రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

4, ఏప్రిల్ 2017, మంగళవారం

     క్రైం జానర్ సినిమా అర్ధమవాలంటే డిటెక్టివ్ సాహిత్యం తెలుసుకోవాలి.  ఫిలిం నోయర్ గా పుట్టిన  క్రైం జానర్ డిటెక్టివ్ సాహిత్యంలోంచే పుట్టింది 1930 లలో. ఇప్పుడు తెలుగులోనూ డిటెక్టివ్ సాహిత్యం లేకపోవచ్చు. కానీ  దాని వారసత్వంగా క్రైం జానర్ తో సినిమాలు వుంటూనే వున్నాయి. కాబట్టి అసలీ క్రైం జానర్ అంటే ఏమిటో తెలుసుకోవాలి. అంటే డిటెక్టివ్ సాహిత్య చరిత్రలోకి వెళ్ళాలి. ఫిలిం నోయర్ సినిమాలలో  ప్రధానంగా వుండే ఎలిమెంట్స్  గనుక చూస్తే- ఓ హత్య జరుగుతుంది, ఆ హత్య కేసుని ఒక డిటెక్టివ్, లేదా ఇన్వెస్టిగేటర్ దర్యాప్తు చేస్తాడు. ఇతనే కథానాయకుడు. మరో  రెండు స్త్రీ పాత్రలుంటాయి -  ఒకటి నెగెటివ్, ఇంకోటి  పాజిటివ్;  కథ నగర ప్రాంతంలోనే జరుగుతుంది, చాలా  వరకూ రాత్రి పూటే జరుగుతుంది, వర్షం కూడా  పడితే పడవచ్చు, డైలాగులు పదునుగా  పోయెటిక్ గా వుంటాయి, ప్రధాన పాత్రలన్నీ ఉన్నత వర్గాలకి చెందినవే అయివుంటాయి,  ఉన్నత వర్గాల హిపోక్రసీని ఎండగట్టడం , కాల నేపధ్యంతో బాటు, సమాజ నేపధ్యాన్ని కూడా జోడించడం  ఈ జానర్ ప్రధాన లక్షణాలుగా వుంటాయి.

           తెలుగులో డిటెక్టివ్ సాహిత్యానికి సుదీర్ఘ చరిత్రే వుంది. గొప్ప గొప్ప పండితులూ ఈ సాహిత్యాన్ని రాసిన వాళ్ళల్లో వున్నారు. 1950 లలో పాంచకడీ దేవ్ అనే రచయిత బెంగాలీలో పుంఖాను పుంఖాలుగా డిటెక్టివ్ నవలలు రాసే వారు. సర్ ఆర్ధర్ కానన్ డాయల్ సృష్టించిన సుప్రసిద్ధ డిటెక్టివ్ పాత్ర షెర్లాక్ హోమ్స్ నీ, ఎర్ల్ స్టాన్లీ గార్డెనర్ సృష్టించిన ప్రఖ్యాత  క్రిమినల్ లాయర్ పాత్ర పెర్రీ మేసన్ నీ,  తలపించేలా పాంచకడీ దేవ్ సృష్టించిన  డిటెక్టివ్ అరిందమ్ పాత్రతో, బెంగాలీ నవలల్ని  ప్రసిద్ధ వేంకట పార్వతీశ్వర కవులు తెలుగులోకి అనువాదం చేసి ముద్రించేవారు.

           కవి సామ్రాట్  విశ్వ నాథ సత్యనారాయణ కూడా ‘దిండు కింద పోక చెక్క’ అనే  డిటెక్టివ్ నవల రాసిన వారే. ఇక ప్రసిద్ధ కవి, పరిశోధకుడు, సినిమా రచయిత  ఆరుద్ర 1950 లో ‘పలకల వెండి గ్లాసు’ అనే  డిటెక్టివ్ నవల రాశారు. ఆ తర్వాత అణాకో బేడ స్టాంపు’, ‘అహింసా రౌడీ’, ‘రెండు రెళ్ళు ఆరు’, ‘ఆనకట్ట మీద హత్య’, ‘త్రిశూలం’, ‘కొండచిలువ మొదలైన డిటెక్టివ్ నవలలెన్నో  రాశారు. చివరిగా 1957 లో ‘ఆడదాని భార్య అనే డిటెక్టివ్ నవల రాశారు. పాలగుమ్మి పద్మరాజు కూడా  చచ్చి సాధించేడుఅనే అపరాధ పరిశోధక నవల రాశారు. 

          ఇదంతా ఒకెత్తయితే,  1930 లలోనే దాదాపు వెయ్యి నవలలు రాసి చరిత్ర కెక్కిన కొవ్వలి లక్ష్మీ నరసింహారావు, వంటింటీ స్త్రీలకి వాడుక భాషలో తన నవలలద్వారా అక్షరాస్యతనీ, పఠనాసక్తినీ పెంచారని పేరుగడించారు. ఈయన కూడా అలవోకగా డిటెక్టివ్ నవలలు  రాసి అవతల పడేయడం ఒకెత్తూ . డిటెక్టివ్ సాహిత్యంలో ఈ మొదటి తరం రచయితలిలా వుండగా, రెండో తరం వచ్చేసి 1950 లలోనే కొమ్మూరి సాంబశివరావుతో ప్రారంభమయ్యింది. ఈయన సగటు పాఠకుడి భాషలో ఆధునికంగా రాయడం మొదలెట్టారు. తెలుగులో ఆధునిక డిటెక్టివ్ సాహిత్య పితామహుడు ఆయనే. మద్రాసులో వుండే ఆయన సృష్టించిన డిటెక్టివ్ యుగంధర్ పాత్ర జంటిల్ మెన్ పాత్ర. చదువుతూంటే ఎలాటి వారికైనా ఈ పాత్రమీద గౌరవం ఏర్పడుతుంది. యుగంధర్ అసిస్టెంట్  రాజు, ఇంకో చైనీస్  అసిస్టెంటు కాత్యా, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్  స్వరాజ్యరావు పాత్రలతో ఆయన నవలలు మూడు దశాబ్దాల పాటూ ఒక క్రేజ్. 

         ఇక టెంపోరావ్ అయితే చెప్పనే అక్కర్లేదు- డిటెక్టివ్ పరశురాం, డిటెక్టివ్ వాలి అనే పాత్రలతో వందలాది నవలలు రాసేశారు. ఇంగ్లీషులో ‘టెంపో’ అనే పత్రికని స్థాపించి, అందులో కూడా తన రచనల ఆంగ్లానువాదాలు ప్రచురించే వారు. సినిమారంగంపత్రిక సబ్ ఎడిటర్  గడియారం వెంకట గోపాలకృష్ణ - జి.వి.జి పేరుతో  డిటెక్టివ్ నవలలు రాసేవారు. ఇలా ఈ డిటెక్టివ్ సాహిత్యపు  పురుగు కుట్టని రచయితలూ, పాఠకులూ లేరంటే అతిశయోక్తి కాదు.    ఈ నేపధ్యంలో డిటెక్టివ్ సాహిత్యం గురించి మరికొంత సమాచారం తెలుసుకుంటే బావుంటుందన్న ఉద్దేశంతో,  2000 జులై  2  ‘ఆంధ్రభూమి’ ఆదివారం అనుబంధంలో ‘మాయమైన డిటెక్టివ్’  పేర ఈ వ్యాసకర్త  రాసిన కవర్ స్టోరీని ఇక్కడ ఇస్తున్నాం, ఆసక్తి వుంటే చదవండి... 
                                            ***
        లే చిత్రంగా తోచే స్థితి ఇది... పుస్తకాల్నిండా డిటెక్టివ్ పాత్రలున్నప్పుడు,  బయటెక్కడా డిటెక్టివ్ లు కన్పించలేదు మన దేశంలో. ఇప్పుడు బయట అడుక్కో ప్రైవేట్ డిటెక్టివ్ సంస్థ వెలుస్తున్నప్పుడు, పుస్తకాల్లోంచే మాయమైపోయాడు డిటెక్టివ్ అనే వాడు!

          క్రైం సాహిత్యంలో డిటెక్టివ్ పొందింది  మామూలు మరణం కాదు – శాశ్వతంగా ఆ జాతి అంతరించిపోయింది, రాక్షస బల్లులు డైనోసారస్ లకి మల్లే.
         
           ఈ పరిణామం ఒక్క తెలుగు డిటెక్టివ్ సాహిత్యానికే పరిమితం కాలేదు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల క్రైం సాహిత్యాల నుంచీ డిటెక్టివ్ మాయమై పోయాడు.

          తెలుగులో శవ సాహిత్యంగా పేరు బడి, అస్పృశ్యతకి  గురైన క్రైం సాహిత్యమే, అనంతర కాలంలో స్టార్ రైటర్ల చలవతో తెలుగు వారపత్రికల కెక్కి,  పాపులరవడం, గౌరవం పొందడం  ఒక వింత. నవలా సాహిత్యమంటే ఇదేనేమో అన్నంత భ్రమలో పాఠకులూ  పడిపోయి, వార పత్రికల్లో స్టార్ రైటర్స్ రాస్తున్న క్రైం థ్రిల్లర్ సీరియల్స్ కి దాసోహమైపోయారు- ఒకప్పుడు డిటెక్టివ్- క్రైం సాహిత్యాన్ని శవ సాహిత్యమని ఛీ కొట్టిన ఉత్తమ సాహిత్యాభిలాషులే,  పాఠకురాళ్ళే, విపరీత క్రేజ్ తో అటువంటి  సీరియల్స్ నే  అక్కున జేర్చుకోవడం మొదలెట్టారు. 

          వార పత్రికల్లో ఆ పాపులర్ సాహిత్యమంతా కూడా మంత్ర తంత్రాల క్షుద్ర సాహిత్యం తోనే మొదలైంది. ఒకప్పుడు పావలాకి  అద్దెకి దొరికే డిటెక్టివ్ నవలలంత సమాన వైభోగమే ఇది. కానీ పాపులర్ నవలా రచయిత లెవరూ డిటెక్టివ్ ని  బతికించుకోవాలనే ఆలోచనే చేయలేకపోయారు.

