రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

23, జూన్ 2017, శుక్రవారం

రివ్యూ!

రచన - దర్శత్వం: రీష్  శంకర్
తారాగణం :  అల్లు అర్జున్, పూజా హెగ్డే, రావు మేష్, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణ మురళి. మురళీ శర్మ, సుబ్బరాజు, చంద్ర మోహన్, వెన్నెల కిషోర్, సనా దితరులు
స్క్రీన్ ప్లే: మేశ్ రెడ్డి, దీపక్ రాజ్;  సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఛాయాగ్రహణం : ఐనాక బోస్
బ్యానర్ : శ్రీ వెంకటేశ్వరా  క్రియేషన్స్
నిర్మాతలు: దిల్రాజు - శిరీష్
విడుదల : జూన్ 23, 2017
***
          ‘దువ్వాడ జగన్నాథం’ తో అల్లు అర్జున్- హరీష్ శంకర్ లు కొత్త కాంబినేషన్ గా ఏర్పడి అభిమానులకి ‘ఫాంటాస్టిక్ - ఎక్స్ ట్రార్డినరీ- మైండ్ బ్లోయింగ్’ గా కన్పించారు. బ్రాహ్మణ వెరైటీ పాత్రతో ఒక అద్భుతాన్ని ఇస్తున్నట్టు ఫ్యాన్స్  ఆనందించారు. దిల్ రాజు నిర్మాణంలో 25 వ చలన చిత్రంగా ఆయనా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.  ఇవన్నీ కలిసి ఏం బొమ్మ చూపించాయి? తేడాగల బొమ్మేనా, తేడా కొట్టిన బొమ్మా? ఈ కింద చూద్దాం...

కథ 
     దువ్వాడ జగన్నాథం (అల్లు అర్జున్) బ్రాహ్మణ వంట వాడిగా వుంటూ, మరోవైపు డిజే పేరుతో అన్యాయాలు  చేసే వాళ్ళని చంపుతూంటాడు. ధర్మాన్ని నిలబెడితేనే ధర్మం మనల్ని కాపాడుతుందని నమ్ముతాడు. చిన్నప్పుడే పిస్తోలు పట్టి చంపడం చేసి ఒక పోలీసు అధికారి ( మురళీ శర్మ ) ని కాపాడతాడు. చెడుని నిర్మూలించడానికి మనం చేతులు  కలుపుదామని ఆ పోలీసు అధికారి పదేళ్ళు లేని డిజే ని చేరదీస్తాడు. అప్పట్నుంచీ ఇద్దరూ దుష్టుల్ని చంపుతూంటారు. డిజే తండ్రి (తనికెళ్ళ భరణి) ఇతడి ఆవేశాన్ని గమనించి ఒక రుద్రాక్ష మాల మెళ్ళో వేసి, హింసకి పాల్పడనని  ఒట్టేయించుకుంటాడు. చంపుతున్నప్పుడు డిజే ఆ మాల తీసేసి చంపుతూంటాడు.

          మిత్రుడు విఘ్నేశ్వర శాస్త్రి (వెన్నెల కిషోర్) పెళ్ళిలో వంట కెళ్ళి నప్పుడు అక్కడ పూజా ( పూజా హెగ్డే) ని చూసి ప్రేమలో పడతాడు డిజే. వంట వాణ్ణి చేసుకోనని పూజా వెళ్ళిపోతుంది. ఇలా వుండగా డిజే మావయ్య (చంద్రమోహన్ ) ఆత్మహత్య చేసుకుంటాడు. అగ్రి డైమండ్ అనే సంస్థ చేసిన మోసానికి ఇంకా చాలా మంది బలై పోతారు. దీంతో డిజే ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమవుతాడు.

          అగ్రి డైమండ్ కుట్రదారు రొయ్యల నాయుడు (రావు రమేష్). ఇతను ఈ కేసు లోంచి బయట పడడానికి హోం  మంత్రి పుష్పం ( పోసాని) ని కలుపుకుంటాడు. పుష్పం తనకి ప్రమాదం తల పెట్టకుండా అతడి కూతుర్ని తన కివ్వాలని షరతు పెడతాడు. పుష్పం కూతురే డిజే ప్రేమించిన పూజా.
          ఇదీ విషయం. ఇప్పుడు ఈ కుట్రదారుల్ని డిజే  ఎలా నిర్మూలించాడనేది మిగతా కథ. 

 
ఎలా వుంది కథ : 
      ఇది టెంప్లెట్ కథ. దిల్ రాజు స్టార్స్ తో తీస్తున్నప్పుడు అనివార్యంగా ఆయనకి టెంప్లెట్ కథలు తప్పవు.  స్టార్స్ తో ఆయన ఇలాగే  సినిమాలు తీస్తూ వుండక తప్పదు. ఒకప్పుడు సీనియర్ స్టార్లు వున్నప్పుడు వాళ్ళ రోటీన్లు చూసి ఇమేజి చట్రంలోఇరుక్కున్నారని కామెంట్స్ వెలువడేవి. ఇప్పుడు స్టార్లు టెంప్లెట్ చట్రంలో ఇరుక్కుని అందులోంచి బయట పడలేక పోతున్నారు. అర్జున్ – హరీష్ ల కొత్త కాంబినేషన్ ఈ చట్రంలోనే ఇరుక్కుని దాని ఫలితం అనుభవించదానికి సిద్ధపడింది.  ఈ సంవత్సరం ఇప్పటి వరకూ పెద్ద సినిమాలు ఎనిమిది విడుదలైతే – డిజే  తో కలుపుకుని ఆరూ టెంప్లెట్ సినిమాలే. వీటిలో విన్నర్, కాటమ రాయుడు, రాధ, రోగ్, మిస్టర్ ఐదూ అట్టర్ ఫ్లాపయ్యాయి. డిజే దీన్నుంచి తప్పించుకుంటుందా? కొత్త వాళ్ళు  తీస్తే  అవే ప్రేమలు, దెయ్యం కామెడీలు, టాప్ స్టార్లు- డైరెక్టర్ లు నిర్మాణ సంస్థలూ తీస్తే అవే టెంప్లెట్ సినిమాలు ఎంతకాలం? టెంప్లెట్ లు ఫ్లాపవుతున్నాయని తెలిసే తీస్తున్నారా, తెలియక తీస్తున్నారా? 

ఎవరెలా చేశారు 
       అల్లు అర్జున్ వెరైటీగా వేసిన బ్రాహ్మణ పాత్ర, అదే రొటీన్ యాక్షన్ పాత్రలా కాకుండా, యాక్షన్ తో టచింగ్ క్యారెక్టర్ గా తీర్చి దిద్దమని దర్శకుణ్ణి అడగవచ్చు. కానీ టెంప్లెట్ చట్రంలో కుదరలేదేమో. టెంప్లెట్ చట్రాల్లో పాత్రలు పేరుకే వెరైటీ గానీ, పాత్ర చిత్రణల  దగ్గర కాదు.  ‘జంటిల్ మేన్’ లో అర్జున్, ‘అపరిచితుడు’ లో విక్రమ్, ‘విశ్వరూపం’ లో కమల్ హాసన్ లు పోషించిన బ్రాహ్మణ పాత్రలు ఎందుకు గుర్తుండి పోతాయో ఆలోచించాలి. 

          నటన విషయానికొస్తే, ‘అదుర్స్’ లో ముద్దుముద్దుగా, రిథమిక్ గా డైలాగులు పలకడంలో ఈజ్ చూపించడం వల్ల ఎన్టీఆర్ బ్రాహ్మణ పాత్ర ఫన్నీగా వుంటే, అర్జున్ కొచ్చేసరికి, అంత ఈజ్ లేకపోయినా బ్యాడ్ గా మాత్రం లేదు. ఇక కామెడీ, ఫైట్లు, డాన్సుల్లో సిద్దహస్తుడే. కథకి ఎత్తుకున్న పాయింటుని టెంప్లెట్ పాలుచేయకుండా వుండుంటే,  పాత్ర చిత్రణ వేరేగా వుండేది. 

