రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

4, జూన్ 2017, ఆదివారం





        డార్క్ మూవీస్ మేకింగ్ గురించి ఇంకో నాల్గు వ్యాసాలు రావాలి ముందనుకున్న ప్రకారం. కానీ వచ్చిన వ్యాసాలకి  సరైన ప్రతిస్పందన లేకపోవడం, ఎవరిలోనూ ఈ జానర్ పట్ల ఆసక్తి లేకపోవడం గమనించి వీటిని ఆపివేస్తున్నాం. ఇప్పటి తెలుగు మేకర్లకి ఈ కమర్షియల్ జానర్ అర్ధంగాకపోవడమే  నిరాసక్తతకి  మూల కారణం. అటు తమిళ మలయాళంలలో,  ఇంకా అటు హిందీలో ఈ జానర్ కొత్త వసూళ్ళ వనరవుతుందని గమనించి, దీని రూపు రేఖల్ని అర్ధం జేసుకుని, విజయవంతంగా తెలుగులో కూడా ఆడించుకుంటున్నారు. అంటే తెలుగు ప్రేక్షకులకి ఈ జానర్ అర్ధమౌతోందన్నమాట, కానీ ఇప్పటి తెలుగు మేకర్లకే అర్ధంగావడం లేదు. ఇప్పటి తెలుగు మేకర్లకి చిన్నబడ్జెట్ లో అర్ధమయ్యే జానర్లు మూడే మూడని తెలుస్తోంది : రోమాంటిక్ కామెడీలు, దెయ్యం కామెడీలు, యాక్షన్ కథలు. మొదటి రెండూ వరసగా ఫ్లాపులు మూటగట్టుకుంటున్నా సరే, మార్కెట్ స్పృహ లేకుండా వీటినే తీయడానికి ఇష్టపడుతున్నారు. వీటిని తీయడానికి పెద్దగా  టాలెంట్ అవసరం లేకపోవడం వల్ల  కూడా  కావొచ్చు. 

          ఇక యాక్షన్ జానర్ లో  గత రెండు మూడు వారాల్లోనే  వెంకటా పురం, కేశవ, అంధగాడు వచ్చాయి. సస్పెన్స్ తో కూడిన డార్క్ మూవీస్ కంటే సస్పెన్స్ తో కూడిన యాక్షన్ కథలే  ఇప్పటి తెలుగు మేకర్లకి బాగా అర్ధమవుతాయని  దీన్ని బట్టి అనుకోవాలి.  ఐతే ఇవైనా సరైన స్ట్రక్చర్, యాక్షన్ మూవీ డైనమిక్స్, సస్పెన్స్ పోషణ తెలిసి కొత్త పాయింట్లతో తీస్తే మంచిదే. తెలుసుకోకుండా ఇష్టారాజ్యంగా  ఇమ్మెచ్యూర్డ్ గా తీస్తూపోతే  ఈ  యాక్షన్ జానర్ కూడా ఏడాది తిరక్కుండా ప్రేక్షకుల తిరస్కారానికి గురవుతుంది. ఇక్కడ పంచ్ లైన్ ఏమిటంటే, డార్క్ మూవీస్ జానర్ అర్ధమైతే గానీ యాక్షన్ మూవీస్ ని సమర్ధవంతంగా తీయలేరు, దట్సాల్!  ఎమ్సెట్  రాయకుండా బీటెక్ చేయలేరు కదా! సో అల్ ది బెస్ట్ టు ఆల్ యాక్షన్ మూవీ మేకర్స్!


-సికిందర్

3, జూన్ 2017, శనివారం

రివ్యూ!





రచనదర్శకత్వం : వంశీ
తారాగణం :  సుమంత్అశ్విన్, అనీషా అంబ్రోస్, మనాలీ రాథోడ్, మానస, వంశీరాజ్, కృష్ణ భగవాన్, రాఘవేంద్ర తదితరులు
సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం :నగేష్బనెల్లా
నిర్మాణ సంస్థ: మధుర ఎంటర్టైన్మెంట్
నిర్మాత: మధుర శ్రీధర్రెడ్డి
విడుదల : 2 జూన్,2017
***
     
వంశీ అంటే గోదావరి, పాపికొండలు, పడవలు, పడుచులు, పోటుగాళ్ళు, గోదావరి యాస, హాస్యం, వ్యంగ్యం, వెటకారం, నాట్యభంగిమల నటనలు, ఇళయరాజా పాటలు. ఇది గతం.
        వంశీ అంటే గోదావరి, పాపికొండలు, పడవలు, పడుచులు, పోటుగాళ్ళు, గోదావరి యాస, హాస్యం, వ్యంగ్యం, వెటకారం, నాట్యభంగిమల నటనలు, ఇళయరాజా పాటల్లాంటి పాటలు. ఇది ప్రస్తుతం.
          గతం 1980 ల నాటి కాలం, ప్రస్తుతం ముప్ఫయ్యేళ్ళు గడిచిపోయిన టైం లాప్స్.
          సినిమాల్లో టైం లాప్స్ తో సీను మారుతుంది. వంశీతో మారలేదు. ఆయన టైం లైన్ లో సీను 1980 ల దగ్గరే ఫ్రీజ్ అయిపోయి వుంటుంది. ఈ సీసులో మన ప్రతిబింబాలెక్కడా అని మారుతున్న తరాల ప్రేక్షకులు వెతుక్కునే పరిస్థితి. 

          లేడీస్ టైలర్ కొడుకు టైలరింగ్ నుంచి ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలనుకోవడానికి  మధ్య ఒక దశ వుంది- అది రెడీమేడ్ దుస్తులొచ్చేసి- యారో, పార్క్ ఎవెన్యూ,  లెవీస్ లాంటి గ్లోబల్ సంస్థల షోరూములు అసంఖ్యాకంగా వెలసి, ఆడవాళ్ళకి బొథిక్స్ తెర్చుకుని, చేతి వృత్తి టైలరింగ్  తెల్లారిపోయిన దశ.  ఈ దశ  సినిమా ఫీల్డులో కాస్ట్యూమ్స్  కుట్టే టైలర్స్ కి కూడా వచ్చింది. సినిమా ఫీల్డులో టైలర్స్ ఫ్యాషన్ డిజైనర్ల ధాటికి తట్టుకోలేకపోతే, వూళ్ళల్లో  రెడీ మేడ్ దుస్తుల ట్రెండ్ కి  దెబ్బతిన్నారు.   అంటే లేడీస్ టైలర్ సుందరం కొడుకు గోపాలంకి ఇప్పుడు పాతికేళ్ళనుకుంటే, అతడికి పదేళ్ళొచ్చేటప్పటికే  వూళ్ళో టైలరింగ్ వృత్తే వుండి వుండకూడదు. అంటే అతడికి టైలరింగే తెలిసివుండకూడదు. ఈ దశని రికార్డు చేయలేదు వంశీ. 

          చేసి వుంటే ఇంకో స్థాయిలో వుండేది  సినిమా!  రియలిస్టిక్ గా,  పోనీ సెమీ రియలిస్టిక్ గా  వున్నప్పుడే బడ్జెట్ సినిమాకి బలం. రాజేంద్ర ప్రసాద్  1986 లో నటించిన లేడీస్ టైలర్ ఒక కల్ట్ క్యారక్టర్. అలాటి దానికి నేటి సీక్వెల్ లో స్థానం లేకుండా చేశారు. ప్రారంభంలో జనాభా లెక్కల అతను వచ్చి నప్పుడు ( జనాభా లెక్కల వాడి సీను చూసి చూసి వున్న  పాత మూస ఫార్ములా సీను) గోపాలం తండ్రిగా సుందరం పేరు చెప్పి వదిలేశారు తప్పితే- అసలు లేడీస్ టైలర్ సుందరంని ఒక లెజెండ్ గా ఎస్టాబ్లిష్ చేసింది లేదు.  అతడి నిలువెత్తు చిత్ర పటం  ముందు గోపాలం, ఇతడి మేనమామ పాపారావూ నిలబడి ఒక శపధం చేసి వుంటే కథ ఎత్తుగడ ఎంతో ఉత్సుకత రేపేది, కాన్సెప్ట్ మెచ్యూర్డ్ గా వుండేది. కానీ వంశీ తన కాన్సెప్ట్ ని కేవలం లేడీస్ టైలర్ కొడుకు ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలనే మెచ్యూరిటీ కన్పించని  ఉత్త కామెడీకి సరిపుచ్చేశారు.  సామాజిక నేపధ్యాలతో ముడిపడిన వృత్తుల్ని సమాజానికి దూరం చేసి ఫార్ములా కథలు వండితే అది ఇలాటి సినిమాకి బలం కాదు. ఇందుకే ఇది కామెడీగా వుంటూనే శంకరాభరణం, దంగల్ లలాంటి విలువల పరిరక్షణా ధ్యేయం గల బలమైన కాన్సెప్ట్ కాలేకపోయింది. 

       టైలర్లు కుట్టుమిషన్ని కనుగొన్న ఎలియాస్ హోవ్ చిత్రపటం పెట్టుకుని పూజిస్తారు. పుట్టిన రోజు వేడుక కూడా జరుపుకుంటారు. ఆ కుట్టుమిషన్ కార్పొరేటీకరణతో పొట్టకి పనికి రాకుండా పోయింది. చేతివృత్తుల్ని అల్లకల్లోలం చేస్తున్నకార్పొరేటీకరణ ప్రభంజనం మీద ‘కుబుసం’ లో ‘పల్లె కన్నీరు పెడుతుందో’  పాట గుర్తుండే వుంటుంది. దీనికి టైలరింగ్ అతీతం కాదు. 

          పాత విలువలకీ కొత్త పోకడలకీ మధ్య సంఘర్షణ ఎప్పుడూ వుంటుంది. ఈ ట్రాప్ లో రచయితలు, దర్శకులు పడితే ముందుకు పోలేరు. సంఘర్షణ పాత్రల మధ్య పెట్టడం వరకే గానీ, వ్యక్తిగతంగా కొత్తా పాతా ఇగోలు  పెట్టుకుంటే పాత దగ్గరే ఆగిపోతారు. కళాకారుడికి కొత్తా పాతా లేదు. ఒక్కటే వుంది-  న్యూట్రాలిటీ. దీంతో  అతను రెండిటినీ మేనేజ్ చేస్తూంటాడు. లేకపోతే  శంకరాభరణం, దంగల్ ల లాంటివి క్రియేట్ చేయలేరు. ఈ రెండూ పాత విలువలకీ కొత్త పోకడలకీ మధ్య సంఘర్షణ పెట్టి ఖ్యాతి కెక్కాయి. ఈ సంఘర్షణే లేడీస్ టైలర్ సుందరం, కొడుకు గోపాలం, మేనమామ పాపారావు ఎదుర్కోవాలి నిజానికి. 

          ఏ కుట్టు మిషన్ తో సుందరం ఆనాడు లేడీస్ టైలర్ గా పాపులరయ్యాడో, ఆ వృత్తి ప్రతిపత్తిని నిలబెట్టాలన్న  పట్టుదల పెరగాలి నిజానికి  వారసులకి. ఈ పట్టుదల (గోల్) లేకుండా ఈసురోమని అదే అరుగుల మీద అలాగే కూర్చుని (బాక్సాఫీసు అప్పీల్ కి వ్యతిరేకంగా) కుట్టుకుంటూంటే, దీన్ని వదిలేసి నరసాపురంలో ఫ్యాషన్ డిజైనింగ్ షాపు పెట్టాలనుకుంటే వారసత్వానికీ, లెజెండ్ సుందరం విలువలకీ నిలువునా పాతరేసినట్టే!

