రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

5, సెప్టెంబర్ 2016, సోమవారం

స్క్రీన్ ప్లే సంగతులు!



స్టార్ సినిమాలతో వున్న సులువు ఏమింటే, ఎలా తీసినా వాటి వ్యాపారం జరిగిపోతుంది, హిట్ టాక్ వచ్చేస్తుంది. ఎప్పుడో స్టార్లుండి కూడా బ్రహ్మోత్సవం, కబాలీ లాంటివి విషయపరంగా మరీ వికటిస్తే పరాభవం తప్పక పోవచ్చు, ఇవి  అరుదుగా ఎదురయ్యే సన్నివేశాలు. విషయపరంగా ఏ మేరకు వికటిస్తే సేఫ్ అనడానికి కొలబద్ద లేదుగానీ, చాలావరకూ విషయపరంగా అర్ధవంతంగా వుండని స్టార్ సినిమాలు హిట్టయి పోతూంటాయి. కారణం స్టార్ పవర్. స్టార్లు ఇద్దరుంటే రెట్టింపు పవర్. కాబట్టి వాటి విజయాలకి వాటి కథా కథనాలు, పాత్రచిత్రణలు కూడా తోడయ్యాయని ఎవరైనా నమ్మితే పొరపాటే. హిట్టయ్యింది కాబట్టి కథాకథనాలు ఇలాగే వుండాలని, పాత్రచిత్రణలూ ఇలాగే వుండాలని భావిస్తే, లేదా కథా కథనాలూ పాత్ర చిత్రణలూ కరెక్టుగా ఇలా కుదరడం వల్లే హిట్టయ్యిందని వాదిస్తే  తప్పులో కాలేసినట్టే. స్టార్ పవర్ ని తీసేసి చూసినప్పుడు ఆ కథా కథనాల, పాత్ర చిత్రణల  బలమెంతో తెలిసిపోతుంది. ‘జనతా గ్యారేజ్’ ఆర్ధిక విజయానికి కారణం ఇదే- స్టార్ పవర్. అందులోనూ డబుల్ స్టార్ పవర్- తప్ప విషయపరంగా చేసిన అద్భుతమేమీ కాదు. డివైడ్ టాక్ ఎందుకొస్తుంది- విషయపరమైన లొసుగుల వల్లే కదా? డివైడ్ టాక్ ని అధిగమించి ‘జనతా గ్యారేజ్’ ఆర్ధిక విజయం సాధిస్తోందంటే అది స్టార్ పవరే. కాబట్టి స్టార్ పవరుంటే చాలు, అంత  చక్కగా స్క్రిప్టు వర్క్ చేసుకోనక్కర లేదని రాతపని సరంజామాతో పాటు మెదడుని  పక్కన పడేస్తే- అన్నివేళలా కలిసి రాకపోవచ్చు. అదొక బ్రహ్మోత్సవమో, కబాలీనో కావొచ్చు. వికటించే రేంజుల్ని బట్టి జాతకాలుంటాయి. 

దురదృష్టవశాత్తూ సినిమాల్లో విషయం ఎంత వికసించాలనిగాక, ఏ రేంజిలో వికటిస్తే మనం సేఫ్ గా వుంటామని ఆలోచించే కాలంలో మనం వున్నాం.  ఈ కథ ఇలా చేస్తే మరీ పాడయిపోతుందా.... అయితే కొంచెం తగ్గించు...తక్కువ పాడు చేసుకుందాం....అనే ధోరణి ప్రబలిన చీకటి యుగంలో వున్నాం. ఇలా తక్కువ వికటించేలా చూసుకునే పనే తప్ప ఎక్కువ వికసించే మాట కాదు. వికాసం, విస్తృతి, నాణ్యతల కంటే కూడా - ఎంత తక్కువ పాడుచేసుకోవచ్చు, ఎంత తక్కువ (ప్రేక్షకుల చేత) తిట్లు తినవచ్చు, ఎంత తక్కువ కెరీర్ కి నష్టం చేసుకోవచ్చనే వాటి మీదే దృష్టి పెట్టి కసరత్తు చేసే నయా క్రియేటర్ల జమానాలో జీవిస్తున్నాం. ఎక్కువ వికాసం గురించి గాక, తక్కువ వినాశం గురించి తపించే నెగెటివిటీ తాండవిస్తున్న ట్రెండ్ ని చవిచూస్తున్నాం. వికాసమంటే ఎంతో కష్టపడాలి, వినాశానికి ఏ కష్టమూ  పడనక్కర్లేదుగా, అందుకని. 

        ‘జనతా గ్యారేజ్’  లో విషయం యే మేరకు సేఫ్ గా వికటించిందీ అంటే,  మనం ఓనమాలు అంటే బేసిక్స్ లోకి వెళ్ళాలి.  మనం ‘తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్’  వ్యాస పరంపరలో భాగంగా మూడో అధ్యాయంలో బేసిక్స్ గురించి చెప్పుకుంటూ,  అసలంటూ ఓ ఐడియా అనుకున్నాక, ముందుగా అందులో కథే వుందా, లేకపోతే  గాథగాని వచ్చి శుభ్రంగా తిష్ఠ వేసిందా పరిశీలించు కోవాలని హెచ్చరించుకున్నాం. ఈ మధ్యే ‘బ్రహ్మోత్సవం’ సినిమా చెప్పాల్సింది కథ అని మర్చిపోయి, ఓ గాథా లహరితో బిగ్ బ్యాంగ్ ఇచ్చి వెళ్ళింది. ఆల్రెడీ ఒకప్పుడు కృష్ణవంశీ ‘మొగుడు’, తో సరిపెట్టకుండా మళ్ళీ,  ‘పైసా’ అంటూ కూడా గాథలతో రెండు బ్యాడ్ టు బ్యాడ్ బ్యాంగు లిచ్చి వదిలారు.  మణిరత్నం సర్ కూడా ‘ఓకే బంగారం’ తో తనదైన వెరైటీ బ్యాంగ్ ఇస్తే, మరో ఇద్దరు దర్శకులు ‘చక్కిలిగింత’ అనీ, ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ అనీ  గాథలందుకుని గాయపడ్డారు. ఆఖర్న  ‘రాజాధిరాజా’ తో కూడా ఈ మధ్యే గాథ బారిన పడి దగాపడి పోయాం. 

       
తెలుగు సినిమాలకి పాసివ్ పాత్రలు, ఎండ్ సస్పెన్స్ కథనాలు అనే రెండు శాపాలు ఇంకా వదలడం లేదు-  ఇక ఇప్పుడు గాథలు కూడా ముచ్చటగా మూడో శాపంగా తోడయ్యియ్యాయి. ఇసుకకీ మట్టికీ తేడా తెలీని వాడు ఇల్లు కట్ట లేనట్టే - కథకీ, గాథకీ తేడా తెలీని వాడు సరైన సినిమా తీయలేడు. దట్స్  బేసిక్స్. 

గాథంటే ఏమిటి?  
      మన్మధ రావు రోడ్డు మీద నడుచుకుంటూ ఏటో పోతున్నాడు... రోడ్లమీద ప్రాణాలకి అంత గ్యారంటీ వుండదు కాబట్టి, వెనకనుంచి ఏదో వాహనం వచ్చి ధభీల్మని గుద్దేసింది. అమ్మో అని గీపెట్టి  కింద పడ్డాడు. ఆ ప్రయాణం రద్దయి, 108 లో అత్యవసరంగా ఇంకో ప్రయాణం కట్టాడు. ఎంచక్కా హాస్పిటల్ బెడ్ నలంకరించాడు. కాలు ఫ్రాక్చరైందని తేలింది. ఫ్రాక్చరైన కాలితో అతను బెడ్ మీద ఎన్ని బాధలు పడ్డాడు, బయటి కొచ్చి ఎంతకాలం ఇంకెన్ని యాతనలు పడ్డాడు, చివరికి కాలు బలపడి మళ్ళీ రోడ్డు మీద ఎంత క్రేజీగా ఎలా నడవసాగాడు- ఈ మొత్తం అనుభవంతో జీవితం గురించి నేర్చుకున్న దేమిటీ అని, సదరు మన్మధరావు తోటి నవీన్ కుమార్ కి   చెబుతోంటే అది గాథ. నవీన్ కుమార్ కి బోరు కొట్టింది. కారణం, ఇందులో ఏముందని ఆసక్తి కల్గించడానికి మన్మధరావు గాయం బాపతు  సోది  తప్ప- కాబట్టి గాథ అనేది ఏదో విషయం మీద స్టేట్ మెంట్ ఇచ్చిన స్థాయిలోనే  వుండిపోతుంది. నేనిలా అనుకుంటే నాకిలా జరిగి ఇలా మిగిలానబ్బా, ఏమంటావ్?-  అని విధికి తలవంచిన మనిషిలా  ఒక పరాజితుడిగా చెప్పేసి వెళ్ళిపోవడం.

కథంటే?
     అదే మన్మధరావు బైక్ మీద అర్జెంటుగా పెళ్లి చూపులకి పోతున్నాడనుకుందాం. వెనుక నుంచి కారొచ్చి గుద్దేసింది. ఎగిరి కింద పడ్డాడు. కాలు విరిగింది. ఎవడ్రా  నన్ను గుద్దిందీ -అని లేవబోయే లోపే కారు వెళ్ళిపోయింది. మన్మధ రావు విరిగిన కాలుతోనే దాని వెంటబడ్డాడు. ఎవరో ఆపి హాస్పిటల్ కి తీసి కెళ్ళారు. ఫ్రాక్చరైన కాలుకి బ్యాండేజీ పడింది. పెళ్లి సంబంధం రద్దయ్యింది.  నా పెళ్లి పాడు చేసిన వాణ్ణి వదిలేది లేదని పోలీసుల్ని పట్టుకుని, లాయర్నీ  పెట్టుకుని, కారు వాడి మీద కేసు వేశాడు. యాక్సిడెంట్ లో తప్పె వరిదనే  పాయింటు పై తీవ్ర పోరాటం చేసి  కేసు గెలిచాడు. నష్టపరిహారం పొందాడు.