          అప్పటివరకూ వున్న  క్రైం- డిటెక్టివ్ రచయితలూ వార పత్రికలకి ఎక్కలేకపోయారు. ఒక్క మధుబాబు విషయంలో అది సాధ్యమైనా, ఆయన సృష్టించిన లెజండరీ పాత్ర ‘షాడో’ డిటెక్టివ్ కాదు, ఒక యాక్షన్ హీరో. డిటెక్టివ్ యుగంధర్, అసిస్టెంట్ రాజు పాత్రలతో మూడు దశాబ్దాల పాటూ  మకుటం లేని మహారాజులా వెలిగిన కొమ్మూరి సాంబశివరావు,  చరమ దశలో ‘ఉదయం’ వీక్లీలో అతి కష్టంగా ఓ డిటెక్టివ్ సీరియల్ రాయగల్గారు ఆ పాత్రలతో, అంతే. చిన్నచిన్న క్రైం కథల్ని ప్రచురించాడానికే అదేదో మర్యాద తక్కువగా వెనుకాడిన వార పత్రికలే,  ఈ ట్రెండ్ లో ఇక ఏకంగా క్రైం –సెక్స్- హార్రర్  కథాంశాలతో,  శైలీ శిల్పం సరైన భాషా వుండని చవకబారు సీరియల్స్ కూడా ప్రచురించడం మొదలెట్టాయి- వాటిని కుటుంబాల డ్రాయింగ్ రూముల్లోకీ తీసికెళ్ళి పోయాయి. సీరియల్స్ పేరుతో  కాపీ రాయుళ్ళనీ, ఘోస్టు రచయితల్నీ ఉత్పత్తి చేసి, ఒక ఆంధ్రా హెరాల్డ్ రాబిన్స్ నీ, ఇంకో ఆంధ్రా ఆర్ధర్ హెయిలీ నీ, మరింకో ఆంధ్రా సిడ్నీ షెల్డన్ నీ ఆడా మగా అమాయక పాఠకుల మీద రుద్దాయి గానీ, ఒక్కరంటే ఒక్క ఆంధ్రా కానన్ డాయల్ ని గానీ, ఆంధ్రా జేమ్స్ హేడ్లీ ఛేజ్ ని గానీ, ఆంధ్రా అగథా క్రిస్టీ ని గానీ  అందివ్వలేకపోయాయి.

          జనబాహుళ్యంలో పఠనాశక్తిని పెంచింది అణా అద్దె డిటెక్టివ్ నవలలే.  పేపరైనా చూడని మొహాలకి చదివే క్రేజ్ ని నేర్పింది ఈ శవ సాహిత్యమనే డిటెక్టివ్ నవలలే. బడి కెళ్ళే బుడ్డి వెధవ దగ్గర్నుంచీ, సోడాలమ్మే మిడిమిడి జ్ఞానపు కామన్ మాన్ వరకూ-  దొంగచాటున డిటెక్టివ్ ల్ని చదివి ఎంతో కొంత అక్షర జ్ఞానంతో  బాటు, విషయ పరిజ్ఞానం పెంపొందించుకున్న వాళ్లెందరో. 

          మద్రాసు కేంద్ర స్థానంగా విరివిగా ఉత్పత్తి అయ్యే డిటెక్టివ్ నవలలు  చొరబడని ఆంధ్రప్రదేశ్ గ్రామమంటూ లేదు. అతి చిన్న సమూహంగా వుండే  ఈ సాహిత్యాభిమానులు, పదుగురి ముందు ఈ నవలలు చదివితే చీప్ టేస్టు వెధవలుగా చిన్న చూపుకి  గురయ్యే వారు. ప్రపంచంలో ఇంకే భాషలోనూ డిటెక్టివ్ సాహిత్యానికి ఈ గతిపట్టలేదు,  సరికదా విన్ స్టన్ చర్చిల్ లాంటి మహానుభావులు రాత్రి పూట డిటెక్టివ్ నవల చదవనిదే నిద్రపోయే వాళ్ళు కాదు.  తెలుగులోనే తామేదో గొప్ప  టేస్టున్న మొనగాళ్ళమని పోజు కొట్టే వాళ్ళు ఈ గతి పట్టించారు.

          ఈ డిటెక్టివ్ నవలలకి కూడా చాటుమాటుగా పట్టుకెళ్ళ డానికీ, దొంగచాటుగా చదువుకోవడానికీ అన్నట్టు ఒక అనువైన సైజు వుండేది. సరీగ్గా జేబులో పట్టే పాకెట్ సైజు (ఈ వ్యాసకర్త నిక్కరు జేబుతో లాభం లేక, పొత్తి కడుపులో దోపుకుని తిరిగే వాడు ఎనిమిదో తరగతి చదువుతూ కొమ్మూరి నవలల్ని. ఒకసారి తండ్రి చేత తొడపాశం కూడా పెట్టించుకున్నాడు. అయినా ఏనాడూ వదల్లేదు ఈ సాహిత్యాన్ని. ఆ నిర్బంధ పరిస్థితులు ఈ వ్యాసకర్తలో ఏకంగా డిటెక్టివ్ రచయిత ఉద్భవించేలా చేశాయి!). నవలలతో  పరిస్థితి ఇలా వుండగా, మరోవైపు ఒక మాస పత్రికతో  వేరేగా వుండేది. ‘అపరాధ పరిశోధన’ అనే ఆ మాసపత్రిక పెద్ద మనుషుల బుక్ షెల్ఫుల్లోకి చేరేది. భువనగిరికి చెందిన శ్యామ దామోదర రెడ్డి 1960 లలోనే హైదరాబాద్ నారాయణ గూడాలో ప్రారంభించిన ఈ డిటెక్టివ్ మాస పత్రికకి మంచి గౌరవం లభించేది. డాక్టర్ దాసరినారాయణ రావు కూడా తమ పాఠకులే అని దామోదర్ రెడ్డి చెప్పేవారు. ఎందరో ఉన్నతాధికారులు, వైద్యులు, న్యాయవాదులూ, ప్రవాసాంధ్రులు కూడా  చందాదార్లుగా వుండే వారు. పాఠకు రాళ్ళ సంఖ్యా తక్కువేం కాదు. ప్రతినెలా ఒక డిటెక్టివ్ కథల పత్రిక, దాంతో పాటూ నాల్గు డిటెక్టివ్ నవలికల సప్లిమెంటరీ వెలువడేవి. ఇవీ పాకెట్ సైజులోనే వుండేవి. తెలుగు డిటెక్టివ్ సాహిత్యానికి ‘అపన’ (‘అపరాధ పరిశోధన’ ముద్దు పేరు) సమకూర్చి పెట్టిన గౌరవ ప్రతిష్టలూ, చేసిన సేవా మరే పత్రికా చేయలేదు. 

కొమ్మూరి సాంబశివరావు 
         మద్రాసు నుంచే సినీనిర్మాత వైవీ రావ్ కొన్నాళ్ళు ‘డిటెక్టివ్’ అనే పత్రిక నడిపారు. విజయబాపినీడు ‘క్లూ’ అనే పత్రిక  నడుపుతూ ఆపుతూ వుండేవారు. అపన మాత్రం ఏ నెలా ఆగకుండా మూడు దశాబ్దాలూ  నడిచింది ( చరమ దశలో ఈ వ్యాసకర్త ఓ యాభై కథలూ, డెబ్బై నవలికలూ, ఇంకో రెండు సీరియల్సూ  ఆరేళ్ళ పాటూ రాసి అస్త్రసన్యాసం చేశాడు).
(ps : 1996- 2010 మధ్య ఆంధ్రభూమిలోనూ, ఆంధ్రజ్యోతిలోనూ 700 వరకూ క్రైం, డిటెక్టివ్  కథలు రాశాడు).
            యండమూరి, మల్లాదిలు కూడా ఈ పత్రికలో రాసిన వారే. ఇక మద్రాసు, విజయవాడ కేంద్ర స్థానాలుగా  కొమ్మూరి సాంబ శివరావు, టెంపోరావ్, గిరిజ శ్రీ భగవాన్, విశ్వ ప్రసాద్, విశ్వ మోహన్, కృష్ణ మోహన్, విజయబాపినీడు, కనక మేడల, భయంకర్, గుత్తా బాపినీడు, డాక్టర్, కొప్పిశెట్టి ... చెబుతూ పోతే జాబితా అంతమవదు- ఈ హేమాహేమీలు పుంఖానుపుంఖాలుగా  డిటెక్టివ్ నవలల్ని వెలువరుస్తూంటే, హైదరాబాద్ నుంచి ‘అపన’ ద్వారా మల్లాది వెంకట కృష్ణ మూర్తి, వసుంధర, శ్యాం బాబు, ముద్దా సురేష్, బొమ్మిడి అచ్చారావు, రమణ శ్రీ, తిరుమల శ్రీ, ఏవీ మోహన్రావ్, రంకిరెడ్డి రాము, అజీజ్, ఎంవివి సత్యనారాయణ, విఎస్ చెన్నూరి,  కురుమద్దాలి విజయలక్ష్మి, సామవేదుల గీతారాణి, విద్వాన్ షీలా దేవి, సికిందర్ ...మరెందరో రచయితలూ తమతమ  కలాలకి పదును పెడుతూ- మెదడుకి మంచి మేత పెట్టే, ఎక్కడ్నించీ కాపీ కొట్టని-  ఒరిజినల్ రచనల్ని అందించే వారు.

