రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

26, డిసెంబర్ 2016, సోమవారం

రివ్యూ!


రచన- దర్శకత్వం : సూరజ్

తారాగణం : విశాల్, తమన్నా, జగపతి బాబు, జయప్రకాష్, సూరి, వడివేలు, తరుణ్ అరోరా, తదితరులు
మాటలు : రాజేష్ ఏ. మూర్తి, పాటలు : చల్లా భాగ్యలక్ష్మి,  సంగీతం ; హిప్ హాప్ తమిళ,  నిర్మాత : జి. హరి
విడుదల : 23.12.16

        ***
         తమిళ మాస్ స్టార్ విశాల్ తో వచ్చిన సమస్య ఏమిటంటే అతను బీ- గ్రేడ్ కి సరిపోయే యాక్షన్ సినిమాలు చేస్తాడు. దీన్ని గుర్తించకుండా హిట్స్ రావడం లేదే అని బాధపడతాడు. ఎంత టాప్ హీరోయిన్స్ ని పెట్టుకుని ఏం లాభం సరయిన దర్శకుడు లేకపోతే. పాపం సినిమాకో టాప్ హీరోయిన్ అతడి ఎదుగుదల కోసం త్యాగాలు చేస్తున్నారు. ఇప్పుడు తమన్నా వంతు కూడా వచ్చింది. అయినా తెలుగులో కూడా విశాల్ సినిమా అంటే జనాలకి ఆసక్తి పోతోంది. ఒక్కడొచ్చినా, ఇంకెందరు హీరోయిన్లని వెంట బెట్టుకొచ్చినా, ఇప్పుడొచ్చిన సినిమాతో చెడగొట్టుకుంటూ వచ్చాడు. ఈ బాపతు సినిమా కథనాలు పూరీ జగన్నాథ్, శ్రీను  వైట్లలు ఎప్పుడో  చేసేశారు మళ్ళీ వాటి జోలికి వాళ్ళే పోలేనంతగా. విశాల్ కి తమిళంలో కొత్తగా అన్పించవచ్చు- కానీ తమిళ మసాలా దర్శకుడు సూరజ్ తెలుగు ఓల్డ్ ఫార్ములానే బీ- గ్రేడ్ గా తమిళంలో ‘కత్తి సందై’ (కత్తి పోరాటం) గా తీసి బాక్సాఫీసు పోరాటానికి దింపాడు. ఈ పోరాటం విశాల్ కి పర్మనెంట్ పద్మవ్యూహమే!
          ఇంతకీ ఒక్కడొచ్చాడు ఎందుకొచ్చాడు?  క్రిస్మస్ కి ఏ  స్క్రిప్ట్ మస్ మోసుకొచ్చాడు? ఒకసారి చూద్దాం.... 

కథ 
      డిసిపి చంద్రబోస్ (జగపతి బాబు) ఒక భారీగా నోట్లు తరలిస్తున్న ట్రక్కుని ఛేజ్ చేసి పట్టుకుంటాడు. ఆ క్రిమినల్ (తరుణ్ అరోరా) ఆఫర్ చేసే మొత్తాన్ని కాదని జైల్లో వేస్తాడు. ఆ ట్రక్కులో మూడొందల కొట్లుంటే యాభై కోట్లే వున్నాయని ప్రకటిస్తాడు. ఊర్నుంచి అర్జున్ (విశాల్) వస్తాడు.  సైకాలజీ చదువుతున్న దివ్య (తమన్నా) ని పూర్వజన్మ కట్టు కథలు చెప్తూ ప్రేమలోకి దింపడానికి ప్రయత్నిస్తూంటాడు. ఈమె కాలేజీలో అబ్నార్మల్ సైకాలజీ చెప్తున్న ప్రొఫెసర్,  అర్జున్ చెప్పే పూర్వజన్మ వృత్తాంతాల మీద స్టడీ చేయమంటాడు. అర్జున్ తనూ ఆమే గత జన్మలో ప్రేమికులమంటూ ఆ గుర్తులు ఇప్పుడు చూపించడం మొదలెడతాడు. ఆమె నమ్మేసి నిజంగానే ఇప్పుడు ప్రేమిస్తుంది. ఇంతకీ ఈమె డిసిపి  బోస్ చెల్లెలు. బోస్ అర్జున్ కి కొన్ని పరీక్షలు పెట్టి ఎంగేజ్ మెంట్ కి అంగీకరిస్తాడు. అంతలో  బోస్ ఇంటి మీద అర్జున్ రెయిడింగ్ చేస్తాడు. దాచిన రెండొందల యాభై కోట్లూ పట్టుకుని తను సిబిఐ నని చెప్తాడు. జైల్లోంచి క్రిమినల్ విడుదలై వచ్చి బోస్ నొక్కిన రెండొందల యాభై  కోట్లూ డిమాండ్ చేస్తాడు. సిబిఐ పట్టుకున్నాడని బోస్ సీసీ టీవీ చూపిస్తాడు. వీడు సిబిఐ కాదు, క్రిమినల్ అని ఈ క్రిమినల్ అనేసరికి షాక్ తింటాడు బోస్...


        ఇప్పుడు ఈ అర్జున్ అసలెవరు? ఎందుకొచ్చాడు? ఎందుకా డబ్బు కొట్టేశాడు? ఆ డబ్బుతో ఏం చేస్తాడు? - అనే సందేహాల కోసం మిగతా సినిమా చూడాలి ఓపిక వుంటే.


ఎలావుంది కథ 

        థల్ని వేలెత్తి చూపడానికి వీల్లేదు, వేలెత్తి చూపాల్సింది వాటిని చెడగొట్టే  కథనాలనే. ఈ కాన్సెప్ట్ పాతదే అయినా, ఎప్పుడూ పనికొచ్చేదే. ఇప్పుడు నోట్ల రద్దు నేపధ్యంలో ప్రధాని ఏదైతే చెప్తున్నాడో- దాన్నే చూపిస్తుందీ కథ. ఈ కథకి మంచి  మార్కెటబిలిటీ వుంది ట్రెండ్ లో వుంటూ.  నోట్ల రద్దుకంటే పూర్వం నుంచే ఈ అయిడియా తో సినిమా తీస్తూ వుండివుంటారు. కాబట్టి ఇందులో పట్టుకున్న వెయ్యీ ఐదొందల నోట్ల కథ- ఇప్పుడు నోట్ల రద్దు పరిధిలోకి రాకున్నా, ఆ డబ్బు ఎవరి దగ్గర్నుంచి ఎందుకు హీరో కాజేశాడన్నది,  ప్రధాని ప్రవచిస్తున్న అవినీతి కట్టడి చర్యలకి కనెక్ట్ అవుతుంది. తమిళ కథ కాబట్టి  తమిళనాడు రాజకీయాలకి సంబంధించే  వుండొచ్చు- ‘టీవీలూ గ్రైండర్లూ ఉచితంగా ఇస్తూ విద్యని కొనుక్కోమంటున్నారు’ అన్న హీరో ఆక్రోశం ప్రభుత్వాల ద్వంద్వ నీతికి అద్దం పడుతోంది. గ్రామాల్లో పథకాలు కాగితాలమీద అమలు చేస్తూ, నిధులు జేబుల్లో వేసుకునే ప్రజాప్రతినిధుల మీద ఈ కథ. పథకాల పేరుతో మీరు దోచుకుని నల్ల డబ్బుగా దాచుకుంటున్నది మా డబ్బే,  అది మాకే  చెందాలన్న హీరో డిమాండే  ఈ కాన్సెప్ట్. ఆ డబ్బుతో అన్ని సౌకర్యాలతో తన  స్వగ్రామాన్నే కొత్తగా నిర్మించుకుంటాడు హీరో. ఈ ప్రయోజనాత్మక కాన్సెప్ట్ ని పనికిరాని కథనంతో చెడగొట్టుకున్నారు.


ఎవరెలా చేశారు        మళ్ళీ విశాల్ బీ గ్రేడ్ కథనపు బాధితుడయ్యాడు. ఏది ప్రాణమో దాని కథనాన్నే పట్టుకోకుండా, గడ్డిపోచ కథనాల్ని పట్టుకుంటే,  స్టార్ పట్టుకున్నాడని చెప్పి గడ్డి పోచ కథనం కల్ప వృక్షమైపోదుగా? గలగలా కాసుల కుంభ వృష్టి కురిపించదుగా? కథ వదిలేసి ఫస్టాఫ్ పూరీ ఫార్మాట్లోకి , సెకండాఫ్ వైట్ల ఫార్మాట్ లోకీ  వెళ్ళిపోయానని  తెలుసుకోలేదు. దీంతో సెకండాఫ్ అయితే వైట్ల బ్రాండ్ బ్రహ్మనందం లాగా వడివేలు వచ్చేసి,  బ్రహ్మనందం డబ్బింగేసుకుని,  30-40 నిమిషాలూ  విశాల్ ని కన్పించకుండా చేశాడు. బ్రహ్మనందమైనా ఇలాటి దానికి డబ్బింగ్ చెప్తున్నప్పుడు- ఒరేయ్ ఎడాపెడా సెకండాఫుల్లో  ఇలా నేను  చేసీ చేసే మూల కూర్చున్నానురా, ఇంకెందుకురా నన్ను పనిష్ చేస్తారు - అని అరిచి గోల పెట్టినట్టు లేదు. విశాల్ ఏం చేస్తున్నట్టు?  జ్ఞాపక శక్తి నశించిందని ఫార్మాట్ ప్రకారం విలన్ ఇంట్లో పడుకున్నాడు కథనపు బాధితుడిగా. ఫైట్లూ డాన్సులు మాత్రం బాగానే  చేశాడు. చిట్ట చివర బయటపడే డబ్బు రహస్యం దగ్గర- తన గ్రామం కథ ఫ్లాష్ బ్యాక్ వేసుకుని గానీ మళ్ళీ కథలోకి రాలేదు. ఇంటర్వెల్ దగ్గర, చివర్లో ఈ ఫ్లాష్ బ్యాక్ దగ్గర- ఈ రెండు చోట్ల మాత్రమే పాత్ర పరంగా తనకి బలం దొరికింది.

        పూరీ సినిమాల్లో అయితే హీరోయిన్ పోలీసు అధికారి కూతురవుతుంది,  కాకపోతే మాఫియా కూతురైనట్టు- ఇక్కడ తమన్నా పోలీసు అధికారి కూతురు. పూరీ సినిమా హీరోయిన్ లాగే ఫస్టాఫ్ లో హీరోకి అవసరమైన లవ్ స్టోరీకి సరిపడా రోమాన్సు ని సరఫరా చేసి, ఇక సెకండాఫ్ లో డ్యూటీ వుండదు గనుక- అప్పుడప్పుడూ ఓ  డాన్స్ చేసి మాత్రమే వెళ్లి పోతూంటుంది. 

        ఫస్టాఫ్ లో జగపతిబాబు డిసిపి పాత్ర, నటనా  నోట్ల రహస్యం అనే సస్పెన్సుతో   తనవెంట మనల్ని లాక్కు పోతున్నది కాస్తా-  సెకండాఫ్ లో హీరో మెమరీ లాస్ నటనకీ, కమెడియన్ చేసే రచ్చకీ పూర్తిగా కుదేలైపోయింది. ఇక డాక్టర్ బూత్రి అనే సైకియాట్రిస్టు పాత్రలో కమెడియన్ వడివేలు అవుట్ డేటెడ్ – అసందర్భ, నాటు, లౌడ్ కామెడీ దాదాపు సెకండాఫ్ ని విడవకుండా ఆక్రమించి సినిమాని చెల్లాచెదురు చేసింది. 


         
హిప్ హాప్ తమిళ మళ్ళీ తన సంగీతాన్నినేర్చుకోవడానికి ఈ సినిమాని వాడుకున్నాడు. అతను నిజంగా హిప్ హిప్ హుర్రే అవడానికి హిమాలయాలకి మించి ఎత్తు ఇంకా వుంది. తెలుగునాట 1980 లలో ప్రారంభమైన అయ్యప్ప దీక్షల ట్రెండ్ లో బాలసుబ్రహ్మణ్యం, జేసుదాస్ ల అయ్యప్ప పాటలెంతో బావుండేవి. అవి మళ్ళీ వినాలన్పిస్తుంది హిప్ హాప్ రొప్పుల్ని చూస్తే. ‘మాలధారణం నియమాల తోరణం’ వింటే గానీ ప్రక్షాళన జరగదు.