        మన్మధరావు ఇలా చెప్తే నవీన్ కుమార్ కి నచ్చింది. ఎందుకంటే ఇందులో వాడిగా వేడిగా ఆసక్తి రేపే ఆర్గ్యుమెంట్ వుంది. మన్మధ రావు చేసే పోరాటం వుంది. చివరికి తప్పొప్పుల నిర్ధారణతో జడ్జి మెంట్ వుంది. నేనకున్న లక్ష్యాన్ని ఫలానా ఈఈ శక్తులతో ఈ విధంగా సంఘర్షించి సాధించుకున్నాను- అని మన్మధరావు  విజేతగా ప్రకటించుకోవడం వుంది. 


కథ- గాథ
       కొన్ని ఛానెల్స్ లో అకస్మాత్తుగా అరుపులు వినిపిస్తూంటాయి. ఏమిటా అనిచూస్తే చర్చావేదికలో కొందరు రాజకీయ నాయకుల్ని కూర్చో  బెట్టుకున్న యాంకర్ వాళ్ళ మధ్య పచ్చ గడ్డి వేస్తూంటాడు. వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుచుకుంటూ వుంటారు. ఏదో యుద్ధం జరుగుతున్నట్టు  ఆ కార్యక్రమం సాగుతూంటుంది. ఇంకొన్ని ఛానెల్స్ లో యాంకర్ ముందు రాజకీయ నాయకులు బుద్ధిగా కూర్చుని ఒకరి తర్వాత ఒకరు మాత్రమే అభిప్రాయాలు వెలిబుచ్చుకుంటూ వుంటారు.  ఎవరైనా అడ్డు తగిలితే ఒకరు మాట్లాడిన తర్వాతే ఇంకొకరు మాట్లాడాలని యాంకర్ కంట్రోలు చేస్తూంటాడు. ఈ  కార్యక్రమాలు చప్పగా సాగుతూంటాయి. ఆర్గ్యూ చేసుకునే ఛానల్స్ కి రేటింగ్ ఎక్కువ వుంటే, అభిప్రాయాలు చెప్పుకునే ఛానెల్స్ కి అంతగా ప్రేక్షకులు వుండరు. 

        కథకీ- గాథకీ తేడా ఇదే. ఛానెల్సే సాక్షి. ఛానెల్స్ కి లాగే సినిమాలకి పనికొచ్చేది ‘కథ’లే గానీ
 ‘గాథ’ లు కాదు. స్క్రీన్ ప్లే ద్వారా ఒక విషయం చెప్పదల్చుకుంటే కథ (story) గానో, గాథ (tale) గానో ఏదో ఒకరకంగా చెప్పవచ్చని ఇదివరకు ఒక సినిమా రివ్యూలో చెప్పుకున్నాం. కాకపోతే గాథగా చెప్తే కమర్షియల్ సినిమాకి పనికి రాదు. సినిమాకి కథే వుండాలి. ఎందుకంటే కథలో ఆర్గ్యుమెంట్ వుంటుంది. 

        దాంతో
 సంఘర్షణ పుడుతుంది.  గాథలో స్టేట్ మెంట్ మాత్రమే వుంటుంది. దీంతో సంఘర్షణ పుట్టదు. సంఘర్షణ  లేని స్క్రీన్ ప్లే చప్పగా వుంటుంది. గాథలు చదువుకోవడానికి నీతి కథలుగా బావుంటాయి. కానీ దృశ్య మాధ్యమంగా చూడాలంటే  కథలు మాత్రమే  బావుంటాయి. కథలో ఒక సమస్య ఏర్పాటై, దాంతో మొదలయ్యే పాత్రల మధ్య సంఘర్షణ (మన్మధరావు- 2 లాగా) అనేది తప్పొప్పుల లేదా న్యాయాన్యాయాల ఆర్గ్యుమెంట్ కి దారి తీసి, చిట్ట చివర ఓ జడ్జ్ మెంట్ నిస్తుంది. గాథ లో సమస్య వున్నా దాంతో పాత్రలు (మన్మధరావు- 1 లాగా)
సంఘర్షించక, ఆర్గ్యుమెంట్ ఎత్తుకోక, జడ్జ్ మెంటూ  ఇవ్వక- కేవలం ఈ ఫలానా సమస్య వల్ల  మాకిలా జరిగి, చివరికి మేమిలా తయారయ్యా మయ్యోచ్ అనేసి స్టేట్ మెంట్ మాత్రమే ఇచ్చి అవతల పారేసి తమ  దారిన తాము వెళ్ళిపోతాయి.
          
        ఇంకోటి గమనిస్తే గాథకి స్ట్రక్చర్ వుండదు. కథకి వుంటుంది. కమర్షియల్ సినిమాకి కథ వల్ల  సమకూరే స్ట్రక్చరే ప్రాణం. గాథ అనే దానికి  బిగినింగ్ మాత్రమే వుండి, అదే సాగి సాగి  ఆ బిగినింగ్ తోనే ముగుస్తుంది. అందుకని కమర్షియల్ సినిమాలకి బిగినింగ్ ని మాత్రమే కలిగి వుండే గాథలు పనికి రావు. కథతో అలా కాదు, కథలకి బిగినింగ్ తో బాటు మిడిల్, ఎండ్ లనే మూడంకాలుండి, ఆ ఆదిమధ్యంతాల సృష్టి స్థితి లయలతో విషయ విపులీకరణ చేస్తాయి.

        ఇంకా చెప్పుకుంటే,  గాథకి ప్లాట్ పాయింట్స్ కూడా వుండవు. కథకి వుంటాయి. గాథకి పాత్ర ఎదుగుదలకి సంబంధించిన క్యారక్టర్ ఆర్క్ (పాత్రోచిత చాపం) కూడా వుండదు. ఎలా మొదలైన పాత్ర అలా నిస్తేజంగా పడి వుంటుంది. కథకి అలాకాదు, పాత్ర ఎదుగుదలతో కూడిన క్యారక్టర్ ఆర్క్ అడుగడుగునా ఉద్విగ్నభరితంగా తయారవుతూ పోతూంటుంది. ఇంకా గాథకి టైం అండ్ టెన్షన్ గ్రాఫ్ (కాలం- వొత్తిడి బిందు రేఖ) కూడా ఏర్పడదు. అంటే తెర మీద సినిమా నడిచే కాలం గడిచే కొద్దీ టెన్షన్ కూడా పెరగడం వుండదన్న మాట. ఎలా మొదలయిన సినిమా అలా నేలబారు కథనంతో నడుస్తూంటుంది. కథకి అలాకాదు, టైం అండ్ టెన్షన్ గ్రాఫ్ పాలన జరగడంతో బాటు, ఉత్థాన పతనాల కథనంతో కట్టి  పడేస్తూ పోతుంది.


        గాథలో సంఘర్షణ కూడా వుండదు, కానీ సంఘర్షణ లేని కథ వుండదు. గాథకి విలన్ కూడా వుండడు, వుంటే సరిగా వుండడు. కథకి విలన్ ఒక కీలక కక్షి దారు. వీడు లేకపోతే మనమీద కక్ష గట్టినట్టు వుంటుంది కథ.

        గాథలు ఆర్ట్ సినిమాలు చూసుకునే వ్యవహారం. కథలు కమర్షియల్ సినిమాలు చూసుకోవాల్సిన వ్యాపారం (తెలుగు సినిమాలు కమర్షియల్ సినిమాల  ముసుగేసుకున్న  ఆర్ట్ సినిమాలే నని చాలా సార్లు చెప్పుకున్నాం). 

       
మరింకా చెప్పుకుంటే, కథఅనే దాంట్లో విధి అనే ఎలిమెంట్ కి స్థానం లేదు.  హీరో ఏదో అనుకుంటూంటే దైవం కల్పించుకుని ఇంకేదో చేసి- - తానొకటి తలిస్తే దైవమొకటి తలచును -  అన్నట్టు అమాంతం ఏ పిడుగో  పడి చావడంతో ముగియదు. గాథ ల్లోనే ఇలాటి మౌఢ్యాలుంటాయి. ఇలాకాక కథల్లో  ప్రత్యక్షంగా అడ్డు పడే ప్రత్యర్ధులతో  భౌతికంగానో మానసికంగానో పోరాడి సాధించుకోవడమే వుంటుంది.  దైవిక పరిష్కారాలు - ఫాటలిజం - కమర్షియల్ సినిమా హంగు కాదు, అది గాథల్ని చక్కగా చెప్పే ఆర్ట్ సినిమా ఎండింగ్ కావొచ్చు. పలాయనం చిత్తగించేదే గాథల్లో  కన్పించే పాసివ్ పాత్ర. గాథల్లో పాసివ్ పాత్రలు అతి పెద్ద ఫాటలిస్టులు. సమస్య వస్తే అది తలరాత అన్నట్టుగా, పరిష్కారం విధి చేతుల్లో పెట్టేసి వూరుకుంటాయి. వీటికి దైవిక పరిష్కారాలంటూ లభిస్తూంటాయి.
        
        ఇక చివరిగా, ప్రేక్షకుల విషయానికి వస్తే, గాథల్ని పాసివ్ గా చూస్తారు; అదే కథల్ని యాక్టివ్ గా చూస్తారు.
        పైన గాథలుగా వచ్చాయని చెప్పుకున్న  బ్రహ్మోత్సవం, కబాలీ, ఓకే బంగారం, మొగుడు, పైసా, చక్కిలిగింత, కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, రాజాధిరాజా మొదలైన సినిమాలతో- జనతా గ్యారేజ్ ని కూడా కలుపుకుని,  మరొక్క సారి వీటన్నిటినీ  పరిశీలనాత్మకంగా చూసినట్లయితే- పై పేరాల్లో చెప్పుకున్న ‘కథ’ కుండే లక్షణాల్లో ఒక్కటీ వీటికి లేదనీ, అన్నీ  ‘గాథ’ కి చెప్పుకున్న లక్షణాలే తుచ తప్పకుండా వున్నాయనీ గుర్తించ వచ్చు. 

