రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

1, ఆగస్టు 2016, సోమవారం

స్క్రీన్ ప్లే సంగతులు!


         
సినాప్సిస్  రాసుకోకపోవడం వల్ల చాలా సినిమాలు అట్టర్ ఫ్లాపవుతున్నాయి. సినాప్సిస్ ఐడియా నుంచి పుడుతుంది. ఐడియా ఒక స్టోరీ లైన్ లోకి ఒదగలేదంటే, సినాప్సిస్  (4 పేజీల కథాసంగ్రహం) కూడా కుదరదు.  ‘జక్కన్న’ లో  చిన్నప్పుడు విలన్ చేసిన సాయానికి జక్కన్న ప్రతిసాయం చేయాలనుకోవడం మాత్రమే కథకి  ఐడియా అవుతుందా? ఇది అర్ధవంతంగా వుందా? ఇందులో కథ కన్పిస్తోందా? స్ట్రక్చర్ కన్పిస్తోందా?  బిగినింగ్-మిడిల్- ఎండ్ విభాగాలు కన్పిస్తున్నాయా? ఇవేవీ కన్పించనప్పుడు కోట్ల రూపాయలతో ఈ సినిమా తీయడానికి ఎలా సాహసించినట్టన్నది జక్కన్నే చెప్పాలి.  

         
సినిమా తీయడానికి వాస్తు చూసుకుంటారు, ముహూర్తాలు చూసుకుంటారు, పూజలు చేసుకుంటారు, జ్యోతిషం కూడా చెప్పించుకుంటారు. కానీ తీస్తున్న సినిమా ఐడియాకి వాస్తు వుందా, శాస్త్రం వుందా, జ్యోతిషం చెప్పించుకోవాలా అని ఆలోచించరు. తమకి తోచిందే ఐడియా, తమకు తోచిందే శాస్త్రం, తమకు తట్టిందే దాని వాస్తు. ఈ కర్ర పెత్తనం లేని హాలీవుడ్ లో  సినాప్సిస్ రైటింగ్ కే ప్రత్యేకమైన శిక్షణా సంస్థలు ఎందుకుంటున్నాయో కాస్త ఆలోచించాలి.

        నిజానికి సినాప్సిస్ రాయడానికి జక్కన్న ఐడియాలో పావు వంతు కథే కన్పిస్తోంది.  అంటే ప్రేక్షకులనుంచి పూర్తి సినిమా డబ్బులు తీసుకుని, పావు వంతు కథే చూపించారన్న మాట. ఇలాటి స్కాములు కూడా జరురుగుతున్నాయని అర్ధంజేసుకోవాలి. ఈ పావువంతు కథతో- ‘విలన్ తనకి చిన్నప్పుడు చేసిన సాయానికి జక్కన్న ప్రతిసాయం చేయాలనుకుని వస్తాడు’ ...అనేది మాత్రమే ఐడియాగా కన్పిస్తోంది. ఈ అయిడియా పావు వంతు కథ మాత్రమే. ఎందుకంటే ఇది స్క్రీన్ ప్లే  స్ట్రక్చర్ లో బిగినింగ్ ని  మాత్రమే సూచిస్తోంది. ‘సాయం చేయడానికి జక్కన్న వస్తే విలన్ ఎలా రియాక్ట అయ్యా’ డనేది కలుపుకుంటే అప్పుడు ఇంకో సగం కథ కలుస్తుంది. అంటే స్ట్రక్చర్  లో మిడిల్ విభాగమవుతుంది.  చివరికేమైందో చెప్పుకుంటే  మిగతా పావు వంతూ  కథ కలిసి -అంటే ఎండ్ విభాగం కూడా జతకూడి స్ట్రక్చర్ పూర్తవుతుంది. వలయం పూర్తి కాకుండా విద్యుత్ ప్రవహించదు, అవునా? అలాగే బిగినింగ్- మిడిల్-ఎండ్ అనే వలయం పూర్తికకపోతే ఐడియా, సినాప్సిస్, స్క్రీన్ ప్లే ఏదీ సాధ్యం కాదు. 

     తనకి విలన్ చిన్నప్పుడు చేసిన సాయానికి ప్రతిసాయం చేయాలనుకున్న జక్కన్నకి- విలనే తెగ సాయం చేసేస్తూ ఎదురు బాదుడు మొదలెడితే  జక్కన్న పరిస్థితి ఏమిటీ ...అని ఐడియాని సవరించుకోవచ్చు. అప్పుడిందులో కథకి మూడంకాలు (బిగినింగ్- మిడిల్- ఎండ్ లు) కన్పిస్తాయి. అంకాలు లేని కథ డొంక దారే చూసుకుంటుంది. ప్రతిసాయం చేయడానికి జక్కన్న రావడం బిగినింగ్, విలనే ఎదురు సాయంతో బాదడం మిడిల్, అప్పుడు జక్కన్న  పరిస్థితేమిటన్నది ఎండ్ గా కథకి కావాల్సిన స్ట్రక్చర్లో ఐడియా వుంటుంది. 

        ప్రతిసాయం చేయాలనుకుని వచ్చిన వాడు ఆ సాయమేదో చేసేసిపోతే, కథెలా అవుతుంది? అది సినిమా తీయడానికి  పనికిరాని ఉత్త ‘గాథ’ అవుతుంది.  జక్కన్న చేసే ప్రతిసాయాన్ని విలన్ అడ్డుకుంటూ సమస్యలు సృష్టిస్తే అప్పుడది కథకి అవసరమైన ఆర్గ్యుమెంట్ ని ప్రతిపాదిస్తూ కథా లక్షణాన్ని ప్రదర్శిస్తుంది. ‘గాథ’ గా ఎలా వుంటుందంటే - నాకెప్పుడో విలన్ చేసిన సాయానికి నేను ప్రతిసాయం చేసి ఇలా బదులు తీర్చుకున్నానూ అని చప్పగా జక్కన్న  ‘స్టేట్ మెంట్’  ఇచ్చేసి తప్పుకునేదిగా వుంటుంది.

         ఇదే కథయితే ఎలా  వుంటుందంటే –నేను పొందిన సాయానికి  ప్రతిసాయం  చేద్దామని వస్తే తనదైన పాయింటుతో అడ్డుకుని ఎదురు సాయం చేస్తూ పోయాడు  వెధవ- అని జక్కన్నకీ- విలన్ కీ మధ్య ఓ పాయింటుతో ఆర్గ్యుమెంట్ సహిత సంఘర్షణని సృష్టించేదిగా వుంటుంది. స్టేట్ మెంట్ కీ, ఆర్గ్యుమెంట్ కీ తేడా గుర్తించాలి : స్టేట్ మెంట్ లో కథ వుండదు, ఆర్గ్యుమెంట్ లో కథ వుంటుంది. ఎందుకంటే ఆర్గ్యుమెంట్ తో  సంఘర్షణ పుడుతుంది, స్టేట్ మెంట్ తో సఘర్షణ పుట్టదు. సినిమా కథంటే సంఘర్షణే. గాథల్లో సంఘర్షణ వుండదు. ఇందుకే  ‘జక్కన్న’ లో విలన్ సంఘర్షించకుండా ఏమీ చేతకాని జోకర్ లా మిగిలిపోయాడు.  

        పైన చెప్పుకున్నట్టు-  తనకి విలన్ చిన్నప్పుడు చేసిన సాయానికి ప్రతిసాయం చేయాలనుకున్న జక్కన్నకి- విలనే తెగ సాయం చేసేస్తూ ఎదురు బాదుడు మొదలెడితే  జక్కన్న పరిస్థితి ఏమిటీ ...’  అన్న సవరించిన అయిడియాతోనే సినాప్సిస్ కి పూనుకున్నామనుకుందాం. (అసలు కథంటే  డైనమిక్స్ కూడా. హీరో అనుకున్నట్టే జరిగిపోతే అది కథే కాదు. జక్కన్న ప్రతిసాయం చేసేద్దామని వస్తే విలన్ దానికి చెక్ పెడుతూ తనే ఎదురు సాయం చేస్తూ చావగొడితే అప్పుడిందులో  డైనమిక్స్ వుంటాయి). ఈ  విధంగా ఐడియాని సవరించుకుంటే అప్పుడు వర్కౌట్ అవుతుందా? ముందు ఈ ఐడియా ప్రేక్షకులకి అమ్ముడుబోయే ఐడియాయేనా? లేకపోతే ప్రేక్షకుల దగ్గర పక్కాగా అసలీ నోట్లు లెక్కెట్టుకుని తీసుకుని, ఆనవాయితీగా  నకిలీ సినిమా అంటగట్టడమే అవుతుందా? రెండు చోట్ల బతికిపోతారు తయారీదార్లు- ఒకటి, మద్యం ధరలు పెంచేసినా ఉద్యమాలు చెలరేగే పరిస్థితి వుండదు; రెండు, నకిలీ సినిమాలు అంటగట్టినా తిరుగుబాట్లు జరుగుతాయనే భయం వుండదు. సినిమాల విషయంలో ఎప్పుడో ఒకసారి బయ్యర్లు రోడ్డెక్కుతారు, అంతే. కానీ ఎవరెలా పోతే మనకేంటనుకున్నా, ఫ్లాప్ టాక్ వస్తే  జక్కన్న పరువుకి అంత మంచిది కాదేమో? 

    కాబట్టి  ముందు సెలెక్టు చేసుకున్న ఐడియా అమ్ముడుబోయే ఐడియాగా వుండక తప్పదు. అమ్ముడుబోవడానికి ఈ ఐడియాలో ఏముందని? సాయం చేస్తే ప్రతి సాయం చేయడమేనా? అదీ పదిహేనేళ్ళ తర్వాత విలన్ చేసిన సాయం గుర్తు పెట్టుకుని మరీ ప్రతి సాయం చేద్దామని రావడమేనా? కన్విన్సింగ్ గా వుందా? సాయానికి ప్రతిసాయం చేయాలనుకోవడమే వెర్రితనం. సాయం చేసే వాళ్ళు తిరిగి ఆ మనిషి నుంచి ఏదో ఆశించి  సాయం చేయరు. ఒకవేళ సాయం చేసిన మనిషి ఆపదలో వుంటే గుర్తుంచుకుని ఆదుకోవడం ధర్మమే కావచ్చు. జక్కన్న చిన్నప్పుడు స్కూల్లో నేర్చుకున్న పాఠం ఇదే. చీమ ఆపదలో వున్నప్పుడు పక్షివల్ల సాయం పొందింది. తిరిగి పక్షి ఆపదల్లో పడ్డప్పుడు చీమ కాపాడింది. 

