రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

20, సెప్టెంబర్ 2016, మంగళవారం

తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ - 16






స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ లో మిడిల్ విభాగం కథ రెండు భాగాలుగా వుంటుందనేది తెలిసిందే- ఇంటర్వెల్ దగ్గర ముగిసే మిడిల్-1, ఇంటర్వెల్ కి తర్వాత ప్రారంభమయ్యే మిడిల్- 2.  క్రిందటి వ్యాసంలో మిడిల్ -1 ని ఎలా నిర్మించుకోవాలో తెలుసుకున్నాక, ఇప్పుడు మిడిల్- 2 నిర్మాణాన్ని నేర్చుకుందాం. నిర్మాణమంటే కథనమే. ఈ కథనం ఎప్పుడూ కొన్ని సీక్వెన్సులుగా వుంటుంది. ఒక్కో సీక్వెన్సులో మళ్ళీ బిగినింగ్- మిడిల్- ఎండ్ అనే స్ట్రక్చర్ వుంటుంది. ఫస్టాఫ్ లో నాలుగు సీక్వెన్సులు, సెకండాఫ్ లో నాల్గు సీక్వెన్సులు ఉండడమే మొత్తం స్క్రీన్ ప్లే. అంటే ఫస్టాఫ్ బిగినింగ్ విభాగంలో రెండు సీక్వెన్సులు, మిడిల్-1 విభాగంలో రెండు సీక్వెన్సులు, మళ్ళీ సెకండాఫ్ మిడిల్ -2 విభాగంలో రెండు సీక్వెన్సులు, చివర్లో ఎండ్ విభాగంలో రెండు సీక్వెన్సులు  మొత్తం కలిపి ఎనిమిది సీక్వెన్సులూ ఇమిడి వుంటాయన్న మాట. దీన్ని అర్ధం జేసుకుంటే ఏ సీను తర్వాత ఏ సీను వస్తుందో- రావాలో  తెలుసుకోగలం.  అప్పుడు వన్ లైన్ ఆర్డర్ సులభంగా, పకడ్బందీగా  వేయగలం. దీన్ని అర్ధం జేసుకోక పోతే చీకట్లో తముడుకుంటున్నట్టు వుంటుంది పరిస్థితి- ఆ మేరకు కథనం కూడా!

           వ్యాసం- తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ -15        https://sikander-cinema
    scriptreview.blogspot.in/2016/06/15.html   లో  ‘శివఆధారంగా  మిడిల్ -1 స్ట్రక్చర్ ని తెలుసుకుంటున్నప్పుడువన్ లైన్ ఆర్డర్ లో అది రెండు  సీక్వెన్సులుగా ఎలా విభజన జరిగివుందో గమనించాం. ఇప్పుడు ఇంటర్వెల్ తర్వాత మిడిల్- 2   రెండు సీక్వెన్సుల కూర్పూ ఎలా వుందో చూద్దాం. మరొక్క సారి వెనుక చెప్పుకుంది గుర్తు చేసుకుంటే, స్క్రీన్ ప్లే అంటే మొట్ట మొదట కాన్షస్సబ్ కాన్షస్ మైండ్ ఇంటర్ ప్లేనే. తర్వాతే- దీనికి లోబడే  స్క్రీన్ ప్లేలో బిగినింగ్- మిడిల్- ఎండ్ విభాగాలుమళ్ళీ వీటిలో సీక్వెన్సులు, సీక్వెన్సుల్లో  మళ్ళీ వాటి తాలూకు బిగినింగ్- మిడిల్- ఎండ్ విభాగాలు, దీని ప్రకారం వన్ లైన్ ఆర్డర్ లో వేసే సీన్లు, మళ్ళీ ఒక్కో సీన్లో  బిగినింగ్- మిడిల్- ఎండ్ విభాగాలూ అన్నమాట!

        ఇలా ఎందులో చూసినా బిగినింగ్- మిడిల్- ఎండ్ విభాగాలే నన్నమాట- ఎందుకనీఎందుకంటే, వీటన్నిటికీ పై స్థానంలో  సర్వాంతర్యామిలా వ్యాపించి వుండే  కాన్షస్సబ్ కాన్షస్ మైండ్ ఇంటర్ ప్లే అనే జగన్నాటక సూత్రధారే కారణం! కాన్షస్ మైండ్ అనేది బిగినింగ్ విభాగమైతే, సబ్  కాన్షస్ మైండ్ మిడిల్ విభాగం, ఎండ్ వచ్చేసి రెండిటి ఇంటర్ ప్లే ఫలితంగా  మనం పొందే మోక్షం. అందుకే స్థూల స్థాయి నుంచీ సూక్ష్మ స్థాయి వరకూ ఎందులో చూసినా బిగినింగ్- మిడిల్- ఎండ్ విభాగాలు సర్దుకుని వుంటాయి. చిట్ట చివర సూక్ష్మ స్థాయిలో ఒక సీను రాస్తున్నప్పుడు దాని ప్రారంభం, అంటే బిగినింగ్ కాన్షస్ మైండ్ లక్షణాలని కలిగి వుంటుంది, ప్రారంభం తర్వాత సీనుకో  నడక వుంటుంది : నడక అంటే మిడిల్ విభాగం సబ్ కాన్షస్ మైండ్ లక్షణాలని కలిగి వుంటుంది. సీను ముగింపు-  అంటే ఎండ్ విభాగం వచ్చేసి మనం పొందే మోక్షాన్ని పోలి వుంటుంది- వుండాలి

          గత రాత్రి  ‘డోంట్ బ్రీత్చూసొచ్చాం. హర్రర్ సినిమాలతో కాన్షస్సబ్ కాన్షస్ మైండ్ ఇంటర్ ప్లే ని వివరించుకుంటే బాగా అర్ధమవుతుంది- ముగ్గురు దొంగలు ఒక అంధుడి ఇంట్లో డబ్బు కొట్టేయాలని జొరబడతారు. జొరబడే ముందు వాళ్ళ దైనందిన జీవితంలో ఆనందాలు  కాన్షస్ మైండ్ కి ప్రతీకలు.   ఇంట్లోకి జొరబడడం సబ్ కాన్షస్  మైండ్ లోకి చేరిక. హార్రర్ సినిమాల్లో చూపించే ఇలాటి గృహలన్నీ మన సబ్ కాన్షస్  మైండ్ లాంటి మిస్టీరియస్ కొంపలే.  మన సబ్ కాన్షస్  మైండే ఒక  అనంతమైన మిస్టీరియస్ కొంప. అందులో ఏమేం అంతుచిక్కని రహస్యాలుంటాయో, ఇంకెలాటి నేర్చుకోదగ్గ  జీవిత సత్యాలుంటాయో మన ఇగోకి తెలీదు. తెలుసుకుని, నేర్చుకుని బాగుపడదామని ప్రయత్నించదు. పైగా అవంటే భయం కూడా. అందుకని ఎంతసేపూ  సబ్ కాన్షస్ కి దూరంగా,  ఔటర్ రింగ్ రోడ్ లాంటి  కాన్షస్ మైండ్ లో,  హార్లీ  డేవిడ్సన్ బైక్ వేసుకుని జామ్మని ఎంజాయ్ చేయడమే దానికి కావాలి. అలా ముగ్గురు దొంగలు (ఇగో) సబ్ కాన్షస్ మైండ్ అనే చీకటి గృహంలోకి తెగించి ప్రవేశిస్తారు. అప్పుడు గబుక్కున అక్కడున్న జీవిత సత్యం అంధుడి రూపంలో మేల్కొంటుంది. వెంటాడుతుంది. దొంగతనం తప్పని ఇగో కి చెప్తుంది, దొంగతనానికి శిక్ష తప్పదనీ చంపడం మొదలెడుతుంది...  ‘అంతర్మధనాన్నితాళలేక తప్పయిపోయింది క్షమించి వదలమన్నా వదలదు అంధుడి రూపంలో వున్న దొంగతనం తప్పనే జీవిత సత్యం. ఇలా వెండితెర మీద కదిలే పాత్రలు కేవలం మన ఇగో ప్లస్ జీవిత సత్యాల ప్రతిరూపాలేమహేష్ బాబు అయినా, తమన్నా అయినా, సప్తగిరి అయినా, ప్రకాష్ రాజ్ అయినా వీటిని ప్రతిబింబించాల్సిందే- ఇంకేదో ప్రదర్శించడం కాదు.  


        ఎందుకు హర్రర్ ఇంతలా ఆడేస్తోందంటే  ఇలా ఇది ప్రేక్షకుల మానసిక ప్రపంచాన్నిఇంటర్ ప్లేతో అంతలా పట్టేసుకుంది కాబట్టే. ‘శివకూడా ఇలాగేఇంటర్ ప్లేతో ప్రేక్షకుల మానసిక ప్రపంచాన్ని ప్రతిబింబించింది కాబట్టే అంతలా అడేసింది. స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ అనేది కేవలం భౌతిక పరమైనది, దానికి కెమెరాతో చిత్రీకరణ కేవలం క్రియేటివ్ కోణమే. ‘ఇంటర్ ప్లేఅనే ఆత్మే  లేకపోతే రెండూ కృతకంగానే మిగిలిపోతాయి.  

          ‘శివలో శివ మన ఇగో కాన్షస్ అయితే, మాఫియా భవానీ సబ్ కాన్షస్ లో దాగి వుండే  ఒక జీవిత సత్యం. దాన్ని ఎదుర్కొని, నశింప జేసి, జీవితాన్ని సుఖమయం చేసుకోవాల్సిందే తప్ప- చేతులు ముడుచుకుంటే మోక్షం లేదు. కురుక్షేత్రం ఎక్కడో జరగలేదు. అది మన అంతరంగం లోనే రోజూ జరుగుతోంది. మన కుండేవి పంచ పాండవు ల్లాంటి ఐదే పాజిటివ్ శక్తులు. మన అంతరంగంలో వుండేవి కౌరవుల్లాంటి  నూటికి నూరు నెగెటివ్ శక్తులు. ఐదే పాజిటివ్ శక్తులతో నూరు నెగెటివ్ శక్తుల పీచమణిచి మనసు స్వర్గతుల్యం  చేసుకోవడమే కురుక్షేత్రపు సూపర్ హిట్  మేజర్ థీమ్- ఫార్ములా


         
జానర్ ని బట్టి ఇంటర్ ప్లే రస పోషణ వుంటుంది. యాక్షన్  జానర్ అయితే వయొ లెంట్ గా, హార్రర్ అయితే భయపెడుతూ, థ్రిల్లర్ అయితే ఉత్సుకతని రేపుతూ, ఫ్యామిలీ అయితే సెంటిమెంట్లతో బాధిస్తూ, ప్రేమ అయితే రొమాంటిగ్గా సమ్మోహన పరుస్తూ, కామెడీ అయితే నవ్విస్తూ ఇంటర్ ప్లే సాగుతుంది.

***


       ఈ నేపధ్యంలో  యాక్షన్ జానర్  ‘శివనిర్మాణాన్ని పెట్టుకుని  స్క్రీన్ ప్లే రచన నేర్చుకుంటూ వస్తున్నాం. ఇప్పడు సెకండాఫ్ మిడిల్ – 2 లో ఇంటర్ ప్లే, సీక్వెన్సుల అమరిక, వగైరా ఎలా వున్నాయో తెలుసుకుందాం. ఇంటర్వెల్లో శివ బృందంలోని మల్లిని చంపించేస్తాడు భవానీ. దీని తర్వాత  మిడిల్- 2 వన్ లైన్ ఆర్డర్ కింది విధంగా వుంటుంది...
        51.  శివ హత్యకి గురయిన మల్లి శవాన్ని హాస్పిటల్లో చూడ్డం, మల్లి నాన్నమ్మ సీఐని నిలదీయడం.
        52.  శివతో సీఐ తాను భవానీని ఏమీ చేయలేనని నిస్సహాయత వెల్లడించడం, మల్లి హత్యకి ప్రతీకారంగా భవానీని చంపడం కాకుండా, భవానీ లాంటి వాళ్ళని  తయారు చేస్తున్న వ్యవస్థని నాశనం చేస్తానని  శివ అనడం.
       
