రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

4, ఆగస్టు 2017, శుక్రవారం

491 : రివ్యూ!

రచన- దర్శకత్వం : కృష్ణవంశీ 
తారాగణం : సందీప్ కిషన్, సాయిధరమ్ తేజ్, తనీష్, రేజీనా కాసాండ్రా, ప్రగ్యా జైస్వాల్, శ్రియా శరణ్, ప్రకాష్ రాజ్, జేడీ చక్రవర్తి, వీవా హర్ష, రఘుబాబు, శివాజీ  రాజా, బ్రహ్మాజీ తదితరులు
సంగీతం : భీఎమ్స్ , భరత్ మధుసూదన్, హరిగోరా, మణిశర్మ, ఛాయాగ్రహణం : శ్రీకాంత్ నరోజ్
బ్యానర్ : శ్రీ చక్ర మీడియా, బుట్ట బొమ్మ క్రియేషన్స్, విన్ విన్ విన్ క్రియేషన్స్
నిర్మాతలు  : ఎస్ వేణుగోపాల్, సజ్జు
విడుదల : ఆగస్టు 4. 2017
***
     ‘నక్షత్రం’ విడుదల సందర్భంగా ప్రతీ సినిమా తనకో పాఠమని చెప్పుకున్న సీనియర్ దర్శకుడు కృష్ణ వంశీ, నేర్చుకోవడానికి ఇంకా పాత పాఠమే మిగిలివుంది.  గత రెండు సినిమాలప్పుడే నేర్చుకోవాల్సిన   పాఠాల్ని నిర్లక్ష్యం చేసిన ఫలితంగా ‘నక్షత్రం’ ప్రత్యక్షమైంది. చాలా నవ్వొచ్చే విషయం. ఇప్పుడాయన ‘నక్షత్రం’ నుంచి ఏం పాఠం నేర్చుకున్నారో చెప్పగలరేమో చూడాలి. ఒకవేళ తెలుగు సినిమాల కంటూ తనే ఒక కొత్త పాఠాన్ని ఇతరులకి నేర్పాలనుకుంటున్నారేమో తెలీదు. సినిమాలు రెగ్యులర్ గా అలాగే ఎందుకుండాలి, ఇర్రెగ్యులర్ గా ఇలా ఎందుకు ఇరగ దీయకూడదని ఉద్దేశపూర్వకంగానే ‘మొగుడు’, ‘పైసా’, తర్వాత ఇప్పుడు ‘నక్షత్రం’ తీసి పారేస్తున్నారా ఒకవేళ, ఈసారి ఏకంగా 12 కోట్లని ప్రమాదంలోకి నెడుతూ? 

     సందీప్ కిషన్, సాయి ధరమ్ తేజ్, తనీష్, రేజీనా కసాండ్రా, ప్రగ్యా జైస్వాల్, ప్రకాష్ రాజ్ పేర్లతోనే ఇంత ప్రకాశించిపోతున్న ‘నక్షత్రం’ నఖశిఖపర్యంతం నగుబాటుపాలు కావడానికి కారణాలేమిటో ఈ కింద చూద్దాం. 

కథ
       రామారావ్ (సందీప్ కిషన్) తన తాతా తండ్రుల్లాగే పోలీసుద్యోగం చేయాలనుకుంటాడు. చదువు సరీగ్గా లేక (చిన్న చిన్న ఇంగ్లీషు ముక్కలు కూడా రావు) ఎస్సై పోస్టుకి ప్రతీసారీ రాత పరీక్ష తప్పుతూంటాడు. ఓ తల్లి (తులసి) వుంటుంది. ఇంకో  పోలీసు అయిన మావయ్య (శివాజీరాజా) వుంటాడు. అతడి కూతురు  జమున (రేజీనా) సినిమాల్లో కొరియో గ్రాఫర్ (వైవా హర్ష) కి అసిస్టెంట్ గా వుంటుంది.  ఇంకో ఘరానా దొంగ కిరణ్ రెడ్డి ( ప్రగ్యా) వుంటుంది. ఓ పోలీస్ కమీషనర్ గా రామబ్రహ్మం (ప్రకాష్ రాజ్) వుంటాడు. ఇతడికో  కొడుకు మత్తుబానిస అయిన రాహుల్ (తనీష్)  వుంటాడు. ఈ రాహుల్ రామారావ్ వల్ల ఓసారి అవమానపడి  అవకాశం కోసం చూస్తూంటాడు. మరోసారి రామారావ్ రాతపరీక్ష పాసవుతాడు. ఇక ఇతర పరీక్షలకి వెళ్తున్నప్పుడు రాహుల్ అడ్డుకుంటాడు. ఆ పరీక్షలకి వెళ్ళలేకపోయిన రామారావ్, మావయ్య మాటలతో పోలీసుకాని పోలీసు అవుతాడు. ఓ పోలీసు యూనిఫాం వేసుకుని తిరుగుతూంటాడు. ఇది చూసి కిరణ్ రెడ్డి అతణ్ణి పట్టుకుని కమీషనర్ రామబ్రహ్మం ముందు ప్రవేశపెడుతుంది. ఈ యూనిఫాం ఎక్కడిదని రామబ్రహ్మం ఇంటరాగేషన్ చేస్తాడు. ఆ యూనిఫాం కనిపించకుండా పోయిన పోలీసాఫీసర్ అలెగ్జాండర్ (సాయి ధరం తేజ్) ది. ఐతే నగరంలో జరిగిన బాంబు పేలుళ్ళ కేసు దర్యాప్తుకి నియమితుడైన అతను ఏమైపోయాడు? ఆ శత్రువులెవరు? దీన్ని రామారావ్ ఎలా పరిష్కరించాడు?...ఇదీ మిగిలిన కథ (?)

ఎలావుంది కథ 
      కథే లేదు. ఏవేవో పోగేసిన గాలి విషయా లున్నాయి. ప్రారంభంలో నగరంలో బాంబు పేలుళ్లు చూపించినప్పుడే ఈ సినిమాకి కాలీన స్పృహ బొత్తిగా లేదని, బద్దకించి అవుట్ డేటెడ్ విషయం చూపిస్తున్నారని, ఏ పాటి రీసెర్చ్ చేశారో తెలిసిపోతోందనీ మనకి అన్పిస్తుంది. మార్కెట్ స్పృహ, క్రియేటివ్ స్పృహా లేకుండా అందరి సమయమూ వృధా చేశారని తోస్తుంది. కనీసం ఓ నాల్గేళ్ళుగా దేశంలో టెర్రర్ దాడులు జరగడం లేదు. టెర్రరిజం కాశ్మీర్ కి పరిమితమయ్యింది. టెర్రరిస్టుల ఎజెండాలు మారిపోయాయి. పాక్ సహా కాశ్మీర్ లో కరుడుగట్టిన వహాబీ ఇస్లాంని స్థాపించాలని చూస్తున్నారు. భారత్- పాక్ లలో వున్నది లిబరల్ సూఫీ ఇస్లాం. ఈ సినిమాలో విషయం ఇంకా ఏనాటిదో గోకుల్ చాట్  పేలుళ్ళ దగ్గరే తిష్ట వేసుకుని వుంది. ఇది చాలనట్టు తర్వాత్తర్వాత మరో రెండు పేలుళ్లు కూడా అలాగే చూపిస్తారు. దీంతోబాటు అక్రమాయుధాల దందా, డ్రగ్స్ స్మగ్లింగ్, బాలల అక్రమరవాణా, దేశభక్తీ  వగైరా వగైరా బోలెడు పాయింట్లతో ఏకసూత్రత అనే కనీస లక్షణాన్నే వదిలేసి, ఏం చెప్తున్నారో అర్ధంగాని పెద్ద గందరగోళాన్నే  సృష్టించారు. కథే లేనప్పుడు కథా ప్రయోజనమూ, సినిమా ప్రయోజనమూ ఏవీ లేవు. 

ఎవరెలా చేశారు
      ఎవరూ  బాగా చేయలేదు. చేసింది నటన అనుకుంటే ఇంతకంటే  నటనకి పట్టిన దుర్గతి వుండదు. ప్రతీ ఒక్కరూ అరిచి లౌడ్ గా మాట్లా
డతారు. బి గ్రేడ్, సి గ్రేడ్ సినిమాల్లో కూడా ఇలావుండదు. కానీ కృష్ణవంశీ కిలాదబాయించి, అరిచి గోలగోలగా  మాటాడితే తప్ప అది
నటన 
లా అన్పించదు. సినిమా మొదలయ్యింది లగా యత్తూ  చివరి షాటు వరకూ, రెండు గంటలా 47 నిమిషాలూ,  ఎవరో రాజకీయ నాయకులు  మైకులు పెట్టి ఒకటే  అరుస్తున్నట్టు వుంటుంది డైలాగులమీద డైలాగుల మోత. దీనికి తోడూ దాదాపు ప్రతీ ఆల్టర్నేట్ సీనులో ఇరవయ్యేసి, ముప్పయ్యేసి మంది గుంపులు గుంపులుగా జనం వుంటారు. ఎక్కడా కాస్త  రిలీఫ్ అనేదే వుండదు. నరాలమీద భరించలేని సమ్మెట పోట్లు. కృష్ణవంశీ దృశ్య, శబ్ద కళల కి జోహార్లు అర్పించాలి. 

