రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

28, అక్టోబర్ 2017, శనివారం

536 : రివ్యూ!

కథ - దర్శకత్వం :  రోహిత్ శెట్టి
తారాగణం : అజయ్ దేవగణ్, అర్షద్ వార్సీ, తుషార్ కపూర్, శ్రేయాస్ తల్పడే, కుణాల్ ఖేమూ, పరిణీతీ చోప్రా, టబు, ప్రకాష్ రాజ్, నీల్ నితిన్ ముఖేష్, జానీ లివర్, సంజయ్ మిశ్రా, ముకేష్ తివారీ, మురళీ శర్మ తదితరులు
స్క్రీన్ ప్లే : యూనస్ సజావల్, మాటలు : సాజిద్ - ఫర్హాద్, సంగీతం : ఆమాల్ మాలిక్, తమన్ తదితరులు, ఛాయాగ్రహణం : జోమన్ టి. జాన్
బ్యానర్ : రోహిత్ శెట్టి ప్రొడక్షన్స్, మంగళ్ మూర్తి ఫిలిమ్స్
నిర్మాతలు : రోహిత్ శెట్టి, సంగీతా ఆహిర్
విడుదల : అక్టోబర్ 20, 2017
***
          మైండ్ లెస్ కామెడీల ‘గోల్ మాల్’ సిరీస్ లో నాల్గోది ‘గోల్ మాల్ ఎగైన్’ ఏడేళ్ళకి ప్రేక్షకుల్ని అలరించేందుకు వచ్చేసింది. మొదటి మూడు సిరీస్ కామెడీలు రెండేళ్ళ గ్యాప్ తో వస్తే, ఈ నాల్గోది చాలా సమయం తీసుకుంది.  సిరీస్ లో కొనసాగుతున్న హీరోల్లో ఒకరిద్దరి మార్పులు తప్ప మిగిలిన హీరోలంతా  ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ సిరీస్ హీరోలలాగే ఒక కుటుంబంగా పాపులరైపోయారు. హిందీలో ఐదుగురు హీరోలతో  ఒక సిరీస్ గా మల్టీ స్టారర్ సినిమాలు రావడం ఇదే ప్రథమం. పైగా ఇవన్నీ హిట్టవుతూ రావడం అలవాటుగా మారిపోయింది. పక్కా కమర్షియల్ దర్శకుడు రోహిత్ శెట్టి ఎప్పటి కప్పుడు సిరీస్ ని అప్ డేట్ చేస్తూ  ఒకదాన్ని మించి ఒకటిగా  తీసుకుంటూ పోతున్నాడు. ప్రస్తుత మైండ్ లెస్ కామెడీని డిజైనర్ లుక్ తో ప్రెజెంట్ చేయడంతో అంతా కొత్త కొత్తగా, కన్నుల పండువగా మారిపోయింది. పాత కథలకే  డిజైనర్ లుక్ అద్దినప్పుడే అవి  వొక ఫాంటసీ లాగా మారిపోయి హిట్టవగలవని  దీంతో రుజువు చేశాడు. 

          చివరంటా ప్రేక్షకుల్ని కుదురుగా కూర్చోనివ్వని ‘గోల్ మాల్ ఎగైన్’ మైండ్ లెస్ కామెడీలకి వొక పరాకాష్ఠ. కామెడీ కోసం అశ్లీలాన్ని ఆశ్రయిస్తున్న రోజుల్లో, ఇబ్బంది పెట్టకుండా ఇంతకంటే ఎక్కువ డోసుతో ప్రేక్షకుల్ని సీట్లలో ఎగిరెగిరి పడేలా చేసే  మైండ్ లెస్ కామెడీలే చాలా బెటరని కూడా దీంతో రుజువవుతోంది. కాకపోతే ఇది చాలా క్రియేటివిటీని  డిమాండ్ చేస్తుంది  అశ్లీల – ద్వంద్వార్ధాల కామెడీల కంటే. ఈ నేపధ్యంలో ఈ నాల్గో ప్రాంచైజ్ కథాకమామిషేమిటో ఓసారి  చూద్దాం...

కథ
     గోపాల్ (అజయ్ దేవగణ్), మాధవ్ (అర్షద్ వార్సీ), లక్కీ (తుషార్ కపూర్), లక్ష్మణ్ వన్ (శ్రేయాస్ తల్పడే),  లక్ష్మణ్ టూ (కుణాల్ ఖేమూ) ఐదుగురూ ఊటీలో జమునాదాస్ (ఉదయ్ టికేకర్) నడిపే రాజభవనం లాంటి అత్యంత విలాసవంతమైన అనాధాశ్రమంలో పెరుగుతారు. పెరుగుతున్నప్పుడు పసిపాపగా వున్న ఖుషీ (పరిణీతీ చోప్రా) ని ఎవరో గేటుముందు వదిలేసి పోతారు. ఆ ఖుషీని ఆడిస్తూ పాడిస్తూ పెంచుతారు. ఈ ఐదుగురూ కుదురుగా వుండే శాల్తీలు కావు. ఒక వెధవ పని చేసి గోపాల్, లక్ష్మణ్ టూ లు అనాధాశ్రమం నుంచి అవుటయి పోతే, మిగతా ముగ్గురూ అలాగే గెటవుటై పోతారు. అలా మొదటి ఇద్దరూ ఎక్కడో, తర్వాతి ముగ్గురూ ఇంకెక్కడో పదేళ్ళ తర్వాత పెద్దవాళ్ళయి తేల్తారు. ముగ్గురు వసూలీ భాయ్ (ముఖేష్ తివారీ) అనే రియల్ ఎస్టేట్ దొంగ వెంట వుంటే, ఇద్దరు ఖాళీగా తిరుగుతూంటారు. ఈ ఇద్దర్లో గోపాల్ చీకటిపడితే దెయ్యాలుంటాయని భయపడి చచ్చేరకం. ఇతణ్ణి  జోలపాడి నిద్రపుచ్చుతూంటాడు లక్ష్మణ్ టూ. ఈ దెయ్యం భయాన్నే ఉపయోగించుకుని మిగతా ముగ్గురూ టెక్నికల్ గా దెయ్యపు చేష్టల్ని సృష్టించి,  వాళ్లిద్దర్నీ ఫ్లాట్ ఖాళీ చేయిం చేస్తారు వసూలీ భాయ్ కోసం. 

          అప్పుడు ఆ ఇద్దరికీ తమని పెంచిన జమునాదాస్ చనిపోయాడని తెలిసి ఊటీ వెళ్లి అనాధాశ్రమంలో మకాం పెడతారు. అప్పటికే రియల్ ఎస్టేట్ కోసం అనాధాశ్రమం ఆస్తులపైన కన్నేసిన బిగ్ షాట్ వాసూ రెడ్డి (ప్రకాష్ రాజ్) కి ఈ ఇద్దరి మకాం నచ్చక, ఖాళీ చేయించేందుకు వసూలీ భాయ్ కి ఆర్డరేస్తాడు. వసూలీ భాయ్ మళ్ళీ ఆ ముగ్గురికీ ఎసైన్ మెంటిచ్చి  పంపుతాడు. అనాధాశ్రమం వచ్చిన  మాధవ్, లక్కీ, లక్ష్మణ్ టూ ముగ్గురూ మళ్ళీ గోపాల్, లక్ష్మణ్ వన్ ల పనిబట్టడం మొదలెడతారు. అక్కడే ఇప్పుడు అందమైన యువతిగా ఎదిగిన ఖుషీని చూస్తారు. ఖుషీని ప్రేమిస్తున్న గోపాల్ నీ చూస్తారు. చిన్నప్పుడు తాము చూసిన ఆశ్రమ ఇంఛార్జి, లైబ్రేరియన్  ఆనా (టబు)నీ చూస్తారు. ఇంతలో ఖుషీ అమ్మాయి కాదనీ, ఆత్మ అనీ తెలిసి మొత్తమంతా ఠారెత్తి పోతారు. 

          ఖుషీ ఆత్మ ఎలా అయింది? జమునాదాస్ ఎలా చనిపోయాడు? నిఖిల్ (నీల్ నితిన్ ముఖేష్) అనే ఎన్నారైతో కలిసి  వాసూరెడ్డి ఏ ఘాతుకానికి పాల్పడ్డాడు? ఈ పరిస్థితికి ఐదుగురూ ఒకటై ఏం చేశారు? ... ఇవన్నీ మిగతా కథలో తేలే విషయాలు. 

ఎలావుంది కథ
     ఇది తెలుగులో పైశాచిక ఎమర్జెన్సీ విధించుకుని యుద్ధప్రాతిపదికన ఉత్పత్తి చేస్తున్న,  అరిగిపోయిన మూస దెయ్యాల కామెడీ కాదు. దెయ్యాల కామెడీలనే సులభమైన పని పెట్టుకున్నాక, ఫాంటసీ అనే జానర్ నే మర్చిపోయారు. ‘గోల్ మాల్ ఎగైన్’ ఆత్మతో ఒక అందమైన ఫాంటసీ. ఈ ఆత్మ తెలుగు దెయ్యంలా భయపెట్టే దుకాణం పెట్టుకోదు. భయపడే పాత్రలు కామెడీలు  చేసే వ్యాపారం పెట్టుకోవు. బరితెగించిన కామెడీ ఐదుగురు హీరోల కజ్జాలతోనే వుంటుంది. ఆత్మని ఫాంటసీ చేసి, డిజైనర్ లుక్ తో కొత్తదనం తీసుకొచ్చిన వినోదాత్మక కథ ఇది.  

ఎవరెలా చేశారు 
      ఐదుగురూ టాప్ రేంజిలో తమతమ బఫూనరీలని ప్రదర్శిస్తారు. ఎక్కువ కామిక్ టైమింగ్ వున్న వాడు శ్రేయాస్ తల్పడే. సమయస్ఫూర్తితోనే హాస్యం పండుతుంది. అజయ్ కి జోల పాడేటప్పుడు, అజయ్ కి పరిణీతి కోసం హెల్ప్ చేసేటప్పుడు, శత్రుత్రయం ముగ్గురి తాటతీసే సన్నివేశాల్లో, తల్పడే పాల్పడే మైండ్ లెస్ కామెడీ కి అంతుండదు. అజయ్ దేవగణ్ ప్రేమించే పరిణీతీ  చోప్రా చిన్నప్పుడు ఎత్తుకున్న పాప అని తెలిశాక తల్పడే ఒక డైలాగు కొడతాడు – ప్రతీ ఆడపిల్లా తనక్కాబోయే వాడిలో ఫాదర్ ఫిగర్ని చూస్తుంది. ఆమెకి ఫిగరుంది, నువ్వు ఫాదర్ వి - అని! ఐయాం నాటే ఘోస్ట్, ఐయాం యువర్ దోస్త్ అంటాడు. నెక్స్ట్ స్టెప్, బెస్ట్ స్టెప్,  ఫినిష్ స్టెప్ అంటూ హడావిడి చేస్తూంటాడు. 

 ఇలాగే ఒక సమోసా కోసం తినే బల్ల దగ్గర కామెడీని ఎక్కడికో తీసికెళ్ళి పోయే కుణాల్ ఖేమూ. ఒకచోట డైలాగు – వీడికి సాయం చేయడమంటే, యాక్స్ (గొడ్డలి) తో కాళ్ళు నరుక్కోవడమే, బ్లాక్ మనీ మీద టాక్స్ వేయడమే, ఇంటర్వెల్ కే క్లయిమాక్స్ రావడమే!

          గోల్ మాల్ సిరీస్ లో మూగవాడి పాత్ర వేస్తున్న తుషార్ కపూర్ ఒక బిగ్ ఎట్రాక్షన్. నోటితో ఏదేదో అరుస్తాడు కానీ ఎక్స్ ప్రెషన్స్ తో విషయం చెప్తాడు. మూగ పాత్రని  ఒక కల్ట్ క్యారక్టర్ లా తయారు చేసిపెట్టాడు తను. 