          కాన్సెప్ట్ ఇలా వుండదు- ముందు స్ట్రగుల్ వుండాలి, ఆ తర్వాత రియలైజేషన్ వుండాలి.  ఈ వృత్తిలో పరిణామ  దశలున్నాయి. వీటిలోంచే కాన్సెప్ట్ పుట్టాలి. సీక్వెల్  అన్నాక మొదటి దాని పాత్ర లోంచే కథ పుట్టాలి. అప్పుడు ట్రాన్సిషన్ బలంగా వుంటుంది (ఇలా జరక్కపోవడం వల్ల  జరిగిన ఇంకో అనర్ధమేమిటో కూడా  తర్వాత చూద్దాం). గోపాలం తండ్రితో కటాఫ్ అయిపోయి తాడూబొంగరం లేని పాత్రగా ఫ్యాషన్ డిజైనర్ నంటూ  పక్కదారి పట్టాడు. కానీ బాధ్యతగల కొడుకుగా తండ్రి వారసత్వాన్ని నిలబెట్టాలనుకుంటే, ఫ్యాషన్ డిజైనింగ్ తో సంఘర్షించే వాడు. తన పాత విలువల్ని ప్రశ్నార్ధకం చేస్తున్న   అభివృద్ధితో  సంఘర్షించేవాడు. తర్వాత పాత విలువలు అభివృద్ధి నుంచి వేర్పడకుండా కలిసి కొనసాగితే రెండూ మనుగడలో బలంగా,  పరిపుష్టంగా వుంటాయని తెలుసుకునే వాడు.  శంకరాభరణం, దంగల్ ల లోనిది రొటీన్ గా పాత విలువల విజయమే. కానీ ప్రాక్టికల్ గా అభివృద్ధి మీద పాత  విలువలు విజయం సాధించడం సాధ్యంకాదు. పాతవిలువల్ని కాదని అభివృద్ధి ముందుకెళ్ళి పోతుంది, ఆగదు. పాతవిలువలు అభివృద్ధికి చేయందిస్తే అభివృద్ధి విలువలుగల అభివృద్ధి అవుతుంది. ఒంటరి అయిపోకుండా పాతవిలువల పరువుకూడా దక్కుతుంది. విన్ స్టన్ చర్చిల్ చెప్పిందిదే- గొర్రెల మంద అనే నూతన  పోకడల్ని పాత  విలువలనే ములుగర్రతో పొడుస్తూ వుండకపోతే ఆ గొర్రెలమంద కుదురుగా వుండక చెల్లా చెదురై పోతుందని!  కొత్తని తిట్టుకుంటూ ములుగర్రని దాచుకుంటే, ఆ కొత్త అనే గొర్రెలు లారీల కిందా, బస్సుల కిందా పడి చచ్చిపోతాయి! ఇక పాతతరం ఉత్పత్తి చేయలేకా, కొత్త తరం మార్గనిర్దేశం లేక చచ్చిపోయీ ప్రపంచం ఆగిపోతుంది. 

         ఇలా ఈ స్ట్రగుల్ కీ రియలైజేషన్ కీ మధ్య గోపాలం కథ నడవాలి. అది కామెడీగానూ కావొచ్చు,  సెటైరికల్  గానూ కావొచ్చు. 

          ఇక లేడీస్ టైలర్ పాత్రలోంచి దాని సీక్వెల్ ఫ్యాషన్ డిజైనర్ కథ పుట్టకపోవడంతో  జరిగిన ఇంకో అనర్ధం  ఏమిటంటే, దర్శకుడు లేడీస్ టైలర్ నుంచే ఏమీ నేర్చుకోనట్టే అన్నట్టు తయారయ్యింది. దీంతో సుందరం, గోపాలం ఇద్దరి కథలూ ఒకేలా తయారయ్యాయి.

లేడీస్ టైలర్ కథ :
          సుందరం (రాజేంద్రప్రసాద్) మంచి డిమాండ్ లో వున్న లేడీస్ టైలర్. కానీ ఆ పని మీద శ్రద్ధ పెట్టడు. ఏదో అదృష్టం తగిలి ధనవంతుణ్ణి అవుతానని కలలు గంటూంటాడు.  ఒక జ్యోతిష్కుడు తగిలి తొడ మీద పుట్టు మచ్చ వున్న  అమ్మాయిని చేసుకుంటే బాగా కలిసి వస్తుందని చెప్పేసరికి,  అలాటి పుట్టుమచ్చ వున్న అమ్మాయి వేటలో పడతాడు సుందరం. పుట్టు మచ్చ చూడ్డం కోసం ఎందరో  అమ్మాయిల్ని మభ్యపెడతాడు. పెళ్ళికోసం వెంట బడుతున్న  అమ్మాయిల మధ్య ఇరుక్కుని అప్పుడు తప్పు తెలుసుకుంటాడు. వాళ్ళకి  నిజం చెప్పేసి క్షమాపణ వేడుకుంటాడు. తను నిజంగా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. 

ఫ్యాషన్ డిజైనర్ కథ:
          గోపాలం నరసాపురంలో షాపు పెట్టుకుని ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలనుకుంటాడు. పెట్టుబడికి డబ్బులేదు. డబ్బున్న అమ్మాయిని చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అప్పుడొక జ్యోతిష్కుడు అతడి చేయి చూసి మన్మధ రేఖ వుందనీ, దీంతో ఏ అమ్మాయినైనా లోబర్చుకోవచ్చనీ చెప్తాడు. దీంతో గోపాలం ముందొక అమ్మయిని  ప్రేమలో పడేసుకుని, ఆమెకంటే డబ్బున్న అమ్మాయి కన్పించడంతో ఆమె వెంట పడి, ఈమె కంటే ఇంకా ఆస్తి వున్న అమ్మాయి కన్పించేసరికి ఆమె వెంటాపడి అల్లరై, తప్పు తెలుసుకుని నిజంగా ఫీలైన అమ్మాయిని చేసుకుంటాడు. 

          ఈ రెండు కథలకీ తేడా ఏముంది?  లేడీస్ టైలర్ దాని సీక్వెల్ ల్ రెండిటి కథలూ ఒకేలా ఎలా వుంటాయి. తండ్రి చేసిన తప్పే కొడుకు కూడా చేస్తే, తండ్రి నుంచి కొడుకేం నేర్చుకోలేదా? లేక తండ్రెవరో తెలీదా? ఇది సీక్వెల్ లా లేదు. కొన్ని మార్పులతో లేడీస్ టైలర్ కి రీమేక్ లా వుంది. లేడీస్ టైలర్ పాత్రలోంచి సీక్వెల్ కథ పుడితే ఫ్యాషన్ డిజైనర్ వ్యవహారం వేరేగా వుండేది.  కథ ముందుకెళ్ళేది. కానీ 30 ఏళ్లుగా ఎక్కడేసిన గొంగళి లాగే వున్నాయి తండ్రీ కొడుకుల కథలు. 

          మేకింగ్ ని లేడీస్ టైలర్ తో పోల్చలేం. ఆ రోజులు, అప్పుడు వంశీతో కలిసిన ప్రేక్షకుల అభిరుచులూ వేరు. ఇప్పుడు వేరు. ఇప్పుడు వంశీ ఎవరో తెలీదు. మళ్ళీ ఒక కొత్త దర్శకుడుగా కొత్త  వాళ్ళతో పోటీ పడుతూ, కొత్త ప్రేక్షకుల ముందుకు  రావాలే  తప్ప, అవే  పాత  అభిరుచులు కొనసాగిస్తే కుదురుతుందా? సంజయ్ గుప్తా ఒక తరానికి వర్కౌట్ అయిన తన అభిరుచులతో తీసీ తీసీ, కొంతకాలానికి తన సమయం ఐపోయి, మళ్ళీ లేచి కొత్త తరం అభిరుచులు తనవిగా చేసుకుని, ఇటీవల ‘కాబిల్’ తీసి  ఆశ్చర్య పర్చాడు. ఆనాటి తన మేకింగ్ కీ, దర్శకత్వానికీ నేటికీ పోలికే లేదు.

          డేవిడ్ ధావన్ కూడా కామెడీలు తీసీ తీసీ,  తన కాలం ఐపోయిందన్పించి కనుమరుగై,  ఐదేళ్ళ తర్వాత  స్టయిలిష్ ‘పార్టనర్’ తో వచ్చి ఒక వూపు వూపాడు. 

          ప్రకృతి నటించదు.అది మారదు. దాని ముందు నర్తించే మనుషులే మారుతూంటారు. ఒక్కో కాలంలో ఒక్కోలా నర్తిస్తారు. కానీ కోనసీమ, పాపికొండలు, గోదావరీ తీరాల్లో వంశీ పాత్రలు ఇంకా అవే లేడీస్ టైలర్ నాటి నటనలతో, మాటలతో, పాటలతో అడిపాడి అలరించాలనుకుంటాయి. పాత్రలు మామూలుగా నిలబడి మాట్లాడవు, అవి నాట్య భంగిమల్ని ప్రదర్శిస్తూ వెటకారంగా మాట్లాడతాయి. ఈ పాత్రల బృహన్నల సిండ్రోంని ఆనాటి వంశీ అభిమానులైతే అర్ధం జేసుకోగలరుగానీ, కొత్త ప్రేక్షకుడు అర్ధంగాక ఇదేం  సినిమారా బాబూ అని సింక్ అవక పక్క సీట్లో నలుగుతూంటాడు. 

       కామెడీ కూడా ఒక పంచ్ డైలాగుకి  కిందపడి గిల గిలా కొట్టుకోవడం, లాగి కొట్టినప్పుడల్లా ఎక్కడో వెళ్లి పడ్డమనే ట్రెండ్ ఇంకా వుందా?  ఒకతరానికి సమకాలీనత కారణంగా  తన అభిరుచులతో సక్సెస్ ఫుల్ గా కనెక్ట్ అవగల్గిన వంశీ, ఇప్పుడు వచ్చేసి సక్సెస్ కోసం నేటి తరం అభిరుచులతో తను కనెక్ట్ అవ్వాలన్న విషయం మర్చిపోయారు. ఇంకా నేనే ఇస్తాను నువ్వే తీసుకోవాలని తలంటు పోస్తే ఎలా? పాటలకి గోదారి తీరాన అవే వెదురు పాకలు, రకరకాల జెండాలు ఇంకానా? పాటలకి అవుట్ డోర్ లో సెట్స్ ఎవరేస్తున్నారిప్పుడు? వెనుక సీట్లో కూర్చున్న నడివయసు ప్రేక్షులకి కూడా నచ్చలేదిది. సినిమా సాంతం దేనికో ఒకదానికి కామెంట్లు  చేస్తూనే వున్నారు. 

          హీరో సుమంత్ అశ్విన్ నటించింది ఇప్పుడు బాక్సాఫీస్ అప్పీలు గానీ, యూత్ అప్పీలు గానీ ఏమాత్రం లేని వెనుకబడిన పల్లెటూరి పాత్ర. ఇలాటి పాత్రల కాలం ఎప్పుడో తీరింది. గోపాలం అనే పాతకాలం పేరు కూడా యూత్ కి కనెక్ట్ కాదు.  సుమంత్ అశ్విన్ గత మూవీ ‘రైట్ రైట్’ లో కూడా ఇదే తప్పు జరిగింది. యూత్ అప్పీల్ లేని పల్లెటూరి బస్సు కండక్టర్ పాత్ర వేశాడు. 

