రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

13, ఆగస్టు 2017, ఆదివారం

496 : రివ్యూ!

రచన – దర్శకత్వం : బోయపాటి శ్రీను
తారాగణం : బెల్లంకొండ శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్, జగపతి బాబు, శరత్ కుమార్, సుమన్, జయప్రకాశ్, ఆకాష్ ఖురానా, తదితరులు
మాటలు : రత్నం, సంగీతం : దేవీశ్రీ ప్రసాద్, ఛాయాగ్రహణం : రుషి పంజాబీ
బ్యానర్ :  ద్వారకా క్రియేషన్స్
నిర్మాత :  మిర్యాల రవీందర్ రెడ్డి
విడుదల : ఆగస్టు 11, 2017

***
          మొదటి సినిమా ‘అల్లుడు శీను’ కి ఫిలిం ఫేర్ ఉత్తమ నూతన నటుడి అవార్డు తీసుకున్న బెల్లంకొండ శ్రీనివాస్, తర్వాత ‘స్పీడున్నోడు’ నటించి దూసుకెళ్ళ లేకపోయాడు. ఇప్పుడు ఎలాగైనా దూసుకెళ్ళడానికి  యాక్షన్ స్పెషలిస్టు బోయపాటి శ్రీనుతో ‘ఆపరేషన్ దూసుకెళ్ళుడు’ కి సమకట్టాడు. తన యాక్షన్  ఫిరంగిలో బెల్లంకొండని మందు గుండులా దట్టించి బోయపాటి ఫైర్ చేస్తే, ఏ రేంజిలో దూసుకెళ్ళి బెల్లంకొండ టార్గెట్ ని ఢీకొట్టాడో ఓసారి పరిశీలిద్దాం...

కథ 
       చక్రవర్తి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ ( శరత్ కుమార్ ) పుత్రరత్నం గగన్ ( బెల్లంకొండ). ఇతనూ తండ్రీ అన్నా కలిసి ఒక జట్టు. ఫ్రెండ్స్ లా వుంటారు. కలిసి మందు కొడతారు. కలిసి బయట  బజ్జీలు తింటారు. గగన్ కాలేజీ స్టూడెంట్ కూడా. కాలేజీలో ఓ మినిస్టర్ (సుమన్)  కొడుకు వల్ల ఇబ్బంది పడ్డ అమ్మాయికి మద్దతుగా గగన్ ఆ కొడుకు కీళ్ళు విరిచేస్తాడు. ఇది చూసిన స్వీటీ అలియాస్ జానకి ( రాకుల్) అనే మరో స్టూడెంట్ గగన్ ని ప్రేమించేస్తుంది. చొరవ తీసుకుని గగన్ ఇంట్లో వాళ్లకి మంచి అలవాట్లు నేర్పి దగ్గరవుతుంది. గగన్ అన్న ప్రేమించినమ్మాయితో పెళ్లి కూడా జరిగేలా  చూస్తుంది. దీంతో గగన్ కూడా ఆమెని ప్రేమించడం మొదలెడతాడు.

          స్వీటీ హైవేస్ అధారిటీ చైర్మన్ ( జయప్రకాష్ ) కూతురు కూడా. ఈ హైవే కాంట్రాక్టు పొందడానికి అశ్వత్ వర్మ ( జగపతిబాబు) ప్రయత్నిస్తే, లిక్కర్ కింగ్ ఆ కాంట్రాక్టు తను కొట్టేయడానికి ప్రయత్నిస్తాడు. ఈ కుమ్ములాటల పర్యవసానంగా స్వీటీ తండ్రి ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ఆమెకి వర్మ కొడుకుతో పెళ్లి జరిపించేస్తాడు. ఈ పెళ్లి మండపంలో లిక్కర్ కింగ్ పెళ్లి కొడుకుని చంపేస్తాడు. ఇలా అన్యాయమైపోయిన స్వీటీని గగన్ ఆదుకోవాల్సి వస్తుంది...ఇదీ కథ!

ఎలావుంది కథ 
      ఫ్యామిలీ డ్రామాలు సృష్టించి అందులోంచి భావోద్వేగాలతో కూడిన యాక్షన్ ని రగిలించడం మార్కు బోయపాటి కథలాగే వుంది. అయితే ఈ తరహా కథల్ని బాలకృష్ణతో  ‘సింహా’,  ‘లెజెండ్’ లుగా తీసినప్పుడు, బాలయ్య గ్లామర్ తో కుటుంబాలు కూడా కదిలివచ్చి పెద్ద హిట్స్  చేశారు. బెల్లంకొండకి కుటుంబ ప్రేక్షకుల్లో గ్లామర్ లేకపోవడంతో కేవలం బి, సి సెంటర్ల మాస్ కథ స్థాయికి చేరింది.  శంఖంలో పోస్తే గానీ తీర్ధం కాదన్నట్టు ఈ కథకి బోయపాటి రేంజి స్టార్ తోనే కళ వస్తుంది  తప్ప-  జ్యూనియర్ హీరోలతో కాదు. వైధవ్యం పొందిన హీరోయిన్ని హీరో చేపట్టడమనే పాయింటు బోయపాటి  ఫ్యామిలీ డ్రామాకి కొత్తదే అయినా, ఇది కూడా కుటుంబ ప్రేక్షకుల్ని నోచుకునే అవకాశం లేకుండా  పోయింది హీరో రేంజి వల్ల.

ఎవరెలా చేశారు 
      ‘ఇది తప్ప ఏదీ రాదా?’ అని బెల్లంకొండ ఎక్స్ ప్రెష న్స్ నుద్దేశించి రకుల్ డైలాగు. బోయపాటి కావాలనే ఈ డైలాగు పెట్టినట్టుంది. బెల్లంకొండ ఫిలిం ఫేర్ నిర్ణయించిన ఉత్తమ నూతన నటుడు. కానీ ఆ అవార్డుకి న్యాయం చేసే విషయం పక్కన పెట్టాడు. దేనికైనా బ్లాంక్ ఫేసే పెట్టడంతో ఇది కూడా కొంపదీసి భావప్రకటనేమో,  దీనిద్వారా ఏం  చెపుతున్నాడో నని మనం బుర్ర బద్దలు కొట్టుకోవాల్సిన పరిస్థితి. కాలేజీలో అమ్మాయిలు సరదాగా తనతో మాట్లాడుతూంటే కూడా మాటలు కలపకుండా, చంద్రబాబు నాయుడు జగన్ ని చూసినట్టు చూపులు. ఒక చోట ఏకాంతంలో  రకుల్ ప్రీత్ సింగ్ ప్రేమ సంభాషణ చేస్తూంటే, పక్కనే కూర్చుని కేసీఆర్ రేవంత్ ని చూసినట్టు చూపులు. డైలాగు పలికినా కూడా కష్టమే. అందుకే డైలాగులు తగ్గించి ‘చూపులు’ వరకే పరిమితం చేశారు నటనని. బెల్లంకొండ భారీ ఫైట్లు చేసుకుపోవడం, పాటల్లో స్పీడుగా డాన్సులు చేసుకుపోవడం  తప్ప పాత్రని నటించగల నటుడిగా నిరూపించుకోలేదు. ఎక్కడా నవ్వడు, కామెడీ చెయ్యడు . ఇలా బోయపాటితో బెల్లం కొండ రేంజి పెరగలేదు సరికదా, బోయపాటి వన్నె తగ్గిపోయింది. 

          హీరో సమవుజ్జీ కాలేక రకుల్ ప్రీత్ సింగ్ నటన కూడా అడవి కాచిన వెన్నెలయింది. ద్వితీయార్ధంలో పాత్ర పెరిగి ఆమె ఎంత నటించుకుంటే ఏం లాభం నటుడి నుంచి దీటుగా స్పందన లేకపోతే. కిక్ - 2 లో బీహార్ ఎపిసోడ్ లో ఇలాటిదే అన్యాయం జరిగిన అమ్మాయిగా రవితేజ ఆలంబనగా నటనని పండించుకుంది. 

          సెకండ్ హీరోయిన్ గా రఫ్ పాత్రలో ప్రగ్యా జైస్వాల్ ఓవర్ యాక్షన్ చేస్తుంది. కమెడియన్లు లేరు. విలన్లే వున్నారు. అయితే జగపతిబాబుతో బాటు, తరుణ్ అరోరా రొటీన్ గానే కనిపిస్తారు. ‘లెజెండ్’  తో బోయపాటి చేతిలో ఇటాలియన్ మాఫియాసో రూపురేఖల్లో విలన్ గా కొత్త అధ్యాయం తెరచిన జగపతిబాబు కీసారి అలాటి ప్రత్యేకతలేం లేవు.

