రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

5, ఆగస్టు 2017, శనివారం

492 : రివ్యూ!

రచన - దర్శకత్వంహరిప్రసాద్
తారాగణం : అశోక్‌,  ఈషా రెబ్బా, పూజిత,  సుదర్శన్, కేదార్శంకర్, జెమిని సురేష్, నోయల్షాన్
సంగీతం: సాయి కార్తీక్‌, ఛాయాగ్రహణం: ప్రవీణ్అనుమోలు
బ్యానర్‌: సుకుమార్రైటింగ్స్, ప్లేబ్యాక్ పిక్చర్స్  
నిర్మాతలు: బి.ఎన్‌.సి.ఎస్‌.పి. విజయ కుమార్, థామస్రెడ్డి ఆడూరి, రవిచంద్ర సత్తి
విడుదల : 4 జులై, 2017
***
        సు
కుమార్ రైటింగ్స్ ఇంకొకటి వచ్చింది. రోమాంటిక్ రైటింగ్స్ కి అలవాటు పడిన కలం ఈసారి రాయకుండా రోమాంటిక్ డ్రామా తీసింది. క్యాంపులో స్టూడెంట్ హరిప్రసాద్ ని దర్శకుడుగా, దర్శకుడి పాత్రలో బంధువు అశోక్ బండ్రెడ్డి ని హీరోగా పరిచయం చేస్తూ  ‘దర్శకుడు’ సిద్ధం చేసింది. క్రితం వచ్చిన ‘కుమారి 21 ఎఫ్’ రైటింగ్స్ కీ, రైటింగ్ ని అవుట్ సోర్స్ చేసిన ‘దర్శకుడు’ కీ చాలా తేడా వుంది. అదేమిటో చూద్దాం...

 కథ 
        చిన్నప్పట్నించీ తండ్రి ప్రోత్సాహంతో సినిమా దర్శకుడవాలని దర్శకత్వ శాఖలో చేరతాడు మహేష్ (అశోక్). రెండేళ్లకే ఓ నిర్మాతకి కథ విన్పించి ఓకే చేయించుకుంటాడు. అయితే కథలో ప్రేమ ట్రాకు బలంగా లేదని, దాన్ని సరి చేస్తేనే తీస్తానని నిర్మాత పదిహేను రోజులు గడువు పెడతాడు. తనకి  ప్రేమలో అనుభవముందా అని కూడా అడుగుతాడు. దీంతో మహేష్  ప్రేమ ట్రాకు గురించి ఆలోచిస్తూ తన వూరు వెళ్తాడు. తిరుగు ప్రయాణంలో వైజాగ్ నుంచి హైదరాబాద్ వస్తున్న నమ్రత (ఈషా) అనే ఫ్యాషన్ డిజైనర్ పరిచయమవుతుంది. ఈ ప్రయాణం కొన్ని అవాంతరాలతో, అపదలతో రకరకాలుగా సాగుతుంది. అతను సినిమా దర్శకుడని తెలుసుకున్న ఆమె సినిమాల్లో చూపించేవన్నీ అబద్ధాలని వాదిస్తుంది. ఈమెతో ఈ అనుభవాలు తన కథకి పనికొస్తాయని ఆలోచిస్తూంటాడతను. ఈ క్రమంలో తనతో ప్రేమలో పడిందని గ్రహిస్తాడు. అ ప్రేమని ఆమె వ్యక్తం చెయ్యదు. హైదరాబాద్ చేరాక అతడికి సినిమాలే తప్ప, తనమీద ప్రేమలేదని, తన ప్రేమని సినిమా కథకి వాడుకుంటున్నాడనీ తెలుసుకుని లెంపకాయ కొట్టి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అది వెండి తెర మీద చూడాలి.

ఎలావుంది కథ 
     సుకుమార్ రైటింగ్స్ నుంచి అవుట్ సోర్స్ కాంట్రాక్టు  పొందిన కొత్త దర్శకుడు అందరు కొత్త దర్శకులకి లాగే టెంప్లెట్ ప్రేమని కథగా చేశాడు. దీనికి సుకుమార్ రైటింగ్స్ అనే బ్రాండింగ్ లేకపోతే ప్రతీవారం వచ్చే చిన్నా చితకా రోమాంటిక్ కామెడీల్లో ఇదొకటిగా ఎవరికీ తెలిసేది కాదు. ఇందులో చూపిన ప్రేమకి కథా ప్రయోజనం లేదు సరే, వృత్తిపరంగా ఔత్సాహిక దర్శకులకి ఏమైనా నేర్పి కథా ప్రయోజనం సాధించిందీ లేదు. అదీ సమస్య. ఒకప్పటి కాలేజీల్లో టీనేజీ ప్రేమ కథలే ఇప్పుడు పాతికేళ్ళు దాటిన ప్రొఫెషనల్ పాత్రలకి పెట్టి తీసేస్తున్నారు. అన్ని రోగాలకీ ఒకటే జిందా తిలిస్మాత్ లాగా, అన్ని ప్రేమలకీ ఒకటే అచ్చిబుచ్చి టీనేజి ప్రేమ కథలు. ఈ చూపిస్తున్న ప్రొఫెషనల్స్ ప్రేమల తీరు, మాటల తీరు, ప్రవర్తనల తీరూ, అలకలూ వియోగాల బాధ అంతాకూడా అపరిపక్వ-   ఇన్ఫాచ్యుయేషన్ బాపతు టీనేజి మనస్తత్వాలే. చాలా నాన్సెన్స్ ఇది. సుకుమార్ రైటింగ్స్ కూడా దీనికే పూనుకోవడం వింత. ఈ చూపిస్తున్న ఏనాటివో కాలం తీరిన మూస టెంప్లెట్ ప్రేమలకంటే, టాలీవుడ్ బయట యూత్ తీస్తున్న షార్ట్ ఫిలిమ్స్ ఎంతో బెటర్. ఇప్పుడు టీనేజీ ప్రేమలైనా ఎలావుంటున్నాయో వాస్తవికంగా చూపిస్తున్నారు. దీంతో వూరూవాడా యూత్ వీటికి కనెక్ట్ అయిపోయి టాలీవుడ్ రోమాంటిక్ కామెడీల వైపే  కన్నెత్తి చూడ్డం లేదు. ఎప్పుడో ఒకటీ అరా బ్రాండింగ్ తో వస్తే మొక్కుబడిగా చూస్తున్నారు. ఒకప్పుడు కుటుంబ సినిమాలకి టీవీ సీరియల్స్ దెబ్బకొట్టి ఫ్యామిలీ ఆడియెన్స్ ని దూరం చేసినట్టు, టాలీవుడ్ రోమాంటిక్ కామెడీలకి షార్ట్ ఫిలిమ్స్ పోటీగా తయారై సినిమాలకి యూత్ డుమ్మాకొడుతున్నారని గమనిస్తే మంచిది.

ఎవరెలా చేశారు 
      కొత్త వాడు కాబట్టి అశోక్ కి ఇంకాస్త సమయమివ్వాలి. కానీ ముందుగా అతను ఏం చేస్తే ముఖభావాలు కనీస స్థాయిలో పలికించగలడో తెలుసుకుని ఆ ప్రయత్నం చేయాలి. అవసరమైతే ప్లాస్టిక్ సర్జరీ కూడా. ముఖభావాలే పలకని, అన్నిటికీ ఒకటే ఫేసుపెట్టే స్టాటిక్ ఎక్స్ ప్రెషనిస్టు యువహీరో ఆల్రెడీ వున్నాడు. ఇంకా స్ట్రగుల్ చేస్తున్నాడు. అశోక్ కి అశోకవనం కాకూడదు టాలీవుడ్. 

