రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

12, అక్టోబర్ 2016, బుధవారం

రివ్యూ!

స్క్రీన్ ప్లే- దర్శకత్వం : ప్రకాష్ రాజ్

తారాగణం : ప్రకాష్‌రాజ్‌, ప్రియమణి, సత్యదేవ్‌, పృథ్విరాజ్‌, అచ్యుత్‌కుమార్‌, రంగాయన రఘు, రఘుబాబు తదితరులు
కథ : జాయ్ మాథ్యూ, మాటలు : గోపిశెట్టి రమణ- ప్రకాష్ రాజ్, సంగీతం
: ఇళయరాజా
ఛాయాగ్రహణం : ముఖేష్
బ్యానర్ : ప్రకాష్రాజ్ ప్రొడక్షన్
, ఫస్ట్కాపీ పిక్చర్స్
నిర్మాతలు
:  రామ్జీ నరసింహన్, ప్రకాష్రాజ్
విడుదల : 7 అక్టోబర్, 2016
***
     ధోని, ఉలవచారు బిర్యానీ  వంటి సమాంతర సినిమాలకు దర్శకత్వం వహించి తన అభిరుచిని చాటుకున్న విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, మరోసారి తన దర్శకత్వ ప్రతిభని చాటుతూ ముందు కొచ్చారు. ‘మన ఊరి రామాయణం’ దర్శకుడుగా ఆయన మూడో రీమేక్. ఇతర భాషల్లో తనకి  నచ్చిన ఉత్తమ సినిమాల్ని రీమేక్ చేస్తూ వస్తున్న ప్రకాష్ రాజ్, ఈసారి  కూడా తెలుగు ప్రేక్షకుల అభిరుచులకి సవాలు విసురుతూ కమర్షియలేతర సినిమా తీశారు. ఒక సినిమాని పాటలు, ప్రేమలు, డాన్సులు, ఫైట్లు, కామెడీలూ లేకుండా చూడలేనంత మొద్దుబారిపోయి వున్నామా మనం నిజంగా- లేకపోతే పలాయనవాదంతో అలా నటిస్తున్నామా? నిజంగా ఇవేవీ లేని ఒక పవర్ఫుల్ కమర్షియలేతర సినిమాని చూడలేమా తెలుగులో? సినిమా అక్షరాస్యతా రేఖకి  అంత దిగువకి జారిపోయి క్షణికానందం కోసం ఉత్త కాలక్షేప సినిమాలు చూస్తూ జీవితాలు చాలించుకోవడానికేనా ఈ  జన్మ? చూసే సినిమాలు అధమంగా  వుండాలనుకున్నప్పుడు, కొనే సెల్ ఫోన్లు కూడా అధమంగానే  వుండాలిగా? అనవసరంగా ఈ హిపోక్రసీ  ‘మన ఊరి రామాయణం’ లాంటి సినిమాల్ని చంపేస్తోంది. కానీ ఈ సినిమా ముందు కమర్షియల్ సినిమాలు కూడా బలాదూర్  అనేందుకు కట్టి పడేసే  అంశాలు ఎలా వుండాలో అలా వుండి – ఏ సినిమా అయినా ఇలా కదా వుండాల్సింది అన్న ఎవేర్నెస్ తో బయటి కొస్తారు ప్రేక్షకులు.

కథ 
      దుబాయ్ లో బాగా డబ్బు సంపాదించుకుని సొంతూరు వస్తాడు భుజంగయ్య (ప్రకాష్ రాజ్).  ఊళ్ళో భార్య, అత్తా, ఇద్దరు కూతుళ్ళూ వుంటారు. బయట డబ్బు మదంతో, ఇంట్లో అడ్డమైన పెత్తనంతో ఎవర్నీ నోరెత్త నివ్వకుండా ఇష్టారాజ్యంగా బతికేస్తూంటాడు. చేసే పనేం లేదు. సాయంత్రం కాగానే తన ఇగోని సంతృప్తి పర్చుకుంటూ నేస్తాలకి మందు పోసి పొగడ్తలు విని తరించడమే. ఇంటి కాంపౌండు నానుకుని రోడ్డు మీదికి ఓ షాపు తన సొంతానిది. దాన్ని అద్దెకివ్వకుండా సాయంకాలాలు పానశాలగా మార్చడమే. దుబాయ్ కి వెళ్ళక ముందు ప్రతీ శ్రీరామ నవమికి రావణుడి వేషం వేసేవాడట. ఇప్పుడు నవమి వచ్చింది. ఆ ఉత్సవాలు డబ్బు ఖర్చుపెట్టి భారీగా నిర్వహిస్తూంటాడు. ఆ ఉత్సవాల్లో భాగంగా తను  రావణాసురుడి వేషం వెయ్య బోతున్నాడు.  ఆ రాక్షసత్వం ఇప్పుడు ఇంట్లో కూడా ప్రదర్శిస్తూ పెద్ద కూతుర్ని డిగ్రీ చదువుకో నివ్వడు. ఎందుకంటే కాలేజీ పేరుతో  ఆమె బాయ్ ఫ్రెండ్ తో తిరుగుతోందని అనుమానం, కాబట్టి కాలేజీ మాన్పించేసి పెళ్లి చేసేస్తానంటాడు. ఒక రోజు ఇంట్లో మాటామాటా పెరిగి ఉక్రోషంతో ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. వూళ్ళో తనకి నమ్మిన బంటు ఒకడు వుంటాడు- శివ (సత్యదేవ్) అనే ఆటో డ్రైవర్. వీడికి దుబాయ్ వెళ్లేందుకు వీసా ఇప్పిస్తానని వెంట తిప్పుకుంటూంటాడు. ఆ రాత్రి షాపులో మందు భాయీలతో మందేసుకుని శివ ఆటో ఎక్కి ఎక్కడికో బయల్దేర తాడు భుజంగయ్య. బయల్దేరుతోంటే రోడ్డుపక్క అమ్మాయి కన్పిస్తుంది. ఆమెనేసుకోవాలన్పించి శివని  పంపిస్తాడు. సుశీల (ప్రియమణి) అనే ఆ వేశ్యని మాట్లాడి శివ పట్టుకొస్తాడు. వాళ్ళు కులకడానికి షాపులోకి తోసి తాళం వేసుకుని, ఫుడ్డు తీసుకుని గంటలో వస్తానని వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిన వాడు ఇక రాడు.  

        ఈ రాకపోవడమే భుజంగయ్య కొంపలు ముంచుతుంది. రాత్రంతా వేశ్యతో షాపులో ఇరుక్కుని, ఏ సమయంలో ఏం జరుగుతుందో, తెల్లారితే ఇదెక్కడ బయటపడి ఇంటా బయటా పరువుపోతుందో, తనేమై పోతాడో - అని క్షణం క్షణం ప్రాణాలరజేతిలో బెట్టుకుని నానా చావూ చస్తాడు. 

       భుజంగయ్య ఈ రొంపి లోంచి ఎలా బయట పడ్డాడు, చిట్ట చివరికి తాళం ఎవరు తీశారు, అప్పుడు ఎవరికి తను దొరికిపోయాడు, దొరికిపోతే ఏం జరిగిందనేది అడుగడుగునా సస్పెన్స్ తో కట్టి పడేసే కథ.

ఎలావుంది కథ 
     2012 లో జాయ్ మాథ్యూస్ అనే కొత్త దర్శకుడు తీసిన ‘షటర్’  అనే మలయాళ  సినిమాకి రీమేక్ ఇది. మలయాళ ఒరిజినల్ కేవలం సస్పెన్స్ థ్రిల్లరే అయితే, తెలుగులో ఈ సస్పెన్స్ థ్రిల్లర్ అనే బంగారు పళ్ళేనికి  మరింత డెప్త్ తీసుకొస్తూ రామాయణంతో పౌరాణిక గోడ చేర్పు ఇచ్చారు. బాపూ రమణలు ఆ పైన వుంటే అక్కడ్నించీ  ప్రకాష్ రాజ్ కి అభినందన సందేశం పంపుతారు- రామాయణాన్ని ఇలా కూడా తీస్తావటయ్యా భలేవాడివి- అని. 1979 లో దాసరి నారాయణ రావు అక్కినేని నాగేశ్వర రావుతో ‘రాముడే రావణుడైతే’ తీశారు. కానీ రావణుడే రాముడైతే? ఇదే ఈ కథ. రావణుడు రాముడిగా మారే కథ. ఒక నోరు తిరగని పేరుతో పోలెండ్ దర్శకుడున్నాడు- స్ట్రిస్టాఫ్ కీష్ లాస్కీ అని. ఇంగ్లీషులో స్పెల్లింగ్ ఇలా వుంటుందిKrzysztof Kieslowski  అనిఈయన 1989లో ‘టెన్ కమాండ్ మెంట్స్’ ని ఆధారంగా తీసుకుని ‘డెకలాగ్’ అనే పది నీతికథల టెలిఫిలిమ్స్ తీశాడు. అవన్నీ ఒకే అపార్ట్ మెంట్ లో జరుగుతాయి. అలా వేశ్యతో ఒక షాపులో ఇరుక్కున్న  రావణుడి నీతి కథే ఇది. మనిషిలో రాముడు రావణుడు ఇద్దరూ వుంటారు. ఇంకో తన బలమెంతో తెలియని హనుమంతుడూ వుంటాడు. అలాగే సీతలా  కన్పించే అమ్మాయి సీత కాకపోవచ్చు- శూర్పణక అయివుండవచ్చు. ఇవన్నీ కలిపి ఒక సస్పెన్స్ రామాయణం ఈ కథ. మలయాళ ఒరిజినల్ దర్శకుడు తన కథని ‘పొయెటికల్ వయొలెన్స్ ఆన్ సెల్యూలాయిడ్’ అన్నాడు. ఇది తెలుగుకీ వర్తిస్తుంది.
ఎవరెలా చేశారు
 
