రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

5, ఏప్రిల్ 2017, బుధవారం

          (కవర్ స్టోరీ మిగతా భాగం)
    మరి ఇంతటి డిటెక్టివ్ ఇంటికెళ్ళి పోవాల్సిన పరిస్థితి ఎందుకేర్పడింది? రచయితల సరుకు అయిపోయిందా? అదేం కాదు, సమాజమే దాని రూపు రేఖలు మార్చుకుంది. కాలక్రమంలో  నేరాల స్వభావం మారింది, తీవ్రతా విస్తృతీ పెరిగాయి. అగథా క్రిస్టీ నవలల్లో లాగా నేరమనేది గ్రామీణ జీవితానికే, ఇరుగుపొరుగు ఇళ్లకే  పరిమితం కాలేదు. గ్రామాల్లో  జరిగే చిన్న చిన్న నేరాలకి సైతం మూలాలు  మాఫియా సంస్కృతి వల్లనైతే నేమి, ఇతర వ్యవస్థీకృత ముఠాల వల్లనైతే నేమి, ఇంకేదో దేశంలో ఏ మారు మూలనో వుంటున్నాయి. ముంబాయిలో పేలుళ్లు జరిపి దావూద్ ఇబ్రహీం అనే వాడు దుబాయిలోనూ కరాచీలోనూ తల దాచుకుంటున్నాడు. మళ్ళీ అక్కడ్నించీ నేరాలు సాగిస్తున్నాడు. రాయల సీమ ఫ్యాక్షన్ పోరు హైదరాబాద్ వీధుల దాకా ప్రాకింది. కోలా కృష్ణమోహన్ అనేవాడి లీలల కిటుకు లండన్లో వుంటోంది... 

         
లాటి పరిస్థితుల్లో నేరాల్ని అరికట్టాలంటే ఏకవ్యక్తి  వ్యవహారం చాలదు. ఎలాగైతే నేరస్థ ముఠాలు విస్తృత నెట్ వర్క్ ని ఏర్పాటు చేసుకుంటున్నాయో, అలా వాళ్ళని దండించే వ్యవస్థలకి అంత కన్నా ఎక్కువ స్థాయిలో నెట్ వర్క్ వుండాలి. సంబంధిత అంతర్రాష్ట్ర,  అంతర్జాతీయ విభాగాలతో సమన్వయముండాలి. ఇది ఒక్క పోలీసు వ్యవస్థకే సాధ్యమవుతుంది తప్ప ప్రైవేట్ డిటెక్టివ్ వల్ల  కాదు. సాధారణంగా పడక్కుర్చీ మేధావి అయివుండే ప్రైవేట్ డిటెక్టివ్ తర్కవితర్కాలకి ఈ నేరాలు లొంగి రావు. కార్య క్షేత్రంలోకి దూకాలి, పరుగులు పెట్టాలి, వేటాడాలి. డిటెక్టివ్ యుగంధర్, డిటెక్టివ్ నర్సన్, డిటెక్టివ్ పరశురాం లాంటి పాత్రలు విదేశాలకీ వెళ్లి శత్రువుల పనిబట్టిన కథలున్నాయి. యుగంధర్ టిబెట్ వెళ్లి దలైలామాని కాపాడేడు. నర్సన్ అసిస్టెంట్ కృపాల్ తో కలిసి విదేశంలో చేసే ఒక అడ్వెంచర్ లాంటిదే రాజేంద్రకుమార్, వహీదా రెహమాన్ లతో ఎస్ఎస్ వాసన్ తీసిన ‘షత్రంజ్’ (చదరంగం- 1969) అనే హిందీ సినిమాలో వుంటుంది. డిటెక్టివ్ పరశురాం కూడా ఎన్నో దేశాలు తిరిగి వచ్చాడు. డిటెక్టివులుగా స్థానికంగా దేశవాళీ హత్య కేసులు పరిశోధిస్తూనే,  అడపాదడపా విదేశాల్లో గూఢచారి  పాత్ర కూడా నిర్వహించాయీ పాత్రలు. షెర్లాక్ హోమ్స్, హెర్క్యూల్ పైరట్ లు కూడా గూఢచారి పాత్ర పోషించిన డిటెక్టివ్ పాత్రలే. కానీ ఫిలిప్ మార్లో, లివ్ ఆర్చర్, ట్రావిస్  మెక్ గీ లాంటి డిటెక్టివ్ పాత్రలు కుటుంబాల్లో జరిగే నేరాల పరిశోధనలకే పరిమితమయ్యాయి. 1954 లో ఇయాన్ ఫ్లెమింగ్ సృష్టించిన బ్రిటిష్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ జేమ్స్ బాండ్- 007 పాత్ర ఆగమనంతో గూఢచారి పాత్రకి ప్రొఫెషనలిజం అబ్బింది. ఈ పని డిటెక్టివ్ లు చేస్తే పాఠకులకి వాస్తవికత అడ్డుతగులుతోంది. 

ఇయాన్ ఫ్లెమింగ్
        రోడ్డు మీద హత్య, అపార్ట్ మెంట్ లో మానభంగం, వ్యాపారి కొడుకు  కిడ్నాప్ లాంటి వ్యక్తి చుట్టూరా   నేరాలు ప్రజల దృష్టి నాకర్షించినంత కాలం, డిటెక్టివ్ పాత్రలకి బాగానే చెల్లు బాటయ్యేది. ఎపుడైతే ఈ పరిధి దాటుకుని నేరాలు అసాంఘీక శక్తుల చేతుల్లో ఆక్టోపస్ లా వ్యాపించి, తీవ్రత కూడా పెంచుకుని నిత్యకృత్యాలై పోయాయో, అప్పుడిక ప్రజల దృష్టి వాటి మీదికి మళ్ళింది. వాటి ముందు డిటెక్టివ్ లు పరిశోధించే  మామూలు హత్య కేసులు వెలవెలబోయాయి. ఇప్పుడు వ్యవస్థీకృత ముఠాల పనిబట్టాలంటే యాక్షన్ ఓరియెంటెడ్ పాత్ర కావాలి, పడక్కుర్చీ మేధావులైన డిటెక్టివ్ పాత్రలు కాదు. తెలుగులో ఈ డిటెక్టివ్ పాత్రల స్థానాన్నిమధుబాబు సృష్టించిన యాక్షన్ హీరో  షాడో మెల్లమెల్లగా ఆక్రమించ సాగాడు. పూర్తిగా ఆక్రమించి డిటెక్టివ్ పాత్రల్ని వెనక్కి  నెట్టేశాడు. 

          అయితే షాడో ఏ ఇన్వెస్టిగేషన్ తోనూ పనిలేని అడ్వెంచర్స్ చేసే పాత్ర. దాని తరహా వేరు. నెట్ వర్క్ ని నెట్ వర్క్ తోనే ఛేదించడం సాధ్యం. ఈ పని ప్రభుత్వ శాఖ అయిన పోలీసు వ్యవస్థకే వీలవుతుంది.  పోలీసులకుండే లాబ్ వసతి, రికార్డుల సదుపాయం, సమాచార సౌలభ్యం, ఇన్ఫార్మర్ ల తోడ్పాటూ  మొదలైనవి  ప్రైవేట్ డిటెక్టివ్ ల అందుబాటులోకి రావు.  ఒక హత్య జరగ్గానే ఏ అధికారమూ లేని  డిటెక్టివ్ ఆ ఘటనా స్థలానికి వెళ్ళిపోతాడు. ఇన్స్ పెక్టర్ సెల్యూట్ కొట్టి సాదరంగా ఆహ్వానిస్తాడు. హత్యాస్థలంలో అన్నీ చూపిస్తాడు. డిటెక్టివ్ క్లూస్ పట్టుకుంటాడు. తనే కేసు పరిశోధించి,  పరిష్కరించి శెభాష్ అన్పించుకుంటాడు. తనే హీరో, పోలీసులు జీరోలు.  నిజంగా ఇలా ఎక్కడైనా జరుగుతుందా? ప్రతీ డిటెక్టివ్ రచయితా చేసిన పని ఇదే. ఏదో కాలం కలిసివచ్చి ఆ పాత్రల్ని అలా రాసి ఆరాధ్య దైవాలు చేశారు కాబట్టే  పాఠకులూ వాస్తవికత చూడకుండా  అభిమానించారు. ఎంత లైసెన్సు వున్న ప్రైవేట్ డిటెక్టివ్ అయినా ఇలాటివి చేయలేడు. పోలీసులూ  రానివ్వరు. 

