రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

28, డిసెంబర్ 2017, గురువారం

576 : రివ్యూ!



రచన -  ర్శత్వం: విఐ.ఆనంద్
తారాగణం: అల్లు శిరీష్, సురభి, అవరాల శ్రీనివాస్, శీరత్ పూర్, దాసరి అరుణ్ కుమార్,  జయప్రకాష్, కాశీ విశ్వనాథ్, రోహిణి, ప్రవీణ్, త్య దితరులు
సంగీతం: ణిశర్మ, ఛాయాగ్రణం: శ్యాం కె.నాయుడు, మాటలు: అబ్బూరి వి
బ్యానర్ : ల
క్ష్మీ సింహా ఎంటర్టైన్మెంట్స్
నిర్మాత
‌: క్రి చిగురుపాటి
విడుదల : డిసెంబర్ 28, 2017
***

        అల్లు శిరీష్  నిదానంగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రయాణం సాగిస్తున్నాడు. ఈసారి వైవిధ్యమున్న సినిమా చేయాలనే ఉద్దేశంతో రోమాంటిక్ థ్రిల్లర్ కి సిద్ధమయ్యాడు. కొత్త ఆలోచనతో వచ్చిన దర్శకుడు విఐ ఆనంద్ కి అవకాశమిస్తూ రోమాంటిక్ థ్రిల్లర్స్ కొక కొత్త రూపు నివ్వాలని సంకల్పించాడు. ఇందుకు ఒక కొత్త కాన్సెప్ట్ ని ప్రయత్నించాడు. కమర్షియల్ గా కొత్త ప్రయోగాలూ చేయాల్సిందే. అయితే ప్రస్తుత ప్రయోగం ఏ మేరకు ఔరా అన్పించుకుంది? హౌరా ఎక్స్ ప్రెస్ లా దూసుకెళ్ళిందా? వైరల్ అయిందా? ఓసారి చూద్దాం...

కథ 
      తొలిచూపులోనే జ్యోత్స్న (సురభి) ని ప్రేమిస్తాడు జీవా (అల్లు శిరీష్). ఆమె కూడా ప్రేమిస్తుంది. జీవాకి ఫోకస్ ఎక్కువ. అనుకున్నది  సాధించే వరకూ నిద్రపోడు. ఆమెకి మనుషుల్ని పరిశీలించే ఆసక్తి ఎక్కువ. ఎదుటి ప్లాట్ లో వుంటున్న శీను (అవసరాల శ్రీనివాస్), స్వాతి (సీరత్ కపూర్) లు ఘర్షణ పడుతూండడాన్ని ఆమె గమనించి జీవాకి చూపిస్తుంది. శీను బారి నుంచి స్వాతిని కాపాడమని కోరుతుంది. జీవా  శీనుని కలుసుకుంటే,  అతను స్వాతితో తన ప్రేమ కథ చెప్తాడు. అది అచ్చం జ్యోత్స్నతో తన ప్రేమలాగే వుందన్పిస్తుంది జీవాకి. అంతేగాక,  శీనుకి జరిగే సంఘటనలే తర్వాత తనకీ  జరుగుతున్నాయని గ్రహిస్తాడు. ఒక రోజు శీను స్వాతిని  చంపేస్తాడు. ఆందోళనతో జీవా, జ్యోత్స్నాలు మహ్మద్ అస్తేకర్ (జయప్రకాష్) అనే ప్రొఫెసర్ ని కలుసుకుంటే, అతను ఇది విధి అనీ, దీనికి పారలల్ లైఫ్ థియరీ వుందనీ చెప్పుకొస్తాడు. ఇప్పుడు చూస్తే దీని ప్రకారం శీను స్వాతిని చంపినట్టే తను జ్యోత్స్నని చంపేస్తాడా?  ఇప్పుడేం చేయాలి? ఇది విధియే  అయితే దీన్నెలా ఎదుర్కొని జ్యోత్స్నని కాపాడుకోవలన్నది మిగతా కథ. 

ఎలావుంది కథ 
      పారలల్ లైవ్స్  - సమాంతర జీవితాల థియరీ మనుషులకే గాక విశ్వానికీ  వుంది. మనుషుల విషయాని కొస్తే వందేళ్ళ తేడాతో అమెరికా అధ్యక్షులు అబ్రహాం లింకన్, జాన్ ఎఫ్ కెనెడీలకి ఒకేలా జరిగిన సంఘటనలు నమ్మలేని నిజాలుగా వున్నాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ కాన్సెప్ట్ తో  2010 లో ‘పారలల్ లైఫ్’ అనే కొరియన్ థ్రిల్లర్ వచ్చింది. ఇందులో ఒక జడ్జి కుటుంబం ఇవ్వాళ హత్యకి గురయినట్టే,  ముప్ఫై ఏళ్ల  క్రితం అప్పటి ఒక జడ్జి కుటుంబం హత్యకి గురయి వుంటుంది. ఇద్దరి హంతకులు ఆ జడ్జీలు శిక్ష విధించిన నేరస్థులే.  అయితే ఇప్పటి జడ్జి కుటుంబంలో కూతురు హత్యకి గురి కాకుండా మిగులుతుంది. పారలల్ లైఫ్ థియరీ ప్రకారం ఈమెని కూడా హంతకుడు  జైల్లోంచి తప్పించుకొచ్చి  చంపేస్తాడా అన్నది కథ. దీనికి లింకన్ – కెనెడీల జీవితాలే స్ఫూర్తి అని సినిమాలో స్పష్టం చేస్తారు. 

          ‘ఒక్క క్షణం’ కథకి  కూడా లింకన్ – కెనెడీల జీవితాలనే  స్పూర్తిగా చూపిస్తారు. ఐతే లింకన్ – కెనెడీల జీవితాలూ, దీని స్ఫూర్తితో కొరియన్ కథా సమాంతర జీవితాలే గానీ అవి ఒకే కాలంలో జరగవు. దీనికి భిన్నంగా ‘ఒక్క క్షణం’ లో రెండు కథలూ ఏకకాలంలో సమాంతరంగా జరుగుతాయి. పైగా ఇది ప్రేమ కథ. దీన్ని ప్రేమ వర్సెస్ విధి అన్నారు. కానీ కథా నిర్వహణలో పారలల్ లైఫ్ కాన్సెప్ట్ ని  విధివిలాసపు కథనంగా చూపడంలో విఫలమై,  రొటీన్ మర్డర్ మిస్టరీగా నడిపారు. ఎంచుకున్న కాన్సెప్ట్ లో ఏ కథని నడపాలో ఆ కథని గుర్తించి దాన్ని నడపలేకపోయారు. హీరో ఫోకస్ వున్న తెలివైన కుర్రాడన్నారు గానీ కథని కూడా ఫోకస్ లో వుంచాలని అనుకోలేదు కథకుడు. ఇంకొకటేమిటంటే, ఈ రోమాంటిక్ థ్రిల్లర్ జానర్ని రోమాంటిక్ డ్రామాగా  చేసేశారు. దీంతో రోమాన్స్ వర్సెస్ విధి అనే థ్రిల్లర్ జానర్ కథకి హుషారు కూడా లేకుండా పోయింది. గతవారం రోమాన్స్ వర్సెస్ విధి కథ ‘హలో’ హుషారైనది. థ్రిల్లర్స్ అంటే అద్భుతరస కథలు. ఇవి ఏడ్పిస్తూ వుండవు. అడ్వెంచర్స్ చేస్తూ వుంటాయి. కథలో విషాదమున్న అద్భుతరస  కథలకి ‘ముత్యాలముగ్గు’  ఎప్పుడూ మార్గదర్శిగా  వుం టుందని ఎన్నోసార్లు చెప్పుకున్నాం.  ఇందులో సంగీతది విషాద కథే. కానీ ఈ విషాద కథకి - ఆమె సమస్య తీర్చడానికి - ఆమె పిల్లలు పాల్పడేది హుషారైన - నవ్వించే – అడ్వెంచరస – అద్భుతరస కథనం!  ఇది అంత హిట్టవడానికి ఇదీ యూనిక్ సెల్లింగ్ పాయింట్- ఇది ‘ఒక్క క్షణం’ లో పూర్తిగా లోపించింది. ఏం  చెబుతున్నారో అర్ధంగాకుండా పోయింది. 

