రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

17, మార్చి 2017, శుక్రవారం

రివ్యూ!





రచన - దర్శత్వం: కుమార్ ట్టి
తారాగణం: శ్రీ విష్ణు, చిత్రా శుక్లా , కాశీవిశ్వనాథ్, నా, జెమినీ  సురేష్ తదితరులు
సంగీతం: సురేష్ బొబ్బిలి, ఛాయాగ్రణం: శ్యామ్
బ్యానర్ : వెన్నెల క్రియేషన్స్
నిర్మాత:  బి. ప్రకాష్ రావు
విడుదల : మార్చి 17, 2017

***

        న్యూ జనరేషన్ హీరో శ్రీ విష్ణు ఉన్నట్టుండి పాత మూస కెళ్ళి పోయి షాకిచ్చాడు. మామూలు షాక్ కాదు న్యూజనరేషన్ ఆడియెన్స్ కీ, బాక్సాఫీసుకీ. అప్పట్లో ‘ఒకడుందే వాడు’ సెమీ రియలిస్టిక్ సక్సెస్ తో తన మీద పెంచుకున్న ఆశలన్నీ వమ్ము చేశాడు. అప్పట్లో శ్రీ విష్ణు అని ఒకడుండేవాడు అని చరిత్రలో తన చాప్టర్ రాసుకునేందుకు వెళ్ళిపోయాడు. తన మీద కొత్తగా ఆసక్తి పెంచుకుంటున్న న్యూ జనరేషన్ ఆడియెన్స్ లో నవ్వుల పాలయ్యేందుకూ సిద్ధపడ్డాడు. ఇలాటి సినిమాల కాలం అయిపోయిందబ్బాయ్ అని మహామహుల సినిమాలనే తిప్పికొడుతున్న ప్రేక్షకుల ముందు తగుదునమ్మాయని పేలవంగా ప్రత్యక్షమయ్యాడు. 

          
నగనగా పూరీజగన్నాథ్ తీసిన సినిమాలుండేవి. వాడేసి, అరిగిపోయిన అవే మాఫియా కథలతో ఒక యాక్షన్ సీన్ – ఒక కామెడీ సీన్- ఒక లవ్ సీన్- ఒక పాట;  మళ్ళీ ఒక యాక్షన్ సీన్- ఒక కామెడీ సీన్- ఒక లవ్ సీన్- ఒక పాట; మళ్ళీ ఒక...ఇలా రంగులరాట్నంలా స్క్రీన్ ప్లే గిర్రున తిరుగుతూ, అవే సీన్లు జతకట్టి రిపీటవుతూ మనకళ్ళు తిరిగేలా చేసేవి. ఆహా, పేరొస్తే సినిమాకథ రాయడం ఎంత సులభం అన్పించేది. మహాత్మాగాంధీ చరఖా తిప్పుతూ నూలు వడికినట్టు, పదిహేను రోజులు బ్యాంకాక్  బీచిలో కూర్చుని రంగులరాట్నం తిప్పుతూ పై వరసక్రమంలో సీన్లు పడేసుకుంటూ పోతే అదే స్క్రీన్ ప్లే అయి కూర్చునేది చచ్చినట్టూ. పూరీ పేరొచ్చాక ధీమాగా చేసిన ఈ పనిని  కొత్త దర్శకుడు ఉత్సాహపడి ‘పూరీ నా  ఆదర్శం’ అని డిక్లేర్ చేసుకుంటున్నట్టు, తొలి సినిమాతోనే రంగులరాట్నం తిప్పి పూర్తిచేశాడు. ఈ దెబ్బతో తను కూడా కేరాఫ్ బ్యాంకాక్ బీచి అయిపోవాలని, రంగులరాట్నంతో స్క్రీన్ ప్లే గాంధీ అన్పించుకోవాలనీ వ్యూహం పన్ని  వుండొచ్చు. కానీ మోకాలొడ్డే న్యూజనరేషన్ ప్రేక్షకులు పొంచి వుండి ఠకీల్మని కిందపడేశారు. ఈ ప్రేక్షకులే పూరీని కూడా ఠపా ఠపా పడేస్తూ వచ్చారు ఈ మధ్య. ఇది తెలుసుకోలేదు పూరీ ఏకలవ్య శిష్యుడు!  నిర్మాత చేత శ్రీ విష్ణు మార్కెట్ కి మించిన అత్యంత  భారీ స్థాయిలో ఖర్చుపెట్టించి, బ్యాంకాక్ సముద్రంలో నిమజ్జనం చేశాడు. 

          పూరీ మేనియాలో దర్శకుడు తీస్తున్నది టెర్రరిజమా, మాఫియానా  సఅని కూడా చూసుకోవడం కుదర్లేదు- అచ్చు గుద్దినట్టు పూరీ మార్కు రిచ్ హై ఫై మాఫియాల్లా చూపించేశాడు టెర్రరిస్టుల్ని. ఏ సీను తీసినా పూరీయిజం ప్రకటితమయ్యే మాఫియా లుక్ తో బ్రహ్మాండంగా వుండాలనుకుని జానర్ మర్యాదని మర్చిపోయాడు. ‘అప్పట్లో ఒకడుండే వాడు’ లో అంత జానర్ మర్యాదతో వున్న ‘మా అబ్బాయి’ శ్రీ విష్ణు కూడా జానర్ మర్యాదంతా కడిగిపారేసి, జోకర్ వేషం వేశాడు. 2015 నుంచి ఏ సినిమా జానర్ మర్యాదతో వుందో దానికే ఆచి తూచి మార్కులు వేస్తున్నారు ప్రేక్షకులన్న సంగతి కూడా,  తన  ప్రొఫెషన్ లో తెలుసుకునే తీరిక లేదు తనకి. 

          టెర్రరిజం దేశం మీద దాడితో సమానమైన దుష్టత్వం. దేశద్రోహం. దీంతో కాంప్రమైజ్ అవడం కుదరదు. టెర్రరిస్టులుగా ముస్లిములు వుంటున్నట్టయితే ఆ పాత్రలనే టెర్రరిస్టులుగా చూపించాలి. ఎవరి మనోభావాలో దెబ్బ తింటాయని బ్యాలెన్స్ చేస్తూ హిందూ పాత్రల్ని చూపించినప్పుడు ఆ కథే విశ్వసనీయతని  కోల్పోతుంది. 

          ఒకప్పుడు హిందీ ఫార్ములా సినిమాల్లో  చెడ్డ ముస్లింని చూపిస్తే, బ్యాలెన్స్ చేస్తూ మంచి ముస్లింని కూడా చూపించే వాళ్ళు. చెడ్డ పోలీసుని చూపిస్తే మంచి పోలీసుని కూడా చూపించేవాళ్ళు. కాలక్రమంలో చెడ్డ పోలీసుని బ్యాలెన్స్ చేయకుండా చెడ్డ పోలీసు ఒక్కడ్నే చూపించే బెటర్ మెంట్ వచ్చింది అన్ని భాషల  సినిమాల్లో. కానీ చెడ్డ ముస్లిం కి బ్యాలెన్సింగ్ అలాగే కొనసాగుతోంది. హృతిక్ రోషన్ ‘కాబిల్’ లో రేపిస్టుల్లో ఒకణ్ణి  ముస్లింగా చూపించినందుకు, బ్యాలెన్సింగ్ గా మంచి ముస్లింని హృతిక్ కి ఫ్రెండ్ గా పెట్టారు. 

          ఇదే చెడ్డ ముస్లిం టెర్రరిస్టు అయితే కాంప్రమైజ్ వుండదు. టెర్రరిస్టు పాత్రల విషయంలో హిందీ సినిమాల్లో ఎప్పుడూ కాంప్రమైజ్ లేదు, బ్యాలెన్సింగ్ లేదు. అందుకే అవి వాస్తవ పరిస్థితికి దర్పణం పడుతున్నట్టు వుండి అన్ని వర్గాల ప్రేక్షకులకి కనెక్ట్ అవుతూంటాయి. మణిరత్నం ‘రోజా’ తీసినప్పుడు కూడా ఇంతే- దీని హిందీ వెర్షన్ కి కూడా అంత పేరొచ్చింది. 

          తెలుగు సినిమాల్లోనే హాస్యాస్పదంగా ఏ గొడవా లేకుండా హిందువుల్ని టెర్రరిస్టులుగా చూపించేసి తప్పించుకోవచ్చనుకుంటున్నారు. ‘ఆది విష్ణు’, ‘బసంతి’ ఇలాంటివే. వీటికి ఏ గతి పట్టిందో తెలిసిందే. హిందువు టెర్రరిస్టు ఎలా అవుతాడన్న ఇంగితజ్ఞానం ప్రేక్షకులకి వుండ దనుకుంటున్నారు. శ్రీ విష్ణు బాంబు పేలుళ్ళలో ఎవడో పంకజ్ అని తెలుసుకుని వాడి కోసం వెతకడం మొదలెడతాడు- ఇక్కడే విశ్వసనీయత ఏమిటో తెలిసిపోయింది. పంకజ్ బదులు ఫారుఖ్ అని ఎందుకు  పెట్టలేకపోయారు?  టెర్రరిస్టులుగా హిందువుల్ని కూడా చూపించ వచ్చు.  చాపకింద నీరులా హిందూ  టెర్రరిజం కూడా వుందని భావిస్తే ఆ బాపతు కథతో. 