     సందీప్ కిషన్ రామారావ్ పాత్ర ఏం చేయాలో కొలిక్కి రావడానికే ఫస్టాఫ్ గంటంపావంతా పట్టింది. ఇక్కడ బాంబు పట్టుకుని చావబోవడం, ముగింపులో మళ్ళీ విలన్ కట్టిన బాంబులతో మానవ బాంబుగా మారి రక్షించమని గగ్గోలు పెట్టడం అనేది హీరోగారి పాత్రచిత్రణ. సెకండాఫ్ గంటన్నరలో దాదాపు గంట వరకూ  తనెక్కడున్నాడో  మర్చిపోతాం- సుదీర్ఘంగా సాయి ధరమ్  ఫ్లాష్ బ్యాక్, అందులో విలన్ కట్టిన బాంబులతో ఎంతకీ ముగియని అతడి చావు తతంగమూ ఇవే ఆక్రమిస్తాయి. ఇదొక చేతకాని పాత్ర.

     పై రెండు పాత మూస ఫార్ములా పాత్రల్లాగే ప్రగ్యా జైస్వాల్ దొంగగా వుంటూ పోలీసుగా బయటపడడం ఇంకో పురాతన –పురావస్తు శాలలోంచి వొళ్ళు దులుపుకుని బయటికొచ్చిన  అయోమయపు పాత్ర. అన్నీ పాత సినిమా మూస పాత్రలే, ఈ కాలపు సహజ పాత్రలు కానరావు. రేజీనా అంగాంగ ప్రదర్శనా వైభవమే నటన అనుకుని చాలా పాటు పడింది పాపం ఆ కళలో. ఏమీ చెయ్యని పాత్ర కూడా గొప్ప పాత్రే అనునుకుని వగలుపోయింది. 

      ఇక ప్రకాష్ రాజ్ అయితే అందరి కంటే పెద్ద లౌడ్ స్పీకర్. దేశం గురించి, పోలీసుల  గురించి, ప్రజల గురించీ చెవులు పగిలేలా  అన్నన్ని భీకర  కేకలు వేసే తన ఇంట్లోనే రేపిస్టు, డ్రగ్గిస్టు, శాడిస్టు, సైకో కిల్లర్, మాఫియా, స్మగ్లర్, టెర్రరిస్టుల తొత్తూ అయిన కొడుకు వున్నాడని, బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లోలాగా ముగింపు సీను వరకూ తెలుసుకునే పాపాన పోడు. ఇలా వుంది ఈ పాత్ర చిత్రణ కూడా ఈ రోజుల్లో. 

     తులసి, శివాజీరాజాలది చీప్ గోల కామెడీ.  బొత్తిగా సున్నితత్వం లేని తోలు మందం  వ్యవహారం. సాంకేతికంగా చూసినా కూడా చాలా దిగదుడుపు.  కెమెరావర్క్ మరీ చీప్ గా వుంది ఏకత్వం కూడా లేకుండా. సంగీతమూ డిటో. ప్రతీ రెండో సీనూ పరమ హింసాత్మకంగా వుంటుంది. మాటాడితే పోరాటాలకి దిగుతారు. ఒకటే కొట్టుకుంటారు. దాదాపు ముప్పాతిక సినిమా ఫైట్ మాస్టర్ల పనే అన్నట్టు వుంటుంది. దర్శకుడి పనేమిటో అర్ధంగాదు. కిందటి శతాబ్దంలో తమిళ డబ్బింగ్ యాక్షన్ సినిమా లొచ్చేవి – కుక్కలు గుర్రాలూ కౌబాయ్ ల ఎడతెరిపి లేని ఫైట్లతో. కృష్ణవంశీ దీన్ని మళ్ళీ కళ్ళకి కట్టారు. 

చివరికేమిటి?  
       పోలీసులు గొప్పోళ్ళే . అందరికీ తెలిసిందే. అయితే ఏమిటి? ఎన్నిసార్లు అదే డబ్బాకొడతారు సినిమాల్లో? వూర మాస్ డైలాగులతో కృష్ణవంశీ లాంటి స్థాయి వున్న దర్శకుడు కూడా డబ్బా కొట్టమేమిటి- నీటుగా చేతలు చూపించకుండా?  ఈకాలపు సినిమా ఎందుకు తీయలేకపోయారు తను. పోలీసు హీరోకి హనుమంతుడి ఇమేజి ఇస్తే,  అతనేం చేశాడు రెండు సార్లూ- మెడకి బాంబులు తగిలించుకుని ఒకటే మొత్తుకు న్నాడు. వాయు
పుత్రుడి వ్యాపకం ఇదేనా? ఇంకో పెద్ద పోలీసాయనేమో ఏమీ చేయకుండా కూర్చుని అరుపులు అరుస్తూంటాడు. మరో యువపోలీసాఫీసర్ ఏదో చావడానికి కూడా అల్లరల్లరై,  బతికించమని బతిమాలుకుని మరీ చస్తాడు. వీళ్ళా పోలీసులు? అసలు చెప్పాలనుకున్న దేమిటి, ఏం చెప్పారు? ఏమీ చెప్పలేదు. ఎందుకంటే....

     కథే  చెప్పాలనుకుంటే ఇదంతా, ఇంత గందరగోళమంతా  వుండదు. చెప్పాలనుకున్నది ‘గాథ’  అయింది. లేదా చెబుతున్నది ‘గాథ’ అని తెలియక చెబుతూ కూర్చున్నారు. ‘మొగుడు’ తో గాథే  ఫ్లాప్ అయ్యింది. వెంటనే ‘పైసా’తో మళ్ళీ గాథే ఫ్లాపయ్యింది. ముచ్చటగా మూడోసారి, నక్షత్రమూ గాథే అయింది. నేర్చుకున్న పాఠమేమిటి? ముచ్చటగా మూడుసార్లు గాథలు తీసిన కృష్ణ వంశీ అని గోడ మీద వ్రాత. మూడు గాథలు- ఆరు వెతలు అని తలవ్రాత. 

     ‘గాథ’ తో అంతంత కమర్షియల్ సినిమాలెలా తీయడానికి సాహసిస్తారు. ‘గాథ’ గాబట్టే అంజనీపుత్రుడైన గాలి హీరోకి గోలీ మార్ గా గోల్ లేదు. పాసివ్ ఆట బంతి అయిపోయాడు. గోల్ లేకపోతే  స్ట్రక్చర్ వుండదు. కృష్ణవంశీ స్ట్రక్చర్ అని దేన్ని అనుకుంటున్నారో. స్ట్రక్చర్ ఏర్పడకపోతే ఏం చెప్తున్నారో అంతుపట్టదు. అనేక విషయాలు చొరబడి పోతాయి. ఇలా ఎటుపోవాలో అంతు పట్టక జీడిపాకంలా సాగుతూ సాగదీస్తూ మూడు గంటలకి చేరింది. హీరో చేయాల్సిన పనులన్నీ  ఎవరెవరో చేసేస్తున్నారు. ఇలా ఇంత జరిగాక, ఇప్పుడు  ‘నక్షత్రం’ తర్వాత కూడా గాథేతోనే ఇంకోటి తీస్తారా? గాథలతోనే కృష్ణవంశీ కాలక్షేపమా? ‘కథలు’ మర్చిపోయారా? లేక రెగ్యులర్ కథలు కాక, అందరికీ భిన్నంగా ఇర్రెగ్యులర్ గాథలతో మార్గదర్శి అవాలనా?

-సికిందర్
http://www.cinemabazaar.in

   

2, ఆగస్టు 2017, బుధవారం

490 : శ్రావణ - నోనో - ప్రేమల మాసం స్పెషల్!