          పాత్ర విషయానికొస్తే, గోల్ అనేది సినిమాల కోసమే పెట్టుకున్నాడు. బావుంది. ఆ సినిమా కథలో ప్రేమ బాగాలేదన్నాడు నిర్మాత. ప్రేమలో అనుభవం లేదా అని కూడా చెత్త ప్రశ్న వేశాడు. అశోక్ పాత్ర గనుక మర్డర్ మిస్టరీ చెప్తే, మర్డర్స్ లో అనుభవం లేదా, వెళ్లి మర్డర్ చేసిరా అంటాడేమో. సరే, ప్రేమలో అనుభవంకోసం కాకపోయినా, ప్రేమలో పడేందుకే దర్శకుడు హరిప్రసాద్ తనని వూరు పంపాడు. అక్కడ ఫ్యాషన్ డిజైనర్ పరిచయమైంది. ఆమెతో ట్రావెల్ చేస్తున్నప్పుడు ప్రేమంటే ఎలావుంటుందో అనుభవమయ్యింది. ఈ బాపతు ప్రేమ రెండు టాలీవుడ్ టెంప్లెట్ రోమాన్సులు  చూసేస్తే తెలిసిపోతుంది- వేరేగా అనుభవం అవసరం లేదు. మిత్రుడు (సుదర్శన్ రెడ్డి) నయం. ఏవేవో రోమాంటిక్ సినిమాలు చూసి ఐడియా లిస్తూంటాడు. అంతకంటే తక్కువరకం ప్రేమానుభవం పొందుతున్నాడు తను. అయితే ఈ ప్రేమలో తను పడడమే పాత్ర వృత్తితత్వాన్ని దెబ్బ తీసింది. దర్శకుడుగా కథకోసం ఆమెని స్టడీ చేయాల్సింది పోయి ప్రేమలో పడిపోయాడు. ఈ ప్రేమ ట్రావెల్ లో కథకోసం రీసెర్చి ఎలా చేస్తారో, ఎలాటి చిక్కుల్లో పడతారో చూపించే అవకాశాన్ని కోల్పోయాడు. ఎందుకంటే, పాత్ర వృత్తి నుంచి విడిపోయి ప్రేమ ఒక్కటే అనుకుంది. 

          సాధారణంగా ఇలాటి సందర్భాల్లో ఏం జరుగుతుందంటే, ఇలా ప్రేమలో పడిపోతే గోల్ ని మర్చిపోతుంది పాత్ర. ఆ ప్రేమలో దెబ్బ తిన్నాకే బుద్ధి తెచ్చుకుని  మళ్ళీ గోల్ వైపు మళ్ళుతుంది. అశోక్ పాత్ర ఈ పని చేసి డెప్త్ తీసుకురాలేదు, పోనీ ప్రేమలో పడకుండా ప్రేమని స్టడీ చేయలేదు. ప్రేమా కావాలి, ప్రొఫెషన్ కూడా కావాలీ అనుకున్నాడు. ఇది ఇమ్మెచ్యూర్ పాత్ర లక్షణం. హీరోకి కాక ఇతర పాత్రలకి వుండొచ్చు ఈ స్పష్టత లేని లక్ష్యం. ఎదురుగా ప్రేమించిన హీరోయిన్ వున్నప్పుడు ఆమెతోనే వుండాలి సంఘర్షణ. తనలో రెండు కోరికలు పెట్టుకుని వాటితో కాదు. 

        ఈ కథ ప్రేమ గురించా, దర్శకుడిగా ప్రొఫెషన్ గురించా? ఇక్కడ కూడా తప్పులో కాలేయడం
వల్ల ప్రేమే కథని మింగేసి, దర్శకుడి పాత్ర చిత్రణకి గ్రహణం పట్టించింది. పాత్రకి వృత్తితత్త్వంతో కూడిన అద్భుత రసమే ప్రధాన రసంగా వుండి,  చెరో పక్క రెండు అంగాలుగా శృంగార, హాస్య రసాలు పలకాల్సింది. ‘ముత్యాలముగ్గు’ వియోగ కథని అద్భుత రస ప్రధానంగా ఎందుకు తీశారో అర్ధం చేసుకోవాలి. ఇక్కడ దర్శకుదు అద్భుత రస ప్రధానంగా నడకపోవడంవల్ల,  పాత్ర గందరగోళంలో పడిపోయి ముగింపు కొచ్చేసరికి, తన షరతుల మీద ఆమెని చేపట్టడం కాక,  పాసివ్ క్యారక్టర్ గా మారిపోతూ వచ్చి, హీరోయిన్ అచ్చిబుచ్చి కబుర్లకి పడిపోయి శుభం వేశాడు. 

          ఇక హీరోయిన్ ఈషా మంచి నటి. భావప్రకటనా సామర్ధ్యం బాగా వుంది. ఆమె రొటీన్ కమర్షియల్ సినిమాల జోలికి పోకుండా ఈ తరహా సినిమాలకి పరిమితమైతే ఎక్కువ కాలం వుండగల్గుతుంది. పాత్రకి వచ్చేసరికి,  కనీసం పాతికేళ్ళ వయసున్న ప్రొఫెషనల్ తను. పైగా ఫ్యాషన్ డిజైనర్.  కానీ హీరో దర్శకుడని తెలిశాక, మరీ టీనేజీ పిల్లల చేష్టలు పోతూ – తనకి  సినిమాలంటే ఇష్టముండదనీ, అన్నీ అబద్ధాలే చూపిస్తారనీ,  ఇంకా ఏదేదో అంత సిల్లీగా ఎలా మాటాడి గిల్లి కజ్జాలు పెట్టుకుంటుంది. ఇద్దరిదీ ఒకే రంగమైనప్పుడు ప్రొఫెషనల్ గా అతడితో వెంటనే కనెక్ట్ అయిపోవాలి. అతడితో కలిసి పనిచేసే దృష్టితో మెచ్యూర్డ్ గా మాటాడాలి.  అతనెప్పుడో సెకండాఫ్ లో పిలిచి పనిలో పెట్టుకుంటే కాదు. తనతో సాన్నిహిత్యంలో అతను  కథని వెతుక్కుంటే తప్పేముంది? కళాకారులకి ఇది తప్పదు కదా, ఆమెకీ తప్పదు. అతను కథనే చూస్తాడు, కథనే చూసినా తను ప్రేమనే చూడవచ్చు. తను ప్రేమకి ప్రతినిధి అయితే, అతను కళకి  అయినప్పడు,  బలాబలాల సమీకరణ గీతగీసి స్పష్టంగా కనపడుతుంది కదా? అతను  కథనే చూశాడనీ, ప్రేమించలేదనీ, ఏ ఎమోషన్సూ లేవనీ  లెంపకాయ కొట్టి ఎలా వెళ్ళిపోతుంది. ఇది ఇమ్మెచ్యూరే కాదు, ప్రిమెచ్యూర్ కూడా. ముందు అతడితో ప్రొఫెషనల్ గా స్థిరపడాలి, ఆ తర్వాతే ప్రేమ గొడవలు లేవనెత్తుకోవాలి. అప్పుడది కథనం అవుతుంది. అతను ఆమెతో అయిన అనుభవాలే సీన్లుగా తీస్తూంటే, ఒక చోట షూటింగు చూసి, ‘నీయబ్బ ఈ సిను ఇంటర్వెల్లో వాడేశాడా!’ అని ఉడుక్కుంటుంది. టోటల్లీ నాన్సెన్స్. అతడి సినిమాకి తను స్ఫూర్తి అయితే మంచి విషయమే కదా? ఏ పల్లెటూరి పిల్లయినా ఎగిరి గంతేస్తుంది. 