          మాఫియాలతో ప్రజలు ఇబ్బంది పడరు. ఆ కథల్ని ఎంటర్ టైనింగ్ గా చూపించ వచ్చు. టెర్రరిస్టులతో సామూహికంగా ఇబ్బంది పడుతున్నారు. టెర్రరిజం ఆ మతం ఈ మతం అని లేకుండా ఇంటి గడపల దాకా వచ్చేసి ఇళ్ళల్లో శోకాలు పెట్టిస్తోంది. ఇలాంటప్పుడు ఈ కథల్ని ఎంటర్ టైనింగ్ గా చూపించలేరు. వేరే భాషల్లో చూపించడం లేదు, తెలుగులోనే చూపిస్తున్నారంటే- ఏ మాత్రం బాధ్యత లేకుండా ఈ కథల్ని మామూలు మూస కథల్లా మసాలాలేసి సొమ్ములు చేసుకోవాలన్న యావతోనే. ఇందులో సందేహం లేదు. ఇది టెర్రరిజం కంటే పెద్ద ద్రోహం. ఇందుకే ఇలాటి సినిమాలకి ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్తున్నారు ప్రేక్షకులు కూడా. అయినా ఈ సినిమాలతో వచ్చే నష్టాలకి వేరే కారణాలున్నాయని ఆత్మవంచన  చేసుకుంటున్నారు. 

      జానర్ మర్యాదని పక్కన బెడదాం, ఈ కథ జోకర్ విన్యాసాలతో ఎలా వుందంటే, ప్రారంభమే అట్టహాసంగా ‘గబ్బర్ సింగ్’ టైటిల్ సాంగ్ ని కాపీ కొట్టే చిత్రీకరణతో మా అబ్బాయి గ్రాండ్ ఎంట్రీ. ఆ వెంటనే ఎక్కడిదో పురాతన సినిమా సీనులా ఇంట్లో అమ్మ అక్క నాన్నలకి పనీపాటా లేని మా అబ్బాయితో ముద్దూ మురిపాలు. అక్కపెళ్ళి చూపులు. మా అబ్బాయే ముప్ఫై దగ్గర పడుతున్నట్టు వుంటే, ముప్ఫై దాటిపోయి వుండాల్సిన మా అక్క పెళ్లి ఇప్పుడెందుకు గుర్తుకొచ్చిందో తెలీదు (తర్వాతి  సీన్స్ లో బాంబు దాడులున్నాయి కాబట్టి పెళ్ళికి రెడీ చేస్తున్నట్టుంది, ఇన్నాళ్ళకి పెళ్లి చేస్తున్నట్టూ వుంటుంది, పైగా బాంబు దాడుల్లోపోతే పెళ్లి ఖర్చు తప్పించుకున్నట్టూ అవుతుంది). అక్క వయసు గురించి ఆడియెన్స్ తేడాగా ఫీలవకూడదని, పాత్రధారిని కాన్వెంట్ అమ్మాయిలా వుండేట్టు చూసి తీసుకుని, కళ్ళద్దాలు పెట్టేశారు. ఇక ఆ కాబోయే బావతో  మా అబ్బాయి తుగ్లక్ ఇంటర్వ్యూ. అక్క పెళ్ళికి తన పేరుమీదున్నకోటి రూపాయల ఫ్లాట్ కట్నంగా కూడా  ఇచ్చేసి, మంచబ్బాయి అన్పించుకునే సీను కూడా ఒకటి మర్చిపోకుండా వేసుకోవడం మాఅబ్బాయి. 

          ఇంకో తెల్లారి పొద్దున్నే ఎదురింటి ముందు ముగ్గులేసుకుంటూ తెలుగు సంస్కృతిని ద్విగుణీకృతం చేస్తూ ఐటీ ప్రొఫెషనల్ హీరోయిన్ ఎంట్రీ. మా అబ్బాయి మదర్ మొదటిసారిగా చూస్తున్న ఈ  హీరోయిన్ ముక్కు బావుందని  కీర్తిగానాలు  చేస్తూంటే, సిగ్గు మొగ్గయి పోవడం ఐటీ హీరోయిన్. ఓ తెల్లారి పొద్దునే ఫలహారం తీసుకొచ్చి సత్యనారాయణ  వ్రతం చేశామని అనడం. ఇంత పొద్దునే సత్యనారాయణ వ్రతం చేసుకునే అర్భక ఫ్యామిలీ ఎక్కడిదిరా అని మనం కన్ఫ్యూజ్ అవుతూంటే, తొలిసారి ఇంట్లో కొచ్చిన ఈ కొత్తమ్మాయి చేతికి కాఫీ ఇచ్చి, నిద్రపోతున్న  కొడుక్కి ఇచ్చిరమ్మని పంపుతుంది  మా అబ్బాయి మదర్.  ఈ మదర్ ఆడదేనా అని మనకింకో డౌటు! ఇలాటి మదర్స్ తో జాగ్రత్తగా వుండాలి కొత్తమ్మాయిలు. 

          జానర్ మర్యాదని పక్కన పెడదాం, కథా మర్యాదనే చూద్దాం...ఇక పెళ్లి ఫిక్స్ అయి షాపింగ్ కి వెళ్తారు. షాపింగ్ చేసుకుని వస్తూ సాయిబాబా గుడి కెళ్తారు. అక్కడ ఎడాపెడా బాంబులు పేలి తను చెక్కుచెదరకుండా, అమ్మా నాన్నా అక్కా  మాత్రం దారుణంగా చచ్చిపోతారు. కట్ చేస్తే, దరిద్రం వదిలింది అన్నట్టు వుంటుంది సీను. ఇంకా ఆ విషాదం వంకాయా ఎవడిక్కావాలి- ఎంటర్ టైన్ మెంట్ మూడ్ లోకి వచ్చెయ్యాలి సినిమా! లేకపోతే ఆడదు! 

       కట్ చేయగానే, ఐటీ హీరోయిన్ టిఫిన్ పట్టుకొస్తుంది. మా అబ్బాయి ఫ్రెష్ గా వుంటాడు, టిఫిన్ తినేస్తూంటాడు. ఇంత  జరిగితే నీకు బాధ లేదా?  అని అనాలి కాబట్టి అంటున్నట్టు ఆమె  అంటే, బాధ ఇక్కడ వుంటుంది ఈ గుండెల్లో- ఆ నాకొడుకుల్ని  పట్టుకు చంపుతున్నప్పుడు బయటి కొస్తుంది ఆ బాధ-అని డిక్లేర్ చేసేస్తాడు.  అంటే ఇక నుంచి కథలో జాలీగా వుండాలి కాబట్టి- జోకర్ లా ఆడిపాడి ఎంటర్ టెయిన్ చేయాలి కాబట్టి, బాధ గురించి ఇలా చెప్పేసి- ప్రేక్షకుల్ని సిద్ధం చేశాడన్న మాట తనని చూసి ఎంజాయ్ చేయడానికి. ఇదీ మాఅబ్బాయి అద్భుత క్యారక్టరైజేషన్ ఇంత ఓవర్ బడ్జెట్ సినిమాలో. 

          క్యారక్టర్ ని చంపి కథలో ఎమోషన్ని తీసి పారేశాక- ఇక స్వేచ్చా జీవి అయిపోయాడు మా అబ్బాయి. కానీ  ప్రేక్షకులు మాత్రం ఆ చావుల దగ్గరే ఆలోచిస్తూ వుండిపోతారు. ఇంకా ముందుకెళ్ళి సినిమా చూడ్డానికి మనసంగీకరించదు. సినిమా ఎక్కడో ఫ్లాప్ అవలేదు, ఇక్కడే సీన్ దగ్గరే  ఫ్లాప్ అయిపోయింది ఈ ప్లేటు ఫిరాయింపుతో. ఇంకా మా అబ్బాయి యేమిటి, చనిపోయిన అక్క మా అమ్మాయి అయితే? మా అమ్మాయి చావుకి లెక్క తేలాలన్న ఎమోషన్ లోకి ప్రేక్షకులు జారుకుంటే, మా అబ్బాయి ఎవడు? వీడి వేషాలతో మాకేం పని?

          దర్శకుణ్ణి బ్యాంకాక్ బీచికి ప్రమోట్ చేయాలన్న  ఏకైక లక్ష్యంతో మా అబ్బాయి చక్రం తిప్పడం మొదలెడతాడు- రంగులరాట్నం. ఈ రంగులరాట్నంలో నాంకే వాస్తే ఒక యాక్షన్ సీన్ – ఖుషీ కే వాస్తే ఒక కామెడీ సీన్- మస్తీ కే వాస్తే ఒక లవ్ సీన్- మజాకే వాస్తే ఒక పాట;  మళ్ళీ నాంకే వాస్తే ఒక యాక్షన్ సీన్- ఖుషీకే వాస్తే ఒక కామెడీ సీన్- మస్తీ కే వాస్తే ఒక లవ్ సీన్- మజాకే వాస్తే ఒక పాట; మళ్ళీ నాంకే వాస్తే ఒక... తిప్పి తిప్పి ఇదే తంతు! 

      ఇలా నాంకే వాస్తే, అదికూడా అప్పుడప్పుడు మా అబ్బాయి టెర్రరిస్టులు అనుకుంటున్న వాళ్ళతో యాక్షన్ సీన్స్, ఇక మిగిలినదంతా హీరోయిన్ తో ఖుషీ కోసమే, మస్తీ కోసమే, మజా కోసమే సీన్లు.  