గ్యారేజ్ ఐడియా 
       ఎక్కడ పడింది  ‘గ్యారేజ్’ డివైడ్ టాక్ కి బీజం? ఐడియా దగ్గరే  పడింది. ఐడియా ఎప్పుడైతే పుడుతుందో అప్పుడు అప్రమత్తంగా లేకపోతే డివైడ్ టాక్ కీ అప్పుడే బీజం పడిపోతుంది! ఈ ఐడియాతో తీసిన సినిమాకి డివైడ్ టాక్ వస్తుందని అప్పుడే చెప్పెయ్యొచ్చు. విడుదలకి పెట్టుకునే ఎలాటి ముహూర్తాలూ దీన్నుంచి కాపాడ లేవు. పనిలో శాస్త్రీయత వుంటే శాస్త్రాలు పెట్టే  ముహూర్తాలు తోడ్పడవచ్చు. ఐడియా అంటే ఏమిటి? ఆర్గ్యుమెంట్ + స్ట్రక్చర్ + లాగ్ లైన్ = ఐడియా అని ‘తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్’ వ్యాసాల్లో భాగంగా ‘ఐడియాలో కథ వుందా?’ అనే  మూడో అధ్యాయంలో చెప్పుకున్నాం. పైన చెప్పుకున్న మన్మథ రావు-1 నే తీసుకుందాం. ఏమిటి వీడి వ్యవహారం? ఇలాటి వాణ్ణి మనిషిగా లెక్కేయ కూడదు, వీడు తన గాయం తాలూకు సోది చెప్పుకున్నాడు. ఈ సోదిని ఐడియాగా తీసుకుని సోదీ సింగ్ సినిమా తీయాలనుకున్నాడను కుందాం :  అప్పుడు కాస్త కామన్ సెన్స్ వున్న రచయిత లైనేంటో  చెప్పమన్నాడనుకుందాం, సోదీసింగ్ ఏమని చెప్తాడు- మన్మధరావు కి యాక్సిడెంట్ అయి చాలా బాధలు పడ్డాడు, చాలా బాధలు పడ్డాడు, ఇంకా బాధలు పడ్డాడు ఆ గాయంతో, మూణ్ణెల్లకి కాలెలాగో బాగై మళ్ళీ హేపీగా నడవసాగాడబ్బా- అని చెప్పాడనుకుందాం-

        దీనికి కామన్ సెన్స్ వున్న రచయిత- ‘మీ ఐడియాలో స్ట్రక్చర్ ఎక్కడుంది, సోది తప్ప. మీరెలా కింగ్ నవుదామనుకున్నారు ఈ సినిమా తీసి?’  అని ప్రశ్నించి, ఇలా వివరించాడనుకుందాం :  ‘యాక్సిడెంట్ అయ్యింది లగాయత్తూ  బాధలు పడుతూనే వున్నాడు, ఇది బిగినింగ్. ఇంకా బాధలే పడుతున్నాడు, ఇది సాగదీసిన బిగినింగ్. ఇంకా ఇంకా బాధలు పడుతూనే వున్నాడు ఆ గాయంతో, ఇది మరీ మరీ ఇంటర్వెల్ మీదుగా  సాగదీసుకున్న  బిగినింగ్...ఇలా మూణ్ణెల్లకి కోలుకుని బాగా నడవడంతో తీరింది అతడి బాధ- ఇక్కడ బిగినింగ్ ముగిసిందే అనుకుందాం, వాట్ నెక్ట్స్ ? అయిపోయింది కదా సినిమా, ఇంకేముంది? బిగినింగ్ తోనే  సినిమాకి శుభం పడ్డాక మిడిల్ లేదు, ఎండ్ కూడా లేదు- మీకూ నాకూ బ్రెడ్ కూడా లేదు. మీరు మొదటి రకం చట్నీ, రెండో రకం చట్నీ, మూడో రకం చట్నీ కూడా పెట్టి,  అసలు ఇడ్లీయే  పెట్టకపోతే ఎలా వుంటుంది, అలా వుంటుంది ఇలా సినిమా తీస్తే. జీవితంలో ఆశాభంగాలకి అడుగులెలా పడతాయో, సినిమాల్లో కూడా మొదట్నించీ తప్పటడుగులు అలాగే పడుతూ వస్తాయి. ముగింపు దాకా అవి తప్పటడుగు లేనని తెలుసుకోనే తెలుసుకోం. జీవితంలో వేసే తప్పటడుగుల్ని సవరించుకుంటాం. ఎందుకంటే అవి దేవుడి హెచ్చరికలు కదా? సినిమాలకి మనమే క్రియేటర్లం కదా, మన క్రియేటివిటీ తప్పవడానికి వీల్లెనే లేదు! మనం రాసేవి శిలా శాసనాలు, మామూలు స్క్రిప్టులేం కాదు...అంత నీచానికి దిగజారం...’

        ఇలా వివరించి, ఈ అయిడియాలో ఆర్గ్యుమెంట్ లేదనీ, మన్మధరావు సోదితో కూడిన స్టేట్ మెంట్ మాత్రమే వుందనీ, ఇందుకే లాగ్ లైన్ కూడా సరీగ్గా రావడం లేదనీ ముక్తాయించాడు కామన్ సెన్స్ వున్న రచయిత. ‘మీ ఐడియా = స్టేట్ మెంట్ + నో స్ట్రక్చర్ + నో లాగ్ లైన్’  అనీ తేల్చాడు. 

        కింగ్ నవుదామనుకున్న సోదీ సింగ్ కి విషయం అర్ధమయ్యింది. మరేం చేయాలో చెప్పమన్నాడు. విధిలేక  రచనలతో కామన్ సెన్స్ కూడా అలవాటు చేసుకుని  కాస్త బెటర్ గా వృత్తి చేసుకుంటున్న రచయిత, మన్మథరావు -2  చెప్పుకొచ్చాడు : మన్మథరావుకు యాక్సిడెంట్ అయ్యింది ( కథా పరిచయం-బిగినింగ్), యాక్సిడెంట్ చేసిన వాడిమీద కేసు వేసి పోరాడాడు (సంఘర్షణ- మిడిల్),  కేసు గెల్చి నష్టపరిహారం పొందాడు (పరిష్కారం- ఎండ్), ఇంతే. ఇక్కడ కథనం ‘గాయం’ దగ్గరే ఆగిపోలేదు. పాయింటు ‘గాయం’ కాదు, ‘హక్కు’. పోరాడి ఆ హక్కు సాధించుకునే తీరు. 

        పోరాటమంటేనే తప్పొప్పుల ఆర్గ్యుమెంట్. దీనికి బిగినింగ్ -మిడిల్ -ఎండ్ లతో కూడిన స్ట్రక్చర్ కూడా తోడైంది. ఇక లాగ్ లైన్ కి వస్తే- యాక్సిడెంట్ లో గాయపడ్డ మన్మథ రావు, నానా తిప్పలుపడి ఎలా న్యాయ పోరాటం చేసి గెల్చాడన్నది కథ. ఈ లాగ్ లైన్ లో పరస్పర సంబంధంతో బిగినింగ్- మిడిల్ - ఎండ్  మూడూ వున్నాయి.

        షెఫ్ అవ్వాలని కోరిక పెట్టుకున్న హీరో, ఫుడ్ ట్రక్ పెట్టుకున్న హీరోయిన్ తో కలిసి పనిచేసి ఎలా ఆమెతో ప్రేమనీ, తన కలనీ నిజం చేసుకున్నాడన్నది బిగినింగ్- మిడిల్- ఎండ్ లకి సంబంధించి పరస్పర సంబంధం గల మూడు వాక్యాలతో  ‘పెళ్లిచూపులు’ లాగ్ లైన్.

        పెళ్లి తప్పించుకున్న హీరోయిన్ పాకిస్తాన్లో తేలితే, అక్కడి పరిస్థితుల్లోంచి ఆమెని కాపాడి,  ఎలా పెళ్ళిచేసి హీరో పంపాడన్నది బిగినింగ్- మిడిల్- ఎండ్ లకి సంబంధించి పరస్పర సంబంధం గల మూడు వాక్యాలతో  ‘హేపీ భాగ్ జాయేగీ’ లాగ్ లైన్. 

        తన తండ్రి నడుపుతున్న కుటుంబ బిజినెస్ అయిన మాఫియా కార్యకలాపాలకి దూరంగా ఉంటున్న కొడుకు, తండ్రి మరణంతో ఇక తప్పక తండ్రి పదవిలోకొచ్చి, శత్రు శేషం గావించడమనేది బిగినింగ్- మిడిల్- ఎండ్ లకి సంబంధించి పరస్పర సంబంధం గల మూడు వాక్యాలతో ‘గాడ్ ఫాదర్’ లాగ్ లైన్. 

       
లాగ్ లైన్ అంటే మరేమిటో కాదు, లైను, స్టోరీ లైను. తమ కథకి మూడు వాక్యాల్లో లైన్ చెప్పలేని వాళ్ళు 90 శాతం మంది ఉండొచ్చు టాలీవుడ్ లో. 

        ఇప్పుడు  కథ అనుకుని తీసిన ‘గ్యారేజ్’ లైనుని కథగా మూడు వాక్యాల్లో చెప్పగలమో లేదో చూద్దాం : ముంబాయిలో పర్యావరణ కార్యకర్తగా  పోరాటం చేస్తున్న హీరో, హైదరాబాద్ వచ్చి పెదనాన్న నడుపుతున్న గ్యారేజ్ లో చేరి, సామాజిక సమస్యల మీద పోరాటం చేశాడు...