          అజయ్ దేవగణ్ ది సీరియస్ కామెడీ. ఎవరైనా తన వైపు వేలు చూపిస్తూ  మాట్లాడితే వేలు విరిచేస్తాడు. పది వేళ్ళతో తుషార్ కపూర్ ఓవర్ యాక్షన్ చూసి,  పది వేళ్ళూ వెనక్కి వంచేస్తాడు. వెనక్కి వంగిన వేళ్ళతో తిరుగుతూంటాడు తుషార్. అజయ్ ఎవర్నయినా కొడితే,  దెబ్బ తగిలిన వాడు రెండు మూడు సార్లు కట్ షాట్స్ లో బంతి కొట్టుకున్నట్టు ఎగిరెగిరి నేలకి కొట్టుకోవాల్సిందే. 

అర్షద్ వార్సీ ది పైకి నవ్వుతూనే వాతలు పెట్టే కామెడీ. పరిణీతీ చోప్రా ఆత్మ అని ఎవరూ అనుకోరు. ఒకమ్మాయి లాగానే కలిసిమెలిసి వుంటుంది. ఈమె పాత్ర ఆశ్రమంలో పనిమనిషి. ఆత్మగా రివీలయ్యాక కొత్త విషాదం తోడవుతుంది పాత్రకి. చివర్లో పగ  దీర్చుకుంటుంది. ఈ పగదీర్చుకోవడంలో కూడా దెయ్యంలా భీకరంగా మారదు. ఒకమ్మా యిలాగే వుంటుంది. ఈ పాత్రని తీర్చిదిద్దడంలో ఫాంటసీ జానర్ దెబ్బతినకుండా చూశారు. 

          ఆనా పాత్రలో టబుకి ఆత్మలు కన్పిస్తాయి, వాటితో మాట్లాడుతుంది. ఈమె పెద్దదిక్కుగా తిరుగుతూంటుంది. టబూ మీద కోల్డ్ క్రీం అంటూ మంత్రాలు చదివే సీను పెద్ద కామెడీ.  హీరోలందరూ తన కళ్ళ ముందు పెరిగిన బచ్చాగాళ్ళు. ఇక చాలా కాలానికి జానీ లివర్ కన్పిస్తాడు. పప్పీ భాయ్ పాత్రలో ఒక సన్నివేశంలో హైదరాబాదీ ఉర్దూతో అల్లకల్లోలం రేపుతాడు. 

          విచిత్రమైన కౌబాయ్ డ్రెస్సులో బాబ్లీ భాయ్ గా సంజయ్ మిశ్రా ది  ఇంకో సందడి. సినిమాలతో కలిపి మాట్లాడి పరువు తీస్తూంటాడు- ఏం బ్యాండ్ వాయించావురా నా అపస్వరాల జస్టిన్ బీబర్ అంటాడు. రేయ్ కుందేలులా అరవకు అంటాడు. ఇక్కడ భూతముంటే వెళ్లి భూతానికి చెప్పు గెస్ట్ అప్పీరియన్సుగా బబ్లీ వచ్చాడని అని అర్డరేస్తాడు. ఘోస్ట్ - జి ఎస్ టి ఘోస్ట్ అని స్పెల్లింగ్ చెప్తాడు. షో హిమ్  యువర్ మూవ్స్ ఖుషీ బేటీ ఎంటీవీ మూవ్స్ అని ఆత్మని ఎంకరేజి చేస్తాడు. క్యాకరే క్యా నాకరే డూ వాట్ విల్ డూ స్కూబీ డూ అంటూ చిత్రవిచిత్రంగా మాట్లాడే క్యారక్టర్ ఇది. కామిక్ విలన్ ప్రకాష్ రాజ్, సీరియస్ విలన్ నీల్ నితిన్ ముఖేష్.

రోహిత్ శెట్టి రెగ్యులర్ రైటర్స్ సాజిద్ – ఫర్హాద్, యూనస్ సజావల్ లు మరోసారి మైండ్ లెస్ కామెడీని ఆద్యంతం వినోదభరితం చేశారు కొత్త పద ప్రయోగాలతో. సంగీతం, ఛాయాగ్రహణం, గ్రాఫిక్స్, నృత్యాలు, పోరాటాలు టికెట్టు కొన్న ప్రేక్షకుడికి పూర్తి సంతృప్తి నిస్తాయి.

చివరికేమిటి 
      రీ సైక్లింగ్ కథల రోహిత్ శెట్టి ఈసారి డిజైనర్ లుక్ సమర్పిం
చడంతోపాతకథేచూస్తున్నామన్పించదు. గతంలో అవే ఫ్యామిలీ డ్రామాలు తీస్తున్న సూరజ్ బర్జాత్యా పంథా మార్చి ‘మై ప్రేమ్ కీ దీవానీ హూఁ’  కి డిజైనర్ లుక్ ఇస్తే రాణించలేదు. అప్పట్లో ఆ కొత్తకి ప్రేక్షకులు అలవాటు పడలేదు. ఇతరులు ‘అశోకా’ లాంటి చరిత్రకాల్ని డిజైనర్ చరిత్రలుగా తీసినా హిట్టవలేదు. చరిత్రల్ని వాటి పురాతన తత్వ్తంతోనే తీయాలి. కానీ ఒక రెగ్యులర్ మూస కమర్షియల్ కథని చిత్రీకరణ పరంగా అదే మూసలో ఇంకా తీస్తున్నప్పుడు పాత వాసనేసి పై స్థాయికి తీసికెళ్ళదు. సినిమాల్లో ఇంకా అనాధాశ్రమం అనే సెటప్ అరిగిపోయిన ఫార్ములా. దీన్ని ఎప్పటిలాగే ఓ పాత బిల్డింగులో చింపిరి పిల్లలతో ఈసురోమని తీస్తూపోతే విజువల్ అప్పీల్ వుండదు. అన్ని అప్పీల్స్ తో బాటు విజువల్ అప్పీల్ కూడా చాలా ముఖ్యం. ఎందుకు ముఖ్యమో ప్రొడక్షన్ డిజైనర్ పీటర్ లార్కిన్ చెప్తాడు – మూడు కారణాలు : 1. సినిమాలు పలాయనవాద వినోదాలుగా మారడం, 2. టీవీ, లాప్ టాప్, స్మార్ట్ ఫోన్ ల వంటి బహువిధ స్క్రీన్స్ తో పోటీ  నెదుర్కోవడం, 3. ఎప్పటికప్పుడు కొత్తగా వస్తున్న దర్శకులతో పోటీ పడాల్సి రావడం. 

            భావోద్వేగాలు ఎప్పుడూ ఒకలాగే వుంటాయి, భావోద్వేగాల కారణాలు కాలంతో బాటు మారిపోతూంటాయి. ఉమ్మడి కుటుంబంగా కలిసి వుండాలనుకోవడం ఒకప్పటి భావోద్వేగం, ఇప్పుడు కాదు. మగ కుర్రాళ్ళు చేయి చేయి పట్టుకుని తిరగడం ఒకప్పటి స్నేహాన్ని ప్రకటించుకునే భావోద్వేగం, ఇప్పుడు కాదు. అలాగే ఫార్ములా సెటప్స్  పైన చెప్పుకున్న మూడు కారణాల వల్ల మారాల్సిందే. కథలూ అదే మూస, వాటి సెటప్సూ అదే మూసలో వుంటే ఆధునిక ప్రేక్షకులు అఫెండ్ అవుతారు. ఇండియాలో ప్రేక్షకులిప్పుడు ఉన్నదాంతో సంతృప్తి పడే స్థితిలో లేరు. ఉన్నత వర్గాలని చూసి మధ్య తరగతి వర్గాలు, మధ్యతరగతి వర్గాలని చూసి కింది వర్గాలూ పోటీలుపడి అనుకరిస్తున్నారు. అనుకరణల మోజులో లేమి లేనట్టే ప్రవర్తిస్తున్నారు. వీళ్ళకి బిగ్ బడ్జెట్ సినిమా అందమైన ప్రపంచాల్ని చూపించాల్సిందే. డిజైనర్ లుక్ అంటే ఉన్నదాన్ని ఎక్కువ చేసి చూపించడమే. చిన్న బడ్జెట్ సినిమాలకి సెటప్స్ మూసలో వుండక తప్పదు. కానీ పెద్ద బడ్జెట్ సినిమాలకీ అవే వుంటే వాటి విజువల్ అప్పీల్ లో తేడా ఏమీ వుండదు.  

          కనుక   ‘గోల్ మాల్ ఎగైన్’  లో ఎక్కువభాగం అనాధాశ్రమంలో నడిచే కథ కావడంతో, ఆ అనాధాశ్రమాన్ని ఊటీలాంటి అందమైన ప్రదేశంలో అత్యంత రిచ్ భవనాల్లో చూపించడంతో మొత్తం కథే పాత  మూసని మరిపించేట్టు తయారయ్యింది. పైగా రెగ్యులర్ దెయ్యం కామెడీ చేయకుండా ఫాంటసీకి మార్చడంతో విజువల్ అప్పీల్ మరింతగా పెరిగింది. ఇంతే గాకుండా, కామెడీని  ఈ సిరీస్ మెయింటెయిన్ చేస్తున్న మైండ్ లెస్ కామెడీనే కంటిన్యూ చేయడంతో ఫాంటసీ విభిన్నంగా తయారయ్యింది. ఇక ఈ సిరీస్ లో ఎప్పుడో పాపులరైన హీరోలని చూపించిన విధానాన్ని హాలీవుడ్ హై కాన్సెప్ట్ పద్ధతిలో చూపించడం వల్ల కూడా ఫాంటసీ మరింత ఎంటర్ టైనర్ గా  మారింది.
          ఇలా డిజైనర్ లుక్, ఫాంటసీ, మైండ్ లెస్ కామెడీ, హై కాన్సెప్ట్ స్టార్ ప్రెజెంటేషన్ అనే నాల్గు ప్రత్యేక హంగులతో మార్కెట్ యాస్పెక్ట్ ఉట్టి పడేలా ప్రొడక్షన్ ని డిజైన్ చేశారు.

                                                  ***
   ఒకప్పుడు మల్టీ స్టారర్ లు కథాబలంతో బరువుగా వుండేవి. పాత్రచిత్రణలూ, సంఘర్షణలూ సంక్లిష్టంగా వుండేవి. కాలం మారింది. హాలీవుడ్ లో బిగ్ బడ్జెట్స్ కి హై కాన్సెప్ట్ కథే వుంటుంది. దాన్ని సింపుల్ గా చెప్పేస్తున్నారు. విజువల్ యాక్షన్ భారీగా వున్నప్పుడు కథకూడా భారంగా వుండకూడదనే బ్యాలెన్సింగ్ యాక్ట్ ప్రదర్శిస్తున్నారు. అదే చిన్న బడ్జెట్స్  లో- కాన్సెప్ట్ కథల్ని సంక్షుభితం చేసి చూపిస్తున్నారు. వీటికి విజువల్ యాక్షన్ వుండదు కాబట్టి పాత్రలూ వాటి సంఘర్షణలూ అనేక పొరలు కమ్మి వుంటాయి. మూల సూత్రం : ప్రేక్షకుల మీద ఏదో వొక భారాన్ని మాత్రమే వేయాలి.

