రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

18, జూన్ 2017, ఆదివారం

రివ్యూ!



రచన -నిర్మాణం - దర్శకత్వం:  పట్టాభి ఆర్‌. చిలుకూరి   
తారాగణం:  పూజా దోషి, హరీష్కల్యాణ్, సాయిరోనక్, సంధ్యా జనక్, షర్మిల,  మోహన్రామన్, సుదర్శన్ తదితరులు
సంగీతం:  ప్రసన్-ప్రవీణ్- శ్యామ్ , కెమెరా:  శేఖర్వి. జోసెఫ్ , బ్యానర్ :   అనగనగా ఫిలిం కంపెనీ 
విడుదల : జూన్ 16, 2017
***
          
         కొత్త హీరో హీరోయిన్లతో కొత్త కొత్త దర్శకుల ప్రేమ సినిమాలు ప్రతీ వారం విధిగా విడుదలవుతున్నాయి. మొన్నటి దాకా నాల్గు ఆటలు పడే ప్రేమ సినిమాలు సింగిల్ స్క్రీన్ థియేటర్ లలో సైతం నేడు రెండు ఆటలకి పడిపోయాయి. ఈ రెండాటలకి కూడా ముగ్గురు నల్గురు చొప్పున ప్రేక్షకులు వుంటున్నారు. ఇంకెందుకు ఈ ప్రేమ సినిమాలు తీస్తున్నట్టు? ఈ కొత్త దర్శకుల, నిర్మాతల హిడెన్ ఎజెండా ఏమైనా వుందా? వుంటే మంచిదే. ఇంకో రకంగా లాభ పడుతున్నారనుకోవచ్చు-  థియేటర్ల క్యాంటీనుల  పార్కింగుల ఆదాయాలకి గండి కొట్టి. లేకపోతే  మాత్రం ప్రేమ సినిమాల కుటీర పరిశ్రమ ఎత్తేసి, ఇంకో రకం సినిమాలతో స్టార్ట్ అప్స్ ప్రారంభించుకోవాల్సిన అవసరం లేదా? దేశాన్ని- పోనీ రెండు రాష్ట్రాల్ని  ఎటు తీసికెళ్దా మనుకుంటున్నారు సాంస్కృతికంగా?

        ఈ వారం ఇలాటి కొత్త దర్శకుల జాబితాలో చేరుతూ,  నిర్మాత కూడా తానే అయి పట్టాభి ఆర్. చిలుకూరి  మరో ప్రేమ సినిమాతో వచ్చారు. దీనికి కేటీఆర్, రాం చరణ్ లతో ప్రమోట్ కూడా చేయించుకున్నారు. తీరా థియేటర్లలో చూస్తే పైన చెప్పుకున్న పరిస్థితే వుంది. కేటీఆర్, రాం చరణ్ లు పరిస్థితిని  ఏమీ మార్చలేక పోయారు. తమ పరిస్థితే ప్రశ్నార్ధకమైంది.  ఇలా వచ్చిన మరో ప్రేమ సినిమా ‘కాదలి’,  కొత్త హీరో హీరోయిన్లతో మరో ముక్కోణ ప్రేమ కథ. ముందు కథెలా వుందో చూద్దాం...

కథ 
      బాంధవి (పూజా దోషి) ఒక ఫిజియో థెరఫిస్టు. తల్లి దండ్రులకి తన సంపాదనే దిక్కుగా వుంటుంది. ఎన్నో పెళ్ళిచూపులకి కూర్చుంటుంది. వస్తామన్న వాళ్ళు రారు. కుటుంబం మీద వున్న అప్పులు చూసి వెనుకాడతారు. తనకసలు పెళ్లవుతుందా అన్న బెంగ పట్టుకుంటుంది. బామ్మ ఒక సలహా ఇస్తుంది. ఈ పెళ్లి చూపుల కంటే బయటే  ఎవరో ఒకర్ని నచ్చిన వాణ్ణి చూసి చేసుకోమంటుంది. బాంధవి ఫ్రెండ్ కూడా దీనికి సపోర్టు చేస్తుంది.

          ఫ్రెండ్ తో కలిసి బాంధవి రెస్టారెంట్ కి వెళ్తుంది. అక్కడున్న కార్తీక్ (హరీష్ కల్యాణ్) చూడగానే నచ్చుతాడు. మాట కలిపి స్నేహం చేసి ప్రేమించడం కూడా చేస్తుంది.  కార్తీక్ ఎప్పుడే వృత్తి చేస్తూంటాడో తెలీదు. పైగా కోపం వచ్చినా,  సంతోష మేసినా ఇంట్లోంచి వెళ్ళిపోతాడు. అలా ఇంట్లోంచి వెళ్ళిపోయి కనపడకుండా పోయిన కార్తీక్ గురించి వర్రీ అవుతూంటే, క్రాంతి (సాయి రోనక్) అనే ఇంకో యూత్ తారస పడతాడు. 

          ఇతడి మీద ఇష్టం పెంచుకుని తిరుగుతుంది. ఇతడికి సవతి తల్లి కారణంగా కోపమెక్కువ. ఎప్పుడెవర్ని కొడతాడో తెలీదు. కోపం తగ్గించుకోమని సలహా ఇస్తే వెళ్లి ధ్యాన శాలలో చేరతాడు. ఇంతలో కార్తీక్ తిరిగి వస్తాడు. బాంధవి తికమకలో పడిపోతుంది. ఇప్పుడు తనని ప్రేమిస్తున్న ఇద్దర్లో ఎవర్ని చేసుకోవాలి?  అదెలా చెప్పాలి?
          ఇదీ కథ. 

ఎలావుంది కథ 
       దీన్ని ‘అమీ తుమీ’ లాగా పక్కా రోమాంటిక్ కామెడీ చేసి సొమ్ములు చేసుకుందా మనుకోలేదు. రోమాంటిక్ డ్రామా చేశారు. కొత్త వాళ్ళతో రోమాంటిక్ డ్రామాలు చూసే ఓపిక ఎప్పుడో పోయింది. వీణ సినిమాలు పోయి, గిటార్ సినిమాలు రావాల్సిన కాలం నడుస్తోంది. కాలానుగుణంగా  ‘అమీతుమీ’ గిటార్ వాయించింది. తెలుగులో రోమాంటిక్ కామెడీలు తీయలేకపోతున్నారు. చేయి వంకర్లు పోయి సగం నుంచి  రోమాంటిక్ డ్రామాలుగా మారిపోయి అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి.  తెలుగు రోమాంటిక్ డ్రామాలు అవే రెండు రకాలు : ప్రేమిస్తున్నానని చెప్పలేక గింజుకు చావడం, ఇద్దర్లో ఎవర్ని చేసుకోవాలో తెలీక తన్నుకు చావడం. ప్రేమికుల సందేహాలు తీర్చే పూజా బేడీ ఒక్క మాటలో తేల్చి పారేస్తుంది ఇలాటి సమస్యల్ని. కానీ రెండు గంటల నసగా తీస్తే తప్ప తనివితీరడం లేదు కొత్త దర్శకులకి.  

