రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

17, ఫిబ్రవరి 2017, శుక్రవారం

రివ్యూ!


రచన- దర్శకత్వం : సంకల్ప్ రెడ్డి

తారాగణం :  రానా గ్గుబాటి, తాప్సీ, కె.కె.మీనన్, రాహుల్ సింగ్, ఓంపురి, అతుల్ కులర్ణి, నాజర్, ఓంపురి, రాహుల్ సింగ్, త్యదేవ్, వి ర్మదితరులు
మాటలు : గుణ్ణం గంగరాజు, సంగీతం : కె, కెమెరా : మాధి, ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, విజువల్ స్టంట్స్ : జాషువా, ఎఫెక్ట్స్ః ఈవా మోషన్ స్టూడియోస్
బ్యానర్ః మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, పివిపి సినిమా
నిర్మాతలుః పివిపి సినిమా-పెరల్ వి.పొట్లూరి, మ్ వి.పొట్లూరి, విన్ అన్నె, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్-అన్వేష్ రెడ్డి, న్మోహన్ వంచ, వెంక ణా రెడ్డి
విడుదల : ఫిబ్రవరి 17, 2017
***
         యుద్ధ సినిమాలు తెలుగు నేటివిటీకి దూరమే. ఎక్కడో దేశ సరిహద్దు వుంటే అక్కడి హిందీ వాళ్ళకే యుద్ధ సినిమాలు నేటివిటీతో కలుస్తున్నాయి. వాళ్ళు ‘బోర్డర్’ తీస్తారు, ‘హకీఖత్’ తీస్తారు. అలాంటిది ‘కంచె’ తో యుద్ధ సినిమా తెలుగు గడప తొక్కింది. ‘శాతకర్ణి’  టైపు రాజుల యుద్ధాలు తెలుగు జీవితమే. కానీ  ‘కంచె’ యుద్ధాన్ని యూరప్ లో చూపించడం సాహసమే. అక్కడ్నించీ యుద్ధాన్ని విశాఖపట్నం తీసుకొస్తే? మావూరికి సర్కస్ వచ్చిం దన్నంత ఆనందం తెలుగు ప్రేక్షకుడనే వాడికి. వాడికీ ఆనందం లేకపోతే తెలియని చరిత్రల్ని   కోల్పోతాడు. శాతకర్ణి తెలియని చరిత్ర తెలుసుకున్నాడు, హథీరాం బాబా తెలియని చరిత్ర కూడా తెలునుకున్నాడు, ఇప్పుడు విశాఖ సైడు ఘాజీ చరిత్రా తిలకిస్తాడు. తెలియని చరిత్రలు బయటికి తీస్తున్న తెలుగు సినిమాలు ఎదిగినట్టేనని ఆనందిస్తాడు. తెలుగు ప్రేక్షకుణ్ణి ‘ఘాజీ’ చూసేందుకు ఇలా సిద్ధం చేద్దాం...
ముందు కథ

      1971లో తూర్పు పాకిస్తాన్ (తర్వాత బంగ్లాదేశ్) లో పశ్చిమ పాకిస్తాన్ సాగిస్తున్న దమనకాండ నేపధ్యంలో భారత నేవీ తన ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ నౌకని విశాఖపట్నం తూర్పు నావల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ కి   బదిలీ చేయడం పాకిస్తాన్ కి ఆందోళన కల్గిస్తుంది. సముద్ర తీరంలో తూర్పు పాకిస్తాన్ కి చేరువలో ఐఎన్ఎస్ విక్రాంత్ వుండడం ప్రమాదమని, దాన్ని నాశనం చేయడానికి  తన జలాంతర్గామి (సబ్ మెరైన్) పిఎన్ఎస్ ఘాజీని పంపడానికి పథకం వేస్తుంది. తూర్పు పాకిస్తాన్ లోని చిట్టగాంగ్ కి పంపిన ఒక రహస్య సందేశాన్ని టాప్ చేయడం ద్వారా ఈ పాక్ పథకం తూర్పు నావల్ కమాండర్- ఇన్- చీఫ్ (ఓంపురి) కి తెలుస్తుంది. ఆయన వెంటనే ఐఎన్ఎస్ రాజ్ పుత్ జలాంతర్గామిని రంగంలోకి దింపుతాడు. భారత సముద్ర జలాల్లోకి ఘాజీ వస్తోందా లేదా నిఘావేసి తెలియజేయాల్సిందిగా కెప్టెన్ రణ్ విజయ్ సింగ్ (కెకె మీనన్) ని ఆదేశిస్తాడు. రణ్ విజయ్ సింగ్ ది  ఉడుకు రక్తం. చూసి తెలియజేయడమెందుకు, చూసి పేల్చేస్తామంటాడు. అది యుద్ధానికి దారి తీస్తుందని, కేవలం చెప్పినట్టు చేయమని హెచ్చరిస్తాడు ఛీప్. రణ్ విజయ్ సింగ్ ని కంట్రోలులో వుంచాల్సిందిగా లెఫ్టినెంట్ కమాండర్ అర్జున్ వర్మ(రానా దగ్గుబాటి) ని కోరతాడు. వీళ్లిద్దరితో బాటు  ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దేవరాజ్ (అతుల్ కులకర్ణి) బయల్దేరతాడు.

       సముద్ర అంతర్భాగంలో రహస్యప్రయాణం మొదలెడుతుంది రాజ్ పుత్; అట్నుంచి ఘాజీ సముద్రం లోపల్నుంచి గుట్టుగా వస్తూంటుంది. అప్పుడు ఈ రెండిటి మధ్య యుద్ధం ఎలా  జరిగింది, ఈ యుద్ధంలో  బద్ధ వ్యతిరేకులైన కెప్టెన్ రణ్ విజయ్ సింగ్, లెఫ్టినెంట్ కమాండర్ అర్జున్ వర్మల మధ్య  ఏం ఘర్షణ జరిగింది, వీళ్ళిద్దరి మధ్య ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దేవరాజ్ ఎలా నలిగాడు, డ్యూటీ విషయంలో అదుపుతప్పే రణ్ విజయ్ ఆవేశాన్ని అర్జున్ ఎలా కంట్రోలు చేశాడు, మధ్యలో ఘాజీ ఒక మర్చంట్ నౌక ని పేల్చేస్తే అందులోంచి అర్జున్ రక్షించిన ఆ యువతి, బాలిక ఎవరు; చివరికి ఘాజీ మీద ఇండియన్ బృందం ఎలా విజయం సాధించిందీ... ఇవన్నీ తెలుసుకోవాలంటే టికెట్ బుక్ చేసుకోవాల్సిందే.
ఎలావుంది కథ 
        ఇది 1971 నాటి యుద్ధ చరిత్ర. అయితే సినిమా కథ చేసినట్టుగా చరిత్ర జరగలేదు. ఇందుకు ఆధారాల్లేవు. 2003, 2010, 2011 వరకూ కూడా నావికాదళాధికారులు పదేపదే ఘాజీ మునకతో రాజ్ పుత్ కి  ఎలాంటి సంబంధం లేదని చెబుతూ వస్తున్నారు (ఇదే పాక్ అధికారులైతే మేమే ముంచేశామని  గొప్పలు చెప్పుకునే వారు). ఆ సమయంలో రాజ్ పుత్ పోర్టులోనే వుందని అంటున్నారు. ఘాజీ లోపల ప్రమాద వశాత్తూ టార్పెడోలూ మందు పాతరలూ పేలి మునిగిపోయిందనీ; బ్యాటరీలని ఛార్జి చేసేటప్పుడు హైడ్రోజన్ వాయువులు  వెలువడ్డమే ఈ పేలుళ్ళకి కారణమనీ భారత నావికాదళాధికారులు ధృవీకరించారు. అయితే ఘాజీ మునక ఎప్పటికీ తేలని మిస్టరీగానే  మిగిలిపోయిందనే నిపుణులూ లేకపోలేదు.