      రిచర్డ్ ఎం. నాథన్ కెమెరా వర్క్ యాక్షన్ సీన్స్ లో బెటర్ గా వుంది. యాక్షన్ కోరియోగ్రఫీ కూడా బెటర్ గా వుంది. 

చివరికేమిటి 

      ఇది ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ కి కవల కథనం విషయంలో. ఒక సినిమాని దాదాపు ఫస్టాఫంతా కథలోకి తీసికెళ్లక పోయినా, కనీసం ఇంటర్వెల్లో అయినా మాంచి కిక్ ఇచ్చే ట్విస్ట్ ఇస్తే,  అంతవరకూ భరించిన వున్న విషయలేమిని క్షమించగలం. కానీ ప్రేక్షకుల్లోంచి అంత కేకలు పుట్టించిన ట్విస్ట్ ని కూడా పక్కన పెట్టి, మళ్ళీ సెకండాఫ్ లో కూడా  ఏటో వెళ్ళిపోయి విషయలేమిని ప్రదర్శించుకుంటే  క్షమించేది వుండదు. రెండోసారి క్షమాపణ వుండదు. అట్టర్ ఫ్లాప్ అని రాసి పెట్టుకోవడమే. ఫస్టాఫ్ లవ్ ట్రాకుతోనే గడిపేశారు. పూర్వజన్మ ప్రేమ అంటూ చాలా పేలవమైన, బోరు కొట్టే  లవ్ ట్రాక్. పైగా దీన్ని డిసిపి చెల్లెలైన హీరోయిన్ నమ్మేయడం. విశాల్- తమన్నా లాంటి మాస్ ఫాలోయింగ్ వున్న స్టార్స్ తో బీ- గ్రేడ్ ప్రేమ వ్యవహారం! విశాల్ రౌడీ ఫ్రెండ్స్  తో ఈ ప్రేమ ట్రాకులో నాటు కామెడీ. ఇంటర్వెల్ దగ్గరికి రాగానే విశాల్ పూరీ మార్కు ‘ఇజం’ ట్విస్టు ఇస్తాడు. జగపతిబాబు ముందు విశాల్- ఈ ప్రేమ ట్రాకు నువ్వు దాచుకున్న డబ్బు దగ్గరికి చేరడానికే నంటూ, సిబిఐ ఆఫీసర్ గా  ట్విస్టు ఇస్తాడు. ఈ అనూహ్య ట్విస్టుకి  పెద్ద పెట్టున ఈలలూ చప్పట్లూ హాల్లోంచి. చాలా హేపీగా ఫీలవుతాం. విశాల్ ఆ డబ్బు పట్టుకెళ్ళి పోయాక, వెంటనే జైల్లోంచి క్రిమినల్ వచ్చి,  విశాల్ సిబిఐ కాదూ  క్రిమినల్ అంటూ ఇంటర్వెల్లో ఇంకో ట్విస్టు - ఈ డబుల్ ధమకాతో  విశాల్ ఇమేజి, పాత్ర మీద నమ్మకం అమాంతం  పెరిగిపోయి మళ్ళీ ఈలలూ చప్పట్లూ హాల్లోంచి! ఇంకా చాలా  హేపీగా ఫీలవుతూ, ఇంటర్వెల్ బ్రేక్ లో దీని గురించే ఆలోచిస్తూంటాం. ఇలా ఇంటర్వెల్ బ్రేక్ లో ఆలోచనలకి పని చెప్పిన  సినిమాని చాలా కాలమైంది చూసి. 


       అంతే, ఇక సెకండాఫ్ మొదలైతే మళ్ళీ ఫస్టాఫ్ లాంటి తంతే. ప్రసాదం పెడుతున్నట్టు గంట కొట్టి పూజారి మాయమైనట్టు ప్లాట్ పాయింట్ వన్ తో కథ మాయం!  పూజారీ ప్రసాదం మాయమై, నిరాశగా చూస్తూంటే మళ్ళీ  ఠంగ్ ఠంగ్ మని గంట ! ఈసారి యాక్షన్ సీన్లో గాయపడ్డ విశాల్ కి జ్ఞాపకశక్తి పోయిందంటూ మరో ట్విస్టు! థ్రిల్లయి అలా చూస్తూంటే,  మళ్ళీ ప్రసాద మెత్తుకుని పూజారీ పరార్! దెయ్యంలా డాక్టర్ బూత్రీ ఎంట్రీ. ఇక ఈ దెయ్యం వదలదుగాక వదలదు...ప్లాట్ పాయింట్ వన్ ని హాంఫట్ చేసిన ఇలాటి సినిమాగా  మళ్ళీ,  దీని కవల అయిన  ‘సప్తగిరి గారి 
ప్యాసింజర్’ నే చూస్తాం.  

     75 ఏళ్లుగా అంతర్జాతీయ రీడర్ షిప్ ని  కలిగి వున్న జేమ్స్ హేడ్లీ ఛేజ్ నవలలు - దాదాపు 80- ఇప్పుడూ లభిస్తాయి. ఒకప్పుడు హిందీ సినిమాల్ని కూడా ఇవి ఇన్ స్పైర్ చేశాయి. ఇప్పుడు విశాల్ సినిమాలో ఇంటర్వెల్లో డబల్ ట్విస్టు తో ఏర్పడ్డ సిట్యుయేషన్స్ రెండూ - ఛేజ్ నవలల్లో వాతావరణాన్నే  తలపిస్తాయి. చాలా సీరియస్. కాకపోతే ఛేజ్  హీరో ప్లాన్ ని సస్పెన్స్ లో వుంచి ఇక్కడి దాకా నడపడు. హీరో ఏ ప్లానుతో చేస్తున్నాడో ముందే చెప్పేస్తాడు.   సినిమాలో విశాల్ ప్రేమ ట్రాకు ఉద్దేశం ముందు చెప్పకుండా నడిపినందు వల్లే అంత బోరు కొట్టింది. ఎండ్ సస్పెన్స్ పనికి రాదనేది ఇందుకే. ఆఫ్ కోర్స్, ఈ బోరు కొట్టించిన ప్రేమ ట్రాకుకి చివర్లో సిబిఐ ఆఫీసర్ గా హీరోకి ట్విస్ట్ ఇచ్చి, అంతసేపు కొట్టించిన బోరుకి కాంపెన్సేట్ చేశారు బాగానే వుంది, కానీ ఇక్కడ ఒక విషయం బాగా గుర్తు  పెట్టుకోవాలి. ఒక అంశం చుట్టూ సస్పెన్స్ ఏర్పడి వుంటే దానికి రెండు పార్శ్వాలుంటాయి. ఒక పార్శ్వంలో ఎందుకు? అన్న ప్రశ్న, ఇంకో పార్శ్వంలో ఎవరు? అన్న ప్రశ్న. ఈ రెండు ప్రశ్నల్నీ దాచి పెట్టి దోబూచు లాడితే, ఈ ప్రేమ ట్రాకులాగే బోరు కొడుతుంది. అది క్లోజుడు సస్పెన్స్, లేదా ఎండ్ సస్పెన్స్ అవుతుంది. ఏదో ఒక ప్రశ్నని ఓపెన్ చేసి నడపాలి. ఒకటి- విశాల్ ఎవరు? అన్న ప్రశ్న కి జవాబు దాచి పెట్టి- ఎందుకు? అన్న రెండో ప్రశ్నకి  ప్రేమ ట్రాకు దేనికో చెప్పేయడం. ఈ ట్రాకు ముగిసి విశాల్ గోల్ ని రీచ్ అయ్యాక, అప్పుడు  అసలతను ఎవరో (సిబిఐ) చెప్పడం. సినిమాలో విశాల్ గోల్ ని రీచ్ అయ్యాకే అతనెవరో (సిబిఐ) చెప్పారు బాగానే వుంగానీ,  అదే సమయంలో ప్రేమ ట్రాకు దేనికనే  ప్రశ్నకి  జవాబు కూడా దాచి పెట్టారు- రెండూ దాచి పెట్టారు. దీనివల్ల ఈ ప్రేమ ట్రా కూ, విశాల్ క్యారక్టరూ ఏదీ అర్ధం గాక బోరు కొట్టాయి. అంత బోరు కొట్టించిన  ప్రేమ ట్రాకుకి చివర్లో ట్విస్టు ఇస్తూ కాంపెన్సేట్ చేసే అవసరమెందుకు? బోరు కొట్టించి ఆపై కాంపెన్సేట్ చేసే అవసరమే లేని టెక్నిక్ వుండగా? దీన్ని బాగా అర్ధం జేసుకుని గుర్తు పెట్టుకోవాలి. 


       ఛేజ్ హీరో ఎందుకు చేస్తున్నాడో ముందే చెప్పేస్తాడు, అతనెవరో పాయింటు కొచ్చినప్పుడు రివీల్ చేస్తాడు. క్యారక్టర్ ని సస్పెన్స్ లో వుంచవచ్చుగానీ, కథనాన్ని వుం చకూడదు. కథనం ఎప్పుడూ సీన్ టు సీన్ సస్పెన్స్ తోనే  వుండాలి, ఎండ్ సస్పెన్స్ తో కాదు. స్క్రీన్ ప్లే అంటే స్క్రీన్ మీద కథ ప్లే అయ్యేదే తప్ప, మూసి పెట్టేది కాదు. 

        విశాల్ సిబిఐ అన్న మొదటి ట్విస్టూ,  దాని ఫాలో అప్ గా- బంగాళా అంతా కొల్లగొడుతూ విపరీతమైన డబ్బు కట్టలు తీసే థ్రిల్లింగ్ బిల్డప్పూ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. చాలా మ్యాటర్ ని ప్రోది చేశాయి. ఇక్కడే కథ సాంద్రత పెరిగింది- ప్లాట్ పాయింట్ వన్ కాబట్టి.

        దీని తర్వాత వెంటనే మిడిల్ ని ప్రారంభిస్తూ జగపతి దగ్గరికి క్రిమినల్ వచ్చి,  హీరో సిబిఐ కాదూ క్రిమినల్ అన్నపుడు ఈ ఇంటర్వెల్ ట్విస్టుతో కథని ఇంకెవ్వరూ ఆపలేనంతగా సెకండాఫ్ కి టేకాఫ్ తీసుకుంది. మరి ఇంత టేకాఫ్ తీసుకున్న కథ సెకండాఫ్ అనే బెర్ముడా ట్రయాంగిల్లో ఎందుకు అంతర్ధానమయ్యింది? బేస్ మర్చిపోవడం వల్ల- గ్రౌండ్ కంట్రోల్ ని బేఖాతరు చేయడం వల్ల. ఆ బేస్ మొదటి ట్విస్ట్ అయితే, గ్రౌండ్ కంట్రోల్ రెండో ట్విస్టు. ఈ రెండో ట్విస్టు సిట్యుయేషనే  ఇప్పుడు జేమ్స్ హేడ్లీ ఛేజ్ ని ఇక్కడికి రప్పిస్తోంది. ఛేజ్ ని - ‘ది కింగ్ ఆఫ్ ఆల్ థ్రిల్లర్ రైటర్స్’ అంటారు.