          ‘కాదలి’ (అంటే ఏమిటో?)  ముక్కోణ జాతికి చెందింది. ఇద్దర్లో ఎవర్ని చేసుకోవాలన్న ధర్మ సందేహం. ఈ పాత్ర విరివిగా వస్తున్న తెలుగు ప్రేమ డ్రామాలు చూడడం లేదు కాబోలు, చూస్తే మాత్రం సెంటిమెంటు ప్రకారం  మొదట దగ్గరైన వాడ్నే చేసుకోవాలని చప్పున గుర్తించేది. 

          కథ కొన్ని వందల సినిమాల పాతదే. కొత్త ప్రతిపాదన లేమీ లేవు. పాతని పాతలాగే పరిరక్షిస్తూ టెంప్లెట్ ప్రేమ డ్రామాకి  పూర్తి న్యాయం చేశారు.

ఎవరెలా చేశారు 
     ఇది హీరోయిన్ కథ. కానీ హీరోయిన్ ఎంపిక మాత్రం ఎంపికలా లేదు. ఎత్తైన హీరోల మధ్య ఆమె చంకలదాకా కూడా రావడం లేదు. పైగా సన్నం. మేడ్ ఫర్ ఈచ్ అదర్ కి ఫర్లాంగు దూరం. లాంగ్ షాట్ పెడితే  అంతేసి ఎత్తుగా హీరోలే కన్పిస్తారు తప్ప ఆమె కన్పించదు. ఆమెని కింద వెతుక్కోవాలి. ఇలా పెట్టి షాట్స్ తీయకూడదని కూడా దర్శకుడు అనుకోలేదు. ప్రేమ కథకి ఇదేం సెలెక్షనో అర్ధం కాదు. ఆమె రికమెండేషన్ మీద వస్తే విధిలేక పెట్టుకున్నట్టుంది. అయితే కొత్త హీరోయిన్ పూజా దోషికి నటించగల టాలెంట్ వుంది. ఆమెది లవ్లీ ఫేస్. నవ్వినప్పుడు క్లోజప్ లో సొట్ట బుగ్గలతో ప్రీతీ జింటాని గుర్తుకు తెస్తుంది. అయితే నస పెట్టే పాత్ర కావడంతో ఆమె పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నీ కాసేపటికి వికర్షించడం మొదలెడతాయి. 

          ఫస్ట్ హీరో
హరీష్కల్యాణ్, సెకండ్ హీరో సాయి రోనక్ లు ప్రదర్శించడానికి పాత్రలకి ప్రత్యేకత లేం లేవు. రొటీన్ లవర్ బాయ్స్. హరీష్ పాత్ర మధ్య తరగతి పాత్రయితే, సాయి పాత్ర ఉన్నత తరగతి పాత్ర. ఆరడుగుల ఈ ఇద్దరూ తమ చంకల దాకా రాని అమ్మాయి గురించి కొట్టుకోవడం విచిత్రంగా వుంటుంది. ఇక వీళ్ళ తల్లి దండ్రుల పాత్ర ధారులు కూడా కొత్త వాళ్ళే. 

          కెమెరా వర్క్ ఓ మాదిరిగా వున్నా, హీరోయిన్ మీద చిత్రీకరించిన పాటలు రెండు బావున్నాయి. ఈ లో-  బడ్జెట్ కి ప్రొడక్షన్ డిజైన్ పరంగా సృజనాత్మకంగా అలోచించ కపోవడంతో, పెద్ద సినిమాల విజువల్స్ పేదవాడు తీసినట్టు వున్నాయి.

 చివరికేమిటి 
      ఫీలింగ్స్ తో పని వుండని  ‘అహ నా పెళ్ళంట’, ‘అమీ తుమీ’ లాంటి పక్కా రోమాంటిక్ కామెడీల్లో  నవ్వించడమే ప్రధానం కాబట్టి  లాజిక్ లు ఎగేసినా చెల్లుతుంది. ఫీలింగ్స్ తోనే పండే రోమాంటిక్ డ్రామాల్లో లాజిక్ లు, లాజికల్ గా  వుండే పాత్రల జీవితాలూ లేకపోతే ఒప్పించడం కష్టం. ఈ రోమాంటిక్ డ్రామాలో కథ హీరోయిన్ దైనప్పుడు ఆమె పాత్రని సహేతుకంగా ఎక్కడా ఎస్టాబ్లిష్ చేయలేదు. ఆమె కుటుంబ పరిస్థితుల నేపధ్యంలో ఆమె పెళ్లి నిర్ణయాలు తీసుకోజాలదు. కుటుంబం అప్పులపాలై,  తండ్రికి సంపాదనా లేక, కుటుంబానికి తన సంపాదనే దిక్కయినప్పుడు- పెళ్లి గురించి ఆలోచిస్తే, కుటుంబాన్ని ఎవరు చూస్తారు? తండ్రి కూడా ఏం పెట్టి పెళ్లి చేద్దామని అన్నేసి సంబంధాలు చూస్తున్నాడు? కాబట్టి ఎంత కాదన్నా హీరోయిన్ ‘అంతులేని కథ’ సిట్యుయేషన్ లో ఉన్నట్టే.  తన జీవితం తను చూసుకుని వెళ్లి పోతానంటే అది వేరు. కానీ కథా నాయికకి బావుండదు. బాంధవి అన్నాక కుదరదు.

          కూతురి సంపాదన తల్లి కూడా తింటూ అన్నం తింటున్న తండ్రిని దుయ్యబట్టడం ఇంకో అర్ధం లేని దృశ్యం. చచ్చిన పాములాంటి తండ్రిని ఇంకా ఎందుకు చంపుతున్నారంటే, తద్వారా కూతురు ఆయనకి అన్నం తినిపించే సెంటి మెంటు పండుతుందని!  ఈ పే ఆఫ్ కోసం సెటప్ ని హేళన చేశారు.

          హీరోయిన్ పాత్రతో దర్శకుడు ఏం చేయాలనుకున్నాడో స్పష్టత లేదు. పెళ్లి చేయాలంటే ఆర్ధిక సమస్యలున్నట్టు చూపించారు. మరో వైపు ఆమె పెళ్లి చేసుకుంటే కుటుంబానికి దిక్కేమిటో  చెప్పడం లేదు. ఆమె కథానాయికే అయితే ఈ పరిస్థితుల్లో పెళ్ళే చేసుకోనంటుంది. కుటుంబం కోసమో, అప్పులు తీర్చడం కోసమో కష్టపడుతుంది. ఎప్పటిదాకో మనకి తెలీదు, దైవాధీనం!  బాలచందర్ ‘అంతులేని కథ’, మహాశ్వేతా దేవి నవల ఆధారంగా తీసిన హిందీ ‘తపస్య’ కి కోదండ రామిరెడ్డి చేసిన రీమేక్ ‘సంధ్య’ లాంటి సినిమాలు దర్శకుడు చూశారో లేదో తెలీదు. 

