రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

9, డిసెంబర్ 2016, శుక్రవారం

రివ్యూ!

స్క్రీన్ ప్లే- దర్శకత్వం : సురేంద్ర  రెడ్డి
తారాగణం : రాం చరణ్, రకుల్ ప్రీత్ సింగ్, అరవింద్ స్వామి. పోసాని కృష్ణ మురళి తదితరులు
కథ : మోహన్ రాజా ( ‘తని ఒరువన్’ తమిళ కథ) మాటలు : వేమా రెడ్డి,  సంగీతం : హిప్ హాప్ తమిళ, ఛాయాగ్రహణం : పీఎస్ వినోద్
బ్యానర్ : గీతా ఆర్ట్స్
నిర్మాతలు : అల్లు అరవింద్, ఎన్వీ ప్రసాద్
 
విడుదల: 9 డిసెంబర్,2016
***
       గోవిందుడు అందరి వాడేలే,  బ్రూస్ లీ లవంటి రెండు వరస పరాజయాలతో సందిగ్ధంలో పడ్డ రాం చరణ్ తమిళ రీమేక్ ‘తని ఒరువన్’ ని ఆశ్రయించాడు. ఈ మధ్య పరాజయాల్లో వున్న కొందరు స్టార్స్ ని రీమేకులే కాపాడినట్టు, రాం చరణ్ ని కూడా ఇదే కాపాడాలి. దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా కిక్ -2 పరాజయం నుంచి ఈ రిమేక్ తో రింగులోకి రావాలని ప్రయత్నించాడు. గీతా ఆర్ట్స్ హంగూ ఆర్భాటాలని కూడా కలుపుకుని మొత్తానికి ‘ధృవ’  విడుదలయ్యింది. ఇదెలా వుందో ఈ కింద చూద్దాం.
కథ 
        ధృవ (రాం చరణ్)  ఒక ఐపీఎస్ ఆఫీసర్. తోటి యువ ఐపీఎస్ లతో ఒక లక్ష్యం పెట్టుకుంటాడు. ఐపీఎస్ ట్రైనీగా వున్నప్పుడు నగరంలో జరుగుతున్న కొన్ని నేరాల్ని గమనిస్తూంటాడు. ఈ చిన్న చిన్న నేరాల వెనుక కొన్ని పెద్ద నేరాలని దాచే కుట్ర సాగుతోందని పసిగడతాడు. ఈ పెద్ద నేరాలు చేసే ఘరానా వ్యక్తులు పదిహేను మంది వున్నారని తెలుసుకుంటాడు. వీళ్ళల్లో ఎవర్ని పట్టుకుంటే వీళ్ళ కింద పనిచేస్తున్న వంద నేరగాళ్ళు క్లోజ్ అవుతారో వాళ్ళని కనిపెట్టాలనుకున్నప్పుడు, ఓ ముగ్గురు ఘరానా పెద్ద మనుషుల వెనుక  సిద్ధార్థ్ ( అరవింద్ స్వామి) అనే సైంటిస్టు వున్నాడని అర్ధమవుతుంది. ఇతన్ని టార్గెట్ చేస్తాడు. ప్రభుత్వం తీసుకు రావాలనుకుంటున్న చవక ధరల జెనెరిక్ మందుల్ని అడ్డుకుని మెడికల్ మాఫియా ని కొనసాగించుకోవాలని సిద్ధార్థ్ చూస్తూంటాడు. దీనికి ధృవ  బీటలు కొట్టడం మొదలెడతాడు. ఇది గమనించిన సిద్ధార్థ్ ఒక కాల్పుల సంఘటనలో గాయపడ్డ ధృవ  శరీరంలోకి  మైక్రో చిప్ ని పెట్టించి అతడి కదలికల్ని, మాటల్నీ గ్రహిస్తూంటాడు. ధృవకి ఆప్తులైన వాళ్ళని టార్గెట్ చేసి ధృవని  బలహీన పర్చాలని చూస్తూంటాడు. ఈ పోరాటంలో చివరికి ఎవరిది, ఎలా పైచేయి అయ్యిందన్నదే మిగతా కథ.
ఎలావుంది కథ 
       ఒరిజినల్ కి ట్రూ కాపీ, అక్కడక్కడ చాలా స్వల్ప మార్పులు తప్పితే. ఇదొక మైండ్ గేమ్ తో కూడిన కథ అన్నారు. ఈ మైండ్ గేమ్ లో, మొత్తం కథా కథనాల్లో,  ఒరిజినల్లో వున్న సవాలక్ష తప్పులే దొర్లాయి. ఈ తప్పులతోనే తమిళంలో ఇలాగే హిట్టయింది కాబట్టి, ఆ సెంటిమెంటు పెట్టుకుని అలాగే తీసేశారు. ప్రేక్షకులందరూ తమ జీవితాల్లో అనుభవంలోకి రాని మైండ్ గేమ్స్ నీ, ఇతర ఇంటలెక్చువల్ అంశాలనీ తెలుసుకోగలిగే ఎక్స్ పర్ట్స్ కాలేరు కాబట్టి,  పైపైన యాక్షన్ చూసేసి ఇదే  చాలనుకోవచ్చు.  అయితే జయం రవితో తమిళ ప్రేక్షకులు వేరు, రాం చరణ్ తో తెలుగు ప్రేక్షకులు వేరు. జయం రవి,  రాం చరణ్ అంత పెద్ద స్టార్ కాదు. తమిళంలో  ఒక  స్టార్ డమ్, దాంతో వుండే అంచనాలూ వంటి ఏ బాదరబందీ లేకుండా ఒక న్యూవేవ్ థ్రిల్లర్ లాగా వచ్చి విజయం సాధించింది. తెలుగులో స్టార్ డమ్, దాంతో అంచనాలూ రెండూ వుంటాయి కాబట్టి,  అలాటి కమర్షియల్ మసాలాలూ లేని ఈ కథ ని ఒక సీరియస్ యాక్షన్ గా సిద్ధపడి చూడాల్సి వుంటుంది.
ఎవరెలా చేశారు 
        రాం చరణ్ చేయడానికి ఈ సినిమాలో ఒక సూపర్ ఎమోషన్ అంటూ, బాధ అంటూ లేదు. యాక్షన్ హీరోగా మాత్రమే చేసుకుంటూ పోతూ కన్పిస్తాడు. క్యారక్టర్ కి ఔటర్ యాక్షనే తప్ప, తన లాంటి స్టార్ తో  ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యే ఇన్నర్ యాక్షన్ లోపించడంతో ప్రేక్షకుల్ని అంతగా  సమ్మోహితుల్ని చేసే నటన కనపడదు. తనతో వుండే కామెడీ, అల్లరి. అలాటి పాటలూ వుండవు. క్లయిమాక్స్ కూడా ఏమాత్రం యాక్షన్ లేకుండానే ముగిసిపోవడం ఒక మైనస్సే. పైన చెప్పుకున్నట్టు జయం రవి స్థాయికి కి సరిపోయిన పాత్ర రాం చరణ్ కి చాల్లేదని కచ్చితంగా చెప్పాలి.
     ఇక హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కి తమిళం ఒరిజినల్లో  నయన తారకి లాగే పెద్దగా పాత్రలేదు. ప్రేమ కోసం వెంటపడే, పాటలు పాడే అవసరాలకి పనికొచ్చే గ్లామర్ బొమ్మ పాత్రగా వుండిపోతుంది. విలన్  గా వేసిన అరవింద్ స్వామి తమిళంతో తను వేసిన పాత్రకి డిటోనే. తమిళం చూడని ప్రేక్షకులకి కొత్తగా అన్పిస్తాడు. 
       టెక్నికల్ గా సినిమాతో వచ్చిన పెద్ద ఇబ్బంది ఏమిటంటే, హిప్ హాప్ తమిళ అనే కొత్తగా వస్తున్న సంగీత దర్శకుడి గందరగోళం గోల! ఎక్కడా ఒక్క నిమిషం కూడా తెరిపి నివ్వకుండా, చెవిపోటు వచ్చే  హారిబుల్ నేపధ్య సంగీతాన్ని వాయించేశాడు. అసలే కథా కథనాలు, సన్నివేశాలూ ప్రేక్షకులు బాగా బుర్ర పెట్టి ఆలోచిస్తూ చూడాల్సిన హైటెక్ –కొన్ని చోట్ల సైంటిఫిక్ మైండ్ గేమ్  అయితే, అలాటి ఏకాగ్రతకి అవకాశమే ఇవ్వకుండా  ఇష్టమొచ్చిన శబ్ద కాలుష్యాన్ని సృష్టిస్తూ థ్రిల్ ని చంపేశాడు. కనీసం ఏ కీలక డైలాగు దగ్గర తన హోరు ఆపితే ఆ డైలాగు ఎఫెక్టివ్ గా వుంటుందో కూడా తెలీనట్టు తలనొప్పి పుట్టించి వదిలాడు. దర్శకుడు సురేందర్ రెడ్డి దీనికి ఎందుకు అంగీకరించినట్టో తెలీదు. ఇక పాటలు ఘోరం. ఒక్క ఎస్ వినోద్ కెమెరా వర్క్ మాత్రం ఫర్వాలేదు. కానీ ఎంత స్టయిలిష్ చిత్రీకరణ వుండీ ఏం లాభం సంగీత దర్శకుడు అలావుంటే? 
చివరికేమిటి 
      ఒక స్టార్ సినిమాతో బి, సి సెంటర్ల ప్రేక్షకులకి అలవాటైన మసాలాలేవీ ఇందులో కన్పించవు. ఈ సినిమాని ఆ ప్రేక్షకులు ఒక మెట్టు పైకెదిగి రాం చరణ్ చేసిన ఒక డిఫరెంట్ ప్రయత్నంగా తీసుకుని చూడాలి. అయితే విషయం గ్రహించడానికి కష్టపడాల్సిన ఈ హైటెక్-సైంటిఫిక్  మైండ్ గేమ్స్ కంటెంట్ ని దెబ్బకొట్టే,  హిప్ హాప్ తమిళ సంకట సంకర సంకీర్ణ  సంగీతాన్ని గట్టిగా  కాచుకోవాల్సి వుంటుంది. ఎప్పుడు ఉండుండి ఏ విచిత్రమైన ట్యూన్లు వాయిస్తాడో తెలీదు. దాంతో ఈ ట్యూనేమిట్రా దేవుడా అని దృష్టి సీన్ల మీంచి చెదిరి ఆ ట్యూన్ల మీదికి పోతుంది. అతి పెద్ద విలన్ ఈ సినిమాకి హిప్పు హాప్పుల సంగీత దర్శకుడే. జీవితంలో కొట్టాల్సిన సంగీత పరికరాలన్నీ తెచ్చి కొట్టి పారేశాడు. ఇతణ్ణి ఒక్క సీనులోనైనా ఆ పరికరాలతో చూపించి వుంటే బావుండేది.
    