        ఛేజ్ క్రిమినల్ సైలెంట్ గా వస్తాడు. వస్తున్నట్టుగా కూడా చూడం. కాలింగ్ బెల్ మో గుతూంటే లోపలున్న వ్యక్తి వెళ్లి  డోర్ తీస్తాడు. షాక్ అవుతాడు ఎదురుగా వున్న క్రిమినల్ ని చూసి. క్రిమినల్ మహేష్ మంజ్రేకర్ లా నింపాదిగా సైలెంట్ గా ఓ స్మైలిస్తాడు. డోర్ తీసిన వ్యక్తికి  చెమట్లు పట్టేస్తూంటాయి. నాలిక పిడచగట్టుకు పోతుంది. చేతులు గజగజ వణుకుతూంటాయి... క్రిమినల్ రిక్వెస్ట్ చేసుకుని లోపలి కొచ్చి కూర్చుంటాడు. సిగరెట్ వెల్గిస్తూ మంచినీళ్ళు ఇమ్మంటాడు. మంత్రించినట్టూ వెళ్లి ఆ వ్యక్తి  మంచినీళ్ళు తెచ్చి అందిస్తాడు. నీ కూతురూ భార్యా క్షేమంగా వున్నారా? -అని అడుగుతాడు క్రిమినల్ గటగటా నీళ్ళు తాగేసి. ఆ వ్యక్తి చెప్పలేని భయంతో చూసి కూలబడతాడు. క్రేజీగా ఫారిన్ టూర్ పంపించావేంటి నా కరెన్సీతో ?- అంటాడు క్రిమినల్ సిగరెట్ పొగ గుప్పున ఆ వ్యక్తి మొహం మీదికి వూదుతూ.  వూపిరాడక ఆ వ్యక్తి ఎలాగో గొంతు పెగల్చుకుని- నీ డబ్బూ....నీ డబ్బూ...అని నసుగుతాడు కంగారుగా.
 
        క్రిమినల్ కి విసుగుపుట్టి, కాలుతున్న సిగరెట్ పీకని అలాగే  గ్లాసు అంచుకి రుద్ది ఆర్పేసి- ఎక్కడ దాచావ్?- అని గాజుకళ్ళతో తీక్షణంగా చూస్తూ- విషం చిమ్ముతున్నట్టున్న పెదాల  మధ్య నుంచి కటువుగా అంటూ, సిగరెట్ పీకని కిందకి జారవిడుస్తాడు....

        ఇలా వుంటుంది సన్నివేశం- డిటైల్డ్ గా, డిస్టర్ బెన్సింగ్ గా...క్రిమినల్ వైపు నుంచి కూల్ గా వుంటే, బాధితుడి వైపునుంచి హాట్ హాట్ గా ద్వంద్వాలు ప్లే అవుతూంటాయి. రాం గోపాల్ వర్మ సినిమాల్లో క్రైం సీన్లు అంత క్వాలిటీగా ఎందుకుంటాయంటే, ఆయన బాగా నవలలు చదవడం వల్లే. సినిమాలే  చూస్తే ఇంత సజీవ సృజన సాధ్యం కాదు. ఎందుకంటే సినిమాల్ని ఆబ్జెక్టివ్ గా చూస్తాం, నవలల్ని సబ్జెక్టివ్ గా చదువుకుంటాం. ఇలాటి సీన్ని  సబ్ కాన్షస్ లో ముద్రించుకునేట్టు పేసింగ్ ఇవ్వాలి. ఇవ్వాలంటే టైం తీసుకోవాలి. సీను పాత్రలనుంచి అంతర్గతంగా సబ్జెక్టివ్ గా వూడిపడాలి. బహిర్గతంగా గా పాత్రల  మీద ఆబ్జెక్టివ్ గా రుద్దడం కాదు. రెండో ట్విస్టులో జగపతిబాబు దగ్గరికి క్రిమినల్ తన 250  కోట్ల డబ్బు కోసం వచ్చినప్పుడు,  పైన చెప్పుకున్న డ్రామా ప్లే అయినప్పుడు అది సబ్ కాన్షస్ లో బాగా ఇంకుతుంది. బ్లో హాట్- బ్లో కూల్ అన్నట్టు నెమ్మది నెమ్మదిగా సీను టార్చర్ పెడుతూ, క్లయిమాక్స్ అందుకున్నప్పుడు - విశాల్ సిబిఐ కాదూ క్రిమినల్ అన్న  మాటతో బ్లాస్ట్ అవ్వాలి.

        సిట్యుయేషన్ డిమాండ్ చేస్తున్న క్రియేటివిటీతో ఇంత గ్రాఫికల్ గా డైరెక్టర్ సీన్ని డెవలప్ చేసినప్పుడు, ఇక  ససేమిరా దీన్ని విడిచి ముందుకు వేరే కథనం పట్టుకుని కామెడీ అంటూ, వడివేలు అంటూ దారితప్పి పోడు. రివీల్ చేయడానికి ముందున్న ఇంకా మంచి కాన్సెప్ట్ కి విలువలేకుండా- అప్పటికి ప్రేక్షకుల సహనం నశించేలా చేసుకోడు.

        పై సీన్ని ఎంత హడావిడిగా తూతూ మంత్రంగా నడిపేసి ట్విస్టు ఇచ్చాడంటే, ఆ ట్విస్టు ప్రేక్షకులకి ఉపయోగ పడిందేమో గానీ, దాని అల్లాటప్పా పూర్వ రంగం మాత్రం సెకండాఫ్ లో కథకి దర్శకుడికి హాని చేసింది. పోనీ, ఆ వెంటనే మెమరీ లాస్ ట్విస్టు నైనా గౌరవించి దానిమీద గేమ్ ఆడేడా అంటే, దాంట్లోకి వడివేలు ని దూర్చి కంగాళీ చేశాడు. 

        ఇంటర్వెల్లో రెండు ట్విస్టులు, క్లయిమాక్స్ లో ఈ ట్విస్టులకి జస్టిఫికేషన్ పెట్టుకుని- మిగిలిన భాగమంతా సంబంధం లేని గోల కామెడీకీ – ‘గే’ కామెడీకీ తార్చేశాడు.

        1990 ల వరకూ సినిమాలు ఫస్టాఫ్ అంతా కామెడీతో ఎంటర్ టైన్  చేసి,  సెకండాఫ్ లో సీరియెస్ గా కథే చెప్పేవి. సెకండాఫ్ లో కామెడీ లేదని ప్రేక్షకులు గోల చేసే వాళ్ళు కాదు. ఫస్టాఫ్ లో బాగానే  నవ్వించాడు కదాని,  సెకండాఫ్ లో చేతులు కట్టుకుని సీరియస్ గా కథ చూసే వాళ్ళు. ఆ తర్వాత 2000 నుంచి ప్రారంభమైన యూత్ సినిమాలతోనే కథంటే గౌరవం తగ్గి- మొత్తం ఏదో ఎంటర్ టైన్ చేస్తే చాలనే ధోరణికి అలవాటు చేశారు ప్రేక్షకుల్ని. వెరీ బ్యాడ్ సిట్యుయేషన్. ఎటూ కాని  ‘గే’- స్క్రిప్టులు తయారవుతున్నాయి.

-సికిందర్ 
http://www.cinemabazaar.in

25, డిసెంబర్ 2016, ఆదివారం

రివ్యూ!




దర్శకత్వం : అరుణ్ పవార్
తారాగణం : సప్తగిరి, రోషినీ ప్రకాష్, అలీ, షకలక శంకర్, పోసాని, సాయాజీ షిండే, అజయ్ ఘోష్ తదితరులు
అడిషనల్ స్టోరీ- స్క్రీన్ ప్లే  : ఏ. సప్తగిరి, సంగీతం : బల్గానిన్, ఛాయాగ్రహణం : సి. రాంప్రసాద్  

బ్యానర్ : సత్యా  సెల్యూలయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్,

నిర్మాత : డాక్టర్ కె. రవికిరణ్ 

విడుదల : 23 డిసెంబర్, 2016
తె
లుగు కమెడియన్లు మామూలు హీరోలుగా కాదు, యాక్షన్ హీరోలవుతున్న ట్రెండ్ లో సప్తగిరి తన బండిని కూడా పట్టా లెక్కించుకుంటే, బులెట్ ట్రైన్ లా కళా జీవితం దూసుకుపోతుందనుకున్నాడు. చార్లీ చాప్లిన్ గొప్ప యాక్షన్ హీరోగా నటించబోయి, అదెంత వరస్ట్ గా వుంటుందో వార్నింగ్ ఇచ్చి వుంటే, జడుసుకుని  మరే తెలుగు కమెడియనూ అటువైపు చూసేవాడు కాదేమో- ఆయన మీద గౌరవం కొద్దీ. ఆల్రెడీ తెలుగులో ఒక కమెడియన్ యాక్షన్ హీరో అన్పించుకోవాలని నానా పాట్లు పడుతున్నాడు- ఇప్పుడు మరింకో కృష్ణుడుగా సప్తగిరి యాక్షన్ హీరోగానే కాకుండా,  సకల కళా వల్లభన్ అన్పించుకోవాలని కూడా పౌరాణికాల దగ్గర్నుంచీ ఫ్యామిలీల వరకూ తెగ సీన్స్ నటించేసి, సప్తగిరి షో కేస్ అన్పించుకున్నాడు. షో కేస్ లో శాంపిల్సే కదా వుంటాయి, సరుకు వుండదు. కనుక వివిధ నిర్మాతలూ దర్శకులూ ఇక ఈ శాంపిల్స్ చూసి, సప్తగిరి ఫైట్ చేసిన ఈ యాక్షన్ శాంపిల్ బావుంది, మేం ఆయన్ని పెట్టుకుని యాక్షన్ సినిమా తీసుకుంటాం; సప్తగిరి ఏడ్చిన ఈ మదర్ సెంటిమెంట్ శాంపిల్ బావుంది, మేం ఆయన్ని పెట్టి మదర్ సెంటిమెంటల్ లాగించుకుంటాం; సప్తగిరి విజృంభించిన ఆ పౌరాణిక శాంపిల్ బావుంది, మేం అతన్తో ఏకంగా మహాభారతానికే  తెరతీస్తాం;  సప్తగిరి గిరికీలు కొట్టిన ఆ జేమ్స్ బాండ్ - సూపర్ మేన్ డ్యూయెల్ శాంపిల్స్ చాలా చాలా బావున్నాయి, మేం ఆయన్తో సూపర్ డూపర్  బాండ్  టూ- ఇన్ - వన్ స్పై ఫాంటసీ మిక్సీ మసాలా తీసిపారేస్తా మనేసి - సెలక్టు చేసుకోవడానికి ఈ ఎగ్జిబిషన్  బాగా ఉపయోగ పడుతుంది. మరి ప్రేక్షకుల సంగతి? ఈ ఒక్కో శాంపిల్స్ తో త్వరలో వచ్చే ఒక్కో బ్లాక్ బస్టర్  తర్వాత వరసగా చూసుకోవచ్చు, సప్తగిరి ఎక్కడికీ పోడు. కాకపోతే ఆ నిర్మాతలు, దర్శకులూ  సప్తగిరి స్క్రిప్టు రాస్తానంటే కూడా ఆ ప్యాకేజీని పకోడీ పొట్లంలా ఒప్పుకోవాలి. ఆయన ఉన్న హిట్టయిన తమిళ స్క్రిప్టుకి, అట్టర్ ఫ్లాప్ అడిషనల్ స్టోరీ వేసి, సూపర్ ఫ్లాప్ స్క్రీన్ ప్లే ఎలా రాస్తాడో కూడా ఈ ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ అంతా ఒక ఆదర్శప్రాయమైన శాంపిలే! ఈ స్క్రిప్టు అత్యంత అద్భుతం, అనిర్వనీయం, చార్లీ చాప్లిన్ కీ చుక్కలు చూపించే చమత్కృతి!