          హీరోయిన్ పూజా హెగ్డే రోటీన్ గ్లామర్ తారే. రావు రమేష్  ఏదో వొక వేషం మార్చి విలన్ వేషాలేస్తారు. ఈసారి తన తండ్రి రావు గోపాల రావులా నిక్కరు వేసుకుని విలనిజం చేశారు. క్లయిమాక్స్ లో ఈ విలనిజం బావుంది. చనిపోయిన తల్లితో మాట్లాడే కొడుకుగా కామిక్ క్యారక్టర్ గా సుబ్బరాజు క్లయిమాక్స్ ని నిలబెట్టాడు. మురళీ శర్మా ఇంకా ఇతర నటులూ పాత్రలకి తగ్గట్టే నటించారు. ‘అమీతుమీ’ హేంగోవర్ లోవున్న ప్రేక్షకులకి  వెన్నెల కిషోర్ ని చూడగానే హుషారు!
          పాటలు ఓ రెండు బావున్నాయి. ఇక మిగతా సాంకేతికాలు బ్యానర్ కి తగ్గట్టే వున్నాయి. 

చివరికేమిటి   
      హింసే పరిష్కారమనుకునే విజిలాంటీ హీరో పాత్ర, సహకరించే పోలీసుపాత్రల మీద ఆధారపడి ఈ సినిమాకి పూనుకున్నారు. కానీ దీనికి కట్టుబడి వుండలేకపోయారు. ముందుగా ఫస్టాఫ్ లో వంటవాడైన హీరోతో ఒక్క గుర్తుండి పోయే మేజర్ సీనుకూడా లేకపోవడం డెప్త్ పరంగా పెద్ద లోపం. ‘క్రిష్ణవేణి’ లో వంటవాడుగా రాజబాబు గుర్తొస్తే ఇప్పటికీ నవ్వొస్తుంది. డిజే లో వంటలతో హీరో చేసే కామెడీ ఏమీలేదు. ఫోటో- ఆప్ కోసం అన్నట్టు గరిటె తిప్పుతూ ఇతర విషయాలు మాట్లాడడం తప్పితే. 

          యాక్షన్ విషయానికి వస్తే, మావయ్య చనిపోవడంతో కుట్ర దార్ల మీద పగదీర్చుకోవాలని హీరో నిర్ణయం తీసుకోవడం కథకి మొదటి మలుపు. ఇది గంట సేపటి కొస్తుంది (సినిమా నిడివి మొత్తం రెండు గంటలా 40 నిమిషాలు). ఐతే దీనికి ముందు హీరో అన్యాయాలు చేసే వాళ్ళని చంపుతూ వుండడంతో, ఈ మొదటి మలుపు దగ్గర తీసుకున్న నిర్ణయం బలంగా అన్పించదు. ఎందుకంటే మొదటి మలుపు నుంచి హీరో కొత్తగా ఏదోచేయాలి. కానీ ముందు నుంచీ ఏదైతే చంపడాలు చేస్తున్నాడో, మావయ్య చనిపోయిన కీలక ఘట్టం దగ్గర్నుంచీ మళ్ళీ అదే చేస్తున్నాడు. దీంతో కథనంలో మొనాటనీ ఒకటి, డైనమిక్స్ లేకపోవడం వొకటీ, పాత్ర ఎదుగుదల లేకపోవడం ఒకటీ జరిగి చప్పగా సాగుతూంటుంది కథ. 

          హీరోని చిన్నప్పుడే కిల్లర్ గా చూపించాక, దాన్నే పెద్దయ్యేవరకూ కంటిన్యూ చేస్తూ అదే కొనసాగించడం వల్ల వచ్చిన సమస్య ఇది. తనని కాపాడి నంత మాత్రాన,  పోలీసు అధికారి ఆ చిన్నపిల్లాణ్ణి పెట్టుకుని, తెర వెనుక తను వుంటూ,  చంపడాలు చేయించడమే కన్విన్సింగ్ గా లేదు. చిన్న పిల్లాడితో ఒప్పందాలేమిటి చెడ గొట్టడానికి కాకపొతే. ఆ తండ్రి అడ్డుపడి దూరం పెట్టి వుండాల్సింది. పెద్దయ్యాక హీరో వంట వాడిగానే వుండేవాడు. మావయ్య  చనిపోయాక పగ రగిలినప్పుడు- అసంఖ్యాక  ప్రజల్ని బాధితులుగా చూసినప్పుడు- చిన్న తనం గుర్తుకు వస్తే, అప్పుడు నిర్ణయం తీసుకుని వెతుక్కుంటూ వెళ్లి ఆ పోలీసు అధికారికి సై  అనివుంటే అది రియల్ డ్రామాగా వుండేది. మొదటి మలుపు బలంగా వుండేది. పాత్ర ఎదుగుదల, ఎవేర్ నెస్ కన్పించేవి.

          కథనానికీ పాత్రకీ ఏ నియమాలూ అవసరంలేదన్నట్టు ఏదో స్క్రీన్ ప్లే రాసేశారు. ఇకపోతే, ఏది ప్రధాన కథ అనే దానికి కూడా స్పష్టత తెచ్చుకోలేదు.  ముప్పావు భాగం కథ హీరోకి హీరోయిన్ తో రోమాన్సులూ పాటలే. మావయ్య చావుతో అంత నిర్ణయం తీసుకున్న హీరో అది వదిలేసి (కథ వదిలేసి) హీరోయిన్ తో ఎంజాయ్ చేస్తూంటాడు.  ఇక్కడ చాలా విచారకర విషయమేమిటంటే, హీరోయిన్ తో విలన్ కుట్ర చేస్తున్నాడని కూడా హీరోకి సెకండాఫ్ లో ఎవరో చెప్పే వరకూ తెలీదు. ఫస్టాఫ్ లో హీరోయిన్ ని తన కొడుక్కు చేసుకోవాలని డిసైడ్ ఐపోయి హీరోమీద దాడులు జరిపిస్తూంటాడు విలన్. కానీ హీరో తెలుసుకోడు. ఇలా పాసివ్  పాత్రగా కూడా తయారయ్యింది.

          కథలో వున్న మెలికని తెలుసుకుని ఆ ప్రకారం నడపకపోవడంతో ప్రధాన కథకంటే ఉప కథే ఎక్కువై మింగేసింది. విలన్ అగ్రి డైమండ్ కుట్ర వొకటే చేయలేదు, అందులోంచి బయట పడేందుకు మంత్రి కూతురైన హీరోయిన్ ని కోడల్ని చేసుకోవాలని కూడా కుట్ర చేస్తున్నాడు. అంటే కథా ఉపకథా కలిసి పోవాలన్న మాట. వ్యక్తిగతంగానూ విలన్ హీరోని దెబ్బ తీస్తున్నప్పుడు, ఇది హీరో తెలుసుకోక హీరోయిన్ తో ఎంజాయ్ చేయడం వల్ల, ఈ ఉపకథ ఉప కథ లాగే వుంటూ- అసలు రివెంజి కథ కన్పించకుండా పోయింది. ఎప్పుడో సెకండాఫ్ లో దుండగులు హీరో చెల్లెల్ని తగుల బెట్టబోయినప్పుడు, హీరో ఫ్రెండ్ ని వురి తీసినప్పుడు- ఇంకా జనాలకి బెదిరింపు కాల్స్ చేసినప్పుడు గానీ- హీరోకి  హీరోయిన్ తో చేస్తున్న మజా అంతా  ఎగిరిపోయి దారికి రాడు! ఎంతకీ కథలోకి రాని హీరో గార్ని ఇలా  కథలోకి లాగినట్టయ్యింది విలన్!  మావయ్య చావుకి హీరో బాధ్యుడు కాదు, కానీ తను చేయాల్సింది  వదిలేసి,  హీరోయిన్ తో మజా  చేసుకోవడం వల్లే చెల్లికీ ఫ్రెండ్ కీ ప్రాణాల మీది కొచ్చినట్టు కథనమూ,  పాత్రచిత్రణా తయారయ్యాయి. 

