రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

10, సెప్టెంబర్ 2016, శనివారం

స్క్రీన్ ప్లే సంగతులు-2

   




    కథల్లోలాగా ఒక ఆసక్తికర ప్రధాన సమస్య చుట్టూ పరిష్కారాన్ని పొందే సంఘర్షణగా కాక, కేవలం కొన్ని సంఘటనల కూర్పు మాత్రంగా సాగే ‘గాథ’ లాగా,  ‘గ్యారేజ్’ లో విషయం ఇలా వుంటుంది : 
   1980 లలో స్వగ్రామంలో మెకానిక్ గా పనిచేస్తూ తమ్ముడు శివ(రెహమాన్) ఉన్నత చదువుకీ, ఆపై ఉద్యోగానికీ తోడ్పడ్డ సత్యం (మోహన్ లాల్), అదే తమ్ముడి ప్రోద్బలంతో హైదరాబాద్ వచ్చి జనతా గ్యారేజ్ అనే అన్ని రకాల వాహనాలని మరమ్మత్తు చేసే కేంద్రాన్ని నెలకొల్పుతాడు. పేదల పక్షపాతికూడా  అయిన సత్యం మరోవైపు గ్యారేజీలో పనిచేసే బోసు ( అజయ్), నాగరాజు (బ్రహ్మాజీ), సైదులు (బెనర్జీ పోషించిన ఈ పాత్ర పేరు సైదులు నల్లగొండ జిల్లాలో వుండే పేరు?) అనే వాళ్ళ బృందంతో  పేదల సమస్యలు కూడా పరిష్కరిస్తూ ఒక బలమైన శక్తిగా ఎదిగి, అక్రమాలు చేసే బడా బిజినెస్ మాన్ ముఖేష్ రాణా ( సచిన్ ఖెడేకర్) కి కంటగింపుగా మారతాడు. ఒక రేప్ అండ్ మర్డర్ కేసుని యాక్సిడెంట్ గా చిత్రించి తప్పించుకున్న రాణా తమ్ముడూ అతడి ఫ్రెండ్స్ మీద చర్య తీసుకోవాలని పోలీసు అధికారి చంద్ర శేఖర్ (సాయి కుమార్) ని కోరతాడు సత్యం. చంద్రశేఖర్ సత్యం తమ్ముడు శివతో పాటు చదువుకున్న వాడే. అయినా సత్యం మాటల్ని పట్టించుకోడు. దీంతో సత్యం తనే రంగంలోకి దిగి ఆ రేపిస్టులు నల్గుర్నీ యాక్సిడెంట్ చేసి చంపేస్తాడు. దీంతో రాణా పగబట్టి సత్యం తమ్ముడు  శివనీ, అతడి భార్యనీ చంపించేస్తాడు. వాళ్ళ కొడుకు ఆనంద్ అనాధ అవుతాడు. ముంబాయి నుంచి వాడి మామయ్య (సురేష్) వచ్చి, మేనల్లుడు ఆనంద్ ని ఈ వాతావరణంలోంచి దూరంగా తనతో తీసుకెళ్ళి పోతాడు సత్యం కోరిక మీద. వాడి తల్లిదండ్రులు ఎలా మరణించారో కూడా వాడికి తెలియనివ్వ కూడదని మాట తీసుకుంటాడు సత్యం.

       పాతికేళ్ళూ గడిచిపోతాయి. ముంబాయిలో ఆనంద్ (ఎన్టీఆర్) ఒక యువశక్తిగా ఎదుగుతాడు. మామయ్య, అత్త, మరదలు బుజ్జి (సమంతా)లతో కలిసి వుంటూ, ప్రకృతిని ప్రేమించే పర్యావరణ కార్యకర్తగా, పరిశోధకుడుగా బిజీగా ఉంటాడు. పనీపాటా లేని బుజ్జి ఇతణ్ణి ప్రేమిస్తూంటుంది. బయట ఆనంద్ జనాలకి మొక్కల పెంపకం గురించి, ప్లాస్టిక్ బ్యాగుల వాడకం గురించీ అవగాహన కల్పిస్తూంటాడు. ఇలాటి ఒక సందర్భంలో ఒకమ్మాయి (నిత్యా మీనన్) పరిచయమవుతుంది. ఈమె హైదరాబాద్ లో పోలీసు అధికారి చంద్ర శేఖర్ కూతురు. ముంబాయిలోనే ఆనంద్ ఒక పార్కు పరిశ్రమగా మారడాన్ని అడ్డుకుంటాడు. ఆ ఎమ్మెల్యే పదవి కోల్పోతాడు. ఆనంద్ శ్రేయోభిలాషి వచ్చి ఆనంద్ మామయ్యని హెచ్చరిస్తాడు- ఎమ్మెల్యే మనుషులు ఆనంద్ కి హాని తలపెట్ట బోతున్నారనీ, ఆనంద్ ని ఇక్కడ్నించీ దూరంగా పంపించెయ్యాలనీ. కానీ హైదరాబాద్ హైదరాబాద్ వెళ్లేందుకు ఆనంద్ నిరాకరిస్తాడు.

     ఇప్పుడు హైదరాబాద్ లో సత్యం అదే గ్యారేజ్ నడుపుతూ అదే పేదల పాలిట దేవుడిగా కంటిన్యూ అవుతూంటాడు. రాణాతో వైరం అలాగే వుంటుంది. సత్యంకి ఇంట్లో భార్యా కొడుకూ వుంటారు. కొడుకు రాఘవ (ఉన్ని ముకుందన్) కి తండ్రి చేసే పనులు నచ్చవు. అతను  రాణా కూతుర్ని ప్రేమిస్తూంటాడు. సీఎంతో సన్నిహితంగా వుండే రాణా, ఓ పేదల బస్తీ మీద కన్నేసి దాన్ని ఆక్రమించాలని చూస్తాడు. సత్యం అడ్డుకుంటాడు. సత్యం కి యాక్సిడెంట్ జరిపిస్తాడు రాణా. బతికి బయట పడ్డ రాణాకి గుండె సమస్య వుందని, అతను గ్యారేజీ కార్యకలాపకి దూరంగా వుండాలనీ డాక్టర్ చెప్తాడు. ప్రజలకి దూరంగా ఎలా వుండనని ఆక్రోశిస్తాడు సత్యం. కష్టాలతో ప్రజలు వచ్చి నిరాశపడి తిరిగి వెళ్లి పోతూంటారు. రాణా వచ్చి తన కూతురితో పెళ్లి సంబంధం కలుపు కుంటాడు. కొడుకుని కాదనలేక ఆ సంబంధం ఒప్పుకుంటాడు సత్యం. రాఘవని అల్లుడిగా చేసుకున్న రాణా,  ఇక రెచ్చిపోతాడు. పర్యావరణాన్ని ధ్వంసం చేస్తూ మైనింగ్ పనులు రాఘవకి అప్పజెప్తాడు. ఇది ముంబాయిలో వున్న ఆనంద్ కి తెలుస్తుంది. వెంటనే వచ్చేసి మైనింగ్ ని అడ్డుకుని రాఘవకి బుద్ధి చెప్తాడు. రాఘవని ఆపలేని సత్యం ఇందుకు సంతోషించి, ఆనంద్ ని రప్పించుకుంటాడు. గ్యారేజ్ వ్యవహారాలు, సత్యం పరిస్థితీ తెలుసుకున్న ఆనంద్, సత్యం బాధ్యతలు తీసుకోవడానికి అంగీకరించి- బాధిత పేదలకి సాయం చేసేందుకు తిరిగి గ్యారేజీ ద్వారాలు తెరుస్తాడు...

        ఇప్పుడు రాణా ఈసారి ఆస్పత్రి నిర్మాణంతో తెర మీదికొస్తాడు. దాని అక్రమ పర్మిషన్ కి మున్సిపల్ ఉద్యోగి (రాజీవ్ కనకాల) ని వేధిస్తాడు. ఆనంద్ వెళ్లి ఆ గూండాలకి బుద్ధిచెప్పి, రాణా అక్రమాన్ని ఆపుతాడు. భార్యతో ఇంట్లోనే వుంటున్న రాఘవకి ఆనంద్ అంటే పడదు. ఓ అర్ధరాత్రి భార్యతో తాగి  వచ్చినందుకు వారిస్తాడు ఆనంద్. ఆ గొడవలో భార్యని తీసుకుని వెళ్ళిపోతాడు రాఘవ. గ్యారేజీ వర్కర్ బోసు భర్త లేని ఒకావిణ్ణి ప్రేమిస్తూంటాడు. ఆనంద్, సత్యంలు వెళ్లి ఆ పెళ్లి జరిపిస్తారు. అటు కూతురితో ఆనంద్ పెళ్లి చేయాలనుకుని ఆనంద్ మామయ్యా అత్తా వస్తారు. వస్తే ఆనంద్ సత్యం దగ్గరే వుంటున్నాడని తెలుస్తుంది. దీంతో తామిద్దరెవరెవరో పరస్పరం తెలుస్తుంది ఆనంద్, సత్యంలకి. ఐతే ఈ ఇంట్లో ఒకసారి తన చెల్లెల్ని ఇచ్చి పోగొట్టుకున్నానని, ఇప్పుడు కూతుర్ని కూడా ఇచ్చి పోగొట్టుకోలేనని ఆనంద్ మామయ్య చెప్పేస్తాడు. ఆనంద్ కి బుజ్జి కావాలంటే తమతో వచ్చెయ్యాలని, లేదూ పెదనాన్న సత్యమే కావాలంటే బుజ్జిని వదులుకోవాలనీ  కండిషన్ పెడతాడు. దీంతో తీవ్ర మానసిక సంఘర్షణకి లోనైన ఆనంద్ బుజ్జినే వదులుకుంటాడు.

        అటు రాణాకి సీఎంతో తేడా వస్తుంది. ఏం చెయ్యాలో పాలుపోదు. సీఎం వ్యతిరేకి ఒకడు (ఆశీష్ విద్యార్థి) ఒక ఐడియా ఇస్తాడు. సీఎంని గద్దె దింపి తను సీఎం అయితే రాణా పనులన్నీ జరుగుతాయని. అందుకు బాంబు దాడులు జరపాలని ప్లాన్ ఇస్తాడు. అల్లుడు రాఘవతో కలిసి రాణా నగరంలో బాంబు దాడులు జరుపుతాడు. ఎంతోమంది చనిపోతారు. గ్యారేజీ వర్కర్ బోసు భార్య కూడా చనిపోతుంది. ఇంకోసారి కూడా దాడులు జరపాలని ప్లానేస్తూంటారు. అంతలో బోసు రైలుపట్టాల మీద ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తుంది.          పోలీస్ కమీషనర్ చంద్రశేఖర్ ఆ బాంబు దాడుల వెనుక తెలిసిన వాళ్ళ కుట్రే వుందని డిజిపితో వాదిస్తాడు. డిజిపి ఒప్పుకోడు. చంద్రశేఖర్ వచ్చి గ్యారేజీ తలుపులు తడతాడు. తను చేయలేకపోతున్న పనిని ఆనంద్, సత్యంలు పూర్తి చేయాలనీ విన్నవించు కుంటాడు. ఆనంద్ కి ఒక లారీ డ్రైవర్ ద్వారా బోసు అనుమానపు పోకడ తెలుస్తుంది. దాన్ని పట్టుకునిపోతే, ఒక బాంబుల తయారీ డెన్ తెలుస్తుంది. ఈ డెన్ తెలుసుకున్నాడనే, రాఘవ బోసు ని చంపి రైలు పట్టాల మీద పడేశాడన్న మాట. ఇంట్లో గంభీర వాతావరణం తలెత్తుతుంది. ఇలాటి కొడుకు రాఘవని చంపెయ్యాలనే తీర్పు చెప్తాడు సత్యం. తనే కొడుకుని చంపేస్తాడు. అక్కడే వున్న రాణాని ఆనంద్ చంపేస్తాడు. సమాప్తం.

గాథకి స్క్రీన్ ప్లే?

