రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

18, అక్టోబర్ 2016, మంగళవారం



     ప్రతిభ నిరూపించుకోవడానికి షార్ట్ ఫిలిమ్సే కాదు, డాక్యుమెంటరీ లనే విభాగం కూడా వుంది. ఐతే ఇది సామాజిక బాధ్యతలతో కూడుకున్నది. వివిధ సామాజిక సమస్యలపై లోతైన అధ్యయనాన్ని డిమాండ్ చేసేది. ఒక రకంగా ఇది జర్నలిజమే. ఉదాహరణకు ‘పార్టనర్స్ ఇన్ క్రైమ్ ‘ అనే డాక్యుమెంటరీ ఫిలిం నే తీసుకుంటే, ఇది సినిమా రంగానికి బెడద గా తయారైన కాపీరైట్/ పైరసీల పెను సమస్య గురించి విశ్లేషనాత్మకంగా చర్చిస్తుంది. ఈ డాక్యుమెంటరీ వివిధ డాక్యూ ఫెస్టివల్స్ లో అనేక అవార్డులు పొందింది. పారోమితా వోహ్రా రూపొందించిన ఈ డాక్యూమెంతరీ కాపీరైట్ చౌర్యం గురించి చాలా ఆశ్చర్యకరమైన అంశాలు వెలికి తీసి లోకానికి ప్రదర్శిస్తుంది.

          ఒక లెక్కలేనన్ని సినిమాలని, మ్యూజిక్ ని, వీడియోలనీ డౌన్ లోడ్  చేసుకున్న కాకలుతీరిన పైరసీ దారుడ్ని’నువ్వు చేస్తున్నది చట్ట విరుద్ధమని తెలుసా?’ అని అడిగితే  – ‘ఇవి నాకేం ఉత్త పుణ్యానికి రాలేదు, వీటిని సంపాదించడానికి చాలా హార్డ్ వర్క్ చేశాను. నేను చేసిన వర్క్ ఎంత విలువైనదో నాకు తెలుసు’ అనేశాడతను.

          ఇలా పైరసీయే గాకుండా, కళాకారులు చేసే పాల్పడే కాపీరైట్ ఉల్లంఘనల గురించి కూడా ఇందులో చిత్రీకరించారు. ముఖ్యంగా మ్యూజిక్ కి సంబంధించి..ఇండియన్ రాక్ బ్యాండ్ ‘ధర్మల్ అండ్ ఏ క్వార్టర్’ ఎలా తమ ట్యూన్లని సినిమాపాటలకి కాపీ చేసి వాడుకుంటున్నారో వివరించారు. అంతేగాకుండా ఇంటర్నెట్ లో తమ సంగీతాన్ని తమ అభిమానులే కాపీ రైట్ హక్కుల్ని ఉల్లంఘించి పైరసీకిపాల్పడుతున్నట్టు  ఆరోపించారు. దర్శకురాలు పారోమిత్రా వోహ్రా వ్యవస్థీ కృత 

మాఫియాలుగా మారిన పైరసీదార్ల దగ్గరనుంచి, వివిధ కళా రంగాల్లో స్వయంగా కాపీరైట్ ఉల్లంఘనలకి పాల్పడుతున్నకళాకారుల వరకూ బయటపడని నిగూఢ రహస్యాలెన్నో వెలికి తీశారు. అసలు పైరసీ అనేది వ్యవస్థీ కృత నేరమా, లేక ఇదో రకమైన వర్గ పోరాటమా అన్న సందేహాన్ని కూడా రేకెత్తించారు.  ఈ మొత్తం వ్యవహారంలో బాధితులవుతున్న స్టేక్ హోల్డర్ల అభిప్రాయాలను కూడా సేకరించారు. సినిమాలని చట్ట విరుద్ధంగా డౌన్ లోడ్ చేసుకునేవారితో, పైరసీ సీడీ ల సేల్స్ మాన్ లతో, ఏది ఇన్ స్పిరేషన్ –ఏది కాపీ అంటూ రీసెర్చ్ చేస్తున్న బ్లాగర్ తో, పైరసీ- కాపీరైట్ చట్టాల్లోని లోసుగులతో సొమ్ము చేసుకుంటున్న యువ పారిశ్రామిక వేత్తతో- ఇలా అటూ ఇటూ అందరు వ్యక్తులతో సంక్షిప్త ఇంటర్వ్యూలు  డాక్యుమెంటరీలో పొందుపర్చారు.

          తొలి నుంచీ కాపీరైట్ చరిత్రని అద్భుతమైన ఇన్ఫో గ్రాఫిక్స్ ద్వారా చూపిస్తూ, బ్యూటిఫుల్ సౌండ్ ట్రాక్ ని జోడించి ప్రయోజనాత్మకమైన ఈ ఇన్వెస్టిగేటివ్ ఈ డాక్యుమెంటరీని అందించిన దర్శకురాలికి అభినందనల వెల్లువ కూడా అంతే స్థాయిలో వుంది. యూట్యూబ్ లో దీన్ని వీక్షించ వచ్చు.

-సికిందర్




17, అక్టోబర్ 2016, సోమవారం

షార్ట్ టేక్:


     షార్ట్ ఫిలిమ్స్ ఫెస్టివల్స్ లో పాల్గొనాలని గుడ్డిగా ప్రయత్నించకూడదు. వాటి నిర్వాహకులు  సెలెక్టివ్ గా షార్ట్ ఫిలిమ్స్ ని ఎంపిక చేసుకుంటారు. కొన్ని కొన్నిరకాల సబ్జెక్టుల్ని మాత్రమే  అనుమతిస్తారు. యూత్ కోసం ఎక్కువగా తీసే లవ్ సబ్జెక్టులు అసలే తీసుకోరు. బలమైన సందేశాత్మకమైన షార్ట్స్  ఆ ఫెస్టివల్స్ లో చోటు సంపాదించుకుంటాయి. కాబట్టి టెక్నాలజీనంతా  రంగరించి ఎంత సైన్స్ ఫిక్షన్ షార్ట్ తీసినా ప్రవేశం లభించకపోవచ్చు.  ఆ షార్ట్ ఫిలిమ్స్ ప్రదర్శనల్లో ప్రేక్షకులు పరిమిత  టేస్టు గల వారై  వుంటారు. ఫెస్టివల్స్ ని పక్కన బెట్టి,  విస్తృత టేస్ట్స్ వున్న  ప్రేక్షకుల  కోసం షార్ట్స్ తీయడం  ఉత్తమం. 

       
వీటికి వేదికలుగా యూట్యూబ్, వీమియో,ఫన్నీ లాంటి ఆన్ లైన్ ప్లాట్ ఫామ్స్ వున్నాయి. విస్తృత పరిధిలో ప్రేక్షకుల్ని ఆకర్షించాలంటే, అలాటి కథల్నే ఎన్నుకోవాలి. ఐతే వీటిని తీశాక వెబ్ ప్రపంచంలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యే అసంఖ్యాక ఇతర షార్ట్స్ తో పోటీ పడాల్సి ఉంటుందని మరువకూడదు. ఎంటర్ టైన్ మెంట్ కోసం ప్రేక్షకులకి మిలియన్ల కొద్దీ ఛాయిసులు ఆన్ లైన్ లో ఊరిస్తూ వుంటాయి. ఒక హులూనో, ఒక నెట్ ఫ్లిక్స్ నో క్లిక్ చేస్తే చాలు. ఇంకా ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి వేదికలు కూడా వున్నాయి. ఓ షార్ట్ ఒకసారి ఆన్ లైన్ లో క్లిక్ అయిందంటే విస్తృత పరిధిలో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ అయిన ఫేస్ బుక్, ట్విట్టర్ లలో కూడా పెద్ద ప్రచారం లభిస్తుంది. 

        వెబ్ ప్రపంచంలో దృష్టి నాకర్షిం చాలంటే, షార్ట్ ని తీయడంలో చాలా మెళకువలు  తెలిసి వుండాలి. వీటిలో ముఖ్యమైనది పేసింగ్. అంటే కథ నడక వేగం. వెబ్ లో లక్షలకొద్దీ షార్ట్స్ దర్శన మిస్తాయి. అందమైన ఛాయాగ్రహణం, నటనలు, గొప్ప కథ ఇవన్నీ వుంటాయి. కానీ  ఒక్క పేసింగ్ అనే టెక్నిక్ ని నిర్లక్ష్యం చేయడం వల్ల అవి స్లోగా నడిచే కథలగా పరమ బోరు కొడతాయి. మొనాపలీ వాతావరణ పరిస్థితులు వుండే సినిమాలకి థియేటర్లలో ఇది చెల్లిపోతుంది. కానీ అనేక ప్రత్యాన్మాయలూ, పోటీ కూడా వుండే  ఆన్ లైన్ వేదికల మీద షార్ట్స్ కి అలాకాదు. పేసింగ్ లేకపోతే  అవి ఒక్క సెకండ్ లో ఫ్లాప్ అయిపోతాయి. షార్ట్ ఫిలిం ని  లాప్ టాప్ లో ఎడిట్ చేసి వంద అడుగుల తెర మీద వేసి చూసుకుంటే పేసింగ్ ఎంత మందకొడిగా వుందో తెలిసిపోతుంది. కాబట్టి ఎంత స్మాల్ స్క్రీన్ వుంటే అంత ఫాస్ట్ పేసింగ్ అవసరం. ఇది జనరల్ ఫిలిం మేకింగ్ రూలు. 