-సికిందర్
http://www.cinemabazaar.in

8, డిసెంబర్ 2016, గురువారం

రివ్యూ!


స్క్రీన్ ప్లే దర్శకత్వం : సుజోయ్ ఘోష్
తారాగణం : విద్యాబాలన్,అర్జున్ రాంపాల్, నైషా సింగ్, టునీషా శర్మ, అంబా సన్యాల్, మానినీ చద్దా, ఖరజ్ ముఖర్జీ, జుగల్ హన్స్ రాజ్ తదితరులు
కథ : సుజోయ్ ఘోష్, సురేష్ నాయర్, మాటలు : రీతేష్ షా
సంగీతం : క్లింటన్ సెరెజో, చాయాగ్రహణం : తపన్ బోస్
బ్యానర్ : బౌండ్ స్క్రిప్ట్ మోషన్ పిక్చర్స్, పెన్ ఇండియా లిమిటెడ్
నిర్మాతలు : సుజోయ్ ఘోష్, జయంతీలాల్ గడా
విడుదల :  2డిసెంబర్ 2016
***
          2012 కహానీకి సీక్వెల్ గా చెప్పుకుంటూ విడుదలైన కహానీ -2’ నిజానికి కొనసాగింపు కథేమీ కాదు, పాత్రలూ వేరు. కథ, పాత్రలు వేరైనప్పుడు సీక్వెల్ అనలేం. అయితే  దర్శకుడు సుజయ్ ఘోష్ దీనికింకో విధంగా చెప్పాడు- ‘కహానీఅనేదాన్ని  ఒక ప్రత్యేక  జానర్ కి పర్యాయపదంగా తీసుకోవాలని. స్త్రీని శక్తివంతంగా చూపించే జానర్ ని  కహానీఅనాలని. కాబట్టి  ఇకనుంచి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్ని కహానీ సినిమాలుఅనాలేమో. కానీ కహానీల్నిక్రైం ఎలిమెంట్స్ ని మిక్స్ చేస్తూ సుజయ్- విద్యా బాలన్ ద్వయం తప్ప ఇంకెవరూ తీయలేరనేంత  గట్టి ముద్ర వేసి వదుల్తున్నారు- మొదటి కహానీఎంత పవర్ ఫుల్లో, ఇప్పుడు రెండో కహానీ’  అంతకంటే పవర్ఫుల్ ! మధ్యలో వచ్చిన అనిరుథ్ రాయ్ చౌధురి- తాప్సీల పింక్లాంటివి అరుదుగా వస్తాయి. శక్తివంతమైన స్త్రీని చూపించడ మంటే ఇక్కడ ఏ ఉద్యమనాయకురాల్నో చూపించడం కాదు- నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యల్ని హీరోయిన్  పాత్ర చుట్టూ సస్పెన్స్  థ్రిల్లర్స్ గా చేసి చూపించడం. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్ని నేటి యూత్ ఫ్రెండ్లీ సినిమాలుగా మార్చి వినోదపర్చడం...సొమ్ము చేసుకోవడం... 