          ఫ్యాషన్ డిజైనర్ లో  ఈ పాత  వెనుకబడిన వెలసిపోయిన పాత్రే,  సంఘర్షణతో కూడి వుంటే పాత వాసనేయకుండా ఆసక్తికరంగా వుండేది-  ఎందుకంటే ఆధునికత్వంతో సంఘర్షిస్తూంటాడు కాబట్టి. ఈ రోజుల్లో ఒక బడ్జెట్ మూవీని సక్సెస్ చేయాలంటే లక్ష కోణాల్లో ఆలోచించాలి. పాత  రోజుల్లో సినిమాలకి ఇతర దృశ్య మాధ్యమాల పోటీ  లేదు కాబట్టి ఎలా తీసినా నడిచిపోయేది.

          సుమంత్ సంఘర్షించడానికి ఎదుటి పాత్ర కూడా లేదు. అమ్మాయిలతో కష్టా లొచ్చేసరికి తనే సమస్యలో పడి తనే మారడంతో తీరిపోతుంది సమస్య. ఇదంతా ప్రేమల గురించి. కానీ ఇటీవల కాలంలో ప్రేమ సినిమాలే ఆడడం లేదు. మార్కెట్ యాస్పెక్ట్ లో చూస్తే దీనికి సేలబిలిటీ లేదు, క్రియేటివ్ యాస్పెక్ట్ చూస్తే పైన చెప్పుకున్న విధంగా వుంది. ఈ రెండు యాస్పెక్ట్స్ ని కాదని ఏ సినిమా నిలబడుతుంది?

- సికిందర్
http://www.cinemabazaar.in


 
         
         
         
         


         



         
         
         
         
         



         

2, జూన్ 2017, శుక్రవారం

రివ్యూ!






రచన- దర్శకత్వంవెలిగొండ శ్రీనివాస్
తారాగణం: రాజ్తరుణ్, హెబ్బా పటేల్, రాజేంద్రప్రసాద్, రాజా రవీంద్ర,, ఆశీష్విద్యార్థి, సాయాజీ షిండే, సత్య, పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు
సంగీతంశేఖర్చంద్ర< ఛాయాగ్రహణం: బి.రాజశేఖర్
బ్యానర్ : .కె.ఎంటర్టైన్మెంట్స్
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
విడుదల: జూన్ 2, 2017
***
        ఏకే ఎంటర్ టైన్మెంట్స్ లో వరసగా రెండో సినిమా నటించిన రాజ్ తరుణ్ రోమాంటిక్ కామెడీల నుంచి దూరంజరిగి కామిక్ థ్రిల్లర్స్ వైపు మొగ్గుతున్నట్టు అన్పిస్తాడు. ఇదే బెటర్. కాకపోతే ఈ కామిక్ థ్రిల్లర్స్ కూడా పాత వాసనేయడం తన ప్రత్యేకతగా నిలబెట్టు
కుంటున్నాడు. ఈ సినిమాతో దర్శకుడైన రచయిత  వెలిగొండ శ్రీనివాస్ కి ఇప్పుడు  కావలసిన స్వేచ్ఛ అంతా లభించింది. తాను అనుకున్నది అనుకున్నట్టు తెరకెక్కించే అవకాశం లభించింది. ఈ అవకాశంతో దర్శకుడుగా తానేం తేడా చూపించాడో, రాజ్ తరుణ్ కూడా తన అభిమానులని ఎలా అలరించాడో ఈ కింద చూద్దాం. 

కథ : 
       పుట్టుకతో అంధుడైన గౌతమ్ (రాజ్ తరుణ్) అనాధాశ్రమంలో నేస్తాలతో పెరుగుతాడు. ఆ నేస్తాలు ముగ్గురికీ చూపు తెప్పించే చికిత్సకి అవకాశం రావడంతో తను తప్పుకుని నేస్తాలనే పంపిస్తాడు. పెద్దయ్యాక రేడియో జాకీ గా పనిచేస్తూ నేత్ర ( హెబ్బా పటేల్ ) అనే కళ్ళ డాక్టర్ తో ప్రేమలో పడతాడు. తన అంధత్వం బయట పడకుండా నటిస్తూంటాడు. ఓ రోజు ఆమెకి తెలిసిపోతుంది. అప్పుడు కులకర్ణి (రాజేంద్ర ప్రసాద్) అనే అతను యాక్సిడెంట్ కి గురై చనిపోవడంతో,  అతడి కళ్ళు గౌతమ్ కి మర్చి చూపు తెప్పిస్తుంది. అప్పటి నుంచీ గౌతమ్ వింతగా ప్రవర్తిస్తూంటాడు. అతణ్ణి కులకర్ణి  ఆత్మ పట్టుకుని హత్యలు చేయిస్తూంటుంది. దీంతో పిచ్చెత్తి పోయిన గౌతమ్ తిరగబడతాడు- అప్పుడేం జరిగిందనేది మిగతా కథ.  

ఎలావుంది కథ 
        వారంవారం చంపి పగదీర్చుకునే  వయొలెంట్ కథలతో యంగ్ హీరోలు క్యూలు కడుతున్నారు. ‘వెంకటాపురం’ తో రాహుల్ టికెట్ తెగింది,  తర్వాత వెంటనే మరుసటి వారం  ‘కేశవ’ తో  నిఖిల్ టికెట్ తెగింది. వారం గ్యాప్ ఇచ్చి  ఇప్పుడు రాజ్ తరుణ్ ‘అంధగాడు’ తో తన టికెట్ చించుకున్నాడు. రాబోయే వారాల్లో టికెట్లు పట్టుకుని ఇంకెదరున్నారో తెలీదు. ఇలా యాక్షన్ జానర్ కి మార్పు లేకుండా అదే పాత మోడల్ పగలనే  జోడిస్తూ పోవడంతో వరసగా ఈ రొటీన్ నే చూడాల్సి వస్తోంది. రోమాంటిక్ కామెడీల స్థానంలో ఈ రివెంజి కథలు  ఇంకొక ట్రెండ్ గా కొన్నాళ్ళు భయపెడతాయేమో అన్నట్టుంది. హృతిక్ రోషన్ ‘కాబిల్’ కూడా అంధుడి ప్రతీకారమే గానీ,  ఆ కథని కిందా మీదా, వెనకా ముందూ చేసి ఫ్లాష్ బ్యాకులతో గందరగోళం చేసి చెప్పలేదు. అతడికి జరిగిన అన్యాయాన్ని ఇప్పటికిప్పుడు జరుగుతున్నట్టుగా లైవ్ గానే  చూపిస్తూ, వెంటనే పగదీర్చుకోవడం కూడా ఇప్పటికిప్పుడు జరుగుతున్నట్టు లైవ్ గానే  చూపించడంతో దాని ఎమోషన్, డైనమిక్స్ అంత బలంగా వర్కౌట్ అయ్యాయి. ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యాయి. అన్యాయం ఎప్పుడో చిన్నప్పుడు జరిగిన చద్దన్నంలా వుంటే, దాని మీద ఎప్పుడో పెద్దయ్యాక హీరోకి ఎంత వేడి వేడి పగని రగిలించినా, ఈ రోజుల్లో లైవ్ గా ఫీల్ కారు యువప్రేక్షకులు. యూత్ కి ఏదైనా హాట్ హాట్ గా, లైవ్ గానే వుండాలి,  ఏనాటివో గతించిన కాలపు ఫ్లాష్ బ్యాకులు కాదు. కేసులు తెమలడానికి కోర్టుల్లో ఏళ్ల కేళ్ళు పడుతున్నట్టు- సినిమాల్లో కూడా ప్రతీకారాలు అంత కాలం తీసుకుంటే- వ్యవస్థకీ సినిమాలకీ తేడా ఏముంటుంది? పాతికేళ్ళ  తర్వాత హీరో గారు తీరిగ్గా పగని రీచార్జి చేసుకుని వస్తానంటే,  యువప్రేక్షకులకి ఈరోజుల్లో పిచ్చి పుల్లయ్యలాగే  కన్పిస్తాడు. నేటి హిట్ అండ్ రన్ తరానికి ఏదైనా తక్షణం జరిగిపోవాలి. కానీ వస్తున్న ఈ బాపతు ఫార్ములా రివెంజి డ్రామా- మెలోడ్రామా కథలు 1970 ల నాటివి. ‘కాబిల్’ దీన్ని నవీకరించి కాలానికి తగ్గట్టుగా హిట్ అండ్ రన్ చేసింది.

          ఈ సినిమాతో దర్శకుడైన వెలిగొండ శ్రీనివాస్ పాతస్కూలు రచయితే. చాలా పాత సినిమాలనే  మార్చి మార్చి రీసైక్లింగ్ చేసిన పాత స్కూలుకి చెందిన వాడే. రచయితగా తనకి స్వేచ్ఛ లేకపోయి వుండొచ్చు.  దర్శకుడయ్యాక చాలా స్వేచ్ఛా వాయువులు పీల్చుకుని వుండాలి. కానీ ఈ తేడా ఏమీ కన్పించడం లేదు. యథా రైటర్ కొలువు తథా డైరెక్టర్ పదోన్నతి.

ఎవరెలా చేశారు 
        రాజ్ తరుణ్ కి అంధుడిగా నటించేంత టాలెంట్ అప్పుడే లేదుగానీ, కళ్ళు వచ్చాక రాజేంద్రప్రసాద్  కోరల్లో చిక్కుకుని విలవిల్లాడే కామెడీయే అతడికి పట్టింది. హీరోయిన్ హెబ్బా పటేల్ తో అంధుడిగా బయటపడకుండా నటించే  విషయంలో కూడా బలహీనమే. ముందుగా రాజ్ తరుణ్ అంధత్వాన్ని నమ్మించగల్గితే అప్పుడీ పాత్రలో ఏమ  చేసినా చెల్లి పోతుంది. అంధుడి లానే అన్పించనప్పుడు  అంధ పాత్ర పోషించి ప్రయోజనం లేదు. ఆ పాత్ర, నటన, ఫస్టాఫ్ లో అంతా కృతకంగా, హడావిడిగా సాగిపోతాయి. ఫీలవడానికేమీ వుండదు. ఇక తన పాత్ర మూడు ఛేంజ్ ఓవర్స్ తో వుంటుంది : అంధుడుగా, కళ్ళు వచ్చాక రాజేంద్ర ప్రసాద్ బాధితుడిగా, చివర్లో పగదీర్చుకునే యాంగ్రీ యంగ్  మాన్ గా. వీటిలో చివరి రెండే తనకి సూటయ్యాయి. 

          హీరోయిన్ హెబ్బాపటేల్ కూడా డాక్టర్ గా నమ్మించలేకపోయింది. ఆమె డాక్టర్ అంటే ఎవ్వరూ నమ్మరు. యంగ్ నటికి కళ్ళజోడు పెట్టి హీరో అక్క అంటే ఎలా నమ్మమో, హెబ్బా పటేల్ కూడా తెల్లకోటు తగిలించుకున్నంత మాత్రాన డాక్టరై పోదు. మెడికో అవచ్చు. 

          రాజేంద్రప్రసాద్ తన కొట్టిన  పిండి అయిన కామిక్ సెన్సు, టైమింగ్ మొదలైన హాస్యాస్త్రాల్ని సంధిస్తూ అప్పుడప్పుడూ నవ్విస్తాడు. అయితే తన పాత్ర బతికున్నప్పుడు ఎలావుందో అలా కాక, చచ్చాక అంటే ఆత్మగా మారేక, మారాం చేసే చిన్న పిల్లాడిలా రాజ్ తరుణ్ ని వేధించుకు తిని పనిజరుపుకునేలా వుంటే,  హాస్యం ఇంకా బాగా వచ్చేది. మార్పు లేకుండా ఎంత సేపూ బెదిరిస్తూనే వుండడం వల్ల ఫన్ తగ్గింది. 