          ఇప్పుడు మళ్ళీ భీకర ప్రతిజ్ఞలు చేస్తాడు. ఇదెప్పుడో ఫస్టాఫ్ లోనే చేశాడు. సెకండాఫ్ మరీ దిగదుడుపుగా తయారయ్యింది. విషయంలేదు. విషయమంతా క్లయిమాక్స్ లో టెంప్లెట్ ప్రకారం ఫోక్ సాంగ్ తర్వాత విలన్ తో అమీ తుమీ తేల్చుకోవడమేనని తెలుసు. ఎందుకోసం ప్రేక్షకులు కూర్చోవాలో అర్ధంగాని సెకండాఫ్ ఇది. క్లయిమాక్స్ లో విలన్ కొడుకుగా సుబ్బరాజు మదర్ ప్రేమ క్యారక్టరైజేషన్ వల్ల ఫన్నీగా మారింది. ఈ మొత్తం బిగ్ కమర్షియల్ లో అనూహ్యంగా ఏదైనా వుందంటే అది ఈ క్లయిమాక్స్ ఒక్కటే.

          హరీష్ శంకర్ కీ ఇలా టెంప్లెట్ సినిమాలు తప్పేలా లేవు. దీని వల్ల అతడి దర్శకత్వ  ప్రతిభ ఏమిటో బయట పడ్డం లేదు. దృశ్యాల చిత్రీకరణలో వైవిధ్యం లేదు. ఐదు టెంప్లెట్ సినిమాల పరాజయాల తర్వాత డిజే పరిస్థితేమితో ప్రేక్షకులే నిర్ణయించాలి.

-సికిందర్
http://www.cinemabazaar.in


21, జూన్ 2017, బుధవారం

స్పెషల్ ఆర్టికల్!





        నేటి నియో నోయర్ లేదా డార్క్ మూవీస్ కి మాతృక బ్లాక్ అండ్ వైట్ ల కాలం నాటి  (1930-60) ఫిలిం నోయర్  అని చెప్పుకున్నాం. దీన్నే క్లాసిక్ నోయర్ అంటారు. కథా కథనాల పరంగా ఈ రెండిటికీ తేడా ఏమిటంటే, టెక్నాలజీ అభివృద్ధి చెందని ఆ కాలంలో బలమైన పాత్రచిత్రణలు చేసి, బరువైన కథనాలు చేసి ప్రేక్షకుల్ని కూర్చో బెట్టే వారు. తర్వాత టెక్నాలజీ అభివృద్ధి చెందాక పాత్ర చిత్రణల్ని, కథనాలనీ లైట్ తీసుకుని టెక్నికల్ గా ఆకర్షించడం మొదలెట్టారు. తెలుగుకి వస్తే, డార్క్ మూవీస్ కథనాల్లో హాలీవుడ్ నోయర్ రీతులన్నిటినీ అనుసరించడం కాసేపు ఆపి, స్థానిక అభిరుచుల్ని దృష్టిలో పెట్టుకుని, ఒక ‘లోకల్ నోయర్’ ని రూపొందించుకుంటే బావుంటుంది. చిత్రీకరణలో- అంటే ఎలిమెంట్స్ విషయంలో మాత్రం - ఫిలిం నోయర్- లేదా నియో నోయర్ రీతుల్నే  అవలంబించవచ్చు. హాలీవుడ్ లో నియో నోయర్ బిగ్ బిజినెస్. బిగ్ స్టార్స్, బిగ్  డైరెక్టర్స్ వీటికి పట్టం గడుతూంటారు. క్రిస్టఫర్ నోలన్ ‘మెమెంటో’ (2001- తెలుగులో ‘గజినీ’) తీసినా, లేదా  మార్టిన్ స్కోర్ససీ ‘షటర్ ఐలాండ్’  (2010) తీసినా,  1940 ల నాటి ఫిలిం నోయర్ రీతుల్ని  పరిశీలించే తీశామని చెప్పుకున్నారు. ఒక రిఫరెన్స్ లేకుండా ఒక అద్భుతం రాదు.    

          గత వ్యాసాల్లో డార్క్ మూవీస్ కథలు అప్పుడున్న సామాజిక పరిస్థితుల్లోంచి ఎలా పుడతాయో చెప్పుకున్నాం. ఏఏ పాత్రలుంటాయో చెప్పుకున్నాం. డార్క్ మూవీస్ కథలు సంపన్న వర్గాల కుసంస్కృతుల నుంచి పుడతాయి. డార్క్ మూవీస్ కథలు పర్సనల్ కథలు. ఆ వ్యక్తి లేదా ఆ కుటుంబానికి సంబంధించి మాత్రమే వుంటాయి. అదే మాఫియా గానీ, లేదా ఇంకే గ్యాంగ్ స్టర్ మూవీస్ కథలు గానీ మొత్తం సమాజాన్ని డిస్టర్బ్ చేసేవిగా వుంటాయి. వీటిని డార్క్ మూవీస్ కథలని పొరబడకూడదు. డార్క్ మూవీస్ కథలు పర్సనల్ కథలు. హిందీలో, తమిళంలో, మలయాళంలో  కూడా ఇలాగే తీశారు- కహానీ, కహానీ -2, పింక్, షైతాన్, జానీ గద్దార్, యాక్సిడెంట్ ఆన్ హిల్ రోడ్, 16- డి, సూదు  కవ్వం, నగరం, కనుపాప మొదలైనవి. 

          మోహన్ లాల్ నటించిన మలయాళ డబ్బింగ్ ‘బ్లాక్ మనీ’ డార్క్ మూవీ కాదు. ఇది ఒక మంత్రి చేసే రాజకీయ కుట్రకి సంబంధించిన యాక్షన్ థ్రిల్లర్.  డార్క్ మూవీస్ లో సీఎం, హోం మంత్రి, ఇంకో ప్రతిపక్ష నాయకుడు వంటి రాజకీయ పాత్రలకి స్థానం లేదు. వుంటే ‘పింక్’  లోలాగా కొడుకుని కాపాడుకునే పర్సనల్ కథగా వుంటాయి. అవికూడా సీఎం కొడుకు, హోం మంత్రి కొడుకు లాంటి పాత మూస ఫార్ములా పాత్రలై వుండవు. ఓ రాజకీయనాయకుడి కొడుకు, అంతే. రాజకీయ కుట్రలు చేసుకుని రాజకీయ, సామాజిక అస్థిరతలకి  పాల్పడే కథనాలు డార్క్ మూవీస్ లో వుండవు. కేవలం వ్యక్తిగత కథలే వుంటాయి. 

      ఫిలిం నోయర్ కాలంలో ప్రధానపాత్ర నేరాల్ని పరిశోధించే డిటెక్టివ్ లేదా పోలీస్ అధికారి పాత్ర, నేరంలో ఇరుక్కున్న సామాన్యుడి పాత్ర, యాంటీ హీరో పాత్ర...ఈ మూడు రకాలుగా వుండేది. నియో నోయర్ ప్రారంభమయ్యాక, మరికొన్ని నమూనాలు చేరాయి : లాయర్, రిపోర్టర్, రైటర్, ఫోటోగ్రాఫర్... ఎందుకంటే, ఈ పాత్రలకి నేరప్రపంచంలో చొచ్చుకు పోవడానికీ, పరిశోధించడానికీ వృత్తిపరమైన వెసులుబాటు,  చొరవ వుంటాయి.
          