         
దివరకు చెప్పుకున్నట్టు బాలీవుడ్ లో బస చేసిన బెంగాలీ దర్శకులు విలక్షణమైన సినిమాలు తీస్తున్నారు. ఇటీవలే పింక్తర్వాత ఇప్పుడు కహానీ -2 అంతటి కళ్ళు తిప్పుకోనివ్వని పకడ్బందీ థ్రిల్లర్. సినిమా చూస్తూ రివ్యూ రైటర్ మెమోలో ఏదైనా పాయింటు ఫీడ్ చేసుకోవాలన్నా ఏకాగ్రత దెబ్బతినేసేంత బిగిసడలని కథాకథనాల క్రియేటివ్ ప్రాసెస్ ఇది. ఒక విద్యాబాలన్ కోమాలో కెళ్ళిపోయి, ఇంకో విద్యాబాలన్  హేండాఫ్ క్యారక్టర్లా యాక్షన్లో కొచ్చి  కుతకుతలాడే కసినంతా తీర్చుకునే విలాసవంతమైన క్వాలిటీ మూవీ...

కథ 
      విద్యా సిన్హా (విద్యా బాలన్) ఒక ఉద్యోగం చేసుకుంటూ పధ్నాల్గేళ్ళ  కూతురు మిన్నీ (టునీషా శర్మ) ని పోషించుకుంటూ వుంటుంది. కాళ్ళు పడిపోయిన కూతురు చక్రాల కుర్చీకీ, మంచానికీ బందీ అయిపోయి వుంటుంది. ఉంటున్నది కలకత్తా దగ్గరలో చందాపూర్ అనే చిన్న టౌన్లో. కూతురికి వైద్యం అమెరికాలో సాధ్యపడుతుందని డాక్టర్ అంటే  అమెరికా తీసికెళ్ళే ప్రయత్నాల్లో వుంటుంది. ఇంతలో కూతుర్ని కిడ్నాప్ చేశామని కాల్ వస్తుంది. విద్యాసిన్హా ఆదరాబాదరా పరిగెడుతూ యాక్సిడెంట్ పాలయ్యి కోమాలో కెళ్ళిపోతుంది. సబిన్స్ పెక్టర్ ఇందర్జిత్ సింగ్ (అర్జున్ రాంపాల్) రంగంలో కొస్తాడు. కోమాలో వున్న విద్యా సిన్హాని చూడగానే షాకవుతాడు. డాక్టర్ ఆమె ఐడీ చూపించి, ఈమె విద్యా సిన్హే అంటాడు. కాదు ఈమె కలింపాంగ్ లో వుండాల్సిన దుర్గా రాణీ  సింగ్ అని ఇందర్జిత్  సింగ్ ఆమె ఇంటికెళ్ళిపోయి  సోదా చేస్తాడు. ఓ డైరీ దొరుకుతుంది. ఆ డైరీ చదువుతూంటే దిమ్మదిరిగిపోతుంది...

      తర్వాత పైఅధికారి ఇందర్జిత్ కి ఒక హేండ్ బిల్ అందించిఈ వాంటెడ్ కిల్లర్ ని పట్టుకోవాలని ఆదేశిస్తాడు. ఆ ఫోటో చూస్తే దుర్గా రాణీ సింగ్ దే. కలింపాంగ్ లో ఎనిమిదేళ్ళ క్రితం ఒక మర్డర్ చేసి, ఇంకో కిడ్నాప్ చేసి పారిపోయిన దుర్గా రాణీ సింగ్ ని పట్టుకుంటే ప్రమోషన్ వస్తుందంటాడు పై అధికారి. ఒకవైపు కోమాలో వున్న విద్యాసిన్హా, ఇంకో వైపు చేతిలో దుర్గా రాణీ సింగ్ గురించిన డైరీ...ఇందర్జిత్ కి బుర్ర వేడెక్కిపోతుంది.

        అసలు విద్యా సిన్హాగా పేరు మార్చుకున్న దుర్గా రాణీ సింగ్ ఎవరు? ఆమె ఎందుకు ఎవర్ని మర్డర్ చేసి, ఎవర్ని కిడ్నాప్ చేసింది? ఇప్పుడు కిడ్నాపైన కూతురు ఎక్కడుంది? ఎవరు ఎందుకు కూతుర్ని కిడ్నాప్ చేశారు? కోమాలో వున్న విద్యా సిన్హా కి మాత్రమే  తెలిసిన ఈ కూతురి కిడ్నాప్ గురించి ఇందర్జిత్ సింగ్ ఎప్పుడు తెలుసుకున్నాడు? విద్యాసిన్హా కోమాలోంచి మేల్కొంటుందా లేదా? ఈలోగా ఇందర్జిత్ సింగ్ పై అధికారినుంచి విషయాలు దాస్తూ ఏం పాట్లు పడ్డాడు? అసలెందుకు విషయాలు దాస్తున్నాడుపెళ్ళయిన ఇతడికి దుర్గా రాణీ సింగ్ తో వున్న సంబంధమేమిటి? ఈ సంబంధం బయటపడితే పీక్కునే దేంటి?....ఇన్ని చిక్కు ప్రశ్నలన్నిటికీ ఒకటే సమాధానం. అదేమిటో తెరపైనే చూడాలి.

ఎలావుంది కథ 
      ఈ పైకి కన్పిస్తున్నదంతా కథ కాదు. ఇదంతా ఇంకో కథకి కథ. 2014 లో ఆలియా భట్- రణదీప్ హుడా లతో ఇంతియాజ్ అలీ తీసిన హైవేలో చివర బయట పడే కథే, ‘కహానీ -2’  లో మందు
పాతరలా మధ్యలో పేల్తుంది. కాకపోతే హైవేలో అది హీరోయిన్ ఆలియా భట్ పాత్ర అనుభవమైతే, ‘కహానీ -2’ లో బాల పాత్ర మిన్నీ వ్యధ. ఎక్కడో ఓ చోట, ఇళ్ళల్లో  చిన్న పిల్లలతో  పాల్పడుతున్న చైల్డ్ ఎబ్యూజ్ అనేది ఎవ్విరీ డే న్యూజ్ లాగా మారిపోయిన ప్రస్తుత కాలంలో, అందులోంచి తనకేమీ కాని ఆరేళ్ళ ఓ పిల్లని కాపాడేందుకు ఓ సాధారణ స్కూలు ఉద్యోగిని తెగించి ఏమేం చేసిందన్నది, ఈ క్రమంలో ఏమేం కోల్పోయిందన్నదీ అసలు కథ. నిత్యజీవితంలో సమస్యల్ని ఇంకా ప్రేక్షకుల్ని ఏడ్పిస్తే డబ్బులొస్తాయనే రొడ్డకొట్టుడు ఏడ్పు కథగా కాకుండా, సస్పెన్స్ థ్రిల్లర్ గా చేసి చూపిస్తూఓ సరికొత్త వీక్షణానుభవాన్నిచ్చే వుమన్ ఎంపవర్ మెంట్ కథ.