          అతను కూడా సినిమా తీసి. నిర్మాతతో సమస్య వచ్చి పేరేసుకోకుండా ఎటో వెళ్లి పోవడం బాగానే వుంది కానీ, ఆ సినిమా కథకి  స్ఫూర్తి అయిన హీరోయిన్ ని తెర మీద పరోక్షంగానైనా ప్రస్తావించకుండా ఎలా వెళ్ళిపోతాడు. అద్భుత రసం ప్రధానంగా పాత్ర కొనసాగుతూ వుంటే ఈ పనే చేసి వెళ్ళిపోయేవాడు. ప్పుడు అన్ని శంకలూ తీరి ఆమే తన దగ్గరికి వచ్చేసేది. ఇలాకాక, నేనింత ప్రేమించాను, అంత ప్రేమించానూ అని ఎన్ని చెప్పుకుంటే ఏం లాభం.  సినిమానే ఆమెకి అంకితమిచ్చి పారేస్తే అంతకంటే ఏది బలపరుస్తుంది తన ప్రేమని. 

          ఫ్రెండ్ పాత్రలో కమెడియన్ సుదర్శన్ రెడ్డి డీసెంట్ గా నటించాడు. నిర్మాతా,  ఆయన కో డైరెక్టర్ పాత్ర ధారులిద్దరూ బావున్నారు. కానీ నిర్మాత ఫస్టాఫ్ లో రెండు సినిమాలు తీసి నష్టపోయానంటాడు. మళ్ళీ ఫస్టాఫ్ లో ఆస్తులన్నీ అమ్మి ఈ సినిమా తీస్తున్నా, పోయిందంటే కుటుంబం సహా  రోడ్డున పడతానంటాడు. ముగింపులో మళ్ళీ,  ముందు తీసిన రెండు సినిమాలకి డబ్బులొచ్చాయంటాడు. ఏది నమ్మాలి? అంత పెద్ద హైఫై నిర్మాత కోటి రూపాయల సినిమాకే రోడ్డున పడతాడా. సుకుమార్ రైటింగ్స్ కి ఇలాటి అవగాహన వుంటుందనుకోలేం.  

          ప్రొడక్షన్ విలువలు చాలా బావున్నాయి. ఆర్ట్ డైరెక్షన్ వున్నట్టు తెలీకుండా తీసిన ట్రెండీ లుక్ బావుంది. కెమెరా వర్క్ స్ఫటిక స్వచ్ఛతతో వుంది. పాటలుకూడా హుషారుగా వున్నాయి. అవుట్ డోర్ లొకేషన్స్  కథకున్న ఫీల్ కి పట్టం గట్టాయి. రాతపని బలహీనంగా వున్నా, నటనల్ని రాబట్టుకునే, దృశ్యాల్ని చిత్రీ కరించే దర్శకత్వపు పనులు చక్కగా వున్నాయి. 

చివరికేమిటి 
         ప్రధాన పాత్రకి సరైన అస్త్ర శస్త్రా లుంటే స్క్రీన్ ప్లే సరీగ్గా వుంటుంది. ప్రధాన పాత్ర తప్ప  దర్శకుడు లేదా రచయిత ఏం చేసీ స్క్రీన్ ప్లేని ఏర్పరచలేరు. ప్రధాన పాత్రని సృష్టించాక కథ కథకుడి చేతిలో వుండదు. అతను ఇష్టారాజ్యం గా పాత్రని క్యాట్ వాక్ చేయించుకుంటూ వెళ్ళలేడు. పాత్ర వెంటే కథకుడు వెళ్ళాలి. ఇలా జరక్కపోవడం వల్ల, ప్లాట్ పాయింట్స్ ఎక్కడ ఏర్పడ్డాయో తెలియనంత అస్పష్ట అష్టావక్ర చట్రం ఈ ప్రేమ సినిమాలో ఏర్పడింది. అంక విభజన అదృశ్యమై గాథ స్టయిల్లో ఆర్గ్యుమెంట్ లేని ఉత్త స్టేట్ మెంట్ చందాన మిగిలింది. టెంప్లెట్ నుంచి బయటికి రాకపోతే,  ప్రేమ సినిమాలు ఏవో పెద్ద బ్యానర్లు వాటి హంగులతో తప్పితే, మిగతావి హంగులూ లేక, కథా కాకరకాయా సరైన స్ట్రక్చర్ లో లేకా చప్పగా తేలిపోతాయి.

-సికిందర్
Cinemabazaar.in











4, ఆగస్టు 2017, శుక్రవారం

491 : రివ్యూ!

రచన- దర్శకత్వం : కృష్ణవంశీ 
తారాగణం : సందీప్ కిషన్, సాయిధరమ్ తేజ్, తనీష్, రేజీనా కాసాండ్రా, ప్రగ్యా జైస్వాల్, శ్రియా శరణ్, ప్రకాష్ రాజ్, జేడీ చక్రవర్తి, వీవా హర్ష, రఘుబాబు, శివాజీ  రాజా, బ్రహ్మాజీ తదితరులు
సంగీతం : భీఎమ్స్ , భరత్ మధుసూదన్, హరిగోరా, మణిశర్మ, ఛాయాగ్రహణం : శ్రీకాంత్ నరోజ్
బ్యానర్ : శ్రీ చక్ర మీడియా, బుట్ట బొమ్మ క్రియేషన్స్, విన్ విన్ విన్ క్రియేషన్స్
నిర్మాతలు  : ఎస్ వేణుగోపాల్, సజ్జు
విడుదల : ఆగస్టు 4. 2017
***
     ‘నక్షత్రం’ విడుదల సందర్భంగా ప్రతీ సినిమా తనకో పాఠమని చెప్పుకున్న సీనియర్ దర్శకుడు కృష్ణ వంశీ, నేర్చుకోవడానికి ఇంకా పాత పాఠమే మిగిలివుంది.  గత రెండు సినిమాలప్పుడే నేర్చుకోవాల్సిన   పాఠాల్ని నిర్లక్ష్యం చేసిన ఫలితంగా ‘నక్షత్రం’ ప్రత్యక్షమైంది. చాలా నవ్వొచ్చే విషయం. ఇప్పుడాయన ‘నక్షత్రం’ నుంచి ఏం పాఠం నేర్చుకున్నారో చెప్పగలరేమో చూడాలి. ఒకవేళ తెలుగు సినిమాల కంటూ తనే ఒక కొత్త పాఠాన్ని ఇతరులకి నేర్పాలనుకుంటున్నారేమో తెలీదు. సినిమాలు రెగ్యులర్ గా అలాగే ఎందుకుండాలి, ఇర్రెగ్యులర్ గా ఇలా ఎందుకు ఇరగ దీయకూడదని ఉద్దేశపూర్వకంగానే ‘మొగుడు’, ‘పైసా’, తర్వాత ఇప్పుడు ‘నక్షత్రం’ తీసి పారేస్తున్నారా ఒకవేళ, ఈసారి ఏకంగా 12 కోట్లని ప్రమాదంలోకి నెడుతూ? 

     సందీప్ కిషన్, సాయి ధరమ్ తేజ్, తనీష్, రేజీనా కసాండ్రా, ప్రగ్యా జైస్వాల్, ప్రకాష్ రాజ్ పేర్లతోనే ఇంత ప్రకాశించిపోతున్న ‘నక్షత్రం’ నఖశిఖపర్యంతం నగుబాటుపాలు కావడానికి కారణాలేమిటో ఈ కింద చూద్దాం. 

