రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

23, డిసెంబర్ 2016, శుక్రవారం

రివ్యూ!


దర్శకత్వం: రామ్‌ గోపాల్‌ వర్మ
తారాగణం: సందీప్ కుమార్, నైనా గంగూలీ, వంశీ చాగంటి, శ్రీతేజ్‌, కౌటిల్య, వంశీ నెక్కంటి తదితరులు
కథ- స్క్రీన్ ప్లే : రాం గోపాల్ వర్మ,
రచన: చైతన్య ప్రసాద్‌, రాధాకృష్ణ, సంగీతం: రవిశంకర్‌, ఛాయాగ్రహణం: రాహుల్‌ శ్రీవాస్తవ్‌, దిలీప్‌ వర్మ, సూర్య చౌదరి
బ్యానర్‌: రామదూత క్రియేషన్స్‌
నిర్మాత: దాసరి కిరణ్‌ కుమార్‌
విడుదల : డిసెంబర్ 23, 2016
***
1970- 80లలో విజయవాడలో కొనసాగిన రౌడీ రాజకీయాలకి  రాం గోపాల్ వర్మ తనదైన  వెర్షన్ తో తెర రూపం ఇచ్చారు. వంగవీటి- దేవినేని కుటుంబాల మధ్య గొడవలు, పరస్పర హత్యలూ చూపించారు. ఒకప్పుడు రౌడీయిజం ఎలా రాజ్యమేలేదో వంగవీటి మోహనరంగా హత్య జరిగిన ఎడాది లోగానే, హైదరాబాద్ నేపధ్యంలో  ‘శివ’  ద్వారా తెలియజేశారు. ‘శివ’ నుంచీ ‘వంగవీటి’ వరకూ వచ్చిన వర్మ-  చరిత్రని కాల్పనీకం చేయడంలో- మధ్యలో తీసిన  ‘రక్తచరిత్ర’ తో కొంత వరకు నిరూపించుకున్నారు. ఆ నిరూపణతో విజయవంతంగా ‘కిల్లింగ్ వీరప్పన్’ కూడా  తీశారు. పరిటాల రవి, వీరప్పన్ లు ఈ కాలం ప్రేక్షకులకి తెలిసిన వాళ్ళే. వీళ్ళకీ 1970- 80 లనాటి దేనినేనీ- వంగవీటి లకీ మధ్య మూడు దశాబ్దాల అంతరం వుంది. ఈ అంతరాన్ని అధిగమిస్తూ ఆనాటి వ్యక్తులకి నేటి ప్రేక్షకులు కనెక్ట్ అవడానికి వర్మ ఏం జాగ్రత్తలు తీసుకున్నారు? ‘వంగవీటి’ అనే టైటిల్ కి ఎంత వరకు న్యాయం చేశారు? మొత్తంగా ఈ చరిత్ర ద్వారా ఏం చెప్పాలనుకున్నారు?.....ఈ ప్రశ్నలకి సమాధానాలు ఈ కింద వెతుక్కుందాం.
కథ





      (చరిత్ర తెలియని వాళ్ళ కోసం కథని పూర్తి పేర్లతో, తేదీలతో  విడమర్చి చెప్పాల్సి వస్తోంది)...1972 లో విజయవాడని గడగడ లాడించిన కమ్యూనిస్టు రౌడీ నాయకుడు చలసాని వెంకటరత్నం హత్య జరిగింది. హత్య చేసిన వాడు వంగవీటి రాధా కృష్ణ మూర్తి అలియాస్ రాధ. ఎందుకు హత్య చేశాడంటే,  కేవలం బస్టాండ్ రాధాగా బస్టాండ్   వరకే రౌడీయిజం చేసుకుంటున్న తనని వెంకటరత్నం గ్యాంగులో చేర్చుకున్నాడు. రాధాకి ఆశ పెరిగింది. వెంకటరత్నం ని అడ్డుపెట్టుకుని బెజవాడ వ్యాప్తంగా ఎదగాలని కలలు గన్నాడు. ఇది వెంకటరత్నంకి తెలిసి ఘోరంగా అవమానించాడు. దీంతో కక్ష పెంచుకుని తన గ్యాంగుతో కలిసి వెంకట రత్నాన్ని కత్తులతో పొడిచి చంపేశాడు రాధ. వెంకట రత్నం అనుచరుల్ని కూడా ఊచకోత కోసి వెంకటరత్నం స్థానాన్ని కైవసం చేసుకుని బెజవాడకి కింగ్ అయ్యాడు. రిక్షా యూనియన్లూ, టాక్సీ యూనియన్లూ వెంకటరత్నం నుంచి రాధా  ఖాతాలోకి బదిలీ అయిపోయాయి. ముఠా ప్రధాన ఆదాయ మార్గం రౌడీ మామూళ్ళు వసూలు చేసుకోవడమే. 

         రాధా  తమ్ముడు మోహన రంగారావు అలియాస్ రంగా. ఇతను సినిమాల్లో లాగే అన్నో తండ్రో మాఫియా అయితే దూరంగా తన మానాన తాను అమాయకంగా బతికే యువకుడు లాంటి వాడు (‘గాడ్ ఫాదర్’ చిన్న కొడుకు కూడా ఇంతే కదా?). బాగా పరపతి పెంచుకున్న రాధా  దగ్గరికి ముగ్గురు స్టూడెంట్స్ – దేనినేని గాంధీ, నెహ్రూ, మురళీ  సోదరులు వచ్చి తమ కాలేజీలో గొడవలకి సంబంధించి సాయం అర్ధించారు. ఈ ముగ్గుర్నీ తనతో కలుపుకుని యూనైటెడ్ ఇండిపెండెంట్స్ అనే స్టూడెంట్ పార్టీని పెట్టించాడు రాధా.  ఇలా తమ నాయకుణ్ణి చంపి, బెజవాడని ఏలుకుంటూ ఏకుమేకైన రాధాని అడ్డు తొలగించు కోవాలనుకుంది కమ్యూనిస్టు పార్టీ. 1974 లో ఒక మామూళ్ళ సెటిల్మెంట్ కోసం ఓ షాపు కెళ్ళిన రాధాని పథకం ప్రకారం పట్టపగలు కత్తులతో పొడిచి చంపేశారు. వెంకట రత్నాన్ని రాధా ఎలా చంపాడో అలాగే తనూ చనిపోయాడు. 

       ఇక గ్యాంగ్ డైలమాలో పడింది. ఇప్పుడు ఎవరు నడపాలి? మళ్ళీ సినిమాల్లో లాగే అమాయకంగా దూరంగా బతుకుతున్న రంగా మీద దృష్టి పడింది. బలవంతం చేసి అతణ్ణి అన్న స్థానంలో కూర్చో బెట్టారు (గాడ్ ఫాదర్ తర్వాత గాడ్ ఫాదర్ చిన్న కొడుకు పరిస్థితీ ఇంతే కదా?- ఇలాటి ఇంకే సినిమాల్లోనూ ఇంతే కదా?). ఐడియాలివ్వడంలో గొప్ప వాళ్ళయిన దేవినేని సోదరులు, రాధాతో బాగానే నెట్టు కొచ్చారు. కానీ ఇప్పుడు రంగాతో అలా లేదు. నగరంలో ప్రైవేట్ సిటీ బస్సుల రద్దుకోసం జరిపిన ఆందోళనకి  తామే సారధ్యం వహించి జేజేలు కొట్టించుకోవడంతో రంగా కన్నెర్ర జేశాడు. దీంతో విడిపోయి కాలేజీలో వేరే పార్టీ పెట్టుకున్నారు దేవినేని సోదరులు- యూనైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ అని.  ఇటు రంగాకి లభిస్తున్న ప్రజాదరణ చూసి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించుకుంది. గుణదలలో జరిగిన ఒక హత్యకి సంబంధించి ప్రతీకారంగా రంగా, 1979లో దేవినేని గాంధీని కాలేజీ క్యాంపస్ లో చంపించేశాడు. దీంతో పగతో రగిలిపోయాడు గాంధీ చిన్న తమ్ముడు మురళీ. రంగా అనుచరుల్ని దొరికిన వాళ్ళని దొరికినట్టు పట్టుకుని చంపేశాడు. 1983 లో ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ స్థాపించడంతో నెహ్రూ, మురళిలు ఆ పార్టీలో చేరిపోయారు. నెహ్రూ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు, రంగా ఓడిపోయాడు. అన్న ఎమ్మెల్యే అవడంతో మురళి ఇంకా చెలరేగిపోయాడు. తన పెద్దన్న చావుకు ప్రతీకారంగా ఎలాగైనా రంగాని చంపాలని ప్రతిన బూనాడు. రంగా భార్యకి ఫోన్ కూడా చేసి బెదిరించాడు. దీంతో నెల్లూరు  వెళ్లి వస్తున్న మురళిని చిలుకలూరి పేట దగ్గర 1988 మార్చిలో దారి కాచి చంపించేశాడు రంగా (ఈ హత్య జరిగినప్పుడు ఈ వ్యాసకర్త విజయవాడలోనే వున్నాడు). సౌమ్యుడైన నెహ్రూ ఆశక్తుడై పోయాడు. ఇక విజయవాడలో రౌడీ రాజకీయాలకి శాశ్వతంగా చుక్క పెట్టాలని నిర్ణయించింది ప్రభుత్వం. బడుగుల సమస్యలపై రంగా నిరాహార దీక్ష చేస్తున్నాడు. అదే 1988 లో, డిసెంబర్ 26 తెల్లవారుజామున అయ్యప్ప భక్తుల్లా ముఠా వచ్చిపడి దీక్షాశిబిరంలోనే రంగానీ, అనుచరుల్నీబాంబులేసి,  నరికి చంపేశారు...ఇదీ సినిమా కథ. 