          బోయపాటిలాగే దేవిశ్రీ కూడా బెల్లంకొండ కోసం కష్టపడ్డారు. కానీ పాటలతో కూడా ఉన్నత తరగతి ప్రేక్షకులకి సినిమా రీచ్ అయ్యే అవకాశంలేదు కన్పించడం లేదు. కెమెరా వర్క్ బోయపాటి స్థాయికి తగ్గట్టే వుంది. బోయపాటి సినిమాల్లో యాక్షన్ సీన్స్ ఒక అన్యాయం లోంచి పుట్టుకొస్తూ భావోద్వేగాల్ని రగిలిస్తాయి. ప్రస్తుతం ఇదే జరిగినా, చివర హంసల దీవి యాక్షన్ ఎపిసోడ్ టాప్ గా నిలుస్తుంది. రత్నం రాసిన డైలాగుల్లో ‘రిచ్ నెస్ అంటే డబ్బుండడం కాదు, బుద్ధుండడం’ బాగా పేలింది. 

చివరికేమిటి 
       ఫ్యామిలీ యాక్షన్ డ్రామాలు తీసే బోయపాటి వాటి స్క్రీన్ ప్లేల్లో ఎప్పటికప్పుడు తాజాదనం కోసం కృషి చేస్తే బావుంటుంది. ఇంకా పాత  సినిమాల ఫీల్ తో  ఓపెనింగ్ సీన్లు పెట్టాల్సిన అవసరం లేదు. మాస్ కూడా పాత కథలకి  కొత్త కథనాల్నే  కోరుకుంటారు. హీరో గురించి చెప్పడానికి కాలేజీ ప్రిసిపాల్ తో వేసిన ఇంటర్ కట్ సీన్స్ చాలా పూర్ గా గావున్నాయి. బోయపాటి తన సృజనాత్మకతని సానబట్టుకోవాల్సి వుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ ఎప్పుడేది వేసి ప్రేక్షకుల్ని రెచ్చగొట్ట వచ్చో బాగా తెలిసిన తనకి వాటికి  తగ్గ కథానాయకుణ్ణి ఎంపిక చేసుకుంటేనే సార్ధకమవుతుంది. ‘సరైనోడు’ లాంటి యాక్షన్ మూవీ ఎవరితో తీసినా చెల్లిపోతుంది, కానీ భారీ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాల్ని కాదు. ఇలాటివి తీయాలంటే  ముందా హీరోకి అన్ని వర్గాల ప్రేక్షకుల మన్నన వుండాలి.

          బెల్లంకొండ శ్రీనివాస్ నటనలో ఇలాగే కొనసాగితే కింది స్థాయిలోనే  వుండిపోతాడు. ఇంతింత భారీ బడ్జెట్స్ తో తీసి,  కేవలం డాన్సులు ఫైట్లు మాత్రమే ప్రదర్శించినంత మాత్రాన వొరిగేదేమీ లేదు. బడ్జెట్స్ తో ఇగోకి పోకుండా, ముందు నటన నేర్చుని  సాధారణ బడ్జెట్స్ కి ఒప్పుకుంటే అన్నీ చక్కబడతాయి. లేని నటుణ్ణి భారీ హంగులు  కవర్ చేయలేవు. 

           మొత్తానికి ఫిరంగిలో బోయపాటి పేల్చిన మందుగుండు మాస్ వరకే వెళ్లగలిగి అక్కడే సెటిలయింది.

-సికిందర్
http://www.cinemabazaar.in
         
         
           
 




          

12, ఆగస్టు 2017, శనివారం

495 : రివ్యూ!

రచన-  ర్శత్వం : హను రాఘపూడి
తారాగణం :  నితిన్, మేఘా ఆకాష్, అర్జున్, వికిషన్, నాజర్, శ్రీరామ్, సురేష్, అజయ్, పృథ్వీ, బ్రహ్మాజీ, ధుసూధన్, రాజీవ్కాల, పూర్ణిమ దితరులు
సంగీతం :  ణిశర్మ, ఛాయాగ్రణం : యువరాజ్
నిర్మాతలుః రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంక
విడుదల : ఆగస్టు 11, 2017

***
          1970 లలో జేమ్స్ బాండ్ స్ఫూర్తితో తెలుగులో ఒక ఊపు వూపిన స్పై  సినిమాలు ఆ తర్వాత ఐపు లేకుండా  పోయాయి. ఆ ట్రెండ్ లో ఆంధ్రా జేమ్స్ బాండ్ గా హీరో కృష్ణ పాపులారిటీ సాధించారు. తెలుగు సినిమా చరిత్రలో అప్పుడప్పుడే ప్రారంభమైన వ్యాపార యుగంలో జేమ్స్ బాండ్, కౌబాయ్ సహా వీలైనన్ని జానర్స్ లో  వెరైటీగా సినిమాలు తీస్తూపోయి వ్యాపార యుగాన్ని హిట్ చేశారు. శతాబ్దం మారేసరికల్లా  వ్యాపార యుగం కాస్తా ఫ్యాక్షన్ యాక్షన్లూ,   ప్రేమలూ దెయ్యాలూ అనే రెండో  మూడో  జానర్లకే కుదించుకు పోయింది. వీటితోనే అదే పనిగా ప్రేక్షకుల్ని బాదుతూ వ్యాపార యుగాన్ని ఫ్లాప్ చేశారు. ఇది సృజనాత్మక నియంతృత్వమని కాక  సృజనాత్మక అలసత్వం. దీనికి పరాకాష్ట  గత శుక్రవారం ‘నక్షత్రం’. వా రం తిరిగేసరికల్లా ఈ శుక్రవారం కనుమరుగైన  జానర్  ముందుకొచ్చింది. అదే ‘లై’ అనే సూపర్ స్పై  థ్రిల్లర్!  మాస్ యాక్షన్లూ, ప్రేమలూ దెయ్యాలూ కాసేపు పక్కన పెట్టి, ఒక ఒక స్పై సినిమా తీయాలన్న ఆలోచన రావడమే గొప్ప!

         
‘అందాల రాక్షసి’ అనే ప్రేమ సినిమాతో పరిచయమైన దర్శకుడు హను రాఘవపూడి  ఆ తర్వాత ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాథ’  అనే జానర్ల కలగూర గంప తీసి ఇంకా  సినిమాకళ మీద పట్టు సాధించని దశలో,  ప్రస్తుత స్పై థ్రిల్లర్ ని జానర్  మీద పట్టున్న దర్శకుడిలా తీశాడు. 

          రోమాంటిక్ కామెడీలతో తిరిగి వెలుగులో కొచ్చిన హీరో నితిన్ కూడా ఈ స్పై థ్రిల్లర్ కి పూనుకుని టెంప్లెట్ సినిమాల నుంచి దూకి అవతల పడ్డాడు. ఇలాటి సినిమా తీయడానికి ముందుకొచ్చిన పాపులర్ నిర్మాతలు కూడా  సరైన నిర్ణయమే  తీసుకున్నారు.


          ఐతే ఇంత చేసీ ఇందులో పాత  మూస లేకపోలేదు- ఈ మూస ఏ తరగతి ప్రేక్షకులకైతే ఉద్దేశించారో వాళ్లకి కాసేపే ఊరట. మిగతా వ్యవహారమంతా మళ్ళీ వాళ్లకి మూస తప్పిన గోసే. ఇదేమిటో చూద్దాం...

కథ 
        చైత్ర (మేఘా ఆకాష్)  పుట్టింది. పుట్టగానే డబ్బు ని  ముట్టుకుంది. పిసినారిగా ఎదిగింది. పెళ్లి చేసుకుంటే హనీమూన్ కి ఫారిన్ తిరగొచ్చని ఎవరో అంటే పేరెంట్స్  ని బలవంత పెట్టి పెళ్ళికి తయారయ్యింది. హనీమూన్ టూరుకి ఏజెంట్ కి డబ్బు కట్టింది. ఆ పెళ్లి క్యాన్సిల్ అయింది. ఏజెంట్ డబ్బివ్వనన్నాడు.

          సత్యం ఆవారాగా తిరుగుతున్నాడు. పెళ్లి చేసుకోరా అని తల్లి వేధిస్తోంది. వచ్చిన సంబంధాలు ఆవారాతనం చూసి కుదరడం లేదు. అమెరికా  వెళ్లి అక్కడ అమ్మాయిల్ని చూసుకుని పెళ్లి చేసుకుంటానంటాడు. 

          చైత్రకి ఏజెంట్ డబ్బు తిరిగివ్వకపోవడంతో ఆ డబ్బులకి ఫారిన్ తిరిగి రావడానికి  బయల్దేరుతుంది. అదే ఫ్లయిట్ సత్యం కూడా ఎక్కుతాడు. ఇద్దరూ అబద్ధాలతో బతికే వాళ్ళే.  ఆ అబద్ధాలతో కలిసి లాస్ వెగాస్ లో వుంటారు. 

          పద్మనాభం (అర్జున్) అనే ఒక ఘరానా క్రిమినల్ అమెరికాలో దాక్కున్నాడు. వాణ్ణి పట్టుకోవడానికి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ప్రయత్నిస్తోంది. ఈ వేటలో ఓ సంఘటన జరిగి అందులో సత్యం ఇరుక్కుంటాడు. 

          సత్యం ఎందుకు ఇరుక్కున్నాడు, అతడికీ పద్మనాభానికీ ఏమైనా సంబంధముందా, పద్మనాభాన్ని పట్టుకోవడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నాడు...ఇవీ ప్రశ్నలు. ఈ ప్రశ్నలకి సమాధానం మిగతా సినిమా. 

