రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

2, ఏప్రిల్ 2017, ఆదివారం

      తెలుగులో పౌరాణికాలు, జానపదాలు, కుటుంబ కథలు, ప్రేమ కథలు,  సామాజిక కథలు, భక్తి  కథలు, కామెడీ కథలు మొదలైనవి తప్పితే యాక్షన్, క్రైం, హార్రర్,  సైన్స్ ఫిక్షన్ కథలతో వచ్చిన సినిమాలు  హాలీవుడ్  నుంచి స్ఫూర్తి పొంది దిగుమతి చేసుకున్న కథా ప్రక్రియలే. అలా దిగుమతి చేసుకున్న యాక్షన్ విభాగంలో  జేమ్స్ బాండ్, కౌబాయ్ సినిమాలు కూడా 1970 లలో తెలుగులో ప్రారంభమయ్యాయి. 1960 లలో ప్రారంభమైన హార్రర్, సైన్స్ ఫిక్షన్ విభాగాలు కూడా నేటి దాకా కొనసాగుతూనే వున్నాయి. కానీ క్రైం విభాగం కూడా హాలీవుడ్ నుంచే దిగుమతి అయినా, అంతగా అభివృద్ధి చెందక వుండిపోయింది.  ఈ విభాగంలో మర్డర్ లేదా ఇంకేదైనా నేరంతో కూడిన మిస్టరీలు తెలుగులో తీయడం ఎప్పుడోగానీ జరగడం లేదు. 

          
హాలీవుడ్ లో టాకీలు ప్రారంభమైన వెంటనే,  1930 లలోనే క్రైం సినిమాలు తీయడం మొదలెట్టారు. వీటికి ముడి సరుకు ఆ డిటెక్టివ్ సాహిత్యమే. ప్రసిద్ధ డిటెక్టివ్  నవలా రచయిత రేమండ్ చాండ్లర్  సృష్టించిన ఫిలిప్ మార్లో అనే డిటెక్టివ్ పాత్రతో ఆనాడు అనేక క్రైం సినిమాలు తీశారు.  ది బిగ్ స్లీప్, టైం టు కిల్, ది లాంగ్ గుడ్ నైట్ ...ఇంకా ఎన్నో. అలాగే ఇంకో ప్రసిద్ధ రచయిత డెషిల్  హెమెట్ సృష్టించిన శామ్ స్పేడ్ డిటెక్టివ్ పాత్రతో మాల్టీజ్ ఫాల్కన్, ది లైఫ్ ఆఫ్ రిలే లాంటి క్రైం సినిమాలెన్నో  వచ్చాయి. ఇతర సినిమా రచయితలూ, దర్శకులూ కూడా వీటివైపు ఆకర్షితులై వందలాది సినిమాలతో ఒక ట్రెండ్ నే  సృష్టించారు. దాదాపు రెండు దశాబ్దాల కాలం పాటు ఇది మొదటి దశగా తెలుపు నలుపు సినిమాలతో కొనసాగింది. అప్పుడు ఈ క్రైం జానర్ కి ఫిలిం నోయర్ అని పేరు పెట్టారు. నోయర్ అంటే ఫ్రెంచి భాషలో డార్క్ అని అర్ధం. అంటే డార్క్ ఫిలిమ్స్ అన్నమాట. డార్క్ ఫిలిమ్సే కదా అని ఈ క్రైం సినిమాలని ఎలాపడితే అలా తీసేవాళ్ళు కాదు. దీనికీ ఒక సైన్స్ వుండేది. దీని గురించి తర్వాత తెలుసుకుందాం. 

          ఇదే ఫిలిం నోయర్ జానర్  కలర్ సినిమాలొచ్చాక, కొంచెం సైన్స్ ని కూడా మార్పు చేసుకుని,1960 ల నుంచీ నియో నోయర్ గా ప్రారంభమయ్యింది. నియో అంటే నూతనం. అంటే నూతనంగా మారిన  డార్క్ ఫిలిమ్స్ అన్నమాట. ఈ నియో నోయర్ దశ వచ్చేసి ఇప్పటికీ అరవై ఏళ్లుగా అప్రతిహతం
గా కొనసాగుతోంది హాలీవుడ్ లో. దీని సైన్స్ గురించి కూడా తర్వాత చెప్పుకుందాం.


రేమండ్ చాండ్లర్ 
         ఇదంతా ఇప్పుడెందుకంటే, కొంత కాలంగా తెలుగులో వస్తున్న లో- బడ్జెట్ సినిమాల పరిస్థితి అధ్వాన్నంగా వుంది. ఎక్కువ తీసేది ఇవే, ఎక్కువ మందికి ఉపాధి కల్పించేవీ ఇవే. ఐతే హార్రర్ కామెడీలు, కాకపోతే  రోమాంటిక్ కామెడీలూ  అనే బాక్సాఫీసు అప్పీల్ కోల్పో యిన ఇవే  సినిమాలు ఇంకా ఇంకా వందల సంఖ్యలో తీస్తూ (గత సంవత్సరం 117) గిలగిల కొట్టుకుంటున్నారు. హార్రర్ కామెడీల వైపు ఇప్పుడు దోమలు కూడా తిరిగి చూడడం లేదు. రోమాంటిక్ కామెడీలకి జనం రావాలంటే మినిమం రాజ్ తరుణ్  లాంటి క్రేజ్ వున్న హీరో వుండాలి. అంతకి తగ్గిన వాడుంటే, లేదా కొత్త వాడు వస్తే దోమలు కాదుకదా చీమలు కూడా దూరడానికి ససేమిరా అంటున్నాయి. పిచ్చిగా నచ్చావ్,  గట్టిగా గిచ్చావ్ అంటూ వచ్చే చిత్తకార్తె  రోమాంటిక్ కామెడీల్ని ఇక కట్టి పెట్టేసుకునే సమయమొచ్చేసింది. ఈ సినిమాలు తీసేవాళ్ళు గనుక మల్టీ ప్లెక్సుల్లో సినిమాలు చూడడం మానేసి, అన్ని వర్గాల ప్రేక్షకులూ వచ్చే సింగిల్ స్క్రీన్ థియేటర్లకి  వెళ్లి సినిమాలు చూస్తూంటే, సినిమా మార్కెట్ అంటే ఏంటో తెలుస్తుంది. ఏసీ గదుల్లో కూర్చుని స్క్రిప్టు రాయలేరనేది పాత కొటేషన్, మల్టీ ప్లెక్సుల్లో చూస్తూ సినిమాలు తీయలేరనేది నేటి కొటేషన్. 


          విషయమేమిటంటే, హార్రర్ కామెడీలకీ, రోమాంటిక్ కామెడీలకీ ఇక  వుండని జనం-  అటు తమిళనాడు నుంచీ, ఇటు కేరళ నుంచీ  వచ్చే క్రైం సినిమాలకి వుంటున్నారు!  ఆ డబ్బింగుల్లో తెలీని మొహాలైనా,  కొత్త మొహాలైనా, పరమ చెత్త మొహాలైనా, ఎవరున్నా కూడా ఎగబడుతున్నారు జనం. ఈ మూడు నెలల్లో వచ్చిన కనుపాప, 16 డి, నగరం, మెట్రో అనే క్రైం జానర్ సినిమాలకి ప్రేక్షకులు వుంటున్నారంటే అలోచించాల్సిందే.  సర్వ సాధారణంగా స్టార్స్ వుంటే తప్ప తమిళ మలయాళ డబ్బింగులు ఆడవు. స్టార్స్ లేకపోయినా  ఈ క్రైం డబ్బింగుల హావాతో మార్కెట్ ఏం సూచన లిస్తోంది? ఇక హార్రర్ లూ రోమాన్సులూ కట్టిపెట్టేసి క్రైం వైపుకు  వెళ్ళమనేనా?

ఫిలిం నోయర్- ‘టచ్ ఆఫ్ ఈవిల్’ (1958)

     మార్చి 31 వరకూ విడుదలైన రోమాంటిక్ కామెడీలు చూస్తే, ఇంకేంటి నువ్వే చెప్పు, నంబర్ వన్ హీరో రాజేందర్ లవ్ స్టోరీ, పడమటి సంధ్యారాగం లండన్లో, ఏ రోజైతే చూశానో, ఇక సెలవ్, కేరాఫ్ గోదావరి, కన్నయ్య, నువ్వెవరో నేనెవరో, లవర్ బాయ్, ఓ పిల్లా నీవల్ల... అని ఈ మూడు నెలల కాలంలో కొత్త కొత్త హీరోలతో పదకొండుకి పదకొండూ గల్లంతయ్యాయి.  సూక్ష్మజీవులు కూడా వీటిని కన్నెత్తి చూడలేదు. ఇక - ఎవరో తానెవరో అనే హారర్, ఆకతాయి అనే పాత మసాలా, వజ్రాలు కావాలా నాయనా అనే కామెడీ అడ్రసు లేకుండా పోయాయి. 