          ఈ వైభవమంతా వారపత్రికలలో పాపులర్ సీరియల్స్ అనే ఒక్క గాలివాటుతో హరప్పా - మొహంజొదారో అయిపోయింది. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అనే రచనా విధానం  పాఠకులకి విపరీతంగా నచ్చేసి,  ఆ రకపు సాహిత్యం వైపు మళ్ళడంతో,  ఉన్న ఆ ఒక్క డిటెక్టివ్ మాస పత్రికా మూతబడిపోయింది. దాంతో ఆ రచయితల్లో అనేకులు కనుమరుగయ్యారు, మిగిలిన వాళ్ళు ఇతర ప్రక్రియల మీద దృష్టి పెట్టారు. సాహితీ వేత్తలు ఒప్పుకోరేమో గానీ, ఇక్కడ చెప్పుకోదగ్గ విశేష మేమిటంటే, ఏ కథల్ని గతంలో శవ సాహిత్యమని ఈసడించుకునే వారో,  ఆ  డిటెక్టివ్ కథల్లో భాష బతికేది. శుభ్రమైన తెలుగుతో వర్ణనలు సింపుల్ గా వుండేవి. వార పత్రికల్లో పాపులర్ సీరియల్స్ ట్రెండ్ మొదలయ్యాక,  తెలుగెలా తయారయ్యిందో, వర్ణనలు, సన్నివేశాలూ ఎలా వుండేవో  చూసిందే. కనుగుడ్లు పీకేసే హార్రర్, ఐసు  దిమ్మెల్లో చిత్ర హింసలు పెట్టే  థ్రిల్స్ , నడిచే రైల్లో గుడ్డ లిప్పుకునే సెక్స్, కరిచే చలిలో నరికి వేతల ఉన్మాదం... కలగలిసిన కాక్ టెయిల్ పానీయాల మత్తులో పాఠక లోకం మైమరచి పోవడంతో- ఇక కుశాగ్రబుద్ధి బలం గల డిటెక్టివ్ చచ్చి వూరుకోక తప్పలేదు. 

          ‘రాజూ, అతన్ని  వెంటాడు... కానీ జాగ్రత్త, అతడి దగ్గర పిస్తోలుంటుందేమో' అని హెచ్చరించే మృదుభాషి అయిన కొమ్మూరి డిటెక్టివ్ యుగంధర్ గొంతు మూగబోయింది. 

          ‘ఈ నేరం చేసి నువ్వు తప్పించుకోలేవ్ రాజారావ్!’  అని ఎంతటి వారినైనా నింపాదిగా పైప్ పీలుస్తూ, ఏక వచనంలో సంబోధించే టెంపో రావ్ డిటెక్టివ్ వాలి తూలిపోయాడు.

          ‘రేయ్ బద్మాష్! ఇది దేశ ద్రోహంరా!’ అని శత్రువుని చెండాడే గిరిజశ్రీ భగవాన్ డిటెక్టివ్ నర్సనూ మాయమైపోయాడు. 

          ఇలా మూడున్నర దశాబ్దాల పాటు మూడు తరాలకి చెందిన రచయితలు కాపాడిన తెలుగు డిటెక్టివ్ తనువు చాలించాడు. మొదటి తరం ఆరుద్ర, కొవ్వలి వంటి  వారిదైతే, రెండో తరం కొమ్మూరి, టెంపో రావ్ లది. మూడోతరం ‘అపన’ రచయితలది.

          తెలుగు డిటెక్టివ్ సాహిత్యపు పరిసమాప్తికి స్థూలంగా పైన పేర్కొన్న కారణాలు కన్పించినా, లోతట్టులో చూస్తే, మరో కోణం కన్పిస్తుంది. ఇదే ఆంగ్లంతో సహా అన్ని భాషల్లోని డిటెక్టివ్ పాత్రలూ అంతర్ధానమవడానికి   కారణంగా అన్పిస్తుంది. ఆంగ్ల డిటెక్టివ్ సాహిత్యానికి స్వర్ణయుగం   1930ల నాటి కాలం. అప్పటికే కొన్నేళ్లుగా సర్ ఆర్ధర్ కానన్ డాయల్ సృష్టించిన షెర్లాక్  హోమ్స్ పాత్ర వుండగా, 1930 లలోనే మరిన్ని సుప్రసిద్ధ డిటెక్టివ్ పాత్రలూ పుట్టాయి. అగథా క్రిష్టీ – హెర్క్యూల్ పైరట్, ఎర్ల్ స్టాన్లీ గార్డెనర్ – పెర్రీ మేసన్ ( క్రిమినల్ లాయర్), రేమండ్ చాండ్లర్ -  ఫిలిప్ మార్లో మొదలైనవి. ఇదే కాలంలో డరోతీ సేయర్స్, జూలియన్ సైమన్స్, మార్గరెట్ కోల్ వంటి రచయిత్రులూ రాజ్యమేలారు. మార్గరెట్ కోల్ అయితే నాజీ నియంత హిట్లర్ అభిమాన రచయిత్రి. ఈ కాలంలోనే ఆంగ్ల డిటెక్టివ్ సాహిత్యపు వైభవానికి ముగ్ధుడై – నంబర్ వన్ హాస్య నవలా రచయిత పిజి ఓడ్ హౌస్ త
ను రాసిన ‘ములినర్స్ నైట్స్’  నవల్లో – ఈ ఆధునిక జీవితంలో ప్రజానీకాన్ని మిస్టరీ నవల కట్టిపడేస్తున్నంతగా మరేదీ కన్పించదు- అని ఒక పాత్ర చేత చెప్పించాడు....

(మిగతా రేపు)



-సికిందర్
         
         
         



         




2, ఏప్రిల్ 2017, ఆదివారం

      తెలుగులో పౌరాణికాలు, జానపదాలు, కుటుంబ కథలు, ప్రేమ కథలు,  సామాజిక కథలు, భక్తి  కథలు, కామెడీ కథలు మొదలైనవి తప్పితే యాక్షన్, క్రైం, హార్రర్,  సైన్స్ ఫిక్షన్ కథలతో వచ్చిన సినిమాలు  హాలీవుడ్  నుంచి స్ఫూర్తి పొంది దిగుమతి చేసుకున్న కథా ప్రక్రియలే. అలా దిగుమతి చేసుకున్న యాక్షన్ విభాగంలో  జేమ్స్ బాండ్, కౌబాయ్ సినిమాలు కూడా 1970 లలో తెలుగులో ప్రారంభమయ్యాయి. 1960 లలో ప్రారంభమైన హార్రర్, సైన్స్ ఫిక్షన్ విభాగాలు కూడా నేటి దాకా కొనసాగుతూనే వున్నాయి. కానీ క్రైం విభాగం కూడా హాలీవుడ్ నుంచే దిగుమతి అయినా, అంతగా అభివృద్ధి చెందక వుండిపోయింది.  ఈ విభాగంలో మర్డర్ లేదా ఇంకేదైనా నేరంతో కూడిన మిస్టరీలు తెలుగులో తీయడం ఎప్పుడోగానీ జరగడం లేదు. 

          
హాలీవుడ్ లో టాకీలు ప్రారంభమైన వెంటనే,  1930 లలోనే క్రైం సినిమాలు తీయడం మొదలెట్టారు. వీటికి ముడి సరుకు ఆ డిటెక్టివ్ సాహిత్యమే. ప్రసిద్ధ డిటెక్టివ్  నవలా రచయిత రేమండ్ చాండ్లర్  సృష్టించిన ఫిలిప్ మార్లో అనే డిటెక్టివ్ పాత్రతో ఆనాడు అనేక క్రైం సినిమాలు తీశారు.  ది బిగ్ స్లీప్, టైం టు కిల్, ది లాంగ్ గుడ్ నైట్ ...ఇంకా ఎన్నో. అలాగే ఇంకో ప్రసిద్ధ రచయిత డెషిల్  హెమెట్ సృష్టించిన శామ్ స్పేడ్ డిటెక్టివ్ పాత్రతో మాల్టీజ్ ఫాల్కన్, ది లైఫ్ ఆఫ్ రిలే లాంటి క్రైం సినిమాలెన్నో  వచ్చాయి. ఇతర సినిమా రచయితలూ, దర్శకులూ కూడా వీటివైపు ఆకర్షితులై వందలాది సినిమాలతో ఒక ట్రెండ్ నే  సృష్టించారు. దాదాపు రెండు దశాబ్దాల కాలం పాటు ఇది మొదటి దశగా తెలుపు నలుపు సినిమాలతో కొనసాగింది. అప్పుడు ఈ క్రైం జానర్ కి ఫిలిం నోయర్ అని పేరు పెట్టారు. నోయర్ అంటే ఫ్రెంచి భాషలో డార్క్ అని అర్ధం. అంటే డార్క్ ఫిలిమ్స్ అన్నమాట. డార్క్ ఫిలిమ్సే కదా అని ఈ క్రైం సినిమాలని ఎలాపడితే అలా తీసేవాళ్ళు కాదు. దీనికీ ఒక సైన్స్ వుండేది. దీని గురించి తర్వాత తెలుసుకుందాం. 

          ఇదే ఫిలిం నోయర్ జానర్  కలర్ సినిమాలొచ్చాక, కొంచెం సైన్స్ ని కూడా మార్పు చేసుకుని,1960 ల నుంచీ నియో నోయర్ గా ప్రారంభమయ్యింది. నియో అంటే నూతనం. అంటే నూతనంగా మారిన  డార్క్ ఫిలిమ్స్ అన్నమాట. ఈ నియో నోయర్ దశ వచ్చేసి ఇప్పటికీ అరవై ఏళ్లుగా అప్రతిహతం
గా కొనసాగుతోంది హాలీవుడ్ లో. దీని సైన్స్ గురించి కూడా తర్వాత చెప్పుకుందాం.


రేమండ్ చాండ్లర్ 
         ఇదంతా ఇప్పుడెందుకంటే, కొంత కాలంగా తెలుగులో వస్తున్న లో- బడ్జెట్ సినిమాల పరిస్థితి అధ్వాన్నంగా వుంది. ఎక్కువ తీసేది ఇవే, ఎక్కువ మందికి ఉపాధి కల్పించేవీ ఇవే. ఐతే హార్రర్ కామెడీలు, కాకపోతే  రోమాంటిక్ కామెడీలూ  అనే బాక్సాఫీసు అప్పీల్ కోల్పో యిన ఇవే  సినిమాలు ఇంకా ఇంకా వందల సంఖ్యలో తీస్తూ (గత సంవత్సరం 117) గిలగిల కొట్టుకుంటున్నారు. హార్రర్ కామెడీల వైపు ఇప్పుడు దోమలు కూడా తిరిగి చూడడం లేదు. రోమాంటిక్ కామెడీలకి జనం రావాలంటే మినిమం రాజ్ తరుణ్  లాంటి క్రేజ్ వున్న హీరో వుండాలి. అంతకి తగ్గిన వాడుంటే, లేదా కొత్త వాడు వస్తే దోమలు కాదుకదా చీమలు కూడా దూరడానికి ససేమిరా అంటున్నాయి. పిచ్చిగా నచ్చావ్,  గట్టిగా గిచ్చావ్ అంటూ వచ్చే చిత్తకార్తె  రోమాంటిక్ కామెడీల్ని ఇక కట్టి పెట్టేసుకునే సమయమొచ్చేసింది. ఈ సినిమాలు తీసేవాళ్ళు గనుక మల్టీ ప్లెక్సుల్లో సినిమాలు చూడడం మానేసి, అన్ని వర్గాల ప్రేక్షకులూ వచ్చే సింగిల్ స్క్రీన్ థియేటర్లకి  వెళ్లి సినిమాలు చూస్తూంటే, సినిమా మార్కెట్ అంటే ఏంటో తెలుస్తుంది. ఏసీ గదుల్లో కూర్చుని స్క్రిప్టు రాయలేరనేది పాత కొటేషన్, మల్టీ ప్లెక్సుల్లో చూస్తూ సినిమాలు తీయలేరనేది నేటి కొటేషన్. 