ఎలావుంది కథ
     చరిత్ర తెలియని, ఆ చరిత్రలోని వ్యక్తుల గురించీ  తెలియని ప్రేక్షకులకైతే ఇది మరో మామూలు దాడి- ప్రతి దాడుల రొటీన్ మాఫియా కథలా వుంటుంది. నేటి ప్రేక్షకులు ఈ సినిమాలో పలికే ఎమోషన్స్ తో కనెక్ట్ అవుతారని చెప్పారు వర్మ. అయితే మంచిదే. కానీ ఆ ఎమోషన్స్ కి ఇవి రియల్ లైఫ్ క్యారక్టర్లు అనే స్పృహ కూడా వుంటేనే బాగా కనెక్ట్ అవగల్గుతారు.  సీదా సాదా హత్యకు ప్రతిహత్యగా, ఓ థ్రిల్లర్ లా అనిపించే ఈ కథలో, బెజవాడ రౌడీల చరిత్ర, ఆ సంఘటనల క్రమం, ఆ వ్యక్తులూ తెలిసి వున్న ప్రేక్షకులతో  పేచీలేదు. ఎలాగూ  ఆ సంఘటనలతో, వ్యక్తులతో  కనెక్ట్ అవుతారు. ఇదలా ఉంచితే, హత్యలకి దారితీసిన పరిస్థితులపై గానీ, మోటివ్స్ పై గానీ  సరైన దృష్టి పెట్టలేదు. అలాగే, పాత్రల మధ్య వాడు మావాణ్ణి చంపాడు, కాబట్టి నేను వాణ్ణి చంపాలన్నట్టుగా –వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత గొడవల్లాగే  చిత్రణ వుంది తప్ప- అప్పట్లో వాళ్ళ చుట్టూ వున్న వాళ్ళ సాంఘీక, రాజకీయ జీవితాలూ పరిస్థితులూ చూపించింది లేదు. ఇందుకు కూడా ఇదొక సాధారణ థ్రిల్లర్ రూపం ధరించి నట్టయింది.  ఈ కథ ఎవరిది? వంగవీటి రంగాదా, లేకపోతే దేవినేని సోదరులదా? దేవినేని సోదరుల  కథ అన్నట్టే తయారయ్యింది. టైటిల్ మాత్రం ‘వంగవీటి’....టైటిల్ ప్రకారం వంగవీటి మోహన రంగారావుని హైలైట్ చేయడానికి ఎందుకో మొహమాట పడ్డారు వర్మ, చివరికి రంగా హత్యని కూడా చప్పగా తేల్చేశారు. రంగా అన్న రాధా హత్యకి కూడా బిల్డప్ ఇవ్వలేదు గానీ, దేవినేని సోదరు లిద్దరి హత్యల్ని మాత్రం టైం తీసుకుని, బిల్డప్పులతో, అంత డిటైల్డ్ గా బాగా చూపించారు. రంగా అనుచరుణ్ణి చంపడానికి మురళీ వెంట తరిమే సీను కూడా చాలా యాక్షన్ తో కూడుకున్నది. ఇలా ప్రేక్షకుల్లోకి ఏ సంకేతాలు పంపదల్చుకున్నారో తెలీదు కానీ,  సానుభూతిని ఎవరిపై ఎక్కుపెట్టారో తెలిసిపోతోంది.

          కానీ రంగా ఒక మహా శక్తిగా ఎదిగాడు. ఎలా ఎదిగాడన్నది చూపించలేదు. బెజవాడ దాటుకుని రాష్ట్రమంతా ప్రసిద్ధుడయ్యాడు రాజకీయాల్లోకి వచ్చాక. ఇది కూడా చూపించలేదు. పేదలకి, బడుగులకి ఒక దేవుడిలా అవతరించాడు. దీని ప్రసక్తి కూడా లేదు. అందుకే ఆయన హత్య తర్వాత బెజవాడ ఒక్కటే కాదు- శ్రీకాకుళం నుంచీ ఆదిలాబాద్ దాకా అట్టుడికి పోయింది. లూటీలూ దహనాలూ జరిగాయి. కమ్మ కులస్థుల్ని టార్గెట్ చేసి వాళ్ళ హోటళ్ళూ, థియేటర్లూ, షాపులూ తగులబెట్టారు. మామూలు జనాలు సైతం ఎగబడి షాపుల్లోంచి టీవీలూ మిక్సీలూ ఎత్తుకెళ్ళారు. రాష్ట్ర వ్యాప్తంగా వందలాది బస్సులు నాశనమయ్యాయి. వారంపాటు స్తంభించిపోయింది రాష్ట్రం. హైదరాబాద్ లో ఆ వర్గం వారి థియేటర్లని తగులబెట్టారు. కాచీగూడ లోని ఎన్టీరామారావు తారకరామా థియేటర్ కూడా ఆహుతయ్యింది. 40 రోజులపాటు కర్ఫ్యూ నీడన మగ్గింది విజయవాడ. ఇంతటి విధ్వంసం రాష్ట్రంలో మళ్ళీ రాజీవ్ గాంధీ హత్య అప్పుడే జరిగింది. రంగా హత్య తర్వాత ఆయన భార్య రత్న కుమారి 1989 లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత తెలుగు దేశంలోకే వెళ్ళారు.

        వర్మ కథలో క్లయిమాక్స్ లో రంగా హత్యా దృశ్యం తుస్సు మన్పించడమే గాక- ఒక వాయిసోవర్ తో కథ ముగించేశారు. రంగా హత్యతో విజయవాడ మాత్రమే విధ్వంసానికి గురయ్యిందన్నారు. హత్య ఎవరు జరిపించారో ఇప్పటికీ ఎవరికీ తెలీదన్నారు. తెలిసి, చూస్తూ వున్నా, ఆ కనక దుర్గమ్మ నోరు విప్పడం లేదని ఒక జోకేసి ముగించారు. రంగా భార్య రత్నకుమారి పాత్రని హత్యలకి ప్రోత్సహించే మనిషిగా చిత్రించారు. ఇదెంతవరకూ నిజం. ఆ పాత్రని అర్ధాంతరంగా ముగించారు. చరిత్రని చూపిస్తున్నప్పుడు ఏదీ దాచకూడదేమో?  రంగా కాపు అయితే, రత్నకుమారి కమ్మ. వాళ్ళది కులాంతర వివాహం. కానీ విచిత్రంగా ఈ రెండు కులాల మధ్యే అగ్ని రాజుకుంది. పోతే, మాట మాత్రంగానైనా ఆ తర్వాత ప్రారంభమైన రత్నకుమారి  రాజకీయ జీవితం గురించి చెప్పలేదు. దేవినేని కుటుంబంలో మిగిలిన నెహ్రూ గురించిన ముక్తాయింపు కూడా లేదు.


        రంగా హత్య ఎవరు జరిపించారో తెలియదన్నారు గానీ, ఒక చోట ఎన్టీఆర్ కాలు, మరో చోట ఎన్టీఆర్ చెయ్యీ ఎందుకలా చూపించారో మరి. వాస్తవంలో రంగా హత్య కేసుని నెహ్రూ ఎదుర్కొన్నాడు. 40 మందికి పైగా అనుచరుల్ని అరెస్ట్ చేశారు. రత్నకుమారి కోరిక మీద కేసుని రంగారెడ్డి కోర్టుకి బదిలీ చేశారు. 2002 లో తీర్పు వచ్చింది. అప్పటికి 13 మంది నిందితులు చనిపోయారు. మిగిలిన వాళ్ళు ప్రాసిక్యూషన్ వైఫల్యంవల్ల విడుదలై పోయారు. ఇలా కేసు మీద తీర్పు కూడా వచ్చింది. 



       వర్మ వంగవీటి- దేవినేనిల ఇమేజిలతో ఎటూ తేల్చుకోలేక, చరిత్రతో ఎందుకొచ్చిం
దన్నట్టు ఓ యాక్షన్ థ్రిల్లర్ లా తీసేశారు. ఈ కథ ద్వారా ఏం చెప్పాలనుకున్నారో తెలీదుగానీ- ఒక సూక్ష్మం మాత్రం బోధపడుతుంది- గ్యాంగ్ స్టర్ అనేవాడు చెప్పుడు మాటలు వింటే ప్రాణాల మీదికే వస్తుందనేది. ఈ కథలో ఇది వెంకటరత్నం హత్యలో, రంగా- దేవినేని సోదరులు విడిపోవడంలో కన్పిస్తుంది. అప్పట్లో రాధా గనుక వెంకట రత్నంని చంపకుండా వేరు కుంపటి పెట్టుకుని వుంటే ఈ రౌడీ రాజకీయం ఇన్ని వరస హత్యలతో ఇన్ని మలుపులు తిరిగేది కాదు. రాధా వేసిన బాటనే మిగిలిన వాళ్ళూ అనుసరిస్తూపోయారు. 


        ఇదలా ఉంచితే, ఈ మొత్తం చరిత్రలో షేక్స్ పియర్ ‘మాక్బెత్’ నీతి కన్పిస్తుంది.
అనుచరుడనే వాడు లీడర్ కి అనుచరుడుగానే వుండాలి. లీడర్ స్థానాన్ని ఆక్రమించడం కోసం లీడర్ ని చంపితే ఏమౌతుందో చరిత్రలో చాలా మాక్బెత్తులు చాలా సార్లు చెప్పాయి. ఒక లీడర్ అనుచరుడు ఎదుటి లీడర్ని కూడా తన లీడర్ ఆదేశాలతో తప్ప చంపకూడదు. అనుచరుడు లీడర్ గా ఎదగాలనుకుంటే వేరు కుంపటి పెట్టుకోవాలి. అప్పుడు లీడర్ అనుచరులకీ తన అనుచరులకీ మధ్య గ్యాంగ్ వార్స్  జరుగుతూండవచ్చు. అప్పటికీ లీడర్ ని చంపకూడదు. కథని ప్రారంభించడానికి లీడర్ని చంపకూడదు, ఒకవేళ కథని ముగించడానికి చంప వచ్చు- వర్మ తీసిన ‘కంపెనీ’ లో సినిమా ముగుస్తూండగా, అజయ్ దేవగణ్  మాఫియా లీడర్ పాత్రని, విజయ్ రాజ్ అనుచరుడి పాత్ర అనూహ్యంగా షూట్ చేసి చంపే ఫినిషింగ్ టచ్ లా...