          ఇవి చాలనట్టు ఏప్రిల్ మొదటి వారంలో-   ఎంతవరకు ఈ ప్రేమ?, చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే... అంటూ మరో రెండు కొత్త మొహాల మహాద్భుత  రోమాంటిక్ కామెడీలు! 

          ఇక నెలనెలా ఈ కోటా భర్తీ అవుతూనే వుంటుంది. ఎవరీ దర్శకులు? ఎవరీ నిర్మాతలు? ఎవరికోసం తీస్తున్నారు? ఏ మార్కెట్ కోసం తీస్తున్నారు? వీళ్ళనుకుంటున్న మార్కెట్ ఇప్పుడుందా?  వీళ్ళనుకుంటున్న ఈ రోమాంటిక్ కామెడీల మార్కెట్ ఇప్పుడు హోటల్లో క్లీనర్ చేతిలో వుంది, పాన్ షాపులో కుర్రాడి చేతిలో వుంది, కాలేజీలో స్టూడెంట్ చేతిలో వుంది... వాళ్ళ చేతిలో స్మార్ట్ ఫోన్ అనే  బెత్తెడు తెర వుంటే,  అందులో థియేటర్లలో పసలేని రోమాంటిక్ కామెడీలని మించిన రియలిస్టిక్ రోమాన్సుల షార్ట్ ఫిలిమ్స్ వుంటున్నాయి.. అవే  తెగ ఎంజాయ్ చేస్తున్నారు  పట్టణం నుంచీ పల్లె దాకా. పిల్లకాయ రోమాంటిక్,  హార్రర్ సినిమాల మార్కెట్ నంతా స్మార్ట్ ఫోన్స్ లో మెచ్యూర్డ్ షార్ట్ ఫిలిమ్స్ తన్నుకుపోయాయి! 


నియో నోయర్- ‘యూజువల్  సస్పెక్ట్స్’  (1995) 

          ఇలా చిన్న సినిమాల మార్కెట్ కి ఒక ఖాళీ అంటూ ఏర్పడితే, ఈ  ఖాళీని ముక్కూ మొహం తెలీని నటులతో క్రైం డబ్బింగులు భర్తీ చేస్తున్నాయి. ఇటీవలే ఒక కొత్త దర్శకుడు రోమాంటిక్ కామెడీ రాసుకుని ఒక కొత్త నిర్మాత దగ్గరికి పోయాడు. ఆ నిర్మాత ఓపిగ్గా విని- మర్డర్ మిస్టరీ కావాలన్నాడు. ‘దృశ్యం’ లాంటిది. ఆ కొత్త దర్శకుడు ఇంకో నిర్మాత దగ్గరికి పోయాడు. ఆయన కూడా  ‘క్షణం’ లాంటి థ్రిల్లర్ కావాలన్నాడు. ఇది చాలా సంతోషకరమైన పరిణామం. ఇలా ఆలోచించే నిర్మాతలు పెరిగితే తప్పకుండా తెలుగు క్రైం సినిమాలతోనే ఈ ఖాళీ భర్తీ అవుతుంది. లేకపోతే పాతాళంలోకే  పోతూంటారు ప్రేమ సినిమాలతో. ప్రేమ సినిమాలు తీయాలనుకుంటే క్రేజ్ వున్న హీరోతో తీసుకోవచ్చు. పనిమాలా కొత్త మొహాలతో తీస్తే కృష్ణ బిలాలు సిద్ధంగా వుంటాయి మింగెయ్యడానికి.  ఇదే కొత్త మొహాలతో క్రైం జానర్ తీస్తే – పాచి ప్రేమలతో, పిచ్చి దెయ్యాలతో మొహం మొత్తిన ప్రేక్షకులకి ఆటవిడుపుగా వుంటుంది కనీసం కొంత కాలం పాటు. ఇద్దరు నిర్మాతల దగ్గర ప్రయత్నించిన ఆ  కొత్త దర్శకుడు ఒక నిర్మాతని ఖాయం చేసుకుని, ఆ రోమాంటిక్ కామెడీని మర్డర్ మిస్టరీగా మార్చడానికి ఈ వ్యాసకర్తని సంప్రదించాడు, అది వేరే విషయం. తెలుగులో చిన్న సినిమాలు తీసే, చిన్న సినిమాలతో పరిచయమయ్యే దర్శకులతో సమస్యే మిటంటే, మార్కెట్ యాస్పెక్ట్ తెలీడం లేదు. టాలీవుడ్ ని జయించడానికి ఏ అలెగ్జాండర్ వచ్చినా, అవే రోత  రోమాంటిక్ కామెడీలు, అవే పాత రోమాంటిక్ డ్రామాలు, అవే నికృష్ట హార్రర్ కామెడీలూ.... ఇవి తప్ప ఇంకో కథా ప్రపంచంతో పరిచయమే వుండడం లేదు.


          క్రైం జానర్ లేకుండాపోయి  ఒక ఖాళీయే కాదు, నిజానికి ఇంకోటి కూడా లేక ఇంకో ఖాళీ కూడా భర్తీ కాకుండానే,  దాదాపు మర్చిపోయేంత ప్రమాదంలో పడింది. అది కామెడీ జానర్. నాటి జంధ్యాల, వంశీ, ఇవివి సత్యనారాయణ, రేలంగి నరసింహా రావుల తర్వాత ఈ తరంలో ఒక్కరంటే ఒక్కరూ  కామెడీ దర్శకులుగా రాలేదు. కామెడీ హీరో అల్లరి నరేష్ పరిస్థితే  ఇందుకు అద్దం పడుతుంది. ఈ ఖాళీని భర్తీ చేసి చుక్కల్లో చంద్రుడులా ప్రకాశి ద్దామని ఎవరికీ ఆసక్తే లేదు. ఎందుకంటే,  పుట్టి పెరిగినప్పట్నించీ కామెడీ జానరే తెలీదు. 2000 నాటి నుంచీ మొదలైన ప్రేమ సినిమాలే చూస్తూ పెరిగిన తరం, ఇంకే భిన్న కథా ప్రపంచాన్ని వూహించగలదు గనుక.  ఇలా   క్రైం జానర్ గురించి కూడా తెలియకుండానే పోయింది. 

          ఇక్కడ చెప్ప కూడదనుకున్నా ఒకటి చెప్పేయాల్సి వస్తోంది- ఈ వ్యాసకర్తకి పరిచయమవుతున్న, దర్శకులవ్వాలని ప్రయత్నిస్తున్న వాళ్ళలో,  నూటికి 99 మంది మందికి -  క్రైం జానర్ గురించేమీ తెలీదు. కనీసం పోలీస్ స్టేషన్లో సిబ్బంది ఎవరెవరుంటారో తెలీదు. బెయిల్, రిమాండ్, చార్జి షీట్  నుంచీ మొదలు పెడితే ఫోరెన్సిక్ సైన్స్ దాకా ఏమీ తెలీదు! మరో వైపు అటు తమిళంలో '16 డి' తీసిన 21 ఏళ్ల యువదర్శకుడి క్రైం ఇన్వెస్టిగేషన్ పరిజ్ఞానం తలపండిన వాడి పనితనంగా ఆశ్చర్యపరుస్తోంది.   కొత్త వాళ్ళని పక్కన పెడదాం, ఎన్నాళ్ళ నించో  పనిచేస్తున్న కో- డైరెక్టర్స్ కి కూడా కొందరికి  పోలీసు, న్యాయ వ్యవస్థల పనితీరులు తెలీవు! ఇక కొందరు దర్శకులకైతే పోలీసులకీ ఏసీబీ అధికారులకీ  తేడాయే తెలీదు. సీఐ పరిధిలో వుండే హత్య కేసు దర్యాప్తులు వీళ్ళ సినిమాల్లో ఎస్సై లు చేసేస్తూంటారు!  

           ఈ పరిస్థితుల్లో బంగారు అవకాశంలా పొంచి వున్న-   చిన్న సినిమాల పరంగా మార్కెట్లో ఏర్పడ్డ శూన్యాన్ని,   క్రైం సినిమాలతో ఎవరు భర్తీ చేయగలరు? ఆల్రెడీ శేఖర్ సూరి వున్నాడనుకుంటే,  ఆయన హార్రర్ అనుకుంటూ ఎటోపోయాడు. రవిబాబు వున్నాడనుకుంటే, ఈయన కూడా తానేమిటో అర్ధం జేసుకోలేక ఇంకెటో పోతున్నాడు.

          ఇలాంటప్పుడు ఈ వ్యాసం ఎవరికోసం రాయాలి?
          ఇది రేపు తెలుసుకోవడానికి అన్నివిధాలా ప్రయత్నిద్దాం...


- సికిందర్ 

1, ఏప్రిల్ 2017, శనివారం

నాటి సినిమా !







