రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

21, ఏప్రిల్ 2017, శుక్రవారం

రివ్యూ!









దర్శకత్వం : జోషి 

తారాగణం : మోహన్ లాల్, అమలా పౌల్, సాయికుమార్, బిజూ మోహన్, సిద్దీఖ్, అమీర్ నియాజ్ తదితరులు
రచన :  సాచీ, మాటలు : శశాంక్ వెన్నెలకంటి, సంగీతం : రతీష్ వేగా, ఛాయాగ్రహణం : ఆర్డీ రాజశేఖర్
బ్యానర్ : మ్యాజీన్ మూవీ మేకర్స్
నిర్మాత : సయ్యద్ నిజాముద్దీన్
విడుదల : ఏప్రిల్ 21, 2017

         ***
         మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తెలుగు ప్రేక్షకుల దృష్టిలో పడి బాక్సాఫీసుకి ఇంకో చేరిక అయ్యాక అడపదపా ఆయన డబ్బింగులు విడుదలవుతున్నాయి. ‘మన్యం పులి’, ‘కనుపాప’ లని కూడా తెలుగులో బాగానే చూశారు. ఇప్పుడు తాజాగా పాత మలయాళం ఒకటి దులిపి తీసి తెలుగు ప్రేక్షకుల ముందుంచారు. 2012 లో మలయాళంలో ఘన విజయం సాధించిన ‘రన్ బేబీ రన్’ అనే సస్పెన్స్ థ్రిల్లర్ ని  తెలుగులో ‘బ్లాక్ మనీ- అన్నీ కొత్త నోట్లే’ గా విడుదల చేశారు. ఈ వారం మొత్తం 6 చిన్నాచితకా సినిమాలు విడుదలయ్యాయి తెలుగులో : లంక, దడపుట్టిస్తా, ఇద్దరి మధ్య 18, బాయ్ ఫ్రెండ్, ఒక పరిచయం, రిజర్వేషన్. ఇవికాక ‘బ్లాక్ మనీ’ తో కలుపుకుని పిశాచి -2, మాచిదేవ అనే మూడు డబ్బింగులు విడుదలయ్యాయి. ఈ మొత్తం తొమ్మిది సినిమాల్లో ఒక్క ‘బ్లాక్ మనీ’ కే  ప్రేక్షకులున్నారు. ఆరుకి ఆరూ తెలుగు సినిమాలన్నీ ప్రేక్షకుల్లేక యధావిధిగా ఇబ్బంది పడుతున్నాయి. 

          వే పేలవమైన ప్రేమలు, అవే రొటీన్ హార్రర్ లు తీయడం తప్ప ఇంకో  పనే లేకుండా పోయింది తెలుగు నిర్మాతలకీ దర్శకులకీ.  సస్పెన్స్ థ్రిల్లర్స్ తీసే పరిజ్ఞానం ఇప్పటి దర్శకులకి శూన్యం అవడంచేత అవే అర్ధం లేని ప్రేమలు కొందరు, టెంప్లెట్ హార్రర్ లు కొందరూ ఇంకా తీసుకుంటూ కాలం గడుపుతున్నారు. ఇవైనా పద్ధతిగా తీస్తే ఏ సమస్యా వుండదు. పద్ధతేమిటో కూడా తెలీక  ప్రేక్షకుల్ని దూరం చేసుకుంటున్నారు. తెలుగులో ఓపెన్ గా వున్న సస్పెన్స్ థ్రిల్లర్స్, డార్క్ మూవీస్ మార్కెట్ ని తమిళ మలయాళ సినిమాలు ఇలా  వచ్చేసి భర్తీ చేస్తూ సొమ్ములు చేసుకుంటున్నా కూడా  ఈ దిశగా స్పృహ తెచ్చుకోవడం లేదు.

          ‘బ్లాక్ మనీ’ దర్శకుడు జోషీ చాలా సీనియర్ దర్శకుడు. 1978 లో మలయాళంలో  రంగప్రవేశం చేసిన ఆయన నాటి నుంచి నేటి వరకూ 81 సినిమాలు తీశారు. 1988 లో కృష్ణంరాజు తో ‘అంతిమ తీర్పు’ అనే సూపర్  హిట్ తీశారు. తాజాగా 2015 లో  ఆయన తీసిన ఒక మలయాళం మోహన్ లాల్- సత్యరాజ్ లతో ‘ఇద్దరూ ఇద్దరే’ గా తెలుగులో డబ్ అయింది. ఇది ఆడలేదు. ఈ సినిమాతో ఆయన పూర్వపు టచ్, నైపుణ్యం కోల్పోయారు. కానీ 2012 లోనే తీసిన ‘బ్లాక్ మనీ’ తో అత్యంత ప్రతిభని చాటుకుంటూ ఆశ్చర్య పర్చారు. ఇప్పటి టెక్నిక్, టెక్నాలజీ తెలిసిన సమర్ధుడైన ఏ కొత్త దర్శకుడో తీసినట్టు పకడ్బందీగా తీశారు!

       ‘బ్లాక్ మనీ’  ఒక మీడియా థ్రిల్లర్. ఒక నేరం చేస్తూ మీడియా సంస్థకి  దొరికిపోయి  భవిష్యత్తు కోల్పోయిన రాజకీయ నాయకుడు,  అదే మీడియా సంస్థని  ఇంకో స్టింగ్ ఆపరేషన్ కి ఎరవేసి  అల్లరిపాలు చేసి – మొదట తను చేసిన నేరం ఇదే మీడియా సంస్థ సృష్టిగా చిత్రీకరిచడం, తిరిగి రాజకీయ భవిష్యత్తుని పొందడమనే కాన్సెప్ట్ తో తయారయ్యిందీ  థ్రిల్లర్. 

        మీడియా సంస్థలు కూడా అమాయకంగా రాజకీయనాయకులు పన్నే వలలో చిక్కుకుని ఫేక్ న్యూస్ తో అల్లరవగలవన్న ఆసక్తికరమైన సబ్జెక్టుని ఇందులో చూపించారు.

        ఈ జానర్ ఏమిటో అర్ధం జేసుకోకుండా కొందరు ఇందులో ఎంటర్ టైన్మెంట్ లేదనీ, కామెడీ లేదనీ రాసేస్తున్నారు. కామెడీ కోసం, ఎంటర్ టైన్మెంట్ కోసం  ‘కాటమరాయుడు’,  ‘మిస్టర్’ లాంటివి మరోసారి ఎంజాయ్ చేసేసి వెబ్సైట్ల నిండా రాసేసుకోవచ్చు. కామెడీ, ఎంటర్ టైన్మెంట్ లు అవసరం లేని ‘బ్లాక్ మనీ’ లో  అవి లేవని అనాలోచితంగా రాసేస్తే, ప్రేక్షకులకి ఎలాటి సంకేతాలు వెళతాయో ఆలోచించాలి. అయినా ఇంకే భాషలో లేని ఈ కామెడీ, ఎంటర్ టైన్మెంట్ ల పిచ్చేమిటసలు? ఇవి లేని కనుపాప, 16-డి, నగరం, మెట్రో మొదలైనవి శుభ్రంగా చూసేశారుగా  తెలుగు ప్రేక్షకులు!

          ఇందులో కొత్తతరహా పాత్ర మోహన్ లాల్ ది. సుప్రసిద్ధ అంతర్జాతీయ వార్తా సంస్థ ‘రాయిటర్’ కి టీవీ విభాగపు  స్ట్రింగర్ (ఫ్రీలాన్స్) కెమెరా మాన్ అతను. పేరు వేణు. ఢిల్లీలో వుంటాడు. హై ప్రొఫైల్ న్యూస్ కెమెరా మాన్ అతను. ఫిలిం ఇనిస్టిట్యూట్ లో సినిమాటోగ్రఫీలో  గ్రాడ్యుయేషన్ చేసినా, సినిమాల్లో కల్పిత దృశ్యాలు తీస్తారని ఏవగించుకుని, నిజ దృశ్యాలు తీసే టీవీ మీడియాలో  కొచ్చాడు. ఛానెల్స్ కోసం తను తీసే ఫుటేజీల్ని ఎడిట్ చేసినా ఒప్పుకోని తత్త్వం అతడిది. ఎడిట్ చేస్తే చెడామడా తిడతాడు. జరిగిన సంఘటనల్ని జరిగినట్టు చూపించాలే తప్ప, ఛానెల్ కి ఇష్టమైనవే చూపించి అక్రమాలు చేస్తే వూరుకోడు. 

         ఒక కేసు నిమిత్తం ఢిల్లీ నుంచి వస్తే, ఇక్కడ మిత్రుడు రిషి ( బిజూ మోహన్) నడిపే న్యూస్ బ్యూరో ఆఫ్ ఇండియా (ఎన్ బీ ఐ) అనే కొత్త ఛానెల్లో జీతాలు చెల్లించడానికి స్టింగ్ ఆపరేషన్లతో  బ్లాక్ మెయిల్స్ చేస్తూంటాడు. 

          భారత్ విజన్ అనే ఇంకో పెద్ద ఛానెల్ వుంటుంది. ఇక్కడ రేణుక (అమలా పౌల్) రిపోర్టర్ గా పని చేస్తూంటుంది. ఢిల్లీ నుంచి వచ్చిన వేణుకి ఈమెతో పాత శత్రుత్వం మళ్ళీ రగుల్కొంటుంది. శత్రుత్వానికి ముందు ఇద్దరూ ప్రేమికులు. ఐదేళ్ళక్రితం ఆరోజు రేపుదయం పెళ్లి చేసుకోబోతున్నారనగా రాత్రికి రాత్రి  బద్ధ శత్రువులైపోతారు. ఒక వ్యాపారవేత్తకి రాజ్యసభ సీటు ఇప్పించడానికి పార్టీ లీడర్ భవానీ ప్రసాద్ (సాయికుమార్) భారీ మొత్తంలో లంచం తీసుకుంటున్న దృశ్యాన్ని రేణుకతో కలిసి వేణు చిత్ర్రీకరిస్తాడు. ఆ వీడియోతో రేణుక మోసం చేస్తుంది. దాంతో వేణు ఆమెతో తెగతెంపులు చేసుకుని ఆజన్మ శత్రువులా చూస్తూంటాడు. 

          ఇప్పుడు ఐదేళ్ళ తర్వాత ఇదే రేణుకతో వేణుకి ఇంకో ఆపరేషన్ చేయాల్సి వస్తుంది మిత్రుడు రిషి ఛానెల్ని  బతికించడానికి. ఈసారి పార్టీ లీడర్ భవానీ ప్రసాద్ ఒకణ్ణి మర్డర్ చేయడానికి ప్లానేశాడు. ఐదేళ్ళ క్రితం రాజ్యసభ సీటుకి లంచం తీసుకుంటూ దొరికిపోయిన సందర్భంలో, పార్టీపరంగా పతనమయ్యాడు. ఇప్పుడేదో చేసి పోయిన ప్రతిష్ట తిరిగి సంపాదించుకుని  పార్టీలో ఎదగాలనుకుంటున్నాడు సీఎం స్థాయికి. లంచం అప్పుడు ఛానెల్ కి ఉప్పందించిన అనుచరుణ్ణి ఇప్పుడు చంపేస్తే తప్ప పోయిన ప్రతిష్ట తిరిగిరాదని నిర్ణయించుకున్నాడు. 