కథ
       రామారావ్ (సందీప్ కిషన్) తన తాతా తండ్రుల్లాగే పోలీసుద్యోగం చేయాలనుకుంటాడు. చదువు సరీగ్గా లేక (చిన్న చిన్న ఇంగ్లీషు ముక్కలు కూడా రావు) ఎస్సై పోస్టుకి ప్రతీసారీ రాత పరీక్ష తప్పుతూంటాడు. ఓ తల్లి (తులసి) వుంటుంది. ఇంకో  పోలీసు అయిన మావయ్య (శివాజీరాజా) వుంటాడు. అతడి కూతురు  జమున (రేజీనా) సినిమాల్లో కొరియో గ్రాఫర్ (వైవా హర్ష) కి అసిస్టెంట్ గా వుంటుంది.  ఇంకో ఘరానా దొంగ కిరణ్ రెడ్డి ( ప్రగ్యా) వుంటుంది. ఓ పోలీస్ కమీషనర్ గా రామబ్రహ్మం (ప్రకాష్ రాజ్) వుంటాడు. ఇతడికో  కొడుకు మత్తుబానిస అయిన రాహుల్ (తనీష్)  వుంటాడు. ఈ రాహుల్ రామారావ్ వల్ల ఓసారి అవమానపడి  అవకాశం కోసం చూస్తూంటాడు. మరోసారి రామారావ్ రాతపరీక్ష పాసవుతాడు. ఇక ఇతర పరీక్షలకి వెళ్తున్నప్పుడు రాహుల్ అడ్డుకుంటాడు. ఆ పరీక్షలకి వెళ్ళలేకపోయిన రామారావ్, మావయ్య మాటలతో పోలీసుకాని పోలీసు అవుతాడు. ఓ పోలీసు యూనిఫాం వేసుకుని తిరుగుతూంటాడు. ఇది చూసి కిరణ్ రెడ్డి అతణ్ణి పట్టుకుని కమీషనర్ రామబ్రహ్మం ముందు ప్రవేశపెడుతుంది. ఈ యూనిఫాం ఎక్కడిదని రామబ్రహ్మం ఇంటరాగేషన్ చేస్తాడు. ఆ యూనిఫాం కనిపించకుండా పోయిన పోలీసాఫీసర్ అలెగ్జాండర్ (సాయి ధరం తేజ్) ది. ఐతే నగరంలో జరిగిన బాంబు పేలుళ్ళ కేసు దర్యాప్తుకి నియమితుడైన అతను ఏమైపోయాడు? ఆ శత్రువులెవరు? దీన్ని రామారావ్ ఎలా పరిష్కరించాడు?...ఇదీ మిగిలిన కథ (?)

ఎలావుంది కథ 
      కథే లేదు. ఏవేవో పోగేసిన గాలి విషయా లున్నాయి. ప్రారంభంలో నగరంలో బాంబు పేలుళ్లు చూపించినప్పుడే ఈ సినిమాకి కాలీన స్పృహ బొత్తిగా లేదని, బద్దకించి అవుట్ డేటెడ్ విషయం చూపిస్తున్నారని, ఏ పాటి రీసెర్చ్ చేశారో తెలిసిపోతోందనీ మనకి అన్పిస్తుంది. మార్కెట్ స్పృహ, క్రియేటివ్ స్పృహా లేకుండా అందరి సమయమూ వృధా చేశారని తోస్తుంది. కనీసం ఓ నాల్గేళ్ళుగా దేశంలో టెర్రర్ దాడులు జరగడం లేదు. టెర్రరిజం కాశ్మీర్ కి పరిమితమయ్యింది. టెర్రరిస్టుల ఎజెండాలు మారిపోయాయి. పాక్ సహా కాశ్మీర్ లో కరుడుగట్టిన వహాబీ ఇస్లాంని స్థాపించాలని చూస్తున్నారు. భారత్- పాక్ లలో వున్నది లిబరల్ సూఫీ ఇస్లాం. ఈ సినిమాలో విషయం ఇంకా ఏనాటిదో గోకుల్ చాట్  పేలుళ్ళ దగ్గరే తిష్ట వేసుకుని వుంది. ఇది చాలనట్టు తర్వాత్తర్వాత మరో రెండు పేలుళ్లు కూడా అలాగే చూపిస్తారు. దీంతోబాటు అక్రమాయుధాల దందా, డ్రగ్స్ స్మగ్లింగ్, బాలల అక్రమరవాణా, దేశభక్తీ  వగైరా వగైరా బోలెడు పాయింట్లతో ఏకసూత్రత అనే కనీస లక్షణాన్నే వదిలేసి, ఏం చెప్తున్నారో అర్ధంగాని పెద్ద గందరగోళాన్నే  సృష్టించారు. కథే లేనప్పుడు కథా ప్రయోజనమూ, సినిమా ప్రయోజనమూ ఏవీ లేవు. 

ఎవరెలా చేశారు
      ఎవరూ  బాగా చేయలేదు. చేసింది నటన అనుకుంటే ఇంతకంటే  నటనకి పట్టిన దుర్గతి వుండదు. ప్రతీ ఒక్కరూ అరిచి లౌడ్ గా మాట్లా
డతారు. బి గ్రేడ్, సి గ్రేడ్ సినిమాల్లో కూడా ఇలావుండదు. కానీ కృష్ణవంశీ కిలాదబాయించి, అరిచి గోలగోలగా  మాటాడితే తప్ప అది
నటన 
లా అన్పించదు. సినిమా మొదలయ్యింది లగా యత్తూ  చివరి షాటు వరకూ, రెండు గంటలా 47 నిమిషాలూ,  ఎవరో రాజకీయ నాయకులు  మైకులు పెట్టి ఒకటే  అరుస్తున్నట్టు వుంటుంది డైలాగులమీద డైలాగుల మోత. దీనికి తోడూ దాదాపు ప్రతీ ఆల్టర్నేట్ సీనులో ఇరవయ్యేసి, ముప్పయ్యేసి మంది గుంపులు గుంపులుగా జనం వుంటారు. ఎక్కడా కాస్త  రిలీఫ్ అనేదే వుండదు. నరాలమీద భరించలేని సమ్మెట పోట్లు. కృష్ణవంశీ దృశ్య, శబ్ద కళల కి జోహార్లు అర్పించాలి. 

     సందీప్ కిషన్ రామారావ్ పాత్ర ఏం చేయాలో కొలిక్కి రావడానికే ఫస్టాఫ్ గంటంపావంతా పట్టింది. ఇక్కడ బాంబు పట్టుకుని చావబోవడం, ముగింపులో మళ్ళీ విలన్ కట్టిన బాంబులతో మానవ బాంబుగా మారి రక్షించమని గగ్గోలు పెట్టడం అనేది హీరోగారి పాత్రచిత్రణ. సెకండాఫ్ గంటన్నరలో దాదాపు గంట వరకూ  తనెక్కడున్నాడో  మర్చిపోతాం- సుదీర్ఘంగా సాయి ధరమ్  ఫ్లాష్ బ్యాక్, అందులో విలన్ కట్టిన బాంబులతో ఎంతకీ ముగియని అతడి చావు తతంగమూ ఇవే ఆక్రమిస్తాయి. ఇదొక చేతకాని పాత్ర.