ఎర్ల్ స్టాన్లీ గార్డెనర్ 
        ఎర్ల్ స్టాన్లీ గార్డెనర్ సృష్టించిన క్రిమినల్ లాయర్ పాత్ర పెర్రీ మేసన్ తో ఇదంతా
వాస్తవికంగా  వుంటుంది. అతను వెళ్ళిన చోట హత్య జరిగి వుంటే ఏదీ ముట్టుకోకుండా వెంటనే పోలీసుల్ని పిలుస్తాడు. పోలీసులు వచ్చి అతన్నే ఇబ్బంది పెడతారు. ఫేమస్ లాయరని సెల్యూట్ కొట్టరు. పెర్రీ మేసన్ కూడా ప్రోటోకాల్ పాటించి వెళ్ళిపోతాడు. పోలీసులే  కేసు దర్యాప్తు చేస్తారు. పెర్రీ మేసన్ కి పాల్ డ్రేక్ అనే ప్రైవేట్ డిటెక్టివ్ వుంటాడు. కేసులోంచి తన క్లయింట్ ని కాపాడడానికి మేసన్,  డ్రేక్ చేత సీక్రేట్ గా పరిశోధన చేయిస్తాడు. ఆ సాక్ష్యాధారాలతో కేసు సంగతి కోర్టులో చూసుకుంటాడు. ఈ కోర్టు సీన్లే మనకి చలిజ్వరం తెప్పిస్తాయి. ఇదంతా ప్రొఫెషనల్ గా వుంటుంది. 

          కాబట్టి నెట్ వర్క్ నేరాలతో  వాస్తవికత  డిటెక్టివ్ పాత్రలకి ప్రతిబంధకంగా మారింది. పైన చెప్పిన పోలీస్ నెట్ వర్క్ లో కూడా  డిటెక్టివ్ ని ఇన్వాల్వ్ చేసి రాస్తే చాల అసహజంగా వుంటుంది.  షెర్లాక్ హోమ్స్ అయినా కేవలం అతడి కుశాగ్రబుద్ధి చేత  ఈ కాలంలో ఇలాటి కేసులు పరిష్కరిస్తున్నట్టు రాయడానికి పూనుకోలేరు. కనుక డిటెక్టివ్ పాత్రలు అస్తిత్వ సమస్యలో పడ్డాయి.

          ఈ నేపధ్యంలో ఇంగ్లీషు సాహిత్యంలో  పోలీస్ డిటెక్టివ్ అనేవాడు అవతరించాడు (బ్రిటన్ నుంచి రూత్ రెండెల్ నవలలు). ఇతను పోలీసు శాఖలో ఉద్యోగియే. డిటెక్టివ్ ఇన్స్ పెక్టర్, డిటెక్టివ్ సబిన్స్ పెక్టర్ అని మన దగ్గరా వున్నారు. అయితే ఈ పాత్రలు మన డిటెక్టివ్ సాహిత్యంలో కొచ్చేసరికి  డిటెక్టివ్ లకి సహకరించే పక్క పాత్రలుగా వుండి పోయాయి ( డిటెక్టివ్ ఇన్స్ పెక్టర్ స్వరాజ్య రావు- కొమ్మూరి సాంబశివరావు, డిటెక్టివ్ ఇన్స్ పెక్టర్ బాలకృష్ణన్- సికిందర్). పాశ్చాత్య సాహిత్యంలో పోలీస్ డిటెక్టివ్ వచ్చేసి స్వతంత్రుడైపోయాడు. ఈ పోలీస్ డిటెక్టివ్ పాత్రలు కేవలం తమ అఖండ మేధాశక్తి తోనే గాక, ఆధునిక ఫోరెన్సిక్ సైన్సు, కంప్యూటర్ ప్రోగ్రాములు వంటి అండదండలతో నేర పరిశోధనని శాస్త్రీయంగా మార్చుకుని ముందుకు సాగుతారు. సమాజంలో చోటు చేసుకునే పరిణామాలు తప్పకుండా సాహిత్యంలో ప్రతిబింబిస్తాయి గనుక, క్రైం  సాహిత్యపు రూపు రేఖలు అలా పూర్తిగా మారిపోయాయి. దీంతో  ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల ఆధునిక క్రైం సాహిత్యంలో డిటెక్టివ్ తన స్థానాన్ని కోల్పోయాడు. గడచిన నలభయ్యేళ్ళ కాలంలో ఆంగ్లంలో కొత్తగా డిటెక్టివ్ పాత్ర సృష్టి ఏదీ జరగలేదు. వున్న డిటెక్టివ్ కథలే పునర్ముద్రిస్తున్నారు. తెలుగులో అదీ లేదు. కొమ్మూరి  జీవించినంత కాలం ఆయన సొంత పబ్లికేషన్లో యుగంధర్ సిరీస్ పునర్ముద్రణలు పొందేవి. 

అగథా క్రిస్టీ
       సరే, తెలుగు సాహిత్యంలో డిటెక్టివ్ క్యారెక్టర్ అడ్రసు గల్లంతయ్యాక, కాల్పనిక క్రైం కథల స్థానంలో రియల్ క్రైం స్టోరీస్ ప్రవేశించాయి. పాశ్చాత్య దేశాల్లో లాగా వెంటనే పోలీస్ డిటెక్టివ్ ని ఎవరూ అందుకోలేదు. ఈ వ్యాసకర్త ‘అపన’ లో రాసినప్పుడు అవన్నీ ఫోరెన్సిక్- మెడికో లీగల్ ప్రొసీజర్స్ తో కూడిన హత్య కేసుల దర్యాప్తులే. అంటే సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్. దీన్ని ప్రైవేట్ డిటెక్టివ్ లకి ఆపాదించి రాయడం అసహజంగానే వున్నా, లాల్ అండ్ జాన్ అనే పాత్రలు పాపులర్ అయ్యాక అవేం చేసినా చెల్లిపోయింది. విమర్శలు రాలేదు. విషయం ఆకర్షించింది. ఈ డిటెక్టివ్ పాత్రల ప్రత్యేకత గురించి ఎడిటర్ శ్యామ దామోదర రెడ్డి గారు సంపాదకీయాల్లో రెండు మూడు సార్లు పేర్కొన్నారు కూడా. డిటెక్టివ్ లాల్ అండ్ జాన్ ల పరిశోధనలు డిటెక్టివ్ సాహిత్యానికే వన్నె తెస్తున్నాయన్నారు. కానీ మొత్తంగా డిటెక్టివ్ సాహిత్యమే కట్ట కట్టుకుని అటకెక్కాక,  ఇంకే పోలీస్ డిటెక్టివ్ ఆలోచనే ఎవరికీ రాలేదు. ఛానెల్స్ వచ్చి పుస్తకమే చచ్చిపోయాక, డిటెక్టివుల గురించి మాట్లాడే పనే లేకుండా పోయింది. 

        అలా తెలుగు సాహిత్యంలో డిటెక్టివ్ అనే పాత్రకి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది.
          మెదడుని  పదునెక్కించేదీ, పరిశీలనా శక్తిని పెంచేదీ; ఇంగిత జ్ఞానాన్ని, తార్కిక బుద్దిని, సమయ స్ఫూర్తి నీ, సూక్ష్మదృష్టినీ  పరిపుష్టం జేసేదీ, వేగవంతమైన ఆలోచనా శక్తిని కల్పించేదీ డిటెక్టివ్ కథే. ప్రైవేట్ డిటెక్టివ్ కావొచ్చు, పోలీస్ డిటెక్టివ్ కావొచ్చు- డిటెక్టివ్ ఎప్పుడూ న్యాయం వైపే వుంటాడు. కక్కుర్తి పడి అన్యాయం చెయ్యడు. మంచిని కాపాడతాడు. అతడి మాటా  ప్రవర్తనా నిజాయితీతో, బాధ్యతతో కూడుకుని వుంటాయి. నెగెటివ్ భావాల్ని రెచ్చ గొట్టే పనికి డిటెక్టివ్ దూరం –బహుదూరం.
                                                         
***
ఇతర భాషల్లో డిటెక్టివ్ లు...
          మన దేశంలో ఇతరభాషల్లో డిటెక్టివ్ పాత్ర లెలా వున్నాయో చూస్తే, బెంగాలీలో సత్యజిత్ రే సృష్టించిన ప్రసిద్ధ ‘ఫెలూదా’ వున్నాడు. చార్మినార్ సిగరెట్ తాగుతూ, స్టేట్స్ మన్ దిన పత్రిక  చదివే ఈ డిటెక్టివ్ పాత్ర వెంట తోప్షే అనే టీనేజర్ వుంటాడు. ఈ జంటని ముంబాయి నుంచీ ఖాట్మండూ వరకూ ఎక్కడికైనా తిప్పేవారు సత్యజిత్ రే. సోనార్ కెల్లా, జై బాబా ఫెలూ నాథ్ అనే రచనల్ని తెర కెక్కించారు కూడా. బెంగాలీ లోనే శిబరాం చక్రవర్తి అనే హాస్య రచయిత సృష్టించిన డిటెక్టివ్ కొల్కే కాశీ  అనే కామిక్ పాత్ర వుంది. మనోరంజన్ భట్టా చార్య  అనే మరో రచయిత హుక్కా కాశీ అనే మరో డిటెక్టివ్ పాత్రని సృష్టించారు. ఇక శరదిందు బందోపాధ్యాయ అయితే ఏకంగా దేశవాళీ షెర్లాక్ హోమ్స్ నే సృష్టించారు. పాత్ర పేరు బ్యాంకేష్ బక్షీ. గంగోపాధ్యాయ అనే మరొకాయన కాకా బాబూ అనే డిటెక్టివ్ నీ, సమ రేష్ బోస్ గగోల్ అనే బాల డిటెక్టివ్ నీ సృష్టించారు. 1960లలో రచయిత నిహరంజన్ గుప్తా ప్రవేశంతో  ఊపు వచ్చింది. ఈయన సృష్టి కిరీటీ రాయ్ అప్పట్లోనే హైటెక్ డిటెక్టివ్. కానీ ఎన్ని డిటెక్టివ్ పాత్రలున్నా,  బెంగాలీలో డిటెక్టివ్ పాత్ర అనగానే సత్యజిత్ రే ‘ఫెలూదా’ యే మెదులుతాడు. 