       
ఏమైనా ఈ వాక్యాలకి పరస్పర సంబంధం వుందా? పర్యావరణ కార్యకర్త సామాజిక పోరాటం చేయడమేమిటి? దీనికి కథా లక్షణం వుందా, గాథలా వుందా? ఒక కథలో రెండు పాయింట్లు ఎలా వుంటాయి? ఒక గోల్ వదిలేసి ఇంకో గోల్ కి హీరో ఎలా వెళతాడు? గాథ కైతేనే అనేక పాయింట్లు వుంటాయి.  ఒక పాయింటు మీంచి ఇంకో పాయింటు, ఒక గోల్ నుంచి ఇంకో గోల్... డాక్యుమెంటరీలు తీయయడానికి వాడే స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ (టైగర్ హరిచంద్రప్రసాద్), దాంతో ఎపిసోడిక్ కథనం ( ఆటోనగర్ సూర్య)...ఫస్టాఫ్ లో చూపించింది హుష్ కాకీ చేసి సెకండాఫ్ లో ఇంకో భారతం (రుస్తుం)... ఇలాటివన్నీ ఐడియా దగ్గర మూడు వాక్యాల సమన్వయం కోల్పోయినప్పుడే తలెత్తుతాయి... కథ అనే ఉన్నతాసనం మీంచి ఐడియా ముక్కలై,  గాథగా అగాథంలోకి పడిపోతుంది.

        ఇలా వెల్డింగ్ చేసిన  ఐడియాని నాలుగు పేజీల సినాప్సిస్ గా రాసుకున్నప్పుడైనా చదువుతున్నడు ఆ పేరాలు లాజిక్ కే అడ్డుతగులుతూంటాయి. సినాప్సిస్ రాసుకునే వాళ్ళుకూడా 90 శాతం వుండరు. ఒక ఐడియా అనుకుని డైరెక్టుగా దానికి వన్ లైన్ ఆర్డర్ వేసుకుపోవడమే...అదిగో అప్పుడే ‘గ్యారేజ్’ లాంటి ‘గాథలు’ తెరమీదికి వస్తాయి. ‘గ్యారేజ్’ ఐడియా లేదా కాన్సెప్ట్ దాని మూలస్థంభమైన సెంట్రల్ పాయింటుకి కూడా నోచుకోలేదు...


(మిగతా రేపు)
- సికిందర్ 
http://www.cinemabazaar.in  
         















1, సెప్టెంబర్ 2016, గురువారం

రివ్యూ

రచన- దర్శకత్వం: కొరటాల శివ
తారాగణం: ఎన్టీఆర్‌, మోహన్‌లాల్‌, సమంత, నిత్యామీనన్‌, సాయికుమార్‌, సురేష్‌, ఉన్ని ముకుందన్‌, సచిన్‌ ఖెడేకర్ కర్‌, అజయ్‌, బ్రహ్మజీ తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌, కెమెరా: తిరు
బ్యానర్‌: మైత్రీ మూవీ మేకర్స్‌
నిర్మాతలు: ఎర్నేని నవీన్‌, యలమంచిలి రవిశంకర్‌, సి.వి.మోహన్‌
విడుదల : సెప్టెంబర్ 1, 2016
***
చాలా  హైప్ తో, పబ్లిసిటీతో  ‘జనతా గ్యారేజ్’ పేరుతో ఈసారి ఎన్టీఆర్ ప్రేక్షకులకి అందించిన నజరానా ఎంత జనరంజకంగా వుందో చూద్దాం...
కథ 
          1980 లలో  సత్యం (మోహన్ లాల్) హైదరాబాద్ లో జనతా గ్యారేజ్ తెరుస్తాడు. తమ్ముడు (రెహమాన్) ని బాగా చదివించి పెళ్లి చేస్తాడు. సత్యం తన గ్రూపుతో గ్యారేజీ పనులు చేస్తూనే తనదగ్గరి కొచ్చే సామాన్యుల సమస్యలు తీరుస్తూంటాడు. ఈ క్రమంలో ముఖేష్ రాణా ( సచిన్ ఖేడేకర్) అనే పారిశ్రామిక వేత్తకి శత్రువుగా మారతాడు. ఒకరోజు మాట వినని సత్యం తమ్ముణ్ణి, భార్యని  ముఖేష్ చంపించేస్తాడు. దీంతో తల్లిదండ్రుల్ని కోల్పోయిన కొడుకు (ఆనంద్) ని వాడి మేనమామ(సురేష్) కిచ్చి ముంబాయి పంపించేస్తాడు సత్యం. మేనమామకో కూతురు బుజ్జి (సమంత)  వుంటుంది. ఆనంద్ చదువుకుని పర్యావరణ పరిశోధకుడు అవుతాడు. పర్యావరణాన్ని దెబ్బ తీసే పరిశ్రమలకి వ్యతిరేకంగా పోరాడుతూంటాడు. ఈ క్రమంలో హైదరాబాద్ వచ్చి ఒక మైనింగ్ మాఫియా మీద పోరాడతాడు. ఈ మాఫియా ముఖేష్ రాణాతో చేతులు కలిపిన సత్యం కొడుకు రాఘవ ( ఉన్ని ముకుందన్) కి బుద్ధి చెప్తాడు ఆనంద్. 

          ఆనంద్ రావడానికి ముందు, సత్యం మీద కూడా ముఖేష్  హత్యాయత్నం చేస్తాడు. దీంతో ఆరోగ్యకారణాల రీత్యా ప్రజల తరపున పోరాడ్డం మానుకుంటాడు సత్యం. ఆనంద్ వచ్చి పర్యావరణాన్ని దెబ్బ తీసే మైనింగ్ ని అడ్డుకోవడంతో, అతణ్ణి పిలిచి తన బాధ్యతలు అప్పగిస్తాడు సత్యం. ఇక సత్యం బాధ్యతల్ని మీదేసుకున్న ఆనంద్ ఇక్కడ్నించీ ఏం చేశాడన్నది మిగతా కథ.


ఎలావుంది కథ
          సారీ, వెరీ సారీ, ఇంత భారీ బడ్జెట్ వెచ్చించి ఎన్టీఆర్ తో తీశామనుకుంటున్న కథ కథ కాదు, ఇది ఒక గాథ మాత్రమేనని చెప్పాల్సి వస్తోంది. ఈ గాథలో ఒక గ్యారేజీ ఓనర్ మంచి డాన్ గా ఎదగడమనే  కథనం గాడ్ ఫాదర్ నాటి నుంచీ  సర్కార్ వరకూ చూస్తున్నదే. అదే తిరిగి దర్శనమిచ్చింది. కనుక కొత్తదనం ఏమీలేదు. ఇక పర్యావరణ కార్యకర్తగా హీరో చేసే పోరాటం  కాస్తా వదిలేసి,  గ్యారేజీ తరపున ప్రజల మాన- ప్రాణ -ఆస్తి సమస్యలపై  పోరాడే నాయకుడుగా మారడంతో హీరో పాత్ర ఏమిటో తెలియకుండా పోయిన వైనం కూడా వుంది. మళ్ళీ ఈ గాథ లోనే కుటుంబ సంబంధాలు కూడా చూపడంతో ఏకసూత్రత పూర్తిగా దెబ్బ తినిపోయింది. ఇదొక కథ అయివుంటే, మిగతా కమర్షియల్ సినిమాల్లో లాగానే  ఒక సెంట్రల్ పాయింటు వుండి, దాంతో సంఘర్షణా- పోరాటం ఉండేవి.  పర్యావరణంతో గానీ, గ్యారేజ్ తో గానీ, కుటుంబంతో గానీ,  ఎక్కడా ఒక ప్రధాన సమస్యంటూ ఏర్పాటు కాకపోవడంతో, ఇది కథా లక్షణాన్ని కోల్పోయింది. ఇదిగో మా జీవితాలు ఇలా ప్రారంభమై, ఇలా కొనసాగి, ఇలా ముగిసింది మా కథ- అని గోడు వెళ్ళ బోసుకునే సంఘటనల పేర్పు  అనే ‘గాథ’ గానే ఇది రూపొందింది. ఈ గాథని కథగా మార్చాలంటే చాలా మేజర్ రిపేర్లు అవసరపడతాయి.

 ఎవరెలా చేశారు
          ఎన్టీఆర్ నటనకి, నృత్యాలకి,  పోరాటాలకీ వంక పెట్టలేం గానీ, సక్సెస్ నిచ్చేవి ఇవి మాత్రమే కావు- తగిన పాత్ర కూడా వుండాలి. తన పాత్ర ఏమిటన్నదే ప్రశ్నార్ధక మయ్యింది- తను పబ్లిసిటీతో విపరీతమైన ఆసక్తి రేపిన పర్యావరణం గురించి పోరాడే కొత్త పాత్రా, లేక జనం కోసం పోరాడే అదే రొటీన్ మాస్ క్యారక్టారా? మొదటిదిగా ప్రారంభమై రెండో దాంట్లోకి తిరగ బెట్టలేదూ? ఇలా ఎందుకు జరిగిందో,  దీని జస్టిఫికేషన్ ఏమిటో ఎన్టీఆరే చెప్పాలి. ఇదొక కథై వుంటే ఇలా జరిగేది  కాదనేది నిర్వివాదాంశం. తను నటించింది గాథలో కాబట్టి ఇలా తయారయ్యింది పాత్ర, ఇంతకంటే మరేం లేదు. ఇలా తయారైన పాత్రలో బాగా నటించాడనుకుంటే అనుకోవచ్చు. ఎన్టీఆర్ నటనకి వంకపెట్టడం వుండదు. పాత్రలే అర్ధవంతంగా వుండాలి. ఇవన్నీ ఎవరు పట్టించుకుంటారు -చల్తా హై-  అనుకుంటే అది వేరు. 
  
          మోహన్ లాల్ ఫస్టాఫ్ వరకూ ఆసక్తి కల్గిస్తాడు. అతడి నటనని కూడా వంకబెట్టలేం. అయితే అతడి పాత్ర చేసే పోరాటానికి తగ్గ ప్రత్యర్థే లేకపోవడంతో క్రమంగా పాత్ర బలహీన పడుతూ – ఇక అతడి స్థానంలోకి ఎన్టీఆర్ రాగానే నామ్ కే వాస్తేగా మిగిలిపోతాడు. 