    ఇదన్నమాట కథ!
   పోలీసు వాళ్ళ కథ. పోలీసు (శివప్రసాద్) కొడుకు సప్తగిరి( సప్తగిరే!) సినిమా వేషాల పిచ్చితో ఏ పనీ చేయకుండా తిరుగుతూంటాడు. ఒక పోలీసు అధికారి (పోసాని) ని కలుపుకుని ఒక క్రిమినల్ గ్యాంగ్ పని చేస్తూంటుంది. ఇది సప్తగిరి తండ్రికి తెలిసిపోయిందని ప్లానేసి, అతణ్ణి ఒక ఫేక్ ఎన్ కౌంటర్లో చంపేస్తారు. ఉన్నతాధికారి (సాయాజీ షిండే) వచ్చి నష్టపరిహారంగా సప్తగిరికి కానిస్టేబుల్ పోస్టు ఇస్తాడు. కానిస్టేబుల్ జీవితం ఎలా వుంటుందో తోటి  కానిస్టేబుల్ (షకలక శంకర్) తో కలిసి చవిచూస్తాడు సప్తగిరి.  ఇంతలో తండ్రి దాచిపెట్టిన ఆధారాలు దొరుకుతాయి. అప్పుడు తండ్రిది హత్య అని తెలుసుకున్న సప్తగిరి, తండ్రిని ఎలా ట్రాప్ చేసి చంపారో,  అలాగే వాళ్ళందర్నీ ట్రాప్ చేస్తాడు...



ఎలావుంది కథ
     2014లో తమిళంలో హిట్టయిన ‘తిరుడాన్ పోలీస్’ (దొంగ పోలీసులు) అనే ఒరిజినల్ కథ. ఇందులో ‘ఆడుకాలం’, ‘విశారణై’  లాంటి సమాంతర సినిమాల్లో నటించిన దినేష్ హీరో. ఇతను కమెడియన్ కాదు. ఈ సినిమాని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు చరణ్ నిర్మించారు. విజువల్ ఎఫెక్ట్స్ శాఖలో పనిచేసిన కార్తీక్ రాజు కిది దర్శకుడుగా మొదటి సినిమా. తన పోలీసు తండ్రిని చంపిన పోలీసుల్ని పోలీసుద్యోగంలో చేరి పట్టుకున్న హీరో ఫన్నీ కథ ఇది. జాతీయ మీడియా కూడా ఈ సినిమాని ప్రశంసించింది. దీన్ని తెలుగులో సప్తగిరిని  హీరోగా చేసి తీశారు. ఒరిజినల్ మూవీ రియలిస్టిక్ అప్రోచ్ తో వుంటుంది. ఒరిజినల్ పోలీస్ క్వార్టర్స్ ని  లొకేషన్స్ గా  తీసుకుని, అక్కడే షూట్ చేశారు. పోలీస్ స్టేషన్లు, పోలీసు వాహనాలు, పోలీసులూ- ఆ మొత్తం వాతావరణమూ- 
అచ్చం నిజజీవితంలో చూస్తున్నంత వాస్తవికతతో వుంటాయి.



     ఎక్కడా ఇది సినిమా అన్నట్టు తీసి చూపిస్తున్నట్టు వుండదు. ‘పెళ్లి చూపులు’ లోని రియలిస్టిక్ అప్రోచే ఈ తమిళ హిట్ కి ప్రాణ మయ్యింది. కృత్రిమ మూస ఫార్ములా సినిమాలూ, వాటిలో  జీవితంతో సంబంధంలేని కృత్రిమ పాత్రలూ, వాటి సినిమాటిక్ డైలాగులూ, వేషాలూ కామెడీలూ చూసి చూసి విసుగెత్తిన ప్రేక్షకులూ, సమీక్షకులూ ఇది ప్రదర్శించిన నేచురాలిటీతో బాగా కనెక్ట్ అయిపోయారు. ఇందులో కామెడీ అంతా సున్నితమైనదే. కెమెరావర్క్ డెప్త్ తో కూడుకున్నది. విజువల్స్ అన్నీ కూడా అత్యంత కంఫర్టబుల్ గా, కంటి కింపుగా వుంటాయి. 

      ఈ కథని అడిషనల్ కథ పేరుతో టైగర్- సారీ-  రైటర్ గా సప్తగిరి ఇమేజి బిల్డప్ కోసం ఏవేవో సీన్లు వేసుకుని కిచిడీ చేశాడు. ఒరిజినల్లో లేని అన్ని రకాల పురాణ, ఫాంటసీ, సాంఘీక పాత్రల ప్రదర్శన చేసి సబ్జెక్టుని నేలకు దించాడు. ఒరిజినల్లో కేవలం ఖాళీగా వుండే హీరో పాత్రని, తను వేషాలేసి టాలెంట్ చూపించుకోవడానికి సినిమా పిచ్చిగల పాత్రగా మార్చేశాడు. కేవలం ఈ ఒరిజినల్ హిట్టయిన  కథని తన స్వార్ధంకోసం నిర్మాత మీద స్వారీ చేస్తూ, ఇంటర్వెల్ కల్లా ప్రేక్షకులు పారిపోయేలా చేశాడు!

ఎవరేం చేస్తారు?

       ఎవరేమీ చేయడానికీ ఇక్కడేమీ లేదు. ఈ సినిమానే గుంటూరు జిల్లా తిరునాళ్ళలో ఆడే సినిమా పేరడీ నాటకంలా చీప్ గా తయారయ్యాక, కథ విడిచి సప్తగిరి ప్రయోగాలన్నీ చేసుకునే ప్లాట్ ఫాంగా ఉపయోగించుకున్నాక, ఇంకెవరూ చేయడానికేమీ లేదు. ఒరిజినల్లో హీరోతో బాటు క్యారక్టర్ ఆర్టిస్టులు, పోలీసు పాత్రల్లో నటించిన వాళ్ళూ, ఆ పాత్రలకి సరిపోయే కొత్త ముఖాలు కావడంతో, ఆ సబ్జెక్టు దాని సహజత్వం కొద్దీ డిమాండ్ చేస్తున్న ఒద్దికైన, నిష్కల్మష, సిన్సియర్ కథా ప్రపంచంలో వాళ్ళంతా పాలూ నీళ్ళల్లా కలిసిపోయారు. తెలుగులో పోసాని, సాయాజీ షిండే, ఇంకో పెద్ద విలన్, హేమ లాంటి ఏకోన్ముఖ మూస ఫార్ములా నటుల్ని తీసుకోవడంతో -మార్పు లేని వాళ్ళ నటనలతో, అరుపులతో  ఫ్లేవర్ అంతా చెదిరిపోయింది. ఈ నటులకి ఒరిజినల్ చూపించి- మీరిలాగే, ఈ చిన్ని కథా ప్రపంచంలో ఒదిగిపోతూ- 


     - ఇలాగే సున్నితంగా సహజంగా నటించాలని చెప్పి వుంటే, అద్భుతాలు చేసి చూపించే వాళ్ళు. ఒక కొత్త పోసానీనీ, కొత్త షిండేనీ, కొత్త హేమనీ, కొత్త విలన్నీ చూసివుండే వాళ్ళం. వీళ్ళంతా  ఈ సినిమాలో నటించి సినిమాకి అన్యాయం చేయలేదు- ఒరిజినల్  సినిమా చూపించి సూచన లివ్వకుండా  వీళ్ళకే అన్యాయం చేశారు నిర్మాతా దర్శకుడూ సప్తగిరీ.

    సప్తగిరి కూడా ఒరిజనల్లో హీరో దినేష్ రేంజిలోనే తన పాత్రని వుంచుకుని, పైత్యాలన్నీ విసర్జించుకుని, ఒరిజినల్ కే  కట్టుబడి వుంటే అప్పుడతను సక్సెస్ ఫుల్ హీరో అన్పించుకునే వాడు. చిన్న చిన్న కామెడీ వేషాలేసిన రాజేంద్రప్రసాద్ ఇలాగే తిరుగు లేని హీరోగా చెలామణీ అయ్యాడు. ఇప్పుడు పెద్ద స్టార్లని చూసి పులిచారలు ప్రదర్శిం చుకోవాలని చూస్తున్న కొందరు కమెడియన్లలాగా, అప్పట్లో రాజేంద్రప్రసాద్ ఓ చిరంజీవో బాలకృష్ణో  అవ్వాలనుకుని ఓవరాక్షన్ చేయలేదు.

       దర్శకుడు అరుణ్ పవార్ ఒరిజనల్లోని మేకింగ్ క్వాలిటీని ఏమాత్రం ఖాతరు చేయలేదు. ఆసక్తి పుట్టించని రొటీన్ రొడ్డకొట్టుడు టేకింగ్ తో కానిచ్చేశాడు. సంగీతం, కెమెరా కూడా తన కంట్రోల్లో వున్నట్టు లేదు, ఇవి కూడా సప్తగిరి హస్తగత మైనట్టున్నాయి. 



చివరికేముంటుంది?           తలనొప్పి! ఇంటర్వెల్ కే కొందరు ప్రేక్షకులు పరారయ్యారు. సూపర్ పోలీసుగా సప్తగిరే  వాళ్ళని వెతికి పట్టుకువచ్చి మిగతా సినిమా చూపించుకోవాలి. అడిషనల్ స్టోరీ? స్క్రీన్ ప్లే? అంటే ఏమిటి? వాట్ డిడ్ హీ మీన్? నటనలో అన్ని టాలెంట్లు ప్రదర్శించింది గాక, ఇవి కూడానా? కనిపించని రెండు టాలెంట్లు ఇవే - అని సూపర్ పోలీసు డైలాగ్ కోసమా? ఓపెనింగ్ లోనే  ఎవత్తో ఒకత్తి ఒకాయన దగ్గర కొచ్చి కూతుర్ని ట్రాప్ చేసే సుత్తి సీనూ డైలాగులూ ఏమిటవి? ఆ వెంటనే భీకరంగా పీకలు తెగిపోతూ చెయిన్ స్నాచింగ్ దృశ్యాలేమిటి? ఇలా ఒరిజినల్ తీసిన దర్శకుడు ప్రారంభించ లేకనా? విజువల్ ఎఫెక్ట్స్ లో పని చేస్తూ ఒరిజినల్ దర్శకుడు కొన్నేళ్ళ పాటు రాసుకుంటూ కూర్చున్నాడు ఈ సబ్జెక్టు-జానర్ మర్యాద అనే పదార్ధాన్ని కాపాడుకుంటూ. అతడి అవగాహన పనికి రాలేదనా? తర్వాత ఉరుములేని పిడుగులా, భారీ సెట్టింగులతో రామాయణ సన్నివేశమేమిటి? అందులో దశరధుడు, రాముడు, సీతా తదితరుల ముందు తను కాషాయ వస్త్రాల్లో ఇంతలావు గొడ్డలుచ్చుకుని, పావుగంట పాటు అంతేసి పరశురామ వీర పరాక్రమ డైలాగుల మోతేమిటి? పద్యాలు కూడా పాడేస్తే అడిషనల్ టాలెంట్ అబ్బేదిగా? మళ్ళీ ఇంకో చోట తల్లిదండ్రుల ముందు (పాపం శివప్రసాద్- తులసి!) ఇంకో పావుగంట దుర్యోధన డైలాగులు దున్నుకోవడమేడమిటి? శివప్రసాద్, తులసిలకే గనుక స్వేచ్ఛ వుండి వుంటే పిచ్చాసుపత్రికి పంపించేవాళ్లు - కొడుకు ఏమైపోతున్నాడో అర్ధంగాక! నిజం, ఈ సీను అర్ధం సప్తగిరి పాత్రని -ఎవడ్రా ఈ లూజ్?- అనుకునేలానే తయారయ్యింది.

      ఒరిజినల్లో శుభ్రంగా క్వార్టర్స్ లో వుంటున్న పోలీసు కొడుకైన హీరో, పై అధికారి కొడుకూ  తేడా వచ్చి కొట్టుకుంటూ, తరుముకుంటూ పోలీస్ స్టేషన్ లో పడి, అక్కడా తన్నుకుని ఇంట్లో కొచ్చి పడే ఓపెనింగ్ సీన్ - కామిక్ జానర్ ని ఫిక్స్ చేసుకుంటూ హుషారెక్కిస్తూ తమాషాగా వుంటుంది. గబగబా ఇరవై నిమిషాల్లో ప్లాట్ పాయింట్ వన్ వచ్చేస్తుంది- తండ్రిని ఫాల్స్ ఎన్ కౌంటర్ లో చంపడంతో. సప్తగిరి దీన్ని గంటకి పైగా ఇంటర్వెల్ కి సాగ లాగాడు. దీంతో అంతవరకూ కథలేక, కథతో సంబంధంలేని ఏవేవో కామెడీలూ వేషాలూ వేసుకుంటూ కూర్చున్నాడు. ఒరిజినల్లో వున్న సీన్ల  అందాన్ని, అర్ధాన్నీ కూడా  మార్చేస్తూ ఇష్టారాజ్యంగా రాసేశాడు. 