           2012  సృష్టి విలయ రహస్యాన్ని మోనాలిసా బొమ్మ ఇముడ్చుకుందన్న మాటే నిజమైతే, జానపద సినిమాల్నీ, సాహిత్యాన్నీ అటక మీదికి చేరుస్తున్న  మానవజాతి,  ముందే తన మానసిక వినాశాన్నీ  కొనిదెచ్చుకుంటున్న  మాటా అంతే  నిజమౌతుంది.

           స్పీడు యుగంలో యాంత్రికంగా బతకడం అలవాటు చేసుకున్నాడు మనిషి. తన నుంచి తానూ పూర్తిగా వేర్పడిపోతూ దిక్కు తోచని స్థితిలో పడుతున్నాడు. దారీ తెన్నూ తెలీక దొరికిన వ్యక్తిత్వ వికాస పుస్తకమల్లా చదవడం మొదలెట్టాడు. కానీ ఇవే విజయానికి సోపానాల గురించి  ఏనాడో పురాణాల్లోనే,  జానపద కథల్లోనే  రాసిపెట్టారన్న సంగతే గుర్తించ లేకపోయాడు. ఇదీ మనిషి మానసిక దివాళాకోరుతనం.  పురాణాలు ఆత్మని కడిగితే, జానపదాలు మేధస్సుని పెంచుతాయి. నిగూఢంగా వున్న  మానసిక శక్తుల్ని పైకి లాగి - పోరా ఆకాశమే నీ హద్దూ అనేసి బతకడాన్ని బ్యాలెన్సు చేస్తూ జీవిత ప్రాంగణంలోకి ముందుకు తోస్తాయి. 

          ఈ పని జానపద చలన చిత్రాల తిరుగులేని కథానాయకుడిగా టీఎల్ కాంతారావు కొన్ని వందలసార్లు చేసి వుంటారు. కాంతారావు చేసిన మేలు మనం అప్పుడు తెలుసుకోలేదు గానీ, ఇప్పుడు ఆలోచిస్తే  జానపద సినిమాలతో వ్యక్తిత్వ వికాసానికి బ్రాండ్ అంబాసిడర్ కి తక్కువకాని  హోదాని తనే ఆనాడే  పోషించారు!


          ఈ పని ‘సప్తస్వరాలు’ తో ఇంకా పరమ నిష్ఠగా చేశారు. ఈ సినిమా మొత్తంగా ఒక సైకలాజికల్ విహార యాత్ర. ఇందులోకి ప్రవేశిస్తే మనల్ని మనం తెలుసుకోగలం
. నిమిష నిమిషానికీ మన మనసు చేసే మాయ, చిత్ర విచిత్రాలూ- వీటన్నిటినీ ఒక దారిలో పెట్టి, లక్ష్యాన్ని సాధించేందుకు మనం చేసే విశ్వ ప్రయత్నాలూ- దీన్నొక కదిలే బొమ్మల పర్సనాలిటీ క్విజ్ గా నిలబెడతాయి.
     కృష్ణుడికి ఎన్టీఆర్ నీ, దేవదాసుకి ఏఎన్నార్ నీ పర్మనెంట్ సింబల్స్ గా ప్రేక్షకుల మనోఫలకాల మీద ముద్రించి వదిలిపెట్టిన సినిమాయే,  జానపద కథానాయకుడికి సింబల్ గా స్ఫురద్రూపియైన కాంతారావు  రూపాన్ని అచ్చు గుద్ది, పక్కనే నిలువెత్తు కత్తినీ గుచ్చి వదిలింది! తను పోతూ ఆ కత్తినీ పట్టుకుపోయారు కాంతారావు. కత్తి కూడా స్వరాలు పలికిస్తుందని ఆయన నిర్ధారణ. సప్తస్వరాల మాలిక సంగీతమైనట్టే, యుద్దాల్లో కత్తులూ ఏడు రకాల శబ్దాలు విన్పిస్తాయట! ఇదీ కాంతారావు ప్రకటన! యుద్ధాలూ,  సమురాయ్ కత్తుల విన్యాసాలూ గురించి కసక్ కసక్ మని రాసే పాల్ సియోలో కూడా ఈ సంగతి చెప్పలేదు మనకి! 

          అలాగని సప్తస్వరాలు ఏవో కత్తులు పాడుకునే సంగీత సమ్మేళన మనుకుంటే  కత్తుల మీద కాలేసినట్టే. సప్త స్వరాలు కేవలం మాధుర్యాన్ని చిలికే సరిగమలే కావనీ, సప్త సముద్రాలు, సప్త గిరులు, సప్తర్షులు, సూర్యుడి సప్తమాశ్వాలూ ... ఇవన్నీ మానవ కోటికి  మహత్తర వరాలనీ, సప్త సంఖ్యామయమైన ఈ జగత్తే మొత్తంగా ఈ సప్తస్వరాల్లో ఇమిడి వుందనీ, ఈ సప్త స్వరాలని జయించిన వాడే శారదా పీఠాన్ని అందుకోగల్గుతాడనీ ఈ సినిమా  కథలోని భావం. మెంటల్ పోస్ట్ మార్టం మేడీజీ అన్నమాట. 


          ఈ అంతరంగ ప్రయాణం ప్రారంభించే ముందు ఏడు ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. లేకపోతే
  అగాథంలోకి పతనం ఖాయం. దీంతో తొలిసారిగా సినిమా నిర్మాణానికి పూనుకున్న కాంతారావు, తన ఉత్తమాభిరుచులేమిటో అడుగడుగునా దృశ్యాల్లో ప్రతిఫలించేలా చేశారు. దీని ఆర్ధిక పరాజయానికి కొన్ని రాజకీయాలు కారణమై వుండొచ్చు, కానీ విషయపరంగా దీన్ని శాశ్వత తత్వానికి  ఎదురేదీ లేదు.

          దేవదాసు లాంటి భగ్న ప్రేమికుడి విషాదాంతంతో బాగా- బాగా-  ఏడ్పించేసి  వదిలిన వేదాంతం రాఘవయ్య కి,  ఈ ‘సప్తస్వరాలు’ గమ్మత్తుగా భగ్నప్రేమికుడి విజయగాథ! ఈ మహా దర్శకుడి చిత్రీకరణలో పాత్రల నిమ్నోత్తమాలు, వాటి తాలూకు భావోద్వేగాలు, అభినయ విలాసాలు, అన్నీ మహోన్నతంగా ఉట్టి పడతాయి.  కాంతారావు, నాగయ్య, రామకృష్ణ, ధూళిపాళ, సత్యనారాయణ, జగ్గయ్య, రాజబాబు, బాలకృష్ణ (అంజి గాడు), రాజశ్రీ, విజయలలిత, విజయనిర్మలల బారెడు తారాతోరణంతో  రాఘవయ్య దర్శకత్వ లాఘవం మనల్ని కదలకుండా కట్టిపడేస్తుందంటే అతిశయోక్తి కాదు. అదే నీవంటివీ, కృష్ణయ్యా గడసరి కృష్ణయా... వంటి పాపులర్ గీతాలతో, నృత్యాలతో, సూటిపదాల సంభాషణలతో; రాజకోట, మాంత్రికుడి కళాత్మక సెట్స్ తో, సమ్మోహనకర ట్రిక్ ఫోటోగ్రఫీతో, కత్తి పోరాటాలతో... ఓ పరిపుష్ట పంచభక్ష్య పరమాన్న విందిది. నిర్మాణ వ్యయాన్ని  వేదాంతం ఆరు లక్షలకి  పైగా లాగేశారని కాంతారావు వాపోయినా, వేదాంతం ఇచ్చిన విందు ముందు కాంతారావు ఖేదం బేఖాతర్ మనకి!

       విచిత్రంగా జానపదంలో పౌరాణీకాన్ని కలుపుకున్న జానర్ ప్రయోగమిది. దీంతో ఇది ఆథ్యాత్మిక యానం కోసం చేసే మనోవైజ్ఞానిక విహార యాత్రవుతోంది. హాలీవుడ్ చలన చిత్ర రాజం  ‘రైడర్స్ ఆఫ్ ది  లాస్ట్ ఆర్క్’  లో ఆథ్యాత్మిక శక్తులున్న ఆర్క్ కోసం జరిపే పోరాటం ద్వారా మహా దర్శకుడు స్టీవెన్ స్పీల్ బెర్గ్ ఏం చెప్పాలనుకున్నాడో, సరీగ్గా ఆ లోక కల్యాణాన్నే ప్రబోధిస్తోంది ‘సప్త స్వరాలు’ కూడా!
          అనేక సమస్యలతో, అన్యాయాలూ అక్రమాలతో పుచ్చి పోయింది మానవ లోకం సమస్తం. అజ్ఞానమే దీనికంతటికీ మూలం.  దీంతో నారదుడు (రామకృష్ణ), గంధర్వుడు (కాంతారావు) లు కలిసి  వెళ్లి సరస్వతి (విజయనిర్మల) కి ఈ సంగతి మొరపెట్టుకుంటారు. అప్పుడామె ఓ శారదా పీఠాన్ని అందించి, దాంతో మనుషుల అజ్ఞానాన్ని తొలగించి మానవ కల్యాణాన్ని పునఃప్రతిష్ఠాపన చెయ్యమనీ ఉపదేశించి పంపుతుంది. ఈ శారదా పీఠాన్ని  వైజయంతి (విజయలలిత) వ్యామోహంలో పడిన గంధర్వుడు పోగొడతాడు. దీంతో – నువ్వెళ్ళి భూలోకంలో అలాగే బాధలనుభవించమని నారదుడు శపిస్తాడు.