          బామ్మ తన బాధలోంచి చెప్పి వుండొచ్చు- ఇదంతా కాదు, బయట ఎవర్నో చూసుకుని చేసుకోమని.  కానీ హీరోయిన్ అన్నాక అలా చేస్తుందా? అలా చేస్తే, మళ్ళీ బ్యాక్ టు పెవేలియనే అవుతుంది. బయట ప్రేమించే వాడు ఈమె వెనక ఏముందో చూస్తే మళ్ళీ మొదటికేగా? కుటుంబ పరిస్థితి దాచి పెట్టి  అబ్బాయిల్ని ట్రాప్ చేయడానికి హీరోయిన్ బయల్దేరడ మేమిటి. అసలు పెళ్లి ఖర్చులకి కూడా డబ్బులున్నట్టు లేదు. ఇలా బకరాల్ని పట్టే హీరోయిన్ పాత్ర కామేడీకి బావుండొచ్చు. 

          బామ్మ  మాట పట్టుకుని ఫ్రెండ్ తో బయల్దేరిన హీరోయిన్, రెస్టారెంట్ కెళ్తుంది. అక్కడ ఒకతన్ని చూసి ఆగిపోయి గుసగుస లాడుకుంటారు ఇద్దరూ. బావున్నాడు వెళ్లి మాట కలుపు- అని ఏదో చెప్పి ముందుకు తోస్తుంది ఫ్రెండ్. హీరోయిన్ ఆ ముక్కూ మొహం తెలీని హీరోని పెళ్లి కొడుకుగా గా ఫిక్స్ చేసుకుని వెళ్లి పరిచయం చేసుకుంటుంది. ఇక్కడ ఆమె పాత్ర పూర్తిగా పడిపోయింది. ఇదెలా వుందంటే బజారు కెళ్ళి ఎవడు కన్పిస్తే వాణ్ణి మొగుడిగా షాపింగ్ చేసుకుని వద్దామన్నట్టుంది. 

          ఇలా బేస్ సరీగ్గా వుండని పాత్రలు, సన్నివేశాలే సినిమా నిండా. ఈ హీరో కన్పించకుండా పోతే ఫోన్ చేయవచ్చు కదా?  అసలలా కోపమొచ్చినా, సంతోష మేసినా వూరొదిలి వెళ్ళిపోయే వాడు తన కెందుకు? అంత ప్రేమిస్తే రెండో హీరోని చూడగానే మళ్ళీ ఇతన్ని ఆశ పెట్టడం ఎందుకు, కోపిష్టి అయిన ఇతన్ని వదిలెయ్యక? మళ్ళీ మొదటి హీరో రాగానే ఇద్దరితో  ఇరకాటంలో పడ్డ మెందుకు? అసలు బలాదూరు తిరిగే మొదటి హీరోది ఎలాటి ప్రేమ? మళ్ళీ చెప్పకుండా వారణాసి చెక్కేస్తే ఇంకెందుకా  దేశదిమ్మరి?  ఇతనే కావాలనుకుంటే ఇంటర్వెల్లో రెండో హీరోకి చెప్పేస్తే తీరిపోతుందిగా సమస్య. సెకండాఫ్ కి లేని కథని సాగదీయడం ఎందుకు - కేవలం ఈ మాట చెప్పడానికి? 

          లైటర్ వీన్  ప్రేమ సినిమాలు సకాలంలో పాయింటుకి రావు. వస్తే అప్పుడే కథ ముగిసిపోతుందని తెల్సు. అందుకే క్లయిమాక్స్ దాకా పాయింటుకి రాక సాగదీస్తారు. క్లయిమాక్స్ దగ్గర పాయింటు కొచ్చి, ఐదు నిముషాలు సంఘర్షణ పెట్టి తీర్చేసి,  ముగించేస్తారు. అంటే మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అన్నమాట. కథ ఉంటేగా మిడిల్ ఉండడానికి. కథ క్లయిమాక్స్ లో ఐదు నిమిషాలే వుంటుంది. అప్పటిదాకా నడిచేది స్క్రీన్ ప్లేలో బిగినింగ్ విభాగమే. అందుకే మలుపులేమీ కన్పించవు. బిగినింగ్ విభాగాన్ని సాగదీస్తున్నంత సేపు కథలో మలుపులు రావు. కథనంలో డైనమిక్స్ వుండవు. ఏవో సీన్లు భర్తీ అవుతూంటాయి. కథ ప్రారంభం కాలేదు కాబట్టి సీన్లలో వేగం వుండదు. ఇందుకే ఈ ప్రేమ సినిమాలు భరించలేక పోతున్నారు ప్రేక్షకులు. 

          కథలో ఎలా వుండాలో తెలీని హీరోయిన్ పాత్రకి, పార్కింగ్ ఎక్కడ చేయాలో కూడా తెలీదులా వుంది. అదేమిటో తను పని చేసే హాస్పిటల్ గేటు బయట, రోడ్డు మీద టూవీలర్ పార్క్ చేసి వెళ్తూంటుంది లోపలికి. ఒకసారి కాదు, ఎప్పుడు హాస్పిటల్ కొచ్చినా ఇంతే. లోపల అంత పెద్ద ప్రాంగణంలో పార్కింగే లేదా అని  మనం సస్పెన్స్ తో చస్తుంటాం. పైగా ఆమె స్టాఫ్ కూడా. అప్పుడు  సెకండాఫ్ లో హీరో  రయ్యిన బుల్లెట్ మీద దూసుకొచ్చి, లోపలికి దూరిపోయి  పార్కింగ్ లో ఠకీల్మని పెడతాడు బండిని!  లోపల పార్కింగ్ వుందన్న మాట! మన హీరోయిన్ గారే బయట వేలాడుతోంది- కథలో లాగా! 

          ముక్కోణ ప్రేమల్లో త్యాగం చేసే పాత్రని ఉన్నతంగా చూపించడం, కథనంలో సస్పెన్స్ పోషించడం ఈ రెండే ప్రధానంగా చూసుకోవాల్సిన అంశాలని ఎన్నో అర్ధవంతమైన సినిమాలు చెప్తున్నాయి.

- సికిందర్
http://www.cinemabazaar.in
         
         






         
         

17, జూన్ 2017, శనివారం

డార్క్ మూవీస్ ఎలిమెంట్స్ - మరికొన్ని ఎగ్జాంపుల్స్ : 


*********************************************************************************************

రివ్యూ!