ఎవరెలా చేశారు
     విద్యాబాలన్ గురించి ఇంకా చెప్పుకోవాల్సిందేముటుంది. సరైన పాత్ర ఇస్తే దాని దుంపతెంచుతుంది. మేకప్ కూడా అవసరం లేకుండా నటించి పారేస్తుంది. గ్లామర్ కోసం పాత్ర లబోదిబోమన్నా చెప్పినట్టు పడుండమంటుంది. ఫ్రీ స్టయిల్ నటన ఆమెది. రెండు పాత్రలతోనూ  సస్పెన్స్ థ్రిల్లర్ ని హై వోల్టేజ్ డ్రామాలాగా మార్చేస్తుంది. ఫ్లాష్ బ్యాక్ పాత్ర ( దుర్గా రాణీ సింగ్)కి వ్యతిరేకంగా సంపన్నుల కుటుంబం, స్కూలు యాజమాన్యం, లేడీ కానిస్టేబుల్ చేసే అన్యాయాలకి తనదైన వ్యూహరచనా సామర్ధ్యంతో ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంది. మళ్ళీ ప్రస్తుత  విద్యాసిన్హా పాత్రలో వాంటెడ్ కిల్లర్ గా చందా నగర్ నుంచీ కలకత్తా దాకా పోలీసుల్ని కిందామీదా చేసేస్తుంది. మిన్నీని అమెరికా తీసికెళ్ళే తన ప్రయాణాన్ని ఎవరూ ఆపలేరు- ఆపితే అయిపోయారన్నట్టే ఒక్కొక్కళ్ళూ. ఆమెని కిల్లర్ గా భావించుకునే మనుషులేగానీ, ఆమె తల్లికాని తల్లి  మనసుని కూడా ఎవరూ పట్టించుకోని విషాదం పాత్రచుట్టూ వుంటుంది. స్కూల్ టీచర్లు స్టూడెంట్స్ ని సొంత పిల్లల్లాగా చూసుకుంటారో లేదో గానీ, ఒక స్కూలు క్లర్క్ గా, పెళ్ళికాని దుర్గా రాణి ఎందుకు ఒక స్కూలు బాలిక కోసం సింగిల్ మదర్ గా జీవితాన్ని డిసైడ్ చేసుకుందన్నది పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నకి ఆమె కథే సమాధానం. విద్యాబాలన్ వి ఈ రెండూ ఆదర్శ పాత్రలు

    సబిన్స్ పెక్టర్ గా అర్జున్ రాం పాల్ ది కూడా చాలాసహజ  పాత్ర
కాస్త ఏమీ పట్టని తత్త్వంతను వస్తూంటే కానిస్టేబుల్ కూర్చుని వున్నా పెద్దగా పట్టించు
కోడు
ఎంక్వైరీ కెళ్ళినప్పుడు పేపరు చదువుకుంటున్న  ఒకడ్ని అడ్రసు అడిగితే,  వాడు పేపరు పేపరు చదువుకోవడమే తప్ప తనని పట్టించుకోకపోయినా-  ఏం చేస్తాం..అనుకుంటూ వెళ్ళిపోయే రకం  అర్జున్ రాం పాల్ సబిన్స్ పెక్టర్ పాత్ర.  కోపమనేదే వుండదుఇదే బెంగాలీ బ్యాక్ డ్రాప్ లో కహానీ’ లో కూడా పోలీసు పాత్రలు ఇలాటి  డిఫరెంట్ ఫీల్ నే ఇస్తాయిఅర్జున్ రాం పాల్ లాగే  పై అధికారి పాత్రలో ఖరజ్ ముఖర్జీ ఆసక్తికర పాత్ర పోషించాడు.

        మిన్నీగా ఆరేళ్ళ బాలికగా నైషా ఖన్నా నటిస్తేపధ్నాల్గేళ్ళ బాలికగా టునీషా శర్మ నటించిందిఇద్దరూ లైంగికంగా తనకేం జరుగుతోందో తెలీని పసితనపు  మిన్నీ అంతరంగాన్ని సున్నితంగా ఆవిష్కరించారుమిన్నీ నానమ్మ పాత్రలో అంబా సన్యాల్ ది టెర్రిఫిక్ నటనఆమె కొడుకు పాత్రలో జుగల్ హన్స్ రాజ్లేడీ కానిస్టేబుల్ పాత్రలో మానినీ  చద్దా మరో రెండు నెగెటివ్ పాత్రలు పోషించారు.  

      నటనలకినటింప జేయడాలకీ ఒక పర్ఫెక్ట్ గైడెన్స్ లా వుంటుంది దర్శకుడి ప్రతిభక్లింటన్ సెరేజో సంగీతం లోని మూడు బ్యాక్ గ్రౌండ్ పాటల్లో లమ్హోకే రస్ గుల్లే’ ( రసగుల్లా ల్లాంటి క్షణాలుపాట టాప్తపన్ బసు ఛాయాగ్రహణం రియల్ లోకేషన్స్ లోముఖ్యంగా నైట్ ఎఫెక్ట్స్ లో ఓ కళాత్మక చిత్రణసబ్ కాన్షస్ గా ప్రేక్షకుల్ని సన్నివేశాల్లో సంలీనం చేసేందుకు బ్యాక్ గ్రౌండ్ లో వెలిగే వర్ణ కాంతులతో ఒక అద్భుత ప్రయోగం చేశారురోడ్ల మీద పసుపు పచ్చ కాంతి ప్రసరింపజేయడం కూడా అందులో ఒకటి. ‘బ్యాక్ టు ది ఫ్యూచర్’ లో వివిధ రూపకాలంకారాల్ని వాడినట్టు ఇక్కడ వర్ణకాంతుల్ని ఉపయోగించారుసినిమాకి ఛాయాగ్రహణంతో కూడా చాలా పనుంటుందని ఇక్కడ నిరూపించారుకథ కాన్షస్ లెవెల్లో ప్రేక్షకులకి అందితేఇలాటి ఛాయాగ్రహణం లోతుగా సబ్ కాన్షస్ లెవెల్ కి తీసికెళ్తుందిఒక హిప్నాటిక్ లోకాన్ని సృష్టిస్తుందిబెంగాల్లోని చందా నగర్కలింపాంగ్కలకత్తా లొకేషన్స్  కాసేపు ఈ హిందీ సినిమాని కొత్త లోకాలకి తీసికెళ్తాయి.

చివరికేమిటి 
       మొదలెట్టింది లగాయత్తూ  ముగిసేదాకా ఒక్క క్షణం కూడా కళ్ళు తిప్పుకోనివ్వని సస్పెన్స్ థ్రిల్లర్ గా దీన్ని రెండు మూడు సార్లు చూడొచ్చు. ప్రతి సీనూ, ప్రతీ షాటూ క్షణం క్షణం కథని ముందుకు పరిగెత్తించేవే తప్ప ఎక్కడా కథని ఆపి కాలక్షేపం కోసం లేవు. చాలా పూర్వం అగర్, ఔర్ కౌన్ లలాంటి సస్పెన్స్ థ్రిల్లర్స్ ని గుర్తుకు తెచ్చేలా వుండే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఇప్పటి కాలానికి హై టెన్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ గా మారింది. మొదటి పదినిమిషాల్లోపు పాత్రకి యాక్సిడెంట్ అయ్యే ప్లాట్ పాయింట్ వన్ వచ్చేసిమళ్ళీ చివర పదిహేను  నిమిషాల  ముందు పాత్ర కోమాలోంచి లేవడంతో ప్లాట్ పాయింట్ టూ వచ్చేసి- మధ్యలో అంతా  గత/ వర్తమాన కాలపు యాక్షన్స్ తో సంక్షుభితంగా వుంటుంది మిడిల్. నడుస్తున్న కథకి ఎలా స్పష్టమైన బిగినింగ్-మిడిల్-ఎండ్ లుంటాయో, అలా  గడిచిపోయిన కథకీ వుంటాయి. డైరీపేజీల్లోంచి వంతులవారీగా వచ్చే ఫ్లాష్ బ్యాక్స్ తో ఈ గడిచినపోయిన కథ వుంటే, ప్రస్తుత కాలంలో కేసుతో పోలీసుల సంఘర్షణగా  వుంటుంది