ఎవరెలా చేశారు 
       శిరీష్ తన స్థాయి మేరకు నటించాడు. ఇంకా ఇది తనకి శిక్షణా కాలమే. ఇంకెన్ని సినిమాలు  నటిస్తే శిక్షణ పూర్తవుతుందో తెలీదు. శిక్షణ కోసమన్నట్టు నటించిన ఈ థ్రిల్లర్ లో, మిగతా  భావోద్వేగాల ప్రకటన అతడి ముఖంలో ఎలా వున్నా, భావోద్రేకాలకి లోనైనప్పుడు ముఖంలో ఆ మేరకు టచప్స్ ఇవ్వాల్సింది. ఆ సమయంలో కూడా తేటగా గ్లామరస్ గా వుంటే నటిస్తున్నట్టే లేదు. చుక్క చెమట కూడా పట్టని భావోద్రేకాలు తేలిపోతాయి.  ఇక ప్రేమ సన్నివేశాలూ, కామెడీ ఇవి మామూలే. వీటితో నటుడన్పించుకోవడం సాధ్యపడదు. యాక్షన్ దృశ్యాల్లో, పాటల్లో మాత్రం అభివృద్ధి కనబర్చాడు. ఐతే ఒక కథానాయకుడుగా పాత్రని అడ్వెంచరస్ గా మారకుండా అడ్డుపడింది దారితప్పిన కథనమే. కాన్సెప్ట్ ప్రకారం తను రోమాంటిక్ థ్రిల్లర్ కథా నాయకుడై వుంటే చాలావరకూ తన లోపాలు కవరై వుండేవి. 

          ఇక హీరోయిన్ సురభికి నటించే అవకాశం దక్కిన పాత్రే ఇది – దేనికీ ఈ నటన? రోమాంటిక్ థ్రిల్లర్ కథానాయికగా విధిని ఎదుర్కొనే ధీశాలిగా, హీరోతో పాటు హుషారుగా వుండాల్సిన తను కాస్తా,  హీరోకి భారమై, అతడి హుషారుని దెబ్బ తీసి, రోమాంటిక్ డ్రామాల విషాద నాయికై ఏడుస్తూ కూర్చునే నటన దేనికి పనికొచ్చింది - తను నటించగలనని నిరూపించుకుందేమో గానీ,  ఈ పాత్ర చిత్రణ కథనే దెబ్బ తీసింది. ముగింపులో ఎంతకీ ముగియని సాగతీత ఓల్డ్ విషాద మెలోడ్రామా థ్రిల్లర్ కి అవసరమా? 

          దాసరి అరుణ్ కుమార్ విలన్ గా అవతారమెత్తి మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఈ పాత్రలో తను ఎక్సెలెంట్. విలన్ గానే స్థిరపడితే బెటర్. హీరో తల్లిదండ్రులుగా కాశీ విశ్వనాథ్ – రోహిణీల పాత్రల తీరు తెన్నులు థ్రిల్లర్ జానర్ మర్యాదకి అడ్డంకి. ఈ పాత్రలు లేకపోయినా వచ్చే నష్టం లేదు. 

        అవసరాల శ్రీనివాస్ ది సంక్షిప్త పాత్ర. ఒకసారి దోషిగా, ఇంకోసారి  నిర్దోషిగా కథనం ద్వారా అన్పిస్తూ ఆసక్తి రేపుతాడు. సీరత్ కపూర్ ది విషాద పాత్ర. జరిగిన ఒక ఘోరానికి తనే బాధ్యురాలని కుమిలిపోతూ జీవితాన్ని దుర్భరం చేసుకునే పాత్రలో బాగా నటించింది గానీ, ఈ పాత్రని అంతలా పొడిగిస్తూ దేన్ని దెబ్బతీస్తున్నాడో తెలుసుకోలేదు  కథకుడు. ఇది ఈ పాత్ర కథ కాదు. ఈ పాత్రకి అసలేం  జరిగిందన్నదీ కథకి అవసరమే  లేదు. కథని గుర్తించకపోతే ఇంతే. కేవలం సీరత్ – అవసరాల పాత్రల వల్ల హీరో హీరోయిన్లకి ఏం జరుగుతుందన్నదే గుర్తించాల్సిన కథ! నడపాల్సిన కథ! అంతే గానీ,  సీరన్ పాత్ర ఎలా చనిపోయిందని ఆ మిస్టరీ అంతా  విప్పుతూ,  సెకండాఫ్ అంతా గడిపే కథ కానేకాదు!!

          పోతే సహాయ పాత్రలుగా ఎక్కడ పడితే అక్కడ కమెడియన్లు కనిపించడం జానర్ మర్యాదని దెబ్బతీసింది. కనీసం అరడజను మంది కమెడియన్లు వచ్చిపోతూంటారు. కథనాన్ని రసాభాస చేస్తూంటారు. ఈ కొత్త కాన్సెప్ట్ లో మూస ఫార్ములా చూస్తున్నట్టు చేస్తారు. 

          పాటల గురించి చెప్పుకోవడం అంతగా అవసరం లేదు. రెండు వారాలు జీవిత కాలం వుండే సినిమాలకి పది కాలాలు నిల్వవుండే పాటలు వుండవు, రావు, అవసరం లేదు కూడా. కాబట్టి చెప్పుకోవాల్సింది కేవలం సన్నివేశాలకి నేపధ్య సంగీతాల గురించే ఇప్పుడు. ఈ విషయంలో మణిశర్మ మరోసారి ప్రతిభ చూపెట్టారు కథ ఎలా మారిపోయినా, ఏం కథ నడుస్తున్నా. శ్యాం కె నాయుడు కెమెరా వర్క్ ఎప్పటిలా పర్ఫెక్ట్. అబ్బూరి రవి మారుతూపోయే కథకి మారిపోయే మాటలే తను మారిపోతూ రాశారు. 

చివరికేమిటి 
        పారలల్ లైఫ్ థియరీ ప్రకారం వుండాల్సిన కథ, దానికి తగ్గ స్క్రీన్ ప్లే లేవు. పారలల్ లైఫ్ థియరీలో ముగిసిపోయిన ఒకరి జీవితంలాగే ఇంకొకరి జీవితం నడుస్తుంది. కాబట్టి రెండిటి కాలాలు వేర్వేరుగా వుంటాయి. ఒకవేళ ఒకే కాలంలో జరుగుతున్నట్టు చిత్రించాలన్నా, ఇద్దరి జీవితాల్లో ఒకే విలన్ వుండకూడదు. అప్పుడది పారలల్ లైఫ్ థియరీ అవదు. 

          రెండోది, ఒకరి జీవితాన్ని ముగించి ఆ జీవితంలాగే ఇంకొకరి జీవితం నడపడం పారలల్ లైఫ్  కథ కొనసాగడానికి అవకాశాన్నిస్తుంది. అంతేగానీ, ముందు ముగిసిన జీవితం ఎలా ముగిసిందని తవ్వడం చేస్తే పారలల్ లైఫ్ కథ అవదు. మర్డర్ మిస్టరీ కథగా మారిపోతుంది. 

          సీరత్ పాత్ర చనిపోయింది, అవసరాల పాత్ర చంపిందని జైలుకి పోయింది. అంటే పారలల్ లైఫ్ ని చూపిస్తూ ఆ పాత్రల కథ ముగిసింది. కేవలం పారలల్ లైఫ్ ని చూపించడానికే ఆ పాత్రలుండాలి. అసలేం జరిగింది, అవసరాల పాత్రే చంపిందా అంటూ ఇన్వెస్టిగేషన్ చేస్తే – ఇప్పుడు పారలల్ లైఫ్ ట్రాక్ లో వున్న శిరీష్ – సురభి పాత్రల కథ చెప్పడానికి వుండదు. ఇదే జరిగింది. కథని గుర్తించకపోవడం. సీరత్ – అవసరాల పాత్రల బ్యాక్ డ్రాప్ లో శిరీష్ – సురభి పాత్రల పారలల్ లైఫ్ ప్రమాదభరిత  అసలు కథని చెప్పే అవకాశాన్ని కోల్పోవడం. బ్యాక్ డ్రాప్ పాత్రయిన  అయిన సీరత్ పాత్రనే మళ్ళీ లాక్కొచ్చి ప్రధాన కథ చెయ్యడం!  చెప్పాల్సిన కథని గుర్తించలేక - కథని గుర్తించలేక - కథని గుర్తించలేకా  – పూర్తిగా చేతులెత్తేయడం!!

          ఈ మర్డర్ మిస్టరీలో పాతమూస ఆస్పత్రి మెడికల్ మాఫియా – ఘోరఖ్ పూర్ ఆస్పత్రి పిల్లల ఉదంతపు ఉటంకింపు, ఆ తాలూకు కుట్రని ఛేదించి ఆస్పత్రి బాగోతాన్ని బట్టబయలు చేయడం...సీరత్ పాత్ర ఎందుకు చనిపోయిందో ఇలా వెల్లడించడం, ఈమెలాగే ఇక సురభి పాత్రెలా చనిపోతుందో చూడండని- తెలుగు సినిమా ఫార్ములా ప్రకారం - క్లయిమాక్స్ లో విలన్ ఆమెని  అపహరించడం – ఏమిటీ కథ!