        ఆధిపత్యం కోసం రాధా వేరు కుంపటి పెట్టుకోకుండా తన లీడర్ వెంకట రత్నాన్నే  చంపాడు. అందుకు త్వరలోనే అనుభవించాడు. రాధా మీద వెంకటరత్నానికి గాసిప్స్ మోసిన వెంకటరత్నం అనుచరులు మాక్బెత్ లో మంత్రగత్తెల పాత్రలే. అలాగే దేవినేని సోదరులమీద గాసిప్స్ మోసిన రంగా అనుచరులు కూడా మాక్బెత్ మంత్రగత్తెల్లాంటి వాళ్ళే. వెంకటరత్నం, రంగాలు ఈ ‘మంత్రగత్తెల’ మాటలకి పడిపోవడం వల్లే అనర్ధాలు జరిగాయి. కానీ వెంకటరత్నంతో రాధా చేసినట్టుగా గాక, తమ లీడర్ రంగా నుంచి విడిపోయి దేవినేని సోదరులు వేరుకుంపటి పెట్టుకున్నారు. ఇక గ్యాంగ్ వార్స్ అనే సహజ పరిణామాలు సంభవించాయి. ఇవి ముదిరి రంగా గాంధీని చంపించాడు. అప్పుడు మురళి రంగా జోలికెళ్ళ కుండా, సరిగ్గానే రంగా అనుచరుల్ని చంపాడు. ఇప్పుడు మిగిలిన రెండో అన్న నెహ్రూని లీడర్ గా తీసుకుని  మురళి అనుచరుడుగా ఉండాల్సిన వాడు. అలా ఉండలేదు. తమ ప్రత్యర్ధి రంగాని స్వతంత్రించి తనే చంపాలనుకున్నాడు. సేమ్ రాధా గతి పట్టింది. అప్పుడు లీడర్లు లీడర్లు  పోరాడుకుని ఒక లీడర్ రంగా హతమయ్యాడు...
        వర్మ తీసిన  ఈ ‘చరిత్ర’ లోంచి ఈ ‘మాక్బెత్’ నీతిని మాత్రమే గ్రహించగలం.



ఎవరెలా చేశారు 
       ప్రతివొక్కరూ బాగా నటించారు. ఇందులో రెండో మాటకి తావులేదు. కాకపోతే వాళ్ళ పాత్రల్నే వర్మ పైపైన తడిమి వదిలెయ్యడంతో సజీవ పాత్రలుగా మాత్రం కన్పించరు.  ఉన్నంత వరకూ పాత్రల్ని అద్భుతంగా నటించారు. అందరూ కొత్త ముఖాలే, ఒక్క లాయర్ పాత్రధారి తప్ప. దీంతో ఫ్రెష్ ఫీలింగ్ కన్పిస్తుంది. కొత్తవాళ్ళయినా నటింప జేసుకోవడంలో వర్మ ఎప్పుడూ విఫలమవలేదు.  సోదరులు రాధా, రంగా రెండు పాత్రల్నీ సమర్ధవంతంగా పోషించాడు సందీప్ కుమార్. ముఖ్యంగా సౌమ్యంగా కన్పించే రంగా పాత్రలో ప్రధానంగా దృష్టిని ఆకర్షిస్తాడు.  ఇక అచ్చం నెహ్రూ లాగే వున్న శ్రీతేజ్ ఇంకొక హైలైట్. చలసాని వెంకటరత్నం (విజయవాడ రాజకీయాల్లో ఇంకో వెంకటరత్నం వుండేవారు- కాంగ్రెస్ మంత్రీ, గొప్ప నాయకుడూ అయిన కాకాని వెంకటరత్నం) పాత్రలో వంశీ నెక్కంటి విచిత్ర  మ్యానరిజమ్స్ ని ప్రదర్శించాడు షార్ట్ టెంపర్ వ్యక్తిత్వంతో. గాంధీగా కౌటిల్య, మురళీగా వంశీ చాగంటి, రత్నకుమారిగా నైనా గంగూలీ కూడా కొత్త వాళ్లన్పించనంత ఈజ్ తో నటించుకు పోయారు. 

        ఈ సినిమా బలహీనత అంతా కూడా కొట్టొచ్చి నట్టు కన్పించే పాత్రల మధ్య కుల సమీకరణలని నిర్వచించక పోవడం దగ్గరే వుంది. నగరంమీద ప్రారంభమైన ఆధిపత్య పోరు కాస్తా కులాధిపత్య పోరుగా పరిణమించి, అంతిమంగా దాని ఫలితాలు అమాయక ప్రజలెలా చవిచూశారో  చెప్పక దాట వెయ్యడంలోనే వుంది.... రత్నకుమారి పాత్ర కేంద్ర బిందువుగా- ఆలంబనగా దీన్ని పకడ్బందీగా చూపించుకు రావొచ్చు.  ఈ పని చేయలేదు. కానీ ఈమె తన స్వకులస్థులైన దేవినేని వర్గీయులనే చంపేందుకు భర్తని ప్రోత్సహించినట్టు చూపించారు.



       ఇది వర్మ చేసిన కల్పనే అయితే,  ఇది ‘మాక్బెత్’ సూత్రాల ప్రకారం కూడా చాలా తప్పు. అధికారంలో వున్న భర్తని భార్య హత్యలకి ప్రోత్సహిస్తోందంటే ఆమెకి సొంత ఎజెండా ఉండొచ్చు. ఆ హత్యా పరంపరలో భర్త రాలిపోతే, ప్రియుడితో కలిసి అధికారాన్ని కైవసం చేసుకోవచ్చని. ‘మాక్బెత్’ చేసే హెచ్చరిక ఇదే (ఇంకా కావాలంటే ‘మాక్బెత్’ ఆధారంగా విశాల్ భరద్వాజ్ తీసిన ‘మక్బూల్’ చూడొచ్చు). కానీ వర్మ చూపించిన ‘భార్య’ పాత్రకి ఇలాటి సొంత ఎజెండాలు కన్పించవు. ఆమె నిజాయితీతోనే వుంటుంది. కానీ ఎలాంటి నిజాయితీ? తను ప్రేమిస్తున్న రంగాతో ఇంట్లో పెళ్ళికి వొప్పుకోకపోతే, ఇల్లొదిలి వచ్చేసిన తనని దేనినేని సోదరులు, తల్లీ  తమ ఇంట్లో పెట్టుకుని రంగాకి నచ్చ జెప్పి పెళ్లి జరిపించారు. అలాటి సహృదయుల పైన భర్తని  ఎలా ఎక్కుబెడుతుందామె? మధ్య వర్తిత్వం నెరపి ఉద్రిక్తతల్ని సడలింప జేయొచ్చుగా? అంత నెగెటివ్ రోల్ ప్లే చేసిన పాత్ర చివరికి ఏం సాధించింది? పే ఆఫ్ కాని  పాత్ర ప్రవర్తనని వూరికే సెటప్ చేయడమెందుకు?


         ఇక దేవినేని సోదరులే తమ కులస్థురాల్ని కాపు కులస్థుడైన రంగాకి నచ్చ జెప్పి పెళ్లి జరిపించినట్టు చూపించినప్పుడు,  ఇది డ్రమెటిక్ సందర్భం వాళ్ళ నిజజీవితాల్లో కూడా. కులాంతర వివాహంతో ముడిపడిన ఈ డ్రమెటిక్ సందర్భమే ఆ తర్వాత వాళ్ళ మధ్య అన్ని సంఘర్షణల్లోనూ వర్మ గుర్తు చేయాలి నిజానికి - చరిత్ర మీద కామెంట్ చేయబూనిన ఒక దర్శకుడైతే. ఏదీ దాచకుండా చరిత్రని ఎత్తి చూపించి ప్రశ్నించి నప్పుడే ఇలాటి సినిమాల్లో దర్శకత్వ నిబద్ధత కనబడేది. దేనికో వెరచి, ఎందుకో సందేహపడి తటస్థ వైఖరిని వదులుకుంటే అది రాజకీయనాయకుడి లక్షణమౌతుంది.  చరిత్ర బ్యాడ్ జర్నలిజమని ఇందుకే అని ఉంటాడు జోసెఫ్ క్యాంప్ బెల్. ఇది నిజం చేశారు వర్మ. అంత నిర్భయంగా ట్వీట్లు చేసే వర్మ,  సినిమాలో తన సహజ శైలి ఫీట్లు చేయక, నిమ్మకు నీరెత్తి నట్టుండిపోయారు- మొక్కుబడి యాక్షన్ థ్రిల్లర్ చూపించేస్తూ. 



      పోస్టర్ల మీద ‘కాపు కాసే శక్తి’ అని కులప్రస్తావన తెచ్చినంత స్వేచ్ఛగా కథలో తిరుగాడలేక పోయారు వర్మ. కాదనలేని ఈ కులాల కోణాన్ని కథకి ఆత్మగా చేసుకుని వుంటే, అదే ఎమోషనల్ థ్రెడ్ గా మారి అద్భుతం చేసివుండేది ఈ సినిమాకి. ఈ కథలో మొదట కులాలకతీతంగా వున్నపాత్రలు ఎలా దిగజారిపోయాయో ఒక బలమైన ముద్రతో చెప్పే వీలుండేది. చరిత్రని ఉన్నదున్నట్టో, అసమగ్రంగానో, అర్ధసత్యాలతోనో చూపించి చేతులు దులుపుకోకుండా, ఆ చరిత్ర సృష్టించిన మనుషులు మిస్సయ్యిందేమిటో,  అది ఎత్తి చూపిస్తూ సమాజానికో హెచ్చరిక పంప గలగాలి. తన యుక్త వయస్సు నుంచీ ఈ హింసారి రంసని గమనిస్తూ వచ్చానంటున్న వర్మ- ఒక్క మాటలో ఈ చరిత్ర మీద తన అభిప్రాయమేమిటో చెప్పి ఉండాల్సింది. రిపోర్టింగ్ చేయడం అభిప్రాయం చెప్పడం కాదు. 

