రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

13, నవంబర్ 2017, సోమవారం

545 : సెకండాఫ్ సంగతులు!




     సినిమా హిట్ అన్పించుకున్నాక తప్పుబట్టడాని కేముంటుంది, ఏమీ వుండదు. అందులో వున్న అన్ని లోపాలూ ఉల్లంఘనలూ సమస్తం ఇన్ స్టంట్ ఒప్పులైపోతాయి. సినిమా స్కూళ్ళు, స్క్రీన్ ప్లే పుస్తకాలు అనవసరాలై పోతాయి. అయితే ఈ విజయానికి  ఇన్స్పైర్ అయి, ఇంకెవరైనా దీన్నే ఫాలో అయిపోవచ్చు. ఇలాగే  ఎలాపడితే అలా తీసెయ్యొచ్చు,  అది కూడా హిట్టవచ్చు. అది పూర్తిగా చీకట్లో రాయి విసరడం. ఎందుకంటే, ఎలా పడితే అలా తీయడానికి రూల్స్ ఏమీ వుండవు. ఎవరికెలా తోస్తే అలా తీసేయడమే. కనిపిస్తున్న విజయమే గైడ్ బుక్. రూల్స్ ని బ్రేక్ చేయడం కూడా రెండు విధాలా వుంటుంది.  రూల్స్ ఏమిటో తెలుసుకుని బ్రేక్ చేయడం, రూల్స్ పట్టకుండా ఏదో చేసుకుపోవడం. కొందరికి రూల్స్ అంటేనే ఇగో వచ్చేస్తుంది, నా సినిమాకి ఎవరో రూల్స్ చెప్పడమేమిటని. ఆ రూల్స్ అనేవి విజయవంతమైన సినిమాల్లోంచి ఏర్పడినవైతేనేం, వాటి గొప్ప మాకెందుకని. కొత్తగా వచ్చే వాళ్ళు కూడా తాము 10 శాతం  విజయాల బ్రాకెట్ కి చెందిన వైట్ కాలర్ వాళ్ళమనుకుంటారు. తీరా చూస్తే  90 శాతం బ్లూ కాలర్ ఫ్లాపుల మార్కెట్ లో వుంటారు. 90 అనేదే వాస్తవం, 10 అనేది వొఠ్ఠి మిధ్య! గాఠ్ఠి మిధ్య!! ఎంతటి వాడైనా 90 కే భయపడాలి, భయపడి నేర్చుకోవాలి, నేర్చుకుంటూ చావాల్సిందే. కంపెనీలకి ఆర్ అండ్ డీ వున్నట్టు, కళాకారులకి అలాటిది వుండాల్సిందే! కళాకారుడి కొవ్వు ఎంతంటే,  కంపెనీలు సెల్ ఫోన్లు తయారు చేస్తూంటే, కళాకారుడు టెలిఫోన్లు తయారు చేస్తూంటాడు. గ్రాంఫోన్లు కూడా తయారు చేస్తాడు. మార్కెట్ కి పనికి రాకపోయినా వాడి క్రియేటివిటీ వాడికద్భుతమే!

         
కాబట్టి రూల్స్ తెలియకుండా ఎలాపడితే అలా తీయాలన్నా  అసలా తప్పులెలా వుంటాయి, అవి తప్పులెందుకవుతాయి, ఉల్లంఘనలెలా వుంటాయి, అవి ఉల్లంఘనలెలా అవుతాయి, మనం ఏ బాపతు అకృత్యాలకి  పాల్పడ వచ్చు తెలియాలి. వూరికే చీకట్లో రాయి విసిరి చూద్దామనుకోకుండా, ఏ వంకరలో రాయి విసిరితే తగులుతుందో తెలుసుకుంటే  ఇలాటి విజయాల్ని సులభతరం చెయ్యొచ్చు.  


          గత వ్యాసంలో ఏ రూల్స్ కీ అందని ఫస్టాఫ్ సంగతులు చూశాం. ఇప్పుడు ఫస్టాఫ్ కి సెకండాఫ్ పూర్తి భిన్నం. ఫస్టాఫ్ లో  మోడర్నిజమైనా వుంది, ట్రెండీ నెస్ అయినా  వుంది. సెకండాఫ్ లో ఈ రెండూ మాయమై ఇంకెలా  వుందో తెలుసుకుందాం 
 



రేపు!

12, నవంబర్ 2017, ఆదివారం

544 : రివ్యూ!



ర్శత్వం: అజయ్ ఆండ్రూస్
తారాగ
ణం: మంచు నోజ్, అనీషా అంబ్రోస్, పోసాని, అజయ్ ఆండ్రూస్, జెన్నీఫర్, సుహాసిని,  మిలింద్ గునాజీ దితరులు
స్క్రీన్ ప్లే : గోపీమోహన్, ఛాయాగ్రణం: వి.కె. రామరాజు, సంగీతం :  శివ నందిగామ
బ్యానర్ : పద్మ ఫిలింస్ ఇండియా ప్రై.లి., ఎన్‌..సి
నిర్మాతలు: ఎస్‌.ఎన్‌.రెడ్డి, క్ష్మీకాంత్
విడుదల : నవంబర్ 10, 2017
***
         
2010  లో ‘బిందాస్’  అనే వొక విజయం తర్వాత ఆ సంవత్సరంలోని  చివరి రెండంకెలు హైలైట్ చేస్తూ 10 సినిమాలతో  దెబ్బతిన్న మంచు మనోజ్, ఈ మూస మాస్ నుంచి కాస్త తప్పుకుని ఒక మంచి ప్రయతం చేద్దామనుకున్నట్టుంది. మంచి ప్రయత్నం  కోసం దేశమో, రాష్ట్రమో,  ఇంకేదో సామాజికమో ఎత్తుకుంటే ఎలివేట్ అవుతాననుకుని, శ్రీలంక శరణార్ధుల సమస్య వైపు మొగ్గాడు. మహేష్ బాబు వెళ్లి రాజస్థాన్ నీటి సమస్య తీర్చినా (ఖలేజా – కలేజా అంటే సరిపోతుంది), రవితేజ వెళ్లి బీహార్ లో ఇంకేదో వాళ్ళ గొడవ  ఎత్తుకున్నా (కిక్ -2) సాధ్యం కాని మంచి ప్రయత్నం తనవల్ల అవుతుందనుకుని మనోజ్ ‘ఒక్కడు మిగిలాడు’ కి శ్రీకారం చుట్టాడు. గూఢచారి ఏ దేశమో వెళ్లి మన దేశం కోసం గూడుపుఠానీ  నడిపినా  అదొక అందం, బాక్సాఫీసుకి మందం. గూఢచారి కానివాడు పరదేశంలో మనది కాని స్థానిక సమస్యలు తీర్చాలనుకుంటే, బాక్సాఫీసుకి ఆ ఇన్ పుట్ అర్ధంగాక  అవుట్ పుట్ ఇస్తుందా? ఇది చూద్దాం...