          ఫస్టాఫ్ దాదాపు ఇంటర్వల్ వరకూ  నిజంగా బోరు. హీరోహీరోయిన్ల ప్రేమకథ చాలాపాత మూస. జానర్ మర్యాదలో వుండదు. ప్రొఫెసర్ని కలిశాక  ఇంటర్వెల్లో వచ్చే మలుపు చాలా బలమైన మలుపు. ఇక పారలల్ లైఫ్ లో హీరోకూడా  హీరోయిన్ని చంపే స్తాడా అన్న ప్రశ్నకి,  నిజంగా ప్రేక్షకులు సీట్లలోంచి  లేవలేకపోయారు విశ్రాంతికి.

          ఆ తర్వాత సెకండాఫ్ లో మొదటి ఇరవై నిమిషాలే ఆ ప్రశ్న ప్రకారం కథ నడుస్తుంది. ఎప్పుడైతే సీరత్ పాత్రలాగే సురభి పాత్ర ఆత్మహత్యాయత్నం చేస్తుందో – ఇక ఆ పైన కథే మారిపోతుంది.  పూర్తిగా సురభిపాత్ర మర్డర్ మిస్టరీ అయి  -  ఇక హీరోహీరోయిన్ల పారలల్ లైఫూ, దానితాలూకు మనం ఆసక్తితో ఎదురుచూసే విధితో చెలగాటాలూ వుండవ్! పైగా  మర్డర్ మిస్టరీలో ఎన్నో చిక్కుముళ్ళు, మలుపులూ. టోటల్ గా ఇది సెకండాఫ్ సిండ్రోమ్  పాలబడ్డ మరో స్క్రీన్ ప్లే.  


సికిందర్









         






575 : రైటర్స్ కార్నర్




(నాలుగో మెట్టు)
          రాస్తున్నప్పుడే తిరగ రాస్తూ వుండడం అలవాటు చేసుకోవాలి. ఏక బిగిన మొత్తం కథంతా రాసుకుపోవాలనుకోవడం నాన్సెన్స్. ఆ ఉచ్చులో పడకుండా జాగ్రత్తపడండి. ఫ్లాష్ రైటింగ్ అనేదాన్ని మర్చిపోండి. ఫ్లాష్ రైటింగ్ తో  ఫస్ట్ డ్రాఫ్ట్ రాసుకుంటూ పోవడం చేస్తే  ఓ పెద్ద గొయ్యి తవ్వుకుని అందులో పడ్డట్టే. మళ్ళీ అందులోంచి బయటికి రాలేరు. నిజంగా మీరొక ప్రొఫెషనల్ లాగా రాయడం నేర్చుకోవాలనుకుంటే ఈ పని చేయకండి. ఫ్లాష్ రైటింగ్ మీకే మాత్రం మేలు చేయదని గ్రహించండి. 

         
మన్వయం చేసుకుంటూ రాసుకుపోవడం చాలా మేలు చేస్తుంది. రాస్తూనే  తిరగ రాస్తూ పోవడమనే వ్యూహం తర్వాత వారాల తరబడి చేయాల్సిన పనిని తగ్గిస్తుంది. అంతే కాదు,  కేవలం మూడు డ్రాఫ్టులే రాసి ముగించవచ్చు. ఏకబిగిన మొత్తం ఒకేసారి రాసుకుంటూ పోతే తర్వాత వంద సార్లు దాన్ని తిరగ రాయాల్సి వుంటుంది. ఈ తేడా గమనించాలి. రాస్తూనే  తిరగ రాస్తూపోవడం వల్ల  కేవలం ఫస్ట్ డ్రాఫ్ట్,  రీరైట్ డ్రాఫ్ట్,  పాలిష్ డ్రాఫ్ట్ - ఈ మూడింటితో పనైపోతుంది. రాస్తూ తిరగరాయడం వల్ల  చాలా టైము కూడా ఆదా అవుతుంది. ఎలాగో ఈ కింద చూద్దాం -

          మొదటి రోజు – పది పేజీలు  రాస్తారు.
          రెండో రోజు – ఆ పది పేజీలు చదువుకుంటారు. మార్పుచేర్పులు చేసుకుంటారు. ఇంకో పది  పేజీలు  రాస్తారు.
          మూడో రోజు –  ఆ ఇరవై పేజీలూ చదువుకుంటారు. మార్పుచేర్పులు చేసుకుని ఇంకో పది  పేజీలు  రాస్తారు.

          ఇలా పూర్తయ్యే వరకూ చేసుకుపోతారు. ఇలా చేయడం వల్ల  కలిగే ప్రయోజనాలేమిటంటే, ప్రతీ రోజూ వెనకటి కథ పునశ్చరణ అవుతుంది. కథాక్రమం, పాత్ర చిత్రణలు, ప్లాట్ పాయింట్లు మీ మైండ్ లో ఎప్పుడూ లైవ్ గా వుంటాయి. అలాగే లోటుపాట్లు తగ్గడం గమనిస్తారు. అంతేకాదు లోపాలు, తప్పులు, పొరపాట్లూ తగ్గిపోవడం గమనిస్తారు. రాయడానికి కూర్చున్న ప్రతీసారీ అంతవరకూ రాసిన కథని అనుభవంలోకి తెచ్చుకుంటూ వుంటారు. కథని ప్రతీరోజూ అనువభవిస్తూంటారు. మీరెప్పుడో రాసిన మొదటి సీను నుంచి తెగిపోరు. ప్రతీరోజూ అంతకి ముందు రోజుల్లో రాసిన సీన్లన్నీ వరస క్రమంలో రీలులా తిరుగుతూంటాయి కళ్ళ ముందు. చాలా అద్భుతంగా వుంటుంది ఈ పని విధానం. ప్రయత్నిస్తే మీకే తెలుస్తుంది. ప్రొడక్టివిటీ కూడా పదిరెట్లు పెరుగుతుంది.

 
కెన్  మియమోటో  
(రేపు చివరి ఐదో మెట్టు)






27, డిసెంబర్ 2017, బుధవారం

574 : సందేహాలు - సమాధానాలు



        Q :    ఎప్పటి నుంచో నన్నొక ప్రశ్న వేధిస్తోంది. రైటింగ్ ఈజ్ రీ రీరైటింగ్ అని, ఫస్ట్ డ్రాఫ్ట్ ఈజ్ షిట్ అని,  నేను కొన్నిచోట్ల చదివాను. బ్లాగులో కూడా మీరు ఇదే విషయాన్ని చాలాసార్లు ప్రస్తావించారు. నా అనుమానం ఏంటంటే, కథ ( సినిమాలోని ముఖ్యమైన పోర్షన్ అంతా) మొత్తం భావతరంగంలా ఒకేసారి పుట్టడం జరగదా?  మనం అనుమానంతో దాన్ని మళ్లీ మళ్లీ రాస్తూనే వుండాలా? ఇళయ రాజా గారు చాలా హిట్ ఆల్బమ్ లన్నీ ఒక రోజులోనే ట్యూన్ చేశారు. వేటూరి గారు శంకరాభరణం సహా చాలా హిట్ పాటలు అలవోకగా డిక్టేట్ చేసినవే. బాపూగారి బొమ్మలు కొన్ని అలాంటివే. పరచూరి గోపాలకృష్ణ కూడా అసెంబ్లీ రౌడీ సహా చాలా సినిమాలు ఒకరోజులో రాశానని స్వయంగా చెప్పారు. పూరీ వన్ వీక్ వర్కింగ్ స్టైల్ మీరు వినే వుంటారు. సంగీతంలా, కవిత్వంలా,  సినిమా రచన కూడా కళే కదా? మరి అలవోకగా పుట్టడం అనే దాన్నుంచి సినిమాకు ఏవిధంగా మినహాయింపు? ఫస్ట్ డ్రాఫ్ట్ పనికిరాదని ఎలా సూత్రీకరిస్తారు? ఒక ఎమోషన్లో సింగిల్ సిట్టింగ్ లో కథ పూర్తయితే అది అసమగ్రమా? గ్రామర్ అనుకుంటే సంగీతానికి, కవిత్వానికి కూడా గ్రామర్ వుంది కదా?
- అశోక్
, దర్శకత్వ శాఖ

        A :   రోడ్డు మీద ఒకేసారి ఒక బొమ్మ వేయవచ్చు, ఒక రాయిని  తీసుకుని ఒకేసారి శిల్పాన్ని చెక్కగలరా? ఒక్కో కళకి ఒక్కో సౌలభ్యం వుంటుంది. సంగీతానికుండే సౌలభ్యం సినిమా స్క్రిప్టు కుండదు. ఉంటే బీఎన్ రెడ్డిలు, నాగిరెడ్డి – చక్రపాణీలు ఆనాడే ఆ సులువు చెప్పిపోయేవాళ్ళు. ఆరునెలల పాటు కథల మీద కూర్చునే వారు కాదు. సినిమా కథ సంగ్రహంగా మెదడులో ఒక భావతరంగంలా పుట్ట వచ్చు. అది సమగ్ర కథ అవదు. అది సాఫ్ట్ వేర్. ఆ సాఫ్ట్ వేర్ కి రూపంకోసం, సమగ్రత కోసం దాన్ని పెంచుకుంటూ హార్డ్ వేర్ ని సృష్టించాల్సిందే. ఆలోచన వరకూ (సాఫ్ట్ వేర్ వరకూ) భావతరంగం సంగ్రహమే. దాన్నలాగే పట్టుకోగల్గి, సమగ్రంగా విస్తరించుకోగల్గితే, ఆ పూర్తి నిడివి కథ సాంతం ఆ భావతరంగం ప్రవహించే అవకాశముంది.  