          ఆమె ప్రతీ మాటకీ అబ్బాయ్ అంటుంది- లేకపోతే శ్రీ విష్ణు గ్రాండ్ గా టైటిల్ రోల్ పోషిస్తున్నాడని మనమెక్కడ మర్చిపోతామో అని. ప్రతీ యాక్షన్ సీన్ అయిపోయిన వెంటనే- అబ్బాయ్ అంటూ సెక్సీగా వచ్చి ఒళ్ళు విరుచుకుంటుంది. ఎంత కసిగా వుందీ....దీన్నీ ...అని ఒర్చుకోలేక పోతాడు మా అబ్బాయి. ఇక కామ ప్రకోపిత విప్రలంభ శృంగార విరహతాప కామెడీ. తాళలేక సాంగేసుకుని ఉష్ణ మంతా స్వేదబిందువులయ్యే కేళీ విలాసాలు. చిట్ట చివర్లో ఫార్ములా ప్రకారం విధిగా ఫోక్ సాంగ్ కూడా వేసుకుని మూస మాస్ కి పూర్తి  న్యాయం చేయడం. 

          మనకెలా వుంటుందంటే, ఆ టెర్రరిస్టులు వీళ్ళిద్దర్నీ కాల్చి చంపాలన్పిస్తుంది. ఇలా తమాషా కింద మారిపోయిన మా అబ్బాయి పాత మూస కథ శ్రీవిష్ణుకి గుణపాఠం నేర్పకపోతే ఇంకేదీ నేర్పదు. అసలు మా అబ్బాయి యేంటి? మా అమ్మాయి కాదా? అక్క పెళ్లి కూడా అయిపోయి, మర్నాడు భర్తతో గుడికెళ్ళి టెర్రరిస్టు దాడిలో భర్తతో పాటూ  చనిపోయివుంటే,  అది బలమైన కథ కాదా?  మా అబ్బాయి యేంటి? ఏం పీకాడని? ‘మా అమ్మాయి’ యే నిలబడుతుంది ఈ కథనీ, నిర్మాతనీ.

          దర్శకుడు ఇంకో పని చెయ్యలేదు, తన ఈ మానస పుత్రికని పూరీ జగన్నాథ్ కి అంకిత మివ్వలేదు.

-సికిందర్
http://www.cinemabazaar.in













          

రివ్యూ!



రచన - దర్శత్వం : సుదర్శన్ సలేంద్ర
తారాగణం : రామ్ శంకర్, త్కుమార్, రేష్మీమీనన్, ఆదిత్యమీనన్, ఎం.ఎస్. నారాయణ, పృథ్వీ,  హర్ష దితరులు
సంగీతంః హిత్ నారాయణ్, ఛాయాగ్రహణం : సిద్ధార్థ్ రామస్వామి
బ్యానర్ :
వైబా క్రియేషన్స్
నిర్మాతః దేపా శ్రీకాంత్
విడుదల : మార్చి 17, 2017
***

        పూరీ జగన్నాథ్ సోదరుడు హీరో సాయి రామ్ శంకర్ మార్చి పరీక్షలన్నీ  పనికి రాకుండా పోయాక, రామ్  శంకర్ గా పేరు మార్చుకుని సెప్టెంబర్ పరీక్షకి సిద్ధమయ్యాడు. ఇది కూడా పరీక్ష జరగడమే బాగా ఆలస్యమైపోయి సస్పెన్సులో పడ్డాడు. ఇందులో నటించిన ఎంఎస్ నారాయణే పరమపదించింది 2015 జనవరిలో అయితే, ఈ  సినిమా ఎప్పుడు ప్రారంభమై వుంటుందో వూహించవచ్చు. కాబట్టి అప్పటి మేకింగ్ కి తగ్గట్టే వుంది. పేరు మార్చుకున్నంత మాత్రాన అన్నీ మారిపోతాయని లేదు. ఈ సినిమాలో ఏదీ మారలేదు. అసలు తనే మారలేదు, తనకో తోడు అన్నట్టు తమిళ సీనియర్ హీరో శరత్ కుమార్ కాంబినేషన్ తో వూరించి తనే సైడ్ అయిపోయాడు. ఈ సినిమా శరత్ కుమార్ ది, ఈ కథ శరత్ కుమార్ ది, ఈ ఆట శరత్ కుమార్ ది, ఇదంతా శరత్ కుమార్ దే... ఇది కూడా తెలుసుకోకుండా హీరోని పెట్టి సినిమా తీస్తారా అంటే, ఇలా తీస్తేనే తృప్తిగా వుంటుంది!

         
రత్ కుమార్ క్యారక్టర్ బావుంది. ప్రేమల్లో పెరిగిపోతున్న  మోసాలకి దర్శకుడు కొత్త సినిమాటిక్ పరిష్కారం కనిపెట్టి దాన్ని శరత్ కుమార్ భుజాన వేయడం మాత్రం బావుంది. రెండు వారాల క్రితం ‘చిత్రాంగద’ కథ కూడా బావున్నా, దాన్ని చెప్పడంలో విఫలమైనట్టు, శరత్ కుమార్ తో కూడా బావున్న పాయింటు చెప్పడం కుదరలేదు. కారణం? ఏ పాయింటు నైనా, ఏ కథనైనా ఈజీగా వుండే ఒకే టెంప్లెట్ లో పడేసి రుబ్బడం, అట్టు వేసెయ్యడం. 

          అనాధ హీరో అప్సరస కావాలనుకోవడం, అలాటిది కనపడగానే వెంటపడి టీజ్ చేయడం- చేసి చేసి ఇంటర్వెల్ కి దాన్ని లవ్ లో పడేసుకోవడం, అప్పుడు హీరోకీ- హీరోయిన్ కీ మధ్య ఎక్కడ్నించో విలన్ ఎంటర్ అయి విడదీయడం, ఇంటర్వెల్ తర్వాత హీరోయిన్ కోసం హీరో ఎమోషనల్ గా, ఎనర్జిటిక్ గా, డైనమిక్ గా, కాన్ఫిడెంట్ గా, డేరింగ్ గా, యాక్షన్ ఓరియెంటెడ్ గా, హైపర్ స్టామినాతో, సూపర్ బాడీలాంగ్వేజ్ తో ఫైట్ చేసి గెలవడం...లాంటి అద్భుత టెంప్లెట్ లో ఈ డిఫరెంట్ కథకూడా పడేసుకుని సారమంతా పిప్పి చేశాడు దర్శకుడు.

          రామ్ శంకర్ అనాధ (తెలుగు రాష్ట్రాల్లో యూత్ అనాధ లెందుకై పోతారో అర్ధంగాదు- చంద్రబాబు, కేసీఆర్ లు దీని మీద దృష్టి పెట్టి బడ్జెట్లో కేటాయింపులు చేయడం లేదు). రొటీన్ గా ఇతను ఫైనాన్స్  కంపెనీ రికవరీ ఏజెంటుగా వుంటాడు, ఇలా వుంటేనే ఫైట్లు చెయ్యొచ్చు కాబట్టి. బాకీ వసూలుకి పోతే ఒకింట్లో భర్త లేడనుకుని బాకీ కింద భార్యని వాడుకుందామనుకునే ‘చిలిపితనం’ ఇతడిది. ఇది కామెడీ అనుకోవాలి. మరి తనకి  ‘జాతి అమ్మాయి’ ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని వుంటుంది. ఆ జాతి అమ్మాయి ఎలా వుంటుందో వర్ణనలుంటాయి. వర్ణిస్తూండగానే సినిమా హాలు దగ్గర కనపడుతుంది జాతి అమ్మాయి రేష్మీ మీనన్. వెంటనే ఆమెని డిసైడ్ చేసుకుని మాయమాటలతో పడెయ్యాలని చూస్తూంటాడు. బోటనీ చదివిన జాతిఅమ్మాయి నర్సరీ నడుపుకుంటూ పూల మొక్కల్ని మితిమీరిన సెంటిమెంట్లతో   పెంచుతూ, పూలకీ మనసుంటుందని లెక్చర్లిస్తూ జాతీయంగా వుంటుంది.

       ఈమె వెంట కామెడీ హర్ష కూడా పడతాడు. హర్ష తండ్రి ఎమ్మెస్ నారాయణతో ఏదో కన్ఫ్యూజన్ ఏర్పడి సంబంధం మాట్లాడడానికి రేష్మీ మీనన్ ఇంటికి వెళ్తాడు. అది కాస్తా బెడిసికొడుతుంది. కన్ఫ్యూజన్ తీరి జాతిఅమ్మాయి రామ్ శంకర్ వైపు మొగ్గుతుంది. తనకి అబద్ధాలు చెప్పి నమ్మించాడని అతడ్నీ తిరస్కరిస్తుంది. ఎందుకు అబద్ధాలు చెప్పాల్సి వచ్చిందో బుల్లెట్ షాట్స్ లాంటి డైలాగ్స్  చెప్తాడు. ఆమె బుట్టలో పడిపోయి వచ్చేస్తూంటే, ఎక్కడ్నించో ఒక వ్యాను దూసుకొచ్చి ఎత్తుకెళ్ళి పోతుంది. ఇంటర్వెల్.