ఎలాఫుంది కథ 
       స్పై జానర్ తో రాజీ పడ్డట్టుంది ప్రారంభమంతా.  హీరోయిన్ పుట్టుక, పిసినారితనం, పెళ్లి ప్రయత్నం, హీరో ఆవారాతనం, పెళ్లి ప్రయత్నాలూ... ఇలా సృష్టి ప్రారంభంనుంచీ ఫలానా ఫలానా అని చూపిస్తూ చేసే రొటీన్ ఫార్ములా మూస చిత్రణలు ఈ  స్పై జానర్ లో కుదురుకునేవి కావు. ఏదో రొటీన్ గా హీరో హీరోయిన్ల ప్రేమకథ అన్నట్టు,  ఒక తరగతి ప్రేక్షకుల్ని బుజ్జగించడానికే అన్నట్టు వుంటాయి. సగం కథ నుంచి హీరో అసలెవరో తెలిశాకే  స్పై జానర్ ప్రారంభమవుతుంది. స్పై జానర్ మొదలయ్యాక, హీరో హీరోయిన్ల గురించి సృష్ట్యాది నుంచీ చూపించిందంతా పరమ చాదస్తం  అన్పిస్తుంది. ఇది దేశానికి సంబంధించి ఒక క్రిమినల్ ని పట్టుకునే గూఢచారుల కథ. ఇందులో హీరో హీరోయిన్ల పుట్టుపూర్వోత్తరాలకి, కుటుంబాల-  ప్రేమల కథలకి  స్థానం లేదు. ఇవి  స్పై కథకే మాత్రం ఉపయోగపడవు. అందుకే ఆ ప్రేమ తూతూ మంత్రంగా మారిపోయి స్పై కథకి అడ్డు పడుతూ వచ్చింది. స్పై జానర్ అందరూ చూడరని భావించడమే తప్పు. దాంతో జానరేతర  మసాలాలు దట్టించడం ఇంకా తప్పు. ప్రేక్షకులకి అలవాటు తప్పిన స్పై జానర్ కి పూనుకున్నాక, దానికి తిరిగి ప్రేక్షకుల్ని సంసిద్ధం చేయాలే గానీ, అవ్వాకావాలీ బువ్వా కావాలీ  అన్నట్టు జానర్ మర్యాద తప్పితే అసలుకే మోసం వస్తుంది. గత సంవత్సర కాలంగా జానర్ మర్యాద తప్పిన  సినిమాల్ని తిప్పి కొడుతున్నారు ప్రేక్షకులు. ప్రేక్షకులు మారుతున్నారు, ప్రొడక్షన్లు కూడా మారాలి. 

ఎవరెలా చేశారు 
       వెరైటీ కోసమో, కాస్త తేడాగా ప్రయత్నించి చూద్దామని మేకోవర్ అనుకునో గడ్డం మీసాలు పెంచి తిరుగుతూంటాడు నితిన్. ఇది పాత్రోచితమేనా? ఈ గెటప్ లో తెలిసిపోయేలా గూఢచారులు  షికార్లు కొడుతూంటారా? మారు వేషం వేసినప్పుడు ఇంకేవైనా పెంచుకోవచ్చు. గడ్డం వేసుకు తిరిగితే స్పై గా క్షణంలో సఫా అవుతాడు. ఆవారా లవర్ బాయ్ గా చూపించడానికి బావుందనుకున్న ఈ గెటప్పే,  తర్వాత పాత్ర షేడ్ కీ అచ్చోసి వదిలేశారు. ఇప్పుడైనా అర్ధమవుతోందా - ఒక తరగతి ప్రేక్షకులని బుజ్జగించబోతే ఏం జరుగుతుందో? 

           నితిన్ స్పై రోల్ ని పటిష్టంగా పోషించాడు. ఐతే గూఢరులకి కొన్ని అలవాట్లు వుంటాయి. ఆ సహజత్వంకోసం మాత్రం ప్రయత్నం చేయలేదు. మామూలు యాక్షన్ హీరోవేరు, స్పై వేరు- ఈ తేడా కన్పించదు నితిన్ కి సంబంధించి. పైగా పూర్తిగా సీరియస్  స్పై అయ్యాడు. దీంతో వినోదం కొరవడింది. చాలాకాలం తర్వాత తిరిగి స్పై మూవీని ప్రేక్షకుల ముందుకి తెస్తున్నప్పుడు,  పాత్రతో  సీరియస్ యాక్షన్ చేయించకుండా,  కలర్ఫుల్ గా యాక్షన్ తో చూపిస్తే  ప్రేక్షకులు ఎంజాయ్ చేయడానికి వీలుంటుంది.  జేమ్స్ బాండ్ గా ఆరేడు సినిమాల్లో నటించిన రోజర్ మూర్  ఎంత హాస్యం పండిస్తూ కలర్ఫుల్ గా సాహసాలు చేసేవాడు? 

          హీరోయిన్ మేఘా ఆకాష్ ( ఆకాశంలో మేఘాలు) తారా చంద్రుల్ని కూడా  మెరిపించాలంటే చాలా మబ్బులు తొలగాలి. యాక్షన్ కింగ్ అర్జున్ ఈ సినిమాకి ఒక ఎసెట్. ఈ మొత్తం సినిమాలో మొత్తమంతా పాత్రలోకి దూరిపోయిన నటుడు ఈయనొక్కడే. క్లాసీ విలనీ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి,  పాత్రలాగే అన్పిస్తూ తనని మర్చిపోయేలా చేశాడు. ఈ సంవత్సరం తెలుగు సినిమాల్లో వైవిధ్యం కనబరచిన విలన్ తను.

          ఎన్ఐఎ చీఫ్ గా రవికిషన్ కి రెండో స్థానం. ఇతర సహాయనటులు తర్వాతి స్థానాలాక్రమిస్తారు.టెక్నికల్ గా అంతర్జాతీయ స్థాయిలో వుంది. కెమెరా వర్క్, ఆర్ట్ డైరెక్షన్ కొత్త లోకాల్లోకి లాక్కెళతాయి.  యాక్షన్ సీన్స్ అత్యంత థ్రిల్లింగ్ గా వున్నాయి. మరొక ఎసెట్ మణిశర్మ పాటలు, నేపధ్య సంగీతం. ఇక నితిన్ మీద చివరి సోలో ఫోక్ పాట – దానికి సమకూర్చిన కోరియోగ్రఫీ చాలా క్రేజీగా వున్నాయి. ఇలాగే  అమితాబ్ బచ్చన్,  హేమమాలిని ని టీజ్ చేస్తూ,  ‘దేశ్ ప్రేమీ’ లో లుంగీ కట్టుకుని మారువేషంలో ‘తానే దిన్ తందానా’  సూపర్ క్రేజీ  మాస్ పాటా డాన్సూ  వేసుకుంటాడు. నితిన్ ఆ రేంజి కెళ్ళిపోయాడు. ఇంత టపోరీ సాంగ్ డాన్సూ ఈ మధ్య కాలంలో చూళ్ళేదు. 

చివరికేమిటి 
      స్పై తో రాజీ పడ్డా ఈ మాత్రమైనా ప్రయత్నం చేసినందుకు దర్శకుడికి మార్కులే. ఈ ప్రయత్నాన్ని అంతర్జాతీయ టేకింగ్ తో చేసినందుకు, నితిన్ తో రాజీపడ్డా ఇతర పాత్రల్ని అదే అంతర్జాతీయ స్థాయిలో ప్రెజెంట్ చేసినందుకూ మంచి మార్కులే. ప్లాట్ డివైస్ గా ఆసక్తి రేపుతూ ప్లే చేసిన విలన్ తాలూకు కోటు కథ క్లాస్ క్రియేషన్. విలన్ చేసిన నేరాలు చూపించకుండా, పట్టుబడకుండా ఇంకో నేరం చేసినట్టూ చూపించకుండా, కేవలం విలన్ ని పట్టుకునే దాగుడు మూతలాటకే  పరిమితం చేయడంతో, కొంత అసంతృప్తి వుంది. క్లయిమాక్స్ చప్పున తేలిపోవడానికీ  కథకి కేంద్రకంగా ఒక మహా కుట్ర లేకపోవడమే కారణం.  ఇవి సరిదిద్దుకుని వుంటే ఈ స్పై థ్రిల్లర్ ఇంకింత థ్రిల్లింగ్ గా వుండేది.

-సికిందర్
http://www.cinemabazaar.in


11, ఆగస్టు 2017, శుక్రవారం

494 : రివ్యూ!