          ఇంతా చేసి, స్క్రిప్టులో ఇంత సమగ్రంగా పొందుపర్చుకున్న భావతరంగాన్ని చిత్రీకరణలో పట్టుకుని కొనసాగగల్గాలి. చిత్రీకరించినప్పుడల్లా భావతరంగానికి అడ్డొచ్చే రీటేకుల బాధ వుంటుంది. తీరా నలభై రోజులు చిత్రీకరించుకుని చూసుకున్నాక, పేపర్ మీదున్న భావతరంగం ప్రొజెక్షన్ లో కూడా కనపడాలి. కాబట్టి మెదడులో ముందు పుట్టిన భావతరంగం వుంటుందే, అది ఒట్టి రాయి లాంటిది. అది తెరమీది కెక్కాలంటే  ఇంత చెక్కాలి. ఇప్పడు ముప్ఫై క్రాఫ్టులున్నాయా, ఈ 30 నీ సమన్వయం  చేసుకుంటూ చెక్కాలి. ఒక భావావేశానికి లోనై ఓ గంటలో రాసేస్తే అయిపోదు, ఆ 30 క్రాఫ్టుల తర్వాతే తేలేది భావతరంగాల సంగతి, భావావేశాల సంగతీ. కాబట్టి ఎందుకొచ్చిన బాధ! ఈ రోజుల్లో ‘హలో’ లోలాగా ఎవరిక్కావాలి భావతరంగాలు. ఫటాఫట్ తీశామా, ఛటాఛట్ చూశారా – ఇంతే సినిమాల సంగతులు. బయట ఇంకా మాధ్యమాలున్నాయి ప్రేక్షకులకి - చాలా సేపూ ఫేస్ బుక్ కూడా చూసుకోవాలి, టైం లేదు. 

          పరుచూరి గోపాల కృష్ణ గారు ఒక రోజులో రాశారంటే అవి 40 పేజీల సినాప్సిస్ లై వుండొచ్చు. షూటింగుకి సిద్ధం చేసిన పూర్తి స్థాయి స్క్రిప్టు లవకపోవచ్చు. అనుభవజ్ఞులు కాబట్టి రాయగలరు. పూరీ జగన్నాథ్ గారు సాఫ్ట్ వేర్ క్రియేట్ చేయరు. అదే కథనం, అవే సీన్లతో ఒక సాఫ్ట్ వేర్ టెంప్లెట్ గా, పర్మనెంట్ గా పక్కన వుంటుంది. దాంట్లోకి ఆర్టిస్టుల్ని మార్చి,  ఆ మేరకు డైలాగులు రాయడానికి వారం రోజులు చాలు. సారంలో తేలేది ఆయన కేవలం డైలాగులు రాశారనే, ఇది మర్చిపోకూడదు. పేరుంది కాబట్టి ఆయనేమైనా చేయగలరు. మీకు లేదు, మీరలా చేయలేరు. 

          మళ్ళీ భావతరంగాని కొద్దాం. భావతరంగమంటే  ఏమిటి, ఒక ఎమోషనేగా? ఆ  ఎమోషన్ వేటి మీద ఆధారపడితే ప్రభావం చూపుతుంది? పాసివ్ పాత్రలు, ఎండ్ సస్పెన్స్ కథనాలు, ఫ్లాష్ బ్యాకుల కథనాలు, మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లేలు, సెకండాఫ్ సిండ్రోములు, కథ కాకుండా గాథలు ...వగైరావగైరాల మీద ఆధారపడి భావతరంగాలు వెల్లివిరుస్తాయా? సరిగమలవుతాయా? ఇది ఆలోచించాలి.

          ఇక
సంగీతానికి, కవిత్వానికి, కథలకీ గ్రామర్ కాదుగానీ, స్ట్రక్చర్ అనాలి, లేదా నిర్మాణ మనాలి. బిందువులో వుండే నిర్మాణం సింధువు గా విస్తరించినప్పుడూ వుంటుంది. ఐతే ఆ బిందువే సోల్ లేదా ఆత్మ అవుతుంది. ఒక్కో కళకి ఒక్కో స్థాయిలో ఆత్మని విస్తరించడమే జరుగుతుంది. కళని బట్టి క్షణాలు పట్టే విస్తరణలు, కాలాలు పట్టే విస్తరణలు. అన్నిటినీ ఒకే గాటన కట్టలేం. 

          స్క్రీన్ ప్లే పండితుడు జేమ్స్ బానెట్ తన పుస్తకంలో  ‘ఆగా బాబా’  అనే జానపద కథప్రస్తావిస్తాడు. అందులో యంగ్ హీరో ఎక్కడికో పోతూ విశ్రాంతి కోసం మంత్రగత్తె దగ్గరాగుతాడు. అప్పుడా మంత్రగత్తె  కొన్ని ప్రశ్నలేస్తుంది - సత్యమంటే ఏమిటి, ఈ ప్రపంచం ఎప్పటికైనా అంతమవుతుందా అంటూ.  అప్పుడా యంగ్ హీరో ‘షటప్! ముందు తింటానికే మైనా పెట్టు!” అంటాడు. అంటే, వున్నాయో లేవో తెలియని అలౌకిక విషయాలకంటే,  వున్న లౌకిక జీవితాని కేం కావాలో చూసుకోవాలని నీతి.

          నేర్చుకునే దశలో కళాఖండాల సృష్టి గురించి ఆలోచన అవసరం లేదు. ముందు ఒక్కో మెట్టు ఎదగడం కోసం బేసిక్స్ నేర్చుకోవడం మీద దృష్టి పెట్టాలి. కాస్త ఇంగ్లీషు పరిజ్ఞానమున్న ఔత్సాహికులు ఒకటే స్క్రీన్ ప్లే పుస్తకాలు  చదివేస్తూంటారు. ముందు సిడ్ ఫీల్డ్ తో ప్రారంభించి ఎంతో బేసిక్స్ నేర్చుకోవాల్సిన వాళ్ళు, అప్పుడే అర్ధం జేసుకోలేని జేమ్స్ బానెట్ కెళ్ళిపోతారు, జోసెఫ్ క్యాంప్ బెల్, రాబర్ట్ మెక్ కీ లకెళ్ళిపోతారు. నల్గురిలో గొప్ప అన్పించుకోవడం కోసం తప్ప మరేమీ కాదు. కూర్చుని ఒక్క లైన్ ఆర్డర్ కూడా వేయలేరు. ఇంటి దగ్గర్నుంచి డబ్బులు తెప్పించుకుని వృధాగా గడిపేస్తూంటారు. దర్శకత్వ శాఖలో వున్న వాళ్ళకి ప్రాక్టికల్ అనుభవం సంపాదించుకునే అవకాశం వుంటుంది. ఆ ప్రాక్టికాలిటీకి ఎంతవరకూ పుస్తకాల్లోంచి తీసుకోవాలో అంతవరకే తెలుసుకోవాలే తప్ప, తెలుసుకుని కస్టమైజ్ చేసుకోవాలే తప్ప, లేనిపోని  మేధస్సు ప్రదర్శించబోతే  లౌకికంగా విఫలమవుతారు. 
***








25, డిసెంబర్ 2017, సోమవారం

573 : రివ్యూ!





