రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

9, జూన్ 2017, శుక్రవారం

రివ్యూ!

రచన – దర్శకత్వం : ఇంద్రగంటి మోహన కృష్ణ
తారాగణం :  వెన్నెల కిషోర్, శ్రీనివాస్ అవరాల, అడవి శేష్‌., ఈషా, అదితి, శ్యామలా దేవి, నికెళ్ల ణి దితరులు
సంగీతం:  ణిశర్మ , ఛాయాగ్రణం:  పీజీ విందా 
బ్యానర్ :  గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ 
నిర్మాతలు :  కె.సి. సింహారావు, వినయ్
విడుద :  జూన్ 9, 2017
***
          ‘అష్టాచెమ్మ’  తో దర్శకుడుగా రంగ ప్రవేశం చేసిన ఇంద్రగంటి మోహన కృష్ణ, ‘అమీతుమీ’ తో ఇంకోసారి తన శైలిలో కామెడీని అందించాలనుకున్నారు. రచనా చమత్కృతులతో ఆధునిక జంధ్యాలలా కన్పించే ఇంద్రగంటి, తన జంధ్యాల షేడ్స్ తో సంబంధం లేని  ‘బందిపోటు’,  ‘జంటిల్ మేన్’ లాంటి యాక్షన్ సినిమాలు కూడా తీశారు. కానీ యాక్షన్ సినిమాలకంటూ తనదైన ఒక శైలిని సృష్టించుకోలేకపోయారు. ఇప్పుడు ‘అమీ తుమీ’ తో మాత్రం  తిరిగి తన స్వచ్ఛమైన సహజశైలి హాస్యధోరణిలో కొచ్చేశారు. నాటు మోటు కామెడీలతో కలుషితమైన క్రియేటివ్ రంగంలో ఆరోగ్యకర హాస్యాన్ని  నిలబెట్టాలంటే చాలా  క్రియేటివ్ పవర్ వుండాలి. దీన్ని ఎలా వాడుకున్నారు, ఏం చేసి అమీతుమీ తేల్చుకున్నారు ఈ కింద చూద్దాం. 

కథ 

         జనార్ధన్ (తనికెళ్ళ భరణి) అనే వొక మనీ పవర్ వున్నవాడి కూతురు దీపిక (ఈషా), కొడుకు విజయ్ (అవరాల శ్రీనివాస్) ల ప్రేమవ్యవహరాలు గిట్టవు.  దీపిక డబ్బులేని అనంత్ (అడవి శేష్) ని ప్రేమిస్తే, విజయ్ డబ్బున్న మాయ (అదితి) ని ప్రేమిస్తూంటాడు. ఈమె  తండ్రి గంగాధర్ తో జనార్ధన్ కి వైరం వుంటుంది. కాబట్టి కొడుకు పెళ్ళికి ఒప్పుకోడు జనార్ధన్. కూతురు దీపిక పెళ్లి వైజాగ్ లో డబ్బున్న శ్రీ చిలిపి ( వెన్నెల కిషోర్) తో జరపాలని ఆమెని గదిలో బంధించి,  శ్రీ చిలిపిని  పెళ్లి చూపులకి రమ్మంటాడు. అడ్డుగా వున్న కొడుకు విజయ్ ని ఇంట్లోంచి వెళ్ళగొడతాడు. పెళ్లి చూపులకి  శ్రీ చిలిపి వచ్చేలోగా పనిమనిషి కుమారి ( శ్యామలా దేవి) సాయంతో దీపిక పారిపోతుంది. ఈ విషయం జనార్ధన్ కి తెలీదు. అటు విజయ్ ప్రేమిస్తున్న మాయ కూడా  సవతి తల్లి పోరుతో ఇంట్లోంచి పారిపోతుంది. ఇప్పడు దీపికతో పెళ్లి చూపులకి శ్రీచిలిపి దిగుతాడు. దీపిక లేని ఇంట్లో దీపిక అనుకుంటూ ఇతడికి పెళ్లి చూపులు ఎవరితో  జరిగాయి, ఆ పెళ్లి చూపులతో ఆమెని లేపుకెళ్ళి  తను కూడా ఏం చేశాడనేది మిగతా కథ.

ఎలావుంది కథ 
       రెండు జంటల మధ్య ఇంకొకడు వచ్చి కామెడీ ఆఫ్ ఎర్రర్స్ ని సృష్టించే రొటీన్ కథే ఇది. అయితే ఇది మూస కథనాన్ని వదిలించుకుని కాస్త నటనలతో, మాటలతో కొత్త పుంతలు తొక్కడంతో ఒక అరుదైన రోమాంటిక్ కామెడీగా మారింది. అరుదైన రోమాంటిక్ కామెడీ అనడం ఎందుకంటే, తెలుగులో విజయవంతమైన రోమాంటిక్ కామెడీలు రావడం ఎప్పుడో మానేశాయి. జానర్ మర్యాద తప్పి రోమాంటిక్ కామెడీలు  సగం కథనుంచి రోమాంటిక్  డ్రామాలుగా ప్లేటు ఫిరాయిస్తూ వుండడంతో, ఇంతవరకూ అవి అపజయాల్నే మూట గట్టుకున్నాయి. ‘అమీ తుమీ’ అలా కాదు- రోమాంటిక్ కామెడీ జానర్ మర్యాదని ఆద్యంతం కాపాడుకుంటూ, మోస్ట్ ఫన్నీ ఎంటర్ టైనర్ గా తయారయ్యింది.  రెండు గంటల సేపు సత్కాలక్షేపాన్నిచ్చే  క్లీన్ కామెడీగా నిలబడింది. ఈ కథకి రచనా బలం, నటనా బలం ఇవే వెన్నుదన్నుగా నిలిచాయి. 

ఎవరెలా చేశారు 
      అడివి శేష్,  అవసరాల శ్రీనివాస్ లు ఇందులో హీరోలుగా కన్పిస్తున్నా మొత్తమంతా మోసింది వెన్నెల కిషోరే.  బహుశా ఒక కమెడియన్ పుల్ లెంత్ పాత్రతో ఆద్యంతం రక్తికట్టించగల్గడం ఇదే. కిషోర్  చాలా సంయమనంతో కామెడీ అదుపుతప్పి ఒవరాక్షన్ తో సర్వనాశనం చేయకుండా, ‘రిచ్’  గా నటించాడనే చెప్పాలి.  కామెడీ అభినయం ‘రిచ్’ గా వుంటే ఎంత రుచిగా వుంటుందో పూర్తి స్థాయిలో ప్రయోగం చేసి చూపించే అవకాశం అతడికి లభించింది.  శ్రీ చిలిపి క్యారక్టర్ ని తన కెరీర్ లో మరపురాని పాత్రగా మల్చుకున్నాడు. ఎంత సేపు హంగామా చేసినా ఒక్క క్షణం బోరుకొట్టకుండా కామెడీని నిభాయించడం అతడికే చెల్లిందని చెప్పుకోవచ్చు. ఈ కథంతా స్పీడుగా పరుగెత్తే కామెడీయే. ఈ స్పీడులో టైమింగ్ తో అతను  ఫాస్టుగా చెప్పేసే తెలుగింగ్లీషు డైలాగులు కూడా యాక్షన్ ప్రవాహంలో కలిసి సాగిపోతాయే తప్ప అడ్డుపడవు, ఒడ్డున పడవు. పూర్తిగా ఈ కామెడీ  వెన్నెల కిషోర్ షో. ఈ షోలో  అతను కన్పించడు, పాత్రే కన్పిస్తుంది.