 కథ 
      సూర్య (మనోజ్) ఇండియాలో వొక శ్రీలంక శరణార్ధ సంతతి. యూనివర్శిటీలో చదువుతూంటాడు. ఒక మంత్రి కొడుకు, వాడి స్నేహితులూ కలిసి యూనివర్సిటీలో ముగ్గురు  విద్యార్ధినుల మీద అత్యాచారం చేయబోతే ఇద్దరు విద్యార్ధినులు ఆత్మహత్య చేసుకుంటారు. ఒక విద్యార్థిని పారిపోతూంటే ఆమెని కూడా చంపి ఆత్మహత్యగా  చిత్రిస్తారు. ఈ కేసుని వ్యక్తిగత సమస్యలతో చేసుకున్న ఆత్మహత్యలుగా మార్చెయ్యడంతో సూర్య తిరగబడతాడు. చనిపోయిన విద్యార్ధినుల్లో  ఇద్దరు శ్రీలంక శరణార్ధులుంటారు. సూర్య ఉద్యమించడంతో విద్యార్ధులంతా మద్దతుగా ఆందోళనకి దిగుతారు. దీంతో సూర్యని డ్రగ్ కేసులో ఇరికించి హింసిస్తారు పోలీసులు. ఒక మంచి కానిస్టేబుల్ (పోసాని) చిత్రహింసల్ని అడ్డుకుని సూర్య గురించి అడిగి తెలుసుకుంటాడు. అప్పుడు సూర్య శ్రీలంకలో తమిళుల మీద జరిగిన దమనకాండ చెప్పుకొస్తాడు. 

          శ్రీలంకలో ఏ హక్కులూ లేక అల్లాడుతున్న  తమిళులు తిరగబడితే కాల్చి చంపుతూంటాయి ప్రభుత్వ బలగాలు. దీంతో పీటర్  (మనోజ్ -2) ఈలం పేరుతో తీవ్రవాద దళాన్ని నిర్మించి తమిళులకి ప్రత్యక దేశంకోసం అంతర్యుద్ధానికి తెరతీస్తాడు. పోరు తీవ్రమవుతుంది.  తట్టుకోలేక ఇండియాకి పారిపోతారు ఓ పదకొండుగురు తమిళులు. వాళ్లకి విక్టర్ (అజయ్ నూతక్కి) నాయకత్వం వహిస్తాడు. సముద్ర మార్గంలో బయల్దేరిన పడవ ప్రయాణం అనేక ఒడిదుడుకుల పాలవుతుంది. ఆ పడవలో ఓ పసి పిల్లాడు కూడా వుంటాడు. పది రోజులపైగా సాగే  ఈ ప్రయాణంలో ఏమేం జరిగాయన్నది, చివరికి ఎందరు మిగిలి తమిళనాడు చేరారన్నది మిగతా కథ.
ఎలావుంది కథ 


        కీ.శే. నడిగర్ తిలగం శివాజీ గణేశన్ ని స్మరించుకునేలా వుంది. ఇటు కథ కాకుండా, అటు డాక్యూడ్రామా కాకుండా ఏదోగా వుంది. 2013 లో ‘రావణ దేశం’ గా తమిళంలో తీసిన దీన్ని ఇవ్వాళ తెలుగులోకి తెచ్చి పొరపాటు చేశారులా వుంది. ఎంతో రీసెర్చి చేసిన దర్శకుడు  అజయ్ ఆ రీసెర్చి సారాన్ని  సినిమా కథగా మల్చడంలో విఫలమయ్యాడు. 2009 లో నిజంగా జరిగిన తమిళ శరణార్ధుల పలాయనం మీద ఈ కథ చేయాలనుకుంటే అది సినిమాకి పనికి రాదనే చెప్పొచ్చు. ఒక సందర్భంలో శివాజీ గణేశన్ - ఆర్టు సినిమా అంటే పడవ పోతూ వుంటుంది, పోతూనే వుంటుంది, రెండు గంటలదాకా ఇంకా పోతూనే వుంటుంది...కానీ ఏమీ జరగదు! – అని జోకేసినట్టు తయారయ్యింది ఈ కథ. 
      
          ఏది కథవుతుంది? పడవలో శరణార్ధుల కష్టాలే చెప్పాలనుకుంటే అది సర్వైవల్ జానర్ గాథవుతుంది, కథవదు. ఎందుకంటే  విషాదాంతం కాబట్టి. విజయాలు చూపిస్తేనే కథలవుతాయి. గాథ అవాలన్నా కూడా, మొదట్నుంచీ గాథే చెప్పాలి. సగంవరకూ అంతర్యుద్ధంతో యాక్షన్ జానర్ లో వైరి వర్గాల మధ్య ‘ఆర్గ్యుమెంట్’ సహిత కథ చెబుతూ, మళ్ళీ తర్వాత సగం సర్వైవల్ జానర్ లో ఉత్త ‘స్టేట్ మెంట్’ మాత్రపు  పడవ ప్రయాణ గాథ చెప్పడం రసభంగం.

          కథకి  బేస్ ఆర్గ్యుమెంట్. గాథకి బేస్ స్టేట్ మెంట్. కమర్షియల్ సినిమాకి ఉస్సూరన్పించే స్టేట్ మెంట్లిచ్చే గాథలు పనికిరావు, వేడివేడి ఆర్గ్యుమెంట్స్ సహిత కథలే  కావాలి. ఐనా పడవలో బయల్దేరిన శరణార్ధుల కష్టాలెవరిక్కావాలి. ఒకటీ అరా జరిగే ఈ ప్రమాదాలే శరణార్ధుల ప్రధాన సమస్య కాదుగా? శ్రీలంక శరణార్ధుల అసలు సమస్య స్వదేశంలో పెనం మీద మలమల మాడి, పారిపోయి తమిళనాడు  వస్తే అక్కడ పొయ్యిలోపడి -  వెరసి -  ఏ దేశం మాది? అన్న ప్రశ్నలేవనెత్తుతూ చెప్పాల్సిన కథ. 
ఎవరెలా చేశారు 
      మనోజ్ త్రిపాత్రాభినయం చేశాడు – ఒకటి స్టూడెంట్, రెండు తీవ్రవాది, మూడు స్థూలకాయం. తను షేపులోకి రాకపోతే యూత్ అప్పీల్ కష్టమవుతుందని  గుర్తిస్తే బావుంటుందేమో.  తెరమీద తనని చూస్తూంటే పాత్ర మీద కన్నా స్థూల కాయం మీదికే బాగా దృష్టిపోయేలా వుంది. రెండు పాత్రల్నీ రౌద్రంగా నటించాడు, హింసాత్మక దృశ్యాలతో. ఉక్రోషంతో డైలాగులు పలికాడు. తీవ్రవాద పాత్ర ఎల్టీ టీఈ అధిపతి  వేలుపిళ్ళై ప్రభాకరనే అని వేరే చెప్పనవసరంలేదు. మొదటి తీవ్రవాద పాత్రకి ఫస్టాఫ్ లో పోరాట దృశ్యాలతో నిడివి ఎక్కువున్నా, రెండో స్టూడెంట్ పాత్ర – ఇటు తీవ్రవాద పాత్రకీ, అటు సెకండాఫ్  పడవ ప్రయాణానికీ ఫ్లాష్ బ్యాక్స్ చెప్తూ రావడం వల్ల  నిడివి తక్కువ. ఫస్టాఫ్ పీటర్ కథ సెకండాఫ్ కొచ్చేసరికి విక్టర్ గాథగా సాగేసరికి,  మనోజ్ పాత్రల పంపకం కుదర్లేదు.

          పోసానిది అదే నటన. టీవీ రిపోర్టర్ పాత్రలో  అనీషా అంబ్రోస్ ది  సంక్షిప్త పాత్ర. విక్టర్  గా నటించిన దర్శకుడు అజయ్ కి సింహభాగం సినిమా దక్కింది. ఇది పూర్తిగా శోకపూరిత పాత్ర పడవ ప్రయాణంలో. 

