రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

10, ఫిబ్రవరి 2017, శుక్రవారం

rరివ్యూ!


స్క్రీన్ ప్లే- దర్శకత్వం : కె. రాఘవేంద్ర రావు


తారాగణం : నాగార్జున అక్కినేని, సౌరభ్ రాజ్, అనూష్కా, ప్రగ్యా జైస్వాల్, సుధ, విమలారామన్, అస్మిత, జగపతి బాబు, సాయికుమార్, రావురమేష్, తనికెళ్ళ, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్,  బ్రహ్మానందం, ఆదిత్యా మీనన్, రఘుబాబు, పృథ్వీ రాజ్ తదితరులు 

కథ- మాటలు: జేకే భారవి, సంగీతం : ఎంఎం కీరవాణి,  ఛాయాగ్రహణం : ఎస్. గోపాలరెడ్డి బ్యానర్ : ఏఎంఆర్ సాయికృపా ఎంటర్ టైన్మెంట్స్ 
నిర్మాత : ఎ. మహేష్ రెడ్డి 
విడుదల : ఫిబ్రవరి 10, 2017
***

       వివిధ దేవుళ్ళకి ప్రణమిల్లి పరమ భక్తుడిగా నటిస్తున్న అక్కినేని నాగార్జున ఈసారి తెలుగు ప్రేక్షకులకి అంతగా తెలీని ఉత్తరాది భక్తుడు హాథీరాం భావాజీ పాత్ర పోషించారు. ఏడుకొండలవాడికి అపర భక్తుడైన హాథీరాం జీవిత కథలో ఒక సంఘటనే  సినిమా తీయడానికి ఆకర్షించి వుంటుంది బహుశా. భక్తి సినిమాలవైపు మళ్ళిన దర్శకుడు కె.  రాఘవేంద్రరావు మరోసారి  తన టీముతో ఈ కొత్త ప్రయత్నానికి పూనుకున్నారు. భక్తి  సినిమాలకి వీళ్ళిద్దరి రెగ్యులర్  కాంబినేషన్ లో ‘ఓం నమో వెంకటేశాయ’ తీరుతెన్నులేమిటో ఈ కింద చూద్దాం...

కథ
          రాం అనే కుర్రాడికి  దేవుణ్ణి చూడాలన్న కోరిక పుడుతుంది. దేవుణ్ణి చూడ్డం కాదు, దేవుడు ప్రత్యక్షమైతే గుర్తుపట్టగల్గాలని ఉపదేశించి ఓంకార మంత్రం నేర్పడం మొదలెడతాడు అనుభవానంద స్వామి (సాయి కుమార్). ఆ మంత్రాన్ని పఠిస్తూనే పెద్దవాడైన రాం (నాగార్జున) వటపత్రసాయి రూపంలో వచ్చిన ఏడుకొండల వాణ్ణి గుర్తుపట్టక, తన తపస్సుని భగ్నం చేసినందుకు కోపగించుకుని ఇంటి కెళ్ళి పోతాడు. అక్కడ తల్లిదండ్రులు (తనికెళ్ళ, సుధ) పెళ్లి చేస్తామంటే ఒప్పుకుంటాడు. కానీ మనసు మార్చుకుని కాబోయే పెళ్లి కూతురు (ప్రగ్యా జైస్వాల్) కి చెప్పేసి  దేవుడి  అన్వేషణలో వెళ్ళిపోతాడు. అసలు వటపత్రశాయి రూపంలో వచ్చింది ఏడుకొండల వాడేనని అనుభవానందస్వామి చెప్పి, పాచికలాట నేర్పి పంపుతాడు. 

          కానీ ఏడుకొండలపైకి చేరుకున్న రాంకి,  వెంకటేశ్వరస్వామి దర్శనం దొరకదు. ఆలయ భటులు నెట్టిపారేస్తారు. అలాగే ఎండలో వానలో ఆలయం ముందు కూర్చుంటాడు. ఆలయంలో చాలా అక్రమాలు జరుగుతూంటాయి ధర్మాధికారి గోవిందరాజులు (రావు రమేష్) ఆధిపత్యంలో. ఆలయంలో పనిచేసే కృష్ణమ్మ (అనూష్కా)  సహకారంతో రాం ఆలయానికి వచ్చే భక్తులకి అసౌకర్యం కలక్కుండా చూసుకుంటూంటాడు. రాం తమకి పోటీగా తయారయ్యాడని గోవిందరాజులు కక్షకట్టి దాడులు జరిపిస్తాడు. రాజు (సంపత్ రాజ్)  కి ఫిర్యాదు చేస్తాడు. ఆ రాజు రాం భక్తినీ నిజాయితీనీ  గమనించి, వరదరాజులుని పదవిలోంచి తొలగించి, రాంని ధర్మాధికారిగా నియమించడంతో- అప్పుడు రాం దైవదర్శనం చేసుకోగల్గుతాడు. అప్పుడు ఏడుకొండలవాడు ప్రసన్నుడై ప్రత్యక్షమవుతాడు- ఓ రాత్రి కలలోనే  పాచికలాట ఆడడానికొస్తాడు.

          ఇలా రాంతో ఏడుకొండలవాడు స్నేహం పెంచుకుని తరచూ పాచికలాటలో ఓడిపోతూంటాడు. చివరికి పందెంలో సర్వం పోగొట్టుకుంతాడు. దీంతో ఏడుకొండలవాడి నగలన్నీ పోయాయని గొడవరేగుతుంది. రాజు సమక్షంలో ఆభరణాలన్నీ రాం ఆశ్రమంలోనే దొరుకుతాయి-  ఒక దోషిలా నిలబడ్డ రాం ఇప్పుడేం సంజాయిషీ చెప్పుకున్నాడు? దీన్ని రాజు నమ్మాడా? నమ్మకపోతే ఏం పరీక్షపెట్టాడు? ఈ పరీక్ష రాం ఎలా నెగ్గాడు? తను బాలాజీ అని పిలుచుకునే ఏడుకొండలవాడు వచ్చి రాంని ఆదుకున్నాడా? ఆదుకుంటే రాం తీర్చుకున్న రుణం ఎలాటిది? తన అఖండ భక్తిని ఏ కోరరాని కోరిక కోరి నిరూపించుకున్నాడు? - వగైరా తెలుసుకోవాలంటే మిగిలిన కథ చూడాల్సిందే.


ఎలావుంది కథ
         
గొప్ప త్యాగంతో గానీ భక్తిరస ప్రధాన చలన చిత్రం పరిపూర్ణం కాదేమో. హాథీరాం భావాజీ చరిత్ర పూర్తిగా దొరకడంలేదని చెబుతున్నారు. కాబట్టి అధికభాగం కల్పన మీదే ఆధారపడ్డ సినిమాకథ హాథీరాం గురించి తెలుగు ప్రేక్షకులకి కొంతైనా ఒక  అవగాహన ఏర్పడేందుకు తోడ్పడుతుంది. హాథీరాం  1500 ప్రాంతాల్లో  తిరుమలకొచ్చాడని ఉన్న కొద్దిపాటి  చరిత్ర చెప్తోంది.  అంతేగాక అతను  ఉత్తరప్రదేశ్ కి చెందిన వాడని వుంది. సినిమాలో రాజస్థాన్ నుంచి వచ్చాడని అన్నారు. తిరుమలలో అతను నిర్మించిన మఠం క్రమంగా 60 గదులకి విస్తరించి, అయిదు వందల ఏళ్ళకి పైగా భక్తులకి సేవలందించి, ఇప్పుడు పూర్తిగా శిథిలావస్థకి చేరుకుని  ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురవుతోందని పత్రికలు  రాశాయి. ఒక తెలియని దైవ భక్తుడి గురించి సినిమావాళ్ళు సినిమాలు తీస్తారు, ప్రభుత్వాలు అవార్డు లిస్తాయి- కానీ ఆ భక్తుడు వదిలిపెట్టి వెళ్ళిన చిహ్నాల్ని  పరిరక్షించుకునే మాటో? సినిమాతోనైనా వాటికి మోక్షం కలగదా?

         
ఇక హాథీ రాం కథకీవిప్రనారాయణసినిమా  కథకీ దగ్గరి సంబంధం వున్నా, తేడా కూడా వుంది. విప్రనారాయణలో పరస్త్రీవ్యామోహంలో పడి దారితప్పిన తన భక్తుడు  విప్రనారాయణ కి సాయపడాలని, ఆలయంలోంచి బంగారు గిన్నె తొలగించి తెచ్చి, అది విప్రనారాయణ పంపిన కానుక అంటూ  దేవదేవికి బహూకరిస్తాడు రంగనాధ స్వామి. బంగారు గిన్నె చోరీ జరిగిందని పూజారి గోల పెడతాడు. నేర విచారణలో విప్రనారాయణుడే నిందితుడిగా నిలబడాల్సి వస్తుంది. అప్పుడు  చోళ రాజు అతడి దోషిత్వాన్ని నిర్ధారించుకుని, శిక్షగా చేతులు నరికెయ్యాలని ఆదేశిస్తాడు. శిక్ష అమలవుతూండగా, రంగనాథుడు ప్రత్యక్షమై కాపాడతాడు..ఇదంతా తాను ఆడించిన ఆటేనని చెప్తాడు.

         
హాథీరాంతో స్వయంగా ఏడుకొండలవాడు పాచికలాటలాడి సర్వం కోల్పోతే, నేరం హథీరాం మీద పడుతుంది. మళ్ళీ ఏడుకొండల వాడే  వచ్చి కాపాడతాడు. రుణం హాథీరాం తీర్చుకుంటాడు. ఇంతకి మించి కథలేదు. ఇదంతా సినిమాటిక్. ఏడుకొండలవాడు హాథీరాంతో పాచికల ఆట ఆడ్డానికి కూడాతన సేవలో అలసిపోతున్న హాథీరాంకి వూరట  కోసమే. ఇంతకిమించి ఆధ్యాత్మిక విలువ లేదు

         
కానీవిప్రనారాయణలో పూర్వ జన్మలో విప్రనారాయణ వైజయంతీ మాలా రూపుడనీ, శాపవశాత్తూ మానవుడిగా జన్మించాడనీ, దేవదేవి కూడా పూర్వజన్మ కర్మానుభవం కోసం మానవిగా జన్మించిన గంధర్వ కాంత అనీ, అలా వీళ్లిద్దరికీ సంబంధ బాంధవ్యాలు కల్పిస్తూ, వాళ్ళ కర్మ శేషం హరింపజేసేందుకే, తన సన్నిధి లోని బంగారు గిన్నెని సాని ఇంటికి పంపాననీ, చెప్పుకొస్తాడు రంగనాథుడు. దీంతో విప్రనారాయణ కష్టాలన్నీ గట్టెక్కి, తిరిగి స్వామి భక్తుడవుతాడు. ఇదొక ఆధ్యాత్మిక ఉద్దేశంతో కూడిన సైకో థెరఫీ మనకి!