          అడివి శేష్ లవర్ బాయ్ పాత్ర. సెకండాఫ్ లో వెన్నెల కిషోర్ తో కాంబినేషన్లో కొచ్చాకే తన కామెడీ చూపిస్తాడు. అలాగే అవసరాల పాత్ర నిడివి అడివి శేష్ కంటే తక్కువే. తను సపోర్టింగ్ కామెడీ నందిస్తాడు. తెలంగాణా పాత్రలో ఎంతవరకు ఒదిగాడనేది చెప్పడం కష్టమే. ఫస్ట్ హీరోయిన్ ఈషా తెలంగాణా పాత్ర, పాత్ర తాలూకు మొరటుతనం ఆమెకి ప్లస్ అవుతాయి. పనిమనిషి కుమారి పాత్రలో శ్యామలా దేవి  పూర్తి  నిడివి తెలంగాణా కామెడీ పాత్ర ఇంద్రగంటి పర్యవేక్షణలో  ఇంకో ఎస్సెట్ సినిమాకి.

          ఇక తొండి తెలంగాణా పాత్రలో తనికెళ్ళ భరణి చెప్పనవసరం లేదు. అయితే ఎక్కువసార్లు తనది లౌడ్ కామెడీయే. అలాగే రెండో హీరోయిన్ అదితి మైనస్. 

          పిజి విందా ఛాయాగ్రహణంతో మంచి ప్రొడక్షన్ విలువలున్న ఈ రోమాంటిక్ కామెడీలో రెండే పాటలున్నా (సెకండాఫ్ లోనే) మణిశర్మ తన పూర్వ వైభవాన్ని సంతరించి పెట్టారు. రెండూ సిట్యుయేషనల్ సాంగ్సే . సిరివెన్నెల సీతారామశాస్త్రి రాశారు. మార్తాండ్ వెం కటేష్  షార్ప్ ఎడిటింగ్ తో కథనం స్పీడు పెరిగింది. అయితే ఫస్టాఫ్ లో వెన్నెల కిషోర్- శ్యామలా దేవిల మొదటి సీను కేవలం డైలాగులతో సుదీర్ఘంగా సాగి సహనాన్ని పరీక్షించకుండా షార్ప్ చేయాల్సింది.

చివరికేమిటి 
        రచయిత, దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ  రోమాంటిక్ కామెడీని రోమాంటిక్ కామెడీ దారిలో పెట్టారు. నటనలు, మాటలు రెండే ఈ రొటీన్ రోమాంటిక్ కామెడీని నిలబెడ తాయని నమ్మినట్టుంది. ఆనాడు హిట్టయిన రోమాంటిక్ కామెడీ ‘నువ్వేకావాలి’ నటనలు, మాటలే, ఇటీవల హిట్టయిన రోమాంటిక్ కామెడీ ‘హేపీ భాగ్ జాయేగీ’  నటనలు, మాటలే. ఈ ప్రయత్నంతో  స్క్రిప్టంతా మాటలతో నింపేశారు. సీన్లు తక్కువే, మాటల  ప్రవాహంవల్ల వాటి నిడివి  ఎక్కువ. ఈ మాటల  రచన అత్యున్నత స్థాయి క్రియేటివిటీ. ప్రపంచ పోకడలని, పరిణామాలనీ గమనించి సినిమాటిక్ గా  విసిరిన అక్షర తూణీరాలు. లేకపోతే  తాటి కల్లుని ఆర్గానిక్ స్కాచ్ అనడమేమిటి? పెళ్లి చూపుల్ని సర్జికల్ స్ట్రైక్ అనడమేమిటి? ఇక సినిమాల్లో తెలంగాణా యాసకి కూడా కొత్త టచ్ ఇచ్చారు. ధారాళంగా ఉర్దూ పదాలు కలిసిన యాసతో నేటివిటీకి దగ్గరగా తీసికెళ్ళే ప్రయత్నం చేశారు. కొన్ని తెలంగాణా తెలుగు పదాలు కూడా ఇంతవరకు  సినిమాల్లో వాడనివే.  ఆయన క్లాస్, మాస్ అనుకుంటూ- ఆంధ్రా, తెలంగాణా ప్రేక్షకులనుకుంటూ, గిరిగీసుకుని కూర్చోలేదు. ఫ్రీ స్టైల్ మూవీ మేకింగ్ చేశారు. ఆంధ్రా తెలంగాణా ముఖ్యపాత్రలతో దీన్నొక  ప్రప్రథమ మోడల్  ‘అంతర్రాష్ట్ర’ మూవీగా తీర్చి దిద్దారు. పాత్రలు  ప్రాంతాల్ని ప్రస్తావించుకోకుండానే అంతా  ఒకటే అన్నట్టు వుంటాయి. 

          ఐతే రెండే బలహీనతలు వున్నాయి. ఎత్తుగడ, విశ్రాంతి ఘట్టం. ప్రారంభం చాలా  స్లోగా, అనాసక్తి కరంగా భయపెడుతూ ప్రారంభమవుతుంది- అడివి శేష్, ఈషాల దొంగ చాటు ప్రేమల తో...అవసరాల, అదితి ల దొంగచాటు ప్రేమలతో మరికొన్ని సీన్లు- తనికెళ్ళ అరుపులు – వీటన్నిటితో  అరగంట పాటు ఇంద్రగంటి ప్రశ్నార్ధక మవుతారు. అరగంట తర్వాత వెన్నెల కిషోర్ వచ్చాకే రచనతో, దర్శకత్వంతో ఇంద్రగంటి బిజీగా మారిపోతారు.  ఇక్కడ్నించీ అందరి నటనలూ వూపందుకుంటాయి. స్ట్రక్చర్ మీద అంతగా దృష్టి పెట్టకుండా కొత్త  డైలాగుల్ని కనుగోనడంలోనే సర్వశక్తులూ ఒడ్డడం వల్ల – ఎత్తుగడతో బాటు ఇంటర్వల్ సీను కూడా మూగబోయింది. ఈ పేలవమైన సీను ని తనికెళ్ళ పాత్రచేత ఆహా ఓహో ఇంటర్వెల్  సీను అని పొగిడించుకోవడంతో  బాగా అభాసయ్యింది. సెకండాఫ్ ప్రారంభంలో కూడా  స్క్రీన్ ప్లేని వెన్నెల పక్క పాత్ర చేత పొగిడించుకున్నారు ఇంద్రగంటి.  ఇలా మాస్ రైటర్ పనులు కూడా చేశారు. 

          ఓడ్ హౌస్ నవలల్లో లాగానో, ముళ్ళపూడి కథల్లో లాగానో సినిమాల్లో అందమైన కథా  ప్రపంచాలు అరుదుగా వుంటాయి. ఇంద్రగంటి కామెడీ తీస్తే అది ఓడ్ హౌస్ కథా లోకమో, ముళ్ళపూడి కథా లోకమో అన్నట్టుగా వుంటుంది-  కానీ కాలం చెల్లినట్టుగా వుండదు.  ‘అమీతుమీ’ ని అలాటి వొక తాము ఇరుక్కున్న కామిక్ రొంపి లోంచి బయటపడేందుకు మరిన్ని హస్య ప్రహసనాలు సృష్టించుకునే ‘అమాయక’ పాత్రల స్ట్రగుల్ గా చూపించారు. అంతే పకడ్బందీగా నటింపజేశారు. స్పీడుకి పెద్ద పీట వేశారు.