          కన్నడ సాహిత్యంలో క్రైం సాహిత్యం  ముప్ఫై శాతం. టాప్ రైటర్ నర్సింహయ్య. ఈయన 1950లో రాయడం ప్రారంభించారు. ఇప్పటికి 400 నవలలు రాశారు. ఈయన సృష్టించిన పురుషోత్తం – మధుసూదన డిటెక్టివ్ పాత్రలు ఇంటింటా తెలిసిన పాత్రలు. రెండో స్థానంలో విజయ నన్నూర్ అనే సీనియర్ ఐపీఎస్ అధికారి వున్నారు. సహజంగానే ఈయన రచనలు సహజత్వానికి దగ్గరగా వుంటాయి. ఇక మరాఠీ కొస్తే, అక్కడ డిటెక్టివ్ సాహిత్యం పుష్కలంగా ఉత్పత్తి అయినా చెప్పుకోదగ్గ రచయితల్లేరు. 1960 లనాటి బాబూరావ్ అర్నాల్కర్ రచనల్నే ఇప్పటికీ యువతకి దిక్కు. ఇతరులు రాసినవి ఆంగ్ల కథలకి మక్కీకి మక్కీ కాపీలు. ఒక్క శ్రీకాంత్ శింకర్ మాత్రం నిజంగా జరిగిన సంఘటనల్ని కథలుగా మల్చి పాపులరయ్యారు. ఇక తమిళంలో, సెక్స్ ఎక్కువ కలిపి రాస్తారు. సుజాత అనే కలం పేరుతో రాసే లాయర్ మాత్రం ఉన్నత ప్రమాణాలు పాటిస్తున్నారు. దేశవాళీ పెర్రీ మేసన్ సృష్టించి పేరు తెచ్చుకున్నారీయన. ఇతర డిటెక్టివ్ రచయితలూ ఛానెళ్ళ  వైపు వెళ్ళిపోయారు.

నాటు సరుకంటే హిందీలోనే!
          ఇంగ్లీష్ డిటెక్టివ్ సాహిత్యానికే  దేశంలో అత్యధిక పాఠకులున్నారు. తర్వాతి స్థానం హిందీది. అయితే రాసేదంతా చవకబారు సరుకే. ఎప్పుడో దశాబ్దం  క్రితం కల్నల్ రంజిత్ పేరుతో డిటెక్టివ్ నవలలు వచ్చేవి. వాటిలో  డిటెక్టివ్ భగవాన్ వుండేవాడు. ఈ అపరాధపరిశోధకుడి పాత్ర ఆకట్టుకునే విధంగా వుండేది. ఇప్పుడొస్తున్న డిటెక్టివ్ నవలలన్నీ సి గ్రేడ్ హిందీ సినిమాల స్థాయిలో వుంటున్నాయి. చాలావరకూ సినిమా కథల్లాగే వుంటాయి డైలాగులు సహా. ఈ ‘డిటెక్టివ్ రచయితలు’  హిందీ సినిమాల్లో అవకాశాల కోసం తహతహలడుతున్నట్టుగా  సినిమాటిక్ గా నవలలు రాస్తూంటారు. 1980 లకి పూర్వం వేద్ ప్రకాష్ కాంభోజ్,  ఓం ప్రకాష్ శర్మ, ఇబ్నె షఫీ అనే రచయితలు హిందీ  డిటెక్టివ్ సాహిత్యానికి ఆద్యులని చెప్పాలి. ఇబ్నె షఫీ సృష్టించిన డిటెక్టివ్ జంట అబ్దుల్ అండ్ హమీద్ లు నాటుగా మోటుగా మాస్ గా వుంటూ హిందీ గ్రామీణ పాఠకుల్ని ఆకట్టుకునేవి. 1980-90 లలో అంతా నరేంద్ర మోహన్ పాఠక్  రాజ్య మేలారు. ఇదే సమయంలో రాయడం మొదలెట్టిన వేద్ ప్రకాష్ శర్మ ‘వర్దీ వాలా గూండా’ (పోలీస్ యూనిఫాంలో గూండా)  అనే నవల ఇప్పటికి  అయిదు లక్షల కాపీలు అమ్ముడయ్యిందని చెప్పుకుంటారు. దీన్ని నవల అనేకన్నా సినిమా స్క్రిప్ట్ అనొచ్చు. హిందీ డిటెక్టివ్ నవలల టైటిల్స్, కథా కథనాలు, పాత్రలు ప్రతీదీ హిందీ మసాలా మూవీస్ లాగే వుంటాయి. వీటిని చదవడమంత  శిక్ష వుండదు. ఈ వ్యాసకర్త పది పేజీలకన్నా చదవలేక పోయేవాడు. ముద్రించే కాగితం కూడా అత్యంత హీనంగా వుంటుంది. హిందీకి జాతీయ భాషా హోదా వున్నప్పటికీ ఆ భాషలో ఒక్కరంటే ఒక్కరు   ఓ పాపులర్ డిటెక్టివ్ పాత్రని  అందించలేకపోయారు.

వాడుకలో డిటెక్టివ్ పదం 
సర్ ఆర్ధర్ కానన్ డాయల్
          ప్రపంచ సాహిత్యంలో తొట్ట తొలి డిటెక్టివ్ పాత్ర సృష్టికర్త సర్ ఆర్ధర్ కానన్ డాయల్ కాదు. ఆయన షెర్లాక్ హోమ్స్ పాత్రని 1887 లో సృష్టించారు. కానీ ఇంకా పూర్వం 1841 లో ఎడ్గార్ అలన్ పో  ‘ది మర్డర్స్ ఇన్ ది రూమార్గ్’ అన్న నవల రాశారు. ప్రపంచంలో ఇదే మొట్టమొదటి డిటెక్టివ్ రచన. ఇందులో ఆయన లీ షావెలర్ సీ ఆగస్ట్ డుపిన్ అనే డిటెక్టివ్ పాత్రని సృష్టించారు. ఇదే ప్రపంచంలో మొట్ట మొదటి డిటెక్టివ్ పాత్ర. కానీ డుపిన్ వల్లా, షెర్లాక్ హోమ్స్ వల్లా డిటెక్టివ్ అన్న పదం వాడకంలోకి రాలేదు. 1829 లో స్కాట్ లాండ్ యార్డ్ గా పిలిచే లండన్ పోలీసు వ్యవస్థ  ఏర్పాటయ్యాక,  నెమ్మదినెమ్మదిగా 1878లో అందులో సీఐడీ విభాగాన్ని ప్రారంభించాక, సీఐడీ  పోస్టుల్ని సృష్టించారు. ఆ సీఐడీ లకే  డిటెక్టివ్ లన్న పర్యాయనామం స్థిరపడింది. అలా క్రైం సాహిత్యానికి డిటెక్టివ్ సాహిత్యమని పేరొచ్చింది. అందులో అపరాధపరిశోధకుడు డిటెక్టివ్ అయ్యాడు. షెర్లాక్ హోమ్స్ సహా అపరాధపరిశోధక పాత్రలన్నిటికీ డిటెక్టివ్ లనే పేరొచ్చింది.