      
ఒరిజినల్లో తండ్రి భౌతికకాయం బయట షామియానా కింద వుంటే  అక్కడే తల్లీ, కాలనీలోని వాళ్ళూ  దుఃఖంతో కూర్చుని వుంటారు. హీరో ఇంట్లో సోఫాలో ముడుచుకుని  పడుకుని వుంటాడు. వెంటనే ఈ సీను ఆలోచింప జేస్తుంది.  ఈసీను అర్ధమేమిటో పట్టించుకోకుండా, ఎమోషన్స్ ప్రదర్శనకి ఇదే ఛాన్సు అన్నట్టు, సప్తగిరి తల్లి పక్కనే కూర్చుని బోల్డు ఎమోషన్స్ కురిపించుకోవడంతో- సీనులో క్యారక్టర్ తాలూకు కొత్త విషయం బయటపడక ఫ్లాట్ గా తేలిపోయింది. క్యారక్టర్ని అర్ధం జేసుకుంటే కదా క్యారక్టర్ నడిపించే కథ బాగా అర్ధమయ్యేది.  

  
     ఇంకో సీన్లో ఒరిజినల్లో పోలీస్ కానిస్టేబుల్ అయిన హీరో, పైఅధికారి కూరగాయల బుట్టని ఇంటికి మోయాల్సి వస్తుంది. అప్పుడే హీరోయిన్ వస్తూంటే ఆమె ముందు  తెగ అవమానం ఫీలైపోతాడు. ఇది డైరెక్టు సీను. దీన్ని కూడా సప్తగిరి అభాసు చేశాడు. హీరోయిన్ వస్తూంటే కారు పక్కన నక్కుతాడు. ఆ కారు వెళ్ళిపోతే హీరోయిన్ కి దొరికి పోతాడు... బహుశా సప్తగిరి ఇంకా సినిమాల్లోకి రాకముందు సినిమాల్లో వచ్చేసి- అరిగిపోయిన సీన్ ఇది. ఎవరికీ ఈ సీనుతో నవ్వురాలేదు. తనే నవ్వుల పాలయ్యాడు అందరికీ తెలిసిన పాత కాపీ సీనుతో.

    హీరోయిన్ ఫ్యామిలీ కొత్తగా సామానుతో క్వార్టర్లోకి దిగుతూంటే,  ఫస్ట్ టైం అక్కడ హీరో ఆమెని చూసి,  అప్పుడే వచ్చిన పై అధికారి కొడుకుని అక్కడ ఇరికించేసి, తను జంటిల్ మేన్ లా ఆమెకి ఫోజిస్తాడు. ఇది ఉండీ లేని డైలాగులతో చాలా గమ్మత్తుగా వుంటుంది. ఈ ఒరిజినల్ సీనుని చెత్త చేశాడు సప్తగిరి. లారీలోంచి ఆమె దిగుతూంటే,  రాఘవేంద్రరావు రేంజిలో ఇమాజినేషన్ సీను వేసుకుని...అబ్బో....తనలో చాలా రోమాంటిక్కు టమారాలే వున్నాయి!



      సెకండాఫ్ లో కథ ఎటు పోయిందో, తండ్రి ని చంపిన వాళ్ళ మీద పగా  ఎటుపోయిందో ( పోతే పోయాడు ఫాదర్- వేషాలేసుకోవడానికి అడిషనల్ గా పోలీస్ డ్రెస్ కూడా వొకటి దొరికిందిగా) -అవన్నీ వదిలేసి- కనీసం ఇంకోవైపు లవ్ ట్రాక్ కంటిన్యూటీ కోసం వెయిట్ చేస్తున్న హీరోయిన్నీ వదిలేసి - షకలక శంకర్ తో మంకీ మాస్కుల దగ్గర్నుంచీ, సూపర్ మేన్ కాస్ట్యూమ్స్ తో - వైర్ వర్క్ యాక్షన్ కోరియోగ్రఫీ మాట్లాడుకుని- ప్రభాస్ లా దున్నేస్తూ- ‘బాహుబలి’ లో వెళ్లి పడదామని విశ్వప్రయత్నం చేశాడు (తన పౌరాణిక టాలెంట్ ప్రదర్శనకి ఇప్పుడు పౌరాణికాలు ఎవరూ తీయరు కాబట్టి- తీస్తున్న ‘బాహుబలి’ నో, ‘శాతకర్ణి’ నో ప్రయత్నించుకోవాలి). ఇక ఫారిన్లో అర్ధనగ్న భామలతో అల్లు అర్జున్ లా ఇరగదీసిన డాన్సులైతే చెప్పనే అక్కర్లేదు! ఎలాటి ఒరిజినల్ ని ఏం చేసుకున్నాడు యాక్షన్ హీరోగా మారి  సప్తగిరి! .

    సప్తగిరి ఎక్స్ ప్రెస్ దూసుకెళ్ళ డానికి కనీసం రెండు పట్టాలైనా అవసరం. అవి ఏవీ? పట్టాలనే కథే లేకపోయాక, పాత్రే లేకపోయాక – బుల్లెట్ ట్రైన్ అయినా గాల్లో దూసుకెళ్ళే టెక్నాలజీతో వుందా?


-సికిందర్
http://www.cinemabazaar.in




23, డిసెంబర్ 2016, శుక్రవారం

రివ్యూ!


దర్శకత్వం: రామ్‌ గోపాల్‌ వర్మ
తారాగణం: సందీప్ కుమార్, నైనా గంగూలీ, వంశీ చాగంటి, శ్రీతేజ్‌, కౌటిల్య, వంశీ నెక్కంటి తదితరులు
కథ- స్క్రీన్ ప్లే : రాం గోపాల్ వర్మ,
రచన: చైతన్య ప్రసాద్‌, రాధాకృష్ణ, సంగీతం: రవిశంకర్‌, ఛాయాగ్రహణం: రాహుల్‌ శ్రీవాస్తవ్‌, దిలీప్‌ వర్మ, సూర్య చౌదరి
బ్యానర్‌: రామదూత క్రియేషన్స్‌
నిర్మాత: దాసరి కిరణ్‌ కుమార్‌
విడుదల : డిసెంబర్ 23, 2016
***
1970- 80లలో విజయవాడలో కొనసాగిన రౌడీ రాజకీయాలకి  రాం గోపాల్ వర్మ తనదైన  వెర్షన్ తో తెర రూపం ఇచ్చారు. వంగవీటి- దేవినేని కుటుంబాల మధ్య గొడవలు, పరస్పర హత్యలూ చూపించారు. ఒకప్పుడు రౌడీయిజం ఎలా రాజ్యమేలేదో వంగవీటి మోహనరంగా హత్య జరిగిన ఎడాది లోగానే, హైదరాబాద్ నేపధ్యంలో  ‘శివ’  ద్వారా తెలియజేశారు. ‘శివ’ నుంచీ ‘వంగవీటి’ వరకూ వచ్చిన వర్మ-  చరిత్రని కాల్పనీకం చేయడంలో- మధ్యలో తీసిన  ‘రక్తచరిత్ర’ తో కొంత వరకు నిరూపించుకున్నారు. ఆ నిరూపణతో విజయవంతంగా ‘కిల్లింగ్ వీరప్పన్’ కూడా  తీశారు. పరిటాల రవి, వీరప్పన్ లు ఈ కాలం ప్రేక్షకులకి తెలిసిన వాళ్ళే. వీళ్ళకీ 1970- 80 లనాటి దేనినేనీ- వంగవీటి లకీ మధ్య మూడు దశాబ్దాల అంతరం వుంది. ఈ అంతరాన్ని అధిగమిస్తూ ఆనాటి వ్యక్తులకి నేటి ప్రేక్షకులు కనెక్ట్ అవడానికి వర్మ ఏం జాగ్రత్తలు తీసుకున్నారు? ‘వంగవీటి’ అనే టైటిల్ కి ఎంత వరకు న్యాయం చేశారు? మొత్తంగా ఈ చరిత్ర ద్వారా ఏం చెప్పాలనుకున్నారు?.....ఈ ప్రశ్నలకి సమాధానాలు ఈ కింద వెతుక్కుందాం.
కథ





      (చరిత్ర తెలియని వాళ్ళ కోసం కథని పూర్తి పేర్లతో, తేదీలతో  విడమర్చి చెప్పాల్సి వస్తోంది)...1972 లో విజయవాడని గడగడ లాడించిన కమ్యూనిస్టు రౌడీ నాయకుడు చలసాని వెంకటరత్నం హత్య జరిగింది. హత్య చేసిన వాడు వంగవీటి రాధా కృష్ణ మూర్తి అలియాస్ రాధ. ఎందుకు హత్య చేశాడంటే,  కేవలం బస్టాండ్ రాధాగా బస్టాండ్   వరకే రౌడీయిజం చేసుకుంటున్న తనని వెంకటరత్నం గ్యాంగులో చేర్చుకున్నాడు. రాధాకి ఆశ పెరిగింది. వెంకటరత్నం ని అడ్డుపెట్టుకుని బెజవాడ వ్యాప్తంగా ఎదగాలని కలలు గన్నాడు. ఇది వెంకటరత్నంకి తెలిసి ఘోరంగా అవమానించాడు. దీంతో కక్ష పెంచుకుని తన గ్యాంగుతో కలిసి వెంకట రత్నాన్ని కత్తులతో పొడిచి చంపేశాడు రాధ. వెంకట రత్నం అనుచరుల్ని కూడా ఊచకోత కోసి వెంకటరత్నం స్థానాన్ని కైవసం చేసుకుని బెజవాడకి కింగ్ అయ్యాడు. రిక్షా యూనియన్లూ, టాక్సీ యూనియన్లూ వెంకటరత్నం నుంచి రాధా  ఖాతాలోకి బదిలీ అయిపోయాయి. ముఠా ప్రధాన ఆదాయ మార్గం రౌడీ మామూళ్ళు వసూలు చేసుకోవడమే. 

         రాధా  తమ్ముడు మోహన రంగారావు అలియాస్ రంగా. ఇతను సినిమాల్లో లాగే అన్నో తండ్రో మాఫియా అయితే దూరంగా తన మానాన తాను అమాయకంగా బతికే యువకుడు లాంటి వాడు (‘గాడ్ ఫాదర్’ చిన్న కొడుకు కూడా ఇంతే కదా?). బాగా పరపతి పెంచుకున్న రాధా  దగ్గరికి ముగ్గురు స్టూడెంట్స్ – దేనినేని గాంధీ, నెహ్రూ, మురళీ  సోదరులు వచ్చి తమ కాలేజీలో గొడవలకి సంబంధించి సాయం అర్ధించారు. ఈ ముగ్గుర్నీ తనతో కలుపుకుని యూనైటెడ్ ఇండిపెండెంట్స్ అనే స్టూడెంట్ పార్టీని పెట్టించాడు రాధా.  ఇలా తమ నాయకుణ్ణి చంపి, బెజవాడని ఏలుకుంటూ ఏకుమేకైన రాధాని అడ్డు తొలగించు కోవాలనుకుంది కమ్యూనిస్టు పార్టీ. 1974 లో ఒక మామూళ్ళ సెటిల్మెంట్ కోసం ఓ షాపు కెళ్ళిన రాధాని పథకం ప్రకారం పట్టపగలు కత్తులతో పొడిచి చంపేశారు. వెంకట రత్నాన్ని రాధా ఎలా చంపాడో అలాగే తనూ చనిపోయాడు. 

