రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

27, జులై 2017, గురువారం

488- రివ్యూ!


రచన- దర్శకత్వం : శ్రీనివాస్ రాజు
తారాగణం : శృతి, పూజా గాంధీ, సంజన, వి శంకర్, మార్కండ్ దేశ్ పాండే, రఘు ముఖర్జీ, భాగ్యశ్రీ, రవి కాలే, పెట్రోల్ప్రసన్న, డానీ కుట్టప్ప, జయదేవ్, కరి సుబ్బు, కోటి తదితరులు
సంగీతం : అర్జున్ జన్య, ఛాయాగ్రహణం : వెంకట్ ప్రసాద్
బ్యానర్ : నిర్మాత
: వెంకట్, విడుదల : 22 జులై, 2017

***

        హిట్టయిన కన్నడ ‘దండుపాళ్యం’ ని తెలుగులోనూ బాగానే రిసీవ్ చేసుకున్నారు ప్రేక్షకులు. ఐదేళ్ల తర్వాత దీని సీక్వెల్ గా ‘దండుపాళ్యం- 2’ విడుదలయింది. యాక్షన్ / హార్రర్  సినిమాలే సీక్వెల్స్ గా విడుదలవుతాయని తెలిసిందే. ఐతే ‘దండుపాళ్యం’ సీక్వెల్ ఏ రకంగా సీక్వెల్ అవుతుంది? సీక్వెల్ కి కూడా భాగాలుంటాయా? అపుడు దాని ప్రభావం ఎలా వుంటుంది? ఓసారి చూద్దాం...

కథ  
          ‘దండుపాళ్యం’ లో 80 హత్యలు చేసిన కిరాతక దోపిడీ ముఠా దొరికిపోయి జైలు కెళ్తారు. ఇప్పుడు దీని తర్వాత ఏం జరిగిందనేది మిగతా కథ. ఆరేళ్ళ విచారణా ననంతరం ఈ పదకొండు మంది సీరియల్ కిల్లర్స్ కీ మరణ శిక్షలు పడతాయి. అయితే అభివ్యక్తి (శృతి) అనే జర్నలిస్టు  వీళ్ళు  నేరస్థులని నమ్మదు. ఈ కేసులో పోలీసుల పాత్రని అనుమానించి దర్యాప్తు చేయడం మొదలెడుతుంది. ఈ దర్యాప్తులో భాగంగా ముఠా సభ్యులని జైల్లో కలుస్తుంది. అప్పుడు వాళ్ళ కోణంలో వాళ్ళు చెప్పుకొచ్చేదే ఈ సీక్వెల్ కథ...
ఎలావుంది కథ
         దండుపాళ్యం’ లాగే ఇదీ పూర్తిగా నిజకథ  కాదు, కాల్పనికం చేశారు. కర్నాటకలో నిజ కథకి 1930 లలో బీజాలు పడ్డాయి. ఐతే  1996 – 2000 మధ్య ఈ చివరి తరం గ్యాంగ్ సభ్యులు పాల్పడ్డ దోపిడీ హత్యలు రాష్ట్రాన్ని గజగజ లాడించాయి కాబట్టి,  దీన్ని కాల్పనికం చేసి  మొదట 2012 లో ‘దండుపాళ్యం’ తీస్తూ వాళ్ళు పట్టుబడినట్టు ముగించారు. ఇప్పుడు సీక్వెల్ తీస్తూ ఇదే కర్కోటక ముఠా అమాయకులనీ, పోలీసులు వీళ్ళని ఇరికించి అన్యాయంగా మరణశిక్షలు పడేలా చేశారనీ చూపిస్తూ  సానుభూతి కలిగించే ప్రయత్నం చేశారు. తాజాగా కర్నాటక హైకోర్టు జులై 21 న ఈ పదకొండు మందిలో ముగ్గురికి ఉరిశిక్షలు రద్దు చేసింది కూడా. దీనిమీద పోలీసులు సుప్రీం కోర్టు కెళ్ళినా ప్రయోజనం లేనంత డబ్బా కేసు పెట్టారు. ఈ సీక్వెల్ లో కథకోసం కొన్ని కల్పితాలు చేశారు. వాటిలో ఒకటి- ఎలాటి సర్కమ్ స్టేన్షియల్, మెడికల్, ఫోరెన్సిక్ సాక్ష్యాలు లేకుండా, కేవలం సాక్షుల చేత చెప్పించి కేసులు  నడిపించారని.  ఈ కథలో చెప్పినట్టుగా, ఐదేళ్లుగా దొరక్కుండా ఎనభై హత్యలు చేశారని చెబుతున్న ముఠాని ఒకవేళ కేసుల్లో  ఇరికించాలనుకుంటే, పోలీసులు అంత  బలహీనంగా కేసులు పెడతారా అన్న సందేహం వస్తుంది.  ఇంత బలహీన కేసు మరణ శిక్షల దాకా వెళ్తుందా?  వాస్తవంగా ముద్దాయిల్లో ఆరుగురి మీద రేప్ నేరాలకి రుజువుల్లేవని కూడా కొట్టేసింది  హైకోర్టు.  హత్య కేసుల్లో అతిముఖ్యమైన సర్కమ్ స్టేన్షియల్, మెడికల్, ఫోరెన్సిక్ సాక్ష్యాలు లేకుండా, చెప్పుడు సాక్ష్యాలతో  ఏ కోర్టూ విచారణ చేపట్టదు. ఇలా సీక్వెల్ లోనే అర్ధంలేని కల్పన చేశారు. ఈ కేసుని ప్రాథమిక స్థాయిలో ట్రయల్ కోర్టు చేపట్టిందంటేనే  ఎంతో కొంత మెటీరియల్ ఎవిడెన్స్ ఉన్నట్టే. ఆ మెటీరియల్ ఎవిడెన్సులో భాగమైన వేలిముద్రలు కలవక ముగ్గురికి మరణశిక్షల్ని రద్దు చేసింది హైకోర్టు.
          కాబట్టి నిజంగా జరిగింది  చూస్తే  పోలీసుల అసమర్ధత కన్పిస్తుంది. దీన్ని సినిమాకోసం లాజిక్ చూడకుండా పోలీసుల కుట్రగా మార్చి, నిందితుల్ని అమాయకుల్ని చేసి సీక్వెల్ నడిపించారు.  ఇలాటి  క్యారక్టర్ రివర్సల్ మూసఫార్ములాకైతే చెల్లుతుందేమోగానీ, రియలిస్టిక్ సినిమాతో కాదు.  ఇక దీన్నెలా జస్టిఫై చేశారో సీక్వెల్లో తేల్చలేదు. నడుస్తూ నడుస్తూ వున్న సీక్వెల్ ని ఠకీ మని ఆపేసి,  ముగింపు ఆగస్టులో చూడండని ప్రకటన వేసి షాకిచ్చారు. ముగింపు కోసం ఇంకోసారి డబ్బులు పెట్టుకుని చూడాలా? ఇదెవరూ నోరత్తలేని మోసమే పూర్తి సినిమా చూపించకుండా. ‘దండుపాళ్యం’ ని పాడియావు చేసి సాధ్యమైనంత పిండుకోవాలని చూస్తున్నారు. ‘దండుపాళ్యం – 2’ రెండు భాగాలుగా వుంటుందని ముందే చెప్పివుంటే అదివేరు.
          ఇకపోతే ముగింపు లేని సినిమాకి రివ్యూ  ఏమిటి? ఎలా రాస్తాం? ఏమో!
ఎవరెలా చేశారు
          పోలీసు అధికారిగా రవిశంకర్ కి చాలా పనుండే సీక్వెల్ ఇది. ‘
దండుపాళ్యం’లో ముఠా పాల్పడ్డ ఘోరాలు చూపిస్తే, ఇప్పుడు పోలీసుల అకృత్యాలు చూపించడం మొదలెట్టారు. ఈ అకృత్యాలకి సారధి రవిశంకర్ పాత్ర. కౄర నీచ నికృష్ట పాత్రని కూల్ గా పోషించాడు. కూలీల చేత చెయ్యని నేరాన్ని ఒప్పించడానికి పెట్టే చిత్ర హింసల్లో అతి పచ్చిగా కన్పిస్తాడు. ఇతనూ ఇతడి సహోద్యోగులు ఇద్దరూ టార్చర్ సెక్షన్ చూసుకుంటే, ఇక పదకొండు మంది ముఠా చిత్రహింసలకి అల్లాడే బ్యాచిగా కన్పిస్తారు. బ్యాచిలో పూజా గాంధీ బాధిత పాత్రలో ఎంత జీవించినా దాని ప్రభావం ప్రేక్షకుల మీద పడే అవకాశం లేదు. ఆమె పచ్చి హంతకురాలని ముందే చూసేశారు ప్రేక్షకులు. ఇదే పరిస్థితి బ్యాచిలో మిగతా అందరితోనూ.  