దర్శకత్వం: అలీ అబ్బాస్జాఫర్ 
తారాగణం
: సల్మాన్ఖాన్, కత్రినా కైఫ్, అనూప్రియా గోయెంకా, అంజలీ గుప్తా, నేహా హింగే, సజ్జాద్ డెల్ ప్ఫ్రూజ్, గిరీష్ కర్నాడ్, పరేష్ రావల్, కుముద్ మిశ్రా, అంగద్బేడి, నవాబ్ షా  తదితరులు
కథ: అలీ అబ్బాస్జాఫర్, నీలేశ్మిశ్రా, స్క్రీన్ ప్లే –మాటలు : అలీ అబ్బాస్ జాఫర్
సినిమాటోగ్రఫీ: మార్చిన్లస్కావీస్ , సంగీతం: విశాల్‌-శేఖర్, జులియస్పాకియమ్
బ్యానర్ : యశ్రాజ్ఫిల్మ్స్
విడుదల : 22 డిసెంబర్, 2017
***
2012 లో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ లతో ‘ఏక్ థా టైగర్’ (ఒక టైగర్ వుండేవాడు)
విడుదలైంది
. దీనికి ‘భజరంగీ భాయ్ జాన్’ ఫేమ్ కబీర్ ఖాన్ దర్శకుడు. ఇందులో సల్మాన్, కత్రినాలు భారత ‘రా’, పాకిస్తానీ ఐఎస్ఐ ఏజెంట్లుగా ప్రేమలో పడి దేశం కంటే ప్రేమే ముఖ్యమని అదృశ్యమైపోతారు. ఇప్పుడు 2017 లో దీని సీక్వెల్ గా ‘టైగర్ జిందా హై’ (టైగర్ బతికే వున్నాడు) లో తిరిగి వీళ్ళిద్దరూ తమ రెండు దేశాల తరపున జాయింట్ ఆపరేషన్ లో పాల్గొంటారు. దీని దర్శకుడు ‘సుల్తాన్’ ఫేమ్ అలీ అబ్బాస్ జాఫర్. రెండిటి నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్సే. మొదటిది కాల్పనిక గూఢచార కథయితే, ఈ రెండో దానికి యదార్ధ ఘటన ఆధారమన్నారు.  ఏమిటా యదార్ధ ఘటన? ఎక్కడ జరిగింది? దాన్నెలా తెరకెక్కించారు? ఒకసారి చూద్దాం...

కథ 
ప్రేమలో పడి పెళ్ళిచేసుకుని, కొడుకుని కని,  ఆస్ట్రియా లోని ఆల్ప్స్ మంచుపర్వత శ్రేణుల్లో  అజ్ఞాతంగా జీవిస్తున్న మాజీ ఇండో- పాక్ ఏజంట్లు టైగర్ అలియాస్ అవినాష్ సింగ్ రాథోడ్ (సల్మాన్),  జోయా (కత్రినా) ల కోసం ‘రా’ (రీసర్చి అండ్ ఎనాలిసిస్ వింగ్ - భారత గూఢచార సంస్థ) చీఫ్ షెనాయ్ (గిరీష్ కర్నాడ్) వెతుకుతూంటాడు. ఇరాక్ లోని టిక్రిట్  లో అబూ ఉస్మాన్ (సజ్జాద్ డెల్ ఫ్రూజ్) అనే అతను కరుడుగట్టిన  ఉగ్రవాద సంస్థ ఐఎస్సీ నాయకుడుగా ఎదిగాడు. అమెరికన్లు ఆగ్రహించి అతడి మీదా అతడి దళం మీదా వైమానిక దాడులు  జరిపితే, గాయపడి ఒక ఆస్పత్రి బస్సెక్కేశాడు. ఆ బస్సుల్లో నర్సులున్నారు. వాళ్ళని ఆస్పత్రికి తీసికెళ్ళి బందీలుగా పెట్టుకుని, సురక్షితంగా మకాం పెట్టాడు. అమెరికన్లు వెనుదీయక ఆస్పత్రి మీద దాడికీ  సిద్ధమయ్యారు. దీనికి వారంరోజులే  టైముంది. 

          దీంతో ఇండియాలో  ‘రా’ చీఫ్ షెనాయ్ అప్రమత్తమయ్యాడు. ఆ నర్సుల్లో పాతికమంది భారత నర్సులే గాక, పదిహేను మంది పాక్ నర్సులు కూడా వున్నారు. ఈ సమయంలో రాజకీయం కాక మానవత్వమే ముఖ్యమని – వాళ్ళందర్నీ ప్రాణాలతో కాపాడాలని సమాయత్తమయ్యాడు. కానీ శత్రు దుర్బేధ్యమైన టిక్రిట్ లో ప్రవేశించే సాహసం చేయగల మొనగాడెవడూ లేడు - ఒక్క టైగర్ తప్ప. ఆఘమేఘాల మీద ఆ టైగర్ని  వెతకడం ప్రారంభించాడు...ఈ నేపధ్యంలోనే   ఆల్ప్స్ లో పండంటి కాపురం చేసుకుంటున్నటైగర్ దొరుకుతాడు. నీ దుంపతెగ రారా అంటే,  కచ్చితంగా రానంటాడు. భార్య జోయా నచ్చజెప్పి పంపుతుంది.

          ‘రా’ చీఫ్ ఇచ్చే టీముని కాదని, ఒక  షార్ప్ షూటర్, ఒక టెక్కీ, ఒక బాంబ్ డిఫ్యూజర్ లతో తన సొంత టీముని ఏర్పాటు చేసుకుని బయల్దేరతాడు. ఇక టైగర్ టిక్రిట్ లోకి ఎలా ప్రవేశించాడు, అక్కడెదురైన ప్రమాదాలేమిటి, టిక్రిట్ లో  జొరబడ్డాక ఆస్పత్రిలోకి ఎలా చొరబాటు చేశాడు, ఈ ఆపరేషన్ మధ్యలో పాక్ తరపున జోయా ఎలా వచ్చి తోడ్పడింది, ఆమెతో కలిసి నర్సుల్ని టైగర్ ఎలా బంధవిముక్తుల్ని చేశాడూ అన్నది మిగతా కథ.

ఎలావుంది కథ 
      2014 లో ఇరాక్ లో జరిగిన యదార్ధ ఘటన అన్నారు. కానీ ఘటన జరిగిన తీరు వేరు. అల్ ఖైదా తానులో ముక్క ఐసిస్ ఇరాక్ లోని టిర్కిట్ లో ఇండియన్ నర్సుల్ని బందీలుగా పట్టుకున్నది నిజం. అయితే అది డబ్బుకోసం కాదు. డబ్బుకోసం అపహరణలకి పాల్పడడం వాళ్ళ పధ్ధతి కాదు. వాళ్ళ దగ్గరే బోల్డు డబ్బుంది. తాము పబ్లిసిటీలోకి రావడానికి ఆ పనిచేశారు. నర్సులకి ఏ హానీ తలపెట్టలేదు. పైగా చాలా మర్యాదగా చూసుకున్నారు. రేపు వాళ్ళ ఇస్లామిక్ సామ్రాజ్యం ఏర్పడితే ఇండియా నుంచి చీప్ లేబర్ వాళ్ళకి అవసరం. కాబట్టి నర్సుల్ని అతిధులుగా చూసుకున్నారు. భారత ప్రభుత్వం వాళ్ళతో సంప్రదింపులు జరిపి నర్సుల్ని విడిపించుకోగల్గింది. ఇదీ నిజంగా జరిగింది.

  దీని మీద మలయాళంలో తీసిన ‘టేకాఫ్’ గత మార్చిలోనే విడుదలయింది. దీన్ని యదార్థ సంఘటనలాగే  తీశారు. కాకపోతే ఫస్టాఫ్ వరకూ అక్కడి కెళ్ళిన నర్సుల జీవితాల్లో కుటుంబపరమైన సమస్యలు చూపించారు. ఆతర్వాత ఐసిస్ పాల్పడిన అపహరణ – విడుదల వగైరా యధాతధంగా చూపించారు. అయితే నర్సుల్ని విడుదల చేయించడంలో భారత ప్రభుత్వ పాత్రకంటే అక్కడి మలయాళీ బిజినెస్ మాన్ పాత్రవుందని వార్తలొచ్చాయి. దీన్ని అప్పటి కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాండీ ధృవీకరించారు కూడా. కానీ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఖండించారు. ఇలాటి బందీల, లేదా సంక్షోభంలో ఇరుక్కున్న సమూహాల తరలింపు ఉదంతాల్లో అదేమిటోగానీ బిజినెస్ మాన్లే భుజానవేసుకునే వైనాలు కనపడుతున్నాయి. ‘షిండ్లర్స్ లిస్ట్’, ‘హోటల్ రువాండా’ ల తర్వాత ‘ఏర్ లిఫ్ట్’, ఇప్పుడు ‘టేకాఫ్’ అనే ఇండియన్ సినిమాలు. కువైట్ సంక్షోభంలో మలయాళీ బిజినెస్ మాన్ ని హీరోగా చూపిస్తూ ‘ఏర్ లిఫ్ట్’ తీసినట్టే, ‘టేకాఫ్’ లోనూ  మలయాళీ బిజినెస్ మాన్ నే ప్రధానపాత్రగా చూపించారు. రెండూ వివాదాస్పదమయ్యాయి. కాకపోతే మొదటి దాని విషయంలో దర్శకుడు క్షమాపణ చెప్పుకున్నాడు. 