          పడవలో ఇంకో పది ఆడా మగా పడుచు పాత్రలు, ముసలి పాత్రలూ, వొక పసి పాత్రా వుంటాయి. ఈ పాసిపాత్రే పెరిగి స్టూడెంట్ పాత్ర అయి ఫ్లాష్ బ్యాక్ చెప్తుంది. పడవలో ఈ పాత్రలన్నిటితో విషాదమయ వాతావరణమే వుంటుంది. దుష్ట మంత్రిగా మిలింద్ గునాజీ చాలాకాలం తర్వాత తెర మీదికొస్తే, మహిళా హక్కుల సంఘం చీఫ్ గా సుహాసిని. 

          ప్రధానంగా చెప్పుకోవాల్సింది యాక్షన్ దృశ్యాలు. శ్రీలంక సైన్యానికీ, తమిళ పులులకీ మధ్య జరిగే యుద్ధ దృశ్యాలు  అత్యంత శక్తివంతంగా, అంతే వాస్తవికంగానూ, ప్రభావశీలంగానూ  వున్నాయి. ఇవన్నీ వొరిజినల్ ‘రావణ దేశం’ లోనివే. అక్కడక్కడా మనోజ్ పాల్గొన్న యాక్షన్ దృశ్యాల్ని మాత్రం రీషూట్ చేశారు. అవుట్ డోర్ లొకేషన్స్ శ్రీలంక నేటివిటీతోనే వున్నాయి. ఇక పడవ ప్రయాణపు సెకండాఫ్ ఎపిసోడ్ అంతా యధాతధంగా వొరిజినలే.  ఈ ఎపిసోడ్ చివర్లో తుఫాను వచ్చే దృశ్యాల సీజీ బీభత్సభరితంగా వుంది. కెమెరా మాన్
వి.కె. రామరాజు సముద్రంలో రిస్కు తీసుకుని చిత్రీకరణ చేశాడు. నేపధ్యసంగీతం ఫర్వాలేదు. 
 చివరికేమిటి 
     సగాలు రెండూ ఒకటైతే జగం జగమే గానీ,  ఇలాటి సగాలు ఒకటైతే కాదు. వసూళ్ళ పిల్లలు పుట్టి పారాడవు. ఫిఫ్టీ –ఫిఫ్టీ ...నీదో సగం, నాదో సగం  అని హీరో – దర్శకుడు ఫస్టాఫ్, సెకండాఫ్ లు పాడుకుని పంచుకుంటే రెండు సినిమాలవుతాయి, ఒకటి కాదు. ఒకటి కథ, రెండోది గాథ. ఇవి రెండూ ఆడా మగలైతే అలాగే కలుసుకుని డ్యూయెట్ పాడుకోవచ్చు, రెండూ మగలై ఆడదాని కోసం వెతుక్కుంటున్నాయి. వాటిని మాయం చేశాడు కథకుడు. 

          ఇందుకే ముందుగా  తట్టిన ఐడియాలో  స్ట్రక్చర్ చూసుకోవాలనేది. చూసుకోకపోతే కథ కాకుండా కొంపలు ముంచే గాథ తయారవుతుంది - లేదా ఇలా సగం కథ, సగం గాథ మాయలేడిలా ముస్తాబవుతుంది. ఇలాటి దుష్టసమాసం ఇంతవరకూ ఏ సినిమాలోనూ లేదు బహుశా. 

          ఈ కథ + గాథకి కవరింగ్ లెటర్ లా ఇంకో కథ వుంది - స్టూడెంట్ కథ. ఈ స్టూడెంట్ కథకే స్ట్రక్చర్ వుంది. విద్యార్ధినుల మరణాలపై ఉద్యమించడం,  అరెస్టయి ఎన్ కౌంటర్ ని ఎదుర్కోవడం, తప్పించుకుని విజయం సాధించడం. ఇదంతా సాగుతున్నప్పుడు అతను మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకుల్లో శ్రీలంక శరణార్ధుల గురించి చెప్పుకొస్తూంటాడు – ఒక పీటర్ కథగా,  ఇంకో విక్టర్ గాథగా. ఇలా ఈ ఫ్లాష్ బ్యాక్ కే స్ట్రక్చర్ లేకుండా పోయి ఏం చెప్తున్నాడో అర్ధంగాని గందరగోళానికి దారితీసింది. 

          ఫస్టాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ తో ప్రారంభించిన శ్రీలంక శరణార్ధుల కథ కథలాగే కొనసాగాలంటే, ఇంటర్వెల్ కల్లా లంక దళాలకి తట్టుకోలేక శరణార్ధులు తమిళనాడు చేరుకోవాలి. సెకండాఫ్ తమిళనాడులో ఆ శరణార్ధులు దేశంకాని దేశపు వాళ్ళుగా ఎదుర్కొనే  వివక్ష, అణిచివేతా వగైరాలతో కూడిన సంఘర్షణ చూపించి, ఈ సమస్యకి పరిష్కారం చెబుతూ ముగించాలి. అంతేగానీ శ్రీలంకలో వాళ్ళ  దైన్యం చూపించి,  పడవలో పడేసి ప్రయాణపు కష్టాలు చూపించి ముగించేస్తే అది పూర్తిగా చెప్పడం కాదు. తమిళనాడులో వాళ్ళ పరిస్థితిని కూడా చూపిస్తేనే  ప్రేక్షకులకి పూర్తి సమాచారమిచ్చి అవగాహన కల్గించినట్టు, విషయం పరిపూర్ణంగా చెప్పినట్టు. అప్పుడే ఈ  మొత్తం అర్ధవంతమైన కథ అన్పించుకుంటుంది. 

          కాందీశీకుడి రూపంలో తమిళనాడులో స్టూడెంట్ పడ్డ బాధలు చూపించాంగా అంటే, అది చూపించడం కాదు, సినిమా వీక్షణానుభవాన్ని చెరచడం. పోరాడే స్టూడెంట్ తో బాటు చనిపోయిన ఇద్దరు శరణార్ధ విద్యార్థినులది కల్పిత, కృత్రిమ, రొటీన్ సినిమాటిక్ ఫార్ములా  కథ. మిగతా కథో గాథో రియలిస్టిక్ గా చూపించుకొస్తూ,  స్టూడెంట్ కథని మూస ఫార్ములాగా ఎలా చూపిస్తారు. ఇక్కడ కావాల్సింది వీళ్ళ కథ కాదు, పడవెక్కి పారిపోయి వచ్చిన ఆ పదకొండు మంది శరణార్ధుల రియలిస్టిక్ కథ. కనుక ఈ స్టూడెంట్ కథ అనే కవరింగ్ లెటర్ అనవసరమై పోతుంది. కథ చెప్పడానికి అతి టాలెంట్  ప్రదర్శించుకోనక్కర్లేదు, టాలెంట్ సరిపోతుంది.

          సారాంశం? పడవ ప్రయాణంలో గల్లంతైన నిజ సంఘటన పై చేసిన రీసెర్చి కేవలం అంతవరకే డాక్యుమెంటరీకి పనికి వస్తుంది. దానికి అంతర్యుద్ధపు కథ, స్టూడెంట్ కథా అని  జోడించడానికి పనికిరాదు. 

          ఈ మొత్తానికి కలిపి చివర్లో స్టూడెంట్ ఇచ్చే స్పీచికి  కూడా అర్ధం లేదు. రండి, మనమంతా కలిసి జీవిద్దాం, వివక్ష వద్దు....లాంటి మాటలు ఎక్కడైనా పీడితుడు చెప్తే ఎవరైనా వింటారా, లేక పీడించే వర్గం నుంచి ఎవడైనా ఇటు స్టూడెంట్ వైపు వచ్చి కలుపుకుని అంటే, వినబుల్ గానూ చూడబుల్ గానూ వుంటుందా?

