రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

9, అక్టోబర్ 2016, ఆదివారం

రివ్యూ!

రచన-  దర్శకత్వం: వీరూ పోట్ల
తారాగణం: సునీల్‌, సుష్మా రాజ్‌, రిచా పనాయ్‌, పునీత్‌ ఇస్సార్‌, జయసుధ, అరవింద్‌కృష్ణ, నరేష్‌, శత్రు, షకలక శంకర్‌, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్‌, పృధ్వీ 
సంగీతం: సాగర్‌ ఎం.శర్మ, ఛాయాగ్రహణం: దేవరాజ్‌
బ్యానర్‌: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ 
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
విడుదల: అక్టోబరు 7, 2016
***
యాక్షన్ హీరో- కమెడియన్ సునీల్ మరో దండయాత్ర చేస్తూ విజయదశమికి వచ్చేశాడు. కాస్త పంథా మార్చి ఈసారి కామిక్ థ్రిల్లర్ తో అదృష్ట పరీక్షకి నిలబడ్డాడు. అదృష్టం దక్కని గత కొన్ని మూస ఫార్ములా యాక్షన్ కామెడీలకి దూరంగా కొంచెం తేడా గల ప్రయత్నం చేద్దామనుకున్నట్టుంది- తేడా రాకుండా చూసుకునే బాధ్యత మాస్  సినిమాల దర్శకుడు వీరూ పోట్ల భుజానేసుకున్నాడు. అప్పుడేం జరిగింది? తేడా వచ్చిందా, తేడాగల ప్రయత్నంగా నిలబడిందా తెలుసుకోవాలంటే బంగార్రాజు కథలోకి వెళ్ళాలి...

కథ 
     అతను బంగార్రాజు (సునీల్). బెజవాడ వస్తాడు పని వెతుక్కుంటూ.  నారదరావు (పృథ్వీ) కొరియర్ కంపెనీలో చేరతాడు. తను ఎవరి దగ్గర పనిలో చేరినా  ఆ యజమాని తన్నులు తిని వ్యాపారం కోల్పోవడమే జరుగుతుంది. అలా తన్నులు తిని వ్యాపారం కోల్పోయిన నారదరావు, బంగార్రాజుని వదిలించుకుంటూ హైదరాబాద్ పంపించేస్తాడు.  అక్కడ బంగార్రాజుకి రోడ్ల మీద తిరిగే గీత (సుష్మా రాజ్) పరిచయమవుతుంది. ఓ స్కూల్ టీచర్ (జయసుధ) ని ఓ అవమానం నుంచి కాపాడడంతో ఆమెకి అతడిలో ఇప్పుడు లేని తన పెద్ద కొడుకు కన్పిస్తాడు. దాంతో  ఇంట్లో ఆశ్రయమిస్తుంది. ఇంట్లో చేరిన బంగార్రాజు ‘తమ్ముడు’ శ్రీనివాస్ (అరవింద్ కృష్ణ) పని చేసే కంపెనీలోనే చేరతాడు. 

        ఉన్నట్టుండి బంగార్రాజు చిక్కుల్లోపడతాడు. ఒక గ్యాంగ్ సునీల్ వర్మ అనే వాడికోసం వెతుకుతూంటారు. వాడు ఓ విగ్రహం కొట్టేసుకు పోయాడు. ఆ విగ్రహంలో 900 కోట్ల రూపాయల విలువైన వజ్రాలున్నాయి. ఆ వజ్రాలు బెట్టింగ్ మాఫియా మహదేవ్ (పునీత్ ఇస్సార్) కి చెందినవి. మహదేవ్ కొడుకు సహదేవ్ తన గ్యాంగ్ తో సునీల్ వర్మ కోసం వెతుకుతూంటే బంగార్రాజు దొరికిపోతాడు. బంగార్రాజు సునీల్ వర్మ పోలికలతోనే వుం టాడు. తను సునీల్ వర్మ కాదని ఎంత మొత్తుకున్నా, అతడి తమ్ముణ్ణి కిడ్నాప్ చేసి  వజ్రాలు పట్రమ్మంటారు. బంగార్రాజు సునీల్ వర్మని పట్టుకుని తమ్ముణ్ణి విడిపించుకునేం దుకు  అన్వేషణ మొదలెడతాడు. ఈ అన్వేణలో ఏమేం జరిగాయి, ఏఏ కుట్రలు బయట పడ్డాయి,ఎవరెవరు కుట్ర దారులుగా బయట పడ్డారు, అసలు సునీల్ వర్మ ఎవరు, అతణ్ణి  ఎలా పట్టుకున్నాడు బంగార్రాజు - అన్నవి మిగతా కథలో తెలిసే అంశాలు.

ఎలా వుంది కథ 
      కామిక్ థ్రిల్లర్ జానర్ లో సస్పన్స్ ని జోడించుకున్న కథే. కానీ దర్శకుడు గతంలో మూస ఫార్ములా మాస్ సినిమాల దర్శకుడవడం చేత ఆ వాసనలన్నీ ఇందులోకి జొరబడి పోయి జానర్ మర్యాదని దెబ్బ తీశాయి. ప్రేక్షకులు తమిళ డబ్బింగ్ సినిమాల్లో తమిళ వాసనలు  పసిగట్టినట్టు, జానర్ కాని జానర్ వాసనలు కూడా ఇప్పుడు పసిగట్టి ఫ్లాప్ చేయగలరని గత సంవత్సరం తెలుగులో విడుదలైన ఫ్లాప్ సినిమాలన్నీ నిరూపించాయి. అవన్నీ జానర్ మర్యాదని మంటగలిపినవే. జానర్ మర్యాదని కచ్చితంగా పాటించిన కేవలం అయిదారు చిన్నా పెద్దా తెలుగు సినిమాలు మాత్రమే గత సంవత్సరం హిట్టయ్యాయి. కామిక్ థ్రిల్లర్ అంటేనే ట్రెండీగా, న్యూవేవ్ మూవీలా వుండాలి. వుంది కాబట్టే ‘స్వామిరారా’ అనే కామిక్ థ్రిల్లర్ అంత  హిట్టయింది. మూస ఫార్ములాతో ఆ నిగ్రహం చూపించలేదు కాబట్టే అదే దర్శకుడు తీసిన ‘దోచేయ్’ అంత ఫ్లాపయ్యింది. కామిక్ థ్రిల్లర్ ‘దోచేయ్’ ని దెబ్బ తీసిన పాత మూసఫార్ములా పైత్యాలే ‘ఈడు గోల్డ్ ఎహె’ జానర్ మర్యాదని కూడా చెరిచాయి. ఏ పాత మూస వాసనలతో గత కొన్ని సినిమాల కథలతో సునీల్ కి శృంగభంగమవుతూ వచ్చిందో, అవే వాసనలు పుష్కలంగా ఈ జానర్ కథకీ పూశారు. మదర్ సెంటిమెంటు, బ్రదర్ సెంటిమెంటు, బరువైన సెంటిమెంటల్ డైలాగులూ, అనాధ హీరో పాత్ర, హీరో మూస ఎంట్రీ, హీరో ఎక్కడ పనిలో చేరితే  అక్కడ నష్టం అనే క్యారక్టరైజేషన్- ఫ్యామిలీ సెంటిమెంట్లు, ఇద్దరు హీరోయిన్లు, రొటీన్ స్లాట్స్ లో వాళ్ళతో రోమాన్సులూ పాటలు, బంగార్రాజు అనే పేరు, ఈడు గోల్డ్ ఎహె అనే టైటిల్ కూడా సంకల్పించిన జానర్ కి రసభంగమే. ఇవి అసలు కథని చాలా దెబ్బ తీశాయి. కామిక్ థ్రిల్లర్స్ తో అంత అలరించిన, నవ్వించిన జాకీ చాన్ సినిమాల్లో ఇలాటివి వుంటాయా? ప్రతీ జానర్ కథలోనూ జానర్ స్పృహ లేకుండా నవరసాలన్నీ నింపాలన్నచాపల్యం వుంటే, దీన్ని ఓరకంట గమనిస్తున్నారిప్పుడు ప్రేక్షకులు.