          భూలోకంలో ఓ సంగీత కారుడు (నాగయ్య) కి  ముత్యపు చిప్పలో మగ శిశువు దొరుకుతాడు. వాడికి సారంగ అని పేరు పెట్టి పెంచుకుంటూ సంగీతం నేర్పుతూంటాడు. ఇంకో ముత్యపు చిప్పలో మహారాజు (ధూళిపాళ) కి ఆడ శిశువు దొరుకుతుంది. దానికి దేవ మనోహరి అని నామకరణం చేసి పెంచుకుంటూ, నాట్యం నేర్పిస్తూంటాడు. సంగీతం
నేర్చుకుని పెద్దవాడైన  సారంగ (కాంతారావు), జయంతి (రాజశ్రీ) తో ప్రేమ కలాపాలు సాగిస్తూంటాడు. ఇది తండ్రికి తెలిసి మందలిస్తాడు. ఎందుకంటే, సారంగాకి తను ఒక లక్ష్యంతో సంగీతం నేర్పుతున్నాడు. ఆ లక్ష్యం స్వర్గలోకం నుంచి భూమండలంలో పతనమైన శారదా పీఠాన్ని  సాధించడం. అది ప్రస్తుతం సోపాన మంటపం మీద ప్రత్యక్షమై వుంది.  దాన్ని సాధించే వాడు సంగీతంలో స్రష్ట అయి, మాతృగర్భంలో జన్మించని అయోనిజుడై వుండాలి. స్త్రీ స్పర్శ ఎరుగని బ్రహ్మచారియై కూడా వుండాలి. ఇది విన్న సారంగ  చకితుడవుతాడు. తను అయోనిజుడు సరే, బ్రహ్మచర్యమంటే ఎలా సాధ్యం? జయంతి  తన సర్వస్వం. ఎటూ తేల్చుకోలేక ఈ సంకటంలో వుండగా,  అప్పుడు వూడిపడతాడు అభేరి (సత్యనారాయణ)  అనే తాంత్రిక విద్యల తుచ్ఛుడు. వీడికి మానవ జాతి పచ్చగా వుంటే నచ్చదు. ఆ శారదా పీఠాన్ని చేజిక్కించుకుని, మానవ లోకాన్ని ముక్కలు చెక్కలు చెయ్యాలని చూస్తూంటాడు. 

        ఇక మొదలవుతుంది రసవత్తర క్రీడ. మామూలు ప్రేక్షకులకి మామూలు భాషలో సస్పెన్స్, థ్రిల్స్, టెంపో, యాక్షన్, అడ్వెంచర్ లాంటివి అన్నీ ఇందులో వుంటాయి. ఈ ఎలిమెంట్సే  రసజ్ఞులకి  ఒకొక్కటీ ఒక్కో  సైకలాజికల్ ట్రూత్ గా ఆశ్చర్య పరుస్తాయి. స్థాపించిన కథా ప్రపంచంలో పైకి కన్పించని ఈ హిడెన్ ట్రూత్  ఆసాంతం రసమయ సంగీతమనే రజాయిని వెచ్చ వెచ్చగా కప్పుకుని వుంటుంది.

          ప్రతీ పాత్రా,  ప్రతీ సన్నివేశమూ సంగీతాన్నే వొలికిస్తాయి. లక్ష్య సాధన కోసం కాంతారావుకే ద్రోహం చేసే నాగయ్య, ఆ ద్రోహంతో ప్రేమలో పిచ్చి వాడయ్యే కాంతారావు మీదికి విషకన్య విజయలలితని ప్రయోగించే సత్యనారాయణ విద్రోహం, మధ్యలో తిక్క వేషాల ధూళిపాళ చెత్త పనులు, మరోవైపు గడ్డీ గాదం మేసి దిట్టంగా సంగీతం నేర్చుకోవాలనుకునే రాజబాబు హాస్య ప్రహసనాలు, రాజశ్రీ సోయగాల కనువిందూ... కలిసి ఓ మహోజ్వల జానపద చలనచిత్ర రాజం!   
  
          వీటూరి కథా మాటలూ రాస్తే; పాటలు సినారె తో బాటు వీటూరి కూడా రాశారు. టీవీ రాజు సంగీతం సమకూరిస్తే, అన్నయ్య ఛాయాగ్రహణాన్నీ, ఎస్ ఎస్ లాల్  ట్రిక్ ఫోటోగ్రఫీనీ పోషించారు. నృత్యాలు వెంపటి సత్యం, కళా దర్శకత్వం బీఎన్ కృష్ణ వహించారు.

          హేమా ఫిలిమ్స్  సంస్థని స్థాపించిన టీఎల్ కాంతారావు, 1969 లో నిర్మించి నటించిన న ఈ కళాఖండాన్ని గురువు హెచ్ ఎం  రెడ్డికి అంకితమిచ్చారు.

చరిత్రలో ఒక పేజీ...
       అప్పటి సినిమాల్లో రాజనాల గొప్ప విలనే. అయితే ఈ విలన్ పాత్రని అప్పుడప్పుడూ నిజజీవితంలో కూడా పోషిస్తూ ఎలా అవమానపర్చే వాడో, ‘బందిపోటు’ షూటింగు సమయంలో ఇచ్చిన డైలాగులతో కావాలని పెట్టిన ముప్పు తిప్పలూ, అది దారి తీసిన పెద్ద గొడవా సీనియర్ రచయిత త్రిపురనేని మహారధి ఈ వ్యాసకర్తకి ఒకసారి వివరించారు.

           కాంతారావుకీ ఇలాటిదే జరిగిందన్నారు త్రిపురనేని. ఎక్కడో చదివిన కథని వీటూరి చేత ‘సప్త స్వరాలు’ స్క్రిప్టుగా రాయించుకుని, రాజనాల దగ్గరికి వెళ్తే, ఆయన  స్క్రిప్టుని సరీగ్గా పట్టుకోకుండా కావాలని కింద పడేసి, ‘ఇప్పుడు రాహుకాలం. నేను కథలు వినను, నీ సినిమాలో నటించను ఫో!’ అనేశారు. దెబ్బతిన్న కాంతారావు వెళ్లిపోయి వేదాంతం రాఘవయ్యకి చెప్పుకుంటే, ఆయన సత్యనారాయణని విలన్ గా తీసుకుందామని సలహా ఇచ్చారు. అలా నాల్గు వేలు పారితోషికంగా తీసుకుని సత్యనారాయణ విలన్ పాత్ర వేసి మెప్పించారు.

          సినిమా 1969 లో విడుదలయ్యింది. అప్పుడు రాజకీయాలు ఈ సినిమాని తినేశాయి. 1969 లో ప్రత్యేక తెలంగాణా ఉద్యమం ఉధృతంగా నడుస్తున్న కాలం. ‘ప్రేక్షకులారా మీరు తెలంగాణా వాడు తీసిన ఆ సినిమా చూస్తారో, ఆంధ్రా వాడు తీసిన ఈ సినిమా చూస్తారో తేల్చుకోండి!’ అని కృష్ణతో  ‘లవ్ ఇన్ ఆంధ్రా’  తీసిన భావనారాయణ ప్రచారం చేయడంతో కాంతారావు గుండె పగిలింది. అయితే ఆ ఉద్యమ ప్రభావానికి ‘సప్తస్వరాలు’ తో బాటు ‘లవ్ ఇన్ ఆంధ్రా’ కూడా మట్టి కర్చింది. 

డైలాగ్ డిష్ 
నాగయ్య :
           * నాకు స్వార్ధమా? భార్యలా బిడ్డలా సంసారమా...  ఏముందని, ఎవరున్నారని నాకు స్వార్ధం?
           ఎవరేం చేసినా చేయకపోయినా,  కళాకారుడు మాత్రం తన కళ ద్వారా దేశం యొక్క గౌరవాన్ని కాపాడాలనుకుంటాడు.
 కాంతారావు :
           * ఆశా లేదు, నిరాశా లేదు. అనుకున్నదీ లేదు, అనుకోనిదీ లేదు. లేదనుకుంటే ఏదీ లేదు, అవునా?
           * నవ్వీ నవ్వీ నవ్వీ ...గుండె బండబారిపోయింది...
           * పాదాలు పట్టుకునే ఆడదాన్నీ, కన్నీళ్లు పెట్టుకునే మగవాణ్ణీ నమ్మ కూడదు.
 రాజబాబు :
           * చచ్చింది గొర్రె! నా నోట్లో నువ్వు గింజ కూడా నానదే!
           * ఇంత వరకూ భూమి కనిపించింది, ఇక ముందు చుక్కలు కనపడతాయి.