     ప్రకాష్ రాజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఎంత రావణుడైనా వాడు కుక్కిన పేనయ్యే రోజొకటి వస్తుంది. వేశ్యతో ఇరుక్కున్న ఈ పరిస్థితిని అద్వితీయంగా పోషించాడు. చాలా క్లిష్ట పాత్ర ఇది. పాత్రలోకి మనల్ని లీనం చేసి వదలకుండా తనతో తీసుకుపోతాడు. క్షణం క్షణం మారిపోయే పరిస్థితులకి అంతకంతకూ పెరిగిపోయే భావోద్వేగాల తీవ్రతని కంటిన్యుటీ చెడకుండా పకడ్బందీగా నటించాడు. షాపు వెనకాలే ఇంట్లో భార్యా పిల్లలున్నారు, షాపులో వేశ్యతో తను వున్నాడు. తాగిన మత్తులో వేశ్యని కోరుకున్నాడు, తీరా ఆమెకిదగ్గర కాలేకపోతున్నాడు. అలాటి తత్త్వం కాదు తనది. ఇంట్లోభార్యని నోరెత్తకుండా చేసే తను ఇప్పుడు వేశ్య ఏరా పోరా అంటున్నా కిక్కురుమనడంలేదు. తాళం వేసుకుపోయిన శివ ఎంతకీ రాకపోయేసరికి భయం- పరువు ప్రతిష్టలగురించి భయం పట్టుకుంది. పైగా పక్క షాపు వాడికి తన షాపు అద్దె కివ్వననేసరికి వాడు కోపం పెంచుకున్నాడు. ఇప్పుడు షాపులో ఏ మాత్రం అలికిడి అయినా వాడొచ్చే  ప్రమాదముంది. కానీ ఈ దిక్కుమాలిన వేశ్య సెల్ ఫోన్ కి మాటిమాటికీ కస్టమర్స్ నుంచి కాల్స్ రావడం, ఆమె పెంకెగా అరిచి మాట్లాడడం ప్రాణాల్ని తోడేస్తోంది...ఇలా చెప్పుకుంటూ పోతే రావణుడి క్షోభ అంతా ఇంతా కాదు. ఇదంతా ప్రకాష్ రాజ్ నటనతో అడుగడుగునా ఊపిరి బిగబట్టి చూడాల్సిన ఉత్కంఠని రేపుతాయి. అంత తేలిగ్గా మర్చిపోలేం ఈ పాత్రలోప్రకాష్ రాజ్ ని.

         ప్రియమణి కూడా వేశ్య చేష్టల్ని చాలా నేర్పుగా నటించింది. ఎంత సేపూ తన గొడవే గానీ అవతలి వాడి ఏడ్పు ఏమాత్రం పట్టని పాత్ర చిత్రణతో తను సృష్టించే సమస్యలు ఇన్నీ అన్నీ కావు- పరువు గురించి వీడికి భయముంటే తనకేంటన్నవేశ్య సహజ నిర్లక్ష్యంతో హడలెత్తించేస్తుంది. దాదాపు ముప్పావు కథ ఈ జగమొండి తనంతోనే సాగేక, అప్పుడు తెల్లారి వెంటిలేటర్ లోంచి అవతల ఇంట్లో అతడి భార్యా పిల్లల్ని చూసినప్పుడు, మెత్తబడి మొట్టి కాయలేయడం మొదలెడుతుంది అతడి పాడు బుద్ధికి. తను కూడా మానవత్వం నేర్చుకుని హూందాతనం ప్రదర్శిస్తుంది. ప్రియమణి కూడా గుర్తుండిపోతుంది ఈ పాత్రతో.

         ఇక సత్యదేవ్ గురించి. తెలుగు వాడైన ఇతను పూరీ జగన్నాథ్ తీసిన ‘జ్యోతిలక్ష్మి’ తో పరిచయమయ్యాడు. ఆ సినిమాలో సినిమాలో వేశ్యతోనే, ఈ సినిమాలోనూ వేశ్యతోనే. భుజంగయ్య తనకి రాముడు లాంటి వాడు. తను హనుమంతుడు. కానీ వాళ్ళిద్దర్నీ  షాపులోకి తోసి తాళం వేసుకుని ఫుడ్డు కోసంవెళ్ళిన వాడు ఎక్కడెక్కడో ఇరుక్కుంటాడు- ఏమేమో చేస్తాడు- ఎక్కడెక్కడో తిరుగుతాడు. తెల్లరిపోయాక నడిబజార్లో తాళం తీసే అవకాశం లేక గురువు గారి కోసం తల్లడిల్లిపోతాడు- ఈ ఆటో డ్రైవర్ క్యారక్టర్లో సత్యదేవ్ కూడా అత్యంత సహజంగా నటించాడు. 

            పృథ్వీ ది చాలా సర్ప్రైజ్ అప్పీయరెన్స్. రొటీనై పోయిన తన ఓవరాక్షన్ పేరడీల, డైలాగుల జడివానలోంచి ఓ తొలకరితో కొత్తదనానికి నాట్లు వేశాడు. ఒక స్ట్రగుల్ చేసే సినిమా దర్శకుడిగా మామూలు చొక్కా ప్యాంటు వేసుకుని,  సామాన్యుడిలా ఆటోల్లో తిరుగుతూ, తగ్గి మాట్లాడుతూ, పోగొట్టుకున్న స్క్రిప్టు వెతుక్కునే పాత్రలో పృథ్వీ జస్ట్ ది బెస్ట్. 

        ఇక ఇలాటి కథ వున్న సినిమాతో ఇళయరాజా గురించి చెప్పేదేముంది- ఆయనకి మరో మౌనరాగమో మరోటో దొరికినట్టే. తన సంగీత సారమంతా కథలోకి దింపేశారు. అలాగే కెమెరా మాన్ ముఖేష్ ఒక ఆర్ట్ వర్క్ లా చిత్రీకరణ చేశాడు. అంత ప్రధాన పాత్రలో నటిస్తూ కూడా ప్రకాష్ రాజ్ కనబర్చిన దర్శకత్వపు మెళకువలు- షాట్స్ తీయడంలో నేర్పు విజువల్ మీడియా మీద తనకున్న పట్టు ఏమిటో తెలియజేస్తాయి. ఏ నటీనటులూ కూడా ఆయన దర్శకత్వంలో అసహజంగా కన్పించరు. 

స్క్రీన్ ప్లే సంగతులు
    చాలా గర్వించాల్సిన విషయమేమిటంటే, తెలుగు సినిమాల్లో శాస్త్రీయ స్క్రీన్ ప్లేల  కోసం కళ్ళుకాయలు  చేసుకునే  సినిమా అక్షరాస్యులకి ఈ స్క్రీన్ ప్లే ఓ స్వీట్ కార్న్. పాప్ కార్న్ కాదు. పాప్ కార్న్ స్క్రీన్ ప్లే- సినిమాల పని అయిపోయింది- నూటికి తొంభై శాతం ఇంకా అట్టర్ ఫ్లాపులే- లేదా వీకెండ్ తర్వాత వసూళ్లు డ్రాపులే. స్వీట్ కార్న్ అమెరికా నుంచి దిగుమతి అయ్యింది. శాస్త్రీయ స్క్రీన్ ప్లే కూడా అమెరికా తయారీయే. ఇది మనది కాదని పాప్ కార్న్ స్క్రీన్ ప్లేలతో పిల్లలాట ఆడుకునే వాళ్ళకి ‘మన ఊరి రామాయణం’ గట్టి ఝలక్ ఇస్తుంది. 

        1. త్రీయాక్ట్ స్ట్రక్చర్, 2. గోల్ ఎలిమెంట్స్, 3. క్యారక్టర్ ఆర్క్, 4. టైం అండ్ టెన్షన్, 5.ప్లాట్ డివైస్, 6. కాన్షస్- సబ్ కాన్షస్ మైండ్ ల ఇంటర్ ప్లే, ఇగో జర్నీ, 7. ఇగో మెచ్యూర్డ్ ఇగోగా మారే ముగింపు...మొత్తంగా 8). ఒక సైకో థెరఫీ!

        త్రీయాక్ట్ స్ట్రక్చర్ : రెండు గంటల నిడివి గల ఈ స్క్రీన్ ప్లేలో బిగినింగ్, మిడిల్, ఎండ్ విభాగాలు ప్రామాణిక టైమింగ్ తోవున్నాయి. మొదటి అరగంటలో బిగినింగ్ విభాగం ముగుస్తుంది. ఈ బిగినింగ్ లో పాత్రల పరిచయం, కథ ఏ బాపతో తెలిపే నేపధ్య వాతావరణ కల్పన, సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన, సమస్య - ప్లాట్ పాయింట్ వన్ తో ఆ సాధించాల్సిన సమస్య ఏర్పాటు.

        భుజంగయ్య పాత్ర ద్వారానే ఈ బిగినింగ్ ఎలిమెంట్స్ అన్నీ ఎస్టాబ్లిష్ అవుతూ పోతాయి. టైటిల్స్ పడిన తర్వాత ప్రారంభమే అతను  బైక్ మీద వస్తూ (తర్వాత ఈ బైక్ కన్పించక పోవడం కథా సౌలభ్యం కోసం పాల్పడిన అనౌచిత్యమే. అతను ఈ బైక్ మీదే తిరిగితే అన్ని కష్టాల్లో పడేవాడు కాదు) ఓ షాపు దగ్గర ఇంకో షాపు వాడితో డిస్కషన్ పెట్టుకుని షాపు అద్దెకివ్వననండంతో, అతడికో ఖాళీ షాపు వుందని మనకర్ధమవుతుంది. ఇదే షాపు తాగుడుకి వాడుకోడం, ఇదే షాపు కీలక కేంద్రంగా ప్లాట్ పాయింట్ వన్ దగ్గర వేశ్యతో ఇరుక్కోవడం...ఇలా షాపుతో ఈ కథ మొదలెట్టడంలో  మనకి అర్ధమవుతుంది. ఏ ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ఏది కీలక పాత్ర వహిస్తుందో, దాంతోనే మనకి తెలీకుండా కథ మొదలెట్టడం తెలివైన కథాపథకం. 

         వూళ్ళో రామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ వాతావరణమంతా ఎస్టాబ్లిష్ అవుతూ వుంటుంది. దీనికి ఉదారంగా విరాళాలిస్తున్న భుజంగయ్య దుబాయ్ లో భారీగా సంపాదించుకు వచ్చాడని మాటల్లో మనకి తెలుస్తుంది. దీనికి తగ్గట్టు  వొంటి మీద బంగారు గొలుసులు, వేళ్ళకి ఉంగరాలు, చేతులకి కంకణాలు, జేబులో పాకెట్ లో పుల్ మనీతో, సిల్కు దుస్తుల్లో  కళకళ లాడుతూ వుంటాడు. ఇంతేకాదు, ఈ సందర్భంగా భుజంగయ్యకి కళాపోషణ కూడా వుందని అర్ధమవుతుంది- ఉత్సవాల్లో రావణ పాత్ర పోషించాలన్న అతడి అభిలాషతో. ఈ అభిలాష ఇంట్లో అతడిలోని రావణుణ్ణి ప్రత్యక్షం చేసి చూపిస్తుంది. భుజంగయ్య ఇంట్లో మర్యాదలేని రాక్షసుడుయితే, బయట గౌరవనీయుడైన రావణుడు. ఇంట్లో భార్య, అత్తా, పెద్ద కూతురు, చిన్న కూతురూ  పరిచయమవుతారు. వీళ్ళని రాచి రంపాన పెడుతూంటాడు ఆడవాళ్ళన్న దయ- వీళ్ళే తనకి దిక్కూ అన్న ఆలోచన కూడా లేకుండా.   