 
రచన -  దర్శకత్వం : తేజ
తారాగణం : రానా, కాజల్
, కేథరిన్, పోసాని, తనికెళ్ళ, అజయ్, జయప్రకాశ్ రెడ్డి, ప్రదీప్ రావత్, సత్యప్రకాష్ తదితరులు
సంగీతం : అనూప్ రూబెన్స్, ఛాయాగ్రహణం : వెంకట్ సి.దిలీప్
బ్యానర్ : సురేష్ ప్రొడక్షన్స్, బ్లూ ప్లానెట్ ఎంటర్ టైన్మెంట్
నిర్మాతలు : డి సురేష్ బాబు, కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి
విడుదల: ఆగస్టు 11, 2017
***
         ర్శకుడు తేజా టీనేజీ ప్రేమ సినిమాలతో రానురాను ఆదరణ కోల్పోయి, కొంతకాలం తెర మరుగై  రాజకీయ సినిమాతో ఇప్పుడు దర్శనం చేసుకున్నారు. గతం లో తీసిన వాటిలో ఒక్క ‘నిజం’  అనే సామాజికం తప్ప మిగిలిన దాదాపు పదిహేనూ టీనేజీ  ప్రేమ సినిమాలే. ‘నిజం’ అనే సామాజికంతో వైఫల్యం తర్వాత ఇప్పుడు ‘నేనే రాజు నేనే మంత్రి’  అంటూ రాజకీయంతో రావడం ఒక విధంగా సాహసమే. ప్రేమల నుంచి రాజకీయాలకి తన స్టీరింగు తిప్పుకున్న తేజా ఎలా డ్రైవ్ చేశారన్నదానిపైనే ఆయన గమ్యం చేరడం ఆధారపడుంటుంది. 

          
రానా కూడా ‘ఘాజీ’, ‘బాహుబలి’ ల తర్వాత రాజకీయ పాత్ర పోషించేందుకు పూనుకోవడం, అందులోనూ అపజయాలతో వున్న తేజకి అవకాశమివ్వడం రెండూ ప్రయోగాలే. ఒకరి సాహసం, ఇంకొకరి ప్రయోగం కలిసి తయారైన ‘నేనే రాజు నేనే  మంత్రి’ గురించి ఇద్దరూ మళ్ళీ ఇది రాజకీయ సినిమా కాదన్నారు- పదిశాతం మాత్రమే రాజకీయం, మిగిలింది ప్రేమ కథ అన్నారు. ఇది వినడానికి విచిత్రంగా వున్నా, అసలేం చేశారో ఒకసారి చూద్దాం...

కథ 
   స్వల్ప వడ్డీకి రుణాలిచ్చే వడ్డీ వ్యాపారి జోగేంద్ర ( రానా) భార్య రాధ ( కాజల్) ని బాగా ప్రేమిస్తూంటాడు. పెళ్ళయిన  మూడేళ్ళకి తండ్రి కాబోతున్నాననే సంతోషంతో గుడికి తీసుకుపోతాడు. గుడి బయట  దీపం వెలిగిస్తూంటే సర్పంచ్ భార్య కోపంతో రాధని తోసేస్తుంది. దాంతో గర్భంపోయి ఇక పిల్లలు పుట్టని పరిస్థితి వస్తుంది. తాము సామాన్యులు కాబట్టేగా ఈ పరిస్థితి వచ్చింది, ఇక ముందు ఇలా జరక్కుండా వుండాలంటే సర్పంచ్ కుర్చీని కైవసం చేసుకోమని రాధ అంటుంది. దీంతో ఎన్నికలో నిలబడి సర్పంచ్ సుబ్బయ్య (ప్రదీప్ రావత్)ని ఓడించేస్తాడు జోగేంద్ర. దీన్ని జీర్ణించుకోలేని సుబ్బయ్య తనని చంపబోతే అతణ్ణి చంపేస్తాడు జోగేంద్ర. ఈ హత్య నుపయోగించుకుని  ఎమ్మెల్యే చౌడప్ప (సత్య ప్రకాష్) జోగేంద్రని ఇరకాటంలో పెట్టేస్తే  అతన్నీ చంపేస్తాడు. అతడికి సహకరించిన సీఐ (అజయ్) ట్రాన్స్ ఫర్ అయ్యేలా చేస్తాడు. ఉపఎన్నికలో ఎమ్మెల్యే అయి మంత్రి కూడా అయిపోతాడు. ఇక్కడ హోంమంత్రి సుబ్బారెడ్డి (ఆశుతోష్) తో వైరుధ్యం వస్తుంది. 

          ఇలావుండగా ఓ ఛానెల్ బాస్ కూతురు దేవికారాణి (కేథరిన్) జోగేంద్రని  ప్రేమిస్తూ అతడి రాజకీయ చదరంగంలో సహకరిస్తూ వుంటుంది. దీన్ని రాధా సహించదు.  దీంతో ఈ ఇద్దరి  మధ్య నలిగిపోతూంటాడు. మరోవైపు ఎట్టిపరిస్థితిలోనూ సీఎం అవాలని ప్రయత్నాల్ని తీవ్రతరం చేస్తాడు.

          ఈ ప్రయత్నాల్లో అతడికెదురైన అడ్డంకులేమిటి, రాధ- దేవికలతో వచ్చిన చిక్కులేమిటి,  ఇవన్నీ ఏ మలుపులు తీసుకున్నాయన్నదే మిగతా కథ.

ఎలావుంది కథ 
      ఇది పక్కా పొలిటికల్ థ్రిల్లర్ జానర్ కింది కొచ్చే కథ.  ఇందులో ఎలాటి సందేహమూలేదు. కానీ ఇందులో  పది శాతమే  రాజకీయ కథ అనడంలోనే  తికమక వుంది. ఆ తికమక కథని కూడా తిప్పలు పెట్టింది. రాజకీయ పరమ పద సోపాన పటంలో కథానాయకుడి ఆరోహణా క్రమం చకచకా సగం దాకా సాగి, అక్కడ్నించీ పతనావస్థకి చేరడం 90 శాతం ప్రేమ కథ కోసమే చేసి వుంటే అది జానర్ మర్యాదని గల్లంతు చేసే పనే. ఎప్పుడైతే జానర్ మర్యాద గల్లంతయ్యిందో విషయం రిస్కులో పడి యాంటీ క్లయిమాక్స్ కి దారి తీసింది. ఈ యాంటీ క్లయిమాక్స్ బాక్సాఫీసు అప్పీల్ తో విభేదిస్తోంది. యాంటీ క్లయిమాక్స్ తో మెప్పించేందుకు ‘మరో చరిత్ర’ లోలాగా స్టోరీ క్లయిమాక్స్ కాస్తా ప్లాట్ క్లయిమాక్స్ గా మార్పు చెందే జగ్రత్తలేవీ  తీసుకోలేదు. 

          కథ నడక, పాత్రల తీరుతెన్నులూ  వగైరా చూస్తే  కోడి రామకృష్ణ తీసిన రాజకీయ సినిమాల శైలి గుర్తుకొస్తుంది. అయితే సిద్ధహస్థుడైన కోడి రామకృష్ణ ప్రేమల్ని గానీ, కుటుంబ సమస్యల్ని గానీ జానర్ మర్యాదకి అడ్డురాకుండా రాజకీయ కథల్ని ఒక లాజికల్ ఎండ్ కి తీసికెళ్లారు. విశాల ప్రాతిపదికన ప్రజలకోసం పోరాడే కథానాయకుల్ని చూపించారు. ప్రస్తుత కథలో కథానాయకుడు తన వ్యక్తిగత స్వార్ధం కోసం మాత్రమే హీరోగా ఎస్టాబ్లిష్ అవాలని ప్రయత్నించాడు. చివరిదాకా తన కోసం పోరాడిన ప్రజానీకాన్ని వదిలేసి భార్యకోసం వెళ్ళిపోయాడు. 

ఎవరెలా చేశారు 
      రానా పోషించింది పవర్ఫుల్ పాత్ర ఫస్టాఫ్ లో. ఇంత యాక్టివ్ పాత్ర సెకండాఫ్ మొదలైన దగ్గర్నుంచీ పాసివ్ రియాక్టివ్ పాత్రగా బలహీనంగా మారిపో
తుంది- రాజకీయ కథలోనూ, దాని ఉపకథ అయిన ప్రేమ కథలోనూ. పవర్ఫుల్ పాత్రలో రానా ఆశ్చర్య జనకమైన నిర్ణయాలు తీసుకుంటూ ప్రత్యర్ధుల్ని మట్టు బెట్టడం మనల్ని కళ్ళప్ప గించి చూసేలా చేస్తుంది. అదే సెకండాఫ్ కొచ్చేసరికి,  ప్రధాన శత్రువు తీసుకునే పవర్ఫుల్ నిర్ణయాలకి గిలగిల లాడే రానాని  కళ్ళు తిప్పుకుని చూసేలా చేస్తుంది. ఇద్దరు అతివల మధ్య రానా నలిగే దృశ్యాలు సానుభూతిని రాబట్టుకోగల్గినా, ప్రధాన శత్రువుతో బలహీనంగా కన్పించడంతో, రెండిటా ఒకే రస పోషణ జరిగి పాత్ర ఫ్లాట్ గా మారింది. ఇలా కాకుండా అతివల విషయంలో  బలహీనంగానూ, శత్రువు విషయంలో బలంగానూ వుంటే డెప్త్ వచ్చేది. రానా తిరుగులేని పవర్ఫుల్ నటుడు- అయితే అతడి రాణింపుకి బాహుబలి, ఘాజీల్లోలాగా సమగ్ర పాత్ర చిత్రణలుండాల్సిన అవసరముంది.  