        ది కథలా వుందా? వుంటే ఎక్కడెక్కడ  ప్లాట్ పాయింట్స్ వున్నాయి? ఎక్కడ ప్రాబ్లం సెటప్ అయింది? ఎక్కడ్నించి ఎక్కడిదాకా బిగినింగ్, ఎక్కడ్నించి ఎక్కడి దాకా మిడిల్, ఎక్కడ్నించీ ఎక్కడి దాకా ఎండ్ ఇందులో వున్నాయి?  గుర్తు పట్టగలమా? మిడిల్, ఎండ్ వుండాలంటే బిగినింగ్ ముగియాలి కదా? బిగినింగ్ ఎప్పుడు ముగుస్తుంది? కథ ప్రారంభమైనప్పుడు. కథ ఎప్పుడు ప్రారంభమవుతుంది? ప్రాబ్లం సెటప్ అయినప్పుడు. పైన చెప్పుకున్న విషయంలో బిగినింగ్ ఎక్కడ ముగిసింది, ఇంటర్వెల్లో ముంబాయి నుంచి ఆనంద్ వచ్చి మైనింగ్ ని అడ్డుకుని సత్యంని మొట్ట మొదటిసారిగా కలిసినప్పుడా? కలిసినప్పుడు ఏ ప్రాబ్లం సెటప్ అయ్యింది? ఇలాటివి సహించనని ఆనంద్ చెప్పి వెళ్ళాడు, ఎవరితో? సత్యంతో. సత్యం ఎవరు?ఆనంద్ చేసిన పనికి (మైనింగ్ ని అడ్డుకోవడం) ఇంప్రెస్ అయిన పాజిటివ్ క్యారక్టర్. పాజిటివ్ క్యారక్టర్ తో ప్రాబ్లం సెటప్ అవుతుందా? అవదు కదా, నెగెటివ్ క్యారక్టర్ తో అవుతుంది. 

        కాబట్టి ఇక్కడ కూడా, అంటే ఇంటర్వెల్ దగ్గర కూడా, ప్రాబ్లం సెటప్ అయి బిగినింగ్ ముగియలేదు; అంటే ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడలేదు. అంటే కథ ప్రారంభంకాలేదు. ఇంటర్వెల్ అర్ధోక్తిలో, విషయమేమిటో తేల్చకుండా పడింది- ‘హోరాహోరీ’ లో లాగా, ‘కిక్-2’ లో లాగా.   

        ఇలా కాక, ఒకవేళ ఇంటర్వెల్ లోపే ఎక్కడైనా కథ ప్రారంభమయ్యిందా? ముంబాయి నుంచి ఆనంద్ రాక ముందు- ఇంటర్వెల్ లోపే ఇటు సత్యంకి - విలన్ రాణాకీ మధ్య ప్లాట్ పాయింట్ వన్ వచ్చి వాళ్ళిద్దరి మధ్య కథ ఏమైనా ప్రారంభమయ్యిందా? పాతికేళ్ళ నుంచీ వాళ్ళ మధ్య తగాదాలు తెమలడమే లేదు. ఎప్పుడో 1980లలో ప్రారంభమైన వాళ్ళిద్దరి మధ్య వైరం పాతికేళ్ళయినా కొలిక్కి రాకుండా నాన్చుడు గానే వుంది తప్ప కొత్త డెవలప్ మెంట్ ఏమైనా వుందా? ఆనంద్ వచ్చే ముందు, ఫస్టాఫ్ లో రాణా నుంచి సత్యం ఎదుర్కొన్న సమస్యలేమిటి- పేదల బస్తీ ఆక్రమణ, తన మీద హత్యా యత్నం, అక్రమ మైనింగ్. ఈ మూడిట్లో  ఏవొక్క దాని  దగ్గరైనా కథనం ఆగి, ఇదిగో ఈ పాయింటుతో బిగినింగ్ ముగిస్తున్నాం, ప్లాట్ పాయిట్ వన్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం,  ఇలా కథ ప్రారంభిస్తున్నాం, సంఘర్షణ  మొదలెడుతున్నాం, కథకి కేంద్ర బిందువు ఇదే అన్నట్టుందా?

        కాబట్టి  ఇటు సత్యం - విలన్ ల పరంగానూ, లేదా అటు ఆనంద్- సత్యంల పరంగానూ, ఇంకా లేదా ఆనంద్- విలన్ ల పరంగానూ  ఫస్టాఫ్ లో పాయింటు లేదు. సెకండాఫ్ లో విలన్ మళ్ళీ ఆస్పత్రి వ్యవహారం అంటూ మొదలెట్టాడు- దీనిదగ్గరైనా ప్లాట్ పాయింట్ వన్ వచ్చిందా? రాలేదు, ఆస్పత్రి గొడవ కూడా కథకి కేంద్ర బిందువు కాలేదు. క్లయిమాక్స్ లో విలన్ మళ్ళీ ఇంకొక కుట్ర ఎత్తుకున్నాడు- బాంబు దాడులంటూ. ఇలా ఒకటి కాదు, దేని దగ్గరా ఆగడు, ఎక్కడా జండా పాతి జమాయించి కూర్చోడు విలన్ రాణా అనే వాడు. ఇదిగో ఈ కథకి హీరోని నేనేనండోయ్ అని విలన్ గనుక తెగ ఫీలై పోకపోతే ఆ స్క్రీన్ ప్లే  అచ్చంగా చచ్చుబడి పోతుందని -
Your Screenplay Sucks! -  అన్నపుస్తకంలో విలియం ఎకర్స్ హెచ్చరిస్తాడు. ఎందుకు హెచ్చరిస్తూ పుస్తకాలు రాస్తాడు, పనిలేకా?

        పోనీ, ఫైనల్ గా వచ్చిన ఈ బాంబు దాడులే ప్లాట్ పాయింట్ వన్ అనుకుందామానుకుంటే క్లయిమాక్స్ లో ఎక్కడైనా ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడుతుందా? ఆఫ్ కోర్స్, ఒకప్పుడు  ఏర్పడేవి. పదిహేనేళ్ళ క్రితం యూత్ సినిమాల ట్రెండ్ లో  ‘మిడిల్ మటాష్’ అనే మనం పేరెట్టిన కథలొచ్చేవి. క్లయిమాక్స్ దగ్గర  ప్లాట్ పాయింట్ వన్ వచ్చి, అప్పుడు మాత్రమే మిడిల్లో పడేది కథ! అయిదు నిమిషాల్లో ఆ మిడిల్ కాస్తా ముగిసి ఎండ్ ప్రారంభమయ్యేది! 

        కనుక ‘గ్యారేజ్’ స్క్రీన్ ప్లే మిడిల్ మటాష్ కూడా కాదు. ఇక్కడ జాగ్రత్తగా తేడా గుర్తించాలి. మిడిల్ మటాష్ అంటే, కథనంలో మరెక్కడా పాత్రల మధ్య  ఇంకే సమస్యా పుట్టకుండా, కేవలం క్లయిమాక్స్ దగ్గరే ఆ చెప్పాలనుకున్న ఒకే సమస్య పుడుతుంది.  అప్పుడది ఆలస్యమైపోయిన ప్లాట్ పాయింట్ వన్ అన్పించుకుంటుంది. ఆలస్యపు పెళ్లి హాస్యంగా ఉన్నట్టే ఇలాటి స్క్రీన్ ప్లేలు కూడా వెక్కిరింతగా ఉండేవి. పైన చెప్పుకున్న ప్రేమ సినిమాల ట్రెండ్ లో ఇలాగే ఉండేవి. 

      ‘గ్యారేజ్’ లో ఇలా కాదు, అడుగడుగునా సమస్యలు పుడుతూ పోతాయి క్లయిమాక్స్ వరకూ- ఒక కేంద్రబిందువైన సమస్యంటూ లేకుండా! ఒక కేంద్రబిందువైన సమస్య వుండి, దాంతో పోరాట ఫలితంగా అందులోంచి పుట్టే పిల్ల సమస్యలు ఉంటాయే తప్ప- కేంద్రబిందువైన ఒక ప్రధాన సమస్య లేకుండా- ‘గ్యారేజ్’ లాంటి కథనాల్లో లాగా విడివిడి సమస్య లుండవు. విడివిడి సమస్యలతో కథ వుండదు, స్క్రీన్ ప్లే వుండదు. స్క్రీన్ ప్లే అంటే మూడంకాలు, ఒక కేంద్ర బిందువు, అంతే.  కేంద్ర బిందువూ దాంతో బాటు అంకాలూ అటూ ఇటూ జరగవచ్చు;  కానీ ఇవంటూ వుంటాయి కథకి, దాని స్క్రీన్ ప్లేకి.  గాథలకే ఇవి వండవు. ఆ మాటకొస్తే గాథలకి అసలు స్క్రీన్ ప్లేనే వుండదు, కుదరదు కూడా. స్క్రీన్ ప్లేలో గాథల్ని కూర్చలేరు. స్క్రీన్ కి (వెండి తెరకి) పనికి రాని విషయానికి స్క్రీన్ ప్లేనే ఉండదు. కాబట్టి గాథలు రాసుకుని దానికి  స్క్రీన్ ప్లే అని పేరేసుకోవడం కామెడీ అవుతుంది. 

        కనుక ‘గ్యారేజ్’ ది కథ కాదు, గాథ అని నిరూపణ అవుతోంది. గాథలతో ఎలాటి భ్రాంతిలో వుంటామంటే,  మనం చూస్తున్నది కథ కాదు, గాథ అని చాలా సేపటి వరకూ పసిగట్టలేం. ఇంటర్వెల్లోనూ ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడకపోతే సెకండాఫ్ లో పెట్టి అప్పుడు మొదలేదతాడేమో చూద్దాం అనుకుంటాం. మిడిల్ మటాష్ కి లాగా క్లయిమాక్స్ లోనూ ప్లాట్ పాయింట్ రాకపోతే, అప్పుడర్ధ మవుతుంది- మనం క్లయిమాక్స్ దాకా చూస్తూ కూర్చుని టైం వేస్ట్ చేసుకుంది కథతో  కాదూ గాథతో  అని- మోసపోయామనీ! ఇది జనరల్ ఆడియెన్స్ కీ తెలీక, సినిమాలు తీసే వాళ్లకీ తెలీక తెగ ఆడేస్తూంటాయి సినిమాలు కాని  సినిమాలు- అటూ ఇటూ తెలుగునాట, ఇంకా అటు ఓవర్సీస్ లో వుండే కొద్ది శాతం  మనలాంటి వాళ్ళం తెల్లబోయి చూస్తూంటాం!

పాయింటేంటి?
       పోనీ, ఇదంతా వదిలేద్దాం- అసలు ‘గ్యారేజ్’ పాయింటేంటి? చెప్పాలనుకున్న దేంటి? దేనిగురించి? కాన్సెప్ట్ ఏంటి?  పర్యావరణం గురించా, పేద బాధితుల గురించా, లేకపోతే కుటుంబం గురించా? కుటుంబం గురించే ఎక్కువ కన్పిస్తుంది. సినిమా ప్రారంభంలో  ‘ఇది ఒక కుటుంబ కథ’ అనే వేశారు. మరైతే కుటుంబ కథ ఇలాగా చెప్పడం? కుటుంబ కథలో కుటుంబానికి ఎదురైన సమస్యేమిటి? మరుగున వుండి బయటపడ్డ ఆనంద్- సత్యంల బంధుత్వమా? ఆనంద్ - బుజ్జిల పెళ్లి సమస్యా? చెడ్డ కొడుకు రాఘవ సమస్యా? వీటిలో ఏ ఒక్కటి పరిష్కారమైంది? ‘ఇచ్చట అన్నీ రిపేర్లు చేయబడును’ అన్నాక,   ఆనంద్- బుజ్జిల పెళ్లి  సమస్యని ఎందుకు రిపేరు చేయలేకపోయారు? చెడ్డ కొడుకు రాఘవని మంచి కొడుకుగా ఎందుకు మార్చలేకపోయారు? రిపేరు చేయడమంటే కొడుకుని చంపడమా? ఇది కుటుంబ కథే అయితే దీని ద్వారా చెప్పిందేమిటి? చెడ్డ కొడుకు విలన్ కి అల్లుడవడం, చెడ్డ కొడుకు విలన్ పక్షం వహించి తల్లిదండ్రుల్ని బాధించడం, కుట్రలు చేయడం; పెద్దాయనకి తనతో ఉంటున్న హీరో చిన్నప్పటి ఫలానా తన బంధువేనని రివీల్ అవడం, పెద్దాయన కోసం హీరో మరదల్ని త్యాగం చేయడం - ఇవెంత పాత రొటీన్, ప్రాక్టికల్ గా నేటి ప్రేక్షకుల అనుభవంలోకి రాని మెలోడ్రామాలు! కుటుంబ కథని నేటి కాలమాన పరిస్థితుల్లో పెట్టి  కొత్తగా చెప్పాల్సింది. కుటుంబ కథ అనగానే  పాత సినిమాల్లోంచి అవే అరిగిపోయిన డ్రామాల్ని దిగుమతి చేయకుండా, సొంత పరిజ్ఞానంతో స్వయంగా సృష్టించుకుంటే పరువు ప్రతిష్ట లేమీ మాయమై పోవుగా?