        ఈ ప్రారంభ దృశ్యాల్లోనే ఇంకొకటి ఎస్టాబ్లిష్ అవుతూంటుంది. సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన. పెద్ద కూతురి సెల్ కి  మెసేజ్ వస్తే సంస్కారం లేకుండా తీసి చూస్తాడు. ఎవడో బాయ్ ఫ్రెండ్ వున్నాడని కేకలేయడం మొదలెడతాడు. కూతుర్ని కాలేజీ  మాన్పించేస్తాడు. పెళ్లి చేసేయాలని సిద్ధమై పోతాడు భార్యా అత్తా కూడా వ్యతిరేకించినా. 

        బయట భుజంగయ్య నమ్మిన బంటుగా ఆటో డ్రయివర్ శివ పరిచయమవుతాడు కథకి. దుబాయ్ వెళ్ళడానికి  భుజంగయ్య వీసా ఇప్పిస్తాడని  నమ్మి భుజంగయ్య పనులన్నీ చేసి పెడుతూంటాడు. అలాగే ఊళ్లోకి దిగిన సినిమా దర్శకుడు గరుడ(పృథ్వీ) కూడా పరిచయమవుతాడు కథకి. 

        ఇలా సెటప్ సిద్ధమయ్యాక, కూతురి గురించి మళ్ళీ నానా రభస చేసి వొళ్ళు మండి ఇంట్లోంచి వెళ్ళిపోతాడు భుజంగయ్య. ఈ వెళ్ళడం సింబాలిక్ గా రాముడు అరణ్య వాసానికి వెళ్ళినట్టే. ఇక రామాయణం ప్రారంభమైనట్టే. కాకపోతే ఇక్కడ రావణుడు వెళ్తున్నాడు. వెళ్లి షాపులో నేస్తాలతో మందు కొట్టి అర్ధరాత్రి బయటి కొచ్చి శివ ఆటో ఎక్కుతాడు. ఈ ఆటోలో పోతున్నప్పుడు రోడ్డు పక్క నిలబడి కన్పిస్తుంది సుశీల. ఒక కొత్త పాత్రతో ప్లాట్ పాయింట్ వన్ ని స్పష్టంగా కొట్టొచ్చినట్టూ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇక షాపులో ఆమెతో బందీ అయిపోవడంతో బిగినింగ్ విభాగం ముగుస్తుంది.

     ఇలా వరసగా బిగినింగ్ విభాగంలో పైన చెప్పుకున్న నాల్గు ఎలిమెంట్స్ ఎస్టాబ్లిష్ అయ్యాయి.  ప్లాట్ పాయింట్ వన్ దగ్గర భుజంగయ్యకున్న  గోల్ ఇక ఆ షాపులోంచి-వేశ్యతో ఆ పరిస్థితి నుంచి  బయట పడడమే. ఈ షాపులో ఇరుక్కోవడం ద్వారా అతడి గోల్ ఎలిమెంట్స్  1. కోరిక- అనేది అతను షాపులోంచి బయట పడాలనుకోవడంలో వుంది, 2. పణం - అనేది తన పరువు రిస్కులో పడేసుకుంటూ వేశ్యలో జతకూడడం ద్వారా పెట్టాడు.  3. పరిణామాల హెచ్చరిక అనేది- పరువు పోవడంతోబాటు కూతురి పెళ్లికే ఎసరు వచ్చేలా వుంది, 4. ఎమోషన్ - ఈ మూడూ తలచుకుంటే యాదృచ్చికంగా బలంగా ఎమోషన్ తన్నుకొస్తోంది.  

        ఇలా ప్లాట్ పాయింట్ వన్ సశాస్త్రీయంగా ఎస్టాబ్లిష్ అయ్యాక, దీని నేపధ్యంలో ఇప్పుడు మిడిల్ విభాగంలోకి వెళ్తోంది కథ. మిడిల్  అంటే కథలో యాభై శాతం వుండాల్సిన కదన రంగం. జేమ్స్ బానెట్ ని మనం ఇక్కడ దర్శించుకుంటే- ఆయన ప్రకారం స్క్రీన్ ప్లేలో మిడిల్ అంటే మన సబ్ కాన్షస్ మైండ్, బిగినింగ్ అంటే మన కాన్షస్ మైండ్. కథ మిడిల్లోకి వెళ్ళడమంటే కాన్షస్ మైండ్ సబ్ కాన్షస్ తో తలపడ్డమే. మన కాన్షస్ మైండ్ కి సారధి మన ఇగో. సినిమా హీరో అంటే మన ఇగోకి సింబలే. అంటే కాన్షస్ మైండ్ ని మజాగా ఏలుకుంటున్న ఇగో ఇక తనకి తెలీని, దిగితే  ఏం జరుగుతుందో వూహించలేని, సబ్ కాన్షస్ మైండ్ లోకి (మిడిల్ లోకి) దూకేస్తుందన్న మాట.

        ఇలా భుజంగయ్య వేశ్య అనే గాలానికి చిక్కి, సబ్ కాన్షస్ మైండ్ కి సింబల్ గా వున్న  షాపులోకి దూకేశాడు. సబ్ కాన్షస్ లోకి ఇగో దూకేక ఏమవుతుంది? అక్కడ తన అస్తిత్వం  కోసం పోరాడుతుంది. మనసు చీకటి కోణాల్లో దాగి వుండే భయాలనే నెగెటివ్ శక్తులతో పోరాడుతుంది. అజ్ఞానమనే అడ్డుగోడల్ని కూల్చేస్తుంది. నగ్నసత్యాల్ని తెలుసుకుంటుంది. పరమ సత్యాన్ని గ్రహిస్తుంది. మోక్షం పొంది అలా కాదు, నేనిలా అర్ధవంతంగా జీవించాలనుకుని, మెచ్యూర్డ్ ఇగోగా మారి ఒడ్డున పడుతుంది. అడ్డగోలు ఇగో కాస్తా పునీతమై మెచ్యూర్డ్ ఇగోగా అవతరిస్తుందన్న మాట. ఇది మానసికంగా మనం నిత్యం అనుభవించే ఆవస్థే. వెండితెర మీద సినిమాలో బొమ్మల కదలిక అంటే మన మానసిక ప్రపంచంలో మనం ఆడుకునే ఆటే (కాన్షస్- సబ్ కాన్షస్ మైండ్ ల ఇంటర్ ప్లే). సినిమా కథనే కాదు. ఏ కథ లక్ష్యమైనా  ఇదే- పాత్రని ఇగో నుంచి మెచ్యూర్డ్ ఇగోగా మార్చడం. 

        భుజంగయ్య పాత్ర కూడా బందీ అయిపోయిన ఆ గదిలో ఈ పాట్లన్నీ పడుతుంది. ఆ షాపు గదిలో ఒక్కో సంఘటన అతడిలోని ఒక్కో రావణ (ఇగో) గర్వాన్ని పటాపంచలు చేస్తూపోతుంది. మనిషి ఏదైనా కోల్పోతాడు గానీ పరువు కోల్పోవడానికి సిద్ధ పడడు. కానీ తనకి గొప్ప పరువు ప్రతిష్ట లున్నాయని విర్రవీగి ప్రవర్తిస్తే, ఆ పరువు ప్రతిష్టలేప్రమడంలో పడే  పరిస్థితి వస్తుంది. అప్పుడు బుద్ధి తెచ్చుకుని ప్రవర్తన మార్చుకుంటాడే తప్ప, ప్రాణాల కంటే ఎక్కువైన పరువు ప్రతిష్టల్ని వదులుకోడు. మనం అర్ధం జేసుకుంటే రావణుడనే వాడు మన ఇగో కి సింబల్, రాముడు మెచ్యూర్డ్ ఇగోకి ప్రతీక. ఇగో మెచ్యూర్డ్ ఇగోగా ఎందుకు మారాలి, అసలు ఇగోనే చంపేస్తే పోదా అనవచ్చు. పదార్ధానికి వినాశం లేదని తెలుసుగా? పదార్ధం ఇంకో రూపం ధరిస్తుంది తప్ప నశించడం దాని ధర్మమే కాదు. కాబట్టి-  ఏయ్ నీ ఇగో తగ్గించుకో, ఇగో నీకు మంచిది కాదు- అనడం అవివేకమే. కోతి  మనిషిగా రూపాంతరం చెందినట్టు, ఇగో మెచ్యూర్డ్ ఇగోగా రూపాంతరం చెందాల్సిందే తప్ప నశించడానికి లేదు. 

        భుజంగయ్య ఈ సంఘర్షణలో జీవితంగురించి, కుటుంబ విలువల గురించి, మనిషి విలువ గురించీ నేర్చుకుని  తనలోని రావణుణ్ణి భూస్థాపితం, చేసి రాముడిలా ఇంటికి తిరిగి వస్తాడు. అతడి వనవాసం పూర్తయ్యింది. 

         కరీనా కపూర్- రాహుల్ బోస్ లతో 2003 లో సుధీర్ మిశ్రా తీసిన ‘చమేలీ’ లో కూడా వర్షపు రాత్రంతా ఒక బస్టాపులో వేశ్యతో చిక్కుబడిపోయిన హీరో తెల్లారే సరికి మారిన మనిషిగా ఇంటికి తిరిగొస్తాడు. గొప్ప కథలు చూస్తున్న మనకూ ఇలాటి సైకో థెరఫీలే చేస్తాయి.  