        అంతేగానీ తన ప్రాణాలు కాపాడినందుకు  -నీ ప్రాణాలు కూడా నేను కాపాడతానూ,  నీ ప్రాణాలు కూడా నేను కాపాడతాను ప్లీజ్ -  అని పక్షి వెంట పడలేదు చీమ. కానీ పెద్దయ్యాక కూడా జక్కన్న- తన పర్సు కింద పడిపోతే బెగ్గర్ కొట్టెయ్యకుండా తీసిచ్చిన  పాపానికి, అప్పటికప్పుడు వెంటపడి మరీ సాయం చేసిన  బెగ్గర్ ని సింగర్ గా మార్చేసే దాకా వూరుకోడు. ఇలాటి వాణ్ణి చూస్తే పొరపాటున కూడా వీడికి సాయం చేయకూడదనే అన్పిస్తుంది ఎవరికైనా. తనకి సాయం చేసిన వాళ్ళ జీవితాల్లో వ్యవసాయం చేసేస్తానని ఊతపదం కూడా జక్కన్నకి. నిజానికిది మానసిక రోగం. ఈ రోగం పది రెట్లవుతుంది. అప్పుడెప్పుడో చిన్నప్పుడు ఒక విలన్ వల్ల  కాకతాళీయంగా తను బతికిపోతే, పదిహేనేళ్ళ తర్వాత ఆ విలన్ కి సాయం చేద్దామని బయల్దేరి రావడమే  సైకోతనం. 

        మురెల్ జేమ్స్- డొరోతీ జొన్గేవార్డ్ లు రాసిన ప్రసిద్ధ పుస్తకం  ‘బోర్న్ టు విన్’ వుంది. అందులో  ఒక సైకలాజికల్ కండిషన్ ని వివరిస్తారు. ఉదాహరణకి చిన్నప్పుడు అన్నదమ్ములు బొమ్మ బస్సుతో ఆటలాడుకుంటూంటారు. ఆ బొమ్మ బస్సు తమ్ముడిది. దాని చక్రం అన్న చేతిలో విరిగింది. అది మనసులో పెట్టుకున్నాడు తమ్ముడు. ఇద్దరూ పెద్దవాళ్ళయి పోయారు, బాగా పెద్ద వాళ్ళయి పోయారు. ఎవరి కుటుంబాలతో వాళ్ళు సుఖంగా వున్నారు. అంతలో ఏమైందో, అన్న బతుకు దుర్భరం చేయసాగాడు తమ్ముడు. ఇంటిమీదికొచ్చి దాడి చేయడం, పారిపోవడం. ఏంటంటే, చిన్నప్పుడు నువ్వు నా బస్సు చక్రం విరగ్గొట్ట లేదా? ఇప్పుడనుభవించూ! 

      ఇదీ విషయం. ఈ మానసిక స్థితిని  ‘సైకలాజికల్ ట్రేడింగ్ స్టాంప్స్’  అన్నారు సదరు సైకియాట్రిస్టులైన  ఈ గ్రంథ రచయిత్రులు. అంటే చిన్నప్పుడు పొందిన చిన్న చిన్న అవమానాలు కూడా అలాగే మనసులో ముద్రేసుకుని వుండిపోతాయి. మనసు వొక ఆల్బం అనుకుంటే ఆ అవమానాలు స్టాంప్స్. ఒక్కో అవమానం ఒక్కో స్టాంపుగా మనసు ఆల్బంలో భద్రపర్చుకుంటూ పోతారు. ఎప్పుడో బుర్రతిరుగుతుంది. అప్పుడు ఆ మనసు ఆల్బం తిరగేసి స్టాంపులు చూసుకుంటూ, ఏళ్ళు గడిచిపోయాక పాత కక్ష తీర్చుకుంటూ ఇలా తిక్క వేషాలేస్తారన్న మాట! 

        ఇది పసి మనస్తత్వమే. జక్కన్న ఐడియా ఈ మానసిక స్థితి ఆధారంగా పుట్టి వుండవచ్చా అంటే అలా కూడా  అన్పించదు. పక్కా  సైకో పాత్రగానే కన్పిస్తాడు. మరి సైకోతో బ్లాక్ కామెడీ వర్కౌట్ అవుతుంది. ఇది బ్లాక్ కామెడీయా అంటే అదీ కాదు, ఏదో ఓ యాక్షన్ కామెడీ.  ‘భేజా ఫ్రై’ అనే హిందీ హిట్ కామెడీలో  మ్యూజిక్ కంపెనీ ఓనరైన రజత్ కపూర్ ఇంట్లో పల్లెటూరి నుంచి సింగర్ నవుదామని వచ్చిన వినయ్  పాఠక్  తిష్ట వేసి నానా బీభత్సం సృష్టిస్తాడు. తన చేష్టలతో ఆ కుటుంబంలో భార్యాభర్తలు విడిపోయేలా అపార్ధాలు కూడా సృష్టిస్తాడు. ఇతను సైకోనా అంటే కాదు, మ్యూజిక్ వరల్డ్ గురించి ఏమీ తెలీని అమాయకుడు. తన చేష్టల వల్ల ఎంత నష్టం జరుగుతోందో కూడా తెలుసుకోని భోళాశాకంరుడు.

        కాబట్టి జక్కన్న సైకో అయితే తప్ప, అదీ బ్లాక్ కామెడీ అయితే తప్ప, ఈ అయిడియా వర్కౌట్ కాదని తేలుతోంది. ప్రేక్షకులు సైకోలు కారు. కనుక ఒక సైకో కాని జక్కన్నేంటీ ఇలా  సాయం చేసిన వాళ్ళ జీవితాల్లో వ్యవసాయం చేస్తానంటూ వెంట పడుతున్నాడూ - అనేసి జక్కన్నతో ఎమోషనల్ గా కనెక్ట్ కూడా కాలేరు. పోనీ ఇది కామెడీ కాబట్టి పక్షీ చీమా నీతి  కథనే  జక్కన్న అతి చేస్తున్నాడని సర్దుకుపోవడానికీ లేదు. ఎందుకంటే కామెడీ కథకి పునాదిగా వుండే పాయింటు లాజికల్ గా వుంటేనే దానిపై కమెడియన్ ఎంత అసంబద్ధంగా, అతిగా కామెడీ చేసినా చెల్లిపోతుంది. పునాదిగా వున్న పాయింటునే (నీతికథనే) అతి చేస్తే దాన్నాధారంగా అతి చేయడానికి ఏ కామెడీ వుండదు. కాబట్టి ఈ సవరించిన ఐడియా అబ్సర్డ్ (అసంబద్ధ) కామెడీగానూ పనికిరాదు. ఇదొక అసహజ పాత్ర, దీంతో ఐడియాని ఎంత  సవరించినా ఎంతకీ అమ్ముడుబోని ఐడియాగానే వుండిపోతుంది. దీంతో సినాప్సిస్ రాయడమే కుదరదు, స్క్రీన్ ప్లే సంగతి తర్వాత! 

        ఇలా ఐడియాలో అర్ధవంతమైన కథ కన్పించడం ఎందుకవసరమో తెలుసుకున్నాక, ఈ అమ్ముడుబోని ఐడియా కథనం కూడా ఎలావుందో ఇప్పుడు చూద్దాం...

కథ 

బిగినింగ్ :        చిన్నప్పుడు పక్షీ చీమా నీతి  కథ తెలుసుకున్న గణేష్ అలియాస్ జక్కన్న (సునీల్) కథలో చీమలా కాకుండా అతిగా బిహేవ్ చేస్తూంటాడు. తన కెవరైనా చిన్న సాయం చేస్తే జీవితాతం వెంటపడి వాళ్లకి సాయం చేసేస్తూ ఉంటాడు. ఇలాటి వాడు ఒకరోజు బట్టలు సర్దుకుని వైజాగ్ వచ్చేస్తాడు. చేత్తో వేసిన ఒకడి బొమ్మ పట్టుకుని ఆరా తీస్తూ తిరుగుతూంటాడు. ఆ బొమ్మ బైరాగి (కబీర్ సింగ్) అనే మర్డర్లు చేసే రౌడీది. వీడు ఎవరికీ కన్పించడు. పేరు మాత్రమే జనాలకీ, పోలీసులకీ తెలుసు, కానీ ఎలా ఉంటాడో రూపం  తెలీదు. 

        ఇలా ఒకవైపు వీడి కోసం వెతుకుతూ, ఇంకో  కన్పించిన సహస్ర (మన్నారా చోప్రా) అనే అమ్మాయి వెంట పడుతూంటాడు. ఈమె నెలరోజుల్లో ఒకడ్ని కొట్టడం కోసం కుంగ్ ఫూ మాస్టర్ (సప్తగిరి) దగ్గర కరాటే నేర్చుకుంటోంది. ఆ కరాటే స్కూల్లో తనూ చేరి ఆమెని ప్రేమించేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు జక్కన్న. 

        పోగాపోగా బైరాగిని కనుక్కుంటాడు. ఇంతకీ నువ్వెందుకు నాకోసం వెతుక్కుంటూ వచ్చావని బైరాగి అడిగితే చెప్పడు. నీకోసం ఏమేం  చేస్తానో చూడూ అని వెంటపడతాడు. బైరాగీ ఎలా వుంటాడో వూరంతా పోస్టర్లు అంటించి జనాలకీ పోలీసులకీ, శత్రువులకీ తెలిసి   పోయేట్టు  చేస్తాడు. ప్రతీ సెంటర్ కీ జనాల మధ్యకి బైరాగిని రప్పిస్తూ దొరక్కుండా ఆటలాడుకుంటాడు. వీడెడవడ్రా అసలు వీడికేం కావాలీ- అని అనుచరుడు నల్లస్వామి( సత్య ప్రకాష్) దగ్గర తలబాదుకోవడమే చేస్తూంటాడు బైరాగి. 