          సంజన గురించి పెద్ద హైప్ వచ్చింది. ఈ సీక్వెల్ లో ఆమె ఎక్కడుందో వెతుక్కోవాల్సిన పరిస్థితి. బ్యాగ్ గ్రౌండ్ ఆర్టిస్టుగా రెండు మూడు సీన్లలో కన్పించి అవుట్ అయిపోతుంది. టెక్నికల్ గా ఛాయాగ్రహణం, బిజిఎంలు బలంగా వున్నాయి. ఛాయాగ్రహణంలో పోలీస్ టార్చర్ కి అవసరమైన చోట్ల డచ్ యాంగిల్స్ వాడుకున్నారు. ఇది కేవలం ఒక రియలిస్టిక్ మూవీ లాంటిదే తప్ప డార్క్ మూవీ కాదు, ఏ నోయర్ కాదు- కథాపరంగానూ, చిత్రీకరణ పరంగానూ. సంభాషణల్లో పదేపదే పచ్చి బూతులు దొర్లాయి. 
చివరికేమిటి
         
ఫస్టాఫ్ మరణ శిక్షలు పడ్డ దోషులు జైలుకి రావడం, వీళ్ళు దోషులని నమ్మని జర్నలిస్టు దర్యాప్తు చేపట్టడం, జైల్లో వాళ్ళని కలుసుకోవడం వుంటాయి. సెకండాఫ్ లో వాళ్ళు జర్నలిస్టుకి తమ ప్లాష్ బ్యాకుగా చెప్పుకునే జీవితాలుంటాయి. ఈ ఫ్లాష్ బ్యాక్ కొనసాగుతూనే పోలీస్ టా ర్చర్ల  ఎపిసోడ్లు మొదలవుతాయి. పూజా గాంధీ టార్చర్ తో అకస్మాత్తుగా సెకండాఫ్ ముగిసి,  ముగింపు ఆగస్టుకి వాయిదా వేశాం పొమ్మనడం వుంటుంది. 

          ఫస్టాఫ్ లో త్వరత్వరగా పది నిమిషాల్లో జర్నలిస్టు దర్యాప్తు చేపట్టడంతో బిగినింగ్ ముగిసి  ప్లాట్ పాయింట్ వన్ వచ్చేస్తుంది. బహుశా సెకండాఫ్ చివర్లో పూజా గాంధీ టార్చర్ తో  ప్లాట్ పాయింట్ టూ వస్తుంది. ఈ మధ్యలో నడిచే మిడిలంతా, ఫస్టాఫ్ లో బావున్న మిడిల్ వన్ వదిలేస్తే, సెకండాఫ్ లో మిడిల్ టూలో,  ఆ ఫ్లాష్ బ్యాక్ అంతా అనాసక్తికరం, అనవసరం, బాక్సాఫీసు అప్పీల్ లేనితనం, పరమబోరు కొట్టే నాటకం. ఎంత కౄరులో ‘
దండుపాళ్యం లో చూపించాక, ఇప్పుడెంత కల్లాకపటం ఎరుగని నగరానికి వలస వచ్చిన అమాయక జీవులో చూపిస్తే, నవరసాల్లో ఇదే రసమవుతుంది ప్రేక్షకులు  కనెక్ట్ అవడానికి? ‘నిర్భయ’ దోషులు పూర్వం ఏంతో పవిత్రులని చెప్తే చెల్లుతుందా? యాకుబ్ మెమన్ ఉరి రద్దుని కోరడమెలాంటిదో, దండుపాళ్యం ముఠా పట్ల సానుభూతిని ప్రోది చేయడం అలాంటిదే అన్నట్టు తేలింది. 

          వీళ్ళని సంచార జాతిగా చూపిస్తూ, గుడిసెల్లో జీవించడం, పందుల్ని పెంచడం, అర్ధాకలితో అలమటించడం, అన్నం అడుక్కుంటూ తిరగడం, జబ్బుతో చావడం...ఒకటని కాదు, ఇప్పటి సినిమాల్లో కన్పించని  సినిమా కష్టాలన్నీ, కన్నీళ్ళన్నీ వున్నాయి. ఆర్టు సినిమా కళలన్నీ వున్నాయి. 

          సెకండాఫ్ లో సంగం ఈ జీవితాలు, సగం పోలీస్ టార్చర్. విషయంలేని ఈ వృధానంతా  అరికడుతూ జర్నలిస్టు పాత్రతో ప్రస్తుతానికి వచ్చి వేగవంతం చేయాల్సింది. కానీ దీన్ని పాడియా వుగా చూస్తూ, ఇంకా ప్రేక్షకుల జేబుల్లోంచి డబ్బులు పిండుకునే ఉద్దేశంతో సాగదీశారు. ఇంత ఫ్లాష్ బ్యాక్ చెబుతున్న హంతక ముఠా నిజమే చెప్తున్నారని మనమెలా నమ్మాలి? దీనికి జర్నలిస్టు దొరకబుచ్చుకున్న ఒక్క ఆధారమూ విశ్వనీయత కోసం ఎస్టాబ్లిష్  చేయలేదు. 

          ముగిసిపోయిన ‘
దండుపాళ్యం’ దారుణ చరిత్రని కెలికి ఇంకేదో చేయాలనుకున్నారు. దీన్ని ఆగస్టు ముక్కలో ఎలా జస్టిఫై చేస్తారో చూసేందుకు, ఈ రివ్యూని కూడా ముగింపు వాయిదా వేసి  వెళ్లిపోదాం.

-సికిందర్
         
         
         









26, జులై 2017, బుధవారం

487- నాటి సినిమా!





       పాత్రికేయుడు థామస్ ఫ్రీడ్మన్ తరచూ ఓ మాట అంటూంటాడు - ప్రపంచంలో ఉగ్రవాద సమస్య తీరడానికి, ఆ వైపు ఆకర్షితులవుతున్న వాళ్ళతో మత పెద్దలు కూర్చుని రచ్చబండ  సమావేశాలు జరుపుకోవాలని. కులపంచాయితీలకి, కట్టుబాట్లకు, సెంటిమెంట్లకి ప్రబల గుర్తుగా వుండే విలేజి రచ్చబండ  తీర్మానాలు, అంత బలమైన ప్రభావం చూపగలవని ఆయన నమ్మకం. కానీ దురదృష్ట వశాత్తూ ఇలాటి సమావేశాలు ఉగ్రవాద తండాల్లోనే  జరుగుతూ, అసంఖ్యాక లేతపిండాలు కరుడుగట్టిన  టెర్రరిస్టులుగా తయారై లోకం మీద పడడాన్ని చూస్తున్నాం. 

          ప్రజాపాలనేది పాజిటివ్ అర్ధంలోకంటే, నెగెటివ్ కోణంలోనే సమాంతర వ్యవస్థ రూపంలో సూపర్ హిట్టవుతుందేమో! ఉగ్ర తండాల్లో తాలిబన్లు, గ్రామాల్లో భూస్వాములు, నగరాల్లో మాఫియాలు... సినిమాల్లో బొబ్బిలిబ్రహ్మన్న! 


             ఔను వాళ్ళిద్దరూ మెలికపడ్డారు...ఫిలిం ఈజ్ బిహేవియర్ అన్నట్టే, స్టార్ ఈజ్ ఆర్గ్యుమెంట్ అని కూడా అన్నారు పెద్దవాళ్ళు. బ్రహ్మన్న ఈ రెంటినీ మెలేసి, ధర్మపీఠం  స్థాపించి కూర్చున్నాడు! ఫ్రీడ్మన్ మార్కు విలేజి రచ్చబండ స్థానే, ధిక్కార ధోరణితో సమాంతర  వ్యవస్థనే స్థాపించాడు. నేరం జరిగిందా, ఇక పోలీసులకి నో ఎంట్రీ. విచారణ తనదే, తీర్పు కూడా తనదే. తీర్పుని శిరసావహించకపోతే  గ్రామబహిష్కారం లేదా అక్కడున్న కత్తితో చటుక్కున శిరవిచ్ఛేదం!  ఎంత తీవ్రవాదం...టోటల్లీ అబ్నార్మల్ క్యారక్టర్!