ఎవరెలా చేశారు 
        సహజంగానే సునీల్ నటన లక్ష్యిత జానర్ కి న్యాయం చేయడం కష్టమైపోయింది. ఈ కామిక్ థ్రిల్లర్ లక్ష్యిత జానర్ పట్ల స్పష్టత వుంటే,  ఆ ప్రకారం సీన్లు మార్పించి ఆ జానర్ కి తగ్గ ఆటాడుకునే వాడు. ‘ముత్యాల ముగ్గు’ లో తల్లి కున్న విషాదం పిల్లలు అనుభవించరు. పిల్లలు బాధ పడే సీను ఒక్కటి కూడా వుండదు. వాళ్ళ హాస్య ధోరణిలో వాళ్ళు విలన్లతో ఆటాడుకుని తల్లికి న్యాయం చేస్తారు. ఆ విషాద కథని అద్భుత రసంతో నడిపారు. అయోధ్య కొచ్చిన లవకుశలు కూడా అడవి పాలైన  తల్లి సీత గురించి బాధ పడుతూ కూర్చోరు. యాక్టివ్ క్యారక్టర్స్ ఎప్పుడూ బాధ పడుతూ కూర్చోవు. సునీల్ కి ఈ వెసులుబాటు లేకుండా పోయింది. పైన చెప్పుకున్న మూసఫార్ములా ధోరణుల వల్ల బాధ,  ఏడ్పు, రోషాలు, అక్రందనలూ, సెంటిమెంట్- మెలోడ్రామాలూ కూడా నటించడంతో జానర్ ప్రధాన రసమైన అద్భుత రసం, దీని బై ప్రోడక్టు అయిన హస్యరసమూ దెబ్బతినిపోయాయి. కథలో రెండే కీలక పరిణామాలని గుర్తించినప్పుడు (తమ్ముడు అనేవాడి కిడ్నాప్, సునీల్ వర్మ పేరుతో తనలాగే మరొకడు- అనే ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ఏర్పడిన సమస్య- గోల్) వీటి ఆధారంగానే ముత్యాల ముగ్గు పిల్లల్లాగా నవ్విస్తూ, జాకీచాన్ లా నరుక్కుంటూ పోవాలే తప్ప- వీటి తాలూకు విషాదం, బాధ ఏదైనావుంటే వాటిని ప్రేక్షకులు ఫీలవడానికి ముత్యాల ముగ్గులో లాగా, బ్యాక్ డ్రాప్ లో సబ్ టెక్స్ట్ లా వదిలెయ్యాలే తప్ప- అన్నీ విప్పి అవన్నీ నటన ద్వారా ప్రదర్శిస్తే  చాలా దెబ్బతినిపోతుంది వ్యవహారం. 

        హీరోయిన్ల పాత్రలూ మూస ఫార్ములా హీరోయిన్లలాగే వున్నాయి ఎక్స్ పోజింగ్స్ తో. పునీత్ ఇస్సార్ విలన్ పాత్రకి బాగా సరిపోయాడు భీకరంగా. మిగిలినవి కామెడీ పాత్రలు. రెండో హీరోయిన్ తండ్రిగా నరేష్, కిడ్నాపర్ గా పోసాని, ఫాం హౌస్ ఓనర్ గా పృథ్వీ, రైల్వే టీసీగా వెన్నెల కిషోర్, దొంగోడిగా షకలక శంకర్, నరేష్ ఇంట్లో పనివాడుగా భరత్ - వీళ్ళందరికీ సునీల్ పాత్రకి లాగా ఏ బాధల బ్యాగేజీ, సెంటిమెంట్ల బస్తాలూ లేకపోవడం వల్ల హేపీ - గో- లక్కీగా నవ్వించుకుంటూ పోయారు. ముఖ్యంగా పృథ్వీ, వెన్నెల, షకలక కామెడీ చివరంటా నవ్వించేదే. ఇందులో పృథ్వీ మళ్ళీ వేరే సినిమాల పేరడీ లేవీ చేయకుండా ఫ్రెష్  కలర్ఫుల్ క్యారక్టర్ లో నటించాడు.  
    
        సంగీతం, కెమెరా వర్క్ ఓ మాదిరిగా వున్నాయి. కొన్ని సీన్లలో డీఐ శృతిమించింది. యాక్షన్ దృశ్యాలు క్లయిమాక్స్ లో జానర్ కి విరుద్దంగా హింసాత్మకంగా వున్నాయి. కారణం, వెనకటి దృశ్యాల్లో హీరో తల్లిని విలన్ కొట్టి వుండడం. కాబట్టి హీరో విలన్ల మధ్య హీరో మదర్ సెంటిమెంట్లూ ఎమోషన్స్ తో ఈ హింస. ఈ కథలో అనవసరమైన తల్లి పాత్ర వల్ల, తల్లిని విలన్ కొట్టే అనవసరమైన దృశ్యం వల్ల,  క్లయిమాక్స్ ఫైట్ హీరో విలన్ల మధ్య జానర్ ప్రకారం హిలేరియస్ గా వుండక, యమ సీరియస్ అయిపోయింది వ్రతం చెడగొడుతూ. 

చివరికేమిటి 
        ఓ మంచి ఐడియాతో ఈ ‘కామిక్ థ్రిల్లర్’ కి పూనుకున్నాడు వీరూపోట్ల. ఇందులో అంచెలంచెలుగా వీడే సస్పెన్స్ వుంది. ఎండ్ సస్పెన్స్ అన్పించని ఎండ్ సస్పెన్ కథనం ప్రాణంగా వుంది- ఎండ్ సస్పెన్స్ గండాన్ని దాటే విధం చూపిన ‘టు ఛేజ్ ఏ క్రూకెడ్ షాడో’ – బ్రిటిష్ సస్పెన్స్, 1958 (హిందీలో ‘ధువాఁ’ - 1981, బెంగాలీలో ‘శేషాంక’ - 1963, తమిళంలో ‘పుథియ పరవాయి’ - 1964) తరహాలో అప్రయత్నంగానో,  ప్రయత్న పూర్వకంగానో కథనం చేశాడు. కథలో సస్పెన్స్ వుందని చివరి వరకూ తెలియ జేయకపోవడం ఈ తరహా కమర్షియల్ సినిమాలకి పనికొచ్చే ఎండ్ సస్పెన్స్ బాపతు కథనం. క్లయిమాక్స్ లో ఫైనల్ షోడౌన్ ఇస్తూ పాత్రలన్నీ ఓపెన్ కావడం ‘టు ఛేజ్ ఏ క్రూకెడ్ షాడో’ లాంటి మాస్టర్ స్ట్రోకే. ఇంతమంచి జానర్ ఫ్రెండ్లీ తురుపు ముక్క చేతిలో పెట్టుకుని దర్శకుడు విజాతి మూస ఫార్ములా ధోరణులతో ఎవరినో సంతృప్తి పరుస్తూ కూర్చున్నాడు. గంటంపావు సేపు ఫస్టాఫ్ అంతా అసలు కథేమిటో తెలియకుండా పోయే గజిబిజి మూస మాస్ దృశ్యాలతో పాత సినిమాలాగా నడుస్తుంది. ఇంటర్వెల్లో తమ్ముడి కిడ్నాప్, సునీవర్మ యాంగిల్,  ఓపెన్ కావడంతో అసలు కథ మొదలైనా- దీనికీ మళ్ళీ సెకండాఫ్ లో హీరోకి కొనసాగించిన సెంటిమెంటు సిమెంటు బస్తాలతో హమాలీ కథైపోయింది క్లైమాక్స్ వరకూ. అసలు స్క్రీన్ ప్లే అంటే ఏమిటో తెలిసి ఈ సినిమా తీసినట్టు కన్పించదు. ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ప్రేక్షకులు ఎలర్ట్ అయ్యేట్టు చేసిన - బంగార్రాజులా వున్నాడంటున్న సునీల్ వర్మ అసలెవరన్న  పాయింటు ప్రధానంగా హీరో పాత్ర ప్రయాణం కొనసాగించకుండా- అంత ముఖ్యమైన పాయింటూ, అసలు కిడ్నాపైన తమ్ముడి విషయమూ మరుగున పడేలా వేరేవేరే కథనాలు చేసుకుంటూ పోయారు. 

        రచయితగా దర్శకుడు సఫలమయ్యింది కామెడీ దృశ్యాల్లోనే. సునీల్- నరేష్- భరత్ ల మధ్య అదొక ఫన్నీ దృశ్యం. రైల్లో వెన్నెల కామెడీ ఎపిసోడ్ మరో ఎంటర్ టైనర్, ఫాం హౌస్ లో కోళ్ళ గురించి పృథ్వీ వెర్బల్ కామెడీ మరో వినోదం. అయితే ఎడాపెడా ప్రతీ చోటా ప్రాస డైలాగులు వాడేశారు. సీన్లు ఫన్నీగా వుండడంతో ఈ ప్రాస డైలాగులు చెల్లిపోయాయి. విలన్ ‘బ్లడీ ఫూల్’  అంటే కమెడియన్ ‘లకడీకా పూల్’  అనడం, వెన్నెల డౌట్ కి పృథ్వీ ‘బ్లెండర్ పడితే పడితే జెండర్ తెలీదు’ అనడం ...లాంటివి బహుశా హిందీలో వచ్చే మైండ్ లెస్ కామెడీల కిందికొస్తుంది. హైదరాబాద్ ఓల్డ్ సిటీ కామెడీ నాటికల్లో కన్పించే ఇలాటి మాటకి మాట ఏదో మాట అనెయ్యడమనే డైలాగ్ స్కీమ్ రచయిత- దర్శకుడు అయిన వీరూపోట్ల చివరంటా దారం తెగకుండా చక్కగా పోషించాడు- ఈ బిజీలో తెగిన గాలిపటం అయింది అసలు కథే!