          ఇతరపాత్రల్లో సైకియాట్రిస్టుగా ఆశీష్ విద్యార్థి, పోలీస్ కమీషనర్ గా సాయాజీ షిండే, లాయర్ గా జయప్రకాశ్ రెడ్డి, అనాధాశ్రయం నిర్వాహకుడుగా పరుచూరి వెంకటేశ్వర రావు, విలన్ గా రాజా రవీంద్ర, హీరో ఫ్రెండ్ గా సత్య  రొటీన్ గానే కన్పిస్తారు. 

          పాటల్లో రెండో పాట, దాని చిత్రీకరణ, నాల్గో పాట, దాని చిత్రీకరణా బావున్నాయి. ఛాయాగ్రహణం, లోకేషన్స్, ఇతర ప్రొడక్షన్ విలువలు రిచ్ గా వున్నాయి. 

చివరికేమిటి 
       థ్రిల్లర్ ని ఫ్లాష్ బ్యాకులతో కన్ఫ్యూజ్ చేయాల్సిన అవసరం లేదు.  వెంకటాపురం, కేశవ కూడా ఈపనే చేశాయి. దీనివల్ల వీక్షణాసక్తి సన్నగిల్లుతుంది. ప్రేక్షకులకి  ఆలోచనలు రేకెత్తిస్తే మంచిదే గానీ, ఇలా జ్ఞాపకశక్తికి పరీక్షపెడితే ఫాలో అవడం మానేస్తారు. చివర్లో రాజ్ తరుణ్ సస్పెన్స్  ని విప్పుతూ- అప్పుడలా చేశానంటే ఇందుకు చేశాను, ఇప్పుడిలా చేస్తే కారణం అదిగో అప్పుడలా జరిగింది- లాంటి సవాలక్ష వివరణ లిస్తూ- మళ్ళీ ఆ సీన్లు చూపిస్తూ కథని  ‘సమప్’ చేసే బరువెత్తుకోవడం మాస్ మీడియా అయిన సినిమాకి పనికొస్తుందా? జరిగిపోయిన సంఘటనల్ని గుర్తు చేసుకుంటూ, కార్యకారణ  సంబంధాన్నిఊహించులోవాల్సిన మానసిక శ్రమ ప్రేక్షకులకి ఎందుకు? ఇది ‘ఆ ఒక్కడు’ నుంచీ బాగా రిపీటవుతోంది.  ఆ కట్ షాట్స్, మాంటేజెస్, ఫ్లాష్ బ్యాక్స్ తో శిరోభారం కల్గించడం తప్ప ఒరిగేదేమీ లేదు. గందరగోళానికి లోను చేయడం తప్ప మరేమీ కాదు.

          ఈ కథే రాజ్ తరుణ్ సెకండాఫ్ దాటి పోయేవరకూ చెప్పే సుదీర్ఘ ఫ్లాష్ బ్యాక్ తో సాగుతుంది. ఇందులో మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ ఫ్లాష్ బ్యాక్ వుంటుంది. ఇవి అయ్యాక, ప్రెజెంట్ లో కొచ్చి,  మళ్ళీ రాజ్ తరుణ్  చిన్ననాటి ఫ్లాష్ బ్యాక్ ఎత్తుకుంటాడు. ఇదయ్యాక అన్ని ఫ్లాష్ బ్యాకులనీ  తులనాత్మక విశ్లేషణ చేయడం మొదలెడతాడు- ఓ గాడ్!  సీదా సాదాగా స్ట్రెయిట్ గా చూపిస్తే బలంగా వుండే ఇంతోటి రివెంజి కథకి ఇన్ని కథన చాతుర్యాలా? ఇంత పాండిత్య ప్రకర్షా? 

          ఫస్టాఫ్ అంతా మళ్ళీ టెంప్లెట్ లాగే హీరోయిన్తో లవ్ ట్రాక్, గంట గడిచాక రాజేంద్ర ప్రసాద్ రాకతో కథ మొదలవుతుంది. షరామామూలుగా అప్పటించీ హీరోయిన్ మాయమై పోతుంది. కేవలం ప్రేమకి, పాటలకి వుంటుంది. 

          ఈ కామిక్ థ్రిల్లర్ లా  అనిపించే రివెంజి సినిమా ఒక్క రాజేంద్ర ప్రసాద్ వున్న మేరకే చాలా ఆసక్తి కల్గిస్తుంది, వినోద పరుస్తుంది. రాజేంద్ర ప్రసా కి ఆవల, ఈవల అంతా సోసో పాత ఫార్ములా సంగతులే.

- సికిందర్
http://www.cinemabazaar.in

         






31, మే 2017, బుధవారం

          టీవలి సంవత్సరాల్లో చూసుకుంటే, ఏడాదికి సుమారు వందమంది కొత్త దర్శకులు తెలుగులో రంగ ప్రవేశం చేస్తున్నారు. కొత్తగా వచ్చే దర్శకులెవరైనా బడ్జెట్ మూవీస్ తో మొదలవ్వాల్సిందే. రాను రాను కొత్త దర్శకుల బడ్జెట్ మూవీల సంఖ్యా పెరిగిపోతోంది. గత సంవత్సరమే రికార్డు స్థాయిలో 117 విడుదలయ్యాయి. అంటే 117 మంది కొత్త దర్శకులన్నమాట. వీళ్ళు తీస్తున్న బడ్జెట్ మూవీస్ సగటున వారానికి మూడు చొప్పున విడుదలవుతున్నాయి. మూడూ అట్టర్ ఫ్లాపవుతున్నాయి. వారం వారం ఓ ఐదారు కోట్లు బడ్జెట్ సినిమాల పేరిట కోల్పోతున్నాయి కనీసం మూడేసి బ్యానర్లు. ఏడాదికి 156 కోట్లు కోల్పోతున్నాయి సదరు బ్యానర్లు.  ఇందులో వ్యాపారం చేయరాక నష్టపోయే బ్యానర్లు కొన్నే. ఈ నష్టాన్నే లెక్కించాలి. మిగతా వ్యాపారంకోసం కాక మరింకెందుకో కోల్పోయే బ్యానర్ల గురించి బాధపడనవసరం లేదు. వాటి దృష్టిలో అది కోల్పోవడం కాదు. అయినా మొత్తంగా చూస్తే  బడ్జెట్ సినిమాల సెగ్మెంట్ ని ఒక పెద్ద నష్టాల ఊబిగా,  భయంకరమైన ‘బి’ గ్రేడ్ లోయగా తయారు చేసి పెట్టారు. తీసిన బడ్జెట్ మూవీస్ ని  కొనే నాధుడుండడు, బ్యానరే మళ్ళీ పెట్టుబడి పెట్టుకుని విడుదలచేసుకోవాలి. అది ఎందుకూ పనికిరాని విడుదల. శాటిలైట్ హక్కులూ రావు. ఒకప్పుడు విడుదల చూపించుకుంటే ఎంతో కొంత శాటిలైట్ హక్కులైనా  వచ్చేవి. ఇప్పుడు విడుదలే శాపంగా మారింది.

          ఒకప్పుడు బడ్జెట్ సినిమాలు కాస్త క్వాలిటీతో తీసేవిగా- క్వాలిటీ లేని నాసిరకం ‘బి’ గ్రేడ్ గా తీసేవిగా రెండు రకాలుండేవి. ఇప్పుడు బడ్జెట్ మూవీస్ కి అంతా  కలిపి ఒకటే గ్రేడ్ కన్పిస్తోంది - నాసిరకం ‘బి’ గ్రేడ్! ఇందుకే వీటివైపు ఎవరూ కన్నెత్తి చూడ్డం లేదు. రివ్యూలకీ నోచుకోవడం లేదు. బ్యానర్లు కూడా ‘బి’ గ్రేడ్ కిందికి  దిగజారిన బడ్జెట్ మూవీస్ నే ఇంకా తీస్తూ నష్టపోతున్నాయంటే  రకరకాల కారణాలున్నాయి...హాబీ కోసమో, ఎంజాయ్ మెంటు కోసమో, మీడియాలో ఇమేజి బిల్డప్  కోసమో  తీసి నష్టపోతే అది నష్టం కిందికి రాదు. ఇమేజి కోసం పెట్టుబడి కిందికి, జాయ్ రైడ్ జేబు ఖర్చుల కిందికి వస్తుంది. బ్లాక్ తో నష్ట పోతే అది వైట్ కిందికి మారిపోతుంది కనుక ఇది కూడా నష్టం కాదు. ఈ  బ్యానర్లు తీసే ఆ ఒక్క  ఫ్లాప్ తో వెళ్ళిపోతాయి. వీటి తోబాటు ఆ కొత్త దర్శకులూ ఇంటికెళ్ళి పోతారు. ఇలా కాక సిన్సియర్ గా వ్యాపారం కోసంవచ్చి అవగాహనా రాహిత్యంతో నష్టపోయే బ్యానర్స్ గురించే ఆలోచించాలి. ఓ నాల్గేళ్ళ క్రితం బడ్జెట్ మూవీస్ 60- 70 కి మించేవి కాదు. అవి కూడా ‘బి’ గ్రేడ్ కి దిగజారిన నష్ట జాతకాలే. బడ్జెట్ సినిమాలు చాలా పూర్వం కూడా వుండేవి. వాటి సక్సెస్ రేటు కూడా తక్కువే అయినా సక్సెస్ అయ్యాయంటే పది, ఇరవై రెట్లు లాభాలు తెచ్చి పెట్టేవి.

           యాభై లక్షలతో ‘చిత్రం’ తీస్తే 10 కోట్లు,  రెండు కోట్లతో ‘నువ్వే కావాలి’ తీస్తే 20 కోట్లు ఎలా వచ్చాయో ఇప్పుడాలోచిస్తే బుర్ర తిరుగుతుంది. ‘ఐతే’, ‘హేపీ డేస్’, ‘జయం’, ‘ఆనంద్’ లాంటివి కూడా  మంచి ఆర్ధిక విజయాలు చవి చూసిన బడ్జెట్ మూవీసే.

          అప్పట్లో బడ్జెట్ మూవీస్ నుంచి స్టార్లుగా,  పోనీ పాపులర్ హీరో హీరోయిన్లుగా ఎదిగి వచ్చిన వాళ్ళుండే వాళ్ళు.  ‘అల్లరి’ తో నరేష్, ‘చిత్రం’ తో ఉదయ్  కిరణ్, రీమా సేన్, ‘నువ్వే కావాలి’ తో తరుణ్, రిచా పల్లోడ్, సునీల్, ‘జయం’ తో నితిన్, సదా, గోపీచంద్, ‘ఐతే’ తో శశాంక్, సింధూ తులానీ, ‘ఆనంద్’ తో రాజా, కమలినీ ముఖర్జీ,  ‘హేపీ డేస్’ తో తమన్నా, వరుణ్ సందేశ్, నిఖిల్, రాహుల్ లు...ఇలా లిస్టు థ్రిల్లింగ్ గా వుంటుంది. ఇప్పటి లిస్టులో చూడ్డాని కేమీ వుండదు. ఏ కొత్త హీరో ఎవరో, ఎవరొచ్చి పోతున్నాడో; ఏ కొత్త హీరోయిన్ ఎవరో, ఎవరొచ్చి పోతోందో అంతా ‘బి’ గ్రేడాట మాయ! 