          మరొకటి, హాథీరాంని ఏడుకొండలవాడు తనకి మించిన స్థానంలో అధిష్టింప జేయబోతే, అందుకు తగనని వెళ్లిపోయే హాథీరాం- సరే, ఇంకేదైనా కోరుకో తీరుస్తానని ఏడుకొండల వాడన్నప్పుడు- ఆ ఏడుకొండల వాణ్ణి బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు ఇరకాటంలో పెట్టేస్తూ, తీర్చుకున్న ఆ కోరికతో, దేవుణ్ణి మించిన దేవుడైపోలేదా హాథీరాం?

          చరిత్ర ప్రకారం హాథీరాం చేసిన నేరానికి రాజు పెట్టే పరీక్ష, ఒక్క పూటలో ఇంటెడు చెరుకు గడల్నీ  తినెయ్యాలని. అది ఏ మనిషికీ సాధ్యం కాదు. హాథీరాం ఏడు కొండల వాణ్ణి స్మరించుకుంటూ నిద్రపోతే, ఒక ఏనుగు వచ్చి మొత్తం తినేసి పోతుంది. తెల్లారి రాజు ఇది తెలుసుకుని, తన భక్తి  బలంతో ఏనుగు రూపంలో ఏడుకొండలవాణ్ణి రప్పించుకున్న హాథీరాం ని మెచ్చి,  అప్పుడే రాం పేరుకి ముందు ‘హాథీ’ (ఏనుగు) అని చేర్చాడు. సినిమాలో ఇదే చూపించారు. అలాగే ఓ రెండిటి గురించి రెండు చోట్ల వివరించారు : వెంకన్నకి బాలాజీ అనే పేరు ఎలా వచ్చిందో,  వెంకన్న ఉత్తరీయానికి శేషవస్త్రమని పేరెలా వచ్చిందో. 

          అయితే ఈ భక్తి జానర్ సినిమా ఆధ్యాత్మిక భావంతో మనసుని కడిగేసేకంటే, ఆత్మత్యాగంతో మనసుని కదిలిస్తుంది, పాచికలతో ఆడిస్తుంది, అంతే. 

ఎవరెలా చేశారు
          భక్తి పాత్రలకి ఇక నాగార్జున పెట్టింది పేరన్నట్టు వుంటుంది హాథీరాం పాత్రాభినయం. అయితే చివరి సన్నివేశాల్లోనే  ఈ భావావేశాల్ని రగిలించడం వుంటుంది. మిగతా సన్నివేశాల్లో భక్తి  కంటే శక్తియుక్తుల ప్రదర్శనే ఎక్కువ వుంటుంది. కథనం అలా చేసినప్పుడు చేసేదేం వుండదు. ఆనాటి క్లాసిక్ భక్తి  ‘భక్త తుకారాం’ లో తన తండ్రి పాత్రలాగా ఆద్యంతమూ భక్తిలో ఓలలాడే గాన- సంగీత మాధుర్యాల జడివాన కురిపిస్తున్నట్టు వుండాల్సింది. ‘భక్త తుకారాం’ లో కూడా అడ్డుపడే నాగభూషణం, సారథి మోసకారి  పాత్రలుంటాయి. వాటికి బుద్ధి చెప్పడం మరో పాట (చిందులు వేయకురా) ద్వారానే వుంటుంది. నాగార్జున పాత్రకి ఆలయంలో కార్మిక- యాజమాన్యం తాలూకు వర్గ పోరాటం లాంటిందిగా  వుండడంతో, ఆథ్యాత్మిక కథా సంవిధానానికి దూరంగా కమర్షియల్  హీరో- విలనిజాల కింద ఆ ఎపిసోడ్స్ అడ్డుపడేవిగా వుంటాయి. ఇక ఏడుకొండల వాడితో  పాచికలాట అయితే వినోదాత్మకమే. వెరసి గాఢమైన భక్తి నటించడానికి నాగార్జునకి మిగిలింది చివరి సన్నివేశాలే. పాత్రకి ప్రణయ కోణం లేదు. ప్రగ్యా జైస్వాల్ పాత్రతో దీన్ని బాగా పూరించే వీలున్నా పొడిపొడిగా చూపించి వదిలేశారు. ఇలా నాగార్జున పాత్ర చిత్రణ సారంలో మాత్రమే గాఢత్వానికి చేరుకోవడంతో గుర్తుండి  పోయే నటనన్నది చివర్లో మాత్రమే కన్పిస్తుంది- అదీ కదిలిస్తూనే, మనసుని కడిగేస్తూ కాదు. 

          ఆలయ సేవిక పాత్రలో  అనూష్కా, ఆమెని మోహించి పశ్చాత్తాప పడే అతిధి పాత్రలో జగపతిబాబూ ఓ పాటతో కలుపుకుని కాలక్షేపం కల్గిస్తారు. అయితే జగపతి పాత్రతో ఒరిగిందేమీ లేదు. ఎందుకొచ్చి ఎందుకు పోయిందో తెలీకుండా వుంటుంది. రాజు పాత్రలో జగపతి వుంటే బలంగా వుండేది. ‘భక్త తుకారాం’ లో శివాజీ గణేశన్ రాజుగా  నటించడంతో ఎంత బలాన్నిచ్చిందో తెలిసిందే. రాజు పాత్రలో విలన్ పాత్రలేసే సంపత్ రాజ్ కుదర్లేదు. ఆల్రెడీ విలన్లుగా రావురమేష్, ఆయన బృందం వుండగా, మళ్ళీ విలన్ లా కన్పించే సంపత్ రాజ్ వల్ల రాజు పాత్రకి  వైవిధ్యం ఏమీ లేదు. 

           ఇక అనూష్కాది  కీలకపాత్రా కాదు, చేసిందేమీ లేదు. ఏడుకొండల వాడిగా సౌరభ్ జైన్ ఫర్వాలేదనే అన్పిస్తాడు- అతడిది కొలమొహం కావడం, అదీ నునులేతగా వుండడం గాంభీర్యానికి మాత్రం అడ్డుపడ్డాయి. అతడిభార్యలుగా విమలారామన్, అస్మితల్లో విమలారామన్ దేవతామూర్తి లాగే వుంటుంది. 

          కీరవాణి సంగీతంలో పన్నెండు పాటలున్నాయి. తెరమీద ఈ పాటలన్నీ బాగానే వున్నాయి- కానీ కదిలించే భక్తి పాట అనేదే కరువయ్యింది. గుర్తుండి పోయే క్యాచీ పల్లవులు వున్నప్పుడే భక్తి పాటలు రక్తి కట్టిస్తాయేమో. ఎస్. గోపాలరెడ్డి ఛాయాగ్రహణం ఉన్నతంగా వుంది. ఎన్నుకున్న లోకేషన్స్, వేసిన సెట్స్ కథకి తగ్గట్టుగా వున్నాయి. 

చివరికేమిటి
          జేకే భారవి కథలో భక్తి రసం కంటే యుక్తి పన్నాగాలే ఎక్కువున్నాయి- చరిత్రలో కేవలం వెంకన్నతో హాథీరాం పాచికలాట ఆడ్డమనే అంశమే ఈ కథకి కీలకం, ఆకర్షణీయం, అదేసమయంలో బాక్సాఫీసు అప్పీలున్న పాయింటు కూడా. కె. రాఘవేంద్రరావు స్క్రీన్ ప్లేలో దీనికి స్ట్రక్చర్ కూడా బాగా  కుదిరింది. ముఖ్యంగా సాయికుమార్ నాగార్జునకి పాచికలు ఇచ్చి తిరుమలకి పంపడమనే ప్రారంభం నుంచీ, నాగార్జున దగ్గర ఆ పాచికలు ఎప్పుడెప్పుడు ఉపయోగంలోకి వస్తాయా అన్న ప్లాట్ డివైస్ లుగా ఆసక్తి కల్గిస్తూ వుంటాయి. మామూలు కథల్లో ఒక ఊర్నుంచి  సర్పంచ్ రాసిచ్చిన ఉత్తరం పట్టుకుని  హీరో సిటీకి వచ్చే కథనం లాంటి దన్నమాట. కాబట్టి ప్రేక్షకులు ఎప్పుడూ ఇష్టపడే ఈ ట్రాక్ ఈ స్క్రీన్ ప్లేకి వెన్నెముకగా నిల్చింది. పాచికలే అతడి జీవితం మొత్తాన్నీ మార్చేశాయి. సింపుల్ గా ఆద్యంతం ఈ ట్రాక్ కి సమాంతరంగా,  ఈ పాచికలతో ఏడుకొండల వాణ్ణి కలవాలన్న భక్తీ తపనలు తప్ప మరోటి లేకుండా చూసి  వుంటే- కథకి ఆథ్యాత్మిక విలువతో కూడిన మెలో డ్రామా కలిసివచ్చేది. 