దర్శకత్వం: .ఆర్‌.కె.శరవణన్
తారాగణం: ఆది పినిశెట్టి, నిక్కీ గర్లాని, ఆనంద్ రాజ్, రాం దాస్, కోటశ్రీనివాసరావు, బ్రహ్మానందం తదితరులు
సంగీతం: దిబు నినన్థామస్ఛాయాగ్రహణం: పివి శంకర్
బ్యానర్స్ : రిషి మీడియా, శ్రీచక్ర ఇన్నోవేషన్స్
విడుదల : జూన్ 16, 2017
***
          ‘మలుపు’, ‘సరైనోడు’ లతో తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు సంపాదించుకున్న తెలుగు వాడైన తమిళ హీరో  ఆది పినిశెట్టి మరోసారి  ప్రేక్షకుల ముందుకొచ్చాడు. తన సీరియస్ సినిమాలకి భిన్నంగా తమిళ ‘మరగద నాణయం’ డబ్బింగ్  ‘మరకతమణి’ తో ఈసారి ఎంటర్ టైన్ చేయడానికి వచ్చాడు. కొత్త దర్శకుడు ఏ ఆర్ కె  శరవణన్ కి అవకాశమిచ్చి  ఇద్దరి భవిష్యత్తూ తేల్చుకునేందుకు ప్రయత్నించాడు. అయితే ఎంటర్ టైన్ చేయడానికి  అది పినిశెట్టికి నిజంగా అంత టాలెంట్ వుందా? కొత్తదనం కోసం ప్రయత్నించిన శరవణన్ కి నిజంగా అంత సమర్ధత వుందా? ఈ రెండిటిని బట్టే ఈ మూవీ ప్రేక్షకులని అలరించడం వుంటుంది. ఇదెంతవరకూ సాధ్యమైందో చూద్దాం...

కథ
   అనంత పురం నుంచి హైదరాబాద్ వస్తాడు రఘు నందన్ ( అది పిని శెట్టి). వూళ్ళో చేసిన అప్పులు తీర్చడానికి హైదరాబాద్ లో మిత్రుడు బుచ్చి పనిచేస్తున్న  స్మగ్లింగ్ గ్యాంగ్ లో చేరతాడు. ఈ గ్యాంగ్ బాస్ (రాందాస్) చిన్న చిన్న పనులే చేయిస్తూంటాడు. ఇలా అయితే అప్పులు తీరవని పెద్ద పనే  చేయాలనీ రఘునందన్ ఒప్పిస్తాడు. చైనా నుంచి వచ్చిన ఒకడు మరకతమణి కోసం జాన్ అనే వాణ్ణి ఆశ్రయిస్తాడు. ఆ మణి  జోలికిపోతే ప్రాణాలు పోతాయని వారిస్తాడు జాన్. విక్రమాదిత్య కాలానికి చెందిన ఆ మణి కోసం ప్రయత్నించిన 132 మంది ఇంతవరకూ చనిపోయారని అంటాడు. రఘునందన్ వచ్చి ఈ పని చేసి పెడతానంటాడు. అతడి ధైర్యానికి  పది కోట్లు ఆఫర్ చేస్తాడు చైనీయుడు.

          రఘునందన్ అలేఖ్య (నిక్కీ గల్రానీ) ని మూగగా ప్రేమిస్తూంటాడు. ఆమెకి ఎంగేజ్ మెంట్ అయిపోతుంది.  ఈ బాధలో వుండగా, రాందాస్ చనిపోతాడు. అతణ్ణి పూడ్చిపెట్టి ఒక స్వామీజీ (కోటశ్రీనివాస రావు)దగ్గరికి పోతారు రఘునందన్, బుచ్చిలు. ఆ స్వామీజీ చావకుండా మణిని దక్కించుకునే మార్గం చెప్తాడు. ఆ ట్రిక్కు ప్రయోగిస్తే మణి కోసం ప్రయత్నించి చనిపోయిన 132  మంది ఆత్మలూ వచ్చేస్తాయి. వాళ్ళల్లో బుచ్చిగాడి  మావయ్య ఆత్మ  వచ్చేసి రాందాస్ శవంలో దూరుతుంది. రాందాస్ లేచివచ్చి వీళ్ళతో రఘునందన్, బుచ్చిలతో కలుస్తాడు.  ఇంకో మూడు శవాల్లో ఆత్మల్ని ప్రవేశపెడితే అవికూడా మణిని కనిపెట్టడానికి తోడ్పడతాయని  రాందాస్ అనేసరికి, ఆ మూడు శవాల కోసం వెళ్తారు. మూడో శవంగా  వురేసుకుని వుంటుంది అలేఖ్య. 

          ఈ నడిచే శవాలతో రఘునందన్ మణి ని ఎలా కనిపెట్టాడన్నది మిగతా కథ. ఇందులో ట్వింకిల్ రామనాథం ( ఆనంద్ రాజ్) అనే ఇంకో గ్యాంగ్ బాస్ పాత్రేమిటన్నది కూడా ఈ మిగతా కథలోనే చూడాలి. 

ఎలావుంది కథ 
      రకరకాల జానర్స్ ని కలిపేసి అల్లేశారు. యాక్షన్ తప్ప క్రైం, హార్రర్, ఫాంటసీ, డార్క్ కామెడీ మొదలైన వాటితో  ఈ కథ నడిపారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసినట్టు వుండదు, ఎలా తోస్తే అలా గట్ ఫీలింగ్ మీద ఆధారపడి కథ అల్లుకు పోయినట్టు అన్పిస్తుంది. ఉద్దేశపూర్వకంగా ఈ జానర్ల కలబోతకి పాల్పడి వుంటే అది వేరేగా వుండేది. ఈ జానర్స్ అన్నిటినీ  చలనంలోకి తేవడానికి అవసరమైన యాక్షన్ అనే జారుడుబల్ల పైకి చేర్చే ప్రయత్నం జరిగేది. ఇలా జరక్కపోవడంతో ఎక్కడేసిన గొంగళిలా వుండే ఉత్త  డైలాగ్ కామెడీ గా మారింది. 