 ప్రస్తుత కథలో ‘ఇరాక్ లో భారత నర్సుల అపహరణ’ అనే వార్తని ఐడియాగా తీసుకుని, స్పై థ్రిల్లర్ గా యాక్షన్ కథ అల్లారు. ట్విస్టుగా పాక్ నర్సుల్ని కూడా చేర్చారు. ఇసిస్ బదులు ఐఎస్సీ అన్నారు. ఇరాక్ బదులు అబుదాభీ, మొరాకో లొకేషన్స్ లో చిత్రీకరించారు. ఈ స్పై జానర్ కథని ‘దంగల్’ కోవలో హాస్యభరితం చేశారు. కష్టాల్లో, ప్రమాదకర పరిస్థితుల్లో, అన్నిటా  పాత్రలు ఫన్నీగా మాట్లాడి తెగ నవ్వించడమనే వినోదాత్మక విలువని చక్కగా ఉపయోగించుకున్నారు.  ఇటీవల ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియెస్ – 8’ లో హీ - మాన్ హీరోల విట్టీ డైలాగ్ పవర్ ఎలా మాస్ చేత కేరింతలు కొట్టించుకుందో,  ప్రేక్షకులతో అవే దృశ్యాలు  ప్రస్తుతం థియేటర్లలో కన్పిస్తున్నాయి. 

ఎవరెలా చేశారు
సల్మాన్ ఖాన్ ని చూపించి ఎలా చప్పట్లు కొట్టించాలో, ఎలా ఈలలు వేయించాలో ఆ విన్యాసాలన్నీ ప్రదర్శించారు. ఆ డైలగులన్నీ పలికించారు. మంచు కొండల్లో సల్మాన్ ఎంట్రీలో చెయ్యి చూపిస్తే ఈలలు, కాలు చూపిస్తే ఈలలు, తోడేళ్ళతో పోరాటం చూపిస్తే కేరింతలు – అందరూ వేటాడగలరు,  టైగర్ లా వేటాడలేరు  - అని డైలాగు కొట్టిస్తే చప్పట్లూ ఈలలూ. ఎడారిలో క్వాడ్ బైక్ మీద దూసుకొస్తూంటే, ఇరాక్ వీధుల్లో గుర్రపు స్వారీ చేస్తూంటే, ఒక పెద్ద మెషీన్ గన్ మోసుకొస్తూంటే, షర్టు విప్పి కండలు చూపిస్తే...ఒకటేమిటి, అభిమానుల్ని ఫుల్ ఖుష్ చేయడానికి ఏమేం చేయాలో అవన్నీ చేశారు.  విచిత్రమేమిటంటే ఇవన్నీ పక్కా లోకల్ మాస్ గా వుంటూనే ఇంటర్నేషనల్ సినిమాలా అన్పించడం. సల్మాన్ డైలాగులు పలికే తీరువల్ల డైలాగ్ రైటర్ల పని సులువై పోతుంది - పై వాడు నిన్ను క్షమిస్తాడో లేదో, నా పని నిన్ను పై వాడి దగ్గరకి పంపించడం (పాత డైలాగే)... మన పని కేవలం నర్సుల్ని రక్షించడమే కాదు - శాంతి కోసం మనం నిలబడ్డామని ప్రపంచానికి చూపించడం కూడా... నీకు దమ్ముంటే నన్నాపి చూడరా ఉస్మాన్ (పాత మూస డైలాగు)... దేశ ప్రతిష్టకే సవాలు (టెంప్లెట్ డైలాగు)...ఇలా రాసేస్తే సరిపోతుంది, వాటి ఎఫెక్టు సంగతి సల్మాన్ చూసుకుంటాడు. అయితే చాలాసార్లు తగ్గాల్సిన చోట్ల తగ్గి, ఇతర పాత్రల బలిమికి అవకాశం కూడా ఇచ్చాడు. 

 ఈ స్పై థ్రిల్లర్ లో జోసెఫ్  క్యాంప్ బెల్ మిథికల్ స్ట్రక్చర్ తో బాటు, జేమ్స్ బానెట్ పాత్రల పొందిక కన్పిస్తాయి. ఒకప్పటి కొన్ని పాత్రలు కనుమరుగైపోయాయి. అలాటి ఒక పాత్ర హీరోయిన్ కత్రినా కైఫ్ పాత్ర. ఇది వెనుకాడే హీరోపాత్రని ముందుకు తోసే ‘థ్రెషోల్డ్ క్యారక్టర్’.  జేమ్స్ బానెట్ ప్రకారం మన మానసికలోకంలో జడప్రాయమైన అవస్థ వుంటే దాన్ని విడుదల చేసే కవాటం లాంటిది ఇది. కత్రినా పాత్ర కథలో ఈ పని చూసుకుంటుంది. ఆమె ఎంట్రీ సీను సూపర్ మార్కెట్ లో వుంటుంది. అక్కడ  జొరబడిన ముగ్గురు దొంగల్ని సీసీ కెమెరా ఒక చుట్టు  తిరిగే లోపు కొట్టి పడేస్తుంది. ‘దిసీజ్ విమెన్ ఎంపవర్ మెంట్’ అని ఓనర్ మెచ్చుకుంటుంది ( అంటే విమెన్ ఎంపవర్ మెంటుకి తన్నాలనా? తంతే తప్ప మగలోకం దారికి రాదనేమో). 

          కత్రినాకి ఇంకా కొన్ని యాక్షన్ సీన్స్ వున్నాయి. సల్మాన్ తన టీముతో అపాయంలో వుండీ స్తబ్దుగా వుంటే, హెడ్ లైట్లు పడతాయి – ఆఁ ... వచ్చేసిందిరో మీ వదిన – అంటాడు సల్మాన్. ఆమె వచ్చేసి ఫటా ఫటా లేపెస్తుంది టెర్రరిస్టుల్ని. కథంటే ఓడిడుకుల మన మానసిక స్థితే. వివిధ పరిస్థితులకి లోనయ్యే స్థితుల్ని చూపిస్తూ పాత్రలతో చక్క దిద్దుతూంటారు.

          ఈ టీముతో సంబంధం లేకుండా కత్రినా సొంతంగా వేరే  ఆపరేషన్ ఒకటి చేస్తుంది కథకి అడ్డం వస్తూ. మెడికల్ కాలేజీ అమ్మాయిల్ని చదవకుండా ఎత్తుకొచ్చి,  రేపులు  చేస్తూ చాకిరీ చేయించుకుంటూ వుంటారు ఐఎస్సీ ఉగ్రవాదులు. వాళ్ళతో సోలోగా స్వోర్డ్ ఫైట్ చేసి అమ్మాయిల్ని విడిపిస్తుంది కత్రినా. ఒకవైపు కథకి నర్సుల్ని విడిపించే పాయింటు వుండగా మళ్ళీ ఇదెందుకు సృష్టించారో అర్ధం గాదు. కత్రినా యాక్షన్ సీన్లు డబల్ ధమకాలా ప్రేక్షకుల చేత కేరింతలు పెట్టించేవే. 

    వెండి తెర మీద నుంచి ఇంకో కనుమరుగైపోయిన జేమ్స్ బానెట్ చెప్పిన పాత్ర - ట్రిక్ స్టర్. అంటే మాయగాడు. మన మనసుకి  మనతో ట్రిక్కుల్ని ప్లే చేసే గుణం వుంటుంది. ఆ మాయలో మనం పక్కదోవ పట్టిపోతాం. ఆ  కాసేపు, లేదా ఎంత కాలమైనా ఆడుకుని తిరిగి మనల్ని ట్రాకులో పెడుతుంది మన మనసు మనల్ని. ఈ పాత్రే  పరేష్ రావల్ అద్భుతంగా పోషించిన ఫిర్దోస్ అలియాస్ తోబాఁ ( అరబిక్ లోపాము). ఇతను పాతికేళ్ళ క్రితం ఇరాక్ లో స్థిరపడి యజమానులకి, అధికారులకీ తొత్తులా వుంటూ కార్మికుల మీద పడి బతుకుతూంటాడు. హీరో టీముని ముప్పు తిప్పలు పెడతాడు. చివరికి నీతి  వైపు నిల్చి సహాయపడతాడు. పరేష్ రావల్ మ్యానరిజమ్స్, మాట తీరూ, నటనా ఎంతో కన్నింగ్ గానూ ఫన్నీగానూ  వుంటాయి. ఇలాటి పాత్రనే ‘మ్యాడ్ మాక్స్ టూ’ లో బ్రూస్ స్పెన్స్ పోషించడాన్ని చూడొచ్చు. కొంచెం తేడాతో ‘మోసగాళ్ళకు మోసగాడు’ లో నాగభూషణాన్ని కూడా చూడొచ్చు. ఆరుద్ర లాంటి ఆనాటి రచయితలకి ఇది బాగా తెల్సు. 