          ఇంటర్వెల్ కి పది  నిమిషాల ముందు, గంటా పదినిమిషాలకి ఎట్టకేలకు నాగార్జున ధర్మాధికారిగా దైవదర్శనం చేసుకోవడంతో ప్లాట్ పాయింట్ వన్ ఇచ్చారు; దీనితర్వాత ఇంటర్వెల్ కి దేవుడితో పాచిక లాటాడే డ్రీమ్ సీన్ ఇచ్చారు. అలాగే సెకండాఫ్ లో చివరిసారి పాచికలాటలో దేవుడు ఓడిపోయి, ఆభరణాలు కోల్పోవడంతో ప్లాట్ పాయింట్ టూ ఇచ్చారు. వెంకన్నతో నాగార్జున ట్రాక్ ప్లాట్ పాయింట్స్ నీ, ఇంటర్వెల్ నీ కలుపుకునే ఏకత్రాటి పై వుంది. కానీ భక్తి సినిమాకుండే భక్తిరసానికే ఒక  ట్రాక్ లేకుండా పోయింది. దీంతో కథనం ఫ్లాట్ గా వున్నట్టు అన్పిస్తుంది.  ఆలయలంలో అక్రమాలతో విలనీ, కామెడీ ఇవేవీ అక్కడికొచ్చిన నాగ్ పాత్రతో సంబంధం లేకుండా వున్నాయి. అక్కడ నాగ్ భక్తులకి చేసే సేవలప్పుడైనా అదొక ఆధ్యాత్మిక ఉద్యమంలా ఏడుకొండలవాణ్ణి కీర్తించే బృందగానలతో వుండుంటే,  భక్తుల్ని ముందుకు నడిపించే కమిట్ మెంట్ తో చూపించి వుంటే, చివర చేసే త్యాగానికి  ఇవి కనెక్ట్ అయి ఇంకా బలన్నిచ్చేవి. అసలు ఫస్టాఫ్ అంతా నాగ్ భక్తిని మాత్రమే గ్లామరైజ్ చేసి (‘కాబిల్’ లో అంధులైన హీరో హీరోయిన్ల పాత్రల్ని గ్లామరైజ్ చేసినట్టు), సెకండాఫ్ లో పాచికలాట తో కథలోకి వెళ్లి వుంటే (‘కాబిల్’ లో రేప్ తో కథ ప్రారంభమైనట్టు) ఇదొక విలక్షణ స్క్రీన్ ప్లేతో  కూడిన ఆథ్యాత్మిక చలనచిత్రంగా భాసించేది. 

          దర్శకేంద్రుడికి  చెప్పేంత స్థాయి లేదు గానీ, జస్ట్  ఒక పరిశీలన అంతే. 

-సికిందర్

         
         
         





8, ఫిబ్రవరి 2017, బుధవారం

పాత సంగతి...






     ఇప్పడు తెలుగు సినిమా అంటే యాక్షన్ సినిమాగానే అర్ధం చెప్పుకోవాల్సి వస్తోంది గనుక, ఓ యాక్షన్ సినిమాలో   హీరో పాత్ర చిత్రణని సమగ్రంగా చూసి ఎంత కాలమైంది? హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా ఆడిన కాలంలో ఆయా స్టార్ హీరోయిన్ల పాత్రలు (శారద ‘ప్రతిధ్వని’, విజయశాంతి ‘కర్తవ్యం’) పూర్తిగా యాక్టివ్ నడకలతో అర్ధవంతంగానే వుండేవి. ఇప్పుడు స్టార్ హీరోల యాక్షన్ సినిమాల ట్రెండ్ మొదలయ్యాక, దాదాపు ప్రతీ యాక్షన్ సినిమాలోనూ అయితే అనావృష్టి (ఎన్టీఆర్ ‘అశోక్’),  కాకపోతే అతివృష్టి (జగపతి బాబు ‘బ్రహ్మాస్త్రం’) అన్నట్టుగా సాగుతోంది పాత్రచిత్రణల ప్రాసెస్. ఇవి పెద్దగా ఆడకపోవడమో, లేదా అస్సలు ఆడకపోవడమో జరుగుతోంది. పాత్ర చిత్రణల్లో యాక్టివ్- పాసివ్ ల తేడాల గురించి,  వీటిని  గుర్తించకపోతే  జరిగే అనర్ధాల గురించీ సినిమా సమీ క్షల్లో, వ్యాసాల్లో  ఎంతకాలంగా వూదరగొడుతున్నా ఎందుకనో – ‘థ్రోయింగ్ పెరల్సు బిఫోర్ ది స్వైన్’ అని  గురజాడ ‘గిరీశం’  కొటేషించినట్టే  వుంటోంది ఇంకా పరిస్థితి! 

  
        ‘పంచ్ కి పంచ్- మంచికి మంచి’ అంటూ మంచి డైలాగే రాసుకున్నారు ఓ సినిమాలో.  మరి హీరో అలా లాగిపెట్టి  ఓ పంచ్ ఇచ్చుకున్నంత మాత్రాన అతను యాక్టివ్ క్యారక్టర్ అయిపోతాడా?  యాక్షన్ సీన్స్ నటించినంత మాత్రాన యాక్టివ్ అయిపోతాడా? మంచితనం ప్రదర్శిస్తే  యాక్టివ్ అనే అర్ధమా? ఇలాటి అశాస్త్రీయ అర్ధాలతో హీరోయిజాలు పేలవమైన పాసివ్ పాత్రలుగా చతికిలబడిపోవడాకి కారణమౌతున్న రచయితని ఏ మానసిక కోణంలో చూడాలి?

        హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో హీరోయిన్ పాత్ర చిత్రణ అనేసరికి ఆమె మానసికలోకంలోకి చప్పున వెళ్ళిపోతాడు రచయిత. అదే హీరో పాత్రనేసరికి ససేమిరా అతడి మనసులోకి చూడడు. ఆడపాత్ర మనసులోకి జొరబడడం, ఆ పాత్ర ఏమనుకుంటోందో వినడం అదేదో మగాడికుండే వయోరిస్టిక్ దుగ్ధ వల్లనేమో. అదే చాలామంది దర్శకురాళ్ళ సినిమాల్లో చూస్తే, ఆ స్త్రీపాత్ర చిత్రణలు హాస్యాస్పదంగా వుండడాన్ని గమనించ వచ్చు. వాళ్ళు స్త్రీ పాత్ర మనసులోకే చూడనట్టు వుంటారు- ఆడదానికి ఆడదే శత్రువన్నట్టు. హీరో పాత్రని రచయిత కేవలం బయటి నుంచి భౌతికంగా చూడ్డం వల్లేనా  ఇలా ప్రాణంలేని పాసివ్ పాత్రలుగా వరస కడుతున్నాయి హీరోల పాత్రలు? 

          కానీ సైకాలజీ ప్రకారం చూస్తే  మానసిక సంఘర్షణ లేనిది భౌతిక సంఘర్షణ లేదు. అంతా మనస్సులోనే వుంది. మనసు ఎలా వుంటే తీసుకునే చర్యలూ  అలా వుంటాయి. రచయిత పాత్రల మనసునే పట్టించుకోకుంటే పాత్రల చర్యలూ బోలుగా వుంటాయి. ‘ప్రతిధ్వని’, ‘కర్తవ్యం’ లాంటి సినిమాల్లో శారద, విజయశాంతి పాత్రల మానసిక సంఘర్షణని కలుపుకుని పాత్ర చిత్రణలు చేయడం వల్లే వాటి బాహ్య చర్యలు (యాక్షన్) అంత బలంగా కట్టి పడేశాయి. ‘ప్రతిఘటన’ లోనూ విజయశాంతి  మానసిక సంఘర్షణ లోంచే అంత బలమైన, సజీవ ప్రతీకార చర్యా వ్యక్తమయ్యింది. ‘మౌనపోరాటం’, ‘ఎర్రమందారం’ లలో కూడా యమున పోషించిన పాత్రలు మానసిక సంఘర్షణ సహిత సవ్యమైన భౌతిక పోరాటాలే. అందుకని ఇవి యాక్టివ్ పాత్రలయ్యాయి.

          ఇలాకాక, నేటి యాక్షన్ హీరోల పాత్రలు కేవలం కండబల ప్రదర్శనే పెట్టుకుని నిరర్ధక నిర్జీవ వికార చేష్టలు పోతున్నాయి. హీరో విపరీతంగా స్పందించడమో, లేదా అసలే స్పందించక పోవడమో లాంటివి పాసివ్  లక్షణాల కిందే వస్తాయి. పాసివ్ పాత్ర అంటే సమస్యకి పరిష్కారాలు వెతక్క విధికి లేదా కాలానికి తలవంచి కూర్చునేది. ట్రాజడీ పాత్రలు పాసివ్ పాత్రలు. దేవదాసు పాసివ్ పాత్ర. పాత్రని కథ నడిపినా, లేదా రచయిత నడిపినా పుట్టేవి  పాసివ్ పాత్రలు. ఇలా  యాక్షన్ సినిమాల్లో హీరో పాసివ్ గా మారితే చాలా దయనీయంగా కన్పిస్తాడు. విలన్ చేతిలో మరీ బాధితుడైపోయి హాస్యాస్పదంగా వుంటాడు. 

        విలన్ తో పోరాటంలో హీరో పాసివ్ గా వుంటే  విలన్ చేతిలో బాధితుడి కిందే, కట్టు బానిస కిందే  లెక్క. కాకపోతే రియాక్టివ్ గా వుంటాడు. అంటే విలన్ లీడ్ తీసుకుని హీరోకి ఏదో చేస్తేనే హీరో తిరగబడి (రియాక్ట్ అయి) ఎదురు దాడి చేస్తాడు. ఇదే తంతు పదే పదే  రిపీటవుతూ వుంటుంది. ఈ ఎదురు దాడులే హీరో చేస్తున్న గొప్ప యాక్షన్ అనుకుంటాడు రచయిత. అది ఆ హీరో పాత్ర పాల్పడుతున్న తెలివితక్కువ తనమనుకోడు రచయిత. ప్రేక్షకులూ  ఇది చూసే చప్పట్లు కొడతారు. ఫ్యాన్సూ అదిరింది బాసూ  అనేసి ఈలలేస్తారు. హీరో పాత్ర  పాసివ్ గా విలన్ చేతిలో బాధితుడు అవకుండా వుండాలంటే, అసలు విక్టిమ్ (బాధిత వ్యక్తి ) మెంటాలిటీ ఏమిటోతెలియాలి.  దాని  బారిన పడకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలియాలి. దీని మీద డాక్టర్  వేన్ డయర్  రాసిన ప్రసిద్ధ సైకాలజీ పుస్తకం ‘పుల్లింగ్ యువర్ ఓన్ స్ట్రింగ్స్’  (1978) చదివితే  అంతా బోధపడుతుంది. ఈ పుస్తకం పీడీఎఫ్ ని ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 

     ఇక్కడ అసలు జరుగుతోందేమిటంటే, విలన్ పరిస్థితిని తన చేతిలోకి తీసుకుని హీరోని అడిస్తూంటే, హీరో వూరికే నరుకుతా చంపుతా  అంటూ ఎడాపెడా ఎదురు దాడులు చేస్తూ ఆత్మ రక్షణ చేసుకోవడమే. అంటే ఎంత సేపూ విలన్ సాధింపులకి తను రియాక్షనే చూపిస్తున్నాడు తప్పించి, విలన్ చేతిలోంచి ఆ పరిస్థితిని వూడలాక్కుని, వాణ్ణి ఆత్మ రక్షణలో పడేసే ఆలోచనే చేయడం లేదన్న మాట. ఆత్మరక్షణలో పడేసేవాడే హీరో, ఆత్మరక్షణ చేసుకునే వాడుకాదు. అందుకే ఇది తెలివితక్కువ తనం. దాదాపు ప్రతీ సినిమాలో ఇదే తంతు కన్పిస్తోంది. దీంతో హీరో  ఏమాత్రం విషయం లేనివాడిగా తేలిపోతూ తెలివిగల  ప్రేక్షకులకి దొరికిపోతాడు. ఇతరులకి గొప్ప జాలీ కన్నీళ్ళూ తెప్పిస్తూ వుండిపోతాడు. ఆ ప్రేక్షకుల దృష్టిలో ఇది గొప్ప సెంటిమెంటల్ డ్రామా అయిపోతుంది. హాలీవుడ్ కథల్నికాపీ  చేసినా ఇదే  ధోరణి కన్పిస్తోంది. 