          నడిచే శవాల్ని చూపించడం కొత్తదే. హాలీవుడ్ లో చాలా పూర్వం నుంచీ ‘జాంబీ’ సినిమాలున్నాయి. గత సంవత్సరమే పదికి పైగా వచ్చాయి. తెలుగులో వీటి  మీద ఎవరి దృష్టీ పడలేదు. తెలుగులో రొటీన్ హార్రర్ కామెడీకి  బదులుగా  ఈ అయిడియా ఉపయోగించుకోమని చెప్తే భయపడ్డాడొక దర్శకుడు. ‘మరకతమణి’ ఈ అయిడియాని తెలిసో తెలీకో ఉపయోగించుకుంది. పక్కోడు ముందుకు పోతోంటే తెలుగు దర్శకులు బల్లగుద్ది కుంభనిద్రకే పెద్ద పీట వేస్తారు. ఆ పీట మీద గుర్రు పెట్టి కుంభ నిద్రోతూ ఇంకా ఇంకా అవే హార్రర్, రోమాన్సుల  అట్టర్ ఫ్లాపు కలలు కమ్మగా, ఇష్టంగా కంటూ వుంటారు.

          జాంబీ ( zombie) దక్షిణాఫ్రికా తెగల వూడూ మంత్రకళ. పూడ్చిన శవాల్ని వూడూ మంత్రంతో లేపి బానిసలుగా పనులు చేయించుకుంటారు. ఈ నడిచే శవాలు మాటాడవు, మరమనుషుల్లా వుంటాయి. వీటికి మాటలు జోడించి ఫాంటసీలు సృష్టించి సొమ్ములు చేసుకుంటోంది హాలీవుడ్. ‘మరకతమణి’ ఈ అయిడియా హాలీవుడ్ ని చూసి ఉపయోగించుకున్నట్టు కూడా అన్పించదు. ఏదో అల్లుకు పోతూంటే తగిలినట్టు అన్పిస్తుంది. లేకపోతే  ఈ కథ జాంబీ యాక్షన్ గా కొత్త పుంతలు తొక్కి రికార్డుల కేక్కేది. 

ఎవరెలా చేశారు 
     ఆది పినిశెట్టి కామెడీ చేస్తే ఎలా వుంటుందో తెలీదు. ఆ అవకాశం అతడికి లేకుండా పక్క పాత్రలన్నీ చేసేశాయి. కాబట్టి  ఈ సినిమాలో ఎంటర్ టైన్ మెంట్ ఏదైనా వుంటే అది మిగతా అన్ని పాత్రల పుణ్యమే. రాందాస్, ఆనంద్ రాజ్, అతడి ఆసిస్టెంట్స్, రెండు నడిచే శవాల నటులు, ఇంకా హీరోయిన్ నిక్కీ గిల్రానీ వీళ్ళే ఈ కథ ముందుకు నడవని కామెడీ డైలాగులతో నవ్వించే ప్రయత్నం చేస్తారు. ‘అది మేడిన్ చైనా- అప్పుడప్పుడు పేల్తుంది. ఇది మేడిన్  ఇండియా-  ఎప్పుడు పడితే అప్పుడు  పేల్తుంది’ అని ఆనంద్ రాజ్ నవ్వించే  లాంటి ఇన్స్ పైరింగ్ డైలాగులు కూడా అది పినిశెట్టి కి లేకపోవడం విచారకరం. అతడివి పరిమితమైన ఎక్స్ ప్రెషన్స్. కామెడీ కష్టం. కామెడీ చేయకా, యాక్షన్ కీ దిగక- కథని కూడా నడిపించక పాసివ్ గ వుండిపోయే పాత్ర పోషించాడు.

          చనిపోయిన హీరోయిన్ లో మగ ఆత్మ దూరడంతో ఆమె మగ గొంతుతో మాట్లాడడం మొదట ఎబ్బెట్టుగా అన్పించినా,  తర్వాత్తర్వాత అలవాటై పోతారు ప్రేక్షకులు. మగ గొంతుతో రఫ్ గా వుండే హీరోయిన్ కి మగ గొంతు  బదులు,  ఆ రఫ్ నెస్ కోసం ఏ తెలంగాణా శకుంతల గొంతు పెట్టినా బావుండేది. మగ గొంతుతో అదీ తెలంగాణా యాస హీరోయిన్ మాట్లాడడం మాత్రం క్రియేటివిటీ కాదు, ఫన్ క్రియేట్ చెయ్యదు.

          స్వామీజీగా కోట శ్రీనివాసరావులో మునపటి చైతన్యం లేదు. ఆయన మీద సీను ప్రారంభమే నీరసంగా వుంటుంది. చివర్లో వచ్చే బ్రహ్మనందం కూడా నవ్వించే బదులు అపార సానుభూతి పొందుతారు. తెలుగు డబ్బింగ్ లో రెండు తెలుగు ముఖాలైనా వుండాలని పట్టుబట్టి వీళ్ళని పెట్టినట్టుంది. దర్శకుడి టేస్టు నిరుపమానం. 

          కెమెరా వర్క్ బావుంది. కానీ ఆడియోలో వున్న ఐదు పాటలు లేవు. రెండే వున్నాయి. ఆడియోలో వున్న యుగళగీతాలు హీరోహీరోయిన్ల మీద లేకుండా విగత గీతాలై పోయాయి.  

          హార్రర్ దృశ్యాల గ్రాఫిక్స్ ఫరవాలేదు. ఆత్మలన్నీ వచ్చి చుట్టూ నిలబడే గ్రాఫిక్స్ తో కూడిన రెండు సీన్లు బావున్నాయి. అలాగే హత్యలు చేసే కిల్లర్ లారీకి ఇచ్చిన హార్రర్ లుక్ బావుంది. విక్రమాదిత్య సమాధిలో విక్రమాదిత్య ఆస్థిపంజరాన్ని చూపించకుండా వుండాల్సింది. ఎముకల గూడు చూపించడంతో మిస్టీరియస్ ఫీలింగ్ ని, రాజుపట్ల భయభక్తుల్ని దెబ్బ తీసి నట్టయింది.

చివరికేమిటి 
     ప్రమాదకరమైన మరకతమణి కోసం వేట అనేది యాక్షన్ థ్రిల్లర్ లా వుండాల్సింది. అంటే అద్భుత రసం ప్రధాన రసం అవ్వాల్సింది. దీంట్లోకి ఇమిడి  మిగతా హాస్య, బీభత్స రసాలు సాగాల్సింది. కానీ సినిమాని ఉత్తేజితం  చేసే ప్రధాన రసాన్నే మర్చిపోయి, ఇతర ఉప రసాలు పిండుకుంటూ కూర్చోవడంతో నిస్సారమైపోయింది.  ప్రధాన రసమైన యాక్షన్ థ్రిల్లర్ త్రాటి పైకి కథని తెస్తే హీరో కూడా యాక్టివ్ అయి గోల్ వైపుగా దూసుకు పోయేందుకు అవకాశ ముండేది. 