        వారం కూడా ఒకటి రెండు కొత్త సబ్జెక్టులు  రాసుకుని చేసిన ఒకే రకం పొరపాట్లు హీరోకి గోల్ లేకపోవడం, మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే గా వుండడం.  ప్రేమ సినిమాల టెంప్లెట్ (అంటే అపార్ధం చేసుకుని విడిపోవడమో, లేదా ప్రేమని వెల్లడించలేక క్షోభ పడడమో ) ఏనాడో 2000 లలో చిన్నసినిమాలతో మొదలై – లైటర్ వీన్ లవ్ స్టోరీస్ అనే పేరు తగిలించుకుని- మిల్స్ అండ్ బూన్ నవలల్లాగా – టీనేజర్లకి ఉద్దేశించి- అదే టెంప్లెట్ తో అవే అచ్చి బుచ్చి ప్రేమ కథలతో దశాబ్దాలు మారినా అలాగే కొనసాగుతూ వచ్చీ వచ్చి, ఇప్పుడు పెద్ద సినిమాలకీ ఎగబ్రాకి ఇటీవల మజ్నూ, నిన్నుకోరి, ఫిదా లాంటివి రావడంతో- టెంప్లెట్ మరింత ఆకర్షణీయంగా కన్పించడం మొదలెట్టింది. దీంతో చిన్న సినిమాలకి తిరుగులేని సర్టిఫికేట్ దొరికిపోయినట్టు, రెట్టింపు ఉత్సాహంతో టెంప్లెట్ పెట్టుకుని రోమాంటిక్ కామెడీలకి సిద్ధమవుతున్నారు. టీనేజీ ప్రేమలు పెద్ద నటులే  నటించేస్తూంటే ఇక లేత పిండాలకి  అడ్డేముంది. 

          స్టార్స్ తో తీసే యాక్షన్ సినిమాలు వాటి టెంప్లెట్ తో ఈ ఏడాది మొత్తం ఆరుకి ఆరూ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఈ టెంప్లెట్ తో విసిగిన సీనియర్ రచయిత వేరే సొంతంగా రియలిస్టిక్ ని ప్లాన్ చేసుకుంటున్నారు. స్టార్ యాక్షన్ కి టెంప్లెట్ బెడద దాదాపు వదిలినట్టే. టెంప్లెట్ ని వదిలించుకున్న  మొదటి సినిమాగా గత వారం విడుదలైన ‘గౌతమ్ నందా’ ని చెప్పుకోవచ్చు. ఇక ఇప్పుడు ప్రేమ సినిమాలకి టెంప్లెట్ పీడా వదలాల్సి వుంది. అపార్ధం చేసుకుని విడిపోవడమో, లేదా ప్రేమని వెల్లడించడానికి గింజుకోవడమో లాంటి కృత్రిమత్వపు టెంప్లెట్  కథలతో నిన్నుకోరి, ఫిదా హిట్టయ్యాయంటే-  వాటికి బ్యానర్స్, స్టార్స్,  డైరెక్టర్స్ గ్లామర్ వుండడం వల్ల. అదే మజ్నూ కి ఈ వేల్యూస్ వున్నాపనిచెయ్యలేదు. ఈ వేల్యూస్ తీసేస్తే ఇవన్నీ వారం వారం విడుదలై అడ్రసులేకుండా పోతున్న చిన్నా చితకా  టీనేజీ  రోమాంటిక్ కామెడీలే విషయపరంగా.

          కాబట్టి నిన్నుకోరి, ఫిదా  హిట్టయ్యాయని అవే రెండు పాయింట్లతో (అపార్ధం చేసుకుని విడిపోవడమో, లేదా ప్రేమని వెల్లడించలేక కుమిలిపోవడమో), కొత్త వాళ్ళు,  కొత్త వాళ్ళతో బడ్జెట్ రోమాంటిక్ కామెడీలుగా  తీస్తే, వారం వారం ఏం జరుగుతోందో వీటికీ అదే జరుగక మానదు. ఇక్కడ పేర్లు అవసరంలేదు గానీ-  తయారు చేసుకున్నసబ్జెక్టులపై నమ్మకం కలగకరమ్మంటే వెళ్ళాక- తెలిసిందేమిటంటే హీరోకి గోల్ లేకపోవడం, దాంతో మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లేలు తయారవడం. టెంప్లెట్ ప్రేమల్లో ఇంతే, గోల్స్ వుండవు. గోల్స్ లేకుండానే టెంప్లెట్ ప్రేమలుంటున్నాయి. గోల్ అనేదే కథకి బేస్. చందమామ కథలకి కూడా. గోల్ లేకపోతే  స్ట్రక్చర్ వుండదు, స్ట్రక్చర్ లేకపోతే  మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అయిపోతుంది. పెద్ద బ్యానర్స్, స్టార్స్,  డైరెక్టర్స్ గ్లామర్స్ తో ఇవి కవరైపోవచ్చు. చిన్న సినిమాలకి స్ట్రక్చర్ లో వున్న ఆర్ధవంతమైన కథే రక్ష. ఎన్నో పెద్ద సినిమాలకి పనిచేసిన రచయితకి ఈ పొరపాటు అర్ధమయి,  గోల్ ని సెట్ చేయడానికి ఒప్పుకోవంతో  ఈ రోమాంటిక్ కామెడీకి  బలం, అర్ధంపర్ధమూ వచ్చి, టెంప్లెట్ వదిలిపోయి- సందేహాలన్నీ తీరిపోయి దర్శకుడు సహా టీం అంతా ఖుష్.  స్క్రిప్టుని అక్కడక్కడా మార్చడానికి ఇంకో పది రోజులు పట్టొచ్చు.

          ఇంకోచోట, ఇంటర్వెల్ ‘బ్యాంగ్’ లో ప్రేమని వెల్లడించలేక హీరో అదే టెంప్లెట్ లో జంప్ అవడం. ఇప్పుడు హీరో గోల్ ఏమనుకోవాలి? జంప్ అయ్యేవాడికి ఏం గోల్ వుంటుంది? ప్రేమలో వున్న యంగ్ హీరోపాత్ర,  సినిమా చూస్తున్న యూత్ ని మోటివేట్ చేసేట్టు వుండక, సమస్య వస్తే జంప్ అయిపోరా  అన్నట్టుంటే అదేం సినిమా? టెంప్లెట్ లవర్స్ కి ఇది తెలియడంలేదు. హీరోయిన్ కి లవ్ చెప్పేస్తే పోయేదేముంది బానిస టెంప్లెట్ తప్ప. ఎందుకు చెప్పలేడు? అదెంత సేపు? టెంప్లెట్ మొదలైన కాలంలో 2000 లోనంటే  సెల్ ఫోన్స్ లేవు, నెట్ వాడకం అంతగా లేదు. ఇప్పుడేమయ్యింది? ఒక మెసేజ్ కొట్టలేడా? ఇలా చేయడంలేదా యూత్? అనుకున్నది చేసెయ్యడం, ఎదుర్కోవాల్సింది తర్వాత చూసుకోవడమే ఇదే నేటి యూత్ తెగింపు. ఈ మానసిక లోకాన్ని చూపెట్టకుండా - ప్రేమని వెల్లడించలేని హీరో  సెకండాఫ్ అంతా లోలోన కుళ్ళి చావడమేమిటి? లవ్ చెప్పేస్తే తెగిస్తున్నట్టు, ఒక గోల్ వున్నట్టు, గోల్ తో స్ట్రక్చర్ వచ్చేసినట్టు, దాంతో చల్లారిన టెంప్లెట్ ఆమ్లెట్ వదిలిపోయినట్టు. ఇంటర్వెల్లో హీరో లవ్ చెప్పెసేట్టు చేశాక కథకి ఎంతో చైతన్యం వచ్చింది...

          ప్లాట్ పాయింట్ వన్ అన్నాక గోల్ ఏర్పడాల్సిందే. గోల్ కి యూత్ అప్పీల్ వుండాల్సిందే. దాంతో బాక్సాఫీసు అప్పీల్ రావాల్సిందే. అపార్ధం చేసుకుని విడిపోవడమో, ప్రేమని వెల్లడించలేక తన్నుకు చావడమో యూత్ అప్పీల్ ముమ్మాటికీ కాదు. ఈ మోటివేట్ చెయ్యని బలహీన టీనేజి ప్రేమలు,  స్టార్ సినిమాలకి వాటి హంగూ ఆర్భాటాలతోనైతే  చెల్లిపోవచ్చు.


-సికిందర్ 

28, జులై 2017, శుక్రవారం

489- రివ్యూ!