        ‘గ్యారేజ్’ బిజినెస్ కొస్తే, ఇది ‘సర్కార్’,  ‘రౌడీ’,  ‘గాడ్ ఫాదర్’  ల మిక్చర్ లా వుంటుంది. ‘సర్కార్’ లో లాగే ప్రారంభ దృశ్యాల్లో ఒక రేప్  అండ్ మర్డర్, దాంతో సత్యం వెళ్లి  దుష్టుల్ని శిక్షించడం జరుగుతాయి! శ్రీకాంత్ నటించిన, ఈవారం విడుదలైన ‘మెంటల్’ లోనూ ఇలాటి మాస్ కాపీయింగ్ దృశ్యాలే వచ్చేశాయి... ‘సర్కార్’ లో అయినా ‘గాడ్ ఫాదర్’ లోనైనా, పెద్దాయన మంచాన పడో మరణించో ఆయన కొడుకు బాధ్యతలు తీసుకుంటాడు. ‘గాడ్ ఫాదర్’ లో పెద్దాయన  కొడుకైన హీరో ఆ బిజినెస్ పట్ల వైముఖ్యంతో వుంటాడు. అలాంటి వాడు గుండె పోటుతో పెద్దాయన పోవడంతో,  మాఫియా బిజినెస్ బాధ్యతలు తీసుకోక తప్పదతడికి. పాత్రచిత్రణ పరంగా ఇక్కడ గుర్తించాల్సిన ప్రవర్తన ఒకటుంది : హీరో సైన్యం లో పని చేసిన అనుభవంతో సమస్య మూలాల్ని తొలగించకుండా, పైపైన సమస్యకి ప్రతిరూపాలుగా వున్న వాళ్ళని కాల్చి చంపుతూంటాడు. మన ప్రభుత్వాలు చేసే పని ఇదేగా? హీరో కూడా ఒకప్పటి ప్రభుత్వోద్యోగియే. దటీజ్ క్యారక్టరైజేషన్.

        ‘సర్కార్’ లో పెద్దాయన హత్యానేరం మీద జైలు కెళ్ళడంతో కొడుకు బాధ్యతలు తీసుకుంటాడు. తర్వాత పెద్దాయన మంచాన పడతాడు. అంటే ఇక్కడేం అర్ధం జేసుకోవాలంటే, వయసులో భారీ వ్యత్యాసమున్న రెండు ప్రధాన పాజిటివ్ పాత్రలు, విలన్ కి వ్యతిరేకంగా వుంటే, వాటిలో పెద్ద పాజిటివ్ పాత్ర  పిక్చర్లోంచి తప్పుకోవడమో (గాడ్ గాదర్), లేదా ఇన్వాలిడ్ అవడమో (సర్కార్) జరగాలి. చిన్న పాజిటివ్ పాత్ర – అంటే హీరో- ఒక్కడే విలన్ అంతు చూడాలి. అప్పుడే అది కమర్షియల్ సినిమా రూలు. 

        ‘గ్యారేజ్’ లో ఇదే జరిగింది. కాకపోతే వేరే రూటులో. ఇక్కడ చిన్న పాజిటివ్ పాత్ర ఆనంద్ వచ్చి, పెద్ద పాజిటివ్ పాత్ర  సత్యంతో చేతులు కలిపాడు. గాడ్ ఫాదర్ కి లాగే సత్యం మీద హత్యాయత్నం జరిగి గుండె బలహీన పడ్డా చావలేదు. చస్తే మలయాళంలో మోహన్ లాల్ ని చూపించడానికేమీ వుండదు. పోనీ ‘సర్కార్’ లోలాగా మంచాన కూడా పడలేదు. అలా కూడా మలయాళ సోదరులకి చూపించలేరు. ఈ సమస్యని మనం అర్ధం జేసుకోగలం. అప్పుడేం చేయాలి? చేయాల్సిందంతా కాన్సెప్ట్ లోనే దాగి వుంది- చేయాలన్పిస్తే. 

        ఆనంద్- సత్యంలని పరస్పరం శత్రువుల్లా మార్చెయ్యాలి. ఇది కాన్సెప్ట్ డిమాండ్ చేస్తోంది- కాన్సెప్ట్ పట్ల నిజాయితీతో వుంటే. కాన్సెప్ట్ ని కుటుంబ కథ అనో ఇంకేదో అనో స్పష్టత లేని పలాయన వాదంతో నిర్వచించుకోకుండా- తమిళ దర్శకులు, స్టార్లు చూపించే తెగువ ప్రదర్శించ గల్గితే -కమర్షియల్ గానే విషయాన్ని పాత చింతకాయ మూస నుంచి ఇంకో మెట్టు పైకి తీసికెళ్ళి 
స్థాపించుకోగల్గితే – అన్ని స్క్రిప్టింగ్ లోపాలూ సమసిపోగలవు- గాథ అనే పెద్ద గుదిబండ సహా!

        వీళ్ళిద్దరూ శత్రువులైతే  మరి విలన్ ఏం చేస్తాడనొచ్చు. ఇప్పుడు విలన్ వుండి  కూడా ఏం చేశాడు- కాసేపు అది కావాలంటాడు, కాసేపు ఇది కావాలంటాడు, అదీ ఇదీ కాకపోతే బాంబులు పేల్చుకుంటాడు! సినిమా క్లయిమక్స్ ని ఎలా తెచ్చి బ్యాడ్ గా అతికించారో అలాగే అంత సడెన్ గానూ  ఎండ్ అయ్యింది సినిమా. ఇదంతా కాన్సెప్ట్ పట్ల నిబద్ధత లేకపోవడం వల్లే.

హీరో లక్ష్యమే కాన్సెప్ట్!
      కమర్షియల్ సినిమాల్లో హీరో పాత్రల  కొనసాగింపు రెండు రకాలుగా వుంటుంది : హీరోకి ఏదైనా స్పెషల్ ఇంటరెస్ట్ వుంటే ప్రారంభంలో ఒకటి రెండు సీన్లలో చూపించి దాన్ని కట్ చేసి అనుకున్న కథలోకి పంపించెయ్యడం; స్పెషల్ ఇంటరెస్ట్ తోనే ఫస్టాఫ్ అంతా హీరోని చూపించుకొస్తే, దాన్నే కంటిన్యూ చేసి సెకండాఫ్ కూడా దాన్నాధారంగానే నడపడం, అదే కథవడం. 

        ‘గ్యారేజ్’ లో ఆనంద్ ఇంటరెస్ట్ అంతా పర్యావరణం గురించే. ఈ ఇంటరెస్ట్ ని ఏదో ‘టాగూర్’ లో సంఘసేవికగా శ్రియని పరిచయం చేసినట్టు, లేదా ‘టెంపర్’ లో జంతు ప్రేమికురాలిగా కాజల్ ని పరిచయం చేసినట్టు, ఆ కార్యకలాపాల్ని రెండు మూడు సీన్లకే పరిమితం చేసి వదిలేసినట్టూ - ఆనంద్ ని కూడా పర్యావరణం అనే ఇంటరెస్ట్ తో అలా పరిచయం చేసి వదిలేస్తే అది వేరు- అప్పుడది పైన  చెప్పుకున్న ఒకటో రకం హీరో పాత్ర కొనసాగింపు అయ్యేది.

        కానీ అలా చెయ్యలేదు. రెండో రకం హీరో పాత్ర కొనసాగింపు చేశారు. అంటే ఫస్టాఫ్ లో ముంబాయిలో అతడి జీవితాన్ని పర్యావరణమే ప్రాణంగా చూపించుకొచ్చారు. దాంతో వాళ్ళకీ వీళ్ళకీ అతడి ఎవేర్నెస్ పాఠాలు, పార్కు విషయంలో అతడి తిరుగుబాటు కూడా చూపించి, మొక్కల్ని ప్రేమించే అతడి ఇంటరెస్టే వినూత్నంగా అతడి లక్ష్యంగా డ్రైవ్ చేశారు ముంబాయిలో అతడి పాత్రని మొత్తం. అంటే ఇంటరెస్ట్ కాస్తా కథకి పూర్తి స్థాయి లక్ష్యమైందన్న మాట. అంటే దీని కొనసాగింపుతోనే సెకండాఫ్ కూడా నడవాలన్న మాట. 

        ‘గాడ్ ఫాదర్’ లోలాగా, ‘సర్కార్’ లో లాగా కొడుకులకి వేరే లక్ష్యాలు లేనప్పుడు వాళ్ళొచ్చి ఫాదర్స్ బిజినెస్సుల్ని బేపర్వాగా టేకప్ చేసి- శత్రు నిర్మూలనే లక్ష్యంగా కొనసాగుతారు. ఆనంద్ కూడా ముంబాయిలో ఇంకా లక్ష్యం ఏర్పడక, పైన చెప్పుకున్న ఒకటో రకం హీరో పాత్రలాగా  లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నప్పుడైతే,  ఆపద్ధర్మంగా వచ్చి సత్యంగారి ‘గ్యారేజీ’ దందాని టేకప్ చేయగలడు. ఈ దందాలో సత్యం గారి ఆశయమే తన ఆశయంగా చేసుకుని పోరాడనూగలడు. అంటే ఏమవుతోందంటే, ఇలా హీరో ప్రవేశించే అసలు కథా ప్రపంచంలో సాఫీగా ప్రవేశం జరుగుతుందన్న మాట. ఇది పాయింటాఫ్ ఎటాక్ : ఎక్కడో వున్న హీరో ఇంకెక్కడో వున్న అసలు కథా ప్రపంచంతో వచ్చి స్పర్శించడం. ఇలా స్పర్శించాలంటే అంతవరకూ హీరోకి వేరే లక్ష్యం వుండకూడదు. స్పర్శతోనే లక్ష్యం ఏర్పడాలి. 

        ముంబాయిలో ఆనంద్ పర్యావరణ ట్రాకు ఒకటి, హైదరాబాద్ లో గ్యారేజీతో సత్యం ట్రాకు ఒకటీ ఫస్టాఫ్ లో చూపించు కొస్తున్నప్పుడు- కథనంతో ఒక ఎజెండా వుంటుంది. దాన్ని తురుపు ముక్కలా ప్రయోగించి సర్ప్రైజ్ చెయ్యాలి. ఈ రెండు కథనాలూ ఎక్కడ ఎలా స్పర్శించి (పాయింటాఫ్ ఎటాక్), ఇంటర్వెల్లో రెండు పాత్రల మధ్య ఎలాటి ఉరుములు ఉరుముతాయో, ఎలాటి మెరుపులు మెరిపిస్తాయో- పిడుగులు కురిపించి సీట్లలో మనల్ని బిక్కచచ్చిపోయేలా చేస్తాయోనని గంటన్నర పాటుగా ఎదురు చూస్తోంటే- ఆనంద్ సాబ్ వచ్చేసి చల్లగా గ్యారేజీలో దూరిపోయాడు. పేలుతుందనుకున్న పర్యావరణ మందు పాతరని పక్కన పడేశాడు. సత్యం సాబ్ గ్యారెజీని ఆనంద్ సాబ్ కి అప్పజెప్పేసి పక్క వాద్యంగా మారిపోయాడు. ఛోటేమియా బడేమియా కలిసి వాళ్ళ కుటుంబ గోత్రాలు చూసుకోవడం మొదలెట్టారు. 

        కుటుంబ కథ చెప్పడానికి మొక్కలతో, బక్క జీవులతో ఇంత డొంకతిరుగుడు అవసరం లేదు : శుభ్రంగా ‘గాడ్ ఫాదర్’ లా చెప్పవచ్చు. 

        హీరోకి ఏదైతే లక్ష్యంగా వుంటుందో అదే కాన్సెప్ట్  అవుతుంది. పర్యావరణ పరిరక్షణ హీరో లక్ష్యమని ఫస్టాఫ్ అంతా చూపించినప్పుడు అదే కాన్సెప్ట్ అవుతుంది! గ్యారేజీ కథ కాన్సెప్ట్ అవదు! రెండో పాత్ర లక్ష్యం ఎప్పుడూ హీరోకి మించి వుండదు. ఇది గుర్తు పెట్టుకోవాలి. ఫస్టాఫ్ లో హీరోకి ఇంత  లక్ష్యం వున్నాక,  దాంతో పోరాటమూ చేస్తున్నాక- దాన్ని కొనసాగించే దమ్ముండాలి దర్శకుడికి. లేకపోతే దీని జోలికే పోకూడదు. 