        రెండోది- టైటిల్స్ సినిమా టైటిల్స్ లా చాంతాడంత సాగకుండా చూసుకోవాలి.  కథని వెనువెంటనే  ప్రారంభించేసి,  మొదటి షాట్ లోనే ప్రేక్షకుడు ఇన్వాల్ అయ్యేలా చేసుకో గల్గాలి. పది  నిమిషాల షార్ట్ లో చివరి నిమిషపు విషయం చెప్పడానికి సుదీర్ఘమైన ఉపోద్ఘాతం ఇస్తే ఎవరూ భరించలేరు. ఉపోద్ఘాతాలని  కట్ చేయాలి. ఫ్లాష్  బ్యాక్స్ కి కూడా షార్ట్స్ లో స్థానం లేదు. ఒక నిమిషం దాటి విషయం లేకపోతే  ఆడియెన్స్ చూసే అవకాశం లేదు. యాడ్ ఫిలిమ్స్ లాగే షార్ట్ ఫిలిమ్స్ కి అటేన్షన్ స్పాన్  తక్కువ. సినిమా హాళ్ళలో ప్రేక్షకుల్ని కంట్రోల్ చేయగలం. అది అక్కడి  మోనాపలీ వాతావరణం, సినిమా మాధ్యమానికి లభించిన వరం.  సమయం, స్థలం, చీకటి వాతావరణం, సౌండ్ వాల్యూం, కూర్చునే సీట్లు, తినే స్నాక్స్ అన్నీ కంట్రోల్ చేయగలరు . ప్రేక్షకుడు థియేటర్ లో సినిమా చూడడమంటే అది తన చేతిలో లేని  పాసివ్ అనుభవం. ఆన్ లైన్ లో అలా కాదు. ప్రేక్షకుడు యాక్టివ్ గా వుంటాడు. ఏ మాత్రం కంట్రోల్ చేయలేం. ఒక్క సీను బోరు కొట్టినా, మూడ్ బాగా లేకపోయినా క్లిక్ చేసేసి మరో దా నికి వెళ్ళిపోతాడు. లేదా మ్యూట్ చేసి వేరే పని చూసుకుంటాడు. డిలీట్ కూడా చేసెయ్యొచ్చు. షార్ట్స్ మేకర్ ఎంతో గొప్పగా అనుకున్న కథని ప్రేక్షకుడు తన చేతులతో రకరకాలుగా చిత్ర హింసలు పెట్టగలడు. 

        అందుకే ఆన్ లైన్లో ప్రేక్షకులని కథలో ఇన్వాల్వ్ అయ్యేలా చేసుకోవాలి. కథలో పాలు పంచుకునేందుకు  ఆహ్వానించాలి. అలాటి షార్ట్స్ కొన్ని – వెల్కం టు పైన్  పాయింట్, సోల్జర్ బ్రదర్, 3డ్రీమ్స్ ఆఫ్ బ్లాక్, వైల్డర్ నెస్ ఇన్ డౌన్ టౌన్ - అనేవి వు న్నాయి.  వీటిని ఒకసారి పరిశీలించ వచ్చు.
The Thomas Beale Cipher అనే షార్ట్ లో దాని దర్శకుడు ఉద్దేశపూర్వకంగా 16 ఎన్క్రిప్టెడ్  మేసేజిల్ని  హైడ్ చేసి ఉంచాడు. ఆ ఫిలిం చూసే ఆన్ లైన్ ప్రేక్షకులు ఆసక్తితో వెనక్కొచ్చి వాటిని సెర్చ్ చేసి, కథని ఇంకా లోతుగా అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించేలా వుందది. 

        కాబట్టి ఆన్ లైన్లో ప్రేక్షకులు మన అదుపులో వుండరు కదా అని బాధ పడనవసరం లేదు. ప్రేక్షకుల్ని కథలో ఇన్వాల్వ్ చేయగల  టెక్నిక్స్ గురించి  ఆలోచించాలి. ఇలా ఇంటరాక్టివ్ మూవీ మేకింగ్ ని అలవర్చుకుంటే ఆన్ లైన్ లోకూడా ప్రేక్షకుల మీద అదుపు సాధించ వచ్చు! ఇంటర్నెట్ కోసం తీసిన ఇంటరాక్టివ్ మూవీస్ ని నెట్ లో చూసుకోవచ్చు. వీకీ పీడియాలో లిస్టు లభిస్తుంది.

        షార్ట్ ఫిలిమ్స్ కి ఐడియాలు ఆలోచించడం చాలా ఫన్ గా వుంటుంది. పనిలో ఫన్ ఫీలయితేనే ఫెంటాస్టిక్ గా వుంటుంది. షార్ట్ ఫిలిమ్స్ షార్ప్ గా ఆడియెన్స్ కి ఆలోచింప జేసే మెసేజ్ లు ఇవ్వగలవు. అంతే కాదు, పెద్ద పెద్ద సినిమాల్లో చూపలేని విషయాలు వీటికే ప్రత్యేకం. మరి ఇంతటి వైవిధ్యాన్ని కలిగివుండే షార్ట్ ఫిలిమ్స్ తీయడానికి వెరైటీ ఐడియాలు ఎలావస్తాయి? అదే తెలుసుకుందాం.

        ప్రతియేటా వివిధ కేటగిరీల్లో సినిమాలకి ఆస్కార్ అవార్డులిచ్చే అకాడెమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ వారు,  షార్ట్ ఫిలిమ్స్ టైటిల్స్ వగైరా అన్నిటితో కలుపుకుని 40 నిమిషాలు, లేదా అంతకు తక్కువ రన్నింగ్ టైం ని కలిగి వుండాలని నిర్ణయించారు. ఐతే ఒక మూవీని షార్ట్ ఫిలిం అనిగానీ, ఫీచర్ ఫిలిం అని గానీ నిర్ణయించడానికి ఫిక్సెడ్ క్రిటేరియా ఏదీ లేదు. అలా అనుకుంటే సినిమా చరిత్ర  ప్రారంభమైన కాలంలో లఘు చిత్రాలే కథా ఫీచర్ ఫీచర్ సినిమాలుగా చెలామణి అయ్యాయి. అయితే రానురాను ఆ లఘు కథా చిత్రాలే నిడివి పెరిగిపోయి సినిమాలు అంటూ అర్ధం చెప్పుకోవడంతో, లఘుచిత్రాలు కాన్సెప్ట్ వేరే దారి చూసుకోక తప్పలేదు - అది సినిమాలకంటే భిన్నంగా కథల్ని  చెప్పే ప్రయోగం!  ఇందులో భాగంగానే ఆర్ట్ ఫిలిమ్స్ వచ్చాయి.ఇప్పుడు ఆర్ట్ ఫిలిమ్స్ కూడా ఆదరణ కోల్పోయి నవ యువ మేకర్లతో భారీ ఎత్తున షార్ట్ ఫిలిం అనే హైటెక్ కేటగిరీకి తెరతీశాయి.

        ఐతే సమస్య ఏమిటంటే ఈ రోజుల్లో సినిమాలకే సరైన కథల్లేక ఫ్లాప్ అవుతున్నాయి. అలాటి సమస్య షార్ట్ ఫిలిమ్స్ కి లేదని కాదు. షార్ట్ ఫిలిమ్స్ కి సమస్య సినిమా కథల్ని అనుసరిస్తేనే వస్తుంది. సినిమాల్లో చూసేదే షార్ట్ ఫిలిం లో కూడా చూపిస్తే ఇక షార్ట్ ఫిలిమ్స్ ప్రత్యేకత ఏమిటి?వాటిని ఎందుకు చూడాలి? కాబట్టి సినిమాల మీద మోజుతో షార్ట్ ఫిలిమ్స్ ని క్రియేటివ్ పరంగా బలి చేయకుండా బతికించుకుంటే, అలా ఈ కేటగిరీని కాపాడుకుంటున్న వాళ్ళుగా పేరు తెచ్చుకుంటే,  గ్రేట్ అన్పించుకుంటారు.
        కాబట్టి ఇకనుంచి షార్ట్ ఫిలిమ్స్ కి కథల్ని ఇలా విభిన్నంగా ఆలోచించడానికి ప్రయత్నించ వచ్చేమో  :

1. ఫ్రెండ్ షిప్పే శాశ్వతమని చెప్పే ఐడియా 
       ఈ సింపుల్  కథ తీయడానికి మంచి గ్రాహ్య శక్తి, నైపుణ్యం, రాసేటప్పుడు తీసేటప్పుడు అంకిత భావంతో టీం వర్క్ వుంటే ఎక్కడికో వెళ్ళిపోతారు. స్నేహమే శాశ్వతం అని చెప్పే ఈ స్టోరీ ఐడియాని పరిశీలించండి:

        ఇద్దరబ్బాయిలు, ఒకమ్మాయి ( అజయ్-నాగ్-నవ్య అనుకుందాం) ముగ్గురూ ఇంటర్ అప్పటి నుంచే మంచి ఫ్రెండ్స్. అజయ్, నాగ్  లకి  నవ్య తన మాజీ బాయ్ ఫ్రెండ్ ద్వారా పరిచయమైంది.  ఆ మాజీ బాయ్ ఫ్రెండ్ ఆమెతో విడిపోయాక కూడా, అతను పరిచయం చేసిన అజయ్, నాగ్  లతో ఆమె ఫ్రెండ్ షిప్ ని కంటిన్యూ చేస్తూనే వుంది. ఐతే ఈ ముగ్గురూ ఎప్పుడూ తమమధ్య  లవ్ గురించి ఆలోచనే రానీయ లేదు. ఆది ఫ్రెండ్ షిప్ ని డిస్టర్బ్ చేస్తుందని భావించారు.  కాకపోతే అజయ్ వేరే కావ్య అనే అమ్మాయితో లవ్ లో పడ్డాడు. కావ్యకి అజయ్- నవ్యల ఫ్రెండ్ షిప్ గురించి తెలిసినా దాన్ని అర్ధం జేసుకుని అడ్జస్ట్ అయింది.

        ఇలావుంటే, కొంతకాలానికి నవ్య తను నాగ్ ని ప్రేమిస్తున్నట్టు గ్రహించింది. ఆ విషయం నాగ్ కి  చెప్పడానికి వెళ్లి నప్పుడు అతను తన గర్ల్ ఫ్రెండ్ సౌమ్య  గురించి చెప్పాడు. నవ్య వెంటనే ఫ్రెండ్ షిప్ నటిస్తూ అతడికి కంగ్రాట్స్ చెప్పింది. అయితే  నాగ్ ని ప్రేమిస్తున్న సౌమ్యకి, అతడితో నవ్య ఫ్రెండ్ షిప్ చేయడం నచ్చలేదు.  ఇది గ్రహించిన నవ్య,  నాగ్ తోబాటు - అజయ్ కీ దూరంగా ఉండసాగింది. 

        ఇలా వుండగా ఓ హేపీ న్యూ ఇయర్ నాడు,  నాగ్  పార్టీ ఇచ్చి నవ్యని  కూడా ఆహ్వానించాడు. ఇది తెలుసుకున్న సౌమ్య  రావద్దని నవ్య ని హెచ్చరించింది. ఫోన్ లో ఇలా హె చ్చరిస్తూంటే అది విన్న నాగ్ ఇంకొక్క క్షణం ఆలస్యం చేయకుండా సౌమ్యని వదిలేసి, నవ్య దగ్గరికి వెళ్ళిపోయాడు. అప్పుడు గానీ తను అసలు లవ్ చేస్తున్నది నవ్య నే అని తెలుసుకోలేకపోయాడు.  దీంతో అజయ్-కావ్య, నాగ్ - నవ్య కపుల్స్ ఇద్దరికీ వాళ్ళమధ్య ఫ్రెండ్ షిప్ దెబ్బతినకుండా సమస్య పరిష్కారమై పోయింది.