 ఐఎస్సీ లీడర్ గా ఇరానియన్ నటుడు సజ్జాద్ డల్ఫ్రోజ్ నటించాడు. ఈ లోకంలో ఒకటే మతముంది,  మానవత్వం - అనే కలికాలంలో ప్రాక్టికల్ గా పనిచెయ్యని ఐడియాలజీతో హీరోకి పేలవమైన రొటీన్ డైలాగే  వుంటుంది. దీనికంటే కళ్ళు తెరిపించే డైలాగు సజ్జాద్ పలుకుతాడు – ఈ ఆయుధాలు, ఈ డబ్బు ఎక్కడ్నించి వస్తున్నాయి? ఉగ్రవాదం ఒక బిజినెస్, దీంట్లో లోకమంతా కలిసి వుంది – అని.  ఉగ్రవాదం అనే కాష్టంలో ఎవరి లాభం కోసం వాళ్ళు ఆజ్యం పోస్తున్నారనే అర్ధంలో. సజ్జాద్ ని ఖాకీ యూనిఫాంలో గడ్డంతో, ఎర్ర టోపీతో చూపిస్తే  కల్నల్ గడాఫీ, ఫిడెల్ కాస్ట్రో, కమ్యూనిజంలని  కలగలిపి చూపినట్టుంది. ఈ మిక్స్చర్ పోట్లంతో ఐసిస్ కి ఏమైనా మెసేజి బహుమానంగా ఇవ్వాలనుకున్నారేమో తెలీదు. 

          ఇక హీరో టీం మెంబర్లుగా కుముద్ మిశ్రా, అంగద్ బేడీ, నవాబ్ షా కన్పిస్తారు. పాకిస్తాన్ ఐఎస్సై టీం లీడర్ గా సుదీప్ కన్పిస్తాడు. ఈ రెండు టీముల్లో  తెలిసిన క్రేజీ స్టార్లుంటే ఇంకా మజా వచ్చేది. ఐఎస్సై  టీములో తర్వాత మాజీ ఏజెంట్ కత్రినా వచ్చి కలుస్తుంది.  ఇరు దేశాల నర్సులు బందీలై వున్నా, రెండు దేశాల టీములు కలిసి పనిచేయడం అంత వాస్తవికంగా అన్పించదు. శాంతి కోసం పనిచేద్దాం రమ్మంటే పాక్ వచ్చే అవకాశంలేదు. తమ నర్సులకోసం పాక్ ఆపరేషన్ నిర్వహించే అవసరమే రాకపోవచ్చు. ఐసిస్ కి కాశ్మీర్ లోకి ఆహ్వానం పలుకుతున్న పాక్ తో  - ఐసిస్ భాయ్ భాయే కాబట్టి – మీరు పట్టుకున్న వాళ్ళల్లో మా అమ్మాయిలున్నార్రా బాబూ వదిలిపెట్టండంటే సరిపోతుంది. కానీ సినిమాలో ఉగ్రవాది ఒక పాక్ నర్సుని కాల్చేసినట్టు చూపించారు. 

గూఢచార సినిమా అనగానే దేశభక్తి ధారాళంగా ప్రవహించేలా చిత్రీకరిస్తారు ( దేశాన్ని రక్షించే సైన్యం ఎక్కడో సైలెంట్ గా వుంటుంది - మిగతా అన్ని రంగాలూ వర్గాలూ దేశభక్తిని పులుముకుని, ఫ్రీగా దేశభక్తిని అనుభవిస్తూ  చిందులేస్తూంటాయి). హాలీవుడ్ సినిమాల్లో ఈ జానరేతర దేశభక్తి ఎలిమెంట్ కన్పించదు. ఇండో- పాక్ టీములు వాళ్ళ వాళ్ళ జెండాలు దాచుకుని తెచ్చుకోవడం, స్నేహపూర్వకంగా ఎవరి దేశభక్తిని వాళ్ళు ప్రదర్శించుకోవడం, చివరికి ఇండియా మెంబరు చనిపోతూ పాక్ మెంబర్ కి తన జెండా ఇచ్చి మోయించడం...ఆఖరికి  శుభం సీనులో నర్సులున్న బస్సుకి రెండు దేశాల జెండాలూ  రెపరెప లాడడం సిల్లీగానే వుంటుంది. నర్సులు భుక్తి కోసం వెళ్ళారా, లేక దేశభక్తితో దేశం కోసం వెళ్ళారా? 

          దేశభక్తి కాకుండా,  ఇలాంటప్పుడు వాస్తవంగా ఏం జరుగవచ్చో అది చూపిస్తే ఈ స్పై జానర్ మర్యాద నిలబడేది. ‘రా’ ఏజెంట్ నేతృత్వంలో ఐఎస్సై ఏజెంట్లు పనిచేయడం వింతే. నిజానికి వాళ్ళు కలవకుండా సపరేట్ ఆపరేషన్ నిర్వహించి,  క్రెడిట్ తాము కొట్టెయ్యాలని ‘రా’ ఏజెంట్లకి అడ్డుతగులుతూండాలి. వాళ్ళ మీద హత్యాప్రయత్నాలు కూడా చెయ్యాలి. వాళ్ళ తీరు వల్ల నర్సుల ప్రాణాలకే ఎసరు రావాలి. హీరోకి అటు ఐఎస్సీతో బహిర్గతంగా ఫిజికల్ యాక్షనే కాకుండా, ఇటు ఐఎస్సై ఏజెంట్లతో అంతర్గతంగా ఎమోషనల్ యాక్షన్ కూడా వుండాల్సింది. అప్పుడే పాత్రకి ద్వంద్వాలేర్పడి పాత్రచిత్రణ కరెక్టుగా వుండి, మరింత ఎఫెక్టివ్ గా మారే   అవకాశంవుండేది. ఇది లేకపోవడంతో ఫ్లాట్ గా,  ఏకోన్ముఖంగా యాక్షన్ చేసుకుంటూ వెళ్ళిపోయింది హీరో పాత్ర. ఈ ద్వంద్వాలుంటే హీరో భార్యగా,  ఐఎస్సై ఏజెంటుగా హీరోయిన్ పాత్ర కూడా మానసిక సంఘర్షణకి లోనై, ద్వంద్వాలు ఏర్పాటై ఎంతో రక్తికట్టించేది. చివరికి సమన్వయ కర్త తనే అయ్యేది - పైన చెప్పుకున్నట్టు ఒక  థ్రెషోల్డ్ పాత్రగా. పాత్ర స్వభావాన్ని మొదట్లో చూపించి తర్వాత మర్చిపోతే ఎట్లా? ఒకే ఆపరేషన్  గురించి రెండు దేశాల ఏజెంట్లు ఘర్షణపడే  ఎజెండా అవసరం ఈ కథకి. దీంట్లోకి దేశభక్తి  కోణం రానవసరం లేదు. కథలో దాని పాత్ర సబ్ టెక్స్ట్ గా మాత్రమే, ఆ ఫీల్ ని ఆడియెన్సు చూసుకుంటారు.  

          నర్సు పాత్రల్లో
అనూప్రియా గోయెంకా, అంజలీ గుప్తా, నేహా హింగేలు ప్రధానంగా కన్పిస్తారు. ‘రా’ చీఫ్ గా  గిరీష్ కర్నాడ్ ఆదేశాలిస్తూ వుండే పాత్ర. మేకింగ్ ఉన్నత ప్రమాణాలతో వుంది (నూట  యాభై కోట్లు అంటున్నారు, యశ్ రాజ్ ఫిలిమ్స్ కి ఇదే తొలి ఖరీదైన ప్రొడక్షనట). పోలెండ్ ఛాయాగ్రాహకుడు మార్చిన్లస్కావీస్ కెమెరా వర్క్ ఒక కళా ప్రయోగం. దీనికి హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ టామ్ స్టూథర్స్ సమకూర్చిన యాక్షన్ దృశ్యాలు స్టన్నింగ్ గా వున్నాయి. నిడివి రెండు గంటలా 40 నిమిషాలనేది ఎక్కువే. 