       ఇక గ్యాంగ్ డైలమాలో పడింది. ఇప్పుడు ఎవరు నడపాలి? మళ్ళీ సినిమాల్లో లాగే అమాయకంగా దూరంగా బతుకుతున్న రంగా మీద దృష్టి పడింది. బలవంతం చేసి అతణ్ణి అన్న స్థానంలో కూర్చో బెట్టారు (గాడ్ ఫాదర్ తర్వాత గాడ్ ఫాదర్ చిన్న కొడుకు పరిస్థితీ ఇంతే కదా?- ఇలాటి ఇంకే సినిమాల్లోనూ ఇంతే కదా?). ఐడియాలివ్వడంలో గొప్ప వాళ్ళయిన దేవినేని సోదరులు, రాధాతో బాగానే నెట్టు కొచ్చారు. కానీ ఇప్పుడు రంగాతో అలా లేదు. నగరంలో ప్రైవేట్ సిటీ బస్సుల రద్దుకోసం జరిపిన ఆందోళనకి  తామే సారధ్యం వహించి జేజేలు కొట్టించుకోవడంతో రంగా కన్నెర్ర జేశాడు. దీంతో విడిపోయి కాలేజీలో వేరే పార్టీ పెట్టుకున్నారు దేవినేని సోదరులు- యూనైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ అని.  ఇటు రంగాకి లభిస్తున్న ప్రజాదరణ చూసి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించుకుంది. గుణదలలో జరిగిన ఒక హత్యకి సంబంధించి ప్రతీకారంగా రంగా, 1979లో దేవినేని గాంధీని కాలేజీ క్యాంపస్ లో చంపించేశాడు. దీంతో పగతో రగిలిపోయాడు గాంధీ చిన్న తమ్ముడు మురళీ. రంగా అనుచరుల్ని దొరికిన వాళ్ళని దొరికినట్టు పట్టుకుని చంపేశాడు. 1983 లో ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ స్థాపించడంతో నెహ్రూ, మురళిలు ఆ పార్టీలో చేరిపోయారు. నెహ్రూ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు, రంగా ఓడిపోయాడు. అన్న ఎమ్మెల్యే అవడంతో మురళి ఇంకా చెలరేగిపోయాడు. తన పెద్దన్న చావుకు ప్రతీకారంగా ఎలాగైనా రంగాని చంపాలని ప్రతిన బూనాడు. రంగా భార్యకి ఫోన్ కూడా చేసి బెదిరించాడు. దీంతో నెల్లూరు  వెళ్లి వస్తున్న మురళిని చిలుకలూరి పేట దగ్గర 1988 మార్చిలో దారి కాచి చంపించేశాడు రంగా (ఈ హత్య జరిగినప్పుడు ఈ వ్యాసకర్త విజయవాడలోనే వున్నాడు). సౌమ్యుడైన నెహ్రూ ఆశక్తుడై పోయాడు. ఇక విజయవాడలో రౌడీ రాజకీయాలకి శాశ్వతంగా చుక్క పెట్టాలని నిర్ణయించింది ప్రభుత్వం. బడుగుల సమస్యలపై రంగా నిరాహార దీక్ష చేస్తున్నాడు. అదే 1988 లో, డిసెంబర్ 26 తెల్లవారుజామున అయ్యప్ప భక్తుల్లా ముఠా వచ్చిపడి దీక్షాశిబిరంలోనే రంగానీ, అనుచరుల్నీబాంబులేసి,  నరికి చంపేశారు...ఇదీ సినిమా కథ. 

ఎలావుంది కథ
     చరిత్ర తెలియని, ఆ చరిత్రలోని వ్యక్తుల గురించీ  తెలియని ప్రేక్షకులకైతే ఇది మరో మామూలు దాడి- ప్రతి దాడుల రొటీన్ మాఫియా కథలా వుంటుంది. నేటి ప్రేక్షకులు ఈ సినిమాలో పలికే ఎమోషన్స్ తో కనెక్ట్ అవుతారని చెప్పారు వర్మ. అయితే మంచిదే. కానీ ఆ ఎమోషన్స్ కి ఇవి రియల్ లైఫ్ క్యారక్టర్లు అనే స్పృహ కూడా వుంటేనే బాగా కనెక్ట్ అవగల్గుతారు.  సీదా సాదా హత్యకు ప్రతిహత్యగా, ఓ థ్రిల్లర్ లా అనిపించే ఈ కథలో, బెజవాడ రౌడీల చరిత్ర, ఆ సంఘటనల క్రమం, ఆ వ్యక్తులూ తెలిసి వున్న ప్రేక్షకులతో  పేచీలేదు. ఎలాగూ  ఆ సంఘటనలతో, వ్యక్తులతో  కనెక్ట్ అవుతారు. ఇదలా ఉంచితే, హత్యలకి దారితీసిన పరిస్థితులపై గానీ, మోటివ్స్ పై గానీ  సరైన దృష్టి పెట్టలేదు. అలాగే, పాత్రల మధ్య వాడు మావాణ్ణి చంపాడు, కాబట్టి నేను వాణ్ణి చంపాలన్నట్టుగా –వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత గొడవల్లాగే  చిత్రణ వుంది తప్ప- అప్పట్లో వాళ్ళ చుట్టూ వున్న వాళ్ళ సాంఘీక, రాజకీయ జీవితాలూ పరిస్థితులూ చూపించింది లేదు. ఇందుకు కూడా ఇదొక సాధారణ థ్రిల్లర్ రూపం ధరించి నట్టయింది.  ఈ కథ ఎవరిది? వంగవీటి రంగాదా, లేకపోతే దేవినేని సోదరులదా? దేవినేని సోదరుల  కథ అన్నట్టే తయారయ్యింది. టైటిల్ మాత్రం ‘వంగవీటి’....టైటిల్ ప్రకారం వంగవీటి మోహన రంగారావుని హైలైట్ చేయడానికి ఎందుకో మొహమాట పడ్డారు వర్మ, చివరికి రంగా హత్యని కూడా చప్పగా తేల్చేశారు. రంగా అన్న రాధా హత్యకి కూడా బిల్డప్ ఇవ్వలేదు గానీ, దేవినేని సోదరు లిద్దరి హత్యల్ని మాత్రం టైం తీసుకుని, బిల్డప్పులతో, అంత డిటైల్డ్ గా బాగా చూపించారు. రంగా అనుచరుణ్ణి చంపడానికి మురళీ వెంట తరిమే సీను కూడా చాలా యాక్షన్ తో కూడుకున్నది. ఇలా ప్రేక్షకుల్లోకి ఏ సంకేతాలు పంపదల్చుకున్నారో తెలీదు కానీ,  సానుభూతిని ఎవరిపై ఎక్కుపెట్టారో తెలిసిపోతోంది.

          కానీ రంగా ఒక మహా శక్తిగా ఎదిగాడు. ఎలా ఎదిగాడన్నది చూపించలేదు. బెజవాడ దాటుకుని రాష్ట్రమంతా ప్రసిద్ధుడయ్యాడు రాజకీయాల్లోకి వచ్చాక. ఇది కూడా చూపించలేదు. పేదలకి, బడుగులకి ఒక దేవుడిలా అవతరించాడు. దీని ప్రసక్తి కూడా లేదు. అందుకే ఆయన హత్య తర్వాత బెజవాడ ఒక్కటే కాదు- శ్రీకాకుళం నుంచీ ఆదిలాబాద్ దాకా అట్టుడికి పోయింది. లూటీలూ దహనాలూ జరిగాయి. కమ్మ కులస్థుల్ని టార్గెట్ చేసి వాళ్ళ హోటళ్ళూ, థియేటర్లూ, షాపులూ తగులబెట్టారు. మామూలు జనాలు సైతం ఎగబడి షాపుల్లోంచి టీవీలూ మిక్సీలూ ఎత్తుకెళ్ళారు. రాష్ట్ర వ్యాప్తంగా వందలాది బస్సులు నాశనమయ్యాయి. వారంపాటు స్తంభించిపోయింది రాష్ట్రం. హైదరాబాద్ లో ఆ వర్గం వారి థియేటర్లని తగులబెట్టారు. కాచీగూడ లోని ఎన్టీరామారావు తారకరామా థియేటర్ కూడా ఆహుతయ్యింది. 40 రోజులపాటు కర్ఫ్యూ నీడన మగ్గింది విజయవాడ. ఇంతటి విధ్వంసం రాష్ట్రంలో మళ్ళీ రాజీవ్ గాంధీ హత్య అప్పుడే జరిగింది. రంగా హత్య తర్వాత ఆయన భార్య రత్న కుమారి 1989 లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత తెలుగు దేశంలోకే వెళ్ళారు.

        వర్మ కథలో క్లయిమాక్స్ లో రంగా హత్యా దృశ్యం తుస్సు మన్పించడమే గాక- ఒక వాయిసోవర్ తో కథ ముగించేశారు. రంగా హత్యతో విజయవాడ మాత్రమే విధ్వంసానికి గురయ్యిందన్నారు. హత్య ఎవరు జరిపించారో ఇప్పటికీ ఎవరికీ తెలీదన్నారు. తెలిసి, చూస్తూ వున్నా, ఆ కనక దుర్గమ్మ నోరు విప్పడం లేదని ఒక జోకేసి ముగించారు. రంగా భార్య రత్నకుమారి పాత్రని హత్యలకి ప్రోత్సహించే మనిషిగా చిత్రించారు. ఇదెంతవరకూ నిజం. ఆ పాత్రని అర్ధాంతరంగా ముగించారు. చరిత్రని చూపిస్తున్నప్పుడు ఏదీ దాచకూడదేమో?  రంగా కాపు అయితే, రత్నకుమారి కమ్మ. వాళ్ళది కులాంతర వివాహం. కానీ విచిత్రంగా ఈ రెండు కులాల మధ్యే అగ్ని రాజుకుంది. పోతే, మాట మాత్రంగానైనా ఆ తర్వాత ప్రారంభమైన రత్నకుమారి  రాజకీయ జీవితం గురించి చెప్పలేదు. దేవినేని కుటుంబంలో మిగిలిన నెహ్రూ గురించిన ముక్తాయింపు కూడా లేదు.


        రంగా హత్య ఎవరు జరిపించారో తెలియదన్నారు గానీ, ఒక చోట ఎన్టీఆర్ కాలు, మరో చోట ఎన్టీఆర్ చెయ్యీ ఎందుకలా చూపించారో మరి. వాస్తవంలో రంగా హత్య కేసుని నెహ్రూ ఎదుర్కొన్నాడు. 40 మందికి పైగా అనుచరుల్ని అరెస్ట్ చేశారు. రత్నకుమారి కోరిక మీద కేసుని రంగారెడ్డి కోర్టుకి బదిలీ చేశారు. 2002 లో తీర్పు వచ్చింది. అప్పటికి 13 మంది నిందితులు చనిపోయారు. మిగిలిన వాళ్ళు ప్రాసిక్యూషన్ వైఫల్యంవల్ల విడుదలై పోయారు. ఇలా కేసు మీద తీర్పు కూడా వచ్చింది. 



       వర్మ వంగవీటి- దేవినేనిల ఇమేజిలతో ఎటూ తేల్చుకోలేక, చరిత్రతో ఎందుకొచ్చిం
దన్నట్టు ఓ యాక్షన్ థ్రిల్లర్ లా తీసేశారు. ఈ కథ ద్వారా ఏం చెప్పాలనుకున్నారో తెలీదుగానీ- ఒక సూక్ష్మం మాత్రం బోధపడుతుంది- గ్యాంగ్ స్టర్ అనేవాడు చెప్పుడు మాటలు వింటే ప్రాణాల మీదికే వస్తుందనేది. ఈ కథలో ఇది వెంకటరత్నం హత్యలో, రంగా- దేవినేని సోదరులు విడిపోవడంలో కన్పిస్తుంది. అప్పట్లో రాధా గనుక వెంకట రత్నంని చంపకుండా వేరు కుంపటి పెట్టుకుని వుంటే ఈ రౌడీ రాజకీయం ఇన్ని వరస హత్యలతో ఇన్ని మలుపులు తిరిగేది కాదు. రాధా వేసిన బాటనే మిగిలిన వాళ్ళూ అనుసరిస్తూపోయారు. 