          ఆనాటి  బడ్జెట్ మూవీస్ తో వచ్చి పాపులరైన దర్శకుల్లో తేజ, శేఖర్ కమ్ముల, వీఎన్ ఆదిత్య, చంద్ర శేఖర్ ఏలేటి, విజయభాస్కర్, రవిబాబు లాంటి వాళ్ళు ఎందరో  నిలదొక్కుకుని ఆపైన మరిన్ని తీస్తూ పోతే, ఇప్పుడు తీస్తున్న కొత్త దర్శకులందరూ ఆ మొదటి  దాంతోనే  అదృశ్యమైపోతున్నారు. ఎవరొస్తున్నారో, ఎవరు పోతున్నారో కూడా పేర్లు తెలీనంతగా.  \

          ఇలా ఓ సక్సెస్ ని  గానీ, భావి హీరో హీరోయిన్లని గానీ, భావి దర్శకుల్ని గానీ అందించలేని దైన్యంతో   ‘బి’  గ్రేడ్ కి దిగజార్చేశారు బడ్జెట్ మూవీస్ ని!

    బడ్జెట్ మూవీస్ ని  దేనికీ వుపయోగపడని ‘బి’ గ్రేడాటగా మార్చేశాక, బడ్జెట్లు పెంచెయ్యడం ఇంకో ఫ్యాషన్ గా  మారిందిటీవల.  కోటితో పోయే ‘బి’ గ్రేడ్ కి గ్రాండ్ గా రెండు కోట్లు,  కాస్త ఆడితే తప్ప ఏ శాటిలైట్ హక్కులకీ  గ్యారంటీ లేని ‘బి’ గ్రేడ్ కూడా కాని నాసిరకానికి కూడా, రెండూ ప్లస్ పబ్లిసిటీ ఇరవై  = రెండూ  ఇరవై అని  ఫిగర్  చెప్పడం కొందరు అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న కొత్త దర్శకులకి ఫ్యాషన్ గా మారిపోయింది. వ్యాపారానికి కాక ఇంకోలా వాడుకోవడానికి వచ్చే బ్యానర్లకి ఐదు కోట్లకి గాలం వేసినా వేయాల్సిందే. ఒక కొత్త బ్యానర్ పుత్రరత్నమే హీరో అవాలనే దుగ్ధతో వుంటే, ఆ ‘బి’ గ్రేడ్ బడ్జెట్ ని ఏకంగా  ఐదున్నర  కోట్ల మెగా బడ్జెట్ కి పెంచేసి  దుగ్ధ తీర్చిన కొత్త దర్శకుడు గొప్పోడే. ఎలాటి వాడికి అలాటి వాడే  దొరుకుతాడు. అలాగని వున్న  నాల్గు వ్యాపారాలకి తోడు ఇదింకో వ్యాపారమని వచ్చే సిన్సియర్ బ్యానర్స్ తో కొత్త దర్శకుడు ఇలా చేస్తే గొప్ప కాదు. అది గొయ్యి తవ్వడం- తనకీ, ఆ సిన్సియర్ బ్యానర్ కీ కూడా. 

           కొత్త దర్శకులు ఫ్యాన్సీ బడ్జెట్లు కోరేవారు కొందరైతే;  మినిమం నాని, శర్వానంద్, సందీప్ కిషన్, రాజ్ తరుణ్ ల లాంటి స్టార్స్ ని కోరేవారు మరి కొందరు. ఈ రెండూ జాప్యానికి దారి తీసేవే. కొత్త దర్శకుడు కొత్త వాళ్లతో తీసే రోమాంటిక్ కామెడీ కో, దెయ్యం కామెడీ కో  అడుగుతున్న రెండు కోట్లకి పైబడి ఫ్యాన్సీ బడ్జెట్లు పెట్టే  బ్యానర్లు ముందుకు రావడానికి  ఎంత జాప్యం జరుగుతుందో; నాని టు రాజ్ తరుణ్ రేంజిలో అవకాశం దక్కించుకోవడానికీ అంతే  జాప్యం జరుగుతుంది. కొత్త దర్శకులకి స్టార్లు అవకాశం ఇవ్వాలని లేదు, ఇవ్వాలనుకుంటే రెడీగా డేట్లు వుండవు. ఏడాదో రెండేళ్ళలో  వేచివుండాలి. అప్పుడు కూడా పరిస్థితులెలా మారిపోతాయో తెలీదు. 

          ఇలా ఫ్యాన్సీ బడ్జెట్లు, స్టార్స్ తో అవకాశాలూ అనే పెద్ద కోరికలు పెట్టుకుని ఎక్కడేసిన గొంగళి అవుతున్న వాళ్ళూ  లెక్కలేనంత మంది.
***
       పై కెగరాలంటే కింద భూమి వుండాలి, భూమి లేకుండా పైకెగర లేవంటే రుచించదు. షార్ట్ కట్సే కావాలి. ఇదంతా  ఏ రూల్సూ లేని ఆటే  కాబట్టి ఏదైనా జరిగిపోవచ్చు. ఒక్కటే జరగడం లేదు. కోటితో తీస్తే పది,  పోనీ రెండు తెచ్చి పెట్టే  ఫస్ట్ టైం డైరెక్టర్ ఎవరూ కన్పించడం లేదు.  డాక్టర్ దాసరి నారాయణ రావు అక్కినేనితో ‘దేవదాసు మళ్ళీ పుట్టాడు’ అనే పెద్ద సినిమా తీయక మునుపు తీసిన 20 సినిమాలూ బడ్జెట్ మూవీసే. బడ్జెట్ సినిమాల దర్శకుడుగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఒక కామెడీ సినిమాల దర్శకుడే లేనట్టు, బడ్జెట్ సినిమాల దర్శకుడంటూ  కూడా ఎవరూ లేరు.   ఓవర్ బడ్జెట్ ఫ్లాప్స్ ఇచ్చే కొత్త  దర్శకులు, అప్పుడే స్టార్స్ కి నిచ్చెనేసే కొత్తదర్శకులూ క్రిక్కిరిసి వున్నారు. 

          కోడి రామకృష్ణ కూడా బడ్జెట్ సినిమాల దర్శకుడుగా ప్రారంభంలో  పేరు తెచ్చున్నారు. తక్కువ బడ్జెట్ తో ఆయన తో తీస్తే మంచి లాభాలొస్తాయనే నమ్మకం వుండేది. ఇవ్వాళ పరుగెత్తి పాలు తాగేయడానికి వీలిచ్చేంత  సులభ  టెక్నాలజీ అందుబాటులో కొచ్చాక, నిలబడి నీళ్ళేందుకు తాగాలనుకుంటున్నారు. ఒకవేళ ఓ బడ్జెట్ సినిమాకి  కొత్త దర్శకుడు రూపాయి మీద హీన పక్షం పది పైసలు లాభం తెచ్చి పెట్టినా, మళ్ళీ ఇతర బడ్జెట్ నిర్మాతలకి అందుబాటులో వుంటాడన్న నమ్మకంలేదు. వెళ్ళిపోయి తనకి అందుబాటులో వుండని  స్టార్స్ కోసం ప్రయత్నాల్లో వుంటాడు పది పైసల సక్సెస్ తో. ఆ స్టార్సూ  దొరకరు, ఎందుకంటే అక్కడ రద్దీ ఎక్కువ. పైగా సీనియర్ దర్శకుల పోటీ. వాళ్ళని దాటుకుని పది పైసల కొత్త సక్సెస్ ఫుల్ దర్శకుడికి అవకాశం రావాలి. ఒకవేళ వచ్చినా వెంటనే ప్రారంభం కాదు. ఒక బడ్జెట్ మూవీని సక్సెస్ చేసి వచ్చిన కొత్త దర్శకుడికి ఓ రేంజి స్టార్స్ అవకాశ మివ్వాలన్నా ఏంతో కాలం పడుతుంది.   

          దీంతో ఎవరైనా కొత్త దర్శకులు సక్సెస్ ఫుల్ బడ్జెట్ సినిమా తీసినప్పటికీ, మళ్ళీ  బడ్జెట్ సినిమాలు తీసే నిర్మాతలకి అందుబాటులో వుండడం లేదు. దీంతో ఆ నిర్మాతలు ఇంకో ఫస్ట్ టైం దర్శకుణ్ణి నమ్మి మునిగిపోవాల్సి వస్తోంది. ఒక సక్సెస్  ఇచ్చిన బడ్జెట్  దర్శకుణ్ణి పట్టుకుందామంటే అతను  స్టార్స్ వెయిటింగ్ రూములో వెయిట్ చేస్తూంటాడు. అటు స్టార్ తో తీయలేకా, ఇటు ఇంకో బడ్జెట్  నిర్మాతకి ఉపయోగపడకా త్రిశంకు స్వర్గంలో కొట్టు మిట్టాడుతూ వుంటాడు. 

          చాలా విచిత్రంగా వుంటుంది.  ఒక కొత్త దర్శకుడుగా ఒకప్పుడు తను బడ్జెట్ మూవీ అవకాశం  కోసం బ్యానర్స్  చుట్టూ తిరిగిన నిరుద్యోగపు రోజుల్ని, పడిన పడిగాపుల్నీ  ఎలా మర్చిపోతాడో అర్ధం గాదు. ఇప్పుడు చూస్తే, కొత్త దర్శకుడిగా ఒక బడ్జెట్ మూవీ సక్సెస్ చేసి కూడా  స్టార్స్ దగ్గర మళ్ళీ అవే వెయిటింగ్ బాధలు పడుతూంటాడు. అదే నిరుద్యోగం చేస్తూ  టైం వృధా చేసుకుంటాడు. దర్శకత్వం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు తను ఒంటరి వాడే. అయినా కనీసం పది మంది నిర్మాతల్ని కలుస్తూంటాడు అవకాశాల కోసం. ఏదో ఒక ఆశ, నల్గురితో సంబంధాలూ వుండి ఊరట లభిస్తుంది. అలా  కొత్త దర్శకుడుగా  ఒక బడ్జెట్ మూవీ పట్టుకుని సక్సెస్ ఇచ్చాడే అనుకుందాం, ఇక స్టార్ ముంగిట్లో వాలిపోయి మళ్ళీ ఒంటరి వాడైపోతాడు, మళ్ళీ నిరుద్యోగి అయిపోతాడు. తనని దర్శకుణ్ణి చేసిన బడ్జెట్ మూవీ సెగ్మెంట్ ని మర్చిపోతాడు. సక్సెస్ ఇచ్చిన ఇతడి కోసం బడ్జెట్ నిర్మాతలు ప్రయత్నిస్తే స్టార్ దగ్గర కన్పిస్తాడు. పైకెళ్ళి పోయినవాడు మన కెందు కొస్తాడులే అనుకుంటారు బడ్జెట్ నిర్మాతలు. ఇలా చుట్టూ నిర్మాతలతో సంబంధాలు కోల్పోయి, స్టార్ దగ్గర ఎటూ తేలక, ఒంటరి నిరుద్యోగపు వెతలు అనుభవిస్తూ వుంటాడు. కొంతకాలానికి ప్రేక్షకుల జ్ఞాపకాల్లోంచి కూడా చెరిగిపోతాడు. 

          ఒక బడ్జెట్ మూవీ సక్సెస్ చేసి ఆ సెగ్మెంట్ లో కింగ్ అన్పించుకున్నాక, వేరే కింగులున్న చోటికి ఛోటా కింగుగా ఎందుకెళ్ళాలో అర్ధంగాదు. ఢిల్లీ కింగ్ అన్పించుకున్న అరవింద్  కేజ్రీవాల్ ముందు తన రాజ్యంలో  తాను పూర్తిగా బలపడకుండా, అప్పుడే పంజాబ్ కీ, గోవాకీ వెళ్లి కంగు తిని-  ఢిల్లీ గల్లీలు కూడా  పోగొట్టుకున్న పరిస్థితే ఇదీ.   సినేరియా మారవచ్చు- పాత్ర ప్రయాణం మాత్రం ఎక్కడైనా ఒకలాగే వుంటుంది-  వుండాల్సిన తెలివితో వుండకపోతే. పరుగెత్తి పాలే తాగుదా మనుకుంటున్నారు. అయితే ఇలా ఎంత సేపు తాగుతామనే ఆందోళన కూడా  లోలోపల పీకుతూనే వుంటుంది. 