2. అపరిచితుల్ని నమ్మడం డేంజర్ అని చెప్పే ఈ స్టోరీ
       
దేళ్ళ వినీత్ మదర్ తో ఉంటున్నాడు. ఫాదర్ లేడు. మదర్  ఓవర్ టైం చేసి కష్టపడి సంపాదిస్తూ,  వినీత్ కి ఏ లోటూ రాకుండా చూసుకుంటోంది. ఒక్కోసారి ఆమె నైట్ షిఫ్ట్ కి వెళ్ళినప్పుడు ఒక టీనేజి కుర్రాడు ఆది వచ్చి వినీత్ కి తోడుగా ఉంటున్నాడు.

        టీవీలో వినీత్ ముందే ఆది చూడకూడని ప్రోగ్రాములు చూస్తాడు. అసభ్యంగా మాట్లాడతాడు. స్మోక్ చేస్తాడు. డ్రింక్ కూడా చేస్తాడు. కులపరంగా వినీత్ దూషిస్తాడు. అలా  ఒక రోజు వినీత్ పాలు తాగుతున్న గ్లాసు చేతిలోంచి జారి పగిలింది. దాంతో ఏడవ సాగాడు. అది చూసి ఆది కోపం పట్టలేక,  వినీత్ మెడ బట్టుకు లాగి బీరువాలోకి తోసి లాక్ చేసేశాడు. వినీత్ లోపలి నుంచి గట్టిగా అరుస్తూంటే, ఏడుస్తూంటే ఆది వాడి నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్ళు చేతులు కట్టేసి మళ్ళీ బీరువాలోకి తోశాడు.

        తెల్లారి డ్యూటీ నుంచి మదర్ వచ్చి చూస్తే,  ఇద్దరూ కన్పించలేదు. ఇంట్లో విలువైన వస్తువులూ పోయాయి. బీరువా తెర్చి చూస్తే నిర్జీవంగా కొడుకు...
        ఈ సింపుల్ కథల్ని ఎలా విజువలైజ్ చేస్తే ఎఫెక్టివ్ గా ఉంటాయో బాగా గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి.  ఏ కథ చెప్పినా అది ఏదో ఒక మెసేజ్ పాస్ చేసినట్లయితే మంచి షార్ట్ గా గుర్తుంది పోతుంది. 

       
-సికిందర్

       






15, అక్టోబర్ 2016, శనివారం

రివ్యూ!


రచనదర్శకత్వం: కోడి రామకృష్ణ 
దిగంత్, రమ్య, విష్ణువర్ధన్, రాజేష్‌వివేక్, సాయి కుమార్, ముకుల్‌దేవ్‌, రవి కాలే దర్శన్, సాధు కోకిల, తదితరులు. 
సంగీతం: గురుకిరణ్‌,
 ఛాయాగ్రహణం: హెచ్‌.సి.వేణు 
బ్యానర్స్: ఇన్‌బాక్స్ పిక్చ‌ర్స్ ప్రై.లి
, బ్లాక్ బ‌స్ట‌ర్ స్టూడియోస్‌, పెన్ మూవీస్‌
నిర్మాతలు: సాజిద్‌ఖురేషి
, సోహైల్‌అన్సారీ, ధవల్‌గడ 
విడుదల:
14 అక్టోబర్, 2016
***
      అసలు టైటిల్లోనే వ్యాకరణ దోషం, ఆ పైన రాసి తీసిందంతా కషాయం. కోడి రామకృష్ణ రేపెప్పుడైనా ‘శంకరాభరణం’ పేరుతో సినిమాతీస్తే దాని టైటిల్ ‘శంకరభరణం’ అవుతుందేమో. లేక తెలుగుని మర్చిపోతున్న- లేదా తెలుగునే ఖాతరు చెయ్యని ఇవ్వాళ్టి  లోకం కోసం సులభగ్రాహ్యంగా వుండేందుకు ‘సంస్కరించి’  ఇలా టైటిల్స్ పెడుతున్నారేమో. ‘నాగాభరణం’  కాస్తా ‘నాగభరణం’ అయ్యింది. సినిమాలో టైటిల్ సాంగ్ ని మాత్రం సింగర్  ‘నాగాభరణం...’ అనే ఇంతెత్తున రాగం తీసి పాడతాడు. భక్తీ-శక్తి ఫాంటసీ తీస్తున్నప్పుడు పెట్టిన మకుటం పట్లే భక్తిభావం లేకపోతే ఆ పైన చేసిన కృషిని ఎలా నమ్మాలి. ఇదొక  కలశం కోసం పోరాటమన్నారు కాబట్టి- కలశం అంటే భరిణె కూడా అవుతుందనుకుని, ఆ భరిణెని కాస్తా భరణం చేసి నాగ యొక్క భరణం = నాగభరణం అని పెట్టారేమోనని కూడా సినిమాని చూసి జస్టిఫై చేసుకోవడానికి వెంటనే బయల్దేరి వెళ్తాం. కానీ భరణం అంటే మనోవర్తి అని అర్ధం కదా, ఒకవేళ నాగదేవత మగాడైన హీరోకే భరణం రివర్స్ లో ఇస్తోందా అన్న ఇంకో పురుగు మనల్ని దొలుస్తుంది. ఇలా నాగ +ఆభరణం = నాగాభరణం కొచ్చిన తిప్పలు ఇన్నీ అన్నీ కావు!

        భాష స్లిప్ అవుతున్నట్టే ఇప్పుడు కథా కథనాల్లోనూ, దర్శకత్వం లోనూ స్లిప్ అవుతున్నారు 130 సినిమాలు తీసిన కోడి రామకృష్ణ. దీన్నర్ధం జేసుకోగలం. ఒకే కళ్ళద్దాలు  కెరీర్ అంతా ధరిస్తే ఈ సమస్య తప్పదు. తరంతరం సినిమాలు చూసే కళ్ళు మారిపోతూంటాయి ప్రేక్షకుల్లో. ఎనభై దాటింత్తర్వాత కూడా కౌబాయ్ నటుడు క్లింట్ ఈస్ట్ వుడ్ ఇప్పుడు కొత్త కళ్ళద్దాలతో  ‘సల్లీ’ తీసి పేరు తెచ్చుకున్నాడు. అదే  ‘గాడ్ ఫాదర్’ కపోలా ఐదేళ్ళ క్రితం ‘ట్విక్స్ట్’ తీసి విఫలమయ్యాడు. కళ్లద్దాలతోనే జాతకాలన్నీ. 

        ‘అరుంధతి’ కళ్ళద్దాలు ఇప్పుడు లేవు రామకృష్ణకి. ‘అరుంధతి’ కి లాంటి మేకింగ్ లో పాటుపడే నిర్మాత (శ్యామ్ ప్రసాద్ రెడ్డి) తోడ్పాటు కూడా లేదు. దీంతో ఈ ఫాంటసీకి ఆథ్యాత్మిక విలువ వున్నా, ఆ ఆథ్యాత్మిక ఔన్నత్యాన్ని  సాధించే గొప్ప అవకాశాన్ని జారవిడుచుకున్నారు. కేవలం గ్రాఫిక్స్ హంగామాగా మార్చేశారు - మైనస్ కథా కథనాలతో. 

        కథ ఎత్తుగడ బ్రహ్మాండమే - ‘బద్రినాథ్’ ఎత్తుగడలాగే. ఆ తర్వాత ఎత్తుగడతో సంబంధంలేని రొటీన్ ఫార్ములా లవ్- మసాలా నడకే ‘బద్రీనాథ్’ లాగే. తెలిసి తెలిసి ‘బద్రినాథ్’ టెంప్లెట్ లో ఎలా పడిపోయారో రామకృష్ణ. 

      గ్రహణం సమయంలో దేవతలు తమశక్తి యుక్తుల్ని కోల్పోతూంటారని సినిమా మొదలెట్టారు. దేవతలు నిర్వీర్యమవగానే  దుష్ట శక్తులు రెచ్చిపోయి లోకాన్ని అతలాకుతలం చేస్తూంటాయని చూపిస్తారు. గ్రహణ సమయంలో ఈ దుష్ట శక్తులనుంచి లోకాన్ని కాపాడాలని దేవతలు ఎంతో శ్రమించి ఒక మహాకలశాన్ని తయారు చేస్తారు. దీన్ని భూగోళం మీద ఒక చోట ప్రతిష్టించి శివయ్య (సాయికుమార్) కుటుంబీకుల్ని రక్షకులుగా నియమిస్తారు. ఈ కలశాన్ని ప్రతిష్టించిన చోట దుష్ట శక్తులు చొరబడకుండా  అష్ట దిగ్బంధం చేస్తారు. ఈ కలశానికి ‘నాగభరణం’ అని పేరుపెడతారు.  

        ఇక దుష్ట శక్తులు దీన్ని చేజిక్కించుకుని దేవతల్ని ఆడించాలని చెయ్యని ప్రయత్నం వుండదు యుగయుగాలుగా. చచ్చి పుడుతూ చచ్చి పుడుతూ వున్న మహా దుష్టశక్తి కపాలి ( రాజేష్ వివేక్) కలశం కోసం  చెయ్యని ప్రయత్నం వుండదు.  ఒక దాడిలో ఆ కలశాన్ని కాపాడుకొస్తున్న శివయ్య చనిపోతాడు. అతడి కూతురు నాగమ్మ (రమ్య)  ఆ కలశం బాధ్యత తీసుకుంటుంది. నాగదేవత ఆమెకి కన్పిస్తూ పూర్తి మద్దతు ప్రకటిస్తూంటుంది. మళ్ళీ కపాలి దాడిలో నాగమ్మ కూడా చనిపోతుంది. చనిపోతూ కపాలిని కూడా చంపి- ఇంకో జన్మెత్తి ఆ కలశాన్ని కాపాడుకుంటానని ప్రతిజ్ఞ చేస్తుంది. ఇదీ ఎత్తుగడ. 