        ఇదలా ఉంచితే, ఈ మొత్తం చరిత్రలో షేక్స్ పియర్ ‘మాక్బెత్’ నీతి కన్పిస్తుంది.
అనుచరుడనే వాడు లీడర్ కి అనుచరుడుగానే వుండాలి. లీడర్ స్థానాన్ని ఆక్రమించడం కోసం లీడర్ ని చంపితే ఏమౌతుందో చరిత్రలో చాలా మాక్బెత్తులు చాలా సార్లు చెప్పాయి. ఒక లీడర్ అనుచరుడు ఎదుటి లీడర్ని కూడా తన లీడర్ ఆదేశాలతో తప్ప చంపకూడదు. అనుచరుడు లీడర్ గా ఎదగాలనుకుంటే వేరు కుంపటి పెట్టుకోవాలి. అప్పుడు లీడర్ అనుచరులకీ తన అనుచరులకీ మధ్య గ్యాంగ్ వార్స్  జరుగుతూండవచ్చు. అప్పటికీ లీడర్ ని చంపకూడదు. కథని ప్రారంభించడానికి లీడర్ని చంపకూడదు, ఒకవేళ కథని ముగించడానికి చంప వచ్చు- వర్మ తీసిన ‘కంపెనీ’ లో సినిమా ముగుస్తూండగా, అజయ్ దేవగణ్  మాఫియా లీడర్ పాత్రని, విజయ్ రాజ్ అనుచరుడి పాత్ర అనూహ్యంగా షూట్ చేసి చంపే ఫినిషింగ్ టచ్ లా...


        ఆధిపత్యం కోసం రాధా వేరు కుంపటి పెట్టుకోకుండా తన లీడర్ వెంకట రత్నాన్నే  చంపాడు. అందుకు త్వరలోనే అనుభవించాడు. రాధా మీద వెంకటరత్నానికి గాసిప్స్ మోసిన వెంకటరత్నం అనుచరులు మాక్బెత్ లో మంత్రగత్తెల పాత్రలే. అలాగే దేవినేని సోదరులమీద గాసిప్స్ మోసిన రంగా అనుచరులు కూడా మాక్బెత్ మంత్రగత్తెల్లాంటి వాళ్ళే. వెంకటరత్నం, రంగాలు ఈ ‘మంత్రగత్తెల’ మాటలకి పడిపోవడం వల్లే అనర్ధాలు జరిగాయి. కానీ వెంకటరత్నంతో రాధా చేసినట్టుగా గాక, తమ లీడర్ రంగా నుంచి విడిపోయి దేవినేని సోదరులు వేరుకుంపటి పెట్టుకున్నారు. ఇక గ్యాంగ్ వార్స్ అనే సహజ పరిణామాలు సంభవించాయి. ఇవి ముదిరి రంగా గాంధీని చంపించాడు. అప్పుడు మురళి రంగా జోలికెళ్ళ కుండా, సరిగ్గానే రంగా అనుచరుల్ని చంపాడు. ఇప్పుడు మిగిలిన రెండో అన్న నెహ్రూని లీడర్ గా తీసుకుని  మురళి అనుచరుడుగా ఉండాల్సిన వాడు. అలా ఉండలేదు. తమ ప్రత్యర్ధి రంగాని స్వతంత్రించి తనే చంపాలనుకున్నాడు. సేమ్ రాధా గతి పట్టింది. అప్పుడు లీడర్లు లీడర్లు  పోరాడుకుని ఒక లీడర్ రంగా హతమయ్యాడు...
        వర్మ తీసిన  ఈ ‘చరిత్ర’ లోంచి ఈ ‘మాక్బెత్’ నీతిని మాత్రమే గ్రహించగలం.



ఎవరెలా చేశారు 
       ప్రతివొక్కరూ బాగా నటించారు. ఇందులో రెండో మాటకి తావులేదు. కాకపోతే వాళ్ళ పాత్రల్నే వర్మ పైపైన తడిమి వదిలెయ్యడంతో సజీవ పాత్రలుగా మాత్రం కన్పించరు.  ఉన్నంత వరకూ పాత్రల్ని అద్భుతంగా నటించారు. అందరూ కొత్త ముఖాలే, ఒక్క లాయర్ పాత్రధారి తప్ప. దీంతో ఫ్రెష్ ఫీలింగ్ కన్పిస్తుంది. కొత్తవాళ్ళయినా నటింప జేసుకోవడంలో వర్మ ఎప్పుడూ విఫలమవలేదు.  సోదరులు రాధా, రంగా రెండు పాత్రల్నీ సమర్ధవంతంగా పోషించాడు సందీప్ కుమార్. ముఖ్యంగా సౌమ్యంగా కన్పించే రంగా పాత్రలో ప్రధానంగా దృష్టిని ఆకర్షిస్తాడు.  ఇక అచ్చం నెహ్రూ లాగే వున్న శ్రీతేజ్ ఇంకొక హైలైట్. చలసాని వెంకటరత్నం (విజయవాడ రాజకీయాల్లో ఇంకో వెంకటరత్నం వుండేవారు- కాంగ్రెస్ మంత్రీ, గొప్ప నాయకుడూ అయిన కాకాని వెంకటరత్నం) పాత్రలో వంశీ నెక్కంటి విచిత్ర  మ్యానరిజమ్స్ ని ప్రదర్శించాడు షార్ట్ టెంపర్ వ్యక్తిత్వంతో. గాంధీగా కౌటిల్య, మురళీగా వంశీ చాగంటి, రత్నకుమారిగా నైనా గంగూలీ కూడా కొత్త వాళ్లన్పించనంత ఈజ్ తో నటించుకు పోయారు. 

        ఈ సినిమా బలహీనత అంతా కూడా కొట్టొచ్చి నట్టు కన్పించే పాత్రల మధ్య కుల సమీకరణలని నిర్వచించక పోవడం దగ్గరే వుంది. నగరంమీద ప్రారంభమైన ఆధిపత్య పోరు కాస్తా కులాధిపత్య పోరుగా పరిణమించి, అంతిమంగా దాని ఫలితాలు అమాయక ప్రజలెలా చవిచూశారో  చెప్పక దాట వెయ్యడంలోనే వుంది.... రత్నకుమారి పాత్ర కేంద్ర బిందువుగా- ఆలంబనగా దీన్ని పకడ్బందీగా చూపించుకు రావొచ్చు.  ఈ పని చేయలేదు. కానీ ఈమె తన స్వకులస్థులైన దేవినేని వర్గీయులనే చంపేందుకు భర్తని ప్రోత్సహించినట్టు చూపించారు.



       ఇది వర్మ చేసిన కల్పనే అయితే,  ఇది ‘మాక్బెత్’ సూత్రాల ప్రకారం కూడా చాలా తప్పు. అధికారంలో వున్న భర్తని భార్య హత్యలకి ప్రోత్సహిస్తోందంటే ఆమెకి సొంత ఎజెండా ఉండొచ్చు. ఆ హత్యా పరంపరలో భర్త రాలిపోతే, ప్రియుడితో కలిసి అధికారాన్ని కైవసం చేసుకోవచ్చని. ‘మాక్బెత్’ చేసే హెచ్చరిక ఇదే (ఇంకా కావాలంటే ‘మాక్బెత్’ ఆధారంగా విశాల్ భరద్వాజ్ తీసిన ‘మక్బూల్’ చూడొచ్చు). కానీ వర్మ చూపించిన ‘భార్య’ పాత్రకి ఇలాటి సొంత ఎజెండాలు కన్పించవు. ఆమె నిజాయితీతోనే వుంటుంది. కానీ ఎలాంటి నిజాయితీ? తను ప్రేమిస్తున్న రంగాతో ఇంట్లో పెళ్ళికి వొప్పుకోకపోతే, ఇల్లొదిలి వచ్చేసిన తనని దేనినేని సోదరులు, తల్లీ  తమ ఇంట్లో పెట్టుకుని రంగాకి నచ్చ జెప్పి పెళ్లి జరిపించారు. అలాటి సహృదయుల పైన భర్తని  ఎలా ఎక్కుబెడుతుందామె? మధ్య వర్తిత్వం నెరపి ఉద్రిక్తతల్ని సడలింప జేయొచ్చుగా? అంత నెగెటివ్ రోల్ ప్లే చేసిన పాత్ర చివరికి ఏం సాధించింది? పే ఆఫ్ కాని  పాత్ర ప్రవర్తనని వూరికే సెటప్ చేయడమెందుకు?


         ఇక దేవినేని సోదరులే తమ కులస్థురాల్ని కాపు కులస్థుడైన రంగాకి నచ్చ జెప్పి పెళ్లి జరిపించినట్టు చూపించినప్పుడు,  ఇది డ్రమెటిక్ సందర్భం వాళ్ళ నిజజీవితాల్లో కూడా. కులాంతర వివాహంతో ముడిపడిన ఈ డ్రమెటిక్ సందర్భమే ఆ తర్వాత వాళ్ళ మధ్య అన్ని సంఘర్షణల్లోనూ వర్మ గుర్తు చేయాలి నిజానికి - చరిత్ర మీద కామెంట్ చేయబూనిన ఒక దర్శకుడైతే. ఏదీ దాచకుండా చరిత్రని ఎత్తి చూపించి ప్రశ్నించి నప్పుడే ఇలాటి సినిమాల్లో దర్శకత్వ నిబద్ధత కనబడేది. దేనికో వెరచి, ఎందుకో సందేహపడి తటస్థ వైఖరిని వదులుకుంటే అది రాజకీయనాయకుడి లక్షణమౌతుంది.  చరిత్ర బ్యాడ్ జర్నలిజమని ఇందుకే అని ఉంటాడు జోసెఫ్ క్యాంప్ బెల్. ఇది నిజం చేశారు వర్మ. అంత నిర్భయంగా ట్వీట్లు చేసే వర్మ,  సినిమాలో తన సహజ శైలి ఫీట్లు చేయక, నిమ్మకు నీరెత్తి నట్టుండిపోయారు- మొక్కుబడి యాక్షన్ థ్రిల్లర్ చూపించేస్తూ. 



      పోస్టర్ల మీద ‘కాపు కాసే శక్తి’ అని కులప్రస్తావన తెచ్చినంత స్వేచ్ఛగా కథలో తిరుగాడలేక పోయారు వర్మ. కాదనలేని ఈ కులాల కోణాన్ని కథకి ఆత్మగా చేసుకుని వుంటే, అదే ఎమోషనల్ థ్రెడ్ గా మారి అద్భుతం చేసివుండేది ఈ సినిమాకి. ఈ కథలో మొదట కులాలకతీతంగా వున్నపాత్రలు ఎలా దిగజారిపోయాయో ఒక బలమైన ముద్రతో చెప్పే వీలుండేది. చరిత్రని ఉన్నదున్నట్టో, అసమగ్రంగానో, అర్ధసత్యాలతోనో చూపించి చేతులు దులుపుకోకుండా, ఆ చరిత్ర సృష్టించిన మనుషులు మిస్సయ్యిందేమిటో,  అది ఎత్తి చూపిస్తూ సమాజానికో హెచ్చరిక పంప గలగాలి. తన యుక్త వయస్సు నుంచీ ఈ హింసారి రంసని గమనిస్తూ వచ్చానంటున్న వర్మ- ఒక్క మాటలో ఈ చరిత్ర మీద తన అభిప్రాయమేమిటో చెప్పి ఉండాల్సింది. రిపోర్టింగ్ చేయడం అభిప్రాయం చెప్పడం కాదు. 