          రేష్మీ మీనన్ ని బందీగా పెట్టుకున్న శరత్ కుమార్, రామ్ శంకర్ ని బెదిరించి పనులు చేయించుకుంటూంటాడు. ఏమిటా పనులు? ఎందుకు చేయించుకుంటున్నాడు? అతడి కథేమిటి? ఆ కథ ఎలా ముగిసింది?...ఇవన్నీ తెలుసుకోవాలంటే ‘నేనోరకం’ చూడాల్సిందే.

          చూశాక కలిగే అనుమానమేమిటంటే ‘నేనోరకం’ అనే టైటిల్ రామ్ శంకర్ మీదే  వుందా, లేక శరత్ కుమార్ మీద వుందా? - అని! ఎందుకంటే,  రామ్  శంకర్ నేనోరకం అన్పించుకోవడానికి అలాటి క్యారక్టరైజేషన్ ఏమీ లేదు. శరత్ కుమార్ కే వుంది- అతను అదోరకంగా రివీల్ అయి, అదోరకం పనులు చేయిస్తూంటే. మరి రామ్ శంకర్ ఏం చేసినట్టు? పది నిమిషాల్లో ఈ పనిచెయ్యకపోతే నీ హీరోయిన్ని లేపేస్తా అని శరత్ కుమార్ అనగానే, ఆ పని చెయ్యడానికి పరుగులు తీయడం; చేశాక మళ్ళీ శరత్ కుమార్- ఈ పని చెయ్యకపోతే నీ హీరోయిన్ చస్తుంది అనగానే మళ్ళీ పరిగెత్తడం, ఇంతే! 

          ఆట శరత్ కుమార్ ది, అడే  వాడు రామ్ శంకర్. టోటల్లీ పాసివ్ క్యారక్టర్ అన్నమాట. కథ- కథనం- డైలాగులు- గోల్ -ఆర్డర్లు -అన్నీ శరత్ కుమార్ వే. రామ్ శంకర్ కి కనీసం తిరగబడి హీరోయిన్ని విడిపించుకోవాలన్న ఆలోచనగానీ, గోల్ గానీ వుండవు. ఏమంటే హీరోయిన్ ప్రాణాలతో వుండాలని పరుగులు తీస్తున్నాననుకోవడం. దాంతో తన లవ్ చాలా బలమైనదని అన్పించుకునే ప్రయత్నం చెయ్యడం. ఇదంతా ఎమోషనే కదా అనుకోవడం. ఈ ఎమోషన్ తో ప్రేక్షకుల సానుభూతి పొందుతున్నాను కదా అనుకోవడం. 

        ఎక్కడైనా ప్రేమించినమ్మాయి వాడెవడో చెయ్యమన్న పనులన్నీ చేస్తూ  తనని కాపాడుకోవాలనుకుంటుందా? తెలివితో వాణ్ణి ఎదిరించి పైచేయి సాధించేవాడు తన నిజమైన ప్రియుడనుకుంటుందా? ఎవరిక్కావాలి బానిసల ఎమోషన్? ఎక్కడికి పోతున్నాయి తెలుగు హీరోల పాత్రచిత్రణలు? ఏది ఎమోషన్? ఏది ఫీలింగ్?  అసలేమైనా తెలుస్తోందా?

        అసలీ శరత్ కుమార్ కథ అయినా ఏంటో ఎంతకీ  తెలీక – సినిమాలో ఏది ఎందుకు జరుగుతోందో అర్ధంగాక- మనం పాసివ్ గా చూస్తూంటే, చివరి పది  నిమిషాల్లో కథ చెప్తాడు దర్శకుడు. శరత్ కుమార్ ఇలా చేయడానికి కారణం ఇప్పుడు ఈ ఆఖరి నిమిషాల్లో మనకి తెలిసి హుషారు తెచ్చుకుంటాం. ఎందుకంటే, కారణం అంత బావుంటుంది. ఈ కారణాన్ని కథలో సకాలంలో ఎప్పుడు ఎలా ఓపెన్ చేసి, దీన్నొక  ఆకట్టుకునే బలమైన సినిమాగా తీర్చి దిద్దవచ్చో దర్శకుడు తెలుసుకోలేకపోయాడు. ఈ కథ డిమాండ్ చేసే స్ట్రక్చర్ ని తెలుసుకోకుండా, మూస టెంప్లెట్ ని   నమ్ముకోవడం ఒకటి, ఎండ్ సస్పెన్స్ కథనం చెయ్యడం ఒకటీ- ఈ రెండూ కలిసి ఒక మంచి బర్నింగ్ పాయింటుని మంటగలిపాయి. 

          ఈ టెంప్లెట్ లో ఫస్టాఫ్ తిరగమోత లవ్ ట్రాక్ అంతా వేస్ట్. ఫస్టాఫ్ లేకపోయినా సరిపోతుంది. ఈ టెంప్లెట్ కుంపట్ల వల్ల ఎంత నష్టం జరుగుతోంటే తెలుసుకోకపోతే ఎవరేం చేయగలరు. ఎక్కడైనా హీరోకి కథ లేకుండా కమర్షియల్ సినిమా వుంటుందా? చేసిన కథలో ఇది కూడా చూసుకోకుండా చేస్తే ఎవరేం చేయగలరు. 

          ఫస్టాఫ్ లోనే అంతోటి ప్రేమకథకి నాల్గు పాటలు. దాదాపు ఫస్టాఫ్ అంతా ప్రేక్షకులు స్మార్ట్ ఫోన్లు చూసుకుంటూ బిజీగా వుంటున్నారు. అయితే ఒకటి- ఏనాడో మొదలెట్టిన సినిమా ఈనాడు విడుదలైంది కాబట్టి దీన్ని ఆనాటి ప్రమాణాలతోనే చూడాలి. కానీ ఆనాటి  ప్రమాణాల మధ్య ఇంత మంచి యూత్ బర్నింగ్ పాయింటు నాశనమయ్యిందే అన్నదే బాధ!

-సికిందర్



15, మార్చి 2017, బుధవారం

రివ్యూ!



రచన – దర్శకత్వం : కార్తీక్ నరేన్
తారాగణం : రెహమాన్, ప్రకాష్ విజయరాఘవన్, అశ్విన్ కుమార్, అంజనా జయప్రకాష్, యషికా ఆనంద్, శరత్ కుమార్, వినోద్ వర్మ, కునాల్ కౌశిక్ తదితరులు
మాటలు : శ్రీరాం ప్రసాద్ గోగినేని,  సంగీతం : జేక్స్ బిజోయ్, ఛాయాగ్రహణం : సుజిత్ సరంగ్, కూర్పు : శ్రీజిత్ సరంగ్
బ్యానర్ :
శ్రీ తిరుమ తిరుపతి వెంకటేశ్వ ఫిలింస్
నిర్మాత : చదలవాడ పద్మావతి
విడుదల : మార్చి 10, 2017

***


        ప్పుడు కొత్తగా వస్తున్న దర్శకుల్లో అనేకులు  అరిగిపోయిన రోమాంటిక్ కామెడీలతో,  హార్రర్ కామెడీలతో టైం పాస్ చేస్తూంటే, కొందరు తెలివైన షార్ట్ ఫిలిం మేకర్లు ఈ చాదస్తాలు మానుకుని,  రియలిస్టిక్ క్రైమ్ తో కొత్త పుంతలు తొక్కుతూ యువప్రేక్షకుల్ని తమ వైపు
తిప్పేసుకుంటున్నారు. రోమాంటిక్  కామెడీలతో, హార్రర్ కామెడీలతో విసిగిన ప్రేక్షకులు వీళ్ళ సినిమాలపైపు తరలిపోతున్నారు. మంచి ఓపెనింగ్స్ తో, మౌత్ టాక్ తో, సంచలనాలతో, 
చిన్న - మధ్య తరహా సినిమాల మార్కెట్ ని షార్ట్ ఫిలిం మేకర్లు తన్నుకు పోతున్నారు. మీనింగ్ ఫుల్ సినిమాలకి వీళ్ళు కొత్త అడ్రెస్ అవుతున్నారు, బిజినెస్ అడ్డాగా మారుతున్నారు. 
       