          ఇలా కొత్త దర్శకులు ఫ్యాన్సీ బడ్జెట్లు కోరడంతో, స్టార్స్ తో అవకాశాలు ఆశించడంతో, కొత్త దర్శకుడిగా  సక్సెస్ ఇచ్చినా  మళ్ళీ బడ్జెట్  సెగ్మెంట్ కి దూరమవడంతో,  బడ్జెట్ సినిమాలు ‘బి’ గ్రేడ్ అగ్నిగుండానికి ఆహుతవుతున్నాయి.

1. బడ్జెట్ సినిమాలు సక్సెస్ కావడం లేదు.
2. బడ్జెట్ సినిమాలు భావి హీరోహేరోయిన్లని అందించడం లేదు
3. బడ్జెట్ సినిమాలు భావి దర్శకులని తయారు చేయడం లేదు
4. బడ్జెట్ సినిమాలు ‘బి’ గ్రేడ్ కి దిగజారిపోయాయి.
5. కొత్త దర్శకులు ఫ్యాన్సీ బడ్జెట్లు కోరుతున్నారు.
6. కొత్త దర్శకులు స్టార్స్ తో అవకాశాలు ఆశిస్తున్నారు.
7. కొత్త దర్శకులు సక్సెస్ ఇచ్చి బడ్జెట్ నిర్మాతలకి దొరకడం లేదు.
8. కొత్త దర్శకులు బడ్జెట్ సినిమాల్ని ‘బి’ గ్రేడ్ అగ్నిగుండంలో పడేసి పోతున్నారు.
9. కొత్త బ్యానర్స్  వ్యాపారం కోసం రావడం లేదు.
10. కొత్త బ్యానర్స్ వ్యాపారం కోసం వచ్చినా ఏం తీయాలో తెలీడం లేదు.
11. కొత్త బ్యానర్స్  కొత్త దర్శకుల్ని తమ సారధిగా భావించడం లేదు.
12. కొత్త బ్యానర్స్ బడ్జెట్ మూవీస్ ని ‘బి’ గ్రేడ్ కి దించి వెళ్ళిపోతున్నాయి.   
***
      ఓ  చిన్న యాడ్ ఫిలిం తీయాలంటే చాలా సృజనాత్మక శక్తి కావాలి. ఆ యాడ్ మీద  కంపెనీ  అమ్మకాలు ఆధారపడి వుంటాయి కాబట్టి. అలాంటిది ఒక బడ్జెట్ మూవీ అమ్ముడుబోవాలంటే ఇంకెంత సృజనాత్మక శక్తి కావాలి. సృజనాత్మక శక్తిని అరచేతిలో టెక్నాలజీగా భావిస్తే  ‘బి’ గ్రేడ్ మూవీసే తీయగల్గుతారు. అరచేతిలో టెక్నాలజీ షార్ట్ ఫిలిమ్స్ కి, ఇండీ ఫిలిమ్స్ కి, క్రౌడ్ ఫండింగ్ ఫిలిమ్స్ కీ,  హోమ్  వీడియోస్ కీ ఉపయోగ పడొచ్చు గానీ,  బడ్జెట్ మూవీస్ కి కాదు. ‘చిత్రం’  అప్పుడు అరచేతిలో టెక్నాలజీ లేదు, ‘ఈ రోజుల్లో’ అప్పుడుంది. ఆ తర్వాత  అది బడ్జెట్ మూవీస్ కే  పనికి రాలేదు. సినిమాకి అనుకరణలైన  షార్ట్  ఫిలిమ్స్, ఇండీ ఫిలిమ్స్, క్రౌడ్ ఫండింగ్ ఫిలిమ్స్, హోమ్  వీడియోస్  టెక్నాలజీ తో బడ్జెట్ మూవీ తీయబోతే, అదెందుకూ పనికిరాని  ‘బి’ గ్రేడ్ సరుకుగా మూలబడుతుంది.  

          పై అనుకరణల (షార్ట్  ఫిలిమ్స్, ఇండీ ఫిలిమ్స్, క్రౌడ్ ఫండింగ్ ఫిలిమ్స్, హోమ్  వీడియోస్)  నుంచి బడ్జెట్ మూవీస్ కి కొత్త దర్శకుడు ప్రమోటవుతున్నప్పుడు, అతను  వేసే అడుగు బారుగా వెళ్లి బిగ్ కమర్షియల్స్  ఆకర్షణల  మీద ఐరన్ లెగ్ లా  పడుతోంది. అదీ సమస్య. బడ్జెట్ మూవీ తీయబోతే ఎవరి సమస్య అయినా ఇదే- బిగ్ కమర్షియల్స్ మీద ఐరన్ లెగ్స్ వేసే యోచన.  అనుకరణలకీ, బిగ్ కమర్షియల్స్ కీ మధ్య బడ్జెట్ మూవీస్ అనే వారధి వుంటుందని గమనించడం లేదు.  అనుకరణల మీంచి కాలెత్తితే, బారుగా తీసికెళ్ళి బిగ్ కమర్షియల్ ఎట్రాక్షన్స్ మీద దభీమని వేస్తున్నారు. తాము ముందు గడిపే షార్ట్, ఇండీ, క్రౌడ్,  హోమ్  అనుకరణల కాలం మాయల ఫకీరు కాలం. ఇవి తీస్తున్నప్పుడు భావి దృష్టి  బడ్జెట్ సినిమాల మీద వుండదు- బిగ్ కమర్షియల్  ‘సరైనోడు’ లో అల్లు అర్జున్ అలా ఇరగదీశాడు, ఇంకో బిగ్ కమర్షియల్  ‘లక్కున్నోడు’ లో మంచు విష్ణు ఇలా యాక్షన్ చేశాడు... మనంకూడా అలా తీయాలి ....అంటూ బిగ్ కమర్షియల్ పోకడల్నే  మనసంతా మేట వేసుకునేలా చేస్తుంది మాయల ఫకీరు కాలం. దీంతో బడ్జెట్ మూవీ తీయబోతే అది బిగ్ కమర్షియల్ అనుకరణలాగే వుంటుంది తప్ప,  బడ్జెట్ మూవీ ఒరిజినాలిటీని ప్రదర్శించదు. 

          అరచేతిలో టెక్నాలజీతో ఉత్సాహపడి నేరుగా బిగ్ కమర్షియల్ కి గాలం వేసుకోవాలంటే నిరభ్యంతరంగా వేసుకోవచ్చు. అంతేగానీ కోటి రూపాయలు మాత్రమే బడ్జెట్ దొరికినప్పుడు బిగ్ కమర్షియల్ కలల్ని మర్చిపోవడమే  కాదు, అసలు చేతిలో వున్న కోటి బడ్జెట్ మూవీని కూడా బిగ్ బడ్జెట్ కొలమానాలతో చూడకూడదు. కానీ ఈ డిసిప్లిన్ ఎవరి కుంటుంది- ఇది ఏ రూల్సూ వర్తించని ఆట కదా!  చేతిలో కలానికి వుండనట్టే బడ్జెట్ కీ రూల్స్ లేవు! బిగ్ కమర్షియల్స్ కీ,  బడ్జెట్ మూవీస్ కీ దేనికీ – సినిమా అనే కళారూపానికి- అరచేతిలో టెక్నాలజీ అనే తేలిక భావపు మైండ్ సెట్ పనికి రాదని చెప్తే ఎవరు వింటారు?  నాటకాల మైండ్ సెట్, సీరియల్స్ ల మైండ్ సెట్ సినిమాలకి పనికి రానట్టే, అరచేతిలో టెక్నాలజీ అల్ట్రా మోడరన్ మైండ్ సెట్ కూడా పనికిరాదు. ప్రపంచం వేగంగా పరిగెడుతున్నట్టే  అన్పిస్తుంది, అంతే. మనం నేర్చుకుంటూ వెనకబడి పోతున్నామని అందిన పనిముట్టు అందుకుని ఒకడికంటే ముందుకు పరుగులు తీస్తూంటాం. కానీ ప్రపంచం ఎక్కడా వేగంగా పరిగెట్టడం లేదు.పని గంటలు అవే ఎనిమిది గంటలున్నాయి. భూమి ఇరవై నాలుగ్గంటలే తన చుట్టూ తాను తిరుగుతుంటుంది.  అదేం స్పీడు పెంచుకుని  గిర్రున ప్రపంచాన్ని కూడా తిప్పడం లేదు మనం చెలరేగిపోవడానికి. పరిగెట్టాలనుకుంటే ఏమీ నేర్చుకోలేరు, తెలుసుకోలేరు.
***
        నిలబడి నీళ్ళే తాగుతూంటే అమృతం దానికదే కురుస్తుంది. సినిమా నిలబడి నీళ్ళే తాగమంటుంది, పరుగెత్తి పాలు తాగమనదు. సినిమా మదగజం లాంటిది. దాన్ని లొంగ దీసుకుని  విజయయాత్ర చేయాలంటే మెరికలు తిరిగిన మావటి వాడు కావాలే  గానీ, ఇంకో టెక్నాలజీ- యాప్  లేదు. సినిమాని వ్యూహంతో లొంగదీయాలి. బడ్జెట్ మూవీని ఇంకింత వ్యూహంతో లొంగ దీయాలి. కొత్త దర్శకుడు సినిమా అనగానే బడ్జెట్ మూవీ ని దాటుకుని సుదూరాన బిగ్ కమర్షియల్స్ ఆకర్షణల్ని చూడ్డం మానుకోవాలి. అదొచ్చినప్పుడు అది తీయొచ్చు, ప్రస్తుతం చేతిలో వున్నది బొటాబొటీ కోటిన్నర ప్రాజెక్టే. దీని వ్యూహం దీనికుంటుంది, దానివ్యూహం దీనికుండదు. అరచేతిలో టెక్నాలజీని మర్చిపోవాలి- అది సినిమా మైండ్ సెట్ కాదు. బడ్జెట్ మూవీ మైండ్ సెట్ అసలే కాదు. బడ్జెట్ మూవీ మైండ్ సెట్, బిగ్ కమర్షియల్ కి మించిన సృజనాత్మక దృష్టే!

(ఇంకా వుంది)


- సికిందర్

28, మే 2017, ఆదివారం

రివ్యూ!