           అయితే ఈ ‘చరిత్ర’ మరుగున పడిపోయిందనీ, ఇందులో పాల్గొన్న మన నావికా దళ సభ్యుల విజయం కూడా ప్రపంచానికి తెలియకుండా పోయిందనీ ఈ కథ చేసిన దర్శకుడు అభిప్రాయపడ్డాడు. కానీ సినిమాకోసం చరిత్రని ఇలా మార్చెయ్యడం విచిత్రమే. దీన్ని దర్శకుడి విజ్ఞతకే వదిలేద్దాం. 

          ఘాజీ సబ్ మెరైన్ నిజానికి అమెరికానుంచి లీజుకి తీసుకుంది పాక్. దాన్ని నిర్వహించుకోలేక మంటగలుపుకుంది. లీజుకి తీసుకున్నపుడు  దాని అమెరికన్ పేరు యూఎస్ ఎస్ డయాబ్లో. చాలా శక్తిమంతమైన జలాంతర్గామి అది. సముద్రం లోపల మందు పాతరలని కూడా పెడుతుంది. భారత సబ్ మెరైన్స్  కి అప్పట్లో ఈ ఏర్పాటు లేదు.

          సినిమా కోసం ఈ కథ చేసినప్పుడు ఇందులో దేశభక్తిని బాగా దట్టించారు. రొటీన్ గా ఒక మాటనేస్తూంటారు- దేశం కోసం ప్రాణాలివ్వాలని. దర్శకుడు మాత్రం ఈ మూస డైలాగుని తిప్పి కొడుతూ- దేశం కోసం ప్రాణాలివ్వడం కాదు, శత్రువుని చంపి గెలవాలని, కామన్ సెన్స్ తో డైలాగు పలికిస్తాడు. 

          ఇంతవరకూ భూమ్మీద, సముద్రం మీద, గాల్లో జరిగే యుద్ధాలతోనే దేశంలో సినిమాలు వచ్చాయి. సముద్రం లోపల జరిగే పోరాటంతో ఒక పకడ్బందీ కథ ఇలా తొలిసారిగా వచ్చింది. దీన్ని తెలుగు – హిందీ భాషల్లో నిర్మించారు. టామ్ క్లేన్సీ  నవల ఆధారంగా హాలీవుడ్ లో తీసిన ‘ది హంట్ ఫర్ రెడ్ అక్టోబర్’ జలాంతర్గాముల  యుద్ధం ఈ సందర్భంగా గుర్తుకొస్తే రావొచ్చు.

ఎవరెలా చేశారు 
      ఇలాటి రియలిస్టిక్, ఇంటలిజెంట్ సినిమాల్లో నటనలు మారిపోతాయి : ఫార్ములా  నటనల బెడద తప్పిపోతుంది. పైగా ప్రధానపాత్రలో రానా,  ఏ కమర్షియల్ సినిమాలోనైనా మొదట్నించీ హీరోకుండే డామినేటింగ్ స్థానాన్ని తీసుకోకుండా, క్రమక్రమంగా పూర్తి  యాక్షన్ లోకొస్తాడు. దాదాపు ఫస్టాఫ్ అంతా  అతను ప్రధాన పాత్ర కాదేమో అన్నట్టుంటాడు. ఉడుకురక్తం కెప్టెన్ ని కంట్రోల్ చేసే సీన్లే అతడికి ఇన్నర్ స్ట్రగుల్ (ఎమోషనల్ యాక్షన్) ని కల్పించి, ఔటర్ స్ట్రగుల్ (ఫిజికల్ యాక్షన్) గా శత్రువుతో పోరాటాన్ని పెట్టి  పాత్ర చిత్రణ చేశారు. దీనివల్ల ఇదొక సమగ్ర పాత్రయింది. ఈ పాత్రలో అతడి నటన అత్యంత నిజమైన నేవీ అధికారి అన్పించేట్టే వుంది- ‘రుస్తుం’ లో నావల్ ఆఫీసర్ గా నటించిన అక్షయ్  కుమార్ కి లాగే. కొత్త దర్శకుడు సంకల్ప్  రెడ్డి ఇంత పకడ్బందీగా పాత్ర చిత్రణ చేయడం ఆశ్చర్య పరచే విషయమే. రానా గుర్తుండి పోతాడు.

          ఇక ఇంకో గుర్తుండిపోయే పాత్ర కెకె మీనన్ నటించిన రణ్ విజయ్. అత్యంత ప్రతిభావంతమైన- క్లాసిక్  ముఖభావాలతో స్టన్నింగ్ క్లోజప్స్ ఇచ్చాడు. రణరంగంలో అప్పటి పరిస్థితిని బట్టి రియాక్ట్ అవ్వాలే గానీ, ఎక్కడ్నించో వచ్చే రాజకీయ నిర్ణయాల్ని పాటించడం పట్ల అసహనం ప్రదర్శించే తన  పర్సనాలిటీ ట్రెయిట్ ని స్వయంగా తాననుభవిస్తున్నట్టే ప్రదర్శించాడు. అతడికి ఈ లక్షణం ఎందుకుందో ఆలోచింపజేసే గత జీవితం కూడా వుంది. 

       శరణార్ధిగా అవతలి దేశం దాటుకుని వచ్చే పాత్రలో తాప్సీ కి పెద్దగా పనిలేకపోయినా- మరీ సినిమా మొత్తంలో ఆడమనిషే కన్పించకపోతే వరస్ట్ గా వుంటుంది కాబట్టి,  ఆ లోటుని భర్తీ చేస్తున్నట్టు ఏకైక ఆడ పాత్రగా- గ్లామర్ లెస్ గా  వుంటుంది ( ‘పింక్’ లో తాప్సీ కోసం ఎగబడ్డ అమ్మాయిలే ఇప్పుడూ భారీగా తరలివచ్చి నిరుత్సాహ పడివుంటారు). అతుల్ కులకర్ణి కూడా ఎక్సెలెంటే. ‘మనవూరి రామాయణం’లో  ప్రకాష్ రాజ్ ని ఇరుకున పెట్టేసే ఆటో వాడి పాత్రలో అలరించిన సత్యదేవ్ మరోసారి ఆకట్టుకుంటాడు. తెలిసిన మొహం రవివర్మకి కూడా నిడివి గల పాత్రే దొరికింది. పాక్ కెప్టెన్ రజాక్ గా ( రాహుల్ సింగ్) మరో ఆకర్షణ.

          ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్లందరూ అంతర్జాతీయ స్థాయికి తీసిపోని విధంగా పనిచేశారు. ‘శాతకర్ణి’ ని అలా పెడితే, ‘కంచె’ తర్వాత ఇంత క్వాలిటీ యుద్ధ సినిమా తెలుగులో ఇదే. ఇక గుణ్ణం గంగరాజు రాసిన మాటలూ సహజంగా వున్నాయి – ‘పైకీ కిందకీ... పైకీ కిందకీ ...ఎవడ్రా వాడు కమాండరా?  లిఫ్ట్ మానా?’ అని రజాక్ 
పాత్ర అర్చినప్పుడు, ఆ  డైలాగు బాగా పేలి హాలంతా నవ్వులతో దద్దరిల్లింది. 

చివరికేమిటి         కొత్త దర్శకులు  ఇంకా పాత మూస సినిమాలతోనే నానా గడ్డి కర్చి నిర్మాతల్ని ఒప్పించుకుంటున్న కాలంలో,  ఓ కొత్త దర్శకుడు సంకల్ప్ రెడ్డి- మూసకి మూడులోకాల  అందనంత దూరంలో, ఎక్కువ బడ్జెట్ ని కోరే  ఇలాటి డిఫరెంట్ సినిమాని ఒప్పించుకోవడం, దీన్ని చేపట్టేందుకు పొట్లూరి వరప్రసాద్, అన్వేష రెడ్డిల  లాంటి నిర్మాతలూ ముందుకు రావడం ఈవారం హిందీ తెలుగు ప్రేక్షకులకి –ఓవర్సీస్ ప్రేక్షకులకి కూడా- రిలీఫ్.
          సంకల్ప్ రెడ్డి సబ్ మెరైన్స్ గురించి చాలా రీసెర్చి చేసే ఒక అథారిటీ లాగా ఘాజీని నడుపుతున్నట్టు కన్పిస్తాడు. స్పీల్ బెర్గ్ జాస్ తీసినప్పుడు ఆ మోడల్ లోపల ఇంజనీర్లు కూర్చుని ఆ ‘సొరచేప’ ని ఆపరేట్ చేశారేమోగానీ,  ఇక్కడ సంకల్ప్  రెడ్డి స్వయంగా సబ్ మెరైన్స్ లో కూర్చుని తను నడుపుతున్నట్టే, మొత్తం మెకానిజమూ, ఇంజనీరింగ్ సాంకేతికాలూ సహా –ఆయా ప్రమాదాల్లో తీసుకోనే జాగ్రత్తలు సహా – క్షుణ్ణమైన అవగాహనతో వున్నట్టు కన్పిస్తాడు.

          నీటిలోపల రాజ్ పుత్  వర్సెస్ ఘాజీ వేసుకునే ఎత్తుగడలూ, చేసుకునే టార్పెడో దాడులూ, క్షణ క్షణం టెన్షన్ ని బిల్డప్ చేసే యాక్షనూ, మెలోడ్రామా తప్పుపట్టలేని విధంగా వున్నాయి. ఇంతే ‘ఇంజనీరింగ్’ స్క్రీన్ ప్లేకీ చేశాడు. స్క్రీన్ ప్లే అంటే పాత్ర చిత్రణలు సహా మొత్తం కథా నడకా. మొదటి ఇరవై అయిదు నిమిషాల్లో ఘాజీని ప్రవేశపెడుతూ (ప్లాట్ పాయింట్ వన్) బిగినింగ్ ని ముగించాడు. ఇక్కడ్నించీ ఈ మిడిల్ ఇంటర్వెల్ కి ముందు అరగంటా చూపించి, ఇంటర్వెల్ కి తర్వాత ఇంకో అరగంటా చూపిస్తూ ముగించాడు. ఇక్కడ కెప్టెన్ రణ్ వీర్ మరణం తర్వాత శపథం చేయడమే ప్లాట్ పాయింట్ టూ. ప్లాట్ పాయింట్ వన్ కీ, టూకీ మధ్య గంట పాటు మిడిల్ విభాగమంతా సమస్యతో సంఘర్షణనే పెంచుకుంటూ పోయాడు నియమాల ప్రకారం. ఇక ప్లాట్ పాయింట్ టూ నుంచీ అరగంట పాటూ క్లయిమాక్స్ కి కేటాయించాడు. ఈ మొత్తం స్ట్రక్చర్ కీ రాజ్ పుత్ కి మందు పాతర (మైన్) పెట్టడంతో ఇంటర్వెల్ ఇచ్చాడు. 

          స్ట్రక్చర్ ని కోరుకోని ఇంకా పాత స్కూలు యువ వృద్ధులు తమ కథలతో ఈ సినిమా కథ ఎలా విబేధించి తమ కథలకంటే ఇంత పకడ్బందీగా వుందో విశ్లేషించి చెప్పగల్గితే, వాళ్ళని ఘనంగా సన్మానించ వచ్చు. చిక్కేమిటంటే, వాళ్ళకి ఏ సినిమా చూసీ విశ్లేషించడం చేతగాదు!

-సికిందర్      


13, ఫిబ్రవరి 2017, సోమవారం

          
     హ  అంతా ఓకే అనుకుని కీ బోర్డు మీద మీరు ఫైనల్ గా సేవ్ కొడతారు. టేబుల్ మీద అటు పక్క వున్న మగ్గులో పొగలు గక్కుతున్న కాఫీని ఇంకోసారి సిప్ చేసి, వర్డ్ డాక్యుమెంట్ ని క్లోజ్ చేస్తారు. ఆ వర్డ్ డాక్యుమెంట్ లో మీరు ఇప్పుడిప్పుడే ఫినిష్ చేసిన బ్లాక్ బస్టర్ స్క్రిప్టు వుంది. మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఫీలవుతారు. గర్వంగానూ ఫీలవుతారు. ఎందుకంటే- ఒక స్క్రిప్టు ని పట్టుబట్టి ఫినిష్  చేయడమంత  గొప్ప పని లేదు! అయితే ఒకటే సమస్య- మీరా స్క్రిప్టుని ప్రేమించకపోవడం, ఇంకా వరస్ట్ గా మిమ్మల్ని మీరే ప్రేమించుకోవడం!
          షాకింగ్ గా వుందా? వుండొచ్చు. వుంటుంది కూడా. రైటర్ గా మీతో మీరే ప్రేమలో పడితే, టాలెంట్ పరంగా మీరొక పెద్ద కొండనే ఢీకొంటారు. ఆ కొండని ఒక్క అంగుళం కూడా కదిలించుకుని దాటలేరు. మీరు అట్టడుక్కి  జారుకుంటే తప్ప-మీ ఇగో కిందనుంచి మీరు కూర్చోబెట్టిన  పీఠాన్ని లాగేస్తే తప్ప!

         రైటర్స్ తో  వచ్చిన చిక్కేమిటంటే, వాళ్ళు సక్సెస్ ని ఫేమ్ గా చూస్తారు. ఫేమ్ కోసం రాస్తారు. రాయడం కోసం రాయరు. వాళ్ళ క్రియేటివ్ ప్రాసెస్ నిండా ప్రపంచంలో తాము పొందబోయే పేరుప్రఖ్యాతుల వాసనలతో నింపేస్తారు. తాము రాసింది పబ్లిక్ లోకి వెళ్ళాలని గాక, రాసిందాంతో తామే పబ్లిక్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాలనుకుంటారు. తమ పేరే కన్పించాలి, తాము రాసింది ఎలా వున్నా ఫర్వాలేదన్న పటాటోపంతో ప్రవర్తిస్తారు.  