           పై  సూత్రాన్ని అనుసరిస్తున్నట్టు,  అలరించడానికి మల్టీ స్టారర్ గా భారీ విజువల్ ఎరీనా వున్న ప్రస్తుత ‘గోల్ మాల్ ఎగైన్’ కి కథని నామమాత్రం చేశారు. పైగా  పాత రొటీన్ కథ. ప్రేక్షకులకి ఈ లోటు తెలీదు. ఇక్కడ స్టార్స్ కోసం కథ లేదు, స్టార్స్ చేసే మెదడు తక్కువ టక్కుట మారాలకోసం కథ వుండాలి కాబట్టి ఏదో వుంది. ఐతే నామ మాత్రపు కథకి తెగ నవ్వించి ఎంత ఎంటర్ టైన్ చేసినా,  చివరికొచ్చేసరికి ‘సో వాట్?’ అనుకుంటాడు ప్రేక్షకుడు. అప్పుడు కాస్త ఫీల్ లోకి దింపుతారు సన్నివేశాల్ని. క్లయిమాక్స్ లో హీరోయిన్ పగదీర్చుకునే సన్నివేశాలు ఇవే. 

          ఒక లైనుగా చెప్పుకుంటే, తాము పెరిగిన అనాధాశ్రమం యజమానినీ, తాము పెంచిన అమ్మాయినీ శత్రువులు చంపేస్తే,  వాళ్ళని రప్పించి అమ్మాయి ఆత్మకి అప్పజెప్పడం మాత్రమే కథ. ఈ సింపుల్ లైనుని మల్టీ స్టారర్ ని దృష్టిలో పెట్టుకుని, ఘోరమైన ఏడ్పులతో, ఆత్మ ప్రతీకారాలతో, అరుపులతో, భయపెట్టడాలతో, అది చెప్పుకునే భయంకర ఫ్లాష్ బ్యాకులతో సంక్షుభితం చేసి తలబొప్పి కట్టించకుండా, అంతే సింపుల్ గా, ఫన్నీగా లైట్ రీడింగ్ మెటీరియల్ లాగా అందించేశారు. 

          ఎంత మైండ్ లెస్ కామెడీ అయినా  లాజిక్ పునాదిగానే వుండాలి. లేకపోతే నవ్వలేం. పరిస్థితి లాజికల్ గా వుండాలి, ఆ పరిస్థితికి రియాక్టయ్యే పధ్ధతి ఎంత ఇల్లాజికల్ గా వున్నా ఫర్వాలేదు. సిగరెట్లు కొనాలనుకోవడం లాజికల్ పరిస్థితి. దానికోసం విమానమెక్కి వెళ్ళడం ఇల్లాజికల్ ప్రవర్తన. ఈ ఇల్లాజికల్ ప్రవర్తనే మైండ్ లెస్ కామెడీ,  లేదా అసంబద్ధ కామెడీ అవుతుంది. ఇది అరిస్టాటిల్ సూత్రం. ప్రస్తుత కథలో హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ లో లోపమిదే. ఎత్తుకుని లాలించిన పిల్లనే హీరో ప్రేమించడం, దాన్ని కామెడీ చేయడం ఇబ్బంది కల్గించేదే. ఎంత మెదడు లేని వాడు కూడా ఈ పనిచెయ్యలేడు. ఆమెకి అన్నగానో, తండ్రిగానో  ఫీలవుతాడు. ఇది చూసి శ్రేయాస్ తల్పడే – బీవీసే బేటీ బన్ గయీ, బేటీ సే భూత్నీ బన్ గయీ – అని జోకులేసినా  ఎంజాయ్ చేయలేం. బచ్పన్ ( పసితనం) – పచ్పన్ (ముసలితనం) అని హీరోహీరోయిన్ల నుద్దేశించి కామెంట్లు చేసినా బలవంతపు కామెడీగానే వుంది. చీకటి పడితే దెయ్యాలుంటాయని భయపడేవాడు తెలీక ఆత్మనే ప్రేమించడం మంచి డైనమిక్కే గానీ,  ఇందులో రోమాన్సుకీ,  తద్వారా మైండ్ లెస్  కామెడీ కీ  లాజిక్కే అడ్డుపడుతుంది. మానవసంబంధాలని లాజికల్ గాచూపించాలనేది ఇందుకే.

          ‘గోల్ మాల్ ఒన్స్ ఎగైన్’  అని మళ్ళీ తీస్తే అదెలా వుంటుందనేది ఆసక్తి రేపే ప్రశ్న. ఈ గోల్ మాల్ గ్యాంగ్ అంతా ఇక ఫారిన్లో అల్లరి చేస్తారేమో.


-సికిందర్ 
www.cinemabazaar.in

27, అక్టోబర్ 2017, శుక్రవారం

535 :రివ్యూ !

రచన –దర్శకత్వం : కిషోర్ తిరుమల
తారాగణం :  రామ్, అనుపమ,  లావణ్యా త్రిపాఠీ, శ్రీవిష్ణు, ప్రియదర్శి తదితరులు
సంగీతం : దేవీశ్రీ ప్రసాద్, ఛాయాగ్రహణం : సమీర్ రెడ్డి
బ్యానర్ : స్రవంతి సినిమాటిక్స్, పిఆర్ సినిమాస్
నిర్మాత : కృష్ణ చైతన్య
విడుదల :  అక్టోబర్ 27, 2017

***
         ద్దరు బాల్యమిత్రులు. ఒకర్ని విడిచి ఒకరుండలేరు. ఇద్దరి మధ్య మిత్రత్వం కంటే ఇంకేదో ఎక్కువ. అభి ( రామ్) మ్యూజిక్ బ్యాండ్ నిర్వహిస్తూ వైజాగ్ లో వుంటాడు. వాసు (శ్రీ విష్ణు) ఏదో ప్రాజెక్టు పనిమీద ఢిల్లీ పోతాడు. అభి వైజాగ్ లో హౌస్ సర్జన్ మహా (అనుపమ) తో ప్రేమలో పడతాడు. ఆమెకూడా ప్రేమిస్తుంది. కానీ పైకి చెప్పుకోరు. ఆమెకి పాడాలని వుంటుంది. ఆమెకి పాట నేర్పి ప్రోగ్రాం ఇప్పిస్తాడు. ఇంతలో వాసు తిరిగి వచ్చి ఆమెని  ప్రేమిస్తున్నానంటాడు. అభి హర్ట్ అయి, ఫ్రెండ్ షిప్ కోసం ఓకే అంటాడు. వాసు మహాకి ప్రేమని వెల్లడిస్తాడు. అభి కూడా వెల్లడించి నిర్ణయం చెప్పమంటాడు. ఆమె వాసునే చేసుకుంటానంటుంది. వాసు ఆమెతో వుంటూ అభిని నిర్లక్ష్యం చేస్తాడు. అభి మళ్ళీ హర్ట్ అయి గొడవపడి దూరంగా వెళ్ళిపోతాడు.  ఎటూ పాలుపోక మహా యాక్సిడెంట్ చేసుకుని చనిపోతుంది. నాల్గేళ్ళ తర్వాత అభి తిరిగి వస్తాడు. ఇంత జరిగినా అభి తెలుసుకుని రానందుకు వాసు దూరంగా వుంటాడు. ఇద్దరి మధ్య మాగీ (లావణ్య) అనే కొత్తమ్మాయి వస్తుంది. ఈమెని ఎవరు పొందారు, స్నేహితులిద్దరూ తిరిగి ఎలా ఒకటయ్యారనేది మిగతా కథ.

ఎలావుంది కథ

          కథ కాదు గాథ. పాసివ్ పాత్రల బాధామయ గాథ. గాథలు తీసుకుని పోసుకోలు 
కబుర్లు చెప్పుకోవడమే సరిపోతోంది, అవెంత ఫ్లాపుతున్నా సరే. మార్కెట్ యాస్పెక్ట్, క్రియేటివ్ యాస్పెక్ట్, యూత్ అప్పీల్, మాస్ అప్పీల్, మొత్తంగా బాక్సాఫీసు అప్పీల్, ట్రెండ్ గ్రిండ్  కుచ్ భీ జాంతానై. జిందగీ జాయే పర్  పురానా ‘చాదస్తం’  న జాయే! ఈ గాథకి కూడా కాలీన స్పృహ లేదు. ఇద్దరు అబ్బాయిల మధ్య స్నేహాన్ని జాగ్రత్తపడి తెర కేక్కించక పోతే నవ్వులపాలవుతారు. స్నేహంలో వున్న ఇద్దరు అబ్బాయిలు ఒకరంటే ఒకరు పడిచచ్చి పోవడం, ఒకరు లేకపోతే  ఇంకొకరు బతకలేమనుకోవడం, లవర్స్ కి మించిన లవ్ ప్రకటించుకోవడం బాపతు సినిమాలు ఒకప్పుడు వచ్చేవి. అప్పట్లో ఇంకో అర్ధం అందులో కనపడక పోయేది. కనీసం 2005 తర్వాత నుంచీ ఇలా వస్తున్న హిందీ సినిమాలకి ప్రేక్షకులు ఇక  గోలెట్టడం మొదలెట్టారు. ఇద్దరు హీరోల మధ్య ఆ అతి స్నేహం ‘గే’ సంబంధం లాగే కనబడుతూ ఛీ పొమ్మన్నారు. దీంతో ఇదంతా ఎందుకని కరణ్ జోహార్ డైరెక్టుగానే ‘దోస్తానా’ అనే ‘గే’ సినిమా ఒకటి తీసిపారేసి  అంకితమిచ్చేశాడు. 

          ఒకప్పుడు అబ్బాయిలు చేయి చేయి పట్టుకుని తిరిగేవాళ్ళు. ఇప్పుడలా తిరిగే ధైర్యం ఎవరూ చేయడం లేదు. ఓపెన్ గా  ‘గే’ కల్చర్ ఈజ్  ఏ గేమ్ ఛేంజర్ అయిపోయింది. ఈ వాస్తవాన్ని, ప్రతికూలతని తెలుసుకోలేదు ఈ గాథ. ఇందులో ఇద్దరు హీరోలు వాళ్ళ  ‘అతి స్నేహం’  కొద్దీ హీరోయిన్ని బలిగొన్నారు. ఆమెతో ప్రేమకన్నా తమ ప్రేమానుబంధాలే ముఖ్యమైపోయి, ఆమె జీవితాన్నెలా ముగించారో కూడా తెలుసుకోరు! ఒకర్ని విడిచి ఒకరుండలేని మగ ఫ్రెండ్స్ కి ఆడ గాలెందుకనేది ప్రశ్న!

ఎవరెలా చేశారు
       గడ్డం పెంచి రామ్ నేటివ్ డీ కాప్రియోలా వుంటాడు. పాత్రకి హుషారు తక్కువ, హూందాతనం ఎక్కువ. గాథ ప్రకారం వుండాల్సిన పాసివ్ పాత్ర. ఫ్రెండ్ షిప్ మీద కొటేషన్స్ లో స్పెషలిస్టు. ఫ్లాష్  బ్యాక్ ప్రేమ - స్నేహాల గాథలో వొత్తుగా గడ్డంతో వుంటూ, ఇవి రెండూ విషాదమవగానే ఫ్రెష్ గా షేవ్ చేసుకుని రివర్స్ లో కన్పిస్తాడు (ఇది గమనించారో లేదో మేకర్లు). తెచ్చిపెట్టుకున్న హూందాతనం వల్ల ఎంటర్ టైన్ చేయడం కష్టమై పోయింది. కొన్ని డైలాగులు మాత్రమే విసిరి అభిమానుల్ని అలరిస్తాడు. అదేమిటోగానీ, పాప్ సింగర్ గానూ పాటల్లో స్పీడు కన్పించదు. అభిమానులాశించే స్టెప్పు లేయడు. ఈ పాటలు కూడా పూర్తిగా వుండవు. కనీసం హీరోయిన్ కి పాట నేర్పే ముఖ్యమైన మలుపుకి సంబంధించిన పాట ఈవెంట్ కూడా అర్ధోక్తిలో ఆగిపోతుంది. గాథ నిడివి ఎక్కువైపోవడం వల్ల,  పాటల్ని ట్రిమ్మింగ్ చేసినట్టుంది. కమర్షియల్ హీరో పాటలకి రేషన్ పెడితే ఫ్యాన్స్ పరేషాన్ ఐపోతారు.