-సికిందర్
http://www.cinemabazaar.in







.









7, అక్టోబర్ 2016, శుక్రవారం

రివ్యూ!


రచన- దర్శకత్వం : చందు ఎం.
తారాగ‌ణం: చైత‌న్య అక్కినేని, శృతీహాస‌న్‌, అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, మ‌డోన్నా సెబాస్టియ‌న్‌, అవంతికా వందనపు, పృథ్వీ, బ్రహ్మాజీ, నర్రా శీను, శ్రీనివాస‌రెడ్డి, అరవింద్ కృష్ణ, చైతన్య కృష్ణ, ప్ర‌వీణ్‌, వైవా హర్ష, నోయెల్‌, అక్కినేని నాగార్జున‌, ద‌గ్గుబాటి వెంక‌టేష్‌ త‌దిత‌రులు
కథ :
అల్ఫోన్స్ పుథ‌రిన్‌, సంగీతం : గోపీసుంద‌ర్‌, రాజేష్ మురుగ‌న్‌, ఛాయాగ్రహణం : కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని
బ్యానర్ : సితార
ఎంట‌ర్ టైన్మెంట్స్‌, నిర్మాత: సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ
విడుదల : 7 అక్టోబర్, 2016

***
      నాగచైతన్యకి ఓ హిట్ కావాలి. లేకపోతే పెళ్లి ముందు ఏమీ బాగోదు. దీన్ని ఎప్పట్నించో ప్లాన్ చేస్తూ వూరిస్తూ, రకరకాల వూహాహగానాలని భరిస్తూ, చివరికి అనుకున్న మలయాళ రీమేక్ ‘ప్రేమమ్’ తో ప్రేక్షకుల ముందు కొచ్చాడు. గత దసరాకి తండ్రి నాగార్జున వచ్చి ‘సోగ్గాడే చిన్నినాయనా’ తో హోరెత్తించినట్టు ఈ దసరాకి తను వచ్చాడు. వచ్చింది హోరెత్తించడానికేనా,  లేకపోతే  బోరెత్తించడానికా ఈ కింద తెలుసుకుందాం.

కథ
    మొదటి కథ : తాడేపల్లి గూడెంలో పదో తరగతి చదివే విక్రం వాత్సల్య అలియాస్ విక్రం ప్రేమ కవితలు రాస్తూ సుమ (అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్‌) ని ప్రేమిస్తాడు. ఆమె వెంట పడే ఇంకెంత మందో ప్రేమికుల్ని అధిగమించి చివరికెలాగో చిన్న పిల్ల సింధు (అవంతికా వందనపు) కిచ్చి ప్రేమ లేఖ పంపుతాడు. రెస్పాన్స్ గా సుమ అతడింటికి వస్తానని అంటుంది. ఆనంద పడతాడు విక్రం. సుమ విక్రం ఇంటికి  తన బాయ్ ఫ్రెండ్ ని తీసుకు వచ్చి పరిచయం చేస్తుంది. ఖంగు తిన్న విక్రం ఆమె మోసం చేసిందని తిట్టుకుని, మర్చిపోవడానికి ప్రయత్నిస్తాడు. 

        రెండో కథ : ఐదేళ్ళ తర్వాత విక్రం ఇంజనీరింగ్ చదువుతూంటాడు. ఎదిగిన యువకుడి పౌరుషం, దౌర్జన్యం వగైరాలతో కాలేజీలో గ్యాంగ్ ని మెయింటెయిన్ చేస్తూ బాస్ లా చెలామణీ అవుతూంటాడు. ఆ కాలేజీకి గెస్ట్ లెక్చరర్ గా సితార (శృతీ హాసన్) వస్తుంది. మరాఠీ అయిన ఈమెని చూడగానే ప్రేమలో పడతాడు విక్రం. ఇతడితో బాటు ఓ లెక్చరర్ (నర్రా శీను) కూడా ప్రేమలో పడతాడు. ఇతడికి తోటి లెక్చరర్ (బ్రహ్మాజీ) ఐడియా లిస్తూంటాడు. విక్రం ఫీలింగ్స్ ని సితార గుర్తిస్తుంది. ఇంతలో సెలవులు రావడంతో సొంతవూరు పుణేకి బయల్దేరుతుంది. ఆ బస్సు యాక్సిడెంట్ అయి జ్ఞాపకశక్తి కోల్పోతుంది. వెళ్లి చూసిన విక్రం ఆమె తనని గుర్తించకపోవడంతో బాధపడి ఆమెని మర్చిపోవడానికి ప్రయత్నిస్తాడు. ఇంతలో  ఆమె కజిన్ (అరవింద్ కృష్ణ)  తో ఆమె పెళ్లి నిశ్చయమైందని  కబురు వస్తుంది. 

        మూడో కథ :  పదేళ్ళ తర్వాత విక్రం ఒక రెస్టారెంట్ నడుపుతూంటాడు. ముప్పయి దాటుతున్న వయసులో మెచ్యూరిటీతో వుంటాడు. ఇప్పుడు ఇంకో అమ్మాయి (మడోన్నా సెబాస్టియన్) పరిచయమవుతుంది. ఇప్పుడీమెతో ప్రేమలో పడ్డ విక్రం కథ ఏ మలుపులు తిరిగిందన్నది మిగతా కథ. 

ఎలావుంది కథ 
    మలయాళీ కథ కావడంతో వారం వారం  వెక్కిరించి  వెళ్ళిపోతున్న మన ఇడ్లీ కథలా లేదు. మనవాళ్ళందరూ కొన్నాళ్ళు కేరళలో జీవించి వస్తే తెలుగులో ఇలాంటి డిఫరెంట్ కథలు స్వయంగా తయారు చేసుకోవడంలో ప్రతిభాశాలురు కాగలరు. ఇది మూడు దశల హీరో ప్రేమ ప్రయాణం. ‘పెళ్లి చూపులు’ లాగా సెమీ రియాలిస్టిక్ కథలా సాగే ఈ కథలో మళ్ళీ మలుపులూ ముగింపూ వచ్చేసి రొటీన్ ఫార్ములా ప్రకారం వుండడమే లోపం. ఈ మలుపులూ ముగింపూ వున్నంత కృత్రిమత్వంతో పోటీ పడుతూ మళ్ళీ భావోద్వేగాలు కూడా ఒక దశనుంచి ఇంకో దశలోకి ప్రభావవంతంగా బదీలీ కాకపోకాడం ఇంకో లోపం. ఈ విషయంలో ఒరిజినల్ నే తుచా తప్పకుండా ఫాలో అయ్యరేతప్ప సరిదిద్దుకోలేదు. సరిదిద్దితే ఏమవుతుందో నన్న భయం కావచ్చు. ఏమైనా మూస ప్రేమ సినిమాలే కుప్ప తెప్పలుగా వచ్చిపడుతున్న మార్కెట్ లోకి,  కాస్త స్వచ్ఛ భారత్ పనిని  చేపట్టి వాటిని ఊడ్చేసే వూపుతో తెలుగులో ఓ ఫ్రెష్ కథ వచ్చినందుకు ఆనందించక తప్పదు.