          అప్పుడేం జరుగుతుంది? ఇలా మీ గురించి  మీరు ఫీలైపోతే, మీరు రాసిందాంట్లో మీరే కన్పిస్తారు; మీ ఇగోయే కన్పిస్తుంది; పేరుతెచ్చుకోవాలన్న మీ యావే కన్పిస్తుంది. ఒక కంపెనీ తన ఉత్పత్తులకి ప్రజల్లో పేరురావాలన్న సంకల్పంతో నాణ్యమైన ఉత్పత్తిని చేస్తుంది, ఉత్పత్తిని వదిలేసి కంపెనీకే పేరురావాలని ప్రాకులాడదు.
          మీరలా కాదు, మీరు మీకే పేరు రావాలనుకుని రాస్తారు, రాసిందాని నాణ్యత పట్టించుకోరు. రాసిందాన్ని ఎప్పుడూ నిష్పాక్షికంగా సరిచూసుకోవాలని కూడా ప్రయత్నించరు. మీ ఇగో మిమ్మల్ని మీరింతగా ప్రేమించుకునేట్టు మాయ చేస్తుంది. మీ ఇగో మీకిచ్చిన  కాన్ఫిడెన్స్ మీద ఈగని కూడా వలనివ్వదు. ఇగోయే మీరు, మీరే ఇగో అన్నట్టుగా మీరుంటారు.
          ఇలా గాలికొట్టి ఉబ్బించుకున్న కాన్ఫిడెన్స్ తో మీరు స్క్రిప్టు ని సబ్మిట్ చేస్తారు. ఇగో చేసే ఇంకో మాయ ఏమిటంటే అది అవతలివారికి కూడా ఇగో వుంటుందన్న స్పృహ మీకు కలగనివ్వదు. మీ స్క్రిప్టు చదివే అవతలి వ్యక్తి  అందులో మీ ‘రైటింగ్ పవర్’ ని చూసి పడిపోతాడనుకుంటారు. కానీ అతడికీ ఇగో వుంటుందనీ, ఆ ఇగోతో అతనూ రియాక్ట్ అవుతాడనీ అనుకోరు. మీ రైటింగ్ పవర్ లో మీ ఇగోని చూసిన అతను కూడా వెంటనే తన ఇగోతో దాన్ని తిప్పికొట్టేస్తాడు.
రెండు ఇగోలూ ఒక ఒరలో ఇమడవు. అవతలి వ్యక్తికి ఇగో లేకుండా మీరు చేయలేరు. ఎంతో కొంత అతడి ఇగోని సంతృప్తిపర్చడమే మీరు చేయగలరు. అతడి ఇగోని  సంతృప్తిపర్చాలంటే మీరు రాసిం దాంట్లో మీ ఇగో కన్పించకూడదు, వినయపూర్వక రాతే కన్పించాలి. ఆ రాతలో ఆ రాతద్వారా ఆ కంపెనీకి వచ్చే లాభాలే కన్పించాలి, మీ పేరుప్రఖ్యాతులు కాదు. కంపెనీకి మీ ఇగో నచ్చి  నడిబజార్లో మిమ్మల్ని నిలబెట్టి మిమ్మల్ని అమ్మాలనుకోదు, మీరు రాసింది నచ్చితే దాన్ని అమ్మాలనుకుంటుంది.
రాసిందాంట్లో అంతా మీ ఇగోయే నిండిపోయి వుంటే, దాన్ని రిజెక్ట్ చేస్తుంది, డీఫేమ్ చేస్తుంది, డస్ట్ బిన్ లో పడేస్తుంది. అప్పుడేమవుతుంది? ఇతరుల్నిఇంప్రెస్ చేయడంలో మీరు ఇలా ఫెయిలవడంతో మీ ఇగో స్థానంలో మిమ్మల్ని అవమానభారం, నిరాశానిస్పృహలు, విరక్తి, వైరాగ్యం, పిరికితనం ఇవన్నీ చుట్టుముడతాయి. మీ ఇగో మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకెళ్తుందన్న మాట.
అందుకని ఏంచేయాలి? మీతో మీరు ప్రేమలో పడకండి, మీ రాతతో ప్రేమలో పడండి. మీ రాతపట్ల కమిట్ మెంట్, నిజాయితీ ఉట్టి పడేట్టు రాయండి. ఆ రాత ద్వారా మీరేదో సాధించాలన్న ఆశలు పెట్టుకున్నట్టు గాక, మీ రాత ఏం సాధించగలతో ద్యోతకమయ్యేట్టు రాయండి. అప్పుడు నెగెటివ్ ఫీడ్ బ్యాక్ మిమ్మల్ని దెబ్బ తీయదు, ఇంకోచోట సబ్మిట్ చేసుకుంటారు.  రిజెక్షన్స్ మిమ్మల్ని బాధించవు, అదికాక పోతే ఇంకోటి రాయడానికి సిద్ధమవుతారు. రాసిందే శాశ్వతమని భావించరు, ఇంప్రూవ్ మెంట్ ఎప్పటికీ వుంటుందని కరెక్షన్స్ చేస్తూంటారు. ఎన్ని కరెక్షన్స్ తో ఎంత పర్ఫెక్షన్ మీరు సాధిస్తూంటే, అంత ఒప్పించడానికి మీరు దగ్గరవుతూంటారు. మార్కెట్లో డబ్బే మాటాడుతుందని గుర్తు పెట్టుకోండి, రాత కాదు.
అంటే మీకంటూ ఏమీ ఆశించకుండా రాయాలా? అవునంతే, ఆశించకూడదు. అది రాస్తే మీకింత పేరొస్తుందని రాయకూడదు, అది రాస్తే మీకింత డబ్బొస్తుందని రాయకూడదు, అది రాస్తే మరెన్నో  ఆఫర్స్ వస్తాయనీ రాయకూడదు. వస్తాయీ అన్నది వూహ, వూహలు చేయకూడదు. వూహించడంటే భవిష్యత్తులో వుండడమే. కానీ మీరు వర్తమానంలో వుండాలి. మీరు భవిష్యత్తుని కలలు గంటూంటే, అది మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడానికీ, ఆ ప్రేమతో మిమ్మల్ని మీరేదో వూహించుకోవడానికీ, పగటి కలలు కనడానికీ, ఫలితంగా ఇగో వచ్చి ఆక్రమించడానికీ, ఆ ఇగోయే మిమ్మల్ని మీరు బాగా ప్రేమించుకోవడానికీ, ఆ సెల్ఫ్ లవ్ తో వర్తమానంలో మిమ్మల్ని నడిపించడానికీ దారి తీస్తుంది. మీ చేతిలో వున్న పనిని సరిగా జరగనివ్వదు, డిస్టర్బ్ చేస్తూంటుంది.
ఏదో రావాలని, ఏదో కావాలని మీరు వూహాజనితమైన భవిష్యత్తులోకి వెళ్ళిపోయే కంటే, వాస్తవికమైన వర్తమానాన్ని నమ్ముకుంటేనే పనిని నమ్ముకున్నట్టు. వర్తమానంలో దృష్టి పెట్టి మీరు సరిగా రాయకపోతే మిమ్మల్ని  మీరెలా నమ్ముకోగలరు. అందుకని పనిని నమ్ముకోవాలి, మిమ్మల్ని కాదు. పనివల్లే మీమీద మీకు నమ్మకం ఏర్పడుతుంది, వూహలవల్ల కాదు. పనిని నమ్ముకున్నప్పుడే  మిమ్మల్ని మీరు ప్రేమించుకోకుండా వుంటారు. ఎందుకంటే వాస్తవంలో లేదా వర్తమానంలో- ఈ క్షణంలో- మీరు చేయాల్సిన పనే మీ ముందుంటుంది. ఆపని తనని ప్రేమించమంటుంది. అందుకని మీ రాతపనిని మాత్రమే మీరు ప్రేమించాలి, అది నిర్దుష్టంగా వుంటే, అదే మీ భవిష్యత్తుని కావలసినంత గొప్పగా తీర్చిదిద్దుతుంది. సరైన వస్తువు నివ్వకుండా మీరే వస్తువూ పొందలేరు, భవిష్యత్తు బంగారమవ్వాలంటే వస్తువే సమాధానం! ఇగోని భవిష్యత్తు వికర్షిస్తుంది, ఒకవేళ ఆకర్షిస్తే  అది తాత్కాలికమే.
-ఏజెన్సీస్ 