53.  ఇంటిదగ్గర వదిన శివ వల్లే తన కూతురు కీర్తి ప్రమాదంలో పడిందని ఆరోపిస్తే, వాళ్ళ క్షేమం కోసం శివ ఇల్లు వదిలి వెళ్ళిపోవడం.
        54.  ఆశా శివాని తమ ఇంట్లో వుండమనడం, తన దగ్గర వుండమని చిన్నా ఆఫర్ ఇవ్వడం.
        55. 
వీధిలో టీ స్టాల్ ఓనర్ భవానీ వసూళ్లు చేస్తున్న మామూళ్ళ గురించి వాపోతే, ఈ రోజు నుంచీ ఎవ్వరూ భవానీకి మామూళ్ళు ఇవ్వడానికి వీల్లేదని శివ ఆజ్ఞాపించడం.
       
56.  ఫ్యాక్టరీ  యజమాని కార్మికుల కోర్కెలు తీర్చకుండా సమ్మె ఆపమని భవానీకి డబ్బు అందించడం.
       
57.  కార్మిక నాయకుడు కృష్ణా రెడ్డి భవానీ దగ్గరకొచ్చి,  ఇలా సమ్మె ఆపితే తనకి చెడ్డ పేరొస్తుందని వాపోతే, చెప్పినట్టు చెయ్యమని భవానీ అనడం.  భవానీ దగ్గరికి నానాజీ వచ్చి,  మల్లి హత్య కేసులో శివ గ్రూప్ గణేష్ మీద కంప్లెయింట్ ఇచ్చారని, గణేష్ ని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైందనీ అంటే, శివని చంపెయ్యమని భవానీ ఆదేశించడం.
       
58.  రాత్రి పూట శివ ఇంటిమీద భవానీ అనుచరుల మీద దాడి, వాళ్ళని ఎదుర్కొని శివ ఒకణ్ణి బందీగా పట్టుకోవడం.
       
59.  బందీగా పట్టుకున్న అనుచరుణ్ణి భవానీ దగ్గరికి తెచ్చి పడేసి- ఈ రోజునుంచి భవానీకి సంబంధించిన  ప్రతీదీ నాశనం చేస్తానని శివ ఇవ్వడం.
       
60.  కల్లు కాంపౌండ్ మీద శివ గ్రూపు దాడి చేయడం.
       
61.  శివ దగ్గరికి కృష్ణా రెడ్డి వచ్చి సమ్మెకి సపోర్టు అడగడం, బదులుగా కార్మికుల సపోర్టు శివకే వుంటుందని అనడం.
       
62.  ఇది  భవానీకి తెలిసిపోయి- శివ కుటుంబం గురించి ఆరా తీయడం, ఆశాని శివ పెళ్లి చేసుకోబోతున్నాడని తెలుసుకోవడం.
       
63.  భవానీ అనుచరులు ఆశాని కిడ్నాప్ చేస్తే శివ వచ్చి కాపాడుకోవడం.
       
64.  ఆశా భద్రత గురించి శివ ఆందోళన చెందితే, ఆశా ప్రేమని వ్యక్తం చేయడం.
       
65.  శివ ఆశాలు ఆశా అన్న (సీఐ) కి తమ పెళ్లి గురించి చెప్పడం.
       
66.  పెళ్లయిపోయిన అర్ధంలో డ్యూయెట్.
       
67.  నానాజీ వచ్చి బార్ వాడు మామూళ్ళు ఇవ్వడం లేదనీ, ఏరియాలో ఎవ్వరూ కేర్ చేయడం లేదనీ భవానీకి చెప్పడం.
       
68.  పెళ్ళయ్యాక శివ తనకే  వుండాలన్న స్వార్ధం పెరిగిపోయిందని, అతను జనం కోసం తిరుగుతోంటే భరించలేక పోతున్నానని అన్నదగ్గర ఆశా బాధ పడడం.
       
69.  శివ అన్న కూతుర్ని వెంటబెట్టుకుని శివ ఇంటికి రావడం, తనకి ట్రాన్స్ ఫర్ అయ్యిందని చెప్పడం, ట్రాన్స్ ఫర్ అతడి భద్రత కోసమే తను చేయించానని తర్వాత ఆశాతో శివ అనడం.
       
70.  శివ- ఆశాల డ్యూయెట్.
       
71.  శివ మీద ఎందుకుచర్య తీసుకోవడం లేదని మాచిరాజు వచ్చి భవానీని తిట్టడం,  అహం దెబ్బ తిన్న భవానీ ఫైనల్ గా వారం రోజుల్లో ఫినిష్ చేస్తాననడం. భవానీ అనుచరుడు డబ్బు అడిగితే భవానీ వాణ్ణి కొట్టడం.
       
72. దెబ్బ తిన్న భవానీ అనుచరుడు చిన్నాకి కాల్ చేసి, పది వేలు  పట్టుకుని ఊర్వశి బార్ కి వస్తే గణేష్ ఆచూకీ చెప్తాననడం.
       
73. ఈ విషయం చెప్పడానికి శివ దగ్గరికి చిన్నా వెళ్తే శివ లేకపోవడం.
       
74. చిన్నా తనే బార్ కి వెళ్లి భవానీ అనుచరుణ్ణి కలవడం, అక్కడికే వచ్చేసిన భవానీ ఆ అనుచరుణ్ణి చంపడం, చిన్నా పారిపోవడం.
       
75. పారిపోతున్న చిన్నాని పట్టుకుని భవానీ అనుచరులు చంపెయ్యడం.
       
76. శివకి చిన్నా రాసిన చీటీ అంది బార్ కి వెళ్ళడం.
       
77. బార్ లో దాక్కున్న గణేష్ ని శివ పట్టుకుని కొట్టడం.
       
78.  గణేష్ ని  పోలీస్ స్టేషన్ ముందు తెచ్చి పడేసి శివ వెళ్ళిపోవడం.
**మిడిల్ సమాప్తం**


              51 వ సీనులో మల్లి హత్యోదంతంతో ఎత్తుకుని, 78వ సీన్లో గణేష్ ని శివ పట్టుకుని పోలీస్ స్టేషన్ ముందు పడెయ్యడంతో 27 సీన్లతో మిడిల్-2 విభాగం ముగిసింది. మిడిల్ -2 విభాగం ముగియడమంటే ప్లాట్ పాయింట్ -2 ఏర్పడ్డమే.  మిడిల్ -1 విభాగం ఫస్టాఫ్ లో 22 వ సీన్లో క్యాంటీన్లో శివా అతడి గ్రూపూ ఎలక్షన్స్ గురించి చర్చించుకుంటూ, భవానీ మనిషి జేడీ మీద శివ పోటీ చేయాలని గ్రూపు అంటే,  కాదని నరేష్ ని నిలబెడదామని శివ అనడంతో ప్రారంభమవుతుంది. అది ప్లాట్ పాయింట్ -1.  అంటే అక్కడ్నించీ ప్రారంభమయ్యే మొత్తం మిడిల్ విభాగం సెకండాఫ్ లో గణేష్ ని శివ పట్టుకుని పోలీస్ స్టేషన్ ముందు పడేసే 78వ సీను దగ్గర ప్లాట్ పాయింట్- 2 గా ముగుస్తుందన్న మాట. అంటే ప్లాట్ పాయింట్ -1 కీ, ప్లాట్ పాయింట్- 2 కీ మధ్య  మొత్తం మిడిల్ విభాగం నిడివి 56 సీన్లతో వుందన్న మాట.  ఇది మొత్తం స్క్రీన్ ప్లే లో 50 శాతంగా  ప్రమాణాల ప్రకారమే  వుంది. 
        
           ఇప్పుడు  మిడిల్ -2 నిర్మాణం  ఎలా జరిగిందో చూద్దాం : ఈ 27 సీన్లూ రెండు సీక్వెన్సులుగా ఏర్పడ్డాయి. మొదటి సీక్వెన్స్ టాపిక్ భవానీని చంపడంగా కాకుండా,భవానీ  లాంటి వాళ్ళని సృష్టిస్తున్న వ్యవస్థని నాశనం చేయడం; రెండో సీక్వెన్స్ టాపిక్ వచ్చేసి మల్లి హత్య కేసులో నిందితుడైన గణేష్ ని పట్టుకోవడం. ఈ రెండు టాపిక్స్ తో ఈ రెండు సీక్వెన్సులూ నడుస్తాయి. టాపిక్స్ నిర్ణయించుకుంటే సీక్వెన్సులు నడపడం సులభం. ఈ టాపిక్స్ థీమ్ తో (కాన్సెప్ట్ తో) మమేకం అవాలి. 

        ఇక్కడ రెండు సీక్వేన్సుల ప్రారంభాలకీ  52, 57 సీన్లలోనే బీజాలు పడ్డాయి.
52 వ సీన్లో శివతో సీఐ తాను భవానీని ఏమీ చేయలేనని నిస్సహాయత వెల్లడించడంతో, దీనికి మల్లి హత్యకి ప్రతీకారంగా భవానీని చంపడం కాకుండా, భవానీ లాంటి వాళ్ళని  తయారు చేస్తున్న వ్యవస్థని నాశనం చేస్తానని  శివ అనే మొదటి టాపిక్ తో, మొదటి సీక్వెన్స్ కి బీజం పడింది. 

        అలాగే 57 వ సీన్లో, మల్లి హత్య కేసులో శివ గ్రూప్ గణేష్ మీద కంప్లెయింట్ ఇచ్చారని, గణేష్ ని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైందనీ భవానీతో నానాజీ  అనే మాటగా రెండో టాపిక్ తో, రెండో సీక్వెన్సుకి బీజం పడింది.

        కానీ రెండు సీక్వెన్సులూ ఈ రెండు టాపిక్స్ తో ఏకకాలంలో సమాంతరంగా నడవలేదు. అలా నడిపి వుంటే చాలా గజిబిజి అయ్యదే. ఇప్పుడు  చాలా సినిమాల్లో సీక్వెన్సుల విధానం తెలీక టాపిక్స్ ని గజిబిజి చేసి నడిపిస్తున్నారు. ‘శివ’ లో ఎత్తుకున్న మొదటి టాపిక్ తో మొదటి సీక్వెన్స్ ని ముగించాకే, రెండో టాపిక్ ని ఎత్తుకుని  రెండో సీక్వెన్స్ ని నడిపారు.

        పై వన్ లైన్ ఆర్డర్ లో మొదటి టాపిక్ కి సంబంధించిన సీన్స్ ని గమనిస్తే – 55,56,57,58,59,60,61,62,63,67,71 సీన్లలో వ్యవస్థని నాశనం చేసే మొదటి టాపిక్ తాలూకు విషయం ప్రవహిస్తుంది. మొదటి టాపిక్ ఎత్తుకున్న 52 వ సీనుతో కలుపుకుని మొత్తం 13 సీన్లుగా మొదటి సీక్వెన్స్ నడుస్తుంది. 52 వ సీనులో వ్యవస్థని నాశనం చేస్తానని శివ అనడంతో మొదలై, 71 వ సీనులో ఆ  వ్యవస్థకి మూలపురుషుడైన మాచి రాజు, భవానీ దగ్గర కొచ్చేసి క్లాసు పీకడంతో మొదటి సీక్వెన్స్ కొలిక్కొస్తుంది. 

        ఈ మొదటి సీక్వెన్సు  నడిచే 52- 71 సీన్ల మధ్య 57 వ సీన్లో బీజం పడేప్పుడు తప్పితే, రెండో టాపిక్ కి సంబంధించిన సీన్లు గానీ, దాని  ప్రస్తావన గానీ ఎక్కడా లే కపోవడాన్ని గమనించాలి. స్ట్రక్చర్ అంటే ఇదే. 