        బైరాగి శత్రువులు బైరాగిని చంపడానికి వచ్చేస్తారు. వాళ్ళందర్నీ చంపేసి బైరాగి ప్రాణాలు కాపాడతాడు జక్కన్న. అప్పటికీ తానెవరో చెప్పకుండా ఏడ్పిస్తూనే వుంటాడు. బైరాగిని పట్టుకోవడానికి ఢిల్లీ నుంచి ఇన్స్ పెక్టర్ (పృథ్వీ) వస్తాడు. ఇన్స్ పెక్టర్ ని బోలెడు కన్ఫ్యూజ్ చేస్తూ బైరాగి దొరక్కుండా చేస్తూంటాడు జక్కన్న. అన్ని ఆధారాలతో బైరాగిని అరెస్టు చేయడానికి ఇన్స్ పెక్టర్ వచ్చేస్తే, బైరాగీ ఇంట్లో బోలెడు మంది బంధువులుని దింపి ఇన్స్ పెక్టర్ని ఫూల్ చేస్తాడు జక్కన్న. ఇన్స్ పెక్టర్ నీ, బైరాగీని కన్ఫ్యూజ్ చేస్తూ బైరాగి ఇంట్లో గేమ్ ఆడుతూంటాడు జక్కన్న. 

        తను ప్రేమిస్తున్న సహస్ర బైరాగి చెల్లెలని తెలుస్తుంది. ఆమె తల్లిదండ్రులు తల్లిదండ్రులు కారు. ఆమె చిన్నప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలని బెదిరించి బైరాగీయే అప్పగించాడు. ఈ ఫ్లాష్ బ్యాక్ తర్వాత,  తను బైరాగికి ఎందుకు సాయం చేస్తున్నాడో ఫ్లాష్ బ్యాక్ వేసుకుంటాడు జక్కన్న. చిన్నప్పుడు బైరాగీ మర్డర్లు చేస్తున్న సంఘటనలో ఇరుక్కున్న తనని,  బైరాగీ శత్రువు చంపబోతూంటే, అప్రయత్నంగా శత్రువుని చంపేసి తన ప్రాణాలు కాపాడాడని చెప్పుకుంటాడు.

ఎండ్ :
       
ప్పుడు బతికున్న శత్రువు మళ్ళీ బైరాగిని చంపేందుకు ప్రయత్నిస్తాడు. ఈ శత్రువుని జక్కన్న చంపేసి బైరాగిని కాపాడతాడు. ఇక బరాగి దగ్గరే సెటిలై ఇంకా సాయం చేస్తూనే వుంటా నంటాడు.  వద్దురాబాబూ  అని దండం పెట్టుకుంటాడు బైరాగీ. సహస్ర జక్కన్న చేయి అందుకుంటుంది. అందరూ హాయిగా నవ్వుకుంటారు. శుభం కార్డు పడుతుంది.  


స్క్రీన్ ప్లే సంగతులు
        పై కథలో జక్కన్న తానెందుకు బైరాగీకి సాయం చేస్తున్నాడో ఫ్లాష్ బ్యాక్ చెప్పే వరకూ సుదీర్ఘంగా సాగిందంతా బిగినింగ్ విభాగంగా గుర్తించాలి. ఆ తర్వాత నుంచీ బైరాగి శత్రువుని జక్కన్న చంపేశాక  కథ ముగింపు వరకూ ఎండ్ విభాగం. ఈ బిగినింగ్ కీ ఎండ్ కీ మధ్య మిడిల్ విభాగం ఈ కథలో కన్పించదు. అంటే మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అన్నమాట. కథంతా మిడిల్లోనే వుంటుంది కదా? ఆ మిడిలే ఈ కథలో లేదు, అందుకే ఇది పావువంతు కథ. రూపాయి తీసుకుని పావలా కథ చూపించారన్న మాట. పొట్లం విప్పి చూస్తే  ఆ పొట్లం చుట్టిన కాగితం తప్ప అందులో ఏమీ లేదన్నమాట! రివ్యూలు అలా రాశారు ఇలా రాశారూ అని ఎదురు నిరసనలు తెలపకుండా, సినిమా ఆఫీసు టోల్ ఫ్రీ కాల్స్ ఏర్పాటు చేస్తే, నేరుగా ప్రేక్షకులనుంచే కుప్పతెప్పలుగా ఫీడ్ బ్యాక్ వచ్చి పడుతుంది కదా? 

        ఫస్టాఫ్ అంతా బైరాగిని వెతకడం, బైరాగిని బకరా చేస్తూ పోస్టర్ల ప్రహసనంతో ఆడుకోవడం, బైరాగిని చంపడానికి వచ్చిన వాళ్ళని చంపేసి కాపాడ్డమూ జరిగి, అసలు నువ్వెవరు, ఎందుకొచ్చావని బైరాగీ అడిగితే- ముందు ముందు ఇంకా వుంది ఆట-  అని కవ్విస్తాడు జక్కన్న. దీంతో ఇంటర్వెల్ పడుతుంది. 

        తేజ తీసిన ఫ్లాపయిన  ‘హోరాహోరీ’ లో కూడా ఇలాటిదే ఇంటర్వెల్ సీన్లో కథేమిటో తెలీకుండా పోతుంది. ఇంటర్వెల్ మీదుగా బిగినింగ్ దురాక్రమించి, సెకండాఫ్ లో ఎక్కడో ముగిసి, అప్పుడు మాత్రమే కథేమిటో తెలిసే మిడిల్ మటాష్  స్క్రీన్ ప్లే అది. ఇలాటిదే  ఫ్లాపయిన ‘కిక్ – 2’ కూడా. 

ఉండాల్సిన స్ట్రక్చర్

     అంటే ఇప్పటికి గంటంపావు సమయం గడిచిపోయాక కూడా ఇంటర్వెల్లో కూడా బిగినింగ్ ముగిసి ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడకుండా, కథేమిటో తెలియకుండా, జక్కన్న గోల్ ఏమిటో తెలియకుండా, జక్కన్నకి బైరాగితో సంఘర్షణ పుట్టకుండా- మొత్తం ఫస్టాఫ్ అంతా విషయం  లేకుండా వృధాగా నడిచిందన్న మాట.  కోట్లమీద కోట్లు పెడుతూ పెట్టి ఇదంతా దండగ్గా తీసుకుంటూ పోయారన్న మాట. 

        సెకండాఫ్ లో ఇంకా బిగినింగ్ విభాగమే కొనసాగుతూంటుంది జక్కన్న ఫ్లాష్ బ్యాక్ చెప్పే వరకూ. సెకండాఫ్ లో అరగంటకి ఈ ఫ్లాష్ బ్యాక్ వచ్చినప్పుడే  కథేమిటో తెలుస్తుంది. అంటే మొత్తం గంటా ముప్పావు సమయంవరకూ కథేమిటా  అని ఎదురు చూస్తూ కూర్చోవాలన్న మాట. ఇంత సేపూ జరిగిందంతా కథే అన్న అజ్ఞానంతో దర్శకుడెలా  వుంటాడో అర్ధంకాదు.  ఈ సెకండాఫ్ లో ఇంతసేపటికి ఏర్పడే ఈ ప్లాట్ పాయింట్ వన్ నుంచీ కథ మిడిల్లో పడడానికేమీ లేదు. డైరెక్టుగా ఎండ్ లోకి వెళ్ళిపోవడమే. అంటే ప్లాట్ పాయింట్ టూ లేకుండా ప్లాట్ పాయింట్ త్రీ వచ్చేసిందన్న మాట. 

జక్కన్న  స్ట్రక్చర్ (!) 
      ఇలాటి అల్లాటప్పా స్క్రిప్టు ఎలా రాస్తారో అంతుచిక్కదు. స్టార్ దొరగ్గానే సీనిమా తీయాలంటే వుండే భయభక్తులన్నీ ఎగిరిపోతాయేమో!

        ఇంటర్వెల్ దగ్గరైనా జక్కన్న బైరాగికి ఇదీ విషయమని చెప్పకుండా కామెడీ చేయడం గొప్ప సస్పెన్స్ ని పోషిస్తున్నామనుకున్నట్టుంది. ఈ సస్పెన్స్ ఏమిటో- బైరాగి జక్కన్నకి ఏం సాయం చేసివుంటే తిరిగి బైరాగికి ప్రతిసాయం చేయడానికి జక్కన్న వచ్చాడో తెలుసుకోవాలని ప్రేక్షకులు ఇంకా కుతూహలపడతారనుకున్నట్టుంది. ఇది ఎండ్ సస్పెన్స్ అనే సుడిగుండం లోకి దిగలాగి సినిమాని నిండా ముంచేస్తుందని అస్సలు  గ్రహించలేదు. 

        ఏది సస్పెన్స్ అవుతుంది? ఫస్టాఫ్ లో సకాలంలో ప్లాట్ పాయింట్ వన్ ఏర్పాటుచేసి.  ఇదీ విషయం- ఇందుకోసమే  హీరో - విలన్లు ఘర్షించుకుంటున్నారని స్టోరీ పాయింటు చెప్పి, ఆతర్వాత వాళ్ళిద్దరి మధ్య సంఘర్షణ ఎలా ఉంటుందనేది సూచనలివ్వకపోతే అది సస్పెన్స్ అవుతుంది. స్టోరీ పాయింటే ఓపెన్ చేయకుండా- అది సస్పెన్స్-  దీనికోసం చివరంటా వెయిట్ చేయండంటే అది సస్పెన్స్ అవదు, ప్రేక్షకులకి సహనపరీక్ష పెట్టి సినిమా తన  మరణ శిక్ష తనే విధించుకోవడం అవుతుంది. 

        ఫస్టాఫ్ లో ప్లాట్ పాయింట్ వన్ పెట్టుకోకపోవడం, బిగినింగ్ నే  సెకండాఫ్ సగం దాకా సాగదీయడం, మిడిల్ మటాష్ చేసుకోవడం, ఎండ్ సస్పెన్స్ పోషించడం, విలన్ పాత్రని బకరాగా పాసివ్ గా తయారు చేయడం, జక్కన్న క్యారక్టరైజేషన్ ని ఆడియెన్స్ తో ఎమోషనల్ కనెక్షన్ లేకుండా చేసుకోవడం....ఇదంతా ఒకెత్తు అయితే, విలన్ ఇంట్లో అందర్నీ పోగేసి, కన్ఫ్యూజ్ కామెడీ అను సింగిల్ విండో స్కీములోకి కథని దింపెయ్యడం ఒకెత్తూ. 