12, ఫిబ్రవరి 2017, ఆదివారం

రివ్యూ!






రచన- దర్శకత్వం : హరి

తారాగణం : సూర్య, అనూష్కా,  శృతీ హాసన్, సూరి, రాధిక, ఠాకూర్ అనూప్ సింగ్, సుమన్, శరత్ బాబు, శరత్సక్సేనా, నీతూ చంద్ర దితరులు
మాటలు : శశాంక్ వెన్నెలకంటి, సంగీతం : హారిస్ జయరాజ్, కెమెరా  : ప్రియన్, ఎడిటింగ్ : వీటీ విజయన్, టీఎస్ జే, స్టంట్స్ : అన్బరీవ్, కణల్ కన్నన్
బ్యానర్ : స్టూడియో గ్రీన్, సురక్ష్ ఎంటర్టైన్మెంట్
నిర్మాతలుః జ్ఞానవేల్ రాజా, ల్కాపురం శివకుమార్
విడుదల : ఫిబ్రవరి 9, 2017
***

        ‘సింగంఇంకా గర్జిస్తోంది. బాక్సాఫీసు మీద పంజా దెబ్బ ఇంకా విసురుతోంది. మొత్తం సినిమాల టర్నోవర్ లో తన  నర సింహ భాగం వాటా లాగేస్తూ  నమిలేస్తోంది. సింగం-1, 2 లతో ఎప్పుడో తన సామ్రాజ్యాన్ని స్థాపించుకుని,  సింగం -3 కి  స్టయిల్ గా SIII గా లోగో అదీ  పెట్టుకుని స్పీడు పెంచి గాండ్రిస్తోంది... సింగం ఎప్పుడూ సింగమే, రెండు నెలలుగా విడుదల ఎన్నిసార్లు వాయిదాలు పడ్డా, ఆఖరికి విడుదల రోజు మార్నింగ్ షోకి మొహం చాటేసినా అది మృగరాజే. అది జూలు విదిలిస్తే దాని మీద జోకులన్నీ బలాదూరే. సింగం మీద జోకులేస్తే అది జనం మీద పడి జేబులు బరాబర్ గా కొట్టేస్తుంది!


          సింగం కోసమే పుట్టాడు సూర్య. సూర్య కోసమే సింగం పుడుతూంటుంది. సింగం సూర్య, సూర్య సింగం ఎలా పిలచినా పలికేది బాలీవుడ్ దాకా హౌస్ ఫుల్ బాక్సాఫీసులే. దేశంలో పడ కేసిన  పక్కా నాన్ వెజ్ మసాలా యాక్షన్ లన్నీ లేచి సిగ్గుపడాల్సిందే. ఇక భాషలో సింగం తీసినా భాషలో  టైటిలే అక్కర్లేకుండా సింగమే ఒన్స్ ఫరాల్  టైటిల్  అవ్వాల్సిందే.


       
ఏమిటీ ఈసారి సింగం ప్రత్యేకత? ఒక సింగంని మించి ఇంకో సింగంగా తనతో తానే పోటీ పడే సింగం సీక్వెల్స్- ఫ్రాంఛైజెస్ మూడోసారీ పోలీస్ స్టోరీని ఇంకెంత వైవిధ్యంగా చూపించింది? మొదటి సింగంతో లోకల్ పోలీసుగా పుట్టిన సింగం ఇప్పుడు లెవెల్ పోలీసుగా విజృంభించాడు?  మొదటి సింగంతో లోకల్ సమస్యని పరిష్కరించిన సింగం, ఇప్పుడు స్థాయి సమస్యతో పోరాడేడు? అసలు సింగం ఏం చేశాడు? చూద్దాం...

కథ 
      మంగళూరులో ఓ  పోలీస్ కమీషనర్ హత్య జరిగి  ఎంతకీ కేసు తెమలక పోవడంతో  ఆంధ్రప్రదేశ్ లో గట్టి  పోలీసాఫీసర్ నరసింహం (సూర్య) మాత్రమే దీన్ని  పరిష్కరించగలడని, కేంద్రం ఒక ఆలోచన చేస్తుంది. ఒక రాష్ట్ర పోలీస్ అధికారిని ఇంకో రాష్ట్రం పంపాలంటే వయా సిబిఐయే మార్గమని చర్చించుకుని, నరసింహంని  సిబిఐ లోకి రిక్రూట్ చేసుకుని, అక్కడ్నించి మంగళూరు పంపుతుంది సీబీఐ డిసిపి గా కేంద్ర ప్రభుత్వం. కమీషనర్ ని చంపిన హంతకుల్ని పట్టుకోవడానికి అక్కడికి చేరుకున్న నరసింహం, అక్కడి  మధుసూదన్ రెడ్డి (శరత్ సక్సేనా)  అనే మాఫియాని అనుమానిస్తాడు. అతడిమీద పకడ్బందీ సాక్ష్యాధారాల్ని సంపాదించడం కోసం అతడితోనే చేతులుకలిపి నటిస్తూంటాడు. 

          విద్య (శృతీ హాసన్) అనే జర్నలిస్టు నరసింహంని పరిచయం చేసుకుని వెంట పడుతూంటుంది. కావ్య (అనూష్కా) అనే ఇంకో అమ్మాయి నరసింహంని రహస్యంగా కలుస్తూంటుంది. నరసింహం మధుసూదన రెడ్డితో చేతులు కలపడాన్ని కనిపెట్టి వార్తగా రాసేస్తుంది విద్య. దీంతో నరసింహంకి  చాలా చెడ్డ పేరొచ్చేస్తుంది. ఇది రూపుమాపుకోవడానికి వెంటనే మధుసూదన రెడ్డీ, అతడి గ్యాంగు మీదా చర్యలు తీసుకోవడం మొదలెడతాడు. దరిమిలా  కమీషనర్ హత్య వెనుక కేంద్ర మంత్రి (సుమన్), ఆస్ట్రేలియాలో వుంటున్న అతడి కొడుకూ విఠల్ (ఠాకూర్ అనూప్ సింగ్) వున్నారని తెలుస్తుంది. 