-సికిందర్
http://www.cinemabazaar.in
         















5, జూన్ 2017, సోమవారం





    
    బడ్జెట్ మూవీస్ ఎక్కువసృజనాత్మకతని కోరుతాయి. బడ్జెట్  పరిమితుల రీత్యా ఈ సృజనాత్మకత  స్క్రిప్టు పరంగానే గాక, ప్రొడక్షన్ పరంగానూ అవసరం. ఇతర అన్ని రకాల  స్క్రిప్టుల కంటే బడ్జెట్ మూవీ స్క్రిప్టు రాయడమే కష్టమైన పని.  అనేక యాక్షన్ సీన్లు, ఫారిన్ సీన్లు, బోలెడు పాత్రలతో హంగామా, ఆరేసి పాటలూ వగైరా బడ్జెట్ స్క్రిప్టులో కుదరదు. బడ్జెట్ స్క్రిప్టు అంతా కేవలం పాత్రల మధ్య బలమైన కథ తోనే రాణిస్తుంది. ఈ బలమైన కథని  తక్కువ పాత్రలతో, తక్కువ లొకేషన్స్ లో, తక్కువ రోజుల్లో  షూట్ చేసేటట్టు రూపొందాల్సిందే. 


          క్కబడ్జెట్ మూవీ రచనకీ, బిగ్ కమర్షియల్ రచనకీ తేడా తెలుసుకోవడం అవసరం. బిగ్ కమర్షియల్స్ కి కథల్లో, పాత్ర చిత్రణల్లో ఎన్ని లోపాలున్నా ఇతర భారీ హంగూ  ఆర్భాటాలతో, స్టార్ ఇమేజితో  కవరై పోవచ్చు. బిగ్ కమర్షియల్ కి ఒక టెంప్లెట్ లో రచన వుంటుంది. అదిలా వుంటుంది-   ముందుగా ఒక యాక్షన్ సీనుతో హీరో ఎంట్రీఒక గ్రూప్ సాంగ్ఆతర్వాత హీరోయిన్ని పడేసే కామెడీ లవ్ ట్రాక్ఆమెతో ఒక టీజింగ్ సాంగ్హీరోయిన్ లవ్ లో పడ్డాకడ్యూయెట్అప్పుడు విలన్ ఎంట్రీ, దాంతో ఇంటర్వెల్. సెకండాఫ్  లో హీరోయిన్ అదృశ్యమై విలన్ తో కథ మొదలుఅప్పుడప్పుడు హీరోయిన్ తో సాంగ్స్, అప్పుడప్పుడు విలన్ ఎటాక్స్చివరికి హీరోయిన్ తో ఒక ఫోక్ సాంగ్ఇక విలన్ తో క్లయిమాక్స్ముగింపూ. 

          ఈ టెంప్లెట్ బడ్జెట్ మూవీస్ కి పనిచేయదు. ఈ టెంప్లెట్ ని పట్టుకుని చాలా బడ్జెట్ మూవీస్ వచ్చాయి. ఫలితంగా అవి బిగ్ కమర్షియల్స్ కి చవకబారు నకళ్ళుగా తేలిపోయాయి. ఈ టెంప్లెట్ లో  మొత్తం సినిమాని బిగ్ కమర్షియల్స్ బాగా రిచ్ గా చూపిస్తూంటే, చవకబారు  అనుకరణలు ప్రేక్షకులకి దేనికి? బడ్జెట్ మూవీస్ కి దాని కథే వ్యక్తిత్వాన్నిస్తుంది. కథని నమ్ముకున్న బడ్జెట్ మూవీ చెడిపోలేదు. కాకపోతే ఏడాదంతా ‘క్షణం’ అనీ,  ‘పెళ్లిచూపులు’ అనీ రెండో మూడో వస్తాయి. చిన్న సినిమాకి కథే  బలం అంటూంటారు. దీన్ని ఇంకాస్త విడమర్చి చెప్పుకుంటే, చిన్న సినిమాకి ‘కథలో పుట్టే సమస్య-
ఆ సమస్యని పట్టుకుని నటీనటుల నటన’ ఇవే బలం. ఇది మొదటి సూత్రం. 

          బడ్జెట్ మూవీని టెంప్లెట్ లో కథ నవ్వులపాలు చేస్తుంది. అదే స్ట్రక్చర్ లో కథ ప్రేక్షకులని కట్టి పడేస్తుంది. ఒక బిగినింగ్, ఒక మిడిల్, ఒక ఎండ్ వున్న కథ సాలిడ్ గా వుంటుంది.  60 – 70 సీన్లకి మించకుండా వుంటే పకడ్బందీగా వుంటుంది. ఒక్కో సీను రెండు మూడు పేజీలకి మించకుండా వుంటే కథ వేగం పెరుగుతుంది. వేగం పెరిగినప్పుడు బోరు తొలగి ప్రేక్షకుల ఇన్వాల్వ్ మెంట్ పెరుగుతుంది. ముఖ్య పాత్రలు కూడా నాల్గుకి మించకుండా వుంటే డ్రామా పదునెక్కుతుంది. మైనర్ పాత్రలతో సబ్ ప్లాట్స్ మూడుకి మించకూడదు. ముఖ్య పాత్రలతో కామెడీ సీన్లయినా ఆచితూచి పొదుపుగా డైలాగులు వాడాలి. స్క్రిప్టంతా డైలాగులతో నిండిపోయి వుండకూడదు. ఎడిటింగ్, డబ్బింగ్, ఆర్ ఆర్ బిల్లులు వాచిపోతాయి. అంతే కాదు, దీనివల్ల సెట్ లో ఒక్కోసీను ఎక్కువ సమయం కూడా తీసుకుంటుంది. బాల నటులు, ఒకసీను నటులూ లేకుండా కూడా చూసుకోవాలి. బంధు మిత్రులకి అస్సలు వేషాలివ్వకూడదు. నిర్మాత అస్సలు నటించకూడదు. జంతువులకి కూడా స్క్రిప్టులో స్థానం కల్పించకూడదు. క్రౌడ్ సీన్లు అస్సలు రాయకూడదు. సెక్స్ సీన్లూ, ఎక్స్ పోజింగులూ, డబుల్ మీనింగులు,  ఐటెం సాంగులూ పెట్టకూడదు. బడ్జెట్ మూవీ ఎంత క్లీన్ గా వుంటే అంత వ్యక్తిత్వంతో అన్నివర్గాలనీ ఆకట్టుకుంటుంది. లేకపోతే ‘బి’ గ్రేడ్ కి దిగజారి నష్టపోతుంది. ఒకప్పుడు ‘ఏ’ సర్టిఫికేట్ తో ‘బి’ గ్రేడ్ ‘సి’ గ్రేడ్ సినిమాలు కూడా ఆడేవి. ఇప్పుడా కంటెంట్ ని పోర్న్ సైట్స్ లో  ఇంకాబాగా చూసేస్తున్నప్పుడు బడ్జెట్ మూవీస్ లో చొరబెట్టడం అమాయకత్వమే.  

          బడ్జెట్ మూవీస్ కి మూస కథలని బిగ్ కమర్షియల్స్ సొంతం చేసుకున్నాయి. బడ్జెట్ మూవీస్ కి సెక్స్ కంటెంట్ ని పోర్న్ సైట్స్ హైజాక్ చేశాయి. ఇక బడ్జెట్ మూవీస్ కి మిగిలింది మానమర్యాదలతో కూడిన క్వాలిటీ కంటెంటే. 