       కార్తీక్ సుబ్బరాజ్, అశ్విన్ శరవణన్, సుజిత్, సంకల్ప్ రెడ్డి, లోకేష్ కనక రాజ్, ఆల్ఫోన్స్ పుతరేన్, కార్తీక్ నరేన్...లాంటి షార్ట్ ఫిలిం మేకర్లు క్రైమ్ జానర్ తో కొత్త ప్రయోగాలు చేస్తూ దేశ దృష్టిని ఆకర్షిస్తున్నారు.  ఇప్పుడు వచ్చేసి కార్తీక్ నరేన్ తమిళంలో ‘ధురువంగళ్ పతినారు’ – (తీవ్రతలు పదహారు)- ని ఇంకో మెట్టు పైకి తీసికెళ్ళి యూరప్ కి చెందిన నియో నోయర్ క్రైం మిస్టరీ జానర్ తో  తన ప్రయోగం చేసి చూపించాడు. యూరోపియన్ జానర్స్ తో దేశీయంగా ప్రయోగాలు చేయాలంటే క్రైంజానర్ లో మాత్రమే సురక్షితంగా చేసి బయటపడగలమని సంకేతం పంపాడు. 2015 లో  తమిళంలో ‘మాయ’ (‘మయూరి’) అనే హార్రర్ తో అపూర్వంగా యూరోపియన్ జానర్ ని ఇండియనైజ్ చేయగల్గిన అశ్విన్ శరవణన్ తర్వాత, కార్తీక్ నరేన్ సక్సెస్ అయ్యాడు. తెలుగులో ‘16- ఎవ్విరీ డిటెయిల్ కౌంట్స్’  ( ప్రతీ ఆధారం కీలకమే) గా డబ్బింగ్ చేసిన ఈ క్రైం మిస్టరీ- తెలుగులో అపరాధపరిశోధక కథలతో సినిమాల్ని నోచుకోని ప్రేక్షకులకి ఇదొక అవకాశం. మరుగున పడిపోయిన జానర్స్ ని అలాగే తొక్కి వుంచి, అరటితొక్క సినిమాలతో ప్రేక్షకుల్ని మభ్య పెట్టే కాలం అంతరించిపోతోంది... లోపలినుంచి మార్పు రాకపోతే బయటి నుంచి షార్ట్ ఫిలిం మేకర్లనే దూతల్ని  పంపి కచ్చితంగా మార్పు తీసుకొస్తుంది కాలం...

కథ 
      ఒక రిటైర్డ్ పోలీస్ ఇన్స్ పెక్టర్,  పోలీస్ శాఖలో చేరాలనుకుంటున్న ఇంకో యువకుడికి చెప్పుకొచ్చే ఒక పెండింగ్ కేసు వివరాల కథ ఇది. ఐదేళ్ళ క్రితం ఈ కేసులో నిందితుల్ని  పట్టుకునే ప్రయత్నంలో కాలు పోగొట్టుకుని ఉద్యోగానికి దూరమైన ఇన్స్ పెక్టర్ దీపక్ (రెహమాన్), ఐపీఎస్ అవాలనుకుంటున్న అశ్విన్ (అశ్విన్ కుమార్) అవగాహన కోసం చెప్పుకొచ్చే ఈ కేస్ డిటెయిల్స్ ప్రకారం - ఓ వర్షపు రాత్రి ఒక అపార్ట్ మెంట్ లో మాస్కు ధరించిన వ్యక్తి ఇద్దర్ని షూట్ చేస్తాడు. వాళ్ళు  శృతి (యషికా ఆనంద్), రాజీవ్  (కునాల్ కౌషిక్ )అనే లవర్స్. అదే రాత్రి వర్షంలో ప్రవీణ్, మనో, ప్రేమ్ అనే ముగ్గురు ఎంబీఏ స్టూడెంట్స్  తాగి కారులో వస్తూ ఒకణ్ణి గుద్దేస్తారు. వాడు చచ్చిపోతే డిక్కీలో వేసుకెళ్ళిపోతారు. దారిలో ట్రాఫిక్ పోలీసులు ఆపితే ఆ ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్ మీద దాడి చేసి తప్పించుకుంటారు. యాక్సిడెంట్ స్పాట్ లోనే అక్కడే ఇంకొకడు రివాల్వర్ తో కాల్చుకుని చచ్చిపోయాడని పేపర్ బాయ్ వెళ్లి పోలీసులకి చెప్తాడు.  అదే  పేపర్ బాయ్ యాక్సిడెంట్ దృశ్యం కూడా చూశానని చెప్తాడు. ఉదయానికల్లా ఈ కాల్పులు, యాక్సిడెంట్ సంఘటన ఇన్స్ పెక్టర్ దీపక్ కి రిపోర్టయి దర్యాప్తు మొదలెడతాడు. అపార్ట్ మెంట్ లో రక్తం వుంటుంది గానీ శృతి కన్పించదు. శృతి ఫ్రెండ్ వైష్ణవి (అంజనా జయప్రకాష్) తను ఉదయమే వూర్నుంచి వచ్చానంటుంది. బయట కాల్చుకుని ఆత్మ హత్య చేసుకున్నట్టు వున్న శవం క్రిష్ దని తేల్తుంది. 

          ఇలా ఇన్స్ పెక్టర్ దీపక్ కి ఇప్పుడు ఒక యాక్సిడెంట్, సూసైడ్ కేసులతోబాటు, శృతి అదృశ్యం అనే మూడు సంఘటనలూ అంతుచిక్కని  మిస్టరీగా మారతాయి. ఈ మూడింటికీ వున్న పరస్పరసంబంధం తేల్చడానికి దర్యాప్తు తీవ్రతరం చేస్తాడు. ఇందుకు కొత్తగా చేరిన కానిస్టేబుల్ గౌతమ్ (ప్రకాష్ విజయరాఘవన్) తోడ్పాటుగా వుంటాడు. ముగ్గురు స్టూడెంట్స్ పాత్ర, డిక్కీలో మాయమైన శవం, క్రిష్ ఆత్మహత్య, ఎవడో సైకో కిల్లర్ వున్నాడన్న అనుమానం, ఆఖరికి వైష్ణవి ప్రవర్తన కూడా అనుమానాస్పదంగా మారి,  చిక్కుముళ్ళు పెరుగుతూ పోతూంటాయి.

          ఈ మిస్టరీని దీపక్ ఎక్కడిదాకా ఛేదించ గల్గాడు? ఎందువల్ల అతడి కాలు విరిగింది? అతడి  అర్ధాంతర రిటైర్ మెంట్ తర్వాత  కేసు ఏమైంది?...ఇవన్నీ దీపక్ చెప్పుకొచ్చే ఫ్లాష్ బ్యాక్ లో తెలుస్తాయి. 

 
ఎలావుంది కథ 
      ప్రధానంగా ఏమిటంటే, ఇప్పుడు సమాజంలో ఇంకో ప్రపంచముంది. అది బాగా డబ్బున్న వాళ్ళ చీకటి ప్రపంచం. గ్లోబలైజేషన్ ఫలాలు విరివిగా  వచ్చి పడుతూ దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వందల, వేలకోట్లు సునాయాసంగా గడిస్తూ ఆ సంపదని ప్రదర్శించుకుంటున్న నయా సంపన్నుల జీవన శైలి నేరమయమవుతోంది. నైట్ లైఫ్ అని ఏర్పాటు చేసుకుని పాల్పడే  కార్యకలాపాలు తెలియకుండానే క్రైంకి దారి తీస్తున్నాయి. ఇలా కేసుల్లో  ఇరుక్కుని పడే పాట్లు ఇప్పుడు ఈ జానర్ లో సినిమాలకి కొత్త కథలవుతున్నాయి. గతసంవత్సరం ముంబాయిలో షీనా బోరా మర్డర్ కేసు ఇలాటి హై  ప్రొఫైల్ కేసే. షైతాన్, కహానీ- 2, పింక్ ఇలాటి హై ప్రొఫైల్ కేసులతో కథలే.  తెలియని ఇంకో ప్రపంచాన్ని తెరచి చూపిస్తూ ఇవి ప్రేక్షకాదరణ పొందుతున్నాయి.  కాలంతో సంబంధం లేకుండా రొటీన్ గా మధ్యతరగతి అప్పారావో, ఇంకో బస్తీ శీనో క్రిమినల్స్  అవడం కొత్తదనం లేని, నేత్రానందం కల్గించని  పాత మూస ఫార్ములా లేజీ కథలు. నియో రిచ్ క్రిమినాలిటీ నేత్రానందం కల్గించే ఇంటలిజెంట్  కథలు, పోలీస్ ప్రొసీజురల్ కథలు. క్రైం ఇన్వెస్టిగేషన్ ఆధారిత అపరాధ పరిశోధక కథలు. ఇలాటిది ‘తని ఒరువన్’ వచ్చింది. కానీ అది రియలిస్టిక్ కాదు- ఇన్వెస్టిగేషన్ లో లాజిక్ ని ఎగేసి స్టార్ ని ఎలివేట్ చేసే ఫార్ములా మూస. 

          ప్రస్తుత కథ ఉన్న స్టార్ ని కాదు కదా, అతడి ఇన్స్ పెక్టర్ పాత్రని సైతం బిల్డప్పులతో కృతకంగా మార్చని సహజ కథ. నిజజీవితంలో పోలీసులు, నిందితులు, ఇతర్లు ఎలా వుంటారో అలాగే చూపించే వాస్తవిక కథ.