        ఈ కథంతా, ఈ పరివర్తనంతా  ఏడ్పులతో, డైలాగులతో చెప్పలేదు. ఒక్క నీతి వాక్యం మౌఖికంగా చెప్పలేదు. ఏ వాయిసోవర్ తోనూ ముగింపు మెసేజి లివ్వలేదు. ఇదే క్వాలిటీ సినిమా అంటే. ఇవన్నీసంఘటనల ద్వారానే, ఆ సంఘటనలకి పాత్రల ప్రతిస్పందనల ద్వారానే  తెలియజేస్తూ పోయారు. ఈ కథ చెప్పడానికి వాడిన ప్రధాన రసం ఏ చింతపండు పులుసో కాదు. సస్పెన్స్ థ్రిల్లర్ కుండే  అద్భుత రసం. ఒక సంఘటనకి మించి ఇంకో సంఘటనగా టెన్షన్ పెంచుతూ టైం  అండ్ టెన్షన్ గ్రాఫ్ మీద కూడా దృష్టి పెట్టారు. ఆ ప్రకారం క్యారక్టర్ ఆర్క్ కూడా పడుతూ లేస్తూ పోతూంటుంది. ఈ మధ్య ‘డోంట్ బ్రీత్’ అనే హర్రర్ సస్పెన్స్ వచ్చింది. దానికంటే ఓ పదిశాతం తక్కువ సస్పెన్స్ -టెన్షన్ – థ్రిల్ ఎలిమెంట్స్ తో ఇది వుండొచ్చు. షాపు బయటి పాత్రలతో ఒకరకమైన సస్పెన్స్, లోపలి పాత్రలతో ఇంకో సస్పెన్స్ తో- రెండంచుల కత్తిలా కథ. 

        ఇంటర్వెల్ మలుపుని  కూడా నరాలు బిగబట్టుకుని చూడాల్సి వస్తుంది. మిడిల్. ఎండ్ రెండు విభాగాలూ కలిపి గంటన్నర సేపు వూపిరిసల్పని సస్పెనుతో కదలకుండా కూర్చో బెట్టేస్తుంది. మన దగ్గర ఇంకా ఎలా ఉంటుందంటే- ప్రేమ కథల్లో, కుటుంబ కథల్లో  సస్పన్స్ అంటే – అది యాక్షన్ సినిమాల వ్యవహారం- మనం దెబ్బతింటాం అనుకుని, అవే సరుకు లేని డ్రామాలు తీస్తూ పోతారు. ప్రసుత రామాయణంలో ఎవరూ హత్య చేయలేదు, ఇంకే నేరమూ చేయలేదు- అచ్చమైన  కుటుంబ కథే ఇది. కుటుంబ కథలో తటస్థించిన ఒకానొక దురదృష్టకర ఘట్టం. దీన్ని సస్పెన్స్ థ్రిల్లర్ గా చెప్తే ఏం కొంపలు మునిగాయి.  ‘మన ఊరి రామాయణం- మనలోని రామాయణం’ అంటూ పాట ద్వారా వెల్లడయ్యే మానసిక లోకపు కల్లోలం. దీనికి పరిష్కారంతో సైకో థరఫీ. ఇంతకనే శాస్త్రీయ స్క్రిప్టు ఏముంటుంది?

        ఇందులో సినిమా దర్శకుడు పోగొట్టుకునే స్క్రిప్టు కూడా ప్లాట్ డివైస్ గా కథ నడుపుతుంది. చివరి దృశ్యంలో నటులు పృథ్వీ- ప్రియమణిలతో ఈ స్క్రిప్టు ఒక అందమైన ముగింపు నిస్తుంది. హార్రర్ కామెడీలూ, ఇంకేవో యాక్షన్ సినిమాలూ పక్కన పెడదాం కాస్సేపు- నిత్య జీవితంలో మన కెదురయ్యే ఘట్టాలు మన చేతల వల్ల  ఎంత సస్పెన్స్ లో పడి ప్రాణాలు తోడేస్తాయో - కల్తీలేని ఈ అచ్చ కుటుంబ కథలో చూసి జీవిత కాలం నెమరేసుకోవచ్చు. షరతు ఏమిటంటే, ఈ సినిమా కెళ్తే పాప్ కార్న్ కాకుండా స్వీట్ కార్న్ తినాలి.


-సికిందర్  



9, అక్టోబర్ 2016, ఆదివారం

రివ్యూ!

రచన-  దర్శకత్వం: వీరూ పోట్ల
తారాగణం: సునీల్‌, సుష్మా రాజ్‌, రిచా పనాయ్‌, పునీత్‌ ఇస్సార్‌, జయసుధ, అరవింద్‌కృష్ణ, నరేష్‌, శత్రు, షకలక శంకర్‌, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్‌, పృధ్వీ 
సంగీతం: సాగర్‌ ఎం.శర్మ, ఛాయాగ్రహణం: దేవరాజ్‌
బ్యానర్‌: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ 
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
విడుదల: అక్టోబరు 7, 2016
***
యాక్షన్ హీరో- కమెడియన్ సునీల్ మరో దండయాత్ర చేస్తూ విజయదశమికి వచ్చేశాడు. కాస్త పంథా మార్చి ఈసారి కామిక్ థ్రిల్లర్ తో అదృష్ట పరీక్షకి నిలబడ్డాడు. అదృష్టం దక్కని గత కొన్ని మూస ఫార్ములా యాక్షన్ కామెడీలకి దూరంగా కొంచెం తేడా గల ప్రయత్నం చేద్దామనుకున్నట్టుంది- తేడా రాకుండా చూసుకునే బాధ్యత మాస్  సినిమాల దర్శకుడు వీరూ పోట్ల భుజానేసుకున్నాడు. అప్పుడేం జరిగింది? తేడా వచ్చిందా, తేడాగల ప్రయత్నంగా నిలబడిందా తెలుసుకోవాలంటే బంగార్రాజు కథలోకి వెళ్ళాలి...

కథ 
     అతను బంగార్రాజు (సునీల్). బెజవాడ వస్తాడు పని వెతుక్కుంటూ.  నారదరావు (పృథ్వీ) కొరియర్ కంపెనీలో చేరతాడు. తను ఎవరి దగ్గర పనిలో చేరినా  ఆ యజమాని తన్నులు తిని వ్యాపారం కోల్పోవడమే జరుగుతుంది. అలా తన్నులు తిని వ్యాపారం కోల్పోయిన నారదరావు, బంగార్రాజుని వదిలించుకుంటూ హైదరాబాద్ పంపించేస్తాడు.  అక్కడ బంగార్రాజుకి రోడ్ల మీద తిరిగే గీత (సుష్మా రాజ్) పరిచయమవుతుంది. ఓ స్కూల్ టీచర్ (జయసుధ) ని ఓ అవమానం నుంచి కాపాడడంతో ఆమెకి అతడిలో ఇప్పుడు లేని తన పెద్ద కొడుకు కన్పిస్తాడు. దాంతో  ఇంట్లో ఆశ్రయమిస్తుంది. ఇంట్లో చేరిన బంగార్రాజు ‘తమ్ముడు’ శ్రీనివాస్ (అరవింద్ కృష్ణ) పని చేసే కంపెనీలోనే చేరతాడు. 

        ఉన్నట్టుండి బంగార్రాజు చిక్కుల్లోపడతాడు. ఒక గ్యాంగ్ సునీల్ వర్మ అనే వాడికోసం వెతుకుతూంటారు. వాడు ఓ విగ్రహం కొట్టేసుకు పోయాడు. ఆ విగ్రహంలో 900 కోట్ల రూపాయల విలువైన వజ్రాలున్నాయి. ఆ వజ్రాలు బెట్టింగ్ మాఫియా మహదేవ్ (పునీత్ ఇస్సార్) కి చెందినవి. మహదేవ్ కొడుకు సహదేవ్ తన గ్యాంగ్ తో సునీల్ వర్మ కోసం వెతుకుతూంటే బంగార్రాజు దొరికిపోతాడు. బంగార్రాజు సునీల్ వర్మ పోలికలతోనే వుం టాడు. తను సునీల్ వర్మ కాదని ఎంత మొత్తుకున్నా, అతడి తమ్ముణ్ణి కిడ్నాప్ చేసి  వజ్రాలు పట్రమ్మంటారు. బంగార్రాజు సునీల్ వర్మని పట్టుకుని తమ్ముణ్ణి విడిపించుకునేం దుకు  అన్వేషణ మొదలెడతాడు. ఈ అన్వేణలో ఏమేం జరిగాయి, ఏఏ కుట్రలు బయట పడ్డాయి,ఎవరెవరు కుట్ర దారులుగా బయట పడ్డారు, అసలు సునీల్ వర్మ ఎవరు, అతణ్ణి  ఎలా పట్టుకున్నాడు బంగార్రాజు - అన్నవి మిగతా కథలో తెలిసే అంశాలు.

ఎలా వుంది కథ 
      కామిక్ థ్రిల్లర్ జానర్ లో సస్పన్స్ ని జోడించుకున్న కథే. కానీ దర్శకుడు గతంలో మూస ఫార్ములా మాస్ సినిమాల దర్శకుడవడం చేత ఆ వాసనలన్నీ ఇందులోకి జొరబడి పోయి జానర్ మర్యాదని దెబ్బ తీశాయి. ప్రేక్షకులు తమిళ డబ్బింగ్ సినిమాల్లో తమిళ వాసనలు  పసిగట్టినట్టు, జానర్ కాని జానర్ వాసనలు కూడా ఇప్పుడు పసిగట్టి ఫ్లాప్ చేయగలరని గత సంవత్సరం తెలుగులో విడుదలైన ఫ్లాప్ సినిమాలన్నీ నిరూపించాయి. అవన్నీ జానర్ మర్యాదని మంటగలిపినవే. జానర్ మర్యాదని కచ్చితంగా పాటించిన కేవలం అయిదారు చిన్నా పెద్దా తెలుగు సినిమాలు మాత్రమే గత సంవత్సరం హిట్టయ్యాయి. కామిక్ థ్రిల్లర్ అంటేనే ట్రెండీగా, న్యూవేవ్ మూవీలా వుండాలి. వుంది కాబట్టే ‘స్వామిరారా’ అనే కామిక్ థ్రిల్లర్ అంత  హిట్టయింది. మూస ఫార్ములాతో ఆ నిగ్రహం చూపించలేదు కాబట్టే అదే దర్శకుడు తీసిన ‘దోచేయ్’ అంత ఫ్లాపయ్యింది. కామిక్ థ్రిల్లర్ ‘దోచేయ్’ ని దెబ్బ తీసిన పాత మూసఫార్ములా పైత్యాలే ‘ఈడు గోల్డ్ ఎహె’ జానర్ మర్యాదని కూడా చెరిచాయి. ఏ పాత మూస వాసనలతో గత కొన్ని సినిమాల కథలతో సునీల్ కి శృంగభంగమవుతూ వచ్చిందో, అవే వాసనలు పుష్కలంగా ఈ జానర్ కథకీ పూశారు. మదర్ సెంటిమెంటు, బ్రదర్ సెంటిమెంటు, బరువైన సెంటిమెంటల్ డైలాగులూ, అనాధ హీరో పాత్ర, హీరో మూస ఎంట్రీ, హీరో ఎక్కడ పనిలో చేరితే  అక్కడ నష్టం అనే క్యారక్టరైజేషన్- ఫ్యామిలీ సెంటిమెంట్లు, ఇద్దరు హీరోయిన్లు, రొటీన్ స్లాట్స్ లో వాళ్ళతో రోమాన్సులూ పాటలు, బంగార్రాజు అనే పేరు, ఈడు గోల్డ్ ఎహె అనే టైటిల్ కూడా సంకల్పించిన జానర్ కి రసభంగమే. ఇవి అసలు కథని చాలా దెబ్బ తీశాయి. కామిక్ థ్రిల్లర్స్ తో అంత అలరించిన, నవ్వించిన జాకీ చాన్ సినిమాల్లో ఇలాటివి వుంటాయా? ప్రతీ జానర్ కథలోనూ జానర్ స్పృహ లేకుండా నవరసాలన్నీ నింపాలన్నచాపల్యం వుంటే, దీన్ని ఓరకంట గమనిస్తున్నారిప్పుడు ప్రేక్షకులు.