       
ఇప్పుడు ఫ్రెష్ గా నాగమ్మ మానసగా పుట్టడంతో ప్రస్తుత కాలపు కథ ప్రారంభమవుతుంది. కపాలిగాడు ఇప్పుడూ పుట్టి ఆ కలశం కోసం కేకలు పెడుతూంటాడు. ఇప్పుడా కలశం దూరంగా ఆర్కియాలజీ శాఖ వాళ్ళ ఆధీనంలో ఢిల్లీలో వుంటుంది. ఈ శాఖ వాళ్ళు సంగీత పోటీలు పెడతారు. ఈ వరల్డ్ మ్యూజిక్ షోలో ఎవరు గెలిస్తే వాళ్ళకి ఆ కలశాన్ని ఇచ్చి పారేస్తామని ప్రకటిస్తారు- గెలిచిన వాళ్ళు దాన్ని తీసుకుని ఏం చేసుకుంటారో అర్ధంగాదు. దానికిప్పుడు దివ్యశక్తులు లేవా? ఇందుకేనా దుష్ట శక్తులుగా ఇప్పుడు టెర్రరిస్టులు తెగిస్తున్నారు. అయినా ఒక పురాతత్వ విలువ కలిగిన వస్తువుని పాత తుక్కు కింద వదిలించుకుంటారా పురాతత్వ శాఖ వాళ్ళు? అలా వదిలించుకుంటున్న ఆ  కలశంలో ఇంకేముందని కపాలిగాడు మళ్ళీ పుట్టి కేకలేస్తున్నాడో కూడా అర్ధంగాదు. 

        ఈ మ్యూజిక్ షోకి నాగచరణ్ (దిగంత్) పోటీ పడతాడు. ఈ నాగ చరణ్ ఆ కలశాన్ని గెలిస్తే దాన్ని కొట్టేయాలని ఒక విలన్ (ముకుల్ దేవ్) అతడి గ్యాంగూ బయల్దేరతారు. ఇదీ విషయం. ఇక పైనేం జరుగుతుందో వెండితెర మీద చూడాల్సిందే.
***

      వెండి తెర మీద - ప్రధానంగా కన్నడ సోదరులకు -  వాళ్ళ దివంగత  అభిమాన హీరో  విష్ణు వర్ధన్ ని గ్రాఫిక్స్ తో  ప్రాణప్రతిష్ఠ చేసి చూపిస్తే,  బ్రహ్మాండంగా ఈ ఫాంటసీ వర్కౌట్ అవుతుందన్న ఒకే ఒక్క లక్ష్యం పెట్టుకుని ఈ సినిమా తీసినట్టు అన్పిస్తుంది.  క్లయిమాక్స్ లో ఇలా విష్ణు వర్ధన్ తో సృష్టించిన పోరాట దృశ్యాలు అద్భుతమే కాదనలేం. ‘మకుట’ విజువల్ ఎఫెక్ట్స్ సంస్థకి- మగధీర, ఈగ, బాహుబలి లాంటి ఎన్నో అద్భుతాల దిగ్గజానికి- ఈ క్రెడిట్ అంతా పోతుంది. అయితే కోడి రామకృష్ణ ఆధ్వర్యం లో ఈ గ్రాఫిక్స్ హంగామా అంతా కూడా ‘అరుంధతి’ లో లాగా కథలో కలిసిపోతేనే అందం. ఎత్తుగడ తర్వాత కథే లేనప్పుడు,  కోడి రామకృష్ణే స్వయంగా మొన్న అన్నట్టు-  గ్రాఫిక్స్‌ సినిమాని ఎలివేట్‌ చేయాలి, కానీ సినిమాలో గ్రాఫిక్స్‌ పెట్టకూడదనే దాన్ని అర్ధం జేసుకోలేం. ఆయన చెప్పిందాంట్లో రెండోదే నిజం చేశారు. 

        ఈ సినిమాని అందరూ కన్నడ నటులతో- ఒకరిద్దరు హిందీ వాళ్ళతో తీసి తెలుగులో డబ్ చేశారు. దర్శకుడు తెలుగువాడే. తెలుగు నటుల్ని కూడా కొందర్ని పెట్టుకుని  జాగ్వార్ లా కన్నడ- తెలుగు సినిమాలాగా తీయలేక పోయారు. 

        ఆ
ధ్యాత్మిక విలువ వుండే కథల్ని ఎందుకని ఆ పాయింటుని ఓపెనింగ్ బ్యాంగ్ గా గొప్పగా ఇచ్చి వదిలేస్తారో తెలీదు. అయిడియాని దాని పరిధి మేర విస్తరించలేనప్పుడు అంతంత విస్తారమైన బడ్జెట్లెందుకు? ఒకప్పటి చరిత్రని పునరావృతం చేస్తూ టెర్రరిస్టులు దేవాలయాల్ని ధ్వంసం చేస్తున్నారని మొదలెట్టిన ‘బద్రీనాథ్’  వ్యవహారం, ఆ కథ వదిలేసి  ఓ దేవాలయానికి రక్షకుడుగా వున్న హీరో మసాలా రొటీన్ ప్రేమ కథగా మార్చేశారు.దీనికి  ఫ్యాక్షన్ టైపు హీరోయిన్ తండ్రి విలన్! ఇది సక్సెస్ అయ్యిందా? 

       
కోడిరామకృష్ణ కథ ఎత్తుగడ అచ్చం  ‘అఖిల్’ కథకి  ఎత్తుగడలాలాగే లేదా? అక్కినేని అఖిల్ ని పరిచయం చేస్తూ గత నవంబర్ లో విడుదల చేసిన ‘అఖిల్’ లో- పూర్వకాలంలో ఎప్పుడో కొందరు ఋషులు భూగోళం బాగోగుల కోసం,  ‘జువాఅనే ఒక గోళాన్ని తయారు చేసి తీసికెళ్ళి భూమధ్య రేఖ దగ్గర ఓ ఆఫ్రికన్ గూడెం లో పడేస్తారు. సూర్యగ్రహణాలు  పూర్తయ్యాక వెలువడే తొలి సూర్య కిరణాలు చాలా ప్రమాదకరమని వాళ్ళు నమ్ముతారు. కనుక ఆ తొలి సూర్య కిరణాలు ఈ జువాగోళం మీద పడితే వాటి దుష్ప్రభావం నుంచి భూగోళం తప్పించుకుంటుందని శాస్త్రం చెప్తారు (ఓజోన్ పొర ఏం చేస్తున్నట్టో మరి). అలా ఆ గోళాన్ని గూడెం వాసులు తరతరాలుగా కాపాడుకొస్తూంటారు. దీని గురించి తెలుసుకున్న ఒక రష్యన్ సైంటిస్టు దాన్నికాజేసి ప్రపంచాన్ని ఆడించాలని కుట్ర పన్నుతాడు. ఆ గోళం అతడి గ్యాంగ్ చేతిలో పడకుండా, బోడో అనే గూడెం వాసి ఒకడు తీసుకుని పారిపోతాడు. వాణ్ణి వెతికి పట్టుకునే పనిలో వుంటుంది ఆఫ్రికన్ గ్యాంగ్. ఇదీ ఎత్తుగడ. దీని తర్వాత నడిపించింది అంతా హీరో గారి ‘బద్రీనాథ్’  మార్కు మూస ప్రేమకథే గా? ఇదీ సక్సెస్ అయిందా? 

       రామకృష్ణ జువా గోళం అనకుండా ‘నాగభరణం’ అనే కలశాన్ని తయారు చేశారు. అసలు సర్వ సృష్టీ దేవతల నియంత్రణలో వుండాల్సింది వాళ్ళే గ్రహణాలకి గిలగిల లాడి పోవడమేంటో? సరే, ఈ కలశం మీదికి దుష్ట శక్తిని తోలి,  హీరోగారి మ్యూజికల్  కథ నడిపారు రామకృష్ణ.  కానీ కలశం మీదికి తోలిన బాపతు దుష్ట శక్తులు ఇప్పుడున్నాయా? కాలాన్ని బట్టి ప్రతీకలు మారుతూంటాయి. పురాణాల్లో వుండే రూపాలతో రాక్షసులు ఇప్పుడు మన మధ్య తిరుగడం లేదు. ఇప్పటి ప్రపంచ రాక్షసుడు టెర్రరిస్టు. ప్రతీకలు ఎప్పుడూ వర్తమాన కాలపు గుర్తులుగా వుంటాయి- వెంటనే ఆడియెన్స్ కనెక్ట్ అవడానికి- ఫీలవడానికీ. స్టీవెన్ స్పీల్ బెర్గ్  ‘రైడర్స్ ఆఫ్ ది  లాస్ట్ ఆర్క్’  తీసినప్పుడు- ప్రతీకలుగా అడాల్ఫ్ హిట్లర్ నీ, అతడి జర్మన్ నాజీ సైనికుల్నీ చూపించాడు. వాళ్ళు దేనికి ప్రతీకలో మనకి తెలుసు. వాళ్ళకో బుద్ధి  పుడుతుంది.  బైబిల్ కాలంలో నిర్గమ కాండం సందర్భంగా దేవుడు మోజెస్ కి బహూకరించిన నిబంధనల పెట్టె (Arc of Covenant) ని చేజిక్కించుకుంటే తమకి అజేయ శక్తి అమరుతుందని నమ్మి దాని కోసం వేట ప్రారంభిస్తారు. ఆర్కియాలజిస్టు అయిన హీరో దీన్ని అడ్డుకోవడానికి సాహస యాత్ర ప్రారంభిస్తాడు. చివరికి ఆ పెట్టెని  చేజిక్కించుకున్న నాజీ సైనికులు,  దాన్ని తెర్చి భస్మీపటలమై పోతారు.  దైవశక్తి ఎప్పుడూ దైవ శక్తే. ఆద్యంతం ఈ పెట్టె కోసమే కథ జరిగి దాని  మహత్తుతో ముగుస్తుంది. ఆథ్యాత్మిక విలువున్న ఈ థ్రిల్లర్  అంతే ఆథ్యాత్మిక  ఔన్నత్యంతో ముగుస్తుంది. అంటే ప్రేక్షకుల ఆత్మిక దాహాన్ని  తీరుస్తుంది- అందుకే అంత ఘనవిజయం సాధించింది. 

     రామకృష్ణ  ఏం చేశారు. అంతటి దేవతల మహత్తు కలిగిన కలశాన్ని ఎందుకూ పనికి రాని వస్తువుగా మ్యూజికల్ షోకి  బహుమతిగా దిగజార్చేశారు! దైవ శక్తి ఎక్కడైనా తరిగిపోతుందా? ఆ కలశం కోసం అందరూ కొట్టుకుంటున్నారని ఆర్కియాలజీ శాఖ స్వాధీ నం చేసుకుంటుందా? ఆర్కియాలజీ శాఖ అష్ట దిగ్బంధాన్ని కూడా ఛేదించేసిందా? కేరళలో పద్మనాభ స్వామి ఆలయంలో ఆరో నేలమాళిగకి  నాగబంధం వుందని తెలిసి దాన్ని తెరవడానికే సాహసించలేదు. అదీ దైవ శక్తి తడాఖా అంటే. 