        కొనసాగిస్తే ఏమవుతుంది? అన్ని స్క్రిప్టింగ్ లోపాలూ దూరమైపోతాయి- కథగా కళకళలాడుతూ - ప్రేక్షకులకి ఒక అపురూప వీక్షణానుభవాన్ని ఇస్తుంది!

       
ఎలా కొనసాగించాలి హీరో లక్ష్యాన్ని?
        వెళ్లి వెళ్లి హైదరాబాద్ లో విలన్ రాణా ఫ్యాక్టరీ ఏదైనా వుంటే దాన్ని పేల్చేయ్యాలి.
        అప్పుడేమవుతుంది?
        లబోదిబోమంటూ కార్మికులు రోడ్డున పడతారు- సత్యంకి చెప్పుకుంటారు.
        సత్యం ఏం చేస్తాడు?
        ఎవడ్రా నువ్వు నా కార్మికుల్ని రోడ్డున పడేశావ్? - అని ఆనంద్ ని పట్టుకుంటాడు.
        ఆనంద్ ఏం చేస్తాడు?
        వాడు నా మొక్కల్ని నాశనం చేశాడు అంటాడు.
        సత్యం ఏమంటాడు?
        ఎవడు నీ మొక్కల్ని నాశనం చేశాడు?
        ఆనంద్  రెస్పాన్స్?
        రాణా  గాడే. మొక్కల్ని కొట్టేసి ఫ్యాక్టరీ కట్టాడు. ఇంకెవడు మొక్కల్ని కొట్టేసి ఏది కట్టినా, కట్టబోతున్నా అవన్నీ పేలిపోతాయ్!
        సత్యం కౌంటర్?
        నీకు పిచ్చెక్కింది- ఇది జరగనివ్వను.
        ఆనంద్ క్వశ్చన్?
        ఎందుకు జరగనివ్వవ్?
        సత్యం ఆన్సర్?
        నీ మొక్కల కోసం నా కార్మికుల జీవితాల్ని నాశనం చేస్తావా?
        ఆనంద్ 
        మనిషికన్నా మొక్కెక్కువ నాకు!
        సత్యం వార్ డిక్లేర్!
        చూస్తా ఎలా పేలుస్తావో!
        ఆనంద్ వార్ స్లోగన్!
        పీకడం మీ పనైతే పేల్చడం నాపని!! ఎన్నిమొక్కలు పీకి నీ గ్యారేజీ కట్టావ్?
                                                           ***

   1992లో బ్రిటన్ లో ఒక గ్రూపు ఏర్పడింది. ఎర్త్ లిబరేషన్ ఫ్రంట్ అనే ఆ గ్రూపు పర్యావరణాన్ని నాశనం చేస్తున్న పరిశ్రమల్ని పేల్చేయడం మొదలెట్టింది. ఈ ఉద్యమం యూరప్ లో 17 దేశాలకూ ప్రాకింది. పరిశ్రమలు కడుతున్నప్పుడు చెట్లని  కొట్టేవద్దని, అడవుల్ని నాశనం చేయవద్దనీ సంబంధిత అధికారులకి, పోలీసులకి, రాజకీయ నాయకులకీ ఎంత ప్రాధేయపడినా వినకపోవడంతో, ఈ గ్రూపు సాయుధ పోరాటానికి దిగి అలాటి పరిశ్రమల్ని పేల్చేయ్యడం మొదలెట్టింది. వీళ్ళని ఎకో టెర్రరిస్టులుగా ముద్రవేశాయి ప్రభుత్వాలు. దశాబ్దానికి పైగా దొరక్కుండా పారిశ్రామికవేత్తల గుండెల్లో నిద్రపోయారు. చివరికి 2005 లో దొరికిపోయారు. 

       ఈ ఉదంతం మీదే ‘ఇఫ్ ఏ ట్రీ ఫాల్స్ అనే డాక్యుమెంటరీ తీశాడు మార్షల్ కర్రీ అనే దర్శకుడు. 2011 లో ఇది ఉత్తమ డాక్యుమెంటరీగా ఆస్కార్ అవార్డులకి నామినేట్ అయ్యింది. 

        సినిమా కథకి ఇంటరెస్టింగ్ సబ్జెక్ట్. నిజ సంఘటన కాబట్టి కాపీ కొట్టినట్టు కాదు. మొక్క వర్సెస్ మనిషి పాయింటుతో ఆనంద్- సత్యంల మధ్య సంఘర్షణకి సరికొత్త టాపిక్. ‘జనతా గ్యారేజ్’ ది వీళ్ళిద్దరి మధ్య సంఘర్షణని డిమాండ్ చేస్తున్న కాన్సెప్ట్. తమిళ స్టార్లు, దర్శకులైతే దీన్ని కళ్ళ కద్దుకుని ఎక్కడికో....తీసికెళ్ళి పోతారు!!



-సికిందర్ 
http://www.cinemabazaar.in

9, సెప్టెంబర్ 2016, శుక్రవారం

 



రచన- దర్శకత్వం : శ్రీనివాస్ అవసరాల

తారాగణం : నారా రోహిత్, నాగ శౌర్య, రెజీనా, పావని గంగిరెడ్డి, సీత,
రాజేశ్వరి, హేమంత్, చైతన్య కృష్ణ, తనికెళ్ల భరణి, నాని (గెస్ట్ రోల్ లో) తదితరులు
సంగీతం : శ్రీ కళ్యాణ్ రమణ,  ఛాయాగ్రహణం : వెంకట్ సి. దిలీప్
బ్యానర్ : వారాహి చలన చిత్ర,  నిర్మాత: రజనీ కొర్రపాటి
సమర్పణ: సాయి కొర్రపాటి
విడుదల : సెప్టెంబర్ 9, 2016
***
చాలా కాలంగా హిట్స్ లేక సతమతమవుతున్న నారా రోహిత్, నాగశౌర్యలు ఒకటై దర్శకుడుగా ఒక హిట్ ఇచ్చిన అవసరాల శ్రీనివాస్ తో కలిసి ఒక రోమాంటిక్ కామెడీతో తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వీళ్ళకి దన్నుగా నిలబడింది. హీరోయిన్ గా రేజీనా కాసాండ్రా దొరికింది. తెలుగులో రోమాంటిక్ కామేడీలకి కొరత లేదు. అదే సమయంలో జాడించి రెండు వారాలాడినవీ పెద్దగా లేవు. ప్రేమకథల్లో ఏదో వైవిధ్యం, ప్రత్యేకత వుంటే తప్ప నిలబడే అవకాశం లేదు. ఈ నేపధ్యంలో ప్రస్తుత రోమాంటిక్ కామెడీ ఏ ప్రత్యేకతలతో వచ్చింది, మిగతా రోమాంటిక్ కామెడీలకి తను తేడా గల కామెడీ అని నిరూపించుకుందా, లేకపోతే  మరో సగటు ప్రేమ సినిమా అన్పించుకుందా ఈ కింద చూద్దాం

కథ
        అచ్యుత్ (నారా రోహిత్), ఆనంద్ (నాగ శౌర్య) అన్నదమ్ములు. మధ్యతరగతి కుటుంబం. ఇద్దరికీ పెళ్ళిళ్ళయి తల్లి (సీత) తో కలిసి వుంటారు. ఓ పెళ్లి రోజున పార్టీలో అన్నదమ్ముల మధ్య జ్యోత్స్న (రేజీనా) అనే అమ్మాయి ప్రస్తావన వస్తుంది. దీంతో వాళ్ళ భార్యలు ఆ మాట పట్టుకుని నిలదీస్తారు. ఇద్దరూ కట్టుకథలు చెప్తారు. తమ పెళ్లి కాక ముందు ఈ ఇంట్లో అద్దెకున్న జ్యోత్స్న కి తమ్ముడితో లింకు పెట్టి అన్న చెప్తే, అన్నకి లింకు పెట్టి తమ్ముడు చెప్పి భార్యల్ని శాంతింపజేసుకుంటారు. కానీ జరింగింది వేరు. ఇంట్లో అద్దెకి దిగిన జ్యోత్స్న తో ఇద్దరూ ప్రేమలో పడతారు. ఒకళ్ళనొకళ్ళు దెబ్బకి దెబ్బ తీసుకుంటూ పోటీలు పడతారు. ఆమె ఇద్దరితోనూ  సరదాగా వుంటుంది.  ఆమె కొద్ది రోజుల్లో యూఎస్ కి వెళ్లిపోవాలి. వెళ్లి పోతూ, తను ఎవర్నీ ప్రేమించ లేదనీ, తనకి భరద్వాజ్ (సుశాంత్) అనే బాయ్ ఫ్రెండ్  వున్నాడనీ చెప్తుంది. దీంతో అచ్యుత్ కి ఒళ్ళు మండి  ఆమె పాస్ పోర్ట్ తగులబెడతాడు. అదే సమయంలో ఇంట్లో ఇంకో విషాద సంఘటన జరుగుతుంది. దీనికి జ్యోత్స్నయే కారమని అన్న దమ్ములు నమ్ముతారు. జ్యోత్స్న వాళ్ళని తిట్టేసి వెళ్లిపోతుంది. ఇదీ జరిగిన విషయం. 

        మూడేళ్ళు గడిచిపోయాక, ఇప్పుడు తాజాగా యూఎస్ నుంచి వస్తుంది జ్యోత్స్న . వచ్చి అదే ఇంట్లో అద్దెకి దిగుతుంది. పెళ్ళయిన అన్నదమ్ములకి హుషారొస్తుంది. ఆమె ఒకరికి తెలీకుండా ఒకరికి ప్రేమిస్తున్నానని చెప్పి కంగారు పుట్టిస్తుంది. ఇప్పుడిలా వచ్చిన జ్యోత్స్న ఉద్దేశమేమిటి? ఆమె మనసులో ఏం పెట్టుకుని వచ్చింది, ప్రతీకారమా?  ప్రత్యుపకారమా? ఇంకేదైనా సహాయం కోరి వచ్చిందా? ఈ ప్రశ్నలకి సమాధానాలు తెలియాలంటే సెకండాఫ్ చూడాల్సిందే.

ఎలావుంది కథ
        సగటు ప్రేమ కథే. ఇలాటి ముక్కోణ ప్రేమ కథలో, అందునా పెళ్ళయిన హీరోల కథలో కొత్తగా ఆశించడానికేమీ వుండదు. సరే, వున్న రొటీన్ కథనైనా సస్పెన్స్ లేకుండా మొదట్నించీ మొత్తం విప్పి చెప్పుకుపోయారు. ఇది ఇంటర్వెల్ వరకే పనికొచ్చింది. ఆతర్వాత విషయం లేక శూన్య స్థితికి చేరింది. 1976 లో సి. ఆనందరామం రాసిన ‘మమతల కోవెల’ నవల ఆధారంగా కె రాఘవేంద్ర రావు జయసుధతో తీసిన ‘జ్యోతి’ లో జయసుధ వచ్చి గుమ్మడిని పెళ్లి చేసుకుంటాననే షాకింగ్ మాటలతో సస్పెన్సుతో ప్రారంభమవుతుంది కథ. అలాగే ప్రస్తుత కథలో రేజీనా పెళ్ళయిన హీరోల ఇంటికి వచ్చి- ఇప్పుడు మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని దుమారం రేపుతూ ప్రారంభించివుంటే కథకి చివరంటా ప్రాణవాయువు లభించేది. సస్పెన్స్, థ్రిల్  లేకుండా రామాయణం కూడా లేదు. సస్పెన్స్, థ్రిల్ అనేవి ఏవో క్రైం సినిమాల ఎలిమెంట్స్  మనకెందుకని ప్రేమసినిమాల కర్తలు పక్కన బెడితే గాలి తీసిన బెలూన్లా వుంటాయి. 

ఎవరెలా చేశారు
        ఈ మధ్యకాలంలో నవ్వొచ్చే విధంగా ఎంతో లావెక్కి నటిస్తున్న నవ హీరో నారా రొహిత్, ఈసారి ఆ ఒబెసిటీ నుంచీ, వీర లెవెల్ మాస్ పాత్రల నుంచీ రక్షిస్తూ చాలా బాక్సాఫీస్ ఫ్రెండ్లీ పొజిషన్ లోకొచ్చాడు. ఇలా సింపుల్ గా నటిస్తే, నవ్విస్తే, కాస్త ఏడిపిస్తే కూడా తనకి సూటవుతుంది. అంతేగానీ శరీరం వేసుకుని లేనిపోని విన్యాసాలే చేస్తే వినాశాకాలే. సిబ్లింగ్ రైవల్రీ తో, అదే సమయంలో బ్రోమాన్స్ తో అచ్యుత్ క్యారెక్టర్ తనకి దక్కిన ఒక వరం. 