-సికిందర్ 
(సాక్షి- నవంబర్, 2009)
cinemabazaar.in


         





         
         
                   



రివ్యూ!






    

టెంప్లెట్ - దర్శకత్వం : పూరీ జగన్నాథ్.
తారాగణం: ఇషాన్, మన్నారా చోప్రా, ఏంజెలా క్రిస్ లిన్ స్కీ,  తులసి, అనూప్సింగ్ఠాకూర్, సుబ్బరాజు, అలీ, అవినాష్, ఎజాజ్ ఖాన్
సంగీతం: సునీల్కాశ్యప్, ఛాయాగ్రహణం: ముకేష్ బ్యానర్‌: తన్వి ఫిలింస్
నిర్మాత: సి.ఆర్‌. మనోహర్, సి.ఆర్‌. గోపి
విడుదల : మార్చి 31, 2017
***

     ఒక దర్శకుడు ఎన్నేళ్ళు పోయినా అవే సినిమాలు అలాగే తీస్తూపోతున్నాడంటే ప్రేక్షకుల సహన శక్తి మీద అంత నమ్మకమన్న మాట. ప్రేక్షకులకి ఈ సహన శక్తి ఏ సినిమాకా సినిమా తను మార్చేసే స్టార్స్ ని చూసి వస్తూండవచ్చు. ఇది తన అదృష్టమే. చాలా కొద్ది మందికే ఇలా చెల్లిపోతుంది. వాళ్ళల్లో  పూరీ జగన్నాథ్ ఒకరు. తనని స్టార్స్ కరుణిస్తున్నంత కాలం శాశ్వత ప్రాతిపదికన, ఎక్కడో ఘనీభవించిన-  శిలాసదృశమైన  తన రాత- తీత పనికే ఢోకా వుండదు. తను రాసిందే కథ, తను తీసిందే సినిమాగా,  స్త్రీ ద్వేషమే  తన అమ్మకపు సరుకుగా కార్యకలాపాలు సాగించుకోవచ్చు. 

         
దృష్ట్యా పూరీ సినిమాలకి రివ్యూలే అవసరం లేదు. ఏముంటుంది రాయడానికి రాసిందే రాయడం తప్ప. అలాగే కొత్త తరం దర్శకులు నేర్చుకోవడానికి ఏముంటుంది పూరీ సినిమాల్లో, చూసిందే చూడడం తప్ప. అయితే ఎవరో పసిగట్టేసి అల్లరి చేస్తున్నారని కాబోలు, కాస్త మారినట్టూ కన్పించడమూ తనకే సాధ్యమైంది. కానీ మారినట్టు కన్పించినంత మాత్రాన  కొత్తగా తీసిన  ‘రోగ్’ కాస్తా రోగరహితమై పోతుందా? రోగాన్ని దాచుకుని పైపైన స్ప్రే కొట్టుకు తిరిగితే ఆ స్ప్రే మార్నింగ్ షో వరకే సరిపోతుంది. ఇక ప్రతీ షోకీ ప్రేక్షకులు స్ప్రే కొట్టుకుని చూడాల్సి వస్తే సహనశక్తి పూర్తిగా నశించిపోతుంది. 




          టెంప్లెట్ సినిమాలు తీసి తీసి, అల్లరయ్యాకా ఎందుకు ఫ్లాపవుతున్నాయో తెలుసుకుని, ‘రోగ్’ ని టెంప్లెట్ నుంచి కాస్తా తప్పించినట్టు కన్పించేలా చేద్దామనుకున్నట్టుంది. పూరీ మార్కు టెంప్లెట్ అంటే- తాజాగా గత వారం  వచ్చిన  ‘కాటమ రాయుడు' అనే అట్టర్ ఫ్లాపే. ఆ దర్శకుడు పూరీని ఆదర్శంగా తీసుకుని టెంప్లెట్ లో అన్నీ సర్దేశాడు. పూరీ టెంప్లెట్ ప్రకారం ఒక యాక్షన్ సీనుతో హీరో ఎంట్రీ, గ్రూప్ సాంగ్, హీరోయిన్ని పడేసే కామెడీ లవ్ ట్రాక్, టీజింగ్ సాంగ్, హీరోయిన్ లవ్ లో పడ్డాక డ్యూయెట్, విలన్ ఎంట్రీ, దాంతో ఇంటర్వెల్. ఇక సెకండాఫ్  లో హీరోయిన్ కట్ అయిపోయి విలన్ తో కథ మొదలు, అప్పుడప్పుడు హీరోయిన్ తో సాంగ్స్, అప్పుడప్పుడు విలన్ ఎటాక్స్, హీరోయిన్ తో ఒక ఫోక్ సాంగ్, విలన్ తో క్లయిమాక్స్, ముగింపు.

          ఇదే టెంప్లెట్ ని ఇంకో విధంగా కూడా చూపించారు-
అదే కథ, అవే పాత్రలు, వాటికి  ఒక యాక్షన్ సీన్ ఒక కామెడీ సీన్- ఒక లవ్ సీన్- ఒక పాటమళ్ళీ ఒక యాక్షన్ సీన్- ఒక కామెడీ సీన్- ఒక లవ్ సీన్- ఒక పాట; మళ్ళీ ఒక...ఇలా ఇవే రౌండ్లేస్తూ  వుండడమన్నమాట.

          అవతల మూసని బ్రేక్ చేసే తెలుగు టాలెంట్స్  తో  ఒక ‘ఘాజీ’ రానీ, ఇంకో ‘గురు’ రానీ- ఈ టెంప్లెట్  ఏమాత్రం గిల్టీ  ఫీలవదు. టెంప్లెట్ కి కాలంతో పని లేదు, కాలమ్స్ కి సరిపడా పాత రేషన్ ని డంప్ చేయడమే దాని పని.

          ఇప్పుడు రూపం మార్చుకున్న టెంప్లెట్ లో ఈ కింది విధంగా ఏడు కాలమ్స్ వున్నాయి :

          ఇవే ఏడు కాలమ్స్ పాత టెంప్లెట్ లో ఇలా వుండేవి :

            ఫస్టాఫ్ ఇంటర్వెల్ దాకా హీరోయిన్ ని పడేసే హీరో కామెడీ ఇప్పుడు లేదు, మార్పు కోసం మిస్టర్  రోగ్ హీరోయిన్స్ ని సీరియస్ గా ద్వేషిస్తూంటాడు, అంతే. ఓపెనింగ్ లోనే పోలీస్ కమీషనర్  పాత్రనీ, అతడి చెల్లెలైన హీరోయిన్ పాత్రనీ రొటీన్ గా భూతకాలంలోంచి దిగుమతి చేసుకుంటాడు. హీరోయిన్ పెళ్లవుతూంటే వచ్చి అడ్డుపడతాడు. అందర్నీ కొడతాడు, ఒక పోలీసు కాళ్ళు  విరగ్గొడతాడు. హీరోయిన్ పెళ్లి మాత్రం జరిగిపోతుంది. దాంతో ఆమె  మోసానికి  స్త్రీ లందర్నీ ద్వేషించడం మొదలెడతాడు. హీరోయిన్ పేరు అంజలి అనే టెంప్లెట్ పేరు. దీంతో అంజలి పేరుతో  ఏ టెంప్లెట్  అమ్మాయి కన్పించినా  పట్టుకు కొట్టేస్తాడు. 

          ఈ రోగ్ కి  అసలే మైనారిటీ లో పడిపోతున్న మాస్ ప్రేక్షకులని బుజ్జగించడానికి  చంటి అనే ఇంకో టెంప్లెట్ పేరు. ఇక బుజ్జగింపు రాజకీయాలు మొదలు. పోలీసు కాళ్ళు విరగ్గొట్టినందుకు ఈ చంటి రోగ్ రెండేళ్ళు జైలుకి పోతాడు. ఈ జైలు సీన్లు మైనారిటీలో పడిపోతున్న మాస్ ప్రేక్షకుల్ని బుజ్జగించేందుకు ప్రత్యేకించినవి. జైలుకొచ్చి కలిసిన పెళ్ళయిన హీరోయిన్, అటు మొగుడితో కూడా ఎలా నాటకాలాడుతోందో ఎస్టాబ్లిష్ అవుతుంది. దీంతో అమ్మాయిలు మేథమెటిక్స్ అనీ  - అబ్బాయిలు పోయెట్రీ అని  డిసైడ్ చేసుకుంటాడు రోగ్. అబ్బాయిలే పవిత్రులూ, అమ్మాయిలు అపవిత్రులన్న డైలాగులు ఇక సాంతం రాజ్యమేలతాయి. ఇక ఏ ఆడ పాత్రకీ పూచిక పుల్ల విలువుండదు. వాళ్ళని ఎంత కించపరిస్తే అంత బాక్సాఫీస్ గలగలలు విన్పిస్తాయన్నట్టు. ఇదంతా అసలే మైనారిటీలో పడిపోతున్న –అదికూడా పూరీ సినిమాలకి కొందరు అబ్బాయిలకే పరిమితమైపోయిన యువ ప్రేక్షకుల చేత కేరింతలు కొట్టించడానికే. నీట్లో తడిసిన హీరోయిన్- ‘పంది కూడా తడిస్తే అందంగా వుంటుంది’ అన్నదాకా ఈ డైలాగుల పంద్యారం సాగుతుంది.