        ఈ మొదటి సీక్వెన్స్ స్ట్రక్చర్ చూద్దాం : 

బిగినింగ్ -ఎత్తుగడతో సాధారణ స్థితి :     51.  శివ హత్యకి గురయిన మల్లి శవాన్ని హాస్పిటల్లో చూడ్డం, మల్లి నాన్నమ్మ సీఐని నిలదీయడం.
       
52.  శివతో సీఐ తాను భవానీని ఏమీ చేయలేనని నిస్సహాయత వెల్లడించడం, మల్లి హత్యకి ప్రతీకారంగా భవానీని చంపడం కాకుండా, భవానీ లాంటి వాళ్ళని  తయారు చేస్తున్న వ్యవస్థని నాశనం చేస్తానని  శివ అనడం.      
       
55.  వీధిలో టీ స్టాల్ ఓనర్ భవానీ వసూళ్లు చేస్తున్న మామూళ్ళ గురించి వాపోతే, ఈ రోజు నుంచీ ఎవ్వరూ భవానీకి మామూళ్ళు ఇవ్వడానికి వీల్లేదని శివ ఆజ్ఞాపించడం.
       
56.  ఫ్యాక్టరీ  యజమాని కార్మికుల కోర్కెలు తీర్చకుండా సమ్మె ఆపమని భవానీకి డబ్బు అందించడం.
       
57.  కార్మిక నాయకుడు కృష్ణా రెడ్డి భవానీ దగ్గరకొచ్చి,  ఇలా సమ్మె ఆపితే తనకి చెడ్డ పేరొస్తుందని వాపోతే, చెప్పినట్టు చెయ్యమని భవానీ అనడం.  భవానీ దగ్గరికి నానాజీ వచ్చి,  మల్లి హత్య కేసులో శివ గ్రూప్ గణేష్ మీద కంప్లెయింట్ ఇచ్చారని, గణేష్ ని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైందనీ అంటే, శివని చంపెయ్యమని భవానీ ఆదేశించడం.

మిడిల్ శివ మీద దాడితో అసాధారణ స్థితి- సంఘర్షణ :
       
58.  రాత్రి పూట శివ ఇంటిమీద భవానీ అనుచరుల మీద దాడి, వాళ్ళని ఎదుర్కొని శివ ఒకణ్ణి బందీగా పట్టుకోవడం.
       
59.  బందీగా పట్టుకున్న అనుచరుణ్ణి భవానీ దగ్గరికి తెచ్చి పడేసి- ఈ రోజునుంచి భవానీకి సంబంధించిన  ప్రతీదీ నాశనం చేస్తానని శివ ఇవ్వడం.
చేస్తున్న వ్యవస్థని నాశనం చేస్తానని  శివ అనడం.

       
60.  కల్లు కాంపౌండ్ మీద శివ గ్రూపు దాడి చేయడం.
       
61.  శివ దగ్గరికి కృష్ణా రెడ్డి వచ్చి సమ్మెకి సపోర్టు అడగడం, బదులుగా కార్మికుల సపోర్టు శివకే వుంటుందని అనడం.
       
62.  ఇది  భవానీకి తెలిసిపోయి- శివ కుటుంబం గురించి ఆరా తీయడం, ఆశాని శివ పెళ్లి చేసుకోబోతున్నాడని తెలుసుకోవడం.
       
63.  భవానీ అనుచరులు ఆశాని కిడ్నాప్ చేస్తే శివ వచ్చి కాపాడుకోవడం.
       
67.  నానాజీ వచ్చి బార్ వాడు మామూళ్ళు ఇవ్వడం లేదనీ, ఏరియాలో ఎవ్వరూ కేర్ చేయడం లేదనీ భవానీకి చెప్పడం.

ఎండ్ పరిష్కారం : 
       
71.  శివ మీద ఎందుకుచర్య తీసుకోవడం లేదని మాచిరాజు వచ్చి భవానీని తిట్టడం,  అహం దెబ్బ తిన్న భవానీ ఫైనల్ గా వారం రోజుల్లో ఫినిష్ చేస్తాననడం. భవానీ అనుచరుడు డబ్బు అడిగితే భవానీ వాణ్ణి కొట్టడం.  

వివరణ :
         
ఈ సీక్వెన్సులో మధ్య మధ్యలో శివ- ఆశాల ప్రేమా పెళ్ళీ తాలూకు సీన్లు; అన్న, వదిన, కీర్తి తాలూకు సీన్లూ డ్యూయెట్లూ వున్నాయి. ప్రధాన కథతో సంబంధం లేకుండా ఇవి సబ్ ప్లాట్ సీన్లూ - పాటలు. ఫస్టాఫ్ నుంచి ఈ సబ్ ప్లాట్ కంటిన్యూ అవుతోంది.
***
       ఇక రెండో సీక్వెన్స్  72-78 సీన్ల మధ్య 7 సీన్లతో నడుస్తుంది. రెండో సీక్వెన్స్ నిడివి ఎప్పుడూ తక్కువే వుంటుంది. ఫస్టాఫ్ లో మిడిల్-1 కి రెండో సీక్వెన్స్ ని కూడా గమనిస్తే, అది 10 సీన్లతోనే వుంటుంది. కానీ మొదటి సీక్వెన్స్ 16 సీన్లతో వుంటుంది. ఫస్టాఫ్ లో రెండో సీక్వెన్స్ ఎప్పుడూ ఇంటర్వెల్ కి దారి తీసే పించ్ -1 దగ్గర ప్రారంభమైనట్టు, సెకండాఫ్ లో కూడా రెండో సీక్వెన్స్  ప్లాట్ పాయింట్ -2 కి ప్రేరేపించే పించ్ - 2 దగ్గరే ప్రారంభమ
వుతుంది. అందుకని వీటి నిడివి ఎప్పుడూ తక్కువే వుంటుంది. పించ్- 1, పించ్- 2 లకి దారితీసే సీక్వెన్స్ లెప్పుడూ చప్పున ముగుస్తాయి. 

        ఇప్పుడు చూద్దాం :  మొదటి సీక్వెన్స్ లోని 57 వ సీన్లోనే రెండో సీక్వెన్స్ టాపిక్ కి బీజం పడిందని పైన గమనించాం. గణేష్ ని పట్టుకునే టాపిక్. మొదటి సీక్వెన్స్ 71 వ సీనుతో ముగిసింది. ఈ సీను ముగింపులోనే రెండో సీక్వెన్స్ ప్రారంభమయ్యింది. ఎలాగంటే డబ్బడిగిన అనుచరుణ్ణి భవానీ లాగి కొట్టాడు. ఈ లాగి కొట్టడమే గణేష్ దొరికిపోవడమనే రెండో సీక్వెన్స్ కి ‘కీ’ ఇచ్చినట్టయ్యింది.

బిగినింగ్ -ఎత్తుగడతో సాధారణ స్థితి : 
       
72. దెబ్బ తిన్న భవానీ అనుచరుడు చిన్నాకి కాల్ చేసి, పది వేలు  పట్టుకుని ఊర్వశి బార్ కి వస్తే గణేష్ ఆచూకీ చెప్తాననడం. 
       
73. ఈ విషయం చెప్పడానికి శివ దగ్గరికి చిన్నా వెళ్తే శివ లేకపోవడం. 

మిడిల్ అనుచరుడి హత్యతో అసాధారణ స్థితి- సంఘర్షణ :
       
74. చిన్నా తనే బార్ కి వెళ్లి భవానీ అనుచరుణ్ణి కలవడం, అక్కడికే వచ్చేసిన భవానీ ఆ అనుచరుణ్ణి చంపడం, చిన్నా పారిపోవడం. 
       
75. పారిపోతున్న చిన్నాని పట్టుకుని భవానీ అనుచరులు చంపెయ్యడం.
       
76. శివకి చిన్నా రాసిన చీటీ అంది బార్ కి వెళ్ళడం. 

ఎండ్ పరిష్కారం : 
       
77. బార్ లో దాక్కున్న గణేష్ ని శివ పట్టుకుని కొట్టడం.
       
78.  గణేష్ ని  పోలీస్ స్టేషన్ ముందు తెచ్చి పడేసి శివ వెళ్ళిపోవడం.

        ఇలా ముగిసే  మిడిల్- 2 ని మనమొకసారి పరిశీలిస్తే, ఫస్టాఫ్ లో మిడిల్-1 లో కేవలం భవానీతో సంఘర్షిస్తూ వుండిన శివ, సెకండాఫ్ మిడిల్ -2 కి వచ్చేసి, భవానీని కాదు, అంతం చేయాల్సింది భవానీలాంటి మాఫియాల్ని తయారు చేస్తున్న వ్యవస్థని అనీ  తెలుసుకుని, ఆ మేరకు తన గోల్ ని మరింత విస్తరించడంతో పాత్ర చిత్రణకి సంబంధించి క్యారక్టర్ డెవలప్ మెంట్, గ్రోత్, మెచ్యూరిటీ ఇవన్నీకనపడుతున్నాయి. 

        52 వ సీన్లో - ‘నా తప్పు నాకిప్పుడు అర్ధమవుతోంది. రౌడీయిజానికి ఎదురు తిరిగాను కానీ అదొక్కటే సరిపోదని తెలిసింది. మల్లిని చంపాడన్న కోపంతో నేను భవానీని చంపితే, వ్యక్తిగతంగా నా పగ తీర్చుకోవడమే తప్ప, ఇంకేమీ జరగదు. ఈ భవానీ కాకపోతే రేపు గణేష్ భవానీ అవుతాడు, లేకపోతే ఇంకొకడు. దీనికి సొల్యూషన్ భవానీని చంపడం కాదు, అలాటి గూండాల్ని పుట్టిస్తున్న వ్యవస్థని నాశనం చెయ్యాలి- గెలుస్తానో లేదో తెలీదు, కానీ ప్రయత్నిస్తాను-‘ అని సీఐ తో శివ అనడం పాత్ర మానసికంగా ఎదిగిందనేందుకు నిదర్శనం. ‘నా తప్పు నాకిప్పుడు అర్ధమవుతోంది. రౌడీయిజానికి ఎదురు తిరిగాను కానీ అదొక్కటే సరిపోదని తెలిసింది...’ అని ఒప్పుకోవడం ప్రేక్షకులకి ఎంతో కనెక్ట్ అవుతుంది. తప్పు చేయడంతో హీరో కూడా తమలాంటి సాధారణ మానవమాత్రుడే నన్న ఫీల్ తో ప్రేక్షకులు కరిగిపోతారు. అంతేగాక, వ్యూహం మార్చడం కోసం హీరో ఆలోచనలు ప్రేక్షకులకి తెలియాలి. ఇప్పటి సినిమాల్లో అరుపులు అరిచి నరకడమే తప్ప- ఆలోచనలు తెలిపి ప్రేక్షకుల్ని దగ్గర చేసుకునే విధానం లేదు.  భవానీ కూడా ఎంత చక్కగా తన వ్యూహం తాలూకు ఆలోచనలు ప్రేక్షకులకి తెలుపుతాడంటే- శివ గణేష్ మీద కంప్లెయింట్ ఇచ్చాడని తెలిశాక - 57వ సీన్లో- ‘నానాజీ. మన బిజినెస్ లో ఎప్పుడూ ఎదుటివాడి దెబ్బ కోసం వెయిట్ చేయడం మంచిది కాదు, ముందు మన దెబ్బ పడిపోవాలి-’ అని! ఇలా చెప్పి రెండో ఇన్నింగ్స్ దాడులు ప్రారంభిస్తాడు. 

        వీటితో జతకూడే ఆశాతో రిస్కూ పెరిగి, పరిణామాల హెచ్చరికలూ రెండింత లయ్యాయి. అదే సమయంలో మిడిల్ -1 బిజినెస్ ప్రకారం ఏ యాక్షన్- రియాక్షన్ లతో కూడిన సంఘర్షణ ప్రారంభమయ్యిందో,  అది మరింత బలపడి మిడిల్ -2 లోనూ కొనసాగడం గమనించ వచ్చు.