        ఒక్కో హత్య జరిగినప్పుడల్లా వర్మ తన వాయిస్ తో  వ్యాఖ్యానాలు చేయడం కథని ముందుకు నడిపించే మంచి టూల్ గానే ఉపయోగపడింది గానీ, ఒక్కోసారి అదే కర్ణక ఠోరంగా పరిణమించిన  మాట కూడా నిజం. అలాగే ఎమోషన్లు పెంచడానికి సెకండాఫ్ లో వరుసగా బ్యాక్ గ్రౌండ్ లో తన స్టయిల్ లో పెట్టిన అరుపుల పాటలతో ఆయా విష పరిణామాలని చూపించడం కూడా పైపైన వేసిన పూతే.  ఎమోషన్ అనేది కథలో వుండే పాయింటు లోంచి కదా పుట్టాలి. ఆ పాయింటు పాత్రలు విస్మరిస్తున్న అంతకి ముందున్న సెక్యులరిజమే. పాయింటుతో కట్టి పడెయ్యకుండా సినిమాని నిలబెట్టడం కష్టం. ‘షిండ్లర్స్ లిస్ట్’ అనే స్పీల్ బెర్గ్ తీసిన నాజీల చరిత్రలో- విలాసవంతంగా జీవిస్తూండే వ్యాపారవేత్త, ఎందుకని లక్షాలాది మంది యూదుల్ని తన సొంత ఖర్చుతో నాజీల ఊచకోత నుంచి తప్పిస్తూ పొరుగు దేశాలకి తరలిస్తూ పోయాడు? కేవలం తనలో మేల్కొన్న మానవత్వం కారణంగానే! ఈ మానవత్వమనే పాయింటే  సినిమాకి ఆత్మ అయింది. అక్షయ్ కుమార్ నటించిన ‘ఏర్ లిఫ్ట్’ లో కూడా ఇంతే. ఎన్ని ఇజాలు పెట్టుకున్నా అవన్నీ మానవిజం కిందే వుంటాయి.

        సినిమాలో మాటలు పొట్టిగా సూటిగా బలంగా బావున్నాయి. టెక్నికల్ గా కంటిన్యూటీ ప్రాబ్లమ్స్ వున్నాయి. ఒకే సీన్లో రాధాని చంపే ముందు,  షాపు ముందు వుండే తడి నేల, వెంటనే పొడి నేలగా కన్పిస్తుంది. టీడీపీ పార్టీ అవిర్భవించినట్టు డైరెక్టుగా పసుపు జెండాలు చూపించకుండా కాస్త కాషాయంగా వుండే పతాకాలు చూపించారు.  అదే నెహ్రూ ఎన్నికల ప్రచారంలో అవికాస్తా ఒరిజినల్ తెలుగుదేశం పసుపు పచ్చ జెండల్లా బస్తీమే సవాల్ గా రెపరెప లాడుతున్నాయని చూసుకోలేదేమో కాస్ట్యూమ్స్ అతను- ఆర్ట్ డైరెక్టర్ కూడా.




        లొకేషన్స్ పరంగా ఆనాటి  విజయవాడని పకడ్బందీగా చూపించారు. ఇప్పుడు అభివృద్ధి చెందిన ప్రాంతాలు వ్యూలోకి రాకుండా ఏరియల్  షాట్స్ మేనేజ్ చేశారు. అలాగే ఒక్కో హత్యా దృశ్యాల సెటప్ ని – యాక్షన్స్ నీ అద్భుతమైన సస్పెన్సుతో  క్రియేట్ చేస్తూ పోయారు. మురళిని చంపేటప్పుడు ఓపెనయ్యే లారీ బాడీలో, ముందు కత్తులూ కటార్లూ టపటప వచ్చి పడే సీను ఒక మార్వెలస్ క్రియేషన్. 


స్క్రీన్ ప్లే సంగతులు

      వర్మ ఫ్లాష్ బ్యాకుల జోలికి పోరు- అదే ఈ స్క్రీన్ ప్లేకి పెద్ద మైనస్. కచ్చితంగా ఫ్లాష్ బ్యాక్స్ ని డిమాండ్ చేసే కథిది. అప్పుడే ఏకత్రాటి పైకి కథ రావడమే గాక, ఒకే పాత్ర ఆధారంగా కథని నడిపించడానికి వీలవుతుంది. సినిమా కథ ఎప్పుడూ ఒక్క పాత్రదే అయ్యుంటుంది. మిగిలిన పాత్రలు ఆ ఒక్క పాత్ర కథలో అంతర్భాగంగా  వుంటాయి.  కారణాలేవైతేనేం, పెట్టుకున్న టైటిల్ ప్రకారం వంగవీటి రంగా కథగా చూపించదల్చు కోలేదు వర్మ. అందులో అంతర్భాగంగా దేవినేనిల కథనీ  చెప్పదల్చుకోలేదు. కానీ వంగవీటి సోదరులు లేకపోతే దేవినేని సోదరులే లేరు. ఇంకా చెప్పాలంటే వెంకటరత్నం లేకపోతే  ఇంకెవరూ లేరు, ఈ చరిత్రే లేదు. ఇప్పుడు పనిగట్టుకుని వంగవీటి రంగా జీవిత చరిత్ర తీయడం, అందులో ఆయన్ని ప్రజాబాంధవ్యుడిగా చిత్రించడం వర్మ చేసేపని కూడా కాదు. ఎందుకంటే ఆయన వ్యక్తి ఆరాధనకి దూరం. ఎవరి భజనా చెయ్యరు. ఇది మంచిదే. కానీ స్క్రీన్ ప్లే కి ఏది మంచిది? 

        చరిత్రలో ఎవరికీ ప్రాధాన్య మివ్వకుండా అందరి జీవితాలనీ కలిపి డాక్యుమెంటేషన్  చేస్తే అది సినిమా స్క్రీన్ ప్లే అవతుందా? కథలతో అపార అనుభవమున్న వర్మ కివన్నీ తెలీవని కాదు, తెలీదన్నట్టు ఇలా రాయడం కూడా మంచిదికాదు. కానీ ఫలితం సినిమాటిక్ అనుభవానికి భిన్నంగా వచ్చింది. సినిమా స్క్రీన్ ప్లేని వదిలేసి డాక్యుమెంటేషన్ చేస్తూ డాక్యూ డ్రామా చేశారు కాబట్టే అనేక సార్లు మధ్య మధ్యలో తన వాయిసోవర్ తో వ్యాఖ్యానాలు చేయాల్సి వచ్చింది. ఇదంతా  సినిమాటిక్ అనుభవాన్ని దెబ్బ తీసింది. ఒకే పాత్ర- ఒక లక్ష్యం అన్నట్టుగా ఉంటేనే కదా స్క్రీన్ ప్లే అన్పించుకునేది. రాసుకున్నవన్నీ స్క్రీన్ ప్లేలు అయిపోవుగా. 


        వివాదం ఎప్పుడు వుంటుంది? రెండు వర్గాలున్నప్పుడే. వివాదాస్పద కథల జోలికెళ్ళి నప్పుడు-రెండు వర్గాల్నీ బ్యాలెన్స్ చేయాల్సి వుంటుంది. ఆ బ్యాలెన్సింగ్ కోసం అందర్నీ కలిపేసి డాక్యుమెంటేషన్ చేస్తే సినిమా అవదు. ‘గాంధీ’ జీవిత చరిత్రతో  సినిమా ఎలా తీయాలన్నప్పుడే అటెన్ బరోకి అమల్లో వున్న స్క్రీన్ ప్లే సూత్రాల్ని తనకోసం కస్టమైజ్ చేసుకోవాలన్పించింది. లేకపోతే గాంధీ జీవితంలో జరిగిన ఎన్నో మహత్తర సంఘటనల్ని ఒక కథగా చెప్పడం కుదరదు. ఆయన జీవితంలోంచి నాల్గే ఘట్టాలు- దక్షిణాఫ్రికాలో న్యాయవాదిగా జీవితం, అవమానం, అందులోంచి లక్ష్యం; భారత్ కి తిరిగి వచ్చి ఆ లక్ష్య సాధనకోసం సహాయ నిరాకరణోద్యమం, మతకలహాలు, మరణం- ఇలా విభజించుకుని స్క్రీన్ ప్లే చేస్తే,  అది సమగ్ర రూపంలో గాంధీ జీవితంలా వచ్చింది. 


        ‘వంగవీటి’ ని ఇలా చేయాలనీ కాదు, రెండు వర్గాలున్నప్పుడు వంగవీటి ని హైలైట్  చేస్తే అది వివాదాస్పదం కావొచ్చు. పైగా వ్యక్తి ఆరాధన కూడా కావొచ్చు. అందుకే ఇలా జరక్కుండా టైటిల్ ఒకటిగా, సినిమా ఇంకొకటిగా తీశారు. ఇలాకాకుండా స్క్రీన్ ప్లే చట్రంలోకి వచ్చి, ఒకే పాత్ర- ఒకే లక్ష్యం అనుకుని,  ఈ సూత్రాన్ని అవసరానికి తగ్గట్టుగా సినిమాటిక్ అనుభవంతో, కస్టమైజ్ చేసుకుంటే సరిపోతుంది. 


        ఒకే పాత్ర (వంగవీటి)- ఒకే లక్ష్యం (దేవినేనిలు), ఒకే పాత్ర (దేవినేని నెహ్రూ)- ఒకే లక్ష్యం (రంగా). ఇలా ఇద్దరి వేర్వేరు వ్యవహారాల డైనమిక్స్ ని  సమాంతరంగా రన్ చేయడం. ఓపెనింగ్ మురళి మర్డర్ తో. దీంతో నెహ్రూ దృక్కోణంలో ఫ్లాష్ బ్యాక్- తాము రంగా బ్యాచిలో చేరినప్పట్నించీ మురళి మర్డర్ వరకూ- రాజకీయాల్లోకి వచ్చాక తాను సాధించిన విజయాలూ కలుపుకుని.  అటు రంగా దృక్కోణంలో ఫ్లాష్ బ్యాక్- వెంకటరత్నం దగ్గర్నుంచీ తన అన్న మర్డర్, దాంతో  తాను బాస్ అయిన విధం వరకూ- - రాజకీయాల్లోకి వచ్చాక తాను సాధించిన విజయాలూ కలుపుకుని. ఇప్పుడు ఇద్దరి సమగ్ర రూప మేర్పడింది, ఎవరేమిటో స్పష్టమైన ముఖ చిత్రం కళ్ళకి కట్టింది. ఇక క్లయిమాక్స్...రంగా మరణం, నెహ్రూ అరెస్ట్, అల్లర్లు, ఎండ్ టైటిల్స్ తో కేసు పరిణామాలు వగైరా. 


        వర్మ ఒక్కో హత్యని  ఒక్కో ప్లాట్ పాయింటుగా  పెట్టుకుంటూ పోయారు. బిగినింగ్ విభాగంలో రాధా  ఎదుగుదలలో భాగంగా వెంకటరత్నం మర్డర్ వేశారు.  తర్వాత రాధా మర్డర్ తో ప్లాట్ పాయింట్ వన్ ని  తెచ్చి, బిగినింగ్ ని ముగిస్తూ  రంగాని  ముగ్గులోకి దింపారు. ఇప్పుడు మిడిల్ ప్రారంభిస్తూ దేవినేనిలతో సంఘర్షణ పుట్టించి, ఇంటర్వెల్లో దేవినేని గాంధీ మర్డర్ వేశారు. మళ్ళీ ఈ మిడిల్ ని  కంటిన్యూ చేస్తూ సెకండాఫ్ లో,  ప్లాట్ పాయింట్ టూ గా,  మురళీ మర్డర్ వేశారు. దీనితర్వాత  రంగా మర్డర్ తో క్లయిమాక్స్.   


        ఇలా చేయడం వల్ల గుంపుగుత్తగా రెండు వర్గాల కథల్నీ కలగాపులగం చేసినట్టయ్యింది. దీంతో చూసేవాళ్ళకి ఆటోమేటిగ్గా ఎవరు హీరో, ఎవరు ఈ కథ నడిపిస్తున్నారూ అన్న సైకలాజికల్ కనెక్షన్ సంబంధ గడబిడ మొదలయింది. ఈ మొత్తాన్నీ పైన చెప్పుకున్న విధంగా, కస్టమైజ్ చేసుకుని వుంటే,  ఆ విడి విడి కథల్లో ఇద్దరూ హీరోలుగానే కన్పించే వాళ్ళు - ఎవరు తప్పు, ఎవరు ఒప్పు అన్నది ప్రేక్షకులకే వదిలేస్తూ.

-సికిందర్
http://www.cinemabazaar.in