దర్శకత్వం :  జేమ్స్  ఎర్ స్కిన్
తారాగణం : సచిన్ టెండూల్కర్, అంజలీ టెండూల్కర్, సారా టెండూల్కర్, అర్జున్ టెండూల్కర్, అజిత్ టెండూల్కర్, మయూర్ మోరే,  అమితాబ్ బచ్చన్, విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, హర్షా భోగ్లే తదితరులు.
రచన : జేమ్స్  ఎర్ స్కిన్ - శివకుమార్అనంత్,  సంగీతం: ఏఆర్ రెహమాన్, ఛాయాగ్రహణం : క్రిస్ ఓపెన్ షా, ఎడిటింగ్ : దీపా భాటియా, అవధేశ్ మోహ్లా,
బ్యానర్ : 200 నాట్అవుట్ప్రొడక్షన్స్, కార్నివాల్ మోషన్ పిక్చర్స్, నిర్మాత : రవి బగ్ చంద్కా  
విడుదల : మే 26, 2017
***
          మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయంగా క్రికెట్ ప్రపంచానికి సంభవించిన ఒక అరుదైన క్రీడాకారుడే. ఒక తరానికి తరం అతణ్ణి అభిమానిస్తూనే ఎదిగింది. మానసికంగా భౌతికంగా అతణ్ణి క్షుణ్ణంగా చదివేసింది. ఇక తెలుసుకోవాల్సిందేమీ లేదు. రిటైర్మెంట్ తో ముగిసిపోయిన  అతడి క్రికెట్ అధ్యాయానికి  అక్రందిస్తూనే వీడ్కోలు చెప్పి విశ్రమించింది. మళ్ళీ తట్టిలేపి,  మీ ఆరాధ్య దైవాన్ని వెండి తెరమీద చూడమంటే చూడ్డాని కేముంటుంది?  ఏమీ వుండదు. తెలిసిపోయే టెంప్లెట్ సినిమా ఎలా వుంటుందో అలా వుంటుంది. పైగా సచిన్ పాత్రలో  బాలీవుడ్ స్టార్ కూడా నటించని బయోగ్రఫీ ఏం బావుంటుంది. సచినే కన్పిస్తూ తనే  ఆటోబయోగ్రఫీ చెప్పుకుంటూంటే ఎంత నీరసంగా వుంటుంది. మొత్తమంతా కలిపి ఒక డాక్యుమెంటరీ డ్రామా (డాక్యూ డ్రామా) లా వుంటే ఏం ఆసక్తి కల్గిస్తుంది...


            ఇంకో పదేళ్ళ తర్వాత ఈ స్పోర్ట్స్ డాక్యూ డ్రామా తీయబోతే ఈ సందేహాలు ఎదురు కావొచ్చు. అప్పటికి మళ్ళీ  ఎదిగి వస్తున్న ఇంకో కొత్త తరానికి సచిన్ తో పెద్దగా అనుబంధం వుండకపోవచ్చు. తరాల అంతరం ఏర్పడొచ్చు. తమ కళ్ళ ముందు ఎదిగి వచ్చిన  ఇంకో క్రీడాకారుడెవరో ‘గాడ్’ అవుతాడు, రోల్ మోడల్ అవుతాడు. గ్లోబలైజేషన్ తెచ్చి పెట్టిన పరిణామాల్లో యువతకి లైవ్ రోల్ మోడల్స్ కావాలి, కిందటి తరం రోల్ మోడల్స్ కాదు. నిన్న మొన్న రిటైరైన  సచిన్ ని ‘గాడ్’ గా చూస్తున్న నేటి తరం, పదేళ్ళ తర్వాత  సచిన్ పట్ల ఇదే భావోద్వేగాలతో వుంటుందని చెప్పలేం. భావోద్వేగాలున్నప్పుడే చరిత్ర చెప్పాలి. సచిన్ చరిత్ర పదేళ్ళ తర్వాత తీరిగ్గా చెప్తే వర్తమాన తరానికీ, భావితరాలకీ ఉపయోగం లేదు. ఈ చరిత్రని మళ్ళీ సినిమా స్టార్ తో చూపిస్తే  కూడా దానికి చారిత్రిక విలువలేదు. సచిన్ తోనే డాక్యూ డ్రామాగా తీస్తే క్రికెట్ కి అదెప్పటికీ పనికొచ్చే కదిలే బొమ్మల రిఫరెన్స్ బుక్ లా వుంటుంది. స్వయంగా సచినే  చెప్తున్న విషయాలతో నమ్మశక్యంగా వుంటుంది. సినిమా స్టార్ తో తీసే ఏ మసాలా స్పోర్ట్స్ మూవీ లేనంత పవర్ఫుల్ గానూ వుంటుంది.  సచిన్ కే పెద్ద స్టార్ డమ్  వున్నప్పుడు ఇంకా వేరే స్టార్ ఎందుకు? 

          1983 వరల్డ్ కప్ ఇండియా గెలవడం చూశాక  పదేళ్ళ సచిన్ కి క్రికెట్ మీద పెరిగిన ఆపేక్ష- 2011 లో స్వయంగా వరల్డ్ కప్ గెలిచే దాకా ఎలా ఒక దీక్షగా మారి చరిత్ర సృష్టించిందో తెలుపుతుందీ  డాక్యూ డ్రామా. అప్పటి బొంబాయిలో సామాన్య మధ్య తరగతి కుటుంబం. తండ్రి రమేష్ టెండూల్కర్ ప్రముఖ మరాఠీ రచయిత. మొదటి భార్యకి ముగ్గురు పిల్లలు. ఆమె చనిపోతే చేసుకున్న రెండో భార్యకి పుట్టిన ఏకైక సంతానం సచిన్. సచిన్ లోని ఆటగాణ్ణి మొదట కనిపెట్టింది అన్న అజిత్తే. పదకొండేళ్ళ వయస్సులో తీసికెళ్ళి ప్రసిద్ధ కోచ్ రమాకాంత్ అచ్రేకర్ కి అప్పజెప్పాడు. ఆయన చేతిలో  రాటుదేలిన సచిన్ 1988 లో బొంబాయిలోనే హారిస్ షీల్డ్ గెలవడంతో పేపర్ల కెక్కాడు. 1989 లో కేవలం  పదహారేళ్ళ వయస్సులో పాకిస్తాన్ తో అంతర్జాతీయ క్రికెట్ లో  తలపడ్డాడు. వీణ్ణెందుకు తీసుకొచ్చారు, వీడేం చేస్తాడు అనుకున్న పాక్ జట్టుకి తడాఖా చూపించి వచ్చాడు. సియాల్ కోట్ ఫైనల్ టెస్ట్ లో వఖార్ యూనిస్ బౌలింగ్ కి ముక్కు పగిలి రక్తం కారుతున్నా  వైద్య సహాయం నిరాకరిస్తూ బ్యాటింగ్ చేశాడు. 

          దీని తర్వాత న్యూజీలాండ్ తో కొనసాగిన అతడి అంతర్జాతీయ క్రికెటింగ్ ప్రపంచ కప్ సాధించేదాకా ఎన్ని ఓడిడుకుల మధ్య గడిచిందో చూపించుకొస్తారు. వృత్తిపరంగా క్రికెటింగ్ ని చూపిస్తూనే, మరో వైపు కుటుంబ జీవితాన్నీ చూపిస్తారు. అంజలితో  ప్రేమ, పెళ్లి, పిల్లలు, సరదాలూ వగైరా.  సచిన్ కంటే అంజలి ఆరేళ్ళు పెద్దది. సచిన్ పదిహేడేళ్ళ వయసులో వున్నప్పుడు చూసి ప్రేమించడం మొదలెట్టింది. నాల్గేళ్ళ తర్వాత తనే అతడి తల్లిదండ్రులతో మాట్లాడి పెళ్లి చేసుకుంది.
***
       కొన్ని వివాదాస్పద అంశాల్ని దాటవేశారు. టీం విజయాలకంటే తన వ్యక్తిగత రికార్డుల్నే హైలైట్ చేసుకునే తత్త్వం, బాల్ టాంపరింగ్ ఉదంతం, యాడ్ ఫిలిమ్స్ సంపాదనపై తను నటుడిగానే తప్ప క్రీడాకారుడిగా యాడ్  ఫిలిమ్స్ చేయలేదని కోర్టు కెక్కడం, పర్మిట్స్ లేకుండా ఇల్లు నిర్మించుకుని గృహప్రవేశం చేయడం వంటి అనేక వివాదాల్ని పక్కన పెట్టి ఆత్మకథ చెప్పారు. సచిన్ రెండు సార్లు కెప్టెన్ అయ్యాడు. మొదటి సారి అయినప్పుడు సీనియర్ అజరుద్దీన్ తో విభేదాలు, ఎడమొహం పెడమొహం– ఒక మాటలో చెప్పి వదిలేశారు- రెండు పవర్ సెంటర్స్ ఏర్పడ్డాయని. అలాగే మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతంలో అజరుద్దీన్ ప్రస్తావన లేకుండా క్రోంజీ ని చూపిస్తూ క్లుప్తంగా ముగించారు. కెప్టెన్ గా సచిన్ రెండు సార్లూ వైఫల్యం చెందాడని మాత్రం సూటిగానే చెప్పారు. 

          వ్యక్తిగతంగా సచిన్ పురుషాధిక్య భావజాలాన్ని మాత్రం కప్పిపుచ్చ లేకపోయారు. ఇందుకు నిదర్శనంగా భార్యే వుంది గనుక కప్పి పుచ్చడం సాధ్యం కాదు. సచిన్ భార్య అంజలి డాక్టర్. పెళ్ళయ్యాక కుటుంబం కోసం వైద్య వృత్తి మానేస్తానని అంజలి చెప్పినట్టు సచిన్ అంటాడు. తర్వాతి షాట్ లో – మనిద్దర్లో ఎవరో ఒకరు కెరీర్ ని వదులుకోవాలని సచిన్ చెప్పినట్టు అంజలి అంటుంది. తనని ఉద్దేశించి అని వుండడు  సచిన్.  తర్వాతి షాట్ లో సచిన్- నా కలల్ని పూర్తిగా అర్ధం జేసుకునే భార్యే నాకవసరమని అంటాడు. ఆమె వైద్య వృత్తి మానేసి  అతడికి సహకరించే భార్యగా వుండిపోయింది. తన కలలు, తన జీవిత లక్ష్యాలూ తప్ప ఇంట్లో ఇంకెవరి మనోభావాలూ ముఖ్యం కాదన్నట్టున్న  సచిన్  వ్యక్తిత్వం ఇలా బయటపడుతుంది. పాపం అంజలి! 

          గాడ్ లోకూడా వంద లోపాలూ వుంటాయి. అయినా గాడ్ గిరీ కేం అడ్డు కావు. భక్తులు తమ గాడ్ లో  లోపాలెన్నడానికి ఇష్టపడరు.  గాడ్ వెనకాల గాడ్ వల్ల బాధలు పడ్డ వాళ్లున్నా సరే, వాళ్ళని చూడ్డానికి భక్తులు ఇష్టపడరు. ఎవరైనా చూపించబోతే చెండాడుతారు. ఒక రిపోర్టర్ సచిన్ లోని  నెగెటివ్ కోణాన్ని ప్రచురణకిస్తే, పబ్లిక్ మూడ్ ని గౌరవించాలయ్యా అని  ఆ ఎడిటర్ దాన్ని బుట్ట దాఖలు చేసిన లాంటి మీడియా సంగతులు ఇందుకే వింటూంటాం. 

         ‘పబ్లిక్ మూడ్’ తో ‘గాడ్’ అయిన సచిన్ ని ఒక్కోసారి మనం కూడా అభిమానించకుండా వుండలేం. బ్రిటన్లో న్యూ యార్క్ షైర్ టూరుకి సచిన్ కుటుంబ సమేతంగా వెళ్లి ఎంజాయ్ చేసిన దృశ్యాల్ని మరువలేం. అతడి వల్లే  కదా వీళ్ళందరూ ఇంత ఆనందంగా వుంటున్నారు... అతను ఈ కుటుంబానికి ఆనంద ప్రదాత. మనిషి బయట ఎన్ని విజయాలు సాధించనీ, ఇంట్లో ఆనందాలివ్వకపోతే బయటి విజయాలు విజయాలే కావు. సచిన్ నిజంగా ఆ కుటుంబ సభ్యులందరి పాలిట దేవుడే- కాసేపు భార్య విషయం  పక్కన బెడితే. ప్రతీ సినిమాలో ఏదో వొక క్యారక్టరైజేషన్ లోపం లేని హీరో వుండడు కదా?