          నటన విషయానికొస్తే రామ్  బాగా నటిస్తాడు, సందేహం లేదు. కాకపోతే నటిస్తున్న పాత్ర కన్విన్సింగ్ గా వుండాలి. గాథ లోంచి అంత కన్విన్సింగ్ గానూ భావోద్వేగాలు పుట్టాలి. ఇంటర్వెల్ కి ముందు పది నిముషాలు, శుభం కి ముందు మరో పది నిముషాలూ  తప్ప మిగిలినవన్నీ కాలయాపన కోసమన్నట్టు పేర్చిన అర్ధంలేని సీన్లే వుంటే ఏం గాథ నడిపిస్తాడు, నడిపించకపోతే ఏం నటిస్తాడు, ఏం ఆకట్టుకుంటాడు. 

          రెండో హీరో శ్రీవిష్ణు అయితే మరీ సీరియస్ గా వుంటాడు. ఇంత జీవితాన్ని చదివేసినట్టు పాత్రలుంటే ఇంకేం వుంటుంది చెప్పడానికి. పాత్రలంటే జీవితాన్ని తెలుసుకునే ప్రయత్నంలో సర్కస్ ఫీట్లు చేసే జోకర్లు కావా? ‘దంగల్’ లో, ‘సీక్రెట్ సూపర్ స్టార్’ లో సమస్యలతోవుంటూనే పాత్రలు ఎంత ఫన్నీగా వుంటాయి. ఇప్పుడొస్తున్న హిందీ సినిమాలనుంచి ఏమీ నేర్చుకోనవసరం లేదా? తెలుగు ప్రేక్షకులు గంభీర ముద్రతో అలాగే ఆసనమేసుకుని సినిమాలు చూసే ప్రత్యేక జీన్సు తో పుట్టారా? 


          ఫస్టాఫ్ హీరోయిన్ అనుపమ ఒక్కతే బాగా మనసుల్లో నాటుకుంటుంది. కారణం,  ఈమె నటించడానికో పాత్ర వుంది, ఈమెకో గాథ వుంది, చివరికో సమస్య వుంది, సంఘర్షణా వుంది. ఈమెని సంఘర్షణలో పడేసి తప్పుకుంటారు హీరోలు. ఆశోపహతురాలైన ఈమె డైరీ రాసిపెట్టి ఆత్మహత్య చేసుకుంటుంది - మీ మగ ఫ్రెండ్ షిప్పు తగిలెయ్యా అన్నట్టు. 


          సెకండాఫ్ హీరోయిన్ లావణ్య కి సరైన పాత్ర లేదు. హీరో లిద్దరి నిర్వాకంవల్ల ఫస్ట్ హీరోయిన్ కేం జరిగిందో తెలిసి కూడా వాళ్ళ వెంటే వుండే బ్రెయిన్ లెస్ పాప. మనమెన్నో సార్లు చెప్పుకున్నట్టు కథనంలో లాజిక్ లేకపోయినా ఫర్వాలేదు, మానవ సంబంధాల్లో లాజిక్ ని చూపించకపోతే వీక్షకుల తలకెక్కవు కథలు. వీక్షకులందరికీ నిత్యం అనుభవమయ్యేది మానవ సంబంధాలే. 


          దేవీశ్రీ ప్రసాద్ పాటలు, సమీర్ రెడ్డి కెమెరా హైలైట్. దర్శకత్వం మాత్రం పాత స్కూలుకి చెందింది. ఇప్పటి ప్రేక్షకులకి భారమే. నడక చాలా స్లో. 


చివరికేమిటి 
     గాథ కాబట్టి, పాత్రలే తప్ప ప్రధాన పాత్ర వుండదు కాబట్టి,  స్ట్రక్చర్ ని ఆశించకూడదు. దాదాపు ప్రతీ రెండో తెలుగు సినిమా ఇంకా చాదస్తంగానే చిన్నప్పట్నుంచీ కథనెత్తుకుని అచ్చిబుచ్చి కబుర్లతో స్పూన్ ఫీడింగ్ చేస్తున్నాయి. ఇప్పటి ట్రెండ్ కి ఈ చిన్నప్పటి కథలు ఎవరికి ఆసక్తికరం. తీరుబడిగా కూర్చుని సినిమాలు చూసే రోజులా? నేరుగా హీరోలనే చూపించేసి, వాళ్ళెంత ‘గాఢమైన’ స్నేహితులో రెండు ముక్కల్లో చెప్పేస్తే అయిపోతుంది. ఇక్కడ చూపించిన చిన్నప్పటి సీన్లు మరీ సిల్లీగా వున్నాయి. ఇదంతా స్క్రీన్ టైంని వృధా చేయడమే. ఆ మాట కొస్తే హీరోలు పెద్దయ్యాక కూడా అరగంట వరకూ పాయింటే వుండదు గాథ నడిచేందుకు. హీరోయిన్ వచ్చాక వుంటుందనుకుంటే, ఆమెతో కూడా ఒకదానితో ఒకటి సంబంధంలేని అతుకుల బొంత సీన్లు. కేవలం ఇంటర్వెల్ దగ్గర కాస్త గాథ పెట్టుకుని ముగించేసే తేలిక పనితో ఈ సీన్ల పేర్పుడు కార్యక్రమం పెట్టుకున్నట్టుంది. తెలుగు సినిమా తీయడం ఇంత ఈజీ అయిపోయిందా – చిన్న పిల్లాడు కూడా తీసేయగలడు కదూ?

          ఇక ఇంటర్వెల్ ముందు పది నిమిషాల్లో నాల్గు మలుపు లొస్తాయి. మలుపువచ్చినప్పుడల్లా ఇదే ఇంటర్వెల్ అనుకుంటాం. గంటన్నర గడుస్తున్నా ఇంటర్వెల్లే రాదు. డిటో సెకండాఫ్ ముగింపు వరకూ. మళ్ళీ ముగింపులో, సడెన్ గావచ్చే  ముగింపుకి పనికొచ్చే నాల్గు సీన్లు  తప్ప,  మిగతావి సహనపరీక్ష పెట్టే  అతుకుల బొంత సీన్లే. అసలేం ‘మ్యాటర్’ చూస్తున్నామో అర్ధం గానట్టు వుంటాయి. 


          కొన్ని సిట్టింగ్స్ లో,  ప్రేమిస్తోందో లేదో తెలీని హీరోయిన్ కి హీరో తన ప్రేమ ఎలా వెల్లడించాలన్న దాని మీద హోరాహోరీ పోరాటాలు జరుగుతున్నాయి. నిజంగానే అది చాలా కష్టమైన పని పాత్రల్ని సరైన తీరులో దృష్టిలో పెట్టుకుంటే. కానీ ఈ గాథలో ఒకరు కాదు ఇద్దరు హీరోలు వచ్చేసి,  హీరోయిన్ కి తమ ప్రేమల్ని చెప్పేస్తారు కాఫీ ఇప్పించినంత ఈజీగా –ఆమె మనసేమిటో తెలుసుకోకుండానే!


          హీరోయిన్ని ప్రేమించానన్న సెకండ్ హీరోని,  ఫస్ట్ హీరో ఆమె దగ్గరికి తీసికెళ్ళి చెప్పించేస్తాడు. ఆమె ఇంకా తేరుకోక ముందే, తనుకూడా ప్రేమిస్తున్నట్టు చెప్పేస్తాడు! ఫ్రెండ్స్ గా మేమింత పారదర్శకంగా వున్నాం, నువ్వే మాలో ఒకర్ని ఎంచుకో అనేస్తాడు. ఈ మాటలు ఆమె మీద ఎలా పనిచేసి ఏం జరుగుతుందో నన్న ఆలోచన లేకుండా. ఏమంటే, అన్ని ట్రయాంగిల్స్  లో ప్రేమించిన ఒక పాత్ర బాధ దిగమింగుకుని తప్పుకుంటుంది, ఇక్కడ రెండు పాత్రలూ ఓపెన్ గా చెప్పేయడం ప్రత్యేకత అని చెప్పుకున్నారు. ఇదేదో కొత్తగానే అన్పిస్తుంది.  హీరోయిన్ కూడా ‘కాదలి’ హీరోయిన్ లా ఎవరికి  ఎస్ చెప్పాలో తేల్చుకోవడానికి సెకండాఫ్ అంతా నమిలేసి, తినేసి పారేసినట్టుగాక, వెంటనే సెకండ్ హీరోని ఓకే చేసేస్తుంది. అప్పుడు ఫస్ట్ హీరో ఏం చేయాలి? మర్యాదగా వాళ్ళ మధ్యనుంచి తప్పుకోవాలి. తప్పుకోకుండా, ఆమెని కలవడానికి జిగ్రీ దోస్తు వెళ్ళినా, ఏం చేసినా దోస్తానా మర్చిపోతున్నావా – నాకంటే ఆమె ఎక్కువయ్యిందా,  నువ్వు నాతోనే వుండాలి -   అని తగాదాలు పెట్టుకుంటే ఏమనుకోవాలి
. రేపు పెళ్ళాం పక్కలో పడుకోకుండా తన పక్కన పడుకోవాలా, లేక వాళ్ళిద్దరి మధ్య దూరి తను పడుకుంటాడా? ఇతడి తగాదాలు చూస్తే, నిజంగా ఫ్రెండ్ షిప్ అనిపిస్తుందా, జెలసీ అన్పిస్తుందా?  ఇలా పాయింటు రెండుగా చీలిపోవడం ట్రయాంగిల్లో ప్రత్యేకతా?

          ఉద్దేశించిన ప్రత్యేకమైన ట్రయాంగిల్ నే ఎలా ముగించవచ్చో అది కూడా చూపించకుండా,  హీరోయిన్ పాత్రని చంపేసి ఈజీ సొల్యూషన్ వెతుక్కోడడం ప్రయోగమా? సెకండాఫ్ లో రెండో హీరోయిన్ తో మళ్ళీ ఇంకో ప్రేమగాథ మొదట్నించీ ఎత్తుకోవడమా? ఒక సినిమాలో ఫస్టాఫ్ లో ఒక బిగినింగ్, సెకండాఫ్ లో మళ్ళీ ఇంకో బిగినింగా? 


          ఒకటే సమస్య- నువ్వు లేక నేను బతకలేననే హీరోల ‘గే’  టైపు స్నేహానికి -హీరోయిన్ ని తెచ్చి కలపడం. ఈ రెండు  వేర్వేరు ప్రేమలు ఒక వొరలో గాథగా నైనా ఇమడవు. వీటిలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ రాణించడు.