ఎవరెలా చేశారు 
        సహజంగానే సునీల్ నటన లక్ష్యిత జానర్ కి న్యాయం చేయడం కష్టమైపోయింది. ఈ కామిక్ థ్రిల్లర్ లక్ష్యిత జానర్ పట్ల స్పష్టత వుంటే,  ఆ ప్రకారం సీన్లు మార్పించి ఆ జానర్ కి తగ్గ ఆటాడుకునే వాడు. ‘ముత్యాల ముగ్గు’ లో తల్లి కున్న విషాదం పిల్లలు అనుభవించరు. పిల్లలు బాధ పడే సీను ఒక్కటి కూడా వుండదు. వాళ్ళ హాస్య ధోరణిలో వాళ్ళు విలన్లతో ఆటాడుకుని తల్లికి న్యాయం చేస్తారు. ఆ విషాద కథని అద్భుత రసంతో నడిపారు. అయోధ్య కొచ్చిన లవకుశలు కూడా అడవి పాలైన  తల్లి సీత గురించి బాధ పడుతూ కూర్చోరు. యాక్టివ్ క్యారక్టర్స్ ఎప్పుడూ బాధ పడుతూ కూర్చోవు. సునీల్ కి ఈ వెసులుబాటు లేకుండా పోయింది. పైన చెప్పుకున్న మూసఫార్ములా ధోరణుల వల్ల బాధ,  ఏడ్పు, రోషాలు, అక్రందనలూ, సెంటిమెంట్- మెలోడ్రామాలూ కూడా నటించడంతో జానర్ ప్రధాన రసమైన అద్భుత రసం, దీని బై ప్రోడక్టు అయిన హస్యరసమూ దెబ్బతినిపోయాయి. కథలో రెండే కీలక పరిణామాలని గుర్తించినప్పుడు (తమ్ముడు అనేవాడి కిడ్నాప్, సునీల్ వర్మ పేరుతో తనలాగే మరొకడు- అనే ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ఏర్పడిన సమస్య- గోల్) వీటి ఆధారంగానే ముత్యాల ముగ్గు పిల్లల్లాగా నవ్విస్తూ, జాకీచాన్ లా నరుక్కుంటూ పోవాలే తప్ప- వీటి తాలూకు విషాదం, బాధ ఏదైనావుంటే వాటిని ప్రేక్షకులు ఫీలవడానికి ముత్యాల ముగ్గులో లాగా, బ్యాక్ డ్రాప్ లో సబ్ టెక్స్ట్ లా వదిలెయ్యాలే తప్ప- అన్నీ విప్పి అవన్నీ నటన ద్వారా ప్రదర్శిస్తే  చాలా దెబ్బతినిపోతుంది వ్యవహారం. 

        హీరోయిన్ల పాత్రలూ మూస ఫార్ములా హీరోయిన్లలాగే వున్నాయి ఎక్స్ పోజింగ్స్ తో. పునీత్ ఇస్సార్ విలన్ పాత్రకి బాగా సరిపోయాడు భీకరంగా. మిగిలినవి కామెడీ పాత్రలు. రెండో హీరోయిన్ తండ్రిగా నరేష్, కిడ్నాపర్ గా పోసాని, ఫాం హౌస్ ఓనర్ గా పృథ్వీ, రైల్వే టీసీగా వెన్నెల కిషోర్, దొంగోడిగా షకలక శంకర్, నరేష్ ఇంట్లో పనివాడుగా భరత్ - వీళ్ళందరికీ సునీల్ పాత్రకి లాగా ఏ బాధల బ్యాగేజీ, సెంటిమెంట్ల బస్తాలూ లేకపోవడం వల్ల హేపీ - గో- లక్కీగా నవ్వించుకుంటూ పోయారు. ముఖ్యంగా పృథ్వీ, వెన్నెల, షకలక కామెడీ చివరంటా నవ్వించేదే. ఇందులో పృథ్వీ మళ్ళీ వేరే సినిమాల పేరడీ లేవీ చేయకుండా ఫ్రెష్  కలర్ఫుల్ క్యారక్టర్ లో నటించాడు.  
    
        సంగీతం, కెమెరా వర్క్ ఓ మాదిరిగా వున్నాయి. కొన్ని సీన్లలో డీఐ శృతిమించింది. యాక్షన్ దృశ్యాలు క్లయిమాక్స్ లో జానర్ కి విరుద్దంగా హింసాత్మకంగా వున్నాయి. కారణం, వెనకటి దృశ్యాల్లో హీరో తల్లిని విలన్ కొట్టి వుండడం. కాబట్టి హీరో విలన్ల మధ్య హీరో మదర్ సెంటిమెంట్లూ ఎమోషన్స్ తో ఈ హింస. ఈ కథలో అనవసరమైన తల్లి పాత్ర వల్ల, తల్లిని విలన్ కొట్టే అనవసరమైన దృశ్యం వల్ల,  క్లయిమాక్స్ ఫైట్ హీరో విలన్ల మధ్య జానర్ ప్రకారం హిలేరియస్ గా వుండక, యమ సీరియస్ అయిపోయింది వ్రతం చెడగొడుతూ. 

చివరికేమిటి 
        ఓ మంచి ఐడియాతో ఈ ‘కామిక్ థ్రిల్లర్’ కి పూనుకున్నాడు వీరూపోట్ల. ఇందులో అంచెలంచెలుగా వీడే సస్పెన్స్ వుంది. ఎండ్ సస్పెన్స్ అన్పించని ఎండ్ సస్పెన్ కథనం ప్రాణంగా వుంది- ఎండ్ సస్పెన్స్ గండాన్ని దాటే విధం చూపిన ‘టు ఛేజ్ ఏ క్రూకెడ్ షాడో’ – బ్రిటిష్ సస్పెన్స్, 1958 (హిందీలో ‘ధువాఁ’ - 1981, బెంగాలీలో ‘శేషాంక’ - 1963, తమిళంలో ‘పుథియ పరవాయి’ - 1964) తరహాలో అప్రయత్నంగానో,  ప్రయత్న పూర్వకంగానో కథనం చేశాడు. కథలో సస్పెన్స్ వుందని చివరి వరకూ తెలియ జేయకపోవడం ఈ తరహా కమర్షియల్ సినిమాలకి పనికొచ్చే ఎండ్ సస్పెన్స్ బాపతు కథనం. క్లయిమాక్స్ లో ఫైనల్ షోడౌన్ ఇస్తూ పాత్రలన్నీ ఓపెన్ కావడం ‘టు ఛేజ్ ఏ క్రూకెడ్ షాడో’ లాంటి మాస్టర్ స్ట్రోకే. ఇంతమంచి జానర్ ఫ్రెండ్లీ తురుపు ముక్క చేతిలో పెట్టుకుని దర్శకుడు విజాతి మూస ఫార్ములా ధోరణులతో ఎవరినో సంతృప్తి పరుస్తూ కూర్చున్నాడు. గంటంపావు సేపు ఫస్టాఫ్ అంతా అసలు కథేమిటో తెలియకుండా పోయే గజిబిజి మూస మాస్ దృశ్యాలతో పాత సినిమాలాగా నడుస్తుంది. ఇంటర్వెల్లో తమ్ముడి కిడ్నాప్, సునీవర్మ యాంగిల్,  ఓపెన్ కావడంతో అసలు కథ మొదలైనా- దీనికీ మళ్ళీ సెకండాఫ్ లో హీరోకి కొనసాగించిన సెంటిమెంటు సిమెంటు బస్తాలతో హమాలీ కథైపోయింది క్లైమాక్స్ వరకూ. అసలు స్క్రీన్ ప్లే అంటే ఏమిటో తెలిసి ఈ సినిమా తీసినట్టు కన్పించదు. ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ప్రేక్షకులు ఎలర్ట్ అయ్యేట్టు చేసిన - బంగార్రాజులా వున్నాడంటున్న సునీల్ వర్మ అసలెవరన్న  పాయింటు ప్రధానంగా హీరో పాత్ర ప్రయాణం కొనసాగించకుండా- అంత ముఖ్యమైన పాయింటూ, అసలు కిడ్నాపైన తమ్ముడి విషయమూ మరుగున పడేలా వేరేవేరే కథనాలు చేసుకుంటూ పోయారు. 

        రచయితగా దర్శకుడు సఫలమయ్యింది కామెడీ దృశ్యాల్లోనే. సునీల్- నరేష్- భరత్ ల మధ్య అదొక ఫన్నీ దృశ్యం. రైల్లో వెన్నెల కామెడీ ఎపిసోడ్ మరో ఎంటర్ టైనర్, ఫాం హౌస్ లో కోళ్ళ గురించి పృథ్వీ వెర్బల్ కామెడీ మరో వినోదం. అయితే ఎడాపెడా ప్రతీ చోటా ప్రాస డైలాగులు వాడేశారు. సీన్లు ఫన్నీగా వుండడంతో ఈ ప్రాస డైలాగులు చెల్లిపోయాయి. విలన్ ‘బ్లడీ ఫూల్’  అంటే కమెడియన్ ‘లకడీకా పూల్’  అనడం, వెన్నెల డౌట్ కి పృథ్వీ ‘బ్లెండర్ పడితే పడితే జెండర్ తెలీదు’ అనడం ...లాంటివి బహుశా హిందీలో వచ్చే మైండ్ లెస్ కామెడీల కిందికొస్తుంది. హైదరాబాద్ ఓల్డ్ సిటీ కామెడీ నాటికల్లో కన్పించే ఇలాటి మాటకి మాట ఏదో మాట అనెయ్యడమనే డైలాగ్ స్కీమ్ రచయిత- దర్శకుడు అయిన వీరూపోట్ల చివరంటా దారం తెగకుండా చక్కగా పోషించాడు- ఈ బిజీలో తెగిన గాలిపటం అయింది అసలు కథే!