          మూడు లైన్లకి మించకుండా ఒక్కో డైలాగు, సీనులో మూడుకి మించకుండా పాత్రలు, మూడు పేజీలకి మించకుండా సీను- ప్లాన్ చేసుకుంటే కథ క్వాలిటీ పెరగడమే గాక, చాలా సొమ్ములు ఆదా అవుతాయి. 

          ‘శాతకర్ణి’, ‘బాజీరావ్ మస్తానీ’ బిగ్ కమర్షియల్స్ అని తెలిసిందే. ఇవి సైతం రెండు మూడు పాత్రల మధ్య పుట్టే బలమైన డ్రామా మీదే ఆధారపడ్డాన్ని గమనించ వచ్చు.  ‘శాతకర్ణి’ లో బాలకృష్ణ- శ్రియల మధ్య; ‘బాజీరావ్ మస్తానీ’ లో రణవీర్ సింగ్- ప్రియాంకా చోప్రా – దీపికా పడుకొనెల మధ్య బలమైన డ్రామా కేంద్రంగా ఇవి వుంటాయి. ఇంత భారీ సినిమాలై వుండి కూడా, ఎన్నో ఇతర పాత్రలుండీ కూడా,  ఈ రెండు మూడు పాత్రల మధ్య డ్రామా మీదే ఆధారపడి నిర్మాణం జరుపుకున్నాయంటే, బడ్జెట్ మూవీస్ కి ఎందుకు సాధ్యంకాదు?  ఈ రెండు బిగ్ కమర్షియల్స్ లో వున్న రోమాంటిక్ డ్రామాలు కట్టి పడేసే విధం చూస్తూంటే- తెలుగులో ఇలాంటి బలమైన రోమాంటిక్ డ్రామాల్ని బడ్జెట్ మూవీస్ గా తీస్తే ఈ రోజుల్లో కూడా ఎందుకు ఆడవనిపిస్తుంది. బడ్జెట్ మూవీస్ కి కావాల్సింది తక్కువ పాత్రలతో బలమైన డ్రామా సృష్టించడమొక్కటే. ఈ డ్రామా ప్రేమ కావొచ్చు, కామెడీ కావొచ్చు, యాక్షన్ కావొచ్చు, ఇంకే జానరైనా కావొచ్చు. 

పాత్ర చిత్రణలు
          బలమైన డ్రామాకి పాత్ర చిత్రణలే  ముఖ్యం. ప్లాస్టిక్ పాత్రలు మొదటి పావుగంట ఇరవై నిమిషాల్లోనే బడ్జెట్ మూవీలో విషయం లేదని తేల్చేస్తాయి. బిగ్ కమర్షియల్స్ లో పెద్ద హీరోల పాత్రల రూపురేఖల్లో బడ్జెట్ మూవీ పాత్రల్ని సృష్టించకూడదు. పాత్రలు నిజజీవితంలో మనుషులకి ఎంత దగ్గరగా అనిపిస్తే అంత  క్లిక్ అవుతాయి. అవి సహజంగా మాట్లాడితే ఇంకా బాగా క్లిక్ అవుతాయి. ‘పెళ్లి చూపులు’ విజయరహస్యమిదే. మాస్ కూడా తమలాగే మాట్లాడుతున్న ఆ పాత్రల్ని చూసి కనెక్ట్ అయ్యారు. 1989 లో ‘శివ’ బడ్జెట్ మూవీ కానప్పటికీ దానిలోని సహజ పాత్రలతో, సహజ సంభాషణలతో ఇలాగే  కనెక్ట్ అయ్యారు అన్ని వర్గాల ప్రేక్షకులూ.    

 డిఫరెంటే  హిట్!     
          బడ్జెట్ మూవీస్ డిఫరెంట్ గా వుండే కథలతోనే హిట్టవుతున్నాయి.  గతంలోకి వెళ్తే,  బడ్జెట్ మూవీస్ మూస కథలతో ఒక్కటీ హిట్ కాలేదు. కారణం మూసకథలకి బిగ్ కమర్షియల్స్ తో రాజీపడ్డారు ప్రేక్షకులు. అక్కడ అంత ఆర్బాటంగా  మూస కథల్ని అందిస్తూంటే ఇక్కడ చిన్న సినిమాల్లో కొత్త మొహాలతో చీప్ నమూనాలు చూడ్డమెందుకు? 2000 సంవత్సరం నుంచి పరిశీలిస్తే, బిగ్ కమర్షియల్స్ కి దూరంగా  డిఫరెంట్ గా వున్న బడ్జెట్ మూవీసే హిట్టయ్యాయి. చిత్రం, గమ్యం, వినాయకుడు, ఐతే, అనుకోకుండా ఒకరోజు, ఎ ఫిలిం బై అరవింద్, మంత్ర మొదలైనవి. అయితే ఈ పదిహేడేళ్ళ కాలంలో ఇవి ఓ పదిహేను కూడా లేకపోవడం వెనుకబాటు తనమే. 

          ఇక్కడ గమనార్హమేమిటంటే, ఇవి విడుదలైన సంవత్సరాల్లో ఇంకే మూస బడ్జెట్ మూవీ హిట్ కాలేదు. అన్నీ ఫ్లాప్సే. నువ్వే కావాలి, జయం, ఉయ్యాల జంపాల, హేపీడేస్, పెళ్లి చూపులు, క్షణం, ఈరోజుల్లో, స్వామి రారా  లాంటి కొన్ని మాత్రమే రెగ్యులర్ కథలతో బాగా తీసినవి హిట్టయ్యాయి. గత సంవత్సరం మొత్తం 117 బడ్జెట్ మూవీస్ లో క్షణం, పెళ్లి చూపులు రెండే హిట్టయ్యాయి. మిగతావి ఎందుకు హిట్ కావడం లేదంటే అవి పెద్ద సినిమాలకి మూస నకళ్ళు కావడం వల్ల. బడ్జెట్ మూవీ డిఫరెంట్ గా వుంటేనే మనుగడలో  వుంటుందని గ్రహించక పోవడం వల్ల. 2000 సంవత్సరం నుంచీ ఈ పరమ సత్యాన్ని గుర్తించక పోవడం వల్ల.  

          కనుక మూసకి  బడ్జెట్ మూవీస్ దూరంగా వుండాల్సిందే. అయితే వూహల్లోంచి కథల్ని సృష్టించబోతే చూసిన బిగ్ కమర్షియల్ సినిమాల్లోని మూసలే మెదులుతాయి. చుట్టూ ప్రపంచంలోకి చూస్తే మాత్రం కొత్త   కథలు పుడతాయి.  వివిధ టాపిక్స్ మీద ఎక్కువ ఆర్టికల్స్ చదవడం వల్ల  కూడా కొత్త పాయింట్లు దొరుకుతాయి. వీటిని బడ్జెట్ మూవీ పరిమితుల్లో సినిమాటిక్ గా మల్చుకోవచ్చు. కొత్త దనం కోసం ప్రయత్నిస్తే నిర్మాతలు దొరకరన్న అనుమానం అవసరం లేదు. ఆ కొత్త దనంలో కన్పించాల్సింది కాసుల గలగలలే. కొత్తదనమున్న  కథ చెప్తూంటే అందులో డబ్బులు కన్పిస్తూంటే వదులుకోవడాని ఏ నిర్మాతా ఇష్టపడరు. ఆ డబ్బులు కన్పించేలా కొత్తదనాన్ని తీర్చి దిద్దడానికే అసలు క్రియేటివిటీ అంతా వుపయోగించాలి. 