తెలుగు సాహిత్యంలో డిటెక్టివ్  పాత్రలు
వాటి సృష్టి కర్తలు
యుగంధర్
కొమ్మూరి సాంబశివరావు
లాయర్ విశాలాక్షి
ఆరుద్ర
వాలి, పరశురాం
టెంపో రావ్
భగవాన్
విశ్వ ప్రసాద్
పృథ్వీరాజ్
మల్లాది వెంకటకృష్ణ మూర్తి
నర్సన్
గిరిజశ్రీ భగవాన్
వెంకన్న 
వసుంధర
ఇంద్రజిత్
పాణి
ఇంద్రజిత్- ప్రమీల   
చాణక్య     
చంద్రమోహన్
సిన్హా
సుధాకర్
కరణ్   
ఇన్స్ పెక్టర్ రాజారెడ్డి
గిరి 
వాసు- శేషు
లాల్ అండ్ జాన్
ఆహర్పతి, జగత్ 
రావులపాటి సీతారామారావు
కృష్ణ మోహన్
కనకమేడల
జివిజి
విజయబాపినీడు
శ్యాం బాబు
ఏవీ మోహన్రావ్
బొమ్మిడి అచ్చారావు
అజీజ్
ఎంవివి సత్యనారాయణ
బి. రాజేశ్వరి
సికిందర్ (అపరాధపరిశోధన)
సికిందర్ (ఆంధ్రభూమి)


ఆంగ్ల సాహిత్యంలో డిటెక్టివ్  పాత్రలు
వాటి సృష్టికర్తలు
షెర్లాక్ హోమ్స్
కానన్ డాయల్
హెర్క్యూల్ పైరట్, మిస్ మార్పుల్
అగథా క్రిస్టీ
ఫిలిప్ మార్లో
రేమండ్ చాండ్లర్
లివ్ ఆర్చర్
రాస్ మెక్ డొనాల్డ్
ట్రావిస్ మెక్ గీ
జాన్ డి. డొనాల్డ్
ఫాదర్ బ్రౌన్
చెస్టర్టన్
పెర్రీమేసన్ (క్రిమినల్ లాయర్)
ఎర్ల్ స్టాన్లీ గార్డెనర్
జేమ్స్ బాండ్ (గూఢచారి)
ఇయాన్ ఫ్లెమింగ్



(కవర్ స్టోరీ అయిపోయింది) 
రేపు : ఈ వ్యాసాలు ఎవరి కోసం?

- సికిందర్











         




4, ఏప్రిల్ 2017, మంగళవారం

     క్రైం జానర్ సినిమా అర్ధమవాలంటే డిటెక్టివ్ సాహిత్యం తెలుసుకోవాలి.  ఫిలిం నోయర్ గా పుట్టిన  క్రైం జానర్ డిటెక్టివ్ సాహిత్యంలోంచే పుట్టింది 1930 లలో. ఇప్పుడు తెలుగులోనూ డిటెక్టివ్ సాహిత్యం లేకపోవచ్చు. కానీ  దాని వారసత్వంగా క్రైం జానర్ తో సినిమాలు వుంటూనే వున్నాయి. కాబట్టి అసలీ క్రైం జానర్ అంటే ఏమిటో తెలుసుకోవాలి. అంటే డిటెక్టివ్ సాహిత్య చరిత్రలోకి వెళ్ళాలి. ఫిలిం నోయర్ సినిమాలలో  ప్రధానంగా వుండే ఎలిమెంట్స్  గనుక చూస్తే- ఓ హత్య జరుగుతుంది, ఆ హత్య కేసుని ఒక డిటెక్టివ్, లేదా ఇన్వెస్టిగేటర్ దర్యాప్తు చేస్తాడు. ఇతనే కథానాయకుడు. మరో  రెండు స్త్రీ పాత్రలుంటాయి -  ఒకటి నెగెటివ్, ఇంకోటి  పాజిటివ్;  కథ నగర ప్రాంతంలోనే జరుగుతుంది, చాలా  వరకూ రాత్రి పూటే జరుగుతుంది, వర్షం కూడా  పడితే పడవచ్చు, డైలాగులు పదునుగా  పోయెటిక్ గా వుంటాయి, ప్రధాన పాత్రలన్నీ ఉన్నత వర్గాలకి చెందినవే అయివుంటాయి,  ఉన్నత వర్గాల హిపోక్రసీని ఎండగట్టడం , కాల నేపధ్యంతో బాటు, సమాజ నేపధ్యాన్ని కూడా జోడించడం  ఈ జానర్ ప్రధాన లక్షణాలుగా వుంటాయి.

           తెలుగులో డిటెక్టివ్ సాహిత్యానికి సుదీర్ఘ చరిత్రే వుంది. గొప్ప గొప్ప పండితులూ ఈ సాహిత్యాన్ని రాసిన వాళ్ళల్లో వున్నారు. 1950 లలో పాంచకడీ దేవ్ అనే రచయిత బెంగాలీలో పుంఖాను పుంఖాలుగా డిటెక్టివ్ నవలలు రాసే వారు. సర్ ఆర్ధర్ కానన్ డాయల్ సృష్టించిన సుప్రసిద్ధ డిటెక్టివ్ పాత్ర షెర్లాక్ హోమ్స్ నీ, ఎర్ల్ స్టాన్లీ గార్డెనర్ సృష్టించిన ప్రఖ్యాత  క్రిమినల్ లాయర్ పాత్ర పెర్రీ మేసన్ నీ,  తలపించేలా పాంచకడీ దేవ్ సృష్టించిన  డిటెక్టివ్ అరిందమ్ పాత్రతో, బెంగాలీ నవలల్ని  ప్రసిద్ధ వేంకట పార్వతీశ్వర కవులు తెలుగులోకి అనువాదం చేసి ముద్రించేవారు.

           కవి సామ్రాట్  విశ్వ నాథ సత్యనారాయణ కూడా ‘దిండు కింద పోక చెక్క’ అనే  డిటెక్టివ్ నవల రాసిన వారే. ఇక ప్రసిద్ధ కవి, పరిశోధకుడు, సినిమా రచయిత  ఆరుద్ర 1950 లో ‘పలకల వెండి గ్లాసు’ అనే  డిటెక్టివ్ నవల రాశారు. ఆ తర్వాత అణాకో బేడ స్టాంపు’, ‘అహింసా రౌడీ’, ‘రెండు రెళ్ళు ఆరు’, ‘ఆనకట్ట మీద హత్య’, ‘త్రిశూలం’, ‘కొండచిలువ మొదలైన డిటెక్టివ్ నవలలెన్నో  రాశారు. చివరిగా 1957 లో ‘ఆడదాని భార్య అనే డిటెక్టివ్ నవల రాశారు. పాలగుమ్మి పద్మరాజు కూడా  చచ్చి సాధించేడుఅనే అపరాధ పరిశోధక నవల రాశారు. 

          ఇదంతా ఒకెత్తయితే,  1930 లలోనే దాదాపు వెయ్యి నవలలు రాసి చరిత్ర కెక్కిన కొవ్వలి లక్ష్మీ నరసింహారావు, వంటింటీ స్త్రీలకి వాడుక భాషలో తన నవలలద్వారా అక్షరాస్యతనీ, పఠనాసక్తినీ పెంచారని పేరుగడించారు. ఈయన కూడా అలవోకగా డిటెక్టివ్ నవలలు  రాసి అవతల పడేయడం ఒకెత్తూ . డిటెక్టివ్ సాహిత్యంలో ఈ మొదటి తరం రచయితలిలా వుండగా, రెండో తరం వచ్చేసి 1950 లలోనే కొమ్మూరి సాంబశివరావుతో ప్రారంభమయ్యింది. ఈయన సగటు పాఠకుడి భాషలో ఆధునికంగా రాయడం మొదలెట్టారు. తెలుగులో ఆధునిక డిటెక్టివ్ సాహిత్య పితామహుడు ఆయనే. మద్రాసులో వుండే ఆయన సృష్టించిన డిటెక్టివ్ యుగంధర్ పాత్ర జంటిల్ మెన్ పాత్ర. చదువుతూంటే ఎలాటి వారికైనా ఈ పాత్రమీద గౌరవం ఏర్పడుతుంది. యుగంధర్ అసిస్టెంట్  రాజు, ఇంకో చైనీస్  అసిస్టెంటు కాత్యా, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్  స్వరాజ్యరావు పాత్రలతో ఆయన నవలలు మూడు దశాబ్దాల పాటూ ఒక క్రేజ్. 

         ఇక టెంపోరావ్ అయితే చెప్పనే అక్కర్లేదు- డిటెక్టివ్ పరశురాం, డిటెక్టివ్ వాలి అనే పాత్రలతో వందలాది నవలలు రాసేశారు. ఇంగ్లీషులో ‘టెంపో’ అనే పత్రికని స్థాపించి, అందులో కూడా తన రచనల ఆంగ్లానువాదాలు ప్రచురించే వారు. సినిమారంగంపత్రిక సబ్ ఎడిటర్  గడియారం వెంకట గోపాలకృష్ణ - జి.వి.జి పేరుతో  డిటెక్టివ్ నవలలు రాసేవారు. ఇలా ఈ డిటెక్టివ్ సాహిత్యపు  పురుగు కుట్టని రచయితలూ, పాఠకులూ లేరంటే అతిశయోక్తి కాదు.    ఈ నేపధ్యంలో డిటెక్టివ్ సాహిత్యం గురించి మరికొంత సమాచారం తెలుసుకుంటే బావుంటుందన్న ఉద్దేశంతో,  2000 జులై  2  ‘ఆంధ్రభూమి’ ఆదివారం అనుబంధంలో ‘మాయమైన డిటెక్టివ్’  పేర ఈ వ్యాసకర్త  రాసిన కవర్ స్టోరీని ఇక్కడ ఇస్తున్నాం, ఆసక్తి వుంటే చదవండి... 
                                            ***
        లే చిత్రంగా తోచే స్థితి ఇది... పుస్తకాల్నిండా డిటెక్టివ్ పాత్రలున్నప్పుడు,  బయటెక్కడా డిటెక్టివ్ లు కన్పించలేదు మన దేశంలో. ఇప్పుడు బయట అడుక్కో ప్రైవేట్ డిటెక్టివ్ సంస్థ వెలుస్తున్నప్పుడు, పుస్తకాల్లోంచే మాయమైపోయాడు డిటెక్టివ్ అనే వాడు!