     పై రెండు పాత మూస ఫార్ములా పాత్రల్లాగే ప్రగ్యా జైస్వాల్ దొంగగా వుంటూ పోలీసుగా బయటపడడం ఇంకో పురాతన –పురావస్తు శాలలోంచి వొళ్ళు దులుపుకుని బయటికొచ్చిన  అయోమయపు పాత్ర. అన్నీ పాత సినిమా మూస పాత్రలే, ఈ కాలపు సహజ పాత్రలు కానరావు. రేజీనా అంగాంగ ప్రదర్శనా వైభవమే నటన అనుకుని చాలా పాటు పడింది పాపం ఆ కళలో. ఏమీ చెయ్యని పాత్ర కూడా గొప్ప పాత్రే అనునుకుని వగలుపోయింది. 

      ఇక ప్రకాష్ రాజ్ అయితే అందరి కంటే పెద్ద లౌడ్ స్పీకర్. దేశం గురించి, పోలీసుల  గురించి, ప్రజల గురించీ చెవులు పగిలేలా  అన్నన్ని భీకర  కేకలు వేసే తన ఇంట్లోనే రేపిస్టు, డ్రగ్గిస్టు, శాడిస్టు, సైకో కిల్లర్, మాఫియా, స్మగ్లర్, టెర్రరిస్టుల తొత్తూ అయిన కొడుకు వున్నాడని, బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లోలాగా ముగింపు సీను వరకూ తెలుసుకునే పాపాన పోడు. ఇలా వుంది ఈ పాత్ర చిత్రణ కూడా ఈ రోజుల్లో. 

     తులసి, శివాజీరాజాలది చీప్ గోల కామెడీ.  బొత్తిగా సున్నితత్వం లేని తోలు మందం  వ్యవహారం. సాంకేతికంగా చూసినా కూడా చాలా దిగదుడుపు.  కెమెరావర్క్ మరీ చీప్ గా వుంది ఏకత్వం కూడా లేకుండా. సంగీతమూ డిటో. ప్రతీ రెండో సీనూ పరమ హింసాత్మకంగా వుంటుంది. మాటాడితే పోరాటాలకి దిగుతారు. ఒకటే కొట్టుకుంటారు. దాదాపు ముప్పాతిక సినిమా ఫైట్ మాస్టర్ల పనే అన్నట్టు వుంటుంది. దర్శకుడి పనేమిటో అర్ధంగాదు. కిందటి శతాబ్దంలో తమిళ డబ్బింగ్ యాక్షన్ సినిమా లొచ్చేవి – కుక్కలు గుర్రాలూ కౌబాయ్ ల ఎడతెరిపి లేని ఫైట్లతో. కృష్ణవంశీ దీన్ని మళ్ళీ కళ్ళకి కట్టారు. 

చివరికేమిటి?  
       పోలీసులు గొప్పోళ్ళే . అందరికీ తెలిసిందే. అయితే ఏమిటి? ఎన్నిసార్లు అదే డబ్బాకొడతారు సినిమాల్లో? వూర మాస్ డైలాగులతో కృష్ణవంశీ లాంటి స్థాయి వున్న దర్శకుడు కూడా డబ్బా కొట్టమేమిటి- నీటుగా చేతలు చూపించకుండా?  ఈకాలపు సినిమా ఎందుకు తీయలేకపోయారు తను. పోలీసు హీరోకి హనుమంతుడి ఇమేజి ఇస్తే,  అతనేం చేశాడు రెండు సార్లూ- మెడకి బాంబులు తగిలించుకుని ఒకటే మొత్తుకు న్నాడు. వాయు
పుత్రుడి వ్యాపకం ఇదేనా? ఇంకో పెద్ద పోలీసాయనేమో ఏమీ చేయకుండా కూర్చుని అరుపులు అరుస్తూంటాడు. మరో యువపోలీసాఫీసర్ ఏదో చావడానికి కూడా అల్లరల్లరై,  బతికించమని బతిమాలుకుని మరీ చస్తాడు. వీళ్ళా పోలీసులు? అసలు చెప్పాలనుకున్న దేమిటి, ఏం చెప్పారు? ఏమీ చెప్పలేదు. ఎందుకంటే....

     కథే  చెప్పాలనుకుంటే ఇదంతా, ఇంత గందరగోళమంతా  వుండదు. చెప్పాలనుకున్నది ‘గాథ’  అయింది. లేదా చెబుతున్నది ‘గాథ’ అని తెలియక చెబుతూ కూర్చున్నారు. ‘మొగుడు’ తో గాథే  ఫ్లాప్ అయ్యింది. వెంటనే ‘పైసా’తో మళ్ళీ గాథే ఫ్లాపయ్యింది. ముచ్చటగా మూడోసారి, నక్షత్రమూ గాథే అయింది. నేర్చుకున్న పాఠమేమిటి? ముచ్చటగా మూడుసార్లు గాథలు తీసిన కృష్ణ వంశీ అని గోడ మీద వ్రాత. మూడు గాథలు- ఆరు వెతలు అని తలవ్రాత. 

     ‘గాథ’ తో అంతంత కమర్షియల్ సినిమాలెలా తీయడానికి సాహసిస్తారు. ‘గాథ’ గాబట్టే అంజనీపుత్రుడైన గాలి హీరోకి గోలీ మార్ గా గోల్ లేదు. పాసివ్ ఆట బంతి అయిపోయాడు. గోల్ లేకపోతే  స్ట్రక్చర్ వుండదు. కృష్ణవంశీ స్ట్రక్చర్ అని దేన్ని అనుకుంటున్నారో. స్ట్రక్చర్ ఏర్పడకపోతే ఏం చెప్తున్నారో అంతుపట్టదు. అనేక విషయాలు చొరబడి పోతాయి. ఇలా ఎటుపోవాలో అంతు పట్టక జీడిపాకంలా సాగుతూ సాగదీస్తూ మూడు గంటలకి చేరింది. హీరో చేయాల్సిన పనులన్నీ  ఎవరెవరో చేసేస్తున్నారు. ఇలా ఇంత జరిగాక, ఇప్పుడు  ‘నక్షత్రం’ తర్వాత కూడా గాథేతోనే ఇంకోటి తీస్తారా? గాథలతోనే కృష్ణవంశీ కాలక్షేపమా? ‘కథలు’ మర్చిపోయారా? లేక రెగ్యులర్ కథలు కాక, అందరికీ భిన్నంగా ఇర్రెగ్యులర్ గాథలతో మార్గదర్శి అవాలనా?

-సికిందర్
http://www.cinemabazaar.in

   

2, ఆగస్టు 2017, బుధవారం

490 : శ్రావణ - నోనో - ప్రేమల మాసం స్పెషల్!



        వారం కూడా ఒకటి రెండు కొత్త సబ్జెక్టులు  రాసుకుని చేసిన ఒకే రకం పొరపాట్లు హీరోకి గోల్ లేకపోవడం, మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే గా వుండడం.  ప్రేమ సినిమాల టెంప్లెట్ (అంటే అపార్ధం చేసుకుని విడిపోవడమో, లేదా ప్రేమని వెల్లడించలేక క్షోభ పడడమో ) ఏనాడో 2000 లలో చిన్నసినిమాలతో మొదలై – లైటర్ వీన్ లవ్ స్టోరీస్ అనే పేరు తగిలించుకుని- మిల్స్ అండ్ బూన్ నవలల్లాగా – టీనేజర్లకి ఉద్దేశించి- అదే టెంప్లెట్ తో అవే అచ్చి బుచ్చి ప్రేమ కథలతో దశాబ్దాలు మారినా అలాగే కొనసాగుతూ వచ్చీ వచ్చి, ఇప్పుడు పెద్ద సినిమాలకీ ఎగబ్రాకి ఇటీవల మజ్నూ, నిన్నుకోరి, ఫిదా లాంటివి రావడంతో- టెంప్లెట్ మరింత ఆకర్షణీయంగా కన్పించడం మొదలెట్టింది. దీంతో చిన్న సినిమాలకి తిరుగులేని సర్టిఫికేట్ దొరికిపోయినట్టు, రెట్టింపు ఉత్సాహంతో టెంప్లెట్ పెట్టుకుని రోమాంటిక్ కామెడీలకి సిద్ధమవుతున్నారు. టీనేజీ ప్రేమలు పెద్ద నటులే  నటించేస్తూంటే ఇక లేత పిండాలకి  అడ్డేముంది. 