          వీళ్ళంతా కలిసి అసలెందుకు కమీషనర్ ని చంపారు? అసలు వీళ్ళు చేస్తున్న బిజినెస్ ఏమిటి? వీళ్ళని నరసింహం ఎలా పట్టుకున్నాడు? మరోవైపు వ్యక్తిగతంగా విద్యతో ఎదుర్కొన్న సమస్య లేంటి? అతణ్ణి  కలుస్తున్న కావ్య ఎవరు? ఇవన్నీ తెలుసుకోవాలంటే సింగం  నోట్లో డబ్బులు పెట్టాల్సిందే.  

ఎలావుంది కథ?
     ఈ మూడో సింగం కాన్వాస్ ని పెంచిందీ కథ. ఈసారి సింగంని యూనివర్సల్ పోలీసుగా ప్రమోట్  చేస్తూ  అంతర్జాతీయ సమస్యని సింగంకి అప్పగించిందీ కథ. సమస్త జీవులకీ, పర్యావరణానికీ ప్రాణాంతకమైన, భూమిలో కలిసిపోయే గుణం లేని బయోమెడికల్ వ్యర్ధాలు, ఈ- వ్యర్ధాలూ  ప్రత్యేక ప్లాంట్లతో నిర్వీర్యం చేయకుండా, ఆసియా దేశాలకి తరలించి డంప్ చేస్తున్న అంతర్జాతీయ పరిశ్రమల కుట్రని భగ్నం చేస్తుందీ కథ. తమిళ సినిమా కథ అంతర్జాతీయ సమస్యల్ని ఎత్తుకోవడానికి బాక్సాఫీసు భయాలు పెట్టుకుని వెనుకాడదు. స్మార్ట్ ఫోన్లు మాస్ ప్రేక్షకుల చేతికి సైతం వచ్చేశాక తమిళ సినిమా కథలకి రెక్కలొచ్చేస్తున్నాయి. నిజానికి పాత చింతకాయ పంజరాల్లో బందీలై  వుంటున్నది తెలుగు రచయితలే- ప్రేక్షకులు కాదు. స్మార్ట్ ఫోన్లతో, షార్ట్ ఫిల్ములతో ప్రేక్షకులు ఆ పంజరాల్లోంచి ఎప్పుడో బంధ విముక్తు లైపోయారు.  తెలుగు ‘జనతా గ్యారేజ్’ బ్రహ్మాండంగా జాతీయంగా పర్యావరణ సమస్యని ఎత్తుకుని, భయపడి పాత మూస ఫార్ములా మాఫియా కమ్ కుటుంబ కథ పంజరంలో సర్దుకుని సేఫ్టీ ఫీలైనట్టు గాక- సింగం అంతర్జాతీయ డంప్ దుష్పరిణామాల్ని కూడా సామాజిక దృష్టాంతా లుగా చూపిస్తుంది. ఈ డంప్ చుట్టే కథ సాగుతుంది తప్ప, ప్లేటు ఫిరాయించి రెగ్యులర్ లోకల్ మూస మాఫియా డెన్నుల్లో రొటీన్ గా తన్నుకు చావదు. 

ఎవరెలా చేశారు 
       ‘సింగ నరసింహం’ సూర్య సినిమా సాంతం సింగిల్ హేండెడ్ గా తానేఅయి గర్జించాడు, గాండ్రించాడు, బాదేడు, తన్నేడు, చీల్చాడు, చెండాడేడు, వెంటాడేడు, వేటాడేడు, వేటు మీద వేటు వేశాడు, కాల్చాడు, కూల్చాడు, భస్మీపటలం చేశాడు- క్షణం కూడా కుదురుగా లేడు. భగభగమండే సూర్య నరసింగ సింగమతను. మోడర్నైజ్ చేసిన- నూతన కల్పన చేసిన మాస్ సినిమా అంటే ఏంటో రుచి చూపించాడతను. మొదటి సింగం నుంచీ మూడో సింగం వరకూ అదే మెరుపు వేగం నటన, అవే తూటాల్లాంటి మాటలు. అలాగని ఈ పాత్ర  హైపర్  యాక్టివ్ పాత్రకాదు. ఓవరాక్షన్ నటనా కాదు. హైపర్ యాక్టివ్ పాత్ర   కిక్ -2 లో రవితేజ విఫలమైన పాత్ర  లాంటింది. హైపర్ యాక్టివ్ నెస్  ఇమేజి పెంచే నటనే కాదు. హైపర్ యాక్టివ్ నెస్ ని చిన్న పిల్లల చేష్టగా డయాగ్నసిస్   చేస్తారు- ఈ రకం మానసిక రుగ్మతతో కూడిన ప్రవర్తన చిన్నపిల్లల్లో వుంటుంది. సూర్యది హై పవర్ యాక్షన్. సూపర్ యాక్టివ్ క్యారక్టర్. అతడి మోహంలో, కళ్ళల్లో, కదలికల్లో బలవంతంగా తెచ్చిపెట్టుకున్న భావోద్వేగ ప్రకటన, బాడీ లాంగ్వేజ్ లుండవు. అంత బీభత్సంలోనూ  అతి సునాయాసంగా సహజంగా సింపుల్ గా రౌద్ర రసమంతా పలికించేస్తాడు. ఒక కాకలు తీరిన పౌరాణిక నటుడికే సాధ్యమయ్యే నటకౌశలమిది. సినిమా సాంతం ఇంత ఎనర్జీ ఎక్కడ్నించీ పోగేసుకొచ్చాడో తెలీదు. ఇదంతా చూస్తే, ఇంతా చేస్తే గానీ ఒక మసాలా యాక్షన్ సినిమాని ఇవాళ్టి  ఎదిగిన ప్రేక్షకుల దర్బారులో ఒక స్టార్ దిగ్విజయంగా నిలబెట్టలేడేమో నన్న అనుమానం  వేస్తుంది. సూర్య కాక ఇంకెవరూ ఇంత కాక పుట్టించలేరు. 

          ఇక ఈ వారం ఇంకో ప్రత్యేకాకర్షణ – ఒకటి కాదు రెండు సినిమాల్లో- అనూష్కా!  సింగంతో బాటు ఓం నమో వెంకటేశాయలో ఆమె ఇంకెంతో లావెక్కి ప్రత్యేకాకర్షణగా నంబర్ వన్ గా నిలిచింది. ఇలాగే  లవులావుమని కంటిన్యూ అయితే బాక్సాఫీసుల్ని రీక్యాలిబరేట్ చేయాల్సి వస్తుందేమో ఆమె క్షేమంగా పట్టేట్టు.