       కాబట్టి తెలుగుకి వచ్చేసి, ఈ ప్రొఫెషనల్ పాత్రలు కాక, ఇష్టానుసారం పాత్రల్ని పెట్టుకుంటే జానర్ మర్యాదని దెబ్బతీస్తుంది. అది డార్క్ మూవీ అవదు. నల్గురు స్టూడెంట్స్ అడవిలోకి వెళ్లి ప్రమాదంలో ఇరుక్కునే టెంప్లెట్  హార్రర్, థ్రిల్లర్ సినిమాలు వస్తూంటాయి. ఈ స్టూడెంట్స్ ని డార్క్ మూవీస్ లో పెట్టి కథ నడిపితే జానర్ మర్యాద దెబ్బతినిపోతుంది. డార్క్ మూవీ అవదు. 2013 లో ఈ వ్యాసకర్త ఒక దర్శకుడికి డార్క్ మూవీ స్క్రిప్టు రాసినప్పుడు, పాతికేళ్ళు నిండని యంగ్ హీరో ప్రొఫెషనల్ గా ఏమీ కాకపోయినా, అతడికి లీ చైల్డ్ థ్రిల్లర్  నవలల పిచ్చి వున్నట్టు పాత్రచిత్రణ చేయడం జరిగింది. అతను లీ చైల్డ్ ని వూ హించుకుని సంభాషిస్తూంటాడు కూడా. కాబట్టి క్రైం వరల్డ్ తో ఈ సాహిత్య స్పర్శతోనే అతడికి నల్గురు దుష్ట ఇన్స్ పెక్టర్లని ఎదుర్కొనే తెలివి, తెగువా సమకూరినట్టు చిత్రించడం జరిగింది. బాధిత పాత్ర అయినప్పటికీ  (నేర) కథాప్రపంచంలో పాల్గొనడానికి దానికో క్వాలిఫికేషన్ ఇవ్వడంజరిగింది. 

          కాబట్టి డార్క్ మూవీస్ కథా ప్రపంచంలో జరిగే ‘బిజినెస్’ లో ఇమిడే సజాతి పాత్రలుండాలి.  పాప్  మ్యూజిక్ కార్యక్రమంలో జానపద గాయకుడు వచ్చి పాడినట్టు విజాతి పాత్రలుండకూడదు. ఈ వ్యాసకర్త ఇంకో డార్క్ మూవీ స్క్రిప్టు రాసినప్పుడు ఆ హీరో, అతడి ఫ్రెండ్ న్యూస్  ఛానెల్ నిఘా టీం పాత్రలయ్యాయి. డిటెక్టివ్ పాత్రలకి తెలుగు నేటివిటీ లేదని చెప్పుకున్నాం. ఆ డిటెక్టివ్ కి ప్రత్యాన్మాయాలే పోలీసు అధికారి, లాయర్, రిపోర్టర్, రైటర్, ఫోటోగ్రాఫర్ మొదలైన నేటివిటీ కలిసే పాత్రలు.

***
         డార్క్ మూవీస్ ని బిగ్ స్టార్స్, బిగ్ డైరెక్టర్లే కాదు, గొప్ప గొప్ప మేధావులూ పట్టించుకున్నారు. డార్క్ మూవీస్ ఒక పెద్ద శాస్త్రం. అసంఖ్యాక  అధ్యయనాలూ గ్రంధాలూ కోర్సులూ ఇప్పటికీ వెలువడుతూంటాయి. ఈ సమాచారారణ్యంలోంచి తెలుగు నేటివిటీకి నారు తీసుకొచ్చి నాట్లు వేయాలంటే మాటలు కాదు.  తెలుగు నేటివిటీతో బాటు, చూసే ప్రేక్షకులెవరనేది కూడా దృష్టిలో పెట్టుకోవడం అవసరం. ఒకప్పుడు వున్నట్టు ఇప్పుడు పాఠక  ప్రపంచం లేదు, ప్రేక్షక ప్రపంచమే వుంది. పాఠక ప్రపంచం వున్నప్పుడు లోతైన కథలు, పాత్రలు, సమస్యలు సినిమాల్లో వుండేవి.  ప్రేక్షక ప్రపంచంగా మారేక, ఇవన్నీ అప్రస్తుతాలై పోయాయి. ఈ సినిమాలో ఈ హీరో తానుగా నిర్ణయం తీసుకోక,  మరొకరు చెప్తేనే యాక్షన్ లోకి దిగాడు కదాని పాత్ర చిత్రణ చెప్తే - ఐతే ఏంటి అనేస్తున్నారు. అది అవుట్ డేటెడ్ పరిశీలన అంటున్నారు. డెప్త్ వుంటే అవుట్ డేటెడ్, డెప్త్ లేకపోవడం అప్ డేటెడ్. కాబట్టి ఫిలిం నోయర్ కథనాల్లోని బరువైన విషయాల్ని  తెలుగులో దించితే ఇప్పుడు లాభించదు.
            నియో నోయర్ మూవీస్ ని చూసే ముందు వీటి మాతృకలైన ఫిలిం నోయర్ మూవీస్ ని కూడా చూడాలి. 

          1.  నియో నోయర్ మూవీస్ అస్తిత్వ సమస్యలు, ప్రభుత్వ విప్లవాత్మక నిర్ణయాలు ( పెద్ద నోట్ల రద్దు వంటివి), టెక్నాలజీతో వచ్చే సమస్యలు, మెమరీ కి సంబంధిన సమస్యలు మొదలైన వాటితో వుంటున్నాయి. ఫిలిం నోయర్ కాలంలో హత్యల  చుట్టూ వుండేవి.

          తెలుగుకి సేఫ్ బెట్  : హత్య, లేదా హత్యాయత్నం, లేదా కిడ్నాప్ చుట్టూ కథలు (కహానీ, కహానీ -2, పింక్, షైతాన్, జానీ గద్దార్, యాక్సిడెంట్ ఆన్ హిల్ రోడ్, 16- డి, సూదు కవ్వం, నగరం, కనుపాప మొదలైనవి). 

          2. నోయర్ మూవీస్ కుట్రకి పథకం పన్నడంతోనో, హత్యకేసు పరిశోధన చేపట్టడంతోనో ప్రారంభమవుతాయి. హింసాత్మక ఘటన ప్రారంభంలో ఒకసారి జరిగి, మళ్ళీ చివర్లో ముగింపులో వుంటుంది. హింస రెండు మూడు సంఘర్షిస్తున్న పాత్రల మధ్య వ్యక్తిగతంగానే  వుంటుంది. అదే యాక్షన్ మూవీస్ లోనైతే  అనేక హింసాత్మక ఘటనలు జరుగుతూనే  వుంటాయి. ఇవి సమాజాన్ని అట్టుడికిస్తూంటాయి. నోయర్ మూవీస్ లో సామాజిక మార్పులు పాత్రలకి ఎఫెక్ట్ అవుతూంటాయి. వేలకోట్లు సంపాదించిన పాత్రకి ఆ డబ్బు ప్రపంచీకరణ వల్లే వచ్చింది. దాంతో అతడి జీవన శైలి మారిపోయింది. పబ్ లో రాత్రంతా ఎంజాయ్ చేసి హై ఎండ్ కారులో దూసుకెళ్ళి  పిల్లర్ కో, పిల్లాడికో గుద్దాడు. ఆ నేరం లోంచి తప్పించుకోవడానికి ఎత్తుకు పై ఎత్తులేశాడు...

         తెలుగుకి సేఫ్ బెట్ :  కుట్రతో మొదలెట్టుకోవచ్చుగానీ, హత్యకేసు దర్యాప్తుతో మొదలెడితే అది ఫ్లాష్ బ్యాక్ కి దారి తీస్తుంది. హత్య ఎలా జరిగిందో ఫ్లాష్ బ్యాక్ లో అదంతా చెప్పుకు రావాల్సి వస్తుంది. అత్యధిక నోయర్ మూవీస్ ఇలాటి ఫ్లాష్ బ్యాక్సే. కాబట్టి జరిగిపోయిన హత్య కేసు దర్యాప్తుతో మొదలెట్టడం కంటే, హత్య జరిపించి మొదలెట్టడం మంచిది. లైవ్ గా వుంటుంది. ‘జానీ గద్దార్’ హత్యతో మొదలై దాని పుట్టుపూర్వోత్తరాల ఫ్లాష్ బ్యాక్ కి వెళ్తుంది. తమిళ డబ్బింగ్  ‘16-డి’ హత్యతో మొదలై, ఐదేళ్లు ముందు కెళ్తుంది కథ. అక్కడ్నించీ దర్యాప్తు మొదలవుతుంది. ‘జానీ గద్దార్’ ఫ్లాష్ బ్యాక్ కథ అయితే, ‘16- డి’  ఐదేళ్ళ తర్వాత రియల్ టైం స్టోరీ. ఇది లైవ్ గా వుంటుంది. ఇప్పుడు జరుగుతున్న కథ ఆసక్తిగా వుంటుంది ఎప్పుడైనా. 