        కలశాన్ని మ్యూజికల్ షోకి పెట్టేశారంటేనే దానికే శక్తీ లేదని అర్ధమైపోతోంది. మరెందుకు కపాలిగాడూ విలన్ గ్యాంగూ దానికోసం అర్రులు చాస్తున్నారు. ఇక గత జన్మలో నాగమ్మకి అండగా వుంటానన్న నాగదేవత ఆమె కపాలిగాడితో తలపడుతున్నప్పుడు ఎక్కడికి పోయింది. చచ్చిపోయేటప్పుడు వచ్చి వచ్చే జన్మలో హెల్ప్ చేస్తానని అంటుందా. నాగమ్మ మళ్ళీ జన్మించాక ఆమెలోంచి బుసలుకోడుతూ లేచి శత్రువుల్ని కాటేస్తుందా. ఈ పని గత జన్మలోనే చేయవచ్చుగా. 

        ఆ నాడు దేవతలు ప్రసాదించిన మహత్తు కలిగిన ఆ నాగాభారణ కలశం ఇప్పటికీ అదే దివ్యశక్తితో వుందనీ, దీన్ని నాశనం చేయడానికో, హస్తగతం చేసుకోవడానికో టెర్రరిస్టులు బయల్దేరరానీ- కాలీన స్పృహతో ఈ ఫాంటసీ చేసి వుంటే అర్ధంపర్ధం వుండేది.


-సికిందర్ 







         

13, అక్టోబర్ 2016, గురువారం

రివ్యూ!

దర్శకత్వం : అనిరుద్ధ రాయ్ చౌధురి

తారాగణం : అమితాబ్ బచ్చన్, తాప్సీ, కీర్తీ కుల్హరీ, ఆండ్రియా తరియంగ్,  అనంగ్ బేడీ, ధృతిమన్ ఛటర్జీ, పీయూష్ మిశ్రా, మమతా శంకర్ తదితరులు
కథ : అనిరుద్ధ  రాయ్ చౌధురి, షూజిత్ సర్కార్, రీతేష్ షా , స్క్రీన్ ప్లే- మాటలు : రీతేష్ షా
సంగీతం : శంతను మొయిత్రా, ఫైజా ముజాహిద్, అనుపమ్  రాయ్, ఛాయాగ్రహణం : అభీక్ ముఖోపాధ్యాయ్
బ్యానర్ : రశ్మీ టెలి ఫిలిమ్స్ లిమిటెడ్
నిర్మాతలు : రశ్మీ శర్మ, షూజిత్ సర్కార్
విడుదల : సెప్టెంబర్ 16, 20016
***
       బెంగాలీ దర్శకులు కమర్షియల్ సినిమాల్నే వాస్తవికతకి దగ్గరగా భిన్నకోణాల్లో తెరకెక్కిస్తూ  హిందీలోకి వస్తారు. మర్డర్, గ్యాంగ్ స్టర్, బర్ఫీ, కహానీ, విక్కీ డోనర్...ఇంకా  గతంలో కెళ్తే  దోస్తీ, చిత్ చోర్, గోల్ మాల్, కటీ పతంగ్  వంటి హిట్స్ తో  ప్రత్యేక ముద్ర వేస్తారు. బాలీవుడ్ ఎప్పుడూ బెంగాలీ దర్శకులతో కిటకిట లాడుతూ వుంటుంది. బాలీవుడ్ అనేకంటే ‘బెలీవుడ్’  అనుకునేంతగా పాగా వేసి కూర్చున్నారు. బెంగాలీలు సాహితీ ప్రియులవడం చేత కూడా స్వాభావికంగానే వాళ్ళ కళాపోషణ ఉత్తమాభిరుచులకి పట్టం గడుతూంటుంది. లపాకీ సినిమాలూ ఇడ్లీ సినిమాలూ తీసే మోజు వాళ్లకి లేదు. వాళ్ళ  బెంగాలీ ఫిష్ కర్రీనే ఎన్నిరకాలుగా వండొచ్చో ఒక్కొక్కళ్ళూ ఒక్కో విధంగా రుచి చూపించేసి  ఔరా అన్పిస్తారు. తాజాగా మరో బెంగాలీ దర్శకుడు హిందీలోకి రంగ ప్రవేశం చేశాడు. చేస్తూనే నాటక అంకాన్ని సినిమాకి జోడించి క్యాబేజీ ఫిష్ వండేశాడు. ఇక దేశవ్యాప్తంగా మిగతా హిందీ సినిమాల్ని పక్కన పెట్టేసి దీన్నే నంజుకుంటున్నారు జనాలు. 

          ర్శకుడు అనిరుద్ధ రాయ్ చౌధురిని హిందీలోకి రప్పిస్తూ మరో బెంగాలీ దర్శకుడు షూజిత్ సర్కార్ (విక్కీ డోనర్, పీకూ) నిర్మాతగా మారి,  ‘పింక్’ తీసినప్పుడు అదొక జాతీయ నినాదమయిందివ్వాళ. అమితాబ్ బచ్చన్, తాప్సీ, మరో ఇద్దరు నటీమణుల్ని కలుపుకుని యువతరపు కొత్త పోకడల్ని – చట్టాలతో వాళ్ళ అనుభవాల్ని బయటపెట్టే పవర్ఫుల్ వినోదసాధనమయ్యింది. మనమెప్పుడూ ఇప్పటి యూత్ సినిమాలంటే ఒకప్పటి ఉబుసుపోక ప్రేమ కథలు కాదనీ, వాళ్ళ వాళ్ళ విశృంఖలత్వాలతో యూత్ చేసుకునే ప్రయోగాల్నీ, దాంతో తెచ్చుకునే ప్రమాదాల్నీ తెలియజెప్పే ఫ్రెష్- న్యూజనరేషన్ రియాలిస్టిక్ ఫిక్షన్ అనీ చెప్పుకుంటూ వచ్చాం. ఈ కోవలో 2011 లో బిజోయ్ నంబియార్ ‘షైతాన్’ తీసి మెప్పించాడు. 2005 లో కృష్ణవంశీ ‘డేంజర్’ తో పాక్షికంగానే ప్రయత్నించాడు. గత సంవత్సరమే నవదీప్ సింగ్ ‘ఎన్ హెచ్- 10’ తో  దృష్టి నాకర్షించాడు. ఇప్పుడు ‘పింక్’ తో అనిరుద్ధ రాయ్ చౌధురి అలాటి జీవనశైలులు ఏ దారిపట్టిపోతాయో చెబుతూనే, అంతమాత్రాన న్యాయం పొందడానికి సిగ్గుపడాల్సిన అవసరమే లేదని యువతులకి ధైర్యం నూరిపోశాడు నూరుపాళ్ళూ. 

కథ *
       మీనల్ అరోరా (తాప్సీ) ఫలక్ అలీ (కీర్తీ కుల్హరీ)  ఆండ్రియా (ఆండ్రియా తరియంగ్) అనే ముగ్గురు ఢిల్లీలోని ఒక ఫ్లాట్ లో నివసిస్తూ జాబ్స్ చేస్తూంటారు. ఒకరాత్రి  సూరజ్ కుంద్ లోని  ఓ రిసార్ట్స్ లో జరుగుతున్న  ప్రోగ్రాంకి వెళ్తారు. అక్కడ రాజ్ వీర్ (అనంగ్ బేడీ) తన ఫ్రెండ్స్ తో వుంటాడు.  రాజ్ వీర్ మీనల్ కి తెలుసు. అక్కడ వాళ్ళతో కలిసి డ్రింక్ చేస్తారు ముగ్గురూ. ఈ అవకాశంతో వాళ్ళని అనుభవించాలని చూస్తారు రాజ్ వీర్ అతడి ఫ్రెండ్స్ ముగ్గురూ. మీనల్ ‘నో’  అన్నా రాజ్ వీర్ వూరుకోక మిస్ బిహేవ్ చేస్తాడు. దీంతో బాటిలెత్తి అతడి తలకాయ బద్దలు కొడుతుంది. తీవ్రంగా గాయపడ్డ అతణ్ణి వదలేసి పారిపోతారు మీనల్, ఫలక్, ఆండ్రియా. 

        ఇక  పరిణామాలు వూహించుకుని బిక్కు బిక్కుమంటూంటారు ముగ్గురూ. బాగా పవర్ఫుల్ రాజకీయనాయకుడి కొడుకైన రాజ్ వీర్, మీనల్ మీద పగ దీర్చుకోవాలనుకుంటాడు. ఆమెతో సహా ఫలక్ నీ, ఆండ్రియానీ ఫ్లాట్లోంచి సాగనంపేయాలని ఓనర్ ని బెదిరిస్తాడు. ఫలక్ మధ్యవర్తిత్వం వహించి  మీనల్ చేత రాజ్ వీర్ కి సారీ చెప్పించాలని ప్రయత్నిస్తుంది. సారీ చెప్పేందుకు మీనల్ ఒప్పుకోదు. ఎదుటి బంగళాలో రిటైర్డ్ లాయర్ దీపక్ సెహగల్ (అమితాబ్ బచ్చన్) వుంటాడు. ఇతను ఈ అమ్మాయిలేదో సమస్యలో పడ్డారని అనుమానిస్తాడు. అతడి కళ్ళముందే రాజ్ వీర్ మీనల్ ని కిడ్నాప్ చేసి తీసికెళ్ళి పోతాడు. వెంటనే దీపక్ పోలీసులకి సమాచారం అందించినా ఆ కారు దొరకదు. ప్రయాణిస్తున్న కార్లో ఫ్రెండ్స్ తో కలిసి రాజ్ వీర్ మీనల్ ని లైంగికంగా వేధించి వదిలేస్తాడు. ఇక మీనల్ కి పోలీసులని ఆశ్రయించక తప్పదు. ఈ లేడీ ఎస్సై  రాజ్ వీర్ తండ్రికి సమాచారం అందివ్వడంతో రాజ్ వీర్ తండ్రి మీనల్ మీద ఎదురు కేసు పెట్టిస్తాడు- రాజ్ వీర్ మీద మీనల్ హత్యాయత్నం చేసిందన్న ఆరోపణతో. మీనల్ అరెస్టయి జైలు కెళ్తుంది.  ఇక వుండలేక లాయర్ దీపక్ ఉచిత న్యాయ సహాయం అందిస్తూ ఈ కేసు చేపట్టడానికి ముందుకొస్తాడు. ఇక్కడ్నించీ కోర్టులో ఈ కేసు ఎలాగెలా నడిచిందీ, అమ్మాయిలు బోనెక్కితే ఎలాటి చేదు అనుభవాలు ఎదురవుతాయి- అన్నది మిగతా కథ.