        ప్లాట్ పాయింట్ -2 ఎప్పుడూ కథ ముగించడానికి పరిష్కార మార్గం లభించే దృశ్యంతో వుంటుంది. అలా శివ గణేష్ ని పట్టుకుని కోర్టుకి అప్పగించడానికి పోలీసులకి సాయపడుతూ, వాణ్ణి తెచ్చి పోలీస్ స్టేషన్ ముందు పడేసే దృశ్యంతో ఈ మిడిల్ విభాగం స్ట్రక్చర్ పరిసమాప్తమవుతోంది.


-సికిందర్
ఎక్సర్ సైజులు:
1. ఏదైనా సినిమా దగ్గర పెట్టుకుని చూస్తూ దాని వన్ లైన్ ఆర్డర్ రాయండి.
2. ఆ వన్ లైన్ ఆర్డర్ లో బిగినింగ్- మిడిల్- ఎండ్ విభాగాల్ని గుర్తించండి.
3. వీటిలో సీక్వెన్సులు కనిపెట్టి, వాటిలో బిగినింగ్-మిడిల్- ఎండ్ విభాగాల్ని గుర్తించండి.
4. ఏదైనా సినిమా చూసి దాని కథ రెండు పేరాల్లో రాయండి.

-








       

       



       



17, సెప్టెంబర్ 2016, శనివారం

రుస్తుం సంగతులు- 3






రుస్తుం ది ఒకే  అర్ధవంతమైన పెద్ద కథ కాదనీ,  రెండు అసమగ్ర  కథల కథావళీ అనీ గత రెండు వ్యాసాల్లో గుర్తించాం. ఒకటి భార్య ద్రోహ కథ ఫస్టాఫ్ లో- రెండు భర్త దేశభక్తి కథ సెకండాఫ్ లో. భార్య ద్రోహ కథగా మొదలై  భర్త దేశభక్తి కథగా మారిపోయేలాటి  డబుల్ సిమ్ సినిమా ఇది. సెకండాఫ్ సిండ్రోమ్ అంటారు ఈ వ్యాధిని. ఫస్టాఫ్ లో డెంగ్యూ దోమ కుడితే సెకండాఫ్ లో చికెన్ గున్యా దోమ కుట్టినట్టు వుంటుంది మనకి. అంతే గానీ  పరిశుభ్రమైన చికెన్ బిర్యానీ లాంటి డిష్ పెట్టాలనుకోరు మనకి. హిందీలో తక్కువేగానీ తెలుగులో ఈ మోజు ఎక్కువే వుంది- ధమ్, దొంగోడు, జ్యోతో లక్ష్మి, సైజ్ జీరో,  జనతా గ్యారేజ్, జ్యో అచ్యుతానంద- లాంటివి ఎన్నో వచ్చాయి, ఇంకా వస్తాయి. ‘రుస్తుం’ ఫస్టాఫ్ లో భార్య ద్రోహ కథైనా ఎంత అసహజంగా వుందో గత వ్యాసంలో చూశాక, ఇక సెకండాఫ్ లో సాగే భర్త దేశభక్తి కథ కూడా ఇంకెంత అసహజంగా వుంటుందో ఇప్పుడు చూద్దాం...
          హీరోని గొప్ప దేశభక్తుడిగా తేల్చడానికి  నేవీ స్కామ్ అనే ఒకదాన్ని సృష్టించారు. బ్రిటన్ లో  ఒక యుద్ధ నౌక అమ్మకానికొస్తుంది. దాన్ని కొనుగోలు చేయాలనీ నావికా దళం నిర్ణయిస్తుంది.  ఇన్స్ పెక్షన్ అధికారిగా రుస్తుం వెళ్లి పరిశీలిస్తాడు. అది కాలం చెల్లిన యుద్ధ నౌకలా వుందని అన్ ఫిట్ సర్టిఫికేట్ ఇస్తానంటాడు.  కాదు పాజిటివ్ రిపోర్టు ఇవ్వాలని నేవీ అధికారులు ఒత్తిడి చేస్తారు. బాగా డబ్బు కూడా ఇస్తామంటారు. ఈ అవినీతినికి ఒప్పుకోడు రుస్తుం. దీన్నాపాలని  నిర్ణయించుకుంటాడు. ఈ నేవీ అధికారుల వెనుక విక్రం (రుస్తుం భార్య ప్రియుడు) వున్నాడని కూడా తెలుసుకుంటాడు. నేవీ అధికారులకీ రుస్తుం కీ మధ్య ఈ సమస్య నలుగుతూ వుంటుంది. రుస్తుం డిఫెన్స్ సెక్రెటరీ దృష్టికి కూడా తీసుకుపోతే అతనూ ఈ స్కామ్  లో భాగస్థుడేనని అర్ధమౌతుంది. ఇక రుస్తుం ఒక ఆలోచన చేసి వాళ్ళు చేస్తున్న స్కామ్ తాలూకు పత్రాలు తన దగ్గరున్నాయనీ,  వాటిని బయట పెడతాననీ బెదిరిస్తాడు. 

        బ్యాక్ గ్రౌండ్ లో ఈ కథ నడుస్తూండగానే  తన భార్య- విక్రంల ఎఫైర్ తెలుస్తుంది రుస్తుం కి (ఈ ఎఫైర్ తెలియడమే స్క్రీన్ ప్లేకి  ప్రారంభం). అప్పుడు విక్రం ని చంపడానికి వెళ్తూ రుస్తుం మధ్యలో పోస్టాఫీసు కెళ్ళి డిఫెన్స్ సెక్రెటరీకి ట్రంక్ కాల్ చేసి వాదన పెట్టుకుంటాడు. ఇప్పుడు విక్రం ని వదలనని అనేస్తాడు. వెళ్లి విక్రం ని కాల్చి చంపేస్తాడు. 

        ఇదీ హత్య వరకూ జరిగిన స్కామ్ పూర్వ కథ. దీని తర్వాత కోర్టులో ఇదెలా తేలిందో చూద్దాం : విక్రం ని చంపి పోలీసులకి లొంగిపోతాడు రుస్తుం. నిజ కథలో అయితే నానావతి ప్రోటోకాల్ ప్రకారం నేవీ అధికారులకే లొంగిపోతాడు. నేవీ అధికారులు బొంబాయి పోలీసులకి అప్పగిస్తారు ఫార్మాలిటీస్ పూర్తిచేసి. అయితే ఇక్కడ కోర్టులో కూడా రుస్తుం వచ్చి అడుగుతున్న నేవీ అధికారుల కస్టడీకి వెళ్ళననీ, పోలీస్ కస్టడీలోనే ఉంటాననీ వాదిస్తాడు. ఎందుకిలా అంటున్నాడో మనకి అర్ధం కాదు. కథ చివర్లో నేవీ స్కామ్ ని రివీల్ చేసినప్పుడు అర్ధమవుతుంది- నేవీ అధికారులు తన విరోధులు కాబట్టి, వాళ్ళల్లో ఒకడైన విక్రంని తను చంపాడు కాబట్టి,  వాళ్ళ కస్టడీకి వెళ్ళ ననడాన్ని అర్ధం జేసుకోవచ్చు.       కానీ ఎవరి కస్టడీలో ఉండాలో నిందితుడికి కోర్టు ఛాయిస్ నిస్తుందా- కోర్టుదే నిర్ణయమవుతుంది గాని? ఇదీ ప్రశ్న. పోనీ దర్శకుడు తన ఇష్టానుసారం కథ నడుపుకోవడం కోసం కోర్టు కాస్త లైట్ తీసుకుని  పోలీస్ కస్టడీకే ఇచ్చిందనుకుందాం- అప్పుడా పోలీసులైనా ఒక నిందితుడుగా వున్న  రుస్తుంని కస్టడీలోకి తీసుకున్నాక,  ఇంకా అతణ్ణి నేవీ యూనిఫాంలోనే అనుమతించరు కదా? మళ్ళీ ఆ యూనిఫాంలోనే  జడ్జీ ఎదురుగా హాజరు పర్చరు కదా? నేవీలో అతను సస్పెండ్ అయ్యాక యూనిఫాం వేసుకునే అధికారమే వుండదు కదా- మెడల్స్ తో సహా అన్నీ సరెండర్ చేయాల్సిందే కదా? 
          సరే, పోలీసులు కూడా దర్శకుడి హంగామా చూసి రూల్స్ ని కాస్త  లైట్ గానే తీసుకున్నారే అనుకుందాం- అతణ్ణి జ్యుడీషియల్  కస్టడీకి జైలుకి తరలించినప్పుడైనా  జైలు మాన్యువల్ ప్రకారం ఖైదీ దుస్తుల్లోకి అతను మారిపోవాల్సిందే కదా? మళ్ళీ జైలు అధికారులు కూడా దర్శకుడి తడాఖాకి తట్టుకోలేక సరేలేరా బాబూ నీ కథ కోసం, హీరోగార్ని నేవీ డ్రెస్ లోనే  రిచ్ గా, గ్రాండ్ గా ప్రతీ ఫ్రేములో చూపించడం కోసం – డ్రస్సు వుంచుకోఫో- అనేసి  మరీ లైట్ గా తీసుకున్నారే అనుకుందాం- మరి హత్య చేసిన హీరో ఆ డ్రెస్ తీయకుండా ఎలాటి సంకేతాలు ఇస్తున్నట్టు  తన పాత్రపరంగా? - నేను దేశాన్ని రక్షించే నేవీ ఆఫీసర్ని, నన్ను మీరు చట్టాలకి అతీతుడుగా, ప్రత్యేకంగా చూడాలి, ఆమేరకు తీర్పు ఇవ్వాలి సుమా - అని కోర్టుని బెదిరిస్తున్నట్టు లేదూ పాత్ర?  ఎన్నిసార్లు ఎక్కడెక్కడ ఎలా ఈ డ్రెస్ లాజిక్ ని ఎగేసినా, అంతిమంగా పాత్ర చిత్రణనే  దెబ్బతీసింది కదా, ఈ యూనీఫాం ధారణ? లాజిక్ ని చూడొద్దు, సినిమాని సినిమాలాగే చూడాలన్న వితండ వాదన చేస్తే  ఇలాగే నాన్సెన్స్ గా తయారవచ్చు పాత్రలు!

          ఇక సొంతంగా కేసు వాదించుకునే విషయం. ఇది కోర్టులు అనుమతించేదే (pro se legal representation).  ఐతే నానావతి తన కేసు తాను వాదించుకోలేదు.  ‘యే రాస్తే హై ప్యార్ కే’ లో నిందితుడైన సునీల్ దత్ కూడా తన కేసు వాదించుకోడు. అతడి తరపున లాయర్ పాత్రలో అశోక్ కుమార్ వాదిస్తాడు. సునీల్ దత్, అశోక్ కుమార్ వీళ్ళంతా ఆరోజుల్లో స్టార్స్. కాబట్టి ఒక స్టార్ నిందితుడి స్థానంలో పాసివ్ గా వున్నా, రెండో స్టార్ కేసు వాదిస్తూ యాక్టివ్ గా ఉండడంతో బాక్సాఫీసు లెక్క భర్తీ అయింది. కానీ ‘రుస్తుం’ లో ఫస్టాఫ్ లో హత్య చేసిన దగ్గర్నుంచీ పోలీసుల బందీగా ఏమీ చేయక పాసివ్ గా వుండిపోయే అక్షయ్  కుమార్ లాంటి స్టార్,  ఇక యాక్టివ్ అవకపోతే సినిమా లేదు. లాయర్ గా ఇంకో స్టార్ ని  తెచ్చిపెట్టాలనుకోలేదు. అందుకని సెకండాఫ్ లో కోర్టు విచారణలో అక్షయ్ ని యాక్టివేట్ చేసినట్టుంది- అందుకే తన కేసు తను వాదించుకునే పాయింటు తెరపైకొచ్చిందని అర్ధం జేసుకోవాలి. 