         దీన్ని నియో నోయర్ క్రైం మిస్టరీ జానర్ లోకి కూర్చారు. నియో  నోయర్ జానర్ ఈమధ్యకాలంలో పరిచయమైంది గానీ, దీని పూర్వ రూపం ఫిలిం నోయర్ గా వుండేది. 1940-50 లలో ఒక ఊపు వూపిన బ్లాక్ అండ్ వైట్ ఫిలిం నోయర్  సినిమాలు క్రైం జానర్ ని కొత్తమలుపు తిప్పాయి. యూరప్ లోని ఫ్రాన్స్ లో ప్రారంభమైన ఈ ఉద్యమం జర్మన్ విజువల్ టెక్నిక్ ని కలుపుకుంది. ఆ  విజువల్ స్టయిల్ వచ్చేసి జర్మన్  ఎక్స్ ప్రెషనిస్ట్ సినిమాటోగ్రఫీ నుంచి వచ్చింది. తెలుపు నలుపు నీడలతో నేరమయ వాతావరణాన్ని, నేరగాళ్ళనీ  ఒకలాంటి ఏవగింపుతో  చూపించే వాళ్ళు. దీన్ని హాలీవుడ్ అందిపుచ్చుకుని దున్నుకుంది. 1960-70 లలో మారిన కాలమాన పరిస్థితుల ననుసరించి నియో నోయర్ గా నవీకరణ చెందింది ఈ జానర్. ఈ కథలు  నేరాన్ని పరిశోధించే ఒక పోలీసు అధికారి కేంద్రంగా వుంటాయి. మంచి పౌరుడే, కానీ బాగా డబ్బుండడం వల్ల వెధవ పన్లు చేసి నేరంలో ఇరుక్కుంటాడు- ఇలాటి పాత్ర ఒకటి, ఇంకా నీతిలేని ఆడా మగా పాత్రలు కొన్ని, చట్టాన్ని కిందామీదా చేసే వాళ్ళు కొందరు, అనుమానితులు మరికొందరు...ఇలా చుట్టూ వుండే సామాన్య ప్రపంచానికి భిన్నంగా  కరుడుగట్టిన, ఏవగింపు కల్గించే  నీతీ రీతీ లేని పాత్రలతో నిండి వుంటాయి. 

         1944 లో బిల్లీ వైల్డర్ దర్శకత్వం వహించిన ఫిలిం నోయర్ క్లాసిక్ ‘డబుల్ ఇండెమ్నిటీ’ ఆధారంగా మహేష్ భట్ రాసిన ‘జిస్మ్’ (బిపాషా బసు, జాన్ అబ్రహాం) నియో నోయర్ కి ఉదాహరణ. ఇంకా హిందీలో మక్బూల్, కమీనే, జానీ గద్దర్, మనోరమ సిక్స్ ఫీట్ అండర్,  మలయాళంలో అరణ్య కాండం, కన్నడలో అపరిచిత...లాంటివి వచ్చాయి. 

          మనుషులు బతికే హడావిడిలో జీవించడం మానేస్తారు, జీవించాల్సి వచ్చేటప్పటికి చెడిపోతారు. ‘భజగోవిందం’ లో ఆది శంకరాచార్య చెప్పినట్టు – దుఃఖ నివృత్తికోసం సంపాదిస్తారు, సుఖప్రాప్తి కోసం సంపదని అనుభవిస్తారు. కానీ సుఖ సంతోషాలనేవి తమలోనే వుంటాయని మర్చిపోతారు- నువ్వు స్పిరిచ్యువల్ జర్నీ కోసం ఈ భూమ్మీదికి రాలేదు, ఆ ఆత్మే మానవ అనుభవం కోసం నీ శరీరంలో చేరింది- దానికి మంచి అనుభవాన్నిచ్చి మోక్షమార్గం పట్టించు- ఇలా డెప్త్ లో ఈ స్పిరిచ్యువల్ మేసేజే  వుంటోంది ఇలాటి కథల్లో. 

          ప్రస్తుత కథ ఈ చట్రంలో ఈ జానర్ లోనే వుంది. దర్శకుడు ఉద్దేశపూర్వకంగా ఈ జానర్ ని దృష్టిలో పెట్టుకునే చిత్రీకరణ జరిపి, సౌండ్ డిజైనింగ్ కూడా చేశాడని తెలిసిపోతూంటుంది. హై ప్రొఫైల్ ఎంబీఏ స్టూడెంట్ల జీవనశైలి, దాంతో అరిష్టాలు; హైప్రొఫైల్ బాయ్ ఫ్రెండ్- గర్ల్ ప్రెండ్ ల మల్టిపుల్ రిలేషన్ షిప్స్,  వాటి  పర్యవసానాలు...కప్పిపుచ్చుకునేందుకు అబద్ధాలు, తప్పించుకునేందుకు ఎత్తుగడలు...వీటన్నిటినీ జానర్ మర్యాద చెడకుండా చిత్రించారు.

ఎవరెలా చేశారు 
       దీపక్ పాత్రలో రెహమాన్ కూల్ గా నటిస్తాడు. ఎప్పుడూ గట్టిగా కూడా మాట్లాడడు. ఒక ఇన్స్ పెక్టర్ గా దురుసుగా కూడా ప్రవర్తించడు. ఇంగ్లీషు ఎక్కువ మాట్లాడతాడు. కాస్త మతిమరుపు కూడా వుంటుంది. ఇందుకే తోడుగా కానిస్టేబుల్ ని పెట్టుకుంటాడు. ఈ మతిమరుపు అనే లక్షణం కథని ఏ మలుపూ తిప్పకుండా  వృధా అయింది. దర్యాప్తు సందర్భంగా ఎక్కడో ఏదో చూసి మర్చిపోయి వుంటే- అదే కీలకం అయివుంటే- ఈ క్రైం డ్రామా ఇంకా రక్తి కట్టేది. ఇలాంటిది లేకపోగా, ఎప్పుడో  ఐదేళ్ళ తర్వాత ఈ కేసుగురించి అంత పూస గుచ్చినట్టు ఎలా చెప్తాడా అన్న సందేహం  కల్గిస్తుంది ఈ మతిమరుపు లక్షణం. పాత్ర చిత్రణ దెబ్బతింది. 

          రెండో ముఖ్యపాత్రలో కానిస్టేబుల్ గా నటించిన  ప్రకాష్ విజయరాఘవన్ ది షార్ప్ బ్రెయిన్. దీన్ని దర్యాప్తుని ముందుకు తీసుకుపోవడానికి వాడుతూంటాడు. చివర్లో కథని ముగిస్తూ ట్విస్టు ఇచి,  అప్పుడు రిటైరైన ఇన్స్ పెక్టర్ నే కంగు తినిపిస్తాడు. స్టూడెంట్లుగా నటించిన ముగ్గురూ కూడా సహజ పాత్రల్లా వుంటారు. వాళ్ళ పదజాలం కూడా వాళ్ళ జీవితాలకి తగ్గట్టే వుంటుంది. సినిమా డైలాగులు అన్ని జానర్లకీ  ఒకే రొడ్డ కొట్టుడుగా, రసవిహీనంగా, కృత్రిమంగా వుంటున్నాయనేది తెలిసిందే. ఏ సినిమాలో చూసినా ఫ్రెండ్స్ – బావా, మామా అని పిల్చుకునే రోత ఒకటి కంటిన్యూ అవుతోంది. ఇక్కడ ఫ్రెండ్స్ క్యారక్టర్స్ తో ఈ ఊచకోత మనకి వుండదు. ఫ్రెష్ గా, ఆసక్తికరంగా వుంటుంది. ఈ కథ ఉన్నతవర్గాల చీకటి లోకాల్ని వాస్తవిక దృష్టితో ఆవిష్కరిస్తోందనుకుంటే- ఆ వాస్తవికతని ఆ లైఫ్ స్టయిల్ తోనే ఓపెన్ చేసి థ్రిల్ చేయాలి- అంతేగానీ ఇక్కడా రొటీన్ మూస ఫార్ములా రాతలు రాసుకుంటే నియో రిచ్ క్యారక్టర్స్ గురించి ఏం చెప్తున్నట్టు? తెలియనిది ఏం వెల్లడిస్తున్నట్టు? 

          ఇతర పాత్రల్లో నటించిన వాళ్ళందరూ ఓకే. టెక్నికల్ కెమెరా వర్క్ సరే, ఇదొక  విజువల్ డిజైన్ తో వుంది- పాత్ర కదుల్తోంటే కెమెరా కూడా కదలడం. అలాగే సౌండ్ ఎఫెక్ట్స్, బిజిఎం షాక్ వేల్యూతో వున్నాయి. ఇక ఎడిటింగ్ అయితే అత్యంత షార్ప్ గా వుంది. ఎక్కడా గిమ్మిక్కులు చేయలేదు. దృశ్య కాలుష్యాన్ని సృష్టించ లేదు. 

         22 ఏళ్ల ఇంజనీర్ కం షార్ట్ ఫిలిం దర్శకుడు కార్తీక్ నరేన్ తొలి సినిమాతోనే  ఇంత  పరిణతి చూపించడం ఒక వండర్. ఆర్టిస్టుల చేత నటనని తీసుకోవడంలోగానీ, మాట్లాడించడంలో గానీ చాలా మెచ్యూరిటీని కనబర్చాడు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ని రియలిస్టిక్ గా చూపిస్తూ, ఏ ఘట్టాన్ని ఎలా చిత్రీకరించాలో అనుభవజ్ఞుడుగా నిర్ణయించుకుంటూ ప్రొఫెషనల్ లా ఒక క్వాలిటీ మూవీని ఇచ్చాడు. తనని నమ్మి నిర్మాతలు ఎవరూ ముందుకు రాక పోయినా తనే తిప్పలుపడి నిర్మాతగా మారాడు.