      నిజమే, రక్త మాంసాలున్న హీరో పాత్ర ప్రయాణంలో కొంత జాలినీ సానుభూతినీ ప్రేక్షకులనుంచి పొంది తీరాల్సిందే. అదెంతవరకూ? టైం అండ్ టెన్షన్ పరిధుల్ని దాటనంత వరకూ. టైముతో టెన్షన్ అనులోమ సంబంధంలో వుంటుంది. టైము గడిచే కొద్దీ ఈ టెన్షన్ ని  కథ నడిపే ( కథని రచయిత నడిపితే పాసివ్ పాత్రయిపోతుంది- టైం అండ్ టెన్షన్ వుండదు) హీరో పాత్ర పెంచుకుంటూ పోలేదంటే, ఆ పాత్ర విఫలమైనట్టే. యాక్షన్ వల్లే ఈ టెన్షన్ పెరుగుతుంది, రియాక్షన్స్ తో కాదు. 


           నితిన్ నటించిన ‘రామ్’ లో తన మీద విలన్ జరుపుతూ వుండే దాడులకి హీరో నితిన్ ప్రతిసారీ రియాక్ట్ అవుతూ తిప్పి కొట్టడం, జెనీలియాని తీసుకుని పారిపోతూ వుండడమే తప్ప, విలన్ గుట్టు ఎక్కడుందో అది పట్టుకుని, వాణ్ణి తన గుప్పెట్లోకి  తెచ్చుకుని, ఆటాడించే  ప్రసక్తే వుండదు. హీరోని చూసి విలన్ పారిపోతూ వుండడం కమర్షియల్ సినిమా అవుతుంది, విలన్ ని చూసి హీరో పలాయనం చిత్తగించడం కచ్చితంగా ఫ్లాప్ సినిమా అవుతుంది. 

           ‘బ్రహ్మాస్త్రం’లో జగపతిబాబు కళ్ళెర్ర జేస్తూ చంపుతా చంపుతా అని అరవడమే గానీ, ఆ చంపడం ఎప్పుడో, దానికేం సన్నాహాలు చేస్తున్నాడో ఏమీ వుండదు. రచయిత చాలా అజ్ఞానంతో- సినిమా పరిజ్ఞాన రాహిత్యంతో- కథల్లో లక్ష్యాన్ని విలన్ కి ఏర్పాటు చేసేస్తే ఇంతే మరి. లక్ష్యం వుండాల్సిన హీరో కి ఏ లక్ష్యమూ లేకుండా పాసివ్ పాత్రగా మిగిలిపోతాడు.
 
       1930 లలో సముద్రాల రాఘవాచార్య దగ్గర్నుంచీ నేటి పరుచూరి బ్రదర్స్ వరకూ సాహిత్యంలోంచీ, నాటకాల్లోంచీ వచ్చిన రచయితలే సినిమా రచయితలూ కావడంవల్ల పాత్ర చిత్రణలు బలంగా ఉండేవి. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ల కాలం వరకూ పాసివ్ పాత్రల్ని చూడలేదు. 2000 సంవత్సరం నుంచీ కొత్త కొత్త దర్శకులే రచయితలూ అయిపోవడంవల్ల- రచయిత కుండాల్సిన మూలాల్లేకపోవడం వల్ల,  నాల్గు డీవీడీలు చూసి స్క్రిప్టులు రాసెయ్యడంవల్లా  వచ్చింది సమస్యంతా. రచయిత రక్తంలోవుంటాడు, డీవీడీ ల్లోంచి వచ్చిన వైరస్ లో వుండడు. దర్శకులై పోవాలనుకునేవాళ్ళు  ఈజీగా వైరస్ రచయితలై పోతే చాలు యూత్ మెచ్చును, సక్సెస్ వచ్చును అనే పెద్ద స్కామ్ కే  తెరతీశారు.

         వైరస్ రచయితలకేం తెలుసు రక్తమాంసాలున్న పాత్రల స్వభావం. పులి చర్మం తెచ్చి మేకకి కప్పేస్తున్నారు. పులి తోలు మేక ఎంత పొటమరించి ఫైటింగులు చేసినా పులై  పోదుగా? ఈ పరిస్థితుల్లో మానవ స్వభావం గురించి ఇటీవల లండన్ యూనివర్సిటీ కాలేజీ జరిపిన రీసెర్చిని పరిశీలించడం  అవసరం కావొచ్చు. ప్రొఫెసర్ సుఖ్విందర్ షేర్గిల్ బృందం ఏం చేసిందంటే, ఒక వొత్తిడిని కలిగించే పరికరం మీద ఒక వలంటీరు చేతి వేలిని వుంచి, కొంత వొత్తిడిని కల్గించి దాన్ని రికార్డు చేశారు. అప్పుడు తను ఫీలయిన వొత్తిడి తోనే  రెండో వలంటీరు వేలిమీద నొక్కమన్నారు. నొక్కింతర్వాత ఆ రెండో వలంటీరుని తను ఫీలైన బలంతోనే మొదటి వలంటీరు వేలిని నొక్కమన్నారు. ఇలా పరస్పరం ఇద్దరి చేతా కొన్ని సార్లు నొక్కించింతర్వాత, ఆ పరికరం చూపిస్తున్న రీడింగుల్ని చూస్తే ఏముంది, ఆశ్చర్యం! 

      నొక్కులాట  ఇంటరెస్టింగ్ గా తేలింది! వలంటీర్లు  ఇద్దరూ పరస్పరం తాము ఫీలైన వొత్తిడి కంటే 40 శాతం అధిక వొత్తిడితో నొక్కుతున్నారు. మీటర్ రీడింగ్ పెరుగుతూ పెరుగుతూ పోయింది. మమూలు స్పర్శగా మొదలైన  క్రీడ, తీవ్ర ఘర్షణకి దారితీసే స్థాయికి చేరిపోయింది. పైకి మాత్రం వాళ్ళు ఒకే స్థిరమైన వొత్తిడితో  నొక్కుతున్నామనుకుంటున్నారు. 
         ఇదే జరుగుతోంది సినిమాల్లోనూ. ఆ వలంటీర్ల లాగే మనసు లోపల రగిలే ప్రతీకారేచ్ఛని పట్టుకోలేకపోతున్నారు. పాత్రకి ఇది మిస్సవడం వల్ల ప్రేక్షకులు అనుభవించే ‘కచ్చి’ తీరే ప్రసక్తే వుండదు. అప్పుడా చప్పిడి సినిమా చెప్పా పెట్టకుండా ప్రొడ్యూసరింటికి వెళ్ళిపోతోంది. పై రీసెర్చివల్ల తేలిందేమిటంటే, ఏ మనిషీ తనకి కలిగిన నొప్పికి బాధపడుతూ కూర్చోడు. అంతకి ఎక్కువ  నొప్పినే  తిరిగి కల్గిస్తాడు. ఇది ఆ వలంటీర్లకి లాగే పైకి తెలియకపోయినా లోలోపల అసంకల్పితంగా జరిగిపోతుంది. కొన్నిసార్లు ప్రతీకారం తీర్చుకోవడం సాధ్యంకాకపోవచ్చు. తను అశక్తుడే కావొచ్చు. అంతమాత్రాన మనసు లోపలి ‘ఇచ్ఛ’ ఎక్కడికీ  పోదు. ఆ ‘ఇచ్ఛ’ యే ప్రేక్షకుల ‘కచ్చి’ తో కనెక్ట్ అవుతూ వుంటుంది. అప్పుడు సినిమా అన్నాక హీరో లేవాలి, లేచి సాధించాలి. జీవితంలో ఎన్నో సాధించాలనుకుంటూ వుండే ప్రేక్షకులు,  వాటిని హీరో సాధిస్తూంటే చూసి ఆనందించే అవకాశం కల్గించకపోతే  ఎలా? 

          ఇదంతా అనావృస్టి పాత్రల సంగతి. ఇక అతివృష్టి కొస్తే, కంటికి కన్ను లోక సమ్మతమేగానీ, కన్రెప్పకి కన్ను న్యాయసమ్మతమైన ప్రతీకారం కాదంటాడు హార్వర్డ్ యూనివర్సిటీ సైకాలజీ  ప్రొఫెసర్ డానియెల్ గిల్బర్ట్. లెబనాన్ దేశం తమ ఇద్దరు సైనికుల్ని బంధించిందన్న కోపంతో ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరపడాన్ని యూరోపియన్ యూనియన్ తప్పు బట్టలేదనీ, అయితే నిర్విచక్షణగా ఆ యెత్తున దాడులు జరపడాన్ని ప్రపంచమంతా ఖండించిందనీ గుర్తు చేశాడీయన.  తిప్పి కొట్టడం ఓకే, కానీ అంత  తీవ్రత కూడదంటాడు. 

          కానీ మన సినిమాల్లో కన్రెప్పకి కన్నుకాదు, మొత్తం తలకాయలే తెగిపడు తున్నాయి. ఆ తల తెగిన మొండెం అలాగే మోటారు బైకుమీద రివ్వున దూసుకెళ్ళడాన్ని ‘అశోక్’ లోనే  చూశాం. తల్లీ తండ్రీ చెల్లీ చక్కటి కుటుంబమూ వున్న ఇంజనీరింగ్ విద్యార్థి కదేం విపరీతమో, తల్వార్లు పట్టుకుని నగరవీధుల్లో నరమేధం గావిస్తాడు. ఇటీవల హైదరాబాద్ వచ్చిన బిమల్ రాయ్ కుమారుడు జాయ్ రాయ్, మన ప్రేక్షకులు హృదయంతో సినిమాలు చూస్తారన్నాడు. మరి ప్రతీకారమైనా హృదయం ఒప్పేదిగా లేకపోతే ఆ  హీరో గతీ, సినిమా సంగతీ ఇంతే సంగతులు. 