          క్రైం సాహిత్యంలో డిటెక్టివ్ పొందింది  మామూలు మరణం కాదు – శాశ్వతంగా ఆ జాతి అంతరించిపోయింది, రాక్షస బల్లులు డైనోసారస్ లకి మల్లే.
         
           ఈ పరిణామం ఒక్క తెలుగు డిటెక్టివ్ సాహిత్యానికే పరిమితం కాలేదు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల క్రైం సాహిత్యాల నుంచీ డిటెక్టివ్ మాయమై పోయాడు.

          తెలుగులో శవ సాహిత్యంగా పేరు బడి, అస్పృశ్యతకి  గురైన క్రైం సాహిత్యమే, అనంతర కాలంలో స్టార్ రైటర్ల చలవతో తెలుగు వారపత్రికల కెక్కి,  పాపులరవడం, గౌరవం పొందడం  ఒక వింత. నవలా సాహిత్యమంటే ఇదేనేమో అన్నంత భ్రమలో పాఠకులూ  పడిపోయి, వార పత్రికల్లో స్టార్ రైటర్స్ రాస్తున్న క్రైం థ్రిల్లర్ సీరియల్స్ కి దాసోహమైపోయారు- ఒకప్పుడు డిటెక్టివ్- క్రైం సాహిత్యాన్ని శవ సాహిత్యమని ఛీ కొట్టిన ఉత్తమ సాహిత్యాభిలాషులే,  పాఠకురాళ్ళే, విపరీత క్రేజ్ తో అటువంటి  సీరియల్స్ నే  అక్కున జేర్చుకోవడం మొదలెట్టారు. 

          వార పత్రికల్లో ఆ పాపులర్ సాహిత్యమంతా కూడా మంత్ర తంత్రాల క్షుద్ర సాహిత్యం తోనే మొదలైంది. ఒకప్పుడు పావలాకి  అద్దెకి దొరికే డిటెక్టివ్ నవలలంత సమాన వైభోగమే ఇది. కానీ పాపులర్ నవలా రచయిత లెవరూ డిటెక్టివ్ ని  బతికించుకోవాలనే ఆలోచనే చేయలేకపోయారు.

          అప్పటివరకూ వున్న  క్రైం- డిటెక్టివ్ రచయితలూ వార పత్రికలకి ఎక్కలేకపోయారు. ఒక్క మధుబాబు విషయంలో అది సాధ్యమైనా, ఆయన సృష్టించిన లెజండరీ పాత్ర ‘షాడో’ డిటెక్టివ్ కాదు, ఒక యాక్షన్ హీరో. డిటెక్టివ్ యుగంధర్, అసిస్టెంట్ రాజు పాత్రలతో మూడు దశాబ్దాల పాటూ  మకుటం లేని మహారాజులా వెలిగిన కొమ్మూరి సాంబశివరావు,  చరమ దశలో ‘ఉదయం’ వీక్లీలో అతి కష్టంగా ఓ డిటెక్టివ్ సీరియల్ రాయగల్గారు ఆ పాత్రలతో, అంతే. చిన్నచిన్న క్రైం కథల్ని ప్రచురించాడానికే అదేదో మర్యాద తక్కువగా వెనుకాడిన వార పత్రికలే,  ఈ ట్రెండ్ లో ఇక ఏకంగా క్రైం –సెక్స్- హార్రర్  కథాంశాలతో,  శైలీ శిల్పం సరైన భాషా వుండని చవకబారు సీరియల్స్ కూడా ప్రచురించడం మొదలెట్టాయి- వాటిని కుటుంబాల డ్రాయింగ్ రూముల్లోకీ తీసికెళ్ళి పోయాయి. సీరియల్స్ పేరుతో  కాపీ రాయుళ్ళనీ, ఘోస్టు రచయితల్నీ ఉత్పత్తి చేసి, ఒక ఆంధ్రా హెరాల్డ్ రాబిన్స్ నీ, ఇంకో ఆంధ్రా ఆర్ధర్ హెయిలీ నీ, మరింకో ఆంధ్రా సిడ్నీ షెల్డన్ నీ ఆడా మగా అమాయక పాఠకుల మీద రుద్దాయి గానీ, ఒక్కరంటే ఒక్క ఆంధ్రా కానన్ డాయల్ ని గానీ, ఆంధ్రా జేమ్స్ హేడ్లీ ఛేజ్ ని గానీ, ఆంధ్రా అగథా క్రిస్టీ ని గానీ  అందివ్వలేకపోయాయి.

          జనబాహుళ్యంలో పఠనాశక్తిని పెంచింది అణా అద్దె డిటెక్టివ్ నవలలే.  పేపరైనా చూడని మొహాలకి చదివే క్రేజ్ ని నేర్పింది ఈ శవ సాహిత్యమనే డిటెక్టివ్ నవలలే. బడి కెళ్ళే బుడ్డి వెధవ దగ్గర్నుంచీ, సోడాలమ్మే మిడిమిడి జ్ఞానపు కామన్ మాన్ వరకూ-  దొంగచాటున డిటెక్టివ్ ల్ని చదివి ఎంతో కొంత అక్షర జ్ఞానంతో  బాటు, విషయ పరిజ్ఞానం పెంపొందించుకున్న వాళ్లెందరో. 

          మద్రాసు కేంద్ర స్థానంగా విరివిగా ఉత్పత్తి అయ్యే డిటెక్టివ్ నవలలు  చొరబడని ఆంధ్రప్రదేశ్ గ్రామమంటూ లేదు. అతి చిన్న సమూహంగా వుండే  ఈ సాహిత్యాభిమానులు, పదుగురి ముందు ఈ నవలలు చదివితే చీప్ టేస్టు వెధవలుగా చిన్న చూపుకి  గురయ్యే వారు. ప్రపంచంలో ఇంకే భాషలోనూ డిటెక్టివ్ సాహిత్యానికి ఈ గతిపట్టలేదు,  సరికదా విన్ స్టన్ చర్చిల్ లాంటి మహానుభావులు రాత్రి పూట డిటెక్టివ్ నవల చదవనిదే నిద్రపోయే వాళ్ళు కాదు.  తెలుగులోనే తామేదో గొప్ప  టేస్టున్న మొనగాళ్ళమని పోజు కొట్టే వాళ్ళు ఈ గతి పట్టించారు.

          ఈ డిటెక్టివ్ నవలలకి కూడా చాటుమాటుగా పట్టుకెళ్ళ డానికీ, దొంగచాటుగా చదువుకోవడానికీ అన్నట్టు ఒక అనువైన సైజు వుండేది. సరీగ్గా జేబులో పట్టే పాకెట్ సైజు (ఈ వ్యాసకర్త నిక్కరు జేబుతో లాభం లేక, పొత్తి కడుపులో దోపుకుని తిరిగే వాడు ఎనిమిదో తరగతి చదువుతూ కొమ్మూరి నవలల్ని. ఒకసారి తండ్రి చేత తొడపాశం కూడా పెట్టించుకున్నాడు. అయినా ఏనాడూ వదల్లేదు ఈ సాహిత్యాన్ని. ఆ నిర్బంధ పరిస్థితులు ఈ వ్యాసకర్తలో ఏకంగా డిటెక్టివ్ రచయిత ఉద్భవించేలా చేశాయి!). నవలలతో  పరిస్థితి ఇలా వుండగా, మరోవైపు ఒక మాస పత్రికతో  వేరేగా వుండేది. ‘అపరాధ పరిశోధన’ అనే ఆ మాసపత్రిక పెద్ద మనుషుల బుక్ షెల్ఫుల్లోకి చేరేది. భువనగిరికి చెందిన శ్యామ దామోదర రెడ్డి 1960 లలోనే హైదరాబాద్ నారాయణ గూడాలో ప్రారంభించిన ఈ డిటెక్టివ్ మాస పత్రికకి మంచి గౌరవం లభించేది. డాక్టర్ దాసరినారాయణ రావు కూడా తమ పాఠకులే అని దామోదర్ రెడ్డి చెప్పేవారు. ఎందరో ఉన్నతాధికారులు, వైద్యులు, న్యాయవాదులూ, ప్రవాసాంధ్రులు కూడా  చందాదార్లుగా వుండే వారు. పాఠకు రాళ్ళ సంఖ్యా తక్కువేం కాదు. ప్రతినెలా ఒక డిటెక్టివ్ కథల పత్రిక, దాంతో పాటూ నాల్గు డిటెక్టివ్ నవలికల సప్లిమెంటరీ వెలువడేవి. ఇవీ పాకెట్ సైజులోనే వుండేవి. తెలుగు డిటెక్టివ్ సాహిత్యానికి ‘అపన’ (‘అపరాధ పరిశోధన’ ముద్దు పేరు) సమకూర్చి పెట్టిన గౌరవ ప్రతిష్టలూ, చేసిన సేవా మరే పత్రికా చేయలేదు. 