-సికిందర్
https://www.cinemabazaar.in





                   
         
         
         



10, నవంబర్ 2017, శుక్రవారం

543 : రివ్యూ!


Dear  Readers!
Yesterday  glitches in net connectivity  caused delay in publishing the review. The desktop gone bongs! The inconvenience is deeply regretted.


        
రచన –దర్శకత్వం : మిస్కిన్
తారాగణం : విశాల్, అనూ  ఇమ్మాన్యుయేల్, అండ్రియా జెర్మియా ప్రసన్నవినయ్భాగ్యరాజ్సిమ్రాన్వినయ్ రాయ్ తదితరులు 
సంగీతంఅరోల్ కొరెల్లీ, ఛాయాగ్రహణం : కార్తీక్
బ్యానర్ విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, నిర్మాత : విశాల్  
విడుదల : నవంబర్ 10, 2017

***
          తమిళ స్టార్ విశాల్ మాస్ సినిమాలంటూ తెలుగులో అంతరించిన అవే రక్తపాతాల యాక్షన్ సినిమాల్లో నటిస్తూ, క్రమంగా తెలుగులో ఫాలోయింగ్ కోల్పోతూ వచ్చాడు. కార్తీకున్న ఓపెనింగ్స్ కూడా తనకి రావడం తగ్గిపోయింది. అయినా వొరవడిని మార్చుకునే ఆలోచన చేయకుండా అపజయాలకి అలవాటు పడిపోయాడు. తమిళంలో తనదగ్గరికి వచ్చే దర్శకులు కూడా అదే అరవ మాస్ –కొండకచో వూరమాస్ నీ అంటగడుతూ విశాల్ వైశాల్యాన్ని కుదించి వేశారు. తను విస్తరించాలంటే అలాటి దర్శకుల్ని వదిలించుకోవాలి. ఎనిమిదేళ్లుగా విశాల్ తో పనిచేయాలని ఎదురుచూస్తున్న దర్శకుడు మిస్కిన్ బరి అవతలే వుండిపోవాల్సివచ్చింది. చివరికెలాగో  విశాల్ ని ‘తుప్పరి వాలన్’ (తెలుగు అర్ధం పత్తేదారు, ఇంగ్లీషులో డిటెక్టివ్)  కి ఒప్పించాడు. తుప్పరివాలన్ గా తనని చూసుకున్న విశాల్ కి కొత్త ఉత్సాహం వచ్చిందేమో, తనే నిర్మాణం చేపడుతూ నటించాడు. ఫలితం? సత్ఫలితమా, దుష్ఫలితమా? ఓసారి చూద్దాం...

కథ 
        ఒక పిడుగుపాటుతో ఆమె (సిమ్రాన్) భర్తనీ, కొడుకునీ కోల్పోతుంది. సినిమా కెళ్ళిన ఒక  పోలీసు అధికారి చీమ కుట్టినట్టయి తర్వాత చనిపోతాడు. నగరంలో అద్వైత భూషణ్ అలియాస్ ఆది (విశాల్) అనే ప్రైవేట్ డిటెక్టివ్ సరైన కేసులు రావడం లేదని బాధపడుతూంటాడు. వెంట ప్రసన్న అనే అసిస్టెంట్ వుంటాడు. ఒక పదేళ్ళ పిల్లవాడు వచ్చి తనకుక్క పిల్లని చంపిన వాణ్ణి  పట్టుకోవాలని బుల్లెట్ చూపించి ఏడుస్తాడు.  ఆది ఫీలై కేసు చేపడతాడు. పోలీసు వర్గాల్లో తనకున్న సంబంధాలతో ఆ బుల్లెట్ ని పరీక్షిస్తే,  అది పవర్ఫుల్ రివాల్వర్ నుంచి వెలువడిందనీ, దాంతో షూట్ చేస్తే బుల్లెట్ కుక్క పిల్ల శరీరంలోనే వుండిపోయే అవకాశం లేదనీ, అవతలకి దూసుకెళ్లి పోతుందనీ తేలుతుంది. బుల్లెట్ మీదున్న స్ట్రయేషన్స్ ని బట్టి చూస్తే  ఇది రికోషెట్ బుల్లెట్ అనీ, అంటే కుక్క పిల్లకి తగలడానికి ముందు ఏ గోడకో తగిలి, పరావర్తనం చెంది కుక్క పిల్లకి తగిలి వుండాలనీ, అందువల్ల వేగం తగ్గి కుక్కపిల్ల శరీరంలో వుండిపోయిందనీ చెప్తారు పోలీసులు. 

          అంటే ఎవరో మతి మాలిన వాడు కావాలని కుక్క పిల్లని చంపలేదనీ,  ఇంకెవరి మీదికో రివాల్వర్ ని  ప్రయోగించి వుండాలనీ అర్ధం జేసుకుని ఆది ఆ స్పాట్ లో గాలిస్తే,  ఒక వూడిపోయిన దంతం  దొరుకుంతుంది. దాంతో దర్యాప్తు చేస్తూ పోతే ఒక పుస్తకం దగ్గరికి దారి తీస్తుంది. ఆ పుస్తకం పిడిగుపాట్ల గురించి సైన్సు పుస్తకం. దరిమిలా ఇంకో ప్రమాదవశాత్తూ మరణం అది కళ్ళముందే జరుగుతుంది. ఇది ప్రమాదం కాదనీ, లాఫింగ్ గ్యాస్ తో చంపారనీ తెలుసుకుని అప్రమత్తమ వుతాడు. మొదట పిడుగుపాటుతో చనిపోయిన వ్యక్తీ, తర్వాత చీమకుట్టినట్టయి చనిపోయిన పోలీసు అధికారీ, ఇప్పుడు రోడ్డు ప్రమాదంలో  చనిపోయిన అతనూ,  ఒకే హంతకుడు  తెలివిగా జరిపించిన మరణాలని  తేలుతుంది ఆదికి. ఎవరీ హంతకుడు? ఎందుకు చంపుతున్నాడు? ఇంకెందర్ని చంపుతాడు? వాణ్ణి ఎలా పట్టుకోవాలి? ఇవీ ఆది ముందున్న ప్రశ్నలు. 

ఎలావుంది కథ 
       అచ్చమైన డిటెక్టివ్ కథ. సర్ ఆర్ధర్ కానన్ డాయల్ డిటెక్టివ్ పాత్ర షెర్లాక్ హోమ్స్ కథలు చదివి స్ఫూర్తి పొందానని చెప్పుకున్నాడు దర్శకుడు. హీరో పాత్రని ని షెర్లాక్ హోమ్స్ ని దృష్టిలో పెట్టుకునీ, అతడి అసిస్టెంట్ పాత్రని  షెర్లాక్ నేస్తం డాక్టర్ వాట్సన్ ని దృష్టిలో పెట్టుకునీ తీర్చి దిద్దానన్నాడు. కానీ అలా అన్పించదు. పూర్తిగా ఒకప్పటి ఎడ్గార్ వాలెస్, జాన్ క్రీసీ  నవలల్లోని వాతావరణంతో, ఆ సరళిలో వుండే కథనంతో, పాత్రల చిత్రణతో కన్పిస్తుందీ కథ. అదే సమయంలో హాంకాంగ్ మూవీ ‘యాక్సిడెంట్’ (2014) లోని కథ ఇందులో కన్పిస్తుంది. అందులో ఒక గ్యాంగ్ కాంట్రాక్టు హత్యల్ని ప్రమాదాలుగానో, సహజ మరణాలుగానో సృష్టిస్తూ వుంటుంది. అందులో ఒకటి,  పిడుగుపాటుని సృష్టించి చంపడం. అయితే ఇది పూర్తిగా మాఫియా బాపతు యాక్షన్ జానర్ కథ. 