ఎవరెలా చేశారు
      ఎక్కడ్నించో ఓ కథ పట్టుకొచ్చి రీమేక్ చేస్తే తప్ప నాగచైతన్య కి ఓ సక్సెస్ దక్కలేదు. దీన్ని బట్టి ఒక యువ స్టార్ ని నిలబెట్టడానికి తెలుగులో ఎంత సృజనాత్మక దారిద్ర్యం వుందో తెలిసిపోతోంది. ఈ అవకశాన్ని చైతన్య కష్టపడి సద్వినియోగం చేసుకున్నాడు. ఇలాటిదే కథ, పాత్ర,  తెలుగులో ఎవరైనా ఒరిజినల్ గా చేసుకుని వస్తే స్వీకరించే వాడా అన్నదీ ప్రశ్నార్ధకమే. ఇంకో భాషలో ప్రూవ్ అయితే తప్ప కొత్తదనం అక్కర్లేదనుకునే మైండ్ సెట్ స్టార్లనుంచి కూడా పోవాలి. నాగచైతన్య ఈ మూడు పాత్రల్ని ఏ పాత్రకా పాత్ర ఎదుగుదలని దృష్టిలో పెట్టుకుని సహజ నటనతో పట్టాలు తప్పకుండా చూసుకున్నాడు. పదహారేళ్ళ కుర్రాడి పాత్ర, రఫ్ గా తిరిగే యువకుడి పాత్ర, మళ్ళీ డీసెంట్ గా ప్రవర్తించే ముప్పయ్యో పడిలో పడ్డ పాత్ర. అమ్మాయిలతో వియోగాలన్నీ కూడా నిగ్రహంతో పోషించాడు. అయితే ఆ బాధ- బ్యాక్ డ్రాప్ తర్వాతి దశల్లోకి బదిలీ అయి వుంటే ఇంకా బలంగా వుండేది పాత్ర. హీరో గతం తెలుస్తున్నప్పుడు (సర్కిల్ ఆఫ్ బీయింగ్) ఆ గతం తాలూకు బాధ ప్రస్తుత జీవితంలో ప్రతిఫలించినప్పుడే ఎఫెక్టివ్ గా వుంటుంది పాత్ర చిత్రణ.

        ఇక హీరోయిన్లు ముగ్గురిలో శృతీ హాసన్ కే ఎక్కువ భాగం కథ వుంది. లెక్చరర్ పాత్రని హూందాగా పోషించుకొచ్చింది. మళ్ళీ చివర్లో వచ్చి ఫినిషింగ్ టచ్ ఇవ్వడంతో  సెంటిమెంట్స్ ని ఎలివేట్ చేసినట్టయ్యింది. మిగతా ఇద్దరు  హీరోయిన్ల పాత్రలకి ఇంత ఎమోషనల్ టచ్ లేకపోవడంతో అంతంతమాత్రంగా కన్పిస్తారు. 

        అతిధి పాత్రకి సరైన నిర్వచనం ఇప్పుడు కుదిరింది. అదీ వెంకటేష్ తో. ఆ అయిదు నిమిషాలూ కన్పించిపోయే సన్నివేశంలో ఒక సెటైర్, ఒక చరుపు, ఒక చమత్కారం, ఒక ముద్రవేసి వెళ్ళడం ఎప్పటికీ గుర్తుండి పోయే అతిధి పాత్రాభినయం. 

        అక్కినేని నాగార్జున ముగింపులో వచ్చేసి- ఇంట్లో ముద్దు చేయాల్సిన కొడుకుని ఉప్పొంగిపోతూ విశాలమైన వెండితెర మీద బహిరంగంగా చేసి - మరోసారి వియ్ ఆర్ ఫ్యామిలీ అని అనవసరంగా చాటారు. ఇది ప్రేక్షకులకి ఎప్పుడో తెలిసిందే. 

        ఇతర పాత్రల్లో ప్రతి ఒక్కరూ శృతిమించకుండా నటించారు, కొందరు నవ్వించారు. మూడో కథకి శ్రీనివాస రెడ్డి కామెడీ ప్రధాన ఆకర్షణ.
        సంగీతం, ఛాయాగ్రహణం, లొకేషన్స్, ప్రొడక్షన్ విలువలూ అన్నీ బావున్నాయి.

చివరికేమిటి 
       దర్శకుడు చందూ ఎం. మలయాళ ‘ప్రేమమ్’ ని అదే పేరుతో రీమేక్ చేసి చెడగొట్టలేదు. ఐతే గురుదత్ తీసిన ‘ప్యాసా’ లో మ్యాటరాఫ్ ఫ్యాక్ట్ తరహా కథనానికీ తను చేసిన కథనానికీ తేడా వుంది. తను చేసిన దానికి ఎమోషన్లు  ఒక కాలావధి లోంచి ఇంకో కాలావధి లోకి క్యారీ కాలేదు. ఒకటి ముగిసిపోయిన ప్రేమ దశ- దాని ప్రస్తావన గానీ ఛాయలు గానీ తర్వాతి దశలో కనిపించనక్కర్లేదనుకోకుండా,  పాత్ర దాన్ని ఫీలవుతున్నట్టు పాత్ర చిత్రణ చేసి వుంటే కథ ఇంకా బలంగా వుండేది. అదే గురుదత్ హీరో పాత్ర ఎక్కడికక్కడ బాధాకరమైన అనుభావాలని మెలోడ్రామా లేకుండా దర్శకుడు కట్ చేస్తున్నా, ఆ బాధని మనమింకా ఫీలవుతూ వుండేలా హీరో పాత్ర అప్రతిహతంగా దాన్ని మోస్తూనే వుంటుంది. 

        ఇక మలుపులూ ముగింపూ మళ్ళీ మూస ఫార్ములాయే. రీమేక్ ని అనడంలేదు, ఒరిజినల్ దర్శకుడే వీటికీ విరుగుడు కనిపెట్టివుంటే ఇప్పుడు తెలుగులో ఇంకో ఎడ్యుకేషన్ లా వుండేది. ఫస్టాఫ్ లో మొదటి కథ, రెండో కథ సగమూ బలమైన వీక్షణానుభవాన్ని ఇవ్వకపోవడానికి కారణాలివే. సెకండాఫ్ లో శృతీ హాసన్ తో కొనసాగే కథ తప్ప మళ్ళీ మూడో కథ మామూలే. అయితే పరమ పాత మూస ప్రేమ సినిమాల్ని ఈ రోజుల్లో కూడా ఎంతో ఔదార్యంతో భరిస్తున్న తెలుగు ప్రేక్షకులకి ఈ వారం ‘ప్రేమమ్’ ని ప్రీమియం ఎంటర్ టైనర్ గా ఎంజాయ్ చెయ్యొచ్చు.