కొమ్మూరి సాంబశివరావు 
         మద్రాసు నుంచే సినీనిర్మాత వైవీ రావ్ కొన్నాళ్ళు ‘డిటెక్టివ్’ అనే పత్రిక నడిపారు. విజయబాపినీడు ‘క్లూ’ అనే పత్రిక  నడుపుతూ ఆపుతూ వుండేవారు. అపన మాత్రం ఏ నెలా ఆగకుండా మూడు దశాబ్దాలూ  నడిచింది ( చరమ దశలో ఈ వ్యాసకర్త ఓ యాభై కథలూ, డెబ్బై నవలికలూ, ఇంకో రెండు సీరియల్సూ  ఆరేళ్ళ పాటూ రాసి అస్త్రసన్యాసం చేశాడు).
(ps : 1996- 2010 మధ్య ఆంధ్రభూమిలోనూ, ఆంధ్రజ్యోతిలోనూ 700 వరకూ క్రైం, డిటెక్టివ్  కథలు రాశాడు).
            యండమూరి, మల్లాదిలు కూడా ఈ పత్రికలో రాసిన వారే. ఇక మద్రాసు, విజయవాడ కేంద్ర స్థానాలుగా  కొమ్మూరి సాంబ శివరావు, టెంపోరావ్, గిరిజ శ్రీ భగవాన్, విశ్వ ప్రసాద్, విశ్వ మోహన్, కృష్ణ మోహన్, విజయబాపినీడు, కనక మేడల, భయంకర్, గుత్తా బాపినీడు, డాక్టర్, కొప్పిశెట్టి ... చెబుతూ పోతే జాబితా అంతమవదు- ఈ హేమాహేమీలు పుంఖానుపుంఖాలుగా  డిటెక్టివ్ నవలల్ని వెలువరుస్తూంటే, హైదరాబాద్ నుంచి ‘అపన’ ద్వారా మల్లాది వెంకట కృష్ణ మూర్తి, వసుంధర, శ్యాం బాబు, ముద్దా సురేష్, బొమ్మిడి అచ్చారావు, రమణ శ్రీ, తిరుమల శ్రీ, ఏవీ మోహన్రావ్, రంకిరెడ్డి రాము, అజీజ్, ఎంవివి సత్యనారాయణ, విఎస్ చెన్నూరి,  కురుమద్దాలి విజయలక్ష్మి, సామవేదుల గీతారాణి, విద్వాన్ షీలా దేవి, సికిందర్ ...మరెందరో రచయితలూ తమతమ  కలాలకి పదును పెడుతూ- మెదడుకి మంచి మేత పెట్టే, ఎక్కడ్నించీ కాపీ కొట్టని-  ఒరిజినల్ రచనల్ని అందించే వారు.

          ఈ వైభవమంతా వారపత్రికలలో పాపులర్ సీరియల్స్ అనే ఒక్క గాలివాటుతో హరప్పా - మొహంజొదారో అయిపోయింది. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అనే రచనా విధానం  పాఠకులకి విపరీతంగా నచ్చేసి,  ఆ రకపు సాహిత్యం వైపు మళ్ళడంతో,  ఉన్న ఆ ఒక్క డిటెక్టివ్ మాస పత్రికా మూతబడిపోయింది. దాంతో ఆ రచయితల్లో అనేకులు కనుమరుగయ్యారు, మిగిలిన వాళ్ళు ఇతర ప్రక్రియల మీద దృష్టి పెట్టారు. సాహితీ వేత్తలు ఒప్పుకోరేమో గానీ, ఇక్కడ చెప్పుకోదగ్గ విశేష మేమిటంటే, ఏ కథల్ని గతంలో శవ సాహిత్యమని ఈసడించుకునే వారో,  ఆ  డిటెక్టివ్ కథల్లో భాష బతికేది. శుభ్రమైన తెలుగుతో వర్ణనలు సింపుల్ గా వుండేవి. వార పత్రికల్లో పాపులర్ సీరియల్స్ ట్రెండ్ మొదలయ్యాక,  తెలుగెలా తయారయ్యిందో, వర్ణనలు, సన్నివేశాలూ ఎలా వుండేవో  చూసిందే. కనుగుడ్లు పీకేసే హార్రర్, ఐసు  దిమ్మెల్లో చిత్ర హింసలు పెట్టే  థ్రిల్స్ , నడిచే రైల్లో గుడ్డ లిప్పుకునే సెక్స్, కరిచే చలిలో నరికి వేతల ఉన్మాదం... కలగలిసిన కాక్ టెయిల్ పానీయాల మత్తులో పాఠక లోకం మైమరచి పోవడంతో- ఇక కుశాగ్రబుద్ధి బలం గల డిటెక్టివ్ చచ్చి వూరుకోక తప్పలేదు. 

          ‘రాజూ, అతన్ని  వెంటాడు... కానీ జాగ్రత్త, అతడి దగ్గర పిస్తోలుంటుందేమో' అని హెచ్చరించే మృదుభాషి అయిన కొమ్మూరి డిటెక్టివ్ యుగంధర్ గొంతు మూగబోయింది. 

          ‘ఈ నేరం చేసి నువ్వు తప్పించుకోలేవ్ రాజారావ్!’  అని ఎంతటి వారినైనా నింపాదిగా పైప్ పీలుస్తూ, ఏక వచనంలో సంబోధించే టెంపో రావ్ డిటెక్టివ్ వాలి తూలిపోయాడు.

          ‘రేయ్ బద్మాష్! ఇది దేశ ద్రోహంరా!’ అని శత్రువుని చెండాడే గిరిజశ్రీ భగవాన్ డిటెక్టివ్ నర్సనూ మాయమైపోయాడు. 

          ఇలా మూడున్నర దశాబ్దాల పాటు మూడు తరాలకి చెందిన రచయితలు కాపాడిన తెలుగు డిటెక్టివ్ తనువు చాలించాడు. మొదటి తరం ఆరుద్ర, కొవ్వలి వంటి  వారిదైతే, రెండో తరం కొమ్మూరి, టెంపో రావ్ లది. మూడోతరం ‘అపన’ రచయితలది.

          తెలుగు డిటెక్టివ్ సాహిత్యపు పరిసమాప్తికి స్థూలంగా పైన పేర్కొన్న కారణాలు కన్పించినా, లోతట్టులో చూస్తే, మరో కోణం కన్పిస్తుంది. ఇదే ఆంగ్లంతో సహా అన్ని భాషల్లోని డిటెక్టివ్ పాత్రలూ అంతర్ధానమవడానికి   కారణంగా అన్పిస్తుంది. ఆంగ్ల డిటెక్టివ్ సాహిత్యానికి స్వర్ణయుగం   1930ల నాటి కాలం. అప్పటికే కొన్నేళ్లుగా సర్ ఆర్ధర్ కానన్ డాయల్ సృష్టించిన షెర్లాక్  హోమ్స్ పాత్ర వుండగా, 1930 లలోనే మరిన్ని సుప్రసిద్ధ డిటెక్టివ్ పాత్రలూ పుట్టాయి. అగథా క్రిష్టీ – హెర్క్యూల్ పైరట్, ఎర్ల్ స్టాన్లీ గార్డెనర్ – పెర్రీ మేసన్ ( క్రిమినల్ లాయర్), రేమండ్ చాండ్లర్ -  ఫిలిప్ మార్లో మొదలైనవి. ఇదే కాలంలో డరోతీ సేయర్స్, జూలియన్ సైమన్స్, మార్గరెట్ కోల్ వంటి రచయిత్రులూ రాజ్యమేలారు. మార్గరెట్ కోల్ అయితే నాజీ నియంత హిట్లర్ అభిమాన రచయిత్రి. ఈ కాలంలోనే ఆంగ్ల డిటెక్టివ్ సాహిత్యపు వైభవానికి ముగ్ధుడై – నంబర్ వన్ హాస్య నవలా రచయిత పిజి ఓడ్ హౌస్ త
ను రాసిన ‘ములినర్స్ నైట్స్’  నవల్లో – ఈ ఆధునిక జీవితంలో ప్రజానీకాన్ని మిస్టరీ నవల కట్టిపడేస్తున్నంతగా మరేదీ కన్పించదు- అని ఒక పాత్ర చేత చెప్పించాడు....