రచన- దర్శకత్వం: సంపత్నంది
తారాగణం: గోపీచంద్, హన్సిక, కేథరిన్, సచిన్ఖేడ్కర్, ముఖేష్రుషి, నికితన్ ధీర్, నికెళ్ళ ణి, చంద్రమోహన్, వెన్నెలకిషోర్ తదితరులు
సంగీతం: ఎస్‌.ఎస్‌.థమన్, ఛాయాగ్రహణం: సౌందర రాజన్
బ్యానర్ :
శ్రీ బాలాజీ సినీ మీడియా
నిర్మాతలు: జె.భగవాన్, జె.పుల్లారావు
విడుదల : జులై 28, 2018
***
      యా
క్షన్ హీరో గోపీచంద్ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేస్తూ, సంపత్ నంది దర్శకత్వంలో ‘గౌతం నందా’ గా తెరపైకొచ్చాడు చాలా కాలానికి. దీనికంటే ముందు బి. గోపాల్ దర్శకత్వంలో రావాల్సిన ‘ఆరడుగుల బుల్లెట్’  విడులవుతూ ఆగిపోయింది. రవితేజతో ‘బెంగాల్ టైగర్’  తీసిన సంపత్ నంది మళ్ళీ కూడదీసుకుని, భారీ సెంటిమెంటల్ యాక్షన్ థ్రిల్లర్ తో ఈ శుక్రవారం విచ్చేశాడు. ఇప్పుడు తెలుగులో కన్పించని హీరోయిన్ హన్సిక, ఎప్పుడో తెలుగులో కన్పించిన కేథరిన్ హీరోయిన్లుగా తమవంతు పాత్ర పోషించారు. మరోసారి తమన్ తన బాణీలు విన్పించి మెప్పించడానికి తయారయ్యాడు. ఐతే అత్యంత భారీ ఖర్చుతో అట్టహాసంగా తీసిన ఈ బిగ్ కమర్షియల్ లో  వున్న విషయమేమిటి, అదెంతవరకూ రాణించిందీ ఓసారి పరిశీలిద్దాం..

 కథ 
       అమెరికాలో మొదలవుతుంది. అక్కడ ఘట్టమనేని విష్ణు ప్రసాద్ (సచిన్ ఖెడేకర్) వ్యాపారంలో టాప్ 50 లిస్టులో ఫోర్బ్స్ పత్రిక కెక్కుతాడు. దీన్ని కొడుకు గౌతమ్ కూడా తన ఫ్రెండ్స్ తో కలిసి పబ్ లో సెలబ్రేట్ చేసుకుంటాడు. అత్యంత ధనికుడైన తను  డ్రగ్స్ మత్తులో మునిగితేలుతూ కష్టమంటే తెలియకుండా పెరిగాడు. పబ్ లో బేరర్ (తనికెళ్ళ భరణి) చేసిన చిన్న తప్పుకి పొగరుతో లెంపకాయ కొడతాడు. దీంతో  బేరర్ అనే ఒక మాట కళ్ళు తెరిపిస్తాయి- ఫోర్బ్స్ తో గుర్తింపు వచ్చింది మీనాన్నకి, నీకు కాదు. నువ్వెవరు? నేను బెరర్ని, వాడు క్లీనర్, నువ్వెవరు చెప్పుకోవడానికి?-   అని నిలదీస్తాడు బేరర్. దీంతో అంతర్మథనం మొదలవుతుంది గౌతమ్ కి. తానెవరో తెలుసుకోవడానికి కారెక్కి పిచ్చిగా ప్రయాణం కడతాడు. వద్దని గర్ల్ ఫ్రెండ్ ముగ్ధ (కేథరిన్) చెప్పినా వినకుండా వెళ్ళిపోతాడు. యాక్సిడెంట్ చేస్తాడు. కొద్దిలో చావు తప్పించుకుంటాడు నందా (గోపీచంద్ -2). ఇతనొచ్చింది ఆత్మహత్య చేసుకోవడానికే. అచ్చం తనలాగే వున్న ఇతడి కథ తెలుసుకుంటాడు గౌతమ్. హైదరాబాద్ బోరబండలో తన బండబారిన జీవితం చెప్పుకుంటాడు మాస్ నందా క్లాస్ గౌతంకి. అయితే మనం  స్థానాలు మార్చుకుందామని అతడింటికి గౌతమ్ వెళ్తాడు, గౌతం ఇంటికి నందా వెళ్లి సెటిలవుతాడు. గౌతం అక్కడ జీవితంలో తను పొందని నిజమైన భావోద్వేగాలెలా వుంటాయో చవిచూస్తూంటే, అక్కడ నందా వేరే పథకం వేస్తూ బిజీగా వుంటాడు. ఏమిటా పథకం, దాంతో ఏం చేశాడు, ఇద్దరూ ఏమయ్యారు, జీవితం గురించీ ఏం తెలుసుకున్నారు...అనేది మిగతా కథ. 

ఎలావుంది కథ 
      చాలా పరిచయమున్న పాత కథే. కొత్తదనం లేదు. ఒకేలా వుండే ఇద్దరు పరస్పరం స్థానాలు మార్చుకోవడం గురించి ఎన్నో సినిమాలొచ్చాయి. దీన్ని కొత్తబాట పట్టించింది హాలీవుడ్ ‘ఫేస్ ఆఫ్’ ... ‘గౌతంనందా’ లో స్థానాలు మార్చుకునే కథకి పాయింటు పక్కదారి పట్టినట్టు తేలుతుంది. దర్శకుడు కన్ఫ్యూజ్ అయ్యాడో, మనం కన్ఫ్యూజ్ అవుతున్నామో గానీ- చెప్పింది ఒకటైతే చేసింది  మరొకటిగా కథ నడుస్తుంది. నువ్వెవరు? అని తండ్రితో పోల్చి కొడుకుని ప్రశ్నించాడు బేరర్.  అప్పుడా కొడుకు తను ఎంజాయ్ చేస్తున్న తండ్రి సంపదని పౌరుషంతో త్యజించి,  సొంత కాళ్ళ మీద ఎదిగి తనకంటూ ఐడెంటిటీ సంపాదించుకోవడానికి సిద్ధమవుతాడని మనం ఆశిస్తాం. కానీ జరిగేది వేరు. తానెవరో తెలుసుకోవడానికి ప్రయాణం కడతాడు. నువ్వెవరు? అని ఇంకేదో అర్ధంలో అడగలేదు బేరర్. అలా అడిగితే నేను ఆత్మని అని తెలుసుకోవడానికి క్షణం పట్టదు. నీకేం ఐడెంటిటీ వుందని మాత్రమే  బేరర్ అడిగాడు. తనని చూపించుకుని బేరర్ని అని, ఇంకోడ్ని చూపించి వాడు క్లీనరనీ అన్నాడు. మరి గౌతం ఎవరు? అతడి పోర్టుఫోలియో ఏమిటి? ఇదీ పాయింటు. ఈ పాయింటు వేరే పాయింటుగా మారిపోయి పైన చెప్పినట్టు వేరే కథ నడుస్తుంది.  

ఎవరెలా చేశారు 
      ద్విపాత్రాభినయానికి వచ్చిన  ఈ అవకాశాన్ని గోపీచంద్ పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేశాడు- మనకూ ఎంజాయ్ మెంటు నిచ్చాడు. రెండో కంత్రీ పాత్రతో నవ్విస్తూ కూడా పోయాడు. మొదటి పాత్రకి ఇచ్చిన రిచ్ బిల్డప్, స్టయిలిష్ ఇమేజి మొదటి అరగంట సేపు ఒక ఫాంటసీలోకి ప్రయాణంలాగా మార్చేస్తాయి. తానెవరు? అన్న ప్రశ్న వేధిస్తూంటే కనబరచిన హావభావాలు, కన్నీటి ధారా బాగా కనెక్ట్ అవుతాయి ప్రేక్షకులకి. ఈ ప్రశ్నకి తాను వెతుక్కుంటున్న జవాబు వేరే అన్నది  వేరే సంగతి. నీ తండ్రి సంపద అనుభవిస్తూ దౌర్జన్యం చేస్తున్నావ్ సిగ్గులేదా- అన్నట్టే వున్న బేరర్ గోడు కాస్తా,  తన సొంత గోడు అయిపోవడమే క్యారక్టర్ ని ఫాలో కాకుండా చేస్తుంది ఆలోచనాపరులకి. నీ ఐడెంటిటీ ఏమిటీ అని బేరర్ అడిగితే- డబ్బున్న నాన్న తనకి ప్రేమని పంచలేదని, ప్రేమంటే ఏమిటో తెలియకుండా పోయిందనీ, ఆకలి ఎరుగని జీవితంవల్ల కష్టాలంటే ఏమిటో తెలియకుండా పోయాయనీ, తనకి ఏ ఎమోషనూ లేకుండా పోయాయనీ, ఎమోషన్స్ తెలుసుకోవడానికే ప్రయాణం కడుతున్నాననీ, తండ్రి మీదికి తప్పు నెట్టేసి పలాయనం చిత్తగించినట్టుంది పాత్ర!