        తమ్ముడి పాత్రలో నాగశౌర్య కూడా డీసెంట్ గా నటించాడు. ఇంతకాలం డైమెన్షన్ లేని రొటీన్  బాయ్ ఫ్రెండ్ పాత్రల్లో నటిస్తూ వస్తున్నాడేమో, ఈసారి  డైమెన్షన్ తో ఫుల్ లెన్త్ అన్నకి తమ్ముడిగా కూడా నటించడంతో- కొత్తగా కన్పిస్తాడు. రోహిత్, శౌర్య లిద్దరూ ఇలా నవ్యంగా కన్పించడానికి కారకుడు దర్శకుడు అవసరాల శ్రీనివాసే. తన విజన్ లో సృష్టించి, రచించి, నటింపజేసిన ఈ పాత్రలతో ఇద్దరూ ప్రేక్షకులకి దగ్గరయ్యే అదృష్టానికి నోచుకున్నట్టయ్యింది. 

        రేజీనా కీలక పాత్ర పోషిస్తూ ఫస్టాఫ్ లో అలరించినా ఆ తర్వాత ఏమైందో మూస ఫార్ములా హీరోయిన్ లా కథలోంచి దాదాపు మాయమయిపోయింది. తన పాత్ర లేకపోతే కథే లేనప్పటికీ,  రాంగ్ వే లో కథ చెప్పడం వల్ల తన పాత్ర గాలి సగంవరకే సరిపోయింది. ఆ తర్వాత ఎంత గాలి కొట్టినా లాభం లేకపోయింది.
        సంగీతం, ఛాయాగ్రహణం, ఇతర సాంకేతికాలు ఈ రోమాంటిక్ ఫీల్ కి తగ్గట్టే వుండి- దర్శకుడి అభిరుచిని చాటుతాయి.  

చివరికేమిటి?
        ఇది దర్శకుడి సినిమా. అయితే స్క్రీన్ ప్లే దగ్గర ఈ సాదా రొటీన్ కథనే సాంతం పకడ్బందీగా చెప్పడం కుదరలేదు. ఫస్టాఫ్ ముగిశాక, సెకండాఫ్ అతికించిన వేరే కథ అయిపోయి సెకండాఫ్ సిండ్రోమ్  బారినపడింది. ప్రారంభ దృశ్యమే హీరోలకి పెళ్ళిళ్ళయినట్టు చూపించేయడం కథని ఫైనల్ చేసినట్టయ్యింది. అంటే హీరోయిన్ వున్నా కథకి ముగింపు ఈ పెళ్ళిళ్ళకి లోబడే ఉంటుందని ముందే తెలిసిపోతోంది. రెండోది, ఇద్దరు హీరోలతో హీరోయిన్ ముక్కోణ ప్రేమ కథ అన్నాక కూడా వీళ్లిద్దరితో ఆమె ఎలా విడిపోయిందనే పాయింటే ప్రధానమై ఈ దృష్టితోనే సినిమా చూడాల్సి వస్తుంది. ఇలా ఫలితాలు ముందే తెలిసిపోవడంతో సస్పెన్స్ లేకుండా పోయింది. పైన చెప్పుకున్న ‘జ్యోతి’ మార్కు నేరేషన్ పెట్టుకుని వుంటే ఈ బాధ తప్పేది. అన్నదమ్ములతో అమ్మాయి కథ కాస్తా అన్నదమ్ముల వేరే కథగా మారక తప్పని పరిస్థితి ఏర్పడేది కాదు. చివరి అరగంట అన్నదమ్ములతో విషాదభారం ఎక్కువయ్యే బాధ కూడా తప్పేది. హీరోయిన్ మళ్ళీ వచ్చిన కారణం- తన బాయ్ ఫ్రెండ్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు కాబట్టి,  వాడి సంగతి చూడాలనడం- సరుకు లేని ప్లాట్ పాయింట్. ఇలాటి తప్పులు దొర్లకుండా చూసుకుందుకే కొన్ని పాత  సినిమాలు మార్గదర్శకాలుగా వున్నాయి. 

        సినిమా ఫస్టాఫ్ చాలా ఫన్నీగా వుండి, సెకండాఫ్ లేకపోవడం ఏకసూత్రతని పాటించక పోవడమే. మాటలు, దర్శకత్వం ఈ రెండిట్లో ప్రతిభ కనబరచిన అవసరాల, మిగతా రచన కూడా కమర్షియల్ సినిమాకి దగ్గరగా చేసుకుని వుంటే బావుండేది.  సిగరెట్ జోకులు పేల్చినంత కామెడీతో,  కథని కూడా దారిలో పెట్టుకుని ఆద్యంతం పేల్చి వుండాల్సింది.



-సికిందర్
http://www.cinemabazaar.in








8, సెప్టెంబర్ 2016, గురువారం

రివ్యూ!

రచన-  దర్శకత్వం : ఆనంద్ శంకర్

తారాగణం :   విక్రమ్, నయనతార, నిత్యామీనన్, నాజర్, తంబిరామయ్య, బాలు, కరుణాకరన్, రిత్విక తదితరులు.
మాటలు : శశాంక్ వెన్నెల కంటి, సంగీతం
: హరీష్ జైరాజ్, ఛాయాగ్రహణం : ఆర్డీ రాజశేఖర్,
బ్యానర్ : ఎన్
.కె.ఆర్.ఫిలింస్,  నిర్మాత : శింబు తమీన్స్,  తెలుగు నిర్మాత : నీలం కృష్ణారెడ్డి విడుదల  : సెప్టెంబర్ 8, 2016
***
          ‘పరిచితుడు’ సూపర్ సక్సెస్ తర్వాత విక్రం గెటప్స్ మీద మమకారం పెంచుకుని మల్లన్న, రావణ్, ఐ లాంటి అంతగా ప్రేక్షకులు మెచ్చని సినిమాలు చేస్తూ, తాజాగా మరో గెటప్ తో ‘ఇంకొక్కడు’ అంటూ వచ్చాడు. ఇంకెన్ని గె ‘తప్పులు’ భవిష్యత్తులో ఉంటాయో తెలీదు- తనకి మాత్రం గెటప్స్ తో  పూర్తి ఆత్మవిశ్వాసం ఉన్నట్టుంది- ఈసారి ఆడా మగా కాని విలన్ గా ద్విపాత్రాభినయం చేస్తూ ‘అరిమా నంబి’ ( తెలుగులో ‘డైనమైట్’)  దర్శకుడు ఆనంద్ శంకర్ దర్శకత్వంలో విచ్చేశాడు. 

       
తెలుగులో చూడాలంటే ఈ రోజుల్లో స్పై థ్రిల్లర్స్ లేవు. తమిళ డబ్బింగుతో ఈ లోటు తీరుతుందేమో అనుకుంటూ ఈ సినిమా కెళ్తే నిజంగా ఎలాటి అనుభవం ఎదురవుతుంది, కొత్త గెటప్ తో విక్రం ఈసారి ఎంత రంజింపజేస్తాడూ అన్నవి ఓసారి చూద్దాం. 

కథ 

        దేశంలో మలేషియా రాయబార కార్యాలయం మీద జరిగిన దాడిని పురస్కరించుకుని ఇండియన్ గూఢచార సంస్థ ‘రా’ (రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్) దర్యాప్తు చేపడుతుంది. దీని చీఫ్ గా మల్లిక్ (నాజర్), ఏజెంట్ గా ఆరుషి (నిత్యా మీనన్) వుంటారు. దాడి దృశ్యాల విజువల్స్ లో దాడి జరిపిన వృద్ధుడి మెడ మీద ఒక పచ్చబొట్టు కీలక సాక్ష్యంగా మారుతుంది. అది పూర్వం ‘లవ్’ (విక్రం డబుల్) అనే క్రిమినల్ గ్యాంగ్ గుర్తు అని చెప్తుంది ఆరుషి. అయితే నాల్గేళ్ళ  క్రితం ఒక ఆపరేషన్లో ‘లవ్’ ని చంపిన మాజీ ‘రా’ ఏజెంట్ అఖిల్ (విక్రం) ని పిలవమంటాడు మల్లిక్. అఖిల్ వచ్చేసి అరుషి తోడుగా కేసు చేపడతాడు- ఈ కేసు మలేషియా ప్రయాణానికి దారి తీస్తుంది. నాల్గేళ్ళ క్రితం అఖిల్ భార్య మీరా (నయనతార) ని ‘లవ్’ చంపేశాడు. ఈమె కూడా ‘రా’ ఏజెంటే. భార్య హత్యకి మొత్తం గ్యాంగు నంతా అప్పట్లోనే హతమార్చాడు అఖిల్. మరిప్పుడు ఈ ‘లవ్’ అంటూ ఇంకెవడు వచ్చాడో అర్ధంగాదు అఖిల్ కి. 

        గతంలో ‘లవ్’ భారీ కుట్రకి తెర తీశాడు. తన ప్రయోగశాలలో ‘స్పీడ్’ అనే ఒక మందు తయారు చేశాడు. దీన్ని ఇన్ హేలర్ లాంటి సాధనంలో పెట్టుకుని పీల్చితే శరీరంలో అమాంతం ఎడ్రెనలిన్ హార్మోన్ పెరిగిపోయి విపరీతమైన బలం వచ్చేస్తుంది. ఆ బలంతో ఎవరికైనా సాధ్యం కానిదేమీ వుండదు. దీన్ని టెర్రరిస్టుల కోసం ఉత్పత్తి చేశాడు ‘లవ్’. అయితే ఇప్పుడు మలేషియా రాయబార కార్యాలయం మీద దాడిలో వాడింది కూడా ఈ ఇన్ హేలరే. ఇప్పుడు దీన్ని ఇంకెవరు తయారు చేస్తున్నారు? ఎక్కడ తయారు చేస్తున్నారు? తాజాగా ఇంకే కుట్ర పన్నుతున్నారు?... ఇవన్నీ కనుగొని అఖిల్ ఎలా అడ్డు కున్నాడన్నది మిగతా కథ. 

ఎలావుంది కథ 
          కథ స్పై థ్రిల్లరే, కానీ స్పై థ్రిల్లర్ కీ రొటీన్ గా వచ్చే యాక్షన్ థ్రిల్లర్స్ కీ తేడా లేనట్టు వుంది. జేమ్స్ బాండ్ స్పై థ్రిల్లర్స్ రెగ్యులర్ యాక్షన్ థ్రిల్లర్స్ లా వుండవు కదా? స్పై థ్రిల్లర్స్ అంతర్జాతీయ గూఢచర్యానికి సంబంధించినవి. ‘లవ్’ ఒక్కడే అంత పెద్ద అంతర్జాతీయ కుట్ర చేసుకుంటున్నట్టు గాకుండా, మరి కొందరు గ్లోబల్ విలన్స్ కూడా వుండాల్సింది;  కథ ఇంకో రెండు మూడు దేశాలకి తిరగాల్సింది. హీరో కూడా మాస్ లుక్ తో గడ్డం పెంచుకుని గాక, హీరోయిన్స్ లాగే  ఇంటర్నేషనల్ స్పైలా,  స్టయిలిష్ గా వుండాల్సింది. కథని స్పై థ్రిల్లర్ లా విస్తరించివుంటే సెకండాఫ్ బోరుకోట్టేది కాదు. ఎంతసేపూ మూడు నాల్గు పాత్రలతో విషయం అక్కడక్కడే తిరుగడంతో ఒక దశలో శూన్య స్థితికి కూడా చేరుకుంది కథ. స్పై థ్రిల్లర్స్ లో యాక్షన్ కూడా సీరియస్ గా, హింసతో కూడుకుని వుండదు. లైటర్ వీన్ యాక్షన్ తో జాకీ చాన్ లా నవ్విస్తూ, ఎంటర్ టైన్ చేస్తూ  సాగిపోతాడు స్పై హీరో. ఇవన్నీ ఇందులో లోపించాయి- స్పై థ్రిల్లర్ ఫీల్ కి న్యాయం చేయకుండా. 