          దీన్ని ఎడ్గార్ వాలెస్, జాన్ క్రీసీ  ల సరళిలో అచ్చమైన డిటెక్టివ్ జానర్ లోకి మార్చడంలోని  దర్శకుడి సృజనాత్మకత మాత్రమే ఆకర్షిస్తుంది, కథ ఐడియాకి  హాంకాంగ్ మూవీ స్ఫూర్తి అనేది అప్రస్తుతమైపోతుంది. కథనే  వున్నదున్నట్టు, హాంకాంగ్ మూవీలోంచి సంగ్రహించి తీసి వుంటే  అదివేరు; వాలెస్, క్రీసీల డిటెక్టివ్ జానర్లోకి మార్చడం పూర్తిగా వేరు. హాలీవుడ్ లో కొన్ని ఫిలిం నోయర్, నియో నోయర్  మూవీస్ ని 1930 లనాటి డషెల్ హమెట్ హార్డ్ కోర్ డిటెక్టివ్ నవలల ప్రభావంతో తీసినట్టు, ప్రస్తుత దర్శకుడు అలాటి సాంప్రదాయాన్ని ఫాలో అవడంతో ఇదొక విశిష్ట రూపాన్ని పొందింది. 

ఎవరెలా చేశారు 
         విశాల్ కి  పాత్ర, దీంతో నటన విభిన్నమైనవి. విచిత్రంగా బిహేవ్ చేస్తూ, ఎప్పుడేమని అరుస్తాడో,  సడెన్ గా ఎప్పుడేం చేస్తాడో అర్ధంగాని పాత్ర. మళ్ళీ తన లోకంలో తానుండిపోతూ ప్రపంచాన్ని పట్టించుకోడు. ఒకవైపు కేసుల్లేక బాధపడతాడు. మరోవైపు బ్లాంక్ చెక్ ఇస్తాను, పారిపోయిన నా కూతుర్ని వెతికి పెట్టమని ఒకడొస్తే లేచి బయటి కెళ్ళి పోతాడు. ఎందుకంటే, ఆ కూతురు ఇంటికి రాకపోతేనే స్వేచ్ఛగా వుంటుందని. మళ్ళీ పదేళ్ళ పిల్లాడు కుక్క పిల్లని చంపారని వస్తే, కరిగిపోయి కేసు తీసుకుంటాడు. ఈ కేసు రాను రాను పెద్దదైపోయి పైసా రాకపోయినా పాటుపడతాడు. 

          షెర్లాక్ హోమ్స్  కి వ్యక్తిత్వ లోపాలుండవు. అపరిమిత వూహాశక్తి గలవాడు, కుశాగ్ర బుద్ధి. ఓ చిన్న విషయం వెనుక ఏఏ కారణాలుండవచ్చో పేజీలకి పేజీలు చెప్పేస్తాడు. విశాల్ పాత్రకి షెర్లాక్ హోమ్స్ నుంచి ఈ టాలెంట్ ని  మాత్రమే తీసుకున్నారు. ఉదాహరణకి హీరోయిన్
ని చూసి - నీ పేరెంట్స్ చనిపోయారు. నువ్వు నీ మేనమామ దగ్గర వుంటున్నావు, మేనమామకి ఇస్త్రీ షాపుంది, నువ్వు వేసుకున్న డ్రెస్ నీది కాదు... ఇలా చూడగానే అనేస్తూంటాడు. ఇదే ధోరణి అనేక సందర్భాల్లో కొనసాగి పాత కాలపు డిటెక్టివ్ పాత్రల్ని గుర్తుకు తెస్తాడు. ఇంత కుశాగ్రబుద్ధి అతనెలా అయ్యాడో, అసలీ వృత్తిలోకి ఎలా వచ్చాడో పాత్ర పరిచయం వుండదు. 

        1968 లో విడుదలైన ‘ది డిటెక్టివ్’ అనే ఫ్రాంక్ సినాట్రా నటించి
న థ్రిల్లర్ లో, పాత్ర కూడా చాలా రఫ్ గానూ, పోలీసు భాష మాట్లాడుతూ మొండిగానూ వుంటుంది. కేసుతీసు
కునే వరకే సెంటిమెంటు, తర్వాత ఏ సెంటిమెం
టూ లేకుండా దర్యాప్తులో వ్యక్తులతో వ్యవహరిస్తాడు. అచ్చం ఈ కోవలోనే విశాల్ పాత్ర వుంది తప్ప, షెర్లాక్ హోమ్స్ తో సంబంధంలేదు. 

          ఒక స్టార్ కిది చిన్నస్థాయి కథ. కానీ ఒక స్టార్ చిన్న స్థాయి కథలో నటించడం వల్ల దాన్ని ఏ స్థాయికి తీసికెళ్ళ గలడో, నటుడిగా తాను కూడా స్థాయికి చేరుకోగలడో నిరూపించాడు  విశాల్.  ఇందులో మూడు యాక్షన్ సీన్లున్నాయి. పాడుబడ్డ గృహంలో రఫ్ గ్యాంగుతో, రెస్టారెంట్ లో చైనీస్ గ్యాంగ్ తో, క్లయిమాక్స్ లో విలన్ తో- ఇవన్నీకొత్తగానూ,  కళాత్మకంగానూ  వుండడం ఒక ప్రత్యేకత. అయితే డిటెక్టివ్ గా వేషధారణ సరీగ్గా కుదర్లేదు. ఐతే ఈ పాత్రతో మాస్ హీరో కాస్తా క్లాస్ హీరో అయ్యాడు. 

       కొత్త హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్ ఇందులో జేబుదొంగగా నటించింది. ఆ పని మాన్పించి తన ఇంట్లో పనిమనిషిగా పెట్టుకుంటాడు హీరో. ఆమె మీద ఎప్పుడు అరుస్తాడో తెలీక భయంభయంగా గడిపే పాత్ర. చివరికి అతను ప్రేమలో పడినా, ఆ ప్రేమ ఆమెకి దక్కదు.

          డిటెక్టివ్ అసిస్టెంట్ పాత్రలో ప్రసన్న కన్పిస్తాడు. కానీ దీనికి డాక్టర్ వాట్సన్ పాత్రతో సంబంధం లేదు. విలన్ గా  నటించిన వినయ్ రాయ్ విలనీ అంతా వాలెస్, క్రీజీ ల శైలిలో వుంటుంది. డెవిల్స్ గ్యాంగ్ అనే పేరుకూడా వాలెస్, క్రీసీల నవలల్లో కన్పించే పేరులాంటిదే. ఈ గ్యాంగ్ ఇంకా సాహిత్యంలో, సినిమాల్లో మాఫియా రాక ముందటి చిత్రణ. నీటుగా, కూల్ గా వుంటూ ఎక్కువ మాట్లాడుకోరు. ఆధునిక పద్ధతుల్లో, ఒక్కోసారి సైన్సు నుపయోగించీ సైలెంట్ గా నేరాలు చేస్తూంటారు. 
\
       వినయ్ ఈ వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ టెర్రిఫిక్ గా నటించాడు. అతడి అసిస్టెంట్ పాత్రలో ఆండ్రియా జెర్మియా డిటో. గ్యాంగ్ మెంబర్ గా భాగ్యరాజా ఓకే. సినిమా ప్రారంభ సీన్లో, మళ్ళీ ఫస్టాఫ్ ముగింపు సీన్లో కన్పించే సిమ్రాన్ కూడా టెర్రిఫిక్ గా వుంది. 