కథనం పురాతనం 
    కథనం కూడా నేటి సినిమా చూస్తున్నట్టుగాక పల్నాటి కాలపు నాటకం వేస్తున్నట్టు వుంటుంది. ప్రారంభ సీనే పాఠశాలలో చిన్నప్పడు  హీరో నీతికథ  వినడంతో (ఇంకా ఈ చిన్నప్పటి ముచ్చట్లతో చాదస్తపు సినిమాలేంట్రా బాబూ!) , ఆ నీతితో క్లాస్ మేట్ చేసిన సాయానికి ప్రతిసాయం చేయడంతో మొదలయ్యే క్యారక్టర్ ఎస్టాబ్లిష్ మెంట్ పాట్లు –ఇంకా పెద్దయ్యాక బెగ్గర్ తో, అదయ్యాక ఒక పాటతో ఇదే క్యారక్టర్ ఎస్టాబ్లిష్ మెంట్  పాట్లు జీడిపాకంలా సాగుతూనే  వుంటాయి. ఈ జక్కన్న ఇలాటి వాడూ అని చెప్పడానికి నేటికాలపు ప్రేక్షకులు అమూల్ బేబీ లైనట్టు ఇంత స్పూన్ ఫీడింగ్ అవసరమా? పైన ఈఎమ్ ఫార్స్టర్ అన్నట్టు- స్పూన్ ఫీడింగ్  తో నేర్చుకునేదేమీ వుండదు ఆ స్పూను షేపు గురించి తప్ప! పావుగంట కాలాన్ని  తినేసే ఈ స్పూన్ ఫీడింగ్ నంతా తీసేసి, ఒకే సీనుతో హీరో ఏమిటో చెప్పెయ్యొచ్చు. దీంతో నీతికథ ప్రసక్తి లేకుండా, నీతికథని అతి చేస్తున్నాడనే రసభంగమూ కలక్కుండా క్యారక్టరైజేషన్ తో ఎస్కేపయ్యే వీలుండేది. పైగా సాయం చేస్తే మీ జీవితాల్లో వ్యవసాయం చేస్తానని వాగనవసరం లేకుండా (అలా వాగడం వల్ల క్యారక్టర్ ఇంకా వరస్ట్ గా తయారయ్యింది)  అదేదో యాక్షన్ (చర్యల) ద్వారా చూపించి వుంటే  కొంతైనా ఆడియెన్స్ కనెక్ట్ ఏర్పడేది. 

        లవ్ ట్రాక్ అయితే మరీ బోరు. అసలు జక్కన్న  వైజాగ్ ఎందుకొచ్చాడు? బైరాగిని పట్టుకుని వాడికి ప్రతిసాయం చేసి తరించడానికేగా? ఆ పని మీదుండక హీరోయిన్ కన్పించగానే లొట్టలేస్తూ అటెలా వెళ్ళిపోతాడు? ‘కబాలి’ లో తలెత్తిన కన్ఫ్యూజన్ లా ఇది హీరోయిన్ తో లవ్ స్టోరీయా, లేక విలన్ తో యాక్షన్ స్టోరీయా? ఏది ప్రధాన కథ, ఏది ఉపకథ?

        ఒకవైపు హీరోయిన్ వెంటపడుతూ, ఇంకో వైపు విలన్ని వెతుకుతూ హీరో గోల్ చెదిరిపోవడం బావుంటుందా, లేక హీరోని చూసి హీరోయిన్ అతడి వెంటపడుతూ,  హీరో విలన్ వెంట పడుతూ వుంటే  హీరో గోల్ చెదరకుండా, డైనమిక్స్ కూడా ప్లే అవుతూ, ఈ  కథనం బావుంటుందా?  

        పదిహేనేళ్ళ క్రితం చూసిన బైరాగి బొమ్మేసుకుని జక్కన్న రావడంలోని సహేతుకతని క్షమిద్దాం, ఆ బొమ్మని ఏ  షోషల్ మీడియాలోనో పెట్టేస్తే క్షణాల్లో బైరాగి దొరికిపోతాడు కదా,  బొమ్మ పట్టుకుని కనపడిన వాళ్ళనల్లా అడుగుతూ గంటసేపూ  స్క్రీన్ టైంని తినేస్తాడెందుకు? ఇది 1980 లనాటి సినిమా అనుకుంటున్నాడా జక్కన్న? 

        దొరికిన బైరాగికి ప్రతిసాయం చేసే పద్ధతేమిటి, పగతీర్చుకుంటున్నట్టు లేదూ? గుట్టుగా బ్రతుకుతున్న బైరాగి ఐడెంటిటీని రట్టుచేయడం ప్రతి సాయమా? అన్ని నేరాలు చేస్తూ తన ముఖం ఎలా వుంటుందో బయటి ప్రపంచానికి తెలియకుండా బ్రతకడం బైరాగికి ఎలా సాధ్యమయ్యింది? బొమ్మ పట్టుకుని జక్కన్న తిరుగుతూ ఫస్టాఫ్ అంతా  టైం పాస్  చేయడానికేగా బైరాగి ఐడెంటిటీతో ఈ అసంబద్ధ కథనం? 

        బైరాగిని పట్టుకోవడానికి ఎక్కడో ఢిల్లీ నుంచి పోలీసు అధికారి రావడమేమిటి? వైజాగ్ లో బైరాగి నేరాలతో అతడికేం సంబంధం? బిల్డప్ వుంటుందనేగా ఢిల్లీనుంచి దిగినట్టు అల్లాటప్పాగా చెప్పించారు? పోట్లంలో సరుకులేకపోయినా, పొట్లం చుట్టిన కాగితం కూడా ఇంత ఛండాలంగా వుండాలా? కథనమనే పొట్లం చుట్టిన కాగితం కూడా చెత్త కుండీ లోంచి వచ్చిందే అన్నట్టుంది. ఇలా అంటున్నందుకు సారీ, కానీ ఈ సినిమాని  క్లాసే కాదు, మాస్ కూడా ఏకోశానా ఎంజాయ్ చేయలేకపోయారు. బుకింగ్స్ దగ్గర చూస్తే  మాస్ ఎంత హుషారుగా తరలివచ్చి హౌస్ ఫుల్ చేశారో(టికెట్లు దొరక్క చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు) అంత నీరసపడి ఇంటర్వెల్ కి బయటి కొచ్చారు, మరింత నీరసపడి మిగతాసగం చూసి వెళ్ళిపోయారు. తర్వాతి ఆటలకి ఈ సినిమాకి అంత సీను లేకుండా పోయింది. సినిమా వాళ్ళు మల్టీ ప్లెక్సుల్లో క్లాస్ ప్రేక్షకుల మధ్య సినిమాలు చూస్తే ఏమీ లాభంలేదు, క్లాస్ కి ఆవల మిగతా వర్గాల ప్రేక్షకులు ఎలా రెస్పాండ్ అవుతున్నారో తెలీని వర్చ్యువల్ ప్రపంచంలో వుండిపోతారు మల్టీ ప్లెక్సులో సుఖంగా  సినిమాలు చూసే సినిమా వాళ్ళు. రాజకీయాల్లో ఓటరు అంటే ధనికులు కారు, సామాన్య జనం. సినిమాలకి కూడా ప్రేక్షకులంటే సామాన్య జనమే. 

           
ఇక డైలాగులు చూస్తే అంతా ప్రాసలమయమే. ప్రతీపాత్రా ప్రాస డైలాగులే వల్లిస్తుంది. ఈ రోజు వచ్చిన నీ అదృష్టం ఆర్టీసీ బస్సులో వస్తే సాయంత్రం వోల్వో బస్సులోవస్తుంది... తండ్రిని భయపెట్టించాడు, మనకిక మామిడి తాండ్రే... నీకు మార్షల్ ఆర్స్ట్ తెలుసా?- నీకు గీతా ఆర్ట్స్ తెలుసా?...ప్రతోడూ సంచుల కొద్దీ పంచులిస్తున్నాడు...ఇదీ వరస! ఇది చాలనట్టు ఇంగ్లీషు  పదాలతో కూడా ప్రాస కాలుష్యమే. ప్రాస డైలాగులతో కామెడీ వస్తుందనే  దురవగాహనతో వున్నట్టుంది. కేవలం ఒకే ఒక్క చోట పలికిన - నేను లే అవుట్ వేస్తే  వాడు వెంచర్ వేశాడు - అనే డైలాగులో కామెడీ మెరుస్తుంది నిజానికి. ఇలాటి ప్రయోగాలు సృజనాత్మకత అన్పించుకుంటాయి.

        కథనంలో ఇంకా పృథ్వీ తో దిక్కులేనట్టు అదే బాలకృష్ణ డైలాగుల పేరడీ. మళ్ళీ చిరంజీవి వీణ డాన్సు బిట్టు ఒకటీ. ఇలా కొత్తదనం, కొత్తగా ప్రవేశ పెట్టిన ఒక్క అంశమూ లేకుండా రకరకాల సినిమాల్లోంచి కత్తిరించుకుని తెచ్చిన ముక్కలతో జక్కన్నని చెక్కి- ఓ పనైందన్పించుకుని - ఇంకా నెక్స్ట్  సినిమా తీసెయ్యడానికి ఒకచోట చేరి ఇంకెలాటి భయంకర చర్యలకి సమాలోచనలు చేస్తున్నారో!! ఇలాటి సమాలోచనల ఇన్ఫర్మేషన్ అందుకుని దాడులు చేయడానికి టాలీవుడ్ ఒక స్క్వాడ్ ని ఏర్పాటు చేసుకోవాలి...


-సికిందర్ 



       



       
       







30, జులై 2016, శనివారం

షార్ట్ రివ్యూ!