          సెంటిమెంట్ల కాజల్ పాత్ర మరీ సెంటి మెంట్లు ఎక్కువైపోయి సినిమాకి అడ్డదిడ్డంగా కాటుక (కాజల్) పూసేసింది. గ్లామర్ పోషణ బావుంది. పాటల్లో బాగానే కన్పిస్తుంది. ముక్కోణ ప్రేమలో త్యాగమనే భారం తనమీదేసుకుని చేసే పని చివరికి రానా చేసే పనిలాగే పిచ్చి పని. రానాని మోటివేట్ చేసే పాత్ర కాస్తా తనే తీవ్ర నిర్ణయం తీసుకోవడం విస్తుపోయేలా చేస్తుంది. పాత్ర చిత్రణలకి  సంబంధించి ఒక కొటేషన్ వుంది : పాత్రని పై దాకా చెట్టెక్కించాలి, ఆ తర్వాత రాళ్ళు తీసుకుని కొట్టాలి. అప్పుడా పాత్ర ఏం చేస్తుందో చూడాలని... అయితే రానా కాజల్ ల లాగా కూడబలుక్కుని చెట్టు దూకి పారిపోకూడదు!  జైసీ  కాజల్ వైసా రానా అయ్యారిక్కడ. 

          టీవీ జర్నలిస్టు పాత్రలో కేథరిన్ కి రానా తగిన బుద్ధి చెప్తూ, తనకి జరిగింది ఆమె చెప్పుకోలేని ‘టెక్నాలజీ’ నుపయోగించడం చాలా బావుంది. ఇలాటి ఆడవాళ్ళకి ఇలాగే బుద్ధి చెప్పాలి. అయితే ఒక జర్నలిస్టు కాపురాల్లో ది ఆదర్ వుమన్ గా చొరబడ్డం లాజికల్ గా ఏమీ వుండదు. ఈమె పాత్రకూడా సెకండాఫ్ లో ఇంకేం చెయ్యాలో తోచక మిస్ అయి, క్లయిమాక్స్ లో భారీ జనసందోహాన్నేసుకుని మళ్ళీ జర్నలిస్టు సోకు వెలగబెడుతుంది. ప్రేమాగీమా ఏమయ్యాయో తెలీదు. ప్రేమ కథకి కూడా న్యాయం జరగలేదు. 

          ‘నక్షత్రం’ లో రేజీనా తండ్రిగా గతవారమే హడలగొట్టిన  శివాజీ రాజా మళ్ళీ ఈసారి కాజల్  ఫాదర్ గా ప్రత్యక్షమయ్యారు. శివాజీ రాజా అప్పుడే పెద్ద పెద్ద హీరోయిన్లకి తండ్రి అయిపోవడం ఒక ఎట్రాక్షన్. ఇక విలన్ కి పక్కవాద్యం
పోసాని, సీఎంగా తనికెళ్ళ, సీఐగా అజయ్, జైలర్ గా జయప్రకాశ్ రెడ్డి, సర్పంచ్ గా ప్రదీప్ రావత్, ఎమ్మెల్యే గా సత్యప్రకాష్ అంతా రాజకీయ సన్నివేశాల్ని బాగా బాగా వేడెక్కించడానికి పనికొచ్చారు. 

          అనూప్ రూబెన్స్ ఈసారి లూప్ లో కొచ్చి సరైన బాణీల్ని అందించారు. సంగీతపరంగా సినిమాకివ్వాల్సిన సోల్ నంతా ఇచ్చారు. కాకపోతే కథాపరంగా ఆ సోల్ చెదిరిపోయింది. దిలీప్ కెమెరా వర్క్ కూడా ఉన్నతం. యాక్షన్, ఆర్ట్, ఎడిటింగ్ తదితర సాంకేతిక విభాగాలన్నీ ఉన్నతంగా  వున్నాయి.

          తేజా  దర్శకత్వంలో ఈసారి కొట్టొచ్చినట్టు కన్పించేదేమింటంటే,  ఎక్కడా ఇది తేజా సినిమా అన్పించక పోవడం. లేకపోతే ప్రేమ సినిమాల్లో అంతా ఆయనే కన్పించేవారు డామినేట్ చేస్తూ. ఈసారి అంత ఇగో లేదు. తను కాకుండా కథ మాత్రమే, పాత్రలు మాత్రమే  కన్పించేట్టు జాగ్రత్తలు తీసుకున్నట్టు కన్పిస్తుంది. 

          ఈ సినిమాకి మరో బలం సంభాషణలు. సంభాషణల రచయితకి సన్నివేశాలతో పనేగానీ,  ఆ సన్నివేశాల కూర్పు సరిగానే వుందా, ప్రధాన పాత్ర బలహీనంగా మారిపోయి,  ప్రధాన కథని ఉప కథ ఆక్రమిస్తూ,  ఉప కథే ప్రధాన కథగా ముగుస్తోందా అన్న బాదరబందీతో  పనుండదు. అవి దర్శకుడు చూసుకుంటాడు. అలాగే డైలాగ్ రైటర్ లక్ష్మీ భూపాల సామెతలు దట్టించి మాటలు పేల్చుకుంటూ బిజీగా గడిపేశారు. తన పనిని తాను  కమర్షియల్ రైటర్ అన్పించుకుంటూ సమర్ధవంతంగా నిర్వహించారు. పరుచూరి బ్రదర్స్ కూడా రచనలో చేయి వేసి న్యాయం చేసేందుకు తమ వంతు కృషి చేశారు. ఎవరైనా కృషి మాత్రమే చేయగలరు. ఫలితం మాత్రం బాక్సాఫీసే చెప్తుంది. ఎలాటి కృషి చేశారనేది మాత్రం అర్ధం గాకుండా వుండిపోతుంది.

చివరికేమిటి
       ఫస్టాఫ్ రానా యాక్షన్ తో కళ్ళుతిప్పుకో నివ్వదు. రాజకీయ కథ కొత్త పుంతలు తొక్కుతుంది. సెకండాఫ్ లో కుటుంబ సెంటిమెంట్ల బారిన పడి ఎత్తుకున్న కథ యూత్ అప్పీల్ కి దూరమైపోతుంది. విషాద ముగింపు ఇంకో మైనస్ కాగా, దీనికికూడా అర్ధం కన్పించదు. ఇలాటి ముగింపు అవసరమే లేదు. ఫస్టాఫ్ లో పదవుల కోసం రానా చేసే హత్యాపరంపర – సెకండాఫ్ కొచ్చేసరికి కేవలం విలన్ చేసే అకృత్యాలని తిప్పి కొట్టే ప్రహసనంగా మారిపోతుంది. ఒక అకృత్యానికి కాజల్ గాయపడినప్పుడైనా విలన్ మీద వేటు వేసే ఆలోచన చేయకపోవడం సెకండాఫ్ సమస్యలన్నిటికీ మూలం. పోతే ఇది సీరియస్ సినిమా. ఇందులో వినోదం పాలు వెతుక్కోకూడదు.

-సికిందర్
http://www.cinemabazaar.in




10, ఆగస్టు 2017, గురువారం

493 : డార్క్ మూవీస్ స్క్రీన్ ప్లే సంగతులు - 9





(జులై 22 ఆర్టికల్ తరువాయి)
         
బ్లడ్ సింపుల్’ మీద విశ్లేషణలు రాసిన ఎందరెందరో పండితులు మనకి తెలిసి ఒక విలువైన స్క్రిప్టింగ్ టూల్ ని గుర్తించనట్టు కనపడతారు.  రైటర్స్ దృక్కోణంలో విశ్లేషించకపోవడం వల్ల కావొచ్చు, ఆ స్క్రిప్టింగ్ టూల్ ప్రాథాన్యాన్ని విస్మరించారు. ఇంతవరకూ మనం చూస్తూ వచ్చిన సినిమాల్లో ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ఏ గోల్ ఏర్పడిందో ఆ గోల్ ప్రకారమే మిడిల్ నడుస్తుందనీ గమనిస్తూ వచ్చాం. ఆ గోల్ కొన్ని ఎలిమెంట్స్  తో కలిసి వుంటుందనీ, అవి కోరిక, పణం, పరిణామాల హెచ్చరిక,  ఎమోషన్ గా వుంటాయనీ తెలిసిందే. ఈ నాలుగూ కాక మరొకటి వుంటే? అది రహస్య ఎజెండా అయితే? అప్పుడు కోరిక, పణం, పరిణామాల హెచ్చరిక,  ఎమోషన్ లకి తోడూ రహస్య ఎజెండా కూడా కలిసి ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడితే? కాకపోతే రహస్య ఎజెండా వుందని ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ప్రేక్షకులకి తెలియదు. ఏర్పాటు చేసిన గోల్ ప్రకారమే మిడిల్ ని చూస్తూ వెళ్లి ఎక్కడో కంగారుపడతారు. అంటే ఏర్పాటు  చేసిన గోల్  అసలు గోల్ కాకుండా పోతుందన్న మాట. ఫేక్ గోల్ ని ఏర్పాటు చేయడమన్న మాట. ప్రేక్షకుల్ని కాసేపు భ్రమల్లో వుంచడానికి ఫేక్ సన్నివేశాల్ని సృష్టించడం కద్దు. కానీ  ఏకంగా గోల్ నే ఫేక్ గోల్ గా ఏర్పాటు చేయడం బహుశా ‘బ్లడ్ సింపుల్’ లోనే వుంది. ఇదెలా జరిగిందో చూద్దాం...