          3. నోయర్ మూవీస్ లో అనుకోని ప్రమాదాలతో కథలు  మొదలవుతాయి. బిల్లీ వైల్డర్ తీసిన  ‘సన్ సెట్ బోలెవార్డ్’ (1950 ) లో పన్నెండో నిమిషంలో ప్లాట్ పాయింట్ వన్ వచ్చి కథ మొదలవుతుంది. అప్పుల వాళ్ళు కారు స్వాధీనం చేసుకోవాలని హీరోని వెంటాడు తూంటారు. కారు టైరు  పేలడంతో హీరో ఒక బంగాళా లోకి టర్న్ తీసుకుని తప్పించుకుంటాడు. ఆ బంగళా లోనే అతడి కథ మొదలవుతుంది.

          తెలుగుకి సేఫ్ బెట్ : యధాతథంగా తీసుకోవచ్చు. ‘పింక్’ లో హత్యాయత్నంగా మారిపోయే అనుకోని ఆత్మరక్షణా ప్రయత్నం, ‘షైతాన్’ లో అనుకోని కారు ప్రమాదం మొదలైనవి. 

          4. నోయర్ లో  సుఖాంతాలే వుండవు, దుఖాంతాలూ ఎదురవుతాయి. బాధితుడైన హీరో చనిపోయే కథలుంటాయి (సన్ సెట్ బోలెవార్డ్),  యాంటీ హీరోలు బతికి బాగుపడే కథలుంటాయి. హీరోని ట్రాప్ చేసే వాంప్ చనిపోయే ముగింపు (డబుల్ ఇండెమ్నిటీ) కూడా వుంటుంది. 

         తెలుగుకి సేఫ్ బెట్ :  హీరోకి సుఖాంతం. యాంటీ హీరోకి దుఃఖాంతం. యాంటీ హీరో రిస్కీ పాత్ర. ఒకర్ని  చంపి తను చనిపోతే బ్యాలెన్స్ అవుతుంది. లేదా ‘కహానీ -2 లోలాగా  ప్రత్యర్ధిని చంపిన హీరోయిన్ని పోలీసు అధికారి తప్పించేసినట్టు  సుఖాంతం చేయవచ్చు. కానీ ఒక హత్య చేసే యాంటీ హీరో తెలివితేటలతో చట్టాన్నుంచి తప్పించుకున్నట్టు ముగిస్తే రిస్కే. 

          5. నోయర్ లో యాంటీ హీరోయిన్ హీరోని ట్రాప్ చేసి తన ఎదుగుదలకి వాడుకుంటుంది (డబుల్ ఇండెమ్నిటీ). ఆమె ప్రేమిస్తోందనుకుని హీరో గాఢంగా ప్రేమించి మోసపోతాడు. కుట్ర బుద్ధితో చివరికామె అరెస్ట్ అవచ్చు, చనిపోవచ్చు.
          తెలుగుకి సేఫ్ బెట్ :  యధాతథంగా తీసుకోవచ్చు.

          6. నోయర్ సినిమాలు ఎక్కువగా వర్తులాకార కథనంతో వుంటాయి. అంటే ఒక సంఘటనతో మొదలై,  ఫ్లాష్ బ్యాక్ కి వెళ్లి,  మళ్ళీ ఆ సంఘటన దగ్గరికొచ్చి ముగియడం. 

          తెలుగుకి సేఫ్ బెట్ : మొత్తం కథ ఫ్లాష్ బ్యాక్ లో చెప్పడం పాత పద్ధతి. ప్రత్యక్షంగానే కథ చెబుతూ ఎక్కడైనా అవసరముంటే ఫ్లాష్ బ్యాక్ చూపించ వచ్చు. 

          7. చాలా నోయర్ మూవీస్ ఎక్కువగా స్వగతంతో ప్రారంభవుతాయి. కథనంలోనూ అక్కడకడా స్వగతం వస్తూంటుంది. స్వగతంతోనే ముగుస్తుంది.   
       
          తెలుగుకి సేఫ్ బెట్ :  స్వగతం అవసరంలేదు. హీరో తన గురించి తాను చెప్పుకుంటూంటే అబద్దాలు చెప్పడం లేదని ఎలా నమ్మాలి? అతడి స్వగతానికి విశ్వసనీయత ఏమిటి? కనుక ఈ ఆత్మకథ చెప్పుకోవడం, ఆత్మాశ్రయ ధోరణి ప్రదర్శించడం అవసరం లేదు. పైగా ఇది కథనాన్ని బరువెక్కిస్తుంది. సినిమా విజువల్ మీడియా, ఆడియో ప్రసారం కాదు. కనుక రచయిత / దర్శకుడు మాత్రమే హీరో కథ చెప్తే నమ్మదగినదిగా, తేలికగా వుండే అవకాశముంది. 

          8. నోయర్ మూవీస్ డైలాగులు పంచ్ లతో కవితాత్మకంగా వుంటూ, మరోవైపు కొత్త పదాల్ని కాయిన్ చేస్తూ రఫ్ అండ్ టఫ్ గానూ, హస్యాయుతంగానూ  వుంటాయి. ఉదాహరణకి : Ameche: Telephone, Barber: Talk, Bean-shooter: Gun,  Beezer: Nose,  Berries: Dollars,  Big house: Jail, Blip off: To kill, Cabbage: Money,  Chicago lightning: gunfire…ఇలా నోయర్ మూవీస్ సృష్టించిన  పదాలకి డిక్షనరీలే వున్నాయి. 

         
తెలుగుకి సేఫ్ బెట్ :  ఇతర సినిమాల్లో రొటీన్ గా వాడుతున్న తోపు, క్లారిటీ, మావా, బావా, జఫ్ఫా లాంటి మాటలు తెలుగు నోయర్ లో వాడేస్తే  శబ్దపరంగా జానర్ మర్యాద మంట గలిసి పోతుంది. సృష్టించ గలిగితే  ఫ్రెష్ పదాల్ని ఫన్నీగా కాయిన్ చేయాలి. డైలాగులు కవితాత్మకంగా వుండనవసరం లేదు, బావుండదు కూడా. అదే సమయంలో సినిమాటిగ్గానూ వుండకుండా రియలిస్టిక్ గా వుంటే మంచిది. డైలాగుల్ని పాలిష్ చేస్తూ ఎన్ని సార్లు తిరగరాస్తే అంత మంచిది. క్రిస్టఫర్ ‘మెమెంటో’  కి పదిహేడు సార్లు తిరగరాశారు. వారం రోజులో డైలాగ్ వెర్షన్ రాసి అవతల పడేసే వాళ్ళున్నారు. అదిక్కడ కుదరదు. ఈ జానర్ ని అర్ధం చేసుకున్న రచయిత / దర్శకుడు మాత్రమే కనీసం రెండు నెలల సమయం తీసుకుంటే గానీ డార్క్ మూవీ డైలాగ్ వెర్షన్ రాదు.

         
9. నోయర్ పాత్రల మానమర్యాదల గురించి  క్రిమినాలజిస్టు నికోల్ రాఫ్టర్ మాట ల్లో...నోయర్  సినిమాలు అధోగతి పాలైన ప్రపంచానికి అద్దం పడతాయి.ఇందులో ప్రతీ ఒక్కరికీ ఏదో పాపం అంటుకునే  వుంటుంది. అదేసమయంలో నిరాశా నిస్పృహలతో వుంటారు. నోయర్ సినిమాల్లో హీరో హీరోయిన్లు అనే మాటకి తావులేదు- ప్రతీ ఒక్కరూ తమ తమ దుర్బుద్ధులతో స్వార్ధంగా బతికెయ్యడానికి ప్రయత్నిస్తారు.
          ఇంకో విధంగా నోయర్ సినిమాల ఫిలాసఫీని ఈ కింది పంక్తుల్లో చూడొచ్చు :
         
          Birds abandon a tree whose fruits are gone,
                   swans abandon a pond that has dried up.
                   A woman abandons a man of no means,
                   counselors abandon a fallen leader.
                   Bees abandon a flower that’s lost its freshness,
                   deer abandon a forest that’s been burned.
                   Every one has an agenda;
                   who is appreciative, who is whose beloved?