          విషయమేమిటంటే, హార్రర్ కామెడీలకీ, రోమాంటిక్ కామెడీలకీ ఇక  వుండని జనం-  అటు తమిళనాడు నుంచీ, ఇటు కేరళ నుంచీ  వచ్చే క్రైం సినిమాలకి వుంటున్నారు!  ఆ డబ్బింగుల్లో తెలీని మొహాలైనా,  కొత్త మొహాలైనా, పరమ చెత్త మొహాలైనా, ఎవరున్నా కూడా ఎగబడుతున్నారు జనం. ఈ మూడు నెలల్లో వచ్చిన కనుపాప, 16 డి, నగరం, మెట్రో అనే క్రైం జానర్ సినిమాలకి ప్రేక్షకులు వుంటున్నారంటే అలోచించాల్సిందే.  సర్వ సాధారణంగా స్టార్స్ వుంటే తప్ప తమిళ మలయాళ డబ్బింగులు ఆడవు. స్టార్స్ లేకపోయినా  ఈ క్రైం డబ్బింగుల హావాతో మార్కెట్ ఏం సూచన లిస్తోంది? ఇక హార్రర్ లూ రోమాన్సులూ కట్టిపెట్టేసి క్రైం వైపుకు  వెళ్ళమనేనా?

ఫిలిం నోయర్- ‘టచ్ ఆఫ్ ఈవిల్’ (1958)

     మార్చి 31 వరకూ విడుదలైన రోమాంటిక్ కామెడీలు చూస్తే, ఇంకేంటి నువ్వే చెప్పు, నంబర్ వన్ హీరో రాజేందర్ లవ్ స్టోరీ, పడమటి సంధ్యారాగం లండన్లో, ఏ రోజైతే చూశానో, ఇక సెలవ్, కేరాఫ్ గోదావరి, కన్నయ్య, నువ్వెవరో నేనెవరో, లవర్ బాయ్, ఓ పిల్లా నీవల్ల... అని ఈ మూడు నెలల కాలంలో కొత్త కొత్త హీరోలతో పదకొండుకి పదకొండూ గల్లంతయ్యాయి.  సూక్ష్మజీవులు కూడా వీటిని కన్నెత్తి చూడలేదు. ఇక - ఎవరో తానెవరో అనే హారర్, ఆకతాయి అనే పాత మసాలా, వజ్రాలు కావాలా నాయనా అనే కామెడీ అడ్రసు లేకుండా పోయాయి. 

          ఇవి చాలనట్టు ఏప్రిల్ మొదటి వారంలో-   ఎంతవరకు ఈ ప్రేమ?, చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే... అంటూ మరో రెండు కొత్త మొహాల మహాద్భుత  రోమాంటిక్ కామెడీలు! 

          ఇక నెలనెలా ఈ కోటా భర్తీ అవుతూనే వుంటుంది. ఎవరీ దర్శకులు? ఎవరీ నిర్మాతలు? ఎవరికోసం తీస్తున్నారు? ఏ మార్కెట్ కోసం తీస్తున్నారు? వీళ్ళనుకుంటున్న మార్కెట్ ఇప్పుడుందా?  వీళ్ళనుకుంటున్న ఈ రోమాంటిక్ కామెడీల మార్కెట్ ఇప్పుడు హోటల్లో క్లీనర్ చేతిలో వుంది, పాన్ షాపులో కుర్రాడి చేతిలో వుంది, కాలేజీలో స్టూడెంట్ చేతిలో వుంది... వాళ్ళ చేతిలో స్మార్ట్ ఫోన్ అనే  బెత్తెడు తెర వుంటే,  అందులో థియేటర్లలో పసలేని రోమాంటిక్ కామెడీలని మించిన రియలిస్టిక్ రోమాన్సుల షార్ట్ ఫిలిమ్స్ వుంటున్నాయి.. అవే  తెగ ఎంజాయ్ చేస్తున్నారు  పట్టణం నుంచీ పల్లె దాకా. పిల్లకాయ రోమాంటిక్,  హార్రర్ సినిమాల మార్కెట్ నంతా స్మార్ట్ ఫోన్స్ లో మెచ్యూర్డ్ షార్ట్ ఫిలిమ్స్ తన్నుకుపోయాయి! 


నియో నోయర్- ‘యూజువల్  సస్పెక్ట్స్’  (1995) 

          ఇలా చిన్న సినిమాల మార్కెట్ కి ఒక ఖాళీ అంటూ ఏర్పడితే, ఈ  ఖాళీని ముక్కూ మొహం తెలీని నటులతో క్రైం డబ్బింగులు భర్తీ చేస్తున్నాయి. ఇటీవలే ఒక కొత్త దర్శకుడు రోమాంటిక్ కామెడీ రాసుకుని ఒక కొత్త నిర్మాత దగ్గరికి పోయాడు. ఆ నిర్మాత ఓపిగ్గా విని- మర్డర్ మిస్టరీ కావాలన్నాడు. ‘దృశ్యం’ లాంటిది. ఆ కొత్త దర్శకుడు ఇంకో నిర్మాత దగ్గరికి పోయాడు. ఆయన కూడా  ‘క్షణం’ లాంటి థ్రిల్లర్ కావాలన్నాడు. ఇది చాలా సంతోషకరమైన పరిణామం. ఇలా ఆలోచించే నిర్మాతలు పెరిగితే తప్పకుండా తెలుగు క్రైం సినిమాలతోనే ఈ ఖాళీ భర్తీ అవుతుంది. లేకపోతే పాతాళంలోకే  పోతూంటారు ప్రేమ సినిమాలతో. ప్రేమ సినిమాలు తీయాలనుకుంటే క్రేజ్ వున్న హీరోతో తీసుకోవచ్చు. పనిమాలా కొత్త మొహాలతో తీస్తే కృష్ణ బిలాలు సిద్ధంగా వుంటాయి మింగెయ్యడానికి.  ఇదే కొత్త మొహాలతో క్రైం జానర్ తీస్తే – పాచి ప్రేమలతో, పిచ్చి దెయ్యాలతో మొహం మొత్తిన ప్రేక్షకులకి ఆటవిడుపుగా వుంటుంది కనీసం కొంత కాలం పాటు. ఇద్దరు నిర్మాతల దగ్గర ప్రయత్నించిన ఆ  కొత్త దర్శకుడు ఒక నిర్మాతని ఖాయం చేసుకుని, ఆ రోమాంటిక్ కామెడీని మర్డర్ మిస్టరీగా మార్చడానికి ఈ వ్యాసకర్తని సంప్రదించాడు, అది వేరే విషయం. తెలుగులో చిన్న సినిమాలు తీసే, చిన్న సినిమాలతో పరిచయమయ్యే దర్శకులతో సమస్యే మిటంటే, మార్కెట్ యాస్పెక్ట్ తెలీడం లేదు. టాలీవుడ్ ని జయించడానికి ఏ అలెగ్జాండర్ వచ్చినా, అవే రోత  రోమాంటిక్ కామెడీలు, అవే పాత రోమాంటిక్ డ్రామాలు, అవే నికృష్ట హార్రర్ కామెడీలూ.... ఇవి తప్ప ఇంకో కథా ప్రపంచంతో పరిచయమే వుండడం లేదు.


          క్రైం జానర్ లేకుండాపోయి  ఒక ఖాళీయే కాదు, నిజానికి ఇంకోటి కూడా లేక ఇంకో ఖాళీ కూడా భర్తీ కాకుండానే,  దాదాపు మర్చిపోయేంత ప్రమాదంలో పడింది. అది కామెడీ జానర్. నాటి జంధ్యాల, వంశీ, ఇవివి సత్యనారాయణ, రేలంగి నరసింహా రావుల తర్వాత ఈ తరంలో ఒక్కరంటే ఒక్కరూ  కామెడీ దర్శకులుగా రాలేదు. కామెడీ హీరో అల్లరి నరేష్ పరిస్థితే  ఇందుకు అద్దం పడుతుంది. ఈ ఖాళీని భర్తీ చేసి చుక్కల్లో చంద్రుడులా ప్రకాశి ద్దామని ఎవరికీ ఆసక్తే లేదు. ఎందుకంటే,  పుట్టి పెరిగినప్పట్నించీ కామెడీ జానరే తెలీదు. 2000 నాటి నుంచీ మొదలైన ప్రేమ సినిమాలే చూస్తూ పెరిగిన తరం, ఇంకే భిన్న కథా ప్రపంచాన్ని వూహించగలదు గనుక.  ఇలా   క్రైం జానర్ గురించి కూడా తెలియకుండానే పోయింది. 