          ఒక సహజవిరుద్ధమైన పాత్రతో రచయిత / దర్శకుడు ప్రేక్షకుల మనస్సుల్లోకి ప్రవేశపెట్టాలనుకునే వాదం ఒప్పించేదిగా వున్నప్పుడే అది విజయవంతమవుతుంది. సినిమా ఆసాంతం కథనం పేరుతో  చేసేదే వాదం అయినప్పుడు, దానికో నాదం వుంటుంది.వాదాన్ని నాదంలా వినిపించడంలో విఫలమైతే  అభాసవుతుంది. బ్రహ్మన్న తన బిహేవియర్ ని, ఆర్గ్యుమెంట్ నీ అంతబాగా వొంటబట్టించుకున్నాడు కాబట్టే, పాత్ర ప్రయాణాన్ని నల్లేరు మీద నడకలా మార్చుకోగలిగాడు. దీన్నే ‘ధర్మాధికారి’ గా హిందీలో దిలీప్ కుమార్ తో కృష్ణంరాజే రీమేక్ చేస్తే, కోలుకోలేని నష్టాలే తేలాయి.  కారణం? దిలీప్ మెత్తటి నటుడు. కృష్ణం రాజులా కళ్ళెర్ర జేసి పౌరుషాగ్నిని రగిలించడం కష్టం. కృష్ణంరాజుకి కళ్ళే నటనకి తరగని ఆస్తి. సంచలన క్యారక్టర్ వుంటే చాలదు, దానికి తగ్గ ఆర్టిస్టు బలం తోడవాలని దిలీప్ కుమార్ తో తేలింది. బిహేవియర్, ఆర్గ్యుమెంట్, ఆర్టిస్టు బలం - ఈ మూడూ ఇనుమడింప జేసే టాలెంట్ కృష్ణం రాజుది. గోపీ కృష్ణా మూవీస్ సంస్థ స్థాపించి, నిర్మించిన ‘కృష్ణవేణి’ (1974) లో వాణిశ్రీ పోషించిన మతిస్థిమితం కోల్పోయిన సహజ విరుద్ధపాత్ర ఆమె టాలెంట్ తో ఎంత సంచలన విజయం సాధించిందో తెలిసిందే! 

   ‘బొబ్బిలిబ్రహ్మన్న’ రచయితల్లో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ రాసిన సిద్ధాంత గ్రంథం – ‘తెలుగు సినిమా సాహిత్యం- కథ, కథనం, శిల్పం’ - లో ఓ చోట ఈ సినిమాలోని ఓ సన్నివేశాన్ని వివరిస్తూ, తెలియని అద్భుత శక్తేదో ఆ కష్టమైన సన్నివేశాన్ని రాయించిందంటారు.  మనం చెప్పుకోవాలంటే, ఆ సన్నివేశాన్నలా వుంచి, అసలు బ్రహ్మన్న అనే అసాధారణ పాత్రనే ఆ అద్భుత శక్తేదో సృష్టించిందనాలి.

      ఈ బ్రహ్మన్న బొబ్బిలి బ్రహ్మన్నల వంశంలో నాల్గవతరం మనిషి. 1857 సిపాయీల తిరుగు బాటప్పుడు, బ్రిటిష్ సైనికులు కోటిపల్లి గ్రామంలో అరాచకాలు చేస్తారు. దీని మీద తిరగబడ్డ మొదటి తరం బ్రహ్మన్న కత్తిపట్టి అరాచక మూకల్ని తెగ నరుకుతాడు. అప్పుడు తెల్లదొర బ్రహ్మన్నని మాయోపాయంతో పట్టుకుని చెట్టుకి ఉరి తీయిస్తాడు. అలా వీరస్వర్గం పొందిన ఆ మొదటి  బ్రహ్మన్న వేలాడిన చెట్టునే నరికి, దాని మొదల్లో అతడి కత్తినే అధికారానికి గుర్తుగా నాటుతారు గ్రామస్థులు. అప్పట్నించీ బ్రహ్మన్న వంశస్థులు గ్రామం లోకి పాలకుల ప్రవేశాన్ని నిషేధించి, ధర్మాన్ని తామే కాపాడుకుంటూ వున్నారు. ఇదంతా ప్రారంభ దృశ్యాల్లో జయసుధ బుర్రకథగా  చెప్పుకొచ్చే ఫ్లాష్ బ్యాక్.  

          ఈ నేపధ్యంలో ఇప్పటి బ్రహ్మన్న పాత్రచిత్రణలో ఓ సమస్య లేకపోలేదు. ఓ సన్నివేశంలో నిందితుడి కోసం గ్రామాని కొచ్చే పోలీసు అధికారిని బ్రహ్మన్న ఆపేస్తూ, అధికారుల వెలికి  తన కారణాలు చెప్తాడు – ‘ఆ నాడు తెల్లవాడు తన సైనికుల చేతిలో పరిపాలన పెడితే, మగవాడి ప్రాణాలకి రక్షణ లేకుండా పోయింది. మలినాడు నిజాం నవాబు ఖాసీం రజ్వీ చేతిలో అధికారం ఉంచితే, ఆడవాళ్ళ శీలానికి భద్రత లేకుండా పోయింది, ఈ  నాడు ప్రజాప్రభుత్వాలు మీ పోలీసుల చేతుల్లో ప్రజల బతుకులు పెడితే...’ అంటూ పోలీసుల ఘోరాలు వార్తా పత్రికల్లో చూపిస్తానంటాడు. 

          ఇప్పటి బ్రహ్మన్న కార్యాచరణకి ఈ కారణాలు చాలవనిపిస్తాయి. ఎప్పుడో శతాబ్దాల క్రితం 1857 లో గ్రామంలో జరిగిన సంఘటనలు,  ముత్తాత బలిదానమూ వగైరా ఇప్పటి తన ప్రవర్తనకి ఇంకా చోదక శక్తులుగా వుంటాయా? పాతికేళ్ళ క్రితం తన తల్లి దండ్రుల్ని చంపిన విలన్ ని కళ్ళారా చూసిన హీరో, ఎప్పుడో పెద్దయ్యాక పగతీర్చుకోవడమే ఒక అసహజ చిత్రణ.  అలాటిది 152 ఏళ్ల తర్వాత ఇంకా పాలనా వ్యవస్థ మీద బ్రహ్మన్న పగబట్టి కూర్చోవడం అతి అన్పిస్తుంది. ఆ చెప్పే కారణాలకి కూడా పొంతన కన్పించదు. బ్రిటీష్ పాలనలో అరాచకాలు  సరే, మధ్యలో ఖాసీం రజ్వీ అరాచకాలు  కోస్తాలో ఎక్కడ జరిగాయి.  తెలంగాణాలో జరిగిందాన్ని కోస్తా కెలా అన్వయిస్తాడు. తన ప్రాంతం  గురించే  మాట్లాడాలి. నిజాం కూడా పాలనని రజ్వీ చేతిలో పెట్టలేదు. ఏ నిజాంల  కాలంలో కూడా మతకలహాలు  జరగలేదు. ఇక రాజ్యం పోతుందన్న దుగ్ధకొద్దీ ఖాసీం రజ్వీ దాన్ని ఎదుర్కోవడానికి నిజాంని కాదని రజాకార్లని సృష్టించి ఎగదోశాడు. ఇక బ్రహ్మన్న పాత్ర వున్న కోస్తాలో బ్రిటిష్ పాలనపోయి భారత పాలన మాత్రమే వచ్చింది. 


     బ్రహ్మన్న ఇప్పుడు చర్యకి పూనుకోవాలంటే ప్రత్యక్ష అనుభవాలతో కూడిన ఫ్లాష్ బ్యాక్ పడాలేమో? పాతికేళ్ళ తర్వాత విలన్ మీద పగదీర్చుకునే హీరోకైనా చిన్నప్పుడు  ఏం జరిగిందో అతడితోబాటు అది చూసిన ప్రేక్షకులకి, అతడి పగతో కనెక్ట్ అయ్యే ఎమోషన్ పుట్టుకొస్తుంది. కానీ బ్రహ్మన్న కీ సర్కిల్ ఆఫ్ బీయింగ్ లేదు. అతను బ్రిటిష్ కాలంనాటి సంఘటనలు చూడలేదు, ప్రేక్షకులు చూశారు. బ్రహ్మన్నతో ప్రేక్షకులకి ఈ ఎడం వుంది. అల్లూరి సీతారామరాజు కూడా మన్యం ప్రజల బాధలు కళ్ళారా చూసి, చలించిన ఫలితంగానే చర్యకి పూనుకున్నాడు. ఇప్పటి బ్రహ్మన్నకి విన్న విషయాలే తప్ప, కన్న విషయాలూ  బాధాకర అనుభవాలూ లేవు. అతను సుఖంగా కాలం గడుపుతున్నాడు. ప్రేక్షకులకి కళ్ళారా చూపించిన పూర్వకాలపు దృశ్యాలు, బ్రహ్మన్నకి అనుభవం కావాలంటే, కనీసం అతడి తండ్రి చనిపోతూ చెప్పాలి, చెప్పి వంశానుగతంగా వస్తున్న ఆచారాన్ని కొనసాగించాలని మాట తీసుకోవాలి- అప్పుడే ప్రేక్షకులతో ఎడం తీరే అవకాశం వుంటుంది. 