-సికిందర్
http://www.cinemabazaar.in


6, అక్టోబర్ 2016, గురువారం

రివ్యూ

రచన- దర్శకత్వం: మహదేవ్‌
తారాగణం : నిఖిల్‌ గౌడ, దీప్తీ సతి, జగపతిబాబు, బ్రహ్మానందం, రఘుబాబు, సంపత్‌ రాజ్, ఆదిత్యామీనన్‌, అవినాష్‌, సుప్రీత్‌, రావు రమేష్‌, రమ్యకృష్ణ తదితరులు
కథ : విజయేంద్ర ప్రసాద్,
సంగీతం: ఎస్ ఎస్ తమన్‌,  ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస
బ్యానర్ :
చన్నాంబికా  ఫిల్మ్స్‌, సమర్పణ: హెచ్‌.డి. కుమారస్వామి,
నిర్మాత: అనితా కుమారస్వామి
విడుదల: అక్టోబర్ 6,  2016
         ***
       మాజీ ప్రధాని  హెచ్ డి దేవె గౌడ మనవడు, మాజీ కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్ డి కుమారస్వామి గౌడ కొడుకూ అయిన  నిఖిల్ గౌడ హైపర్ యాక్షన్ హీరోగా అట్టహాసంగా కన్నడ- తెలుగు వెండి తెరలకి ఈవారం పరిచయమయ్యాడు. భారీగా ఓపెనింగ్స్ వచ్చాయి. ఎస్ ఎస్ రాజమౌళి క్యాంపు నుంచి విజయేంద్ర ప్రసాద్ కథ అందించి, మహాదేవ్ దర్శకత్వం వహించి ‘జాగ్వార్’ అనే ఈ బిగ్ బడ్జెట్ సినిమాని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. దక్షిణాదిలో 75 కోట్ల బడ్జెట్ తో ఓ  కొత్త హీరోతో నిర్మించిన మొదటి సినిమాగా రికార్డుల కెక్కిన ఈ తెలుగు- కన్నడ బై లింగ్వల్ లో జగపతిబాబు, బ్రహ్మానందం, రఘుబాబు, సంపత్‌ రాజ్, ఆదిత్యామీనన్‌,  రావు రమేష్‌, రమ్యకృష్ణల వంటి హేమాహేమీల్ని  నటింపజేసి కన్నడ వాసనలు సోకకుండా జాగ్రత్త తీసుకున్నారు. ఉన్నత శ్రేణి సాంకేతికులు, ఉన్నత నిర్మాణ విలువలూ కలిగిన ఈ యాక్షన్ మూవీలో అసలు విషయమేమిటి? సూపర్ మాన్, బ్యాట్ మాన్ లాగా  జాగ్వార్ ఒక సూపర్ హీరో కథనా? టెక్నో థ్రిల్లర్ అనిపించే ఒక స్వాప్నిక జగత్ విహారమా? ఇది తెలుసుకోవాలంటే ఓసారి విషయంలో కెళ్ళాలి...
కథ  
    శౌర్యప్రసాద్ (సంపత్ రాజ్) ఎస్ ఎస్ టీవీ ఛానెల్ యజమాని. ఓ రాత్రి అతడి ఛానెల్లో ఓ హత్యా దృశ్యం లైవ్ గా ప్రసారమవుతుందని ప్రచారమవుతుంది. లక్షలాది ప్రేక్షకుల సాక్షిగా  ఓ ముసుగు వీరుడు ఓ జడ్జి (రవి కాలే) ని హత్య చేసి పారిపోతాడు. ఈ సంచలనంతో సీబీఐ అధికారి జేబీ (జగపతి బాబు)  ఆ ముసుగు వీరుణ్ణి పట్టుకోవడానికి రంగంలోదిగి, వాడికి  జాగ్వార్ అని నామకరణం చేస్తాడు. జాగ్వార్ అయిన ఎస్ ఎస్ కృష్ణ అనాధ నని చెప్పుకుని  ఏమీ తెలీనట్టు మెడికల్ కాలేజీలో చేరతాడు. ఆ మెడికల్ కాలేజీ - కమ్ - ఆస్పత్రి చైర్మన్ గా ఆదిత్య (ఆదిత్యా మీనన్) వుంటాడు. ఇదే కాలేజీలో ఆర్య (ఆదర్శ్ బాలకృష్ణన్), అతడి చెల్లెలు ప్రియ ( దీప్తీ సతి) చదువుతూంటారు. చలాకీ కుర్రాడైన ఎస్ ఎస్ కృష్ణ  ప్రియని తన ప్రేమలో పడేసుకుంటానని ఆమె అన్నని ఉడికిస్తూ  ఆమె వెంటపడుతూంటాడు. కాలేజీలో విద్యార్థి నాయకుడైన ఆర్య, ఆస్పత్రిలో అక్రమాలు జరుగుతున్నాయని ఆందోళన లేవదీస్తాడు. ఈ ఆందోళనని అణచడానికి వచ్చిన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్  శంకర్ (సుప్రీత్) ని రాత్రి పూట చంపుతూ, అదే టీవీ ఛానెల్లో మరో లైవ్ ఇస్తాడు జాగ్వార్ కృష్ణ. తమ ఛానెల్ ని ఎవడో జాగ్వార్ గాడు హ్యాక్ చేసి ఇలా హత్యల్ని లైవ్ ఇస్తున్నాడనీ ఆగ్రహించిన యజమాని శౌర్యప్రసాద్- అలాగే తమ ఆస్పత్రి అక్రమాలపై విద్యార్దులు ఆందోళన చేస్తున్నారనీ చైర్మన్ ఆదిత్యాలు- ఆర్యని  జాగ్వార్ గా అనుమానించి అతణ్ణి చంపడానికి ప్లానేస్తారు. ఈలోగా సీబీఐ అధికారి జేబీ  తన ఏజెంట్ గా పద్మనాభం  (బ్రహ్మానందం) ని  ఆదిత్య ఇంట్లోకి దింపుతాడు. కృష్ణ కూడా అదే ఇంట్లో చేరతాడు. ఇలా విలన్ల ఇంట్లో పాగావేసిన ఈ ఇద్దరూ- ఏం చేశారు? అసలు విలన్ల మీద కృష్ణ పగకి కారణ మేమిటి? ఇంకెంత మందిని ఇలా చంపుతాడు? దీనికి అతడి తల్లిదండ్రులతో (రమ్యకృష్ణ, రావురమేష్) లతో సంబంధ మేమిటి? ... ఇవన్నీ తెలుసుకోవాలంటే మిగతా సినిమా చూడాల్సిందే! 

ఎలావుంది కథ 
      తెలుగులో ప్రతీవారం వస్తున్న ఇడ్లీ కథలాగే వుంది. ఇందులో ఇంకో మాటకి తావులేదు. ఓల్డ్ మాస్టర్ విజయేంద్రప్రసాద్ చాలా ఓల్డ్ రివెంజి డ్రామాని రాసేసి శిష్యుడు మహదేవ్ కి ఇచ్చేశారు. ‘జాగ్వార్’  అంటే ఇదేదో ‘మ్యాట్రిక్స్’ లా, ‘ధూమ్ -3’ లా టెక్నో థ్రిల్లర్ అయివుంటుందని భావించుకుని కళ్ళకద్దుకుని కొత్త కుర్రాడి మీద తీసేశాడు దర్శకుడు మహాదేవ్. కొత్త కుర్రాడికి పాతిక ముప్పయ్యేళ్ళ క్రితం కథలిలా వుండేవని ఏం తెలుస్తుంది. పైగా ఒక రేస్ బైక్, స్పై కెమెరా, బ్లాక్ కాస్ట్యూమ్స్ అందిస్తే కొత్త కొత్తగానే కన్పిస్తుంది అంతా. చాలా పాత మోడల్ కథకి అత్యాధునిక హంగులు జతచేస్తే కొత్తకాలానికి చెల్లిపోదని ఈ కథతో రుజువవుతోంది. తన చిన్నప్పుడు తల్లిదండ్రులకి జరిగిన అన్యాయానికి పగదీర్చుకునే హీరో కథే పాత అనుకుంటే, ఇందులో మళ్ళీ కోన వెంకట్ బ్రాండ్- ‘సెకండాఫ్ కథలో విలన్ ఇంట్లో హీరో చేరి వాళ్ళని బకారాలని చేయు’ అనబడు సింగిల్ విండో స్కీమ్ కథ  మళ్ళీ ఇక్కడా ప్రత్యక్షమయ్యింది- ఈ మధ్య ఇలాటి కథలతో  సినిమాల గొడవ వదిలిందనుకుంటే. రచయిత విజయేంద్ర ప్రసాద్ తను ఒక సినిమా కథ రాసేముందు  విధిగా ‘షోలే’ చూస్తానన్నారు. ‘షోలే’ నే చూస్తూంటే ఎలా, ఓసారి ‘ది మాగ్నిఫిషెంట్ సెవెన్’  చివరి భాగంకూడా చూసి వుంటే ప్రస్తుత పాత కథకే  ఎంతో  వన్నె చేకూర్చే వారయ్యే వారు. పాత కథలకి వన్నె చేకూర్చేది కొత్త కథన టెక్నిక్కులే తప్ప- ఎలాటి పిక్చరైజేషన్ టెక్నాలజీ కాదు. 

ఎవరెలా చేశారు 
    కొత్త హీరోగా అడుగు పెట్టిన నిఖిల్ గౌడ శారీరకంగా సమసౌష్టవంగా వున్నా, వ్యావహారికంగా ఇంకా వికసించాల్సి వుంది. మన హీరో కాదు కాబట్టి ఎక్కువ చెప్పుకోవాల్సిన పని లేదు. జగపతి బాబు ఈ సినిమాలో ఎందుకు నటించినట్టో అర్ధంగాదు. చంపుతున్న హీరోకి జాగ్వార్ అని తనే నామకరణం చేసి, పట్టుకునే తంతు లేకుండా,  హత్యలుచేస్తూంటే ఆపే పనే లేకుండా,  సెకండాఫ్ లో కాసేపటికి సినిమాలోంచే హాయిగా అదృశ్యమైపోయే ‘నిరుద్యోగ పాత్ర’ ఎందుకు పోషించినట్టో సినిమా కథని మించిన మిస్టరీగా వుంది. కథలో విజయేంద్ర ప్రసాద్ ఇవ్వలేని లేని మిస్టరీని,  ఇలా హాయిగా తన అదృశ్యంతో తీర్చినట్టుంది. బ్రహ్మానందం, రఘుబాబుల పాత్రలు కూడా డిటో- అర్ధోక్తిలో హాయిగా అంతర్ధానమై పోతాయి. రమ్యకృష్ణ, రావురమేష్ లుకూడా హాయిగానే జీవంలేని పాత్రల్లో  కన్పిస్తారు. రావురమేష్ చాలా అనాసక్తిగా వున్నట్టన్పించే  పాత్ర పోషణ ఇదే బహుశా. ఇద్దరు విలన్లు- సంపత్ రాజ్, ఆదిత్యా మీనన్ లు- వీళ్ళే  రొటీన్ గానే అయినా కాస్త హడావిడీ చేస్తూ కన్పిస్తారు. ఇక హీరోయిన్ దీప్తీ సతి గురించి చెప్పుకోవడానికేమీ లేదు- పాటలకి, ప్రేమ సీన్లకి కన్పించే గ్లామర్ బొమ్మ పాత్ర కాబట్టి. చివరి పాటలో ఐటెం గర్ల్ గా దర్శన మిచ్చే తమన్నాతో  ఆ కాసేపూ హుషారొస్తుంది ప్రేక్షక దేవుళ్ళకి. 