       అనావృష్టి పాత్రల్లాగే అతివృష్టి పాత్రలు కూడా పాసివ్ పాత్రలే. మనోబలం లేనివాడే బలప్రయోగంతో ఒప్పించబోతాడు. ఇలాటి పాత్రలకి పట్టరాని ఆవేశమే తప్ప ఆలోచన వుండదు. మరి ఇంతకీ సమగ్రమైన యాక్షన్ పాత్ర ఎలా పుడుతుంది? ఇందుకు స్వామి సుఖబోధానంద నుంచి తీసుకోవచ్చు. స్వామి సుఖబోధానంద యూత్ కి కనెక్ట్ అయ్యేలా ఆధునిక జీవితంలోంచి ఉదాహరణలు తీసుకుని, చాలా సింపుల్ గా ఆథ్యాత్మిక విషయాలు చెప్తాడు. ఒక సమస్య ఎదురైతే ముందు దాంతో సామరస్యాన్ని ఏర్పరచుకోమంటాడు. మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యర్ధి పట్టులో లాక్ అయిన చేతిని విసురుగా లాగేసుకుంటే చేతి ఎముకలు విరిగి పోతాయనీ, ప్రత్యర్ధి పట్టులోనే కాస్సేపలా వుండిపోయి, అతని పట్టుని అర్ధం చేసుకునే ప్రయత్నం ఇవతలి ఫైటర్ చేస్తాడనీ వివరిస్తాడు. అప్పుడు చెయ్యిని విడిపించుకునే ఒడుపు తెలిసివచ్చి, సునాయాసంగా లాక్ తీసుకుని ఎదురు దెబ్బ తీస్తాడనీ విజువలైజ్  చేస్తాడు సుఖబోధానంద. 

          ఇలా జీవితంలో వుండే డైనమిక్సే  సినిమా పాత్రలకి లేకపోతే ప్రేక్షకులకి అవి దూ రంగా వుండి పోతాయి. స్క్రీన్ ప్లే పండితుడు జేమ్స్ బానెట్ కూడా ఏమంటాడో చూద్దాం : “ఒక పరిస్థితికి దెబ్బ తిన్న హీరో ఆ పరిస్థితిని రూపుమాపాలని కమిటవుతాడు. మన జీవితాల్లోనూ ఈ కమిట్ మెంటే మనల్ని కట్టేస్తుంది. ఒకసారి మనం కమిటయ్యాక, మాటి చ్చాక, సంతకం పెట్టాక, ప్రమాణం చేశాకా, ఇహ  వెనుదిరిగి పోలేం.  కాబట్టి కమిట్ మెంటే కీ లకం. ఇది లేకుండా ఏదీ సాధించలేం. 

       “ అలా హీరో కమిటయ్యాక, కొందరు సాయపడే వాళ్ళు  ప్రత్యక్షమవుతారు. మనకీ జీవితంలో ఇలాగే జరుగుతుంది. ఈ సాయమనేది వ్యక్తులు అందించే సాయం రూపంలోనే గాక, మనకి పుట్టే ఐడియాల ద్వారా కూడా అందవచ్చు. ఏ కమిట్ మెంటూ లేకుండా కూర్చుంటే  మన పరిస్థితులు చక్కబడే ఎలాటి సాయమూ ఎక్కడ్నించీ అందదు.  (‘వసంతం’ లో వెంకటేష్ పాసివ్ పాత్ర ఇంతేగా). కానీ మనం కమిట్ మెంట్ తో వున్నామని తెలిస్తే మనచుట్టూ ఎందరో చేరతారు, మనసులోనూ ఎన్నో ఐడియాలూ ముసురుకుంటాయి. ఎన్నో సలహాలందుతాయి. ఫలానా వ్యక్తుల్ని  కలవాలి, ఫలానా కోర్సుకి అటెండవ్వాలి, ఫలానా పుస్తకం చదవాలి, ఇలా ఎన్నో...  కథలో హీరోకి ఇలాటి ‘హెల్పర్’ తో ఏర్పడే సంబంధం ప్రేక్షకులతో అత్యంత అవసరమైన సైకలాజికల్ కనెక్షన్ ని ఎర్పాటు చేస్తుంది.

          “ వీటన్నిటినీ క్రోడీకరించుకుని హీరో ప్రణాళిక వేసుకుంటాడు. ఇక చర్యకి పూనుకుంటాడు. సమస్య తీవ్రతని, దాని కారకుల్నీ లేదా,  కారణమైన అంశాల్నీ, పరిష్కార మార్గాల్నీ కనిపెట్టి ఉద్యుక్తుడవడంతో సమగ్రమైన యాక్టివ్ పాత్రగా అతను మారిపోతాడు...”


-సికిందర్
(2006, ఆంధ్రభూమి ‘వెన్నెల’)



         
          

4, ఫిబ్రవరి 2017, శనివారం

రివ్యూ...




దర్శకత్వం : ప్రియదర్శన్

తారాగణం : మోహన్ లాల్, సముద్ర కని,  అనుశ్రీ, విమలారామన్, నెడుముడి వేణు, బేబీ మీనాక్షి తదితరులు
కథ : గోవింద్ విజయన్, సంగీతం : రాన్ యోతాన్ యోహాన్, ఛాయాగ్రహణం : ఎన్ కె ఏకాంబరం
బ్యానర్ : ఆశిర్వాద్ సినిమాస్
నిత్మాత : బి. దిలీప్ కుమార్
విడుదల : ఫిబ్రవరి 3, 2017

***
          అంధత్వం వరుసగా ముడి సరుకవుతోంది థ్రిల్లర్స్ కి. ఈ ఆర్నెల్ల కాలంలో హాలీవుడ్ నుంచి  ‘డోంట్ బ్రీత్”, బాలీవుడ్ నుంచీ ‘కాబిల్’, మాలీవుడ్ నుంచి ‘ఒప్పమ్’, టాలీవుడ్ నుంచీ ‘ఒప్పమ్’  డబ్బింగ్ ‘కనుపాప’ అనే ‘బ్లయిండ్ థ్రిల్లర్స్’ నాల్గు వచ్చాయి. ప్రస్తుత టాలీవుడ్ ‘కనుపాప’ జయాపజయాల సంగతెలా వున్నా, మిగతా మూడు భాషల్లో మూడూ హిట్టయ్యాయి. అనేక కామెడీలు తీసి కామెడీ జానర్ కి మలయాళ, హిందీ భాషల్లో కొత్త ఒరవడిని దిద్దిన దర్శకుడు  ప్రియదర్శన్,  చాలాకాలం గ్యాప్ తర్వాత ఈ  క్రైం థ్రిల్లర్ తో వచ్చాడు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన ఈ ‘కనుపాప’  తెలుగు ప్రేక్షకులతో పరిచయం పెంచుకోవాలన్న అతడి ప్లానింగ్ లో భాగంగా  ఈ అయిదు నెలల కాలంలో ఇది నాలుగో సినిమా.  కానీ 1994 లోనే ప్రియదర్శన్ తీసిన ‘గాండీవం’ లో తొలిసారిగా మోహన్ లాల్ తెలుగు ప్రేక్షకులకి పరిచయమయ్యాడు.
          మోహన్ లాల్ అంధుడి పాత్ర నటించిన ప్రస్తుత ‘కనుపాప’  టైటిల్ కీ కథకీ వున్న 
సంబంధమేమిటో ఈ కింద చూద్దాం...

కథ
       కళ్ళులేని  జయరాం (మోహన్ లాల్) ఓ అపార్ట్ మెంట్ లో లిఫ్ట్ ఆపరేటర్ గా  పనిచేస్తూ వూళ్లో వుంటున్న  చెల్లెలి పెళ్ళికి డబ్బు కూడేస్తూవుంటాడు. అపార్ట్ మెంట్ లో అందరూ అతణ్ణి  బాగా చూసుకుంటారు. ఒక రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్జి కృష్ణమూర్తి (నెడుముడి వేణు) అనే అతను  జయరాంతో మరింత సన్నిహితంగా వుంటాడు. ఈ కృష్ణమూర్తికో సమస్య వుంటుంది. ఎప్పుడో ఒక రేప్ అండ్ మర్డర్ కేసులో దోషికి  14 ఏళ్ళు ఖైదు విధించాడు. ఆ వాసుదేవ్ (సముద్రకని) అనే దోషి తానే  నేరం చేయలేదని మొరపెట్టుకున్నాడు. కానీ సాక్ష్యాథారాల్ని బట్టి మూర్తి శిక్ష విధించాడు. వాసుదేవ్ కుటుంబం ఈ అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. దీంతో వాసుదేవ్ సైకోగా మారాడు. జైల్నుంచి  విడుదలై తన జీవితం, తన కుటుంబ సభ్యుల జీవితాలూ అన్యాయమై పోవడానికి కారకులైన వాళ్ళందర్నీ -కేసుతో సంబంధమున్న  పోలీసు అధికార్లూ ప్రాసిక్యూటర్ సహా-  చంపడం మొదలెట్టాడు. ఇప్పుడు  కృష్ణమూర్తి ఒక్కడే  మిగిలాడు. కృష్ణమూర్తి తన కూతురు నందిని (బేబీ మీనాక్షి)ని వేరే చోట కాన్వెంట్ లో చదివిస్తూంటాడు. ఇదంతా జయరాంకి  చెప్పివుంచాడు. 