భావోద్వేగాల ఉప్పెన 
      టాలెంటెడ్  నటిగా తాప్సీ ఈ సినిమాతో  బాగా ఎస్టాబ్లిష్ అయినట్టే. ఇప్పట్నించే ఆమెకి అవార్డుల పంటని వూహించుకోవచ్చు. బాధిత పాత్రని బలమైన భావోద్వేగాలతో, కటువైన మాటలతో సహజాతిసహజంగా పోషించింది. కోర్టు దృశ్యాల్లో ఇబ్బంది కల్గించే సందర్భాల్లో ప్రతిస్పందనల్ని పొల్లు పోకుండా ప్రకటించడంలో కనబర్చిన  నేర్పే నటిగా ఆమెని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. ఈ సినిమా ఆమె కెరీర్ కి ఓ కిరీటం.
        మరోసారి అమితాబ్ బచ్చన్ తన విలువేంటో రుజువు చేసుకున్నాడు. బైపోలార్ డిజార్డర్ తో మానసికంగా, వాతావరణ కాలుష్యంతో శారీరకంగా  సతమతమయ్యే వృద్ధ లాయర్ పాత్రలో ఇప్పటికీ తన అభినయ చాతుర్యానికి బాక్సాఫీసు అప్పీల్ వుంటుందని విరగబడి ఆడుతున్న ఈ సినిమా సక్సెస్ తోనే నిరూపించాడు. 

        కీర్తీ, ఆండ్రియా ఇద్దరూ కూడా డీసెంట్ గా నటించారు. రాజ్ వీర్ పాత్రలో కళ్ళల్లో దుష్టత్వం నింపుకుని సైలెంట్ విలన్ గా అనంగ్ బేడీ నటిస్తే, ప్రాసిక్యూటర్ గా మరోసారి పీ యూష్ మిశ్రా తన బ్రాండ్ డైలాగ్ డెలివరీ తో సన్నివేశాల్ని రక్తి కట్టించాడు. ఉర్దూ పిచ్చిగల పోలీసు అధికారిగా ‘హేపీ భాగ్ జాయేగీ’ లో చేసిన  డైలాగుల మాయాజాలం ఎలాంటిదో మొన్నే చూశాం. జడ్జి పాత్రలో ధృతిమన్ ఛటర్జీ కమర్షియల్  సినిమాల ‘ఆర్డర్ ఆర్డర్’ బాపతు అరుపుల, బల్ల మీద సుత్తిమోతల ఫార్ములా జడ్జీలనుంచి ఎంతో  రిలీఫ్. 

         ‘హేపీ భాగ్ జాయేగీ’ సెకండాఫ్ లో హీరో,  అతడి తండ్రీ జరిపే సుదీర్ఘ సంభాషణ గల దృశ్యం టీవీ సీరియల్ లాగా కన్పిస్తుంది. సహజత్వం ఒక్కోసారి ఇలాటి బారిన పడుతూంటుంది. కానీ  ‘పింక్’ సహజత్వం సినిమాకే హైలైట్ గా వుంటుంది. కోర్టు ఇంటీరియర్ కూడా సెట్ వేసి నట్టుండదు. పాటలు, వాటి చిత్రీకరణా కళాత్మకంగా వున్నాయి. కెమెరా వర్క్, సంగీతం న్యూయేజ్ మూవీస్  ట్రెండ్ లో  వున్నాయి.

మైండ్ సెట్స్- మైండ్ గేమ్స్ 
       థగా చూస్తే ఈ కేసు అత్యంత సాధారణ నేర సంఘటన. ఒకమ్మాయి ఒకబ్బాయి తల బద్దలు కొట్టింది. కోర్టుకి కావాల్సింది దీనికి  సాక్ష్యాలేగానీ, నిందితురాలి  క్యారక్టర్ కాదు, సెంటి మెంట్లు కాదు. నిందితురాలు ఎప్పుడు కన్యాత్వం పోగొట్టుకుంది, ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ తో తిరిగిందీ కోర్టుకి అక్కర్లేదు. బాధితుణ్ణి  కొట్టిందా లేదా అన్నదే పాయింటు. ఆత్మరక్షణ చేసుకుంటూ కొట్టి వుంటే అది నిరూపించాలి, అంతే. 

        ఇదే గనుక కథగా నడిపివుంటే- ఈ పరిధిలోనే కాన్సెప్ట్ పెట్టుకుంటే-  ఈ సినిమా ఇంత సంచలనాత్మకం అయ్యేది కాదు- ‘రుస్తుం’ లాగా ఓ రొటీన్ కోర్టు రూమ్ క్రైం డ్రామా అయ్యేది. దీన్నొక సామాజిక రుగ్మతల కడిగివేతగా సంకల్పించారు కాబట్టే-  అసలీ సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో వాటి  మూలాల్ని  ఎత్తి చూపించి హె చ్చరించాలనుకున్నారు. అప్పుడే కథా ప్రయోజనం నెరవేరుతుంది. కనుక  ప్రొసీజర్ ప్రకారం సాక్ష్యాల్ని పరిశీలిస్తూనే, మనస్తత్వాల మదింపూ చేశారు. ఈ మనస్తత్వాల మదింపు ల్లోంచి ఇలాటి సంఘటనల మూలాల్ని బయట పెట్టారు. అబ్బాయిల్ని ఎండగట్టారు. అలాగని ఈ సినిమా చూసి అబ్బాయిలు మారిపోతారని కాదు- ఇంకా డోనాల్డ్ ట్రంప్ ని ఆదర్శంగా తీసుకుంటామనొచ్చు. తమకి డోనాల్డ్ ట్రంపే వుండగా ఈ డొక్కు సినిమాలేం  చేస్తాయని కూడా అనుకోవచ్చు. డోనాల్డ్ ట్రంప్ కి ఈ సినిమా చూపిస్తే తన పరువు తీయడానికే  ఈ సినిమా తీశారని చిందులు కూడా వేయవచ్చు. 


         కానీ ఒక లాజిక్ కూడా వుంది. లాజిక్ లేకుండా మనస్తత్వాల ముచ్చట్లు పెట్టుకుంటే అదొక కళా రూపం కాదు, సినిమా అన్పించుకోదు. కథని వదిలేసి నీతి బోధలు చేయడం అవుతుంది. ఇలా చేయడానికి కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీయనవసరం లేదు. సోదంతా నింపి ఆడియో సీడీలు విడుదల చేస్తే సరిపోతుంది. లాజిక్ ఏమిటంటే, స్థూల దృష్టికి నిందితురాలు నేరం చేసిందనే  రుజువవుతోంది సాక్ష్యాధారాల ఆధారంగా. ఆమె జైలుకెళ్ళే పనే. కథ ఇలా ముగిసిపోతే డోనాల్డ్ ట్రంప్ కూడా ఒప్పుకోడు. కానీ ఆ నేరం ఏ పరిస్థితుల్లో చేసిందో నిరూపిస్తే లాయర్ దీపక్ ఆమెని రక్షించుకోగలడు. ఆత్మరక్షణ అనే ఒకే  ఒక్క ఆధారం దీనికి వుంది. ఆత్మరక్షణకే  బాధితుణ్ణి  కొట్టినట్టు నిరూపిస్తే ఆమె బయట పడిపోతుంది. ఆడదానికి ఆత్మరక్షణ అంటే  శీల రక్షణే. కాబట్టే పనిగట్టుకుని మీనల్ శీలం మీదికి పోతాడు లాయర్ దీపక్.

        అయితే దీనికంటే ముందు బాధితుడూ అతడి ఫ్రెండ్స్ మోటివ్స్ ని తేటతెల్లం చేస్తాడు.  మైండ్ సెట్స్ ని మైండ్ గేమ్స్ తోనే గెలవాలేమో.  అబ్బాయిల మైండ్ సెట్స్ కోర్టు వెలుపల నేర సంఘటనని సృష్టిస్తే, కోర్టు లోపల లాయర్ దీపక్ ఆడే మైండ్ గేమ్స్ వాళ్ళ మైండ్ సెట్స్ లోని డొల్ల తనాన్ని బట్టబయలు చేస్తాయి. కోర్టులో అబ్బాయిల సాక్ష్యాల్లో వెల్లడయ్యే అమ్మాయిల పట్ల వాళ్ళ  మైండ్ సెట్స్ ని,  అమ్మాయిలకి ఒక్కో నీతి సూత్రంగా మార్చి వ్యంగ బాణాలు  విసురుతూంటాడు లాయర్ దీపక్ : 

       అమ్మాయిలు డ్రింక్ చేస్తే- వాళ్ళ క్యారక్టర్ మంచిది కాదని అర్ధమన్న మాట. అదే అబ్బాయిలు డ్రింక్ చేస్తే కేవలం ఆరోగ్యానికి హానికరమన్న మాట!
        అమ్మాయి రాక్  షో  కెళ్తే అది హింట్ ఇస్తున్నట్టు అర్ధమన్న మాట. అదే గుడి కెళ్తే, లైబ్రరీ కెళ్తే, అమ్మాయి అలాంటిది కాదన్న మాట. అమ్మాయిల క్యారక్టర్ ని వాళ్ళు  వెళ్ళిన  స్థలం నిర్ణయిస్తుందన్న మాట!

        ఏ అమ్మాయి అయినా ఏ అబ్బాయితోనూ ఎక్కడికీ వొంటరిగా వెళ్ళ రాదు. వెళ్లిందంటే ఇష్టపడే వెళ్ళిందనీ, తనని టచ్ చేసే పూర్తి  లైసెన్సు అబ్బాయికి ఇచ్చేసిందనీ అర్ధం జేసుకుంటారన్న మాట!

        రాత్రి పూట అమ్మాయిలు రోడ్డు మీద పోతూంటే వాహనాలు స్లో అవుతాయి,  అద్దాలు కిందికి దిగిపోతాయి. పగటి పూట ఇంత  గొప్ప సేవా భావం ఎందుకుండదో
 ఎవరికీ!

        నగరాల్లో అమ్మాయిలు ఒంటరిగా ఉండరాదు- అబ్బాయిలు వుండ వచ్చు, కానీ  అమ్మాయిలు ఉండరాదు. ఎందుకంటే ఒంటరిగా, ఇండిపెండెంట్ గా వుండే అమ్మాయిలు అబ్బాయిల్నితెగ కన్ఫ్యూజ్ చేసేస్తారు మరి! 