రచన- దర్శకత్వం: తరుణ్‌ భాస్కర్
తారాగణం : విజయ్‌ దేవరకొండ, రీతూ వర్మప్రియదర్శి పులికొండ,
నందు, అనీష్‌ కురువిల్లా, కేదార్‌ శంకర్‌, గురురాజ్‌ తదితరులు
సంగీతం: వివేక్‌ సాగర్‌, ఛాయాగ్రహణం: నగేష్‌ బానెల్‌
బ్యానర్‌: ధర్మపథ క్రియేషన్స్‌, బిగ్‌ బెన్‌ సినిమాస్‌
సమర్పణ: డి. సురేష్‌బాబు
నిర్మాతలు: రాజ్‌ కందుకూరి, యష్‌ రంగినేని
విడుదల : జులై 29, 2016
***
      చిన్న బడ్జెట్ సినిమా అంటే పెద్ద బడ్జెట్ సినిమాల హంగూ ఆర్భాటాల్ని అనుకరించే నాసిరకం ఉత్పత్తులుగా, ఒక జోకుగా, హాస్యాస్పదంగా మారిపోయి- వారంవారం కుప్పతెప్పలుగా వచ్చిపడుతున్న  హవా నడుస్తూండగా, చెంపపెట్టులా ప్రత్యక్షమయింది ‘పెళ్లి చూపులు’ అనే రియలిస్టిక్ ఫిక్షన్. చిన్న బడ్జెట్ సినిమా అంటే రియల్ లైఫ్ అనీ, పెద్ద బడ్జెట్ సినిమా అంటే లార్జర్ దేన్ లైఫ్ అనీ  నిర్వచనాన్ని కూడా వదిలేసి టోకున ఖజానా ఖాళీ చేసుకుంటున్న చిన్నచిన్న నిర్మాతలకీ, పెద్ద సినిమాల మత్తులో జోగే ఛోటా మోటా దర్శకులకీ లాగి లెంప కాయకొట్టినట్టు దర్శనమిచ్చింది ‘పెళ్లిచూపులు’. నిజమైన సినిమా చూసే భాగ్యానికి నోచుకోనివ్వకుండా ప్రేక్షకుల నెత్తిన నానా చెత్త రుద్దుతున్న- అసలీ నోట్లు తీసుకుని నకిలీ సినిమాలు చూపిస్తున్న వాళ్ళందరికీ ‘బయటికి పోవు దారి’ చూపిస్తున్నట్టు బెత్తం పుచ్చుకుని వచ్చింది ‘పెళ్లిచూపులు’... 

         
కొన్ని షార్ట్ ఫిలిమ్స్ తీసిన దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ క్రాసోవర్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఇది రోమాంటిక్ కామెడీయే అయినా నేటి రోమాన్స్ ని షార్ట్ ఫిలిం మేకర్స్ ఎలా ఫీలవుతున్నారో గత కొన్ని రివ్యూల్లో చెప్పుకున్నాం. రుచీ పచీ వుండని మూస ఫార్ములా ప్రేమ సినిమాలకి ఆవల పల్లెల్లో, నగరాల్లో యూత్ ప్రేమల రియలిస్టిక్ ప్రపంచమంటూ ఒకటుంది. ఆ ప్రేమల్ని షార్ట్ ఫిలిం మేకర్స్ పట్టుకుని లవ్ మార్కెట్ లో వాస్తవికతని కళ్ళకి కట్టినట్టు చూపిస్తున్నారు. ఈ షార్ట్ ఫిలిమ్స్ ముందు మూస సినిమాల మాసిపోయిన ప్రేమలు వెలవెలబోతున్నాయి. అందుకే కృత్రిమ ప్రేమ సినిమాల వైపు యువ ప్రేక్షకులు కన్నెత్తి చూడ్డం లేదు. దీన్ని బ్రేక్ చేస్తూ నేటి యూత్ కి నచ్చే రియలిస్టిక్ ఫిక్షన్ తో ‘పెళ్లి చూపులు’ తీశాడు దర్శకుడు తరుణ్ భాస్కర్. 

        ‘పెళ్లి చూపులు’ అనగానే ఇదేదో పెళ్లి వ్యవస్థమీద అంటూ కృష్ణ వంశీ తీసిన ‘మొగుడు’ లాంటి, నందినీ రెడ్డి తీసిన ‘కళ్యాణ వైభోగమే’ లాంటి యూత్ కి ఏమాత్రం పట్టని పురాతన సోకాల్డ్ సందేశాల సంతర్పణ కాదిది. జీవితం పట్ల అత్యధిక శాతం  యువత కుండే భిన్నదృక్పథాల వితరణ ఇది. భుక్తి మార్గమేమిటో కూడా తెలుసుకోకుండా అర్జెంటుగా పెళ్ళో అంటూ ప్రాకులాడే సత్యదూరమైన అపరిపక్వ హీరో హీరోయిన్ల మూస ఫార్ములా పాత్రలు కావివి... పులిని చూసి వాతలు పెట్టుకున్నట్టు డాన్సులూ ఫైట్లూ కామెడీ లాంటి పెద్ద సినిమాల హంగుల  కోసమైతే ఈ సినిమా చూడక్కర్లేదు (ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ లేవనీ, మాస్ వేల్యూస్ కూడా లేవనీ ఓ  రివ్యూ రైటర్ బాధ పడ్డాడు! అన్ని సినిమాల్నీ ఒకే రంగుటద్దాల్లో చూడాలన్న అవగాహనతో వున్నాడు కాబోలు ...)

       
అసలిప్పుడు ప్రేమంటే ఏమిటో?

కథ
      ప్రేమంటే వృత్తి వ్యాపకాలు. ఏ వృత్తీ లేనివాడికి ప్రేమే దక్కదు. కానీ ప్రశాంత్ (విజయ్ దేవరకొండ) కి వృత్తి చేసుకు బతకాలంటేనే బద్ధకం. ఏ పనీలేక సోమరిపోతులా జీవించడమే ఇష్టం. కోటి రూపాయలు కట్నమిస్తే బ్యాంకులో ఎఫ్ డీ చేసుకుని ఆ వచ్చే  వడ్డీ మీద బతుకు లాగించెయ్యాలని ప్లాన్. అపసోపాలుపడి ఎలాగో ఇంజనీరింగ్ చేసిన కొడుకు ప్రశాంత్ ఉద్యోగ ప్రయత్నాలు చేయకపోవడంతో విసిగిపోయిన తండ్రి,  పెళ్లి చేసి పడేస్తే వాడి పాట్లు వాడు పడతాడని ఒక సంబంధం చూస్తాడు. ఆ పెళ్ళిచూపులకి వెళ్తే ఆ అమ్మాయి చిత్ర (రీతూ వర్మ) తో పొరపాటున గంట సేపు గదిలో బందీ అయిపోతాడు.  ఆమె ఎంబీఏ పూర్తి చేసి ఆస్ట్రేలియా వెళ్ళిపోయే ప్లాన్ తో వుంది, ఈ పెళ్ళీ గిళ్ళీ ఏమీ పట్టడం లేదు. ఆస్ట్రేలియా వెళ్ళాలంటే డబ్బు కావాలి, ఆ డబ్బు తండ్రి ఇవ్వడం లేదు. ఏదో బిజినెస్ చేసి ఆ డబ్బు సంపాదించే ఆలోచనతో వుంది. ఆ బిజినెస్ పెట్టబోతే బాయ్ ఫ్రెండ్ మోసం చేసి పారిపోయాడు...

        ప్రశాంత్  తను కూడా ఎవత్తితో ఎలా తిరిగితే ఏం జరిగిందో తన ఫ్లాష్ బ్యాక్ చెప్పుకొస్తాడు. మార్చి మార్చి చెప్పుకునే ఈ ఇద్దరి ఫ్లాష్ బ్యాకులూ తూర్పు పడమరలు. ఒకే పాయింటు  దగ్గర ఇద్దరి అభిరుచులూ కలుస్తాయి : అది సాస్ లేకుండా సమోసా తినే దగ్గర. 

        మొత్తానికి కెరీర్ మైండెడ్ గా వున్న ఈమె, కెరీర్ నే  సన్యసించిన తనకి లొంగే అవకాశం లేదని నిరాశ పడ్డాక, అసలు విషయం తెలుస్తుంది- తను రాంగ్ అడ్రసుకి పెళ్లి చూపుల కొచ్చాడని. తను వెళ్ళాల్సింది వేరే ఎనిమిదో నంబర్ వీధిలో ఇంటికని!

        మళ్ళీ వీళ్ళిద్దరూ ఎలా కలిశారు, కలిస్తే అక్కడ్నించీ వాళ్ళ సంబంధం ఎలా కొనసాగింది, అప్పుడేమేం జరిగాయన్నది మిగతా ద్వితీయార్ధపు కథ. 

ఎలావుంది కథ 
     చాన్నాళ్ళకి తెలుగులో ఒక ఫ్రెష్ కథ చూస్తున్నట్టు వుంది. కథంటే పాత్రలూ సంఘటనలూ కూడా కాబట్టి, ఇవి కూడా ఎక్కడా మూస ధోరణుల్లోకి తిరగబెట్టకుండా ఆద్యంతం ఎక్కడికక్కడ ఆధునిక పోకడలతో, ఆధునిక మనస్తత్వాల మదింపుతో ఆలోచనాత్మకంగా వుంది- ఇదంతా తెలుగు నేటివిటీని  కాపాడుతూనే. ప్రధానంగా ఈ కథ  పేరెంట్స్ కీ వాళ్ళ పిల్లలకీ  మధ్య వుండే అంతరాల గురించే తప్ప, రొటీన్ గా ప్రేమికుల మధ్య ప్రేమకి వుండే అడ్డంకుల గురించి కాకపోవడంతో, ఆ అంతరాలు కూడా పైన చెప్పుకున్న ‘మొగుడు’ లో లాగా,  కళ్యాణ వైభోగమే’ లోలాగా పెద్దలు చాదస్తపు క్లాసులు పీకే తత్త్వంతో కాక, ఆయా పరిణామాలే పరస్పరం పిల్లల్నీ పెద్దల్నీ మార్చే విజువల్ నేరేషన్ వల్ల ఈ కథ వాస్తవికతతో కూడుకున్న వినోదాత్మక విలువలతో  వుంది. ఎలాటి కృ త్రిమత్వపు ఛాయల్లేకుండా మనచుట్టూ జరిగే నిజప్రపంచం లాగే వుంది ఈ కథ. 