          కెమెరా వర్క్, బిజిఎం, సెట్స్ డిజైనింగ్, ఎన్నుకున్న లొకేషన్స్, నైట్ సీన్స్ సమస్తం కళాత్మకంగా, ఆలోచనాత్మకంగా వున్నాయి. కథకి  తగ్గ స్టయిల్ నీ, మూడ్ నీ క్రియేట్ చేయ డం వేరే కసరత్తు. దీనికి రిఫరెన్స్ అయినా వుండాలి, సొంత నైపుణ్య మైనా వుండాలి. 

చివరికేమిటి 
      ‘పిశాచి’ దర్శకుడు మిస్కిన్ ఈ ‘డిటెక్టివ్’ తీశాడు. కార్తీక్ సుబ్బరాజు లాగే తనదీ ప్రత్యేక విజన్, దానికి రిఫరెన్సులు. నిజానికి మాఫియా పాత్రలు, కథలు అలవాటయ్యాక, అంతకి ముందటి ఇంటలెక్చువల్ థ్రిల్లర్స్ ని  కోల్పోయాం. మర్డర్స్ అంటే కాల్చో, నరికో చంపే సంస్కృతిలోకి సినిమాలు మారేక, మెదడుకి పదునుబెట్టే నేరాల ప్రక్రియల్ని చిత్రీకరించడం  అరుదై పోయింది. నేర ప్రపంచం ఇంకా చాలా వుంది. సినిమాలు ఒకే  హింసని,  రక్తపాతాన్నీ  పట్టుకుని వుంటున్నాయి. డిటెక్టివ్ లో ద్విపార్శ్వ దర్శన మౌతుంది. చంపడంలో హింస వుంటే వుండొచ్చు, ఆ చంపే విధానం మీదే మన దృష్టంతా కేంద్రీకృతమవుతుంది – హింస కంటే, దాని విధానమే కట్టి పడేస్తుంది. పిడుగుపాటుని సృష్టించి చంపడం, రైసిన్ తో చీమ కుట్టినట్టు చేసి చంపడం, లాఫింగ్ గ్యాస్ తో నవ్వించీ నవ్వించీ రోడ్డు ప్రమాదం జరిపించి చంపడం లాంటి నేరాలు ఆలోచనలో పడేస్తాయి.  

          ఈ డిటెక్టివ్ కథ దాని జానర్ మర్యాదని గౌరవిస్తూ పూర్తిగా లాజిక్ కి పట్టం గడుతుంది. లాజిక్ లేని చిత్రీకరణ ఎక్కడా కన్పించదు. పూర్తిగా ప్రొఫెషనలిజంతో కూడుకుని వుంటుంది. పోలీసులు, డిటెక్టివ్ లు లాజికల్ గానే అలోచించి,  లాజికల్ గానే పని చేసుకుపోతారు. చాలా సినిమాల్లో చూపించినట్టు లాజిక్ ని ఎగేసి పనిచేస్తే ఉద్యోగాలు పోతాయి. ఈ మూవీలో ఒక్క డైలాగు మిస్ చేసుకున్నా, ఒక్క సీను సరిగా చూడకపోయినా, ఆ తర్వాత అర్ధంగాని ప్రమాదం వుంటుంది. డ్రమెటిక్ కంటిన్యుటీ కోల్పోతాం.

          ఓ పది నిమిషాల్లో పిల్లాడి కేసుతో ప్లాట్ పాయింట్ వన్ ఏర్పాటు చేసేస్తారు. దీనికి ముందు హీరోకి తెలియని రెండు ప్రమాదవశాత్తూ జరిగిన మరణాల్ని చూపిస్తారు. పిల్లాడి కేసుతో హీరో మిడిల్ విభాగంలో ప్రవేశించి సమస్య (కేసు)తో సంఘర్షిస్తూ, గోల్ కోసం (కుక్కపిల్లని చంపిందెవరు?) ప్రయత్నిస్తూ ముందుకు పోతున్నప్పుడు ఒక సందేహం వస్తుంది  - ఈ కథ ఎండ్ సస్పెన్స్ కథగా మారుతుందా అని. డిటెక్టివ్ కథలు నవలా రూపంలో ఇలాగే  వుంటాయి. చిట్ట చివరికి గానీ డిటెక్టివ్ కి, పాఠకులకీ హంతకుడు తెలియడు. ఇలా సినిమాలో కొనసాగితే ప్రేక్షకులు అంత సేపూ భరించలేరు. విలన్ కీ   హీరోకీ మధ్య పోరాటం మొదలవాల్సిందే. అదీ ఇంటర్వెల్ లోపు. 

       సస్పెన్స్ లో రెండు ప్రశ్నలుంటాయి : ఎవరు? ఎందుకు? అని. ఈ రెండూ దాచిపెట్టి కథ నడిపిస్తే ఎండ్ సస్పెన్స్ అవుతుంది. అంటే ఈ ప్రశ్నలకి సమాధానాలు ఎండ్ లో మాత్రమే తెలుస్తాయన్న  మాట. అంతవరకూ పాత్రతో ఏక పక్ష కథనమే వుంటూ భరించలేరు.  ప్రస్తుత  డిటెక్టివ్ కి ఇదే జరుగుతోందా అన్నసందేహం వస్తుంది. పరిశోధన చేస్తున్నాడు. గంట గడుస్తున్నా హంతకుడెవరో, ఎందుకు చంపుతున్నాడో తెలీడం లేదు. నవలలా సినిమా వుండబోతే విశాల్ అట్టర్ ఫ్లాప్!

          కానీ అదే 60 వ నిమిషంలో, ఇంటర్వెల్ లోపు  సినిమా రూపమే అంటూ స్పష్ట మైపోతుంది. విలన్,  అతడి గ్యాంగ్ ఓపెనైపోతారు. విలన్ కరెంటు రంపంతో ఒక శవాన్ని కోస్తూంటాడు కూడా. దీంతో మనలోని సగటు ప్రేక్షకుడి బుద్ధి సంతృప్తి పడుతుంది. ఎవరు? అనేది తెలిసిపోయింది. ఇక ఎందుకు? (ఎందుకు హత్యలు చేస్తున్నాడు) అన్నది రివీల్ అవ్వాలి. దీన్ని చివరి వరకూ ఆపినా నష్టం లేదు. రెండు ప్రశ్నలూ ఆపెస్తేనే  ఎండ్ సస్పెన్స్ అవుతుంది. ఒకటి ఓపెన్ చేసేసి నడిపిస్తే సీన్ టు సీన్ సస్పెన్స్ అవుతుంది. ఈ విలన్ అప్పుడే హీరోకి తెలియాల్సిన అవసరం లేదు. ప్రేక్షకులకి తెలిస్తే, హీరో ఎలా తెలుసుకుంటాడా అన్న సస్పన్స్ తో కూడిన కథనం ముందుకు లాక్కెళ్తుంది. 