        సరే, రుస్తుం యాక్టివ్ పాత్ర అయ్యాడు. కేసు విచారణ రుస్తుం భార్యతో విక్రం శారీరక సంబంధం కారణంగా హత్య అనే కోణంలోనే సాగుతూండగా, రుస్తుం ఇంట్లో దుండగుల సోదాతో నేవీ స్కామ్ కోణం మళ్ళీ తెరపైకొస్తుంది. రుస్తుం భార్య జైలుకొచ్చి దుండగుల గురించి  రుస్తుంకి చెప్తే, అది ముఖ్యమైన పత్రాల కోసం నేవీ అధికారులు చేసిన కుట్ర అని చెప్పి, వాళ్లకి ఒక డిమాండ్ పెట్టమని కవర్ అందిస్తాడు. అందులో స్విస్ బ్యాంక్ ఎక్కౌంట్ వివరాలుంటాయి.


      ఇప్పుడు ప్రశ్న: రుస్తుం స్విస్ బ్యాంక్ ఎక్కౌంట్ ఎప్పుడు  ఓపెన్ చేశాడు? విక్రం ని చంపడానికి వెళ్తూ పోస్టాఫీసుకి వెళ్లి డిఫెన్స్ సెక్రెటరీతో  ట్రంకాల్ మాటాడినప్పుడే ఎక్కౌంట్ ఓపెన్ చేశాడని విచారణలో తేలుతుంది. అంటే అతను స్విస్ బ్యాంకు అధికార్లతో ఫోన్లో మాట్లాడేసి, ఎకౌంట్ ఓపెన్ చేయించుకుని, అప్పటికప్పుడే ఎక్కౌంట్ నంబర్ కూడా పొందేశాడా- ఇది సాధ్యమా?


        ఆ ఎక్కౌంట్ నంబర్ వున్న కవరు కూడా ఇంకా జేబులోనే పెట్టుకు తిరుగుతున్నాడా? పోలీసులుగానీ, జైలు అధికారులుగానీ స్వాధీనం చేసుకోలేదా?
        ఇక రుస్తుం భార్య వెళ్లి నేవీ అధికారులకి ఆ పత్రాలు కావాలంటే ఐదు కోట్లు ఇవ్వాలని బేరం పెడుతుంది. 1959 లో ఐదు కోట్లు అంటే మామూలు విషయం కాదు. ఆ రోజుల్లో లక్షాధికారులే వుండేవాళ్ళు గానీ కోటీశ్వరుల సంఖ్య తక్కువే. అన్ని కోట్లు ఆ రోజుల్లో నేవీ అధికారులైనా ఎక్కడ్నించి తెచ్చిస్తారో. లక్షల్లో బేరం పెడితే ఇప్పటి ప్రేక్షకులు నవ్వుతారని బిల్డప్ కోసం ఐదుకోట్లు పెట్టారేమో. బాక్సాఫీసు తూకం బాగానే సరిచూసుకుంటున్నారు. ఆ ఐదు కోట్లూ స్విస్ ఎక్కౌంట్ లో వేసేందుకు ఒప్పందం కుదురుతుంది. 


        ఇప్పుడు డిఫెన్స్ సెక్రెటరీతో వ్యవహారం చూద్దాం : కేసు విచారిస్తున్న పోలీసు అధికారి డిఫెన్స్ సెక్రెటరీకి రుస్తుం ట్రంక్ కాల్ చేసిన మాటాడిన ఎవిడెన్స్ కోసం ఢిల్లీ వెళ్లి డిఫెన్స్ సెక్రెటరీని కలుస్తాడు. అప్పుడు డిఫెన్స్ సెక్రెటరీ తన కొచ్చే కాల్స్ అన్నిటినీ రికార్డు చేస్తానని చెప్పి- రుస్తుం కాల్ చేసి మాటాడి నప్పటి ఆడియో టేపు విన్పిస్తాడు. ‘విక్రం ని వదలను’ అన్న మాటలున్న ఆ టేప్ తెచ్చి కోర్టులో పెడతాడు పోలీసు అధికారి. దాంతో కేసు ఓడిపోతాడు రుస్తుం. ఆత్మ రక్షణ కోసం తను హత్య చేయలేదనీ, హత్య చేయాలని ముందు నిర్ణయించుకునే విక్రం దగ్గరి కెళ్ళి చంపాడనీ  రుజువైన దరిమిలా జ్యూరీ ఇక తీర్పు కి సిద్ధమౌతుంది. 


       ఇక్కడ ప్రశ్నలు : డిఫెన్స్ సెక్రెటరీ రుస్తుం మాటల్ని కూడా రికార్డు చేయడం తన డెత్ వారంట్ ని తను రాసుకోవడం కాదా? ఎవడైనా స్కామ్  చేస్తున్న వాడు అలా రికార్డు చేసి దగ్గర వుంచుకుంటాడా అలాటి మాటలు-  అది కూడా అధికారికంగా తన సొంత కార్యాలయంలో? రుస్తుంని పట్టించే ‘విక్రం ని వదలను’  అన్న మాటలున్న మేరకే టేపుని కత్తిరించి కోర్టులో పెట్టినంత మాత్రాన- రుస్తుం కేసు ఓడిపోతాడా? అసలు డిఫెన్స్ సెక్రెటరీకి రుస్తుం భార్య - విక్రంల  శారీరక సంబంధంతో సంబంధమేంటయ్యా బాబూ చెప్పూ- అని కోర్టు అడగదా?  నా భార్యతో సంబంధం పెట్టుకున్నాడు కాబట్టి - విక్రం ని వదలనని రుస్తుం ఎక్కడో డిఫెన్స్ సెక్రెటరీకి కాల్ చేసి ఎందుకు చెప్తాడయ్యా స్వామీ- అని కోర్టు నిలదీయదా? అసలీ ‘విక్రం ని వదలను’ అన్న మాటకి ముందు- మాటకి తర్వాత  వాళ్ళిద్దరేం మాటాడుకున్నారో పూర్తి సంభాషణతో టేపు కోర్టుకి సమర్పిస్తావా, లేకపోతే ఇలాగే ఈ ముక్క పట్టుకుని నకరాలు చేస్తావా?- అని కోర్టు మొట్టికాయ వేయదా?

        అప్పుడు పూర్తి టేపు కోర్టుకి సమర్పించాల్సి వస్తే డిఫెన్స్ అయ్యగారి పనేమౌతుందో?! ఇలా వుంది కథా రచన! సినిమాల్లోనే ఇలాటి భయంకర కథా రచనలుంటాయి- అవి చెల్లిపోతాయి- సినిమాల్ని కళ్ళతో చూస్తారు కాబట్టి. సాహిత్యంలో ఇలాటి భయంకర కథా రచనలు చెల్లవు- మెదడుతో చదువుతారు కాబట్టి. 


        కోర్టు అడగకపోతే అడగకపోయింది- గెలుస్తానన్నట్టు అంత ఫోజుపెట్టి కేసు వాదించుకున్న రుస్తుం కూడా ఈ టేపు ముక్క చెల్లదని  అనడు. ఎందుకంటే స్కామ్   బయట పడుతుందని అట!
        తర్వాత జైల్లో అదే పోలీసు అధికారికి స్కామ్ గురించి మొత్తం చెప్పేస్తాడు- మరి దీన్ని బయట పెట్టి కేసునుంచి విడుదల కావొచ్చుగా? –అని అధికారి అంటే- స్కామ్ బయట పెడితే దేశానికి చెడ్డ పేరొస్తుందని అంటాడు రుస్తుం!
        దేశానికి చెడ్డ పేరొస్తుందని స్కాములు చేసుకునే వాళ్ళని చేసుకోనిస్తూ అలాగే వుండనిస్తా డన్నమాట!


        దీనికి ‘నువ్వు చాలా గొప్ప దేశభక్తుడివి’ – అని మెచ్చుకుంటాడు పోలీసు అధికారి. ‘అయితే స్కామ్ చేస్తున్నాడని విక్రంని దేశభక్తితో చంపావన్న మాట- నీ భార్యతో సంబంధం పెట్టుకున్నందుకు పత్నీ భక్తితో కాదన్న మాట?’ అని మాత్రం అడగడు. అడిగితే ఇరకాటంలో పడతానని దర్శకుడు అడగనిచ్చి వుండడు. 


        కానీ ఒకటి అడిగేస్తాడు పోలీసు అధికారి- ‘ఐదు కోట్లు తీసుకుని స్కామ్ పత్రాలు నేవీ వాళ్లకి ఇచ్చేశావా?’- అని. అప్పుడు  రుస్తుం కొంటెగా నవ్వి- ‘అసలా పత్రాలుంటేగా- వూరికే బుకాయించా’ అంటాడు!


        మరి స్విస్ బ్యాంకు ఎక్కౌంట్లో ఐదు కోట్ల సంగతి అడగాలిగా అధికారి? అదికూడా అడగడు- అడిగితే దర్శకుడు చాలా కన్ఫ్యూజ్ అయిపోతాడని వదిలేసినట్టున్నాడు. 
ఇలా తలతిక్కగా వుంటుంది కథానిర్వహణ! 


        ఇన్ని లోపాలు ఎత్తి చూపిస్తూంటే ఇది చదువుతున్న వాళ్లకి కోపాలు రావొచ్చు. ఇన్ని లోపాలే ఒక దర్శకుడో, రచయితో వెళ్లి హీరోకో, నిర్మాతకో కథ వినిపిస్తే వాళ్ళ అవగాహన కొద్దీ ఎత్తి చూపి- మార్చి రాసుకు రమ్మంటారు. మార్చి మార్చి మళ్ళీ మళ్ళీ  రాయిస్తూంటారు. ఆ టార్చర్ నంతా భరిస్తూ అప్పుడు రాని కోపాలు, ఇప్పుడెందుకు రావాలి?


       ‘రుస్తుం’ లో ఇదంతా కాదు- దేశానికి చెడ్డ పేరొస్తుందని హీరో స్కామ్ ని బయట పెట్టక పోవడం పెద్ద నేరం కాకపోవచ్చు దర్శకుడి దృష్టిలో. కానీ దర్శకుడు పాల్పడ్డ అసలు నేరం వేరే వుంది- దేశానికీ, ఆనాటి నావికా దళానికీ చెడ్డ పేరొచ్చేలా రాసుకున్న ఈ కథతో.          ఈ కథాకాలం 1959 అంటే, దేశానికి స్వాతంత్ర్యం వచ్చి పట్టుమని పదిహేనేళ్ళు పూర్తికాలేదు. అప్పట్లో ఏ నాయకులకి కూడా దేశాన్ని దోచేసుకుందామన్న అవినీతి బుద్ధుల్లేవు. కొత్త దేశం, కొత్త బాధ్యతలు, భయభక్తులు -ఇవే వుండేవి.  అందులోనూ రక్షణ శాఖలో స్కామ్ అప్పట్లో వూహకే అందనిది. నిజమే, 1948 లో ఒక ఉదంతం జరిగింది. జీపుల కుంభకోణం. ఇంగ్లాండ్ నుంచి 80 లక్షలకి రెండు వందల జీపుల్ని రక్షణ శాఖ కొనుగోలు చేస్తే 155 మాత్రమే వచ్చాయి. అప్పటి ఇంగ్లాండ్  హై కమీషనర్ వీకే కృష్ణ మీనన్ ఈ  ఉదంతంలో ఇరుక్కున్నారు. తర్వాత జీపుల లెక్క క్లియర్ చేశారు. దీన్ని స్కామ్ అని కూడా అనలేం- రక్షణ శాఖలో మొట్ట మొదటి స్కామ్ చేసేందుకు సాహసించింది – స్వాతంత్య్రం వచ్చిన 40 ఏళ్ళకి-  1987లో-  బోఫోర్స్ తుపాకులతో మాత్రమే,  అంతే!