(Translated from Sanskrit by Thomas Cleary)

          తెలుగుకి సేఫ్ బెట్ :  శాశ్వత సత్యమిది. సార్వజనీనమైనది.

***
        కథనంలో పైన సూచించిన సేఫ్ బెట్లు మార్చుకోవాలన్పిస్తే  మార్చుకోవచ్చు. జానర్ మర్యాదా, నేటివిటీ, టార్గెట్ ప్రేక్షకులూ అనుమతించిన మేరకు మార్చుకోవచ్చు. కథనం మీద ఎవరికైనా పూర్తి  క్రియేటివ్ స్వేచ్ఛ వుంటుంది.  అయితే డార్క్ మూవీస్ తో ఎలా పడితే అలా క్రియేటివ్ స్వేచ్ఛ  తీసుకోలేరు. వేరే డైలాగులెందుకు, రొటీన్ తోపు, క్లారిటీ...లాంటివి పెట్టేద్దామనుకుంటే అప్పుడు డార్క్ మూవీ శిల్పం, జానర్ మర్యాదా  చెడతాయి. ఫ్లాష్ బ్యాక్ తో మొదలెడితే ఏమౌతుంది - అనుకుంటే శిల్పం చెడకపోవచ్చు, కానీ టార్గెట్ ప్రేక్షకులకి రుచించదు. హీరో స్వగతంతోనే కథ నడిపిద్దామనుకుంటే  అదీ టార్గెట్ ప్రేక్షకులకి నచ్చక పోవచ్చు. 

          కథకి స్ట్రక్చర్ అనేది ఏ తరహా కమర్షియల్ సినిమాకైనా మారేది కాదని తెలిసిందే. స్ట్రక్చర్ వేరు, క్రియేటివిటీ వేరని చాలా సార్లు చెప్పుకున్నాం. స్ట్రక్చర్ కి నియమాలుంటాయి. క్రియేటివిటీకి వుండవు. ఎవరి అభిరుచుల్ని బట్టి వాళ్ళ క్రియేటివిటీని ప్రదర్శించుకుంటారు. అయితే కథలో మొదటి మలుపు అరగంటలోనే ఎందుకు రావాలి- చెప్పడానికి అరిస్టాటిల్ ఎవరు- సిడ్ ఫీల్డ్ ఎవరు- నా క్రియేటివిటీ నా ఇష్టమని తీసికెళ్ళి క్లయి మాక్స్ దగ్గర పెడితే, అది క్రియేటివ్ చమత్కృతి అవదు. మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అవుతుంది. ఎందుకంటే స్ట్రక్చర్ ని చెడ గొట్టారు కాబట్టి. అందుకే  స్ట్రక్చర్ వేరు, క్రియేటివిటీ వేరు. స్ట్రక్చర్ మీద క్రియేటివ్ ప్రతాపం చూపించలేరు. ఆ స్ట్రక్చర్ మీద కథ అల్లుకోవడం మీదే క్రియేటివ్ ప్రతిభా వ్యుత్పత్తులు దండిగా ప్రదర్శించు కోవచ్చు. ఫ్లాష్ బ్యాకులు పెట్టుకుంటారో, స్వగతాలు పెట్టుకుంటారో ఇంకేం  పెట్టుకుంటారో పెట్టుకోవచ్చు. అయితే డార్క్ మూవీస్ ఈ క్రియేటివ్ స్వేచ్ఛ కూడా ఇవ్వడం లేదు. అదీ పాయింటు!  క్రియేటివిటీ ని కూడా ఇలాగే వుండాలని కొన్ని నియమాలు పెట్టి శాసిస్తున్నాయి. ఇది అర్ధం జేసుకున్నప్పుడే డార్క్ మూవీస్  కథనాల్ని డార్క్ మూవీస్  కథనాలుగా చేసుకోగలరు.

-సికిందర్








         









         


18, జూన్ 2017, ఆదివారం

రివ్యూ!



రచన -నిర్మాణం - దర్శకత్వం:  పట్టాభి ఆర్‌. చిలుకూరి   
తారాగణం:  పూజా దోషి, హరీష్కల్యాణ్, సాయిరోనక్, సంధ్యా జనక్, షర్మిల,  మోహన్రామన్, సుదర్శన్ తదితరులు
సంగీతం:  ప్రసన్-ప్రవీణ్- శ్యామ్ , కెమెరా:  శేఖర్వి. జోసెఫ్ , బ్యానర్ :   అనగనగా ఫిలిం కంపెనీ 
విడుదల : జూన్ 16, 2017
***
          
         కొత్త హీరో హీరోయిన్లతో కొత్త కొత్త దర్శకుల ప్రేమ సినిమాలు ప్రతీ వారం విధిగా విడుదలవుతున్నాయి. మొన్నటి దాకా నాల్గు ఆటలు పడే ప్రేమ సినిమాలు సింగిల్ స్క్రీన్ థియేటర్ లలో సైతం నేడు రెండు ఆటలకి పడిపోయాయి. ఈ రెండాటలకి కూడా ముగ్గురు నల్గురు చొప్పున ప్రేక్షకులు వుంటున్నారు. ఇంకెందుకు ఈ ప్రేమ సినిమాలు తీస్తున్నట్టు? ఈ కొత్త దర్శకుల, నిర్మాతల హిడెన్ ఎజెండా ఏమైనా వుందా? వుంటే మంచిదే. ఇంకో రకంగా లాభ పడుతున్నారనుకోవచ్చు-  థియేటర్ల క్యాంటీనుల  పార్కింగుల ఆదాయాలకి గండి కొట్టి. లేకపోతే  మాత్రం ప్రేమ సినిమాల కుటీర పరిశ్రమ ఎత్తేసి, ఇంకో రకం సినిమాలతో స్టార్ట్ అప్స్ ప్రారంభించుకోవాల్సిన అవసరం లేదా? దేశాన్ని- పోనీ రెండు రాష్ట్రాల్ని  ఎటు తీసికెళ్దా మనుకుంటున్నారు సాంస్కృతికంగా?

        ఈ వారం ఇలాటి కొత్త దర్శకుల జాబితాలో చేరుతూ,  నిర్మాత కూడా తానే అయి పట్టాభి ఆర్. చిలుకూరి  మరో ప్రేమ సినిమాతో వచ్చారు. దీనికి కేటీఆర్, రాం చరణ్ లతో ప్రమోట్ కూడా చేయించుకున్నారు. తీరా థియేటర్లలో చూస్తే పైన చెప్పుకున్న పరిస్థితే వుంది. కేటీఆర్, రాం చరణ్ లు పరిస్థితిని  ఏమీ మార్చలేక పోయారు. తమ పరిస్థితే ప్రశ్నార్ధకమైంది.  ఇలా వచ్చిన మరో ప్రేమ సినిమా ‘కాదలి’,  కొత్త హీరో హీరోయిన్లతో మరో ముక్కోణ ప్రేమ కథ. ముందు కథెలా వుందో చూద్దాం...

కథ 
      బాంధవి (పూజా దోషి) ఒక ఫిజియో థెరఫిస్టు. తల్లి దండ్రులకి తన సంపాదనే దిక్కుగా వుంటుంది. ఎన్నో పెళ్ళిచూపులకి కూర్చుంటుంది. వస్తామన్న వాళ్ళు రారు. కుటుంబం మీద వున్న అప్పులు చూసి వెనుకాడతారు. తనకసలు పెళ్లవుతుందా అన్న బెంగ పట్టుకుంటుంది. బామ్మ ఒక సలహా ఇస్తుంది. ఈ పెళ్లి చూపుల కంటే బయటే  ఎవరో ఒకర్ని నచ్చిన వాణ్ణి చూసి చేసుకోమంటుంది. బాంధవి ఫ్రెండ్ కూడా దీనికి సపోర్టు చేస్తుంది.