ఎవరెలా చేశారు
     ప్రతీ వొక్కరూ సహజ నటనతో రక్తి కట్టిస్తారు ఇందులో. హీరో విజయ్ దేవరకొండ –హీరోయిన్ రీతూ వర్మల నేచురల్ నటన ఎసెట్ ఈ సినిమాకి. పాత్రచిత్రణలు సింపుల్ గానే  వున్నా వీళ్ళవి  సంకీర్ణ పాత్రలు. ఇద్దరి మధ్యా సమస్య పెద్దదే, అయినా సంఘర్షణ భీకరంగా ఉండనవసరం లేదు. డ్రామా, మెలోడ్రామా,  సెంటి మెంట్లు మొదలైన వాటికి దూరంగా మ్యాటరాఫ్ ఫ్యాక్ట్ టెక్నిక్ తో నిలబడ్డ పాత్రలివి. బిగ్ కమర్షియల్ సినిమాల్లో చూసినా ఏ టాప్ హీరోయినూ వేయనంత  ముద్ర తన సింపుల్ నటనతోనే సాధిస్తుంది రీతూ వర్మ. ఆమె ఫీలింగ్స్ నీ, ఆలోచనల్నీ  క్లోజప్స్ లో పట్టుకున్న తీరుతో ఆమె కలకా లం గుర్తుండిపోతుంది. అలాగే కామన్ బాయ్ గా కన్పించే విజయ్ పాత్రలోని హాస్య ధోరణి, అతడి ఫ్రెండ్స్ గా  నటించిన ప్రియదర్శి పులికొండ, అభయ్ ల ఫన్నీ కామెడీ కొత్త పుంతలు తొక్కుతాయి. ముఖ్యంగా హైదరాబాదీ తెలుగులో ప్రియదర్శి పులికొండ తన మాట తీరుతో ఒక భిన్నమైన కమెడియన్ గా పరిచయమవుతాడు. విజయ్- ప్రియదర్శి-అభయ్ ముగ్గురూ వున్న ప్రతీ సీనూ ఓ కామిక్ టానిక్కే. 

       పెద్దవాళ్ళ పాత్రల్లో అనీష్‌ కురువిల్లా, కేదార్‌ శంకర్‌, గురురాజ్‌ లు చాలా డీసెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. నిజంగా మనుషులిలాగే వుంటారు- సినిమాల్లో కొచ్చేసి నాటకీయంగా, ఓవర్ యాక్షన్స్ తో, సినిమా డైలాగులతో ఎందుకుండాలి? సినిమా చూస్తున్నట్టు వుంటే అది సినిమా ఎందుకవుతుంది? 

        ఎక్కడా సినిమా డైలాగులు విన్పించకుండా, ఎక్కడా సినిమా చూస్తున్నట్టు అన్పించకుండా దర్శకుడు కళా దర్శకత్వాన్నీ, ఛాయాగ్రహణాన్నీ, సంగీతాన్నీ, నటీనటుల ఆహర్యాన్నీ, లొకేషన్స్ నీ, సమస్తాన్నీ -  తన ఆధీనంలోకి తెచ్చుకుని- ఏ వొక్కటీ దేన్నీ డామినేట్ చేయకుండా ఏకత్వాన్ని సాధించడమే దర్శకత్వం అన్నట్టు పనిచేసుకుపోయాడు దర్శకుడు. 

    నటీనటుల దగ్గర్నుంచీ ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్లందరూ తెలంగాణీయులే కావడం మరో ప్రత్యేకత. సాధారణంగా  తెలంగాణా సినిమా అంటే చిన్న చూపు వుంది. కారణం- ఎంతసేపూ అవే పోరాట కథలు తీస్తారని. కానీ ప్రధాన స్రవంతి లోకొచ్చి  ప్రాంతీయత కతీతంగా  కమర్షియల్ సినిమాని  తామూ  తీయగలమని ప్రప్రథమంగా ఈ సినిమాలో ప్రతీ వొక్కరూ నిరూపించారు. అదీ ఇంత  డిఫరెంట్ గా, ఇంత జనరంజకంగా!

చివరికేమిటి
        ప్రేక్షకులకి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు, తీస్తున్నవి సినిమాలనుకుంటూ ఇరు రాష్ట్రాల ప్రేక్షకుల్ని రాచిరంపాన పెడుతున్న వాళ్ళకి కనువిప్పూ!


-సికిందర్
http://www.cinemabazaar.in




       
       

       
       
       

29, జులై 2016, శుక్రవారం

షార్ట్ రివ్యూ!








రచన- దర్శకత్వం : వంశీకృష్ణ ఆకెళ్ళ


తారాగణం: సునీల్, మన్నారా చోప్రా, కబీర్ సింగ్, సత్యప్రకాష్ ,
పృథ్వీ, సప్తగిరి, పోసాని, నాగినీడు,
మాటలు : భవానీ ప్రసాద్, సంగీతం : దినేష్, కెమెరా : రాం ప్రసాద్ సి
బ్యానర్ : ఆర్పీఏ క్రియేషన్స్
విడుదల 29 జులై, 2016
***

      తెలుగులో హీరోగా తన కంటూ ఒక స్థానం కోసం సునీల్ ఇంకా దండయాత్రలు చేసే పరిస్థితుల్లోనే ఉండాల్సిరావడం నిజంగా ట్రాజడీయే. కమెడియన్ గా మొదటి సినిమాతోనే ఎస్టాబ్లిష్ అయిపోగల్గిన తను తీరా హీరోగా మారాలనుకునే సరికి- ఈ విభాగంలో  కమర్షియల్ సినిమాల స్థితిగతులు పరిశీలించుకున్నట్టు లేదు. స్టార్లు నటిస్తున్న కమర్షియల్ సినిమాలకే ఠికానా లేదు, వాటి కథాకమామీషులు అలా ఉంటున్నాయి- అలాటిది హీరోగా, ఇంకా యాక్షన్ హీరోగానూ  మారిపోయి కొత్తగా సునీల్ కూడా వస్తే, ఇటువైపు విభాగంలో పరిస్థితులేమీ మారిపోవు. అవే పరిస్థితుల మధ్య, అవే అరిగిపోయిన, ఇతర హీరోలు నటించేసిన, అవే  పాత మూస వ్యవహారాల్లోనే చిక్కుకుని గిలగిల్లాడాల్సి వుంటుంది. అదే ఇప్పుడూ జరిగింది ‘జక్కన్న’ తో. ‘బ్యాక్ టు ఎంటర్ టైన్’ అనే ట్యాగ్ లైన్ తో వస్తూ, ఎంటర్ టైన్మెంట్ కి తన దృష్టిలో అర్ధం ఇదా అన్నట్టు  ముక్కున వేలేసుకునేట్టు చేయడం మరీ  ట్రాజడీ. 

      దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ళ  నాల్గు తెలుగు సినిమాల కట్ అండ్ పేస్ట్ దర్శకుడుగానే తప్ప సొంత టాలెంట్ గల వ్యక్తిగా ఏ కోశానా కన్పించక పోవడం ఈ సినిమాలో ప్రత్యేకత. కనీస స్క్రీన్ ప్లే, కథాకనాలు, పాత్ర చిత్రణల నాలెడ్జి కొరవడినట్టు మొదటి సీను దగ్గర్నుంచే తెలిసిపోతుంది. పైపెచ్చు శ్రీను వైట్ల వాడి వాడీ కెరీర్ మీదికి తెచ్చుకున్న ‘విలన్ ఇంట్లో హీరో చేరి వాణ్ణి బకరా చేయు కన్ఫ్యూజ్  కామెడీ  అనబడు సింగిల్ విండో స్కీమ్’  నే ఈ దర్శకుడూ  అరువు దెచ్చుకుని సునీల్ కి అంటగట్టడం సాహసాల్లో కెల్లా సాహసం! 

        సినిమాలు చూడ్డంలో ప్రేక్షకులకి  ఎబిసిడిలు తెలీనట్టు ఈ కథా ప్రారంభం ఎలా వుంటుందంటే...

నీతి కథ!

        నగనగా ఒక వూళ్ళో ఒక మేష్టారు పిల్లలకి నీతి కథ చెప్తాడు. చిన్నప్పటి హీరో ఈ నీతి  కథ వినని అచ్చు అలా మారిపోతాడు. నీతికథ సారాంశమేమిటంటే,  నీకెవరైనా సాయం చేస్తే దానికి నువ్వు రెట్టింపు సాయం చెయ్ అనేది. పెద్దవాడైపోయిన హీరో గణేష్ అలియాస్ జక్కన్న (సునీల్) బ్యాగు భుజానికి తగిలించుకుని వైజాగ్ వచ్చేస్తాడు. కాగితం మీద ఒకడి బొమ్మ పట్టుకుని వాడి కోసం వెతుకుతూ, మరోవైపు సహస్ర (మన్నారా చోప్రా) అనే అమ్మాయి వెంట ప్రేమకోసం  పడుతూ వుంటాడు.జక్కన్న వెతుకుతున్న బైరాగి (కబీర్ సింగ్) అనే వాడు వైజాగ్ ని గడగడ లాడిస్తూన్న గూండా. అయితే అతనెలా ఉంటాడో ఎవరికీ తెలీదు. ఇది హీరో తెలుసుకుని అతడికి  సాయం చేసేందుకు వెంటపడతాడు. ఎందుకంటే ఈ బైరాగి జక్కన్న చిన్నప్పుడు ప్రాణాలు కాపాడి గొప్ప సాయం చేశాడు. కనుక  ఇప్పుడు తిరిగి వాడికి సాయం చేసేందుకు జక్కన్న వచ్చేశాడన్న మాట!

        ఏం సాయం చేశాడు, ఎలా చేశాడు, దాన్ని సాయం అంటారా వెటకారం అంటారా, సాయం చేయించుకున్న గూండా బకరాలా మారిపోయి ఎలా చేయించుకున్నాడూ, చేయించుకున్నప్పుడు ఏమయ్యాడూ మొదలైనవి వెండి తెరమీద చూసి తరించాల్సిందే!