          ఇదే విషయం రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు ముందు పెడితే, ఫ్లాష్ బ్యాకులు ఎక్కువై పోతాయన్నారు. జయసుధ బుర్ర కథతో చెప్పిన ఫ్లాష్ బ్యాక్ సరిపోతుందన్నారు. అది ప్రేక్షకులకి చెప్పారు, బ్రహ్మన్నకి చెప్పినట్టు చూపించలేదు కదా అంటే, దానికేదో చెప్పారు. మరి సెకండాఫ్ లో అన్నపూర్ణతో కృష్ణంరాజు ఫ్లాష్ బ్యాక్ గురించి అడిగినప్పుడు, దానికి టకటకా చెప్పేసి కన్విన్స్ చేశారుగానీ; అంతటి బ్రహ్మన్న, తన మీద వచ్చిన ఆరోపణలకి ఆ ఫ్లాష్ బ్యాకే చెప్పి, ప్రత్యర్ధి నోర్మూయించలేకపోతే, మళ్ళీ తన కొడుకే వచ్చి కాపాడాల్సి వస్తే, అది కూడా చాలక అన్నపూర్ణ కూడా వచ్చి బలపరచాల్సి వస్తే, బ్రహ్మన్న పాత్ర దయనీయ స్థితిలో పడిపోలేదా అన్న ప్రశ్నకూడా మనకి ప్రశ్నగానే మిగిలిపోయింది. ప్రశ్నలకి వివరణల  సంగతెలా వున్నా, ఎప్పుడో 1984 లో రాసిన స్క్రిప్టు సంగతులు ఇంకా గుర్తుండడం చూస్తే ఆయన జ్ఞాపక శక్తి అమోఘమన్పిస్తుంది. 

          ఇలా పైవిధంగా సహజ విరుద్ధ సినిమాటిక్ పాత్ర బ్రహ్మన్న కి కాస్త అతి కూడా జత కలిసింది. చర్యకీ కారణానికీ ఎడం వుంటే అతిగానే వుంటాయి పాత్రలు. తాలిబనిజంతో కూడిన నెగెటివిజం,  యాంటీ హీరోయిజములే  బ్రహ్మన్న విలక్షణ వ్యక్తిత్వం. ప్రేక్షకులు నిజ జీవితంలో ఏసు క్రీస్తు, మహాత్మా గాంధీ, మార్టిన్ లూథర్ కింగ్ ల వంటి అహింసా  మూర్తుల్ని హీరోలుగా పరిగణినిస్తారనీ, అదే సినిమాల్లో కొచ్చే టప్పటికి, హీరో వయోలెంట్ గా వుంటేనే అభిమానిస్తారనీ, ఓ హాలీవుడ్ రచయిత సెలవిచ్చాడు. ఇలాంటి వయోలెంట్ బ్రహ్మన్న తాపత్రయమంతా కూడా ధర్మం కోసమే. 

          ఈ ధర్మపీఠం మీద ఆధిపత్యం కోసం పెద వెంకటరాయుడుగా రావుగోపాలరావు  కుతంత్రాలు. ఈయనది  కామిక్ విలనీ. బృహన్నల లాంటి కొడుకుగా  సత్యనారాయణనీ, చాణక్య చిట్కాలు చెప్పే గుడిపూజారి గా నూతన్ ప్రసాద్ నీ, ఇంకా అటలు పట్టించి  పరువు తీసే బార్బర్ గా  అల్లురామలింగయ్యనీ వెంటేసుకుని ఏం తీర్పులు  చెప్తాడో దేవుడెరుగు- ఎలాగైనా ధర్మ పీఠం తనకి కావాలంటే కావాలంతే! దీనికోసం బ్రహ్మన్నని ఇరుకున బెడుతూ  ఏదో వొక సమస్య  తెచ్చి పెడుతూంటాడు. ఓసారి ఖర్మకాలి  సత్యనారాయణ తన మగటిమిని నిర్ధారించుకునే ప్రయోగం చేసి, జయసుధ అక్క పాత్రతో నీచానికి పాల్పడతాడు. దీనికి బ్రహ్మన్న ఒకటే తీర్పు చెప్తాడు – అదే అమ్మాయితో పెళ్లి, లేదా రావుగోపాలరావ్ అండ్ కంపెనీ గ్రామం నుంచి వెలి! 


  భలే ఇరకాటంలో పడతాడు రావుగోపాలరావు. పైగా కొడుకు పాల్పడ్డ నీచానికి ఆ అమ్మాయి మాట కూడా పడిపోయింది. కొడుకు ఇలా మూగదాన్ని చేసుకోవాల్సి వస్తే, బ్రహ్మన్న కూతురు కూడా కళ్ళు లేని దాన్ని చేసుకునేట్టుగా పథకమేస్తాడు. 

    బ్రహ్మన్న కూతురుగా ముచ్చెర్ల అరుణ, భార్యగా శారద వుంటారు. తమ్ముడిగా కృష్ణంరాజు (ద్విపాత్రాభినయం) వుంటాడు. ఈ తమ్ముడి ప్రేమికురాలు జయసుధ. రాజేష్ ని అరుణ రహస్యంగా ప్రేమిస్తూంటుంది. వీళ్ళిద్దర్నీ లేచిపోయేలా చేస్తే బ్రహ్మన్న పదవీ భ్రష్టు డవుతాడని చిట్కా చెప్తాడు నూతన్ ప్రసాద్. దీన్ని కృష్ణంరాజు,  జయసుధలు విఫలం చేస్తారు. రావుగోపాలరావు ఇక సొంత చిట్కా ప్రయోగిస్తాడు. దీంతో అరుణ వల్ల  ఒకడు కళ్ళు పోగొట్టుకుంటాడు. ఈ పంచాయితీ ధర్మపీఠం ముందుకొస్తుంది. తన కూతురు ఈ గుడ్డి వాణ్ణే చేసుకోవాలని తీర్పు చెప్పేస్తాడు బ్రహ్మన్న. కృష్ణం రాజు అడ్డుపడి ఆమె ప్రేమిస్తున్న రాజేష్ తోనే  పెళ్లి జరిపించేస్తాడు. దీంతో వీళ్ళందర్నీ గ్రామబహిష్కారం చేస్తాడు బ్రహ్మన్న. ఇది తట్టుకోలేక  శారద వెళ్లి వాళ్ళని చూసొస్తానంటే, ఆమెనీ బహిష్కరించి ఏకాకి అయిపోతాడు  బ్రహ్మన్న

          ఇదంతా చూసి ఆనందిస్తూంటాడు రావుగోపాలరావు. అప్పుడు  ఒకటొకటే నిజాలు బయట పడుతూంటాయి. అడ్డంగా బ్రహ్మన్నకి దొరికిపోతాడు. తరిమి తరిమి మరీ వధిస్తాడు బ్రహ్మన్న. ఇక ధర్మ పీఠాన్ని తమ్ముడికి అప్పజెప్పేసి జైలు కెళ్ళిపోతాడు.

          దీనికి కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఆయన మార్కు కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ వుంటాయి. చక్రవర్తి సంగీతం. ఇప్పుడా పాటలూ నృత్యాలూ బలహీనంగా అన్పిస్తాయి. సలీం నృత్య దర్శకుడు. కొన్ని చోట్ల కృతకంగా వుంటుంది కథనం.

       1984 లో ఇది విడుదలయింది. అప్పటికింకా కాస్త మిగిలిన జమీందారీ వ్యవస్థనీ, ఉమ్మడి కుటుంబ వ్యవస్థనీ ప్రతిబింబిస్తుంది. మధ్య తరగతి ఉమ్మడి కుటుంబాలు పూర్తిగా  వేరు. అవి ఫ్రీగా మసలుకుంటాయి. జమీందారీ ఉమ్మడి కుటుంబాల్లో కుటుంబ పెద్దని చూసి జడుసుకు చస్తుంటారు కుటుంబ సభ్యులు. చివరాఖరికి ఆ కుటుంబ పెద్ద బుద్ధి తెచ్చుకోవడమే పని. ఇది  సినిమాలకి అలవాటయిన ఫార్ములా. ఇంకో పదేళ్ళ తర్వాత ఇలాటి జమీందారీ కథతోనే మోహన్ బాబు ‘పెద రాయుడు’ తీశారు

           
-సికిందర్
(సెప్టెంబర్ 13, 2009 – ‘సాక్షి’)
http://www.cinemabazaar.in         
         


          

25, జులై 2017, మంగళవారం

సాంకేతికం : republishing the article to clear some misconceptions among the new comers in di



          డీఐ విధానంలో కలరిస్టు  పని చిత్ర లేఖనమే. చిత్రకారుడు కుంచెతో రంగు లద్దినట్టు కలరిస్టు సాఫ్ట్ వేర్ తో మెరుగులు దిద్దుతాడు. వెలుగు నీడల్ని సరిచేస్తాడు. ఆలోచన మెరిస్తే, తెలుపు నలుపు దృశ్యాల్లో చొక్కా గుండీలకి రంగు లేసి చమత్కారం కూడా చేస్తాడు. కెమెరామాన్ దృశ్యమానం చేస్తే,  కలరిస్టు కలంకారీ తనం ప్రదర్శిస్తాడు. ఉపయోగించే సాఫ్ట్ వేర్ బేస్ లైట్ కావొచ్చు, లస్టర్ కావొచ్చు, ఇంకేదైనా కావొచ్చు  -వర్క్ స్టేషన్ ఏదైనా విన్యాసాలోకటే.