ఆ ఐదు ఎలిమెంట్స్
          డిఫరెంట్ గా వుంటూ  హిట్టయిన బడ్జెట్ మూవీస్ ని పరిశీలిస్తే, వాటిలో కామన్ గా ఈ ఐదు ఎలిమెంట్స్ కనిపిస్తాయి. 1. హీరోకి స్పష్టమైన లక్ష్యం వుండి  యాక్టివ్ పాత్ర అయివుండడం, 2. నేపధ్య వాతావరణం మిస్టీరియస్ గా వుండడం, 3. సబ్ ప్లాట్స్ లేకుండా ప్రధాన కథ మాత్రమే వుండడం, 4. ఏ జానర్ అయితే ఆ జానర్ మర్యాద కాపాడ్డం, 5. డైలాగులు రియలిస్టిక్ గా వుండడం. 

          ఈ ఐదు ఎలిమెంట్స్ ని కలిపి కథ అల్లితే డిఫరెంట్ గా వున్న బడ్జెట్ మూవీస్ హిట్టయ్యాయి. ఇక ఏ జానర్ కథలు తీసుకోవాలంటే, అప్పటి మార్కెట్లో అమ్ముడుబోయే  ఏ జానరైనా తీసుకోవచ్చు. ఏ జానర్ ని తీసుకున్నా ఆ జానర్ మర్యాదని కాపాడాలి. గత రెండు సంవత్సరాలుగా ప్రేక్షకుల్లో మార్పు వచ్చింది. చిన్న దైనా పెద్ద దైనా జానర్ మర్యాదని కాపాడిన సినిమాలనే హిట్ చేశారు (జానర్ మర్యాద గురించి ఇదే బ్లాగులో వ్యాసాలున్నాయి చదువుకోవచ్చు). కాబట్టి వొళ్ళు దగ్గర పెట్టుకుని జానర్ మర్యాదకి కట్టుబడాలి. నిర్మాత పైత్యమో, నిర్మాత బావమరిది పైత్యమో చొరబెడితే ఇంతే సంగతులు. వాళ్ళూ వుండరు, దర్శకుడూ వుండడు. ఇది గ్యారంటీ. 

          బడ్జెట్ మూవీకి కంటెంటే కీలకం. ఇంతే కీలకంగా  నటీనటుల నటన కూడా అవసరం. ‘
కథలో పుట్టే సమస్య- ఆ సమస్యని పట్టుకుని నటీనటుల నటన’  ఇదే బడ్జెట్ మూవీ బాక్సాఫీసు రహస్యం. కాబట్టి నటీనటుల్ని చూసి ఎంపిక చేసుకోవాలి. అన్ని సినిమాల్లో ఒకేలా నటించి, డైలాగులు చెప్పేసే నటీనటుల్ని నివారించాలి. పాత్రని అర్ధం జేసుకుని భిన్న పార్శ్వాలని ప్రదర్శించే రావురమేష్ లాంటి వాళ్ళు బడ్జెట్ మూవీస్ ని కాపాడగలరు తప్ప,  కృత్రిమ ఫార్ములా పాత్రలకి అలవాటు పడిన నటులు కాదు. 

          ఈ వ్యాసం ప్రారంభంలో స్క్రిప్టు పరమైన  సృజనాత్మకత గురించి ప్రస్తావించుకున్నాం. ‘శివ’ బడ్జెట్ మూవీ కాకపోయినా అదిప్పుడు బడ్జెట్ మూవీస్ కి ఒక భరోసా. దీని సార్వజనీన స్ట్రక్చర్ ని ఫాలో అయివుంటే ఎన్నో బిగ్ కమర్షియల్స్ ఫ్లాప్ అవకుండా వుండేవి. బిగ్ కమర్షియల్స్ దీన్ని వదిలేసినా బడ్జెట్ మూవీస్ దీంతో బాముకోవచ్చు. ‘శివ’  స్క్రీన్ ప్లే  ఆధారంగా ‘తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్’  శీర్షికన ఈ బ్లాగులోనే రాసిన పదిహేడు వ్యాసాలూ ఒకసారి చదువుకుంటే,  బడ్జెట్ మూవీస్ కి పకడ్బందీ స్క్రీన్ ప్లే, పాత్రచిత్రణలూ సమూలంగా తెలుస్తాయి.  

          ఇక ప్రొడక్షన్ పరంగా బడ్జెట్ మూవీ సృజనాత్మకత ఏమిటో వచ్చే వ్యాసంలో చూద్దాం.


-సికిందర్
         
         
          

4, జూన్ 2017, ఆదివారం





        డార్క్ మూవీస్ మేకింగ్ గురించి ఇంకో నాల్గు వ్యాసాలు రావాలి ముందనుకున్న ప్రకారం. కానీ వచ్చిన వ్యాసాలకి  సరైన ప్రతిస్పందన లేకపోవడం, ఎవరిలోనూ ఈ జానర్ పట్ల ఆసక్తి లేకపోవడం గమనించి వీటిని ఆపివేస్తున్నాం. ఇప్పటి తెలుగు మేకర్లకి ఈ కమర్షియల్ జానర్ అర్ధంగాకపోవడమే  నిరాసక్తతకి  మూల కారణం. అటు తమిళ మలయాళంలలో,  ఇంకా అటు హిందీలో ఈ జానర్ కొత్త వసూళ్ళ వనరవుతుందని గమనించి, దీని రూపు రేఖల్ని అర్ధం జేసుకుని, విజయవంతంగా తెలుగులో కూడా ఆడించుకుంటున్నారు. అంటే తెలుగు ప్రేక్షకులకి ఈ జానర్ అర్ధమౌతోందన్నమాట, కానీ ఇప్పటి తెలుగు మేకర్లకే అర్ధంగావడం లేదు. ఇప్పటి తెలుగు మేకర్లకి చిన్నబడ్జెట్ లో అర్ధమయ్యే జానర్లు మూడే మూడని తెలుస్తోంది : రోమాంటిక్ కామెడీలు, దెయ్యం కామెడీలు, యాక్షన్ కథలు. మొదటి రెండూ వరసగా ఫ్లాపులు మూటగట్టుకుంటున్నా సరే, మార్కెట్ స్పృహ లేకుండా వీటినే తీయడానికి ఇష్టపడుతున్నారు. వీటిని తీయడానికి పెద్దగా  టాలెంట్ అవసరం లేకపోవడం వల్ల  కూడా  కావొచ్చు. 