          ప్రేక్షకులకి చాలా బ్యాడ్ లక్ ఏంటంటే, హీరోయిన్లిద్దరూ నిరాశపర్చడం. సమంతాకీ, నిత్యా మీనన్ కీ సరైన పాత్రలే లేవు. ఉన్న పాత్రలతో పట్టుమని పదినిమిషాలు కూడా కన్పించరు. సెకండాఫ్ లోనైతే  చాలా సేపూ ఇద్దరూ మాయమైపోతారు. ఓ పాటకి, కాస్త గిలిగింతకీ వచ్చేసి వెళ్ళిపోయే ఈ స్టార్ హీరోయిన్లు పారితోషికాలు మాత్రం పూర్తిగానే పొంది వుంటారు పుష్కలంగా.  వీళ్ళిద్దరికీ తోడైనట్టు- ఐటెం సాంగ్ తో ఐదే నిముషాలు కన్పించి పోతుంది కాజల్ అగర్వాల్. తగిన ఫ్లో లేకుండా సడెన్ గా వచ్చి పడే ఈ ఐటెం సాంగ్ డిస్టర్ బెన్స్ గానే వుంటుంది. 

          విలన్ గా సచిన్ ఖెడేకర్ కూడా హీరోయిన్లలాగే అతిధి పాత్ర పోషించే వేస్టు పాత్ర! కమెడియన్లు లేరు, కామెడీ లేదు. ఉన్న వెన్నెల కిషోర్ కి కూడా రెండే సీన్లు!. ఇక గ్యారేజీ మెకానిక్కులుగా బ్రహ్మాజీ, అజయ్ ఇంకొంత మంది వుంటారు- ఎప్పుడో 1980 లలో గ్యారేజీ ప్రారంభమైన నాటినుంచీ ఎలావున్న వాళ్ళు అలా ఏదో కోర్టు ఆదేశాల ప్రకారం యథాతథ స్థితిని పాటిస్తున్నట్టు- పెళ్ళీ పెటాకులు లేకుండా అలాగే ఉండిపోతారు. ఇప్పటికి వీళ్ళు ముసలి  వాళ్ళయి వుండాలి! క్లయిమాక్స్ దగ్గరలో అర్జెంటుగా పెళ్ళిచేసుకుని అంతలో చచ్చిపోతాడు పాపం అజయ్. పోతే మిగిలినవన్నీ సహాయపాత్రలు. పోలీసు అధికారిగా సాయికుమార్ కూడా అసంబద్ధ పాత్ర చిత్రణ బాధితుడే. 

          దేవీశ్రీ ప్రసాద్ నుంచి ఓ రెండు పాటలు బావున్నాయి. పోరాటాలు పరమ రొటీన్ గా వున్నా, తిరు కెమెరా వర్క్, ఇతర సాంకేతిక విలువలు షరా మామూలుగా ఉన్నతంగా వున్నాయి. భారీ బడ్జెట్ సినిమాలకి ఉన్నతంగా ఉండేవి ఇవే!


చివరికేమిటి?
          ఎన్టీఆర్ మోహన్ లాల్ ల కాంబినేషన్ అంటూ అంచనాలు పెంచేయడం మంచిదే- కానీ పొజిషనింగ్ ని కూడా చూసుకోవాలి. ఈ ఇద్దరు హేమా హీమీలు ఒకవైపు వుంటే,  ఎదురుగా అంతే పవర్ఫుల్ పాత్ర, నటుడూ వుండడం కూడా అవసరం. ఇద్దరు హేమీ హేమీలకి తుస్సుమనే విలన్ ని పెట్టారు- వాడికి  సరైన పనే  లేదు. ఒకసారి ప్రజల భూమి లాక్కో బోతాడు, ఇంకోసారి అక్రమ మైనింగ్ చేయబోతాడు, మరింకో సారి అక్రమంగా ఆస్పత్రి కట్టించబోతాడు...చెబుతున్నది కథగా లేకపోతే ఇంతే. ఒక పాయింటు మీద విషయం నిలబడదు. చివరికి సీఎం ని దింపడానికి నగరంలో విలన్ బాంబులు పేల్చడం ఎంత పురాతన బలహీన క్లయిమాక్స్!

          ఈ సినిమా ఇంటర్వెల్ పడ్డా కథేమిటో తెలియదు, సెకండాఫ్ లో పదినిమిషాల తర్వాత ఎన్టీఆర్ కీ, మోహన్ లాల్ కి సరైన కమర్షియల్ సినిమా పొజిషనింగ్ తో,  పరస్పరం విరోధులయ్యే వాతావరణం కన్పించి- అంతలో ఇద్దరూ చేతులు కలపడంతో అదికూడా తేలిపోతుంది. ఇక ఇద్దరూ చిల్లర సమస్యలే చూసుకోవడంతో ఓ పాయింటూ లేక కథే ప్రారంభం కాదు. చివరి దాకా కథే వుండదు. అందుకే ఇది గాథ!  బిగినింగే తప్ప, మిడిల్, ఎండ్ లేని అనంత గాథ. స్టీవెన్ స్పీల్ బెర్గ్ చెప్పినట్టు, సినిమా వాళ్ళు కథలు చెప్పడం ఎప్పుడో మర్చిపోయారు- బిగినింగే వుంటుంది...మిడిల్ వుండదు...ఎంతకీ ముగియని ఎండ్ తప్ప!

          దర్శకుడు కొరటాల శివ రచయితగా వచ్చిన వాడే. కానీ ఏ ప్రాతిపదికన రచనలు చేస్తున్నట్టో తెలీదు. ఇంతగా రిపేరు కొచ్చిన రచన ఇంకోటి చేయలేదేమో. ప్రేక్షకులు ఈ సినిమాని ఎక్కువ ఆశలు పెట్టుకోకుండా చూసేస్తే సరి.


-సికిందర్



          



.

30, ఆగస్టు 2016, మంగళవారం

సాంకేతికం :







ద్దరు కాస్ట్యూమర్లు. ఒకరు రిఫరెన్సులు  లేకుండా కుట్టేస్తారు, మరొకరు రియలిస్టిక్ గా కుడతారు. ఒకరు సినిమాలు కూడా తీస్తారు. మరొకరు యూనియన్ ప్రెసిడెంటుగా వ్యవహరిస్తారు. ఒకరు ఇన్ఫర్మేటివ్ అయితే, మరొకరు ఎగ్రెసివ్. కాస్ట్యూమర్స్ యూనియన్ ప్రెసిడెంట్ చిల్లర వేణుగోపాల రావు తమ శాఖ దుస్థితి మీద ఎడాపెడా విరుచుకు పడతారు. ‘ఎవరిమీద మీకింత ఆగ్రహం?’ అంటే,  వెంటనే శాంతిస్తారు. మనకందరికీ తెలిసిందే- రెడీ మేడ్ల,  ఫ్యాషన్ డిజైనర్ల ఈ కాలంలో పెద్ద ఆఫర్లు కాస్ట్యూమర్లకి అంతగా దక్కడం లేదని. అయితే దీనికి రెండో వైపు ఒక ఆశావహ దృశ్యం కూడా వుంది. ఫ్యాషన్ డిజైనర్లకి అంత సీనేమీ లేదు, ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడమే వాళ్ళ పని.  అయితే అప్పటికే జరగాల్సిన నష్టమంతా జరిగిపోతుంది.


        దీనికొకటి చెప్తారు ఒకప్పుడు యూనియన్ వైస్ ప్రెసిడెంట్ గా కూడా పనిచేసిన వానపల్లి జగదీశ్ : ‘పంచాక్షరి’ లో హీరోయిన్ అనూష్కాకి ఒక రోమన్ డ్రెస్ కావాల్సి వచ్చింది. ముంబాయి చెన్నైల లోని ఫ్యాషన్ డిజైనర్లు దాన్ని  రూపొందించారు. ఆ  అతుకుల బొంతల్ని తిప్పి కొట్టారు అనూష్కా. ఇక జగదీశ్ రంగంలోకి దిగారు. అప్పటికి టైం లేదు, ఒక్క రోజులోనే కుట్టాలి. రిఫరెన్సులు కూడా అక్కరలేని తన సొంత క్రియేటివిటీతో,  రాత్రికి రాత్రి ఆ డ్రెస్ ని తయారు చేసేశారు. దాన్ని చూసి అనూష్కాతో బాటు సెట్లో అందరూ థ్రిల్లయ్యారు. నెట్, షీఫాన్ ల నుపయోగిస్తూ-  ఫాల్స్,  హేంగ్ వర్క్ లతో అత్యద్భుతంగా కుట్టిన ఆ వైట్ కలర్ డ్రెస్ ఇప్పుడు తన దగ్గరే వుంది- దాన్ని తీసి సగర్వంగా ప్రదర్శించారు జగదీష్. 

           కాస్ట్యూమర్స్ కి కుట్టు పని తెలియడంతో పాటు, స్పీడు కూడా వుంటుందన్నారు వేణుగోపాలరావు అలియాస్ వేణు. ఫాంటసీలని సృష్టించడంలో కూడా జగదీష్ దిట్ట అయితే, వేణు రియలిస్టిక్ గా పోతారు. జేడీ చక్రవర్తికి పర్సనల్ కాస్ట్యూమర్ గా వుండడం వల్ల తనకీ రియలిస్టిక్ అప్రోచ్ అబ్బిందన్నారు. ‘ఎగిరే పావురమా’ లో జేడీ రైల్వే గ్యాంగ్ మన్ పాత్రకి తను కుట్టిన బట్టల జత చూసి నిర్మాత రవికిషోర్, దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డి లు ఏంతో  మెచ్చుకున్నారన్నారు. తెలుగులో మంచి కాస్ట్యూమ్స్ కి నాగార్జునని చెప్పుకుంటారనీ, తను ఆయనకి కూడా కాస్ట్యూమర్ గా వున్నాననీ  అన్నారు వేణు.   ఫాంటసీ డ్రెస్సు లకి కన్నడ హీరో ఉపేంద్ర గురించి అంతా చెప్పుకుంటారనీ, ఆయనకి తనే బట్టల ప్రదాతననీ చెప్పుకొచ్చారు జగదీష్. ఉపేంద్ర నటిస్తున్న ఓ కన్నడ సినిమాకి తను అందుబాటులో లేనప్పుడు, ముంబాయి  బెంగళూరుల నుంచి ఐదుగురు డిజైనర్లు ఐదు మోడల్స్ లో టైగర్స్ డ్రెస్సులు తయారు చేసి తెచ్చారనీ, అవేవీ నచ్చక పోవడంతో ఉపేంద్ర తనని వెతికి పట్టుకున్నారనీ - అప్పుడా జెర్కిన్, ప్యాంట్, బుల్లెట్ బెల్టు లతో కూడిన ఫాంటసీ ‘టైగర్’ కాస్ట్యూమ్స్ ని,  తను తయారు చేసి తీసుకుని పోతే- అక్కడున్న హీరోయిన్ నయనతార సహా అందరూ అవాక్కయి చూశారనీ గుర్తు చేసుకున్నారు జగదీష్. 