          రెండో పాత్ర ఇంట్లో మకాం వేసి చేసేదంతా స్లమ్ జీవితాన్ని చవి చూస్తూ, బాధలెలా వుంటాయో  స్వయంగా తెలుసుకుని, అమ్మ చేతి  వంట, వడ్డనా  ఎలా వుంటాయో రుచి చూసి, చెల్లెలితోనూ  నాన్నతోనూ  సెంటిమెంట్లు ఎలావుంటాయో అనుభవించి తరించడమే. ఇదంతా పూర్తయి అమెరికాలో తన తండ్రి కంపెనీ బాధ్యతలు స్వీకరించే సమావేశంలో,  ఆ తండ్రి తనకి కేటాయించిన లక్షల కోట్ల షేర్స్ ని పేదవాళ్ళకి దానమిచ్చేసి గొప్పవాడై పోతాడు! 

          అప్పుడు మనకి తనికెళ్ళ గారి బేరర్ ఓ మూల నిల్చుని మొత్తుకుంటున్నట్టు మైండ్ లో బొమ్మ తిరుగుతుంది – ‘ఓరి పిచ్చినాన్నా!  నే చెప్పింది నీ తండ్రి సొమ్ము నువ్వు దానం చేసి న్యూస్ కెక్కాలని కాదురా, ఆటోగ్రాఫులు ఇవ్వాలని కాదురా, నువ్వో రూపాయి సంపాయించి చూపించమనే!’ అని.

       ఇప్పుడా తండ్రి అనుకుంటాడు- ఫోర్బ్స్ కెక్కిన నేను గొప్పా, వీడు గొప్పా అని. ఇద్దరూ గొప్పే. డబ్బు గడించినవాడూ గొప్పే, దానమిచ్చేవాడూ గొప్పే, కాకపోతే దానమిచ్చేవాడు సొంత సొత్తు లోంచి ఇచ్చుకోవాలి. 

          సారీ సంపత్ నందీ, ఈసారి మీరు చాలా కన్ఫ్యూజ్ చేసేశారు.  వర్కౌట్ కాదు.
          హన్సిక, కేథరిన్ లు గ్లామర్ బొమ్మ పాత్రలకి సరిపోయారు. ముఖేష్ రిషీ విలనీ రొటీనే. ఇద్దరు కమెడియన్లున్నా ఆ కామెడీ సాదాగానే వుంది. ప్రొడక్షన్ విలువలుమాత్రం అత్యంత భారీతనంతో వున్నాయి. హీరో రిచ్ నెస్ గురించి తీసిన దృశ్యాలు ఫాంటసీ చూస్తున్నట్టున్నాయి. ఇది కరెక్ట్ గా వర్కౌట్ చేసిన డైనమిక్స్. ఈ అమెరికన్ లైఫ్  తర్వాత బొరబండ స్లమ్స్ కి కథ వచ్చినప్పుడు తేడా కొట్టొచ్చినట్టు కన్పిస్తుంది. ఈ డైనమిక్సే ‘కాబిల్’ లో హీరోయిన్ పాత్రతో చేసి సక్సెస్ అయ్యాడు సంజయ్ గుప్తా. ఇక యాక్షన్ సీన్స్, పాటల చిత్రీకరణా వగైరా అంతా టాప్ క్లాస్. థమన్ నేపధ్య సంగీతం కూడా బాగా రాణించింది. డైలాగ్స్ బలంగానే వున్నాయి- పక్కదారి పట్టిన పాయింటుకి న్యాయం చేస్తూ. కానీ తండ్రి పాత్రలో చంద్రమోహన్ – నేను మూడు పూటలా మందులు ఎందుకు వేసుకోవడంలేదో తెలుసా?  వేసుకుంటే మీ ముగ్గిరికీ భోజనం వుండదని - అనడం మాత్రం అభ్యంతరకరంగా వుంటుంది. 

చివరికేమిటి 
      కథ రొటీనే అయినా ఇది టెంప్లెట్ లో లేకపోవడం చాలా పెద్ద రిలీఫ్. ఎలాటి ఓపెనింగ్ బ్యాంగులు లేకుండా కథకి పనికొచ్చే విషయంతో నేరుగా ప్రారంభమవుతుంది. గౌతం పాత్రనే పట్టుకుని పోతుంది. ఇరవై ఐదో నిమిషంలో నందా పాత్ర తగలడంతో మొదటి మలుపు వస్తుంది. అక్కడ్నించీ ఇరవై ఐదు నిమిషాలు నందా ఫ్లాష్ బ్యాక్. ముఖేష్ రిషీ విలనీ,  నందా మీద హత్యా ప్రయత్నం...ఇలా ఫస్టాఫ్ అంతా చకచకా సాగిపోతుంది. సెకండాఫ్ సెంటిమెంట్ల బరుఫుకింద కుయ్యో మంటుంది  మొదటి అరగంటకి పైగా. చివరి అరగంట రెండు పాత్రల అమీతుమీతో యాక్షన్లో కొస్తుంది. 

          తనికెళ్ళ భరణి ఎందుకు పీకారోగానీ,  ఆ పీకిన క్లాసు యూత్ అప్పీల్ వుండే పాయింటుకి దారితీసేదే. డబ్బు సంపాదించడం ఎప్పుడూ యూత్ అప్పీల్ వుండే క్రేజీ పాయింటే. ఏడుస్తూ సెంటిమెంట్లు పొందడం యూత్ అప్పీల్ వున్న పాయింటు కాదు. ‘బ్రహ్మోత్సవం’ ఇది గమనించలేకే, ఏడుతరాల బంధువుల అన్వేషణ అనే ముసలి పాయింటు పట్టుకుని పోయింది. మార్కెట్ యాస్పెక్ట్ లో సరీగ్గా స్క్రిప్టుని  బైండింగ్ చేసుకోకపోతే గుదిబండవక తప్పదు.

          విషయం, పాత్ర ఎటెటో పోయినా గోపీచంద్ తన లోకంలో తాను  రెండు పాత్రల్నీ ఎంజాయ్ చేస్తూ ఎంటర్ టైన్ చేశాడనేది నిజం. తెలుగు ప్రేక్షకులందరూ ఈ మధ్య విషయమూ పాత్రా చూడ్డం లేదు కాబట్టి- ఇలా ఫటాఫట్ హీరోయిజాలు  చాలేమో  సినిమాలు తీయడానికి.

-సికిందర్ 

27, జులై 2017, గురువారం

488 - రివ్యూ!

     రచన – దర్శకత్వం : అలంకృతా శ్రీవాస్తవ్
తారాగణం : కొంకణా సేన్ శర్మరత్నా పాఠక్ఆహనా కుమ్రాప్లబితా బోర్థాకూర్సుశాంత్ సింగ్విక్రాంత్ మాసీ, జగత్ సింగ్ సోలంకీ తదితరులు 
సంగీతం : జేబున్నీసా బంగాష్మంగేష్ ధక్డేఛాయాగ్రహణం : అక్షయ్ సింగ్
బ్యానర్ : ప్రకాష్ ఝా ప్రొడక్షన్స్
నిర్మాత ; ప్రకాష్ ఝా
విడుదల : 21 జులై, 2017 
                                                                                                                                                   ***


     సెన్సార్ బోర్డుతో యుద్ధానికి దిగి,  భారీగా 27 కట్స్ తో పహ్లాజ్ నిహ్లానీతో మోరల్ పోలీసింగ్ చేయించుకుని, ఎట్టకేలకు విడుదలైన ‘లిప్ స్టిక్ అండర్ మై బురఖా’ ఒక కరకు వాస్తవాన్ని కళ్ళ ముందుంచుతోంది మోరల్ పోలీసింగ్ చేయకుండానే  : మధ్యతరగతి స్త్రీలు   స్వేచ్ఛ కావాలనో, హక్కులుండాలనో ఎంత గొంతు చించుకున్నా, ఆ గొంతులకంటే వ్యవస్థలు పెద్దవి. ఒక్క ఇటుకని కూడా కదల్చలేరు- మత వ్యవస్థలోంచి, రాజకీయ వ్యవస్థలోంచీ. వూరికే ఇంట్లో వాళ్ళని అడిపోసుకుంటే కూడా లాభంలేదు. వాళ్ళు కూడా  ఈ రెండు వ్యవస్థలకి తరాలుగా బందీలే. 