         ఇంతకీ రోగ్ ఇవన్నీ చేసేది కోల్ కత మహా నగరంలోనే. జైలునుంచి విడుదలై  టెంప్లెట్ ప్రకారం ఇంటికి పోతే టెంప్లెట్ ప్రకారమే తండ్రి వెళ్ళ గొడతాడు. కాళ్ళు విరగ్గొట్టిన పోలీసు కుటుంబాన్ని ఆదుకుందామని పోతాడు. వాళ్ళు ఛీ కొట్టినా ఇంటి ముందే వుంటున్న బెగ్గర్స్ గుంపుతో  మకాం వేస్తాడు. ఆ కానిస్టేబుల్ చెల్లెలు ఇంకో హేరోయిన్. ఈమె కోల్ కత నైట్ క్లబ్ లో టెంప్లెట్ ప్రకారం తెలుగు పాటలు పాడుతూ అన్న కుటుంబాన్ని పోషించుకునే త్యాగమయి- ఈమె కూడా ‘బజారుమయి’ అయిపోతుంది. సౌజన్యం : రోగ్ గారి స్త్రీ ద్వేషం. పైగా ఈమె పేరూ అంజలి. రోగ్ గారు కర్ర తీసుకుని చావబాదుతూ బిర్యానీలు కూడా తినిపిస్తాడు ఈమె ఇంటిల్లిపాదినీ.

          టెంప్లెట్ ప్రకారమె ఒక వడ్డీల వ్యాపారికి వసూళ్ళ ఏజెంటుగా కుదిరి, ఆ వచ్చిన కమిషన్ తో  కానిస్టేబుల్ అప్పులు తీర్చడం మొదలెడతాడు రోగ్. కానిస్టేబుల్ కి ప్రభుత్వం నష్టపరిహారం అదీ బాగానే ఇచ్చే వుండాలి, చెల్లెలికి ప్రభుత్వోద్యోగం కూడా ఇచ్చే వుండాలి. అయినా రోగ్ ఆదుకుంటానని వేధిస్తూంటాడు. ఇంకా చాలా చేస్తూంటాడు. పెళ్ళయిన హీరోయిన్ ఇంటికి కూడా వెళ్లి భర్తకి, పోలీస్ కమీషనర్ అయిన ఆమె అన్నకీ ఆమె మీద గాసిప్స్ చెప్పి చెడగొట్టాలని చూస్తూంటాడు. టెంప్లెట్ ప్రకారం ఇంటర్వెల్ కి  ముందు విలన్ వచ్చే దాకా ఈ రోగ్ స్త్రీ ద్వేషిగా టైం పాస్ చేయాలి కాబట్టి- కామెడీ చేయరాక అరుస్తూ వుండాలి కాబట్టి, అడ్డొచ్చిన వాళ్ళని కొడుతూ వుండాలి కాబట్టి- ఇవన్నీ చేస్తూండగా, ఇక టైము చూసుకుని వచ్చేస్తాడు టెంప్లెట్ విలన్. 


         వీడు సైకో. హీరో రోగ్ అయితే, విలన్ సైకో. ఈ సైకోకి ఇంకా హీరోయిన్ కన్పించాలి కాబట్టి అప్పటి దాకా రోగ్ తో దోస్తానా చేస్తూంటాడు. హీరోయిన్ కన్పించగానే  టెంప్లెట్ ప్రకారం కామెడీగా వెంటపడతాడు. ఈ కామెడీ సైకోతో ఆమెకి కథ వుంది. క్లాస్ రూమ్ లో వీడు ఒకమ్మాయిని కాల్చి చంపాడు. అప్పుడు పెట్రోలు పోసుకుని వున్న వీణ్ణి లైటర్ తో అంటించేసి చంపాలనుకుంటుంది హీరోయిన్. కానీ చేతిలో ఆ లైటర్ వెల్గించి పట్టుకుని ఆ పనే చెయ్యదు. ఫ్రెండ్ చస్తే చచ్చింది, నేనెందుకు వీణ్ణి చంపి జైలుకి పోవాలనుకుందో ఏమో- అలాగే ముందు ముందుకు వెళ్తూంటుంది లైటర్ తో. వాడి మీదికి విసిరేస్తే వాడే భస్మీ పటలమైపోతాడు. కానీ ఆ పనే చెయ్యదు. సైకో కూడా గట్టిగా వూదితే ఆరిపోయే లైటర్ కి భయపడతాడే గానీ, వూదేసి పారిపోవాలనుకోడు. పోలీసులు వచ్చే దాకా లైటర్ ని చూస్తూ భయపడుతూ స్టూడెంట్స్ చేత తన్నులు తిని, పోలీసులకి దొరికిపోతాడు. ఇప్పుడు జైలు నుంచి తప్పించు కొచ్చి హీరోయిన్ పని బడుతున్నాడన్న మాట. 

        ఇదీ విషయం. ఇక వీణ్ణి ఎదుర్కొని హీరోయిన్ని కాపాడుకోవాలి రోగ్. ఈ రీసైక్లింగ్ కథ కాదుగానీ, దీంతో పూరీ పడ్డ పాట్ల గురించే చెప్పుకోవాలి. ఎలాగైనా దీన్ని నిలబెట్టాలన్న ఆదుర్దా, ఆందోళనలే ప్రతీ చోటా కన్పిస్తాయి. ఏం చేస్తున్నాడో తనకే తెలీనట్టు ఎడాపెడా అర్ధం లేని సీన్లు వచ్చిపడుతూంటాయి. సెకండాఫ్ లో ఇదెక్కువై పోతుంది. అప్పటికప్పుడు సెట్లో సీన్లు రాసుకున్నారన్నట్టు తయారవుతుంది. పోనూ పోనూ పూర్తిగా అదుపుతప్పి పోతుంది. తనకి హీరోయిన్ దక్కకుండా చేస్తున్నారని ఊళ్ళో ఆడవాళ్ళందర్నీ సైకో కిడ్నాప్ చేయడం, కానిస్టేబుల్ కి కాళ్ళు తెప్పించే  ఆపరేషన్ కోసం రోగ్ కి పది లక్షలు కావాల్సి వచ్చి సైకో సాయమే తీసుకోవడం, ఆ సైకో ఏకంగా దోపిడీలే చేయడం....ఏమిటో,  కథంటే ఎలా అంటే అలా నరుక్కు పోతూంటే ఎక్కడో దార్లో పడకపోతుందా అన్నట్టు- సిల్వర్ స్క్రీన్ మీదే సినిమా చూపిస్తూ పూరీ రఫ్ కాపీ రాసుకుంటున్నట్టు వుంటుంది... ఈ ‘రోగ్’ రఫ్ కాపీయే. దీన్ని చక్కదిద్ది ఫైనల్ కాపీ ఎప్పుడు చూపిస్తారో. ఫైనల్ కాపీయే  ఇంకో కథగా, ఇంకో టెంప్లెట్ గా వచ్చినా ఆశ్చర్యం లేదు. 

          ఇలా తను టెంప్లెట్ నుంచి బయటపడ్డానని అన్పించుకోవడానికి, టెంప్లెట్ కే కొత్త రూపం తొడిగి మభ్యపెట్టబోతే ఫలితాలు డిటో గానే వచ్చాయి. టెంప్లెట్స్ రాయకుండా పూరీ స్క్రీన్ ప్లే రాయడం నేర్చుకున్నప్పుడు ఫలితాలు వేరేగా వుంటాయి. అన్నట్టు పూరీ స్క్రీన్ ప్లే ఎప్పుడు రాసినట్టు? అసలు ఒక్క స్క్రీన్ ప్లే రాయకుండా రెండు దశాబ్దాలు చెలామణీ అవడం రికార్డే. 

         ఐతే ఈసారి టెంప్లెట్ కి స్టార్ ఎట్రాక్షన్ లేకుండా పోయింది. కన్నడ వ్యక్తిని హీరోగా పరిచయం చేస్తూ  స్టార్ ఎట్రాక్షన్ లేని లోపంతో సతమతమవాల్సి వచ్చింది. కొత్త హీరో ఇషాన్ ఫైట్లు డాన్సులు బాగా చేయడం గొప్పేం కాదు. ఈ రోజుల్లో అవి లేకుండా తెరంగేట్రం చేయలేరు. నటన ఎంతన్నదే పాయింటు. తనలో గనుక నటుడే వుంటే, నటనకి ఏమాత్రం అవకాశమివ్వని ఈ ‘రోగ్’ బ్యాడ్ ఆప్షనే తనకి. నటనంటే అరుపులు అరవడమే, లంగ్ పవర్ చూపడమే అని పూరీ అనుకుంటే, తన ద్వారా పరిచయమయ్యే హీరోల కెరీరే ప్రారంభం కాదు. 