చివరికేమిటి 
హాస్యం ఈ స్పై థ్రిల్లర్ని అపహాస్యం పాలుకాకుండా కాపాడింది. హాస్యం లేకుండా సీరియస్ మూడ్ లో చూడాలంటే భరించే కాలం కాదిది. ఈ రోజుల్లో – పెరిగిపోతున్న వివిధ దృశ్య మాధ్యమాలతో తీవ్ర పోటీని ఎదుర్కొంటున్న తరుణంలో - సినిమాలకి  ఏదో ఒక యూనిక్ సెల్లింగ్ పాయింటు (యూఎస్పీ) వుండాల్సిందే. ఆ యూఎస్పీని ప్రధానంగా చేసుకుని సినిమాలు తీసి  ప్రేక్షకుల్ని ఆకర్షించాల్సిందే. ఆ యూఎస్పీయే ఈ స్పై థ్రిల్లర్ కి హాస్యమనే షుగర్ కోటింగ్.  సినిమాలంటే కేవలం క్రియేటివ్ యాస్పెక్ట్ తో తీసేది కాదు, మార్కెట్ యాస్పెక్ట్ నికూడా కలుపుకోకపోతే తీసి దండగ. టాలీవుడ్ లో ఈ మార్కెట్ యాస్పెక్ట్ ఇంకా అలవడాల్సి వుంది. వుంటే లో కేటగిరీలో కాలం చెల్లిన పద్ధతిలో వుండకుండా హిందీ, హాలీవుడ్ సినిమాలు చూసి  అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం చాలా వుంది.  

          ‘దంగల్’ లాంటి సీరియస్ కాన్సెప్ట్ ని  హాస్యయుతమైన పాత్రలతో వినోదాత్మకం చేయపోతే వెంటనే ఫ్లాపయ్యేది. ఆ పాత్రలుకూడా ఎవరికీ గుర్తుండేవి కాదు. పాత్రలు కామెడీ చేయడం పాత పధ్ధతి, హాస్యంగా మాట్లాడ్డం ఇప్పటి పధ్ధతి. కథలు సీరియస్ గానే వుంటాయి, పాత్రలు ఛలోక్తుతో రియాక్ట్ అవుతూంటాయి. కష్టాల్ని,  పనిని ఆటలాగా తీసుకోవడమే వీటి కార్యాచరణ. ఇలా ఇవి మనల్ని ఎలా జీవించాలో కూడా నేర్పుతాయి. 

          ప్రస్తుత స్పై థ్రిల్లర్ లో పాత్ర చావుతప్పి కన్ను లొట్టబోయి బయట పడి - యమ రాజ్ టచ్ కర్కే  నికల్ గయా ( యముడు టచ్ చేసి వెళ్ళిపోయాడు) - అంటే అంత సీరియస్ సీనులో ప్రేక్షకులు ఘోల్లున నవ్వకుండా వుంటారా? ఎంట్రీ సీన్లో సల్మాన్ కొడుకుతో తోడేళ్ళతో తలపడే యాక్షన్ ఎపిసోడ్ ఎంత గుర్పాటు కల్గిస్తుందో, ఫన్నీ డైలాగులతో అంత రిలీఫ్ నిస్తూంటుంది – ఇంజెక్షన్ ఇస్తూ డాక్టర్ కబుర్లలో పెట్టినట్టు. ఈ ఎపిసోడ్ లో కొడుకు భయపడిపోయి కేకలు పెట్టేట్టుగా, సల్మాన్ వాణ్ణి కాపాడేట్టుగా  – పిచ్చిగా ఫాదర్ సెంటి మెంటు,  చైల్డ్ సెంటిమెంటు అంటూ  వెలగబెట్టకుండా - చైల్డ్ ఎంపవర్ మెంట్ ని చూపించడం బావుంటుంది ఇద్దరి ఫన్నీ డైలాగ్స్ తో. తను తోడేళ్ళ గుంపుని  ఎదుర్కొంటూనే,  వాడికి తప్పించుకునే  కళలు నేర్పుతూంటాడు. తప్పించుకుంటున్న వాడి వెంట తోడేళ్ళు పడ్డా కేకలు వేయడు. ఈ ఎపిసోడ్ లో సల్మాన్ ఒక్క తోడేలుని కూడా చంపకుండా, మీద పడేటప్పుడు పక్కకి తప్పుకోవడం, వాటిని పక్క దోవ పట్టించడం లాంటి ట్రిక్కులు ప్లే చేస్తాడు. హాస్యాన్ని యూఎస్పీ అస్త్రం చేసుకుని ప్రయోగించడమే దీని ఘన విజయానికి కారణం. 

ఇక స్పై జానర్ కథలో హీరో పాత్ర ప్రయాణం భిన్నంగా వుంటుంది. పరిష్కరించాల్సిన సమస్య అతడికి వ్యక్తి గతంగా ఎదురుకాదు. ఎక్కడో ఏదో సమస్య ముందే ఏర్పాటయి వుంటుంది. ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నాడో వెతికి పట్టుకొచ్చి అతణ్ణి  ఆ సమస్యలోకి తోస్తారు.  జేమ్స్ బాండ్ లాంటి స్పై జానర్ హీరో పాత్రకి సొంత బాధలుండవు. కవిలాగా ప్రపంచ బాధే  తన బాధ. ఆ ప్రపంచ బాధలు తీర్చడమే తనకొచ్చిన బాధ. ఇదంతా స్పై జానర్ కొక టెంప్లెట్. ఈ టెంప్లెట్ లోనే ఈ కథలుంటాయి. కాకపోతే స్పై సినిమాలు ఎప్పుడో గానీ రావు గనుక  ప్రేక్షకులకి అదేపనిగా విసుగు పుట్టించవు, బతికిపోతారు.  ఇలాకాక, టాలీవుడ్ సినిమాలు వారంవారం  టెంప్లెట్ అనే ఒకే టెంపుల్ లో గంట వాయించుకుంటూ బిలబిలమంటూ అలాగే వచ్చే స్తూంటే,  విసుగు సూచీ వసూళ్ళ సూచీ కంటే బాగా పై స్థాయిలోనే ఎగదన్ని వుంటోంది. మార్కెట్ యాస్పెక్ట్ అంటే మనకి అర్ధంగాని అరబ్బీ పదం కదా. అందుకే ఎవరో ఆకతాయిలు తప్ప,  ప్రేక్షకులు బతికివుండే  అవకాశం బొత్తిగా లభించడం లేదు. 

          దర్శకుడు అలీఅబ్బాస్ జాఫర్, నీలేష్ మిశ్రాలు  కలిసి ఈ కథ రాశారు. ఐదేళ్ళ క్రితం ‘ఏక్ థా టైగర్’ తర్వాత ఈ సీక్వెల్ తో నీలేష్ కిది రెండో అవకాశం. తీవ్రవాద / ఉగ్రవాద డెస్కు జర్నలిస్టుగా క్షేత్రస్థాయిలో పనిచేసిన అనుభవముంది. దీనివల్ల కథ ఆపరేటింగ్ పార్టు ఆథెంటిగ్గా వచ్చింది. అబ్బాస్ సమకూర్చుకున్న స్క్రీన్ ప్లేలో జోసెప్ క్యాంప్ బెల్ మిథికల్ స్ట్రక్చర్ కన్పిస్తుంది. అంటే పురాణ కథల కథాక్రమం కనపడుతుంది (పై పటం చూడండి). ఆన్ని మతాల పురాణాల్లోంచి జోసెప్ క్యాంప్ బెల్ కనుగొన్న మిథికల్ స్ట్రక్చర్,  ‘స్టార్ వార్స్’  మొదలుకొని ఎన్నో హాలీవుడ్ సినిమాలకి ఒక గైడ్ లా వుంటోంది.

          ఈ స్ట్రక్చర్ లో పై పటంలో కన్పించే దశలన్నీ ఈ స్పై థ్రిల్లర్ లో కన్పిస్తాయి. స్ట్రక్చర్స్ ని ఫాలో అవుతున్న వాళ్ళకి ఈ స్క్రీన్ ప్లే ని ఇంకా విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే స్పై జానర్ కథల్లో  ప్లాట్ పాయింట్ వన్ సమస్య తలెత్తినప్పుడు రాదు, ఆ సమస్య  ని హీరో చేపట్టినప్పుడే వస్తుంది. ఐఎస్సీ నాయకుడి మీద అమెరికా వైమానిక దాడులు, అతను నర్సుల్ని బందీలుగా పట్టుకోవడం, ‘రా’ చీఫ్ కి సమాచారం తెలియడం, ఇలా  ఇది బిగినింగ్ విభాగంలో ముందే ఏర్పాటయిన సమస్యే. కానీ ఇదే  ప్లాట్ పాయింట్ వన్ మాత్రం కాదు . ఇప్పుడు హీరో ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో చూపించి,  ‘రా’  చీఫ్ వెళ్లి సమస్య చెప్పాక, నర్సుల్ని విడిపించడానికి హీరో అంగీకరించడమే ప్లాట్ పాయిట్ వన్ అవుతుంది.  బిగినింగ్ విభాగానికి ఇదే ముగింపుగా వుంటుంది.


సికిందర్
         
         
         











         




























.