        ఒక్కో హత్య జరిగినప్పుడల్లా వర్మ తన వాయిస్ తో  వ్యాఖ్యానాలు చేయడం కథని ముందుకు నడిపించే మంచి టూల్ గానే ఉపయోగపడింది గానీ, ఒక్కోసారి అదే కర్ణక ఠోరంగా పరిణమించిన  మాట కూడా నిజం. అలాగే ఎమోషన్లు పెంచడానికి సెకండాఫ్ లో వరుసగా బ్యాక్ గ్రౌండ్ లో తన స్టయిల్ లో పెట్టిన అరుపుల పాటలతో ఆయా విష పరిణామాలని చూపించడం కూడా పైపైన వేసిన పూతే.  ఎమోషన్ అనేది కథలో వుండే పాయింటు లోంచి కదా పుట్టాలి. ఆ పాయింటు పాత్రలు విస్మరిస్తున్న అంతకి ముందున్న సెక్యులరిజమే. పాయింటుతో కట్టి పడెయ్యకుండా సినిమాని నిలబెట్టడం కష్టం. ‘షిండ్లర్స్ లిస్ట్’ అనే స్పీల్ బెర్గ్ తీసిన నాజీల చరిత్రలో- విలాసవంతంగా జీవిస్తూండే వ్యాపారవేత్త, ఎందుకని లక్షాలాది మంది యూదుల్ని తన సొంత ఖర్చుతో నాజీల ఊచకోత నుంచి తప్పిస్తూ పొరుగు దేశాలకి తరలిస్తూ పోయాడు? కేవలం తనలో మేల్కొన్న మానవత్వం కారణంగానే! ఈ మానవత్వమనే పాయింటే  సినిమాకి ఆత్మ అయింది. అక్షయ్ కుమార్ నటించిన ‘ఏర్ లిఫ్ట్’ లో కూడా ఇంతే. ఎన్ని ఇజాలు పెట్టుకున్నా అవన్నీ మానవిజం కిందే వుంటాయి.

        సినిమాలో మాటలు పొట్టిగా సూటిగా బలంగా బావున్నాయి. టెక్నికల్ గా కంటిన్యూటీ ప్రాబ్లమ్స్ వున్నాయి. ఒకే సీన్లో రాధాని చంపే ముందు,  షాపు ముందు వుండే తడి నేల, వెంటనే పొడి నేలగా కన్పిస్తుంది. టీడీపీ పార్టీ అవిర్భవించినట్టు డైరెక్టుగా పసుపు జెండాలు చూపించకుండా కాస్త కాషాయంగా వుండే పతాకాలు చూపించారు.  అదే నెహ్రూ ఎన్నికల ప్రచారంలో అవికాస్తా ఒరిజినల్ తెలుగుదేశం పసుపు పచ్చ జెండల్లా బస్తీమే సవాల్ గా రెపరెప లాడుతున్నాయని చూసుకోలేదేమో కాస్ట్యూమ్స్ అతను- ఆర్ట్ డైరెక్టర్ కూడా.




        లొకేషన్స్ పరంగా ఆనాటి  విజయవాడని పకడ్బందీగా చూపించారు. ఇప్పుడు అభివృద్ధి చెందిన ప్రాంతాలు వ్యూలోకి రాకుండా ఏరియల్  షాట్స్ మేనేజ్ చేశారు. అలాగే ఒక్కో హత్యా దృశ్యాల సెటప్ ని – యాక్షన్స్ నీ అద్భుతమైన సస్పెన్సుతో  క్రియేట్ చేస్తూ పోయారు. మురళిని చంపేటప్పుడు ఓపెనయ్యే లారీ బాడీలో, ముందు కత్తులూ కటార్లూ టపటప వచ్చి పడే సీను ఒక మార్వెలస్ క్రియేషన్. 


స్క్రీన్ ప్లే సంగతులు

      వర్మ ఫ్లాష్ బ్యాకుల జోలికి పోరు- అదే ఈ స్క్రీన్ ప్లేకి పెద్ద మైనస్. కచ్చితంగా ఫ్లాష్ బ్యాక్స్ ని డిమాండ్ చేసే కథిది. అప్పుడే ఏకత్రాటి పైకి కథ రావడమే గాక, ఒకే పాత్ర ఆధారంగా కథని నడిపించడానికి వీలవుతుంది. సినిమా కథ ఎప్పుడూ ఒక్క పాత్రదే అయ్యుంటుంది. మిగిలిన పాత్రలు ఆ ఒక్క పాత్ర కథలో అంతర్భాగంగా  వుంటాయి.  కారణాలేవైతేనేం, పెట్టుకున్న టైటిల్ ప్రకారం వంగవీటి రంగా కథగా చూపించదల్చు కోలేదు వర్మ. అందులో అంతర్భాగంగా దేవినేనిల కథనీ  చెప్పదల్చుకోలేదు. కానీ వంగవీటి సోదరులు లేకపోతే దేవినేని సోదరులే లేరు. ఇంకా చెప్పాలంటే వెంకటరత్నం లేకపోతే  ఇంకెవరూ లేరు, ఈ చరిత్రే లేదు. ఇప్పుడు పనిగట్టుకుని వంగవీటి రంగా జీవిత చరిత్ర తీయడం, అందులో ఆయన్ని ప్రజాబాంధవ్యుడిగా చిత్రించడం వర్మ చేసేపని కూడా కాదు. ఎందుకంటే ఆయన వ్యక్తి ఆరాధనకి దూరం. ఎవరి భజనా చెయ్యరు. ఇది మంచిదే. కానీ స్క్రీన్ ప్లే కి ఏది మంచిది? 

        చరిత్రలో ఎవరికీ ప్రాధాన్య మివ్వకుండా అందరి జీవితాలనీ కలిపి డాక్యుమెంటేషన్  చేస్తే అది సినిమా స్క్రీన్ ప్లే అవతుందా? కథలతో అపార అనుభవమున్న వర్మ కివన్నీ తెలీవని కాదు, తెలీదన్నట్టు ఇలా రాయడం కూడా మంచిదికాదు. కానీ ఫలితం సినిమాటిక్ అనుభవానికి భిన్నంగా వచ్చింది. సినిమా స్క్రీన్ ప్లేని వదిలేసి డాక్యుమెంటేషన్ చేస్తూ డాక్యూ డ్రామా చేశారు కాబట్టే అనేక సార్లు మధ్య మధ్యలో తన వాయిసోవర్ తో వ్యాఖ్యానాలు చేయాల్సి వచ్చింది. ఇదంతా  సినిమాటిక్ అనుభవాన్ని దెబ్బ తీసింది. ఒకే పాత్ర- ఒక లక్ష్యం అన్నట్టుగా ఉంటేనే కదా స్క్రీన్ ప్లే అన్పించుకునేది. రాసుకున్నవన్నీ స్క్రీన్ ప్లేలు అయిపోవుగా. 


        వివాదం ఎప్పుడు వుంటుంది? రెండు వర్గాలున్నప్పుడే. వివాదాస్పద కథల జోలికెళ్ళి నప్పుడు-రెండు వర్గాల్నీ బ్యాలెన్స్ చేయాల్సి వుంటుంది. ఆ బ్యాలెన్సింగ్ కోసం అందర్నీ కలిపేసి డాక్యుమెంటేషన్ చేస్తే సినిమా అవదు. ‘గాంధీ’ జీవిత చరిత్రతో  సినిమా ఎలా తీయాలన్నప్పుడే అటెన్ బరోకి అమల్లో వున్న స్క్రీన్ ప్లే సూత్రాల్ని తనకోసం కస్టమైజ్ చేసుకోవాలన్పించింది. లేకపోతే గాంధీ జీవితంలో జరిగిన ఎన్నో మహత్తర సంఘటనల్ని ఒక కథగా చెప్పడం కుదరదు. ఆయన జీవితంలోంచి నాల్గే ఘట్టాలు- దక్షిణాఫ్రికాలో న్యాయవాదిగా జీవితం, అవమానం, అందులోంచి లక్ష్యం; భారత్ కి తిరిగి వచ్చి ఆ లక్ష్య సాధనకోసం సహాయ నిరాకరణోద్యమం, మతకలహాలు, మరణం- ఇలా విభజించుకుని స్క్రీన్ ప్లే చేస్తే,  అది సమగ్ర రూపంలో గాంధీ జీవితంలా వచ్చింది. 


        ‘వంగవీటి’ ని ఇలా చేయాలనీ కాదు, రెండు వర్గాలున్నప్పుడు వంగవీటి ని హైలైట్  చేస్తే అది వివాదాస్పదం కావొచ్చు. పైగా వ్యక్తి ఆరాధన కూడా కావొచ్చు. అందుకే ఇలా జరక్కుండా టైటిల్ ఒకటిగా, సినిమా ఇంకొకటిగా తీశారు. ఇలాకాకుండా స్క్రీన్ ప్లే చట్రంలోకి వచ్చి, ఒకే పాత్ర- ఒకే లక్ష్యం అనుకుని,  ఈ సూత్రాన్ని అవసరానికి తగ్గట్టుగా సినిమాటిక్ అనుభవంతో, కస్టమైజ్ చేసుకుంటే సరిపోతుంది. 


        ఒకే పాత్ర (వంగవీటి)- ఒకే లక్ష్యం (దేవినేనిలు), ఒకే పాత్ర (దేవినేని నెహ్రూ)- ఒకే లక్ష్యం (రంగా). ఇలా ఇద్దరి వేర్వేరు వ్యవహారాల డైనమిక్స్ ని  సమాంతరంగా రన్ చేయడం. ఓపెనింగ్ మురళి మర్డర్ తో. దీంతో నెహ్రూ దృక్కోణంలో ఫ్లాష్ బ్యాక్- తాము రంగా బ్యాచిలో చేరినప్పట్నించీ మురళి మర్డర్ వరకూ- రాజకీయాల్లోకి వచ్చాక తాను సాధించిన విజయాలూ కలుపుకుని.  అటు రంగా దృక్కోణంలో ఫ్లాష్ బ్యాక్- వెంకటరత్నం దగ్గర్నుంచీ తన అన్న మర్డర్, దాంతో  తాను బాస్ అయిన విధం వరకూ- - రాజకీయాల్లోకి వచ్చాక తాను సాధించిన విజయాలూ కలుపుకుని. ఇప్పుడు ఇద్దరి సమగ్ర రూప మేర్పడింది, ఎవరేమిటో స్పష్టమైన ముఖ చిత్రం కళ్ళకి కట్టింది. ఇక క్లయిమాక్స్...రంగా మరణం, నెహ్రూ అరెస్ట్, అల్లర్లు, ఎండ్ టైటిల్స్ తో కేసు పరిణామాలు వగైరా. 