          కాకపోతే డీటీఎస్ నిపుణుల్లాగే  డిఐ కలరిస్టులు  ఫీల్డు మొత్తం మీద అతికొద్ది మందే వుంటారు. ఫీల్డు అవసరాలకి వీళ్లి సరిపోతారు. టాలీవుడ్ లో వున్న అలాటి అతికొద్ది మంది కలరిస్టుల్లో  సి.వి. రావు ఒకరు. కలరిస్టుకి పని ఒత్తిడి చాలా ఎక్కువ. అలాంటప్పుడు డీఐ సూట్లు పెంచుకుని, ఎక్కువ మంది కలరిస్టుల్ని నియమించుకోవచ్చు కదా అన్పించ వచ్చు. కా నీ అది కాదు సమస్య. ఎడాపెడా సినిమాలు తమ మీద వచ్చి పడిపోవడం వల్ల కాదు పని భారం పెరిగి ఒత్తిడి.. సీవీ రావు మాటల్లోనే చెప్పుకుంటే- సినిమాల్ని రిలీజ్ ఘడియ వరకూ ఎడిటింగ్ చేస్తూ ఆక్షరి నిమిషాల్లో డీఐ కి పంపిస్తూంటారు. దీంతో ఒత్తిడి పెరిగి నాణ్యతతో కూడా రాజీ పడాల్సి వస్తోంది..’  ఇదీ సమస్య. ఆఖరి నిమిషాల్లో ఆదరాబాదరా అవసరాలు తీర్చే సమస్య!


      ‘మగధీర’ ’ క్లయిమాక్స్ దృశ్యాలకి ఈయన అలాటి డెడ్ లైన్ ( రెండు రోజులు మాత్రమే గడువు!) ఒత్తిడినే ఎదుర్కోవాల్సి  వచ్చింది. ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాల్లో డీఐ  అక్కడక్కడా పాలిపోయినట్టు కన్పించడానికి కారణం ఇలాటి పని ఒత్తిడే. తెలుగు సినిమాలపై వెబ్ సైట్లలో వచ్చే ఇంగ్లీషు రివ్యూలలో, డీఐ బాగా లేదని రాస్తూంటారు. ఎందుకు బాగా రాలేదో కారణాలు తెలుసుకుని రాస్తే, కలరిస్టుల  నైపుణ్యం మీద అనుమానాలు తొలగి పోయే అవకాశముంటుందని అబిప్రాయపడ్డారు తను. 


          డీఐ అంటేనే కెమెరామాన్ చిత్రీకరించు కొచ్చిన  బొమ్మల్ని రేణువులుగా విడగొట్టి, శుద్ధి చేసి, తిరిగి ఫిలిం మీదికి ఎక్కించడం. ఈ ఫిలిం ట్రీట్ మెంట్, డీ-స్పాటింగ్, డర్ట్ ఫిక్సింగ్, కలర్- లైటింగ్ కరెక్షన్ ప్రక్రియల్లో కలరిస్టు సూక్ష్మ గ్రాహి అయివుంటాడు. అతడి ఏకాగ్రతకి పూర్తి 30 రోజుల గడువూ ఇవ్వకపోతే, క్వాలిటీ రాదన్నారు సీవీ రావు.


        ఓకే, ఇక సాంకేతికాల్లోకి వెళితే, ఆయన చెప్పిన ప్రకారం- సాంప్రదాయ గ్రేడింగ్ లో ఎనలైజర్ తో బొమ్మని మాత్రమే సరి చేయగల్గుతారు. స్కిన్ కలర్ ని బేస్ చేసుకుని, దృశ్యంలో ప్రధాన బొమ్మ వరకూ మాత్రమే సరిదిద్ద గలుగుతారు. దీన్ని ప్రైమరీ కలర్ కరెక్షన్ అంటారు. ఈ బొమ్మ మినహా మరే దృశ్య భాగాన్నీ ఎనలైజర్ తో దిద్దడం  కుదరదు. అంటే- దృశ్యంలో పొద్దు తిరుగుడు పువ్వు ప్రధాన బొమ్మగా వుంటే, దాని పసుపు వర్ణం ( అంటే స్కిన్ కలర్)  ని ఆధారం చేసుకుని కాడనీ, తొడిమల్నీ, ఆకుపచ్చ రంగుతో ఎంతయినా ఆకర్షణీయం చేయొచ్చు. కానీ పైన ఆకాశాన్నీ, కింద నేలనీ మాత్రం ఏమీ చేయలేరు. ఈ పువ్వు స్థానంలో మనిషి రూపమే  ప్రధాన బొమ్మగా వున్నా కూడా, ఆ  స్కిన్ కలర్ ని బేస్ చేసుకుని, ఆ రూపం వరకూ మాత్రమే సింగా రించగల్గుతారు. 

        డీఐ తో అలా కాదు- దృశ్యం లో ప్రధాన బొమ్మతో బాటు, నేపధ్యంలో ఇంకా ఏవైనా విశేషాలుంటే వాటన్నిటినీ రంగులతో, వెలుగు నీడలతో సరి దిద్దెయ్యొచ్చు. అంటే పొద్దు తిరుగుడు పువ్వు తో బాటు పైన భూమ్యాకాశాల్నీ, చుట్టూ పశుపక్ష్యాదుల్నీ, సమస్త విశేషాల్నీ కొట్టొచ్చేట్టు తీర్చిదిద్ద వచ్చన్న మాట. దీన్ని సెకండరీ కలర్ కరెక్షన్ అంటారు. పాత గ్రేడింగ్ పద్ధతి ప్రైమరీ కే పరిమితమైతే, డీఐ వచ్చేసి సెకండరీకి విస్తరించి, మొత్తం ఫ్రేమునీ కళకళ లాడేట్టు చేస్తుంది.ఇదెలా జరుగుతుందో వీడియో స్క్రీన్ మీద ఉత్సాహంగా చేసి చూపించారు.


     బేస్ లైట్ ఈయన అభిమాన వర్క్ స్టేషన్. దాని ముందు ఆత్మవిశ్వాసంతో గర్వంగా కూర్చుని పని చేస్తారు. ఇందుకోసం లండన్ లో బేస్ లైట్ కంపెనీ ఇచ్చిన ప్రత్యేక శిక్షణ పొంది వచ్చారు. 2005 లో ఒక నార్వేజియన్ ఫిలిం కిల్ బుల్ జో’ ( క్వెంటిన్ టరాంటినో తీసిన కిల్ బిల్ కి పేరడీ) తను డీఐ చేసిన మొదటి సినిమా. అయితే తెలుగులో బడ్జెట్ పరిమితులుండే  చిన్నా చితకా సినిమాలకి డీఐ చేసుకునే అదృష్టం ఉండదా అని అడిగితే- దీనికిలా  చెప్పారు :  ‘వాళ్ళు ముడి ఫిలిం కి పెట్టే లక్షల రూపాయల్ని డీ ఐ కి కేటాయించుకుని, డిజిటల్లో చిత్రీకరణ జరుపు కోవచ్చు. చిన్న సినిమాలకి కూడా డీఐ అదృష్టం వుంటుంది. ఎలాగూ ఆ డిజిటల్ అవుట్ పుట్ ని ఫిలిం మీద ప్రింట్లు వేయించుకునే సదుపాయం వుంది కదా, ఇలా చేసుకుంటే భారీ సినిమాల డిఐ హంగులు చిన్న సినిమాలకీ సాధ్యమే!


       చిత్తూరు జిల్లా దొడ్డి పల్లి కి చెందిన సీవీ రావు ( చెరపల్లి వెంకటేశ్వర రావు) ఆర్ధిక శాస్త్రంలో పీ హెచ్ డీ చేసి, మల్టీ మీడియాలో మాస్టర్స్ డిప్లొమా పూర్తి చేశారు. హైదరాబాద్ లో ఓ మల్టీ మీడియా సంస్థలో  పని చేస్తున్నప్పుడు, 2005 లో  కె. బసిరెడ్డి నెలకొల్పిన డిజిక్వెస్ట్లాబ్ లో అవకాశం వచ్చింది. అప్పట్నించీ మగధీర’, ‘కిక్’, ‘స్టాలిన్’, ‘ప్రస్థానం’, ‘సాధ్యం’, ‘తకిట తకిట’, ‘కాఫీబార్వంటి తెలుగు సినిమాలతో బాటు, 9 ప్రాంతీయ భాషల్లో, మూడు అంతర్జాతీయ భాషల్లో మొత్తం 90 పై చిలుకు సినిమాలకి కలరిస్టుగా సేవలందించారు.