          హీరోయిన్లు ఏంజెలా
క్రిస్ లిన్ స్కీ , మన్నారా చోప్రా లు ఎందుకున్నారో వున్నారు. అలీ, అతడి గ్రూపు బెగ్గర్ కామెడీ నీరసంగా వుంది. సైకో అనూప్ సింగ్ హీరో కంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తూ,  రూపాయికి రూపాయిన్నర శ్రమని అమ్ముకున్నాడు. చాలా రోజులకి కన్పించిన సుబ్బరాజు ఎన్ కౌంటర్ స్పెషలిస్టు టెంప్లెట్ పాత్రలో ఏమీ చేయకుండానే వుం డిపోయాడు. రోగ్ గారి మాతృమూర్తిగా తులసిది అయోమయం పాత్ర. 

          పూరీ చేతిలో మంచి స్క్రిప్టు లేకపోయినా ముఖేష్ జి రూపంలో మంచి కెమెరా మాన్ దొరకడం అదృష్టం. స్క్రిప్టు విషయంలో తను అవుట్ డేటెడ్ గా వుంటే,  ఆ కెమెరా మాన్ కి అన్యాయం చేయడమే అవుతుంది. చిరిగిన చొక్కా మీద కోటేసుకున్న చందాన తను టెక్నీషియన్ లని వాడుకోవడం ఇకనైనా మానుకుంటే మంచిది. అలాగే సునీల్ కాశ్యప్ సంగీతాన్ని ఆస్వాదించాలంటే సినిమాకో అర్ధంపర్ధం కూడా వుండాలిగా.

          పూరీ జగన్నాథ్ స్క్రీన్ ప్లే రాయడం ప్రారంభించిన రోజున ప్రేక్షకులు తిరిగి రావడం ప్రారంభిస్తారు తన సినిమాలకి. ఈ సంవత్సరం ఈ మూడు నెలల్లో ‘రోగ్’ తో కలిపి ‘కాటమ రాయుడు’, ‘విన్నర్’, ‘మా అబ్బాయి’, ‘నేనోరకం’, ‘గుంటూరోడు’ అనే ఆరు  టెంప్లెట్ సినిమాలు వస్తే  అరింటినీ నిర్ద్వంద్వంగా తిప్పి కొట్టారు క్లాస్ మాస్ ప్రేక్షకులందరూ. ఇప్పటికైనా టెంప్లెట్ ని మూసిపెట్టుకుంటారా? ఇలాగే  కోటాను కోట్లు పోగొట్టుకుంటూ వుంటారా? 

-సికిందర్
cinemabazaar.in









31, మార్చి 2017, శుక్రవారం






రచన- దర్శకత్వం : సుధా కొంగర
తారాగణం : వెంకటేష్‌., రుతికా సింగ్‌, ముంతాజ్సర్కార్, నాజర్‌., జాకీర్ హుస్సేన్, తనికెళ్ల భరణి, రఘుబాబు, అనితా చౌదరి తదితరులు
మాటలు : హర్షవర్ధన్, సంగీతం: సంతోష్నారాయణన్ , ఛాయాగ్రహణం: శక్తివేల్
బ్యానర్ :  వై నాట్స్టూడియోస్
నిర్మాత: ఎస్‌.శశికాంత్
విడుదల : మార్చి 31, 2017
          ***
   
త రెండు నెలలుగా విడుదల వాయిదా పడుతూ పడుతూ మొత్తం మీద ఈ మండుటెండల్లో ప్రేక్షకుల తలుపు తడుతున్న  వెంకటేష్ ‘గురు’, బాక్సాఫీసు క్రీడకి  గెలుపు పాయింట్లు ముందే స్కోరు చేసేసుకుంది. దీని తమిళ- హిందీ మాతృకలే  దీని స్కోరేమిటో ముందే చెప్పేశాయి. కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా ఏమిటి రిజల్టు, ఏమిటి టాక్ అని ఎంక్వైరీ చేసుకోనవసరం లేదు- ది బిగ్ ‘వీ’ ఈజ్ ఆల్రెడీ రిటెన్ ఆన్ ది ఎంటైర్ వాల్!

          ‘దృశ్యం’, ‘గోపాలా గోపాలా’ లాంటి విజయాల్లో వయసుకి తగ్గ పాత్రలు వేసిన వెంకటేష్, ఆ తర్వాత  ‘బాబు బంగారం’ లో కుర్ర పాత్రతో కుదేలయ్యాక, తిరిగి ఇప్పుడు వయసుని గౌరవించుకుంటూ గురువు పాత్ర పోషించారు. గౌరవనీయ పాత్రలు రీమేకులతోనే సాధ్యపడుతున్నాయి తనకి. 

          మణిరత్నం సహాయకురాలు, విశాఖపట్నం వాసి  సుధా కొంగర ఈ రీమేక్ చేస్తూ తెలుగులో అన్ని ఫార్ములా వెటకారాల్నీ పటాపంచలు చేశారు. క్లాస్- మాస్ ప్రేక్షకులతో భారీ ఓపెనింగ్స్ ని సాధించుకుంటూ – ఏదో రొటీన్ నే వూహించుకుంటూవచ్చిన ప్రేక్షకుల్ని అనూహ్యంగా ఈ సీరియస్ స్పోర్ట్స్ డ్రామాతో కట్టి పడేశారు – ఇటీవలే ఇలాటిదే  ‘దంగల్’ ని తెలుగులో కూడా చూసివున్న  ప్రేక్షకుల్ని నోరెత్తకుండా చేశారు. 

          ‘గురు’ - ఒక డిఫరెంట్ స్పోర్ట్స్ డ్రామా- జీవితంలో ఓ దిశా దిక్కూ లేకుండా కాలం  గడిపేసే స్లమ్ డాగ్స్ కి, అండర్ డాగ్స్ కీ ఒక ధృవ నక్షత్రం. కాకపోతే  ఈ జీవులకి చేయూత నిచ్చే వ్యక్తులు, వ్యవస్థా ఎవరా అని ఎదురు చూడాల్సిందే. సినిమాల్లో తప్ప అలాటి గురువెవరో  ‘మొండెదవ’ గా ఎప్పుడో గానీ రాడు. ఇప్పుడొచ్చిన  ‘మొండెదవ’ మామూలు ‘మొండెదవా’ కాదు. వీడి కథేమిటో ఒకసారి తెలుసుకుందాం...

కథ 
      తన పొగరురుతో, మొండితనంతో బాక్సర్ గా ఎదగలేకపోయిన ఆదిత్య (వెంకటేష్),  విమెన్స్ బాక్సింగ్ ఫెడరేషన్ లోనూ అదే ప్రవర్తనతో ట్రైనర్స్ ని  ముప్పు తిప్పలు పెడుతూంటాడు. ఇది తట్టుకోలేక అమ్మాయిలు లైంగిక హింస కంప్లెయింట్ పెడతారు.  ఫెడరేషన్ బాస్ దేవ్ ఖత్రీ  (జాకీర్ హుస్సేన్) ఇదే ఛాన్సు అనుకుని ఆదిత్యని వైజాగ్ కి ట్రాన్స్ ఫర్ చేసి పారేస్తాడు. దేవ్ తో ఆదిత్యకి పాత పగలు చాలానే  వుంటాయి.

          వైజాగ్ వచ్చిన ఆదిత్య,  మార్కెట్లో కూరగాయలమ్మే రఫ్ అండ్ టఫ్ కూలీ పిల్ల రామేశ్వరి అలియాస్ రాముడు (రుతికా సింగ్) లో వీధి పోరాటాల, సిగపట్ల మాస్ టాలెంట్ చాలా వుందని పసిగట్టి, తనే రోజుకి ఐదొందలు ఎదురిచ్చుకుంటూ బలవంతంగా ట్రైనింగ్ ఇప్పిస్తూంటాడు. తను మొండి అయితే ఆమె జగమొండి. ఏ మాత్రం మంచీ మర్యాదా వుండదు. పరువు  తీసి మాటాడినా దులుపుకుంటాడు. 