          వజ్రాల కథలన్నీ వేటే కదా? వేట లేకుండా కథ మేట వేసుకు కూర్చుంటే ప్రేక్షకులు కూర్చోగలరా?  కథా  ప్రారంభంలో మరకతమణి చరిత్ర చెప్పడం, దాంతో ప్రమాదం వివరించడం గంభీరంగా సస్పెన్స్ ని సృష్టిస్తుంది. ఆ తర్వాత  హీరో స్మగ్లింగ్ చేస్తూ ఎంటరవుతాడు. పాటతో కలిపి ఈ దృశ్యాలు పాత ఫార్ములా దృశ్యాలే. హీరోయిన్ ని ఓ రెండు సార్లు మూగగా ప్రేమిస్తున్నట్టు చూడడం, ఆమెకి ఎంగేజ్ మెంట్ అయిపోయాక ఫీల్ అవడం, ఆ తర్వాత అప్పు తీర్చడానికి పెద్ద ప్లానుకోసం ప్రయత్నించడం, మరకతమణి ఆఫర్ రావడం వరకూ వచ్చి,  మొదటి మలుపు తీసుకునే స్క్రీన్ ప్లే ఆతర్వాత నుంచీ చప్పబడి పోతుంది. మొదటి మలుపులో వేట నిర్ధారణ అయ్యింది. కానీ ఈ వేట ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసుకునే తతంగమే సుదీర్ఘంగా సాగుతూ  పక్కదారి పడుతుంది. ఒక్కో శవాన్నే లేపుతూ వచ్చే కామెడీ మీదికిపోయి, వేట అనే ‘సెటప్’ - ఆ వేట తో వచ్చే పదికోట్లూ అనే ‘ పే ఆఫ్’ టూల్స్  గల్లంతై పోయాయి.  కామెడీ శవాల్ని లేపడం గురించి వుండాలా, లేక కట్ షాట్స్ తో టకటకా శవాల్ని లేపేసి వాటితో కలిసి మరకతమణి వేట కొనసాగించడంలో వుండాలా?         

          శవాలతో కలిసి వేట సాగించడంలోనే కామెడీ వుండాలి. కామెడీ ఏ సెగ్మెంట్ లో వుండాలో తెలుసుకోక, ఆ వేట సంగతే వదిలేసి, కూర్చుని మాట్లాడుకుంటూ కామెడీలు చేసుకోవడంతో- ఫస్టాఫ్ నీరసంగా,  కదలని మొద్దులా తయారైంది. కథ వేటలోకే అంటే,  యాక్షన్ లోకే దిగదు కాబట్టి,  ఇంటర్వెల్ కూడా సిల్లీయే! 

          సెకండాఫ్ లో మళ్ళీ శవాలు చేసే వెర్బల్ – ఇండోర్ కామెడీ. వాటి క్యారక్టరైజేషన్స్. ఒక డ్రామా చూస్తున్నట్టే వుంటుంది.  సినిమా చూస్తున్నట్టు ఎప్పుడు ఫీలవుతామంటే, ఈ యాక్షన్ లేని- యాక్షన్ కామెడీ లేని ఇండోర్ దృశ్యాల నుంచి-  క్లయిమాక్స్ లో అవుట్ డోర్స్ లో పడ్డాకే.

          ప్రమాదాలు, ప్రాణాపాయాలు ఇక్కడే మొదలవుతాయి కాసేపు, అంతే. ఇప్పుడు కథ కథ  కొస్తుంది. కానీ ఈ క్లయిమాక్స్ కూడా బలహీనమే. అయినా ఫర్వాలేదనుకుంటాం, కథ కథ కొచ్చిందన్న వూరటతో. 

          ఏం చేసి వుండాల్సింది? తను లేపిన శవాలు జాంబీలని దర్శకుడు గ్రహించి, జాంబీ సినిమాలు హాలీవుడ్ లో వున్నాయని తెలుసుకుని, ఆ మేరకు జాంబీ లతో హిలేరియస్ యాక్షన్ కామెడీ చేసి వుంటే,   ఇంత అర్ధంపర్ధం లేకుండా వుండేది కాదు.

-సికిందర్
http://www.cinemabazaar.in






15, జూన్ 2017, గురువారం

June 15, 2017 : డార్క్ మూవీ ఎలిమెంట్స్


(కొందరు వర్ధమాన రచయితల,  దర్శకుల వొత్తిడి మేరకు డార్క్ మూవీస్ వ్యాసాలని  తిరిగి ప్రారంభిస్తున్నాం)
         
డార్క్ మూవీస్ అనేవి ఇతర జానర్స్ కంటే కూడా ప్రత్యేక కళతో కూడుకుని వుంటాయి. విషయపరంగానే గాక, చిత్రీకరణ పరంగానూ ఇవి భిన్నంగా  వుంటాయి. నేరాలతో మనిషిలోని, సమాజంలోని చీకటి కోణాల్ని వెల్లడి చేయడమనే ప్రధాన ఎజెండాతో ఇవి  రూపొందుతాయి. ఇంత కాలం తెలుగు సినిమాలు బలమైన జానర్ ని పట్టించుకోక వెనుక బడిపోయాయి. కళాత్మకత, సృజనాత్మకత అనేవి ప్రేమ సినిమాల్లోనూ, దెయ్యం సినిమాల్లోనూ ఏనాడో కనుమరుగైపోయాయి. కానీ డార్క్ మూవీస్ కళాత్మకత, సృజనాత్మకత ఏనాడూ చచ్చిపోయేవి కావు. ఇవిలేక డార్క్ మూవీస్ లేవు. వీటిని రుచి మరిగిన ప్రేక్షకులు వీటిని విడిచి పెట్టనూ లేరు – (డార్క్ మూవీ పాత్రలు -   May 2, 2017)

         
టీవల విడుదలైనవెంకటా పురం’, ‘కేశవచూసే వుంటారు చాలా మంది. వీటిని డార్క్ మూవీస్ గా పొరబడ కూడదు. డార్క్ మూడ్ క్రియేట్ చేసినంత మాత్రాన డార్క్ మూవీస్ అయిపోవు.  పై పేరాలో పేర్కొన్నట్టు నేరాలతో మనిషిలోని, సమాజం లోని చీకటి కోణాలని వ్యక్తం  చేసేవే డార్క్ మూవీస్. వెంకటా పురం’, కేశవరెండూ యాక్షన్ మూవీసే. యాక్షన్ మూవీస్ వేరు, డార్క్ మూవీస్ వేరు. కేశవలో హీరో చేసే  మొదటి హత్య తర్వాత పోలీసులు చెట్టుకి   వురేసి వున్న శవాన్ని దింపుకుని వెళ్ళిపోతారు అదేదో తమ సొత్తు అయినట్టు. ఇలా ఎక్కడైనా జరుగుతుందా? విధిగా శవ పంచనామా చేస్తారు, వీడియోలూ ఫోటోలూ తీస్తారు, సాక్ష్యాధారాల కోసం శోధిస్తారు. డార్క్ మూవీస్ లో వాస్తవికత కనిపిస్తుంది. కాబట్టి యాక్షన్ మూవీస్ ని డార్క్ మూవీస్ అనుకోకూడదు. అలా రాసేసి తీయకూడదు. వెంకటా పురంలో హీరో పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి ఒంటి చేత్తో పోలీసులందర్నీ చంపుతాడు. ఇలా డార్క్ మూవీస్ లో జరగదు. డార్క్ మూవీస్ లో ఇలాటి వాస్తవ దూరమైన సీన్లు వుండవని గత వ్యాసాల్లో చెప్పుకున్నాం. 