        షూటింగు లకి ముందు ఛాయాగ్రాహకులకి ఎక్స్ పోజర్ లెవెల్స్ పైన మాత్రమే  సూచన లిచ్చే తనకి, సెట్స్ కి వెళ్ళే అలవాటు లేదన్నారు.


సికిందర్ (అక్టోబర్ 2010, ఆంధ్రజ్యోతి- సినిమా టెక్శీర్షిక) 

          



22, జులై 2017, శనివారం

486 : డార్క్ మూవీస్ స్క్రీన్ ప్లే సంగతులు -8





ప్పుడైనా  ప్లాట్ పాయింట్ వన్ ని బట్టే మిడిల్లో కథ వుంటుంది. మిడిల్లో వేరే కథ పుట్టుకురాదు. కొన్ని తెలుగు సినిమాల్లో పుట్టుకొస్తుంది. ఫస్టాఫ్ కథ సెకండాఫ్ లో వుండదు. సెకండాఫ్ లో వేరే కథ మొదలవుతుంది.  బ్రహ్మోత్సవం, షేర్, బ్రూస్ లీ, కాటమరాయుడు, డిక్టేటర్ మొదలైన  స్టార్ సినిమాలు ఇలా తీస్తూనే వుంటారు. జ్యోతిలక్ష్మి కూడా ఇలాటిదే. ఇంటర్వెల్ వరకూ ఒక సినిమా, ఇంటర్వెల్ తర్వాత ఇంకో సినిమా.  స్క్రీన్ ప్లే  సగానికి ఫ్రాక్చర్ అయిన సంగతే పట్టదు. ఫ్రాక్చరై సెకండాఫ్ సిండ్రోమ్ లో, ఆ పైన అట్టర్ ఫ్లాప్ సుడిగుండంలో పడుతున్నామని అసలే పట్టదు. పైన చెప్పుకున్నవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. వెనక్కిపోతే ఇంకా వున్నాయి. ఇది రెండు వేర్వేరు ముక్కల్ని అతికించి సక్సెస్ ని ఆశించే కళా తాపీ మేస్త్రీయం. వేర్వేరు ముక్కలు కాకుండా, చూపిస్తున్న ఒకే రూపాన్ని ఫ్రాక్చర్ అవకుండా, ప్లాట్ పాయింట్ వన్ దగ్గర్నుంచీ ఇంకో రూపంలో చూపించవచ్చా? తప్పకుండా వచ్చు. ‘బ్లడ్ సింపుల్’  చూస్తే బాగా వచ్చు. 

            ‘బ్లడ్ సింపుల్’ ప్లాట్ వన్ దగ్గర డిటెక్టివ్ విస్సర్ కి ఏర్పాటైన గోల్  ప్రకారమే మిడిల్లో కథ నడుస్తోందని అన్పిస్తోందా? విస్సర్ మార్టీకి ఫోన్ చేసి వాళ్ళిద్దర్నీ చంపేశానని చెప్పడం చూస్తే  అలాగే అన్పిస్తుంది. మార్టీ కిచ్చిన మాట ప్రకారం డబ్బుకోసం వాళ్ళని చంపడమే విస్సర్ గోల్. ఐతే అసలు విస్సర్ గోల్ ఇదే కాకపోతే?  అప్పుడేమవుతుంది?  చెప్పిన గోల్ తో సంబంధంలేని కథ మొదలవుతుందా? ఇంతవరకూ ఇంటర్వెల్ తర్వాతే వేరే అతుకుడు కథలు మొదలవుతున్నాయని పైన చెప్పుకున్నాం. ఇంటర్వెల్ లోపే ప్లాట్ పాయింట్ వన్ దగ్గరే,  ఆశించిన దానికి భిన్నంగా కథ మొదలవడం ఇప్పుడు చూడబోతున్నాం  ‘బ్లడ్ సింపుల్’ లో. ఇలా అయితే ఇంటర్వెల్ దాకా ఎందుకు,  ప్లాట్ పాయింట్ వన్ దగ్గరే ఫ్రాక్చర్ అవుతుందా స్క్రీన్ ప్లే? చూద్దాం!

          మిడిల్ - 1 వన్ లైన్ ఆర్డర్ తరువాయి చూస్తే-
         
19.  విస్సర్ మార్టీ దగ్గరికెళ్ళి మర్డర్ ఫోటో చూపించి డబ్బు తీసుకుని, మార్టీని షూట్ చేయడం
          20.  రే బార్ కొచ్చి మార్టీ శవాన్నీ, రివాల్వర్నీ చూసి ఈ హత్య ఎబ్బీ చేసిందనుకోవడం
          21. కారులో శవంతో రే బార్ లోంచి బయట పడడం
          22.  హైవే మీద ప్రయాణంలో మార్టీ ఇంకా బతికే వున్నాడని  రే తెలుసుకుని పారిపోవడం
          23.  మార్టీ ని అలాగే లాక్కెళ్ళి సజీవ సమాధి చేయడం

19.  విస్సర్ మార్టీ దగ్గరికెళ్ళి మర్డర్ ఫోటో చూపించి డబ్బు తీసుకుని, మార్టీని షూట్ చేయడం 
        ఎబ్బీ, రే లని చంపేశాడు గనుక  డబ్బు తీసుకోవడానికి మార్టీ దగ్గరికి బార్ మూసేశాక వస్తాడు  రాత్రి పూట విస్సర్. వచ్చి రెండు చేపల్ని టేబుల్ మీద పడేసి కూర్చుని సిగరెట్ వెల్గించుకుని, లైటర్ ని టేబుల్ మీద పెడతాడు. టేబుల్ మీద మార్టీ వైపు ఇంకో రెండు చేపలు పడి వుంటాయి. డబ్బులు అడుగుతాడు విస్సర్. ముందు నువ్వేదో చూపించాలేమో? – అంటాడు మార్టీ. విస్సర్ కవరందిస్తాడు. అందులోంచి చిన్నగా ఫోటో బయటికి లాగుతూ చూస్తాడు మార్టీ. బెడ్ మీద ముందు రే కన్పిస్తాడు. ఇంకా ఫోటో లాగుతూంటే పక్కన ఎబ్బీ వుంటుంది. కప్పుకున్న దుప్పటి మీద మూడు బుల్లెట్ రంధ్రాలు కన్పిస్తూంటాయి. రక్తం వుంటుంది. ఇదంతా చూసి- చచ్చినట్టేనా?-  -అంటాడు. అంతే కదా మరి- అని విస్సర్ సమాధానం.  

            క్లోజ్  షాట్ లో టేబుల్ మీదున్న చేపల్ని పెన్సిల్ పట్టుకుని మార్టీ ముందుకు తోస్తాడు విస్సర్. శవాల్ని ఏం చేశావంటాడు మార్టీ.  చేయాల్సింది చేశా, నువ్వెంత తక్కువ తెలుసుకుంటే అంత మంచిదంటాడు విస్సర్. ఒక్కసారి మార్టీ వొంట్లో అలజడి ప్రారంభమవుతుంది. ఏదో  అనీజీగా వుందని, కవర్లో ఫోటో పెట్టుకుని, దాంతో లేచి బాత్రూం వైపు వెళ్తాడు మార్టీ. 

          క్లోజ్ షాట్ లో కొస్తాడు విస్సర్. మార్టీ వెళ్తూంటే గమనిస్తాడు. ఆ ఫోటో తనక్కావాలని చెప్తాడు. మాట్లాడకుండా బాత్రూం లో కెళ్ళి పోతాడు మార్టీ. డోర్ పూర్తిగా వేసుకోడు. సందులోంచి లోపలి లైటు తెల్లటి కాంతి ప్రసరిస్తూంటుంది.

          విస్సర్ తలతిప్పి సేఫ్ వైపు చూస్తూంటాడు. నుదుటి మీద చిరు చెమటలు పడుతూంటాయి.  హేట్ తో గాలి వూపుకుంటాడు. ఆఫ్ స్క్రీన్ లో బాత్రూం లోంచి నీళ్ళ శబ్దం వస్తుంది. అటు చూస్తాడు. బాత్రూం పక్కన నోటీసు వుంటుంది : Employees must wash hands – అని. వెంటనే చేతిలోని సిగరెట్ పీకని టేబుల్ మీదున్న దున్నపోతు మినియేచర్ మీద నలిపేస్తాడు. 