-సికిందర్ 
www.cinemabazaar.in

19, అక్టోబర్ 2017, గురువారం

534 : రివ్యూ


రచన – దర్శకత్వం : పి.  సునీల్ కుమార్ రెడ్డి
తారాగణం :
చేతన్ మద్దినేని, డింపుల్ చోపడే, సంతోష్ పవన్, అనిల్ కళ్యాణ్, పూజిత, పోసాని, నాగినీడు, జీవా, వేణు, ప్రభాస్ శ్రీను, తనికెళ్ళ భరణి, తోటపల్లి మధు, సనా తదితరులు
మాటలు : పులగం చిననారాయణ, సంగీతం: ప్రవీణ్ ఇమ్మడి, ఛాయాగ్రహణం : ఎస్ వి శివరాం
నిర్మాతలు : రవీంద్ర బాబు, రమణీ కుమార్

విడుదల : అక్టోబర్ 13, 2017
***
సామాజిక సినిమాల సునీల్ కుమార్ రెడ్డి గల్ఫ్ వలస కార్మికుల సమస్యతో తెలుగులో తొలి ప్రయత్నం చేశారు. గల్ఫ్ కి వలస వెళ్ళే తెలుగు కార్మికులు అక్కడ పడే బాధలు, చేసుకునే ఆత్మహత్యలు చూపిస్తూ సమస్యకి పరిష్కారం కోసం అన్వేషించారు. ప్రత్యక్షంగా అక్కడి పరిస్థితుల్ని పరిశీలించి, సుదీర్ఘకాలం నిర్మాణం చేసి ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ప్రేక్షకులు ఇలాటి సీరియస్ సినిమాకి సిద్ధంగా వున్నారా? సామాజిక సినిమాని ఇంకెలా తీస్తే ఈ కాలం ప్రేక్షకులు చూస్తారు? ఇందులో వున్నదేమిటి, లేనిదేమిటి, వుండీ లేనిదేమిటి, వుండకుండా పోయిందేమిటి...ఒకసారి  పరిశీలిద్దాం.

కథ 
        సిరిసిల్లలో చేనేత కార్మికుడి (నాగినీడు) కొడుకు శివ (చేతన్). ఇతడికి మగ్గం పని ఇష్టం వుండదు. రోజంతా కష్టపడినా రెండొందలు రావని మొండి కేస్తాడు. దుబాయి నుంచి అట్టహాసంగా మిత్రుడు వస్తాడు. అతడి సంపాదనా ఠీవీ చూసి శివ దుబాయ్ కెళ్ళిపోయి బాగా సంపాదించాలని తల్లిదండ్రుల్ని బలవంత పెట్టి  వెళ్ళిపోతాడు. ప్రయాణంలో గోదావరిజిల్లా అమ్మాయి లక్ష్మి (డింపుల్ ) పరిచయమవుతుంది. ఈమె తల్లికి క్యాన్సర్. వైద్యం కోసం మేనమామ దుబాయిలో ఒక షేక్ ఇంట్లో పనిమనిషి ఉద్యోగం ఇప్పించాడు. దుబాయిలో ఇద్దరూ దిగి తమతమ పనుల్లోకి వెళ్ళిపోతారు. 

          తీరా చూస్తే సిరిసిల్లా వచ్చి ఫోర్మన్ ఉద్యోగమని చెప్పుకున్న మిత్రుడు కూలీపని చేస్తూంటాడు. సరైన చదువులేని వాళ్ళంతా అక్కడ భవన నిర్మాణ కార్మికులే. శివ కూడా అదే పనిచేస్తాడు. తోటి పనివాళ్ళయిన ఇంకో నల్గురితో కలిసి  ఇరుకు గదిలో వుంటాడు. అటు షేక్ ఇంట్లో పనికి కుదిరిన లక్ష్మి మీద  మొదటి చూపులోనే కన్నేస్తాడు షేక్. ఆమెని లైంగికంగా వేధించడం, లొంగకపోతే కొట్టడం చేస్తూంటాడు.

          శివకి గల్ఫ్ జీవితమేమిటో అర్ధమవుతూంటుంది. జీతం డబ్బులు అంత తేలిగ్గా చేతికి రావు. అందరివీ ఈతి బాధలే. ఒంటరితనమే. మరో పక్క శివకి లక్ష్మి గురించి ఆందోళన. ఆమెని రహస్యంగా కలుసుకుంటూ వుంటాడు. ఇద్దరూ ప్రేమలో పడతారు. ఆ ఇంట్లో లక్ష్మికి చిత్ర హింసలు మాత్రం తప్పవు. ఇంతలో శివ మిత్రుడొకడు చెల్లెలి  పెళ్ళికి డబ్బు అడిగితే చిత్తుగా తంతాడు షేక్. స్నేహితుడు ఆత్మహత్య చేసుకుంటాడు. దీంతో  శివ ఇక తిరగబడాలని నిశ్చయించుకుంటాడు. మిత్రులతో కలిసి షేక్  ఇంట్లో డబ్బులూ పాస్ పోర్టులు దోపిడీ చేసి, లక్ష్మిని కూడా తీసుకుని పారిపోతాడు. షేక్ పోలీసుల్ని ఉసిగొల్పుతాడు. 
           ఇప్పుడు శివ బృందం ఏం చేసింది? తప్పించుకుని స్వదేశం వచ్చేశారా? అక్కడి అనుభవాలతో ఇంకేం  నేర్చుకున్నారు?... అనేది మిగతా కథ. 

ఎలావుంది కథ 
       ఇతివృత్తం కొత్తదే. ఇంతవరకూ తెలుగుతెరమీద రాలేదు. అయితే గల్ఫ్ వలస కార్మికుల కష్టాలు చూపిస్తూ పాక్షిక ప్రయోజనాన్ని మాత్రమే  సాధించింది ఈ కథ. అక్కడి నరకకూప జీవితాలు చూస్తే ఇంకే తల్లిదండ్రులూ తమ పిల్లల్ని గల్ఫ్ కి వెళ్ళనివ్వరు బహుశా. ఆ మాత్రం కూలీ ఇక్కడే దొరుకుతుంది. ఎక్కువ సంపాదన విషయానికొస్తే,   అదంతా మళ్ళీ గల్ఫ్ కి వెళ్ళడానికి చేసిన అప్పులు తీర్చడానికే చాలదు. ఇంతవరకు మాత్రం ఓ హెచ్చరిక చేస్తూ ఈ కథకి ప్రయోజనం చేకూరింది.  ఆ తర్వాత అక్కడి సమస్యలకి పరిష్కారం మాత్రం చెప్పదు ఈ కథ. తిరిగి వెళ్ళలేక అక్కడే వుండిపోయే కార్మికులకి వాళ్ళ హక్కుల గురించిన అవగాహన కల్పించదు. హీరో దీని మీదే పోరాడతాడని మనమాశిస్తే అది జరగదు. ప్రభుత్వ పార్శ్వాన్ని పూర్తిగా పక్కన పెట్టారు. ఒక్క ట్వీట్ చేస్తే ప్రభుత్వం మీముందు వుంటుందన్నసుష్మా స్వరాజ్ మాటలకి స్థానం లేదిక్కడ. 

          ఇలాగే సినిమాకోసం వాస్తవాల్ని బలిపెడుతూ అక్షయ్ కుమార్ తో చారిత్రక ఘట్టమైన గల్ఫ్ సంక్షోభం మీద ‘ఏర్ లిఫ్ట్’  తీస్తే బాగా విమర్శలు వచ్చాయి ప్రభుత్వ వర్గాల నుంచే. కువైట్ సంక్షోభంలో వేలాది మంది  కార్మికుల్ని విమానాల్లో ప్రభుత్వం స్వదేశానికి తరలిస్తే, ఆ ప్రభుత్వ వూసే లేకుండా, అదంతా హీరోగారే చేసినట్టు చూపించడం చరిత్రని వక్రీకరించడమే అయ్యింది. ఒక ఛానెల్లో ఆ దర్శకుణ్ణి కూర్చోబెట్టి, అప్పటి గల్ఫ్ సంక్షోభంలో పనిచేసిన అధికారులు, పైలట్లూ నిలదీస్తే,  తన తప్పు ఒప్పుకున్నాడు కూడా  ఆ దర్శకుడు.

          ప్రస్తుత కథ అన్ని కోణాల నుంచీ సమగ్రం కాలేదు సరికదా, ముగింపు అసలు ఈ కథనే ప్రశ్నార్ధకం చేసింది. ఇదెలాగో కింద స్క్రీన్ ప్లే సంగతులులో చూద్దాం. ఇది నేరస్థుల కథా, బాధితులా కథా అన్న సందేహంతో బయటికొస్తాం. 

          గల్ఫ్ లో వలస కార్మికులొక్కరే లేరు. వైట్ కాలర్ ఉద్యోగులు కూడా లెక్కలేనంత మంది వున్నారు. వాళ్ళ ఉనికే ఈ కథలో కన్పించదు. తోటి స్వదేశీయులైన వలస కార్మికుల ఇక్కట్లు వాళ్ళేమీ పట్టించుకోరా? అక్కడ పని చేస్తున్న ఎన్జీఓ లేమయ్యాయి. అసలు వైట్ కాలర్ ఉద్యోగుల జీవితాలెలా వున్నాయి. ‘ఏర్ లిఫ్ట్’ లో అన్ని వర్గాలనీ చూపించారు. 

          గల్ఫ్ జీవితాల మీద మలయాళంలో ఎక్కువ సినిమాలొచ్చాయి. సూపర్ స్టార్లు మమ్ముట్టి, మోహన్ లాల్ లు కలిసి నటించింది కూడా ఒకటి వుంది. వాటి క్వాలిటీ వేరు. తెలుగులో గల్ఫ్ కార్మికుల మీద తొలి సినిమా కథగా నమోదవుతున్న దీనికి ఆ స్థానానికి తగ్గ ఘనత మాత్రం లేకపోవడం విచారకరం.  పబ్లిసిటీ లో ‘ఎమోషనల్ స్టోరీస్ ఆఫ్ అన్ సంగ్ హీరోస్’ అనీ, ‘సరిహద్దులు దాటిన ప్రేమకథ’  అనీ అన్నారు. రెండూ తప్పుదోవ పట్టించేవే. జీవితాలకి సంబంధించిన ఒక క్లిష్ట సమస్య కి ‘సరిహద్దులు దాటిన ప్రేమకథ’  అంటూ ప్రేక్షకులని ఆకర్షించాలనుకోవడంలోనే  కాన్సెప్టు పట్ల నిబద్ధత తెలిసిపోతోంది. అన్ సంగ్ హీరోస్ అని ఎవర్ని అంటారు? ఒక సంస్థకో, రాజకీయ పార్టీకో, ఇంకేదో వ్యవస్థకో కింది స్థాయిలో పనిచేసే వాళ్ళు పాటుపడి మంచి పేరు తెస్తారు. కానీ ఆ క్రెడిట్ మాత్రం పని చేయించుకున్న లీడర్ కే పోతుంది. అప్పుడు ఆ పాటుబడ్డ వాళ్ళని అన్ సంగ్ హీరోస్ అంటారు. ‘గల్ఫ్’ కథలో ఈ పరిస్థితి ఎక్కడుంది?  ఇలా కాన్సెప్ట్ పట్ల నిబద్ధత బాటు,  స్పష్టత కూడా కన్పించదు. ఏ అంశం తీసుకున్నా  పరస్పర విరుద్ధంగా కన్పిస్తాయి.

ఎవరెలా చేశారు

       ఒక సామాజిక సమస్య తీస్తున్నప్పుడు ప్రేక్షకుల్లో గుర్తింపు లేని నటీనటులతో తీస్తే, ముందు ప్రేక్షకులు కరువవుతారు, తర్వాత ఆ కొత్త నటీనటులు ఆ సామాజిక సమస్య పట్టుకుని ఎంత మొత్తుకున్నా బాక్సాఫీసు అప్పీల్  జీరోనే అవుతుంది.  సామాజిక సమస్యల మీద ఒక ఇమేజి వున్న హీరో పోరాడినా, సందేశాలిచ్చినా వుండే ప్రభావం వేరు, కొత్త ముఖాలు చేస్తే వుండే పస వేరు. ఇలా ఇక్కడ చిన్నచిన్న నటులే ఈ సినిమాకి పెద్ద మైనస్ అయ్యారు. మార్కెట్ యాస్పెక్ట్ గురించి ఆలోచించకుడా, గల్ఫ్ కార్మికుల సమస్య లాంటి బిగ్ ఇష్యూని,  లో- బడ్జెట్ లో చిన్నా కొత్తా  నటులతో ముగించేద్దామన్న ప్లానింగ్ పనిచెయ్యలేదు.