  చివరికేమిటి 
        దర్శకుడు ఇంటలిజెంట్ గా వుండాలని కోరుకుంటారు ప్రేక్షకులు, లేజీ రైటింగ్ తో నేలబారుగా, సగటు జీవిలా వుండాలనుకోరు. లేకపోతే రోమాంటిక్ కామెడీలకీ, హార్రర్ కామెడీలకీ ఈ గతే పట్టించరు ప్రేక్షకులు.  దర్శకుడు కార్తీక్ ఇంటలిజెంట్ గా రాత పని పూర్తిచేశాడు. 28 రోజుల్లో తీత పని ముగించేశాడు. అపరాధపరిశోధక కథని పాటలు, కామెడీ, ఫైట్లు అనే ఆకర్షణలకి లోనవ కుండా పోలీస్ ప్రొసీజురల్ కథా లక్షణానికి కట్టుబడి, వీలైనంత ప్రొఫెషనలిజం కనబర్చాడు. ఇన్వెస్టిగేషనే ప్రధానంగా నడిచే ఈ కథాక్రమంలో అంచెలంచెలుగా లభిస్తున్న సాక్ష్యాధారాల్ని జానర్ రీత్యా ప్రేక్షకుల మీద ప్లే చేస్తూ-  అసలేం జరిగింది? అన్న ప్రశ్న చుట్టూ పజిల్ నీ, మెదడుకి మేతనీ ప్రేక్షకులకి పంచుతూ,  ప్రేక్షకులు యాక్టివ్ గా, బిజీగా  సినిమా చూసేట్టు చేయాలనీ విశ్వప్రయత్నం చేశాడు. ఇందులో సందేహం లేదు. (అరటితొక్క, ఇడ్లీ మూస సినిమాలు చూసి చూసి వున్నవే  కాబట్టి,  వాటిని పాసివ్ గా, బోరుకొట్టించుకుంటూ లేజీగా, బద్ధకంగా,  సీట్లలో పడుకుని వుండిపోయి ప్రేక్షకులు చూసే దౌర్భాగ్య దృశ్యాలు మనకి కన్పిస్తూంటాయి). అడుగడుగునా దృష్టి మరల్చలేని సస్పెన్సు ని  పోషిస్తూ,  చివరిదాకా ఒకే టెంపోతో తీసికెళ్లే ప్రయత్నం చేశాడు ఈ గంటా ఐదునిమిషాల సేపూ. 

          అయితే పోలీస్ ఇన్వెస్టిగేషనే  కథ అయినప్పుడు అందులో లొసుగులు కన్పించకూడదు. ప్రేక్షకులు పసిగట్టేసే ఆ లొసుగులతో విచారణాధికారి సిల్లీగా కన్పిస్తాడు. ఒకవేళ అతను  కేసుని తిమ్మినిబొమ్మిని చేయడానికే  లొసుగుల్ని పట్టించుకోవడం లేదనే అర్ధంలో వుంటే అదివేరు. అయినా వాటన్నిటికీ చివర సమాధానం చెప్పాల్సిందే. లేకపోతే సమగ్ర కథవదు. 

          ఎవ్విరీ డిటెయిల్ కౌంట్స్ అన్నప్పుడు ప్రేక్షకులకి కళ్ళ ముందు కన్పించే ఏ డిటెయిల్ నీ వదలకూడదు- అధికారి రికార్డు చేయాల్సిందే. రికార్డు చెయ్యక, చివర్లో ఎక్స్ ప్లనేషన్ ఇవ్వకా  వదిలేస్తే, అది  కథ చేయలేక దర్శకుడు తప్పించుకున్నట్టే అవుతుంది. ఇంత చిన్నవయసులో ఇంత సినిమా తీసినందుకు తప్పకుండా దర్శకుడు అభినందనీయుడే. కొన్ని తప్పులు చూపి అతణ్ణి డీగ్రేడ్ చేయలేం. ఈ జానర్ లో అతను మాస్టర్. చిన్న చిన్న లాజిక్కులు పెద్దగా లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు- ఈ జానర్ లో కథాకథనాలు తప్పనిసరిగా లాజికల్ గా పటిష్టంగా వుండాలన్న నియమం వున్నప్పటికీ. కానీ ఆ లొసుగులు భూతాల్లా కన్పిస్తూ మొత్తం కథనే క్యాన్సిల్ చేస్తున్నవైతే, తప్పకుండా వాటి గురించి చెప్పుకోవాలి.

          1. షాట్స్, 2. ఎటాక్, 3. సెటప్. వీటి లోపాలు స్పష్టంగా ప్రేక్షకులకి తెలిసిపోతూంటాయి. షాట్స్ - అపార్ట్ మెంట్ లో సైకో కిల్లర్   రివాల్వర్ పేల్చినప్పుడు ఆ షాట్స్ థియేటర్ దద్దరిల్లేలా మాంచి సౌండ్ ఎఫెక్ట్ తో ప్రేక్షకుల్ని అదరగొడతాయి. మరి అవే  షాట్స్ అపార్ట్ మెంట్లో ఎవరికీ విన్పించవా? పక్క ఫ్లాట్లో వాళ్ళకీ? తెల్లారి ఇన్స్ పెక్టర్ వచ్చి చూసినప్పుడు ఈ షాట్స్ గురించి ఎవర్నీ అడగడా? మతిమర్పుపు కాబట్టి మర్చిపోయాడా? అలా అన్పించదు. 

          ఎటాక్ – స్టూడెంట్స్ యాక్సిడెంట్ చేసి, చచ్చిన వాణ్ణి డిక్కీలో వేసుకు పారిపోతూ ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్ కి దొరికినప్పుడు, అతడి మీద ఎటాక్ చేసి పారిపోతారు. ట్రాఫిక్ పోలీసుని కొడితే పెద్ద కేసవదనీ, ఈ కారు ఆంధ్రా రిజిస్ట్రేషన్ అనీ, వాళ్ళు కనుక్కుని వచ్చేటప్పటికి మూడ్రోజులు పడుతుందనీ, ఈ లోగా శవాన్ని వదిలించుకోవచ్చనీ వూపిరి పీల్చుకుంటారు.

          ట్రాఫిక్ పోలీసుని కొట్టినా పెద్ద కేసవదని డైలాగు వుండడం అభ్యంతరకరమే. ఇది నిజమే కాబోలనుకుని సినిమా  చూసిన వాళ్ళు  అడ్డగోలు డ్రైవింగ్  చేసి ట్రాఫిక్ పోలీసుల్ని కొడుతూపోతే? ఇంకా ఈ సీనులో కొట్టిన తీరు అటెంప్ట్ టు మర్డర్ కిందికొస్తుంది. రెండోది, కారుని  కనుక్కోవడానికి మూడ్రోజులు పట్టదు. నంబర్  కూడా నోట్  చేసుకున్న  ఆ ఇన్స్ పెక్టర్ వెంటనే నైట్ పెట్రోలింగ్స్ ని ఎలర్ట్ చేస్తే, ఏ రూట్లోనో  అప్పుడే దొరికిపోతారు. 

          ఈ ఎటాక్ కూడా ఈ కథకి కీలక ఘట్టమే. కానీ ప్రోమోస్ లో, సినాప్సిస్ లో –ఒక సూసైడ్, ఒక యాక్సిడెంట్ ఇంకో కిడ్నాప్ – ఈ మూడు వేర్వేరు సంఘటనల పజిల్ అంటూ ప్రచారం చేస్తూ వచ్చారు. ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్ మీద ఎటాక్ ని వదిలేశారు. ఇది కూడా కలుపుకుంటే నాల్గు సంఘటనలవుతాయి. నిజానికిది నాల్గు సంఘటనల క్రైం స్టోరీ. అప్పుడు గాయపడ్డ ఆ ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్ తప్పకుండా తన మీద ఎటాక్ ని కంప్లెయింట్ చేస్తాడు- అప్పుడు ఇన్స్ పెక్టర్ దీపక్ ముందు మొత్తం నాల్గు సంఘటన లుంటాయి. ఈ ఎటాక్ ని దర్శకుడు కథకోసం కావాలని ఉపేక్షించినట్టు కనపడుతోంది. ఈ ఎటాక్ ని పరిగణనలోకి తీసుకుంటే తెల్లారే స్టూడెంట్లు దొరికిపోయి కథ ఇంకెటో  పోతుంది. 

        సెటప్- ఈ సంఘటనలు రాత్రిపూట  భారీ వర్షంలో జరుగుతాయి. యాక్సిడెంట్ సంఘటనని తెల్లవారుజాము రెండున్నరకి చూశానని అంటాడు పేపర్ బాయ్ కూడా. అంటే  అప్పుడు కూడా భారీ వర్షం కురుస్తూనే వుంది. ఉదయం ఇన్స్ పెక్టర్ దీపక్  దర్యాప్తు కొచ్చినప్పుడు మాత్రం మచ్చుకి కూడా చుక్క వర్షం పడ్డట్టు లొకేషన్ వుండదు. ఇక్కడ్నించీ పదే పదే చూపించే ఈ లొకేషన్ తో బాటు,  పక్కనే అపార్ట్ మెంట్ వున్న లొకేషన్ కొద్ది గంటల క్రితంవరకూ భారీ వర్షం కురిసిన ఆనవాళ్ళే లేకుండా వుంటాయి. 

          ఒకసారి ఏదో పొరపాటున లొకేషన్స్ కంటిన్యుటీ మర్చిపోయారే అనుకుందాం- రాం గోపాల్ వర్మ ‘వంగవీటి’ లో వర్షం పడ్డ మరుసటి షాట్ కరువుకాటకంతో తల్లడిల్లుతున్న పొడినేలగా వున్నట్టు. కానీ పదే పదే  వర్షం జాడలేని ఆ లొకేషన్లే  చూపిస్తూ కంటిన్యుటీ ఎలా మర్చిపోతారు- ఇది ప్రేక్షకుల పుండు మీద పదే పదే కారం జల్లడమే  అవుతుంది.