          ఇలా సుదూరంగా క్లబ్ హౌస్ లో మర్డర్ కి ఏర్పాట్లు చేస్తాడు. వేణూ రేణూలు అక్కడ రహస్యంగా చిత్రీకరించడానికి అట్టహాసంగా రకరకాల అధునాతన రిమోట్ కెమెరాలూ, రోబో కెమెరాలూ ఏర్పాటు చేస్తారు. భవానీ ప్రసాద్ మర్డర్ చేసి శవాన్ని వేలాడదీయిస్తాడు. ఇది ఛానెల్లో ప్రసారమై సంచలనం రేగుతుంది. దీంతో ఛానెల్ ధ్వంసమై, వేణూ రేణూలు నేరస్థులై పారిపోవాల్సి వస్తుంది.

         ఇదేంటి- హత్య చేస్తూ ప్రపంచానికి దొరికిపోయిన భవానీ ప్రసాద్ క్షేమంగా వుండి, దాన్ని చిత్రీ కరించిన వేణూ రేణూలు నేరస్థులుగా పారిపోవడమేమిటి? ఇదెలా  జరిగింది? అసలేం జరిగింది? ఇందులోంచి ఈ ఇద్దరూ ఎలా బయట పడ్డారు? బయటపడకుండా భవానీ ప్రసాద్ ఇంకే వలలు బిగిస్తూ పోయాడు? ... ఇవి తెలుసుకోవాలంటే ఈ ఇంటలిజెంట్ క్రైం డ్రామాని చూడాల్సిందే.

          సస్పెన్స్ థ్రిల్లర్ ఎప్పుడూ తదనంతర పరిణామాలతో సీన్లు అల్లుకుంటూ ముందుకు పరిగెడుతుంది. ఇతర ఫార్ములా మసాలా మాస్ సినిమాలకి ఇలా వుండదు. అందుకే ఇంటర్వెల్ తర్వాత ఎటు వెళ్ళాలో అంతు పట్టక  సెకండాఫ్స్ సెండాఫ్ ఇచ్చేస్తూంటాయి. ఇంటర్వెల్ దగ్గర పాత్రకి ఏర్పాటు చేసిన సమస్య సంగతి క్లయిమాక్స్ లో  చూసుకోవచ్చన్న తేలిక భావంతో  అప్పటిదాకా కామెడీలతో పాటలతో ఫైట్లతో గడిపేస్తారు. 

          సస్పెన్స్  థ్రిల్లర్స్ తో ఇలా సాగదు. అడుగడుగునా what next? ప్రశ్నే పుట్టకపోతే అది బిగిసడలని  సస్పెన్స్  థ్రిల్లర్ అవదు, కూర్చోబెట్టదు. బిగి సడలని కథనం,  కూర్చోబెట్ట గల్గడం- ఈ రెండూ లేకపోతే సస్పన్స్ థ్రిల్లర్ కి నూకలు చెల్లిపోతాయి. ఒక సీనులో ఒక సంఘటన జరిగిందంటే,  దాని పరిణామమేమిటి తర్వాతి సీన్లలో అన్న చందాన కథనం అల్లుకుంటూ పోకపోతే ఈ జానర్ రక్తి కట్టదు. అలా ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయే సీన్లలోంచి ఏ వొక్కటి తీసేసినా కథే అర్ధంగానంత గందరగోళం ఏర్పడుతుందన్న మాట. 

          ఈ సినిమాలో అల్లిన సీన్లన్నీ ఇలాంటివే. మొదటి సీను నుంచీ చివరి సీను దాకా వృధాగాఏదీలేదు సరికదా, ఏ వొకటి తీసేసినా సినిమాయే అర్ధంగాకుండా పోయే ప్రమాదముంది. 

          ఇందులో మళ్ళీ ఒక సూపర్ స్టార్ గా మోహన్ లాల్ స్థాయికి తగ్గ చిక్కు ముళ్ళతో, ఇరకాటాలతో దర్శకుడు ఆడుకోవడమే వుంది. మోహన్ లాల్ ఎలాటెలాటి వూహించని ప్రమాదాల్లో ఇరుక్కుంటాడంటే, ఇప్పుడేమిటి- ఎలా బయటపడతాడు- what next?- అన్న ఆదుర్దా కల్గిస్తాడు. అంతే వూహకందని తెలివితేటలతో వాటిలోంచి బయటపడుతూంటాడు. క్లయిమాక్స్ సీన్లో ఇంకా కఠినమైన పరిస్థితిలో ఇరుక్కుంటాడు అమలా పౌల్ తో కలిసి. 

         ఇంటర్వెల్ సీన్ లీడర్ మీద మోహన్ లాల్ పైచేయే అయినా,  ఆ వెంటనే లీడర్ దే పై చేయి అయి క్లయిమాక్స్ దాకా లీడర్ పన్నే వలల్లో దొరక్కుండా తప్పించుకునే యుక్తులే పన్నుతూంటాడు తను. క్లయిమాక్స్ లో లీడర్ మరో మర్డర్ చేయబోతున్నట్టు సమాచారం వదిలి మోహన్ లాల్ ని ట్రాప్ చేసినప్పుడు,  ఆ  మర్డర్ అవబోయేది తనూ అమలా అని గ్రహించి మోహన్ లాల్ ఎలా లీడర్ ని దెబ్బ తీశాడన్నది  అత్యంత బలమైన ముగింపు. 

          ఇందులో మొదటి అరగంట లోపే  మోహన్ లాల్- అమలాల ప్రేమ ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. ఇక్కడే లీడర్ లంచం వ్యవహారం పట్టుకున్నప్పుడు అమల మోసం చేసిందని మోహన్ లాల్ విడిపోతాడు. ఇలా ఈ ఫ్లాష్ బ్యాక్  ప్రేమ కథలో వాళ్ళ బ్రేకప్ ని మాత్రమే చూపించదు- ఇందులోని ఆ లీడర్ లంచం ఎపిసోడ్  లోంచే ప్రస్తుత ప్రధాన కథ ప్రారంభం కూడా చూపిస్తుంది. ఇదొక గమ్మత్తయిన క్రియేటివిటీ. కొత్తగా బాగా కుదిరింది. ఎందుకంటే సస్పెన్స్ థ్రిల్లర్ తదనంతర పరిణామాల దొంతరే. ఏదీ వృధాగా వుండదు. ఫ్లాష్ బ్యాక్ లో ఆ లంచం ఎపిసోడ్ మచ్చ రూపు మాపుకోవడానికే లీడర్ ఈ మర్డర్ ఎపిసోడ్ కి తెర తీస్తాడు. ఇది  ప్లాట్ పాయింట్ వన్ ఘట్టం. 

          ప్లాట్ పాయింట్ వన్ ఘట్టంలో  సినిమాల్లో అరుదుగా కన్పించే అన్ని ఎలిమెంట్స్ ఇక్కడ కనిపిస్తాయి : 1. కోరిక, 2. పణం, 3. పరిణామాల హెచ్చరిక, 4. ఎమోషన్ అన్నవి.  నిజానికి  ఒక మనిషిని హత్య చేస్తోంటే ఆపాలిగానీ, దాన్ని కెమెరాతో షూట్ చేసి ఛానెల్ పాపులారిటీ పెంచుకోవడం నీతి కాదని వ్యతిరేకిస్తాడు మోహన్ లాల్. అయితే ఆ పవర్ఫుల్ లీడర్ చేతిలో ఈ హత్యని ఆపడం ఎవరితరం కాదని తెలుస్తుంది. హత్యని ఆపలేనప్పుడు హంతకుణ్ణి పట్టుకోవడమే నీతి అన్న వాదం ఎదురవుతుంది. 

       1. కోరిక : మిత్రుడి ఛానెల్ ని బతికించడానికి ఈ ఆపరేషన్ని  చేపట్టాలన్న కోరిక వుంది  మోహన్ లాల్ కి, 2. పణం : దీనికి తన నీతినే  పణంగా పెట్టాల్సి వస్తోంది, 3. పరిణామాల హెచ్చరిక : ఆ పవర్ఫుల్ లీడర్ మీద రెండో సారి ఆపరేషన్ ఏ కొంచెం అటు ఇటైనా తన పేరుమోసిన స్ట్రింగర్ కెమెరామాన్ వృత్తినే కోల్పోతాడు, 4. ఎమోషన్ : ఒక హత్యని  ఆపలేకపోతున్న నిస్సహాయత, వృత్తిరీత్యా విశ్వనీయత కోల్పోతానన్న ఆందోళనా కలిసి సంక్షుభిత ఎమోషన్ ని క్రియేట్ చేశాయి. అతడి మోరల్ కంపాస్ ని ఛిన్నాభిన్నం చేశాయి. 

          దీంతో ఈ పాత్రని  మనం పట్టించుకు తీరాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది :
 get your audiences to root for your  character  అనే నియమపాలన ఇక్కడ ఇంత బలంగా ఖచ్చితంగా జరిగింది. వృత్తిలో విలువలకోసం తగాదాలు పెట్టుకునే మోహన్ లాల్ ఆ విలువలకే తిలోదకాలిచ్చే  మోరల్ డైలెమాలో పడేకన్నా బలమైన ప్లాట్ పాయింట్ వన్ ఏముంటుంది? 

          అక్కడికీ హత్య జరిగిపోతూంటే ఆపాలనుకుని వెళ్లిపోబోతూంటే అమల వెనక్కి లాగి పడేస్తుంది. ఈ ప్లాట్ పాయింట్ వన్ ఘట్టంలో చాలా డ్రామా వుంటుంది- మానసిక సంఘర్షణల్లోంచి పుట్టుకొచ్చే సహజ, ప్యూర్ డ్రామా. అనుకున్నట్టే ఈ ప్లాట్ పాయింట్ వన్ ఘట్టం పూర్తయి దానికదే ఎదురు తన్నుతుంది!  ఎదురు తన్నక పోతే అది విలన్ పాత్రచిత్రణే కాదు. లంచం ఎపిసోడ్ అప్పుడు తెలీక దొరికిపోయిన లీడర్ తెలిసీ మళ్ళీ దొరికిపోవాలనుకోడు- హీరోనే  ఇరికించి తప్పించుకోవాలనుకుంటాడు.  

          ఇదే జరిగి మోహన్ లాల్ అమలతోపాటు  అజ్ఞాతంలోకి పారిపోవాల్సి వస్తుంది. మార్కెట్ లో  విశ్వసనీయత కోల్పోయి, రాయిటర్స్ తో  కాంట్రాక్ట్ కోల్పోయి, మిత్రుడి ఛానెల్ ముక్కచెక్కలై, కేసులు మీద పడి  పక్కా నేరస్థుడి స్థితికి దిగజారి పోతాడు. 