          న్నతవర్గాల స్త్రీలకి దాదాపు స్వేచ్ఛ వుంటుంది. ఈ స్వేచ్ఛ ఆకర్షణల్ని సృష్టిస్తూంటుంది.  ప్రపంచం ఆకర్షణలు  – కోరికలు అనే రెండుగా విడిపోయివుంది. ఉన్నత వర్గాలు ప్రదర్శించే ఆకర్షణలు, వాటికోసం అర్రులు చాచే మధ్యతరగతి కోరికలు. ఈ గ్యాప్ ని పూడ్చే ప్రయత్నం పైనుంచి ఉన్నత వర్గాలతో జరగదు, ఎప్పుడూ కింది నుంచి మధ్యతరగతి జీవులతో ఊర్ధ్వ ముఖంగానే  జరుగుతూంటుంది. ఎంతకీ ఆ నీలాకాశం అందదు, ఇంతలో రాలిపడి మళ్ళీ వ్యవస్థల బందీకానాలో ముడుచుకోవడమే.

       రకరకాల స్వేచ్ఛలు  కావాలంటే ముందుగా  ఆర్ధిక స్వేచ్ఛ సాధించేందుకు సమయమంతా వినియోగించు- అప్పుడు పబ్బులు, మాల్సు, మల్టీ ప్లెక్సులు, బాయ్ ఫ్రెండ్స్,  కాస్త వయసు మళ్లినావిడకైతే ఫోన్ సెక్స్- అన్నీ చెంతకు వస్తాయి. ఎవరూ అభ్యంతర పెట్టరు. ఆర్ధిక స్వేచ్ఛ లేకుండా అప్పుడే స్వేచ్ఛ పేరుతో ఈ ఆకర్షణల వెంట పడ్డావా- ఈ రియలిస్టిక్ మూవీలో అభాగినుల గతే నీకూ పడుతుంది. స్వేచ్ఛని ఉన్నత వర్గాలు బాహాటంగా అనుభవిస్తాయి. అనుకరణ జీవులైన మధ్యతరగతి వర్గాలు దొంగ చాటుగా అనుభవించాలని చూస్తాయి- అదేం స్వేచ్ఛ? ముందు ఆర్ధిక స్వాతంత్ర్యాన్ని సాధిస్తే ఈ ఖర్మే వుండదు. పొందిన ఆర్ధిక స్వేచ్ఛనంతా కూడా దుర్వినియోగం చేసుకుని డ్రగ్స్ కేసులో దొరికిపోవాలనుంటే దొరికిపో. కానీ డ్రగ్స్ కేసులో దొరికిపోయి హెడ్ లైన్స్ సృష్టించడానికి ఏళ్ల కేళ్ళు  అంత  కష్టపడి గడించిన ఆర్ధిక స్వేచ్ఛంతా  అవసరం లేదు. మధ్యతరగతి జీవిగానే రెండువేలు ఎక్కడ అడుక్కున్నా, చిటికెడు డ్రగ్స్ ఇచ్చేవాళ్ళు, పట్టుకుని ప్రెస్ మీట్ లో పెట్టేవాళ్ళూ ఎప్పుడూ వుంటారు. 

      బురఖా పంజరానికి సింబల్. లిప్ స్టిక్ స్వేచ్ఛకి సంకేతం. పంజరంలో ఈ నల్గురు లిప్ స్టిక్ పక్షులు బయట  రహస్యంగా ‘స్వేచ్ఛ పొందుతూంటారు. ముందుగా కాలేజీ టీనేజీ రిహానా (ప్లబితా బోర్థాకూర్) చక్కగా బురఖా వేసుకుని బయల్దేరి దారిలో తీసిపారేసి,  లోపలున్న జీన్సూ టీ షర్ట్స్ తో టూవీలర్ మీద జామ్మని కాలేజీకి దూసుకుపోతుంది. ఆమెకి చాలా కోరికలున్నాయి. అందుకని కాలేజీ నుంచి వస్తూ షాపింగ్ మాల్స్ లో ఖరీదైన వస్తువులు కొట్టేసి వస్తూంటుంది. ఆమెకింకో కోరిక వుంది- మిలీ సైరస్ లాగా సింగర్ నవ్వాలని. దానికి ఓ బ్యాండ్ గ్రూప్ లో చేరి పాడుతూంటుంది. అక్కడ ధృవ్ అనే బాయ్ ఫ్రెండ్ ఏర్పడతాడు. ఈమె చేసే ఈ రహస్య కార్యకలాపాలేవీ ఇంట్లో బురఖాలు తయారు చేసే  తల్లిదండ్రులకి తెలియకుండా వుంటాయి.


          లీలా (
ఆహనా కుమ్రా) అనే ఓ ఇరవై ఏళ్ళు పైబడ్డ అమ్మాయి బ్యూటీ పార్లర్ నడుపుతూంటుంది. ఆమెకి ఫోటోగ్రాఫర్ బాయ్ ఫ్రెండ్ ( విక్రాంత్ మాసీ)వుంటాడు. తల్లికి దొరక్కుండా అతడితో ఎక్కడపడితే అక్కడ  సెక్స్ స్వేచ్ఛ పూర్తిగా అనుభవిస్తూ వుంటుంది. కానీ ఈ ఇరుకు వూళ్ళోంచి ఢిల్లీ పారిపోయి, అక్కడ ప్రతిరోజూ బాయ్ ఫ్రెండ్ తో హనీమూన్ లా గడపాలనీ  కోరికలుంటాయి. 

          షిరీన్ (కొంకణా సేన్ శర్మ) అనే ముప్పై పైబడ్డ ముగ్గురు పిల్లల తల్లి వుంటుంది. ఈమె ఓ కంపెనీలో సేల్స్  ఎగ్జిక్యూటివ్. భర్త రహీం (సుశాంత్ సింగ్) సౌదీ వెళ్లి వచ్చి ప్రస్తుతం ఖాళీగా వుంటున్నాడు. తన ఉద్యోగం గురించి అతడికి తెలియనివ్వకుండా రహస్యంగా ఆఫీసు కెళ్ళి వస్తూంటుంది. రాత్రయితే ఆమె ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా అతడికి సెక్స్ కావాలి. ఈ మారిటల్ రేప్ ని భరిస్తూ, అనేక గర్భాలు అబార్షన్ చేయించుకుంటూ నిస్సారంగా జీవిస్తూంటుంది. 

     ఉష (రత్నా పాఠక్) అనే 55 ఏళ్ల విడో వుంటుంది. ఈమెకి అప్పుడే వయసై పోలేదనీ, ఇంకా అనుభవించాల్సింది వుందనీ వుంటుంది. హిందీ  రోమాంటిక్ నవలలు చదువుతూ ఫాంటసీల్లో బతుకుతుంటుంది. జగత్ అనే ఒక స్విమ్మింగ్ కోచ్ పరిచయమై, స్విమ్మింగ్ నే ర్చుకునే వంకతో అతడి స్పర్శలోని  హాయిని అనుభవిస్తూ వుంటుంది. రాత్రి పూట రోజీ పేరుతో అతడికి ఫోన్ చేసి ఫోన్ సెక్స్ కి  పాల్పడుతూంటుంది. చాలా గ్లామరస్ గా తయారై హుషారుగా తిరుగుతూంటుంది. 

          ఈ నల్గురూ విడివిడిగా ఈ రహస్య కలాపాలతో ‘స్వేచ్ఛ’ ని పొందుతూ వుంటారు. అప్పుడు మాల్ లో చోరీ కేసులో రిహానా దొరికిపోతుంది. బాయ్ ఫ్రెండ్ వదిలేస్తాడు. ఆమెని విడిపించుకున్న తండ్రి,  కాలేజీ మాన్పించి ఇంట్లో బురఖాలు కుట్టమంటాడు. సంబంధాలు చూడమని భార్యతో చెప్తాడు. మాట్లాడకుండా ఇంట్లో కూర్చుంటుంది రిహానా. 

          లీలా బాయ్ ఫ్రెండ్ తో సెక్స్ చేస్తూ తల్లికి దొరికిపోతుంది. ఆమెని రెండు పీకి సంబంధం చూసి నిశ్చితార్ధం కూడా చేస్తే, బాయ్ ఫ్రెండ్ తోనే ఎంజాయ్ చేస్తూంటుంది. ఆ తల్లి, పెళ్లి కొడుకు వదిలి పారేస్తారు. 

          షిరీన్ కి నలభై వేల జీతంతో ప్రమోషన్ వస్తుంది. ఆమె ఉద్యోగం చేస్తోందన్న సంగతి భర్తకి తెలిసిపోయి రేప్ చేసి, ఉద్యోగం మానేసి,  ఇంట్లో పడుండమంటాడు.