        పకడ్బందీ రచన, పకడ్బందీ నటనలు ఎందుకు సాధ్యం కావు మనసుంటే- ఏదో నడిచిపోతుందని స్టార్ వేల్యూ మీద ఆధారడిపోయి చుట్టేస్తే అదొక సినిమా అన్పించుకుంటుందా? ప్రేక్షకులు దొంగ నోట్లు ఇవ్వడంలేదు దొంగ సినిమాలు చూపించడానికి- దొంగ సినిమాల మధ్య అప్పుడప్పుడు ఇలాటి దొర సినిమాలు వస్తున్నా, తేడా పసిగట్టలేని ప్రేక్షకులు వుంటున్నందువల్లే బరితెగించి దొంగ సినిమాలు వస్తూంటాయి.... ‘కహానీ -2’ దొరసాని సినిమా!


-సికిందర్
http://www.cinemabazaar.in











3, డిసెంబర్ 2016, శనివారం

రివ్యూ!





రచన - దర్శకత్వం : వైశాఖ్
తారాగ‌ణం: మోహ‌న్‌లాల్‌, క‌మ‌లినీ ముఖ‌ర్జీ, జ‌గ‌ప‌తిబాబు, లాల్‌, విను మోహ‌న్ బాల త‌దితరులు
క‌థః ఉద‌య్ కృష్ణ‌, సంగీతం: గోపీసుంద‌ర్‌, ఛాయా గ్రహ‌ణం: షాజీ కుమార్‌
బ్యానర్ :
 శ్రీ స‌ర‌స్వ‌తి ఫిలిమ్స్
నిర్మాత: సింధూర‌పువ్వు కృష్ణారెడ్డి
విడుదల : డిసెంబర్ 2, 2016
***


      మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ మధ్య తెలుగు ప్రేక్షకుల  మధ్యకి వరసగా వచ్చేస్తున్నాడు. మనమంతా, జనతా గ్యారేజ్ ల వంటి డైరెక్టు తెలుగు సినిమాలతోనే తెలుగు ప్రేక్షకుల్లో గుర్తిపు సంపాదించుకున్న మోహన్ లాల్, ఇప్పుడు  మూడో ప్రయత్నంగా మలయాళ డబ్బింగ్ ‘మన్యం పులి’ (పులి మురుగన్) తో విచ్చేశాడు. మలయాళం లో ఇది నూట పాతిక కోట్లు వసూలు చేసిందని చెప్పుకుంటున్నారు. భారీ సెట్టింగులు, లొకేషన్లు, కాస్ట్యూమ్స్, తారాగణం, గ్లామర్ మొదలైన రెగ్యులర్ కమర్షియల్ హంగులేవీ లేకుండానే పాతిక కోట్ల బడ్జెట్ తో తీసి, నూట పాతిక కోట్లు సంపాదించుకోవడం రికార్డే. అదీ కేరళ లాంటి చిన్న మార్కెట్ లో. ఏమైనా సినిమా తీయడంలో ఈ కొత్త బేసిక్స్ ని ఆహ్వానించాల్సిందే. అయితే ఇది ప్రేక్షకుల బేసిక్ ఇన్ స్టింక్ట్స్ ని సొమ్ముచేసుకోవడం అవుతుందేమో ఆలోచించాలి...

 కథ       అది పులియూర్ అనే మన్యం ప్రాంతం. అక్కడ  పులులు మనుషుల్ని చంపి తింటూంటాయి. పదేళ్ళ కుమార్ అలియాస్ కుమారస్వామి తండ్రిని కూడా పులి తినేస్తుంది. అంతకి ముందే తల్లి చనిపోతుంది. చిన్నపిల్లాడుగా వున్న  తమ్ముడు మణి తో మిగులుతాడు. తండ్రిని చంపిన పులిని చంపడం కోసం తర్ఫీదు  పొందుతాడు. ఆ పులిని వలపన్ని చంపేస్తాడు. పెద్దయ్యాకా మన్యంలోనే స్థిరపడి లారీ డ్రైవర్ గా బ్రతుకుతూంటాడు. మరోవైపు మనుషులని చంపుతున్న పులుల్ని చంపుతూంటాడు. దీంతో చట్టం దృష్టిలో పడతాడు. ఫారెస్ట్  రేంజర్ (కిషోర్) కుమార్ ని పట్టుకోవాలని ప్రయత్నిస్తూంటాడు. కుమార్ ప్రేమిస్తున్న మన్యం పిల్ల మైనా (కమలినీ ముఖర్జీ) మీద కన్నేస్తాడు. అతన్నుంచి తప్పించుకున్న ఆమెని  కుమార్ పెళ్లి చేసుకుంటాడు. కూతురు పుడుతుంది, అయినా రేం జర్ ఆమెని వదిలిపెట్టడుతాడు. రేంజర్ ని చిత్తుగా తంతాడు కుమార్. రేంజర్  ట్రాన్స్ ఫర్ అయి వెళ్ళిపోతాడు. కుమార్ తమ్ముడి స్నేహితులు ఆయుర్వేద పరిశోధనలకోసం మన్యం వస్తారు. ఆ గంజాయి మొక్కల్ని లారీ కెక్కించుకుని కుమార్ ని రమ్మంటారు. ఆయుర్వేద కంపెనీలో తమ్ముడికి జాబ్ ఇప్పిస్తామని తీసుకుపోతారు. అక్కడ డాడీ గిరిజ (జగపతి బాబు) అనే కంపెనీ ఓనర్ దగ్గర బస చేస్తారు.  కట్ చేస్తే, ఆ డాడీ కుమార్ ని చంపడం కోసం తిరుగుతూంటాడు. ఎందుకు? కుమార్ వల్ల ఇతడికేం నష్టం జరిగింది? ఏమిటా కథ?...అన్నది తెర మీద చూడాలి.