          ఇంతకంటే హీరోయిజం ఏం కావాలి మోహన్ లాల్ స్టేచర్ కి. ఇవన్నీ తట్టుకుని, తేరుకుని, పైకిలేచి తన్నే వాడే కదా నిజమైన హీరో. వీటికి  తోడూ ఇంకో ఎమోషనల్ ప్రాబ్లం వుంది- తోకలా తనతో వుంటున్న పాత శత్రువు అమల. ఈమెని పోలీసులకి పట్టించి వదిలించు కోవాలనుకుంటాడు కూడా. బంకలా పట్టుకుని వుంటుంది. ఈ ఏకాంతంలో కూడా, ఈ కష్ట సమయంలో కూడా  పాత  ప్రేమలు తిరిగి పుట్టుకురావడానికి అవకాశం లేదు. బలమైన పాత్రలకి అలాంటిది వుండదు. వృత్తి విలువ దిగజార్చిన ఆమెతో ప్రేమనే తెంచుకున్నాడు. ఆమె కూడా ఐదేళ్ళ క్రితం చేసిన తప్పుకి క్షమాపణ కోరే బలహీనురాలు కాదు. అందుకే అతణ్ణి టీజ్ చేసి, కవ్వించి, నవ్వించి, డ్రీం సాంగ్స్ వేసుకుని సొంతం చేసుకునే నీచానికి పాల్పడదు. మరి వీళ్ళ మధ్య పెరిగిపోతున్న ఈ టెన్షన్ తీరేదెలా? ఇదే ‘చెలియా’ లో  మణిరత్నం చేయలేక చేతులెత్తేశాడు. జోషి 2012 లోనే,  దీన్నే రెండు హై టెన్షన్ వైర్లు గా చేసి, ఎప్పుడప్పుడు షార్ట్ సర్క్యూట్ అవుతాయా  అని చివరిదాకా వూరించాడు. 

         ఇక్కడ సస్పెన్సు కోసం ప్లాట్ పాయింట్ - టూ  ఘట్టాన్ని వివరించడం లేదు. ఈ క్రైం డ్రామాకి  క్లయిమాక్స్ ఒక సంతృప్తికరమైన ఆర్ట్ వర్క్ అనొచ్చు.

          సీనియర్ దర్శకుడు జోషి ఎక్కడా చాదస్తాలకి పోకుండా, కథనుంచి పక్క దార్లు పట్టకుండా- ఆధునిక ఎలక్ట్రానిక్ మీడియా వ్యవస్థని టెక్నాలజీ పరంగా ఇంకే సినిమాలోనూ చూపించని విధంగా- మీడియా పాత్రల్ని ఇంకే సినిమాలోనూ చూపించనంత ప్రొఫెషనల్ గా, అడుగడుగునా వాస్తవిక దృక్పథంతో థ్రిల్ చేస్తూ ఉన్నత స్థాయి చిత్రీకరణ చేశారు. కెమెరా మాన్ రాజశేఖర్ అద్భుత పనితనాన్ని కనబర్చాడు. సంగీత దర్శకుడు రతీష్ వేగా మాత్రం సెకండాఫ్ వచ్చేసరికి వేగాన్ని కంట్రోలు చేసుకోలేకపోయాడు. ఇంటర్వెల్ కే సినిమాతో దిమ్మదిరిగినట్టు, సెకండాఫ్ అంతా సౌండు పెంచేసి  హుదూద్ తూఫాను లాంటిది  సృష్టిస్తే తప్ప, ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కి న్యాయం చేయలేనని తెగ ఫీలైపోయినట్టు కన్పిస్తాడు.    

          లాజికల్ గా ప్లాట్ పాయింట్ వన్ ఘట్టంలో ఏర్పాటు చేసిన రహస్య కెమెరాల పొజిష నింగుతో ప్రాబ్లం వుంది. ఆ కెమెరాల కళ్ళు గప్పి లీడర్ శవంతో కనికట్టు చేయడం సాధ్యం కాదు. కానీ దీనికి పరిష్కారం కూడా లేదు- అయితే ఇలాటి థ్రిల్లర్స్ లాజికల్ గా లోపాలు లేకుండా వుండాల్సిన అవసరముంది. 

          మళ్ళీ శుక్రవారం ‘బాహుబలి -2’ వచ్చేవరకూ ‘బ్లాక్ మనీ’ కి మార్కెట్లో పోటీ లేదు. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లో సమాంతరంగా మోహన్ లాల్- అమలా పౌల్ ల విచిత్ర బాండింగ్ కూడా చూసి ఈ వేసవిలో ఏసీ లేకుండా ఎంజాయ్ చేసేందుకు ఇదొక అవకాశం. ఎప్పుడో ఐదేళ్ళ క్రితం తీసిన సినిమాలా అన్పించక, ఇప్పుడే తీసి విడుదల చేసిన ఫ్రెష్ నెస్  అన్నిటా కన్పించడం ఈ డబ్బింగ్ ప్రత్యేకత.

- సికిందర్
http://www.cinemabazaar.in


         










         
         



19, ఏప్రిల్ 2017, బుధవారం


     డార్క్ మూవీస్ కీ  యాక్షన్ మూవీస్ కీ  తేడాల గురించి తెలుసుకుంటే తప్ప డార్క్ మూవీస్ జానర్ కి న్యాయం చేయలేరు. న్యాయం చేయకపోతే నాల్గు డబ్బులు రావు. రోమాంటిక్ కామెడీ జానర్ లక్షణాలు తెలీక రోమాంటిక్ కామెడీ లనుకుంటూ ఎలా ఇప్పుడు మార్కెట్ లేని రోమాంటిక్ డ్రామాలు  తీసేసి దెబ్బ తినేస్తున్నారో,  అలా డార్క్ మూవీస్ అనుకుని యాక్షన్ మూవీస్ తీసేసి దెబ్బ  తినేసే  అవకాశం చాలా  వుంది. రోమాంటిక్ కామెడీలతో చేసిన జానర్ పరమైన తప్పిదాలు మళ్ళీ డార్క్ మూవీస్ తో కూడా జరక్కుండా చూసుకోవాల్సి వుంటుంది. జానర్ స్పృహ, మర్యాద, డిసిప్లిన్ అనేవి లేకపోతే ఈ రకమైన సినిమాలు తీయడమే వృధా. దేని క్రియేటివ్ పరిధి, పరిమితులు దాని కుంటాయి. గుండుగుత్తగా ఆన్ని జానర్స్ కీ కలిపి ఒకే క్రియేటివ్ ప్రపంచం లేదు. క్రియేటివిటీని  జాతీయం చేయడం కుదరదు. క్రియేటివిటీ చిన్న చిన్న గణ రాజ్యాలుగానే వుంటుంది. డార్క్ మూవీస్  ఖచ్చితంగా వాస్తవికతని డిమాండ్ చేస్తాయి. డార్క్ మూవీస్ వాస్తవికత ఎన్నటికీ మాయనిది. ఏ కాలంలో నైనా వాటికి  వాస్తవికతే ఆభరణం.  వాస్తవికత లేకపోతే  డార్క్ మూవీస్ లేవు.  ఈ రోజుల్లో ‘మాభూమి’ లాంటి వాస్తవిక కథా చిత్రం, లేదా ఆర్టు సినిమా తీస్తే ఎవ్వరూ చూడరు. కానీ అదే వాస్తవికతతో కూడిన డార్క్ మూవీస్ తీస్తే చూస్తున్నారు. ‘నగరం’ లాంటి డార్క్ మూవీ వాస్తవికతతో,  జీవనోపాధి కోసం ఓ హీరో పడే పాట్లుగా ఆర్ట్ సినిమా  తీస్తే ఎవరైనా చూస్తారా? ఎవ్వరూ చూడరు బహుశా. 


          యాక్షన్ మూవీస్ కి ఈ వాస్తవికతతో పనిలేదు. ఎందుకంటే వీటి విషయంలో వినోదమే ప్రధానం. ఈ వినోదాన్ని పండించడం కోసం లాజిక్ ని తీసి పక్కన పెడతారు. ‘ఖైదీ’ లాంటి యాక్షన్ మూవీ లో పోలీస్ స్టేషన్ లో  పది మంది పోలీసులని కొట్టి వెళ్ళిపోతాడు చిరంజీవి. ఇలా నిజజీవితంలో సాధ్యం కాకపోయినా ఎంజాయ్ చేస్తారు ప్రేక్షకులు. యాక్షన్ మూవీస్ లో ప్రేక్షకులు కోరుకునేది నిజ జీవితంలో సాధ్యపడని ఈ ఎస్కేపిజమే, లాజిక్ కాదు. ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ –8’ అనే యాక్షన్ మూవీ చాలా పెద్ద ఎస్కేపిస్టు ఫేర్. టాప్ స్టార్స్ తో యాక్షన్ మూవీస్  ఇలా ఎంత వాస్తవ  విరుద్ధంగా వున్నా వాటికేం ప్రమాదం రాదు. కానీ ఇదే లాజిక్ లేకుండా డార్క్ మూవీస్ తీస్తే అది జానర్ మర్యాద అన్పించుకోదు. జానర్ మర్యాదతో లేనిది ఈ రోజుల్లో ఏదీ ఆడడం లేదని గత రెండు సంవత్సరాలుగా చూస్తున్నాం. 


యాక్షన్ మూవీ 
           ఒక డార్క్ మూవీ తీస్తూ అందులో పైన చెప్పుకున్న చిరంజీవి ఫైట్ లాంటిది పెట్టారనుకోండి, అది డార్క్ మూవీగా ఫెయిల్ అయినట్టే. అలాగే చిరంజీవిని పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి విచారణ చేశారనుకోండి, అనుమానం తీరక లాకప్ లో   పెట్టారనుకోండి- ఇది డార్క్ మూవీ రచన అవుతుంది, యాక్షన్ మూవీ కాదు.

          యాక్షన్ మూవీకి ఎక్కువ బడ్జెట్ కావాలి. వాటిలో స్టంట్స్,  ఛేజెస్ వుండాలి. కాల్చివేతలు, పేల్చివేతలు, విధ్వంసాలు, మారణహోమాలూ  వుండాలి. నాన్ స్టాప్ యాక్షన్ తో వుండాలి. స్పీడు ప్రాణమవ్వాలి. యాక్షన్ సీన్స్ లో లాజిక్ వుండనవసం లేదు. గాలిలో విన్యాసాలు చేసి శత్రువుల్ని తన్న వచ్చు. ఏదో ఒక అంశం గురించి హీరో విలన్లు పోరాడు కోవాలి. విలన్ ఎంత మందిని చంపినా పోలీసులు వచ్చి కేసులు నమోదు చేసుకోనవసరం లేదు. యాక్షన్ లో ఎంత మంది చచ్చినా శవాలకి అంత్య క్రియల గురించి ప్రేక్షకులు బెంగ పెట్టుకోనవరసం లేదు. యాక్షన్ మూవీస్ లో హీరో క్యారక్టర్ డెవలప్ మెంట్ అంత ప్రధానం కాదు. కథ ఫోకస్ అంతా బిగ్ యాక్షన్ మీదే వుంటుంది. స్టోరీ లైన్ సరళంగా వుంటుంది. బోలెడంత కథలో ప్రేక్షకులు చిక్కుబడి పోకుండా బోలెడు యాక్షన్ తో దూసుకెళ్ళేలా చేయడమే యాక్షన్ మూవీస్ ప్రధానోద్దేశం. ‘శివ’ లో బోలెడంత  కథ వుండదు- ఏకత్రాటిపై సింపుల్  కథే  పరిగెడుతూ శివ- భవానీల యాక్షన్ - రియాక్షన్ల సంకుల సమరంగా వుంటుంది.


          యాక్షన్ మూవీస్ రాయడం తేలిక. తీయడం కూడా దర్శకుడికి తేలికే. యాక్షన్ సీన్స్ అన్నీ స్టంట్ మాస్టర్లు తీసేసి వాళ్ళే ఎడిటింగ్ చేసేస్తారు. పాటలు డాన్స్ మాస్టర్లు తీసేసి వాళ్ళే ఎడిటింగ్ చేసేస్తారు. దర్శకుడు తీయడానికి మిగిలేది ఓ గంట టాకీ పార్టు మాత్రమే. 