        చివరికో పీకుడు పీకుతాడు :
        ఒకవేళ అమ్మాయి అబ్బాయితో డ్రింక్ కో,  డిన్నర్ కో వెళ్లిందంటే తన సొంత ఛాయిస్ తో వెళ్తుంది- తను అవైలబుల్ అని బోర్డు పెట్టుకుని వెళ్ళదురా శుంఠా అని! 

        జడ్జి అభ్యంతరం చెప్తున్నా బాణా లేస్తాడు అబ్బాయిల మీద దీపక్. ఇక మీనల్ కన్యాత్వాన్ని ప్రశ్నించే  సరికి గగ్గోలు లేచిపోతుంది. కానీ ఇదే గగ్గోలు బాదితుడూ అతడి ఫ్రెండ్స్,  మీనల్ - ఆమె స్నేహితురాళ్ళ శీలం గురించి అన్నప్పుడు పుట్టదు. దీపక్ వ్యూ హం ఒక్కటే- విచారణని ఆత్మరక్షణ కోణంలోకి మళ్ళించడం. తను పంతొమ్మిదో ఏట కన్యాత్వాన్ని కోల్పోయినట్టు ఒప్పుకుంటుంది మీనల్. ఆ తర్వాత ప్రశ్నలకి, కొందరు బాయ్ ఫ్రెండ్స్ తో కూడా తిరిగినట్టు ఒప్పుకుంటుంది. మరింకేం- ఆమె ఇలాంటిది కాబట్టే బాధితుడు చొరవ తీసుకున్నాడని బాధితుడి పక్షం అర్ధం వచ్చేసింది. కానీ...కానీ...

        మీనల్  అలాంటిదైనంత మాత్రాన ఆమెని వాడేసుకునే హక్కుండదు ఆమె ఒప్పుకోకపోతే- మీనల్ వాడికి నో చెప్పేసింది. అయినా బలవంత పెట్టాడు. దీంతో తలబద్దలు కొట్టింది.

        ఇప్పుడంటాడు లాయర్ దీపక్- ‘ఈ అబ్బాయిలు ‘నో’ అనే మాటకి అర్ధం ‘నో’ అనే ఉంటుందని అర్ధం జేసుకు చావాలి. అలా ‘నో’ అన్న అమ్మాయి పరిచయస్థురాలైనా, ఫ్రెండ్ అయినా, గర్ల్ ఫ్రెండ్ అయినా, సెక్స్ వర్కర్ అయినా, సొంత భార్య అయినా- కచ్చితంగా ‘నో’ అన్నట్టే అర్ధం. అప్పుడా వెధవ గట్టిగా నోర్మూసుకోవాలి!’ అని.
       
కేసు రివర్స్ అయి బాధితుడూ వాడి భాగస్థులూ జైల్లో పడతారు.

నాటకాంకం
     ఇక ఈ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ విషయం చూద్దాం. స్క్రీన్ ప్లే రాయడమంటేనే తీసివేత- తీసివేత- తీసివేతల ఎడతెగని తంతు. ఈ డైలాగు ఎందుకుండాలి, ఈ సీను ఎందుకుండాలి, ఈ షాటు ఎందుకుండాలీ, వీడెందుకిలా నవ్వాలీ, ఇదెందుకలా చూడాలీ అని వీలైనంత తగ్గించడం గురించే, వేటు వేయడం గురించే ఆలోచించే తంతు అనవసరమనిపిస్తే.  తీసివేయగా తగ్గించగా చెత్తంతా పోగా, మిగిలిన పేజీల్ని అందంగా చెక్కే, పాలిష్ పట్టే హస్తకళే స్క్రీన్ ప్లే రాత. ఏ స్క్రీన్ ప్లే అయినా పేషంట్ గానే జన్మెత్తుతుంది, నిర్మొహమాటంగా చికిత్స చేస్తే తప్ప బతికి సినిమాకి పనికి రాదు.
        ఒకసారి
పైన చెప్పుకున్నఈ సినిమా కథా సంగ్రహాన్ని స్క్రీన్ ప్లే పరంగా ఇలా విడగొడదాం :
         
బిగినింగ్ :
         
మీనల్ అరోరా (తాప్సీ) ఫలక్ అలీ (కీర్తీ కుల్హరీ)  ఆండ్రియా (ఆండ్రియా తరియంగ్) అనే ముగ్గురు ఢిల్లీలోని ఒక ఫ్లాట్ లో నివసిస్తూ జాబ్స్ చేస్తూంటారు. ఒకరాత్రి  సూరజ్ కుంద్ లోని  ఓ రిసార్ట్స్ లో జరుగుతున్న  ప్రోగ్రాంకి వెళ్తారు. అక్కడ రాజ్ వీర్ (అనంగ్ బేడీ) తన ఫ్రెండ్స్ తో వుంటాడు.  రాజ్ వీర్ మీనల్ కి తెలుసు. అక్కడ వాళ్ళతో కలిసి డ్రింక్ చేస్తారు ముగ్గురూ. ఈ అవకాశంతో వాళ్ళని అనుభవించాలని చూస్తారు రాజ్ వీర్ అతడి ఫ్రెండ్స్ ముగ్గురూ. మీనల్ ‘నో’  అన్నా రాజ్ వీర్ వూరుకోక మిస్ బిహేవ్ చేస్తాడు. దీంతో బాటిలెత్తి అతడి తలకాయ బద్దలు కొడుతుంది. తీవ్రంగా గాయపడ్డ అతణ్ణి వదిలేసి పారిపోతారు మీనల్, ఫలక్, ఆండ్రియా.
       
మిడిల్ :
        ఇక  పరిణామాలు వూహించుకుని బిక్కు బిక్కుమంటూంటారు ముగ్గురూ. బాగా పవర్ఫుల్ రాజకీయనాయకుడి కొడుకైన రాజ్ వీర్, మీనల్ మీద పగ దీర్చుకోవాలను
కుంటాడు. ఆమెతో సహా ఫలక్ నీ, ఆండ్రియానీ ఫ్లాట్లోంచి సాగనంపేయాలని ఓనర్ ని బెదిరిస్తాడు. ఫలక్ మధ్యవర్తిత్వం వహించి  మీనల్ చేత రాజ్ వీర్ కి సారీ చెప్పించాలని ప్రయత్నిస్తుంది. సారీ చెప్పేందుకు మీనల్ ఒప్పుకోదు. ఎదుటి బంగళాలో రిటైర్డ్ లాయర్ దీపక్ సెహగల్ (అమితాబ్ బచ్చన్) వుంటాడు. ఇతను ఈ అమ్మాయిలేదో సమస్యలో పడ్డారని అనుమానిస్తాడు. అతడి కళ్ళముందే రాజ్ వీర్ మీనల్ ని కిడ్నాప్ చేసి తీసికెళ్ళి పోతాడు. వెంటనే దీపక్ పోలీసులకి సమాచారం అందించినా ఆ కారు దొరకదు. ప్రయాణిస్తున్న కార్లో ఫ్రెండ్స్ తో కలిసి రాజ్ వీర్ మీనల్ ని లైంగికంగా వేధించి వదిలేస్తాడు. ఇక మీనల్ కి పోలీసులని ఆశ్రయించక తప్పదు. ఈ లేడీ ఎస్సై  రాజ్ వీర్ తండ్రికి సమాచారం అందివ్వడంతో రాజ్ వీర్ తండ్రి మీనల్ మీద ఎదురు కేసు పెట్టిస్తాడు- రాజ్ వీర్ మీద మీనల్ హత్యాయత్నం చేసిందన్న ఆరోపణతో. మీనల్ అరెస్టయి జైలు కెళ్తుంది.  ఇక వుండలేక లాయర్ దీపక్ ఉచిత న్యాయ సహాయం అందిస్తూ ఈ కేసు చేపట్టడానికి ముందుకొస్తాడు. ఇక్కడ్నించీ కోర్టులో ఈ కేసు ఎలాగెలా నడిచిందీ, అమ్మాయిలు బోనెక్కితే ఎలాటి చేదు అనుభవాలు ఎదురవుతాయి-
         
ఇక ఎండ్ వచ్చేసి- కన్యాత్వం పాయింటు మీద నడిచి ముగుస్తుంది. బిగినింగ్ విభాగానికి ముగింపు హీరోయిన్లు రాజ్ వీర్ ని  కొట్టి పారిపోవడం అనే ప్లాట్ పాయింట్ -1 ఘట్టం అన్నమాట. ఇక మిడిల్ కి ముగింపు – అవును, మేం డబ్బుతీసుకున్నామని కోర్టులో ఫలక్ పాత్ర గొంతు చించుకుని తనకుతానే కేసు ఓడిపోయేఘట్టాన్ని సృష్టించుకోవడం. ఇది ప్లాట్ పాయింట్- 2 ఘట్టం అన్నమాట. 

        బాగానే వుంది, అయితే పైన చెప్పుకున్న బిగినింగ్ విభాగం సినిమాలో లేనేలేదు. బిగినింగే లేదు, బిగినింగ్ అస్సలు లేదు! బిగినింగ్ లేకుండా మిడిల్, ఎండ్ లతోనే సినిమా నడిచి ముగుస్తుంది.  సినిమా ప్రారంభమే మిడిల్ ప్రారంభంతో మొదలవుతుంది. ఆ తర్వాత ఎండ్ కి వెళ్ళిపోతుంది, అంతే. మరి బిగినింగ్ ఎందుకు లేదు, అదేమైనట్టు? అసలు బిగినింగ్ లేకుండా ఏ సినిమా ఏ స్క్రీన్ ప్లే ప్రపంచంలోనే  లేదు. బిగినింగ్ స్థానం మారవచ్చు. మిడిల్ తో మొదలయ్యే కథలో ఫ్లాష్ బ్యాక్ గా బిగినింగ్ రావచ్చు. ఇలాటి సినిమాలు చాలా వున్నాయి. హాలీవుడ్ కాదుకదా, అసలే స్క్రీన్ ప్లే స్ట్రక్చరూ పట్టని యూరోపియన్ సినిమాలు కూడా బిగినింగ్ లేకుండా లేవు. బిగినింగ్ లేకుండా కథ చేయవచ్చన్న వూహే ఎవ్వరికీ రాదు. 

        మరి బిగినింగ్ లేకపోతే,  పైన కథా సంగ్రహమంటూ చెప్పుకున్న స్క్రీన్ ప్లేలో  బిగినింగ్ అంటూ చెప్పుకున్న కథ ఎక్కడ్నించీ వచ్చింది? అది వున్నందుకే కదా మిడిల్ మొదలైంది. అది లేకపోతే మిడిల్ ఎలా మొదలైంది?  