          ఇక యాక్షన్ జానర్ లో  గత రెండు మూడు వారాల్లోనే  వెంకటా పురం, కేశవ, అంధగాడు వచ్చాయి. సస్పెన్స్ తో కూడిన డార్క్ మూవీస్ కంటే సస్పెన్స్ తో కూడిన యాక్షన్ కథలే  ఇప్పటి తెలుగు మేకర్లకి బాగా అర్ధమవుతాయని  దీన్ని బట్టి అనుకోవాలి.  ఐతే ఇవైనా సరైన స్ట్రక్చర్, యాక్షన్ మూవీ డైనమిక్స్, సస్పెన్స్ పోషణ తెలిసి కొత్త పాయింట్లతో తీస్తే మంచిదే. తెలుసుకోకుండా ఇష్టారాజ్యంగా  ఇమ్మెచ్యూర్డ్ గా తీస్తూపోతే  ఈ  యాక్షన్ జానర్ కూడా ఏడాది తిరక్కుండా ప్రేక్షకుల తిరస్కారానికి గురవుతుంది. ఇక్కడ పంచ్ లైన్ ఏమిటంటే, డార్క్ మూవీస్ జానర్ అర్ధమైతే గానీ యాక్షన్ మూవీస్ ని సమర్ధవంతంగా తీయలేరు, దట్సాల్!  ఎమ్సెట్  రాయకుండా బీటెక్ చేయలేరు కదా! సో అల్ ది బెస్ట్ టు ఆల్ యాక్షన్ మూవీ మేకర్స్!


-సికిందర్

3, జూన్ 2017, శనివారం

రివ్యూ!





రచనదర్శకత్వం : వంశీ
తారాగణం :  సుమంత్అశ్విన్, అనీషా అంబ్రోస్, మనాలీ రాథోడ్, మానస, వంశీరాజ్, కృష్ణ భగవాన్, రాఘవేంద్ర తదితరులు
సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం :నగేష్బనెల్లా
నిర్మాణ సంస్థ: మధుర ఎంటర్టైన్మెంట్
నిర్మాత: మధుర శ్రీధర్రెడ్డి
విడుదల : 2 జూన్,2017
***
     
వంశీ అంటే గోదావరి, పాపికొండలు, పడవలు, పడుచులు, పోటుగాళ్ళు, గోదావరి యాస, హాస్యం, వ్యంగ్యం, వెటకారం, నాట్యభంగిమల నటనలు, ఇళయరాజా పాటలు. ఇది గతం.
        వంశీ అంటే గోదావరి, పాపికొండలు, పడవలు, పడుచులు, పోటుగాళ్ళు, గోదావరి యాస, హాస్యం, వ్యంగ్యం, వెటకారం, నాట్యభంగిమల నటనలు, ఇళయరాజా పాటల్లాంటి పాటలు. ఇది ప్రస్తుతం.
          గతం 1980 ల నాటి కాలం, ప్రస్తుతం ముప్ఫయ్యేళ్ళు గడిచిపోయిన టైం లాప్స్.
          సినిమాల్లో టైం లాప్స్ తో సీను మారుతుంది. వంశీతో మారలేదు. ఆయన టైం లైన్ లో సీను 1980 ల దగ్గరే ఫ్రీజ్ అయిపోయి వుంటుంది. ఈ సీసులో మన ప్రతిబింబాలెక్కడా అని మారుతున్న తరాల ప్రేక్షకులు వెతుక్కునే పరిస్థితి. 

          లేడీస్ టైలర్ కొడుకు టైలరింగ్ నుంచి ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలనుకోవడానికి  మధ్య ఒక దశ వుంది- అది రెడీమేడ్ దుస్తులొచ్చేసి- యారో, పార్క్ ఎవెన్యూ,  లెవీస్ లాంటి గ్లోబల్ సంస్థల షోరూములు అసంఖ్యాకంగా వెలసి, ఆడవాళ్ళకి బొథిక్స్ తెర్చుకుని, చేతి వృత్తి టైలరింగ్  తెల్లారిపోయిన దశ.  ఈ దశ  సినిమా ఫీల్డులో కాస్ట్యూమ్స్  కుట్టే టైలర్స్ కి కూడా వచ్చింది. సినిమా ఫీల్డులో టైలర్స్ ఫ్యాషన్ డిజైనర్ల ధాటికి తట్టుకోలేకపోతే, వూళ్ళల్లో  రెడీ మేడ్ దుస్తుల ట్రెండ్ కి  దెబ్బతిన్నారు.   అంటే లేడీస్ టైలర్ సుందరం కొడుకు గోపాలంకి ఇప్పుడు పాతికేళ్ళనుకుంటే, అతడికి పదేళ్ళొచ్చేటప్పటికే  వూళ్ళో టైలరింగ్ వృత్తే వుండి వుండకూడదు. అంటే అతడికి టైలరింగే తెలిసివుండకూడదు. ఈ దశని రికార్డు చేయలేదు వంశీ. 

          చేసి వుంటే ఇంకో స్థాయిలో వుండేది  సినిమా!  రియలిస్టిక్ గా,  పోనీ సెమీ రియలిస్టిక్ గా  వున్నప్పుడే బడ్జెట్ సినిమాకి బలం. రాజేంద్ర ప్రసాద్  1986 లో నటించిన లేడీస్ టైలర్ ఒక కల్ట్ క్యారక్టర్. అలాటి దానికి నేటి సీక్వెల్ లో స్థానం లేకుండా చేశారు. ప్రారంభంలో జనాభా లెక్కల అతను వచ్చి నప్పుడు ( జనాభా లెక్కల వాడి సీను చూసి చూసి వున్న  పాత మూస ఫార్ములా సీను) గోపాలం తండ్రిగా సుందరం పేరు చెప్పి వదిలేశారు తప్పితే- అసలు లేడీస్ టైలర్ సుందరంని ఒక లెజెండ్ గా ఎస్టాబ్లిష్ చేసింది లేదు.  అతడి నిలువెత్తు చిత్ర పటం  ముందు గోపాలం, ఇతడి మేనమామ పాపారావూ నిలబడి ఒక శపధం చేసి వుంటే కథ ఎత్తుగడ ఎంతో ఉత్సుకత రేపేది, కాన్సెప్ట్ మెచ్యూర్డ్ గా వుండేది. కానీ వంశీ తన కాన్సెప్ట్ ని కేవలం లేడీస్ టైలర్ కొడుకు ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలనే మెచ్యూరిటీ కన్పించని  ఉత్త కామెడీకి సరిపుచ్చేశారు.  సామాజిక నేపధ్యాలతో ముడిపడిన వృత్తుల్ని సమాజానికి దూరం చేసి ఫార్ములా కథలు వండితే అది ఇలాటి సినిమాకి బలం కాదు. ఇందుకే ఇది కామెడీగా వుంటూనే శంకరాభరణం, దంగల్ లలాంటి విలువల పరిరక్షణా ధ్యేయం గల బలమైన కాన్సెప్ట్ కాలేకపోయింది. 

       టైలర్లు కుట్టుమిషన్ని కనుగొన్న ఎలియాస్ హోవ్ చిత్రపటం పెట్టుకుని పూజిస్తారు. పుట్టిన రోజు వేడుక కూడా జరుపుకుంటారు. ఆ కుట్టుమిషన్ కార్పొరేటీకరణతో పొట్టకి పనికి రాకుండా పోయింది. చేతివృత్తుల్ని అల్లకల్లోలం చేస్తున్నకార్పొరేటీకరణ ప్రభంజనం మీద ‘కుబుసం’ లో ‘పల్లె కన్నీరు పెడుతుందో’  పాట గుర్తుండే వుంటుంది. దీనికి టైలరింగ్ అతీతం కాదు. 