        వర్మ ఒక్కో హత్యని  ఒక్కో ప్లాట్ పాయింటుగా  పెట్టుకుంటూ పోయారు. బిగినింగ్ విభాగంలో రాధా  ఎదుగుదలలో భాగంగా వెంకటరత్నం మర్డర్ వేశారు.  తర్వాత రాధా మర్డర్ తో ప్లాట్ పాయింట్ వన్ ని  తెచ్చి, బిగినింగ్ ని ముగిస్తూ  రంగాని  ముగ్గులోకి దింపారు. ఇప్పుడు మిడిల్ ప్రారంభిస్తూ దేవినేనిలతో సంఘర్షణ పుట్టించి, ఇంటర్వెల్లో దేవినేని గాంధీ మర్డర్ వేశారు. మళ్ళీ ఈ మిడిల్ ని  కంటిన్యూ చేస్తూ సెకండాఫ్ లో,  ప్లాట్ పాయింట్ టూ గా,  మురళీ మర్డర్ వేశారు. దీనితర్వాత  రంగా మర్డర్ తో క్లయిమాక్స్.   


        ఇలా చేయడం వల్ల గుంపుగుత్తగా రెండు వర్గాల కథల్నీ కలగాపులగం చేసినట్టయ్యింది. దీంతో చూసేవాళ్ళకి ఆటోమేటిగ్గా ఎవరు హీరో, ఎవరు ఈ కథ నడిపిస్తున్నారూ అన్న సైకలాజికల్ కనెక్షన్ సంబంధ గడబిడ మొదలయింది. ఈ మొత్తాన్నీ పైన చెప్పుకున్న విధంగా, కస్టమైజ్ చేసుకుని వుంటే,  ఆ విడి విడి కథల్లో ఇద్దరూ హీరోలుగానే కన్పించే వాళ్ళు - ఎవరు తప్పు, ఎవరు ఒప్పు అన్నది ప్రేక్షకులకే వదిలేస్తూ.

-సికిందర్
http://www.cinemabazaar.in



       
       
       


       
       
       


 

22, డిసెంబర్ 2016, గురువారం

నాటి సినిమా!




ణిరత్నం కళ్ళకి ఎల్లలు లేవు. అనంతమైన సృజన సీమ కనబడుతుంది ఎదరంతా...  ముంబాయి నేరమయ జగత్తు- దాని అధినాయకుడు, తమిళ సినీ రాజకీయ రంగాలు- ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు, శ్రీలంక అంతర్యుద్ధం-అందులో పసి బాలిక జీవితం, కాశ్మీర్ తీవ్రవాదం- ఎదురులేని దేశభక్తి, ఈశాన్య రాష్ట్రాల సంక్షోభం- అనంతమైన ప్రేమ శక్తి, హిందూ ముస్లిం కల్లోలం- దగాపడ్డ జీవితాలు, పార్లమెంటరీ వ్యవస్థ - యువ నాయకత్వం, కార్పొరేట్ రంగం- కరకు నిజాలు,  మహాభారతం- పురాణ పాత్రల పునఃసృష్టి, రామాయణం- దుష్ట పాత్ర  సమకాలీనం... ఇలా కొత్త కొత్త సీమలు  తన చలచిత్ర రాజాలకి రసమయ పోషకాలు. ఒక వరసలో ఇదంతా ఇండియన్ ఫైలాసఫీయే. దటీజ్ కాల్డ్ భారతీయాత్మ. స్నేహ సౌభాతృత్వాల, వినోద విజ్ఞానాల నిర్వచనాల సమ్మేళనాలు...

        ణిరత్నం సృజనాత్మక శక్తి దాని పరిధిని ఎక్కడ్నించి ఎక్కడిదాకా విస్తరించుకుందో  పై పేరా చెబుతుంది. నడిచిన, నడుస్తున్న చరిత్రని పక్కనబెట్టి సినిమా తీయడం అతడికి చేతగాదు. ఎవరైనా ప్రేక్షకులు కోరుకుంటున్న సినిమాలే తాము తీస్తున్నామని చెప్పుకుంటే, అది శుద్ధ అబద్ధమంటాడు అకిరా కురసావా. అలా తీసి మెప్పించిన వాళ్ళు ఈ భూమ్మీద లేరంటాడు. దర్శకుడు తానుగా నమ్మి ఫీలై, తనకోసం తీసుకున్న సినిమాలే ప్రేక్షకుల్లో కొత్త ఎవేర్నెస్ ని కలిగించి నిలబడ్డాయంటాడు. మిగిలినవన్నీ చెత్త బుట్ట దాఖలయ్యా యంటాడు. 

        మణిరత్నం ఫీలయ్యాడంటే అది తమిళమా, తెలుగా, హిందీయా, సింహళమా చూడడు. ఎక్కడ ఏ చరిత్ర పుడితే అక్కడికి సాగిపోతాడు. తన కాల్పనిక కళా జగత్తులో  మొదలంటా దాన్ని ఇమిడ్చేస్తాడు. ఒక బలమైన, రసవత్తరమైన డాక్యు డ్రామాగా మార్చేస్తాడు. చెన్నై నుంచీ చెచెన్యా దాకా ప్రేక్షక లోకం దాసోహ మవ్వాల్సిందే. టైం మ్యాగజైన్ కూడా పట్టించుకుని 100 అత్యుత్తమ  చలన చిత్రాల పట్టికలో చేర్చాల్సిందే. భారత ప్రభుత్వ, తమిళనాడు- ఆంధ్ర  రాష్ట్ర ప్రభుత్వాల పురస్కారాలేకాదు, ఫిలిం ఫేర్, ఎడిన్ బర్గ్, బెర్లిన్, జెరూసలెం, లాస్ ఏంజిలిస్, జింబాబ్వే, వెస్ట్ చెస్టర్, మాంచెస్టర్ గీంచెస్టర్  మొదలైన సవాలక్ష అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో అవార్డుల కుంభవృష్టి కురవాల్సిందే. మిచిగాన్ యూనివర్సిటీ, ఎడిన్ బర్గ్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ లు తమతమ  సిలబస్సుల్లో పాఠాలు రాసుకోవాల్సిందే. 

        సత్యజిత్ రే తర్వాత ఇంతలా భారతీయాత్మని ఆవిష్కరిస్తున్న దర్శకుడు తనే. ఎవర్ని ఆదర్శంగా తీసుకుని సినిమా తీసినా,  అంతిమంగా అందులో భారతీయాత్మ ప్రతిబింబించక పోతే అస్సలొప్పుకోదు  అంతర్జాతీయ సమాజం. కురసావాని మణిరత్నం ఆదర్శంగా తీసుకున్నప్పుడు,  ఇతరుల్లా  ఇండియన్ సినిమా అంటే పొడి పొడి ఫారిన్ పోకడల పేకాటగా మార్చెయ్యలేదు. ఈ పేకాటలోనే పడి కొట్టుకు పోతున్న యువదర్శకులు మణిరత్నంని ఆదర్శంగా తీసుకుంటున్నదీ లేదు. మణిరత్నం తర్వాత మహా శూన్యం ఏర్పడే ప్రమాదం మాత్రం పొంచి వుంది. 

        కురసావా మీద అచ్చయిన ఒక పుస్తకంలో, ‘కురసావా తాను రాజకీయ తత్త్వపు దర్శకుడిగా కాక,  సామాజిక తత్త్వం గల దర్శకుడిగానే వుండిపోవడాని కిష్టపడతాడు’ అన్న వాక్య ముంటుంది. నిజమే, రాజకీయ తత్త్వమేమిటి? అదెక్కడ ప్రజా సమస్యల్ని నిష్పాక్షిక దృష్టితో  చూస్తుందని? ఇందుకే మణిరత్నం కురసావాని ఆదర్శంగా తీసుకున్నాడు. ప్రజాసమస్యల పట్ల నిష్పాక్షిక దృష్టితో చూసే సామాజిక తత్త్వాన్ని గొప్ప మానవతా వాదంతో అలవర్చుకుని నిండుగా కన్పిస్తాడు. ఒక సారెప్పుడో ‘బొంబాయి’ తీసినప్పుడు అందులో పక్షపాతం చూపించుకుని వివాదాస్పదుడు కావడం, మరోసారి ‘గురు’ లో అవినీతికి పట్టంగట్టి హాస్యాస్పదం కావడమూ వంటి ఒకటీ రెండూ తప్పడుగుల్లేక పోలేదు. 

       విశాల ప్రాతిపదికన  ‘నాయకుడు’, ‘రోజా’, ‘బొంబాయి’, ‘దళపతి’, ‘దిల్సే’, ‘ఇద్దరు’, ‘అమృత’, ‘యువ’, ‘గురు’ ల్లాంటి ప్రబోధాత్మకాలు తీస్తూనే, మళ్ళీ ‘ఘర్షణ’, ‘దొంగా దొంగా’, ‘మౌన రాగం’, ‘సఖి’, ‘గీతాంజలి’...వంటి గిలిగింతలు కూడా పెడుతూ గిరికీలు కొట్టాడు. ఇక్కడ కూడా తన గట్ ఫీలింగ్స్ నే నమ్మాడు. మనం వుంటాం, మన ప్రేయసి మీద మనం కవిత్వాలు రాసుకుంటే ఇతరులకి భేషుగ్గా వుంటుంది, అదే ఇతరుల ప్రేయసుల మీద రాస్తే వీపు వాచిపోతుంది. సృజనాత్మకత ఎప్పుడూ పర్సనల్ గోడు. ‘గీతాంజలి’ ని సృజియిం చినప్పుడు అది మణిరత్నం పర్సనల్ గోడు. ఇందుకే అందరికీ- అంతమందికీ అంత బాగా నచ్చింది. 

        తెలుగులో మణిరత్నం దర్శకత్వం వహించిన ఏకైక మణిరత్నం ‘గీతాంజలి’. కాస్త తమిళ వాసనలు వేసినా మొత్తంగా ఇది దృశ్య వైభవాల సంగీత సౌరభం. 1989 లో ‘శివ’ తర్వాత నాగార్జున కిది మరో  సంచలనాత్మక విజయం. ఆనాడే కాదు, రెండు దశాబ్దాల తర్వాతా  దీనిది కాలదోషం పట్టని మనసులో మాట. శాశ్వత సత్యాలకి కాలదోషం పట్టదు. కాకపోతే పట్టించుకునే నాథులే తక్కువ. నిన్నంటూ  చేజారిపోయి, రేపనేది చేతుల్లో లేకపోయాక,  మిగిలేది ఈ రోజు అనే వర్తమానమే. దీన్నెలా గడిపామన్న  దానిపైనే  అంత్యకాలపు తృప్తి  ఆధారరపడుతుంది. ఒక టీవీ ఛానెల్లో 2012 లో అప్పట్లో రాబోయే (?) ప్రళయం గురించి చర్చ పెడితే, చాలామంది ఇక జీవితంలో ఏం సాధించి ఏం లాభమనే నైరాశ్యాన్నే ప్రకటించారు. వాళ్లకి ‘ గీతాంజలి’ చూపించాలి. ఇప్పుడు మరణం ఖాయమైపోయిన ఎయిడ్స్ రోగులు కోకొల్లలుగా కన్పిస్తారు. వాళ్ళకీ ‘గీతాంజలి’ ఇచ్చే మెసేజ్ తో నమ్మకం కల్గించాలి. 