డార్క్ మూవీ 
          డార్క్ మూవీస్ ఇలా కాదు. యాక్షన్ సీన్స్, పెద్దగా పాటలూ వుండని డార్క్ మూవీస్ మొత్తం కథ మీదే ఆధారపడి నడుస్తాయి. కాబట్టి దర్శకుడికే సినిమా బరువంతా తానే మోసే పనుంటుంది.  ఒక నేరం చుట్టూ జరిగే వాస్తవిక ధోరణిలో గల కథలే వీటిలో వుంటాయి.  వీటిలో స్థాపించే కథలు  నిజ జీవితంలో ఎవరికైనా జరగవచ్చు. ‘పింక్’ లో రిసార్ట్స్ లో తనతో మిస్ బిహేవ్ చేసిన వాణ్ణి సీసా పెట్టి కొట్టి పారిపోయి, ఉల్టా తనే కేసులో ఇరుక్కునే హీరోయిన్ కథ లాంటిది ఎవరికైనా జరగ వచ్చు. ‘16-డి’ లో విశృంఖల ప్రేమాయణాల పర్యవసానంగా జరిగే దారుణాల్లాంటి కథ ఎవరి జీవితాల్లోనైనా సంభవించ వచ్చు.  వీటి కథలు, కథనాలూ సంక్లిష్టంగా వుంటాయి. 

          కాబట్టి వీటిని మెదడు పెట్టి చూడాల్సిందే. మెదడు పెట్టి చూసేలా ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేయగల శక్తి ప్రస్తుతం డార్క్ మూవీస్ కే వుంది. ఆర్ట్ సినిమాల్ని మెదడు పెట్టి చూడాలి. గొప్పగొప్ప సాంఘికాలు, ‘మేఘ సందేశం’ లాంటి మానసిక సంఘర్షణాత్మకాలూ మెదడు పెట్టి చూడాల్సిందే. సామాజిక సినిమాలు, స్త్రీవాద సినిమాలు, భక్తి  సినిమాలూ మొదలైనవి ఖచ్చితంగా మెదడు పెట్టే చూడాలి. ఇందుకు గత రెండు దశాబ్దాలుగా ప్రేక్షకులు సిద్ధంగా లేరు.  ఎందుకంటే దేశపరిణామాల్ని బట్టి  ప్రేక్షకుల మనోభావాలుంటాయి. 2000 సంవత్సరం నుంచి ఆర్ధిక సంస్కరణల ఫలితాలూ, ప్రపంచీకరణ ఫలాలూ  ఒకేసారి దండిగా చేతిలో వచ్చి పడుతూంటే వాటిని అనుభవించే స్థితికి చేరుకున్నారు ప్రేక్షకులు. ఉపాధి కోసం, ఉద్యోగాలకోసం ఇక ప్రభుత్వాల మీద ఆధారపడే అవస్థ తప్పింది. పట్టణం నుంచీ పల్లెదాకా టీనేజీ  కుర్రకారు పుష్కలంగా పాకెట్ మనీతో తిరుగుతున్నారు. 1980, 90 లనాటి ఆకలి కేకలు, నిరుద్యోగ పొలికేకలు ఇక లేవు. ఆ కవిత్వాలు, ఆ పోరాటాలు, ఆ ఉద్యమాలు, ఆ తీవ్రవాదమూ, ఆ సినిమాలూ తీసి అవతల పారేసి – ఎంజాయ్ చేస్తున్నారు పల్లెనుంచి నగరం దాకా. 


          ఇది గమనించారు గనుకనే సినిమాల అర్థాన్నే మార్చేసి  కేవలం ఎంటర్ టైన్మెంట్! ఎంటర్ టైన్మెంట్!!  ఎంటర్ టైన్మెంట్!!!  అనే ధోరణిలోనే సినిమాలు  తీస్తూ రంజింప జేస్తూ వచ్చారు. సినిమాల్ని ఇక మెదడు పెట్టి చూసే అవరమే లేకుండా పోయింది. ఎంటర్ టైన్ చేయడానికి నాల్గు వెర్రి వేషాలతో, మూడు జాడింపులతో, ఓ రెండు వాయింపులతో టపటప లాడించేసి  వదిలేస్తే సరి- పెద్ద పెద్ద బకెట్లతో కూల్ డ్రింకులు, పెద్ద పెద్ద ట్రేలు వొళ్ళో పెట్టుకుని ఫాస్ట్ ఫుడ్డులూ లాగిస్తూ చూసేసి దులిపేసుకుని వెళ్ళిపోతున్నారు. మెదడుతో పనేలేదు! సినిమాలు చూడ్డానికి తినడం అవసరమా? 


          ఈ నేపధ్యంలో రివ్యూ రైటర్లు ఈ పాత్ర చిత్రణ ఇలా వుండాల్సింది కాదు, ఇక్కడ ఈమె ఇలా ఏడ్వాల్సింది కాదు, అక్కడ ఆయన అలా అరవాల్సింది కాదు-  అని  విశ్లేషణలు చేస్తే - వీళ్ళెవర్రా? అని తలలు బాదుకుంటున్నారు  ప్రేక్షకులు. మెదడుకి ఆలోచనలు పెట్టే పనే వద్దంటున్నారు. మెదడుని పోటీ పరీక్షలు రాయడానికి, విదేశాల్లో జాబ్స్ చేసుకోవడానికి మాత్రమే కఠినాతి కఠినంగా వాడుకుంటామంటున్నారు. 


          ఇలా ఆర్ధిక సంస్కరణలు - ప్రపంచీకరణ అనే దేశ పరిణామాలతో కూడిన నేపధ్యంలోంచి  అన్ని మాధ్యమాల్లో ఎంటర్ టైన్మెంట్ ప్రధానమైన వాతావరణమే కన్పిస్తూండవచ్చు. ఆకలి బాధలో, ఇంకే సామాజిక సమస్యలో కళా రూపాలుగా స్థానం కోల్పోయి వుండ వచ్చు. కానీ కళా రూపంగా నేరం దాని స్థానాన్ని కోల్పోవడం లేదు. ఆర్ధిక సంస్కరణలు – ప్రపంచీకరణ ఎంత ఎంటర్ టైన్మెంట్ ని తెచ్చిపెట్టాయో- సమాజంలో అన్నే నేరాల్నీ  తెచ్చి పెట్టాయి. మనం ఒకటి అర్ధం జేసుకుంటే, 1930 లలో అమెరికాలో   ఏర్పడిన ఆర్ధిక మాంద్యం  నేపధ్యంలోంచే  ఫిలిం నోయర్ అనే డార్క్ మూవీ జానర్ సినిమాలు పుట్టుకొచ్చాయి. డబ్బు లేకపోయినా నేరాలే, డబ్బెక్కువైపోయినా నేరాలే! అలా ఇప్పుడు ఆర్ధిక సంస్కరణలు – ప్రపంచీకరణ నేపధ్యంలో డబ్బెక్కువైపోయి నేరాలు జరుగుతున్నాయి. కొత్త కొత్త నేరాలు జరుగుతున్నాయి. ఉన్నత వర్గాల హై ప్రొఫైల్ నేరాలు మునుపెన్నడూ లేనంతగా జరుగుతున్నాయి.  వాళ్ళ ఎంటర్ టైన్మెంట్స్  శృతి మించి నేరాలకి దారి తీస్తున్నాయి. కాబట్టి ఎంటర్ టైన్మెంట్ - నేరాలు ఈ రెండూ ఆర్ధిక సంస్కరణలు – ప్రపంచీకరణలకి రెండు ముఖాలు. వీటిలో ఎంటర్ టైన్మెంట్ అనే ఒకే ముఖాన్ని చూపిస్తూ వచ్చారు సినిమాల్లో. క్రైం ఎలిమెంట్ అనే రెండో ముఖాన్ని కూడా పట్టుకోగల్గడంతో  షైతాన్, జానీ గద్దార్, పింక్,  కహానీ -2, 16- డి, నగరం,  మెట్రో, కనుపాప  లాంటి నియో నోయర్ సినిమాలు వచ్చేసి హిట్టవుతున్నాయి. 


          అయితే ఇందాక చెప్పుకున్నట్టు, ఇలా మెదడు పెట్టి చూడాల్సిన సాంఘికాలు, సామాజికాలు, విప్లవాత్మకాలు, అనేక వాదాలు, మానసిక సంఘర్షణలూ...లాంటి కథలతో కూడిన ఆలోచనాత్మక సినిమాలని చూడ్డానికి ఇష్ట పడని  ప్రేక్షకులు, అంతే మెదడుకి పని కల్పించి చూడాల్సిన పై నియో నోయర్ సినిమాల్ని ఓపిగ్గా ఆలోచనలు లగ్నం చేసి చూసి ఎలా హిట్ చేయగల్గుతున్నారు?


          స్క్రీన్ ప్లే పండితుడు జేమ్స్ బానెట్ ఏం చెప్పారో ఒకసారి ఇక్కడ చూడాలి- మనిషి పరిణామ క్రమం సరీసృపాల నుంచి క్షీరదాలకి, క్షీరదాల నుంచి ఆదిమానవుడికి, ఆదిమానవుడి నుంచి వివేక వంతుడైన మనిషి గా ఏర్పడినప్పుడు- ప్రతీ పరిణామ దశలో మెదడు పొరలు కమ్ముకుంటూ వచ్చింది. సరీసృపాల యాంత్రిక,  కేవల భౌతిక మెదడు (రెప్టీలియన్ కాంప్లెక్స్) మీద, భావోద్వేగాలతో కూడిన క్షీరదాల మెదడు (లింబిక్ సిస్టం) పొరకమ్మింది.  భావోద్వేగాలతో కూడిన క్షీరదాల మెదడు మీద ఆలోచనా శక్తి పెంచుకున్న  మనిషి  మెదడు (నియో కార్టెక్స్) పొర కమ్మింది. వీటన్నిటి మధ్యా ఎక్కడో ఆథ్యాత్మిక మెదడు వుంటుంది- దీని స్థానాన్ని ఇంకా కనుగొనలేదు. 




            కాబట్టి  ప్రేక్షకులకి డార్క్ మూవీస్ ఆకర్షించడానికి గల కారణ మేమిటో ఇప్పుడు తెలిసిపోతోంది. పొరలు పొరలుగా మూడు రకాల మెదడులు కలిగివున్నప్పుడు, కింది పొరలో వున్న జంతు సమానమైన వొరిజినల్ సరీసృపాల మెదడుని, ఈ జానర్ సినిమాలు సంతృప్తి పరుస్తున్నాయన్న మాట! నేరాలు ఈ మెదడుతోనే జరుగుతాయి. ఈ మెదడుని అణిచి పెట్టుకుని మనుషులు గొప్ప బుద్ధి గలవాళ్ళుగా వుండడానికి తంటాలు పడుతూంటారు. అది తన్నుకొ చ్చినప్పుడు తప్పుడు పనులన్నీ చేసేస్తారు. 

          తప్పుడు పనులు చేసే మెదడు తమలోనే వుంది కాబట్టి, ఆ తప్పుడు పనులు చేయకుండా వుండేదెలా, లేదా చేసేస్తే బయట పడేదెలా అన్న కుతూహలమే ఈ సినిమాలని దృష్టి కేంద్రీకరించి చూసేలా చేస్తుంది. మనిషి మెదడెలా వుంటుందో, అదెలా పనిచేస్తుందో అర్ధం జేసుకోకుండా సరైన సినిమాలు తీయలేరు. 