        సంగీత దర్శకుడు తమన్ మళ్ళీ తన పూర్వ వైభవం కోసం విఫల యత్నం చేస్తున్నట్టు మళ్ళీ కన్పిస్తుంది ఈ సినిమాలో. బిజిఎం కూడా సరీగ్గా కుదరలేదు. మనోజ్ పరమహంస సమకూర్చిన ఛాయాగ్రహణం ఎప్పట్లాగే తన బ్రాండ్ విలువలతో చెప్పుకోదగ్గదిగా వుంది. క్లైమాక్స్ లో రామ్  - లక్ష్మణ్ లు సమకూర్చిన యాక్షన్ కొరియోగ్రఫీ చాలా కాలం తర్వాత మొనాటనీని బద్దలు కొట్టి ఫ్రెష్ గా వుంది.

చివరికేమిటి 
     నందమూరి బాలకృష్ణతో గతంలో ‘మిత్రుడు’ తో విఫలయత్నం చేసిన దర్శకుడు మహదేవ్ ప్రస్తుత మెగా మూవీతోనూ అడుగు ముందుకు వేయలేకపోయాడు. ప్రధాన కారణం స్క్రిప్టే. ప్రొడక్షన్ విలువలతో స్క్రిప్టు విలువలు సరితూగకపోవడం. ఇంత భారీ బడ్జెట్ తో ఈ స్క్రిప్టు పదునైన కత్తిలా వుండాల్సింది. మనస్కరిస్తే అలా ఉండేందుకు చాలా అవకాశముంది- కానీ ‘రుజువైన, ప్రేక్షకులకి కొట్టిన పిండి అయిన పాత ఫార్ములాయే’  చాలు మనకి సేఫ్ అనుకుంటే సానబెట్టేందుకు ఏమీ వుండదు, అసలుకే ఎసరొస్తుంది.  కానీ ‘ది మాగ్నిఫిషెంట్ సెవెన్’ కాలానికంటే  ముందుంది  కథనానికి. అందుకనే ఇవ్వాళ్ళ రిమేక్ చేసినా ఇవాల్టి సినిమాలాగే వుంది తప్ప- ‘జాగ్వార్’ లా గడిచిపోయిన కాలపు చాదస్తంలా లేదు. ముసుగు వీరుడు జాగ్వార్ మెరపులా ఎక్కడ్నించి వస్తాడో, ఎవర్ని చంపుతాడో అంతుచిక్కని మిస్టరీగా వుండాల్సింది- అతణ్ణి  రొడ్డ కొట్టుడుగా, నవ్యత లేకుండా  అదే అరిగిపోయిన కాలేజీ స్టూడెంట్ గా  మార్చేసినప్పుడే కిక్, పెప్ అంతా పోయింది. ఎన్ని సార్లు ఈ కాలేజీ కజ్జాలూ, వారం వారం చూస్తున్న అదే ఫార్ములా ప్రేమలూ పాటలూ చూస్తూ ఇంటర్వెల్ వరకూ సహనం వహించాలి? అన్ని ఆర్ధిక వనరులూ, సాంకేతిక సహాయమూ వున్న ఇలాటి మెగా మూవీస్ కూడా సగటు సినిమా విషయ విన్యాసాలతో విసుగెత్తేలా వుండాల్సిందేనా? జరుగుతున్న అక్రమా లపై  విద్యార్ధులు చేస్తున్న ఆందోళనలకి అదృశ్య శక్తిగా, ఆపద్బాంధవుడిగా, జేజేలందుకునే ఒక ఆరాధ్య దైవంలా జాగ్వార్ వుండాల్సింది పోయి- పాత మోడల్ డ్రామా లేస్తూ విలన్ ఇంట్లో కూర్చోవడమేమిటి? ఎన్ని సార్లు ఇదే చూపిస్తారు? అతనొక హ్యాకర్, టెక్నో క్రాట్, లోకానికి ఐడెంటిటీ తెలీని హైటెక్ కిల్లర్- అలాటివాడు లోకకల్యాణం కోసమే అస్త్రశస్త్రాలు ప్రయోగించాలే  తప్ప- ఓపెన్ గా సొంత పగేదో తీర్చుకుంటూ దిగజారి పోవడమేమిటి? మాకు జాగ్వారే కావాలి, జాగ్వారే రావాలి – అంటూసమాజం ఎలుగేత్తేలా ఆ వేషధారణతో,  మానవాతీత వ్యూహాలతో ఒక పురాణ పాత్ర (మిథికల్  క్యారక్టర్) లా ఆత్మిక దాహాన్ని తీరుస్తూ వుండాలే గానీ- తన స్వార్ధం కోసం తన దాహం తాను తీర్చుకునే అట్టడుగు వ్యక్తిలా వుండడ మేమిటి? 

        డెంజిల్ వాషింగ్టన్ ‘ది మాగ్నిఫిషెంట్ సెవెన్’ లో తన కౌబాయ్ గ్రూపుతో గ్రామానికి విలన్ ముఠా పీడా విరగడ చేయడానికి ఆపద్బాంధవుడిలా వస్తాడు. పీడా విరగడ చేసి, చివరికి విలన్ని చంపుతూ - ‘నా చిన్నప్పుడు  మా అమ్మనీ, ఇద్దరు చెల్లెళ్ళ నీ నువ్వు చంపావ్ గుర్తుందా?’ అంటాడు. ఈ ఎండింగ్ స్టేట్ మెంట్ కి మనం కూడా షాకవుతాం. విలన్తో అతడికి పాతపగ వుందని మనకి కూడా అప్పటివరకూ తెలియదు. ఇలా చివరికి తెలిసినప్పుడు వాషింగ్టన్ పాత్ర ఎంతో ఉన్నతంగా కన్పిస్తుంది. అతను ఇంత బాధ దాచుకుని గ్రామం కోసం చేశాడన్న మాట. హీరో అనేవాడి  మొదటి ప్రాధాన్యం  పర సుఖమే, తన సుఖం తర్వాత!

-సికిందర్
http://www.cinemabazaar.in





        


3, అక్టోబర్ 2016, సోమవారం

రివ్యూ!


సాంకేతికం :




కప్పుడు కంప్యూటర్లతో డిజైన్ చేసిన సినిమా పోస్టర్లంటే అంత దూరం పారిపోయేది  తెలుగు సినిమా రంగం. తర్వాత  అదే డిజిటల్ డిజైన్లని రుచి మరిగాక  కావాలీ-  ఇంకా కావాలీ అంటూ వెంట పడసాగింది తెలుగు సినిమా ప్రపంచం. దేశంలోనే కాదు, విదేశాలలోనూ ఏ  సినిమాకీ వుండనన్ని పోస్టర్ డిజైన్లు ఒక్క తెలుగు సినిమాలకే వుండడం కూడా టాలీవుడ్ సాధించిన ఒక  రికార్డు.

          ఎందుకిలా? ఎందుకంటే, ఇక్కడి ప్రేక్షకుల అభిరుచీ, నిర్మాతల తాపత్రయమూ కారణమని రాంరెడ్డి అలియాస్ రాము సమాధానం. రవితేజ నటించిన ‘వీర’ తో దర్శకుడిగా మారిన రమేష్ వర్మ స్థాపించిన సుప్రసిద్ధ కిరణ్ యాడ్స్ వ్యవహారాలు చూసుకుంటున్న ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ పి.  రాము నిజానికి మాన్యువల్ తరం నుంచి వచ్చిన కళాకారుడు. నల్లగొండ జిల్లా వెలిగొండ మండలం ఆరూరు గ్రామానికి చెందిన వ్యవసాయదారుడైన తండ్రికి గల చిత్రలేఖనం హాబీని చూసి తనూ కుంచె పట్టిన రాము, ప్రఖ్యాత పబ్లిసిటీ డిజైనర్ గంగాధర్ కుమారుడు శంకర్ దగ్గర శిష్యరికం చేసి, తన కళకి మరింత పదును  పెట్టుకుని వచ్చి కిరణ్ యాడ్స్ లో చేరిపోయారు.