          లాంగ్ షాట్ తీసుకుంటే,  మార్టీ తిరిగి ఆఫీసులోకి ఎంటరవుతాడు. ఔను, డబ్బివ్వాలి కదూ- అంటాడు.  విస్సర్ డల్ గా టేబుల్ మీదికి చూస్తాడు. మార్టీతో  అంటాడు -  నేనొకటి అడగాలనుకుంటున్నా మార్టీ. నేను చాలా చాలా కేర్ ఫుల్ గా వుంటున్నా, నువ్వూ  అంతే కేర్ ఫుల్ గా వున్నావనుకుంటా...

          ఆఫ్ కోర్స్ – అంటాడు మార్టీ. నన్ను హైర్  చేసినట్టు ఎవరికీ తెలీదుగా?  –విస్సర్ మళ్ళీ అడిగితే సమాధానం చెప్పడు మార్టీ. 

          హై యాంగిల్ తీసుకుంటే, ఓపెన్ చేసిన సేఫ్ ముందు కూర్చుని వుంటాడు మార్టీ. చేతిలో కవర్ వుంటుంది. విస్సర్ కి సేఫ్ కన్పించకుండా అతడి వైపు వీపు అడ్డు పెట్టి, కవర్ లోని ఫోటోని సేఫ్ లోకి జారవిడుస్తాడు. డబ్బు తీస్తాడు...

          అప్పుడు విస్సర్ ప్రశ్నకి జవాబిస్తాడు- ఈ విషయం ఎవరికీ తెలియనివ్వలేదని. సేఫ్ మూసి లాక్ చేసేస్తాడు.  మనది అక్రమ రోమాన్సు, ఒకర్నొకరు నమ్మాలంటాడు. టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుంటూ  కవరూ డబ్బూ విస్సర్ ముందు పడేసి- ‘కష్టంలో, సుఖంలో’ – అని మాట పూర్తి చేస్తాడు. అలాగనకు, నీ పెళ్ళిళ్ళు  అంత గొప్పగా వర్కౌట్ కాలేదంటాడు విస్సర్. అని, చెయ్యి ప్యాంటుకి తుడుచుకుంటాడు. ఈ ఖర్చుని ఎక్కౌంట్ లో ఎలా చూపిస్తావని  అడుగుతాడు. ఏం చేయాలో చేశా, ఎంత తక్కువ నువ్వు తెలుసుకుంటే అంత మంచిదంటాడు మార్టీ,  విస్సర్ మాటల్ని విస్సర్  కే అప్పజెపుతూ. చిరునవ్వుతో చూస్తాడు విస్సర్. డబ్బందుకుంటూ, చాలా రిస్కు తీసుకున్నానంటాడు. లెక్కెట్టుకో మంటాడు విస్సర్. లేదు, నిన్ను నమ్ముతా – అంటాడు విస్సర్, కోటు జేబులోకి చెయ్యి పెడుతూ.  చెయ్యి బయటికి తీస్తాడు. రివాల్వర్ వుంటుంది. మార్టీకి గురిపెట్టి ట్రిగ్గర్ లాగుతాడు. మార్టీ నిశ్చేష్టుడై చూస్తాడు. షర్టు మీద రక్తం ధార కడుతూంటుంది... 


       రివాల్వర్ పేలుడు తర్వాత ఫ్యాను శబ్దం మాత్రమే వినిపిస్తూ వుంటుంది. క్లోజ్ షాట్స్ లో పరస్పరం చూసుకుంటూంటారు. వైడ్  షాట్ లో ఇద్దరి పరిస్థితి : తలవాల్చేసి మార్టీ, అలాగే రివాల్వర్ గురి పెట్టి విస్సర్. క్లోజ్ కొస్తే, విస్సర్ అలాగే గురి పెట్టి హేట్ తో గాలి విసురుకుంటూంటాడు. అలాగే చూస్తూంటాడు. టేబుల్ మీద జాపుకున్న మార్టీ కాలు జారిపోతుంది. గాలి విసురుకోవడం ఆపేస్తాడు మార్టీ. కర్చీఫ్ తో రివాల్వర్ పట్టుకున్న అతడి చెయ్యి క్లోజ్ షాట్ లో  కిందికి  వస్తుంది. రివాల్వర్ని  కింద పెట్టి కాలితో తన్నేస్తాడు. డబ్బూ కవరూ తీసి జేబులో పెట్టుకుంటాడు. విస్సర్ కేసి చూసి-  ఇప్పుడెవరు స్టుపిడ్-  అనేసి వెళ్ళిపోతాడు. టేబుల్ మీద టిల్ట్ డౌన్ చేస్తూంటే, నాల్గు చేపలు, మార్టీ శవం, చేపల ముందు లైటర్...

          టాప్ యాంగిల్ తీసుకుంటే,  మార్టీ కుర్చీలో పడున్న స్థితి, పైన నెమ్మదిగా తిరుగుతూ ఫ్యాను రెక్కలు. అవతల డోర్ వేసేసినట్టు పెద్ద చప్పుడు.

***
      ఈ సీనులో చాలా సంకేతాలూ నిగూఢార్ధాలూ ప్లానింగూ వున్నాయి. ఇవన్నీ  స్క్రిప్టులో రాయలేదు. చిత్రీకరణలో వున్నాయి. కావాలని సృష్టించినట్టు వుండవు. అంతర్వాహినిగా సీన్లో కలిసిపోయి వుంటాయి. ముందుగా  అంధకారంలో మూసివున్న భవనాల దృశ్యం వుంటుంది. నడి రోడ్డు మీద దున్నపోతు విగ్రహం వుంటుంది. దాని పక్కన ఆకుపచ్చ సీరియల్ బల్బులు వెలుగుతూంటాయి...చూస్తూంటే ఈ  దృశ్యం సైకలాజికల్ గా మనకి ఇబ్బంది పెట్టేలా వుంటుంది. చీకట్లో నిర్మానుష్యంగా వున్న కూడలి, మూసి వున్న వ్యాపార కేంద్రాలు, దున్నపోతు విగ్రహం. దానికి వెలుగుతూ ఆకుపచ్చ బల్బులు. చాలా మిస్టీరియస్ వాతావరణం. 

          ‘బ్యాక్ టు ది ఫ్యూచర్’ లో  కాల యంత్రంగా తయారుచేసిన  కారుకి డిజైన్ చేసిన పుర్రెలు, లింగం, అగ్ని వంటి సింబాలిజమ్స్ ని జేమ్స్ బానెట్ తన పుస్తకంలో శివుడి గుర్తులుగా విశ్లేషించి,  వాటి అర్ధం చెబుతాడు. అలాగే హిందూ పురాణాల్లోని  సింబాలిజంని  వాడుకున్నారు కోయెన్ బ్రదర్స్. ఈ దున్నపోతు విగ్రహం యముడి వాహనం. దీనికి ఆకు  పచ్చ లైట్లువెలుగుతున్నాయంటే యముడి నుంచి ఆహ్వానం వస్తున్నట్టే. ఎవరికి? మార్టీకే! అన్ని ఆకుపచ్చ లైట్లెందుకు- మార్టీని సూచిస్తూ ఒక్కటుంటే చాలదా? యముడు మార్టీ ఒక్కడికే కాదు, మరెందరికో టోకున ఆహ్వానాలు పంపుతూ నిత్యం బిజీగా వుంటాడు, అందుకని అన్ని లైట్లు. ‘బ్యాక్ టు ది ఫ్యూచర్’ లో  కాల యంత్రం కారుకి చాలా పుర్రెలుంటాయి. అన్ని పుర్రెలు అన్ని పునర్జన్మలకి గుర్తులని బానెట్ రాశాడు. 

          ఇక విస్సర్ మూసి వున్న బార్లోకి వచ్చి టేబుల్ మీద రెండు చేపల్ని పడేస్తాడు. ఈ చేపలు చనిపోయిన ఎబ్బీ, రేలే. మార్టీ పక్కన కూడా ఇంకో రెండు చేపలుంటాయి. ఇవి తను ఫిషింగ్ టూర్ కెళ్ళి నట్టు సాక్ష్యానికి. కానీ మొత్తంగా ఈ నాల్గు చచ్చిన చేపల్ని చూస్తే ఎబ్బీ, రే, మార్టీ, విస్సర్-  నల్గురి కుళ్ళిన మానసిక స్థితిగతులకీ  నిదర్శనాలని గుర్తు చేస్తూంటాయి.

          విస్సర్ సిగరెట్ వెల్గించుకుని, లైటర్ ని టేబుల్ మీద పెట్టడం క్లోజ్ షాట్ లో రిజిస్టర్ చేస్తారు. లైటర్ తో, సిగరెట్ కేస్ తో మొదట్నుంచీ చూపిస్తున్న విస్సర్ సైకలాజికల్ ట్రాక్ ఇక పక్వానికి వచ్చిందని తెలుస్తూంటుంది. 