          ఇక్కడ చెప్ప కూడదనుకున్నా ఒకటి చెప్పేయాల్సి వస్తోంది- ఈ వ్యాసకర్తకి పరిచయమవుతున్న, దర్శకులవ్వాలని ప్రయత్నిస్తున్న వాళ్ళలో,  నూటికి 99 మంది మందికి -  క్రైం జానర్ గురించేమీ తెలీదు. కనీసం పోలీస్ స్టేషన్లో సిబ్బంది ఎవరెవరుంటారో తెలీదు. బెయిల్, రిమాండ్, చార్జి షీట్  నుంచీ మొదలు పెడితే ఫోరెన్సిక్ సైన్స్ దాకా ఏమీ తెలీదు! మరో వైపు అటు తమిళంలో '16 డి' తీసిన 21 ఏళ్ల యువదర్శకుడి క్రైం ఇన్వెస్టిగేషన్ పరిజ్ఞానం తలపండిన వాడి పనితనంగా ఆశ్చర్యపరుస్తోంది.   కొత్త వాళ్ళని పక్కన పెడదాం, ఎన్నాళ్ళ నించో  పనిచేస్తున్న కో- డైరెక్టర్స్ కి కూడా కొందరికి  పోలీసు, న్యాయ వ్యవస్థల పనితీరులు తెలీవు! ఇక కొందరు దర్శకులకైతే పోలీసులకీ ఏసీబీ అధికారులకీ  తేడాయే తెలీదు. సీఐ పరిధిలో వుండే హత్య కేసు దర్యాప్తులు వీళ్ళ సినిమాల్లో ఎస్సై లు చేసేస్తూంటారు!  

           ఈ పరిస్థితుల్లో బంగారు అవకాశంలా పొంచి వున్న-   చిన్న సినిమాల పరంగా మార్కెట్లో ఏర్పడ్డ శూన్యాన్ని,   క్రైం సినిమాలతో ఎవరు భర్తీ చేయగలరు? ఆల్రెడీ శేఖర్ సూరి వున్నాడనుకుంటే,  ఆయన హార్రర్ అనుకుంటూ ఎటోపోయాడు. రవిబాబు వున్నాడనుకుంటే, ఈయన కూడా తానేమిటో అర్ధం జేసుకోలేక ఇంకెటో పోతున్నాడు.

          ఇలాంటప్పుడు ఈ వ్యాసం ఎవరికోసం రాయాలి?
          ఇది రేపు తెలుసుకోవడానికి అన్నివిధాలా ప్రయత్నిద్దాం...


- సికిందర్ 

1, ఏప్రిల్ 2017, శనివారం

నాటి సినిమా !







           2012  సృష్టి విలయ రహస్యాన్ని మోనాలిసా బొమ్మ ఇముడ్చుకుందన్న మాటే నిజమైతే, జానపద సినిమాల్నీ, సాహిత్యాన్నీ అటక మీదికి చేరుస్తున్న  మానవజాతి,  ముందే తన మానసిక వినాశాన్నీ  కొనిదెచ్చుకుంటున్న  మాటా అంతే  నిజమౌతుంది.

           స్పీడు యుగంలో యాంత్రికంగా బతకడం అలవాటు చేసుకున్నాడు మనిషి. తన నుంచి తానూ పూర్తిగా వేర్పడిపోతూ దిక్కు తోచని స్థితిలో పడుతున్నాడు. దారీ తెన్నూ తెలీక దొరికిన వ్యక్తిత్వ వికాస పుస్తకమల్లా చదవడం మొదలెట్టాడు. కానీ ఇవే విజయానికి సోపానాల గురించి  ఏనాడో పురాణాల్లోనే,  జానపద కథల్లోనే  రాసిపెట్టారన్న సంగతే గుర్తించ లేకపోయాడు. ఇదీ మనిషి మానసిక దివాళాకోరుతనం.  పురాణాలు ఆత్మని కడిగితే, జానపదాలు మేధస్సుని పెంచుతాయి. నిగూఢంగా వున్న  మానసిక శక్తుల్ని పైకి లాగి - పోరా ఆకాశమే నీ హద్దూ అనేసి బతకడాన్ని బ్యాలెన్సు చేస్తూ జీవిత ప్రాంగణంలోకి ముందుకు తోస్తాయి. 

          ఈ పని జానపద చలన చిత్రాల తిరుగులేని కథానాయకుడిగా టీఎల్ కాంతారావు కొన్ని వందలసార్లు చేసి వుంటారు. కాంతారావు చేసిన మేలు మనం అప్పుడు తెలుసుకోలేదు గానీ, ఇప్పుడు ఆలోచిస్తే  జానపద సినిమాలతో వ్యక్తిత్వ వికాసానికి బ్రాండ్ అంబాసిడర్ కి తక్కువకాని  హోదాని తనే ఆనాడే  పోషించారు!


          ఈ పని ‘సప్తస్వరాలు’ తో ఇంకా పరమ నిష్ఠగా చేశారు. ఈ సినిమా మొత్తంగా ఒక సైకలాజికల్ విహార యాత్ర. ఇందులోకి ప్రవేశిస్తే మనల్ని మనం తెలుసుకోగలం
. నిమిష నిమిషానికీ మన మనసు చేసే మాయ, చిత్ర విచిత్రాలూ- వీటన్నిటినీ ఒక దారిలో పెట్టి, లక్ష్యాన్ని సాధించేందుకు మనం చేసే విశ్వ ప్రయత్నాలూ- దీన్నొక కదిలే బొమ్మల పర్సనాలిటీ క్విజ్ గా నిలబెడతాయి.
     కృష్ణుడికి ఎన్టీఆర్ నీ, దేవదాసుకి ఏఎన్నార్ నీ పర్మనెంట్ సింబల్స్ గా ప్రేక్షకుల మనోఫలకాల మీద ముద్రించి వదిలిపెట్టిన సినిమాయే,  జానపద కథానాయకుడికి సింబల్ గా స్ఫురద్రూపియైన కాంతారావు  రూపాన్ని అచ్చు గుద్ది, పక్కనే నిలువెత్తు కత్తినీ గుచ్చి వదిలింది! తను పోతూ ఆ కత్తినీ పట్టుకుపోయారు కాంతారావు. కత్తి కూడా స్వరాలు పలికిస్తుందని ఆయన నిర్ధారణ. సప్తస్వరాల మాలిక సంగీతమైనట్టే, యుద్దాల్లో కత్తులూ ఏడు రకాల శబ్దాలు విన్పిస్తాయట! ఇదీ కాంతారావు ప్రకటన! యుద్ధాలూ,  సమురాయ్ కత్తుల విన్యాసాలూ గురించి కసక్ కసక్ మని రాసే పాల్ సియోలో కూడా ఈ సంగతి చెప్పలేదు మనకి! 

          అలాగని సప్తస్వరాలు ఏవో కత్తులు పాడుకునే సంగీత సమ్మేళన మనుకుంటే  కత్తుల మీద కాలేసినట్టే. సప్త స్వరాలు కేవలం మాధుర్యాన్ని చిలికే సరిగమలే కావనీ, సప్త సముద్రాలు, సప్త గిరులు, సప్తర్షులు, సూర్యుడి సప్తమాశ్వాలూ ... ఇవన్నీ మానవ కోటికి  మహత్తర వరాలనీ, సప్త సంఖ్యామయమైన ఈ జగత్తే మొత్తంగా ఈ సప్తస్వరాల్లో ఇమిడి వుందనీ, ఈ సప్త స్వరాలని జయించిన వాడే శారదా పీఠాన్ని అందుకోగల్గుతాడనీ ఈ సినిమా  కథలోని భావం. మెంటల్ పోస్ట్ మార్టం మేడీజీ అన్నమాట. 


          ఈ అంతరంగ ప్రయాణం ప్రారంభించే ముందు ఏడు ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. లేకపోతే
  అగాథంలోకి పతనం ఖాయం. దీంతో తొలిసారిగా సినిమా నిర్మాణానికి పూనుకున్న కాంతారావు, తన ఉత్తమాభిరుచులేమిటో అడుగడుగునా దృశ్యాల్లో ప్రతిఫలించేలా చేశారు. దీని ఆర్ధిక పరాజయానికి కొన్ని రాజకీయాలు కారణమై వుండొచ్చు, కానీ విషయపరంగా దీన్ని శాశ్వత తత్వానికి  ఎదురేదీ లేదు.

          దేవదాసు లాంటి భగ్న ప్రేమికుడి విషాదాంతంతో బాగా- బాగా-  ఏడ్పించేసి  వదిలిన వేదాంతం రాఘవయ్య కి,  ఈ ‘సప్తస్వరాలు’ గమ్మత్తుగా భగ్నప్రేమికుడి విజయగాథ! ఈ మహా దర్శకుడి చిత్రీకరణలో పాత్రల నిమ్నోత్తమాలు, వాటి తాలూకు భావోద్వేగాలు, అభినయ విలాసాలు, అన్నీ మహోన్నతంగా ఉట్టి పడతాయి.  కాంతారావు, నాగయ్య, రామకృష్ణ, ధూళిపాళ, సత్యనారాయణ, జగ్గయ్య, రాజబాబు, బాలకృష్ణ (అంజి గాడు), రాజశ్రీ, విజయలలిత, విజయనిర్మలల బారెడు తారాతోరణంతో  రాఘవయ్య దర్శకత్వ లాఘవం మనల్ని కదలకుండా కట్టిపడేస్తుందంటే అతిశయోక్తి కాదు. అదే నీవంటివీ, కృష్ణయ్యా గడసరి కృష్ణయా... వంటి పాపులర్ గీతాలతో, నృత్యాలతో, సూటిపదాల సంభాషణలతో; రాజకోట, మాంత్రికుడి కళాత్మక సెట్స్ తో, సమ్మోహనకర ట్రిక్ ఫోటోగ్రఫీతో, కత్తి పోరాటాలతో... ఓ పరిపుష్ట పంచభక్ష్య పరమాన్న విందిది. నిర్మాణ వ్యయాన్ని  వేదాంతం ఆరు లక్షలకి  పైగా లాగేశారని కాంతారావు వాపోయినా, వేదాంతం ఇచ్చిన విందు ముందు కాంతారావు ఖేదం బేఖాతర్ మనకి!