ఎలావుంది కథ  
       చాలా అతుకుల బొంతలా వుంది. మొదటి అరగంట చూసి నిద్రపోయి, చివరి అరగంట చూస్తే చాలు- ఎందుకంటే ఇవి యాక్షన్ సీన్సు గనుక. యాక్షన్ సీన్స్ తప్ప ఈ సినిమాలో కథని భరించడం కష్టం. మృగం (పులి) మానవ  మృగం (జగపతిబాబు పాత్ర) అనే కాంట్రాస్ట్ పెట్టి వీటితో హీరో తలపడే కథ పూర్తిగా ఉద్దేశం అంతుచిక్కని అతుకులబొంత కథ. పులి- పులి వేట అనగానే ఎవరికైనా జిమ్ కార్బెట్ (1875-1955) గుర్తుకొస్తాడు. ఆనాడు బ్రిటిష్ ఇండియాలో బ్రిటిష్ హంటర్ అయిన ఇతను నరమాంస భక్షక పులుల్ని సంహరించేవాడు ప్రభుత్వ  ఆదేశాలతో. మనిషిరక్తం రుచి మరిగిన పులులు  సమీప గ్రామాల్లోకి వచ్చి దాడి చేసేవి. వీటిని పట్టుకుని షూట్ చేసేందుకు జిమ్ కార్బెట్ అడవుల్లో చేసే ప్రాణాంతక సాహసాలు గగుర్పాటు కల్గించే విధంగా వుంటాయి. మన్యంపులి కథలో పులులు గ్రామాల మీద దాడి చేయవు. అడవుల్లో ఉంటున్న వాళ్ళ  మీదే  పడుతూంటాయి. ఒక సీనులో ఒక పాత్ర ఓ పాముని పట్టుకుని సురక్షితంగా వదిలిపెడుతూ- ఇది వున్న చోటుకి మనం రావడం తప్పంటాడు. అందుకని దాన్ని చంపకుండా పక్కకి తీసికెళ్ళి వదిలేస్తాడు. మరి ఇది పులులకీ వర్తించదా? పులులుండే చోట మనుషులు ఎందుకుండాలి? అవి చంపుతున్నాయని వాటినెందుకు చంపడం? రెండోది, బాల్యంలో హీరో తండ్రిని చంపిన పులి అదే అని ఎలా గుర్తు పట్టి చంపాడు? జిమ్ కార్బెట్ గ్రామం మీద దాడి చేసిన పులి అడుగుజాడల్ని పరిశోధించి, వాటి ఆధారంగా అడవుల్లో సదరు పులిని అన్వేషించే వాడు. దానికోసం మంచె కట్టుకుని దాని మీద రేయింబవళ్ళు గడిపేవాడు. జిమ్ కార్బెట్ ఒక లెజెండ్. పులులతో తన అనుభవాల గురించి ఆయన రాసిన పుస్తకం చదివితే పులుల గురుంచి అంతా తెలిసిపోతుంది- వాటి స్వభావం, జీవనం, జిత్తులు సమస్తం. జిమ్ కార్బెట్ పేర ఉత్తరాఖండ్ లో నేషనల్ పార్క్ ఏర్పాటయ్యింది. 

        మన మన్యం హీరో అసలే అంతరించిపోతున్న పులి జాతిని అలా చంపుతూంటే మనకే కోపం వస్తుంది. దాన్ని హీరోయిజంగా తీసుకుని ఎలా ఎంజాయ్ చేయగలం. ఎప్పుడో చిన్నప్పుడు ఒక పులి దాని స్వభావం కొద్దీ తండ్రిని చంపిందని జీవితాంతం పులుల మీద ద్వేషం పెంచుకునే మానసికంగా ఎదగని, ఓ మానసిక పీడితుడి కథని ఓ హీరో మీద చూడ్డం  విజ్ఞులకి కష్టమే. ఈ కథ పర్యావరణానికే గాక, చట్టాలకీ వ్యతిరేకమని భావించాల్సి వుంటుంది. 

ఎవరెలా చేశారు
       
డ్డలుంగీ కట్టుకుని మాస్ పాత్ర నటించిన సూపర్ స్టార్ మోహన్ లాల్ అసలీ పాత్రద్వారా ఏం చెప్పాలనుకున్నాడో అర్ధంగాదు. పులుల్ని చంపే యాక్షన్ సీన్స్ కోసం మాత్రమే తనని చూడాలనుకున్నట్టు తయారయ్యిందే తప్ప మరొకటి కాదు. తన కుటుంబం పట్ల, స్నేహితులపట్లా  కనబర్చే మానవీయ కోణం ఏ దశలోనూ పులుల పట్ల ప్రదర్శించని -క్యారక్టర్ గ్రోత్, క్యారక్టర్ ఆర్క్ లేని, కథలో ఒక గోల్ లేని, దిశాదిక్కూ లేని పాత్రగా మిగిలిపోయాడు. ఒక చోట కమలినీ ముఖర్జీ పాత్రచేత తన్నించుకోవడం, ఇంకోచోట జగపతి బాబు పాత్ర కాళ్ళు పట్టుకోవడం లాంటి భేషజాలు లేని వ్యక్తిత్వాన్ని ఒక స్టార్ గా ప్రదర్శించినా- కాస్త మనసున్న ప్రేక్షకుల కోసం, ఇదే వినయాన్ని  కనీసం చివర్లోనైనా  పులులతో కూడా చాటుకోవాల్సింది. 

        కమలినీ ముఖర్జీది ఉత్తుత్తి రుసరుస లాడే పాత్ర కామెడీ కోసం. జగపతిబాబు పాత్ర ఇచ్చే బిల్డప్పులు ఓపెనింగ్ లో, ఇంటర్వెల్ లో ఎందుకోసమా అని చూస్తే చివర తేలేది సరుకులేని మ్యాటరే. 

        తెలుగులో మంచి సంగీతం ఇస్తున్న గోపీ సుందర్ ‘మన్యం పులి’ లో షాకింగ్ గా తలనొప్పి మ్యూజిక్ ఇచ్చాడు. నేపధ్య సంగీతం కూడా చాలా పూర్ గా వుంది- దీన్ని కవర్ చేయడానికి హోరెత్తించే సౌండ్ ఎఫ్ఫెక్ట్స్ రుద్దారు. డబ్బింగ్ కూడా నీటుగా లేదు- బి గ్రేడ్ సినిమాల్లో లాగా ప్రతీ డైలాగూ అరిచి (లౌడ్) మాట్లాడ్డమే. షాజీ కుమారన్ కెమెరా వర్క్, పీటర్ హెయిన్స్ యాక్షన్ కోరియోగ్రఫీ, సీజీ వర్క్, ఇవే సినిమాలో కాస్త నయమన్పించే అంశాలు.

        దర్శకుడు వైశాఖ్ దర్శకత్వంలో, రచనలో పూర్తిగా విఫలమయ్యాడు- విఫలమయ్యాడు అనేకంటే చవకబారు పనితం కనబర్చాడనండం న్యాయం. చాలా పాత కాలం ‘బి’ గ్రేడ్ సినిమా చూస్తున్నట్టు వుంటుంది. సీన్లు, కామెడీ, కథ అల్లిక మొదలైనవి చవకబారుగా వున్నాయి. ఎక్కడా కథనంలో టెన్షన్ అనేదే వుండదు. సీన్లు చప్పగా వచ్చిపోతూంటాయి. స్క్రీన్ ప్లే అనే మాటే ఇక్కడ వర్తించదు. కేవలం పేటర్ హెయిన్స్ యాక్షన్ ప్లే గురించే చెప్పుకోవాలి. ఇదంతా మాస్ కి వర్కౌట్ అయిపోతుంది. మలయాళం లో కామెడీ సీన్లు వర్కౌట్ అయ్యాయోమో గానీ, తెలుగులో వీటిని తీసిపడేస్తే చీకాకు తప్పుతుంది.  