        ఏదో నయంకాని గుండె జబ్బు, ఇంకో మూలగ క్యాన్సరూ అన్నవి ‘గీతాంజలి’ లో కేవలం మనల్ని ఎప్పుడైనా చుట్టు ముట్టే అవకాశమున్న అరిష్టాలకి వాడుకున్న సింబల్సే. కాలంతోపాటు ఈ అరిష్టాల రూపాలు మారవచ్చు. వాటికి మనమెలా రెస్పాండ్ అవ్వాలన్నది ‘గీతాంజలి’ ని చూసి అర్ధం జేసుకోకపోతే ఈ జన్మ దండగ. 

        హ్యాపీగా గడపాలని కమిటైతే పచ్చిక బయళ్ళైనా, స్మశానవాటికలైనా ఒకటేనని, అల్లరల్లరిగా తిరిగే గీతాంజలి వైఖరి లోనే చెప్పాలనుకున్న విషయమంతా వుంది. స్మశానం  లో సమాధులు భయాలకి  గుర్తులు. సద్గురు జగ్గీ వాసుదేవ్ చెప్పినట్టూ, ఈ భయాలనేవి కలుపు మొక్కల్లాంటివి. వాటికవే పెరిగిపోతాయి. పోషణా సంరక్షణా వాటికక్కర్లేదు. అలాటి వాటిని పీకి అవతల పడెయ్యడానికి ప్రయత్నించం సరికదా, ఎంతో ఆశపడి వాటిమధ్య నాటుకున్న ఆశయమనే గింజ మొలకెత్తి మహావృక్ష మయ్యేందుకూ శ్రమించం. గీతాంజలిని చూస్తే, తాను మరణిస్తున్నానని తెలిసీ, ఆ మరణమనే సమాధుల మధ్య అపరాత్రైనా తను నాటిన సంతోషాల మొక్కనే, ఆటా పాటగా పోషించుకుంటూ, వున్న జీవితాన్ని దిలాసాగా ఎంజాయ్ చేసేస్తోంది!

        ఈ బ్యాక్ డ్రాప్ లోకి వస్తాడు ప్రకాష్ (అక్కినేని నాగార్జున). సిటీలో వుండే ఇతను తనకి నయంకాని మూలగ క్యాన్సర్ సోకిందని తెలుసుకుని, శేష జీవితాన్ని శాంతంగా గడిపేందుకు ఊటీ వస్తాడు. ఇక్కడ గీతాంజలిని వైఖరిని చూశాక తనకి  కొత్తలోకాలు తెర్చుకుంటాయి- ‘రేపటి గురించి బెంగలేదు, ఈ రోజే నాకు ముఖ్యం, ఇలాగే వుంటాను’ అనే ఈమె స్పోర్టివ్ నెస్ తో ఇక పోటీపడక తప్పని స్థితి. తీరా తను ఎప్పటి చలాకీ మనిషిగా మారేక, చూస్తే ఏముంది- ఆమె గుట్టంతా బయటపడింది! ఆమె గుండె కాయని మృత్యువు కబళించి వుంది...

       రివర్స్ లో తనని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డ అతడి గుట్టు కూడా ఈమెకి తెలిసిపోయి, పెద్ద దుమారమే రేపుతుంది. నువ్వొద్దు వెళ్లిపొమ్మంటుంది. నువ్వెక్కడో బతికే వున్నావన్న ఆశతో తృప్తిగా చనిపోతానంటుంది.  తర్వాత్తర్వాత చూస్తే, నీ చేతుల్లోనే చనిపోతానంటుంది. పుని స్త్రీగా తనువు చాలించాలనే ఇండియన్ సెంటిమెంటుని ప్లే చేశా డిక్కడ మణిరత్నం- ‘రోజా’ లో సతీ అనసూయ సెంటిమెంటులాగే. ఎత్తుకున్న కథ ప్రకారమైతే వీళ్ళిద్దరూ చనిపోవాలి. ఈ నమ్మకంతోనే ప్రేక్షకుల్ని వుంచుతాడు మణిరత్నం. కానీ ప్రేక్షకులు అలా నమ్మినట్టుగానే ముగిస్తే అది తను ఫీలైన సినిమా ఎలా అవుతుంది? అందుకని ఆ స్టోరీ క్లయిమాక్స్ ని మూసేశాడు. ప్లాట్ క్లయిమాక్స్ ని పైకి లాగాడు. వాళ్ళిద్దర్నీ నిక్షేపంలా వుంచి, ఎప్పుడు ఈ లోకం వీడి పోతారో తెలీదనీ, కానీ అప్పటిదాకా ఇలా కలిసే జీవిస్తారనీ చెప్పి ముగిస్తాడు. 

        సంతోషాలకే కాదు, ఆ సంతోషాల్ని కల్లోలపర్చే గాయపడ్డ ప్రేమలకి కూడా కట్టుబడి వుండాలని పరోక్షంగా చెప్పే మణిరత్నం ఎక్కడా అతికి పోడు. నటనలు, మాటలు, సెంటిమెంట్లూ  చాలా మితంగానే వుంటాయి. డబ్బింగ్ కింగ్ రాజశ్రీ మాటలు రాశారు. ఊటీ అందాలూ, వీటికి పిసి శ్రీరాం హై పవర్ ఛాయాగ్రహణమూ  విషయాన్నిడామినేట్ చేస్తు నట్టు వున్నా- కథా బలం, పాత్రల బలం కలిసి దానికి మ్యాచ్ అవడంతో, రసాస్వాదనకి అడ్డంకిగా వుండవు. పాత్రల్లో నాగర్జున, గిరిజలు ఆ పాత్రలకోసమే పుట్టినట్టుంటారు. నాగార్జున తల్లి దండ్రులుగా సుమిత్ర, విజయ్ చందర్ లు, నానమ్మగా రాధాబాయి కన్పిస్తారు. సినిమా ప్రారంభంలో యూనివర్సిటీ ఛాన్సెలర్ గా సీనియర్ నటి షావుకారు జానకి కన్పిస్తారు.

      ఇక సుత్తి వేలు- డిస్కో శాంతిల కామెడీ ట్రాకు మాత్రం మణిరత్నాన్ని చూసి నవ్వా లన్పించేలా వుంటుంది. ఈ ఫెయిలైన కామెడీని ఇప్పుడు సీడీల నుంచి తొలగించి మంచి పనే చేశారు. 

        భాగ్యలక్ష్మి ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ లో సి ఎల్ నరసారెడ్డి నిర్మించిన ఈ ప్రేమకావ్యానికి అందిన బహుమతులెన్నో. రాష్ట్రప్రభుత్వ నంది అవార్డులు ఏడు దక్కాయి. ఉత్తమ వినోదాత్మక కథా చిత్రంగా జాతీయ అవార్డు  ఒకటి లభించింది. తమిళ, మళయాళ భాషల్లో అనువాదమై హిట్టయ్యింది. హిందీలో మాత్రం దీపక్ ఆనంద్ ‘యాద్ రఖేగీ దునియా’ గా ఫ్రీమేకు చేస్తే ఫ్లాపయ్యింది. 

        ఇప్పుడు సంగీతం విషయానికొద్దాం. వేటూరి- ఇళయరాజా- బాలసుబ్రహ్మణ్యం- జానకి- చిత్ర బృందం కలిసి సృష్టించిన ఈ మ్యూజికల్ జగత్తంతా ఆచంద్ర తారార్కమనాలి. ప్రతీపాటా స్వీట్ హిట్టే. అందులో ‘ఓం నమః’ అనే పాట చిత్రీకరణకి ప్రయోగం చేశాడు మణిరత్నం. నాగార్జున -గిరిజలని నించున్న చోటే నించో బెట్టి రౌండ్ ట్రాలీ వేసి సింగిల్ షాట్ గా తీసిన క్రియేటివిటీ చాలా సంచలనం. ఇప్పుడు చూస్తే యూ ట్యూబ్ లో ‘వేరీజ్ మై మనీ’, ‘రష్యన్ ఆర్క్’ లలాంటి సింగిల్ షాట్  సినిమాలు కన్పిస్తాయి- కానీ ఈ రెండున్నర నిమిషాలకి మించవివి!


-సికిందర్
(జనవరి 2010, ‘సాక్షి’)
http://www.cinemabazaar.in




       


 



21, డిసెంబర్ 2016, బుధవారం

రివ్యూ!





నిర్మాణం- దర్శకత్వం : ఆదిత్యా చోప్రా

తారాగణం : రణవీర్ సింగ్, వాణీ కపూర్, అర్మాన్ రాల్హాన్, ఆకాష్ ఖురానా, ఆయేషా రజా జూలీ ఆర్డాన్ తదితరులు
కథ- స్క్రీన్ ప్లే : ఆదిత్యా చోప్రా, మాటలు : శరత్ కటారియా, సంగీతం : విశాల్- శేఖర్, ఛాయాగ్రహణం : కనామే ఒనోయమా
బ్యానర్ : యశ్ రాజ్ ఫిలిమ్స్,
విడుదల : 9 డిసెంబర్,  2016
***
సెంటిమెంటల్ సినిమాల ఆదిత్యా చోప్రా స్వయంగా రోమాంటిక్ కామెడీకి దర్శకత్వం వహిస్తూ ‘బేఫిక్రే’  (కేర్ ఫ్రీ) తీసినప్పుడు ఇది కాలేజీ యూత్ ని కిర్రెక్కించేలా తయారయ్యింది. యూత్ నాడిని పట్టుకుని ఎక్కడా దేనికీ హద్దుల్లేని, పరిమితుల్లేని  ఆల్ ఫ్రీ- కేర్ ఫ్రీ లవ్ ని కలర్ఫుల్ గా తెరాయమానం చేశాడు. హీరో రణవీర్ సింగ్, హీరోయిన్  వాణీ కపూర్ లు ఈ ‘ ‘రోమెడీ’ (రోమాంటిక్ కామెడీ) ని హాట్ హాట్ గా రగిలించి – క్యారక్టర్స్ ని పండించి, నవ్వించి, కవ్విస్తూ కొలిక్కి తెచ్చిన విధం ఎట్టిదంటే....