         
ప్లాట్ పాయింట్ వన్ లో  ఎబ్బీ, రేలని చంపే కాంట్రాక్టుని మార్టీ నుంచి విస్సర్ పొందాడని తెలుసుకున్నాం. ఇలా విస్సర్ గోల్ లో  పైన చెప్పుకున్న నాల్గు ఎలిమెంట్స్  వున్నాయని గమనించాం. అయితే జరిగిందేమిటి? 19 వ సీను (గతవ్యాసం) లో విస్సర్ మార్టీని చంపి సంచలనం సృష్టించాడు. కన్నింగ్ ఫెలో మార్టీ అని ముందే చెప్పుకున్నాం. తనని నమ్మిన వాళ్ళ గొంతు కోసి బాముకునే రకం. ఒకసారి చూసి రమ్మంటే ఫోటోలు తెచ్చి  బ్లాక్ మెయిల్ కి పాల్పడ్డ విస్సర్ ని మళ్ళీ నమ్మి చంపే పని అప్పగించాడు మార్టీ. ఫలితం అనుభవించాడు. ఇది ప్లాట్ పాయింట్ వన్ ని తలకిందులు చేసిందా? ప్లాట్ పాయింట్ వన్ ఇలా ఉల్టా పల్టా అవడం ఎక్కడైనా చూశామా? ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ఏ  గోల్ ఏర్పడిందో ఆ గోల్ ని దృష్టిలో పెట్టుకునే మిడిల్ ని  నడపడం సర్వసాధారణం. ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ఎబ్బీ, రే లని చంపేందుకు మార్టీ నుంచి  కాంట్రాక్టు పొందాడు విస్సర్. ఆ ప్రకారం ఎబ్బీ, రేలని చంపిన ఫోటోలు మార్టీ కి చూపించాడు. మార్టీ దగ్గర రావాల్సిన డబ్బులు తీసుకుని మార్టీని చంపేశాడు. పైకి చూస్తే  ఇది ఎబ్బీ, రే ల హత్యలతో ముందుముందు తనకి మార్టీ తో సమస్యలు రాకూడదని మార్టీని కూడా అంతమొందించి నట్టు కన్పిస్తోంది.  మార్టీ  హత్యని ఎబ్బీ మీదికో, రే మీదికో తోసేయ్యడానికి ఎబ్బీ రివాల్వర్ని ఉపయోగించాడని కూడా అర్ధమవుతోంది. 

          ప్లాట్ పాయింట్ వన్ లో విస్సర్ గోల్ ఎబ్బీ, రేలని చంపడమే కదా, వాళ్ళని చంపాక దాని పరిణామాల్లో భాగంగానే మార్టీ ని కూడా చంపి వుండవచ్చని  అన్పించవచ్చు. అంటే ప్లాట్ పాయింట్ వన్ కి కొనసాగింపుగా మార్టీ హత్య తోచవచ్చు. ముందు ఎబ్బీ, రేలని చంపి, దానికి  సాక్షిగా వుండే  మార్టీ బతికి వుండకూడదని మార్టీని కూడా చంపినట్టు కన్పిం
చవచ్చు. 


         కానీ అసలు ఎబ్బీ, రే లనే విస్సర్ చంపి వుండకపోతే? చంప 
లేదు కూడా! చంపదల్చుకోలేదు. ప్లాట్ పాయింట్ వన్ లో మార్టీ ఆఫర్ ని స్వీకరించడం ఒక పెద్ద దగా.అలా నటించాడు. అప్పుడే ఎబ్బీ, రేలకి బదులుగా మార్టీ నే చంపి, ఈ హత్యని ఎబ్బీ, రేల మీదికి
తోసెయ్యదల్చు
కున్నాడు. పదివేల డాలర్లు అవసరమే. కాకపోతే రిస్కు తీసుకో తీసుకోదల్చుకోలేదు. తను ఏబీ, రేలని చంపేస్తే,  రేపొకవేళ మార్టీ దొరికిపోతే, తనని కూడా కేసులోకి లాగవచ్చు. మార్టీ నే చంపి ఎబ్బీ, రే ల మీదికి తోసేస్తే ప్రమాదం వుండదు- తను వాళ్ళకి తెలీదు గనుక. 


          ప్లాట్ పాయింట్ వన్ దగ్గరే అతడికీ రహస్య ఎజెండా వుంది. ఇది మార్టీకీ, ప్రేక్షకులకీ తెలీదు. అందుకే ఇలా ప్లాట్ పాయింట్ వన్ ట్విస్టు ఇచ్చాడు విస్సర్. ప్లాట్ ట్విస్టులుంటాయి, కానీ ప్లాట్ పాయింట్ వన్ ట్విస్టే కొత్తది! ఈ ట్విస్టు పెట్టాలంటే పాత్రకి పైకి కన్పించే గోల్ కాక   లోలోపల రహస్య పథకం వుండాలి. ఇది అచ్చిబుచ్చి తెలుగు ప్రేమసినిమాల్లో కూడా పెట్టుకోవచ్చు. కానీ అచ్చిబుచ్చి తెలుగు ప్రేమసినిమాల్లో అలిగి విడిపోవడాలు, ప్రేమదీపం మలిపేసుకుని ఈసురో మని మిగిలిపోవడాలూ ఇవే ప్లాట్ పాయింట్ వన్ లుగా గొప్పగా అన్పిస్తాయి రోమకామ ( రోమాంటిక్ కామెడీ)   రైటర్లకి.


          ఏ ఆధారాలతో విస్సర్ ప్లాట్ పాయింట్ ట్విస్ట్ ఇచ్చాడని తెలుస్తోంది?  అతను ఎబ్బీ రివాల్వర్ తో మార్టీని చంపడమే ఆధారం. ఎబ్బీ, రేలని చంపి వచ్చి ఎబ్బీ రివాల్వర్ తో మార్టీని ఎలా చంపుతాడు అంత కన్నింగ్   డిటెక్టివ్? ఎబ్బీ, రేల మరణ సమయం, మార్టీ మరణ సమయం విభేదిస్తాయి. రేపు పోస్ట్ మార్టమ్స్ లో తెలిసే మరణ సమయాల ప్రకారం ముందు చనిపోయిన ఎబ్బీ,  రేలు తర్వాత వచ్చి మార్టీని ఎలా చంపుతారు? అంటే వాళ్ళిద్దరూ బతికే వున్నారన్నమాట. విస్సర్ చంపి రాలేదన్న మాట. అలా ఫేక్ చేసిన ఫోటోలు చూపించి మార్టీని మోసం చేసి, డబ్బులు వసూలు చేసుకుని ఎబ్బీ రివాల్వర్ తో చంపేసి  పోయాడన్న మాట. ఇప్పుడు పీకలదాకా ఎబ్బీ, రే లు ఇరుక్కోవడమే!

          ఈ ప్లాట్ పాయింట్ ట్విస్టుతో చాలా బలమైన పరిణామాన్ని సృష్టించాడు విస్సర్. ఇప్పుడు దీని తర్వాతి దృశ్యం చూద్దాం... ఎంత తెలివిగల డిటెక్టివ్ అయినా నేరస్థుల్ని  పట్టుకోగలడేమో గానీ, నేరం చేసి బయట పడలేడు. ఇప్పుడు తర్వాతి  సీను దగ్గర్నుంచే అతనూహించి నట్టుగాక, అనూహ్యంగా అతడి పతనావస్థకి ఎలా బీజం పడిందో చూద్దాం...

 (సశేషం )
- సికిందర్


         
         




         


         


5, ఆగస్టు 2017, శనివారం

492 : రివ్యూ!

రచన - దర్శకత్వంహరిప్రసాద్
తారాగణం : అశోక్‌,  ఈషా రెబ్బా, పూజిత,  సుదర్శన్, కేదార్శంకర్, జెమిని సురేష్, నోయల్షాన్
సంగీతం: సాయి కార్తీక్‌, ఛాయాగ్రహణం: ప్రవీణ్అనుమోలు
బ్యానర్‌: సుకుమార్రైటింగ్స్, ప్లేబ్యాక్ పిక్చర్స్  
నిర్మాతలు: బి.ఎన్‌.సి.ఎస్‌.పి. విజయ కుమార్, థామస్రెడ్డి ఆడూరి, రవిచంద్ర సత్తి
విడుదల : 4 జులై, 2017
***
        సు
కుమార్ రైటింగ్స్ ఇంకొకటి వచ్చింది. రోమాంటిక్ రైటింగ్స్ కి అలవాటు పడిన కలం ఈసారి రాయకుండా రోమాంటిక్ డ్రామా తీసింది. క్యాంపులో స్టూడెంట్ హరిప్రసాద్ ని దర్శకుడుగా, దర్శకుడి పాత్రలో బంధువు అశోక్ బండ్రెడ్డి ని హీరోగా పరిచయం చేస్తూ  ‘దర్శకుడు’ సిద్ధం చేసింది. క్రితం వచ్చిన ‘కుమారి 21 ఎఫ్’ రైటింగ్స్ కీ, రైటింగ్ ని అవుట్ సోర్స్ చేసిన ‘దర్శకుడు’ కీ చాలా తేడా వుంది. అదేమిటో చూద్దాం...