        కానీ ‘రుస్తుం’ దర్శకుడు ఈ కథలో  1959 లోనే రక్షణ శాఖలో స్కామ్ ని సృష్టించినప్పుడు అప్పుడప్పుడే పుట్టిన దేశ ప్రతిష్టకి, నావికాదళ గౌరవానికీ భంగంకల్గిస్తున్నా నన్న స్పృహతో లేడు! అప్పట్లో నేవీ అధికారులు అవినీతి పరులని చూపడం చాలా దుర్మార్గమని కూడా గ్రహించలేదు!



 (ఇంకా వుంది)


-సికిందర్  

16, సెప్టెంబర్ 2016, శుక్రవారం

రివ్యూ!






రచన- దర్శకత్వం : జి. నాగ కోటేశ్వర రావు

తారాగణం : రోషన్, శ్రియ శర్మ, నాగార్జున, ఎల్బీ శ్రీరాం, తాగుబోతు రమేష్,  రోషన్ కనకాల తదితరులు
సంగీతం: రోషన్ సాలూరి,  ఛాయాగ్రహణం : ఎస్వీ విశ్వేశ్వర్
బ్యానర్ : అన్నపూర్ణా స్టూడియోస్, మాట్రిక్స్ టీమ్ వర్క్స్
నిర్మాతలు : నాగార్జున, నిమ్మగడ్డ ప్రసాద్
విడుదల : 16 సెప్టెంబర్, 2016
  
***

హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ ని టీనేజి హీరోగా పరిచయం చేస్తూ అక్కినేని నాగార్జున- నిమ్మగడ్డ ప్రసాద్ లు సంయుక్తంగా నిర్మించిన ‘నిర్మలా కాన్వెంట్’ అనే ఈ కొత్త సినిమాలో  రోషన్ పేరుతో ఇంకో ఇద్దరు పరిచయమయ్యారు- సంగీతదర్శకుడు కోటి కుమారుడు సాలూరు రోషన్ సంగీత దర్శకుడిగా, రాజీవ్ కనకాల కొడుకు రోషన్ కనకాల ఓ సహాయ పాత్రగా. ఇంతమంది రోషన్ లు ఒకేసారి ఏదో సాధిద్దామని తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చేశారు.  అంతే కాదు నేనున్నానంటూ ఏఆర్  రెహమాన్  పుత్రరత్నం  అమీన్ కూడా గానం చేస్తూ తెలుగు శ్రోతలకి పరిచయమయ్యాడు. ఈ నవ తరపు ప్రతినిధుల పేర్లు వింటేనే, అందులోనూ ‘నిర్మలా కాన్వెంట్’  అనే సింపుల్ టైటిల్ చూస్తేనే,  ఇదెంతో ఫ్రెష్ ఫీల్ తో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ అయ్యుంటుందని మనబోటి అమాయకులకి అన్పిస్తుంది. తీరా వెళ్లి చూస్తే ఏమనిపిస్తుందో ఈ కింద చూద్దాం...

కథ!
      అనగనగా ఎస్. కోట దగ్గర ఓ భూపతి నగరంలో ఓ భూపతి రాజు గారి పట్టుమని పదహారేళ్ళ శాంతి (శ్రియా శర్మ) అనే కాన్వెంట్ స్కూలు బాలిక  నిశిరాత్రి వేళ విరహం తాళలేక, పిన్నికి చెప్పుకుని  స్నానం గట్రా చేసేసి, ప్రబంధనాయికలా ముస్తాబై, అభిసారికలా తన కలల రాకుమారుడి (రోషన్) రాక కోసం నిట్టూర్పులతో  శృంగారభరితంగా ఎదురు చూస్తూ ఫ్లాష్ బ్యాక్ వేసుకుంటుంది- తన బాలికోన్మత్త  ప్రణయ కావ్యం పూర్తిగా అర్ధమవ్వాలంటే మూడు తరాల వెనకనుంచీ చూసుకుంటూ రావాలట. తన తాతగారికి 99 ఎకరాల పొలముంది (ఇంతేనా! దీనికే రాజుగారూ ఆయనకో  రాజకోట లాంటి అంత పేద్ద భవనమా? ). ఈ 99 ఎకరాలకి నీరు పారాలంటే పైనున్న ఒక్క ఎకరం మీదుగా పారాలి. ఆ ఎకరం ఆసామి దళిత ఈరిగాడు (ఎల్బీ శ్రీరామ్) ఇందు కొప్పుకోడు. దీంతో కసక్ మని రాజుగారు జాతరలో  పొడిపిస్తే,  జివ్వు మని రక్తం చిమ్ముకుని  చచ్చిపోతాడు ఈరిగాడు.  చచ్చిపోతూ ఆ ఎకరం భూమీ  కొడుకు (సూర్య) చేతిలో పెట్టి అమ్మవద్దంటూ మాట తీసుకుంటాడు. రాజుగారి మీద తెగ కోపంతో ఈరిగాడి కొడుకు ఏకంగా మతమే మారిపోయి- డేవిడ్ గా అవతరిస్తాడు. ఆ ఎకరం సాగు చేస్తూ, చెప్పులు కుట్టుకుంటూ కొడుకు సామేల్ అలియాస్ సామ్ (రోషనే) ని కాన్వెంట్ స్కూల్లో చదివిస్తూంటాడు. ఇదే కాన్వెంట్ స్కూల్లో చదువుతున్న శాంతి, సామ్ ని పడేస్తానని పిల్ల మూకతో బెట్ కడుతుంది. స్కూల్ యూనిఫాంలో తిరిగే పిల్లవాడు సామ్ తనేం తీసిపోకుండా ఆమెకి ‘లవ్ లాంగ్వేజ్’ నేర్పుతానంటూ వెంటపడతాడు. సామ్ తోటి పిల్లలు కిలకిలా నవ్వుతూ సామ్ వెంట పోకిరోళ్ళ లా తిరుగుతూంటారు.

    లవ్ లాంగ్వేజ్  తర్వాత,  పిల్లవాడు సామ్ ఏ కిస్సు ఎక్కడ పెడితే దానికేం పేరుంటుందో అద్భుతమైన  కవిత్వ భాషలో వర్ణించి పాడుతూ శాంతికి వొళ్ళంతా మైకం తెప్పిస్తాడు. ఈ ముద్దుల తర్వాత వీడు ఇంకేం  నేర్పిస్తాడోనని ఒక తోటి పిల్ల కామెంట్ చేస్తే, నేనే వాడికి లైన్ వేసుకుంటా నని ఇంకో పోకిరీ స్కూలు పిల్ల పళ్లికిలిస్తుంది!

    ఈ మొత్తానికీ ఓ పిల్ల విలన్ ఉంటాడు- వీడు నేటికాలపు పిల్ల విలనే అయినా పాతకాలపు విలన్ లా,  లవ్ బర్డ్స్  అయిన సామేల్ - శాంతి ల ప్రేమ ఫోటోలు తీసి శాంతి తండ్రికి పంపించేసి చేతులు దులుపుకుంటాడు. అంతేగానీ  నేటికాలపు విలన్ లా ఆ ఫోటోలతో ఆ పిల్లనే  బ్లాక్ మెయిల్ చేసి లొంగ దీసుకోవాలనుకోడు! ఆ ఫోటోలు చూసి ఆ పిల్ల తండ్రి తనివిదీరా ఆమెకి దేహశుద్ధి చేసి స్కూలు మాన్పించేస్తాడు. అదిక కుయ్యోమంటూ ఇంట్లో పడుంటుంది చదువుమానేసి! ఈమె కున్న పిన్ని గారైతే ఎప్పుడో ఈమెకి నాగార్జున లాంటి మొగుడొస్తాడని, నాగార్జునెందుకు- అఖిల్ లాంటి మొగుడే  దొరుకుతాడనీ చాలా కబుర్లు చెప్పి,  మత్తెక్కించి, మదమెక్కిన మగువలా తయారుచేసి వుంచింది.

       ఇంకా అటువైపు ప్రబంధ నాయకుడైన పిల్ల సామ్ గారి కాళ్ళూ చేతులూ కూడా విరిచేసి హాస్పిటల్లో పడేస్తాడు పిల్లదాని తండ్రి.  స్కూలు చదువు కూడా దాటని   పిల్ల టీనేజి సామ్- ఆ పిల్లలేక పోతే బతక లేనంటాడు అమ్మ ఇచ్చిన పాయసం కూడా ముట్టుకోకుండా. వెళ్లి వెంటనే పెళ్లి సంబంధం మాట్లాడమంటాడు స్కూలు చెడ్డీ  సామ్!

    అలాగే తండ్రి డేవిడ్ వెళ్లి పెళ్లి సంబంధం మాట్లాడేస్తాడు! తన బడి కెళ్ళే  చిత్తకార్తె కొడుకు పెళ్లి కోసం ఏమైనా చేస్తానని  ఆ వివాదాస్పదమైన ఎకరం పొలం కూడా రాసిచ్చి పారేస్తాడు!  ఎంచక్కా ఆ ఎకరమూ వుంచుకుని,  ఇంకా బోల్డు డబ్బు సంపాదించుకురా ఫో- అని వెళ్ళగొడతాడు పిల్ల తండ్రి.

    దీంతో పిల్లోడు సామ్  అచ్చం – ప్రేమ కోసమై వలలో పడెనే పాపం పసివాడు- అనే టైపులో బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే సాంగ్ తో,  బ్యాగు సర్దుకుని స్లమ్ డాగ్ లా ఎక్కడికో వెళ్లి పోతూంటాడు. వెళ్లి వెళ్లి  ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో అన్నపూర్ణా స్టూడియోస్ గేటు ముందు తేలతాడు.  నాగార్జునని కలవాలని పట్టుబట్టి కూర్చుంటాడు- సారీ- అండర్ డాగ్ లా నించుంటాడు రోజంతా!

    ఇలా నిర్మలా స్కూల్ సామ్ బాబు ఎందుకని నాగార్జునని కలవాలి? ఎందుకంటే  ‘మా’ టీవీలో ఆయన నిర్వహించే  ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ప్రోగ్రాం లో పాల్గొని కొట్లాది  రూపాయలు సంపాదించుకెళ్ళి- తన జగదేక బాల సుందరి శాంతిని సొంతం చేసుకునేందుకు!

ఎలావుంది కథ 
      ఎలా వుందో పైనే చెప్పుకుంటూ వచ్చాం. పెద్ద హీరోలు చేయాల్సిన కథ (కథేనా?) పెద్ద హీరోలు దొరక్క పిల్లల మీద తీసేసినట్టుంది. లేకపోతే అన్ని సినిమాల కథలూ పెద్ద హీరోల మూసఫార్ములా  మాస్ కథల్లాగే వుంటాయన్న బలమైన నమ్మకంతో ఇలా బోల్డ్ గా బాలల వృత్తాంతం రచించుకున్నట్టుంది. గతంలో ఇలాటి హైస్కూలు ప్రేమ-  టీచరుతో ప్రేమ లాంటి కథలు కొన్ని వచ్చి పచ్చి విమర్శల పాలయ్యాయి. ప్రస్తుత కాన్వెంట్  ప్రేమ- మోహ  పాఠాల కథ, పెద్ద బ్యానర్ కింద పెద్దవాళ్ళు, ప్రముఖులూ అయిన నాగార్జునా నిమ్మగడ్డ ప్రసాద్ లాంటి వాళ్ళు  ఇష్టపడి తీశారు కాబట్టి-  కొందరు ప్రముఖుల పిల్లలూ నటించి- సంగీతించి- గానించి- అందించారు కాబట్టీ విమర్శల కతీతం అవుతుందనుకుంటే- అభ్యంతరకరం అవదనుకుంటే- చెప్పేదేమీ లేదు. తీసేవాళ్ళు గొప్పవాళ్ళయితే ‘సి’ గ్రేడ్ సినిమాల ‘విషయం’  క్లాస్  సినిమాగా మారిపోతుందనుకుంటే ఇలాటివి ఇంకా తీయవచ్చు.  స్కూలు కెళ్ళే పిల్లలు ప్రేమించుకోవడం, పెళ్లి గురించి పట్టు బట్టడం ఈ రోజుల్లో తప్పుకాదని చెప్పి, ప్రోత్సహించాలనుకుంటే మంచిదే! ఇంతకంటే కావాల్సిన అభివృద్ధి ఏముంటుంది? గో ఎహెడ్!