-సికిందర్
http://www.cinemabazaar.in







.









7, అక్టోబర్ 2016, శుక్రవారం

రివ్యూ!


రచన- దర్శకత్వం : చందు ఎం.
తారాగ‌ణం: చైత‌న్య అక్కినేని, శృతీహాస‌న్‌, అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, మ‌డోన్నా సెబాస్టియ‌న్‌, అవంతికా వందనపు, పృథ్వీ, బ్రహ్మాజీ, నర్రా శీను, శ్రీనివాస‌రెడ్డి, అరవింద్ కృష్ణ, చైతన్య కృష్ణ, ప్ర‌వీణ్‌, వైవా హర్ష, నోయెల్‌, అక్కినేని నాగార్జున‌, ద‌గ్గుబాటి వెంక‌టేష్‌ త‌దిత‌రులు
కథ :
అల్ఫోన్స్ పుథ‌రిన్‌, సంగీతం : గోపీసుంద‌ర్‌, రాజేష్ మురుగ‌న్‌, ఛాయాగ్రహణం : కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని
బ్యానర్ : సితార
ఎంట‌ర్ టైన్మెంట్స్‌, నిర్మాత: సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ
విడుదల : 7 అక్టోబర్, 2016

***
      నాగచైతన్యకి ఓ హిట్ కావాలి. లేకపోతే పెళ్లి ముందు ఏమీ బాగోదు. దీన్ని ఎప్పట్నించో ప్లాన్ చేస్తూ వూరిస్తూ, రకరకాల వూహాహగానాలని భరిస్తూ, చివరికి అనుకున్న మలయాళ రీమేక్ ‘ప్రేమమ్’ తో ప్రేక్షకుల ముందు కొచ్చాడు. గత దసరాకి తండ్రి నాగార్జున వచ్చి ‘సోగ్గాడే చిన్నినాయనా’ తో హోరెత్తించినట్టు ఈ దసరాకి తను వచ్చాడు. వచ్చింది హోరెత్తించడానికేనా,  లేకపోతే  బోరెత్తించడానికా ఈ కింద తెలుసుకుందాం.

కథ
    మొదటి కథ : తాడేపల్లి గూడెంలో పదో తరగతి చదివే విక్రం వాత్సల్య అలియాస్ విక్రం ప్రేమ కవితలు రాస్తూ సుమ (అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్‌) ని ప్రేమిస్తాడు. ఆమె వెంట పడే ఇంకెంత మందో ప్రేమికుల్ని అధిగమించి చివరికెలాగో చిన్న పిల్ల సింధు (అవంతికా వందనపు) కిచ్చి ప్రేమ లేఖ పంపుతాడు. రెస్పాన్స్ గా సుమ అతడింటికి వస్తానని అంటుంది. ఆనంద పడతాడు విక్రం. సుమ విక్రం ఇంటికి  తన బాయ్ ఫ్రెండ్ ని తీసుకు వచ్చి పరిచయం చేస్తుంది. ఖంగు తిన్న విక్రం ఆమె మోసం చేసిందని తిట్టుకుని, మర్చిపోవడానికి ప్రయత్నిస్తాడు. 

        రెండో కథ : ఐదేళ్ళ తర్వాత విక్రం ఇంజనీరింగ్ చదువుతూంటాడు. ఎదిగిన యువకుడి పౌరుషం, దౌర్జన్యం వగైరాలతో కాలేజీలో గ్యాంగ్ ని మెయింటెయిన్ చేస్తూ బాస్ లా చెలామణీ అవుతూంటాడు. ఆ కాలేజీకి గెస్ట్ లెక్చరర్ గా సితార (శృతీ హాసన్) వస్తుంది. మరాఠీ అయిన ఈమెని చూడగానే ప్రేమలో పడతాడు విక్రం. ఇతడితో బాటు ఓ లెక్చరర్ (నర్రా శీను) కూడా ప్రేమలో పడతాడు. ఇతడికి తోటి లెక్చరర్ (బ్రహ్మాజీ) ఐడియా లిస్తూంటాడు. విక్రం ఫీలింగ్స్ ని సితార గుర్తిస్తుంది. ఇంతలో సెలవులు రావడంతో సొంతవూరు పుణేకి బయల్దేరుతుంది. ఆ బస్సు యాక్సిడెంట్ అయి జ్ఞాపకశక్తి కోల్పోతుంది. వెళ్లి చూసిన విక్రం ఆమె తనని గుర్తించకపోవడంతో బాధపడి ఆమెని మర్చిపోవడానికి ప్రయత్నిస్తాడు. ఇంతలో  ఆమె కజిన్ (అరవింద్ కృష్ణ)  తో ఆమె పెళ్లి నిశ్చయమైందని  కబురు వస్తుంది. 

        మూడో కథ :  పదేళ్ళ తర్వాత విక్రం ఒక రెస్టారెంట్ నడుపుతూంటాడు. ముప్పయి దాటుతున్న వయసులో మెచ్యూరిటీతో వుంటాడు. ఇప్పుడు ఇంకో అమ్మాయి (మడోన్నా సెబాస్టియన్) పరిచయమవుతుంది. ఇప్పుడీమెతో ప్రేమలో పడ్డ విక్రం కథ ఏ మలుపులు తిరిగిందన్నది మిగతా కథ. 

ఎలావుంది కథ 
    మలయాళీ కథ కావడంతో వారం వారం  వెక్కిరించి  వెళ్ళిపోతున్న మన ఇడ్లీ కథలా లేదు. మనవాళ్ళందరూ కొన్నాళ్ళు కేరళలో జీవించి వస్తే తెలుగులో ఇలాంటి డిఫరెంట్ కథలు స్వయంగా తయారు చేసుకోవడంలో ప్రతిభాశాలురు కాగలరు. ఇది మూడు దశల హీరో ప్రేమ ప్రయాణం. ‘పెళ్లి చూపులు’ లాగా సెమీ రియాలిస్టిక్ కథలా సాగే ఈ కథలో మళ్ళీ మలుపులూ ముగింపూ వచ్చేసి రొటీన్ ఫార్ములా ప్రకారం వుండడమే లోపం. ఈ మలుపులూ ముగింపూ వున్నంత కృత్రిమత్వంతో పోటీ పడుతూ మళ్ళీ భావోద్వేగాలు కూడా ఒక దశనుంచి ఇంకో దశలోకి ప్రభావవంతంగా బదీలీ కాకపోకాడం ఇంకో లోపం. ఈ విషయంలో ఒరిజినల్ నే తుచా తప్పకుండా ఫాలో అయ్యరేతప్ప సరిదిద్దుకోలేదు. సరిదిద్దితే ఏమవుతుందో నన్న భయం కావచ్చు. ఏమైనా మూస ప్రేమ సినిమాలే కుప్ప తెప్పలుగా వచ్చిపడుతున్న మార్కెట్ లోకి,  కాస్త స్వచ్ఛ భారత్ పనిని  చేపట్టి వాటిని ఊడ్చేసే వూపుతో తెలుగులో ఓ ఫ్రెష్ కథ వచ్చినందుకు ఆనందించక తప్పదు.

ఎవరెలా చేశారు
      ఎక్కడ్నించో ఓ కథ పట్టుకొచ్చి రీమేక్ చేస్తే తప్ప నాగచైతన్య కి ఓ సక్సెస్ దక్కలేదు. దీన్ని బట్టి ఒక యువ స్టార్ ని నిలబెట్టడానికి తెలుగులో ఎంత సృజనాత్మక దారిద్ర్యం వుందో తెలిసిపోతోంది. ఈ అవకశాన్ని చైతన్య కష్టపడి సద్వినియోగం చేసుకున్నాడు. ఇలాటిదే కథ, పాత్ర,  తెలుగులో ఎవరైనా ఒరిజినల్ గా చేసుకుని వస్తే స్వీకరించే వాడా అన్నదీ ప్రశ్నార్ధకమే. ఇంకో భాషలో ప్రూవ్ అయితే తప్ప కొత్తదనం అక్కర్లేదనుకునే మైండ్ సెట్ స్టార్లనుంచి కూడా పోవాలి. నాగచైతన్య ఈ మూడు పాత్రల్ని ఏ పాత్రకా పాత్ర ఎదుగుదలని దృష్టిలో పెట్టుకుని సహజ నటనతో పట్టాలు తప్పకుండా చూసుకున్నాడు. పదహారేళ్ళ కుర్రాడి పాత్ర, రఫ్ గా తిరిగే యువకుడి పాత్ర, మళ్ళీ డీసెంట్ గా ప్రవర్తించే ముప్పయ్యో పడిలో పడ్డ పాత్ర. అమ్మాయిలతో వియోగాలన్నీ కూడా నిగ్రహంతో పోషించాడు. అయితే ఆ బాధ- బ్యాక్ డ్రాప్ తర్వాతి దశల్లోకి బదిలీ అయి వుంటే ఇంకా బలంగా వుండేది పాత్ర. హీరో గతం తెలుస్తున్నప్పుడు (సర్కిల్ ఆఫ్ బీయింగ్) ఆ గతం తాలూకు బాధ ప్రస్తుత జీవితంలో ప్రతిఫలించినప్పుడే ఎఫెక్టివ్ గా వుంటుంది పాత్ర చిత్రణ.

        ఇక హీరోయిన్లు ముగ్గురిలో శృతీ హాసన్ కే ఎక్కువ భాగం కథ వుంది. లెక్చరర్ పాత్రని హూందాగా పోషించుకొచ్చింది. మళ్ళీ చివర్లో వచ్చి ఫినిషింగ్ టచ్ ఇవ్వడంతో  సెంటిమెంట్స్ ని ఎలివేట్ చేసినట్టయ్యింది. మిగతా ఇద్దరు  హీరోయిన్ల పాత్రలకి ఇంత ఎమోషనల్ టచ్ లేకపోవడంతో అంతంతమాత్రంగా కన్పిస్తారు. 

        అతిధి పాత్రకి సరైన నిర్వచనం ఇప్పుడు కుదిరింది. అదీ వెంకటేష్ తో. ఆ అయిదు నిమిషాలూ కన్పించిపోయే సన్నివేశంలో ఒక సెటైర్, ఒక చరుపు, ఒక చమత్కారం, ఒక ముద్రవేసి వెళ్ళడం ఎప్పటికీ గుర్తుండి పోయే అతిధి పాత్రాభినయం. 