(మిగతా రేపు)



-సికిందర్
         
         
         



         




2, ఏప్రిల్ 2017, ఆదివారం

      తెలుగులో పౌరాణికాలు, జానపదాలు, కుటుంబ కథలు, ప్రేమ కథలు,  సామాజిక కథలు, భక్తి  కథలు, కామెడీ కథలు మొదలైనవి తప్పితే యాక్షన్, క్రైం, హార్రర్,  సైన్స్ ఫిక్షన్ కథలతో వచ్చిన సినిమాలు  హాలీవుడ్  నుంచి స్ఫూర్తి పొంది దిగుమతి చేసుకున్న కథా ప్రక్రియలే. అలా దిగుమతి చేసుకున్న యాక్షన్ విభాగంలో  జేమ్స్ బాండ్, కౌబాయ్ సినిమాలు కూడా 1970 లలో తెలుగులో ప్రారంభమయ్యాయి. 1960 లలో ప్రారంభమైన హార్రర్, సైన్స్ ఫిక్షన్ విభాగాలు కూడా నేటి దాకా కొనసాగుతూనే వున్నాయి. కానీ క్రైం విభాగం కూడా హాలీవుడ్ నుంచే దిగుమతి అయినా, అంతగా అభివృద్ధి చెందక వుండిపోయింది.  ఈ విభాగంలో మర్డర్ లేదా ఇంకేదైనా నేరంతో కూడిన మిస్టరీలు తెలుగులో తీయడం ఎప్పుడోగానీ జరగడం లేదు. 

          
హాలీవుడ్ లో టాకీలు ప్రారంభమైన వెంటనే,  1930 లలోనే క్రైం సినిమాలు తీయడం మొదలెట్టారు. వీటికి ముడి సరుకు ఆ డిటెక్టివ్ సాహిత్యమే. ప్రసిద్ధ డిటెక్టివ్  నవలా రచయిత రేమండ్ చాండ్లర్  సృష్టించిన ఫిలిప్ మార్లో అనే డిటెక్టివ్ పాత్రతో ఆనాడు అనేక క్రైం సినిమాలు తీశారు.  ది బిగ్ స్లీప్, టైం టు కిల్, ది లాంగ్ గుడ్ నైట్ ...ఇంకా ఎన్నో. అలాగే ఇంకో ప్రసిద్ధ రచయిత డెషిల్  హెమెట్ సృష్టించిన శామ్ స్పేడ్ డిటెక్టివ్ పాత్రతో మాల్టీజ్ ఫాల్కన్, ది లైఫ్ ఆఫ్ రిలే లాంటి క్రైం సినిమాలెన్నో  వచ్చాయి. ఇతర సినిమా రచయితలూ, దర్శకులూ కూడా వీటివైపు ఆకర్షితులై వందలాది సినిమాలతో ఒక ట్రెండ్ నే  సృష్టించారు. దాదాపు రెండు దశాబ్దాల కాలం పాటు ఇది మొదటి దశగా తెలుపు నలుపు సినిమాలతో కొనసాగింది. అప్పుడు ఈ క్రైం జానర్ కి ఫిలిం నోయర్ అని పేరు పెట్టారు. నోయర్ అంటే ఫ్రెంచి భాషలో డార్క్ అని అర్ధం. అంటే డార్క్ ఫిలిమ్స్ అన్నమాట. డార్క్ ఫిలిమ్సే కదా అని ఈ క్రైం సినిమాలని ఎలాపడితే అలా తీసేవాళ్ళు కాదు. దీనికీ ఒక సైన్స్ వుండేది. దీని గురించి తర్వాత తెలుసుకుందాం. 

          ఇదే ఫిలిం నోయర్ జానర్  కలర్ సినిమాలొచ్చాక, కొంచెం సైన్స్ ని కూడా మార్పు చేసుకుని,1960 ల నుంచీ నియో నోయర్ గా ప్రారంభమయ్యింది. నియో అంటే నూతనం. అంటే నూతనంగా మారిన  డార్క్ ఫిలిమ్స్ అన్నమాట. ఈ నియో నోయర్ దశ వచ్చేసి ఇప్పటికీ అరవై ఏళ్లుగా అప్రతిహతం
గా కొనసాగుతోంది హాలీవుడ్ లో. దీని సైన్స్ గురించి కూడా తర్వాత చెప్పుకుందాం.


రేమండ్ చాండ్లర్ 
         ఇదంతా ఇప్పుడెందుకంటే, కొంత కాలంగా తెలుగులో వస్తున్న లో- బడ్జెట్ సినిమాల పరిస్థితి అధ్వాన్నంగా వుంది. ఎక్కువ తీసేది ఇవే, ఎక్కువ మందికి ఉపాధి కల్పించేవీ ఇవే. ఐతే హార్రర్ కామెడీలు, కాకపోతే  రోమాంటిక్ కామెడీలూ  అనే బాక్సాఫీసు అప్పీల్ కోల్పో యిన ఇవే  సినిమాలు ఇంకా ఇంకా వందల సంఖ్యలో తీస్తూ (గత సంవత్సరం 117) గిలగిల కొట్టుకుంటున్నారు. హార్రర్ కామెడీల వైపు ఇప్పుడు దోమలు కూడా తిరిగి చూడడం లేదు. రోమాంటిక్ కామెడీలకి జనం రావాలంటే మినిమం రాజ్ తరుణ్  లాంటి క్రేజ్ వున్న హీరో వుండాలి. అంతకి తగ్గిన వాడుంటే, లేదా కొత్త వాడు వస్తే దోమలు కాదుకదా చీమలు కూడా దూరడానికి ససేమిరా అంటున్నాయి. పిచ్చిగా నచ్చావ్,  గట్టిగా గిచ్చావ్ అంటూ వచ్చే చిత్తకార్తె  రోమాంటిక్ కామెడీల్ని ఇక కట్టి పెట్టేసుకునే సమయమొచ్చేసింది. ఈ సినిమాలు తీసేవాళ్ళు గనుక మల్టీ ప్లెక్సుల్లో సినిమాలు చూడడం మానేసి, అన్ని వర్గాల ప్రేక్షకులూ వచ్చే సింగిల్ స్క్రీన్ థియేటర్లకి  వెళ్లి సినిమాలు చూస్తూంటే, సినిమా మార్కెట్ అంటే ఏంటో తెలుస్తుంది. ఏసీ గదుల్లో కూర్చుని స్క్రిప్టు రాయలేరనేది పాత కొటేషన్, మల్టీ ప్లెక్సుల్లో చూస్తూ సినిమాలు తీయలేరనేది నేటి కొటేషన్. 


          విషయమేమిటంటే, హార్రర్ కామెడీలకీ, రోమాంటిక్ కామెడీలకీ ఇక  వుండని జనం-  అటు తమిళనాడు నుంచీ, ఇటు కేరళ నుంచీ  వచ్చే క్రైం సినిమాలకి వుంటున్నారు!  ఆ డబ్బింగుల్లో తెలీని మొహాలైనా,  కొత్త మొహాలైనా, పరమ చెత్త మొహాలైనా, ఎవరున్నా కూడా ఎగబడుతున్నారు జనం. ఈ మూడు నెలల్లో వచ్చిన కనుపాప, 16 డి, నగరం, మెట్రో అనే క్రైం జానర్ సినిమాలకి ప్రేక్షకులు వుంటున్నారంటే అలోచించాల్సిందే.  సర్వ సాధారణంగా స్టార్స్ వుంటే తప్ప తమిళ మలయాళ డబ్బింగులు ఆడవు. స్టార్స్ లేకపోయినా  ఈ క్రైం డబ్బింగుల హావాతో మార్కెట్ ఏం సూచన లిస్తోంది? ఇక హార్రర్ లూ రోమాన్సులూ కట్టిపెట్టేసి క్రైం వైపుకు  వెళ్ళమనేనా?

ఫిలిం నోయర్- ‘టచ్ ఆఫ్ ఈవిల్’ (1958)

     మార్చి 31 వరకూ విడుదలైన రోమాంటిక్ కామెడీలు చూస్తే, ఇంకేంటి నువ్వే చెప్పు, నంబర్ వన్ హీరో రాజేందర్ లవ్ స్టోరీ, పడమటి సంధ్యారాగం లండన్లో, ఏ రోజైతే చూశానో, ఇక సెలవ్, కేరాఫ్ గోదావరి, కన్నయ్య, నువ్వెవరో నేనెవరో, లవర్ బాయ్, ఓ పిల్లా నీవల్ల... అని ఈ మూడు నెలల కాలంలో కొత్త కొత్త హీరోలతో పదకొండుకి పదకొండూ గల్లంతయ్యాయి.  సూక్ష్మజీవులు కూడా వీటిని కన్నెత్తి చూడలేదు. ఇక - ఎవరో తానెవరో అనే హారర్, ఆకతాయి అనే పాత మసాలా, వజ్రాలు కావాలా నాయనా అనే కామెడీ అడ్రసు లేకుండా పోయాయి. 