       విచిత్రంగా జానపదంలో పౌరాణీకాన్ని కలుపుకున్న జానర్ ప్రయోగమిది. దీంతో ఇది ఆథ్యాత్మిక యానం కోసం చేసే మనోవైజ్ఞానిక విహార యాత్రవుతోంది. హాలీవుడ్ చలన చిత్ర రాజం  ‘రైడర్స్ ఆఫ్ ది  లాస్ట్ ఆర్క్’  లో ఆథ్యాత్మిక శక్తులున్న ఆర్క్ కోసం జరిపే పోరాటం ద్వారా మహా దర్శకుడు స్టీవెన్ స్పీల్ బెర్గ్ ఏం చెప్పాలనుకున్నాడో, సరీగ్గా ఆ లోక కల్యాణాన్నే ప్రబోధిస్తోంది ‘సప్త స్వరాలు’ కూడా!
          అనేక సమస్యలతో, అన్యాయాలూ అక్రమాలతో పుచ్చి పోయింది మానవ లోకం సమస్తం. అజ్ఞానమే దీనికంతటికీ మూలం.  దీంతో నారదుడు (రామకృష్ణ), గంధర్వుడు (కాంతారావు) లు కలిసి  వెళ్లి సరస్వతి (విజయనిర్మల) కి ఈ సంగతి మొరపెట్టుకుంటారు. అప్పుడామె ఓ శారదా పీఠాన్ని అందించి, దాంతో మనుషుల అజ్ఞానాన్ని తొలగించి మానవ కల్యాణాన్ని పునఃప్రతిష్ఠాపన చెయ్యమనీ ఉపదేశించి పంపుతుంది. ఈ శారదా పీఠాన్ని  వైజయంతి (విజయలలిత) వ్యామోహంలో పడిన గంధర్వుడు పోగొడతాడు. దీంతో – నువ్వెళ్ళి భూలోకంలో అలాగే బాధలనుభవించమని నారదుడు శపిస్తాడు.


          భూలోకంలో ఓ సంగీత కారుడు (నాగయ్య) కి  ముత్యపు చిప్పలో మగ శిశువు దొరుకుతాడు. వాడికి సారంగ అని పేరు పెట్టి పెంచుకుంటూ సంగీతం నేర్పుతూంటాడు. ఇంకో ముత్యపు చిప్పలో మహారాజు (ధూళిపాళ) కి ఆడ శిశువు దొరుకుతుంది. దానికి దేవ మనోహరి అని నామకరణం చేసి పెంచుకుంటూ, నాట్యం నేర్పిస్తూంటాడు. సంగీతం
నేర్చుకుని పెద్దవాడైన  సారంగ (కాంతారావు), జయంతి (రాజశ్రీ) తో ప్రేమ కలాపాలు సాగిస్తూంటాడు. ఇది తండ్రికి తెలిసి మందలిస్తాడు. ఎందుకంటే, సారంగాకి తను ఒక లక్ష్యంతో సంగీతం నేర్పుతున్నాడు. ఆ లక్ష్యం స్వర్గలోకం నుంచి భూమండలంలో పతనమైన శారదా పీఠాన్ని  సాధించడం. అది ప్రస్తుతం సోపాన మంటపం మీద ప్రత్యక్షమై వుంది.  దాన్ని సాధించే వాడు సంగీతంలో స్రష్ట అయి, మాతృగర్భంలో జన్మించని అయోనిజుడై వుండాలి. స్త్రీ స్పర్శ ఎరుగని బ్రహ్మచారియై కూడా వుండాలి. ఇది విన్న సారంగ  చకితుడవుతాడు. తను అయోనిజుడు సరే, బ్రహ్మచర్యమంటే ఎలా సాధ్యం? జయంతి  తన సర్వస్వం. ఎటూ తేల్చుకోలేక ఈ సంకటంలో వుండగా,  అప్పుడు వూడిపడతాడు అభేరి (సత్యనారాయణ)  అనే తాంత్రిక విద్యల తుచ్ఛుడు. వీడికి మానవ జాతి పచ్చగా వుంటే నచ్చదు. ఆ శారదా పీఠాన్ని చేజిక్కించుకుని, మానవ లోకాన్ని ముక్కలు చెక్కలు చెయ్యాలని చూస్తూంటాడు. 

        ఇక మొదలవుతుంది రసవత్తర క్రీడ. మామూలు ప్రేక్షకులకి మామూలు భాషలో సస్పెన్స్, థ్రిల్స్, టెంపో, యాక్షన్, అడ్వెంచర్ లాంటివి అన్నీ ఇందులో వుంటాయి. ఈ ఎలిమెంట్సే  రసజ్ఞులకి  ఒకొక్కటీ ఒక్కో  సైకలాజికల్ ట్రూత్ గా ఆశ్చర్య పరుస్తాయి. స్థాపించిన కథా ప్రపంచంలో పైకి కన్పించని ఈ హిడెన్ ట్రూత్  ఆసాంతం రసమయ సంగీతమనే రజాయిని వెచ్చ వెచ్చగా కప్పుకుని వుంటుంది.

          ప్రతీ పాత్రా,  ప్రతీ సన్నివేశమూ సంగీతాన్నే వొలికిస్తాయి. లక్ష్య సాధన కోసం కాంతారావుకే ద్రోహం చేసే నాగయ్య, ఆ ద్రోహంతో ప్రేమలో పిచ్చి వాడయ్యే కాంతారావు మీదికి విషకన్య విజయలలితని ప్రయోగించే సత్యనారాయణ విద్రోహం, మధ్యలో తిక్క వేషాల ధూళిపాళ చెత్త పనులు, మరోవైపు గడ్డీ గాదం మేసి దిట్టంగా సంగీతం నేర్చుకోవాలనుకునే రాజబాబు హాస్య ప్రహసనాలు, రాజశ్రీ సోయగాల కనువిందూ... కలిసి ఓ మహోజ్వల జానపద చలనచిత్ర రాజం!   
  
          వీటూరి కథా మాటలూ రాస్తే; పాటలు సినారె తో బాటు వీటూరి కూడా రాశారు. టీవీ రాజు సంగీతం సమకూరిస్తే, అన్నయ్య ఛాయాగ్రహణాన్నీ, ఎస్ ఎస్ లాల్  ట్రిక్ ఫోటోగ్రఫీనీ పోషించారు. నృత్యాలు వెంపటి సత్యం, కళా దర్శకత్వం బీఎన్ కృష్ణ వహించారు.

          హేమా ఫిలిమ్స్  సంస్థని స్థాపించిన టీఎల్ కాంతారావు, 1969 లో నిర్మించి నటించిన న ఈ కళాఖండాన్ని గురువు హెచ్ ఎం  రెడ్డికి అంకితమిచ్చారు.

చరిత్రలో ఒక పేజీ...
       అప్పటి సినిమాల్లో రాజనాల గొప్ప విలనే. అయితే ఈ విలన్ పాత్రని అప్పుడప్పుడూ నిజజీవితంలో కూడా పోషిస్తూ ఎలా అవమానపర్చే వాడో, ‘బందిపోటు’ షూటింగు సమయంలో ఇచ్చిన డైలాగులతో కావాలని పెట్టిన ముప్పు తిప్పలూ, అది దారి తీసిన పెద్ద గొడవా సీనియర్ రచయిత త్రిపురనేని మహారధి ఈ వ్యాసకర్తకి ఒకసారి వివరించారు.

           కాంతారావుకీ ఇలాటిదే జరిగిందన్నారు త్రిపురనేని. ఎక్కడో చదివిన కథని వీటూరి చేత ‘సప్త స్వరాలు’ స్క్రిప్టుగా రాయించుకుని, రాజనాల దగ్గరికి వెళ్తే, ఆయన  స్క్రిప్టుని సరీగ్గా పట్టుకోకుండా కావాలని కింద పడేసి, ‘ఇప్పుడు రాహుకాలం. నేను కథలు వినను, నీ సినిమాలో నటించను ఫో!’ అనేశారు. దెబ్బతిన్న కాంతారావు వెళ్లిపోయి వేదాంతం రాఘవయ్యకి చెప్పుకుంటే, ఆయన సత్యనారాయణని విలన్ గా తీసుకుందామని సలహా ఇచ్చారు. అలా నాల్గు వేలు పారితోషికంగా తీసుకుని సత్యనారాయణ విలన్ పాత్ర వేసి మెప్పించారు.

          సినిమా 1969 లో విడుదలయ్యింది. అప్పుడు రాజకీయాలు ఈ సినిమాని తినేశాయి. 1969 లో ప్రత్యేక తెలంగాణా ఉద్యమం ఉధృతంగా నడుస్తున్న కాలం. ‘ప్రేక్షకులారా మీరు తెలంగాణా వాడు తీసిన ఆ సినిమా చూస్తారో, ఆంధ్రా వాడు తీసిన ఈ సినిమా చూస్తారో తేల్చుకోండి!’ అని కృష్ణతో  ‘లవ్ ఇన్ ఆంధ్రా’  తీసిన భావనారాయణ ప్రచారం చేయడంతో కాంతారావు గుండె పగిలింది. అయితే ఆ ఉద్యమ ప్రభావానికి ‘సప్తస్వరాలు’ తో బాటు ‘లవ్ ఇన్ ఆంధ్రా’ కూడా మట్టి కర్చింది. 

డైలాగ్ డిష్ 
నాగయ్య :
           * నాకు స్వార్ధమా? భార్యలా బిడ్డలా సంసారమా...  ఏముందని, ఎవరున్నారని నాకు స్వార్ధం?
           ఎవరేం చేసినా చేయకపోయినా,  కళాకారుడు మాత్రం తన కళ ద్వారా దేశం యొక్క గౌరవాన్ని కాపాడాలనుకుంటాడు.
 కాంతారావు :
           * ఆశా లేదు, నిరాశా లేదు. అనుకున్నదీ లేదు, అనుకోనిదీ లేదు. లేదనుకుంటే ఏదీ లేదు, అవునా?
           * నవ్వీ నవ్వీ నవ్వీ ...గుండె బండబారిపోయింది...
           * పాదాలు పట్టుకునే ఆడదాన్నీ, కన్నీళ్లు పెట్టుకునే మగవాణ్ణీ నమ్మ కూడదు.
 రాజబాబు :
           * చచ్చింది గొర్రె! నా నోట్లో నువ్వు గింజ కూడా నానదే!
           * ఇంత వరకూ భూమి కనిపించింది, ఇక ముందు చుక్కలు కనపడతాయి.


-సికిందర్ 
(సాక్షి- నవంబర్, 2009)
cinemabazaar.in


         





         
         
                   



రివ్యూ!