        అక్కినేని నాగార్జున ముగింపులో వచ్చేసి- ఇంట్లో ముద్దు చేయాల్సిన కొడుకుని ఉప్పొంగిపోతూ విశాలమైన వెండితెర మీద బహిరంగంగా చేసి - మరోసారి వియ్ ఆర్ ఫ్యామిలీ అని అనవసరంగా చాటారు. ఇది ప్రేక్షకులకి ఎప్పుడో తెలిసిందే. 

        ఇతర పాత్రల్లో ప్రతి ఒక్కరూ శృతిమించకుండా నటించారు, కొందరు నవ్వించారు. మూడో కథకి శ్రీనివాస రెడ్డి కామెడీ ప్రధాన ఆకర్షణ.
        సంగీతం, ఛాయాగ్రహణం, లొకేషన్స్, ప్రొడక్షన్ విలువలూ అన్నీ బావున్నాయి.

చివరికేమిటి 
       దర్శకుడు చందూ ఎం. మలయాళ ‘ప్రేమమ్’ ని అదే పేరుతో రీమేక్ చేసి చెడగొట్టలేదు. ఐతే గురుదత్ తీసిన ‘ప్యాసా’ లో మ్యాటరాఫ్ ఫ్యాక్ట్ తరహా కథనానికీ తను చేసిన కథనానికీ తేడా వుంది. తను చేసిన దానికి ఎమోషన్లు  ఒక కాలావధి లోంచి ఇంకో కాలావధి లోకి క్యారీ కాలేదు. ఒకటి ముగిసిపోయిన ప్రేమ దశ- దాని ప్రస్తావన గానీ ఛాయలు గానీ తర్వాతి దశలో కనిపించనక్కర్లేదనుకోకుండా,  పాత్ర దాన్ని ఫీలవుతున్నట్టు పాత్ర చిత్రణ చేసి వుంటే కథ ఇంకా బలంగా వుండేది. అదే గురుదత్ హీరో పాత్ర ఎక్కడికక్కడ బాధాకరమైన అనుభావాలని మెలోడ్రామా లేకుండా దర్శకుడు కట్ చేస్తున్నా, ఆ బాధని మనమింకా ఫీలవుతూ వుండేలా హీరో పాత్ర అప్రతిహతంగా దాన్ని మోస్తూనే వుంటుంది. 

        ఇక మలుపులూ ముగింపూ మళ్ళీ మూస ఫార్ములాయే. రీమేక్ ని అనడంలేదు, ఒరిజినల్ దర్శకుడే వీటికీ విరుగుడు కనిపెట్టివుంటే ఇప్పుడు తెలుగులో ఇంకో ఎడ్యుకేషన్ లా వుండేది. ఫస్టాఫ్ లో మొదటి కథ, రెండో కథ సగమూ బలమైన వీక్షణానుభవాన్ని ఇవ్వకపోవడానికి కారణాలివే. సెకండాఫ్ లో శృతీ హాసన్ తో కొనసాగే కథ తప్ప మళ్ళీ మూడో కథ మామూలే. అయితే పరమ పాత మూస ప్రేమ సినిమాల్ని ఈ రోజుల్లో కూడా ఎంతో ఔదార్యంతో భరిస్తున్న తెలుగు ప్రేక్షకులకి ఈ వారం ‘ప్రేమమ్’ ని ప్రీమియం ఎంటర్ టైనర్ గా ఎంజాయ్ చెయ్యొచ్చు.


-సికిందర్
http://www.cinemabazaar.in


6, అక్టోబర్ 2016, గురువారం

రివ్యూ

రచన- దర్శకత్వం: మహదేవ్‌
తారాగణం : నిఖిల్‌ గౌడ, దీప్తీ సతి, జగపతిబాబు, బ్రహ్మానందం, రఘుబాబు, సంపత్‌ రాజ్, ఆదిత్యామీనన్‌, అవినాష్‌, సుప్రీత్‌, రావు రమేష్‌, రమ్యకృష్ణ తదితరులు
కథ : విజయేంద్ర ప్రసాద్,
సంగీతం: ఎస్ ఎస్ తమన్‌,  ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస
బ్యానర్ :
చన్నాంబికా  ఫిల్మ్స్‌, సమర్పణ: హెచ్‌.డి. కుమారస్వామి,
నిర్మాత: అనితా కుమారస్వామి
విడుదల: అక్టోబర్ 6,  2016
         ***
       మాజీ ప్రధాని  హెచ్ డి దేవె గౌడ మనవడు, మాజీ కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్ డి కుమారస్వామి గౌడ కొడుకూ అయిన  నిఖిల్ గౌడ హైపర్ యాక్షన్ హీరోగా అట్టహాసంగా కన్నడ- తెలుగు వెండి తెరలకి ఈవారం పరిచయమయ్యాడు. భారీగా ఓపెనింగ్స్ వచ్చాయి. ఎస్ ఎస్ రాజమౌళి క్యాంపు నుంచి విజయేంద్ర ప్రసాద్ కథ అందించి, మహాదేవ్ దర్శకత్వం వహించి ‘జాగ్వార్’ అనే ఈ బిగ్ బడ్జెట్ సినిమాని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. దక్షిణాదిలో 75 కోట్ల బడ్జెట్ తో ఓ  కొత్త హీరోతో నిర్మించిన మొదటి సినిమాగా రికార్డుల కెక్కిన ఈ తెలుగు- కన్నడ బై లింగ్వల్ లో జగపతిబాబు, బ్రహ్మానందం, రఘుబాబు, సంపత్‌ రాజ్, ఆదిత్యామీనన్‌,  రావు రమేష్‌, రమ్యకృష్ణల వంటి హేమాహేమీల్ని  నటింపజేసి కన్నడ వాసనలు సోకకుండా జాగ్రత్త తీసుకున్నారు. ఉన్నత శ్రేణి సాంకేతికులు, ఉన్నత నిర్మాణ విలువలూ కలిగిన ఈ యాక్షన్ మూవీలో అసలు విషయమేమిటి? సూపర్ మాన్, బ్యాట్ మాన్ లాగా  జాగ్వార్ ఒక సూపర్ హీరో కథనా? టెక్నో థ్రిల్లర్ అనిపించే ఒక స్వాప్నిక జగత్ విహారమా? ఇది తెలుసుకోవాలంటే ఓసారి విషయంలో కెళ్ళాలి...
కథ  
    శౌర్యప్రసాద్ (సంపత్ రాజ్) ఎస్ ఎస్ టీవీ ఛానెల్ యజమాని. ఓ రాత్రి అతడి ఛానెల్లో ఓ హత్యా దృశ్యం లైవ్ గా ప్రసారమవుతుందని ప్రచారమవుతుంది. లక్షలాది ప్రేక్షకుల సాక్షిగా  ఓ ముసుగు వీరుడు ఓ జడ్జి (రవి కాలే) ని హత్య చేసి పారిపోతాడు. ఈ సంచలనంతో సీబీఐ అధికారి జేబీ (జగపతి బాబు)  ఆ ముసుగు వీరుణ్ణి పట్టుకోవడానికి రంగంలోదిగి, వాడికి  జాగ్వార్ అని నామకరణం చేస్తాడు. జాగ్వార్ అయిన ఎస్ ఎస్ కృష్ణ అనాధ నని చెప్పుకుని  ఏమీ తెలీనట్టు మెడికల్ కాలేజీలో చేరతాడు. ఆ మెడికల్ కాలేజీ - కమ్ - ఆస్పత్రి చైర్మన్ గా ఆదిత్య (ఆదిత్యా మీనన్) వుంటాడు. ఇదే కాలేజీలో ఆర్య (ఆదర్శ్ బాలకృష్ణన్), అతడి చెల్లెలు ప్రియ ( దీప్తీ సతి) చదువుతూంటారు. చలాకీ కుర్రాడైన ఎస్ ఎస్ కృష్ణ  ప్రియని తన ప్రేమలో పడేసుకుంటానని ఆమె అన్నని ఉడికిస్తూ  ఆమె వెంటపడుతూంటాడు. కాలేజీలో విద్యార్థి నాయకుడైన ఆర్య, ఆస్పత్రిలో అక్రమాలు జరుగుతున్నాయని ఆందోళన లేవదీస్తాడు. ఈ ఆందోళనని అణచడానికి వచ్చిన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్  శంకర్ (సుప్రీత్) ని రాత్రి పూట చంపుతూ, అదే టీవీ ఛానెల్లో మరో లైవ్ ఇస్తాడు జాగ్వార్ కృష్ణ. తమ ఛానెల్ ని ఎవడో జాగ్వార్ గాడు హ్యాక్ చేసి ఇలా హత్యల్ని లైవ్ ఇస్తున్నాడనీ ఆగ్రహించిన యజమాని శౌర్యప్రసాద్- అలాగే తమ ఆస్పత్రి అక్రమాలపై విద్యార్దులు ఆందోళన చేస్తున్నారనీ చైర్మన్ ఆదిత్యాలు- ఆర్యని  జాగ్వార్ గా అనుమానించి అతణ్ణి చంపడానికి ప్లానేస్తారు. ఈలోగా సీబీఐ అధికారి జేబీ  తన ఏజెంట్ గా పద్మనాభం  (బ్రహ్మానందం) ని  ఆదిత్య ఇంట్లోకి దింపుతాడు. కృష్ణ కూడా అదే ఇంట్లో చేరతాడు. ఇలా విలన్ల ఇంట్లో పాగావేసిన ఈ ఇద్దరూ- ఏం చేశారు? అసలు విలన్ల మీద కృష్ణ పగకి కారణ మేమిటి? ఇంకెంత మందిని ఇలా చంపుతాడు? దీనికి అతడి తల్లిదండ్రులతో (రమ్యకృష్ణ, రావురమేష్) లతో సంబంధ మేమిటి? ... ఇవన్నీ తెలుసుకోవాలంటే మిగతా సినిమా చూడాల్సిందే! 