చివరికేమిటి
        రోజుల్లో పులుల్ని చంపడం నేరంగా కాదు, హీరోయిజంగా చూపించారు. ఇదే ఈ సినిమా ఇస్తున్న మెసేజ్. ఇందుకే హిట్టయింది. ఇక ఈసారి ఇంకో అడుగు ముందుకేసి వీరప్పన్ ఏనుగుల్ని ఎలా చంపాడో ఆ కథతో కూడా తీస్తే బాగా హిట్టవుతుంది. డిస్కవరీ ఛానెల్లో అమాయక జంతువుల్ని వెంటాడి చంపే పులుల్ని  షూట్ చేసి చంపినట్టు కూడా చూపిస్తే ఛానెల్ టీఆర్పీ బాగా పెరిగిపోతుంది...

-సికిందర్
http://www.cinemabazaar.in


       




1, డిసెంబర్ 2016, గురువారం

రివ్యూ!



దర్శకత్వం : ప్రదీప్ కృష్ణ మూర్తి
తారాగణం : విజయ్ ఆంథోనీ, అరుంధతీ నాయర్, చారు హాసన్, వైజి మహేంద్ర, సిద్ధార్థ్ శంకర్, మీరా కృష్ణన్ తదితరులు
రచన : ప్రదీప్ కృష్ణ మూర్తి- జో డీ క్రజ్, కార్తీక్ కృష్ణ, సంగీతం : విజయ్ ఆంథోనీ, ఛాయాగ్రహణం : ప్రదీప్ కలిపురయత్
నిర్మాత : ఫాతిమా విజయ్ ఆంథోనీ
విడుదల : డిసెంబర్ 1, 2016
***
         ‘బిచ్చగాడు’ తో బాగా పాపులర్ అయిన తమిళ హీరో – సంగీత దర్శకుడు విజయ్ ఆంథోనీ ఈసారి బేతాళుడుగా మారి సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ ని ప్రయత్నించాడు. రొటీన్ ఫార్ములా సినిమాలకి భిన్నమైన సబ్జెక్టులు చేస్తున్న ఆంథోనీ ‘బిచ్చగాడు’ తో ప్రేక్షకుల హృదయాల్లో బాగా నాటుకుపోయాడు. ‘బిచ్చగాడు’ పూర్తిగా మానవ విలువలకి సంబంధించిన సార్వజనీన ఎమోషనల్ డ్రామా కావడంతో దాన్ని ప్రాంతాలకతీతంగా ఆదరించారు. ఐతే ‘బేతాళుడు’ లో సార్వజనీనతని  కాసేపు పక్కన పెట్టి,  తన పాత్రవరకే పరిమితమయ్యే ఎమోషన్స్ తో, సైకలాజికల్ థ్రిల్లర్స్ ని ఇష్టపడే ప్రేక్షకులకోసం తీశాడు.

         ఈ ప్రోత్సాహంతో అన్నట్టు దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తి కూడా ఎలాటి కమర్షియల్ అంశాల జోలికీ వెళ్ళకుండా ‘ బేతాళుడు’ని ఒక సీరియస్ కేస్ స్టడీ లాగా తీశాడు. ఐతే ఈ కేస్ స్టడీ కూడా ఎంతవరకు నిలబడిందన్నది ప్రశ్న. వివరాల్లోకి వెళ్తే గానీ ఇది తేలదు...

కథ 
     ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేసే దినేష్  చిత్తభ్రాంతులకి  లోనవుతూంటాడు. తనలో ఇంకో వాయిస్ ఎవరిదో విన్పిస్తూంటుంది. అమాంతం పనిచేస్తున్న సిస్టం లోంచి చెయ్యి వచ్చి దాడి చేస్తుంది. ఆ వాయిస్ ఇంకా రకరకాల సమస్యలు సృష్టిస్తూంటుంది. ఇదంతా ఐశ్వర్య ( అరుంధతీ నాయర్) ని పెళ్లి చేసుకున్నప్పట్నించే జరుగుతూంటుంది. మిత్రుడి సలహాతో సైకియాట్రిస్టుని సంప్రదిస్తాడు. ఆ సైకియాట్రిస్టు హిప్నటైజ్ చేసి దినేష్ తల్లి గర్భంలో వున్నంత వరకూ తీసికెళ్తాడు. అయినా అతడి మానసిక సమస్యకి మూలం దొరకదు. ఇక పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ తో గత జన్మలోకి తీసికెళ్తాడు. అప్పుడు గతజన్మలో మాచర్లలో శర్మగా పుట్టి టీచర్ గా పనిచేసిన దినేష్ కి,  భార్య జయలక్ష్మి వల్ల మరణం సంభవించిందని తెలుస్తుంది. ఆ జయలక్ష్మి మీద ఇప్పుడు పగదీర్చుకోవడం కోసమే శర్మ వాయిస్, దినేష్ లోపల చేరి ఇబ్బంది పెడుతోందని అర్ధమవుతుంది. ఆ జయలక్ష్మి ఎవరు?  ఆమెతో శర్మకి అసలేం జరిగింది? పెళ్ళికి ముందే శర్మతో వున్న పిల్ల వాడెవడు? పెళ్లి తర్వాత శర్మకి పుట్టిన పిల్లాడికి ఏమైంది?...ఈ ప్రశ్నలకి సమాధానాల కోసం దినేష్ మాచర్లకి ప్రయాణం కడతాడు...

ఎలావుంది కథ 
       మొదటే చెప్పుకున్నట్టు ఇదొక సైకలాజికల్ కేస్ స్టడీ. అయితే గతజన్మలు వున్నాయో లేదో, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అనే ప్రక్రియ విశ్వసనీయ
మైనదో కాదో, అలాగే  గత జన్మలో మనిషి ఈ జన్మలో ఆవహిస్తాడనడానికి శాస్త్రీయ నిరూపణలున్నాయో లేదో,  అలాగే అసలిదంతా కేవలం మనుషులు హిస్టీరియాకి లోనై  ప్రవర్తిస్తారేమో ...అన్నవి తేల్చే జోలికి  పోలేదు సరికదా, పరస్పర విరుద్ధ వాదనలు చేసిందీ కథ. ఎలాగంటే  హీరోకి ఎవరో క్లినికల్ పరిశోధనల్లో భాగంగా ఓ మందు ప్రయోగించడం వల్ల అది బ్రెయిన్ ని స్నాప్ చేసి పూర్వజన్మలోకి తీసికెళ్ళిందని చెప్తారు. అది పూర్వ జన్మలోకి తీసికెళ్ళిందో, అలా ఫీలయ్యే చిత్తభ్రాంతులకి (హేల్యూసినేషన్స్) కి లోను చేసిందో ఎవరికి  తెలుసు? శాస్త్రీయంగా ఏదీ తేల్చకపోయినా,  పూర్వజన్మల కథ అనే తలపండిన బాక్సాఫీసు ఫార్ములాకి పరిమితం చేసి ఈ కథ చెప్పివున్నా అదో అందం.  బాక్సాఫీసు ఫార్ములానే మందు ప్రయోగంతో అభాసు చేసుకుంటే ఇదే కథో అర్ధంగాకుండా పోతుంది. అర్ధమై నమ్మాలన్నా ఏ కథని నమ్మాలో అర్ధంగాని పరిస్థితి  : శర్మ ఆత్మ తానుగా పగదీర్చుకోవడానికి సహజంగా దినేష్ లో తిష్ట వేసిన పారానార్మల్ థ్రిల్లర్ కథానా, లేకపోతే మందువల్ల బ్రెయిన్ లో తేడా వచ్చి  పూర్వజన్మ ని చూసిన సైకలాజికల్ కథానా? కథకి ఉండాల్సిన ఏకసూత్రత పాటింపు ఇక్కడ జరగలేదు. 