          శృతీ హాసన్ ఫేస్ లో కూడా మార్పు క్లోజప్స్ లో బయటపడుతోంది. అందం హీరోయిన్ల పక్షపాతి అనే మాటని ఆమె నిలబెట్టుకోకపోతే అవకాశాలకి ఎసరొచ్చే ప్రమాదముంది. 

          ఈ సూపర్ ఫాస్ట్ గా పరుగులెత్తే సీన్లతో కూడిన యాక్షన్ లో సమస్యేమిటంటే - సూర్యకి, కమెడియన్ సూరికీ తప్ప- ఇంకెవరికీ కాస్తాగి పాత్రల్ని నటించేంత  స్పేస్ లేకపోవడం. ఈ రొంబ యాక్షన్లో కాస్త కామెడీతో రిలీఫ్ వుండాలన్నట్టు,  అప్పుడప్పుడు యాక్షన్ ని ఆపుతూ సూరి  వచ్చేసి, తన నాటు కామెడీతో కొంత  స్పేస్ ని సొంతం చేసుకుంటూంటాడు. వీళ్ళిద్దరికీ తప్ప- హీరోయిన్లూ విలన్లూ ఇంకెవరూ సరిగా రిజిస్టర్ కానంత మెరుపు  వేగంతో  సీన్లు - సీన్లు కావివి మైక్రో సీన్లు - వెళ్లి పోతూంటాయి. మొత్తం కలిపి నలభైకి పైగా ఆర్టిస్టులు డెకొరేషన్ బల్బుల్లా క్షణక్షణం వెలుగుతూ ఆరిపోతూ వుంటారు.

          తెరవెనుక హీరోలు స్టంట్ కో- ఆర్డినేటర్లు అన్బరీవ్
, కణల్ కన్నన్ లు. వీళ్ళతో పనిలేని సీనే దాదాపు లేదు. ఇన్నేసి యాక్షన్ సీన్లలో రిపిటీషన్ బారిన పడకుండా దేనికదిగా పోరాటాల్ని సృష్టించారు. ఏర్ పోర్టులో, రైల్వే స్టేషన్లో, హైవేలమీదా, నడిబజార్లలో, భవనాల్లో, అరణ్యాల్లో  ఎక్కడపడితే అక్కడ - కథా కథనాల వేగంతో పోటీ పడుతూ- కళ్ళు తిప్పుకోనివ్వని హైపర్ యాక్షన్ సీన్స్ ని సృష్టించారు. ఈ సీన్స్ లో  సింగం ని హైలైట్ చేసేలా చాలా లౌడ్ గా (మాస్ గా) ఆర్ ఆర్ ఒక్కటే సెకండాఫ్ వచ్చేసరికి చెవులు తట్టుకోలేని పరిస్థితి తెస్తుంది. మిరపకాయల పొగ బెట్టినట్టు ఇంత ఘాటు మసాలా అవసరం లేదేమో ఎంత మాస్ యాక్షన్ కైనా! 

          హారిస్ జయరాజ్ పాటల కోసం తన వంతు కృషి చేస్తే, లొకేషన్స్ పరంగా వీటి కోరియోగ్రఫీ రిలీఫ్ కూడా ఇచ్చేట్టు వుంది. ఈ యాక్షన్ కథకి పాటలు అడ్డుపడలేదు- వూపిరి సలపనివ్వని ఇంత  స్పీడ్ భారీ యాక్షన్ నుంచి కొన్ని నిమిషాలు  లెటజ్ చిల్ గా ఉపశమనం కల్గిస్తాయి. 

          ప్రియన్ కెమెరా వర్క్ కూడా అతి కష్టమైనది. కెమెరా స్పీడుగా పరిగెడుతూనే వుం టుందెప్పుడూ. 360 డిగ్రీ కెమెరాలు కూడా యదేచ్ఛగా వాడేశారు. జూమ్ ఇన్-  జూమ్ బ్యాక్ లేకుండా దాదాపు  షాట్స్ లేవు. కానీ  ఒకటీ  రెండు సెకన్ల నిడివితో  ఒక మైక్రో షాటే ఒక సీనుగా వుంటున్నప్పుడు, కంటిన్యూటీ చెడకుండా వీటిని క్యాప్చర్ చేస్తూ పోవడం ఎంత కష్టమో వూహించుకోవాల్సిందే. మాట్ డామన్ నటించిన బోర్న్ ఐడెంటిటీ సీక్వెల్స్ లో ‘బోర్న్ సుప్రమసీ’ (2004) లోనైతే,  సగటున ఒక్కో షాట్  నిడివి 1.9 సెకన్లు మాత్రమే. ఈ విజువల్ అప్రోచ్ ఎడిటింగ్ కీ, ఆర్ ఆర్ కీ, డీఐకీ అన్నిటికీ పెద్ద సవాలుగా మారింది- ఈ వేగం చూడలేక ప్రేక్షకుల కంటికీ ఇబ్బందై  విమర్శల పాలయ్యింది. ఇలా కళ కోసం టెక్నాలజీ గా కాక, టెక్నాలజీ కోసం కళ గా దుర్వినియోగమవడానికి దగ్గరగానే వుంది సింగం కూడా. కాకపోతే ఇక్కడ మైక్రో షాట్స్ ఎక్కువ లేవు- మైక్రో సీన్స్ వున్నాయి. 

          విజయన్
, జేలకి కూడా ఎడిటింగ్ లో  ఇది సవాలే. మైక్రో సీన్లతో,  వాటి ఇంటర్ కట్స్ తో, ఫ్లాష్ బ్యాక్స్ తో, స్పీడుతో  షాట్స్ ని ఏర్చి కూర్చి ఒక దృశ్యమాలికని  ఇంద్రధనుస్సులా చేయడం మామూలు కష్టం కాదు. 

          ఇంకా గ్రాఫిక్స్ సహా అన్ని టెక్నికల్ విభాగాలూ అత్యన్నతంగా పనిచేశాయి. వీటన్నిటినీ, వీళ్ళందర్నీ డామినేట్ చేస్తూ క్షణ క్షణం తెరమీద విచ్చలవిడిగా వెదజల్లుతున్న నిర్మాతల డబ్బు కట్టలే కనిపిస్తూంటాయి.