          స్టార్స్ తో తీసే యాక్షన్ సినిమాలు వాటి టెంప్లెట్ తో ఈ ఏడాది మొత్తం ఆరుకి ఆరూ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఈ టెంప్లెట్ తో విసిగిన సీనియర్ రచయిత వేరే సొంతంగా రియలిస్టిక్ ని ప్లాన్ చేసుకుంటున్నారు. స్టార్ యాక్షన్ కి టెంప్లెట్ బెడద దాదాపు వదిలినట్టే. టెంప్లెట్ ని వదిలించుకున్న  మొదటి సినిమాగా గత వారం విడుదలైన ‘గౌతమ్ నందా’ ని చెప్పుకోవచ్చు. ఇక ఇప్పుడు ప్రేమ సినిమాలకి టెంప్లెట్ పీడా వదలాల్సి వుంది. అపార్ధం చేసుకుని విడిపోవడమో, లేదా ప్రేమని వెల్లడించడానికి గింజుకోవడమో లాంటి కృత్రిమత్వపు టెంప్లెట్  కథలతో నిన్నుకోరి, ఫిదా హిట్టయ్యాయంటే-  వాటికి బ్యానర్స్, స్టార్స్,  డైరెక్టర్స్ గ్లామర్ వుండడం వల్ల. అదే మజ్నూ కి ఈ వేల్యూస్ వున్నాపనిచెయ్యలేదు. ఈ వేల్యూస్ తీసేస్తే ఇవన్నీ వారం వారం విడుదలై అడ్రసులేకుండా పోతున్న చిన్నా చితకా  టీనేజీ  రోమాంటిక్ కామెడీలే విషయపరంగా.

          కాబట్టి నిన్నుకోరి, ఫిదా  హిట్టయ్యాయని అవే రెండు పాయింట్లతో (అపార్ధం చేసుకుని విడిపోవడమో, లేదా ప్రేమని వెల్లడించలేక కుమిలిపోవడమో), కొత్త వాళ్ళు,  కొత్త వాళ్ళతో బడ్జెట్ రోమాంటిక్ కామెడీలుగా  తీస్తే, వారం వారం ఏం జరుగుతోందో వీటికీ అదే జరుగక మానదు. ఇక్కడ పేర్లు అవసరంలేదు గానీ-  తయారు చేసుకున్నసబ్జెక్టులపై నమ్మకం కలగకరమ్మంటే వెళ్ళాక- తెలిసిందేమిటంటే హీరోకి గోల్ లేకపోవడం, దాంతో మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లేలు తయారవడం. టెంప్లెట్ ప్రేమల్లో ఇంతే, గోల్స్ వుండవు. గోల్స్ లేకుండానే టెంప్లెట్ ప్రేమలుంటున్నాయి. గోల్ అనేదే కథకి బేస్. చందమామ కథలకి కూడా. గోల్ లేకపోతే  స్ట్రక్చర్ వుండదు, స్ట్రక్చర్ లేకపోతే  మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అయిపోతుంది. పెద్ద బ్యానర్స్, స్టార్స్,  డైరెక్టర్స్ గ్లామర్స్ తో ఇవి కవరైపోవచ్చు. చిన్న సినిమాలకి స్ట్రక్చర్ లో వున్న ఆర్ధవంతమైన కథే రక్ష. ఎన్నో పెద్ద సినిమాలకి పనిచేసిన రచయితకి ఈ పొరపాటు అర్ధమయి,  గోల్ ని సెట్ చేయడానికి ఒప్పుకోవంతో  ఈ రోమాంటిక్ కామెడీకి  బలం, అర్ధంపర్ధమూ వచ్చి, టెంప్లెట్ వదిలిపోయి- సందేహాలన్నీ తీరిపోయి దర్శకుడు సహా టీం అంతా ఖుష్.  స్క్రిప్టుని అక్కడక్కడా మార్చడానికి ఇంకో పది రోజులు పట్టొచ్చు.

          ఇంకోచోట, ఇంటర్వెల్ ‘బ్యాంగ్’ లో ప్రేమని వెల్లడించలేక హీరో అదే టెంప్లెట్ లో జంప్ అవడం. ఇప్పుడు హీరో గోల్ ఏమనుకోవాలి? జంప్ అయ్యేవాడికి ఏం గోల్ వుంటుంది? ప్రేమలో వున్న యంగ్ హీరోపాత్ర,  సినిమా చూస్తున్న యూత్ ని మోటివేట్ చేసేట్టు వుండక, సమస్య వస్తే జంప్ అయిపోరా  అన్నట్టుంటే అదేం సినిమా? టెంప్లెట్ లవర్స్ కి ఇది తెలియడంలేదు. హీరోయిన్ కి లవ్ చెప్పేస్తే పోయేదేముంది బానిస టెంప్లెట్ తప్ప. ఎందుకు చెప్పలేడు? అదెంత సేపు? టెంప్లెట్ మొదలైన కాలంలో 2000 లోనంటే  సెల్ ఫోన్స్ లేవు, నెట్ వాడకం అంతగా లేదు. ఇప్పుడేమయ్యింది? ఒక మెసేజ్ కొట్టలేడా? ఇలా చేయడంలేదా యూత్? అనుకున్నది చేసెయ్యడం, ఎదుర్కోవాల్సింది తర్వాత చూసుకోవడమే ఇదే నేటి యూత్ తెగింపు. ఈ మానసిక లోకాన్ని చూపెట్టకుండా - ప్రేమని వెల్లడించలేని హీరో  సెకండాఫ్ అంతా లోలోన కుళ్ళి చావడమేమిటి? లవ్ చెప్పేస్తే తెగిస్తున్నట్టు, ఒక గోల్ వున్నట్టు, గోల్ తో స్ట్రక్చర్ వచ్చేసినట్టు, దాంతో చల్లారిన టెంప్లెట్ ఆమ్లెట్ వదిలిపోయినట్టు. ఇంటర్వెల్లో హీరో లవ్ చెప్పెసేట్టు చేశాక కథకి ఎంతో చైతన్యం వచ్చింది...

          ప్లాట్ పాయింట్ వన్ అన్నాక గోల్ ఏర్పడాల్సిందే. గోల్ కి యూత్ అప్పీల్ వుండాల్సిందే. దాంతో బాక్సాఫీసు అప్పీల్ రావాల్సిందే. అపార్ధం చేసుకుని విడిపోవడమో, ప్రేమని వెల్లడించలేక తన్నుకు చావడమో యూత్ అప్పీల్ ముమ్మాటికీ కాదు. ఈ మోటివేట్ చెయ్యని బలహీన టీనేజి ప్రేమలు,  స్టార్ సినిమాలకి వాటి హంగూ ఆర్భాటాలతోనైతే  చెల్లిపోవచ్చు.


-సికిందర్ 

28, జులై 2017, శుక్రవారం

489- రివ్యూ!