ఎవరెలా చేశారు
       పాపం ట్రైలర్స్ లో ‘ఇంకొక్కడు’ మాస్ టైటిల్ కి, విక్రం ఆడ లుక్ కీ ఆకర్షితులై మాస్ లేడీస్ కూడా వచ్చారు ఉదయాన్నే సినిమాకి. వాళ్ళందరూ బుక్కైపోయారు. ఆడ లుక్ తో విక్రం ఈ క్లాస్ మ్యనరిజమ్స్ తో వాళ్ళని అలరించలేక పోయాడు. క్లాస్ ప్రేక్షకులు కూడా కనెక్ట్ అయ్యారా అంటే ఏదో చూస్తున్నమంటే చూస్తున్నామన్నట్టు పాసివ్ గా చూశారు తప్ప, ‘అపరిచితుడు’ లో చూసినట్టు కిర్రెక్కి పోలేదు. అంత క్రేజీ క్యారక్టర్ గా లేకపోవడంతో ఈ కష్టం. కానీ ఈ గెటప్ లో  సభ్యతగా చాలా కంట్రోల్లో వుండి  నటించాడు విక్రం. మూతి విరుపులు, కంటి చూపులు ఈ రెండిటి తోనే పాత్రని ఆ మేరకు సాఫ్ట్ గా నటించాడు.
        స్పై పాత్రలో విక్రం దంతా సీరియస్ నటనే. ఇదంతా రొటీన్ గానే  వుంది. గుర్తుండిపోయే సన్నివేశాలేవీ లేవు. ఇక నయనతార షరామామూలుగా తన డల్  నటనతో చాలాసేపు ఇబ్బంది పెట్టి, సెకండాఫ్ సగంలో యాక్షన్ లోకి వస్తుంది. అయితే ఈ యాక్షన్ కూడా ఫాస్ట్ గా ఏమీ వుండదు. ఇకపోతే నిత్యా మీనన్ సంగతి- ఈమె సినిమాల్లో ఎందుకు నటిస్తోందో అర్ధంకాదు. ఇప్పుడుకూడా ఏమీ చేయని పాత్రలో ఫ్రేములు నింపడానికే అన్నట్టు వుంటుంది. ఒక ‘రా’ ఏజెంట్ గా ఒక్క యాక్షన్ సీనూ లేదు. తోటి ఏజెంట్ అయిన హీరో పోరాడుతూంటే, ఫార్ములా  యాక్షన్ సినిమాల్లో హీరోయిన్ లాగా ఆ పక్కన నించుని చూస్తూంటుంది. పైగా ఒక ఫైట్ సీనులో హీరో ఆమెని కారెక్కి కూర్చోమంటాడు! ఆమె డ్యూటీ చేయాల్సిన స్పై ఎజెంట్ అనుకున్నాడా లేకపోతే, ఇది మూస యాక్షన్ సినిమా అనుకుంటూ తన లవర్ అనుకున్నాడా? ఒకవేళ ఆమె లేడీ పోలీస్ అయివుంటే ఆ మాట అంటాడా?  

        దర్శకుడికి ఈ జానర్ పట్ల ఏమాత్రం స్పష్టత లేదు. రాకరాక ఒక స్పై సినిమా వస్తే ఆ ఫీల్ ని కూడా నోచుకోకుండా చేశాడు. జానర్ స్పష్టత లేని సినిమాలు బోల్తా కొట్టినట్టే,  ఇది కూడా ఆ ప్రమాదపు టంచుల మీదుంది. 

        చాలా రోజుల తర్వాత హేరీస్ జయరాజ్ ఫ్రెష్ మ్యూజిక్ తో వచ్చాడు. పాటలకీ, బ్యాక్ గ్రౌండ్ కీ మంచి ట్యూన్లు ఇచ్చాడు. థీమ్ మ్యూజిక్ కూడా సన్నివేశాల్ని ఎలివేట్ చేస్తూ బాగా పని కొచ్చింది. అలాగే ఆర్డీ రాజశేఖర్ ఛాయాగ్రహణం ఉన్నతంగా వుంది. గ్రాఫిక్స్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టినట్టు లేదు. యాక్షన్ సీన్స్  జానర్ కి తగ్గట్టు లేవు. 

చివరికేమిటి?
       
ఇంకో కొత్త రూపంతో విక్రం రావడం బాగానే వుంది  గానీ విషయం కూడా కొత్తగా, బలంగా  ఉండేట్టు చూసుకోలేదు. పోనీ ఈ గెటప్ అయినా- ‘డార్క్ నైట్’ లో విలన్ జోకర్ లా  విషయాన్ని పైకెత్తిందా అంటే అదీ లేదు. కథలో పాత్రలకి ప్రమాదం పొంచి ఉన్నదీ లేదు. ప్రమాదాన్ని మందు ఉత్పత్తికి, సరఫరాకి మాత్రమే పరిమితం చేయడం స్పై సినిమాకైనా, మామూలు యాక్షన్ సినిమాకైనా దారుణం. ఆ మందుతో విలన్ ఫలానా  నగరంలో బీభత్సం సృష్టించ బోతున్నాడన్న ప్రమాదం పొంచివుంటే, చివరి క్షణాలవరకూ దాన్ని హీరో ప్రాణాలొడ్డి అడ్డుకోబోతూంటే  ఎక్కువ థ్రిల్ వుంటుంది చూడ్డానికి. అలాగాక, విలన్ ఏం ప్రమాదం తలపెడతాడో వూసే లేని థ్రిల్లర్ ఒక థ్రిల్లర్ అవజాలదు. విలన్ ఏం ప్రమాదం తలపెడతాడో చిత్రించకుండా, వూరికే  ఆ మందు సరఫరాని ఆపడమే హీరో లక్ష్యంగా వుంటే అది సినిమాకి చాలని విషయం. విలన్ ఎంత ప్రమాదకారియో చూపనప్పుడు హీరో ఎన్ని తిప్పలు పడ్డా వృధా. 

        ఫస్టాఫ్ ‘లవ్’ ఎవరో తెలుసుకోవడానికి కథ నడిపినా- ఇంటర్వెల్ ఎందుకో ‘సింహాద్రి’ ని గుర్తుకు తెచ్చి బలంగా వుండదు. ఇక సెకండాఫ్ అంతా బలవంతంగా నడిపిన కథలాగా చాలా చోట్లా భారంగా వుంటుంది. కథ పెరగక పోవడం వల్లే ఈ సమస్య. రెండు పత్రాలు పోషిస్తూ విక్రం ఈ మంచి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోకపోవడం విచారకరం.


-సికిందర్ 

5, సెప్టెంబర్ 2016, సోమవారం

స్క్రీన్ ప్లే సంగతులు!



స్టార్ సినిమాలతో వున్న సులువు ఏమింటే, ఎలా తీసినా వాటి వ్యాపారం జరిగిపోతుంది, హిట్ టాక్ వచ్చేస్తుంది. ఎప్పుడో స్టార్లుండి కూడా బ్రహ్మోత్సవం, కబాలీ లాంటివి విషయపరంగా మరీ వికటిస్తే పరాభవం తప్పక పోవచ్చు, ఇవి  అరుదుగా ఎదురయ్యే సన్నివేశాలు. విషయపరంగా ఏ మేరకు వికటిస్తే సేఫ్ అనడానికి కొలబద్ద లేదుగానీ, చాలావరకూ విషయపరంగా అర్ధవంతంగా వుండని స్టార్ సినిమాలు హిట్టయి పోతూంటాయి. కారణం స్టార్ పవర్. స్టార్లు ఇద్దరుంటే రెట్టింపు పవర్. కాబట్టి వాటి విజయాలకి వాటి కథా కథనాలు, పాత్రచిత్రణలు కూడా తోడయ్యాయని ఎవరైనా నమ్మితే పొరపాటే. హిట్టయ్యింది కాబట్టి కథాకథనాలు ఇలాగే వుండాలని, పాత్రచిత్రణలూ ఇలాగే వుండాలని భావిస్తే, లేదా కథా కథనాలూ పాత్ర చిత్రణలూ కరెక్టుగా ఇలా కుదరడం వల్లే హిట్టయ్యిందని వాదిస్తే  తప్పులో కాలేసినట్టే. స్టార్ పవర్ ని తీసేసి చూసినప్పుడు ఆ కథా కథనాల, పాత్ర చిత్రణల  బలమెంతో తెలిసిపోతుంది. ‘జనతా గ్యారేజ్’ ఆర్ధిక విజయానికి కారణం ఇదే- స్టార్ పవర్. అందులోనూ డబుల్ స్టార్ పవర్- తప్ప విషయపరంగా చేసిన అద్భుతమేమీ కాదు. డివైడ్ టాక్ ఎందుకొస్తుంది- విషయపరమైన లొసుగుల వల్లే కదా? డివైడ్ టాక్ ని అధిగమించి ‘జనతా గ్యారేజ్’ ఆర్ధిక విజయం సాధిస్తోందంటే అది స్టార్ పవరే. కాబట్టి స్టార్ పవరుంటే చాలు, అంత  చక్కగా స్క్రిప్టు వర్క్ చేసుకోనక్కర లేదని రాతపని సరంజామాతో పాటు మెదడుని  పక్కన పడేస్తే- అన్నివేళలా కలిసి రాకపోవచ్చు. అదొక బ్రహ్మోత్సవమో, కబాలీనో కావొచ్చు. వికటించే రేంజుల్ని బట్టి జాతకాలుంటాయి. 

దురదృష్టవశాత్తూ సినిమాల్లో విషయం ఎంత వికసించాలనిగాక, ఏ రేంజిలో వికటిస్తే మనం సేఫ్ గా వుంటామని ఆలోచించే కాలంలో మనం వున్నాం.  ఈ కథ ఇలా చేస్తే మరీ పాడయిపోతుందా.... అయితే కొంచెం తగ్గించు...తక్కువ పాడు చేసుకుందాం....అనే ధోరణి ప్రబలిన చీకటి యుగంలో వున్నాం. ఇలా తక్కువ వికటించేలా చూసుకునే పనే తప్ప ఎక్కువ వికసించే మాట కాదు. వికాసం, విస్తృతి, నాణ్యతల కంటే కూడా - ఎంత తక్కువ పాడుచేసుకోవచ్చు, ఎంత తక్కువ (ప్రేక్షకుల చేత) తిట్లు తినవచ్చు, ఎంత తక్కువ కెరీర్ కి నష్టం చేసుకోవచ్చనే వాటి మీదే దృష్టి పెట్టి కసరత్తు చేసే నయా క్రియేటర్ల జమానాలో జీవిస్తున్నాం. ఎక్కువ వికాసం గురించి గాక, తక్కువ వినాశం గురించి తపించే నెగెటివిటీ తాండవిస్తున్న ట్రెండ్ ని చవిచూస్తున్నాం. వికాసమంటే ఎంతో కష్టపడాలి, వినాశానికి ఏ కష్టమూ  పడనక్కర్లేదుగా, అందుకని. 

        ‘జనతా గ్యారేజ్’  లో విషయం యే మేరకు సేఫ్ గా వికటించిందీ అంటే,  మనం ఓనమాలు అంటే బేసిక్స్ లోకి వెళ్ళాలి.  మనం ‘తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్’  వ్యాస పరంపరలో భాగంగా మూడో అధ్యాయంలో బేసిక్స్ గురించి చెప్పుకుంటూ,  అసలంటూ ఓ ఐడియా అనుకున్నాక, ముందుగా అందులో కథే వుందా, లేకపోతే  గాథగాని వచ్చి శుభ్రంగా తిష్ఠ వేసిందా పరిశీలించు కోవాలని హెచ్చరించుకున్నాం. ఈ మధ్యే ‘బ్రహ్మోత్సవం’ సినిమా చెప్పాల్సింది కథ అని మర్చిపోయి, ఓ గాథా లహరితో బిగ్ బ్యాంగ్ ఇచ్చి వెళ్ళింది. ఆల్రెడీ ఒకప్పుడు కృష్ణవంశీ ‘మొగుడు’, తో సరిపెట్టకుండా మళ్ళీ,  ‘పైసా’ అంటూ కూడా గాథలతో రెండు బ్యాడ్ టు బ్యాడ్ బ్యాంగు లిచ్చి వదిలారు.  మణిరత్నం సర్ కూడా ‘ఓకే బంగారం’ తో తనదైన వెరైటీ బ్యాంగ్ ఇస్తే, మరో ఇద్దరు దర్శకులు ‘చక్కిలిగింత’ అనీ, ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ అనీ  గాథలందుకుని గాయపడ్డారు. ఆఖర్న  ‘రాజాధిరాజా’ తో కూడా ఈ మధ్యే గాథ బారిన పడి దగాపడి పోయాం. 

       
తెలుగు సినిమాలకి పాసివ్ పాత్రలు, ఎండ్ సస్పెన్స్ కథనాలు అనే రెండు శాపాలు ఇంకా వదలడం లేదు-  ఇక ఇప్పుడు గాథలు కూడా ముచ్చటగా మూడో శాపంగా తోడయ్యియ్యాయి. ఇసుకకీ మట్టికీ తేడా తెలీని వాడు ఇల్లు కట్ట లేనట్టే - కథకీ, గాథకీ తేడా తెలీని వాడు సరైన సినిమా తీయలేడు. దట్స్  బేసిక్స్. 