        బిగినింగ్ వుంది- పైన చెప్పుకున్నట్టే  అంతా వుంది. అయితే తీసివేత కార్యక్రమంలో ఎగిరిపోయింది. ఒక పెద్ద కత్తి తీసుకుని గట్టి వేటు వేస్తె ముక్క తెగి అరేబియా సముద్రంలో పడింది. దరిద్రం వదిలింది. ఒక డైలాగు కాదు, ఒక సీను కాదు, ఒక షాటూ కాదు, ఒకడి నవ్వూ కాదు, ఒకత్తి చూపూ కాదు- ఏకంగా  బిగినింగ్ అంతా కట్టకట్టి అనవసరమని లేపేశారు. చాలా తెగింపు, చాలా మేజర్ ఆపరేషన్. 

        క్లుప్తతే కళకి ఆభరణం. ఈ క్లుప్తీ కరణలో ఇంకోటి కూడా వుంది : మాటగా చెబితే అర్ధమయ్యే దాన్ని బొమ్మగా చూపనవసరం లేదు, బొమ్మగా చూపిస్తే అర్ధమై పోయే దాన్ని మాటగా చెప్పనవసరంలేదు. ఏ  స్టోరీ ఈజ్ టోల్డ్ ఇన్ పిక్చర్స్-  అన్నాడు సిడ్ ఫీల్డ్ డైలాగుల ప్రాధాన్యం తగ్గించుకోమంటూ. కానీ బిగినింగే లేకపోతే పిక్చర్స్ కూడా ఎక్కడివి? ముందు కాలంలో ‘పింక్’ అనేది వచ్చి ఈ ప్రశ్న వేస్తుందని వూహించి వుండడు. 

        మాటతో చెబితే పోయేదానికి చాట భారతం  చూపించనవసరం లేదని  ఫ్లాష్ బ్యాక్స్ గురించి రూలుంది. అదే ఫ్లాష్ బ్యాక్ రూలుని  మొత్తం బిగినింగ్ విభాగానికే వర్తింప జేస్తే? బిగినింగ్ విభాగమంతా రెక్కలు కట్టుకుని ఎగిరిపోతుంది. క్లుప్తతకి- తీసివేతకి ఇంతకంటే సులువు వుందా?

       ఈ సినిమా రాత్రిపూట గాయపడ్డ  రాజ్ వీర్ ని నేస్తాలు హడావిడిగా కార్లో హాస్పిటల్ కి తీసుకుపోతూండగా, అవతల ఇంకో చోట  ఆందోళనతో హీరోయిన్లు ముగ్గురూ క్యాబ్ ఎక్కి పారిపోతూండగా మొదలవుతుంది. వాళ్ళు హాస్పిటల్ కి పోతారు, వీళ్ళు ఫ్లాట్ కి వచ్చేస్తారు. ఏదో జరిగింది. ఏం జరిగిందనేది పెద్ద సస్పెన్స్. ఈ దృశ్యాలన్నీ మిడిల్ కి చెందినవి. ఎక్కడో ఏదో సంఘటన జరిగి వీళ్ళిలా వచ్చేశారంటే- హాఫ్ వేలో సినిమా మొదలైందంటే - అప్పటికే బిగినింగ్ అయిపోయిందన్న మాట. ఏదో జరిగి వుండడం అనేదే ప్లాట్ పాయింట్ -1 ఘట్టం. ఈ ఘట్టం మనకి చూపించకుండా ఈ ఘట్టం తర్వాత పరారీ నుంచి ఎత్తుకున్నారు కథని. అంటే మిడిల్ నుంచీ కథ ఎత్తుకున్నారు. సర్వసాధారణంగా ఇలాంటప్పుడు ఒక్కటే జరుగుతుంది- కాస్సేపు సస్పెన్స్ ని  పోషించినట్టు పోషించి,  సందు చూసుకుని ఆ బిగినింగ్ ని ఫ్లాష్ బ్యాక్ గా వేసేసి,  మొత్తం చూపించేస్తారు ఏం జరిగిందో. 

        ఇలా కాకుండా ఓపెనింగ్ బ్యాంగ్ అని ఇంకా ఒక ఫ్యాషన్ పెట్టుకున్నట్టయితే,  ఆ ఘట్టంతోనే సినిమా ఓపెన్ చేసి బ్యాంగ్ ఇచ్చి- తర్వాతి మొక్కుబడి తంతుగా టైటిల్స్ మొదలెడతారు. ఇంకా అంబాసిడర్ కార్లలాగా తిరుగుతున్న ఈ రెండిటినీ (ఫ్లాష్ బ్యాక్, ఓపెనింగ్ బ్యాంగ్) కాలుష్య నియంత్రణ చట్టం కింద కాలం చెల్లిన డొక్కు బళ్ళుగా ప్రకటించి, వేటు వేసిందే ‘పింక్’ పంథా. 

        ఈ సృష్టిలో మనం మిడిల్ లో వున్నాం, ఎండ్ చూస్తాం, సృష్టి ఎలా మొదలయ్యిందో మనం చూళ్ళేదు. వాళ్ళూ వీళ్ళూ చెప్పగా వింటున్నాం.  సినిమాలో బిగినింగ్ ని మాత్రం చూడాలన్న కోరిక ఎందుకు పెట్టుకోవాలి. పాత్రలే చెప్పుకుంటున్నది వింటే సరిపోదా?

        మిడిల్ తో ప్రారంభించి - మిడిల్ బిజినెస్ తాలూకు సంఘర్షణంతా చూపించుకొస్తూ- సెకండాఫ్ లో కోర్టు ప్రొసీడింగ్స్ ప్రారంభమైనప్పుడు- అసలేం జరిగిందో (బిగినింగ్) ఆయా సాక్షుల, వైరి పక్షాల వాంగ్మూలాల్లో బయటపడ్డం మొదలవుతుంది. ఎప్పుడూ కూడా ఏ సాక్షీ అసలేం జరిగిందంటే అనగానే- ఒక బిట్ ఏదో ఫ్లాష్ బ్యాక్ గా వేస్తూ చూపించడం కూడా చేయలేదు. ఇప్పుడు కూడా జరిగిన సంఘటన దృశ్య పరంగా అస్సలు చూపించలేదు. కోర్టు విచారణలో పాత్రల మాటల ద్వారానే మనం వూహించుకోవాలి, అర్ధం జేసుకోవాలి. ప్రేక్షకులతో ఇంటరాక్టివ్ స్టోరీ టెల్లింగ్ అంటారు దీన్ని. ఒక్కసారి ప్రాసిక్యూటర్ సీసీ టీవీ ఫుటేజీ వేస్తాడు కోర్టులో. అప్పుడు కూడా ఆ రిసార్ట్స్ రూమ్స్ బయట హీరోయిన్లు ముగ్గురి అనుమానాస్పద కదలికలే చూపించి అర్ధాలు తీయడం మొదలెడతాడే తప్ప- రూమ్స్ లోపలేం జరిగిందో చూపించడు. ఎందుకంటే రూమ్స్ లోపల సీసీ కెమెరాలు పెట్టరని మనకి తెలిసిందే. వాస్తవంగా చూసినా  ఒక సంఘటన జరిగి కేసు నడిస్తే,  ఆ సంఘటనలో పాల్గొన్న వ్యక్తులు తప్ప మనం గానీ, పోలీసులు గానీ, కోర్టుగానీ దాన్ని చూసి వుండే అవకాశం ఎలా వుండదో,  అదే వాస్తవిక ధోరణితో కథని నడిపారు. 

        రెండోది, ఏం జరిగిందో మనకి అర్ధమైపోతూంటే ఇంకా దృశ్య రూపం అక్కర్లేదు. మాటగా చెబితే అర్ధమయ్యే దానికి బొమ్మ చూపించనవసరం లేదు. 

        ఇందుకే దృశ్యపరమైన బిగినింగ్ అప్రస్తుతమై పోయింది. కోర్టు భాషలో చెప్పాలంటే ఇమ్మెటీరియల్ ఐపోయింది. ఇది స్టేజి నాటక విధానం. ఇదే కథని స్టేజి నాటకంగా వేస్తే  మొదటి రంగం అవసరం లేకుండా తర్వాతి రెండు రంగాల్లో చూపించేస్తారు. మొదటి రంగం రిసార్ట్స్ సంఘటన అయితే అదెలాగూ స్టేజీ మీద చూపించడం కష్టం కాబట్టి దాన్ని పరిహరించి, నేరుగా ఈ సినిమాలోలాగే పాత్రల పరారీతో రెండో రంగంగా ప్రారంభించి, రెండో రంగం బిజినెస్ గా ఆ సంఘర్షణ అంతా తెర దించకుండా ఆ ఒక్క రంగం లోనే నడిపి- అప్పుడు తెరదించి,  మూడో రంగంగా  కోర్టు సెట్ తో కేసు విచారణ ప్రారంభించి ముగిస్తారు ఈ సినిమాలో లాగే. 

        ఇలా నాటకాల్లో మొదటి  అంకాన్ని పరిహరించినట్టు, సినిమాలోనూ బిగినింగ్ విభాగాన్ని దృశ్యంగా తీసేసి, దాని విశేషాల్ని మిడిల్ బిజినెస్ లో భాగంగా పాత్రల చేత పలికిస్తూ వచ్చారు. ఏమైనా తేడా వచ్చిందా ఆస్వాదనలో? ఏమీ రాలేదు. 


        ఈ కథలో బిగినింగ్ వుంది. కాకపోతే  మిడిల్- ఎండ్ విభాగాల్లో మాటల రూపంలో దాగి వుంది. కాఫీలో పంచదార వుంది. అయితే కలపలేదు, తాగుతూంటే మెల్లగా కరుగుతూంటుందిగా. ఇదే ఈ స్క్రీన్ ప్లేతో చేసిన అపూర్వ ప్రయోగం. దీంతో మొత్తం సినిమాకే ఒక కొత్త కళ  వచ్చింది. రూల్స్ అందరూ పాటిస్తారు. రూల్స్ ని బ్రేక్ చేసే రెబల్స్ కావాలంటే కూడా బెడిసి కొట్టకుండా ఒడిసిపట్టే  నేర్పు తెలిసి వుండాలి. అనిరుద్ధ  రాయ్ చౌధురి, షూజిత్ సర్కార్, రీతేష్ షా త్రయం ఈ  జిమ్నా(సిన్మా) స్టిక్స్ లో ఆరితేరిపోయారు.


-సికిందర్
http://www.cinemabazaar.in