ఎవరెలా చేశారు 
       కొత్త యంగ్  హీరో రోషన్ నటించగలడు,  అయితే నటించడానికి కావాల్సింది ఇలాటి పాత్ర కాదు. ఈ పాత్రకి భారమైన ప్రేమ గోల ఎక్కువైపోయింది. ఛానెల్స్ లో ఏ డిస్నీ టీనేజి సిరీస్ చూసినా  వాటిలో వయసురీత్యా టీనేజి హీరోల చేష్టలు, దూకుడు, ఫాస్ట్ నటన- చాలా  ఫన్నీగా వుంటాయి. కానీ రోషన్ పాత్ర ఈ ఉత్సాహాన్ని పట్టుకోలేక పెద్ద హీరోలా చాలా సార్లు లేనిపోని గాంభీర్యంతో కన్పిస్తుంది. ‘పెళ్లి సందడిలో’ శ్రీకాంత్ లా హూందాగా వుండేందుకు ప్రయత్నిస్తుంది. ఇదంతా దర్శకత్వ లోపమే. స్కూలుపిల్లల్లో పెద్ద హీరోని చూసిన ఫలితం. పెద్ద హీరో పాత్రలా వుండి, పెద్ద హీరోలా బాధ్యతలు మీదేసుకునే కథనంతో రోషన్ ఎటూ తేల్చుకోలేని నటనతో ఓ సినిమా అయిందన్పించాడు.

    చిన్న పిల్ల శ్రియా శర్మ అన్ని శృంగార భావాలూ చక్కగా పలికించింది. మోహం, తాపం, విరహం, సిగ్గులు, హొయలు, స్కూలు వయసప్పుడే పెళ్లి మాటలు, మగాడు ఎలా వుండాలో కొటేషన్లు చెప్పే అనుభవం, శాంతి తో పెట్టుకుంటే మనశ్శాంతి ఉండదని పెద్ద హీరోయిన్లా మాస్ డైలాగులు, పాతికేళ్ళ హీరోయిన్ పలికే అన్ని ప్రేమ పలుకులూ, సినిమా ప్రారంభమే మొదటి షాట్ దగ్గర్నుంచీ సెక్సీ తనంతో రెచ్చ గొట్టే వొంటి విరుపులూ - ఇలా బాల శృంగార నాయికలా తను నటించడమూ, ఇలా ఈ పాత్రని దర్శకుడు తీర్చి దిద్దడమూ అపూర్వం, అమోఘం, అద్భుతం! తెలుగు సినిమా చరిత్రకి గర్వకారణం!

    ఈ సినిమాలో పాటల గురించి మనం చెప్పుకోవడం లేదు- ఎందుకంటే స్కూలు పిల్లలమీద ఈ ప్రేమ గీతాలు రాయడమూ, వాటికి బాణీలు కట్టడమూ ఎబ్బెట్టు కాదు, ఎబ్బెట్టున్నర!

చివరికేమిటి? 
         స్కూలు పిల్లలకి ప్రేమలూ పెళ్లిళ్ళనే  కోరికలు పుడతాయా-  దోస్తానా మస్తానా ఆకర్షణ లుంటాయా తెలుసుకోకుండా పెద్ద హీరో హీరోయిన్ల లవ్ ట్రాకులు పెట్టేసి భారీగా ప్రేమ పాటలూ  పెట్టేస్తే ఎట్లా? సున్నితత్వమనేదే లేకుండా మొరటు చిత్రీకరణలు చేస్తే అయిపోయిందా? ఇక్కడ చూపించాల్సింది స్కూలుపిల్లల మనస్తత్వాలా, లేకపోతే  మదమెక్కిన పోకిరీల వేషాలా? జానర్ మర్యాదని కూడా కాపాడకుండా ఆ విలనిజా లేంటి, ఆ కేకలేంటి, తాగుబోతు పాత్రలేంటి, మాస్ కమర్షియల్ మసాలా లేంటి? నిర్మలా కాన్వెంట్ అనే టీనేజీ కథని నీటుగా- క్లాసుగా- పిల్లలు చూసినా చప్పట్లు కొట్టేలా పిల్లల మనస్తత్వ చిత్రణలతో తీయలేరా? ప్రేమలో పడతారేమో, అది ప్రేమ కాదు ఆకర్షణ -అన్న ఆదుర్దా, సస్పెన్స్ సృష్టించి థ్రిల్లింగ్ గా కథని చెప్పలేరా? దాసరి నారాయణ రావు తీసిన ‘నీడ’ ని ఒకసారి చూస్తే, వయసురీత్యా అపాయపు టంచున వుండే టీనేజర్ తో కథ, పాత్ర ఎలా ఉంటాయో తెలుస్తుంది. స్కూలు పిల్లల కథకి కావాల్సింది వాళ్ళు తెలియకుండా చేసే ప్రయోగాలు, సాహసాలు- వెరసి ఒక అపాయకర పరిస్థితి!

    టీనేజి కథలో కూడా ఫార్ములా హీరోలాగా కోట్లు సంపాదించే హీరోయిజం వుం టుందా? స్కూలు పిల్లాడు వెళ్ళేసి  నాగార్జునని కలిసి – ప్రోగ్రాం చేసి- అదీ  తనూళ్లోనే ప్రోగ్రాం పెట్టించి - రాత్రికి రాత్రి రెండు కోట్లు గడించేసి- ఆ డబ్బు తీసికెళ్ళి విలన్ ముందు పడేసి – పిల్లనివ్వమనడం అప్పుడే రోషన్ లాంటి లేత కుర్రాడికి అవసరమైన యాక్టింగా?

    సెకండాఫ్ అంతా ఆ టీవీ ప్రోగ్రామేగా? సినిమా కెళ్ళి టీవీ ప్రోగ్రాం చూడాల్సి రావడమేమిటి? ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ కథకి ఒక ప్రేమ కథేదో కలిపి తీసేస్తే అదొక సినిమా అయిపోతుందా? ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ కుర్రాడి పాత్ర వేరు, అవసరం వేరు,  సన్నివేశం వేరు. కాన్సెప్టే లేని  ‘నిర్మలా కాన్వెంట్’ కథాకమామిషు పూర్తిగా వేరు! ఇది టీనేజి సినిమా కాదు- పెద్ద హీరోల మూస మాస్ ఫార్ములా సినిమా. 


-సికిందర్
http://www.cinemabazaar.in

14, సెప్టెంబర్ 2016, బుధవారం

నాటి సినిమా!




క రీడర్స్ డైజెస్ట్ జోకు వుంది-
        స్వర్గంలో దేవుడు సుఖాసీనుడై వుంటే సైంటిస్టు వచ్చాడు.
          ‘దేవుడు గారూ! మాకు మీ అవసరం తీరింది. ఇక మీరెళ్ళి పోవచ్చు. ప్రాణిని ఎలా సృష్టించవచ్చో కిటుకు మాకు తెలిసిపోయింది. అన్నిటికంటే బిగినింగ్ లో మీరేం చేశారో అది మేమూ చేయగలం’ అన్నాడు యమ సీరియస్ గా.
           ‘అలాగా?’ అని ఆసక్తిగా  చూశాడు దేవుడు.
          ‘ఔను. ఇంతమట్టిని ఉండలా చేసి ఫిగరొకటి తయారు చేస్తాం. అందులోకి ఉఫ్ ఫ్... మని ప్రాణాన్ని వూదేస్తాం. దట్సాల్, మనిషి తయార్. చూస్తారా?’
          ‘ఏదీ చూపించు నాయనా!’
          సైంటిస్టు ఉత్సాహంగా వంగి, మట్టిని తీయబోతున్నాడు. అది చూసి దేవుడు వెంటనే, ‘ఆగు నాయనా, ముందు నువ్వు తయారు చేసిన నీ మట్టేదో నువ్వు చూపించాలి కదా?’ అన్నాడు  నవ్వుతూ. ఈ మాటలకి గతుక్కుమన్నాడు సైంటిస్టు. జవాబు దొరక్క బుర్ర గోక్కో సాగాడు వెర్రివాడిలా...


       కాబట్టి ఏ మట్టి ఎవరి సొంతం? ఏ మట్టిని ఎవరు తయారుచేయగలరు?  ఏ సినిమా కథ మీద ఎవరికి హక్కులు? ఏ సినిమా కథ ఎవరు సొంతంగా తయారు చేయగలరు? పది పాత సినిమాల కలబోతే కొత్త సినిమా కథ. మోహన్ బాబు వచ్చేసి ప్రతిష్టాత్మకంగా తీసిన ‘పెదరాయుడు’, తాము రాసిన ‘బొబ్బిలి బ్రహ్మన్న’ లాగే వుందని పరుచూరి బ్రదర్స్ వెళ్ళేసి ఈరోడ్ సుందర్ ( ‘పెదరాయుడు’ తమిళ మాతృక ‘నాట్టమాయి’ రచయిత) ని పట్టుకుంటే, అతడింకెన్ని  సినిమాల్లోంచి తీసుకుని  ఆ కథ రాశాడో తవ్వుకుంటూ పోతే ఎక్కడ తేలతాం...మట్టి తీసిన సైంటిస్టూ, కథలు తీసిన రచయితా ఒక్కటే. ఏ కథా ఎవ్వరి సొంతమూ కాదు! 

        ‘బొబ్బిలి బ్రహ్మన్న’ ఛాయలు ‘పెదరాయుడు’ లో చాలా కనిస్తాయి. వాటి పాయింట్లే వేర్వేరు, పాత్రలు మాత్రం అవే. హీరోల ద్విపాత్రాభినయాలు అవే. రెండిట్లో అన్నల పొరపాటు తీర్పులే. తమ్ముళ్ళకి అన్యాయపు బహిష్కరణలు, అన్నల భార్యల వేదనలు, వాళ్ళ మీదా బహిష్కరణల వేట్లూ,  అన్నల మీద ఎదుటి జమీందార్ల కుట్రలు కుహకాలూ, పూర్వీకుల బలిదానాలూ వగైరా వగైరా రెండిట్లో ఒకటే. తేడా అల్లా ‘పెదరాయుడు’ రామాయణాన్ని కలిపి చెబుతుంది- ఫలితంగా హుందాగా ఉదాత్తంగా కన్పిస్తుంది. 

          అన్న మాట కోసం తమ్ముడు త్యాగం చేయడంతోనే  ధర్మం నిలబడదు, అన్న కూడా తనవల్ల తమ్ముడికి హాని జరిగిందనుకుంటే ప్రాయశ్చిత్తం చేసుకుని తనూ వెళ్లి పోయినప్పుడే ధర్మం నిలబడుతుంది. ఇది కూడా గుర్తు చేస్తుందీ గాథ. ‘పెదరాయుడు’ ... కలెక్షన్  కింగ్ మోహన్ బాబు బాక్సాఫీసు చరిత్రని తిరగరాసిన తమిళ రీమేకు. ఇది తన జీవితంలో మర్చిపోలేని అధ్యాయమంటాడాయన. ఇందులో తన పాపులర్  మేనరిజమ్స్ ని పూర్తిగా పక్కన పెట్టేశారు.  అరిస్తే చరుస్తా చరిస్తే కరుస్తా లాంటి మాస్ ఊతపదాలు, వీర హీరోయిజాలతో భీకర రావాలూ లాంటి ఫార్ములా చేబదుళ్ళకి దూరంగా,  అర్ధవంతమైన సహజ పాత్ర పోషణ చేశారు.