         
చేతన్, డింపుల్, సంతోష్ పవన్, అనిల్ కళ్యాణ్, పూజితలు ఎంత కష్టపడి నటించినా వీళ్ళందరికీ కలిపి ఒక ఇమేజి వున్న హీరో సారధిగా వున్నప్పుడే  వీళ్ళ పాత్రలకి, నటనలకి గుర్తింపు వచ్చేది. సీనియర్లు పోసాని బ్రోకర్ గా నటిస్తే, తనికెళ్ళ ఒక ఖవ్వాలీ పాడి వెళ్ళిపోతారు. జీవా రెండు మూడు సీన్లలో ఒకడి మేనమామగా కన్పిస్తారు. సీనియర్ మాటల రచయిత తోటపల్లి మధుది కూడా ఒక చిన్న  సహాయ పాత్రే.  ఈయన చెప్పుకునే డైలాగు ఒకటి  : బయట కులాలనీ మతాలనీ చాలా  నాన్సెన్స్ వుంటుంది, ఈ గదిలోనే వసుధైక కుటుంబం కన్పిస్తుందని... వాస్తవిక కథా చిత్రంలో ఇలాటి డైలాగులు బావుండవేమో. రాజ్యాంగంలో వుండే విలువలు  ప్రజాజీవితంలో తొంగిచూడవు. భూమ్మీద మనుషులున్నంత  వరకూ కుల మత ప్రాంతీయ తత్త్వాలతో బాటు, బంధుప్రీతీ ఎక్కడికీ పోవు.  వసుధైక కుటుంబాలు చిన్న గదిలో కూడా సాధ్యమయ్యే  అవకాశం ఎక్కడుందో గానీ, సాధ్యమైంది రెండే– ప్రపంచం ఓ కుగ్రామవవడం ఇంటర్నెట్ తో, దాంతో  చేతికో సెల్ ఫోన్ వచ్చి తలా ఓ మూల కూర్చోవడం. 


          ఇక నాగినీడు పాత్ర తీరువల్ల మధ్య మధ్యలో వచ్చే ఆయన సీన్లు చాలా పాత సినిమాల ధోరణిలో వుంటాయి. దుబాయిలో వేశ్యా గృహం నిర్వాహకురాలిగా సనా సడెన్ గా మారిపోయి, వేశ్యలతో షేక్ మీద తిరుగుబాటు చేసేస్తుంది. షేక్స్ గా నటించిన నటులు నార్త్ కి చెందిన ఫిలిం ఇనిస్టిట్యూట్ నటులు. వీళ్ళున్న సీన్లే బలంగా వున్నాయి. 


          సాంకేతికంగా బడ్జెట్ కి తగ్గట్టే వుంది. పులగం చిన్నారాయణ రాసిన తెలుగు మాటలు బలహీన కథ వల్ల దెబ్బ తిన్నాయి. ‘హీరో’ చేతన్ పాత్ర తిరగబడ్డాక కూడా కొన్నిసార్లు నిరాశగా పలికే డైలాగులు సీన్లని దిగలాగాయి. తెలంగాణా భాష డబ్బింగ్ పలికిన తీరు అంతంత మాత్రమే.  తెలంగాణా ఆర్టిస్టులతో డబ్బింగ్ చేయించారో లేదో. హీరోయిన్ డింపుల్ ప్రారంభంలో పలికే తూర్పు గోదావరి యాస చాలా అతిగా వుంది. మళ్ళీ తర్వాత్తర్వాత అదే అతి యాస కన్పించదు.  షేక్ పాత్రలకి అరబిక్, హిందీ కలిపి వాడేశారు. వీటికి సబ్ టైటిల్స్ వేయకపోవడం వల్ల ఏం మాట్లాడుతున్నారో అర్ధం గాదు. హిందీ తెలిసిన వాళ్ళకి హిందీ ముక్కలు అర్ధమవుతాయి. దుబాయిలో నాల్గు మాండలికాల్లో అరబిక్ మాట్లాడతారు. హిందీ తీసేసి, ఒక మాండలికం అరబిక్ వాడుతూ తెలుగులో సబ్ టైటిల్స్ వేయాల్సింది. ఈ గల్ఫ్ సినిమా పట్ల ఆసక్తి వున్న రూరల్  ప్రేక్షకులైనా, అర్బన్ ప్రేక్షకులైనా - చూడాలనుకున్నా,  చూసి జాగ్రత్తపడాలనుకున్నా,  అక్కడి సమస్యలకి మూలకారకులైన  షేకులు అసలేం  మాట్లాడుతున్నారో అర్ధమవాలిగా. 



స్క్రీన్ ప్లే సంగతులు 

       కాన్సెప్ట్ పరమైన లోపాలు పైన చెప్పకున్నవైతే, ఇక దాని విస్తరణలో చోటుచేసుకున్న లోపాలు ప్రధానంగా రెండున్నాయి :

ఈ రెండూ బేసిక్స్ కి సంబంధించినవే. ఒకటి, ఈ కథకి కథానాయకుడు లేకపోవడం; రెండు, కథనం కలగాపులగమవడం.  బేసిక్సే సరిగా లేనప్పుడు ఇంకేం వుంటుంది. కథకి జీరో మార్కులు పడతాయి. 


          శివ అనే పాత్రని కథానాయకుడిగా పరిచయం చేస్తూ,  బిగినింగ్ లో ఇంట్లో మగ్గం పనంటే ఇష్టం లేని అతణ్ణి, తల్లిదండ్రులతో విభేదాల్ని, దుబాయినుంచి ఫ్రెండ్ రావడంతో శివకి తనూ దుబాయి వెళ్లి సంపాదించాలన్న కోరికని, అందుకోసం తల్లిదండ్రుల్ని బలవంతగా ఒప్పించడాన్నీ చూపించి విమానం ఎక్కించారు. ఇక్కడ దుబాయి నుంచి వచ్చిన ఫ్రెండ్ కూడా దుబాయిలో పరిస్థితులు తెలిసీ శివని ఆపకుండా, ప్రోత్సహిస్తాడు. ఇదేం ఫ్రెండ్ షిప్? ఇక దీంతో బిగినింగ్ ముగిసి ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడింది. ఇది అరగంటలోగా పూర్తయింది. చాలా బావుంది ఈ కాలావధి. 


          ప్లాట్ పాయింట్ వన్ అంటే ఏమిటి? అది మిడిల్ కి దారితీసే కీలక ఘట్టం, లేదా మొదటి మలుపు. అక్కడేం జరుగుతుంది? హీరోకి గోల్ ఏర్పడుతుంది. ఆ గోల్ లో ఏమేం వుంటాయి?  కోరిక, పణం, పరిణామాల హెచ్చరిక, ఎమోషన్ అనే నాల్గు ఎలిమెంట్స్ వుంటాయి. ఈ హీరో గోల్ లో ఏమున్నాయి? ఒకటే వుంది- డబ్బు సంపాదించాలన్న కోరిక – కేవలం కోరిక ఒకటే వుండడం వల్ల వీగిపోయింది గోల్. కోరిక వుంటే  రెండోదైన పణం కూడా పెట్టాలి.
There's no such thing as a free lunch   – అవునా? కానీ మన వాడు కోరిక ఒకటి మాత్రమే పెట్టుకుని  ఫ్రీ లంచ్ వచ్చేస్తుందని విమాన మెక్కేశాడు. పూర్తిగా స్వార్ధపరుడు. పేరెంట్స్ ని వదిలేసి తనదారి తను చూసుకున్నాడు. బిగినింగ్ లో ఏనాడూ మీరింత  కష్ట పడకూడదనీ,  తనని దుబాయి పంపిస్తే కష్టాలన్నీ తీరిపోతాయనీ ఇంక్లూజివ్ గా మాట్లాడడు. ఎక్స్లూజివ్ గా తనొక్కడి సుఖమే అన్నట్టు గొడవపడి, పేరెంట్స్ ని వాళ్ళ ఖర్మానికి వదిలేసి వెళ్లిపోతాడు. ఇది పాత్ర స్వభావం కాదు. పాపం పాత్ర మంచిదే. దీని చిత్రణే ఇలా బ్యాడ్ ఐపోయింది.  దుబాయి వెళ్లి సంపాదిస్తున్నాక,  నేస్తాలు ఇళ్ళకి డబ్బులు పంపిస్తూంటే మన వాడు ఒక్క దినార్ కూడా పంపిన పాపాన పోడు. ఇది కూడా పాత్ర స్వభావం కాదు. శివ మంచోడే. పాత్ర చిత్రణలో చిత్తయిపోయాడు. ఇతను ఇంటర్వెల్లో దుబాయి షేకు మీద తిరగబడ్డాడు గానీ, ముందే ప్లాట్ పాయింట్ వన్ దగ్గర కథకుడి మీద తిరగబడి కరెక్షన్స్ చేయించుకోవాల్సింది.

          పేరంట్స్ పట్టకుండా వెళ్ళిపోతే గోల్ కోసం దేన్ని పణంగా పెడతాడు. నేత పనిలో అప్పులపాలై వున్నట్టు చూపించి వుంటే, దీన్నుంచి కుటుంబాన్ని బయట పడెయ్యడానికి దుబాయి ప్రయాణం కడితే, కుటుంబం కోసం తన జీవితాన్నే పణంగా పెడుతున్నట్టు వుండేది. చూసే  ప్రేక్షకులందరికీ తెలుసు- కార్మికులుగా గల్ఫ్ వెళ్ళడమంటే యూఎస్ వెళ్ళడం కాదని, సరాసరి నరకానికే వెళ్ళడమని. ఇలా జీవితాన్నే పణంగా పెడుతున్నప్పుడు ఇందులోంచి మూడో ఎలిమెంట్ అయిన పరిణామాల హెచ్చరికని ప్రేక్షకులు ఆటోమేటిగ్గా ఫీలవుతారు. ఏఏ పరిణామాలు ఇతణ్ణి చుట్టుముట్టి కాటేస్తాయో, కుటుంబాన్నెలా ఉద్ధరిస్తాడోనని. దీంతో ఎమోషన్స్ కి సరైన బీజం పడుతుంది.  అప్పుడు గోల్ సజీవంగా,  బలంగా వుంటుంది.  


          గోల్ కి కుటుంబం అనే పునాది లేకుండా, ఆవారాగా డబ్బు సంపాదించుకోవాలని ఎగిరిపోతే, అతనెలా పోయినా డోంట్ కేర్ ప్రేక్షకులకి. వాడిదొక గోలే కాదు, వాడొక మనిషే కాదని. ఇంత మృతప్రాయమైన ప్లాట్ పాయింట్ వన్ తో కథ  ఏం సాధిస్తుంది. కథ పుట్టేదే ఇక్కడ. పురిట్లోనే సంధికొట్టింది. సినిమా ఇక్కడే ప్లాపయ్యింది.


***
     ఇక  కథానాయకుడు కథానాయకుడే కాకుండా      పోయాడు. ప్లాట్ పాయింట్ వన్దగ్గర్నుంచి మిడిల్లో  కథానాయకుడిలా వుండడు. ఇతరపాత్రల మధ్య గుంపులో ఒకడిగా వుంటాడు. గోల్ సరిగా లేకపోతే ఇంతే. గోల్ సరిగా వుంటే ఈ మిడిల్లో గోల్ కోసం సంఘర్షించే వాడు. మిడిల్ అంటేనే గోల్ కోసం సంఘర్షణ. అడ్డంకుల్ని అధిగమించడం. ఇతను పక్కకెళ్ళి పోయి, ఇక నేస్తాల కష్టాలూ ఫ్లాష్ బ్యాకులూ మొదలవుతాయి. పక్కకెళ్ళిన తన పని హీరోయిన్ ని ప్రేమించడమే. ఒక నేస్తానికి చెల్లెలి పెళ్ళికి డబ్బు కావాలి. దీనికి నేస్తాలందరూ ఓటీ చేసి సంపాదించి ఇవ్వాలనుకుంటారు. మన శివకి తల్లిదండ్రులు గుర్తుకు రారుగానీ, నేస్తం కోసం కష్టపడాలనుకుంటాడు. ఇది ఇంటర్వెల్ కి దారి తీసే పించ్ – 1 సీను.  