     ఈ నేపధ్యంలో అపార్ట్ మెంట్ లో ఓ పెళ్ళి జరుగుతూంటే, ఆ అవకాశం తీసుకుని వాసుదేవ్ వచ్చి కృష్ణమూర్తిని చంపేస్తాడు. చంపి పారిపోతూ జయరాంతో కలబడతాడు, తప్పించుకుని పారిపోతాడు. పోలీసులు కేసు టేకప్ చేస్తారు. కృష్ణమూర్తికి చెందిన యాభై లక్షలు కూడా పోవడంతో, అదే సమయంలో జయరాం చెల్లెలి పెళ్ళికి డబ్బు కూడేస్తున్నాడని తెలియడంతో,  అతణ్ణి అనుమానించి వేధించడం మొదలెడతారు. మరోవైపు వాసుదేవ్ సాక్ష్యం లేకుండా చేయడానికి జయరాంని కూడా చంపడానికి ప్రయత్నిస్తూండడంతో,  కళ్ళులేని జయరాం గొప్ప చిక్కుల్లో పడిపోతాడు. అతడి ముందున్న మరో పెద్ద సమస్య- నందినిని కూడా వాసుదేవ్ చంపకుండా కాపాడుకోవడం...అటు పోలీసులనుంచీ, ఇటు హంతకుడి నుంచీ కూడా తనని కాపాడుకుంటూ, జయరాం తన ధ్యేయం కోసం ఎలా పోరాడాడన్నది మిగతా కథ. 

ఎలావుంది కథ 
       అచ్చమైన దేశవాళీ క్రైం థ్రిల్లర్ జానర్ కి చెందిన కథ ఇది. అంటే ఏ విదేశీ సినిమా లోంచీ కాపీ కొట్టలేదు. భౌతికంగా సాక్ష్యాధారాలు సేకరించకుండా, వాటి ఆధారంగా కేసు బిల్డప్ చేయకుండా, ఇంకా సాక్షుల వాంగ్మూలాలతో, వాళ్ళనుంచి వివరాలు రాబట్టే కర్రపెత్తనంతో, బుర్రపెత్తనానికి దూరంగా వుంటున్న అశాస్త్రీయ పోలీసు వ్యవస్థకి తార్కాణంగా వుంటుందీ కథ. ఇలాటి పోలీసుల్ని ఎదుర్కోవాలంటే మామూలు నిర్దోషులకే సాధ్యంకాదు, అలాంటిది కళ్ళులేని వాడి సంగతి చెప్పనవసరంలేదు. ఈ కథలో ఇంకో గొప్ప ఐరనీ ఏమిటంటే, ఏ జడ్జి తనకి అన్యాయంగా శిక్ష విధించాడని ఆ ‘నిర్దోషి’ ఆ జడ్జిని చంపాడో, అదే జడ్జి హత్య కేసులో ఇంకో నిర్దోషినే బోనెక్కించి చేతులు దులుపుకోవాలనుకోవడం! ఆ నిర్దోషీ ఈ నిర్దోషీ ఎప్పుడో స్వర్గంలో ఆ జడ్జిని కలుసుకుంటే అక్కడా కొట్టుకు చావాలనేమో!! 

          కథా ప్రయోజనం విషయానికొస్తే, ఇది ‘కాబిల్’ లో లాగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని విజిలాంటీ గా మారే  అంధుడి వ్యక్తిగత వేదన కాదు, ‘డోంట్ బ్రీత్’ లోలాగా ఆత్మరక్షణ చేసుకునేకంటే, పోలీసులకి పట్టించడంకంటే,  దొరికిన దొంగల్ని చట్టాన్ని  తానే చేతుల్లోకి తీసుకుని,  కిరాతకంగా శిక్షించాలనుకునే అంధుడి శాడిజం కూడా కాదు; ఇరుక్కున్న కేసులోంచి బయటపడాలనుకునే, ప్రమాదంలో వున్న బాలికని కాపాడుకోవాలనుకునే, వ్యవస్థ బాధితుడైన గుడ్డివాడి పోరాటంగా సామాజిక ప్రయోజనమున్న కథ ఇది. కళ్ళున్న వ్యవస్థ బ్లయిండ్ జ్యూరీగా ప్రవర్తించే దురవస్థ ఇది. 

ఎవరెలా చేశారు 
     అంధ పాత్రని మోహన్ లాల్ సగటు మనుషుల సామాన్య ప్రపంచానికి దించాడు. హైఫై హవా లేదు, గ్లామర్ లేదు, అలవిమానిన హీరోయిజం లేదు, స్టార్ పవర్ లేదు. మలయాళ సినిమాలంటేనే వాస్తవికత. పూర్తిగా వాస్తవిక ధోరణికి కట్టుబడి నిజజీవితంలోని సహజమైన గుడ్డిపాత్రని ఒక నిష్ణాతుడిలా ఆవిష్కరించాడు. పోలీసులు తనని కొడుతున్న సన్నివేశంలోనైతే, ఓ రిక్షావాణ్ణి కొడితే ఎలా మొత్తుకుంటూ అటూఇటూ దూకుతాడో అచ్చం అలాగే చేశాడు. తర్వాత తను ఆ పోలీసులందర్నీ కలిపి కొట్టేయాల్సిన అత్యవసర పరిస్థితిలో,  అలవాటులేని ఆ పనికి పిల్లి మొగ్గలేస్తూ అష్టకష్టాలూ పడి మొత్తం మీద విజయం సాధిస్తాడు. కళ్ళులేని తను శారీరకంగా అసమర్ధుడైనా మానసికంగా  శక్తి సంపన్నుడు. తన ఎదురుగా వున్న మనిషి ఎత్తెంతో, బరువెంతో చెప్పేయగలడు.  మనిషి మాటలు ఏ ఎత్తునుంచి విన్పిస్తున్నాయో దాన్నిబట్టి తన ఎత్తుతో బేరీజు వేసుకుని చెప్పేయగలడు. హంతకుడు తనతో చెలగాటమాడే దృశ్యాల్లో చిక్కకుండా వేసే ఎత్తుగడలు అంధులకి స్ఫూర్తినిస్తాయి. కానీ అంధులు సినిమా చూడలేరు. కానీ అంధపాత్రలతో ఏఏ సినిమాలు ఎలా తీయవచ్చో కళ్ళున్న వాళ్ళకి తెలియజెప్తాయి. కళ్ళతో బాటు బుర్ర వున్నవాళ్ళకి ఇంకా బాగా తెలియజెప్తాయి. అంధ పాత్రలకి మోహన్ లాల్ అభినయం ఒక అధ్యయనాంశమే. 



       ఇక నేరస్థుడిగా ముద్ర పడ్డ మోహన్ లాల్ దగ్గరికి చెల్లెలు వచ్చి- నువ్వు నా పెళ్ళికి రావొద్దు, వస్తే నా పెళ్లి జరగదు- అనేసి కర్కశంగా చెప్పేసి వెళ్ళిపోవడంలాటిది సాధారణంగా తెలుగు సినిమాల్లో చూపించడానికి జంకుతారు- ఏదో సెంటి మెంటు దెబ్బతినేసి కొంపలంటుకుంటాయని. కానీ మలయాళ సినిమా జీవితాన్ని కప్పెట్టి మాయ చేయాలనుకోదు.  ఇలాంటివి జరిగే జీవితాలు కూడా వుంటాయి. గుడ్డివాడై వుండికూడా మోహన్ లాల్ తను సమకూర్చిన నీతిమంతమైన డబ్బుతోనే ఆ పెళ్లి జరుగుతున్నా, చెల్లెలిలో ఆ స్వార్ధం- స్వసుఖం అతన్నెలా దెబ్బ తీసి వుంటాయో ఇక్కడ పదాల్లో చెప్పడం కుదరదు. మోహన్ లాల్ ని చూడాల్సిందే. 

       ఇక సీరియల్ కిల్లర్ వాసుదేవ్ గా సముద్రకనిది కూడా డౌన్ ప్లే చేసిన సహజ- ఎక్సెలెంట్ నటన. మోహన్ లాల్ తనని చూడలేడు కాబట్టి, మోహన్ లాల్ ఎక్కడుంటే అక్కడ, పోలీస్ స్టేషన్ లో వుంటే అక్కడా, అన్నీ గమనిస్తూ ఫ్రీగా మసలుకుంటూ వుంటాడు.  బస్టాప్ లో పక్కనే నించుని లారీకింద తోసేసిపోతాడు. అసలు అపార్ట్ మెంట్ లోనే నివాసముంటాడు. క్లయిమాక్స్ పూర్తిగా అతడి ఆధీనంలో కొచ్చి, ఇంకో రెండు మూడు హత్యలు కూడా చేసి,  మోహన్ లాల్ నీ, బాలికనీ చీకట్లో చంపడానికి చేతులదాకా వచ్చినప్పుడు అతడి కళ్ళూ, మొహమూ అత్యంత భయానకంగా రూపుదాలుస్తాయి. సైలెంట్ విలనీని పరాకాష్ఠకి చేర్చిన హైపాయింట్ అది. 
          మోహన్ లాల్ కి సహకరించే యంగ్ ఎసిపి గంగ గా అనుశ్రీది, సరీగ్గా అలాటి ఆఫీసర్ కుండే స్కిల్స్ తో కూడిన ప్రొఫెషనల్ నటన. అయితే క్లయిమాక్స్ లో అర్ధాంతర మరణమే మింగుడుపడనిది. 

            బాలనటి బేబీ మీనాక్షి పాత్ర థర్డ్ యాక్ట్ లో- అంటే  క్లయిమాక్స్ లో అందుకుంటుంది, కిల్లర్ ఆమెకోసం రావడం అప్పుడే జరగడంతో. ఈ క్లయిమాక్స్ లో మోహన్ లాల్ ఆమెని కాపాడుతూ చేసే స్ట్రగుల్ తో పాసివ్ గా వుండిపోదు బేబీ మీనాక్షి. సర్వసాధారణంగా ఇలాంటప్పుడు బాల పాత్రలు భయపడుతూ, ఏడుస్తూ,  పెద్ద పాత్రలకి భారంగా వుంటాయి. కానీ బేబీ మీనాక్షి చాలా యాక్టివ్ గా, ఇంటలిజెంట్ గా వుంటూ, మోహన్ లాల్ కి దారి చూపుతూ, హంతకుడి ఉనికిని తెలుపుతూ, ఆయుధాలు అందిస్తూ, సమాన పాత్ర పోషించడంతో ఈ పాత్రకి వన్నె చేకూరింది.