          ఫ్రెండ్ తో కలిసి బాంధవి రెస్టారెంట్ కి వెళ్తుంది. అక్కడున్న కార్తీక్ (హరీష్ కల్యాణ్) చూడగానే నచ్చుతాడు. మాట కలిపి స్నేహం చేసి ప్రేమించడం కూడా చేస్తుంది.  కార్తీక్ ఎప్పుడే వృత్తి చేస్తూంటాడో తెలీదు. పైగా కోపం వచ్చినా,  సంతోష మేసినా ఇంట్లోంచి వెళ్ళిపోతాడు. అలా ఇంట్లోంచి వెళ్ళిపోయి కనపడకుండా పోయిన కార్తీక్ గురించి వర్రీ అవుతూంటే, క్రాంతి (సాయి రోనక్) అనే ఇంకో యూత్ తారస పడతాడు. 

          ఇతడి మీద ఇష్టం పెంచుకుని తిరుగుతుంది. ఇతడికి సవతి తల్లి కారణంగా కోపమెక్కువ. ఎప్పుడెవర్ని కొడతాడో తెలీదు. కోపం తగ్గించుకోమని సలహా ఇస్తే వెళ్లి ధ్యాన శాలలో చేరతాడు. ఇంతలో కార్తీక్ తిరిగి వస్తాడు. బాంధవి తికమకలో పడిపోతుంది. ఇప్పుడు తనని ప్రేమిస్తున్న ఇద్దర్లో ఎవర్ని చేసుకోవాలి?  అదెలా చెప్పాలి?
          ఇదీ కథ. 

ఎలావుంది కథ 
       దీన్ని ‘అమీ తుమీ’ లాగా పక్కా రోమాంటిక్ కామెడీ చేసి సొమ్ములు చేసుకుందా మనుకోలేదు. రోమాంటిక్ డ్రామా చేశారు. కొత్త వాళ్ళతో రోమాంటిక్ డ్రామాలు చూసే ఓపిక ఎప్పుడో పోయింది. వీణ సినిమాలు పోయి, గిటార్ సినిమాలు రావాల్సిన కాలం నడుస్తోంది. కాలానుగుణంగా  ‘అమీతుమీ’ గిటార్ వాయించింది. తెలుగులో రోమాంటిక్ కామెడీలు తీయలేకపోతున్నారు. చేయి వంకర్లు పోయి సగం నుంచి  రోమాంటిక్ డ్రామాలుగా మారిపోయి అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి.  తెలుగు రోమాంటిక్ డ్రామాలు అవే రెండు రకాలు : ప్రేమిస్తున్నానని చెప్పలేక గింజుకు చావడం, ఇద్దర్లో ఎవర్ని చేసుకోవాలో తెలీక తన్నుకు చావడం. ప్రేమికుల సందేహాలు తీర్చే పూజా బేడీ ఒక్క మాటలో తేల్చి పారేస్తుంది ఇలాటి సమస్యల్ని. కానీ రెండు గంటల నసగా తీస్తే తప్ప తనివితీరడం లేదు కొత్త దర్శకులకి.  

          ‘కాదలి’ (అంటే ఏమిటో?)  ముక్కోణ జాతికి చెందింది. ఇద్దర్లో ఎవర్ని చేసుకోవాలన్న ధర్మ సందేహం. ఈ పాత్ర విరివిగా వస్తున్న తెలుగు ప్రేమ డ్రామాలు చూడడం లేదు కాబోలు, చూస్తే మాత్రం సెంటిమెంటు ప్రకారం  మొదట దగ్గరైన వాడ్నే చేసుకోవాలని చప్పున గుర్తించేది. 

          కథ కొన్ని వందల సినిమాల పాతదే. కొత్త ప్రతిపాదన లేమీ లేవు. పాతని పాతలాగే పరిరక్షిస్తూ టెంప్లెట్ ప్రేమ డ్రామాకి  పూర్తి న్యాయం చేశారు.

ఎవరెలా చేశారు 
     ఇది హీరోయిన్ కథ. కానీ హీరోయిన్ ఎంపిక మాత్రం ఎంపికలా లేదు. ఎత్తైన హీరోల మధ్య ఆమె చంకలదాకా కూడా రావడం లేదు. పైగా సన్నం. మేడ్ ఫర్ ఈచ్ అదర్ కి ఫర్లాంగు దూరం. లాంగ్ షాట్ పెడితే  అంతేసి ఎత్తుగా హీరోలే కన్పిస్తారు తప్ప ఆమె కన్పించదు. ఆమెని కింద వెతుక్కోవాలి. ఇలా పెట్టి షాట్స్ తీయకూడదని కూడా దర్శకుడు అనుకోలేదు. ప్రేమ కథకి ఇదేం సెలెక్షనో అర్ధం కాదు. ఆమె రికమెండేషన్ మీద వస్తే విధిలేక పెట్టుకున్నట్టుంది. అయితే కొత్త హీరోయిన్ పూజా దోషికి నటించగల టాలెంట్ వుంది. ఆమెది లవ్లీ ఫేస్. నవ్వినప్పుడు క్లోజప్ లో సొట్ట బుగ్గలతో ప్రీతీ జింటాని గుర్తుకు తెస్తుంది. అయితే నస పెట్టే పాత్ర కావడంతో ఆమె పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నీ కాసేపటికి వికర్షించడం మొదలెడతాయి. 

          ఫస్ట్ హీరో
హరీష్కల్యాణ్, సెకండ్ హీరో సాయి రోనక్ లు ప్రదర్శించడానికి పాత్రలకి ప్రత్యేకత లేం లేవు. రొటీన్ లవర్ బాయ్స్. హరీష్ పాత్ర మధ్య తరగతి పాత్రయితే, సాయి పాత్ర ఉన్నత తరగతి పాత్ర. ఆరడుగుల ఈ ఇద్దరూ తమ చంకల దాకా రాని అమ్మాయి గురించి కొట్టుకోవడం విచిత్రంగా వుంటుంది. ఇక వీళ్ళ తల్లి దండ్రుల పాత్ర ధారులు కూడా కొత్త వాళ్ళే. 

          కెమెరా వర్క్ ఓ మాదిరిగా వున్నా, హీరోయిన్ మీద చిత్రీకరించిన పాటలు రెండు బావున్నాయి. ఈ లో-  బడ్జెట్ కి ప్రొడక్షన్ డిజైన్ పరంగా సృజనాత్మకంగా అలోచించ కపోవడంతో, పెద్ద సినిమాల విజువల్స్ పేదవాడు తీసినట్టు వున్నాయి.

 చివరికేమిటి 
      ఫీలింగ్స్ తో పని వుండని  ‘అహ నా పెళ్ళంట’, ‘అమీ తుమీ’ లాంటి పక్కా రోమాంటిక్ కామెడీల్లో  నవ్వించడమే ప్రధానం కాబట్టి  లాజిక్ లు ఎగేసినా చెల్లుతుంది. ఫీలింగ్స్ తోనే పండే రోమాంటిక్ డ్రామాల్లో లాజిక్ లు, లాజికల్ గా  వుండే పాత్రల జీవితాలూ లేకపోతే ఒప్పించడం కష్టం. ఈ రోమాంటిక్ డ్రామాలో కథ హీరోయిన్ దైనప్పుడు ఆమె పాత్రని సహేతుకంగా ఎక్కడా ఎస్టాబ్లిష్ చేయలేదు. ఆమె కుటుంబ పరిస్థితుల నేపధ్యంలో ఆమె పెళ్లి నిర్ణయాలు తీసుకోజాలదు. కుటుంబం అప్పులపాలై,  తండ్రికి సంపాదనా లేక, కుటుంబానికి తన సంపాదనే దిక్కయినప్పుడు- పెళ్లి గురించి ఆలోచిస్తే, కుటుంబాన్ని ఎవరు చూస్తారు? తండ్రి కూడా ఏం పెట్టి పెళ్లి చేద్దామని అన్నేసి సంబంధాలు చూస్తున్నాడు? కాబట్టి ఎంత కాదన్నా హీరోయిన్ ‘అంతులేని కథ’ సిట్యుయేషన్ లో ఉన్నట్టే.  తన జీవితం తను చూసుకుని వెళ్లి పోతానంటే అది వేరు. కానీ కథా నాయికకి బావుండదు. బాంధవి అన్నాక కుదరదు.