    

టెంప్లెట్ - దర్శకత్వం : పూరీ జగన్నాథ్.
తారాగణం: ఇషాన్, మన్నారా చోప్రా, ఏంజెలా క్రిస్ లిన్ స్కీ,  తులసి, అనూప్సింగ్ఠాకూర్, సుబ్బరాజు, అలీ, అవినాష్, ఎజాజ్ ఖాన్
సంగీతం: సునీల్కాశ్యప్, ఛాయాగ్రహణం: ముకేష్ బ్యానర్‌: తన్వి ఫిలింస్
నిర్మాత: సి.ఆర్‌. మనోహర్, సి.ఆర్‌. గోపి
విడుదల : మార్చి 31, 2017
***

     ఒక దర్శకుడు ఎన్నేళ్ళు పోయినా అవే సినిమాలు అలాగే తీస్తూపోతున్నాడంటే ప్రేక్షకుల సహన శక్తి మీద అంత నమ్మకమన్న మాట. ప్రేక్షకులకి ఈ సహన శక్తి ఏ సినిమాకా సినిమా తను మార్చేసే స్టార్స్ ని చూసి వస్తూండవచ్చు. ఇది తన అదృష్టమే. చాలా కొద్ది మందికే ఇలా చెల్లిపోతుంది. వాళ్ళల్లో  పూరీ జగన్నాథ్ ఒకరు. తనని స్టార్స్ కరుణిస్తున్నంత కాలం శాశ్వత ప్రాతిపదికన, ఎక్కడో ఘనీభవించిన-  శిలాసదృశమైన  తన రాత- తీత పనికే ఢోకా వుండదు. తను రాసిందే కథ, తను తీసిందే సినిమాగా,  స్త్రీ ద్వేషమే  తన అమ్మకపు సరుకుగా కార్యకలాపాలు సాగించుకోవచ్చు. 

         
దృష్ట్యా పూరీ సినిమాలకి రివ్యూలే అవసరం లేదు. ఏముంటుంది రాయడానికి రాసిందే రాయడం తప్ప. అలాగే కొత్త తరం దర్శకులు నేర్చుకోవడానికి ఏముంటుంది పూరీ సినిమాల్లో, చూసిందే చూడడం తప్ప. అయితే ఎవరో పసిగట్టేసి అల్లరి చేస్తున్నారని కాబోలు, కాస్త మారినట్టూ కన్పించడమూ తనకే సాధ్యమైంది. కానీ మారినట్టు కన్పించినంత మాత్రాన  కొత్తగా తీసిన  ‘రోగ్’ కాస్తా రోగరహితమై పోతుందా? రోగాన్ని దాచుకుని పైపైన స్ప్రే కొట్టుకు తిరిగితే ఆ స్ప్రే మార్నింగ్ షో వరకే సరిపోతుంది. ఇక ప్రతీ షోకీ ప్రేక్షకులు స్ప్రే కొట్టుకుని చూడాల్సి వస్తే సహనశక్తి పూర్తిగా నశించిపోతుంది. 




          టెంప్లెట్ సినిమాలు తీసి తీసి, అల్లరయ్యాకా ఎందుకు ఫ్లాపవుతున్నాయో తెలుసుకుని, ‘రోగ్’ ని టెంప్లెట్ నుంచి కాస్తా తప్పించినట్టు కన్పించేలా చేద్దామనుకున్నట్టుంది. పూరీ మార్కు టెంప్లెట్ అంటే- తాజాగా గత వారం  వచ్చిన  ‘కాటమ రాయుడు' అనే అట్టర్ ఫ్లాపే. ఆ దర్శకుడు పూరీని ఆదర్శంగా తీసుకుని టెంప్లెట్ లో అన్నీ సర్దేశాడు. పూరీ టెంప్లెట్ ప్రకారం ఒక యాక్షన్ సీనుతో హీరో ఎంట్రీ, గ్రూప్ సాంగ్, హీరోయిన్ని పడేసే కామెడీ లవ్ ట్రాక్, టీజింగ్ సాంగ్, హీరోయిన్ లవ్ లో పడ్డాక డ్యూయెట్, విలన్ ఎంట్రీ, దాంతో ఇంటర్వెల్. ఇక సెకండాఫ్  లో హీరోయిన్ కట్ అయిపోయి విలన్ తో కథ మొదలు, అప్పుడప్పుడు హీరోయిన్ తో సాంగ్స్, అప్పుడప్పుడు విలన్ ఎటాక్స్, హీరోయిన్ తో ఒక ఫోక్ సాంగ్, విలన్ తో క్లయిమాక్స్, ముగింపు.

          ఇదే టెంప్లెట్ ని ఇంకో విధంగా కూడా చూపించారు-
అదే కథ, అవే పాత్రలు, వాటికి  ఒక యాక్షన్ సీన్ ఒక కామెడీ సీన్- ఒక లవ్ సీన్- ఒక పాటమళ్ళీ ఒక యాక్షన్ సీన్- ఒక కామెడీ సీన్- ఒక లవ్ సీన్- ఒక పాట; మళ్ళీ ఒక...ఇలా ఇవే రౌండ్లేస్తూ  వుండడమన్నమాట.

          అవతల మూసని బ్రేక్ చేసే తెలుగు టాలెంట్స్  తో  ఒక ‘ఘాజీ’ రానీ, ఇంకో ‘గురు’ రానీ- ఈ టెంప్లెట్  ఏమాత్రం గిల్టీ  ఫీలవదు. టెంప్లెట్ కి కాలంతో పని లేదు, కాలమ్స్ కి సరిపడా పాత రేషన్ ని డంప్ చేయడమే దాని పని.

          ఇప్పుడు రూపం మార్చుకున్న టెంప్లెట్ లో ఈ కింది విధంగా ఏడు కాలమ్స్ వున్నాయి :

          ఇవే ఏడు కాలమ్స్ పాత టెంప్లెట్ లో ఇలా వుండేవి :

            ఫస్టాఫ్ ఇంటర్వెల్ దాకా హీరోయిన్ ని పడేసే హీరో కామెడీ ఇప్పుడు లేదు, మార్పు కోసం మిస్టర్  రోగ్ హీరోయిన్స్ ని సీరియస్ గా ద్వేషిస్తూంటాడు, అంతే. ఓపెనింగ్ లోనే పోలీస్ కమీషనర్  పాత్రనీ, అతడి చెల్లెలైన హీరోయిన్ పాత్రనీ రొటీన్ గా భూతకాలంలోంచి దిగుమతి చేసుకుంటాడు. హీరోయిన్ పెళ్లవుతూంటే వచ్చి అడ్డుపడతాడు. అందర్నీ కొడతాడు, ఒక పోలీసు కాళ్ళు  విరగ్గొడతాడు. హీరోయిన్ పెళ్లి మాత్రం జరిగిపోతుంది. దాంతో ఆమె  మోసానికి  స్త్రీ లందర్నీ ద్వేషించడం మొదలెడతాడు. హీరోయిన్ పేరు అంజలి అనే టెంప్లెట్ పేరు. దీంతో అంజలి పేరుతో  ఏ టెంప్లెట్  అమ్మాయి కన్పించినా  పట్టుకు కొట్టేస్తాడు. 

          ఈ రోగ్ కి  అసలే మైనారిటీ లో పడిపోతున్న మాస్ ప్రేక్షకులని బుజ్జగించడానికి  చంటి అనే ఇంకో టెంప్లెట్ పేరు. ఇక బుజ్జగింపు రాజకీయాలు మొదలు. పోలీసు కాళ్ళు విరగ్గొట్టినందుకు ఈ చంటి రోగ్ రెండేళ్ళు జైలుకి పోతాడు. ఈ జైలు సీన్లు మైనారిటీలో పడిపోతున్న మాస్ ప్రేక్షకుల్ని బుజ్జగించేందుకు ప్రత్యేకించినవి. జైలుకొచ్చి కలిసిన పెళ్ళయిన హీరోయిన్, అటు మొగుడితో కూడా ఎలా నాటకాలాడుతోందో ఎస్టాబ్లిష్ అవుతుంది. దీంతో అమ్మాయిలు మేథమెటిక్స్ అనీ  - అబ్బాయిలు పోయెట్రీ అని  డిసైడ్ చేసుకుంటాడు రోగ్. అబ్బాయిలే పవిత్రులూ, అమ్మాయిలు అపవిత్రులన్న డైలాగులు ఇక సాంతం రాజ్యమేలతాయి. ఇక ఏ ఆడ పాత్రకీ పూచిక పుల్ల విలువుండదు. వాళ్ళని ఎంత కించపరిస్తే అంత బాక్సాఫీస్ గలగలలు విన్పిస్తాయన్నట్టు. ఇదంతా అసలే మైనారిటీలో పడిపోతున్న –అదికూడా పూరీ సినిమాలకి కొందరు అబ్బాయిలకే పరిమితమైపోయిన యువ ప్రేక్షకుల చేత కేరింతలు కొట్టించడానికే. నీట్లో తడిసిన హీరోయిన్- ‘పంది కూడా తడిస్తే అందంగా వుంటుంది’ అన్నదాకా ఈ డైలాగుల పంద్యారం సాగుతుంది.

         ఇంతకీ రోగ్ ఇవన్నీ చేసేది కోల్ కత మహా నగరంలోనే. జైలునుంచి విడుదలై  టెంప్లెట్ ప్రకారం ఇంటికి పోతే టెంప్లెట్ ప్రకారమే తండ్రి వెళ్ళ గొడతాడు. కాళ్ళు విరగ్గొట్టిన పోలీసు కుటుంబాన్ని ఆదుకుందామని పోతాడు. వాళ్ళు ఛీ కొట్టినా ఇంటి ముందే వుంటున్న బెగ్గర్స్ గుంపుతో  మకాం వేస్తాడు. ఆ కానిస్టేబుల్ చెల్లెలు ఇంకో హేరోయిన్. ఈమె కోల్ కత నైట్ క్లబ్ లో టెంప్లెట్ ప్రకారం తెలుగు పాటలు పాడుతూ అన్న కుటుంబాన్ని పోషించుకునే త్యాగమయి- ఈమె కూడా ‘బజారుమయి’ అయిపోతుంది. సౌజన్యం : రోగ్ గారి స్త్రీ ద్వేషం. పైగా ఈమె పేరూ అంజలి. రోగ్ గారు కర్ర తీసుకుని చావబాదుతూ బిర్యానీలు కూడా తినిపిస్తాడు ఈమె ఇంటిల్లిపాదినీ.