          ‘HO’ లో కూడా ఉపేంద్రకి ఒక కవచం తయారు చేశానన్నారు. అప్పటి వరకూ కవచాల్ని దేశంలో ఫైబర్ తో తయారు చేసే వారనీ, అవి పెళుసుగా వుండి తొడుక్కుంటే ఇబ్బంది పెట్టేవనీ; తను తొలిసారిగా ఫోమ్, స్పాంజిల నుపయోగించి, కంఫర్టబిలిటీకి తిరుగు లేకుండా రూపొందించాననీ అన్నారు జగదీష్. ఉపేంద్ర నటించిన ‘హాలీవుడ్’  లో రోబో డ్రెస్ ని కూడా అందరికీ భిన్నంగా కార్లు, చెప్పుల తయారీల్లో ఉపయోగించే విడిభాగాలతో రూపొందించానన్నారు. రజనీకాంత్ ‘రోబో’ కి ఆ కాస్ట్యూమర్లు పెళుసుగా వుండే ఫైబర్ నే వాడారన్నారు. మరి మీరెందుకు మీ కొత్త ప్రయోగాన్ని ‘రోబో’ నిర్మాతల దగ్గర ప్రమోట్ చేసుకో లేదన్న ప్రశ్నకి- తనకి ఆసక్తి లేదనేశారు జగదీష్. 

          బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా ప్రోత్సాహాన్ని కూడా ఇలాగే తిరస్కరించారు జగదీష్. హైదరాబాద్ లో ఆమె ‘అపురూపం’  షూటింగ్ కి వచ్చినప్పుడు ఎవరో తనని ఆమెకి పరిచయం చేశారు. అప్పుడామె తను  వేసుకున్న జీన్స్ కలర్ లోనే చెవి రింగులు కావాలన్నారు. ఆమె అనుమతితో ఆమె నడుం వెనుక భాగం నుంచి జీన్స్ లోపలి బెల్టు ముక్క కత్తిరించి, అక్కడికక్కడే దాంతో చెవి రింగులు తయారు చేసిస్తే,  కళ్ళు తిరిగిన ప్రియాంకా వెంటనే ముంబాయి వచ్చేయమన్నారు. కానీ  ఇంటి బాధ్యతల వల్ల తిరస్కరించాల్సి వచ్చింది జగదీష్ కి. 

      సుస్మితా సేన్. కత్రినా కైఫ్ లకి కూడా కాస్ట్యూమ్స్ అందించారు జగదీష్. అయితే ఓ కన్నడ సినిమాలో జ్యోతికకి కుట్టిన ఫాంటసీ డ్రెస్ సీతాకోక చిలుక మంచి పేరే తెచ్చింది. ఇదెలా వుంటుందంటే, రంగురంగుల స్లీవ్ లెస్ టాప్స్, దీనికి మ్యాచయ్యే అంబ్రెల్లా స్కర్ట్ తో అచ్చం సీతాకోక చిలుకలాగే వుంటుంది. 

       మరి ఇప్పుడొస్తున్న ఫాంటసీ సినిమాలతో కాస్ట్యూమర్స్ కి మళ్ళీ పూర్వవైభవం వచ్చినట్టే కదా అంటే, హైప్ కోసం ఫ్యాషన్ డిజైనర్ల వెంటబడుతున్నారన్నారు వేణు. ‘ ఆ ఫాంటసీ డిజైన్లు పట్టుకుని డిజైనర్లు మా దగ్గరికే వచ్చి కాస్ట్యూమ్స్ కుట్టించు  కుంటున్నారు... పేరు మాత్రం వాళ్ళది చెప్పుకుంటారు’ అని అక్కస్సుగా అన్నారు వేణు. ఇక్కడే వున్న ఒక అసిస్టెంట్ ని చూపిస్తూ, ఇతను తయారు చేసిచ్చిన ఒక అద్భుతమైన డ్రెస్ కి క్రెడిట్ ఇతడికి రాకుండా,  ఫ్యాషన్ డిజైనర్ కొట్టేశారని విమర్శించారు జగదీశ్. వేణూ జగదీష్ లు కలిసే వుంటారు, కానీ కలిసి పనిచెయ్యరు. అదొక స్నేహబంధం అంతే.  

        బాపట్లకి చెందిన వేణు 1991 లో ‘క్షణం క్షణం’ కి అసిస్టెంట్ గా పనిచేసి, 1996 లో ‘గులాబీ’ తో కాస్ట్యూమ్స్ చీఫ్ అయ్యారు. కాస్ట్యూమ్స్ తో ఈయన అలవర్చుకున్న వాస్తవిక దృక్పథం  ఎలాంటిదంటే,  పోసాని కృష్ణ మురళి తీసిన ‘శ్రావణ మాసం’ అనే ఫార్ములా సినిమాలోనూ,  50 మంది రికార్డు స్థాయి తారాగణం మొత్తానికీ, రియలిస్టిక్ దుస్తులనే తయారుచేసి ఇచ్చిపారేశారు. ఇప్పటివరకూ 75 సినిమాలు పూర్తి చేశారు. 

        జగదీష్  1983 లో వైజాగ్ నుంచి చెన్నై వెళ్లారు. ఆరేళ్ళప్పుడే సూది పట్టిన ఈయన,  అన్నం లేకుండా ఆర్రోజులు గడపగల జీవన కళ ని కూడా ఔపోసన పట్టారు.  అంతటి దుర్భర స్థితి నుంచి పైకొచ్చారు. మొదట  కె ఆర్ విజయ, ప్రభలకి, కె ఎస్ ఆర్ దాస్ సినిమాలకీ పనిచేసి;  ఉపేంద్ర , రాజ శేఖర్ లకి పర్సనల్ కాస్ట్యూమరై;  సురేష్ ప్రొడక్షన్స్ కి కంపెనీ కాస్ట్యూమర్ గా వ్యవహరిస్తూ, తెలుగు తమిళ కన్నడ హిందీ భాషల్లో 300 సినిమాలూ పూర్తి చేశారు. ఈయన శిష్యులు ఐదారుగురు కాస్ట్యూమర్స్ అయ్యారు. ‘సీమశాస్త్రి’, ‘హలో ఉమా’ సినిమాలకి సహ నిర్మాతగా కూడా వున్నారు జగదీష్.



-సికిందర్
 (ఏప్రెల్ 2011- ‘ఆంధ్రజ్యోతి’ –సినిమాటెక్ శీర్షిక)  

29, ఆగస్టు 2016, సోమవారం

రచన- పాటలు- దర్శకత్వం : ముదస్సర్ అజీజ్

తారాగణం : అభయ్ డియోల్, డయానా పెంటీ, మోమల్ షేక్, అలీ ఫైజల్, జిమ్మీ షేర్ గిల్, పీయూష్ మిశ్రా, జావేద్ షేక్, కన్వల్జిత్ సింగ్ తదితరులు సంగీతం : సోహైల్ సేన్, ఛాయాగ్రహణం : సౌరభ్ గోస్వామి బ్యానర్స్ : ఇరోస్  ఇంటర్నేషనల్, ఎ కలర్ ఎల్లో ప్రొడక్షన్ నిర్మాతలు : కృషికా లుల్లా, ఆనంద్ ఎల్ రాయ్
 
విడుదల :  18 ఆగస్టు, 2016
***
        కామెడీ తీయడం ఆషామాషీ వ్యవహారం కాదనీ,  అందుకే ఇప్పుడు ప్యూర్ కామెడీల జోలికి ఎవరూ పోవడం లేదనీ, ఈ సెగ్మెంట్ లో శూన్యాన్ని భర్తీ  చేసి లాభపడే ఆలోచన చేయడం లేదనీ, చేస్తే కామెడీకి పూర్వవైభవం కల్పించే అదృష్టం చేసుకుంటూ, దండిగా రాబడులు కూడా  పొందవచ్చనీ తెలియజేసుకుంటూ హిందీలో ఓ సినిమా వచ్చింది- ‘హేపీ భాగ్ జాయేగీ’ అని.  ఇది అసాధ్యాన్ని ఎలా సుసాధ్యం చేసిందో ఈ కింద చూసుకుంటూ వెళ్దాం...