        ఈమెకి తల్లిదండ్రులు (రఘుబాబు, అనితాచౌదరి) లతో బాటు, ఓ ఆక్క లక్ష్మి (ముంతాజ్ సర్కార్- విఖ్యాత దివంగత మ్యాజిషియన్ పీసీ సర్కార్ కుమార్తె) వుంటుంది. బాక్సింగ్ లో ఈమెకి ప్రవేశమున్నా ఆదిత్య  రాముడునే ప్రోత్సహిస్తాడు. రాముడు ఇక అదిత్యని వదిలించుకుందామని అనుకున్నప్పుడు- తనకోసం రాముడు చేసిన ఒక త్యాగం తెలుసుకుని మనసు మార్చుకుంటుంది- ఆ మార్చుకున్న మనసు ఇంకెటో  వెళ్ళిపోయి మ్యాచ్ ఒడి- ఆదిత్య  ఆగ్రహానికీ  వెలివేతకీ గురవుతుంది.
  

        మళ్ళీ ఇద్దరి మధ్య ఎలా సఖ్యత కుదిరిందీ,  ఆమెని వరల్డ్ ఛాంపియన్ గా చేయడానికి ఆదిత్య ఎలా సంఘర్షించాడూ, మధ్యలో దేవ్ ఆడిన గేమ్ ఏమిటీ...మొదలైనవి మిగతా కథలో తెలిసే అంశాలు. 

ఎలా వుంది కథ  |

       
        స్పోర్ట్స్ జానర్ కూడా ఓ టెంప్లెట్ లోనే వుంటుంది. ఓ క్రీడలో శిక్షణ ఇప్పియ్యడం, క్రీడా రాజకీయాలతో సంఘర్షించడం, చివరికి స్టేడియంలో ఛాంపియన్ గా గెలవడం. ఇదీ ఈ చట్రంలో వున్న కథే. కాకపోతే కమర్షియల్ ఫార్ములాలకి దూరంగా రియలిస్టిక్ గా చూపించారు. ఇదే దర్శకురాలి తమిళ ‘ఇరుధి సుత్రు’ (ఫైనల్ రౌండ్), హిందీ ‘సాలా ఖదూస్’ (మొండెదవ) లకి తెలుగు రీమేక్ అయిన ఈ కథ ఇంకో దర్శకుడి చేతిలో పడితే ఏమయ్యేదో గానీ- ఒరిజినల్ దర్శకురాలి ఒరిజినాలిటీ అంతా యీ రిమేక్ కి చాలా కలిసివచ్చింది. క్రీడ అంటే క్రికెట్టే అన్నట్టు తయారైన పరిస్థితుల్లో ఇలాటి సినిమాలే ఇతర క్రీడలని జనాలకి పరిచయం చేస్తూ వాటి ప్రశస్తిని చాటుతున్నాయి. 




ఎవరెలా చేశారు 
          మొండోడుగా వెంకటేష్  చాలా ప్రభావశీలంగా నటించిన పాత్ర ఇది. దర్శకుడి/ దర్శకురాలి విజన్ ని మన్నిస్తే  సీనియర్ స్టార్స్ తామూహించని ఎత్తులకి ఎదుగుతారని నిరూపించిన నటన ఇది.  క్రీడా జీవితంలో ఓడిపోయాడు, పెళ్ళాం లేచిపోయింది, అధికారులతో తగాదాలు పెట్టుకుంటాడు, ట్రైనర్స్ ని తన్నితగిలేసి  ట్రైనింగ్ ఇప్పిస్తాడు, తాగుతాడు, ఛీ కొట్టించుకునేలా వుంటాడు- ఇదంతా అర్ధం జేసుకుంటే-  ‘ఆమెకి గోల్డ్ మెడల్ సాధించి పెట్టడం కోసం నూట ఇరవై కోట్ల మంది జనం కాళ్ళు నాకమన్నా నాకే’ పని రాక్షసుడు అతడిలో కన్పిస్తాడు,  అర్ధం జేసుకోకపోతే  మొండెదవలా కన్పిస్తాడు. 

          రెండోదేమిటంటే, హీరోయిజమంతా తన పాత్రకే వుండాలన్న నియమం పెట్టుకోకుండా, హీరోయిన్ కి కావాల్సినంత రంగస్థలాన్ని వదలడం. అభిమానుల్లో తన ఇమేజికి దెబ్బ తగులుతుందనే అనుమానాలేవీ పెట్టుకోకుండా, ఆమె బూతుమాటలన్నీ పడడం. తెలుగు ప్రేక్షకులకి తొలిసారిగా ఒక సీనియర్ స్టార్ ఇంత పచ్చి పాత్రలో కన్పించడం, కదలకుండా కూర్చోబెట్టేయడం. దీంతో వెంకటేశ్ ఇప్పుడే నిజానికి విక్టరీ వెంకటేష్ అయినట్టు. 

          తమిళ హిందీల్లో నటించిన రుతికా సింగే హీరోయిన్ గా నటించింది. ఆమె మాట, చేత, తాటతీత మాస్ క్యారక్టర్ ని  ప్రేక్షకులు వూహించని స్థాయికి తీసికెళ్ళి పోయాయి - మూస ఫార్ములా కృత్రిమత్వం లేకుండా. ఇవన్నీ చేస్తూనే జీవంతో గుండెలు బరువెక్కిం చనూ గలదు తను.

          అక్కపాత్రలో ముంతాజ్,  చెల్లెలి మీద ఈర్శ్యాసూయల్ని పతాకస్థాయికి తీసికెళ్ళే సన్నివేశం మరపురానిది. ఇప్పుడొస్తున్న యువ హీరోయిన్లలో  కూడా చాలా  ప్రతిభ వుంటోంది. నూటికి తొంభై తొమ్మిది శాతం సినిమాల్లో వీళ్ళకి కరివేకు పాత్రలిచ్చి ఇంటికి పంపేస్తున్నారు. ఇక ప్రతినాయక దేవ్ ఖత్రీ పాత్రలో జాకీర్ హుస్సేన్ మెత్తగా పిండాలు పెడుతూంటాడు. జ్యూనియర్ కోచ్ గా నాజర్ ది కామెడీ పాత్ర.

          సాంకేతికంగా ఉన్నత స్థాయిలో వుంది- ఈ రియలిస్టిక్ జానర్ కి తగ్గ విజువల్స్ తో,  మ్యూజిక్ తో – కంటెంట్ ని సానబడుతూ కత్తిలా తయారుచేసిన సాంకేతిక ఔన్నత్యమిది...

 చివరికేమిటి 
       దర్శకురాలు సుధా కొంగర ఒకే కథతో మూడు సినిమాలు చేయడం – అందులో మొదటి రెండిట్లో దొర్లిన చిన్న చిన్న లోపాలు దీంట్లో సవరించుకోవడమూ ఒక ఎడ్యుకేషన్ లాగే ఉపయోగ పడిందామెకి. దృశ్యమాధ్యమాన్ని ఎలా వాడుకోవాలో ఎనలేని అవగాహన వుందామెకి. పఫర్ఫుల్ సినిమా ఎలా తీయాలో కూడా తెలుసామెకి. జానర్ మర్యాదని జానర్ మర్యాదతోనే  వుంచడమూ బాగా తెలుసామెకి. అయితే ప్లాట్ పాయింట్  వన్ దగ్గర హీరోయిన్ కి గురు మీద ప్రేమ కలగడమనే జానర్ మర్యాద తప్పిన  ఫార్ములా మూస వాసనే మింగుడు పడనిది. దీన్ని ఇంకో పావుగంట ఇంటర్వెల్ వరకూ భరించక తప్పదు మనకి. అప్పుడు ఆమెకి గురు క్లాసు పీకడంతో  ఈ మూస రొమాంటిక్ యాంగిల్ బాధ తొలగిపోతుంది. గురువు మీద అమ్మాయిలకి ఆకర్షణ పుట్టొచ్చు. అందులోనూ అక్షరం ముక్కరాని స్లమ్ డాగ్ పిల్లకి. కానీ గురువు గురువే. ఇందువల్ల మళ్ళీ జానర్ మర్యాద పట్టా లెక్కుతుంది. ప్లాట్ పాయింట్ టూ రాగానే, మళ్ళీ హీరోయిన్- నువ్వు రిజైన్ చేశావంటే ప్రేమే కదా అంటుంది- ఇక్కడ చాలా బ్యాడ్ గా కన్పిస్తుంది ఈ మాటనేసిన తను. ఇంతే కాదు- క్లయిమాక్స్ లో సదరు  ‘గురు’ గ్లామరస్ గా తయారై  కూడా వచ్చేస్తాడు!  ముగిస్తూ వీళ్ళు లవర్స్ అనే అర్థాన్నే ఇచ్చారు. ఈ రియలిస్టిక్ కథలో సినిమాటిక్ ట్విస్టులు ప్రేక్షకులు డిమాండ్ చేయలేదే- ఎందుకు తొందరపడాలి. స్పోర్ట్స్ లో సెక్సువల్ హెరాస్ మెంట్ అంటూ చెప్పారు బాగానే వుంది. కానీ ముగింపు చూస్తే  కోచ్ లతో ఎఫైర్సే క్రీడాకారిణులకిశ్రీరామ రక్ష అన్నట్టుగా,  లొంగిపోయినట్టు వుంది...

-సికిందర్