 కథ 
        చిన్నప్పట్నించీ తండ్రి ప్రోత్సాహంతో సినిమా దర్శకుడవాలని దర్శకత్వ శాఖలో చేరతాడు మహేష్ (అశోక్). రెండేళ్లకే ఓ నిర్మాతకి కథ విన్పించి ఓకే చేయించుకుంటాడు. అయితే కథలో ప్రేమ ట్రాకు బలంగా లేదని, దాన్ని సరి చేస్తేనే తీస్తానని నిర్మాత పదిహేను రోజులు గడువు పెడతాడు. తనకి  ప్రేమలో అనుభవముందా అని కూడా అడుగుతాడు. దీంతో మహేష్  ప్రేమ ట్రాకు గురించి ఆలోచిస్తూ తన వూరు వెళ్తాడు. తిరుగు ప్రయాణంలో వైజాగ్ నుంచి హైదరాబాద్ వస్తున్న నమ్రత (ఈషా) అనే ఫ్యాషన్ డిజైనర్ పరిచయమవుతుంది. ఈ ప్రయాణం కొన్ని అవాంతరాలతో, అపదలతో రకరకాలుగా సాగుతుంది. అతను సినిమా దర్శకుడని తెలుసుకున్న ఆమె సినిమాల్లో చూపించేవన్నీ అబద్ధాలని వాదిస్తుంది. ఈమెతో ఈ అనుభవాలు తన కథకి పనికొస్తాయని ఆలోచిస్తూంటాడతను. ఈ క్రమంలో తనతో ప్రేమలో పడిందని గ్రహిస్తాడు. అ ప్రేమని ఆమె వ్యక్తం చెయ్యదు. హైదరాబాద్ చేరాక అతడికి సినిమాలే తప్ప, తనమీద ప్రేమలేదని, తన ప్రేమని సినిమా కథకి వాడుకుంటున్నాడనీ తెలుసుకుని లెంపకాయ కొట్టి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అది వెండి తెర మీద చూడాలి.

ఎలావుంది కథ 
     సుకుమార్ రైటింగ్స్ నుంచి అవుట్ సోర్స్ కాంట్రాక్టు  పొందిన కొత్త దర్శకుడు అందరు కొత్త దర్శకులకి లాగే టెంప్లెట్ ప్రేమని కథగా చేశాడు. దీనికి సుకుమార్ రైటింగ్స్ అనే బ్రాండింగ్ లేకపోతే ప్రతీవారం వచ్చే చిన్నా చితకా రోమాంటిక్ కామెడీల్లో ఇదొకటిగా ఎవరికీ తెలిసేది కాదు. ఇందులో చూపిన ప్రేమకి కథా ప్రయోజనం లేదు సరే, వృత్తిపరంగా ఔత్సాహిక దర్శకులకి ఏమైనా నేర్పి కథా ప్రయోజనం సాధించిందీ లేదు. అదీ సమస్య. ఒకప్పటి కాలేజీల్లో టీనేజీ ప్రేమ కథలే ఇప్పుడు పాతికేళ్ళు దాటిన ప్రొఫెషనల్ పాత్రలకి పెట్టి తీసేస్తున్నారు. అన్ని రోగాలకీ ఒకటే జిందా తిలిస్మాత్ లాగా, అన్ని ప్రేమలకీ ఒకటే అచ్చిబుచ్చి టీనేజి ప్రేమ కథలు. ఈ చూపిస్తున్న ప్రొఫెషనల్స్ ప్రేమల తీరు, మాటల తీరు, ప్రవర్తనల తీరూ, అలకలూ వియోగాల బాధ అంతాకూడా అపరిపక్వ-   ఇన్ఫాచ్యుయేషన్ బాపతు టీనేజి మనస్తత్వాలే. చాలా నాన్సెన్స్ ఇది. సుకుమార్ రైటింగ్స్ కూడా దీనికే పూనుకోవడం వింత. ఈ చూపిస్తున్న ఏనాటివో కాలం తీరిన మూస టెంప్లెట్ ప్రేమలకంటే, టాలీవుడ్ బయట యూత్ తీస్తున్న షార్ట్ ఫిలిమ్స్ ఎంతో బెటర్. ఇప్పుడు టీనేజీ ప్రేమలైనా ఎలావుంటున్నాయో వాస్తవికంగా చూపిస్తున్నారు. దీంతో వూరూవాడా యూత్ వీటికి కనెక్ట్ అయిపోయి టాలీవుడ్ రోమాంటిక్ కామెడీల వైపే  కన్నెత్తి చూడ్డం లేదు. ఎప్పుడో ఒకటీ అరా బ్రాండింగ్ తో వస్తే మొక్కుబడిగా చూస్తున్నారు. ఒకప్పుడు కుటుంబ సినిమాలకి టీవీ సీరియల్స్ దెబ్బకొట్టి ఫ్యామిలీ ఆడియెన్స్ ని దూరం చేసినట్టు, టాలీవుడ్ రోమాంటిక్ కామెడీలకి షార్ట్ ఫిలిమ్స్ పోటీగా తయారై సినిమాలకి యూత్ డుమ్మాకొడుతున్నారని గమనిస్తే మంచిది.

ఎవరెలా చేశారు 
      కొత్త వాడు కాబట్టి అశోక్ కి ఇంకాస్త సమయమివ్వాలి. కానీ ముందుగా అతను ఏం చేస్తే ముఖభావాలు కనీస స్థాయిలో పలికించగలడో తెలుసుకుని ఆ ప్రయత్నం చేయాలి. అవసరమైతే ప్లాస్టిక్ సర్జరీ కూడా. ముఖభావాలే పలకని, అన్నిటికీ ఒకటే ఫేసుపెట్టే స్టాటిక్ ఎక్స్ ప్రెషనిస్టు యువహీరో ఆల్రెడీ వున్నాడు. ఇంకా స్ట్రగుల్ చేస్తున్నాడు. అశోక్ కి అశోకవనం కాకూడదు టాలీవుడ్. 

          పాత్ర విషయానికొస్తే, గోల్ అనేది సినిమాల కోసమే పెట్టుకున్నాడు. బావుంది. ఆ సినిమా కథలో ప్రేమ బాగాలేదన్నాడు నిర్మాత. ప్రేమలో అనుభవం లేదా అని కూడా చెత్త ప్రశ్న వేశాడు. అశోక్ పాత్ర గనుక మర్డర్ మిస్టరీ చెప్తే, మర్డర్స్ లో అనుభవం లేదా, వెళ్లి మర్డర్ చేసిరా అంటాడేమో. సరే, ప్రేమలో అనుభవంకోసం కాకపోయినా, ప్రేమలో పడేందుకే దర్శకుడు హరిప్రసాద్ తనని వూరు పంపాడు. అక్కడ ఫ్యాషన్ డిజైనర్ పరిచయమైంది. ఆమెతో ట్రావెల్ చేస్తున్నప్పుడు ప్రేమంటే ఎలావుంటుందో అనుభవమయ్యింది. ఈ బాపతు ప్రేమ రెండు టాలీవుడ్ టెంప్లెట్ రోమాన్సులు  చూసేస్తే తెలిసిపోతుంది- వేరేగా అనుభవం అవసరం లేదు. మిత్రుడు (సుదర్శన్ రెడ్డి) నయం. ఏవేవో రోమాంటిక్ సినిమాలు చూసి ఐడియా లిస్తూంటాడు. అంతకంటే తక్కువరకం ప్రేమానుభవం పొందుతున్నాడు తను. అయితే ఈ ప్రేమలో తను పడడమే పాత్ర వృత్తితత్వాన్ని దెబ్బ తీసింది. దర్శకుడుగా కథకోసం ఆమెని స్టడీ చేయాల్సింది పోయి ప్రేమలో పడిపోయాడు. ఈ ప్రేమ ట్రావెల్ లో కథకోసం రీసెర్చి ఎలా చేస్తారో, ఎలాటి చిక్కుల్లో పడతారో చూపించే అవకాశాన్ని కోల్పోయాడు. ఎందుకంటే, పాత్ర వృత్తి నుంచి విడిపోయి ప్రేమ ఒక్కటే అనుకుంది. 

          సాధారణంగా ఇలాటి సందర్భాల్లో ఏం జరుగుతుందంటే, ఇలా ప్రేమలో పడిపోతే గోల్ ని మర్చిపోతుంది పాత్ర. ఆ ప్రేమలో దెబ్బ తిన్నాకే బుద్ధి తెచ్చుకుని  మళ్ళీ గోల్ వైపు మళ్ళుతుంది. అశోక్ పాత్ర ఈ పని చేసి డెప్త్ తీసుకురాలేదు, పోనీ ప్రేమలో పడకుండా ప్రేమని స్టడీ చేయలేదు. ప్రేమా కావాలి, ప్రొఫెషన్ కూడా కావాలీ అనుకున్నాడు. ఇది ఇమ్మెచ్యూర్ పాత్ర లక్షణం. హీరోకి కాక ఇతర పాత్రలకి వుండొచ్చు ఈ స్పష్టత లేని లక్ష్యం. ఎదురుగా ప్రేమించిన హీరోయిన్ వున్నప్పుడు ఆమెతోనే వుండాలి సంఘర్షణ. తనలో రెండు కోరికలు పెట్టుకుని వాటితో కాదు. 