          అప్పుడదంతా కంప్యూటర్స్ ప్రపంచం. 1998లో ఓ కంప్యూటర్ మీదే స్వతంత్రంగా తన మొదటి సినిమా పోస్టర్ డిజైన్ చేశారు రాము. ఆ సినిమా పేరు ‘బావగారూ బావున్నారా?’. అప్పటినుంచీ  కొన్ని వందల స్టార్ సినిమాలకి పోస్టర్స్ వేస్తూ వస్తున్నారు.

          అసలు కంప్యూటర్ పోస్టర్స్ డిజైనింగ్ ని దక్షిణాదిన పరిచయం చేసింది రమేష్ వర్మే. పూర్తిగా మాన్యువల్ కి అలవాటైన ఆ కాలంలో నిర్మాతలు కంప్యూటర్ పోస్టర్లని అస్సలు ఒప్పుకునే వాళ్ళు కాదు. అలాటిది నెమ్మదిగా వాటిని అలవాటు చేశారు వర్మ. అలాగే స్టిల్ ఫోటోగ్రఫీ లోనూ డిజిటల్ కెమెరాని ప్రవేశ పెట్టింది తనే. వినైల్ బోర్డుల్ని పరిచయం చేసింది కూడా తనే. ఇంతే కాదు, బొటాబొటీగా సంపాదించుకుంటూ, పెద్దగా గుర్తింపు కూడా పొందని పబ్లిసిటీ ఆర్టిస్టులకి  చీఫ్ టెక్నీషియన్ గా గుర్తింపు తీసుకొచ్చి అత్యధిక పారితోషికం (5 లక్షలు) పొందిన ఘనత కూడా ఈయనదే.

      స్టూడియోలో రాము తన కుంచె పనిని (లోగోలు వేసే పనిని) అవుట్ సోర్సింగ్ ఇచ్చేసి పూర్తిగా ఫోటోషాప్ కి అంకితమైపోయారు. బయటి ఆర్టిస్టులు రూపొందించిన లోగోలని మెరుగు పరచి సెలక్షన్  కోసం నిర్మాతలకి పంపిస్తారు. అయితే ఇప్పుడు శతదినోత్సవాల సినిమాల్లేని కాలంలో, పోస్టర్  డిజైనింగ్ స్టూడియోల దగ్గర నుంచీ ప్రింటింగ్ ప్రెస్సుల వరకూ పనీపాటలు  తగ్గిపోలేదా అంటే, పనీపాటలు  ఇంకా బాగా పెరిగాయన్నారు రాము. రెండు మూడు వారాల్లోనే వసూళ్లు రాబట్టుకునే వ్యూహంతో వందలాది థియేటర్లలో సినిమాలు విడుదల చేస్తున్నప్పుడు  పబ్లిసిటీ వ్యయం భారీగా పెరిగిందన్నారు. ఇదివరకు ఇరవై లక్షల రూపాయలు సరిపోతే, ఇప్పుడు ముప్పయి కోట్ల సినిమాకి 3 కోట్ల రూపాయలు పబ్లిసిటీకి ఖర్చవుతొందన్నారు. ఈ లెక్కన పబ్లిసిటీ రంగం అభివృద్ధి పథంలోనే వుందని వివరించారు.

          పోస్టర్ల మీద సెన్సార్ సర్టిఫికేట్ల ముద్రణ ఎందుకు మానేశారని అడిగితే,  విడుదలకి చాలా ముందే పోస్టర్లు తయారై పోతాయి గనుక, విడుదలకి రెండ్రోజుల ముందు సినిమా సె న్సారైనప్పుడు U, U/A, A  మొదలైన రేటింగ్స్ ని ముద్రించడం ఎలా కుదురుతుందన్నారు. బాలీవుడ్లో  నెల రోజుల ముందే సెన్సారవడం వల్ల అక్కడ పోస్టర్ల మీద సెన్సార్ సర్టిఫికెట్లు ముద్రించడం కుదురుతోందన్నారు రాము.

         ఒక పోస్టర్ని సృష్టించాలంటే రాముకి ఒక్కోసారి అరగంటే పట్టొచ్చు, ఒక్కోసారి రోజంతా కూడా పట్టొచ్చు. సమయం ఎంత పట్టినా క్వాలిటీ మీద దృష్టి పెడతారు. షూటింగ్ స్పాట్స్ లో స్టిల్స్ తీసి అందించే  స్టిల్ ఫోటోగ్రాఫర్లు తమ స్టిల్స్ ఎలా వచ్చినా అవి రాము చేతిలో క్వాలిటీని సంతరించుకుంటాయన్న నమ్మకంతో వుంటారు. లోగోలని రాము అవుట్ సోర్సింగ్ ఇవ్వడానికి కారణం నల్గురి నుంచి వైవిధ్యం వస్తుందనే. అదే తనే వేస్తె మొనాటనీ వుండొచ్చు. మరి ఆ మొనాటనీ పోస్టర్ డిజైనింగ్ తో వుండదా అని ప్రశ్నిస్తే, ఈ రంగంలో టాప్ పొజిషన్లో  వుండాలంటే అనుక్షణం కొత్తదనం కోసం పాటుపడాల్సిందే నన్నారు రాము.

-సికిందర్
(జులై 2011 ఆంధ్రజ్యోతి)




30, సెప్టెంబర్ 2016, శుక్రవారం

రివ్యూ!

రచన - దర్శకత్వం: సంతోష్‌ శ్రీన్‌వాస్‌
తారాగణం: రామ్‌, రాశీఖన్నా, సత్యరాజ్‌, మురళీశర్మ, రావు రమేష్‌, పోసాని కృష్ణమురళి, హేమ, ప్రియ, ప్రభాస్‌ శ్రీను తదితరులు.
మాటలు: అబ్బూరి రవి సంగీతం: జిబ్రాన్‌ చాయా గ్రహణం: సమీర్‌రెడ్డి,
నిర్మాణ సంస్థ: 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌
నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌సుంకర
విడుదల : సెప్టెంబర్ 30, 2016
***


         
కైనెటిక్ స్టార్ రామ్ మళ్ళీ తన మాస్ మసాలా వ్యామోహంతో ఆ వర్గ ప్రేక్షకులకోసం ‘హైపర్’ అంటూ వచ్చేశాడు. రామ్ తో ‘కందిరీగ’  తీసిన దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ఈ సారి రామ్ తో తండ్రీ కొడుకుల అనుబంధంతో  మాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవచ్చనుకున్నాడు. ఇద్దరూ కలిసి మాస్ కోసం ఏమేమో చేసుకుంటూ పోయారు. ఇన్ని చేసినా  ఎంత నిబద్ధతతో చేశారో ఈ  కింద చూద్దాం. 

కథ 

        బీటెక్ చదివిన సూరి (రామ్) ఫ్రెండ్స్ తో ఆవారాగా తిరుగుతూంటాడు. వెనకనుంచి ఓ అమ్మాయి( రాశీ ఖన్నా) నడుం చూసి ఆమె ప్రేమలో పడిపోయి, అమ్మాయిల బ్యాక్ లు చూస్తూ ఆమెకోసం వెతుకుతూంటాడు. ఇతడికి తండ్రి నారాయణ మూర్తి (సత్యరాజ్) అంటే ఇ తడి మాటల్లోనే ‘పిచ్చ ప్రేమ’. ఆ ప్రేమతో తండ్రి కోసం ఏమైనా చేస్తాడు. భవంతుల నిర్మాణాలకి  అనుమతులిచ్చే శాఖలో పనిచేస్తూంటాడు తండ్రి.  తండ్రి తో బాటు ఓ తల్లీ చెల్లెలూ వుంటారు సూరికి. ఓ రోజు తండ్రిని ఓ రోడ్డు ప్రమాదం నుంచి కాపాడతాడు గజ (మురళీ శర్మ) అనే గూండా. దీంతో సూరి గజ వెంటపడి వాడికోసం ఏ పనైనా  చేసేస్తూంటాడు. సూరీ గజా ఇద్దరూ ఫ్రెండ్స్ అవుతారు. ఇప్పుడు మంత్రి రాజప్ప  ( రావురమేష్) కట్టబోయే ఓ పెద్ద కాంప్లెక్స్ నిర్మాణపు  ఫైలు తండ్రి దగ్గరి కొస్తుంది. అది సక్రమంగా లేదని సంతకం పెట్టనంటాడు సూరి తండ్రి. రాజప్ప గజకి పురమాయించి వెళ్ళిపోతాడు. నారాయణ మూర్తి సూరి తండ్రి అని తెలియక బెదిరిస్తూంటాడు గజ. తర్వాత తెలుసుకుని చేతులెత్తేస్తే, మళ్ళీ మంత్రి రాజప్ప రంగంలోకి దిగుతాడు. వీళ్ళ కుట్ర తెలిసిపోయిన సూరి,  రాజప్ప చేతే అతడి రాజీనామా లేఖ మీద సంతకం పెట్టిస్తానని ఛాలెంజి చేస్తాడు. ఈ ఛాలెంజిగా  సాగేదే మిగతా కథ. 