కథ 
     అమృత్ సర్ లో ఇండో- పాక్ వ్యవసాయ సదస్సు జరుగుతూంటుంది. పాకిస్తాన్ నుంచి మాజీ గవర్నర్ జావేద్ అహ్మద్ (జావేద్ షేక్), అతడి కొడుకు బిలాల్ అహ్మద్ (అభయ్ డియోల్) వచ్చి పాల్గొంటారు. కొడుకు తన లాగే రాజకీయాల్లోకి వస్తే పాకిస్తాన్ చరిత్రే మారిపోతుందని నమ్ముతూంటాడు జావేద్  (It will change the history of Pakistan).  కొడుకు బిలాల్ కి రాజకీయాలంటే ఇష్టముండదు. క్రికెటర్ కావాలని వుంటుంది. తండ్రిమాట కాదనలేక ఈసురోమని ఏడుస్తూ  రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటూ వుంటాడు.  అమృత్ సర్ లో సదస్సు ముగించుకుని లాహోర్ వెళ్ళిపోతాడు తండ్రితో. ఉదయాన్నే లేచి అమృత్ సర్ నుంచి తెచ్చుకున్న పెద్ద పళ్ళ బుట్టని తెరిస్తే,  అందులోంచి కెవ్వు మంటూ హేపీ (డయానా పెంటీ) బయటికి గెంతుతుంది. బిలాల్ తో బాటు పనిమనిషీ, పియ్యే అదిరిపడతారు. ఎవరు ఏమిటని ఆరాతీస్తే, తను అమృత్ సర్ వాసి. అక్కడి కార్పొరేటర్ బగ్గా ( జిమ్మీ షేర్ గిల్) తో తన కిష్టం లేని పెళ్లి చేస్తున్నాడు తండ్రి (కన్వల్జిత్ సింగ్). తను గిటారిస్ట్ గుడ్డూ (అలీ ఫైజల్) ని కాలేజీలో చదువుకుంటు
న్నప్పట్నించీ ప్రేమిస్తోంది. గుడ్డూతో పారిపోవాలని పెళ్లి పందిట్లో పైనుంచి దూకితే లారీలో పడింది. గుడ్డూ మిస్సయ్యాడు. లారీలో పళ్ళ బుట్టలో దాక్కున్న తనకి రాత్రిపూట లారీ ఎటు వెళ్లిందో తెలీదు. ఇదీ సంగతి. 

        అమృత్ సర్ నుంచి ఆ లారీతో బాటు తన  కాన్వాయ్ సరిహద్దు దాటుకుని మా లాహోర్ వచ్చిందంటాడు బిలాల్. ఇది లాహోర్,  నువ్వు పాకిస్తాన్ లో వున్నావ్- మా కొంపలు ముంచావ్-  అని లబోదిబో మంటాడు. ఇది బయటపడితే రాజకీయంగా అల్లరవుతుందనీ, హేపీని పోలీసులకి అప్పగిస్తే ఆమెకి కూడా ఇబ్బందులు తప్పవనీ భావించి,  తండ్రికి తెలీకుండా ఇంట్లోనే దాస్తాడు. ఇంట్లో కన్పించీ కన్పించకుండా మిస్సవుతున్న ఆకారాన్ని చూసి తండ్రి కంగారు పడుతూంటే, ‘అది అమ్మ ఆత్మ’  అని నమ్మిస్తూంటాడు బిలాల్. ఒకవైపు తనకి పొలిటీషియన్ జియా రెహమానీ (మనోజ్ బక్షీ) కూతురు మోడరన్ గర్ల్ జోయా (మోమల్ షేక్) తో సంబంధం కుదిరి వుంది. కానీ ఇప్పుడు చూస్తే  హేపీని లైక్ చేస్తూంటాడు. 

        అటు అమృత్ సర్ లో హేపీని పోగొట్టుకున్న పెళ్లి కొడుకు బగ్గా,  హేపీ లవర్ గుడ్డూని బంధిస్తాడు. హేపీ తండ్రి  హేపీ కన్పిస్తే కాల్చెయ్యాలని తుపాకీ పట్టుకుని తయారుగా వుంటాడు. పరిస్థితి ఉద్రిక్తంగా వుంటుంది. ఈ నేపధ్యంలో అటు లాహోర్లో బిలాల్ వైపు నుంచి ఏ సంఘటన జరిగి,  వీళ్ళంతా  లాహోర్లో వెళ్లి పడి అలజడి సృష్టిస్తారనేది మిగతా కామెడీ కథ. 

ఎలా వుంది కథ     ఫ్రెష్ కామెడీ అనొచ్చు. కామెడీ అనగానే, పెళ్లి  కూతురు పారిపోయిందనగానే, రౌడీ గ్యాంగులు టాటా సుమో లేసుకుని తుపాకులూ కత్తులతో బీభత్స భయానక దృశ్యాల్ని సృష్టించే (ఇవ్వాల్టి ‘చుట్టాలబ్బాయ్’ వరకూ)  తెలుగు కామెడీల్లా లేదు. తెలుగు కామెడీల  క్వాలిటీ నేలకు దిగిన పరిస్థితుల్లో కాస్త ఉపశమనం కోరుకునే వాళ్ళు  ‘హేపీ భాగ్ జాయేగీ’ హాస్యాన్ని ఆశ్రయించాల్సిందే. జీవితాల్లో పట్టుకున్న సృజనాత్మక హాస్యం దీని ప్రత్యేకత. నిత్యజీవితంలో అనుభవమయ్యే వివిధ పరిస్థితుల సునిశిత పరిశీలనలోంచి బోల్డు హాస్యాన్ని సృష్టించిన కథ. పెళ్లి కూతురు పారిపోవడమనేది పాత కథే, కథనం కొత్తది. దీనికి పాకిస్తాన్ నేపధ్యం సరికొత్తది. ఎవరి మనోభావాల్నీ  దెబ్బతీసే ఎలాటి రాజకీయ కామెంట్లు గానీ, జోకులు గానీ  లేని క్లీన్ ఎంటర్ టైనర్. హీరోయిన్ చూపించే ఇండియన్ నోటు మీద గాంధీ బొమ్మ చూసి, పాక్ పోలీసు సెల్యూట్ కొట్టేలాంటి చిన్న చిన్న ఫన్నీ సీన్స్ కి కూడా,  పాక్ సెన్సార్ బోర్డు అభ్యంతర పెట్టి అనుమతి ఇవ్వలేదు గానీ- మీడియాలో ఎక్కడా ఏ అంశం మీదా వివాదం రేగకుండా జాగ్రత్త తీసుకున్న కథ ఇది.  ‘నువ్వేమైనా అడుగు, కాశ్మీర్ తప్ప’ అని  పాక్ పోలీసు అధికారి పలికే  డైలాగుగానీ, జిన్నా చిత్రపటం చూసి – ‘ఇంకెన్ని అబద్ధాలు చెప్పిస్తావు?’ అని హీరో అనే డైలాగు గానీ నవ్వు తెప్పించేవే. ‘నేను ఇండియా వెళ్లి ఇండియా ఉప్పు తినను’  అని పాక్ పోలీసు అధికారి అంటే, ‘మనం దిగిమతి చేసుకుంటున్నది ఇండియా ఉప్పే’ అని హీరో గుర్తు చేయడం ఎలాటి సెన్సార్ కీ, కాంట్ర వర్సీలకీ దొరకని సెటైరే.  ఇక ప్రతీ మాటకీ హీరో తండ్రి - It will change the history of Pakistanఅనడం అతి పెద్ద  వ్యంగ్య బాణమే అనుకోవాలిగానీ, ఒంటి కాలిమీద లేవడానికి ఎవరికీ అవకాశమే ఇవ్వదు. అమృత్ సర్ లో చెడిపోయే మొదటి పెళ్లి సీను దగ్గర్నుంచీ, లాహోర్ లో సామూహిక వివాహాల సీను వరకూ నాన్ స్టాప్ క్రేజీ కామెడీ ఇది. 
ఎవరెలా చేశారు
       బిగ్ మసాలా సినిమాలకి దూరంగా సహజంగా వుండే చిన్న చిన్న సినిమాలతో వెరైటీ పాత్రల్ని ప్రేక్షకులకి పరిచయం చేస్తున్న అభయ్ డియోల్ కిది మరో విభిన్న పాత్ర. పాకిస్తానీయుడి పాత్రలో, అదీ మాజీ గవర్నర్ కొడుకు పాత్రలో,  హుందాగా కన్పిస్తూ ఉత్తమ హాస్యాన్ని పలికించాడు. మన తెలుగు సినిమాల్లోలాగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కొడుకైనా సరే ఆవారా తాగుబోతు, నీచ నికృష్ట, కోన్ కిస్కా గాడిలా వుండాలన్న దిక్కు మాలిన తెలుగు రూలు నుంచి ఇదెంతో రిలీఫ్!