        రీమేకుల రాజా రవిరాజా పినిశెట్టి  కూడా తన క్వాలిటీ  స్పృహని కోల్పోకుండా, ఉన్నత విలువలతో విషయాన్ని మనోజ్ఞంగా ప్రెజెంట్ చేశారు. మోహన్ బాబు సహా నటీ నటులందరూ ఆయా పాత్రల్లో అచ్చు గుద్దినట్టు ఒదిగిపోగా, ఆ కథంతా వచ్చేసి రవిరాజా గుప్పెట్లో ముఖమల్ వస్త్రంలా ముడుచుకుంది.  సన్నివేశాల కల్పనలో ఏమాత్రం కృత్రిమత్వానికీ పాల్పడకపోగా, వాటిలో ఏయే విభిన్న రసపోషణలు జరిగినా, అంతర్వాహినిగా ఒకే నిశబ్ద మెలోడీ అనుభవమయ్యేలా ఏక సూత్రత్వాన్ని అమలుచేశారు. దాని పేరే కథాత్మ. ఈ కథాత్మ, బలీయమైన అన్నదమ్ముల అనుబంధం వల్ల ప్రాణం పోసుకుంది. 

        పాత దర్శకుడు డాన్ లివింగ్ స్టన్ ‘ఫిలిం అండ్ ది డైరెక్టర్’ అని రాసిన పుస్తకంలో, ‘మూవ్ మెంట్’ అన్న విభాగంలో ఇలాగంటాడు- ‘కెమెరా మూవ్ మెంట్ ని ఇంటలిజెంట్ గా నిర్వహించడం  దర్శకుడి విజువల్ టెక్నిక్స్ లో ప్రథమ స్థానం వహించాలి. అప్పుడే అతను  ప్రేక్షకుల్ని చాలా ఈజ్ తో సినిమా చూసేట్టు చేసేయగలడు. పాత్రల వ్యక్తిత్వాల చిత్రణ సుబోధకం చేయగలడు. అంతే కాదు, ప్రేక్షకుల్ని ఫీల్ గుడ్ మూడ్ లోకి ఇట్టే తీసికెళ్ళి కట్టిపడెయ్యనూ గలడు- ‘ అని.  రవిరాజా దిగ్విజయంగా సాధించిందిదే : స్లో మూవ్ మెంట్స్ తో, కథా నడకలో ఒక లయని స్థాపించి, కథాత్మ (సోల్) ని పోషించడం!

       నిజ ప్రపంచంలో ఎక్కడెలా వున్నా,  కనీసం సినిమాల్లో చూపించే ఫ్యూడల్ వ్యవస్థకో నీతివుంటుంది. సినిమా జమీందార్లు బయట ఎలాటి తీర్పులు చెప్తారో, ఇంట్లో జరిగే తప్పులకీ తడుముకోకుండా అలాటి తీర్పులే చెప్పి పడేస్తారు. జమీందారీ వ్యవస్థ కాల గర్భంలో కలిసిపోవచ్చు-  ఇప్పుడు నయా జమీందార్లుగా వెలసిన కొందరు ఎమ్మెల్యేలు, ఏంపీలూ జమీందార్ల స్టయిల్లో ఇంట్లో జరిగే తప్పులకి తీర్పులేం చెప్పరు. కొడుకులో తమ్ముళ్లో పాత జమీందార్ల వారసుల పాత్రలు పోషిస్తూ ఏ అఘాయిత్యానికో పాల్పడితే. సదరు ప్రజాప్రతినిధి గారు తీర్పులు చెప్పరు గాక చెప్పరు- ఏకంగా కేసే లేకుండా మాయం చేసేస్తారు.

        వెండితెర జమీందార్లు ధర్మం తప్పరు. ‘తీర్పు చెప్పేవాడి దృష్టిలో అందరూ ఒకటే. న్యాయం మన ఊపిరి, ధర్మం మన ప్రాణం’ అంటూ ప్రాణం విడవడానికీ సిద్ధపడతారు. ఈ గాథలో పెద్ద జమీందారు పాత్రయిన రజనీ కాంత్ ఇలాగే చేస్తాడు. బావ చేతిలో వెన్ను పోటుకి గురైన పెద్ద జమీందారు రజనీ కాంత్. తమ్ముడు మోహన్ బాబు కి అన్న మాటే శిరోధార్యం. అందుకే, ‘నువ్వే పాపం చేయలేదని అన్నకి ఎందుకు చెప్పవు?’ అని భార్య సౌందర్య అడిగినప్పుడు –ఆయన అడగలేదు కాబట్టి చెప్పలేదంటాడు. ఆయన అడగంది ఏదీ తను చెప్పలేదనీ, ఆయన చెప్పంది  ఏదీ తను చేయలేదనీ అంటాడు.  ‘ఆరోజు రాముడు నేను అడవుల కెందుకెళ్లాలని ప్రశ్నించి వుంటే రామాయణం జరిగుండేది కాదు. తండ్రి మాటని గౌరవించి రాముడు అడవులకెళ్లాడు. తండ్రి కంటే గొప్పవాడైన అన్న మాటని గౌరవించి నేనిక్కడికొచ్చాను’ అంటాడు. 

         చూస్తే రామాయణంలో రఘువంశమంతా పాసివ్ క్యారక్టర్ల మయమే, కైకేయితప్ప. ఈమె యాక్టివ్ గా తన లక్ష్య దృష్టితో దశరధుడి మీద కోర్కెల బాణం విసరకపోతే, రామాయణమే లేదు. గాథల్లో యాక్టివ్ పాత్రలు నిప్పు రాజెయ్యకపోతే పాసివ్ పాత్రలకి ఉనికే లేదు. ట్రాజడీల్లేవు. వాటి త్యాగాలూ గొప్పతనాలూ తేలవు. ‘బొబ్బిలి బ్రహ్మన్న’ లో కృష్ణం రాజు పోషించిన రెండు పాత్రలకీ లక్ష్యం వుండదు. ఉన్న లక్ష్యమల్లా రావుగోపాల రావు ప్రతినాయక పాత్రకే వుంటుంది. అలాగే ‘పెదరాయుడు’ లోనూ మోహన్ బాబు రెండు పాత్రలూ డిటో. ఏదో ఒక టార్గెట్ వున్న వాడు విలన్ పాత్ర అనంత్ రాజ్ ఒక్కడే. 

        ఈ అనంత్ రాజ్ మేనమామ రజనీకాంత్ హయాంలో ఒక మనభంగం చేసి, రజనీ కాంత్ ఇచ్చిన తీర్పు ప్రకారం ఆమెనే పెళ్లి చేసుకోవాల్సి వస్తే, ఆ  తీర్పుకి తాళలేని అనంత్ రాజ్ తండ్రి చలపతి రావు, రజనీకాంత్ ని చంపేస్తాడు. చనిపోతూ  రజనీకాంత్,  ఈ ధిక్కారానికి మరో తీర్పు చెప్తాడు- తన బావ అయిన ఈ చలపతి రావు కుటుంబానికి 18 ఏళ్ళూ  సాంఘిక బహిష్కారం విధిస్తాడు. దీంతో ఎక్కడో అతిహీనంగా బతికిన అనంత్ రాజ్ ఆ శిక్షా కాలంపూర్తి కాగానే, రజనీకాంత్ తమ్ముడు మోహన్ బాబు మీద పగదీర్చుకోవడానికి వచ్చేస్తాడు. 

       ‘వెన్నెల’ సినిమా తీసిన ఎన్నారై దర్శకుడు కట్టా దేవ కౌషిక్ ఓ సిట్టింగ్ సందర్భంగా ఓ ముఖ్యమైన విషయాన్ని దృష్టికి తెచ్చారు. చాలా  సినిమాలు ఫ్లాపవడానికి సెకండాఫ్ లో రెండో పాట తర్వాత- క్లయిమాక్స్ కి ముందు - కథలో కొత్త మలుపు రాకపోవడమే కారణమని. తరచి చూస్తే, ఇది నిజమన్పించడానికి అనేక సినిమాలు కన్పిస్తాయి. అయితే, దాదాపు దశాబ్దంన్నర క్రితం తీసిన ‘పెదరాయుడు’ లో ఇలాటి తప్పు జరిగినట్టు కన్పించదు. పైగా దీనికి విరుగుడు కన్పిస్తుంది. మొదట్నించీ కథనంలో ప్రేక్షకులు ఏమాత్రం అనుమానించడానికి వీల్లేని విషయాన్ని క్లయిమాక్స్ కి ముందు ముందుకు లాగి- కథని కొత్త మలుపు తిప్పుతాడు విలన్ అనంత్ రాజ్! ఫస్టాఫ్ లో ఎందుకు జరిగిందో లాజిక్ కి అందక, గాల్లో వేలాడుతూ వుండిన టీచర్ పాత్ర ఆత్మహత్యా  ఘటన వెనుక అసలు కథ అనూహ్యంగా ఇప్పుడు వెలుగులోకి రావడంతో-  ఈ సినిమా క్లయిమాక్స్ కి కొత్త బలం వచ్చి అమాంతం పైకి లేస్తుంది. స్క్రీన్ ప్లే పరిభాషలో ఇలా అప్రధానంగా వుండిపోయి తర్వాత ప్లే అయ్యే టీచర్ పాత్ర ఆత్మహత్యా  ఘటనలాంటిది కావొచ్చు, లేక ఏదైనా క్లూ కావొచ్చు, ఇంకేదైనా వస్తువూ లేదా పాత్ర కావొచ్చు- ఈ ప్లాట్ డివైస్ ని ‘మెక్ గఫిన్’ అంటారు. 

        ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమా ఒక స్క్రీన్ ప్లే లెసన్. ఇందులో గోపీ- మోహన్ లు రాసిన బ్రహ్మానందం - బాబూ మోహన్ ల కామెడీ ట్రాకు కూడా కథాశిల్పంలో ఇమిడిపోయి కన్పిస్తుందే తప్ప- పక్క వాటుగా తెచ్చి అతికించినట్టుండదు. ముందే చెప్పుకున్నట్టు,  పాత్రలన్నీ ఒద్దికగా కన్పిస్తాయి. ప్రధానపాత్రలో మోహన్ బాబు హూందా తనం, రెండో పాత్రలో  వినయ విధేయాలు, భార్యల పాత్రల్లో భానుప్రియ, సౌందర్యల సౌమనస్యాలు, మేనత్త పాత్రలో జయంతి దైన్యం, పెద్ద జమీందారు పాత్రలో రజనీకాంత్ దర్పం ... ఇలా హృదయాల్ని తాకని పాత్రంటూ వుండదు. వీటికి జి. సత్యమూర్తి రాసిన మాటలు అంతే  ఉన్నతంగా వుంటాయి. 

        మోహన్ బాబు సినిమా అంటే తప్పకుండా ఓ జేసుదాస్ పాట! ఇక్కడ కూడా ‘కదిలే కాలమా’ అంటూ జేసుదాస్ తన కంఠాన్ని ఖంగుమన్పించాడు. సంగీత దర్శకుడు కోటి స్వరపర్చిన మిగతా మెలోడీ పాటలు కూడా కథ మూడ్ ని ఎలివేట్ చేసేట్టే వుంటాయి. 

        సౌభాతృత్వం అనే థీమ్ ని ఆలోచనాత్మకంగానూ, అంతే వినోదాద్మకంగానూ తెరమీద దృశ్యమానం చేసిన ‘పెదరాయుడు’ - రీమేక్ లో కూడా ఒరిజినల్ సోల్ ని తెచ్చి ధారాళంగా ప్రవహింపజేయవచ్చని నిరూపిస్తోంది.


-సికిందర్
(సెప్టెంబర్ 2009, ‘స్సాక్షి’)
http://www.cinemabazaar.in