          ఇక సహాయపాత్రలు కూడా బిజీగా వుంటాయి కథలో. జడ్జిగారి గ్లామరస్ పని మనిషిగా, మోహన్ లాల్ కి లైనేసే ఆడ రోమియోగా  మొన్నటి  మలయాళ- తెలుగు హీరోయిన్ విమలారామన్ కన్పిస్తుంది. అపార్ట్ మెంట్ వాచ్ మన్ గా మముక్కోయా, ఆటో డ్రైవర్ గా అజూ వర్ఘీస్ - వీళ్ళిద్దరూ మాటలతో పోలీసుల్ని ముప్పుతిప్పలు పెడుతూంటారు. కోర్టులో ఒకరోజు నిలబడి వుండే శిక్ష వేయించుకునే దుష్టుడైన సీఐగా వినోద్ జోస్, ఐపీఎస్ అధికారిగా రెంజీ పణిక్కర్, ఇంకో పోలీసు అధికారిగా ప్రదీప్ చంద్రన్, మోహన్ లాల్ చెల్లెలిగా అంజలీ అనీష్ కన్పిస్తారు. 



        సంగీతం చూస్తే సినిమాకి పాటలు బలహీనం, నేపధ్య సంగీతమే బలం. కెమెరా వర్క్ ఫర్వాలేదు. కోచీ నైట్ సీన్లు, ఊటీ పగటి సీన్లూ మాత్రం చిత్రీకరణా పరంగా బావున్నాయి. కోచీ  నైట్ సీన్లు  పాత క్లాసిక్ లుక్ రావడానికి డార్క్ రెడ్ లో డీఐ చేయడం బావుంది. ఇక యాక్షన్ సీన్లు మోహన్ లాల్ పాత్ర పరిమితులకి లోబడి సహజంగా వున్నాయి. 

చివరికేమిటి 
     అరవై ఏళ్ల ప్రియదర్శన్ దర్శకత్వం ఫస్టాఫ్ లో అలసటని తెలియజేస్తుంది. ఈ వయసులో ఇంకో కామెడీ చేసుకోక, ఎందుకురా థ్రిల్లర్ ని నెత్తి నేసుకున్నానూ అన్నట్టు వుంటుంది. మోహన్ లాల్ అంధ పాత్ర అష్టకష్టాలూ పడి ఎలాగో పోలీసుల్ని కొట్టి బయటపడినట్టు, ప్రియదర్శన్ కూడా కనాకష్టంగా  ఫస్టాఫ్ లోంచి బయటపడ్డాక తన పూర్వపు సత్తా ప్రదర్శిస్తాడు సెకండాఫ్ లో. ఫస్టాఫ్ లో కథని ప్రారంభించడానికే ఇంటర్వెల్ వరకూ తీసుకున్నాడు. నిజానికి కథని సెటప్ చేయడానికి అంత సుదీర్ఘమైన విషయం  లేదు- కేవలం జడ్జి గారి ఫ్లాష్ బ్యాక్ చెప్పేసి సీరియల్ కిల్లర్ తో రానున్న ప్రమాదాన్ని వెల్లడిస్తే సరిపోతుంది. కానీ అపార్ట్ మెంట్ లో రకరకాల పాత్రలతో, ప్రేమ వ్యవహారాలతో, కాలక్షేపాలతో, మూడేసి  పాటలతో గంట వరకూ సాగలాగడంతో పలచన బడిపోయింది సగం వరకూ థ్రిల్లర్.

           అన్నేసి పాత్రల పరిచయాలూ కథలూ ఎప్పుడవసరమంటే- ‘బర్నింగ్ ట్రైన్’ లాంటి ఉమ్మడి ప్రమాద పరిస్థితి వున్నప్పుడు. ‘బర్నింగ్ ట్రైన్’ లో గంట వరకూ రకరకాల పాత్రలు ట్రైన్ ఎక్కుతూ వుండడం, వాటి సరదాలూ కబుర్లూ, డ్యూయెట్లూ  ఖవ్వాలీలూ  ప్రేమలూ ఫ్లాష్ బ్యాకులూ వగైరా పూర్తి స్థాయిలో కానిచ్చాకే ప్రమాదంలో పడుతుంది ట్రైన్. ట్రైన్ సహా ఈ పాత్రలన్నీ అప్పుడు ప్రమాదంలో పడతాయి. ఇలా అన్ని పాత్రలూ ప్రమాదంలో  పడుతున్నప్పుడు వాటన్నిటి కథలూ  అవసరమే. 

          కానీ ప్రియదర్శన్ కథలో ఆ అపార్ట్ మెంట్ లో ప్రమాదం వాటిల్లబోయేది ఒక్క రిటైర్డ్ జడ్జికే. కనుక అతనొక్కడి కథమీద దృష్టి పెడితే సరిపోతుంది. అపార్ట్ మెంట్ లో మరెన్నో పాత్రల వ్యవహారాలన్నీ చూపిస్తూ కూర్చుంటే జడ్జి పాత్ర ఆనదు. పైగా అన్నేసి పాత్రలతో కథేమిటో అర్ధంగాదు. అపార్ట్ మెంట్ లో సర్దార్జీల పెళ్లి వేడుకల నేపధ్యంలో జడ్జి హత్య చూపించారు కాబట్టి- అంతమాత్రం చేత ఆ కాబోయే పెళ్లి కొడుకూ పెళ్లి కూతుర్ల ఎఫైర్లకి సీన్లు, వాళ్ళు పట్టు బడితే అపార్ట్ మెంట్ లో పెద్ద పంచాయితీ, పెళ్లి చేయాలనీ తీర్పూ వంటి తతంగాలతో కూడిన ఎపిసోడ్స్ తో కథకేం సంబంధం లేదు. అలాగే పెళ్లి సందడి చూసుకుని హంతకుడు వచ్చి హత్య చేసి పోయాడని కథలో చెప్పించారు. హంతకుడు వచ్చి వొంటరిగా వుండే జడ్జిని చంపిపోవడానికి ఈ పెళ్లి తతంగమే అవసరం లేదు. 

          బహుశా, జడ్జి పాత్ర మీంచి  ప్రేక్షకుల దృష్టి మళ్లించడానికే అన్నేసి పాత్రలూ, పెళ్లి సందడీ సృష్టించి వుంటారు. ఇవన్నీ లేకుండా కేవలం జడ్జి పాత్రే కన్పిస్తూంటే ప్రేక్షకులకి అనేక సందేహాలు వస్తాయి : సీరియల్ కిల్లర్ గురించి అంత ఫ్లాష్ బ్యాక్ చెప్పిన జడ్జి తన రక్షణ గురించి ఎందుకు ఏర్పాట్లు చేసుకోవడం లేదు? ఊటీలో చదువుకుంటున్న కూతురికీ ప్రమాదముందని పోలీస్ కంప్లెయింట్ ఎందుకివ్వడం లేదు?  హంతకుడు ఒక్కొకర్నీ చంపుతున్నాడని తెలిసీ, ఎందుకు చంపుతున్నాడో వాడి గురించి పేరుతో  సహా పోలీసులకి చెప్పేసి ఎందుకు పట్టుకునే ఆలోచన చేయడం లేదు? మోహన్ లాల్ కూడా ఇవన్నీ తెలిసీ ఎందుకు మిన్నకుండిపోయాడు? – ఈ సందేహాలన్నీ వస్తాయి కనుకనే, వస్తే కథే వుండదు కాబట్టీ,  అపార్ట్ మెంట్ లో అన్నేసి పాత్రలతో దృష్టిని మళ్ళించే ప్రయత్నం చేశారనుకోవాలి.

          ఇలా దాటవేతలతో ఫస్టాఫ్ అనే భవసాగరాన్ని ఎలాగో ఈది జడ్జిని చంపాక, ఇక సెకండాఫ్ లో పోలీసుల సంగతి. వాళ్ళు పాత  కేసులు  తిరగేస్తూ ఈ హత్యలన్నీ ఒకడే చేస్తున్నాడనీ, వాడు చంపి  చిటికెన వేళ్ళు కత్తిరించుకు పోతున్నాడనీ అనుకుంటారు. అయినా  ఇంతకాలం ఈ కేసుల మీద దృష్టి పెట్టలేదంటే ఈ  పోలీసు పాత్రల పోకడని బట్టి వీళ్ళింతేలే  అనుకోవచ్చు. మరి ఆ హంతకుడు జడ్జి చిటికెన వేలిని కూడా కత్తిరించినట్టా లేదా? ఈ విషయం గురించి పోలీసులు మాట్లాడుకోలేదంటే ఇది దర్శకుడి లోపమే. మరణించిన జడ్జి చేతుల అనాటమీ ఎలా వుందో మనకి  కూడా చూపించలేదు. అంటే చిటికెన వేలు కత్తిరించనట్టే. ఎందుకు ఈసారి కత్తిరించలేదు సీరియల్ కిల్లర్? అసలంతకి ముందు ఎందుకు కత్తిరిస్తున్నట్టు? అమెరికన్ పోలీసులు  నేరస్థుల ఇలాటి ప్రవర్తనని ‘ట్రోఫీ’ దాచుకునే యత్నంగా చెప్తారు. అంటే బాధితుల తాలూకు ఏదో వస్తువునో, అంగమో సేకరించి తమ విజయ చిహ్నంగా భద్రపర్చుకోవడ మన్నమాట. చిటికెన వేళ్ళు కత్తిరించడం ఇందుకేనా? ఏ సంగతీ చెప్పనప్పుడు ఇలాటి క్లూలు వూరికే ప్రస్తావిస్తే అది ఉత్త బిల్డప్  కోసమే అన్నట్టుగా వుంటుంది.

          సీరియల్ కిల్లర్ ప్రణాళికలో కూడా లోపం వుంది. అతడికి జడ్జికో కూతురుందని తెలుసు. అలాంటప్పుడు  కూతుర్ని ముందు చంపి, జడ్జి కుళ్ళి కుళ్ళి ఏడుస్తూంటే చూడాలనుకుంటాడు పగబట్టిన ఏ కిల్లరైనా. అప్పుడే  జడ్జిని కసిదీరా చంపుతాడు. ఈ మానసిక ధోరణి కూడా చూపిస్తే కూతురే ముందు చచ్చిపోయి కథే వుండదు. కాబట్టి కిల్లర్ పాత్రని ఇలా ఎక్కడబడితే అక్కడ కిల్  చేస్తూపోయారు.

          కథని పాత్రల్ని స్థాపించే ప్రయత్నం ఇలావున్నాక- ఇక హీరో/పోలీస్/కిల్లర్ అనే త్రిముఖ అట మొదలయ్యాక  సాఫీగా నడిచిపోతుంది. ఈ ఆటకి రాత్రిపూట ఊటీలో క్లయిమాక్స్ బలంగా వచ్చింది. అయితే ఇది కూడా ఎసిపి గంగ పాత్రలాగే సడెన్ గా ముగిసి పోవడమెందుకో అర్ధంగాదు. ఆ చిట్టచివరి చర్యని ఇంకో పావు నిమిషం పొడిగించి వుంటే అసలేం జరిగిందో ప్రేక్షకులకి అర్ధమయ్యే వీలుంటుంది. ఇలా ఈ కథ క్లయిమాక్స్ లోనే పాపని కాపాడే కథే తప్ప, మొత్తం అదే కథ కాదు. 