          పాత విలువలకీ కొత్త పోకడలకీ మధ్య సంఘర్షణ ఎప్పుడూ వుంటుంది. ఈ ట్రాప్ లో రచయితలు, దర్శకులు పడితే ముందుకు పోలేరు. సంఘర్షణ పాత్రల మధ్య పెట్టడం వరకే గానీ, వ్యక్తిగతంగా కొత్తా పాతా ఇగోలు  పెట్టుకుంటే పాత దగ్గరే ఆగిపోతారు. కళాకారుడికి కొత్తా పాతా లేదు. ఒక్కటే వుంది-  న్యూట్రాలిటీ. దీంతో  అతను రెండిటినీ మేనేజ్ చేస్తూంటాడు. లేకపోతే  శంకరాభరణం, దంగల్ ల లాంటివి క్రియేట్ చేయలేరు. ఈ రెండూ పాత విలువలకీ కొత్త పోకడలకీ మధ్య సంఘర్షణ పెట్టి ఖ్యాతి కెక్కాయి. ఈ సంఘర్షణే లేడీస్ టైలర్ సుందరం, కొడుకు గోపాలం, మేనమామ పాపారావు ఎదుర్కోవాలి నిజానికి. 

          ఏ కుట్టు మిషన్ తో సుందరం ఆనాడు లేడీస్ టైలర్ గా పాపులరయ్యాడో, ఆ వృత్తి ప్రతిపత్తిని నిలబెట్టాలన్న  పట్టుదల పెరగాలి నిజానికి  వారసులకి. ఈ పట్టుదల (గోల్) లేకుండా ఈసురోమని అదే అరుగుల మీద అలాగే కూర్చుని (బాక్సాఫీసు అప్పీల్ కి వ్యతిరేకంగా) కుట్టుకుంటూంటే, దీన్ని వదిలేసి నరసాపురంలో ఫ్యాషన్ డిజైనింగ్ షాపు పెట్టాలనుకుంటే వారసత్వానికీ, లెజెండ్ సుందరం విలువలకీ నిలువునా పాతరేసినట్టే!

          కాన్సెప్ట్ ఇలా వుండదు- ముందు స్ట్రగుల్ వుండాలి, ఆ తర్వాత రియలైజేషన్ వుండాలి.  ఈ వృత్తిలో పరిణామ  దశలున్నాయి. వీటిలోంచే కాన్సెప్ట్ పుట్టాలి. సీక్వెల్  అన్నాక మొదటి దాని పాత్ర లోంచే కథ పుట్టాలి. అప్పుడు ట్రాన్సిషన్ బలంగా వుంటుంది (ఇలా జరక్కపోవడం వల్ల  జరిగిన ఇంకో అనర్ధమేమిటో కూడా  తర్వాత చూద్దాం). గోపాలం తండ్రితో కటాఫ్ అయిపోయి తాడూబొంగరం లేని పాత్రగా ఫ్యాషన్ డిజైనర్ నంటూ  పక్కదారి పట్టాడు. కానీ బాధ్యతగల కొడుకుగా తండ్రి వారసత్వాన్ని నిలబెట్టాలనుకుంటే, ఫ్యాషన్ డిజైనింగ్ తో సంఘర్షించే వాడు. తన పాత విలువల్ని ప్రశ్నార్ధకం చేస్తున్న   అభివృద్ధితో  సంఘర్షించేవాడు. తర్వాత పాత విలువలు అభివృద్ధి నుంచి వేర్పడకుండా కలిసి కొనసాగితే రెండూ మనుగడలో బలంగా,  పరిపుష్టంగా వుంటాయని తెలుసుకునే వాడు.  శంకరాభరణం, దంగల్ ల లోనిది రొటీన్ గా పాత విలువల విజయమే. కానీ ప్రాక్టికల్ గా అభివృద్ధి మీద పాత  విలువలు విజయం సాధించడం సాధ్యంకాదు. పాతవిలువల్ని కాదని అభివృద్ధి ముందుకెళ్ళి పోతుంది, ఆగదు. పాతవిలువలు అభివృద్ధికి చేయందిస్తే అభివృద్ధి విలువలుగల అభివృద్ధి అవుతుంది. ఒంటరి అయిపోకుండా పాతవిలువల పరువుకూడా దక్కుతుంది. విన్ స్టన్ చర్చిల్ చెప్పిందిదే- గొర్రెల మంద అనే నూతన  పోకడల్ని పాత  విలువలనే ములుగర్రతో పొడుస్తూ వుండకపోతే ఆ గొర్రెలమంద కుదురుగా వుండక చెల్లా చెదురై పోతుందని!  కొత్తని తిట్టుకుంటూ ములుగర్రని దాచుకుంటే, ఆ కొత్త అనే గొర్రెలు లారీల కిందా, బస్సుల కిందా పడి చచ్చిపోతాయి! ఇక పాతతరం ఉత్పత్తి చేయలేకా, కొత్త తరం మార్గనిర్దేశం లేక చచ్చిపోయీ ప్రపంచం ఆగిపోతుంది. 

         ఇలా ఈ స్ట్రగుల్ కీ రియలైజేషన్ కీ మధ్య గోపాలం కథ నడవాలి. అది కామెడీగానూ కావొచ్చు,  సెటైరికల్  గానూ కావొచ్చు. 

          ఇక లేడీస్ టైలర్ పాత్రలోంచి దాని సీక్వెల్ ఫ్యాషన్ డిజైనర్ కథ పుట్టకపోవడంతో  జరిగిన ఇంకో అనర్ధం  ఏమిటంటే, దర్శకుడు లేడీస్ టైలర్ నుంచే ఏమీ నేర్చుకోనట్టే అన్నట్టు తయారయ్యింది. దీంతో సుందరం, గోపాలం ఇద్దరి కథలూ ఒకేలా తయారయ్యాయి.

లేడీస్ టైలర్ కథ :
          సుందరం (రాజేంద్రప్రసాద్) మంచి డిమాండ్ లో వున్న లేడీస్ టైలర్. కానీ ఆ పని మీద శ్రద్ధ పెట్టడు. ఏదో అదృష్టం తగిలి ధనవంతుణ్ణి అవుతానని కలలు గంటూంటాడు.  ఒక జ్యోతిష్కుడు తగిలి తొడ మీద పుట్టు మచ్చ వున్న  అమ్మాయిని చేసుకుంటే బాగా కలిసి వస్తుందని చెప్పేసరికి,  అలాటి పుట్టుమచ్చ వున్న అమ్మాయి వేటలో పడతాడు సుందరం. పుట్టు మచ్చ చూడ్డం కోసం ఎందరో  అమ్మాయిల్ని మభ్యపెడతాడు. పెళ్ళికోసం వెంట బడుతున్న  అమ్మాయిల మధ్య ఇరుక్కుని అప్పుడు తప్పు తెలుసుకుంటాడు. వాళ్ళకి  నిజం చెప్పేసి క్షమాపణ వేడుకుంటాడు. తను నిజంగా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. 

ఫ్యాషన్ డిజైనర్ కథ:
          గోపాలం నరసాపురంలో షాపు పెట్టుకుని ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలనుకుంటాడు. పెట్టుబడికి డబ్బులేదు. డబ్బున్న అమ్మాయిని చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అప్పుడొక జ్యోతిష్కుడు అతడి చేయి చూసి మన్మధ రేఖ వుందనీ, దీంతో ఏ అమ్మాయినైనా లోబర్చుకోవచ్చనీ చెప్తాడు. దీంతో గోపాలం ముందొక అమ్మయిని  ప్రేమలో పడేసుకుని, ఆమెకంటే డబ్బున్న అమ్మాయి కన్పించడంతో ఆమె వెంట పడి, ఈమె కంటే ఇంకా ఆస్తి వున్న అమ్మాయి కన్పించేసరికి ఆమె వెంటాపడి అల్లరై, తప్పు తెలుసుకుని నిజంగా ఫీలైన అమ్మాయిని చేసుకుంటాడు. 