         
నేటి పరిస్థితులు డిమాండ్ చేస్తున్న ఈ డార్క్ మూవీస్ జానర్ ని తెలుగు సినిమాలు టచ్ చేయడం లేదు. హిందీ, తమిళ, మలయాళ సినిమాలు ఈ బాటలో నడుస్తున్నాయి. ఇప్పడు  తెలుగులో ప్రారంభించాలంటే ఏం చేయాలి?  వాటిని ఎలా తీర్చిదిద్దాలి?  వాటి జానర్ మర్యాదని ఇతర భాషల్లోలాగా ఎలా కాపాడాలి?  ఒక పూర్తి స్థాయి నియో నోయర్ డార్క్ మూవీ ఎలా వుంటుంది?....మొదలైన విషయాలతో రేపు ముగింపు వ్యాసం చూద్దాం. 


-సికిందర్

http://www.cinemabazaar.in/

17, ఏప్రిల్ 2017, సోమవారం

రివ్యూ!










దర్శకత్వం : ఎఫ్. గేరీ గ్రే 

తారాగణం : విన్ డిసెల్, డ్వాయన్ జాన్సన్, జేసన్ స్టాథం, మిషెల్ రోడ్రిగ్స్, నాథాలీ ఇమ్మాన్యుయేల్, టిరెస్ గిబ్సన్, స్కాట్ ఈస్ట్ వుడ్, చార్లిజ్ థెరాన్ తదితరులు
రచన : క్రిస్ మోర్గాన్, సంగీతం : బ్రియాన్ టేలర్, ఛాయాగ్రహణం : స్టీఫెన్ ఎఫ్ విండన్
విడుదల :  ఏప్రెల్ 14, 2017

         ***
     చాలా సినిమాలు ఒకటి రెండు సీక్వెల్స్ తర్వాత నీరసించిపోతాయి. కానీ ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ సీక్వెల్స్  సీను  తగ్గడంగానీ,  ప్రేక్షకుల మోజు తీరడం గానీ జరగడం లేదు. ప్రస్తుత ఎనిమిదవ సీక్వెల్ కి మూడు రోజుల్లోనే బడ్జెట్ కి రెట్టింపు వసూళ్లు వచ్చాయి. ఇండియాలోనూ ఇంగ్లీషుతోబాటు హిందీ, తెలుగు, తమిళంతో బాటు, తొలిసారిగా కన్నడ డబ్బింగ్ వెర్షన్లు దిగ్విజయంగా ఆడేస్తున్నాయి. ముఖ్యంగా హిందీ వెర్షన్ కి అత్యధిక ప్రజాదరణ లభిస్తోంది. ఈ ఫ్రాంచైజ్ ప్రారంభమైన నాటి నుంచీ నటిస్తున్న విన్ డిసిల్ తో బాటు ఒక్కో సీక్వెల్ తో పరిచయమవుతూ వస్తున్న స్టార్స్ కి ఇండియాలో అశేష అభిమాను లేర్పడ్డారు. హై వోల్టేజ్  యాక్షన్ స్టార్స్ అయిన వీళ్ళని మళ్ళీ మళ్ళీ చూసేందుకు అభిమానులు ఎగబడుతున్నారు. ఎఫ్ ఎఫ్ -8 ఇప్పుడు ఆలిండియా హిట్టయ్యింది. 

           కారు రేసులు, దోపిడీలూ వంటి కథాంశాలతో నిర్మాణం జరుపుకుంటూ వస్తున్న ఈ సీక్వెల్స్ ఈ సారి జేమ్స్ బాండ్ సాహసకృత్యాల వైపు మళ్ళింది. ఒక టీముగా వుండి ఒక ఆపరేషన్ పూర్తి చేసే యాక్షన్ స్టార్స్ జట్టు, ఇప్పుడు ఒక్కొకరు ఒక్కో  జేమ్స్ బ్యాండ్ లైపోయి రష్యాలో యాంటీ టెర్రరిజం ఆపరేషన్ విజయవంతం చేసి వస్తారు. 

      ఇందులో లాజిక్ చూడకూడదు, సాధ్యాసాధ్యాలు అడక్కూడదు- కళ్ళప్పగించి హైపర్ యాక్షన్ సీన్స్ చూస్తూ  ఉండడమే. కారు రేసులో హీరోగారు  కారుని రివర్స్ గేరులో వెనక్కి నడిపి రేసు గెల్చినా దీన్నొక మైండ్ లెస్ యాక్షన్ కామెడీగానే  ఎంజాయ్ చేయాలి తప్ప ఏడుస్తూ కూర్చోకూడదు. డిసిల్ భార్యనీ, కొడుకునీ సైఫర్ అనే సైబర్ టెర్రరిస్టు పాత్రలో  చార్లిజ్ థెరాన్ కిడ్నాప్ చేసి బంధించి,  డిసిల్ చేత విద్రోహ పనులు చేయిస్తూంటుంది. తమ టీము లోంచి విడిపోయి డిసిల్ ఇలా ఎందుకు చేస్తున్నాడో అర్ధంగాని మిగతా టీం మెంబర్లు అతడి పన్లకి అడ్డు పడుతూంటారు. డిసిల్ కొడుకుని కాపాడుకుంటూ సైఫర్ ని అణిచేందుకు ఓ ప్లానేసి సాగిపోతాడు- ఈ ప్రయాణం రష్యాకి దారితీస్తుంది- టీం అంతా అతడి వెంట వుంటుంది.

          హాలీవుడ్ ‘హై కాన్సెప్ట్’ సినిమాలు యాక్షన్ భారీగా, స్టోరీలైన్ సింపుల్ గా వుంటాయి.  ఈ మర్మం టాలీవుడ్ తెలుసుకోవడం లేదు. యాక్షనూ భారీగా, స్టోరీ లైనూ ఏవేవో లగేజీలతో మోతబరువుగా మారిపోయి తలబొప్పి కట్టిస్తాయి. ఎఫ్ ఎఫ్ – 8 లో ఇంత భారీ యాక్షన్ మధ్య సింపుల్ గా, సెంటి మెంటల్ గా ఓ పసివాడి ప్రాణాలు అనే కథ మాత్రమే!

         సైబర్  హ్యాకర్ గా చార్లిజ్ థెరాన్ హ్యాక్ చేయలేనిదంటూ వుండదు. కేవలం ఒక చిప్ తో దేన్నైనా హ్యాక్ చేసేయగలదు. నగరంలో కార్లని హ్యాక్ చేస్తే అవన్నీ డ్రైవర్ల అదుపులో వుండక అల్లకల్లోలం సృష్టిస్తాయి. రష్యాలో సబ్ మెరైన్ ని వ్యవస్థని, బెర్లిన్ లో బ్యాంకు వ్యవస్థని కూడా  ఆమె హ్యాక్ చేసి విద్రోహాలకి  పాల్పడగలదు. 

          వాయువేగంతో దూసుకెళ్ళే కార్లు, వాటి పేల్చి వేతలు;  రష్యా మంచు ప్రాంతంలో మిలిటరీ యాక్షన్, ఆ వాహనాల విధ్వంసాలూ, హేండ్ టు హేండ్ ఫైట్స్, గన్ ఫైట్స్ – బ్లాస్టింగ్స్ – వీటన్నిటి మధ్య మన హై వోల్టేజ్ యాక్షన్ హీరోలు, హీరోయిన్లు చెక్కు చెదరకుండా ఫ్రెష్ గా వుండడం, శత్రువులు మాత్రం చెత్తకింద తుక్కు అవడం, ఈ యాక్షన్ సీన్సులో కామెడీ, అసలు వీళ్ళ టీం బాసే ఒక కమెడియన్... ఏడాది నిండని పసివాడు కూడా నవ్వించడం, ఇలా బిగ్ కమర్షియల్ యాక్షన్  సినిమా కుండాల్సిన మసాలాలన్నీ వున్నాయి. 

          ఈ హై వోల్టేజ్ యాక్షన్ హీరో హీరోయిన్లు తామంతా ఒకే  ఫ్యామిలీ అంటారు. కానీ ఒకరంటే ఒకరికి పడదు. ఘోరంగా అవమానించుకుంటూ వుంటారు. ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవడున్నాడో ఎవడు చచ్చాడో కూడా పట్టించుకోరు. అంతా ముగిశాక మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్ గా కూర్చుని,  కొత్తగా తమ ‘ఫ్యామిలీ’ లోకి ఆ పసి ప్రాణిని చేర్చుకుంటారు.

     ఇంకొకటి గమనిస్తే, కథ సింపుల్ లైనుతో వుండి, యాక్షన్ భారీగా వున్నప్పుడు డైలాగ్స్ కూడా పవర్ఫుల్ గా వుండడం. ఈ హై వోల్టేజ్ యాక్షన్ స్టార్స్ కి హాలీవుడ్ రచయిత రాసిన డైలాగులూ, వాటికి  హిందీ డబ్బింగ్ రైటర్ చేసిన అనువాదమూ ఎక్సెలెంట్. పాత్రల్ని ఉన్నత శిఖరాల్లాగా  చూపిస్తున్నప్పుడు వాటి నోట్లోంచి రావాల్సింది ఇలాటి తూటాల్లాంటి మాటలే. అవి మూసగా వుండక, కొత్త కొత్త ఉపమానాలతో క్రియేటివ్ గా కూడా వుండాల్సిందే. దీంతో పాటు గట్టిగా నవ్వు తెప్పించే  ఒకటీ రెండు పదాల జోకులూ అంతే పవర్ఫుల్ పంచ్ తో వుండడం గమనించాలి. ఇలా కామెడీ కోసం రాసిన డైలాగులు కూడా రఫ్ గా వుంటాయి. ఈ మూవీ అంతా యాక్షన్ తో ఎంత ఫన్నో, డైలాగ్ పవర్ తో కూడా అంతే ఫన్. 

          ఈ వ్యాసకర్త కావాలని ఆబిడ్స్ రామకృష్ణా లో హిందీ వర్షన్ చూశాడు. పై నుంచీ కింది దాకా అన్ని వర్గాల ప్రేక్షకులూ సెకండ్ షో హౌస్ ఫుల్ చేసి,  తమ అభిమాన తారల టక్కు టమారాల్ని, గిమ్మిక్కుల్నీ తెగ ఎంజాయ్ చేశారు. ఒక్కో  డైలాగుకి  ఎగిరెగిరి నవ్వుతూ ఎంజాయ్ చేశారు చివరిదాకా. ఇక్కడ హిందీ డబ్బింగ్ రైటరు పెద్ద హీరో అనేట్టున్నాడు. ఈ ప్రేక్షకుల్లో ఆడవాళ్ళు కూడా వున్నారు. 

          మొత్తానికి ఎఫ్ ఎఫ్ -8 హిందీ వెర్షన్ పెద్ద హిట్. సోమవారం కూడా ఆన్ లైన్ బుకింగ్స్ హౌస్ ఫుల్స్.

-     -  సికిందర్
www.cinemabazaar.in



         
         

15, ఏప్రిల్ 2017, శనివారం

రివ్యూ!