గాథంటే ఏమిటి?  
      మన్మధ రావు రోడ్డు మీద నడుచుకుంటూ ఏటో పోతున్నాడు... రోడ్లమీద ప్రాణాలకి అంత గ్యారంటీ వుండదు కాబట్టి, వెనకనుంచి ఏదో వాహనం వచ్చి ధభీల్మని గుద్దేసింది. అమ్మో అని గీపెట్టి  కింద పడ్డాడు. ఆ ప్రయాణం రద్దయి, 108 లో అత్యవసరంగా ఇంకో ప్రయాణం కట్టాడు. ఎంచక్కా హాస్పిటల్ బెడ్ నలంకరించాడు. కాలు ఫ్రాక్చరైందని తేలింది. ఫ్రాక్చరైన కాలితో అతను బెడ్ మీద ఎన్ని బాధలు పడ్డాడు, బయటి కొచ్చి ఎంతకాలం ఇంకెన్ని యాతనలు పడ్డాడు, చివరికి కాలు బలపడి మళ్ళీ రోడ్డు మీద ఎంత క్రేజీగా ఎలా నడవసాగాడు- ఈ మొత్తం అనుభవంతో జీవితం గురించి నేర్చుకున్న దేమిటీ అని, సదరు మన్మధరావు తోటి నవీన్ కుమార్ కి   చెబుతోంటే అది గాథ. నవీన్ కుమార్ కి బోరు కొట్టింది. కారణం, ఇందులో ఏముందని ఆసక్తి కల్గించడానికి మన్మధరావు గాయం బాపతు  సోది  తప్ప- కాబట్టి గాథ అనేది ఏదో విషయం మీద స్టేట్ మెంట్ ఇచ్చిన స్థాయిలోనే  వుండిపోతుంది. నేనిలా అనుకుంటే నాకిలా జరిగి ఇలా మిగిలానబ్బా, ఏమంటావ్?-  అని విధికి తలవంచిన మనిషిలా  ఒక పరాజితుడిగా చెప్పేసి వెళ్ళిపోవడం.

కథంటే?
     అదే మన్మధరావు బైక్ మీద అర్జెంటుగా పెళ్లి చూపులకి పోతున్నాడనుకుందాం. వెనుక నుంచి కారొచ్చి గుద్దేసింది. ఎగిరి కింద పడ్డాడు. కాలు విరిగింది. ఎవడ్రా  నన్ను గుద్దిందీ -అని లేవబోయే లోపే కారు వెళ్ళిపోయింది. మన్మధ రావు విరిగిన కాలుతోనే దాని వెంటబడ్డాడు. ఎవరో ఆపి హాస్పిటల్ కి తీసి కెళ్ళారు. ఫ్రాక్చరైన కాలుకి బ్యాండేజీ పడింది. పెళ్లి సంబంధం రద్దయ్యింది.  నా పెళ్లి పాడు చేసిన వాణ్ణి వదిలేది లేదని పోలీసుల్ని పట్టుకుని, లాయర్నీ  పెట్టుకుని, కారు వాడి మీద కేసు వేశాడు. యాక్సిడెంట్ లో తప్పె వరిదనే  పాయింటు పై తీవ్ర పోరాటం చేసి  కేసు గెలిచాడు. నష్టపరిహారం పొందాడు.


        మన్మధరావు ఇలా చెప్తే నవీన్ కుమార్ కి నచ్చింది. ఎందుకంటే ఇందులో వాడిగా వేడిగా ఆసక్తి రేపే ఆర్గ్యుమెంట్ వుంది. మన్మధ రావు చేసే పోరాటం వుంది. చివరికి తప్పొప్పుల నిర్ధారణతో జడ్జి మెంట్ వుంది. నేనకున్న లక్ష్యాన్ని ఫలానా ఈఈ శక్తులతో ఈ విధంగా సంఘర్షించి సాధించుకున్నాను- అని మన్మధరావు  విజేతగా ప్రకటించుకోవడం వుంది. 


కథ- గాథ
       కొన్ని ఛానెల్స్ లో అకస్మాత్తుగా అరుపులు వినిపిస్తూంటాయి. ఏమిటా అనిచూస్తే చర్చావేదికలో కొందరు రాజకీయ నాయకుల్ని కూర్చో  బెట్టుకున్న యాంకర్ వాళ్ళ మధ్య పచ్చ గడ్డి వేస్తూంటాడు. వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుచుకుంటూ వుంటారు. ఏదో యుద్ధం జరుగుతున్నట్టు  ఆ కార్యక్రమం సాగుతూంటుంది. ఇంకొన్ని ఛానెల్స్ లో యాంకర్ ముందు రాజకీయ నాయకులు బుద్ధిగా కూర్చుని ఒకరి తర్వాత ఒకరు మాత్రమే అభిప్రాయాలు వెలిబుచ్చుకుంటూ వుంటారు.  ఎవరైనా అడ్డు తగిలితే ఒకరు మాట్లాడిన తర్వాతే ఇంకొకరు మాట్లాడాలని యాంకర్ కంట్రోలు చేస్తూంటాడు. ఈ  కార్యక్రమాలు చప్పగా సాగుతూంటాయి. ఆర్గ్యూ చేసుకునే ఛానల్స్ కి రేటింగ్ ఎక్కువ వుంటే, అభిప్రాయాలు చెప్పుకునే ఛానెల్స్ కి అంతగా ప్రేక్షకులు వుండరు. 

        కథకీ- గాథకీ తేడా ఇదే. ఛానెల్సే సాక్షి. ఛానెల్స్ కి లాగే సినిమాలకి పనికొచ్చేది ‘కథ’లే గానీ
 ‘గాథ’ లు కాదు. స్క్రీన్ ప్లే ద్వారా ఒక విషయం చెప్పదల్చుకుంటే కథ (story) గానో, గాథ (tale) గానో ఏదో ఒకరకంగా చెప్పవచ్చని ఇదివరకు ఒక సినిమా రివ్యూలో చెప్పుకున్నాం. కాకపోతే గాథగా చెప్తే కమర్షియల్ సినిమాకి పనికి రాదు. సినిమాకి కథే వుండాలి. ఎందుకంటే కథలో ఆర్గ్యుమెంట్ వుంటుంది. 

        దాంతో
 సంఘర్షణ పుడుతుంది.  గాథలో స్టేట్ మెంట్ మాత్రమే వుంటుంది. దీంతో సంఘర్షణ పుట్టదు. సంఘర్షణ  లేని స్క్రీన్ ప్లే చప్పగా వుంటుంది. గాథలు చదువుకోవడానికి నీతి కథలుగా బావుంటాయి. కానీ దృశ్య మాధ్యమంగా చూడాలంటే  కథలు మాత్రమే  బావుంటాయి. కథలో ఒక సమస్య ఏర్పాటై, దాంతో మొదలయ్యే పాత్రల మధ్య సంఘర్షణ (మన్మధరావు- 2 లాగా) అనేది తప్పొప్పుల లేదా న్యాయాన్యాయాల ఆర్గ్యుమెంట్ కి దారి తీసి, చిట్ట చివర ఓ జడ్జ్ మెంట్ నిస్తుంది. గాథ లో సమస్య వున్నా దాంతో పాత్రలు (మన్మధరావు- 1 లాగా)
సంఘర్షించక, ఆర్గ్యుమెంట్ ఎత్తుకోక, జడ్జ్ మెంటూ  ఇవ్వక- కేవలం ఈ ఫలానా సమస్య వల్ల  మాకిలా జరిగి, చివరికి మేమిలా తయారయ్యా మయ్యోచ్ అనేసి స్టేట్ మెంట్ మాత్రమే ఇచ్చి అవతల పారేసి తమ  దారిన తాము వెళ్ళిపోతాయి.
          
        ఇంకోటి గమనిస్తే గాథకి స్ట్రక్చర్ వుండదు. కథకి వుంటుంది. కమర్షియల్ సినిమాకి కథ వల్ల  సమకూరే స్ట్రక్చరే ప్రాణం. గాథ అనే దానికి  బిగినింగ్ మాత్రమే వుండి, అదే సాగి సాగి  ఆ బిగినింగ్ తోనే ముగుస్తుంది. అందుకని కమర్షియల్ సినిమాలకి బిగినింగ్ ని మాత్రమే కలిగి వుండే గాథలు పనికి రావు. కథతో అలా కాదు, కథలకి బిగినింగ్ తో బాటు మిడిల్, ఎండ్ లనే మూడంకాలుండి, ఆ ఆదిమధ్యంతాల సృష్టి స్థితి లయలతో విషయ విపులీకరణ చేస్తాయి.

        ఇంకా చెప్పుకుంటే,  గాథకి ప్లాట్ పాయింట్స్ కూడా వుండవు. కథకి వుంటాయి. గాథకి పాత్ర ఎదుగుదలకి సంబంధించిన క్యారక్టర్ ఆర్క్ (పాత్రోచిత చాపం) కూడా వుండదు. ఎలా మొదలైన పాత్ర అలా నిస్తేజంగా పడి వుంటుంది. కథకి అలాకాదు, పాత్ర ఎదుగుదలతో కూడిన క్యారక్టర్ ఆర్క్ అడుగడుగునా ఉద్విగ్నభరితంగా తయారవుతూ పోతూంటుంది. ఇంకా గాథకి టైం అండ్ టెన్షన్ గ్రాఫ్ (కాలం- వొత్తిడి బిందు రేఖ) కూడా ఏర్పడదు. అంటే తెర మీద సినిమా నడిచే కాలం గడిచే కొద్దీ టెన్షన్ కూడా పెరగడం వుండదన్న మాట. ఎలా మొదలయిన సినిమా అలా నేలబారు కథనంతో నడుస్తూంటుంది. కథకి అలాకాదు, టైం అండ్ టెన్షన్ గ్రాఫ్ పాలన జరగడంతో బాటు, ఉత్థాన పతనాల కథనంతో కట్టి  పడేస్తూ పోతుంది.


        గాథలో సంఘర్షణ కూడా వుండదు, కానీ సంఘర్షణ లేని కథ వుండదు. గాథకి విలన్ కూడా వుండడు, వుంటే సరిగా వుండడు. కథకి విలన్ ఒక కీలక కక్షి దారు. వీడు లేకపోతే మనమీద కక్ష గట్టినట్టు వుంటుంది కథ.

        గాథలు ఆర్ట్ సినిమాలు చూసుకునే వ్యవహారం. కథలు కమర్షియల్ సినిమాలు చూసుకోవాల్సిన వ్యాపారం (తెలుగు సినిమాలు కమర్షియల్ సినిమాల  ముసుగేసుకున్న  ఆర్ట్ సినిమాలే నని చాలా సార్లు చెప్పుకున్నాం). 

       
మరింకా చెప్పుకుంటే, కథఅనే దాంట్లో విధి అనే ఎలిమెంట్ కి స్థానం లేదు.  హీరో ఏదో అనుకుంటూంటే దైవం కల్పించుకుని ఇంకేదో చేసి- - తానొకటి తలిస్తే దైవమొకటి తలచును -  అన్నట్టు అమాంతం ఏ పిడుగో  పడి చావడంతో ముగియదు. గాథ ల్లోనే ఇలాటి మౌఢ్యాలుంటాయి. ఇలాకాక కథల్లో  ప్రత్యక్షంగా అడ్డు పడే ప్రత్యర్ధులతో  భౌతికంగానో మానసికంగానో పోరాడి సాధించుకోవడమే వుంటుంది.  దైవిక పరిష్కారాలు - ఫాటలిజం - కమర్షియల్ సినిమా హంగు కాదు, అది గాథల్ని చక్కగా చెప్పే ఆర్ట్ సినిమా ఎండింగ్ కావొచ్చు. పలాయనం చిత్తగించేదే గాథల్లో  కన్పించే పాసివ్ పాత్ర. గాథల్లో పాసివ్ పాత్రలు అతి పెద్ద ఫాటలిస్టులు. సమస్య వస్తే అది తలరాత అన్నట్టుగా, పరిష్కారం విధి చేతుల్లో పెట్టేసి వూరుకుంటాయి. వీటికి దైవిక పరిష్కారాలంటూ లభిస్తూంటాయి.
        