కథ 
     ఢిల్లీ కరోల్ బాగ్ కుర్రాడు ధరమ్ పని వెతుక్కుంటూ పారిస్ చేరతాడు. తనకి తెలిసిన విద్య కామెడీ షోలు చేయడమే. ఒక నైట్ క్లబ్లో ఏకపాత్రాభినయాలు చేస్తూ నవ్విస్తూంటాడు.  అక్కడే షైరా (వాణీ కపూర్) పరిచయమై చెట్టపట్టా లేసుకుంటారు. ఆమె తల్లిదండ్రుల్ని  వదిలి పెట్టి అతడితో సహజీవనం చేయడం మొదలెడుతుంది. ఇద్దరికీ పెద్దగా ప్రేమలంటూ పట్టింపుల్లేవు. ఆ సహజీవనంలో ఓ రోజు తేడా వస్తుంది. ఆమె వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయాక ఫ్రెండ్స్ గా కలిసివుందామనుకుంటారు. అసలు ముందు ఫ్రెండ్ షిప్ చేయకుండా కలవడం వల్లే అది ఉత్త మోహానికి దారి  తీసిందనీ, అదే ముందు ఫ్రెండ్ షిప్ చేసి వుంటే ప్రేమ పుట్టి వుండేదనీ గుర్తిస్తారు. ఇప్పుడు తమ రిలేషన్ షిప్ ని మర్చిపోయి ఫ్రెండ్స్ గా వుంటున్నప్పుడు  ఒక ఇన్వెస్ట్ మెంట్  బ్యాంకర్ (అర్మాన్ రాల్హాన్) కి ఆమె కనెక్ట్ అవుతుంది. క్రిస్టీన్ (జూలీ ఆర్డాన్) అనే ఫ్రెంచ్ అమ్మాయికి ధరమ్ కనెక్ట్ అవుతాడు. బ్యాంకర్ తనకి ప్రేమిస్తూ కూర్చునే టైం లేదనీ, పెళ్లి చేసుకుందామనీ తొందర పెడతాడు. ఆమె ధరమ్ సలహా అడుగుతుంది. చేసుకొమ్మంటాడు. ఆమె పెళ్లి చేసుకుంటూంటే,  పోటీ పడి తనూ క్రిస్టీన్ ని పెళ్లి చేసుకోబోతాడు- ఈ పెళ్ళిళ్ళు అయ్యాయా, ఏం చేసుకున్నారు, ఏం తెలుసుకున్నారు, ఎలా ముగించుకున్నారు.... అనేది మిగతా కథ. 

ఎలావుంది కథ
      నస పెట్టకుండా   సాఫీగా వుంది. నేటి తరాన్ని టార్గెట్ చేస్తూ వాళ్ళ టేస్టులకి  పట్టం గడుతూ వుంది. మనస్సుని కాదనుకుని ఎంతైనా స్వేచ్ఛాయుత జీవితాలు గడుపుకోవచ్చు, ఒకనాటికి ఆ మనస్సుకి  చెప్పుకోవాల్సి వస్తుందన్న సున్నితమైన థీమ్ తో వుంది. ఇందులో తెలుగు యూత్ సినిమాల్లో లాగా హాస్యాస్పదంగా పెద్ద పాత్రల చాదస్తాలు, జోక్యాలు, ఏడ్పులూ, క్లాసులు పీకి ప్రేమికుల మధ్య సమస్య పరిష్కరించడాలూ వంటి నాన్ సెన్స్ లేకుండా చాలా రిలీఫ్ నిచ్చేలా వుంది. హీరోయిన్ కి పేరెంట్స్ వున్నా,  తండ్రి ఒకసారి – మన చేతుల్లో వీళ్ళు పెరగరు, వీళ్ళ చేతుల్లో మనం పెరగాలని  విజ్ఞతతో అనేసి వూరుకుంటే, చివర్లో డైలెమాలో పడ్డ  హీరోయిన్ తో తల్లి చెప్పే ఒక మంచి మాటని  కూడా తలకిందులు చేసేస్తూ, హీరోతో కలిసి  నిర్ణయం తీసుకుంటుంది హీరోయిన్. ఫలితంగా ఫ్రెంచి చర్చిలో రెండు పెళ్ళిళ్ళ గలాభా, గందరగోళం, పెద్ద కిష్కింధ కాండా  జరిగి- ఒక కామిక్ స్ట్రోక్ తో ముగుస్తుంది.  ఎత్తుకున్న జానర్ కి న్యాయం చేస్తూ, ఎక్కడా బరువెక్కించని పూర్తి స్థాయి సరదా రోమాంటిక్ కామెడీ ఇది. 

ఎవరెలా చేశారు
      క్యారక్టర్  ఒక్కోసారి చాలా పెద్ద పని చేసి పెడుతుంది. రొటీన్ గా వుండే కమర్షియల్ సినిమా క్యారక్టర్లు కేవలం ప్రేమల్లో పోకిరీ తనాలూ, హీరోయిన్ని ఏడ్పించి లొంగ దీసుకోవడాలూ మొక్కుబడిగా చేసుకు పోతూంటాయి. రణవీర్ సింగ్ పాత్ర ఇక్కడ చాలా పెద్ద పని చేసి పెట్టింది. చాలా ఇంటరెస్ట్ పుట్టిస్తుంది. అతడి ముఖాన్ని, చేష్టల్ని  మర్చిపోలేకుండా చేసి పెట్టింది. ఇంకా పద్నాల్గేళ్ళు నిండని లేత కుర్రాడు చూపులు ఎలా చూస్తాడో, మూతి విరుపులు ఎలా ప్రదర్శిస్తాడో, ఎలాటి చేష్టలు పోతాడో, అలిగితే ఎలా వుంటాడో, సరీగ్గా వీటిని ప్రెజెంట్ చేస్తూ కేర్ ఫ్రీగా దున్నుకుంటూ పోయాడు రణవీర్. చిన్న కుర్రాడిలా పెట్టే అతడి మూతిని, చూపుల్నీ అస్సలు మర్చిపోలేం. మనస్తత్వం కూడా అలాటిదే. ఈ క్షణం అలిగితే మరుక్షణం నవ్వేస్తాడు. మనసులో ఏదీ దాచుకోడు. ప్రేమంటే పెద్దగా తెలీదు. పెళ్ళంటే కూడా తెలీకుండా పోటీకోసం  పెళ్ళికి సిద్ధపడతాడు. ఈ రకం క్యారక్ట రైజేషన్ ఈ రోమాంటిక్ కామెడీని చాలా కలర్ఫుల్ గా మార్చేసింది. 

     హీరోయిన్ వాణీ కపూర్ కూడా అతడికేం తీసిపోని తెగువతో నటించేసింది. హీరో కే మాత్రం తీసిపోని, తగ్గని, స్వత్రంత్రతా కోల్పోని తత్త్వాన్ని కొట్టొచ్చినట్టూ గ్లోరిఫై చేసింది. ఈమె పేరెంట్స్ పాత్రల్లో ఆకాష్ ఖురానా, ఆయేషా రజాలవి చాలా అదుపులో వుండే పొదుపైన పాత్రలు. 

     ఈ రోమాన్స్ కి దీటుగా పారిస్ నగరాన్ని పగలూ రాత్రీ వైభవంగా చూపించారు. ఈ హాట్ రోమాన్స్ కి పోటీ పడే బీట్స్ తో పాటలూ వున్నాయి. టెక్నికల్ గా అంతర్జాతీయ స్థాయిలో వుంది. విశృంఖల శృంగారం అక్కడక్కడా వుంది. కానీ ఒక్క బూతు మాటా లేదు.  డబల్ మీనింగులతో కామెడీ చేయడాలు లేదు. డైలాగుల్లో వాడిన భాష కూడా అర్బన్ యూత్ వాడే పదాలతో వుంది.

చివరికేమిటి 
        మేం యూత్ కి ఫలానా ఈ మెసేజ్ తో సీనిమా తీశామని పాత స్టయిల్లో పబ్లిసిటీ చేసుకోవడాలు చూస్తూంటాం. యూత్ కి మెసేజ్ ఇచ్చేదేమిటి? వాళ్ళు దేశాలు దాటిపోతున్నారు. సినిమా ఫీల్డు దాటకుండా కూర్చుని మెసేజి లివ్వడమేమిటి? ఆదిత్యా చోప్రా కేవలం అనుభవాలు చూపించి వదిలేశాడు. అనుభవాల్లోంచి యూత్ వాళ్ళే నేర్చుకుంటారు. కావాల్సిందల్లా అచ్చు గుద్దినట్టు వాళ్ళ జీవితాల్ని, అనుభవాల్నీ చూపించడం. పెద్దగా విషయం లేకుండానే విషయమున్నట్టు తోచే ఈ రోమాంటిక్ కామెడీ బాలీవుడ్ వేసిన ఒక ముందడుగు. 1995 లో ‘దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే’ కి దర్శకత్వం వహించిన ఆదిత్యా చోప్రా, ఇంకో రెండే సినిమాలకి దర్శకత్వం వహించి, నిర్మాతగా 40 సినిమాలు నిర్మించి, ఇప్పుడు ఈ యూత్ ఫుల్ రోమాంటిక్ కామెడీకి రచన- దర్శకత్వమూ వహిస్తూ అత్యంత ట్రెండీ చిత్రీకరణ జరపడం గొప్ప విషయమే.