          ఉష సీక్రెట్ లవ్ చుట్టు  పక్కల తెలిసిపోయి ఆమెని వీధికి లాగి అల్లరల్లరి చేస్తారు. ఇది జగత్ చూస్తాడు. తనతో ఫోన్ సెక్స్ చేస్తోంది ఈమేనని అప్పుడు తెలుసుకుని,  అనరాని మాటనేసి వెళ్ళిపోతాడు.

          ఎలా మొదలయ్యారో మళ్ళీ అదే స్థితికి- అదే పంజరంలోకి వచ్చి  చేరుకున్న  నల్గురూ ఓ గదిలో చేరతారు. ఏదో పైకెగురుదామనుకుంటే, ఇంకింత  అధఃపాతాళంలోకే  పడ్డారు. ధూమపానం  చేస్తూ కబుర్లాడుకుంటారు. జనం చించి పారేసిన ఉష దాచుకున్న నవలలుంటాయి రకరకాల రోమాంటిక్ టైటిల్స్ తో. వాటితో కాసేపు ఆ ఓల్డ్ లేడీని ఆటలు పట్టిస్తారు. ఒక నవల చివరి మూడు పేజీలు  చదవలేదని, చదివి విన్పించమనీ  అంటుందామె. ఇప్పుడా రోజీ కథ ముగింపు చదివి విన్పిస్తుంది రిహానా. చాలా ఫీలవుతారు. 

        ప్రారంభంనుంచీ వాయిసోవర్ లో అప్పుడప్పుడు వచ్చే రోజీ కథ ఈ  నవల్లోనిదన్న మాట. మొత్తం కథలో  ఈ నల్గురికీ వర్తించే వెన్నో వున్నాయి. ఒక ప్రధాన పాత్రంటూ లేకుండా, నల్గురి వేర్వేరు కథలుగా వున్న స్క్రీన్ ప్లేకి,   వాయిసోవర్ లో రోజీ కథనం ఒక బ్రిడ్జింగ్ ఫోర్సుగా కలిపి వుంచుతుందన్న మాట.

          ఈ పాత్రల్ని మర్చిపోలేం, ఈ నటుల్ని మరచిపోలేం, ఈ దర్శకురాలినీ మర్చిపోలేం. ప్రముఖ దర్శకుడైన నిర్మాత ప్రకాష్ ఝానీ కొనియాడలేక వుండలేం. చాలాకాలం పాటు ఈ సినిమా మనుషులనే వాళ్ళని వెంటాడుతూంటుంది. స్వేచ్ఛ అంటే ఏమిటో, అందులోనూ మధ్యతరగతి ఆడవాళ్ళు అర్ధం చేసుకోవాల్సిన స్వేచ్ఛ అంటే ఏమిటో, అదెలా లభిస్తుందో, ఎలా లభించదో, ఎప్పుడు లభిస్తుందో, ఎప్పుడు లభించదో - ఒక్క డైలగుతోనూ చెప్పకుండా, పరిణామాల క్రమం చూపించి వదిలేసిన ఈ క్రియేషన్ ఒక అద్భుతమైన అనుభవం ప్రేక్షకులకి.

-సికిందర్
         
         








488- రివ్యూ!


రచన- దర్శకత్వం : శ్రీనివాస్ రాజు
తారాగణం : శృతి, పూజా గాంధీ, సంజన, వి శంకర్, మార్కండ్ దేశ్ పాండే, రఘు ముఖర్జీ, భాగ్యశ్రీ, రవి కాలే, పెట్రోల్ప్రసన్న, డానీ కుట్టప్ప, జయదేవ్, కరి సుబ్బు, కోటి తదితరులు
సంగీతం : అర్జున్ జన్య, ఛాయాగ్రహణం : వెంకట్ ప్రసాద్
బ్యానర్ : నిర్మాత
: వెంకట్, విడుదల : 22 జులై, 2017

***

        హిట్టయిన కన్నడ ‘దండుపాళ్యం’ ని తెలుగులోనూ బాగానే రిసీవ్ చేసుకున్నారు ప్రేక్షకులు. ఐదేళ్ల తర్వాత దీని సీక్వెల్ గా ‘దండుపాళ్యం- 2’ విడుదలయింది. యాక్షన్ / హార్రర్  సినిమాలే సీక్వెల్స్ గా విడుదలవుతాయని తెలిసిందే. ఐతే ‘దండుపాళ్యం’ సీక్వెల్ ఏ రకంగా సీక్వెల్ అవుతుంది? సీక్వెల్ కి కూడా భాగాలుంటాయా? అపుడు దాని ప్రభావం ఎలా వుంటుంది? ఓసారి చూద్దాం...

కథ  
          ‘దండుపాళ్యం’ లో 80 హత్యలు చేసిన కిరాతక దోపిడీ ముఠా దొరికిపోయి జైలు కెళ్తారు. ఇప్పుడు దీని తర్వాత ఏం జరిగిందనేది మిగతా కథ. ఆరేళ్ళ విచారణా ననంతరం ఈ పదకొండు మంది సీరియల్ కిల్లర్స్ కీ మరణ శిక్షలు పడతాయి. అయితే అభివ్యక్తి (శృతి) అనే జర్నలిస్టు  వీళ్ళు  నేరస్థులని నమ్మదు. ఈ కేసులో పోలీసుల పాత్రని అనుమానించి దర్యాప్తు చేయడం మొదలెడుతుంది. ఈ దర్యాప్తులో భాగంగా ముఠా సభ్యులని జైల్లో కలుస్తుంది. అప్పుడు వాళ్ళ కోణంలో వాళ్ళు చెప్పుకొచ్చేదే ఈ సీక్వెల్ కథ...
ఎలావుంది కథ
         దండుపాళ్యం’ లాగే ఇదీ పూర్తిగా నిజకథ  కాదు, కాల్పనికం చేశారు. కర్నాటకలో నిజ కథకి 1930 లలో బీజాలు పడ్డాయి. ఐతే  1996 – 2000 మధ్య ఈ చివరి తరం గ్యాంగ్ సభ్యులు పాల్పడ్డ దోపిడీ హత్యలు రాష్ట్రాన్ని గజగజ లాడించాయి కాబట్టి,  దీన్ని కాల్పనికం చేసి  మొదట 2012 లో ‘దండుపాళ్యం’ తీస్తూ వాళ్ళు పట్టుబడినట్టు ముగించారు. ఇప్పుడు సీక్వెల్ తీస్తూ ఇదే కర్కోటక ముఠా అమాయకులనీ, పోలీసులు వీళ్ళని ఇరికించి అన్యాయంగా మరణశిక్షలు పడేలా చేశారనీ చూపిస్తూ  సానుభూతి కలిగించే ప్రయత్నం చేశారు. తాజాగా కర్నాటక హైకోర్టు జులై 21 న ఈ పదకొండు మందిలో ముగ్గురికి ఉరిశిక్షలు రద్దు చేసింది కూడా. దీనిమీద పోలీసులు సుప్రీం కోర్టు కెళ్ళినా ప్రయోజనం లేనంత డబ్బా కేసు పెట్టారు. ఈ సీక్వెల్ లో కథకోసం కొన్ని కల్పితాలు చేశారు. వాటిలో ఒకటి- ఎలాటి సర్కమ్ స్టేన్షియల్, మెడికల్, ఫోరెన్సిక్ సాక్ష్యాలు లేకుండా, కేవలం సాక్షుల చేత చెప్పించి కేసులు  నడిపించారని.  ఈ కథలో చెప్పినట్టుగా, ఐదేళ్లుగా దొరక్కుండా ఎనభై హత్యలు చేశారని చెబుతున్న ముఠాని ఒకవేళ కేసుల్లో  ఇరికించాలనుకుంటే, పోలీసులు అంత  బలహీనంగా కేసులు పెడతారా అన్న సందేహం వస్తుంది.  ఇంత బలహీన కేసు మరణ శిక్షల దాకా వెళ్తుందా?  వాస్తవంగా ముద్దాయిల్లో ఆరుగురి మీద రేప్ నేరాలకి రుజువుల్లేవని కూడా కొట్టేసింది  హైకోర్టు.  హత్య కేసుల్లో అతిముఖ్యమైన సర్కమ్ స్టేన్షియల్, మెడికల్, ఫోరెన్సిక్ సాక్ష్యాలు లేకుండా, చెప్పుడు సాక్ష్యాలతో  ఏ కోర్టూ విచారణ చేపట్టదు. ఇలా సీక్వెల్ లోనే అర్ధంలేని కల్పన చేశారు. ఈ కేసుని ప్రాథమిక స్థాయిలో ట్రయల్ కోర్టు చేపట్టిందంటేనే  ఎంతో కొంత మెటీరియల్ ఎవిడెన్స్ ఉన్నట్టే. ఆ మెటీరియల్ ఎవిడెన్సులో భాగమైన వేలిముద్రలు కలవక ముగ్గురికి మరణశిక్షల్ని రద్దు చేసింది హైకోర్టు.
          కాబట్టి నిజంగా జరిగింది  చూస్తే  పోలీసుల అసమర్ధత కన్పిస్తుంది. దీన్ని సినిమాకోసం లాజిక్ చూడకుండా పోలీసుల కుట్రగా మార్చి, నిందితుల్ని అమాయకుల్ని చేసి సీక్వెల్ నడిపించారు.  ఇలాటి  క్యారక్టర్ రివర్సల్ మూసఫార్ములాకైతే చెల్లుతుందేమోగానీ, రియలిస్టిక్ సినిమాతో కాదు.  ఇక దీన్నెలా జస్టిఫై చేశారో సీక్వెల్లో తేల్చలేదు. నడుస్తూ నడుస్తూ వున్న సీక్వెల్ ని ఠకీ మని ఆపేసి,  ముగింపు ఆగస్టులో చూడండని ప్రకటన వేసి షాకిచ్చారు. ముగింపు కోసం ఇంకోసారి డబ్బులు పెట్టుకుని చూడాలా? ఇదెవరూ నోరత్తలేని మోసమే పూర్తి సినిమా చూపించకుండా. ‘దండుపాళ్యం’ ని పాడియావు చేసి సాధ్యమైనంత పిండుకోవాలని చూస్తున్నారు. ‘దండుపాళ్యం – 2’ రెండు భాగాలుగా వుంటుందని ముందే చెప్పివుంటే అదివేరు.
          ఇకపోతే ముగింపు లేని సినిమాకి రివ్యూ  ఏమిటి? ఎలా రాస్తాం? ఏమో!
ఎవరెలా చేశారు
          పోలీసు అధికారిగా రవిశంకర్ కి చాలా పనుండే సీక్వెల్ ఇది. ‘
దండుపాళ్యం’లో ముఠా పాల్పడ్డ ఘోరాలు చూపిస్తే, ఇప్పుడు పోలీసుల అకృత్యాలు చూపించడం మొదలెట్టారు. ఈ అకృత్యాలకి సారధి రవిశంకర్ పాత్ర. కౄర నీచ నికృష్ట పాత్రని కూల్ గా పోషించాడు. కూలీల చేత చెయ్యని నేరాన్ని ఒప్పించడానికి పెట్టే చిత్ర హింసల్లో అతి పచ్చిగా కన్పిస్తాడు. ఇతనూ ఇతడి సహోద్యోగులు ఇద్దరూ టార్చర్ సెక్షన్ చూసుకుంటే, ఇక పదకొండు మంది ముఠా చిత్రహింసలకి అల్లాడే బ్యాచిగా కన్పిస్తారు. బ్యాచిలో పూజా గాంధీ బాధిత పాత్రలో ఎంత జీవించినా దాని ప్రభావం ప్రేక్షకుల మీద పడే అవకాశం లేదు. ఆమె పచ్చి హంతకురాలని ముందే చూసేశారు ప్రేక్షకులు. ఇదే పరిస్థితి బ్యాచిలో మిగతా అందరితోనూ.  