          ఈ ప్రధాన లోపాలు మొత్తం కథనే క్యాన్సిల్ చేస్తున్నాయి. కథే వుండేందుకు అవకాశం లేదు. లేని కథని చూపించినట్టయ్యింది. ఎప్పుడైతే రివాల్వర్ షాట్స్ పేల్తాయో అప్పుడే అపార్ట్ మెంట్ లో కలకలం లేస్తుంది. జనం లేచి వచ్చారంటే, బయట సంఘటనలేవీ  జరగవు.  యాక్సిడెంట్ జరగదు, బాయ్ ఫ్రెండ్ క్రిష్ సూసైడ్  సీన్ కూడా క్రియేట్ అవదు. కథే వుండదు. 

          రివాల్వర్ షాట్స్ ఎవరికీ విన్పించకుండా చేసి, అనుకున్న కథ అనుకున్నట్టు వుండే ట్టు చేయాలంటే, ఆ రివాల్వర్ కి సైకో కిల్లర్ సైలెన్సర్ అమర్చుకు రావాలి. అప్పుడు గుట్టు చప్పుడు కాకుండా పనిపూర్తి చేయగల్గుతాడు. కానీ సైలెన్స ర్ రివాల్వర్ ఉపయోగిస్తే ఆడియెన్స్  పక్కలో బాంబులు పడ్డట్టు ట్రెమండస్  సౌండ్స్ ఎఫెక్ట్స్ వుండవు కాబట్టి, దర్శకుడు కథ కంటే కూడా ఈ సౌండ్  ఎఫెక్టే ఇంపార్టెంట్ అనుకున్నట్టుంది.

         యాక్సిడెంట్ ఎపిసోడ్ లో ఆ ఎటాక్ సీన్ అవసరమే లేదు. అది కథకి ఉపయోగపడక పోగా అడ్డుపడుతోంది. ఇక వర్షం కురిపించి  ఒకేసారి దగ్గరదగ్గర ఇన్ని నేరాలు జరుగుతున్నట్టు చూపడమెందుకు? వర్షంతో ఏం పని? ఇందాక సౌండ్ ఎఫెక్ట్స్ గురించి కథని వదిలేసినట్టు, వర్షం మీద కూడా అలాటి ప్రేమని పెంచుకున్నట్టుంది విజువల్స్ బ్రహ్మాండంగా వుంటాయని. తెల్లారి ఆ వర్ష ఛాయలే  లేకుండా చేశారు.  బట్ ఎవ్విరీ డిటెయిల్ కౌంట్స్ అన్నాక, ఘటనా స్థలాల్లో  రాత్రి పడ్డ వర్షం కూడా లెక్కకొస్తుంది. సైకో కిల్లర్ వర్షంలో వచ్చి నేరం చేసినప్పుడు ఆ బురద కీలక సాక్ష్యమవుతుంది. ఫ్లాట్ లో సైకో కిల్లర్ నేరం చేసింది వర్షం పడుతున్నప్పుడు సుమారు అర్ధరాత్రి సమయం. అది శృతి బర్త్ డే సందర్భం. బాయ్ ఫ్రెండ్ రాజీవ్ వచ్చి రింగ్ కూడా తొడిగాడు. అప్పుడే వూర్నించి శృతి ఫ్రెండ్ వైష్ణవి కూడా వచ్చి వుంది. కిల్లర్ ఎటాక్ చేశాడు. అప్పుడు ఇంకేం జరిగిందో సస్పెన్స్ కోసం ఇక్కడాపుతున్నాం. కానీ బాయ్ ఫ్రెండ్ రాజీవ్, వైష్ణవీ, సైకో కిల్లర్ ముగ్గురూ వర్షంలోనే  వచ్చి వుంటే, ఫ్లాట్ లో ఘటనా స్థలం మామూలుగా వుండదు.

          పైగా  ఫోరెన్సిక్ డిపార్ట్ మెంట్ ని కూడా చూపించారు. వాళ్ళూ వర్షాన్ని పట్టించుకోరు. కానీ ఫ్లాట్ గోడ మీద రక్తపు మరకలు బయట కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న క్రిష్ వి అని తేలుస్తారు. ఆత్మహత్య చేసుకున్న రివాల్వర్ మీద అతడి వేలిముద్రలున్నాయంటారు. వర్షంలో వేలిముద్రలు పడతాయా? 

          ఇక శృతి కిడ్నాప్ అయిందని భావించిన ఇన్స్ పెక్టర్ ఆమెని వెతికే ప్రయత్నమే చెయ్యడు.
          ఇదే సమయంలో అపార్ట్ మెంట్ పక్కనే ఇంకో బుల్లి సంఘటన జరుగుతుంది. ఆ వర్షంలో అంత రాత్రి వేరే స్టూడెంట్స్  షార్ట్ ఫిలిం తీస్తూంటారు. ఉదయం మళ్ళీ వచ్చి తీస్తూ ఇన్స్ పెక్టర్ కి దొరికిపోతారు. ఆ కెమెరాలో ముఖ్యమైన విషయం వాళ్లకి తెలీకుండా రికార్డయివుంటుంది, అదివేరే విషయం. కానీ రాత్రి అన్ని ఘోరాలు జరిగిన స్పాట్ కి మళ్ళీ తెల్లారి వచ్చి షార్ట్ ఫిలిం తీస్తారా వాళ్ళూ?

          ఇక అపార్ట్ మెంట్ లో సీసీ కెమెరాలే వుండవు, సెక్యూరిటీ అతను  కూడా రాత్రి డుమ్మా కొట్టానంటాడు. ఇన్స్ పెక్టర్ తేలిగ్గా తీసుకుంటాడు. ఇలా దర్శకుడే ఈ సాక్షులకీ, అనుమానితులకీ, కుట్ర దారులకీ సహకరిస్తూ అసలు సూత్రధారిగా వున్నాడనే పెడర్ధం వచ్చేలా సీన్లు రాశాడు. 

          సమస్య ఎక్కడ వచ్చిందంటే, ఎవ్విరీ డిటెయిల్ కౌంట్స్ అంటూ ఎన్నో డిటెయిల్స్ ఇస్తూ పోయాడు. కొంతసమయానికి ఇక  కథని ఫాలో కాలేనంత  సంక్లిష్టం చేశాడు ఎన్నో  డిటెయిల్స్ తో.  ఫస్టాఫ్ అంతా ఆ క్లూ ఈ క్లూ అంటూ, ఆ సాక్ష్యం ఈ సాక్ష్యం అంటూ ఎంతో ఇన్ఫర్మేషన్ పడేస్తూ పోయాడు. ఇంటర్వెల్ కీ  ఏదీ కొలిక్కి రాదు. మళ్ళీ సెకండాఫ్ లో ఇదే ధోరణి. రిటైర్డ్ ఇన్స్ పెక్టర్ ఈ ఫ్లాష్ బ్యాక్ ముగించే టప్పటికి  ఇన్ని డిటెయిల్స్ తో  కేసు ఎటూ తేలకుండానే వుంటుంది. ఫ్లాష్ బ్యాక్ పూర్తయ్యాక ఈ పెండింగ్ కేసు ఇప్పుడు ఒక ట్విస్టుతో కొలిక్కి వస్తుంది. కానీ దీనికి ముందంతా ఏదీ తేల్చని ఇన్ఫర్మేషన్ హంగామానే. ఎందుకిలా జరిగిందంటే,  దీన్ని ఎండ్ సస్పెన్స్ కథ చేయడం వల్ల. 

          మరి ఈ ముగింపులోనైనా  సందేహాలన్నీ తీర్చాడా అంటే చాలా సందేహాలు తీర్చకుండానే వదిలేశాడు. ఒక ఆంగ్ల పత్రికకి రివ్యూ రాసిన క్రిటిక్ ఇలాటి  సందేహాల గురించి అడిగితే, ఇంకోసారి సినిమా చూస్తే  అర్ధమవుతుందని చెప్పాడు దర్శకుడు. 

          ఇన్వెస్టిగేషన్ లో పోలీసులకి ఎన్నో డిటెయిల్స్ లభించవచ్చు. అవన్నీ కీలకమే అయివుండవు. వాటితో ఎప్పటికప్పుడు అనుమానితుల్ని, సాక్షుల్నీ  ఫిల్టర్ చేసి వదిలించుకుంటూ,  ఒకటో రెండో అంశాలమీద దృష్టిని  కేంద్రీకరించి, కేసుని ఛేదిస్తారు. ఎక్కడైనా ఇంతే జరుగుతుంది. దర్శకుడు కార్తీక్ ఇలా చేసి వుంటే, ఇంత ఇన్ఫర్మేషన్ తో తలబొప్పి కట్టించి వుండే వాడు కాదు. 

         అయితే ముగింపులో సందేహాలు మిగిలే వున్నా- రిటైర్డ్ ఇన్స్ పెక్టర్, ఐపీఎస్ అవాలనుకున్న క్యాండిడేట్-  ఈ ఇద్దరి నిజస్వరూపాలు బయటపడే క్యారక్టర్స్ ట్విస్ట్ మాత్రం భలే వుంది.

-సికిందర్