          వెరైటీగా అంధుడి పాత్ర వుండి, ఆ పాత్రలో సూపర్ స్టార్ మోహన్ లాల్ వున్నప్పుడు, దేశవాళీ కథని వరల్డ్ క్లాస్ స్టోరీగా అందించాల్సిన అవసరం కూడా వుంటుంది. ప్రియదర్శన్ కథని కూడా కనుపాపలా కాపాడుకుని వుండుంటే ఇది సాధ్యమయ్యేదేమో!  

-సికిందర్










 


 

3, ఫిబ్రవరి 2017, శుక్రవారం

రివ్యూ...



దర్శకత్వం : త్రినాధరావు నక్కిన

తారాగణం : నాని, కీర్తీ సురేష్, నవీన్ చంద్ర, సచిన్ ఖడేకర్, ఈశ్వరీరావ్, పోసాని, రావు రమేష్ తదితరులు.
రచన: ప్రసన్న కుమార్ బెజవాడ, సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్, ఛాయాగ్రహణం: నిజార్ షఫీ
బ్యానర్ : శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్
నిర్మాత : దిల్ రాజు
విడుదల  : ఫిబ్రవరి 3 2017
***
      ‘నేచురల్ స్టార్’ నాని ఓసారి మాస్ క్యారక్టర్ గా మెరిపించాలని ‘నేను లోకల్’  గా విన్యాసాలు చేస్తూ విచ్చేశాడు. నిర్మాత దిల్ రాజు, దర్శకుడు త్రినాధరావు నక్కిన, సంగీత దర్శకుడు దేవీ శ్రీప్రసాద్ ల టీంతో మొదటిసారి పనిచేస్తూ అభిమానుల్ని మురిపించేందుకు ముందడుగేశాడు. మరి గత వైఫల్యం  ‘మజ్నూ’ ని మరిపించే లోకల్ సంగుతులు ఇందులో ఏమున్నాయో ఒకసారి చూద్దాం...

కథ 
       బాబు (నాని) అనేకసార్లు బీటెక్ తప్పి, లెక్చరర్ ని అల్లరిపెట్టి, కాపీకొట్టి ఎలాగో పాసయి ఖాళీగా తిరుగుతూంటాడు. సంపాదించే తల్లి (ఈశ్వరీ రావ్) ) ఉద్యోగం పోగొట్టుకున్న తండ్రీ (పోసాని) వుంటారు. ఒక సంఘటనలో కీర్తి (కీర్తీ సురేష్) అనే అమ్మాయి ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమని పొందేందుకు ఆమె చదువుతున్న ఎంబీఏ కాలేజీలో చేరి  వేధించడం, అల్లరి చేయడం మొదలెడతాడు. ఆమెకి మాత్రం తండ్రి (సచిన్ ఖెడేకర్) చూసే సంబంధమే చేసుకోవాలని వుంటుంది. ఈ  పట్టుదలని వదిలించి ప్రేమలో పడేసుకుంటాడు. ఇంతలో వర్మ (నవీన్ చంద్ర)  అనే ఒక పోలీస్ ఎస్సై వచ్చి, ఆమెని తను ప్రేమించానని, తనే పెళ్లి చేసుకోవాలనీ అడ్డు పడతాడు. ఆమె తండ్రి కూడా అతన్నే సమర్ధించి బాబుకి ఓ సవాలు విసురుతాడు : పాతిక రోజుల్లో నువ్వు నా చేత అవునన్పించుకుంటే కూతుర్నిచ్చి  పెళ్లి చేస్తానని. ఈ సవాలుని  బాబు స్వీకరిస్తాడు...

          ఇప్పుడు బాబు ఎలా యోగ్యుడనిపించుకున్నాడు, ఇందుకోసం ఏమేం చేశాడు, ఎస్సై తో ఎలా పోటీ పడ్డాడు, ఏమేం డ్రామా లాడేడూ  అన్నది మిగతా కథ. 

 ఎలావుంది కథ 
      ఇది మార్కెట్ లో వుండాల్సిన రోమాంటిక్ కామెడీ జానర్ కాకుండా, ఒక  పూర్తి స్థాయి వూర రోమాంటిక్ డ్రామా జానర్ కథ. చివర్లో  డబ్బు- వర్సెస్- ప్రేమ గురించి భారీగా క్లాసు పీకే మెలోడ్రామా దీనికి కొసమెరుపు. ఈ మూస ఫార్ములా డ్రామా పొల్లుపోకుండా ఈ కథంతా నడుస్తుంది. పూర్వం చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జునలు అత్తారింట్లో మాస్ అల్లుళ్ళుగా వచ్చేసిన కథ కాదా అంటే, కావొచ్చు. వచ్చేసిన కథలే తెలుగుసినిమాలకి  అచ్చోసిన కొత్తగా అన్పించే  కథలని అర్ధంజేసుకోవాలి.  ముందే చెప్పుకున్నట్టు, ఇది నేచురల్ స్టార్ నాని తన నేచురాలిటీ చూసుకోకుండా కమిటై నటించిన, రోజూ తినే ఇడ్లీ లాంటి రొటీన్ మాస్ కథ. 

ఎవరెలా చేశారు 
     ఈ మాస్ క్యారక్టర్ లో నాని చేయాల్సిన వన్నీ చేశాడు. బీటెక్ స్టూడెంట్ గా ఎంత ఆకతాయిగా అలరిస్తాడో, ఆ తర్వాత ఎంబీఏ స్టూడెంట్ గా అంత చిల్లరగా నవ్విస్తాడు. అయితే  ఇక్కడ తను చూపెట్టిన స్పెషాలిటీ ఏమిటంటే, ఇలాటి క్యారక్టర్లు సాధారణంగా తండ్రి సంపాదిస్తూంటే తిని హీరోయిన్ వెంట పడుతూంటాయి. ఈ మూసని తనదైన  క్యారక్టరైజేషన్ తో నాని బ్రేక్ చేసి నెక్స్ట్ లెవెల్ కి తీసికెళ్ళాడు : తల్లి ఉద్యోగం చేసి సంపాదిస్తూంటే తను తిని హీరోయిన్ వెంటపడే కొడుకుగా ప్రేక్షకుల్ని అలరిస్తాడు, నవ్విస్తాడు, ఏడ్పిస్తాడు, ఎంతో ఎంటర్ టైన్ చేస్తాడు!  అరిగిపోయిన రొటీన్ ఆవారా మాస్ పాత్రకి ఇదే ప్రత్యేకాకర్షణ! ఈ క్యారక్టర్ లో బీటెక్ ఇంజనీర్ గా నాని మెరిసిపోయాడు. ‘పనీ పాటా లేకుండా, బాధ్యతా లేకుండా తిరిగే నువ్వూ...’  అని హీరోయిన్ తండ్రి తిట్టినా, సవాలు విసిరినా- నేను మారను, నేనిలాగే వుంటాను, ఏ పనీ చెయ్యను, హీరోయిన్ నాలోని ప్రేమని చూసే ప్రేమించాలి, నాలోని ప్రేమని చూసే పెళ్లి చేయాలి- అని చివరివరకూ అదే దృఢసంకల్పంతో, మాస్ కమిట్ మెంట్ తో వుండి,  పెద్దవాళ్ళందరి మీదా  పైచేయి  సాధించడం నాని హీరోయిజాన్ని మాసాత్మకంగా మరో  మెట్టు పైకి తీసికెళ్ళి అనితరసాధ్యంగా ఎస్టాబ్లిష్ చేసింది. ముగింపులో ప్రేమకోసం చేయబోయిన ప్రాణ త్యాగం, చెప్పిన మాటలు అద్భుతం. ఇలాటి నేచురల్ మాస్ పాత్రలు కమర్షియల్ సినిమాలకి చాలా అవసరం. ఈ వొరవడికి శ్రీకారం చుట్టిన,  తనకిచ్చిన పాత్రని అర్ధం జేసుకుని అంత  కష్టపడి నటించిన  ‘నేచురల్ స్టార్’ నానిని  ఎంతయినా అభినందించాల్సిందే! 

          నాని పాత్ర ఇంత ఎలివేట్ అయ్యేందుకు  కీర్తీ సురేష్, నవీన్  చంద్ర, ఈశ్వరీరావ్, తులసి, పోసాని, సచిన్ ఖెడేకర్, రావురమేష్ మొదలైన వాళ్ళందరూ పోటీపడి నటించారు. సంగీత సాహిత్యాలు, ఛాయాగ్రహణం అన్నీ వండర్ఫుల్ గా తోడ్పడ్డాయి. దర్శకుడు నక్కిన త్రినాధరావు ఇంతమంచి ప్రయత్నం చేసినందుకు నిజంగా అభినందనీయుడు!

చివరికేమిటి 
      ఎంటర్ టైనర్ గా తీసుకుని టైం పాస్ చేయడానికి ఎలాటి ధ్యాసకూడా  పెట్టి చూడనవసరంలేని,  ఈజీ గోయింగ్ మాస్ కమర్షియల్ మూవీగా ఇది ప్రేక్షకుల్ని అలరిస్తుంది. నాని హిట్ ‘భలే భలే మగాడివోయ్’ లాంటి పూర్తి స్థాయి ఆరోగ్యకర రోమాంటిక్ కామెడీ ని దృష్టిలో పెట్టుకుని దీన్ని చూడకూడదు. ఆ తర్వాత వచ్చిన హిట్ కాని రోమాంటిక్ డ్రామా  ‘మజ్నూ’  ని చూసిన కళ్లతోనూ దీన్ని చూడకూడదు. జస్ట్ నేచురల్ నాని, మాసాత్మకంగా ఎలా నేల విడిచి సాము చేశాడో చూడాలనుకుంటే మాత్రం దీన్ని తప్పకుండా చూడాలి!  దీనికి ‘మాసాత్మక నేచురల్’ అని  పైన అవకతవక హెడ్డింగ్ పెట్టడాన్ని కూడా వ్యాకరణాత్మకంగా  చూడరాదు.

-సికిందర్ 
http://www.cinemabazaar.in