         అతను పెన్సిల్ పట్టుకుని చేపల్ని మార్టీ వైపు తోయడంలోని బాడీ లాంగ్వేజ్ ని మార్టీ పసిగట్ట లేదు. పసిగట్టి వుంటే విస్సర్ ప్లాన్ మార్చుకున్నాడని అర్ధమయ్యేది. పెన్సిల్ అనేది ప్లాన్ మార్చుకోవడానికి డ్రీమ్స్ లో సింబాలిజం. ఆ చేపల్ని పెన్సిలుతో అలా తోస్తున్నాడంటే- నీ ప్లాను నాకక్కర్లేదు, వేరే ప్లానేసుకున్నా- అని చెప్పడమన్నమాట.



       ఫోటో చూశాక మార్టీ రియాక్షన్- అనీజీగా ఫీలవడం పొంచివున్న మృత్యువు రేపుతున్న అలజడి కావచ్చు. అతను  బాత్రూంలోకి ఫోటో వున్న కవరు పట్టుకుని వెళ్తాడు. టేబుల్ మీదే పెట్టవచ్చుగా? ఆ ఫోటో తన కవసరం. రేపు విస్సర్ అడ్డం తిరక్కుండా ఆయుధంగా ఉపయోగప
డుతుంది కాబట్టి దాన్ని కొట్టేసే ఆలోచనతో వున్నాడు. బాత్రూం లోకి వెళ్ళినప్పుడు పూర్తిగా వెయ్యని తలుపు సందు లోంచి తెల్లని లైటు కాంతి ప్రసరిస్తూంటుందని స్క్రిప్టులో రాశారు. మొదట దున్నపోతు, తర్వాత ఒంట్లో అనీజీ, ఇప్పుడు తెల్లని కాంతి- మూడూ మృత్యుసంకేతాలే. దైవసన్నిధికి చేరుకుంటున్నందుకు ఆ ధవళ కాంతి. బాత్రూంకి డ్రీమ్ మీనింగ్ బాధల నుంచి విముక్తి పొందే ప్రపంచం. దైవలోకం. వొంట్లో ముంచుకొస్తున్న మృత్యువుతో దైవలోకం లాంటి బాత్రూం లోకి ప్రవేశించాడు, అక్కడ ధవళ కాంతి ప్రసరించింది. నిజజీవితంలో మన చుట్టూ మనకి వర్తించే ఇలాటి చర్యలెన్నో జరిగిపోతూనే వుంటాయి. గ్రహించలేనంత బిజీగా వుంటాం. మనకి తెలీయకుండా  కర్మ ఫలాలు ట్రాప్ చేస్తూనే వుంటాయి. దీన్ని సింక్రో డెస్టినీ అన్నాడు డాక్టర్ దీపక్ చోప్రా. 

          ఎందుకిదంతా అంటే,  సినిమా కథకుడికి స్పిరిచ్యువాలిటీతో కూడా పరిచయం వుండాలి. అప్పుడు కథలు ఆత్మిక దాహం తీరుస్తూ హత్తుకుంటాయి. ‘రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్’ గానీ, ‘మాట్రిక్స్’ గానీ, ఇంకా మరెన్నో హాలీవుడ్స్ ఇలాటివే. ‘బ్లడ్ సింపుల్’ కూడా ఇలాగే కన్పిస్తోంది.

          ఇప్పుడు బాత్రూం పక్కన విస్సర్- Employees must wash hands- అని నోటీసు చూసి,  ఇక నీకూ నాకూ చెల్లురా బాబూ అన్న అర్ధంలో సిగరెట్ పీకని నలిపేసి చేతులు దులుపుకుంటాడు. ఇప్పుడొక విశేషం గమనించాలి. అతను సిగరెట్ పీక నలిపేసేది దున్నపోతు మినియేచర్ బాటమ్  మీదే. ఆఖరికి దున్నపోతు మార్టీ టేబుల్ మీదే వుందన్నమాట. సీక్వెన్స్ చూద్దాం- మొదట బయట దున్నపోతు విగ్రహం, తర్వాత మార్టీ ఒంట్లో ఇబ్బంది, బాత్రూంలో దైవలోకం, అక్కడ ధవళ కాంతి, ఇప్పుడు యమలోక ప్రయాణానికి టేబుల్ మీద దున్నపోతు మినియేచర్ సిద్ధం! దాని బాటమ్  మీద విస్సర్ సిగరెట్ నలిపేశాడంటే, ఆ నుసిలాగా మసైపోయి వెళ్ళిపోతాడన్న మాట మార్టీ! 


          కళా దర్శకత్వమంటే ఇది కాదా? ఇలాకాకుండా కథ, పాత్రలు ప్రతిఫలించకుండా,  తోచిన వస్తువులతో అట్టహాసంగా అలంకరణలు చేస్తే సరిపోతుందా? ఇక్కడ కోయెన్ బ్రదర్స్ ఈ వస్తువుల్ని,  ఫీలింగ్స్ నీ ఎక్కడెక్కడ, ఎప్పుడెప్పుడు రివీల్ చేయాలో వరసక్రమంలో అప్పుడే చేస్తూ రావడం గమనించాలి. విస్సర్ వచ్చి టేబుల్ మీద చేపలు పడెయ్యగానే టేబుల్ మీదే వున్న దున్నపోతు మినియేచర్నీ రివీల్ చేయలేదు. ఇంకే షాట్ లోనూ దాన్ని చూపించలేదు. ఎప్పుడు దేంతో కలిపి చూపిస్తే ఎఫెక్టివ్ గా వుంటుందో, ఉలిక్కిపడతామో ఆ టైమింగ్ ని దృష్టిలో పెట్టుకుని అప్పుడే రివీల్ చేశారు. సీక్వెన్స్ లో మార్టీకి ది ఎండ్ అన్నప్పుడే దాన్ని రివీల్ చేశారు. దీన్ని సిగరెట్ నుసితో కలిపి చూపించడంతో ఇంకింత తీవ్రత పెంచుకుంది. సిగరెట్ నలిపెయ్యడానికి దారి తీసిన పరిస్థితి బాత్రూం పక్క నోటీసు. దీనికీ మీనింగుంది, సిగరెట్ నలిపెయ్యడానికీ మీనింగుంది, నుసికీ మీనింగుంది, మినియే చర్ కి మహా మీనింగుంది...

          ఇక-  నన్ను హైర్  చేసుకున్నట్టు ఎవరికీ చెప్పలేదు కదా - అని విస్సర్ అడగడంలో అంతరార్ధం, తను మార్టీని చంపబోతున్నాడు గనుక,  సాక్షుల గురించి ఆరా తీయడమే. మార్టీ సేఫ్ దగ్గర కూర్చున్నప్పుడు హై యాంగిల్లో మార్టీ వెనకాల టాప్ లో,  రెడ్ కలర్ లైటు కాంతి పర్చుకుని వుంటుంది. దాంట్లో  నల్లటి గడుల్లాగా నీడలువుంటాయి. ఆ రెడ్ కలర్ రక్తపాతంతో చావు వుంటుందని చెప్పడం, నల్లటి గడులు అతడి పరలోక ప్రయాణం అంత సాఫీగా వుండదనీ, ఎగుడుదిగుడుగా, లేదా ఎత్తుపల్లాలుగా  కష్టాలతో కూడుకుని వుం టుందనీ  సూచించడం. దీనికి మ్యాచింగ్ సింబాలిజాన్ని  ముందు ముందు వచ్చే  సీను లో ఫిజికల్ గా – యాక్షన్ లో చూపించుకొస్తారు. 

        మార్టీ సేఫ్ లో ఫోటో జారవిడిచిన విషయం విస్సర్ కి తెలీదు. దీనికి ఇంకెవరైనా సాక్షులున్నారా అనే అర్ధంలో అడిగాడు గానీ, మార్టీయే ఫ్రెష్ గా సేఫ్ లో సాక్ష్యం ఏర్పాటు చేశాడని తెలుసుకోలేదు. ఇక రివాల్వర్ తీసి షూట్ చేయడంతో కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. ఈ బుల్లెట్ ఎక్కడిది? తను కొట్టేసిన ఎబ్బీ రివాల్వర్ లో మూడు బుల్లెట్స్  వున్నాయి. ఫోటోలో హత్యా దృశ్యం ప్రకారం ఆ మూడు బుల్లెట్లూ అక్కడే పేల్చాడు. మరి ఈ బుల్లెట్ ఎక్కడిది?

          అసలు మార్టీని ఎందుకు చంపాడు? ఎబ్బీ, రే, మార్టీ- ముగ్గుర్నీ చంపి ఏం చేస్తాడు? ఉన్న నాల్గు పాత్రల్లో మూడూ పోయాక ఇప్పుడేమిటి? కొత్త పాత్రలొస్తాయా? అసలేమిటి విస్సర్ మార్చుకున్న ప్లాను?

(సశేషం)
-సికిందర్