తారాగణం : విద్యాబాలన్, నసీరుద్దీన్ షా ,ఆశీష్ విద్యార్థి ,రజిత్ కపూర్, చంకీ పాండే, గౌహర్ ఖాన్, పల్లవీ శారద ,ఇళా అరుణ్ తదితరులు
కథ : శ్రీజిత్ ముఖర్జీస్క్రీన్ ప్లే : శ్రీజిత్ ముఖర్జీకౌసర్ మునీర్మాటలుపాటలు  : కౌసర్ మునీర్
సంగీతం : అనూ మాలిక్, ఖయ్యాం, ఛాయాగ్రహణం : గోపీ భగత్
బ్యానర్ : విశేష్  ఫిలిమ్స్, ప్లే ఎంటర్ టైన్మెంట్స్
నిర్మాతలు : ముఖేష్ భట్విశేష్  భట్
విడుదల : ఏప్రెల్  14, 2017
            ***
        దేశ విభజన మీద హిందీలో అనేక సినిమాలొచ్చాయి. దేశ విభజన నేపధ్యంలో వేశ్యల పోరాటంతో ‘బేగం జాన్’ వచ్చింది. బెంగాలీ దర్శకులతో విద్యాబాలన్ నటించినప్పుడల్లా అదొక కళాత్మక సినిమా అవుతోంది. ఈ మధ్య సరిగా సినిమాలు తీయక వెనకబడ్డ మహేష్ భట్ ఈసారి విద్యాబాలన్ తో, దర్శకుడు శ్రీజిత్ ముఖర్జీతో ఈ కళాత్మకం  తీసి వార్తలకెక్కారు. దేశ విభజన గురించి వేశ్య పాత్రలతో ఇప్పుడు కొత్తగా ఏం చెప్పారన్న ఆసక్తి రేకెత్తించారు. విద్యాబాలన్ మరో షబానా అజ్మీ అవుతున్న క్రమంలో, శ్యాం బెనెగళ్ తీసిన ‘మండి’లో లాంటి షబానా అజ్మీ పాత్ర సంఘర్షణని ఇంకో స్థాయికి తీసికెళ్ళి ఎలా బలమైన ముద్ర వేశారో ఒకసారి చూద్దాం...

కథ 
       2016 డిసెంబర్ లో ఒక రాత్రి న్యూ ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ లో బస్సులో పోతున్న బాయ్  ఫ్రెండ్- గర్ల్ ప్రెండ్ జంటని పోకిరీలు వేధిస్తూంటే,  బస్సు దిగి పారిపోతుంది గర్ల్ ఫ్రెండ్.  ఆమెని వెంబడించి రేప్ చేయబోతారు. అప్పుడొక ముసలవ్వ ఆ అమ్మాయికి రక్షణగా నిలబడి- తన బట్టలు విప్పేస్తూ పోకిరీలని ఆహ్వానిస్తుంది...ఈ దృశ్యంతో  పోకిరీలు జన్మకి సరిపడా గుణపాఠం నేర్చుకుంటారు. 

          ఈ ఓపెనింగ్ టీజర్ తో కథ 1947 నాటి కాలంలోకి పోతుంది. అక్కడ పంజాబ్ కొండ కనుమల మధ్య ఒకే పెద్ద కోటలాంటి ఇల్లు. ఆ ఇంట్లో బేగం జాన్ ( విద్యా బాలన్ ) అనే యజమానురాలు. ఆమె కింద పదకొండు మంది వేశ్యలు, ఒక అమ్మ (
ఇళా అరుణ్), ఇంకో మైనర్ బాలిక. సుర్జిత్ (పితో బాష్  త్రిపాఠీ) అనే ఒక సేవకుడు, సలీం మీర్జా (సుమిత్ నిఝావన్) అనే అంగరక్షకుడు వుంటారు. ఆ వేశ్యా గృహంలో వేశ్యల మధ్య కులమత ప్రాంతీయ బేధాల్లేవు. అందరిదీ బతకడం కోసం ఒకే పోరాటం. బేగం జాన్ దేనికీ రాజీ పడని, లొంగని  మొండి ఘటం. ఒక సంస్థానానికి చెందిన రాజాజీ (నసీరుద్దీన్ షా) తో, ఇంకో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాస్టర్ (వివేక్ ముష్రాన్) అనే నేతతో సంబంధాలు పెట్టుకుని తన జోలికి ఏ చట్టమూ, ఏ తెల్లవాడి నిర్బంధమూ రాకుండా చూసుకుంటూ వుంటుంది. స్థానిక పోలీసు అధికారిని పూచిక పుల్లలా తీసిపారేస్తుంది. ఆమె దగ్గరికి వచ్చే విటుల్లో పెద్ద మనుషులూ వుంటారు, ఆ పెద్ద మనుషుల్లో కులీనులూ వుంటారు. 

          ఇలా వుండగా ఓ అర్ధరాత్రి దేశానికి స్వాతంత్ర్యం వస్తుంది. రేడియోలో ఈ ప్రకటనకి వేశ్యలంతా  ఆనందాతిరేకాలతో  నృత్యాలు చేస్తారు, బాణసంచా కాలుస్తారు. బేగం జాన్ మాత్రం నిర్లిప్తంగా  కూర్చుని వుంటుంది. ఆమె దృష్టిలో దేశానికి స్వాతంత్ర్యం రాలేదు, మగాళ్ళకి వచ్చింది. మగాళ్ళ నుంచి ఆడవాళ్ళకి స్వాతంత్ర్యం లభించినప్పుడే దేశానికి లభించినట్టు. 

          ఇదిలా వుండగా,  
ఢిల్లీలో దేశ విభజనకి విభజన రేఖ గీసే నిర్ణయాలు జరుగుతాయి.
 లూయిస్ మౌంట్ బాటెన్ (పాట్రిక్ ఐర్) ఈ పనిని బ్రిటిష్ లాయర్ సిరిల్ రాడ్ క్లిఫ్ (రాజా బిస్వాస్)కి అప్పజెప్తాడు. వారం రోజుల్లో అటు బెంగాల్లో, ఇటు పంజాబ్ లో రెండు గీతలు గీసేసి దేశాన్ని విభజించేస్తాడు రాడ్ క్లిఫ్. అటు తూర్పు పాకిస్తాన్, ఇటు పశ్చిమ పాకిస్తాన్, మధ్యలో ఇండియా అంటాడు. 

          దీంతో అటూ ఇటూ స్థానచలనం, వలసలు ప్రారంభమవుతాయి. మరో వైపు విభజన రేఖ మ్యాప్ పట్టుకుని కంచె వేసే పని చేపడతారు  పంజాబ్ వైపు ఇద్దరు చిన్ననాటి మిత్రులు. వీళ్ళు హరిప్రసాద్ (ఆశీష్ విద్యార్థి), ఇలియాస్ ( రజిత్ కపూర్) లనే కాంగ్రెస్,  ముస్లిం లీగ్ నేతలు. కంచె వేసుకుంటూ వస్తూంటే, సరీగ్గా రాడ్ క్లిఫ్ రేఖ మీద బేగం జాన్ కోట తగుల్తుంది. ఖాళీ చేయాల్సిందిగా ఆమెకి నోటీసు లిస్తారు. ఆమె చించి పారేస్తుంది- ‘మీరు సాని కొంప అంటున్న ఈ ఇల్లు నా ఇల్లు, నా దేశం. మమ్మల్ని ఇక్కడ్నించి కదిలించాలని చూశారో, మీ కాళ్ళూ చేతులూ తీసేసి “దేహ విభజన” చేస్తాం’ అని వార్నింగ్ ఇస్తుంది. 

          ఇదీ సమస్య. ఇదెలా పరిష్కార మైంది? ఎవరిది పై చేయి అయింది? బేగం జాన్ తన బృందంతో కలిసి దేశానికి ఇచ్చిన సందేశం ఏమిటి? పైకి కన్పించని ఈ సందేశం ఆమె పోరాటానికి ఎలా సంసిద్ధం చేసింది?...ఇవీ మిగిలిన కథలో తెలిసే అంశాలు.

ఎలావుంది కథ 
         ‘రాజ్ కహిని’ (రాజుల కథ) పేరుతో 2015 లో ఇదే దర్శకుడు తీసిన బెంగాలీకి ఇది రీమేక్. అందులో రీతూ పర్ణ సేన్ గుప్తా నటించారు. అయితే 1983 లో  శ్యాం బెనెగళ్ తీసిన ‘మండి’ స్ఫూర్తితోనే  ‘రాజ్ కహిని’ తీశారు. ‘మండి’ (సంత) కూడా ‘ది బెస్ట్ లిటిల్ వోర్ హౌస్ ఇన్ టెక్సాస్’  (1982) అనే హాలీవుడ్ తో బాటు, గులాం అబ్బాస్ రాసిన ‘ఆనంది’ అనే ఉర్దూ కథ ఆధారంగా తీశారు. ఇందులో  రుక్మిణీ బాయి (షబానా అజ్మీ)  హైదరాబాద్ లో నడిపే వేశ్యాగృహాన్ని నగర శివార్లకి తరలించాలని నేతలు నిర్ణయించడంతో రుక్మిణీ బాయి సంఘర్షిస్తుంది. అది స్థానిక సమస్య, దాంతో వ్యక్తిగత సంఘర్షణ. 

          ‘బేగం జాన్’ కొచ్చేసరికి విశాలప్రాతిపదికన దేశ విభజన సమస్యకి కేంద్ర బిందువు అయింది. ఈ సినిమా చూస్తూంటే ఆమె ఓ ఇంటికోసం తను గెలవలేని పోరాటం ఎందుకు చేస్తోందని అన్పిస్తుంది. మూర్ఖత్వమని కూడా అన్పిస్తుంది. కొన్ని భూసేకరణ  కథల్లో రైతు పొలం అమ్మనని భీష్మించుకునే లాగ. అమ్మక తప్పదు, అభివృద్ధిని ఆపలేరు. బ్రిటిష్ వాడు నిర్ణయించిన విభజన రేఖని మార్చడం బేగం వల్ల కాదు, ఆమె ఖాళీ చేసి పోవాల్సిందే. 

          కానీ రైతుకీ ఓ రక్షణ వుంటుంది, కనీసం నష్టపరిహారం లభిస్తుంది. ఈ వేశ్యల చేత ఖాళీ చేయించి తమలో కలుపు కోడానికి సరిహద్దు కిరువైపులా ఎవరూ సిద్ధంగా వుండరు.  వాళ్ళ ఖర్మానికి వదిలేస్తారు.  ఈ నేపధ్యంలో బేగం, ఆమె బృందం ఆయుధాలు చేపట్టి, ఓడిపోతామని తెలిసీ  కోటని రక్షించుకోవడాని చేసే భీకర పోరాటం చూస్తూంటే, మామూలు కంటికి ఓ యాక్షన్ – మెర్సినరీ జానర్ లో ఫిక్స్ చేసి కమర్షియల్ గా సొమ్ములు చేసుకోవాలనుకున్న కథలాగే అన్పిస్తుంది. వేశ్యలు వాళ్ళ  వృత్తి కోసం చేస్తున్న ప్రాణత్యాగం లాగే అన్పిస్తుంది. 

          ఇంతే కథ అనుకుంటే పప్పులో కాలేసినట్టే, సినిమా చూడ్డం రానట్టే. అర్ధవంతమైన సినిమా కథకి ఓ సంస్కారం వుంటుంది. అది కంటికి కాదు, మనసుకి కథని అందిస్తుంది. అందుకని ఈ పైకి కన్పించేదంతా నిజం కాదనీ - దీనికి సమాంతరంగా అంతర్లీనంగా వేరే అర్ధంలో అసలు కథ నడుస్తోందనీ పసిగడతాం. వేశ్యలు వాళ్ళ వృత్తి కోసం ప్రాణత్యాగం చెయ్యరు. అలా చూపిస్తే సినిమా ఒక్క ఆట కూడా ఆడదు. 