          మధ్యలో ఇంకేదో జరిగి ఆ నేస్తం షేకుని డబ్బులు అడిగి, దెబ్బలు తిని ఆత్మహత్య చేసుకుంటాడు. దీంతో శివ  షేక్ ఇంట్లో దోపిడీ పథక మేస్తాడు- నేస్తం చెల్లెలి పెళ్లి డబ్బుకి!

          ఇది చాలా బ్యాడ్ ఇంటర్వెల్ మలుపు. ఇది ఇక పూర్తిగా కాన్సెప్ట్ ని చెడగొట్టింది. కాన్సెప్ట్ బాధితులుగా పోరాడి జయించమనే  కోరుతుంది గానీ, నేరస్థులుగా మారిపోయి చచ్చిపొమ్మని కాదు. అంటే గల్ఫ్ కి వెళ్ళేవాళ్ళు  డబ్బుకోసం నేరస్థులుగా మారాలని  కాన్సెప్ట్ చెప్పదు.  శివకి కుటుంబ పునాదిగా గోల్ లేకపోవడం వల్ల ఈ పరిస్థితి. ఠికానా లేని పాత్రకి  ఠికానా లేని ఆలోచనలు. ఇది కూడా శివ మౌలిక స్వభావం కాదు. అతను బుద్ధిమంతుడే. పాత్ర చిత్రణ అనే కోరలకి చిక్కి అడుగడుగునా స్వభావం కరాళ నృత్యం చేస్తోంది.

                                             ***
    ఇంటర్వెల్ తర్వాత సెకండాఫ్ లో మిడిలే కొనసాగుతుందని సహజంగా అనుకుంటాం. కానీ కొనసాగదు. ఇక్కడ్నించే కథనం చెడిపోతుంది. ఫస్టాఫ్ లో ప్లాట్ పాయింట్ వన్ నుంచీ ఇంటర్వెల్ వరకూ మిడిల్ వన్, ఇంటర్వెల్ తర్వాత నుంచీ ప్లాట్ పాయింట్ టూ వరకూ మిడిల్ టూ వుంటాయని కదా అనేక సార్లు చెప్పుకునీ చెప్పుకునీ అలసిపోయాం. అయినా ఇక్కడ మిడిల్ టూ ప్రారంభమే కాదు. మళ్ళీ బిగినింగ్ కే వస్తుంది కథ. జరగాల్సిన మిడిల్ టూ బిజినెస్ జరక్క, మళ్ళీ అయిపోయిన బిగినింగ్ బిజినెస్సే  మొదలవుతుంది. ఆ మధ్య  ‘బ్రదర్స్’ అనే హిందీ సినిమాలో ఇంటర్వెల్ తర్వాత ఇలాగే  బిగినింగ్ బిజినెస్ వచ్చిపడి అయోమయం సృష్టించింది. అందుకే దీన్ని శాండ్ విచ్ స్క్రీన్ ప్లే అన్నాం. రెండు మిడిల్స్ మధ్య  బిగినింగ్ ని పెట్టి సర్వ్ చేయడం. ఐతే శాండ్ విచ్ లో తాజా వెజిటబుల్సేవో వుంటాయి. ఇక్కడ పాచిపోయిన బిగినింగ్ బిజినెస్. ఇది అత్యంత  స్వల్ప నిడివితో వుండడం వల్ల బ్రతికిపోయాం. 

          ‘గల్ఫ్’ లో స్వల్ప నిడివి కాదు,  ప్లాట్ పాయింట్ టూ వరకూ బిగినింగ్ బిజినెస్సే. ఎప్పుడో ఒకసారి  మిడిల్ టూ సీన్లు వచ్చిపోతూంటాయి. సెకండాఫ్ డాక్యుమెంటరీలా ఉందనీ,  బోరు కొట్టిందని రివ్యూలు రాశారు. కారణం ఇదే, మళ్ళీ బిగినింగ్ బిజినెస్ మొదలవడమే.  ఏమిటా బిగినింగ్ బిజినెస్?  మళ్ళీ కష్టాలు. ఈసారి వేశ్యాగృహాల్లో, గే సెక్స్ లో, సహజీవనాల్లో కష్టాలు కావవి, జల్సాలు – కామెడీలు. మరి అక్కడ ఇంత ఎంజాయ్ చేస్తున్నప్పుడు గల్ఫ్ తో వచ్చిన సమస్యే మిటి? అంతా హేపీ హేపీయే కదా, ఇంకా కాన్సెప్ట్ ఎక్కడిది?

          దోపిడీ పథకమేసి, దోపిడీ చేశాక ఇంటర్వెల్ తర్వాత దీని కొనసాగింపు కథనం చేయకుండా- మళ్ళీ మొదటికొచ్చి, బిగినింగ్ లో వుండాల్సిన సీన్లు చొరబెట్టడంతో సెకండాఫ్ నాశనమైంది. ఇక ఎండ్ విభాగంలో పోలీసులు పట్టుకోబోతే పారిపోయి అక్రమమార్గంలో  ఏజెంట్ ద్వారా ఆ దేశం వదిలి పారిపోవడానికి ప్రయత్నించి- దాక్కున్న సిమెంట్ మిక్సర్ మెషీన్ లో క్రషింగ్ అయిపోయి చచ్చిపోతారు, ఎర్రటి రక్తాలు పారిస్తూ.

                                                 ***
ఇంతే !
  ఈ ముగింపుతో ఏం చెప్పదల్చుకున్నారు? నేరగాళ్లుగా మారితే ఇలాటి శిక్ష తప్పదని చెప్పాలనుకుంటే కరెక్టే కావొచ్చు. కానీ వీళ్ళు నేరగాళ్లుగా  మారడమేమిటి? పైగా వాళ్ళు బుద్ధి తక్కువై గల్ఫ్ కొచ్చామనీ, తిరిగి వూళ్ళకి వెళ్ళిపోయి ఏదో  చేసుకుని బతుకుదామనీ అనుకుంటారు. ఇలా పరివర్తన చెందిన పాత్రల్ని చంపేస్తారా? చంపకపోతే ఏం చేయాలి? చట్టానికి అప్పగించి శిక్షించాలి, ఆ తర్వాత స్వదేశానికి పంపించెయ్యాలి. బతుకు జీవుడా అని వెళ్లి వేరే పనులు చేసుకుంటారు. అయితే ఈ కథ గల్ఫ్ లో  జరిగే తప్పుల్ని ప్రశించడానికి ఉద్దేశించిందా, లేక పాత్రల చేతే తప్పు చేయించి,  గల్ఫ్ ఈజ్ ఆల్వేస్ రైట్ అని సమర్దించడానికా?

          అసలేమిటీ కథ. సామాజిక కథా, లేక క్రైం థ్రిల్లరా?  దుబాయిలో ఒకప్పుడు సిమెంట్ మిక్సర్ లో నలిగి కార్మికులు భయంకర మరణం పొందిన సంఘటన బావుందని తెచ్చి ఇక్కడ ముగింపుగా అతికించేస్తే సరిపోయిందా? 

          చివరికి రోలింగ్ టైటిల్స్ లో సంవత్సరాలవారీగా మరణాల సంఖ్య చూపిస్తూ పోతే ఏమనుకోవాలి – ఈ కథ మరణాల గురించా?  చాలా గందరగోళంగా వుంది. చాలా  వృథా పోయింది ఈ సినిమాకోసం పడిన కష్టం – మార్కెట్ యాస్పెక్ట్ పరంగానూ, క్రియేటివ్ యాస్పెక్ట్ పరంగానూ.



సికిందర్ 

18, అక్టోబర్ 2017, బుధవారం

533 : రివ్యూ

రచన –దర్శకత్వం : అనిల్ రావిపూడి
తారాగణం:  వితేజ, మెహరీన్, ప్రకాష్ రాజ్, రాధిక, వివన్ బాట్నే, రాజేంద్రప్రసాద్, సంపత్రాజ్, శ్రీనివాసరెడ్డి, జయప్రకాష్ రెడ్డి తదితరులు.
సంగీతం
: సాయికార్తీక్ , ఛాయాగ్రణంః మోహకృష్ణ
నిర్మాణ
సంస్థ:  శ్రీ వెంకటేశ్వ క్రియేషన్స్
నిర్మాత :
 శిరీష్, ర్పణః దిల్రాజు
విడుదల
: అక్టోబర్ 18, 2017
***
      
మాస్ మహారాజా రవితేజ రెండేళ్ళు బ్రేక్ తీసుకుని, ఇక అంధుడిగా ప్రయోగం చేస్తే బెటరనుకుని దీపావళికి విచ్చేశారు. కుటుంబ  సినిమాలు తీసే దిల్ రాజు ఈసారి రవితేజతో మాస్ తీస్తూ తనుకూడా ఓ ప్రయోగం చేశారు. రెండు సినిమాల అనుభవమున్న దర్శకుడు అనిల్  రావిపూడి, ఇంకోసారి పూర్వ దర్శకుల ప్రెజెంటేషన్ మీద ఆధారపడి అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నాడు. ఈ ముగ్గురు ప్రముఖుల ప్రయత్నం చివరికి ఆశించిన  ఫలితాల్ని చ్చిందా లేదా  చూద్దాం...

కథ 
      ఒక పోలీసు అధికారి (ప్రకాష్ రాజ్),  దేవరాజ్ (వివన్ బాట్నే)  అనే ఓ గూండా నాయకుడి తమ్ముణ్ణి  ఎన్ కౌంటర్ చేస్తాడు. దీంతో దేవరాజ్ ఆ పోలీసు అధికారిని చంపేసి  అతడి కూతురు లక్కీ (మెహరీన్) ని కూడా చంపాలని వెంటపడతాడు. ఆమె డార్జిలింగ్ పారిపోతుంది. పోలీసు ఐజీ (సంపత్) ముగ్గురు పోలీసుల్నిచ్చి ఆమెకి రక్షణ ఏర్పాట్లు చేస్తాడు. అనంత లక్ష్మి (రాధిక) అనే కానిస్టేబుల్ కి రాజా (రవితేజ) అనే కొడుకు వుంటాడు. ఇతను అంధుడు. ఇతణ్ణి  పోలీసుద్యోగంలో చేర్పించాలని పోరాటాల్లో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తుందామె.  లక్కీ రక్షణకి సంబంధించిన సీక్రెట్ ఆపరేషన్లో రాజా కూడా వుండేలా చూస్తుంది. రాజా డార్జిలింగ్ వెళ్లి లక్కీకి రక్షణగా వుంటాడు. ఈమెని  కనిపెట్టి వచ్చి దాడులు చేస్తూంటాడు దేవరాజ్. ఆ దాడుల్ని తిప్పికొడుతూ లక్కీని కాపాడుతూంటాడు రాజా...