-సికిందర్
http://www.cinemabazaar.in/










19, డిసెంబర్ 2016, సోమవారం



        కొందరు అడుగుతూంటారు- తెలుగు సినిమాల స్క్రిప్ట్స్ ఎక్కడ దొరుకుతాయని. తెలుగులో కాదుకదా ఏ దేశభాషలోనూ ఏ సినిమా స్క్రిప్టూ ఎక్కడా దొరకదనేవి రికార్డయిన సత్యం. హాలీవుడ్ అంత అభివృద్ధి పథంలో లేదు మన దేశ సినిమా రచనా రంగం. హాలీవుడ్ లో స్క్రిప్టులు ప్రింటయి వస్తాయి. నెట్ లో వాటి పీడీఎఫ్  లు లభిస్తాయి ఉచితంగా. తెలుగు సినిమా స్క్రిప్టులకి ఈ సదుపాయం లేదు. షూటింగ్, ఎడిటింగ్, డబ్బింగ్ ఈ మూడూ పూర్తయ్యే వరకే వుంటాయి. సినిమా విడుదలయ్యాక ఎటుపోతాయో ఎవరికీ తెలీదు. వాటి అవసరం కూడా అంతగా ఫీలవరు. ఒకవేళ ఏ సినిమా ఆఫీసులోనైనా ఏదైనా స్క్రిప్టు అదృష్టవశాత్తూ వుంటే దాన్నిచదవడం బ్రహ్మ కైనా సాధ్యం కాదు. స్క్రిప్ట్ అంటే డైలాగ్ వెర్షనే కాబట్టి- అది షూటింగ్ దగ్గర్నుంచీ డబ్బింగ్ వరకూ రకరకాల కొట్టివేతలతో,  మార్పుచేర్పులతో  గజిబిజిగా తయారై వుంటుంది. కాబట్టి చదవడం సాధ్యం కాదు. డైలాగ్ వెర్షన్ కాకుండా, చక్కగా ఒక కథలా చదువుకోవడానికి- దాన్ని విశ్లేషించుకోవడానికీ ట్రీట్ మెంట్ ( స్క్రీన్ ప్లే) కాపీ ఏదైనా వుం టుందా అంటే, అదీ ఇంతే. దాన్నుంచి డైలాగ్ వెర్షన్ రాస్తున్నప్పుడే ఆ కాగితాలు చెత్త బుట్టలోకి చేరిపోతూంటాయి. కాబట్టి తెలుగు సినిమాల స్క్రిప్టులు చూసి, చదివి స్క్రిప్టులు రాయడం నేర్చుకుందామనుకుంటే కుదరని పని.

          పని ఇంగ్లీషు వచ్చి వుంటే హాలీవుడ్  స్క్రిప్టులతో సులభ సాధ్యమవుతుంది. హాలీవుడ్ స్క్రిప్టులు  అసంఖ్యాకంగా లభిస్తాయి. ఇంకోటేమిటంటే, ఇవి రాసినప్పుడు ఎలా వుంటాయో తీశాక కూడా అలాగే వుంటాయి- రాసింది రాసినట్టే తీస్తారు కాబట్టి. కనుక ఈ స్క్రిప్టులు ముందు పెట్టుకుని ఆ సినిమాలు చూస్తూంటే ఎక్కడా తేడా కొట్టదు. ఒక్కడైలాగూ మారదు. అందుకే నేర్చుకోవడానికి ఈ స్క్రిప్టులు బాగా కలిసివస్తాయి.

        అసలు స్క్రిప్టులు చదివి నేర్చుకోవడం ఎందుకు? సినిమాల్ని చూస్తున్నప్పుడు కంటే వాటిని చదుతున్నప్పుడు లోతుగా బాగా అర్ధమవుతాయి. స్ట్రక్చర్ బాగా అర్ధమవుతుంది. స్ట్రక్చర్  తెలియకుండా ఈ స్క్రిప్టులు చదివి నేర్చుకుందామనుకుంటే కుదరదు. స్ట్రక్చర్ తెలిస్తేనే దాన్ని స్క్రిప్టులో గుర్తు పడుతూ, విశ్లేషించుకుంటూ, అర్ధం చేసుకుంటూ నేర్చుకోవడానికి సాధ్యమవుతుంది. పైగా స్ట్రక్చర్ లో ఏ ప్లాట్ పాయింటు ఎక్కడ వచ్చిందో, క్యారక్టర్ ఆర్క్ ఏఏ సీన్లలో ఎలా కొనసాగిందో, బిగినింగ్, మిడిల్, ఎండ్ విభాగాలు ఎలా వున్నాయో, మొదలైన స్ట్రక్చర్ సంబంధ ఎలిమెంట్స్ ని  ఆ స్క్రిప్టులు మీద మార్క్ చేసుకుంటూ, నోట్స్ రాసుకుంటూ పోవచ్చు. ఇది రిఫరెన్స్ గా బాగా పనికొస్తుంది. 

          అసలు థ్రిల్లర్స్ స్క్రిప్టులు చదవితే ఇంకా బాగా క్రాఫ్ట్ నేర్చుకోవచ్చు. ఎందుకంటే వాటి కథనాల్లో  థ్రిల్స్, యాక్షన్, సస్పెన్స్,  టెంపో, స్పీడు, ట్విస్టులు, ప్లే, పాత్రల ఎత్తుగడలు, కార్యకారణ సంబంధాలు, లాజిక్, అంచెలంచెలుగా బయటపడే మిస్టరీ,  ఇవన్నీ – వీటన్నిటి మీదా  పట్టు సాధించే వీలు కలుగుతుంది. అంతేగాక 
సమయస్ఫూర్తి, సిక్స్త్ సెన్స్ పెరుగుతాయి. మొత్తంగా బ్రెయిన్ షార్ప్  అవుతుంది. ఒకసారి బ్రెయిన్  షార్ప్ అయ్యిందంటే అదలాగే ఉండిపోతుంది. ఇలా  స్క్రిప్టుల్ని క్షుణ్ణంగా అభ్యసించి  పట్టు సాధించ గలిగితే, ఇంకే జానర్ స్క్రిప్టు నైనా ఈజీగా, పకడ్బందీగా  రాసెయ్య గల్గుతారు. 

        స్టీవెన్ స్పీల్ బెర్గ్ తన కెరీర్ ప్రారంభ దినాల్లో తీసిన క్లాసిక్ థ్రిల్లర్ ‘ది రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్’ స్క్రీన్ ప్లే స్క్రిప్టు ఒక మంచి ఉదాహరణ. అలాగే కోయెన్ బ్రదర్స్ మాస్టర్ పీస్ ‘ఫార్గో’ కూడా.  ఇలాటివి దృష్టికొచ్చినవి ఏవి వుంటే వాటిని ఉచితంగా డౌన్ లోడ్ చేసుకుని స్టడీ మొదలెట్టుకోవచ్చు. స్ట్రక్చర్ నేర్చుకుని ఆ స్ట్రక్చర్ ప్రకారం సినిమాలు చూడ్డం వేరు, స్క్రిప్టులు చదవడం వేరు. ఈ కింద ఇస్తున్న రెండు లింకులు ప్రయత్నించండి, ఆల్ ది బెస్ట్. 
       www.dailyscript.com/scripts/RaidersoftheLostArk.pdf
                                        www.coenbrothers.net/scripts/fargo.pdf


-సికిందర్ 

అధ్యయనం - అభిరుచి
            కాలాలు మారిపోవచ్చు. మనుషులు మారవచ్చు. సంక్షోభాలు ఎదురవచ్చు. కానీ కొన్ని అలవాట్లుఅభిరుచులు మారవు. ఈ కోవకు చెందిన అభిరుచి పుస్తకాలు చదవడం. కొన్ని దశాబ్దాల కిందటితో పోలిస్తే పుస్తకాలు ఇప్పుడు ఎక్కువగా అందుబాటులోకి వచ్చాయి. అక్షరాస్యత పెరిగింది. చదివేవాళ్ళ సంఖ్యా అనేక రెట్లు ఇనుమడించింది. చదువు లేకుండా ఏ రంగంలోనూ రాణించే అవకాశం లేదు. అసలు చదవకుండా నవనవోన్మేషంగా జీవించడమూ సాధ్యం కాదు. ఒక దశ నుంచి మరో దశకు ఎదగాలన్నానిర్వర్తించే వృత్తివ్యాపకాల్లో ముందుకు వెళ్ళాలన్నా అధ్యయనం బతుకులో భాగం కావాలి. 

            నిజానికి ఎవరయినా చదివి తీరాల్సిన క్లాసిక్స్‌ ప్రతి జాతికీ ఉంటాయి. ఎవరు ఎలాంటి వృత్తి వ్యాపకాల్లో ఉన్నప్పటికీ వాటిని చదవాలి. రామాయణమహాభారతాలుపంచతంత్ర కథలుభగవద్గీతమేఘసందేశంబృహత్కథ వంటివి భారతీయ క్లాసిక్స్‌. వీటిలోని కొన్ని అంశాలతో విభేదించినా చదవడం మంచిది. శతాబ్దాల మానవ ప్రయాణంలో పరంపరానుగతంగా వస్తున్న సంప్రదాయాల్లోని మేలిమిని తెలుసుకోడానికి ఉపకరించే క్లాసిక్స్‌ ప్రతి ఒక్కరు అధ్యయనం చేయాలి. ఈరకమైన అభిరుచిని పెంపొందించే దిశగానే బాల్య కౌమారల్లోని విద్యా సిలబస్‌ రూపొందాలి. చదివే అభిరుచుల్ని కల్పించే లక్ష్యంతో పాఠశాలల్లో స్టోరీ పీరియడ్‌ లాంటివి ఏర్పాటు చేయాలి.
            ఇంటర్నెట్‌ విస్తరణమొబైల్స్‌ వాడకం పెరిగినప్పటికీ పుస్తకాల ప్రాధాన్యం చెదిరిపోదు. శాస్త్రసాంకేతిక రంగాల్లో వేగంగా వస్తున్న మార్పులు అధ్యయన అవసరాల్ని మరింత పెంచుతున్నాయి. అందుకని ఎప్పటికప్పుడు నైపుణ్యాల్ని పెంచుకోడానికి అధ్యయనం తప్పనిసరి. జీవనయానంలోని ప్రతి దశలోనూ వ్యక్తి మనో వికాసానికి పుస్తకాల అధ్యయనం తోడ్పడుతుంది. జీవితాన్ని సృజనాత్మకంగా మలుచుకోడానికినిత్యనూతనంగా గడపడానికి ఉపకరిస్తుంది. కనుకనే వయసుతో నిమిత్తం లేకుండా అధ్యయనం అనివార్యమైన అవసరం.

(Navatelangana- Sunday editorial- Courtesy: KP Ashok Kumar)