          బేగం సహా పదకొండు మంది వేశ్యలు ప్రాణాలకి తెగించి చేసే ఆ  పోరాటం కేవలం వృత్తి కోసమో, ఇంటి కోసమో కాదు. దేశం కోసం. ఆ కోటలాంటి ఇల్లు  దేశానికి రూపకాలంకారమని మనకి  అర్ధమవుతుంది. ఆ వేశ్యల పోరాటం దేశ విభజననే అడ్డుకుంటున్న పోరాటమని తెలుస్తుంది. సంకేత భాషలో  అంతర్గతంగా  ఈ కథ నడుస్తోంది. నీలకంఠ తీసిన ‘షో’ లో కూడా సంకేత భాషలో అంతర్లీనంగా కూడా ఓ కథ నడుస్తూంటుంది. ఇది మనసుకి కన్పిస్తుంది. 

          బేగం ఈ పోరాటంలో ఓడిపోతుందని తెలుసు- దేశం అఖండ భారత్ గా వుండాలన్న వాళ్ళ కోరికలోని బలం ముందు ప్రాణాలు ముఖ్యం కాదు. కథ ముగుస్తున్నప్పుడు వచ్చే పాట వాళ్ళ నినాదాన్ని తెలుపుతుంది-  ‘వోహ్ సుభాహ్ హమీసే ఆయేగీ’ - ఆ శుభోదయం మాతోనే వస్తుంది అంటూ. మిమ్మల్ని స్వర్గానికి తీసి కెళ్ళడానికి ఏ కాంతి పుంజమూ ఆకాశంలోంచి దిగిరాదు, మీరే కాంతి పుంజం కావాలని పాడతారు. నిజమే, ఎవళ్ళ  స్వార్ధాలతో వాళ్ళు మనుషులు దేశాన్ని చీకట్లోనే వుంచుతారు- వాళ్ళతో శుభోదయం ఎలా ఎప్పుడు వస్తుంది? 

          దేశభక్తి గురించి ఇంతగా మాట్లాడే సంస్థలు, పార్టీలు ఏవీ ఆ నాడు దేశ విభజనని అడ్డుకునే చిన్న ఉద్యమం కూడా రేపి ప్రజల్నిజాగృతం చేయలేదు. పైపెచ్చు ప్రజల్ని అనాధలుగా వదిలేసి, విభజన వంకతో  వాళ్ళు వూచకోతకి గురవుతూంటే ప్రేక్షక పాత్ర వహించాయి.

          దర్శకుడు శ్రీజిత్ ముఖర్జీ ఈ కథతో అలాటి పార్టీలకి, సంస్థలకి చెంపపెట్టు లాంటి సమాధానమిచ్చాడు.

ఎవరెలా చేశారు 
       ఎవరెలా చేశారంటే చెప్పడం కష్టం. ప్రతీ ఒక్క పాత్రలో ప్రతీ ఒక్కరూ 1940 ల నాటి మనుషులే  అన్పించేలా పోకడలు ప్రదర్శించారు. పచ్చి వేశ్యలుగా నటించిన ప్రతి వొక్కరూ నటుల్లా అన్పించరు. వేశ్యలే వచ్చి నటిస్తున్నట్టు వుంటుంది. పచ్చి భాష మాట్లాడే బేగం పాత్రలో విద్యాబాలన్ ని తప్ప ఇప్పట్లో ఇంకొకర్ని వూహించలేం.  ఈ పాత్రకి ఒకలాంటి ఫెమినిజం వుంటుంది. తిడితే ఆడదానికి తగిలే తిట్లు తిట్టే మగ నాకొడుకులతో ఆడదానికి స్వాతంత్ర్యం ఎప్పుడూ రాదనే ఈమే, ఆడవాళ్ళకి తగిలే తిట్లే  ఘోరంగా తిడుతూంటుంది. ఇది పాత్రచిత్రణ లోపం కావచ్చు. 

          ఈమె పుట్టుపూర్వోత్తరాలు పోలీసులకి కూడా తెలీవు. ఈమె అసలెవరో, వేశ్య గా ఎలా మారిందో  తెలపడానికి దర్శకుడు అద్భుతమైన క్రియేటివిటీ చేశాడు. మామూలుగానైతే  ఓ పాత్ర వచ్చి ఈమె ఫలనాఫలనా అని స్టేజి నాటకం పద్ధతిలో  చెప్పేసి చెక్కేస్తుంది. అది క్రియేటివిటీ కాదు, కుక్కలు కూడా ఆపని చేయగలవు. మొరగడం సినిమా కళ కాదు. మొరగకుండా  దృశ్యపరంగా చూపించేదే సినిమా కళ. కుక్కలకి  సినిమా కళ సింహాసనం తెలీదు. 

          విభజన రేఖ గీసి ఆమెని నెట్టేస్తున్న నేపధ్యంలో దర్శకుడు సమయోచితంగా ఆమె గతాన్ని బయట పెడతాడు. దేశానికి ఈ విభజన రేఖ లాంటిదే ఆమె జీవితంలోనూ విభజన రేఖే దగా చేసిందని. దీన్ని ఆమె ఈ సందర్భంగా  తల్చుకుంటుంది. మొగుడు పోయాడని లేత వయసులోనే తనకి శిరో ముండనం చేసి, తెల్ల చీర చుట్టి తనవాళ్ళు  వీధిలోకి నెట్టేసిన విభజన రేఖ! అలా అలా తిరిగి వేశ్యగా మారి, ఓ నవాబు దగ్గర బేగం జాన్ అయింది. దీనికి సోదిలా ఫ్లాష్ బ్యాక్ ఏమీ వుండదు. షాక్ వేల్యూ కోసం కొన్ని కట్ షాట్స్ తో  మెరుపు వేగంతో చూపించేస్తాడు దర్శకుడు. తేరుకోవడం మనవల్ల  కాదు. సినిమా తీయడమంటే మజాకా కాదు. డాగీ బిజినెస్ కాదు.

          ప్రస్తుతానికొస్తే, కోట ఖాళీ చేయమని తనని వేధిస్తున్న వాళ్ళ సంగతి చూడమని రాజాజీ (నసీరుద్దీన్ షా) ని పొదరింటికి ఆహ్వానించి, ఎర్ర చీరా నిండుగా ఆభరణాలతో ధగధగ మెరిసిపోతూ కొత్త పెళ్లి కూతుర్లా  విద్యాబాలన్ అతడి ముందు కూర్చున్నప్పుడు- ఇంకొక డిస్టర్బింగ్ సీను వస్తుంది. అతను ఆమె పెంచుకుంటున్న మైనర్ బాలిక కావాలంటాడు. షాక్ అవుతుంది. ఏం చెప్పినా విన్పించుకోడు. పైగా పాట పాడితే తప్ప తనకి మూడ్ రాదం టాడు.  మైనర్ బాలికతో అతను  పవళిస్తే అతడి ముందు కూర్చుని పాడే విద్యాబాలన్ పెళ్ళికూతురి ముస్తాబంతా పోయి పడే వేదన అంతాఇంతా కాదు. ‘శంకరాభరణం’ లో  మానభంగం జరుగుతున్నపుడు అరిగిపోయిన రికార్డు తిరుగుతూంటే, ఇక్కడ ప్రత్యక్షంగా కూర్చుని నరకం అనుభవిస్తూ పాడాల్సి వస్తుంది. ఈ భజన్ రాజాజీ పక్కలో ఆ మైనర్ బాలికకి జోల పాడే భజన్. ఇలాటి డిస్టర్బింగ్  సీన్లు విద్యాబాలన్ కి చాలా వున్నాయి. పీరియడ్ ఫిలిం కావడం వల్ల  ఈ వెయిట్ వున్న పాత్ర కావాల్సినంత క్లాసిక్ లుక్ తో విజువల్ గా బలమైన ముద్ర  వేస్తుంది. 

         ఆశీష్ విద్యార్థి, రజిత్ కపూర్ మిత్రుల సీన్లలో కూడా దర్శకుడి పనితనం వల్ల వాళ్ళు అద్భుతంగా హత్తుకునేలా కన్పిస్తారు. ఒకరు ఇండియన్, ఇంకొకరు పాకిస్తానీ అన్నట్టుగా విడిపోబోతున్నారు కంచె వేసే పని పూర్తి చేశాక. వీళ్ళిద్దర్నీ ఎప్పుడు చూపించినా, స్క్రీన్ కి ఇటు చివర ఒకరి సగం ముఖం -  అటు చివర ఇంకొకరి సగం ముఖం మాత్రమే చూపిస్తాడు దర్శ కుడు. ఈ విభజన ప్రాణమిత్రుల్ని కూడా ముక్కలు చేసిందనే అర్ధంలో ఇలాటి  షాట్ డివిజన్ చేస్తాడు దర్శకుడు. ఇతను ఇండియాలో వుంటే సగమే వుంటాడు, తన ఇంకో సగం మిత్రుడితో పాకిస్తాన్ లో వుంటుందన్నట్టు,   అలాగే అతను  పాకిస్తాన్ లో వుంటే సగమే వుంటాడు, తన ఇంకో సగం మిత్రుడితో ఇండియాలో వుంటుందన్నట్టు కదిలించే దృశ్యీకరణ. విద్యాబాలన్ సహా ఏ పాత్రని చూపించినా విభజన కాన్సెప్టే దృశ్యాల్లో నిశ్శబ్దంగా వెల్లడయ్యేలా చిత్రీకరణ  చేస్తాడు  దర్శకుడు. 

          ఇక ఇందులో కిరాయి హంతకుడుగా పేరు చెప్తే తప్ప గుర్తుపట్టలేని విధంగా వుంటాడు చంకీ పాండే విరిగిన, గారపట్టిన పళ్ళతో.  కిల్లర్ కబీర్ గా అవసరాన్ని బట్టి హిందువుగా, ముస్లిం గా మారిపోయే ఊసర వెల్లిలా ఖతర్నాక్ గా వుంటాడు. 

          అనూ మాలిక్, ఖయ్యూం ల సంగీతాల్లో పాటలూ, వాటి చిత్రీకరణా దృశ్య కావ్యంలా వుంటాయి. దర్శకుడి చేతిలో ప్రతీదీ కళాత్మకమే. గోపీ భగత్ సమకూర్చిన ఛాయాగ్రహణం, దాని డీఐ ఇంకో చెప్పుకోవాల్సిన కళా నైపుణ్యం. కాస్ట్యూమ్స్, కళా దర్శకత్వం, పోరాటాలు ఛత్తీస్ ఘడ్ లొకేషన్స్  ప్రతీదీ కథాకాలంలో సింక్ అయిపోతూ కన్పిస్తాయి.  ఇందులో ముగింపు పాట కోసం దర్శకుడు చాలా అన్వేషించి 1958 లో రాజ్ కపూర్ సినిమా ‘ఫిర్ సుభాహ్  హోగీ’ లొ వాడకుండా వుంచేసిన, సాహిర్ లుథియాన్వీ రాసిన ‘వోహ్ సుభాహ్ తో కభీ ఆయేగీ ‘ పాటని కొద్ది మార్పులు చేసి వాడుకున్నారు. 