        ఈ కథ ప్రేమ గురించా, దర్శకుడిగా ప్రొఫెషన్ గురించా? ఇక్కడ కూడా తప్పులో కాలేయడం
వల్ల ప్రేమే కథని మింగేసి, దర్శకుడి పాత్ర చిత్రణకి గ్రహణం పట్టించింది. పాత్రకి వృత్తితత్త్వంతో కూడిన అద్భుత రసమే ప్రధాన రసంగా వుండి,  చెరో పక్క రెండు అంగాలుగా శృంగార, హాస్య రసాలు పలకాల్సింది. ‘ముత్యాలముగ్గు’ వియోగ కథని అద్భుత రస ప్రధానంగా ఎందుకు తీశారో అర్ధం చేసుకోవాలి. ఇక్కడ దర్శకుదు అద్భుత రస ప్రధానంగా నడకపోవడంవల్ల,  పాత్ర గందరగోళంలో పడిపోయి ముగింపు కొచ్చేసరికి, తన షరతుల మీద ఆమెని చేపట్టడం కాక,  పాసివ్ క్యారక్టర్ గా మారిపోతూ వచ్చి, హీరోయిన్ అచ్చిబుచ్చి కబుర్లకి పడిపోయి శుభం వేశాడు. 

          ఇక హీరోయిన్ ఈషా మంచి నటి. భావప్రకటనా సామర్ధ్యం బాగా వుంది. ఆమె రొటీన్ కమర్షియల్ సినిమాల జోలికి పోకుండా ఈ తరహా సినిమాలకి పరిమితమైతే ఎక్కువ కాలం వుండగల్గుతుంది. పాత్రకి వచ్చేసరికి,  కనీసం పాతికేళ్ళ వయసున్న ప్రొఫెషనల్ తను. పైగా ఫ్యాషన్ డిజైనర్.  కానీ హీరో దర్శకుడని తెలిశాక, మరీ టీనేజీ పిల్లల చేష్టలు పోతూ – తనకి  సినిమాలంటే ఇష్టముండదనీ, అన్నీ అబద్ధాలే చూపిస్తారనీ,  ఇంకా ఏదేదో అంత సిల్లీగా ఎలా మాటాడి గిల్లి కజ్జాలు పెట్టుకుంటుంది. ఇద్దరిదీ ఒకే రంగమైనప్పుడు ప్రొఫెషనల్ గా అతడితో వెంటనే కనెక్ట్ అయిపోవాలి. అతడితో కలిసి పనిచేసే దృష్టితో మెచ్యూర్డ్ గా మాటాడాలి.  అతనెప్పుడో సెకండాఫ్ లో పిలిచి పనిలో పెట్టుకుంటే కాదు. తనతో సాన్నిహిత్యంలో అతను  కథని వెతుక్కుంటే తప్పేముంది? కళాకారులకి ఇది తప్పదు కదా, ఆమెకీ తప్పదు. అతను కథనే చూస్తాడు, కథనే చూసినా తను ప్రేమనే చూడవచ్చు. తను ప్రేమకి ప్రతినిధి అయితే, అతను కళకి  అయినప్పడు,  బలాబలాల సమీకరణ గీతగీసి స్పష్టంగా కనపడుతుంది కదా? అతను  కథనే చూశాడనీ, ప్రేమించలేదనీ, ఏ ఎమోషన్సూ లేవనీ  లెంపకాయ కొట్టి ఎలా వెళ్ళిపోతుంది. ఇది ఇమ్మెచ్యూరే కాదు, ప్రిమెచ్యూర్ కూడా. ముందు అతడితో ప్రొఫెషనల్ గా స్థిరపడాలి, ఆ తర్వాతే ప్రేమ గొడవలు లేవనెత్తుకోవాలి. అప్పుడది కథనం అవుతుంది. అతను ఆమెతో అయిన అనుభవాలే సీన్లుగా తీస్తూంటే, ఒక చోట షూటింగు చూసి, ‘నీయబ్బ ఈ సిను ఇంటర్వెల్లో వాడేశాడా!’ అని ఉడుక్కుంటుంది. టోటల్లీ నాన్సెన్స్. అతడి సినిమాకి తను స్ఫూర్తి అయితే మంచి విషయమే కదా? ఏ పల్లెటూరి పిల్లయినా ఎగిరి గంతేస్తుంది. 

          అతను కూడా సినిమా తీసి. నిర్మాతతో సమస్య వచ్చి పేరేసుకోకుండా ఎటో వెళ్లి పోవడం బాగానే వుంది కానీ, ఆ సినిమా కథకి  స్ఫూర్తి అయిన హీరోయిన్ ని తెర మీద పరోక్షంగానైనా ప్రస్తావించకుండా ఎలా వెళ్ళిపోతాడు. అద్భుత రసం ప్రధానంగా పాత్ర కొనసాగుతూ వుంటే ఈ పనే చేసి వెళ్ళిపోయేవాడు. ప్పుడు అన్ని శంకలూ తీరి ఆమే తన దగ్గరికి వచ్చేసేది. ఇలాకాక, నేనింత ప్రేమించాను, అంత ప్రేమించానూ అని ఎన్ని చెప్పుకుంటే ఏం లాభం.  సినిమానే ఆమెకి అంకితమిచ్చి పారేస్తే అంతకంటే ఏది బలపరుస్తుంది తన ప్రేమని. 

          ఫ్రెండ్ పాత్రలో కమెడియన్ సుదర్శన్ రెడ్డి డీసెంట్ గా నటించాడు. నిర్మాతా,  ఆయన కో డైరెక్టర్ పాత్ర ధారులిద్దరూ బావున్నారు. కానీ నిర్మాత ఫస్టాఫ్ లో రెండు సినిమాలు తీసి నష్టపోయానంటాడు. మళ్ళీ ఫస్టాఫ్ లో ఆస్తులన్నీ అమ్మి ఈ సినిమా తీస్తున్నా, పోయిందంటే కుటుంబం సహా  రోడ్డున పడతానంటాడు. ముగింపులో మళ్ళీ,  ముందు తీసిన రెండు సినిమాలకి డబ్బులొచ్చాయంటాడు. ఏది నమ్మాలి? అంత పెద్ద హైఫై నిర్మాత కోటి రూపాయల సినిమాకే రోడ్డున పడతాడా. సుకుమార్ రైటింగ్స్ కి ఇలాటి అవగాహన వుంటుందనుకోలేం.  

          ప్రొడక్షన్ విలువలు చాలా బావున్నాయి. ఆర్ట్ డైరెక్షన్ వున్నట్టు తెలీకుండా తీసిన ట్రెండీ లుక్ బావుంది. కెమెరా వర్క్ స్ఫటిక స్వచ్ఛతతో వుంది. పాటలుకూడా హుషారుగా వున్నాయి. అవుట్ డోర్ లొకేషన్స్  కథకున్న ఫీల్ కి పట్టం గట్టాయి. రాతపని బలహీనంగా వున్నా, నటనల్ని రాబట్టుకునే, దృశ్యాల్ని చిత్రీ కరించే దర్శకత్వపు పనులు చక్కగా వున్నాయి. 

చివరికేమిటి 
         ప్రధాన పాత్రకి సరైన అస్త్ర శస్త్రా లుంటే స్క్రీన్ ప్లే సరీగ్గా వుంటుంది. ప్రధాన పాత్ర తప్ప  దర్శకుడు లేదా రచయిత ఏం చేసీ స్క్రీన్ ప్లేని ఏర్పరచలేరు. ప్రధాన పాత్రని సృష్టించాక కథ కథకుడి చేతిలో వుండదు. అతను ఇష్టారాజ్యం గా పాత్రని క్యాట్ వాక్ చేయించుకుంటూ వెళ్ళలేడు. పాత్ర వెంటే కథకుడు వెళ్ళాలి. ఇలా జరక్కపోవడం వల్ల, ప్లాట్ పాయింట్స్ ఎక్కడ ఏర్పడ్డాయో తెలియనంత అస్పష్ట అష్టావక్ర చట్రం ఈ ప్రేమ సినిమాలో ఏర్పడింది. అంక విభజన అదృశ్యమై గాథ స్టయిల్లో ఆర్గ్యుమెంట్ లేని ఉత్త స్టేట్ మెంట్ చందాన మిగిలింది. టెంప్లెట్ నుంచి బయటికి రాకపోతే,  ప్రేమ సినిమాలు ఏవో పెద్ద బ్యానర్లు వాటి హంగులతో తప్పితే, మిగతావి హంగులూ లేక, కథా కాకరకాయా సరైన స్ట్రక్చర్ లో లేకా చప్పగా తేలిపోతాయి.

-సికిందర్
Cinemabazaar.in