          సంజన గురించి పెద్ద హైప్ వచ్చింది. ఈ సీక్వెల్ లో ఆమె ఎక్కడుందో వెతుక్కోవాల్సిన పరిస్థితి. బ్యాగ్ గ్రౌండ్ ఆర్టిస్టుగా రెండు మూడు సీన్లలో కన్పించి అవుట్ అయిపోతుంది. టెక్నికల్ గా ఛాయాగ్రహణం, బిజిఎంలు బలంగా వున్నాయి. ఛాయాగ్రహణంలో పోలీస్ టార్చర్ కి అవసరమైన చోట్ల డచ్ యాంగిల్స్ వాడుకున్నారు. ఇది కేవలం ఒక రియలిస్టిక్ మూవీ లాంటిదే తప్ప డార్క్ మూవీ కాదు, ఏ నోయర్ కాదు- కథాపరంగానూ, చిత్రీకరణ పరంగానూ. సంభాషణల్లో పదేపదే పచ్చి బూతులు దొర్లాయి. 
చివరికేమిటి
         
ఫస్టాఫ్ మరణ శిక్షలు పడ్డ దోషులు జైలుకి రావడం, వీళ్ళు దోషులని నమ్మని జర్నలిస్టు దర్యాప్తు చేపట్టడం, జైల్లో వాళ్ళని కలుసుకోవడం వుంటాయి. సెకండాఫ్ లో వాళ్ళు జర్నలిస్టుకి తమ ప్లాష్ బ్యాకుగా చెప్పుకునే జీవితాలుంటాయి. ఈ ఫ్లాష్ బ్యాక్ కొనసాగుతూనే పోలీస్ టా ర్చర్ల  ఎపిసోడ్లు మొదలవుతాయి. పూజా గాంధీ టార్చర్ తో అకస్మాత్తుగా సెకండాఫ్ ముగిసి,  ముగింపు ఆగస్టుకి వాయిదా వేశాం పొమ్మనడం వుంటుంది. 

          ఫస్టాఫ్ లో త్వరత్వరగా పది నిమిషాల్లో జర్నలిస్టు దర్యాప్తు చేపట్టడంతో బిగినింగ్ ముగిసి  ప్లాట్ పాయింట్ వన్ వచ్చేస్తుంది. బహుశా సెకండాఫ్ చివర్లో పూజా గాంధీ టార్చర్ తో  ప్లాట్ పాయింట్ టూ వస్తుంది. ఈ మధ్యలో నడిచే మిడిలంతా, ఫస్టాఫ్ లో బావున్న మిడిల్ వన్ వదిలేస్తే, సెకండాఫ్ లో మిడిల్ టూలో,  ఆ ఫ్లాష్ బ్యాక్ అంతా అనాసక్తికరం, అనవసరం, బాక్సాఫీసు అప్పీల్ లేనితనం, పరమబోరు కొట్టే నాటకం. ఎంత కౄరులో ‘
దండుపాళ్యం లో చూపించాక, ఇప్పుడెంత కల్లాకపటం ఎరుగని నగరానికి వలస వచ్చిన అమాయక జీవులో చూపిస్తే, నవరసాల్లో ఇదే రసమవుతుంది ప్రేక్షకులు  కనెక్ట్ అవడానికి? ‘నిర్భయ’ దోషులు పూర్వం ఏంతో పవిత్రులని చెప్తే చెల్లుతుందా? యాకుబ్ మెమన్ ఉరి రద్దుని కోరడమెలాంటిదో, దండుపాళ్యం ముఠా పట్ల సానుభూతిని ప్రోది చేయడం అలాంటిదే అన్నట్టు తేలింది. 

          వీళ్ళని సంచార జాతిగా చూపిస్తూ, గుడిసెల్లో జీవించడం, పందుల్ని పెంచడం, అర్ధాకలితో అలమటించడం, అన్నం అడుక్కుంటూ తిరగడం, జబ్బుతో చావడం...ఒకటని కాదు, ఇప్పటి సినిమాల్లో కన్పించని  సినిమా కష్టాలన్నీ, కన్నీళ్ళన్నీ వున్నాయి. ఆర్టు సినిమా కళలన్నీ వున్నాయి. 

          సెకండాఫ్ లో సంగం ఈ జీవితాలు, సగం పోలీస్ టార్చర్. విషయంలేని ఈ వృధానంతా  అరికడుతూ జర్నలిస్టు పాత్రతో ప్రస్తుతానికి వచ్చి వేగవంతం చేయాల్సింది. కానీ దీన్ని పాడియా వుగా చూస్తూ, ఇంకా ప్రేక్షకుల జేబుల్లోంచి డబ్బులు పిండుకునే ఉద్దేశంతో సాగదీశారు. ఇంత ఫ్లాష్ బ్యాక్ చెబుతున్న హంతక ముఠా నిజమే చెప్తున్నారని మనమెలా నమ్మాలి? దీనికి జర్నలిస్టు దొరకబుచ్చుకున్న ఒక్క ఆధారమూ విశ్వనీయత కోసం ఎస్టాబ్లిష్  చేయలేదు. 

          ముగిసిపోయిన ‘
దండుపాళ్యం’ దారుణ చరిత్రని కెలికి ఇంకేదో చేయాలనుకున్నారు. దీన్ని ఆగస్టు ముక్కలో ఎలా జస్టిఫై చేస్తారో చూసేందుకు, ఈ రివ్యూని కూడా ముగింపు వాయిదా వేసి  వెళ్లిపోదాం.

-సికిందర్