ఎలా వుంది కథ

       
పైన చెప్పుకున్నట్టు సింగిల్ విండో స్కీము కథ. ఈ స్కీము సృష్టి కర్తలైన కోన వెంకట్ ట్- గోపీ మోహన్ ద్వయమే అల్లరై దానికి మూత పెట్టేసుకోగా, ఇంకేం చేద్దామని జక్కన్న వచ్చాడో అర్ధంగాదు. ఇంకా ఎంటర్ టైన్మెంట్ అంటే ఇదే అనుకుంటూ ‘బ్యాక్ టు ఎంటర్ టైన్మెంట్’ అంటూ రావడం చాలా హ్యూమరస్ గా వుంది. సునీల్ పాత్ర పేరుగా పెట్టుకున్న గణేష్ కి నిక్ నేమ్ జక్కన్న ఎలా సూట్ కాదో, అలా సాయం చేసే గుణానికీ సాగదీసిన ఈ అరిగిపోయిన పాత  మూస కథకీ సంబంధమే లేదు! 

ఎవరెలా చేశారు 

       రెండు చోట్ల కమెడియన్ సప్తగిరి రియల్ ఫన్ చేశాడు, ఈ మాత్రం కూడా సునీల్ కామెడీ చేయలేదు. అన్ని పాత్రలకీ కామెడీ పేర దొర్లించిన తెలుగింగ్లీషు ప్రాస డైలాగులతో శబ్దకాలుష్య మే తప్ప నవ్వనే మాటకి చోటే లేదు. సునీల్ పోషించిన పాత్ర నిజానికి మానసిక రోగి పాత్ర. ఏదో కాకతాళీయంగా సాయపడ్డ ప్రతీవాడికీ పనిగట్టుకుని తిరిగి సాయపడాలనుకోవడం, సాయం చేసే పేరుతో వేధించడం కామెడీ అన్పించుకోదు, మానసిక రుగ్మత అన్పించుకుంటుంది. ఇలాటి పాత్రతో ఎంజాయ్ మెంటు తక్కువ ఎలర్జీ ఎక్కువగా తయారయ్యింది. ఇంతగా అర్ధంపర్ధం లేని పాత్ర ఈ మధ్య కాలంలో ఏ సినిమాలోనూ లేదు. 

        హీరోయిన్ చాలా మైనస్ ఈ సినిమాకి. హీరోయిన్ విషయంలో కూడా సునీల్ టేస్టు కనబర్చుకో లేదు.  ఇంకా చీటికీమాటికీ వచ్చి పడి చిరాకు పుట్టించే  బోలెడు మంది కమెడియన్లు వున్నారు. అలవాటుగా రొటీన్ గా, పృథ్వీ తో అదే బాలకృష్ణ డైలాగుల పేరడీ కూడా వుంది. కామెడీ పేరుతో  ఇంత హంగామాకీ  కింది క్లాసు ప్రేక్షకులు కూడా నవ్వకుండా, సైలెంటుగా ఏదో తప్పని తద్దినం అన్నట్టు చూశారంటే అది దర్శకుడి గొప్పతనమే.  

        పాటలూ రోటీన్ గానే వుంటే, కెమెరా మాన్ గా సీనియర్ రామ్ ప్రసాద్ చాలా నీరసంగా చిత్రీకరణ జరిపారు. ఆయనకీ ఈ సినిమాలో కిక్కు లభించలేదేమో, చుట్టి అవతల పడేశారు. 

చివరికేమిటి?

       
ముంది, సునీల్ కి మరింకో దండయాత్రే.  ఏకైక కామెడీ హీరో అల్లరి నరేష్ పరిస్థితి అలా వుంటే, ఏకైక కండల హీరోగా మారాలనుకున్న కమెడియన్ సునీల్ పరిస్థితి ఇలా వుంది. స్టార్ల జోన్లో సినిమాల పరిస్థితి ఎలా వుంటోందో, ఇందులోకి ఎంటరైన సునీల్ పరిస్థితీ ఇందుకు భిన్నంగా ఏమీ వుండదు. ఎంతకాలమైనా  ఈ త్రిశంకు  స్వర్గం తప్పదు.


-సికిందర్
cinemabazaar.in








25, జులై 2016, సోమవారం

ఆర్టికల్ :









     ప్రతీ సంస్కృతీ హీరోల్ని కలిగి వుంటుంది.  దాదాపు కథలన్నీ హీరో చుట్టే తిరుగుతాయి. మైథాలజిస్టు జోసెఫ్ క్యాంప్ బెల్ హీరో పాత్ర రూపకల్పనలో చోటు చేసుకునే వివిధ దశల క్రమాన్ని గుర్తించారు. హీరో అంటే తన రోజు వారీ సాధారణ ప్రపంచపు సరిహద్దులు దాటుకుని,  సవాళ్ళతో కూడిన అసాధారణ ప్రపంచంలోకి ప్రవేశించి, తనవాళ్ళ శ్రేయస్సు కోసం పోరాడి, అంతిమంగా వారికా విజయ ఫలాల్ని అందించేవాడు- ‘కబాలి’ లో రజనీకాంత్ లాగా. ‘కబాలి’ లో రజనీ కాంత్ మలేషియాలో తమిళుల హక్కుల కోసం పోరాటం చేయడాన్ని చూపించారు. 
          ఒక సాధారణ వ్యక్తి  హీరోగా అవతరించాలంటే  అతను అనుభవించాల్సిన దశలు 11 వుంటాయని క్యాంప్ బెల్ అంటారు. ముందుగా ఆ కాబోయే హీరో తన చుట్టూ వున్న పరిస్థితులతో అసౌకర్యాన్ని ఫీలవుతాడు. అప్పుడు అతడికి ఆ పరిస్థితుల్ని మార్చక తప్పదన్నట్టుగా ఒక అనుభవం ఎదురవుతుంది- ఆ అనుభవంతో అతడికి ముందు కెళ్ళాలంటే ప్రమాదకర పరిస్థితులుంటాయి. అప్పుడు అతడికి పెద్ద దిక్కుగా వున్న పాత్ర ముందుకు వెళ్లేందుకే అతడ్ని ప్రోత్సహిస్తుంది. దాంతో సమీకరణలు చోటు చేసుకుంటాయి- అనుచరులు ఒక వైపు- ప్రత్యర్ధులు ఒక వైపు గుమికూడతారు. ఇక మిగిలిన కథ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం గురించి, దాన్ని సాధించడం గురించి, ఆ విజయ ఫలాలతో తిరిగి రావడం గురించీ వుంటుంది. క్యాంప్ బెల్ పురాణ పాత్రలకి సంబంధించే హీరో పాత్ర నిర్మాణం గురించి చెప్పినా, ఇది నేటి సినిమా స్క్రిప్టులకి కూడా వర్తిస్తుంది. శక్తియుక్తుల్ని ప్రదర్శించే హీరో ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాడు. కబాలీ ఇదే చేస్తాడు. 

      క్యాంప్ బెల్ ఇలా అంటారు : పురాణాల, పారంపర్యంగా వస్తున్న ఆచారాల ప్రధాన కర్తవ్యం మానవశక్తి పురోగమించడానికి అవసరమైన ప్రతీకాత్మలని అందించడమే ...అయితే వాస్తవానికి, మానవ బలహీనతలు పెచ్చు మీరుతున్న కొద్దీ ప్రతీకాత్మలు అందించే ఆధ్యాత్మిక  విలువలు  కూడా గుర్తింపుని కోల్పోతూంటాయి...

          అంటే హీరో అనేవాడు ఆధ్యాత్మిక ప్రదాత అన్నమాట. అతను మన ఆలోచనల్ని ప్రభావితం చేసి మనం ఉన్నతంగా ఎదిగేందుకు మనల్ని తన వెంట తీసుకుపోతాడన్న మాట- ఎలా వున్న వాళ్ళని అలా వదిలెయ్యకుండా. కబాలి ఇది సాధించాడా?

       హీరో అనేవాడు తను వేసే ప్రతీ అడుగూ ఉన్నతాశయపు పవిత్రతని కాపాడేందుకే వేస్తాడు. కథలో భాగంగా వుండే  ఎలాటి హింసకైనా అతీతంగా అతడి మంచితనం ప్రకాశిస్తుంది. చెబుతున్న  కథ ప్రభావశీలంగా వుండేందుకు కొన్ని అతిశయోక్తులకి పాల్పడక తప్పదు. కాబట్టి మంచితనమా - హింస ఈ రెండిటినీ పోటాపోటీగా  కొంచెం అతి చేసి చిత్రించడం అవసరమే.

      జైన మతస్థులు ఈ పరిస్థితిని మేనేజ్ చేసేందుకు ఒక ఆసక్తికర విధానాన్ని కనుగొన్నారు. ప్రతీ కథలో మూడు ప్రధాన పాత్రలుంటాయి. నాలుగు కూడా వుండొచ్చు. నాల్గోపాత్ర కథలో వున్నా లేకపోయినా, దాన్ని చక్రవర్తి అన్నారు. మిగతా మూడు పాత్రలు బలదేవుడు  లేదా హీరో పాత్ర, వసుదేవ లేదా సెకండ్ హీరో పాత్ర, ప్రతి వసుదేవ  లేదా యాంటీ హీరో అంటే విలన్ పాత్ర. ప్రతి వసుదేవ అన్న పేరే సగం ప్రపంచానికి అతను అధిపతి అన్న అర్ధాన్నిస్తోంది. ఎలాగైతే వసుదేవులు ప్రపంచాన్ని ఏలతారో, అలా యాంటీ వసుదేవులు ప్రపంచం మీద ఆధిపత్యం ప్రదర్శిస్తారు. అయితే ఇది విలనిజంతో కూడుకుని వుంటుంది.  

          బలదేవుడు ఎవర్నీ చంపడు. అతను  జైనుల అహింసా సిద్ధాంతపు పరిరక్షకుడుగా వుంటాడు. వసుదేవుడు చంపి పాతాళానికి పోతాడు. ప్రతి వసుదేవ కూడా వాడి దుర్మార్గాల రీత్యా నరకానికే పోతాడు. అత్యున్నత ఆధ్యాత్మిక పాత్రయిన బలదేవుడు మాత్రం జైనుల  ధర్మం ప్రకారం పరిత్యాగం చేసి మోక్షం పొందుతాడు. 