         
జస్ట్ ఒకసారినేనూ మనిషినేలో గుమ్మడినే  చూడండి- హత్య చేసి హత్య నుంచి తప్పించుకోవడానికి ఎంత హుందాగా వుంటారో. అలాటి హుందాతనాన్ని ఒలకబోసేవే డార్క్ మూవీస్. డార్క్ మూవీస్ లో రఫ్ పాత్రలు వుండవు, పైశాచికంగా ప్రవర్తించవు, రక్తపాతాన్ని సృష్టించవు. . డార్క్ మూవీస్ అంటే 1930 లలో హాలీవుడ్ ప్రారంభించిన జానర్ అని గత వ్యాసాల్లో తెలుసుకున్నాం. 1960 లలో కలర్ లో కొచ్చేటప్పటికి నియో నోయర్ గా రూపాంతరం చెందింది. నియో నోయర్ సినిమాలు హాలీవుడ్ నుంచి ఇప్పటికీ వస్తున్నాయి

         
ఇక క్షణం’, ‘అనసూయలాంటి క్రైం సినిమాలు వస్తూంటాయినియోనోయర్ జానర్ గురించి తెలియకపోవడం వల్లనో ఏమోవీటిని సాధారణ థ్రిల్లర్స్ లాగే  తీసేశారు. అదే నియోనోయర్ లో పెట్టి తీసి వుంటే వీటి విలువ పెరిగేది. హిందీలో కహానీగెరిల్లా ఫిలిం మేకింగ్ టెక్నిక్ తో కళాత్మకంగా తీసిన నియోనోయర్ డార్క్ మూవీ. దీన్ని తెలుగులో అనామికగా రొటీన్ గా రిమేక్ చేసేశారు. చెప్పొచ్చేదేమంటే యాక్షన్, థ్రిల్లర్ లతో బాటు క్రైం, మర్డర్ మిస్టరీల్ని కూడా ఒకే పోత (టెంప్లెట్) లో పోసి తీసేస్తున్నారు. డార్క్ మూవీ అనే ఒక మన్నికగల ప్రత్యేక కళ వుందని తెలుసుకోవడం లేదు.  డార్క్ మూవీస్ ఎలిమెంట్స్ ని ఫాలో అయివుంటే క్షణంఅనసూయ, అనామికలు కళాత్మక విలువలతో డిఫరెంట్ గా వుండేవి. టాలీవుడ్ లో కూడా మంచి ఆర్టు వుందని చాటేవి

         
డార్క్ మూవీ ఎలిమెంట్స్ రచనకి సంబంధించినవి కావు. చిత్రీకరణకి సంబంధించినవి. కాబట్టి చిత్రీకరణలో ఈ జానర్ విలక్షణతని  కెమెరా మాన్ కూడా అర్ధం జేసుకోవాల్సి వుంటుంది. అధ్యయనం చేయాల్సి వుంటుంది. రచయిత - దర్శకుడు- కెమెరామాన్ ముగ్గురి సమన్వయంతో మాత్రమే ఒక  నియో నోయర్ అనే డార్క్ మూవీని  కళాత్మకంగా తీయగలరు. నియో నోయర్ చిత్రీకరణకి కొన్ని ఎలిమెంట్స్ వుంటాయి.  ప్రారంభంలో బ్లాక్ అండ్ వైట్ లో ఫిలిం నోయర్ ప్రారంభించిన ఎలిమెంట్స్ నే దాదాపు తర్వాత కలర్ లో కొచ్చాక నియో నోయర్ సినిమాలూ  అనుసరిస్తున్నాయి. వీటిని తెలుగుకి వాడినా అసందర్భంగా ఏమీ వుండవు.  అవేమిటో ఈ కింద చూద్దాం :

          1.
చారుస్కూరో లైటింగ్, 2. హై కాంట్రాస్ట్ , లాంగ్ షాడోస్, 3. డీప్ ఫోకస్, 4. ఎక్స్ ట్రీం హై, ఎక్స్ ట్రీం లో- యాంగిల్స్, 5. టైట్ క్లోజప్స్, 6. కాంప్లెక్స్ షాట్స్,  7. కాంప్లెక్స్ మీసాన్సెన్ షాట్స్, 8. ఎసెమెట్రికల్ కంపోజిషన్, 9. బార్స్, డయాగోనల్, ఫ్రేమ్స్ వితిన్ ఫ్రేమ్స్, 10. లాంగ్ ట్రాక్ షాట్స్, 11. అబ్ స్క్యూర్ సీన్స్, 12. డచ్ యాంగిల్స్, ఇన్వర్టెడ్ ఫ్రేమ్స్, 13. వాటర్ అండ్ రిఫ్లెక్షన్స్, 14. మిర్రర్స్, 15. మోటిఫ్స్  మొదలైనవి. 

1. చారుస్కూరో (Chiaroscuro) లైటింగ్ :  
       
       ఈ ఎఫెక్ట్ హై కాంట్రాస్ట్ లైటింగ్ తో ప్రగాఢ నీడల్ని సృష్టిస్తుంది. పాత్రల్ని, సీనులో ఇతర విశేషాల్ని  హైలైట్ చేయడానికి దీన్ని వాడతారు. ఇంటరాగేషన్ సీన్లలో కూడా లైటింగ్ ని వాడతారు. బ్యాక్ లైటింగ్ వుండదు. పాత్ర చుట్టూ గంభీర వాతావరణం వుంటుంది. 



          2. హై కాంట్రాస్ట్ , లాంగ్ షాడోస్ :             మామూలుగా లో కాంట్రాస్ట్ లైటింగ్ వుంటుంది. నియోనోయర్లో హై కాంట్రాస్ట్ లైటింగ్ తో బ్యాక్ గ్రౌండ్ లో లేదా ఫోర్  గ్రౌండ్ లో  నీడల్ని సృష్టిస్తారు.  ప్రమాదమో, చేసిన పాపమో వెంటాడుతోందనే అర్ధంలో.  నీడ ముందుంటే ప్రమాదం, వెనుక వుంటే చేసిన పాపం. ముందున్న నీడకి ప్రేక్షకులకి అర్ధం తెలిసిపోయి ప్రమాదాన్ని ఊహించేయవచ్చు పాత్రకంటే ముందే. దీంతో సస్పెన్స్ పుడుతుంది. 