          ఇవి చాలనట్టు ఏప్రిల్ మొదటి వారంలో-   ఎంతవరకు ఈ ప్రేమ?, చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే... అంటూ మరో రెండు కొత్త మొహాల మహాద్భుత  రోమాంటిక్ కామెడీలు! 

          ఇక నెలనెలా ఈ కోటా భర్తీ అవుతూనే వుంటుంది. ఎవరీ దర్శకులు? ఎవరీ నిర్మాతలు? ఎవరికోసం తీస్తున్నారు? ఏ మార్కెట్ కోసం తీస్తున్నారు? వీళ్ళనుకుంటున్న మార్కెట్ ఇప్పుడుందా?  వీళ్ళనుకుంటున్న ఈ రోమాంటిక్ కామెడీల మార్కెట్ ఇప్పుడు హోటల్లో క్లీనర్ చేతిలో వుంది, పాన్ షాపులో కుర్రాడి చేతిలో వుంది, కాలేజీలో స్టూడెంట్ చేతిలో వుంది... వాళ్ళ చేతిలో స్మార్ట్ ఫోన్ అనే  బెత్తెడు తెర వుంటే,  అందులో థియేటర్లలో పసలేని రోమాంటిక్ కామెడీలని మించిన రియలిస్టిక్ రోమాన్సుల షార్ట్ ఫిలిమ్స్ వుంటున్నాయి.. అవే  తెగ ఎంజాయ్ చేస్తున్నారు  పట్టణం నుంచీ పల్లె దాకా. పిల్లకాయ రోమాంటిక్,  హార్రర్ సినిమాల మార్కెట్ నంతా స్మార్ట్ ఫోన్స్ లో మెచ్యూర్డ్ షార్ట్ ఫిలిమ్స్ తన్నుకుపోయాయి! 


నియో నోయర్- ‘యూజువల్  సస్పెక్ట్స్’  (1995) 

          ఇలా చిన్న సినిమాల మార్కెట్ కి ఒక ఖాళీ అంటూ ఏర్పడితే, ఈ  ఖాళీని ముక్కూ మొహం తెలీని నటులతో క్రైం డబ్బింగులు భర్తీ చేస్తున్నాయి. ఇటీవలే ఒక కొత్త దర్శకుడు రోమాంటిక్ కామెడీ రాసుకుని ఒక కొత్త నిర్మాత దగ్గరికి పోయాడు. ఆ నిర్మాత ఓపిగ్గా విని- మర్డర్ మిస్టరీ కావాలన్నాడు. ‘దృశ్యం’ లాంటిది. ఆ కొత్త దర్శకుడు ఇంకో నిర్మాత దగ్గరికి పోయాడు. ఆయన కూడా  ‘క్షణం’ లాంటి థ్రిల్లర్ కావాలన్నాడు. ఇది చాలా సంతోషకరమైన పరిణామం. ఇలా ఆలోచించే నిర్మాతలు పెరిగితే తప్పకుండా తెలుగు క్రైం సినిమాలతోనే ఈ ఖాళీ భర్తీ అవుతుంది. లేకపోతే పాతాళంలోకే  పోతూంటారు ప్రేమ సినిమాలతో. ప్రేమ సినిమాలు తీయాలనుకుంటే క్రేజ్ వున్న హీరోతో తీసుకోవచ్చు. పనిమాలా కొత్త మొహాలతో తీస్తే కృష్ణ బిలాలు సిద్ధంగా వుంటాయి మింగెయ్యడానికి.  ఇదే కొత్త మొహాలతో క్రైం జానర్ తీస్తే – పాచి ప్రేమలతో, పిచ్చి దెయ్యాలతో మొహం మొత్తిన ప్రేక్షకులకి ఆటవిడుపుగా వుంటుంది కనీసం కొంత కాలం పాటు. ఇద్దరు నిర్మాతల దగ్గర ప్రయత్నించిన ఆ  కొత్త దర్శకుడు ఒక నిర్మాతని ఖాయం చేసుకుని, ఆ రోమాంటిక్ కామెడీని మర్డర్ మిస్టరీగా మార్చడానికి ఈ వ్యాసకర్తని సంప్రదించాడు, అది వేరే విషయం. తెలుగులో చిన్న సినిమాలు తీసే, చిన్న సినిమాలతో పరిచయమయ్యే దర్శకులతో సమస్యే మిటంటే, మార్కెట్ యాస్పెక్ట్ తెలీడం లేదు. టాలీవుడ్ ని జయించడానికి ఏ అలెగ్జాండర్ వచ్చినా, అవే రోత  రోమాంటిక్ కామెడీలు, అవే పాత రోమాంటిక్ డ్రామాలు, అవే నికృష్ట హార్రర్ కామెడీలూ.... ఇవి తప్ప ఇంకో కథా ప్రపంచంతో పరిచయమే వుండడం లేదు.


          క్రైం జానర్ లేకుండాపోయి  ఒక ఖాళీయే కాదు, నిజానికి ఇంకోటి కూడా లేక ఇంకో ఖాళీ కూడా భర్తీ కాకుండానే,  దాదాపు మర్చిపోయేంత ప్రమాదంలో పడింది. అది కామెడీ జానర్. నాటి జంధ్యాల, వంశీ, ఇవివి సత్యనారాయణ, రేలంగి నరసింహా రావుల తర్వాత ఈ తరంలో ఒక్కరంటే ఒక్కరూ  కామెడీ దర్శకులుగా రాలేదు. కామెడీ హీరో అల్లరి నరేష్ పరిస్థితే  ఇందుకు అద్దం పడుతుంది. ఈ ఖాళీని భర్తీ చేసి చుక్కల్లో చంద్రుడులా ప్రకాశి ద్దామని ఎవరికీ ఆసక్తే లేదు. ఎందుకంటే,  పుట్టి పెరిగినప్పట్నించీ కామెడీ జానరే తెలీదు. 2000 నాటి నుంచీ మొదలైన ప్రేమ సినిమాలే చూస్తూ పెరిగిన తరం, ఇంకే భిన్న కథా ప్రపంచాన్ని వూహించగలదు గనుక.  ఇలా   క్రైం జానర్ గురించి కూడా తెలియకుండానే పోయింది. 

          ఇక్కడ చెప్ప కూడదనుకున్నా ఒకటి చెప్పేయాల్సి వస్తోంది- ఈ వ్యాసకర్తకి పరిచయమవుతున్న, దర్శకులవ్వాలని ప్రయత్నిస్తున్న వాళ్ళలో,  నూటికి 99 మంది మందికి -  క్రైం జానర్ గురించేమీ తెలీదు. కనీసం పోలీస్ స్టేషన్లో సిబ్బంది ఎవరెవరుంటారో తెలీదు. బెయిల్, రిమాండ్, చార్జి షీట్  నుంచీ మొదలు పెడితే ఫోరెన్సిక్ సైన్స్ దాకా ఏమీ తెలీదు! మరో వైపు అటు తమిళంలో '16 డి' తీసిన 21 ఏళ్ల యువదర్శకుడి క్రైం ఇన్వెస్టిగేషన్ పరిజ్ఞానం తలపండిన వాడి పనితనంగా ఆశ్చర్యపరుస్తోంది.   కొత్త వాళ్ళని పక్కన పెడదాం, ఎన్నాళ్ళ నించో  పనిచేస్తున్న కో- డైరెక్టర్స్ కి కూడా కొందరికి  పోలీసు, న్యాయ వ్యవస్థల పనితీరులు తెలీవు! ఇక కొందరు దర్శకులకైతే పోలీసులకీ ఏసీబీ అధికారులకీ  తేడాయే తెలీదు. సీఐ పరిధిలో వుండే హత్య కేసు దర్యాప్తులు వీళ్ళ సినిమాల్లో ఎస్సై లు చేసేస్తూంటారు!  

           ఈ పరిస్థితుల్లో బంగారు అవకాశంలా పొంచి వున్న-   చిన్న సినిమాల పరంగా మార్కెట్లో ఏర్పడ్డ శూన్యాన్ని,   క్రైం సినిమాలతో ఎవరు భర్తీ చేయగలరు? ఆల్రెడీ శేఖర్ సూరి వున్నాడనుకుంటే,  ఆయన హార్రర్ అనుకుంటూ ఎటోపోయాడు. రవిబాబు వున్నాడనుకుంటే, ఈయన కూడా తానేమిటో అర్ధం జేసుకోలేక ఇంకెటో పోతున్నాడు.

          ఇలాంటప్పుడు ఈ వ్యాసం ఎవరికోసం రాయాలి?
          ఇది రేపు తెలుసుకోవడానికి అన్నివిధాలా ప్రయత్నిద్దాం...


- సికిందర్