          ఈ రెండు కథలకీ తేడా ఏముంది?  లేడీస్ టైలర్ దాని సీక్వెల్ ల్ రెండిటి కథలూ ఒకేలా ఎలా వుంటాయి. తండ్రి చేసిన తప్పే కొడుకు కూడా చేస్తే, తండ్రి నుంచి కొడుకేం నేర్చుకోలేదా? లేక తండ్రెవరో తెలీదా? ఇది సీక్వెల్ లా లేదు. కొన్ని మార్పులతో లేడీస్ టైలర్ కి రీమేక్ లా వుంది. లేడీస్ టైలర్ పాత్రలోంచి సీక్వెల్ కథ పుడితే ఫ్యాషన్ డిజైనర్ వ్యవహారం వేరేగా వుండేది.  కథ ముందుకెళ్ళేది. కానీ 30 ఏళ్లుగా ఎక్కడేసిన గొంగళి లాగే వున్నాయి తండ్రీ కొడుకుల కథలు. 

          మేకింగ్ ని లేడీస్ టైలర్ తో పోల్చలేం. ఆ రోజులు, అప్పుడు వంశీతో కలిసిన ప్రేక్షకుల అభిరుచులూ వేరు. ఇప్పుడు వేరు. ఇప్పుడు వంశీ ఎవరో తెలీదు. మళ్ళీ ఒక కొత్త దర్శకుడుగా కొత్త  వాళ్ళతో పోటీ పడుతూ, కొత్త ప్రేక్షకుల ముందుకు  రావాలే  తప్ప, అవే  పాత  అభిరుచులు కొనసాగిస్తే కుదురుతుందా? సంజయ్ గుప్తా ఒక తరానికి వర్కౌట్ అయిన తన అభిరుచులతో తీసీ తీసీ, కొంతకాలానికి తన సమయం ఐపోయి, మళ్ళీ లేచి కొత్త తరం అభిరుచులు తనవిగా చేసుకుని, ఇటీవల ‘కాబిల్’ తీసి  ఆశ్చర్య పర్చాడు. ఆనాటి తన మేకింగ్ కీ, దర్శకత్వానికీ నేటికీ పోలికే లేదు.

          డేవిడ్ ధావన్ కూడా కామెడీలు తీసీ తీసీ,  తన కాలం ఐపోయిందన్పించి కనుమరుగై,  ఐదేళ్ళ తర్వాత  స్టయిలిష్ ‘పార్టనర్’ తో వచ్చి ఒక వూపు వూపాడు. 

          ప్రకృతి నటించదు.అది మారదు. దాని ముందు నర్తించే మనుషులే మారుతూంటారు. ఒక్కో కాలంలో ఒక్కోలా నర్తిస్తారు. కానీ కోనసీమ, పాపికొండలు, గోదావరీ తీరాల్లో వంశీ పాత్రలు ఇంకా అవే లేడీస్ టైలర్ నాటి నటనలతో, మాటలతో, పాటలతో అడిపాడి అలరించాలనుకుంటాయి. పాత్రలు మామూలుగా నిలబడి మాట్లాడవు, అవి నాట్య భంగిమల్ని ప్రదర్శిస్తూ వెటకారంగా మాట్లాడతాయి. ఈ పాత్రల బృహన్నల సిండ్రోంని ఆనాటి వంశీ అభిమానులైతే అర్ధం జేసుకోగలరుగానీ, కొత్త ప్రేక్షకుడు అర్ధంగాక ఇదేం  సినిమారా బాబూ అని సింక్ అవక పక్క సీట్లో నలుగుతూంటాడు. 

       కామెడీ కూడా ఒక పంచ్ డైలాగుకి  కిందపడి గిల గిలా కొట్టుకోవడం, లాగి కొట్టినప్పుడల్లా ఎక్కడో వెళ్లి పడ్డమనే ట్రెండ్ ఇంకా వుందా?  ఒకతరానికి సమకాలీనత కారణంగా  తన అభిరుచులతో సక్సెస్ ఫుల్ గా కనెక్ట్ అవగల్గిన వంశీ, ఇప్పుడు వచ్చేసి సక్సెస్ కోసం నేటి తరం అభిరుచులతో తను కనెక్ట్ అవ్వాలన్న విషయం మర్చిపోయారు. ఇంకా నేనే ఇస్తాను నువ్వే తీసుకోవాలని తలంటు పోస్తే ఎలా? పాటలకి గోదారి తీరాన అవే వెదురు పాకలు, రకరకాల జెండాలు ఇంకానా? పాటలకి అవుట్ డోర్ లో సెట్స్ ఎవరేస్తున్నారిప్పుడు? వెనుక సీట్లో కూర్చున్న నడివయసు ప్రేక్షులకి కూడా నచ్చలేదిది. సినిమా సాంతం దేనికో ఒకదానికి కామెంట్లు  చేస్తూనే వున్నారు. 

          హీరో సుమంత్ అశ్విన్ నటించింది ఇప్పుడు బాక్సాఫీస్ అప్పీలు గానీ, యూత్ అప్పీలు గానీ ఏమాత్రం లేని వెనుకబడిన పల్లెటూరి పాత్ర. ఇలాటి పాత్రల కాలం ఎప్పుడో తీరింది. గోపాలం అనే పాతకాలం పేరు కూడా యూత్ కి కనెక్ట్ కాదు.  సుమంత్ అశ్విన్ గత మూవీ ‘రైట్ రైట్’ లో కూడా ఇదే తప్పు జరిగింది. యూత్ అప్పీల్ లేని పల్లెటూరి బస్సు కండక్టర్ పాత్ర వేశాడు. 

          ఫ్యాషన్ డిజైనర్ లో  ఈ పాత  వెనుకబడిన వెలసిపోయిన పాత్రే,  సంఘర్షణతో కూడి వుంటే పాత వాసనేయకుండా ఆసక్తికరంగా వుండేది-  ఎందుకంటే ఆధునికత్వంతో సంఘర్షిస్తూంటాడు కాబట్టి. ఈ రోజుల్లో ఒక బడ్జెట్ మూవీని సక్సెస్ చేయాలంటే లక్ష కోణాల్లో ఆలోచించాలి. పాత  రోజుల్లో సినిమాలకి ఇతర దృశ్య మాధ్యమాల పోటీ  లేదు కాబట్టి ఎలా తీసినా నడిచిపోయేది.

          సుమంత్ సంఘర్షించడానికి ఎదుటి పాత్ర కూడా లేదు. అమ్మాయిలతో కష్టా లొచ్చేసరికి తనే సమస్యలో పడి తనే మారడంతో తీరిపోతుంది సమస్య. ఇదంతా ప్రేమల గురించి. కానీ ఇటీవల కాలంలో ప్రేమ సినిమాలే ఆడడం లేదు. మార్కెట్ యాస్పెక్ట్ లో చూస్తే దీనికి సేలబిలిటీ లేదు, క్రియేటివ్ యాస్పెక్ట్ చూస్తే పైన చెప్పుకున్న విధంగా వుంది. ఈ రెండు యాస్పెక్ట్స్ ని కాదని ఏ సినిమా నిలబడుతుంది?

- సికిందర్
http://www.cinemabazaar.in