          పది నిమిషల తర్వాత,  ఇంటర్వెల్ కొచ్చేసరికి హీరో ప్రారంభంలో మొదటి రెండు మరణాల రహస్యం తెలుసుకుంటాడు. ఇదే సమయంలో విల తన పార్టనర్ మీద ఇంకో దడి జరిపిస్తాడు. ఫస్టాఫ్ లో రెండు మరణాల మిస్టరీ ఇంటర్వెల్ కల్లా తేల్చేయడం మంచి కథనం. అదే సమయంలో ఇంటర్వెల్ మళ్ళీ విలన్ చేసే ఇంకో ఎటాక్ తో కథ తెగిపోకుండా, సెకండాఫ్ కి సన్నద్ధం చేయడం. 

          సాధారణంగా ఇటువంటి సినిమాల్లో మొదటి రెండు మరణాల రహ్యసం, అ మాటకొస్తే మొత్తం కథలో జరిగిన సంఘటనల వివరణ కార్యకారణ సంబంధం సహా వివరిస్తూ ముగింపులో బోలెడు చెప్తాడు హీరో. ఇది నవలా పద్దతి. సినిమాలో మళ్ళీ ఆడియెన్స్ మొదట్నించీ అన్నీ గుర్తు చేసుకుంటూ హీరో ఇచ్చే వివరణలతో కనెక్ట్ అవడం బోరుకొట్టే బిజినెస్. అందుకని ఎప్పటికప్పుడు తేల్చెయ్యాలి. అందుకే ఫస్టాఫ్ మరణాల రహస్యాన్ని ఫస్టాఫ్ లోనే ఇంటర్వెల్ లో విప్పేశారు.

          సెకండాఫ్ కథ ఎజెండా విలన్ తన బిజినెస్ కి అడ్డుగా వున్నాడని హీరోని చంపే ప్రయత్నాలు చేయడం. హీరో తప్పించుకుంటే అసిస్టెంట్ ని, అసిస్టెంట్ బయటపడితే, హీరోయిన్ ని...ఇలా యాక్షన్ లోకి దిగుతుంది కథ. క్లయిమాక్స్ లో హీరో విలన్ల ముఖాముఖీ. ఇంతే మూడంకాల స్ట్రక్చర్.  

          అన్ని కోణాల్లో సమగ్రంగా వుండే థ్రిల్లర్స్ తీయడం అందరికీ సాధ్యం కాదు. సాధ్యమైనా కూడా ఇంకేవో చాపల్యాలతో చెడగొడతారు. ప్రొఫెషనల్ పాత్రలకి ప్రొఫెషనలిజంతో కూడిన కథ చేస్తేనే ఆ పాత్రలకీ, థ్రిల్లర్ కీ న్యాయం చేసినట్టు; తద్వారా  బాక్సాఫీసు దగ్గర బావుకున్నట్టు.

-సికిందర్

          





9, నవంబర్ 2017, గురువారం

542 : రివ్యూ!





రచన – దర్శకత్వం : అట్లీ
తారాగణం: విజయ్ ( త్రిపతరాభినయం)  మంత, కాజల్ అగర్వాల్, నిత్యామీనన్, డివేలు, ఎస్జెసూర్య, త్యరాజ్, వడివేలు  దితరులు
సంగీతం: ఏఆర్‌.రెహమాన్. ఛాయాగ్రణం: జి.కె.విష్ణు
బ్యానర్స్
: తెన్నాండాళ్ స్టూడియోస్ లిమిటెడ్, నార్త్స్టార్ట్ ఎంటర్టైన్మెంట్
నిర్మాతలు: ఎన్‌.రామస్వామి, హేమరుక్మిణి
విడుదల : నవంబర్ 9 2017
***
         
నెలరోజులుగా విడదల వాయిదాలు పడుతూ చివరికి విడుదలైన విజయ్ – అట్లీ ల కాంబినేషన్ లో ఈ తెలుగు డబ్బింగ్ రెండో ఎంట్రీ. గత సంవత్సరం ఇద్దరూ ‘పోలీస్’ అనే థ్రిల్లర్ తో వచ్చారు. ఈ సారి సామాజిక సమస్య తీసుకుని వస్తూ, వివాదం కూడా రేపారు. దీంతో తెలుగు డబ్బింగ్ లో వివాద కారణమైన జీఎస్టీ మీద విసుర్లు సెన్సారై పోయాయి. అయితే ఆ విసుర్లేమిటో మనకి తెలిసిందే గనుక, మిగతా విషయం ఎలావుందో చూద్దాం...

కథ 
      డాక్టర్ భార్గవ్ (విజయ్) ఓ అయిదు రూపాయల డాక్టర్. వైద్యం చవకగా అందించాలన్న తన తండ్రి ఆశయాన్నిఆచరిస్తూ, వైద్యుల అవినీతి మీద పోరాటం చేస్తూంటాడు. విజయ్ (విజయ్ -2) ఒక మెజీషియన్. ఇతను కుటుంబానికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నిస్తూంటాడు. భార్గవ్ తారా (సమంత) అనే యాంకర్ ని ప్రేమిస్తూంటే, విజయ్ పల్లవి (కాజల్) అనే డాక్టర్ ని ప్రేమిస్తూంటాడు. వీళ్ళిద్దరూ చిన్నప్పుడు విడిపోయిన అన్నదమ్ములు. డానీ (ఎస్ జే సూర్య),   అర్జున్ (హరీష్ పరాడే) అనే ఇద్దర్లు చెడ్డ డాక్టర్లు వుంటారు. వీళ్ళ మీద పగదీర్చుకోవడానికి అన్నదమ్ములిద్దరూ స్థానాలు  మార్చుకుంటూ పోలీస్ అధికారి (సత్య రాజ్)  ని ముప్పుతిప్పలు పెడుతూంటారు. అసలు గతంలో ఏం జరిగింది,  అందులో చెడ్డ డాక్టర్ల పాత్రేమిటి, వీళ్ళ మీద అన్నదమ్ములు పగ ఎలా తీర్చుకోగలిగారు...అన్నది మిగతా కథ. 

ఎలావుంది కథ 
       పూర్తిగా మాస్. సామాజిక సమస్యలతో శంకర్ తీసే సినిమాల తీరు తెన్నులకి ఇంకాస్తా దట్టించిన మసాలా. కాకపోతే వైద్య రంగంలో అవినీతి మీద పోరాటం. దీన్ని కథానాయకుల కుటుంబానికి జరిగిన అన్యాయం నేపధ్యంగా చెప్పారు. కార్పొరేట్ ఆస్పత్రుల మీద గతంలో సినిమా లొచ్చాయి. కొత్తగా మళ్ళీ చెప్పడానికి సింగపూర్ ని దృష్టిలో పెట్టుకుని ఉచిత వైద్యం డిమాండ్ ని ముందుకు తెచ్చారు. సింగపూర్ లో ఏడు శాతం జీఎస్టీకి ఉచిత వైద్యమే గానీ, ఉచిత విద్య, ఉచిత గృహాలు, ఉచిత విద్యుత్, ఫించన్లు, రుణమాఫీలు, సబ్సిడీలు, రేషన్లు, ఆడపిల్లకి నిలువు బంగారాలు, పెళ్లి పిల్లకి షాదీ ముబారక్ లు, సబ్ ప్లాన్లు, కలర్ టీవీలు, లాప్ టాప్ లు  వంటి సవాలక్ష తాయిలాలతో ఓటు బ్యాంకులు తెరవడం లేదు. ప్రభుత్వం కూడా జీఎస్టీ మీద తగిన సమాచారంతో తమిళ వెర్షన్ రేపిన వివాదాన్ని ఎదుర్కోక సినిమా గొంతు నొక్కాలని చూసింది. నొక్కితే సినిమా చెప్పిందే నిజమనుకుంటారు ప్రజలు. తమిళ డైలాగుల్లో జీఎస్టీని అలాగే వుంచి, తెలుగులో తీసేస్తే, దేశవ్యాప్తంగా ఒకే జీఎస్టీని అమలు చేస్తున్నామని కూడా ఎలా చెప్పుకుంటారో తెలీదు. తెలుగులో జీఎస్టీ డైలాగులు మ్యూట్ చేసినా, మఫ్టీలో వున్న ‘గోరఖ్ పూర్’ పరోక్ష ప్రస్తావన జోలికి పోలేదు. అంబులెన్స్ ఇవ్వక  పేదలు మైళ్ళకి మైళ్ళు ఆస్పత్రుల  నుంచి శవాల్ని మోసుకు వెళ్తున్నఉదంతాల ప్రస్తావనకీ తెలుగులో కూడా కత్తెర పడలేదు. అలాగే మందిరం కాదు, మందిరం కట్టే స్థలంలో ఆస్పత్రి కట్టాలని ఆస్పత్రిని కట్టి చూపించే దృశ్యాల పట్ల కూడా ఎవరికీ అభ్యంతరం లేదు. ఉచిత వైద్యం గురించి ఈ కథ ఇచ్చే సందేశం ఆలోచనాత్మకమే గానీ ఆచరణాత్మకం కాదు. ఐతే ఈ కాన్సెప్ట్ నంతా గజిబిజిగానో, నామమాత్రంగానో సినిమాకి వాడేసుకుని వదిలిపారెయ్యడంగా గాక, ఆద్యంతం సీరియస్ గానే పట్టించుకోవడం కమర్షియల్ కథకి సంతోషం కల్గించే విషయం.