        ఇక చివరిగా, ప్రేక్షకుల విషయానికి వస్తే, గాథల్ని పాసివ్ గా చూస్తారు; అదే కథల్ని యాక్టివ్ గా చూస్తారు.
        పైన గాథలుగా వచ్చాయని చెప్పుకున్న  బ్రహ్మోత్సవం, కబాలీ, ఓకే బంగారం, మొగుడు, పైసా, చక్కిలిగింత, కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, రాజాధిరాజా మొదలైన సినిమాలతో- జనతా గ్యారేజ్ ని కూడా కలుపుకుని,  మరొక్క సారి వీటన్నిటినీ  పరిశీలనాత్మకంగా చూసినట్లయితే- పై పేరాల్లో చెప్పుకున్న ‘కథ’ కుండే లక్షణాల్లో ఒక్కటీ వీటికి లేదనీ, అన్నీ  ‘గాథ’ కి చెప్పుకున్న లక్షణాలే తుచ తప్పకుండా వున్నాయనీ గుర్తించ వచ్చు. 

గ్యారేజ్ ఐడియా 
       ఎక్కడ పడింది  ‘గ్యారేజ్’ డివైడ్ టాక్ కి బీజం? ఐడియా దగ్గరే  పడింది. ఐడియా ఎప్పుడైతే పుడుతుందో అప్పుడు అప్రమత్తంగా లేకపోతే డివైడ్ టాక్ కీ అప్పుడే బీజం పడిపోతుంది! ఈ ఐడియాతో తీసిన సినిమాకి డివైడ్ టాక్ వస్తుందని అప్పుడే చెప్పెయ్యొచ్చు. విడుదలకి పెట్టుకునే ఎలాటి ముహూర్తాలూ దీన్నుంచి కాపాడ లేవు. పనిలో శాస్త్రీయత వుంటే శాస్త్రాలు పెట్టే  ముహూర్తాలు తోడ్పడవచ్చు. ఐడియా అంటే ఏమిటి? ఆర్గ్యుమెంట్ + స్ట్రక్చర్ + లాగ్ లైన్ = ఐడియా అని ‘తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్’ వ్యాసాల్లో భాగంగా ‘ఐడియాలో కథ వుందా?’ అనే  మూడో అధ్యాయంలో చెప్పుకున్నాం. పైన చెప్పుకున్న మన్మథ రావు-1 నే తీసుకుందాం. ఏమిటి వీడి వ్యవహారం? ఇలాటి వాణ్ణి మనిషిగా లెక్కేయ కూడదు, వీడు తన గాయం తాలూకు సోది చెప్పుకున్నాడు. ఈ సోదిని ఐడియాగా తీసుకుని సోదీ సింగ్ సినిమా తీయాలనుకున్నాడను కుందాం :  అప్పుడు కాస్త కామన్ సెన్స్ వున్న రచయిత లైనేంటో  చెప్పమన్నాడనుకుందాం, సోదీసింగ్ ఏమని చెప్తాడు- మన్మధరావు కి యాక్సిడెంట్ అయి చాలా బాధలు పడ్డాడు, చాలా బాధలు పడ్డాడు, ఇంకా బాధలు పడ్డాడు ఆ గాయంతో, మూణ్ణెల్లకి కాలెలాగో బాగై మళ్ళీ హేపీగా నడవసాగాడబ్బా- అని చెప్పాడనుకుందాం-

        దీనికి కామన్ సెన్స్ వున్న రచయిత- ‘మీ ఐడియాలో స్ట్రక్చర్ ఎక్కడుంది, సోది తప్ప. మీరెలా కింగ్ నవుదామనుకున్నారు ఈ సినిమా తీసి?’  అని ప్రశ్నించి, ఇలా వివరించాడనుకుందాం :  ‘యాక్సిడెంట్ అయ్యింది లగాయత్తూ  బాధలు పడుతూనే వున్నాడు, ఇది బిగినింగ్. ఇంకా బాధలే పడుతున్నాడు, ఇది సాగదీసిన బిగినింగ్. ఇంకా ఇంకా బాధలు పడుతూనే వున్నాడు ఆ గాయంతో, ఇది మరీ మరీ ఇంటర్వెల్ మీదుగా  సాగదీసుకున్న  బిగినింగ్...ఇలా మూణ్ణెల్లకి కోలుకుని బాగా నడవడంతో తీరింది అతడి బాధ- ఇక్కడ బిగినింగ్ ముగిసిందే అనుకుందాం, వాట్ నెక్ట్స్ ? అయిపోయింది కదా సినిమా, ఇంకేముంది? బిగినింగ్ తోనే  సినిమాకి శుభం పడ్డాక మిడిల్ లేదు, ఎండ్ కూడా లేదు- మీకూ నాకూ బ్రెడ్ కూడా లేదు. మీరు మొదటి రకం చట్నీ, రెండో రకం చట్నీ, మూడో రకం చట్నీ కూడా పెట్టి,  అసలు ఇడ్లీయే  పెట్టకపోతే ఎలా వుంటుంది, అలా వుంటుంది ఇలా సినిమా తీస్తే. జీవితంలో ఆశాభంగాలకి అడుగులెలా పడతాయో, సినిమాల్లో కూడా మొదట్నించీ తప్పటడుగులు అలాగే పడుతూ వస్తాయి. ముగింపు దాకా అవి తప్పటడుగు లేనని తెలుసుకోనే తెలుసుకోం. జీవితంలో వేసే తప్పటడుగుల్ని సవరించుకుంటాం. ఎందుకంటే అవి దేవుడి హెచ్చరికలు కదా? సినిమాలకి మనమే క్రియేటర్లం కదా, మన క్రియేటివిటీ తప్పవడానికి వీల్లెనే లేదు! మనం రాసేవి శిలా శాసనాలు, మామూలు స్క్రిప్టులేం కాదు...అంత నీచానికి దిగజారం...’

        ఇలా వివరించి, ఈ అయిడియాలో ఆర్గ్యుమెంట్ లేదనీ, మన్మధరావు సోదితో కూడిన స్టేట్ మెంట్ మాత్రమే వుందనీ, ఇందుకే లాగ్ లైన్ కూడా సరీగ్గా రావడం లేదనీ ముక్తాయించాడు కామన్ సెన్స్ వున్న రచయిత. ‘మీ ఐడియా = స్టేట్ మెంట్ + నో స్ట్రక్చర్ + నో లాగ్ లైన్’  అనీ తేల్చాడు. 

        కింగ్ నవుదామనుకున్న సోదీ సింగ్ కి విషయం అర్ధమయ్యింది. మరేం చేయాలో చెప్పమన్నాడు. విధిలేక  రచనలతో కామన్ సెన్స్ కూడా అలవాటు చేసుకుని  కాస్త బెటర్ గా వృత్తి చేసుకుంటున్న రచయిత, మన్మథరావు -2  చెప్పుకొచ్చాడు : మన్మథరావుకు యాక్సిడెంట్ అయ్యింది ( కథా పరిచయం-బిగినింగ్), యాక్సిడెంట్ చేసిన వాడిమీద కేసు వేసి పోరాడాడు (సంఘర్షణ- మిడిల్),  కేసు గెల్చి నష్టపరిహారం పొందాడు (పరిష్కారం- ఎండ్), ఇంతే. ఇక్కడ కథనం ‘గాయం’ దగ్గరే ఆగిపోలేదు. పాయింటు ‘గాయం’ కాదు, ‘హక్కు’. పోరాడి ఆ హక్కు సాధించుకునే తీరు. 

        పోరాటమంటేనే తప్పొప్పుల ఆర్గ్యుమెంట్. దీనికి బిగినింగ్ -మిడిల్ -ఎండ్ లతో కూడిన స్ట్రక్చర్ కూడా తోడైంది. ఇక లాగ్ లైన్ కి వస్తే- యాక్సిడెంట్ లో గాయపడ్డ మన్మథ రావు, నానా తిప్పలుపడి ఎలా న్యాయ పోరాటం చేసి గెల్చాడన్నది కథ. ఈ లాగ్ లైన్ లో పరస్పర సంబంధంతో బిగినింగ్- మిడిల్ - ఎండ్  మూడూ వున్నాయి.

        షెఫ్ అవ్వాలని కోరిక పెట్టుకున్న హీరో, ఫుడ్ ట్రక్ పెట్టుకున్న హీరోయిన్ తో కలిసి పనిచేసి ఎలా ఆమెతో ప్రేమనీ, తన కలనీ నిజం చేసుకున్నాడన్నది బిగినింగ్- మిడిల్- ఎండ్ లకి సంబంధించి పరస్పర సంబంధం గల మూడు వాక్యాలతో  ‘పెళ్లిచూపులు’ లాగ్ లైన్.

        పెళ్లి తప్పించుకున్న హీరోయిన్ పాకిస్తాన్లో తేలితే, అక్కడి పరిస్థితుల్లోంచి ఆమెని కాపాడి,  ఎలా పెళ్ళిచేసి హీరో పంపాడన్నది బిగినింగ్- మిడిల్- ఎండ్ లకి సంబంధించి పరస్పర సంబంధం గల మూడు వాక్యాలతో  ‘హేపీ భాగ్ జాయేగీ’ లాగ్ లైన్. 

        తన తండ్రి నడుపుతున్న కుటుంబ బిజినెస్ అయిన మాఫియా కార్యకలాపాలకి దూరంగా ఉంటున్న కొడుకు, తండ్రి మరణంతో ఇక తప్పక తండ్రి పదవిలోకొచ్చి, శత్రు శేషం గావించడమనేది బిగినింగ్- మిడిల్- ఎండ్ లకి సంబంధించి పరస్పర సంబంధం గల మూడు వాక్యాలతో ‘గాడ్ ఫాదర్’ లాగ్ లైన్. 

       
లాగ్ లైన్ అంటే మరేమిటో కాదు, లైను, స్టోరీ లైను. తమ కథకి మూడు వాక్యాల్లో లైన్ చెప్పలేని వాళ్ళు 90 శాతం మంది ఉండొచ్చు టాలీవుడ్ లో. 

        ఇప్పుడు  కథ అనుకుని తీసిన ‘గ్యారేజ్’ లైనుని కథగా మూడు వాక్యాల్లో చెప్పగలమో లేదో చూద్దాం : ముంబాయిలో పర్యావరణ కార్యకర్తగా  పోరాటం చేస్తున్న హీరో, హైదరాబాద్ వచ్చి పెదనాన్న నడుపుతున్న గ్యారేజ్ లో చేరి, సామాజిక సమస్యల మీద పోరాటం చేశాడు...

       
ఏమైనా ఈ వాక్యాలకి పరస్పర సంబంధం వుందా? పర్యావరణ కార్యకర్త సామాజిక పోరాటం చేయడమేమిటి? దీనికి కథా లక్షణం వుందా, గాథలా వుందా? ఒక కథలో రెండు పాయింట్లు ఎలా వుంటాయి? ఒక గోల్ వదిలేసి ఇంకో గోల్ కి హీరో ఎలా వెళతాడు? గాథ కైతేనే అనేక పాయింట్లు వుంటాయి.  ఒక పాయింటు మీంచి ఇంకో పాయింటు, ఒక గోల్ నుంచి ఇంకో గోల్... డాక్యుమెంటరీలు తీయయడానికి వాడే స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ (టైగర్ హరిచంద్రప్రసాద్), దాంతో ఎపిసోడిక్ కథనం ( ఆటోనగర్ సూర్య)...ఫస్టాఫ్ లో చూపించింది హుష్ కాకీ చేసి సెకండాఫ్ లో ఇంకో భారతం (రుస్తుం)... ఇలాటివన్నీ ఐడియా దగ్గర మూడు వాక్యాల సమన్వయం కోల్పోయినప్పుడే తలెత్తుతాయి... కథ అనే ఉన్నతాసనం మీంచి ఐడియా ముక్కలై,  గాథగా అగాథంలోకి పడిపోతుంది.

        ఇలా వెల్డింగ్ చేసిన  ఐడియాని నాలుగు పేజీల సినాప్సిస్ గా రాసుకున్నప్పుడైనా చదువుతున్నడు ఆ పేరాలు లాజిక్ కే అడ్డుతగులుతూంటాయి. సినాప్సిస్ రాసుకునే వాళ్ళుకూడా 90 శాతం వుండరు. ఒక ఐడియా అనుకుని డైరెక్టుగా దానికి వన్ లైన్ ఆర్డర్ వేసుకుపోవడమే...అదిగో అప్పుడే ‘గ్యారేజ్’ లాంటి ‘గాథలు’ తెరమీదికి వస్తాయి. ‘గ్యారేజ్’ ఐడియా లేదా కాన్సెప్ట్ దాని మూలస్థంభమైన సెంట్రల్ పాయింటుకి కూడా నోచుకోలేదు...


(మిగతా రేపు)
- సికిందర్ 
http://www.cinemabazaar.in