          కూతురి సంపాదన తల్లి కూడా తింటూ అన్నం తింటున్న తండ్రిని దుయ్యబట్టడం ఇంకో అర్ధం లేని దృశ్యం. చచ్చిన పాములాంటి తండ్రిని ఇంకా ఎందుకు చంపుతున్నారంటే, తద్వారా కూతురు ఆయనకి అన్నం తినిపించే సెంటి మెంటు పండుతుందని!  ఈ పే ఆఫ్ కోసం సెటప్ ని హేళన చేశారు.

          హీరోయిన్ పాత్రతో దర్శకుడు ఏం చేయాలనుకున్నాడో స్పష్టత లేదు. పెళ్లి చేయాలంటే ఆర్ధిక సమస్యలున్నట్టు చూపించారు. మరో వైపు ఆమె పెళ్లి చేసుకుంటే కుటుంబానికి దిక్కేమిటో  చెప్పడం లేదు. ఆమె కథానాయికే అయితే ఈ పరిస్థితుల్లో పెళ్ళే చేసుకోనంటుంది. కుటుంబం కోసమో, అప్పులు తీర్చడం కోసమో కష్టపడుతుంది. ఎప్పటిదాకో మనకి తెలీదు, దైవాధీనం!  బాలచందర్ ‘అంతులేని కథ’, మహాశ్వేతా దేవి నవల ఆధారంగా తీసిన హిందీ ‘తపస్య’ కి కోదండ రామిరెడ్డి చేసిన రీమేక్ ‘సంధ్య’ లాంటి సినిమాలు దర్శకుడు చూశారో లేదో తెలీదు. 

          బామ్మ తన బాధలోంచి చెప్పి వుండొచ్చు- ఇదంతా కాదు, బయట ఎవర్నో చూసుకుని చేసుకోమని.  కానీ హీరోయిన్ అన్నాక అలా చేస్తుందా? అలా చేస్తే, మళ్ళీ బ్యాక్ టు పెవేలియనే అవుతుంది. బయట ప్రేమించే వాడు ఈమె వెనక ఏముందో చూస్తే మళ్ళీ మొదటికేగా? కుటుంబ పరిస్థితి దాచి పెట్టి  అబ్బాయిల్ని ట్రాప్ చేయడానికి హీరోయిన్ బయల్దేరడ మేమిటి. అసలు పెళ్లి ఖర్చులకి కూడా డబ్బులున్నట్టు లేదు. ఇలా బకరాల్ని పట్టే హీరోయిన్ పాత్ర కామేడీకి బావుండొచ్చు. 

          బామ్మ  మాట పట్టుకుని ఫ్రెండ్ తో బయల్దేరిన హీరోయిన్, రెస్టారెంట్ కెళ్తుంది. అక్కడ ఒకతన్ని చూసి ఆగిపోయి గుసగుస లాడుకుంటారు ఇద్దరూ. బావున్నాడు వెళ్లి మాట కలుపు- అని ఏదో చెప్పి ముందుకు తోస్తుంది ఫ్రెండ్. హీరోయిన్ ఆ ముక్కూ మొహం తెలీని హీరోని పెళ్లి కొడుకుగా గా ఫిక్స్ చేసుకుని వెళ్లి పరిచయం చేసుకుంటుంది. ఇక్కడ ఆమె పాత్ర పూర్తిగా పడిపోయింది. ఇదెలా వుందంటే బజారు కెళ్ళి ఎవడు కన్పిస్తే వాణ్ణి మొగుడిగా షాపింగ్ చేసుకుని వద్దామన్నట్టుంది. 

          ఇలా బేస్ సరీగ్గా వుండని పాత్రలు, సన్నివేశాలే సినిమా నిండా. ఈ హీరో కన్పించకుండా పోతే ఫోన్ చేయవచ్చు కదా?  అసలలా కోపమొచ్చినా, సంతోష మేసినా వూరొదిలి వెళ్ళిపోయే వాడు తన కెందుకు? అంత ప్రేమిస్తే రెండో హీరోని చూడగానే మళ్ళీ ఇతన్ని ఆశ పెట్టడం ఎందుకు, కోపిష్టి అయిన ఇతన్ని వదిలెయ్యక? మళ్ళీ మొదటి హీరో రాగానే ఇద్దరితో  ఇరకాటంలో పడ్డ మెందుకు? అసలు బలాదూరు తిరిగే మొదటి హీరోది ఎలాటి ప్రేమ? మళ్ళీ చెప్పకుండా వారణాసి చెక్కేస్తే ఇంకెందుకా  దేశదిమ్మరి?  ఇతనే కావాలనుకుంటే ఇంటర్వెల్లో రెండో హీరోకి చెప్పేస్తే తీరిపోతుందిగా సమస్య. సెకండాఫ్ కి లేని కథని సాగదీయడం ఎందుకు - కేవలం ఈ మాట చెప్పడానికి? 

          లైటర్ వీన్  ప్రేమ సినిమాలు సకాలంలో పాయింటుకి రావు. వస్తే అప్పుడే కథ ముగిసిపోతుందని తెల్సు. అందుకే క్లయిమాక్స్ దాకా పాయింటుకి రాక సాగదీస్తారు. క్లయిమాక్స్ దగ్గర పాయింటు కొచ్చి, ఐదు నిముషాలు సంఘర్షణ పెట్టి తీర్చేసి,  ముగించేస్తారు. అంటే మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అన్నమాట. కథ ఉంటేగా మిడిల్ ఉండడానికి. కథ క్లయిమాక్స్ లో ఐదు నిమిషాలే వుంటుంది. అప్పటిదాకా నడిచేది స్క్రీన్ ప్లేలో బిగినింగ్ విభాగమే. అందుకే మలుపులేమీ కన్పించవు. బిగినింగ్ విభాగాన్ని సాగదీస్తున్నంత సేపు కథలో మలుపులు రావు. కథనంలో డైనమిక్స్ వుండవు. ఏవో సీన్లు భర్తీ అవుతూంటాయి. కథ ప్రారంభం కాలేదు కాబట్టి సీన్లలో వేగం వుండదు. ఇందుకే ఈ ప్రేమ సినిమాలు భరించలేక పోతున్నారు ప్రేక్షకులు. 

          కథలో ఎలా వుండాలో తెలీని హీరోయిన్ పాత్రకి, పార్కింగ్ ఎక్కడ చేయాలో కూడా తెలీదులా వుంది. అదేమిటో తను పని చేసే హాస్పిటల్ గేటు బయట, రోడ్డు మీద టూవీలర్ పార్క్ చేసి వెళ్తూంటుంది లోపలికి. ఒకసారి కాదు, ఎప్పుడు హాస్పిటల్ కొచ్చినా ఇంతే. లోపల అంత పెద్ద ప్రాంగణంలో పార్కింగే లేదా అని  మనం సస్పెన్స్ తో చస్తుంటాం. పైగా ఆమె స్టాఫ్ కూడా. అప్పుడు  సెకండాఫ్ లో హీరో  రయ్యిన బుల్లెట్ మీద దూసుకొచ్చి, లోపలికి దూరిపోయి  పార్కింగ్ లో ఠకీల్మని పెడతాడు బండిని!  లోపల పార్కింగ్ వుందన్న మాట! మన హీరోయిన్ గారే బయట వేలాడుతోంది- కథలో లాగా! 

          ముక్కోణ ప్రేమల్లో త్యాగం చేసే పాత్రని ఉన్నతంగా చూపించడం, కథనంలో సస్పెన్స్ పోషించడం ఈ రెండే ప్రధానంగా చూసుకోవాల్సిన అంశాలని ఎన్నో అర్ధవంతమైన సినిమాలు చెప్తున్నాయి.

- సికిందర్
http://www.cinemabazaar.in