ఎలావుంది కథ 
      తెలుగులో ప్రతీవారం వస్తున్న ఇడ్లీ కథలాగే వుంది. ఇందులో ఇంకో మాటకి తావులేదు. ఓల్డ్ మాస్టర్ విజయేంద్రప్రసాద్ చాలా ఓల్డ్ రివెంజి డ్రామాని రాసేసి శిష్యుడు మహదేవ్ కి ఇచ్చేశారు. ‘జాగ్వార్’  అంటే ఇదేదో ‘మ్యాట్రిక్స్’ లా, ‘ధూమ్ -3’ లా టెక్నో థ్రిల్లర్ అయివుంటుందని భావించుకుని కళ్ళకద్దుకుని కొత్త కుర్రాడి మీద తీసేశాడు దర్శకుడు మహాదేవ్. కొత్త కుర్రాడికి పాతిక ముప్పయ్యేళ్ళ క్రితం కథలిలా వుండేవని ఏం తెలుస్తుంది. పైగా ఒక రేస్ బైక్, స్పై కెమెరా, బ్లాక్ కాస్ట్యూమ్స్ అందిస్తే కొత్త కొత్తగానే కన్పిస్తుంది అంతా. చాలా పాత మోడల్ కథకి అత్యాధునిక హంగులు జతచేస్తే కొత్తకాలానికి చెల్లిపోదని ఈ కథతో రుజువవుతోంది. తన చిన్నప్పుడు తల్లిదండ్రులకి జరిగిన అన్యాయానికి పగదీర్చుకునే హీరో కథే పాత అనుకుంటే, ఇందులో మళ్ళీ కోన వెంకట్ బ్రాండ్- ‘సెకండాఫ్ కథలో విలన్ ఇంట్లో హీరో చేరి వాళ్ళని బకారాలని చేయు’ అనబడు సింగిల్ విండో స్కీమ్ కథ  మళ్ళీ ఇక్కడా ప్రత్యక్షమయ్యింది- ఈ మధ్య ఇలాటి కథలతో  సినిమాల గొడవ వదిలిందనుకుంటే. రచయిత విజయేంద్ర ప్రసాద్ తను ఒక సినిమా కథ రాసేముందు  విధిగా ‘షోలే’ చూస్తానన్నారు. ‘షోలే’ నే చూస్తూంటే ఎలా, ఓసారి ‘ది మాగ్నిఫిషెంట్ సెవెన్’  చివరి భాగంకూడా చూసి వుంటే ప్రస్తుత పాత కథకే  ఎంతో  వన్నె చేకూర్చే వారయ్యే వారు. పాత కథలకి వన్నె చేకూర్చేది కొత్త కథన టెక్నిక్కులే తప్ప- ఎలాటి పిక్చరైజేషన్ టెక్నాలజీ కాదు. 

ఎవరెలా చేశారు 
    కొత్త హీరోగా అడుగు పెట్టిన నిఖిల్ గౌడ శారీరకంగా సమసౌష్టవంగా వున్నా, వ్యావహారికంగా ఇంకా వికసించాల్సి వుంది. మన హీరో కాదు కాబట్టి ఎక్కువ చెప్పుకోవాల్సిన పని లేదు. జగపతి బాబు ఈ సినిమాలో ఎందుకు నటించినట్టో అర్ధంగాదు. చంపుతున్న హీరోకి జాగ్వార్ అని తనే నామకరణం చేసి, పట్టుకునే తంతు లేకుండా,  హత్యలుచేస్తూంటే ఆపే పనే లేకుండా,  సెకండాఫ్ లో కాసేపటికి సినిమాలోంచే హాయిగా అదృశ్యమైపోయే ‘నిరుద్యోగ పాత్ర’ ఎందుకు పోషించినట్టో సినిమా కథని మించిన మిస్టరీగా వుంది. కథలో విజయేంద్ర ప్రసాద్ ఇవ్వలేని లేని మిస్టరీని,  ఇలా హాయిగా తన అదృశ్యంతో తీర్చినట్టుంది. బ్రహ్మానందం, రఘుబాబుల పాత్రలు కూడా డిటో- అర్ధోక్తిలో హాయిగా అంతర్ధానమై పోతాయి. రమ్యకృష్ణ, రావురమేష్ లుకూడా హాయిగానే జీవంలేని పాత్రల్లో  కన్పిస్తారు. రావురమేష్ చాలా అనాసక్తిగా వున్నట్టన్పించే  పాత్ర పోషణ ఇదే బహుశా. ఇద్దరు విలన్లు- సంపత్ రాజ్, ఆదిత్యా మీనన్ లు- వీళ్ళే  రొటీన్ గానే అయినా కాస్త హడావిడీ చేస్తూ కన్పిస్తారు. ఇక హీరోయిన్ దీప్తీ సతి గురించి చెప్పుకోవడానికేమీ లేదు- పాటలకి, ప్రేమ సీన్లకి కన్పించే గ్లామర్ బొమ్మ పాత్ర కాబట్టి. చివరి పాటలో ఐటెం గర్ల్ గా దర్శన మిచ్చే తమన్నాతో  ఆ కాసేపూ హుషారొస్తుంది ప్రేక్షక దేవుళ్ళకి. 

        సంగీత దర్శకుడు తమన్ మళ్ళీ తన పూర్వ వైభవం కోసం విఫల యత్నం చేస్తున్నట్టు మళ్ళీ కన్పిస్తుంది ఈ సినిమాలో. బిజిఎం కూడా సరీగ్గా కుదరలేదు. మనోజ్ పరమహంస సమకూర్చిన ఛాయాగ్రహణం ఎప్పట్లాగే తన బ్రాండ్ విలువలతో చెప్పుకోదగ్గదిగా వుంది. క్లైమాక్స్ లో రామ్  - లక్ష్మణ్ లు సమకూర్చిన యాక్షన్ కొరియోగ్రఫీ చాలా కాలం తర్వాత మొనాటనీని బద్దలు కొట్టి ఫ్రెష్ గా వుంది.

చివరికేమిటి 
     నందమూరి బాలకృష్ణతో గతంలో ‘మిత్రుడు’ తో విఫలయత్నం చేసిన దర్శకుడు మహదేవ్ ప్రస్తుత మెగా మూవీతోనూ అడుగు ముందుకు వేయలేకపోయాడు. ప్రధాన కారణం స్క్రిప్టే. ప్రొడక్షన్ విలువలతో స్క్రిప్టు విలువలు సరితూగకపోవడం. ఇంత భారీ బడ్జెట్ తో ఈ స్క్రిప్టు పదునైన కత్తిలా వుండాల్సింది. మనస్కరిస్తే అలా ఉండేందుకు చాలా అవకాశముంది- కానీ ‘రుజువైన, ప్రేక్షకులకి కొట్టిన పిండి అయిన పాత ఫార్ములాయే’  చాలు మనకి సేఫ్ అనుకుంటే సానబెట్టేందుకు ఏమీ వుండదు, అసలుకే ఎసరొస్తుంది.  కానీ ‘ది మాగ్నిఫిషెంట్ సెవెన్’ కాలానికంటే  ముందుంది  కథనానికి. అందుకనే ఇవ్వాళ్ళ రిమేక్ చేసినా ఇవాల్టి సినిమాలాగే వుంది తప్ప- ‘జాగ్వార్’ లా గడిచిపోయిన కాలపు చాదస్తంలా లేదు. ముసుగు వీరుడు జాగ్వార్ మెరపులా ఎక్కడ్నించి వస్తాడో, ఎవర్ని చంపుతాడో అంతుచిక్కని మిస్టరీగా వుండాల్సింది- అతణ్ణి  రొడ్డ కొట్టుడుగా, నవ్యత లేకుండా  అదే అరిగిపోయిన కాలేజీ స్టూడెంట్ గా  మార్చేసినప్పుడే కిక్, పెప్ అంతా పోయింది. ఎన్ని సార్లు ఈ కాలేజీ కజ్జాలూ, వారం వారం చూస్తున్న అదే ఫార్ములా ప్రేమలూ పాటలూ చూస్తూ ఇంటర్వెల్ వరకూ సహనం వహించాలి? అన్ని ఆర్ధిక వనరులూ, సాంకేతిక సహాయమూ వున్న ఇలాటి మెగా మూవీస్ కూడా సగటు సినిమా విషయ విన్యాసాలతో విసుగెత్తేలా వుండాల్సిందేనా? జరుగుతున్న అక్రమా లపై  విద్యార్ధులు చేస్తున్న ఆందోళనలకి అదృశ్య శక్తిగా, ఆపద్బాంధవుడిగా, జేజేలందుకునే ఒక ఆరాధ్య దైవంలా జాగ్వార్ వుండాల్సింది పోయి- పాత మోడల్ డ్రామా లేస్తూ విలన్ ఇంట్లో కూర్చోవడమేమిటి? ఎన్ని సార్లు ఇదే చూపిస్తారు? అతనొక హ్యాకర్, టెక్నో క్రాట్, లోకానికి ఐడెంటిటీ తెలీని హైటెక్ కిల్లర్- అలాటివాడు లోకకల్యాణం కోసమే అస్త్రశస్త్రాలు ప్రయోగించాలే  తప్ప- ఓపెన్ గా సొంత పగేదో తీర్చుకుంటూ దిగజారి పోవడమేమిటి? మాకు జాగ్వారే కావాలి, జాగ్వారే రావాలి – అంటూసమాజం ఎలుగేత్తేలా ఆ వేషధారణతో,  మానవాతీత వ్యూహాలతో ఒక పురాణ పాత్ర (మిథికల్  క్యారక్టర్) లా ఆత్మిక దాహాన్ని తీరుస్తూ వుండాలే గానీ- తన స్వార్ధం కోసం తన దాహం తాను తీర్చుకునే అట్టడుగు వ్యక్తిలా వుండడ మేమిటి? 

        డెంజిల్ వాషింగ్టన్ ‘ది మాగ్నిఫిషెంట్ సెవెన్’ లో తన కౌబాయ్ గ్రూపుతో గ్రామానికి విలన్ ముఠా పీడా విరగడ చేయడానికి ఆపద్బాంధవుడిలా వస్తాడు. పీడా విరగడ చేసి, చివరికి విలన్ని చంపుతూ - ‘నా చిన్నప్పుడు  మా అమ్మనీ, ఇద్దరు చెల్లెళ్ళ నీ నువ్వు చంపావ్ గుర్తుందా?’ అంటాడు. ఈ ఎండింగ్ స్టేట్ మెంట్ కి మనం కూడా షాకవుతాం. విలన్తో అతడికి పాతపగ వుందని మనకి కూడా అప్పటివరకూ తెలియదు. ఇలా చివరికి తెలిసినప్పుడు వాషింగ్టన్ పాత్ర ఎంతో ఉన్నతంగా కన్పిస్తుంది. అతను ఇంత బాధ దాచుకుని గ్రామం కోసం చేశాడన్న మాట. హీరో అనేవాడి  మొదటి ప్రాధాన్యం  పర సుఖమే, తన సుఖం తర్వాత!

-సికిందర్
http://www.cinemabazaar.in