ఎలావుంది కథ 
      దిల్ రాజు క్వాలిటీ ఏకోశానా కన్పించని  విషయంలేని - టెంప్లెట్ కథ. కుటుంబ కథల్లో అయితే ఆయన ఇన్వాల్వ్ అయి తన మార్క్ వుండేలా చూసుకుంటా రేమో గానీ, తనకి అలవాటులేని మాస్ కథకి చేతులు కట్టుకుని దూరంగా వుండిపోతారు. కనీసం రవితేజని ప్రయోగాత్మకంగా అంధుడి పాత్రలో చూపిస్తున్నప్పుడైనా కథలో కాస్త కొత్తదనం వుండా లన్న ఆలోచన చేయలేదు. విషయంలేని అరిగిపోయిన పాత మూస కథకీ, కొత్త తరహా పాత్రకీ బలవంతపు పెళ్లి చేశారు. సినిమాలో చూపించిన నల్గురు పెళ్ళాల్ని నల్గురు మొగుళ్ళు పదేపదే చాచి లెంపకాయలు కొట్టినట్టు -  రవితేజ పాత్రా కథా ఎడాపెడా  లెంపకాయలు కొట్టేసుకున్నాయి.

ఎవరెలా చేశారు
      రవితేజ పాత్ర చూస్తే ‘బర్ఫీ’ లో మూగవాడిగా రణబీర్ కపూర్ హీరోయిన్ ని కిడ్నాప్ చేసి  చేసే సూపర్ కామెడీ గుర్తుకొస్తుంది. అది కొత్త పుంతలు తొక్కే క్రియేటివ్ కామెడీ. రవితేజ పాత్రకి ఎప్పుడూ కమర్షియల్ హీరోల పాత్రలకుండే అదే  రొటీన్, టెంప్లెట్ మూస కామెడీయే పెట్టారు తప్ప, అంధపాత్రకి క్రియేటివ్ గా ఆలోచించలేదు. ఆఫ్ కోర్స్, టాలీవుడ్ ప్రమాణాలిలాగే వుంటాయి. రవితేజ చేసే అదే తన బ్రాండ్  కామెడికీ, డైలాగులకీ కింది తరగతుల ప్రేక్షకులు మాత్రం సంతృప్తి చెంది అడుగడుగునా కేరింతలు కొట్టారు. రవితేజ అంధుడిగా గొప్పగా నటించలేదని కాదు, ఆయన చాలా కష్టపడి నటించాడు. కథే ఆయనకి సహకరించలేదు. ఏ దృశ్యానికా దృశ్యం కామెడీ మీద -  అది కూడా సిల్లీ కామెడీ మీద పెట్టిన శ్రద్ధ కథ మీద పెట్టలేదు. సినిమా సాంతం లెక్కలేనన్ని పాత్రల డైలాగుల మోతతో లౌడ్ గా వుండడం వల్ల- రవితేజ అంధ పాత్రతో పోరాటదృశ్యాలు కూడా ఆ వెల్లువలో నిలబడకుండా కొట్టుకు పోయాయి. విషయం లేని ఈ కథలో అంధపాత్రతో ఆయన గుర్తుండిపోయేలా చేయడానికి మిగిలిందొక్కట్టే - పోరాట దృశ్యాలు. అంధత్వంతో వీటికి వుండాల్సిన ఫీల్ ని కూడా  మిగతా లౌడ్ దృశ్యాలు మింగెయ్యడంతో ఇవి ఏ ప్రత్యేకతనీ  చాటుకోలేకపోయాయి. 

          హీరోయిన్ తో ఎప్పుడో చివర్లో తప్ప రోమాన్సులోకి రాదు రవితేజ పాత్ర. హీరోయిన్ ది చాలావరకూ తండ్రిని కోల్పోయిన బాధతో వుండే పాత్ర కావడంవల్ల రోమాన్సు కుదరలేదు. ‘కటీ పతంగ్’ లో ఆశా పరేఖ్ విడోగా ఎంత విషాద పాత్రయినా,  ఒక కవిహృదయుడైన రోమియోగా  రాజేష్ ఖన్నా  ఆమెని నవ్వించకుండా వదలడు. రవితేజ పాత్రకి ఈ రోమాంటిక్ యాంగిల్ కొరవడ్డం పెద్ద లోపం. 

          హీరోయిన్ మెహరీన్ నటించడానికి పాత్రే సరిగ్గా లేదు. హీరోచాటు పాత్రగా వుండిపోయింది. హీరో ఆమెకేవో ఆశయాలు గుర్తుచేసినట్టు చూపించారు.  ఆ ఆశయాలు అసలేమిటో, వాటితో  ఆమె ఏం చేసిందో చూపించిన పాపాన పోలేదు. ఆమెవి లాలిత్యం పలికే ముఖకవళికలు కావు. గత మూవీ ‘మహానుభావుడు’ లోలాగే పైపై నటనతో సరిపెట్టేసింది.  ఇంకో హీరోయిన్ రాశీఖన్నా ఓ పాటలో కన్పిస్తుంది- కానీ ఎందుకో ప్రేక్షకులు సైలెంట్ గా వుండిపోయారు ఆ ఒక్క పాటలో మెరిసిన ఆమెని చూసి. మిగిలిన పాత్రధారుల సంగతేమోగానీ, రవితేజ తల్లిగా  రాధిక హాస్య పాత్ర బాగా ఎంటర్ టైన్ చేస్తుంది. పోలీస్ స్టేషన్ లో గుండె నొప్పి నటిస్తూ ఆమె చూపించే హొయలు ఏ కమెడియన్ కీ తీసిపోవు. చివర్లో విలన్ మీద కొట్టే  డైలాగులు కూడా దంచి కొట్టి వదుల్తుంది. ఈనాటి హీరోయిన్లు నేర్చుకోవాల్సింది చాలా వుంది సీనియర్లని చూసి. 

          విలన్ గా వివన్ బాట్నే ఇతర పరభాషా విలన్ పాత్ర ధారుల చట్రంలోనే ఏ ప్రత్యేకతా లేకుండా రొటీన్ గా అదే మూసలో- అదే వేష భాషల్లో కన్పిస్తాడు. ఇక ప్రకాష్ రాజ్,
రాజేంద్రప్రసాద్, సంపత్రాజ్, శ్రీనివాసరెడ్డి, జయప్రకాష్ రెడ్డి, పోసానీ మొదలయిన వాళ్ళంతా వాళ్ళ మూసలోనే కన్పిస్తారు.

          ఓ రెండు పాటలకి తప్ప మిగతావాటికి ప్రేక్షకులు గమ్మున వుండిపోయారు. ఆ రెండు పాటలకి మాత్రం  మాస్ మహనీయులు వూగిపోయారు. మల్టీ ప్లెక్సుల్లో వూగడానికి ఇలాటి మహనీయులు వుండరు. ఛాయాగ్రహణం ఏవరేజిగా కన్పించడానికి కారణం దృశ్యాలు, దర్శకత్వం రొడ్దకొట్టుడుగా వుండడం. ఎడిటింగ్ లో కూడా ఏదైనా చూపించడానికి దర్శకత్వ విలువలు సహకరిస్తేగా. మూడు సార్లు క్లయిమాక్స్ వస్తే ఎడిటర్ ఏం చేయగలడు. ఒకటి చాలని మిగతా రెండూ లేపేస్తే,  నిడివి చాలక సెన్సార్ వాళ్ళు పొమ్మంటారు. ఇంకోసారి దిల్ రాజు మాస్ సినిమాలతో పెట్టుకోకుండా వుంటే మంచిది.

చివరికేమిటి 
    పటాస్ , సుప్రీమ్  అనే సినిమాలతో కొత్త దర్శకుడైన అనిల్ రావిపూడి తన కొత్తదన
మేంటో చూపించకుండా,  పూర్తిగా పాత దర్శకుల మేకింగ్ మీద ఆధారపడుతున్నాడు. వాళ్ళ కాలంలో తీసిన సినిమాలు వాళ్ళు తీసినట్టుగానే తీసి రెండు సార్లు సక్సెస్ అవగల్గాడేమోగానీ, ఇది ఎల్లకాలం పనిచెయ్యదు. ఇలాటి లౌడ్ సినిమాలతో తనకి తానే హాని చేసుకుంటాడు. వచ్చిన సినిమాల్లోని కథలు,  సీన్లు, డైలాగులు సమస్తం టెంప్లెట్ గా పెట్టుకుని తీయడానికి నవదర్శకులే  అవసరం లేదు. నవదర్శకులు వచ్చే నవదర్శకులకి స్ఫూర్తి నివ్వకపోతే అంతా కలిసి పరమ చాదస్తులుగా కన్పిస్తారు. అనిల్ రావిపూడి లాంటి టాలెంట్ తో చిన్నచిన్న సినిమాలతో స్ట్రగుల్ చేస్తున్న నవదర్శలుకు చాలామందే వున్నారు. వాళ్లకి స్టార్ లతో ఛాన్సు రావడం లేదు, వాళ్ళ టాలెంట్ గల తనకి వస్తున్నాయి, అంతే తేడా. 

          కొత్త కథలు చేయలేకపోతే,  అనిల్ రావిపూడి ఒకసారి రోహిత్ శెట్టిని చూస్తే సరిపోతుంది. రోహిత్ శెట్టి పాత కథల్నే కొత్తగా,  ట్రెండీ గా, యూత్ ఫ్రెండ్లీగా తీసి మినిమం వంద కోట్లు ప్రేక్షకుల జేబులు కొట్టేసి వెళ్ళిపోతాడు. అంధుడి పాత్రతో అదే అరిగిపోయిన కథలో అదే హీరోయిజం, అదే కామెడీ, పాటలు, హీరోయిన్ కి ప్రాబ్లం, విలన్ ఎంట్రీ తర్వాత ఇంటర్వెల్ లాంటి టెంప్లెట్ తో,  రెండేళ్ళ తర్వాత రవితేజ సినిమాకి కొత్తదనం వచ్చేస్తుందా? 

          ఇక సెకండాఫ్ లో కూడా చెప్పడానికి విషయమే లేక, రవితేజనీ హీరోయిన్ నీ ఆమె బాబాయిల ఇంటికి చేర్చి శ్రీనువైట్ల టెంప్లెట్ పెట్టుకో లేదా? ఉన్న కథేదో దాన్ని దారి మళ్ళించి ఇంకో పాత సినిమా చూపించలేదా? ఆ బాబాయిలు  పెళ్ళాల్నికొట్టే కామెడీ, వాళ్ళని రవితేజ రిపేరు చేసే సీన్లు ఏనాటివి? అర్ధరాత్రి  నిద్రపోతున్న రవితేజ మీద బాబాయిలు కామెడీగా దాడి చేసే సీను,  ఏ ‘పరమానందయ్య శిష్యుల కథ’ కాలం నాటిది! దీనికి ప్రేక్షకులు నవ్వారా? 

          విలన్ ఎన్ని సార్లు వచ్చి తన్నులు తినిపోతాడు? అన్నిసార్లు క్లయిమాక్సే గా?  శ్రీను వైట్ల టెంప్లెట్ ఒకటి, విలన్ తో మూడుసార్లు క్లయిమాక్సులూ పెట్టేస్తే సెకండాఫ్ అయిపో
తుందా? ఇంత సులభంగానా?  సినిమా అంటే ఇంతేనా? దర్శకుడేం కష్టపడనవసరం లేకుండా, రవితేజ లాంటి స్టార్ల  భుజాల మీదేసేస్తే,  వాళ్ల పాపులారిటీ కొద్దీ వాళ్ళే చచ్చీ చెడీ నటించి ఒడ్డుకు చేర్చేస్తారా? రేపు కూడా రావిపూడి స్టార్ల మీద ఇదే ‘టాలీవుడ్ మూవీస్ మేడీజీ’ మంత్రం ప్రయోగిస్తూ  పోతాడా?

సికిందర్
www.cinemabazaar.in
(ps : ఈ సినిమాలో కూడా కొత్తగా
తెలుసుకోవడాని కేమీ లేదు గనుక
దీనికి 'స్క్రీన్ ప్లే సంగతులు' వుండదు.

టెంప్లెట్ మూవీస్ కి విశ్లేషణ
అవసరం లేదు)