రచన- దర్శకత్వం: సంపత్నంది
తారాగణం: గోపీచంద్, హన్సిక, కేథరిన్, సచిన్ఖేడ్కర్, ముఖేష్రుషి, నికితన్ ధీర్, నికెళ్ళ ణి, చంద్రమోహన్, వెన్నెలకిషోర్ తదితరులు
సంగీతం: ఎస్‌.ఎస్‌.థమన్, ఛాయాగ్రహణం: సౌందర రాజన్
బ్యానర్ :
శ్రీ బాలాజీ సినీ మీడియా
నిర్మాతలు: జె.భగవాన్, జె.పుల్లారావు
విడుదల : జులై 28, 2018
***
      యా
క్షన్ హీరో గోపీచంద్ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేస్తూ, సంపత్ నంది దర్శకత్వంలో ‘గౌతం నందా’ గా తెరపైకొచ్చాడు చాలా కాలానికి. దీనికంటే ముందు బి. గోపాల్ దర్శకత్వంలో రావాల్సిన ‘ఆరడుగుల బుల్లెట్’  విడులవుతూ ఆగిపోయింది. రవితేజతో ‘బెంగాల్ టైగర్’  తీసిన సంపత్ నంది మళ్ళీ కూడదీసుకుని, భారీ సెంటిమెంటల్ యాక్షన్ థ్రిల్లర్ తో ఈ శుక్రవారం విచ్చేశాడు. ఇప్పుడు తెలుగులో కన్పించని హీరోయిన్ హన్సిక, ఎప్పుడో తెలుగులో కన్పించిన కేథరిన్ హీరోయిన్లుగా తమవంతు పాత్ర పోషించారు. మరోసారి తమన్ తన బాణీలు విన్పించి మెప్పించడానికి తయారయ్యాడు. ఐతే అత్యంత భారీ ఖర్చుతో అట్టహాసంగా తీసిన ఈ బిగ్ కమర్షియల్ లో  వున్న విషయమేమిటి, అదెంతవరకూ రాణించిందీ ఓసారి పరిశీలిద్దాం..

 కథ 
       అమెరికాలో మొదలవుతుంది. అక్కడ ఘట్టమనేని విష్ణు ప్రసాద్ (సచిన్ ఖెడేకర్) వ్యాపారంలో టాప్ 50 లిస్టులో ఫోర్బ్స్ పత్రిక కెక్కుతాడు. దీన్ని కొడుకు గౌతమ్ కూడా తన ఫ్రెండ్స్ తో కలిసి పబ్ లో సెలబ్రేట్ చేసుకుంటాడు. అత్యంత ధనికుడైన తను  డ్రగ్స్ మత్తులో మునిగితేలుతూ కష్టమంటే తెలియకుండా పెరిగాడు. పబ్ లో బేరర్ (తనికెళ్ళ భరణి) చేసిన చిన్న తప్పుకి పొగరుతో లెంపకాయ కొడతాడు. దీంతో  బేరర్ అనే ఒక మాట కళ్ళు తెరిపిస్తాయి- ఫోర్బ్స్ తో గుర్తింపు వచ్చింది మీనాన్నకి, నీకు కాదు. నువ్వెవరు? నేను బెరర్ని, వాడు క్లీనర్, నువ్వెవరు చెప్పుకోవడానికి?-   అని నిలదీస్తాడు బేరర్. దీంతో అంతర్మథనం మొదలవుతుంది గౌతమ్ కి. తానెవరో తెలుసుకోవడానికి కారెక్కి పిచ్చిగా ప్రయాణం కడతాడు. వద్దని గర్ల్ ఫ్రెండ్ ముగ్ధ (కేథరిన్) చెప్పినా వినకుండా వెళ్ళిపోతాడు. యాక్సిడెంట్ చేస్తాడు. కొద్దిలో చావు తప్పించుకుంటాడు నందా (గోపీచంద్ -2). ఇతనొచ్చింది ఆత్మహత్య చేసుకోవడానికే. అచ్చం తనలాగే వున్న ఇతడి కథ తెలుసుకుంటాడు గౌతమ్. హైదరాబాద్ బోరబండలో తన బండబారిన జీవితం చెప్పుకుంటాడు మాస్ నందా క్లాస్ గౌతంకి. అయితే మనం  స్థానాలు మార్చుకుందామని అతడింటికి గౌతమ్ వెళ్తాడు, గౌతం ఇంటికి నందా వెళ్లి సెటిలవుతాడు. గౌతం అక్కడ జీవితంలో తను పొందని నిజమైన భావోద్వేగాలెలా వుంటాయో చవిచూస్తూంటే, అక్కడ నందా వేరే పథకం వేస్తూ బిజీగా వుంటాడు. ఏమిటా పథకం, దాంతో ఏం చేశాడు, ఇద్దరూ ఏమయ్యారు, జీవితం గురించీ ఏం తెలుసుకున్నారు...అనేది మిగతా కథ. 

ఎలావుంది కథ 
      చాలా పరిచయమున్న పాత కథే. కొత్తదనం లేదు. ఒకేలా వుండే ఇద్దరు పరస్పరం స్థానాలు మార్చుకోవడం గురించి ఎన్నో సినిమాలొచ్చాయి. దీన్ని కొత్తబాట పట్టించింది హాలీవుడ్ ‘ఫేస్ ఆఫ్’ ... ‘గౌతంనందా’ లో స్థానాలు మార్చుకునే కథకి పాయింటు పక్కదారి పట్టినట్టు తేలుతుంది. దర్శకుడు కన్ఫ్యూజ్ అయ్యాడో, మనం కన్ఫ్యూజ్ అవుతున్నామో గానీ- చెప్పింది ఒకటైతే చేసింది  మరొకటిగా కథ నడుస్తుంది. నువ్వెవరు? అని తండ్రితో పోల్చి కొడుకుని ప్రశ్నించాడు బేరర్.  అప్పుడా కొడుకు తను ఎంజాయ్ చేస్తున్న తండ్రి సంపదని పౌరుషంతో త్యజించి,  సొంత కాళ్ళ మీద ఎదిగి తనకంటూ ఐడెంటిటీ సంపాదించుకోవడానికి సిద్ధమవుతాడని మనం ఆశిస్తాం. కానీ జరిగేది వేరు. తానెవరో తెలుసుకోవడానికి ప్రయాణం కడతాడు. నువ్వెవరు? అని ఇంకేదో అర్ధంలో అడగలేదు బేరర్. అలా అడిగితే నేను ఆత్మని అని తెలుసుకోవడానికి క్షణం పట్టదు. నీకేం ఐడెంటిటీ వుందని మాత్రమే  బేరర్ అడిగాడు. తనని చూపించుకుని బేరర్ని అని, ఇంకోడ్ని చూపించి వాడు క్లీనరనీ అన్నాడు. మరి గౌతం ఎవరు? అతడి పోర్టుఫోలియో ఏమిటి? ఇదీ పాయింటు. ఈ పాయింటు వేరే పాయింటుగా మారిపోయి పైన చెప్పినట్టు వేరే కథ నడుస్తుంది.  