ఎవరెలా చేశారు
      పాత్రమేరకు విజయ్ ఆంథోనీ  చక్కగా నటించాడు, నీటుగా కూడా నటించాడు. ఈ కాలపు దినేష్ గా, పాత కాలపు శర్మగా నటుణ్ణి నిలబెట్టుకున్నాడు. క్లయిమాక్స్ లో ఒక యాక్షన్ సీన్లో మాత్రం బేతాళ ప్రతాపం చూపించలేదు. మామూలు హీరోలాగానే ఫైట్ చేశాడు. ఆ ఇంజెక్షన్ చేసింతర్వాత ఎలా ప్రవర్తిస్తాడో చూద్దామని అంటాడు విలన్. ఆ ఇంజెక్షన్ తో అతను బేతాళుడిగా మారిపోయి ప్రళయ బీభత్సాన్ని  సృష్టిస్తాడని మనమాశిస్తే అడియాసే అవుతుంది. విజయ్ ఆంథోనీ ఒక వెరైటీ పాత్రనైతే చేశాడన్పించుకున్నాడుగానీ, వెరైటీ అంతగా దమ్ము లేకుండాపోయింది. 

     హీరోయిన్ అరుంధతీ నాయర్ కూడా ఐశ్వర్యగా ఈ జన్మ పాత్రలో,  జయలక్ష్మిగా గత జన్మ పాత్రలో నటించింది. ఆధునికత్వం, గ్లామర్ అనే వాటికి  దూరంగా సంసారపక్షంగా వుండే రూపు రేఖలామెవి. లావు కూడా ఆ వయస్సుకి ఎక్కువే. ఐశ్వర్య పాత్రలో సస్పెన్స్ వుంది. ఈ సస్పెన్స్  పాత్ర ఫీలయ్యేది కాదు, మనం ఫీలయ్యేది. చివరికి ఈ పాత్రని జస్టిఫై చేయడం కష్టమే. ఈ పాత్రే కాదు, పూర్వ జన్మలో జయలక్ష్మి పాత్ర ప్రవర్తన కూడా జస్టిఫికేషన్ కి, సెంటిమెంట్స్ కి, నేటివిటీకీ దూరమే. 

     ఇతరపాత్రల్లో పాత్రధారులందరూ పకడ్బందీగానే నటించారు. విజయ్ ఆంథోనీ సమకూర్చిన పాటలూ బాగానే వున్నాయి సింపుల్ గా- చక్కగా అర్ధమయ్యే భాషతో.  ప్రదీప్ కెమెరా వర్క్ మరో ఎస్సెట్ ఈ సినిమాకి. టెక్నికల్ విలువలు ఉన్నతంగా వున్నాయి. లొకేషన్స్ కూడా కొత్తగా బావున్నాయి . అన్నీ బావున్నాయి- ఒక్క దర్శకుడితో మాత్రమే ఏమంత బాగా లేదు.

 చివరికేమిటి 
       ఈ పర్సనల్ సైకలాజికల్ కేస్ స్టడీలో రెండు అంశాలు పొసగకుండా వున్నాయి. పూర్వ జన్మలో చూపించిన కథ, సెకండాఫ్ లో మెడికల్ మాఫియా కథ. సెకండాఫ్ లో ఎప్పుడైతే హీరోయిన్ అపహరణకి గురై మెడికల్ మాఫియా లాబ్ కి చేరుతుందో,  అప్పుడు కథ దారి తప్పిపోయింది. హీరో సైకలాజికల్ సమస్య ఎలా తీరుతుందా అని ఎదురు చూస్తూంటే, మందుల కోసం మనుషుల మీద ప్రయోగాలూ చేసే వేరే కథగా మారిపోవడం- అసలు హీరో సమస్యకి ఈ మందులే కారణమన్నట్టుగా  చిత్రించండం కాన్సెప్ట్ పట్ల కన్ఫ్యూజన్ ని బయటపెడుతుంది. ఇది ముగింపుని కూడా సహేతుకంగా లేకుండా చేసింది. హీరో బావున్నప్పుడు సాఫ్ట్ వేర్ ఆఫీసులో ఒక చోట అంటాడు- నేను క్లిష్టంగా వున్న దాన్ని సులువు చేస్తాను, సులువుగా వున్న దాన్ని క్లిష్టంగా మార్చేస్తానని. హీరో మాటేమో గానీ దర్శకుడు మాత్రం సులువుగా కన్పిస్తున్న  కథని నానా క్లిష్టతరంగా  మార్చేసి  అతి క్రియేటివిటీ చూపించబోయాడు. పూర్వజన్మ కథలో  జయలక్ష్మితో శర్మకి ఏవో అపార్ధాలేర్పడి వుంటాయని వూహిస్తాం –కట్టుకున్న భార్య మంచిదే అయివుండాలన్న బాక్సీఫీసు నమ్మకాల ప్రకారం. భర్తే అపార్ధం జేసుకుని పగపెంచుకున్నాడని అనుకుంటాం. దీనికి విరుద్ధంగా నేరాలు ఘోరాలు కథలాగా, భార్యతో ఒక చవకబారు క్షుద్రకథని చూపించినప్పుడు ఆ ఫ్లాష్ బ్యాక్ కి లేదా- పూర్వజన్మ కథకి విలువే  లేకుండా పోయింది.

     సినిమాలో వినోదం అస్సలు లేదు, ఉన్న కథ ప్రకారమైనా భావోద్వేగాలు పండిస్తాయనుకుంటే అదీ కుదరకుండా కథ పక్క దార్లు పట్టిపోయింది. తప్పుల్ని కవర్ చేయడం కోసం చివరి షాట్ లో కూడా ప్రయత్నించి విఫలమయ్యారు- ఎవరో ముసలావిడ ఇప్పుడు జయలక్ష్మిని నేనే నంటూ చనిపోతే,  ఇప్పుడున్న ఐశ్వర్య ఎవరు? జయలక్ష్మి కాదా? మరి జయలక్ష్మి లాగే భావించుకుని సినిమా సాంతం చూశారే ప్రేక్షకులు?  చూసిందంతా హుష్ కాకీయేనా?


-సికిందర్ 
http://www.cinemabazaar.in