ఎలావుంది కథ 
        ఇడ్లీ బండీవాడు రోజూ ఇడ్లీలే వేస్తూంటే జనాలు తినడం లేదూ? అలాగే ఇడ్లీలూ సినిమాలూ ఒకటేనని భావించుకుని చూసేసే మొహం మొత్తని జనాలకోసం అన్నట్టు వుంది ఈ రొడ్ద కొట్టుడు రొటీన్ కథ. టాలీవుడ్ ని ‘ఇడ్లీవుడ్’ గా వుంచేస్తూ తన వంతు కూడా కృషిచేస్తున్న స్టైలిష్ కైనెటిక్ స్టార్ రామ్ ని అభినందిస్తూ, కలకాలం తను ఇలాగే కొనసాగాలని కోరుకోవాలన్నంత ‘పిచ్చపిచ్చ’ గా వుందీ కథ. ఇందులో ‘హైపర్’ గా ఏముందో వెతుక్కోలేనంత భారీ ప్యాకేజీతో వుందీ కథ. ఈ ప్యాకేజీలో స్టోరీ పాయింటు వచ్చేసి ‘జనతా గ్యారేజ్’ మున్సిపల్ ఆఫీసు సీనుగానూ, హీరో వచ్చేసి విలన్ ని ప్రేమించే ‘జక్కన్న’ టైపు క్యారక్టర్ గానూ, ఇక  క్లయిమాక్స్ వచ్చేసి టీవీ ఛానెల్స్ తో ‘రేసుగుర్రం’ మార్కు క్లయిమాక్స్ గానూ వుండేసి-  చూసిందే చూడమని- పనిలోపనిగా - ప్రభుత్వోద్యోగులకి ఓ ప్రభోదాత్మక సందేశమిచ్చే  సెమీ- నారాయణమూర్తి కథలాగానూ వుంది. 

ఎవరెలా చేశారు 
      కైనెటిక్ స్టార్ రామ్ 4 - జి కాలంలో ఇంకా 2- జి సినిమాల దగ్గరే ఆగిపోవడం చాలా ఆశ్చర్యం కల్గించే విషయం. సినిమాలెప్పుడూ ఇంకా 1-జి,  2- జిలు గానే వుంటాయను కోవడం విచారకరం. సరే, ఈ పాతచింతకాయ  మూస మాస్ కథనైనా, పాత్రనైనా, కాస్త చూడబుల్ గా ఉండాలంటే ఏం చేయవచ్చో కూడా ఆలోచించకపోవడం అన్నిటికన్నా విషాదం. చాలా సింపుల్ గా, అదే సమయంలో బలంగానూ చెప్పే అవకాశమున్న కథని, పాత్రనీ  ఏమేమో చేసి ఏదేదో చేసి బుర్ర తినేస్తే ఎలా? తండ్రిని పిచ్చగా ప్రేమించడమనే పాయింటు తనకి  ఆకర్షణీయంగా కన్పించినంత మాత్రాన మిగతా అంశాలూ ఆకర్షణీయంగా ఉండేట్టు చూసుకోవాల్సిన అవసరం లేదా?  ఇంతా  చేసి క్లయిమాక్స్ ని ప్రారంభించింది కూడా ఒక హీరో పాత్రగా తను కాకపోతే ఎలా?  హీరోయిన్ తో చాలా బోరు కొట్టే ప్రేమలో పడేసే సీన్లు రొటీన్ ఇడ్లీ కల్చర్ లో భాగమే అనుకుందాం, ఆ ఇడ్లీలో మినపప్పు కూడా వేయరా?  ఇలా 5-జి ఇడ్లీలు తయారు చేద్దామనుకుంటున్నారా?

          హీరోయిన్ రాశీ ఖన్నా ని ఆ పాత్రలో చూస్తే చాలా జాలేస్తుంది. ముందు అమాయకంగా వుండే తను తర్వాత రామ్ కంటే హైపర్ గా మారిపోతుంది. సడెన్ గా ఈ మార్పు  ఒవర్ యాక్షన్ లాగా వుంటుంది. కానీ మాస్ కోసం ఈ సినిమా కాబట్టి ఎలా వున్నా అదే వరమని  చూసేస్తారు తప్పదు.

          తండ్రి పాత్ర సత్య రాజ్ ది  ఏకపక్ష వ్యవహారమే. తనని అంత  ప్రేమించి, తన కోసం అంత చేసే కొడుక్కి ఏమీ ఇచ్చినట్టు కన్పించడు. తండ్రీ కొడుకుల అనుబంధం- మధ్యలో విలన్ తో సమస్య- ఆ సమస్యని తీర్చడం అని సింపుల్ గా ఉండాల్సిన పాయింటులోకి ఎన్నెన్నో విషయాలు, ఉపకథలూ, ఒకడి మీద ఇంకో విలన్ పాత్రలూ పెట్టేసి గందరగోళం సృష్టించడంతో సత్యరాజ్- రామ్ ల బాండింగ్ గల్లంతయి పోయింది. కనీసం వాళ్ళిద్దరి మీద ఒక పాట పెట్టినప్పుడే కదా ఆ అనుబంధమైనా బలంగా నాటుకునేది. తండ్రీ కొడుకుల మీద పాట ప్రేక్షకులు ఒప్పుకోరనా? 

          ఒకటో విలన్ గా మురళీ శర్మ, రెండో కృష్ణుడు రెండో విలన్ గా, మంత్రిగా రావురమేష్, రెండో నంబర్ మంత్రి గా జయప్రకాష్ రెడ్డి, ముఖ్యమంత్రిగా విశ్వనాథ్, ఇంకా సత్యరాజ్ పైన ఒకటో నంబర్ ఆఫీసర్ గా సాయాజీ షిండే తదితరుల సోపానక్రమం క్రమంగా బలహీనపడి పోతుంది కథలో.

          మలయాళ సంగీత దర్శకుడు జిబ్రాన్ తెలుగుపాటలు కుదరలేదు- ఒక్క చివరి టైటిల్ సాంగ్ తప్ప. సమీర్ రెడ్డి ఛాయాగ్రహణం హైపర్ గా ఏమీ లేదు. ‘హైపర్’ టైటిల్ కి తగ్గట్టుగా స్టయిలిష్ గా ఏమీ తీయలేదు.

చివరికేమిటి?
       ‘కందిరీగ’ తో సెకండాఫ్ సిండ్రోమ్ ని  అంత బాగా అధిగమించగల్గిన దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ఆ తర్వాత  ‘రభస’ తో, మళ్ళీ ఇప్పుడు ‘హైపర్’  తో స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ అనేదొకటుంటుందని పూర్తిగా మర్చిపోయినట్టుంది.  తూర్పుకి తిరిగి రోడ్డు వేసుకుంటూ పోతూంటే  బెజవాడకి  రూటు అదే పడుతుందన్నట్టు, ఏమేమో సీన్లు వేసుకుంటూ పోయారు. అనవసర సీన్లు వేసుకుంటూ పోయారు. బలహీనంగా,  హీరోని పాసివ్ గా మార్చేసే సీన్లు  ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అమర్చుకుంటూ పోయారు- ఈ అమరికలో మాటల  రచయిత పాత్ర  కూడా ఉందేమో తెలీదు. ఈ కథ మొత్తాన్నీ పరిశీలిస్తే హీరో కిడ్నాపయ్యే సీను ప్లాట్ పాయింట్ వన్ గా పెట్టుకోవాలి. అంటే హీరో తండ్రి మీద విలన్ వొత్తిడి తెచ్చే క్రమమంతా ఈ లోపే అరగంటలో ముగిసిపోవాలి. ఆ తర్వాత హీరో కాబోయే బావని కిడ్నాప్ చేసి- హీరోని తండ్రి నుంచి విడగొట్టే మెయిన్ విలన్ అయిన మంత్రి కుట్ర తో ఇంటర్వెల్ రావాలి. ఈ టైమింగ్స్ తో ఈ రెండు మూలస్థంభాల  ఆధారంగా ఈ మొత్తం కథా  నడిపివుంటే- కేవలం సంతకం చుట్టూ కథ అని కాకుండా, సంతకం చెయ్యని కారణంగా భౌతికంగా ఇంకేదో భారీ నష్టం కూడా చూపించి వుంటే -  ఇడ్లీ కథయినా చూడబుల్ గా వుండేది! 


-సికిందర్
http://www.cinemabazaar.in