        అభయ్  పాత్రకో అంతర్మథనముంది- క్రికెటర్ అవాలన్న తన కోరిక చంపుకుని తండ్రి కోర్కె తీరుస్తూ ఇష్టంలేని రాజకీయాల్లోకి వచ్చాడని. పంజరంలో పక్షిలా ఫీలవుతున్నాడు. తనకి విరుద్ధంగా హీరోయిన్ హేపీ తన స్వాతంత్ర్యం కోసం ఎప్పుడైనా ఎక్కడికైనా పారిపోగల తత్త్వంతో వుండడం. ఇలాటి ఈమెని తిరిగి తండ్రి దగ్గరికి పంపి ఆమె స్వేచ్చని, కోరికల్ని హరించకుండా,  ప్రియుడితో పెళ్లి జరగడానికి సహకరించాలన్న ధ్యేయం పెట్టుకుంటాడు-తనకి లేని స్వేచ్చ ఆమె కుండాలన్న ఆలోచనతో.  దీంతో పాత్ర అమాంతం ఎలివేటవుతుంది. కానీ ఈ ధ్యేయంతో చాలా చిక్కుల్లో పడతాడు. చాలా గేములు ఆడాల్సి వస్తుంది. సొంత తండ్రి, కాబోయే భార్య, కాబోయే మామ, హీరోయిన్ తండ్రి, పెళ్లి కొడుకు బగ్గా, లాహోర్ లో వాడి  అనుచరులూ – ఇంతమందిని ఎదుర్కొని గట్టెక్కాల్సిన పరిస్థితి దాపురిస్తుంది! సాధారణంగా హీరోకి వ్యతిరేకంగా విలన్ ఒక్కడే ఉంటాడు, కానీ ఇక్కడలా కాదు- హీరోకి అందరూ వ్యతిరేకులే- ఒక్కోసారి హీరోయిన్ కూడా. 
       ఏ రాజకీయాల్ని అసహ్యించుకుంటాడో ఆ రాజకీయాలే చెయ్యాల్సి వస్తుంది. హేపీ ప్రియుడు గుడ్డూ కోసం అమృతసర్ వచ్చినప్పుడు కోరిక ఆపుకోలేక గల్లీలో పిల్లలతో క్రికెట్ ఆడతాడు. రెండు  సిక్సర్ లు కొట్టి, తను పాకిస్తానీ అని ప్రకటిస్తాడు. ఈ సంగతి ముందు చెప్పి వుండాల్సింది - అని పిల్లలు అనగానే, పిల్లల చేతిలో కూడా క్రికెట్ రాజకీయాలమయమై పోయిందని వాపోతాడు! అభయ్  డియోల్ కిది కొత్త నేపధ్యంతో కొత్త తరహా పాత్ర. 
      హేపీ పాత్రలో హీరోయిన్ డయానా పెంటీది సినిమాలో అందరికంటే డాషింగ్ పాత్ర. ఆమె ఒక్క తన్ను తంతే ఎక్కడికి ఎగిరెళ్లిపోతారో తెలీదు. ఆమె ఎక్కువ ఆలోచించదు. ఎప్పుడేది అనుకుంటే అప్పుడది వెంటనే చేసేస్తుంది. మనదేశం, పర దేశం అన్న తేడా,  భయం కూడా లేవు. లాహోర్ లో ఆటో వాడికి ఇండియన్ నోటు ఇచ్చి అడ్జస్ట్ చేసుకొ మ్మంటుంది. వాడు వినకపోతే చితకబాది గలాభా సృష్టిస్తుంది. ‘పాకిస్తాన్ లోకి వచ్చి ఇలా పడ్డావ్, నీకు టెన్షన్ గా లేదా?’ అనడిగితే, ‘నాకెందుకూ టెన్షన్, పాకిస్తాన్ పడాలి  టెన్షన్!’ అనేసే రకం. 
      ఆమెని వెతుక్కుంటూ లాహోర్ వచ్చిన ఆమె తండ్రి, మాజీ గవర్నర్ ని చంపడానికి వచ్చిన టెర్రరిస్టుగా ముద్ర పడి, వూరంతా పోస్టర్లు వెలసి, పోలీసు వేటతో నానా తంటాలు పడతాడు. ఈ పాత్రలో కన్వల్జిత్ సింగ్ ది ఇంకో రకమైన హాస్యం. హేపీని వెతుక్కుంటూ లాహోర్ వచ్చిన పెళ్లి కొడుకు బగ్గా, జగ్గా అనేవాడి లోకల్ ముఠాతో హేపీని కిడ్నాప్ చేయడానికి ప్లానేస్తాడు. ఈ నెగెటివ్ పాత్రలో హీరో జిమ్మీ షేర్ గిల్ అచ్చం పంజాబీ వాడిలా కన్పిస్తాడు. తనేం మాట్లాడతాడో అర్ధం జేసుకోవడం చాలా కష్టం- ‘ఐయాం స్పీకింగ్ విత్ గుడ్డూ మీ దమన్ సింగ్ బగ్గా పంజాబీ టు ‘ఇంగీష్’ నాన్ స్టాప్  టాప్ స్పీడ్  హూ యూ బీ వాట్ యూ వాంట్’ -  అని ఫుల్ స్టాపులు, కామాలు లేకుండా అనేస్తాడు. గమ్మత్తయిన క్లయిమాక్స్ తో తనే లాహోర్ వదిలి అమృత్ సర్ పారిపోయి రావాల్సి వస్తుంది. అమృత్ సర్ లో సభ ఏర్పాటు చేసి, పెళ్ళయిపోయిన హేపీ- గుడ్డూ లని పొగుడుతూ ఉపన్యసించే తీరు జిమ్మీ షేర్ గిల్ నుంచి అద్బుత కామెడీ.  

        మోడరన్ గర్ల్ జోయా పాత్రలో పాకిస్తానీ నటి
మోమల్ షేక్ సీరియస్ గా వుంటుంది పరిస్థితుల ప్రకారం. ఆమె తండ్రిగా వేసిన మనోజ్ బక్షీ - అభయ్ డియోల్, అతడి పనిమనుషులూ పెట్టే తికమకకి జవాబులు వెతుక్కునే పాత్రలో రాయల్ కామెడీని ప్రదర్శిస్తాడు. అభయ్ తండ్రిగా వేసిన జావేద్ షేక్ అయితే తన ఊతపదంతో (ఇట్ విల్  ఛేంజ్ ది హిస్టరీ  ఆఫ్ పాకిస్తాన్) ఇంకో గుర్తుండి పోయే పాత్ర పోషించాడు.

        ఇక టాప్ కామెడీ అయితే పీయూష్ మిశ్రాది. పాక్ పోలీసు అధికారి ఉస్మాన్ గా నవాబీ ఉర్దూ మాట్లాడుతూ గందరగోళం సృష్టిస్తాడు. పాతకాలం నవాబులు ఎలా మాట్లాడతారో అవే పదాలతో,  ఉచ్ఛారణతో, ముఖకవళికలతో పాత్రని ఎంజాయ్ చేస్తూ జీవించేస్తాడు. డబ్బా గాళ్లయిన గుడ్డూతో, బగ్గాతో  అతడి సీన్లు టాపు లేచిపోతాయి. అమాయక ప్రేమికుడు గుడ్డూ పాత్రలో అలీ ఫైజల్ కూడా ఫర్వాలేదు. 

        తన కెమెరా పనితనంతో లాహోర్ లొకేషన్స్ ని బాగా మనోరంజకం చేశాడు సౌరభ్ గోస్వామి. ఇందుకు పాకిస్తానీయులు అభినందించాలి. అయితే అమృత్ సర్ దృశ్యాలకి అక్కడి బాణీల్ని నేపధ్య సంగీతంగా కూర్చిన  సోహైల్ సేన్, లాహోర్ సన్నివేశాలకి అక్కడి సంస్కృతితో కూడిన బాణీలు కూర్చివుంటే బావుండేది- అక్కడి బాణీలు  హిందుస్తానీ సంగీతమేగా! 

        కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం అన్నీ తానై నిర్వహించిన ముదస్సర్ అజీజ్,  పెళ్ళికూతురు పారిపోవడమనే పాత కథనే  కొత్తరకం పాత్రలతో,  కొత్త రకం నేటివిటీతో, సన్నివేశాలతో వినోదభరితం చేశాడు బాగానే వుంది గానీ, అదే సమయంలో స్క్రీన్ ప్లే తో హీరో పాత్ర సమన్వయం కూడా చూసుకోవాల్సింది. ఫస్టాఫ్ లో హీరోయిన్ వల్ల  రాజకీయంగా అల్లరవుతుందని భయపడి గుడ్డూ తో ఆమెని కలిపేసేందుకు  ప్రయత్నించే హీరో, సెకండాఫ్ లో తన గోల్ కి కారణం ఇది కాదన్నట్టు- తనకి లేని స్వేచ్ఛ హీరోయిన్ కుండాలన్నట్టుగా వెల్లడించడం, అందుకే తను ప్రయత్నిస్తున్నట్టు చెప్పడం  స్టోరీ పాయింటుని  రెండుగా చీల్చినట్టు వుంది. హీరో పాత్రకి ఒక గోల్ పెట్టినప్పుడు దానికి ఒకే కారణం పెట్టివుంటే పాత్ర ఇంకా బలంగా కన్పించేది. ఈ పాత్ర గోల్ కి సెంటిమెంటు బలమున్న స్వేచ్ఛ కి సంబంధించిన కారణమే కరెక్ట్. 

చివరికేమిటి?
      కామెడీ రైటింగ్ కూడా ఇంటలిజెంట్ రైటింగ్ గా మారినప్పుడు అప్డేటెడ్ మూవీస్ ఇలా ప్రేక్షకుల మధ్యకి వస్తాయి.  సినిమాటిక్ డైలాగులతో, సీన్లతో,  క్రియేటివిటీ లేని మాసిపోయిన కార్బన్ కాపీ కామెడీలు తీయడం అలవాటుపడిన వాళ్ళు - ఇలా జీవితాల్లో ఉట్టి పడే సహజ హాస్యంతో  ఆరోగ్యకర సినిమాలు తీసే స్థాయికి ఎదగడం ఇప్పటి అర్జెంటు అవసరం. సమాజంలో చాలా హస్యముంది, పాత్రలున్నాయి- వీటితో ప్రేక్షకులు తమని ఐడెంటిఫై చేసుకున్నంతగా, మూసఫార్ములా కామెడీ- పేరడీలకి కనెక్టయ్యే  పరిస్థితి ఇక లేదని వారం వారం తెలుస్తూనే వుంది.

        రెండోదేమిటంటే, హార్రర్ కామెడీ, థ్రిల్లర్ కామెడీ, యాక్షన్ కామెడీ, క్రైం కామెడీ, అడల్ట్ కామెడీ...ఇంకేవేవో  కామేడీలంటూ ఇతర జానర్లని కలిపి కృత్రిమంగా విరగబడి తీసేస్తూ,  ప్యూర్ కామెడీనే మర్చిపోయారు. ప్యూర్ కామెడీలకి  ఇటు జంధ్యాల, ఈవీవీ లాంటి వాళ్ళు; అటు హృషికేష్ ముఖర్జీ, ప్రియదర్శన్ లాంటి వాళ్ళూ  ఇప్పుడు లేనే లేరు. ముదస్సర్ అజీజ్ ఈ కొరత తీర్చాడు. 

        మూడోదేమిటంటే, సింగీతం శ్రీనివాసరావు టైపు హింస లేని ఫక్తు హాస్యభరిత క్లయిమాక్సులు ఇప్పుడు  వర్కౌట్ కావేమో అన్న సందేహాల్ని  కూడా ‘హేపీ భాగ్ జాయేగీ’ శుభ్రంగా పటాపంచలు చేస్తోంది.

-సికిందర్