చివరికేమిటి 
       దర్శకుడు హరి సింగం సిరీస్ కి ఒక విజువల్ సెన్స్ ని  ఏర్పాటు  చేసుకుని అదే పాటిస్తూ వస్తున్నాడు. ఈ విజువల్ సెన్స్ తో ప్రస్తుత కథకి కథనాన్నీపాత్రల్నీ వాయువేగం పట్టిస్తూ ఎక్కడా ప్రేక్షకులకి ఆలోచించే అవకాశమివ్వకుండా చూశాడు. ఒక సీను మీద పూర్తిగా దృష్టి సారించే లోపే ఆ సీను మారిపోయే క్రమం చివరివరకూ కన్పిస్తుంది. ఒక నార్మల్ సీనులో ఎం టీవీ తరహా  మైక్రో షాట్లు వుండేవి ఒకప్పుడు. ఇప్పుడు మైక్రో షాట్ల స్థానంలో  మైక్రో సీన్లని ప్రవేశపెట్టాడు  దర్శకుడు. ఎన్నెని సీన్లు, ఎక్కడెక్కడి సీన్లు- క్షణంలో ఇక్కడ ఓపెన్ అయితే క్షణంలో స్వీడెన్ లో వుంటాయి; క్షణంలో హైవే మీద వుంటే,  క్షణంలో ఏర్ పోర్టులోవుంటాయి. ఒక సీను మీద ప్రేక్షకులు ధ్యాస నిలిపే సమయం ( అటెన్షన్ స్పాన్) బాగా తగ్గిపోయిన నేపధ్యంలో ‘టర్మినేటర్’ లాంటి సీజీ విజువల్ ఎఫెక్ట్స్ తో సినిమా కథ చెప్పే విధానమే మారిపోయిందని చెప్పాడు ఒకప్పుడు సిడ్  ఫీల్డ్. సీజీల  సంగతేమోగానీ, సింగం మైక్రో షాట్స్ తో హంగామా చేస్తోంది. ఈ టెక్నిక్ తో  కథనీ పాత్రల్నీ పట్టుకోగల్గే మాటలా వుంచి, అసలు మెదడు ఎంత అలసిపోతుందో ఆలోచించాలి. కచ్చితంగా రెండో సారి ఇలాటి సినిమా చూడలేరు ప్రేక్షకులు. 

          అయితే ఈ సీన్ల సందడి మీద కూడా దర్శకుడి కమాండ్ ఏలాంటిదంటే- ఇంత హంగామాలోనూ, ఎన్నెన్నో సీన్లతో  ఇంత స్పీడులోనూ,  ఎక్కడా కన్ఫ్యూజ్ అవుతున్నట్టు కన్పించడు. గందరగోళం చేస్తున్నట్టు, నవ్వులపాలవుతున్నట్టూ అన్పించడు. దేశ విదేశాల్లో విలన్లతో ప్రధాన కథని పరుగులెత్తిస్తూనే, అందులోనే ఒక హీరోయిన్ తో హీరో ప్రేమ కథ, ఇంకో హీరోయిన్ తో పెళ్లికథ, పెళ్లి అనంతర కథ, అత్తగారింటి కథ, అత్తగారి అస్తమయ కథా; ఇంకా డ్యూయెట్లూ, వూర మాస్ కామెడీలూ....ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడేయాలో మాస్టర్ షెఫ్ లా స్పీడుగా వేసుకుంటూ పోయాడు. అయితే అంతే స్పీడుతో ఆరగించాల్సివచ్చే ప్రేక్షకాతిధుల సంగతి అలోచించినట్టు లేదు. 

          కథతో కూడా జానర్ మర్యాద తప్పలేదు. అయితే కాన్సెప్ట్ ని అలా చెప్పి వదిలేశాడు తప్పితే,  దాన్ని ప్రధానం చేయలేదు; దాంతోనే  కథ ముగించే ఆలోచన చేయలేదు ఇలాటి చాలా సినిమాలకి లాగే. నాన్ బయో డీగ్రే డబుల్ వేస్ట్స్ తో అంతర్జాతీయ కుట్ర ఇక్కడ స్థానికంగా  ఎంతమంది స్కూలు పిల్లల్ని బలిగొందో – ఆ దయనీయమైన ట్రాక్ ని కొనసాగిస్తూ, బాధిత కుటుంబాల సమక్షంలో విలన్స్  ని శిక్షించినప్పుడే కదా - తామెంతటి దుర్మార్గానికి పాల్పడ్డారో ఆ విలన్స్ కి తెలిసివచ్చేది. బిన్ లాడెన్ ని శిక్షిస్తే అతడి బాధితుల సమక్షంలో బహిరంగంగా శిక్షించాలని ఎందుకు సలహా ఇచ్చి వుంటాడు హాలీవుడ్ రచయిత సీఐఏకి? అది సినిమా బుద్ధి కాబట్టి. అలా వుంటేనే సినిమా బావుంటుంది కాబట్టి. ఒకప్పుడు సినిమా కథల్లో విలన్ బాధితులు హీరో వెంట వుండేవాళ్ళు  కాన్సెప్ట్ ని మోస్తూ. సమాజ బాధని సింగం తానొక్కడి  ఎమోషన్ గా ఒప్పించలేడు తనూ బాదితుడైతే తప్ప. బాధితుడు కాని హీరో బాధితులు తోడయినప్పుడే  వాళ్ళ ఎమోషన్ తో కలుపుకుని తనూ జ్వలించగలడు.  సహాయ పాత్రలు అవుట్ డేటెడ్ కాలేవు, ఎందుకంటే అవి ఎప్పుడూ వుండే ఎమోషన్స్ కాబట్టి. ఒక్కో ఎమోషన్ కి ఒక్కో ప్రతీకలైన తల్లి- చెల్లి- తండ్రి- తాత- పెద్దమనిషి- స్నేహితుడు- హాస్యగాడు- మాయగాడు మొదలైన  అనేక పాత్రల్లో చాలా పాత్రలు (ఎమోషన్లు) మాయమైపోయినట్టు, లేదా నామమాత్రమైనట్టు- సామాజిక కుట్రల బాధితులు కూడా మాయమైపోయి- స్టార్ ఒక్కడే మిగులుతున్నాడు సెకండ్ హేండ్ లేదా పరోక్ష ఎమోషన్ ని  ప్రకటిస్తూ.

          ‘ది మాగ్నిఫిషెంట్  సెవెన్’ లో కౌబాయ్ హీరో డెంజిల్ వాషింగ్టన్ వూరి ప్రజలని కాపాడ్డానికి  పోరాటాలు చేస్తాడు. ప్రజలు కోరినంత మాత్రాన ఎక్కడ్నించో వచ్చి పోరాడాల్సిన ఎమోషనల్ కనెక్ట్ తనకి లేదు. కానీ చివర్లో విలన్ని చంపుతూ- ఆనాడు నా తల్లినీ చెల్లినీ చంపింది నువ్వే కదరా?-  అని జస్టిఫై చేసుకుంటాడు తన ఎమోషనల్ కనెక్ట్ ని!

          సింగం లో స్పీడుతో బాటు  మైక్రో సీన్ల కారణంగా ఒక్క సీనూ  గుర్తుకురాని విధంగా తేలిపోయిన మాట నిజమే- చూస్తున్నంత సేపే థ్రిల్ తప్ప ఎమోషన్ తో కట్టిపడేసేది లేదు, గుర్తుండేదీ లేదు. జస్ట్ కిక్ స్టార్ట్ పవర్ డ్రింక్ తాగిన చందాన వుంటుంది. ఎమోషన్ అనేది కాన్సెప్ట్ లో వుంది. ఆ నిజమైన ఎమోషన్ బాధిత పాత్రల్ని కలుపుకుని వస్తుంది- సినిమాకి ఆత్మ అనేది కాన్సెప్ట్ ని ఎమోషనల్ గా డ్రైవ్ చేసినప్పుడే ఏర్పడుతుంది. ఈ కథాత్మని కూడా జత చేసివుంటే సింగం ఇంకా సజీవమయ్యేది. 

          సింహం ఒంటరిగా పోరాడేటప్పుడుకంటే కూడా, తన పిల్లల్ని వెంటేసుకుని పోరాడుతూంటే ఆ డ్రామా బాగా గుర్తుండిపోతుంది!

-సికిందర్