         3. డీప్ ఫోకస్ :
  డీప్ ఫోకస్ లో బ్యాక్ గ్రౌండ్ కి కూడా సమాన ప్రాధాన్యమిస్తారు. అంటే బ్యాక్ గ్రౌండ్ ని బ్లర్ చేయరు. డీప్ ఫోకస్ ని రెండు అవసరాలకోసం వాడతారు : అది మనిషికన్ను ఎలా చూస్తుందో అలాటి షాట్ సృష్టిస్తుంది గనుక;  రెండోది,  డబ్బు ఆదా చేయడానికి. ఒకే షాట్ లో నటులందరూ వుండేట్టు చూడ్డం వల్ల, కట్స్ పడవు. కట్స్ పడకపోతే వాటిని తీయడానికి సమయం సొమ్మూ  కలిసివస్తాయి. 

4. ఎక్స్ ట్రీం హైఎక్స్ ట్రీం లో యాంగిల్స్ : 

        మామూలుగా  లెవెల్ కెమెరా యాంగిల్ పెడతారు.నియో నోయర్ లో ఎక్స్ ట్రీం హై
ఎక్స్ ట్రీం లో యాంగిల్స్ పెడతారు. సీనులో, పాత్రలో తీవ్రతని ప్రదర్శించడానికి.          

          5. టైట్ క్లోజప్స్ :  ఉద్రిక్తతని ఎలివేట్ చేయడానికి టైట్  క్లోజప్స్ తీస్తారు

         
6. కాంప్లెక్స్ షాట్స్ : 

       డబ్బు ఆదా చేయడానికి కాంప్లెక్స్ (సంకీర్ణ ) షాట్ కంపోజింగ్ చేస్తారు. పాత్రలన్నీ ఏకకాలంలో ఒకే షాట్లో వుండేలా చూస్తారు. త్రికోణంగా నిలబడి మాట్లాడుకునేట్టు షాట్స్ తీస్తారు. 

          7. కాంప్లెక్స్ మీసాన్సెన్ (
mise-en-scène ) షాట్స్ : 

          టైట్ క్లోజప్ లో ఫర్నీచర్, వస్తు సామగ్రితో క్రిక్కిరిసివున్న గదిలో పాత్రని చూపిస్తారు,. దీనివల్ల ఆ పాత్ర పీకలదాకా ఇరుక్కుందనే ఫీలింగ్ ని ఎలివేట్ చేస్తారు. 

          8. ఎసెమెట్రికల్ (Asymmetrical) కంపోజిషన్ :  ఒక పాత్ర రెండో పాత్రకి సమాన ఎత్తులో కన్పించకుండా అసమాన కంపోజిషన్ చేస్తారు.

           9. బార్స్, డయాగోనల్, ఫ్రేమ్స్ వితిన్ ఫ్రేమ్స్ :            పాత్రలు పరిస్థితులకి బందీలై నట్టు, కర్మఫలం అనుభవిస్తున్నట్టు ఫీల్ కలగడానికి ఈ షాట్స్ తీస్తారు


          10లాంగ్ ట్రాక్ షాట్స్ :  సీనులో టెన్షన్ పెంచడానికి కట్ చేయకుండా ఒకేలాంగ్ ట్రాక్ షాట్  తీస్తారు.

        11. అబ్ స్క్యూర్ (Obscure) సీన్స్ : సీను బ్యాక్ 
గ్రౌండ్ లో గానీ  ఫోర్ గ్రౌండ్లో గానీ పొగ , పొగ మంచుఆవిరి మొదలైన వాటితో అస్పష్టతా భావాన్ని, లేదా మిస్టీరియస్ ఫీలింగ్ ని కల్గిస్తారు. 

        12.  డచ్ యాంగిల్స్, ఇన్వర్టెడ్ ఫ్రేమ్స్ :
       అసహనం, మతిమాలిన తనం, సమన్వయ లోపం తెలియజేయడానికి డచ్ యాంగిల్స్ లో షాట్స్ తీస్తారు. అనుకున్నది బెడిసి కొట్టిం దనో, పాత్ర గతం ఛండాలమనో  తెలపడానికి ఇన్వర్టెడ్ (తలకిందుల) ఫ్రేమ్స్ లో చూపిస్తారు. 
          13. వాటర్ అండ్ రిఫ్లెక్షన్స్ :   సైకలాజికల్ ఎఫెక్ట్ కోసం నీరు, నీటిలో ప్రతిబింబాలు చిత్రీకరిస్తారు.

          14.  మిర్రర్స్ :  ప్రేక్షకుల్ని కన్ఫ్యూజ్ చేయడానికి మిర్రర్స్ ని వాడతారు. పాత్ర స్ప్లిట్ పర్సనాలిటీ అయినప్పుడు కూడా అద్దంలో చూపిస్తారు.
 

         
15. మోటిఫ్స్ ( మూలాంశాలు) : ఒకే వస్తువూ వివిధ సీన్లలో రిపీట్ అవడాన్ని మోటిఫ్ అంటారు.  రింగులు రింగులుగా సిగరెట్ పొగ వూదడం కూడా ఒకటి. సింబాలిజం కోసం వాడతారు. 

బార్స్, డయాగోనల్, ఫ్రేమ్స్ వితిన్ - లాంగ్ ట్రాక్  -అబ్ స్క్యూర్ - కాంప్లెక్స్ మీసాన్సెన్- ఇన్వర్టెడ్ – మిర్రర్స్ 
 
           ఇదీ- డార్క్ మూవీస్ సైన్స్. డార్క్ మూవీస్ లో షాట్స్ కూడా కథ చెప్పడానికి తోడ్పడతాయి. కెమెరా- కలం -పాత్ర మూడింటి డైమెన్షన్ తో  డార్క్ మూవీ నేరమయ ప్రపంచం కళాత్మకంగా ఆవిష్కారమౌతుంది. పై పదిహేను ఎలిమెంట్స్ ని అర్ధంజేసుకుని కథ కనుగుణంగా ఉపయోగించుకుంటే సీన్లు మ్యాజిక్ చేస్తాయి. ప్రేక్షకులకి సరికొత్త వీక్షణా నుభవం లభిస్తుంది. డార్క్ మూవీస్ బడ్జెట్ మూవీసే. డార్క్ మూవీస్ ని శాస్త్రీయంగా ఇలా తీస్తే బడ్జెట్ మూవీస్ సెగ్మెంట్ లో అద్భుతాలు చేస్తాయి. 

          ఎలిమెంట్స్ గురించి ఈ వ్యాసం చదవడమే గాకుండా  వీలైనన్ని నియో నోయర్ మూవీస్ కూడా చూస్తే విషయం సుబోధకమౌతుంది. 

(next : కథనం)
-సికిందర్




.