ఎవరెలా చేశారు 
      ద్విపాత్రాభినయానికి వచ్చిన  ఈ అవకాశాన్ని గోపీచంద్ పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేశాడు- మనకూ ఎంజాయ్ మెంటు నిచ్చాడు. రెండో కంత్రీ పాత్రతో నవ్విస్తూ కూడా పోయాడు. మొదటి పాత్రకి ఇచ్చిన రిచ్ బిల్డప్, స్టయిలిష్ ఇమేజి మొదటి అరగంట సేపు ఒక ఫాంటసీలోకి ప్రయాణంలాగా మార్చేస్తాయి. తానెవరు? అన్న ప్రశ్న వేధిస్తూంటే కనబరచిన హావభావాలు, కన్నీటి ధారా బాగా కనెక్ట్ అవుతాయి ప్రేక్షకులకి. ఈ ప్రశ్నకి తాను వెతుక్కుంటున్న జవాబు వేరే అన్నది  వేరే సంగతి. నీ తండ్రి సంపద అనుభవిస్తూ దౌర్జన్యం చేస్తున్నావ్ సిగ్గులేదా- అన్నట్టే వున్న బేరర్ గోడు కాస్తా,  తన సొంత గోడు అయిపోవడమే క్యారక్టర్ ని ఫాలో కాకుండా చేస్తుంది ఆలోచనాపరులకి. నీ ఐడెంటిటీ ఏమిటీ అని బేరర్ అడిగితే- డబ్బున్న నాన్న తనకి ప్రేమని పంచలేదని, ప్రేమంటే ఏమిటో తెలియకుండా పోయిందనీ, ఆకలి ఎరుగని జీవితంవల్ల కష్టాలంటే ఏమిటో తెలియకుండా పోయాయనీ, తనకి ఏ ఎమోషనూ లేకుండా పోయాయనీ, ఎమోషన్స్ తెలుసుకోవడానికే ప్రయాణం కడుతున్నాననీ, తండ్రి మీదికి తప్పు నెట్టేసి పలాయనం చిత్తగించినట్టుంది పాత్ర!

          రెండో పాత్ర ఇంట్లో మకాం వేసి చేసేదంతా స్లమ్ జీవితాన్ని చవి చూస్తూ, బాధలెలా వుంటాయో  స్వయంగా తెలుసుకుని, అమ్మ చేతి  వంట, వడ్డనా  ఎలా వుంటాయో రుచి చూసి, చెల్లెలితోనూ  నాన్నతోనూ  సెంటిమెంట్లు ఎలావుంటాయో అనుభవించి తరించడమే. ఇదంతా పూర్తయి అమెరికాలో తన తండ్రి కంపెనీ బాధ్యతలు స్వీకరించే సమావేశంలో,  ఆ తండ్రి తనకి కేటాయించిన లక్షల కోట్ల షేర్స్ ని పేదవాళ్ళకి దానమిచ్చేసి గొప్పవాడై పోతాడు! 

          అప్పుడు మనకి తనికెళ్ళ గారి బేరర్ ఓ మూల నిల్చుని మొత్తుకుంటున్నట్టు మైండ్ లో బొమ్మ తిరుగుతుంది – ‘ఓరి పిచ్చినాన్నా!  నే చెప్పింది నీ తండ్రి సొమ్ము నువ్వు దానం చేసి న్యూస్ కెక్కాలని కాదురా, ఆటోగ్రాఫులు ఇవ్వాలని కాదురా, నువ్వో రూపాయి సంపాయించి చూపించమనే!’ అని.

       ఇప్పుడా తండ్రి అనుకుంటాడు- ఫోర్బ్స్ కెక్కిన నేను గొప్పా, వీడు గొప్పా అని. ఇద్దరూ గొప్పే. డబ్బు గడించినవాడూ గొప్పే, దానమిచ్చేవాడూ గొప్పే, కాకపోతే దానమిచ్చేవాడు సొంత సొత్తు లోంచి ఇచ్చుకోవాలి. 

          సారీ సంపత్ నందీ, ఈసారి మీరు చాలా కన్ఫ్యూజ్ చేసేశారు.  వర్కౌట్ కాదు.
          హన్సిక, కేథరిన్ లు గ్లామర్ బొమ్మ పాత్రలకి సరిపోయారు. ముఖేష్ రిషీ విలనీ రొటీనే. ఇద్దరు కమెడియన్లున్నా ఆ కామెడీ సాదాగానే వుంది. ప్రొడక్షన్ విలువలుమాత్రం అత్యంత భారీతనంతో వున్నాయి. హీరో రిచ్ నెస్ గురించి తీసిన దృశ్యాలు ఫాంటసీ చూస్తున్నట్టున్నాయి. ఇది కరెక్ట్ గా వర్కౌట్ చేసిన డైనమిక్స్. ఈ అమెరికన్ లైఫ్  తర్వాత బొరబండ స్లమ్స్ కి కథ వచ్చినప్పుడు తేడా కొట్టొచ్చినట్టు కన్పిస్తుంది. ఈ డైనమిక్సే ‘కాబిల్’ లో హీరోయిన్ పాత్రతో చేసి సక్సెస్ అయ్యాడు సంజయ్ గుప్తా. ఇక యాక్షన్ సీన్స్, పాటల చిత్రీకరణా వగైరా అంతా టాప్ క్లాస్. థమన్ నేపధ్య సంగీతం కూడా బాగా రాణించింది. డైలాగ్స్ బలంగానే వున్నాయి- పక్కదారి పట్టిన పాయింటుకి న్యాయం చేస్తూ. కానీ తండ్రి పాత్రలో చంద్రమోహన్ – నేను మూడు పూటలా మందులు ఎందుకు వేసుకోవడంలేదో తెలుసా?  వేసుకుంటే మీ ముగ్గిరికీ భోజనం వుండదని - అనడం మాత్రం అభ్యంతరకరంగా వుంటుంది. 

చివరికేమిటి 
      కథ రొటీనే అయినా ఇది టెంప్లెట్ లో లేకపోవడం చాలా పెద్ద రిలీఫ్. ఎలాటి ఓపెనింగ్ బ్యాంగులు లేకుండా కథకి పనికొచ్చే విషయంతో నేరుగా ప్రారంభమవుతుంది. గౌతం పాత్రనే పట్టుకుని పోతుంది. ఇరవై ఐదో నిమిషంలో నందా పాత్ర తగలడంతో మొదటి మలుపు వస్తుంది. అక్కడ్నించీ ఇరవై ఐదు నిమిషాలు నందా ఫ్లాష్ బ్యాక్. ముఖేష్ రిషీ విలనీ,  నందా మీద హత్యా ప్రయత్నం...ఇలా ఫస్టాఫ్ అంతా చకచకా సాగిపోతుంది. సెకండాఫ్ సెంటిమెంట్ల బరుఫుకింద కుయ్యో మంటుంది  మొదటి అరగంటకి పైగా. చివరి అరగంట రెండు పాత్రల అమీతుమీతో యాక్షన్లో కొస్తుంది. 

          తనికెళ్ళ భరణి ఎందుకు పీకారోగానీ,  ఆ పీకిన క్లాసు యూత్ అప్పీల్ వుండే పాయింటుకి దారితీసేదే. డబ్బు సంపాదించడం ఎప్పుడూ యూత్ అప్పీల్ వుండే క్రేజీ పాయింటే. ఏడుస్తూ సెంటిమెంట్లు పొందడం యూత్ అప్పీల్ వున్న పాయింటు కాదు. ‘బ్రహ్మోత్సవం’ ఇది గమనించలేకే, ఏడుతరాల బంధువుల అన్వేషణ అనే ముసలి పాయింటు పట్టుకుని పోయింది. మార్కెట్ యాస్పెక్ట్ లో సరీగ్గా స్క్రిప్టుని  బైండింగ్ చేసుకోకపోతే గుదిబండవక తప్పదు.

          విషయం, పాత్ర ఎటెటో పోయినా గోపీచంద్ తన లోకంలో తాను  రెండు పాత్రల్నీ ఎంజాయ్ చేస్తూ ఎంటర్ టైన్ చేశాడనేది నిజం. తెలుగు ప్రేక్షకులందరూ ఈ మధ్య విషయమూ పాత్రా చూడ్డం లేదు కాబట్టి- ఇలా ఫటాఫట్ హీరోయిజాలు  చాలేమో  సినిమాలు తీయడానికి.

-సికిందర్