          చిన్నప్పుడు కూతురితో ఆడుకునే దృశ్యాలు మరో హైలైట్. పెద్దయ్యాక కొడుకుతో కారు దిగే స్టయిలిష్ షాట్ మరొక హైలైట్. సచిన్ ఫిజిక్ కి, డ్రెస్ సెన్స్ కి ఏ స్టారూసాటి రాడు. గోవా పార్టీ ఇంకో అందమైన సన్నివేశం. ఇవన్నీ సచిన్ కి బదులు సినిమా స్టార్ తో తీసి వుంటే  ఏ మాత్రం న్యాయం చేసి వుండేవి కాదు- ఇలా డాక్యూ డ్రామా చేసి ఫస్ట్ హేండ్ స్టోరీ చేసి, సాక్షాత్తూ సచిన్ నే  చూపించడం వల్ల ప్రత్యక్షంగా సచినే  అనుభవమవుతాడు మనకి.

          మ్యాచ్ గెలిచినప్పుడల్లా రిపీటయ్యే సచిన్ షాట్స్ ఎప్పుడూ ఒకేలా వుంటాయి- అతను కేరింతలు కొడుతున్న ప్రేక్షక సందోహం వైపు  చూసి బ్యాట్ వూపడు- తల పైకెత్తి ఆకాశంలోకే చూస్తాడు. కనిపించని శక్తి కేసే అలా  చూస్తాడు. 1999 ప్రపంచ కప్ లో వుండగా తండ్రి మరణ వార్తకి తిరిగి వచ్చి, అంత్యక్రియలు ముగించి తిరిగి వెళ్లినప్పట్నించీ రిటైరయ్యే దాకా అతడి ఆకాశంలోకి చూసే చూపే మారిపోయింది- తండ్రి ఆశీస్సులకోసం తలపైకెత్తి చూస్తాడు. ఇదేమీ బాలీవుడ్ రచయిత కావాలని సృష్టించిన మెలోడ్రామా దృశ్యాలు కావు, వాటి ప్రకారం సచిన్ నటించలేదు- మ్యాచుల్లో వివిధసార్లు కెమెరాలకి చిక్కిన అతడి నిజజీవిత భావావేశాలే.  

          అపజయాలతో అతను  అంతర్ముఖీనుడవుతాడు. అప్పుడు ఒకే పాట లూప్ లో పెట్టి  రోజంతా వింటాడు. అది బప్పీ లహరీ పాడిన ‘యాద్  ఆరహా హై’ విరహ గీతం. విచిత్రమేమిటంటే, సచిన్ తండ్రి తాను అభిమానించే సంగీత దర్శకుడు సచిన్ దేవ్ బర్మన్ పేరు లోంచి సచిన్ తీసి సచిన్ కి పెట్టాడు. సచిన్ బప్పీ లహరీ వైపు వెళ్ళిపోయాడు. ఈ  పాట సాహిత్యపరంగా మంచిదే-  బప్పీ గళ మహాత్మ్యం. అయితే దీని బీటే  వీక్, టపోరీ పాటలా వుంటుంది (
కిషోర్ కుమార్ పాటల మధ్య ఎన్నాళ్ళ నించో స్మార్ట్ ఫోన్లో  ఈ పాట ఇరుక్కుని వుంటే చిరాకొచ్చి మొన్నే  డిలీట్ చేసేశాడు ఈ వ్యాసకర్త!).
***
      ఈ డాక్యూ డ్రామాని  పాత ఫోటోలు, ఫ్యామిలీ వీడియోలూ, ఉద్వేగభరిత క్రికెట్ మ్యాచుల ఫుటేజీల ఆధారంగా ఆసక్తికరంగా రూపొందించారు. ఆద్యంతం అవసరమైన చోటల్లా సచిన్ స్వగతంలో సాగుతుంది. సచిన్ తెర పైకొచ్చి తన కథ తనే చెబుతూంటే ఇంటర్ కట్స్ లో దాని తాలూకు పై ఫార్మాట్స్ లోగల దృశ్యాలు తెరపైకి వస్తూంటాయి. ఈ కథనం కూడా నాన్ లీనియర్ గా వుంటుంది. చెబుతున్నదంతా ఫ్లాష్ బ్యాక్సే  అయినా, ఆ ఫ్లాష్ బ్యాక్స్  ఒక క్రమంలో సాగవు. అపక్రమ పద్ధతిలో కాలం ముందుకూ వెనక్కీ కదుల్తూంటుంది. మధ్యమధ్యలో సునీల్ గవాస్కర్, వివియన్ రిచర్డ్స్, విరాట్ కోహ్లీ, అజిత్ టెండూల్కర్, అంజలీ టెండూల్కర్ ల వ్యాఖ్యానాలు  కూడా వస్తూంటాయి. కామెంటేటర్ హర్షా భోగ్లే, ఇంకో జర్నలిస్టు వ్యాఖ్యానాలు కూడా వుంటాయి. వ్యాఖ్యాతలుగా ఇందరు క్రీడాకారుల మధ్య క్రీడా కారుడుకాని అమితాబ్ బచ్చన్ వుండడమే సింక్ కాదు. 

          గత సంవత్సరం ఇమ్రాన్ హాష్మీ నటించిన  ‘అజర్’ విడుదలయింది. కానీ ఇది అజరుద్దీన్ కథ కాదని ముందే చెప్పేశారు. ఇది కాల్పనిక చరిత్ర అనీ  అజరుద్దీన్ తో సంబంధం లేదనీ చెబుతూ ఒక స్పోర్ట్స్ థ్రిల్లర్ లా తీశారు. గత సంవత్సరమే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో  ‘ఎం ఎస్ ధోనీ : ది అన్ టోల్డ్ స్టోరీ’ తీశారు. ఈ రెండూ నటుల చేత నటింప జేసిన క్రికెట్  సినిమాలు. కానీ సచిన్ డాక్యు డ్రామా విషయానికొస్తే – సచిన్ పిచ్ లో లైవ్  యాక్షన్ లో  వున్నప్పుడు, ఇంట్లో- బయటా కుటుంబంతో గడిపినప్పుడూ క్యాచ్ చేసిన రియల్ లైఫ్ దృశ్యాలే. ఆ ఫీలింగ్స్ , ఎమోషన్స్, యాక్షన్ ప్రతీదీ నిజ జీవితంలో పట్టుకున్నవే. ఇందులో సచిన్ ని సచిన్ లా వున్నదున్నట్టు చూపిస్తే,  పై రెండు సినిమాల్లో ఫిక్షన్ చేసి నటుల చేత నటింపజేశారు. సచిన్ ఫస్ట్ హేండ్ ఇన్ఫర్మేషన్ అయితే, పై రెండూ సెకండ్ హేండ్ ఇంఫర్మేషన్స్ . ఇదీ తేడా. 

          ఉన్న పాత బొమ్మల్నే పేర్చి డాక్యుమెంటరీ చూపిస్తే న్యూస్ రీలులా ఏం ఆసక్తి కల్గిస్తుందనే వాళ్లకి దీని ఎడిటర్స్ వాళ్ళ పనితనంతోనే సమాధానం చెప్తారు. ఒక డాక్యుమెంటరీ చూస్తున్నట్టు ఎడిటింగ్ వుండక పోవడమనేది సామాన్య విషయం  కాదు. కథనం లో ఒక లయని మెయింటెయిన్ చేశారు. ఒక క్లిప్పింగ్ కీ ఇంకో క్లిప్పింగ్ కీ మధ్య జంప్స్ లేకుండా స్మూత్ ట్రాన్సి షన్స్  సృష్టించారు. చిన్నప్పుడు మొదలైతే రిటైర్మెంట్ వరకూ స్టోరీ బోర్డు వొక అమర్ చిత్ర కథలా సాగిపోతుంది.
***
     దీన్ని బ్రిటిష్ దర్శకుడే వచ్చి  ఎందుకు రూపొందించినట్టు? ఎందుకంటే దేశీయ దర్శకులైతే  సచిన్ తో మొహమాటాలకు పోతారని, నిష్పాక్షికంగా చూపించరని నిర్మాత నమ్మడం వల్ల.  బ్రిటిష్ స్పోర్ట్స్ సినిమాల దర్శకుడు జేమ్స్  ఎర్ స్కిన్ దీన్ని చేపట్టి నాల్గేళ్ళల్లో పూర్తి చేశాడు. ఇందులో కొన్ని దృశ్యాల్లో కన్పించడానికి అంజలిని ఒప్పించడా నికే రెండేళ్ళు పట్టింది. సచిన్ కథకి ఒక స్ట్రక్చర్ కోసం వేల కొద్దీ భద్రపరచిన ఫోటోలూ, వీడియోలూ, స్పోర్ట్స్ కవరేజీలూ చూశాడు. సచిన్ సన్నిహితులెందరితోనో మాట్లాడి సచిన్ ని సంపూర్ణంగా దర్శించాడు. అతడి దృష్టిలో స్పోర్ట్స్ సినిమా అంటే కేవలం క్రీడాకారుడి సంఘర్షణ, విజయాలూ ఇదే కాదు; క్రీడలు కల్చర్ తో ఎక్కడ ఎలా స్పర్శిస్తున్నాయో హైలైట్  చేసేదే స్పోర్ట్స్ సినిమా. అలాగే సచిన్ కథ చెప్పాలంటే ఒక డ్రైవింగ్ పాయింటు వుండాలి. ఆ డ్రైవింగ్ పాయింటు వరల్డ్ కప్పేనని భావించి సచిన్ కి చెప్తే, తన స్వప్నం వరల్డ్ కప్ సాధించడమే నని  సచిన్ కూడా  చెప్పాడు. ఈ గోల్ ఆధారంగా కథనం చేశాడు దర్శకుడు. జీవిత చరిత్రలు తీయాలంటే మూల కేంద్రం ఒకటి వుండాలి- అది ఆ వ్యక్తి  జీవిత ధ్యేయం కాక మరొకటై వుండే అవకాశం లేదు.  

       దర్శకుడు జేమ్స్  ఎర్ స్కిన్ డాక్యూ డ్రామాని కళాఖండంగా మార్చేశాడు. సచిన్ గురించి కేవలం ఒక సమగ్ర సమచాహర భాండాగారంగా కాక, ఎమోషనల్ ప్రయాణంగా తీర్చిదిద్దాడు. చిట్ట చివర్లో 2013 లో వాంఖడే  స్టేడియంలో లక్షలాది అభిమానుల మధ్య అతడి రిటైర్మెంట్ స్పీచ్ తో ముగింపు దర్శకుడి మాస్టర్ స్ట్రోక్ సన్నివేశం. బరువెక్కిన హృదయాలతో థియేటర్ల  లోంచి రాక తప్పదు ప్రేక్షకులు. ఫైనల్ షాట్ గా భారత రత్న స్వీకరణ.

          రిచర్డ్ అటెన్ బరో తీసిన ‘గాంధీ’ ఎలాటి భక్తి పారవశ్యానికి లోనుజేస్తుందో  అలాటిదే భావోద్వేగం ‘సచిన్’ కల్గిస్తుంది. ‘గాంధీ’ ని తీయడానికి బ్రిటన్ నుంచి అటెన్ బరో వస్తే, బ్రిటన్ నుంచే ‘సచిన్’ ని తీయడానికి ఎర్ స్కిన్ వచ్చాడు. మరో ‘గాంధీ’ ని తీయలేనట్టే, ‘సచిన్’ ని అజరామరం చేసి పెట్టాడు ఎర్ స్కిన్. లెజెండ్ సచిన్ టెండూల్కర్ గురించి ఇంతకంటే లెజండరీ మూవీ వుండబోదు. ఏఆర్ రెహ్మాన్ స్వరాలు కూడా చుట్టూ దడి కట్టేశాయి.

-సికిందర్ 
http://www.cinemabazaar.in