          పోతే, దేశ విభజన నేపధ్యంలో కేవలం వలసలు పోతున్న ప్రజలనే చూపించి, అప్పట్లో చెలరేగిన హింసాగ్ని, లక్షలాది మరణాలూ  చూపించలేదన్న ప్రశ్న తప్పక వస్తుంది. అదంతా చూపిస్తే, బేగం చేసే పోరాటం దాని ముందు డైల్యూట్ అయిపోతుంది. ప్రధాన కథనీ, ప్రధాన పాత్రనీ కాపాడుకోవాలంటే ఒక్కోసారి నేపధ్యాన్ని సెలెక్టివ్ గా వాడుకోక తప్పదు. 

          బాలీవుడ్ కొస్తున్న బెంగాలీ దర్శకులు అత్యంత కళాత్మకంగా తీస్తూ ఇతర దర్శకులకి సవాలు విసురుతున్నారు. ‘పింక్’ లాంటి  థ్రిల్లర్ తీసినా కళాత్మకమే- వాళ్ళు ఏం తీస్తే అది హిట్టే!
చివరికేమిటి 
దర్శకుడు శ్రీజిత్  ముఖర్జీ
        స్ట్రక్చర్ తో క్రియేటివిటీకే అందం వస్తుంది. స్ట్రక్చర్ లో వుంచడం వల్ల ఈ స్క్రీన్ ప్లే ఇంత బలంగా, అర్ధవంతంగా వుంది, కళాత్మకంగా వుంది. హాలీవుడ్ సినిమాల్లో ఓపెనింగ్ టీజర్లు వుంటాయి- మన సినిమాల్లో ఓపెనింగ్ బ్యాంగులు వున్నట్టు. ఓపెనింగ్ టీజర్లు ఇంకా వాడిగా, బలంగా, కత్తిలా వుంటాయి. దీన్ని ఈ కథ మొదలెట్టడానికి వాడుకున్నారు. పైన చెప్పుకున్న కథలో మొదటి పేరాలో ముసలవ్వ వివస్త్ర అయ్యే సన్నివేశం అలాటి పవర్ఫుల్ టీజరే.  ఈ టీజర్ లో  సన్నివేశం 2016 నాటిది. మరి వెంటనే మరుసటి సీన్లో 1947 లోకి కథ వెళ్ళాలి - ఎలా? 

          ఈ ముసలవ్వ ‘టైటానిక్’ ముసలావిడ అయ్యింది... అంటే ఆ అమ్మాయిని పోకిరీల బారినుంచి తను కాపాడేక, తీక్షణమైన చూపులు చూస్తూ తన గతంలో కెళ్ళి పోతుంది. వెంటనే ఈ ముసలవ్వ పాయింటాఫ్ వ్యూలో 1947 లో కథ ప్రారంభమవుతుంది. ఆనాటి కథలో మైనర్ బాలికే ఇప్పుడున్న ముసలవ్వ. 1947 లొ మైనర్ గా వున్నప్పుడు ఒకావిడ్ని పోలీసు అధికారి రేప్ చేయకుండా ఇలాగే బట్టలు విప్పుకు నిలబడి ఆహ్వానిస్తుంది. పోలీసు అధికారికి  సెక్స్ మీదే వైరాగ్యం పుట్టి పారిపోతాడు. ఈ ఓపెనింగ్ టీజర్ కి  1947 తో లింకు వుందన్న మాట. రేపిస్టులకి బుద్ధి చెప్పడానికి చిన్నప్పుడు ఏం చేసిందో,  ముసలావిడ అయ్యాకా అదే చేయాల్సి వచ్చిందన్న మాట. ఇది కొరడా చరుపు లాంటి  సోషల్ కామెంట్ అన్నమాట!

          స్ట్రక్చర్ లో బిగినింగ్ వచ్చేసి, బేగం జాన్ వేశ్యాగృహం, బిజినెస్ వగైరా ఒక పక్క చూపిస్తూ, ఇంకో పక్క దేశ పరిణామాలు, స్వాతంత్ర్యం, దేశ విభజన ప్రక్రియా, సరిహద్దుల ఏర్పాటూ అంచెలంచెలుగా చూపించు కొస్తూంటారు. ఈ ట్రాక్ అంతా బేగంతో ఎక్కడ ఎందుకు ఎలా కనెక్ట్ అవుతుందా అన్న సస్పెన్స్ పుడుతుంది. ఈ ట్రాక్ అంతా ముందు ముందు  ప్లాట్ పాయింట్ -1 దగ్గర కథకి అవసరమైన ‘సమస్య’ ఏర్పాటు కోసం దారితీసే పరిస్థితుల కల్పనే అని అర్ధమవుతుంది నియమాల ప్రకారం.

          నలభై ఐదో నిమిషం కల్లా సరిహద్దు కంచె వేసుకుంటూ వస్తే ఏముంది- విభజన రేఖ మీద బేగం కోట వుంటుంది. అంతే, ప్లాట్ పాయింట్ -1, దాని సమస్యా ఏర్పాటై పోయాయి. కోట ఖాళీ చేసి వెళ్ళాలంటూ బేగంతో అధికారుల వాదన, వాళ్లతో ఆమె  ఘర్షణ - కథ ప్రకారం బలంగా భీకరంగా వుంటాయి. 

          అయితే ఇక్కడ ఏ సినిమాలోనూ జరగని విధంగా ‘సీనస్ ఇంటరప్టస్’ జరుగుతుంది. ఇది తికమక పెడుతుంది. ప్లాట్ పాయింట్ -1  సన్నివేశాన్ని బ్రేక్ చేసి మరో సీన్ కి వెళ్ళడం జరగదు. కానీ ఇక్కడ జరిగింది.  అధికారులూ, బేగంల మధ్య రసపట్టులో వున్న సంఘర్షణ అకస్మాత్తుగా  వీగిపోతూ సీన్ మారుతుంది- అక్కడ దూరంగా వేశ్యా ఆమె ప్రియుడుల మధ్య  ఎమోషనల్ సీను, వర్షం. ఇదొక అద్భుత దృశ్య కావ్యం, అది వేరే విషయం. దీని తర్వాత తిరిగి ప్లాట్ పాయింట్ -1 సీనుకి!  

          కథనంలో ఎక్కడైనా సీన్లకి ‘సీనస్ ఇంటరప్టస్’ జరగవచ్చు గానీ, ప్లాట్ పాయింట్ -1 సీనుని మధ్యకి విరిచి తిరిగి అతికిస్తూ చేయడం ఎక్కడా వుండదు. సమస్య ఎంత తీవ్రమైనదో చరిత్ర తెలిసిన మనకి తెలుసు కాబట్టి ప్లాట్ పాయింట్ -1 ని ఇలా విరిచినా కథనానికి డ్యామేజి జరగలేదు. వెంటనే ఇంటర్వెల్ వస్తుంది యాభయ్యో నిమిషంలో. 

          మళ్ళీ ఇదొక బుర్ర దొలిచేసే పని. ప్లాట్ పాయింట్ -1 తో ఎవరైనా ఇంటర్వెల్ వేస్తారా? ప్లాట్ పాయింట్ -1 ని అనవసరంగా సాగదీసి సాగ దీసి గంటకో, గంటంపావుకో ఎస్టాబ్లిష్ చేసి ఇంటర్వెల్ వేయడం వేరు. కానీ యాభై నిమిషాలకి ప్లాట్ పాయింట్ -1 అవగానే ఇంటర్వెల్ ఇవ్వడం నాటక పద్దతి. నాటకాల్లో ఒక అంకం అయిపోగానే తెరదించినట్టు, ఇక్కడ బిగినింగ్ అనే మొదటి అంకం అవగానే విశ్రాంతి నిచ్చేశారు.  ఇంకో బెంగాలీ దర్శకుడు తీసిన ‘పింక్’ లో నైతే కోర్టు సీన్లన్నీ నాటక రంగ టెక్నిక్ తోనే నడుస్తాయి!

రచయిత్రి కౌసర్ మునీర్
         ఇక విశ్రాంతి తర్వాత మిడిల్ లో పడ్డ కథ అత్యంత సంఘర్ష ణాత్మకంగా వుంటుంది. నియమాల ప్రకారం. ఈ సంఘర్షణలో ఆమెకి ఎదురయ్యే అడ్డంకులు అంతకంతకీ తీవ్రత పెంచుకుంటూ వుంటాయి. ఇక విధిలేక తుపాకులు పేల్చడంలో తనతో సహా అందరూ శిక్షణ పొందడం, బయటి నుంచి ప్రత్యర్ధుల దాడులు పెరిగి, చివరికి ఆమె అంగ రక్షకుడు సజీవ దహన మైనప్పుడు,  ప్లాట్ పాయింట్ -2 ఏర్పడి  మిడిల్ ముగుస్తుంది.

          ఈ ప్లాట్ పాయింట్ -2 కూడా బలంగా రిజిస్టర్ అవుతుంది. ప్లాట్ పాయింట్-1, ప్లాట్ -పాయింట్ -2  రెండూ కూడా విజువల్ గా బలంగా రిజిస్టర్ చేసినప్పుడే ఈ మిడిల్ అనే స్క్రీన్ ప్లేకి  వెన్నెముక పటిష్టవంతంగా వుంటుంది.

          ఈ ప్లాట్ పాయింట్ -2 దృశ్యాన్ని  ఎవరూ జీవితంలో మర్చిపోలేరు. మర్చిపోయారంటే మనసుతో సినిమా చూడనట్టే. అంగరక్షకుడు నిలువెత్తు మంటల్లో ఒక ప్రభాలా వెలిగిపోతూ, గాలికి వూగుతున్న వరికంకిలా అటూ ఇటూ స్వింగ్ అవుతూంటాడు. అతన్నే చూస్తూంటుంది. జీవితంలో ఏదీ వూరికే జరగదు. ప్రతిదీ మనకో అర్ధాన్నిస్తాయి. సింక్రో డెస్టినీ అంటారు. దీని ప్రాధాన్యాన్ని గుర్తించకుండా-  ఏదో తగలబడ్డాడు, ఆమె చూసింది, అతను కిందపడ్డాడు, చచ్చి పోయాడు, ఏడ్చింది –అన్న చందంగా  సీను తీసేస్తే అది అజ్ఞానం. క్రియేటివిటీకి అవమానం. 

          నిలువెల్లా మంటల్లో అలా ఊగుతూ అతనేదో మూగగా చెప్తున్నాడు - ఈ పోరాటాన్ని గెలవలేవు, ఆనందంగా ఆహుతైపో- అంటున్నాడేమో? ఇదే ప్లాట్ పాయింట్ -2 దగ్గర ఆమెకి దొరికిన పరిష్కారమార్గం. దీంతో ఎండ్ విభాగంలో ఆమె బృందంతో కలిసి తీసుకునే నిర్ణయం ఎంత హృదయవిదారకంగా వుంటుందంటే...

          కళ, క్రియేటివిటీ, ఇతర సాంకేతికాలు ఒక స్ట్రక్చర్ పరిధిలోకి వచ్చినప్పుడే పురులు విప్పుకుంటాయి. స్ట్రక్చర్ లేని క్రియేటివిటీ మృత దేహానికి అలంకరణ చేయడం లాంటిది. దర్శకుడు శ్రీజిత్  ముఖర్జీ, రచయిత్రి కౌసర్ మునీర్ ల చేతుల్లో ఈ స్క్రీన్ ప్లే అంతా ఒక స్టడీ మెటీరియల్.


-సికిందర్
http://www.cinemabazaar.in