ఎవరెలా చేశారు 
      మూడు పాత్రల్లో విజయ్ చేయాల్సిన మాస్ కమర్షియల్ హంగామా అంతా చేశాడు. డాక్టర్ గా, మెజీషియన్ గా, ఫ్లాష్ బ్యాక్ లో మల్లయుద్ధ వీరుడిగా ప్రేక్షకులకి ఏమేం కావాలో అవన్నీ అందించే
శాడు. గ్రామీణ వాతావరణంలో ఫ్లాష్ బ్యాక్ గ్రూప్ సాంగ్ లో విన్యాసాల్ని తారాస్థాయికి తీసికెళ్ళాడు. ఇద్దరు హీరోయిన్లతో రోమాన్స్ అంతంతమాత్రమే. కానీ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే మూడో హీరోయిన్ నిత్యా మీనన్ తో రోమాన్స్ భిన్నం. దాని నిడివి కూడా ఎక్కువ. అయితే అన్నదమ్ముల పాత్రల్లో అన్నెవరో తమ్ముడెవరో గుర్తించడానికి  పెద్ద తేడా చూపలేదు. ఇద్దరూ చేసే ఫైట్స్ థ్రిల్లింగ్ గానే వున్నాయి. 

          హీరోయిన్లు కాజల్, సమంతా లకి పెద్దగా పాత్రల్లేవు. డాక్టర్ గా కాజల్ వైద్యమే చేయదు. యాంకర్ గా సమంత హీరోతో ఒక ఇంటర్వ్యూ చేసి చేతులు దులుపుకుంటుంది. నిత్యా మీనన్ ది మాత్రం వూళ్ళో భర్త (విజయ్ – 3) తో కలిసి పోరాటం చేసి,  మరణించే హోమ్లీగా వుండే  బరువైన పాత్ర. కమెడియన్ వడివేలు విజయ్ -1 తో వుండి, సీక్రెట్ ఆపరేషన్స్ లో సహకరిస్తూంటాడు. పోలీస్ అధికారిగా సత్య రాజ్ ది వేళాకోళం పాత్ర. ఇక విలన్ గా ఎస్ జే దూర్య మరోసారి ఖతర్నాక్ గా వుంటాడు. చివర్లో హీరోల చేతుల్లో తన్నులు తిన్నాక, అతను కనబర్చే పరిస్థితి, చూసే చూపులు అతడికే చెల్లు.

          మరోసారి అట్లీ తనబ్రాండ్ వెలుగు నీడల ఛాయాగ్రహణంతో రిచ్ మూడ్ తో చిత్రీకరణ చేశాడు ఈ కథని. కెమెరా మాన్ విష్ణు తీసిన కొన్ని షాట్స్ అనితరసాధ్యమైనవి. వూళ్ళో అగ్నిప్రమాద దృశ్యాల చిత్రణకి డౌన్ ప్లే చేసిన కలర్స్ తో క్లాసిక్ లుక్ తీసుకొచ్చాడు.

          ఏఆర్ రెహమాన్ నేపధ్య సంగీతం చాలా హోరుగా వుంది. ఒక థీమ్ లేదు. పాటలు కూడా ఒక్క ముక్క అర్ధం కావు. ఒక్క ముక్క అర్ధం గాక పోయినా ఫ్లాష్ బ్యాక్ గ్రామీణ గ్రూప్ సాంగొక్కటే  చెప్పుదగ్గ ట్యూనుతో వుంది. 

చివరికేమిటి 
        చెప్పుకోదగ్గది ఫ్లాస్ బ్యాక్ క్రియేషన్. సెకండాఫ్ లో సుదీర్ఘంగా సాగే ఈ ఫ్లాష్ బ్యాక్ కథ చెప్పడంలో ఒక సృజనాత్మక ప్రయోగం. స్పష్టమైన బిగినింగ్, మిడిల్, ఎండ్ లతో, సీన్లకి స్మూత్ ట్రాన్సిషన్స్ తో, ఫ్యామిలీ – పొలిటికల్ డ్రామాల కలబోతతో,  నీటుగా కన్పించే ఒక ఆల్బం లాంటిదనొచ్చు. ప్రారంభంలో ఒక సంబరాల పాటలోనే చాలా కథ చెప్పేస్తారు, కోరియోగ్రఫీ- మాంటేజెస్ ల జుగల్ బందీతో. మిగతా కథంతా ఒకెత్తు, ఈ ప్లాష్ బ్యాక్ అంతా ఇంకో అద్భుత లోకంలోకి తీసుకెళ్లడం ఒకెత్తు. ట్రాజడీతో ముగిసే ఈ ఫ్లాష్ బ్యాక్ కి మాస్టర్ స్ట్రోక్ లా, చీకట్లో  చెత్త కుప్పలో పారేసిన పసికందు ఆకాశంలోకి లేపే చెయ్యి వొక హెచ్చరిక.

          సుదీర్ఘమైన ఈ ఫ్లాష్ బ్యాక్ వల్లే సినిమా నిడివి పెరిగింది. అయినా ఈ ఫ్లాష్ బ్యాక్ బోరు కొట్టదు. దీని తర్వాత క్లయిమాక్స్ పన్నెండు నిమిషాల్లోనే పవర్ఫుల్ గా ముగిసిపోతుంది. 

          చెప్పొచ్చేదేమంటే, పచ్చి కమర్షియల్ మాస్ అయినా మీనింగ్ ఫుల్ గా తీయాలని. స్టార్ లకి ఇంకా మాసులు తీయడానికి కథల్లేవు. అవే మాసులు చూడ్డానికి ప్రేక్షకులు సిద్ధంగా లేరు. జరుగుతున్న ఉదంతాలని మాస్ కి కలిపి  కొత్త వాసనలు చూపించడానికి మనస్కరిస్తే, ఈ ‘మెర్సల్’ లా మెరవొచ్చు .

సికిందర్
https://www.cinemabazaar.in






`