          టెంప్లెట్ ప్రకారమె ఒక వడ్డీల వ్యాపారికి వసూళ్ళ ఏజెంటుగా కుదిరి, ఆ వచ్చిన కమిషన్ తో  కానిస్టేబుల్ అప్పులు తీర్చడం మొదలెడతాడు రోగ్. కానిస్టేబుల్ కి ప్రభుత్వం నష్టపరిహారం అదీ బాగానే ఇచ్చే వుండాలి, చెల్లెలికి ప్రభుత్వోద్యోగం కూడా ఇచ్చే వుండాలి. అయినా రోగ్ ఆదుకుంటానని వేధిస్తూంటాడు. ఇంకా చాలా చేస్తూంటాడు. పెళ్ళయిన హీరోయిన్ ఇంటికి కూడా వెళ్లి భర్తకి, పోలీస్ కమీషనర్ అయిన ఆమె అన్నకీ ఆమె మీద గాసిప్స్ చెప్పి చెడగొట్టాలని చూస్తూంటాడు. టెంప్లెట్ ప్రకారం ఇంటర్వెల్ కి  ముందు విలన్ వచ్చే దాకా ఈ రోగ్ స్త్రీ ద్వేషిగా టైం పాస్ చేయాలి కాబట్టి- కామెడీ చేయరాక అరుస్తూ వుండాలి కాబట్టి, అడ్డొచ్చిన వాళ్ళని కొడుతూ వుండాలి కాబట్టి- ఇవన్నీ చేస్తూండగా, ఇక టైము చూసుకుని వచ్చేస్తాడు టెంప్లెట్ విలన్. 


         వీడు సైకో. హీరో రోగ్ అయితే, విలన్ సైకో. ఈ సైకోకి ఇంకా హీరోయిన్ కన్పించాలి కాబట్టి అప్పటి దాకా రోగ్ తో దోస్తానా చేస్తూంటాడు. హీరోయిన్ కన్పించగానే  టెంప్లెట్ ప్రకారం కామెడీగా వెంటపడతాడు. ఈ కామెడీ సైకోతో ఆమెకి కథ వుంది. క్లాస్ రూమ్ లో వీడు ఒకమ్మాయిని కాల్చి చంపాడు. అప్పుడు పెట్రోలు పోసుకుని వున్న వీణ్ణి లైటర్ తో అంటించేసి చంపాలనుకుంటుంది హీరోయిన్. కానీ చేతిలో ఆ లైటర్ వెల్గించి పట్టుకుని ఆ పనే చెయ్యదు. ఫ్రెండ్ చస్తే చచ్చింది, నేనెందుకు వీణ్ణి చంపి జైలుకి పోవాలనుకుందో ఏమో- అలాగే ముందు ముందుకు వెళ్తూంటుంది లైటర్ తో. వాడి మీదికి విసిరేస్తే వాడే భస్మీ పటలమైపోతాడు. కానీ ఆ పనే చెయ్యదు. సైకో కూడా గట్టిగా వూదితే ఆరిపోయే లైటర్ కి భయపడతాడే గానీ, వూదేసి పారిపోవాలనుకోడు. పోలీసులు వచ్చే దాకా లైటర్ ని చూస్తూ భయపడుతూ స్టూడెంట్స్ చేత తన్నులు తిని, పోలీసులకి దొరికిపోతాడు. ఇప్పుడు జైలు నుంచి తప్పించు కొచ్చి హీరోయిన్ పని బడుతున్నాడన్న మాట. 

        ఇదీ విషయం. ఇక వీణ్ణి ఎదుర్కొని హీరోయిన్ని కాపాడుకోవాలి రోగ్. ఈ రీసైక్లింగ్ కథ కాదుగానీ, దీంతో పూరీ పడ్డ పాట్ల గురించే చెప్పుకోవాలి. ఎలాగైనా దీన్ని నిలబెట్టాలన్న ఆదుర్దా, ఆందోళనలే ప్రతీ చోటా కన్పిస్తాయి. ఏం చేస్తున్నాడో తనకే తెలీనట్టు ఎడాపెడా అర్ధం లేని సీన్లు వచ్చిపడుతూంటాయి. సెకండాఫ్ లో ఇదెక్కువై పోతుంది. అప్పటికప్పుడు సెట్లో సీన్లు రాసుకున్నారన్నట్టు తయారవుతుంది. పోనూ పోనూ పూర్తిగా అదుపుతప్పి పోతుంది. తనకి హీరోయిన్ దక్కకుండా చేస్తున్నారని ఊళ్ళో ఆడవాళ్ళందర్నీ సైకో కిడ్నాప్ చేయడం, కానిస్టేబుల్ కి కాళ్ళు తెప్పించే  ఆపరేషన్ కోసం రోగ్ కి పది లక్షలు కావాల్సి వచ్చి సైకో సాయమే తీసుకోవడం, ఆ సైకో ఏకంగా దోపిడీలే చేయడం....ఏమిటో,  కథంటే ఎలా అంటే అలా నరుక్కు పోతూంటే ఎక్కడో దార్లో పడకపోతుందా అన్నట్టు- సిల్వర్ స్క్రీన్ మీదే సినిమా చూపిస్తూ పూరీ రఫ్ కాపీ రాసుకుంటున్నట్టు వుంటుంది... ఈ ‘రోగ్’ రఫ్ కాపీయే. దీన్ని చక్కదిద్ది ఫైనల్ కాపీ ఎప్పుడు చూపిస్తారో. ఫైనల్ కాపీయే  ఇంకో కథగా, ఇంకో టెంప్లెట్ గా వచ్చినా ఆశ్చర్యం లేదు. 

          ఇలా తను టెంప్లెట్ నుంచి బయటపడ్డానని అన్పించుకోవడానికి, టెంప్లెట్ కే కొత్త రూపం తొడిగి మభ్యపెట్టబోతే ఫలితాలు డిటో గానే వచ్చాయి. టెంప్లెట్స్ రాయకుండా పూరీ స్క్రీన్ ప్లే రాయడం నేర్చుకున్నప్పుడు ఫలితాలు వేరేగా వుంటాయి. అన్నట్టు పూరీ స్క్రీన్ ప్లే ఎప్పుడు రాసినట్టు? అసలు ఒక్క స్క్రీన్ ప్లే రాయకుండా రెండు దశాబ్దాలు చెలామణీ అవడం రికార్డే. 

         ఐతే ఈసారి టెంప్లెట్ కి స్టార్ ఎట్రాక్షన్ లేకుండా పోయింది. కన్నడ వ్యక్తిని హీరోగా పరిచయం చేస్తూ  స్టార్ ఎట్రాక్షన్ లేని లోపంతో సతమతమవాల్సి వచ్చింది. కొత్త హీరో ఇషాన్ ఫైట్లు డాన్సులు బాగా చేయడం గొప్పేం కాదు. ఈ రోజుల్లో అవి లేకుండా తెరంగేట్రం చేయలేరు. నటన ఎంతన్నదే పాయింటు. తనలో గనుక నటుడే వుంటే, నటనకి ఏమాత్రం అవకాశమివ్వని ఈ ‘రోగ్’ బ్యాడ్ ఆప్షనే తనకి. నటనంటే అరుపులు అరవడమే, లంగ్ పవర్ చూపడమే అని పూరీ అనుకుంటే, తన ద్వారా పరిచయమయ్యే హీరోల కెరీరే ప్రారంభం కాదు. 

          హీరోయిన్లు ఏంజెలా
క్రిస్ లిన్ స్కీ , మన్నారా చోప్రా లు ఎందుకున్నారో వున్నారు. అలీ, అతడి గ్రూపు బెగ్గర్ కామెడీ నీరసంగా వుంది. సైకో అనూప్ సింగ్ హీరో కంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తూ,  రూపాయికి రూపాయిన్నర శ్రమని అమ్ముకున్నాడు. చాలా రోజులకి కన్పించిన సుబ్బరాజు ఎన్ కౌంటర్ స్పెషలిస్టు టెంప్లెట్ పాత్రలో ఏమీ చేయకుండానే వుం డిపోయాడు. రోగ్ గారి మాతృమూర్తిగా తులసిది అయోమయం పాత్ర. 

          పూరీ చేతిలో మంచి స్క్రిప్టు లేకపోయినా ముఖేష్ జి రూపంలో మంచి కెమెరా మాన్ దొరకడం అదృష్టం. స్క్రిప్టు విషయంలో తను అవుట్ డేటెడ్ గా వుంటే,  ఆ కెమెరా మాన్ కి అన్యాయం చేయడమే అవుతుంది. చిరిగిన చొక్కా మీద కోటేసుకున్న చందాన తను టెక్నీషియన్ లని వాడుకోవడం ఇకనైనా మానుకుంటే మంచిది. అలాగే సునీల్ కాశ్యప్ సంగీతాన్ని ఆస్వాదించాలంటే సినిమాకో అర్ధంపర్ధం కూడా వుండాలిగా.

          పూరీ జగన్నాథ్ స్క్రీన్ ప్లే రాయడం ప్రారంభించిన రోజున ప్రేక్షకులు తిరిగి రావడం ప్రారంభిస్తారు తన సినిమాలకి. ఈ సంవత్సరం ఈ మూడు నెలల్లో ‘రోగ్’ తో కలిపి ‘కాటమ రాయుడు’, ‘విన్నర్’, ‘మా అబ్బాయి’, ‘నేనోరకం’, ‘గుంటూరోడు’ అనే ఆరు  టెంప్లెట్ సినిమాలు వస్తే  అరింటినీ నిర్ద్వంద్వంగా తిప్పి కొట్టారు క్లాస్ మాస్ ప్రేక్షకులందరూ. ఇప్పటికైనా టెంప్లెట్ ని మూసిపెట్టుకుంటారా? ఇలాగే  కోటాను కోట్లు పోగొట్టుకుంటూ వుంటారా? 

-సికిందర్
cinemabazaar.in