      నిజమే, హీరో కూడా హింసకి పాల్పడాల్సి వస్తుంది. అయితే అది విలన్ పాత్ర పాల్పడే స్థాయిలో భయానక బీభత్సభరితంగా వుంటే, నిర్దాక్షిణ్యంగా చంపడమే హీరోయిజ మనుకుంటే, అతను  రక్తపాతానికి అతీతుడైన ధర్మ పరాయణుడైన హీరో ఎలా అవుతాడు? కబాలిలో చూపించినట్టుగా మనుషుల్ని చంపడమంటే దోమల్ని చంపడంతో సమానమా? అసలు చంపడాలు లేని బ్రాండ్ హీరోయిజాన్ని మనం ప్రమోట్ చేయలేమా?


-సుధామహి రఘునాథన్
(టైమ్స్ ఆఫ్ ఇండియా)



         

         



          

22, జులై 2016, శుక్రవారం

రివ్యూ :






రచన- దర్శకత్వం : పా. రంజిత్ 

తారాగణం : రజనీకాంత్, రాధికా ఆప్టే, ధన్సిక, రిత్విక, దినేష్ రవి, కళయరాసన్, జాన్ విజయ్, విన్ స్టన్ చావో, రోస్యమ్ నోర్ తదితరులు 
సంగీతం : సంతోష్ నారాయణ్, ఛాయాగ్రహణం : జి. మురళి 
విడుదల : 22 జులై, 2016 
***
        సూపర్ స్టార్ రజనీకాంత్ తో మారుతున్న ప్రేక్షకాభిరుచిని అర్ధంజేసుకోవడంలో దర్శకులు విఫలమవుతున్నట్టు సూచనలు కన్పిస్తున్నాయి. రజనీతో రొటీన్ మాస్ కమర్షియల్స్ తీయడానికి ఇంకా ఏమీ మిగల్లేదనే, మెగా దర్శకుడు శంకర్ రజనీతో  ‘రోబో’ అనే సైన్స్ ఫిక్షన్ తీసి ప్రేక్షకుల్ని ఓ కొత్త వూహా ప్రపంచంలోకి తీసికెళ్ళాడు. తిరిగి ప్రస్తుతం తనే తీస్తున్న ‘రోబో- 2’ అనే మరో సైన్స్ ఫిక్షన్ తో ఇంకో కొత్త ఊహా ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్నాడు. కానీ ‘రోబో’ అనే సైన్స్ ఫిక్షన్ లో రజనీని ప్రేక్షకులు మరమనిషి గా అంగీకరించారు కదాని, మనంకూడా ఇంకో అడుగు ముందుకేస్తున్నట్టు భ్రమించి, మరమనిషి నుంచి అసలే ప్రాణంలేని త్రీడీ గ్రాఫిక్స్ రూపానికి దించి,  రజనీ కుమార్తె ఐశ్వర్య ‘విక్రమ సింహా’ తో ప్రేక్షకుల్ని అపరిమితంగా  పరిహాసమాడింది. వెంటనే ‘లింగా’ తో అందుకుని, కె ఎస్ రవికుమార్ పాత మూస రజనీ కాంత్ నే మళ్ళీ చూపించి ప్రేక్షకాభిమానుల్ని అనుచితంగా హతాశుల్ని చేశాడు. ఇప్పుడు రియలిస్టిక్ సినిమాల రంజిత్ వచ్చేసి రజనీతో ఏం చేసుకోవాలో అర్ధంగాక ఏమేమో చేసి –ఆఖరికి ప్రేక్షకులు నవ్వుకునే స్థితికి సూపర్ స్టార్  సినిమాని దిగజార్చాడు. 


       ఇంగిత జ్ఞానాన్ని ప్రదర్శించి  ఐశ్వర్య దర్శకుడు రంజిత్ ని ప్రశ్న అడిగింది- మీ స్క్రిప్టులో ఎంటర్ టైన్ మెంట్ అనేది లేదు కదా కాస్త ఉండేట్టు చూడమని. దీనికి రంజిత్- ఇందులో ఎంటర్ టైన్ మెంట్ కుదరదనడం సహజంగానే అతడి నాన్-కమర్షియల్ మైండ్ సెట్ కి మచ్చుతునక. ఇప్పటి రజనీకాంత్ యిప్పటి అమితాబ్ బచ్చన్ కాదని తెలుసుకోకపోవడమే అతడితో వచ్చిన చిక్కు.  తమ రజనీకాంత్ ఎప్పటికీ ఆల్ రౌండరే అని నిద్రలో లేపి అడిగినా సాక్ష్యం చెప్తారు అభిమానులు. 


      ‘కబాలీ’ అనే బ్రహ్మండమైన పవర్ఫుల్ ఇగోయిస్టిక్ టైటిల్, దీనికి తగ్గట్టు విపరీతమైన క్రేజ్ సృష్టించిన ట్రైలర్స్, రెండు పరాజయాల తర్వాత ఈసారి రజనీ చాలా జాగ్రత్త తీసుకుంటారన్న అతిపెద్ద భరోసా, పైగా మొట్ట మొదటిసారిగా ఒరిజినల్ రూపంతో రజనీకాంత్ దర్శనం, దేశవ్యాప్తంగా గొప్ప పండగవాతావరణం...ఇదీ నేపధ్యబలం. దీంతో వెయ్యేనుగుల బలం వచ్చినట్టు ఫీలయ్యి థియేటర్లోకి అడుగుపెడితే...


తెర మీద కన్పించే కథ     
      మ
లేషియాలో కబలీశ్వరన్ అలియాస్ కబాలి (రజనీకాంత్) పాతికేళ్ళు జైలు శిక్ష అనుభవించి విడుదలవుతాడు. మలేషియాలో తరాలుగా జీవిస్తున్న తమిళ బడుగు జీవుల సమస్యలు తీర్చే మాఫియా డాన్ అతను.  జైలు నుంచి వచ్చాక తన పాత శత్రువు టోనీ (విన్ స్టన్ చావో) చేస్తున్న దందాల్ని బంద్ చేయించే ప్రయత్నాలు మొదలెడతాడు. అతణ్ణి చంపడానికి టోనీ అనుచరులు దాడులు ప్రారంభిస్తారు. తన పాత  అనుచరుల పిల్లలు కూడా ఈ మార్గం పట్టకూడదని వాళ్ళకి చదువు చెప్పించే స్కూలు నడుపు తున్న కబాలీ  ఆ స్టూడెంట్స్ అడిగితే  తన గతం చెప్పుకొస్తాడు. 


        ఆ రోజుల్లో సీతారామరాజు ( నాజర్) తమిళుల పెద్ద దిక్కుగా ఉంటాడు. అతను హత్యకి గురవడంతో వారసత్వం కబాలీకి లభిస్తుంది. దీంతో ద్వేషం పెంచుకున్న మరో అనుచరుడు టోనీ తో కుమ్మక్కయి కబాలీని అడ్డు తొలగించే ప్రయత్నంలో గర్భవతి అయిన కబాలీ భార్య కుందనవల్లి (రాధికా ఆప్టే)  మీద దాడి  చేస్తాడు. అతణ్ణి కబాలీ చంపేసి జైలు కెళ్తాడు.

        ఇలాటి గతమున్న తను ఇప్పుడు వృద్ధాప్యంలో భార్య జ్ఞాపకాలతో బాధగా గడుపుతూంటాడు. ఇప్పుడు యోగి (ధన్సిక) అనే అమ్మాయిని కబాలీని చంపేందుకు నియమిస్తాడు టోనీ. తీరా చూస్తే  ఈమె తన కూతురే అని తెలుస్తుంది కబాలీకి. అంతలో భార్య కూడా బతికే వుందని తెలుస్తుంది...


        పాతికేళ్ళ క్రితం టోనీవల్ల తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి పగ తీర్చుకోవడమే ఇక ఇక్కడ్నించీ కబాలీ కథ. 


ఎలావుంది కథ
       
సారి రజనీ జాగ్రత్త పడతారన్న భరోసాకాస్తా అవిరైపోయేలా వుంది కథ. రజనీ ఇందులో ‘బాషా’ ని చూశారా, ‘నాయకుడు’ ని చూశారా, లేక ఏకంగా ‘గాడ్ ఫాదర్’ నే చూశారా? ఈ కథలో తను ప్రజల కోసం పోరాడారా, కుటుంబం గురించి పగదీర్చుకున్నారా? ఈ కథలో తను డానా, ఫ్యామిలీ మ్యానా? రజనీ సార్ తన ఒల్డేజి పాత్రలో బాధపడే దిలీప్ కుమార్ ని చూశారా, మండిపడే అమితాబ్ బచ్చన్ ని చూశారా? చాలా కన్ఫ్యూజన్. కథలో కొత్త దనం లేదు. ఉన్న కథలో హేతుబద్ధత లేదు. కథ దేని గురించన్న స్పష్టత లేదు సరే, నేటివిటీ- కమర్షియాలిటీలు కూడా కరువయ్యాయి. కథలో వున్న ఫ్యామిలీ డ్రామాకి తగిన భావోద్వేగాలు కూడా కరువే. కథ ఎప్పుడూ పాత్ర ద్వారానే వ్యక్తమవుతుంది. నిజ జీవితంలో ఎలా వుండే రజనీని అలాగే వుంచి పాత్రకి సిద్ధం చేయడం ఓ కొత్త ప్రయోగమే, కానీ పాత్రని సీరియస్ పాత్రగా మల్చడమే పొరపాటయి పోయింది. దీంతో చాలా  విషయాల్లో  కమర్షియాలిటీ లేకుండా పోయింది. రజనీ కాంత్ సీరియస్ గా వుండడమంటే ప్రపంచమంతా కూమ్ రివర్ లో కొట్టుకు పోయినట్టే. పాతికేళ్ళ క్రితం ‘చనిపోయిన’ భార్య బిడ్డల గురించే ఇంకా బాధపడే పాత్రా- ఆ పాత్రకి తగ్గట్టు పంచ్ డైలాగుల్లేని, సహజ రజనీ మార్కు హాస్యం లేని, ఏ మ్యానరిజమ్సూ లేని, హుషారు లేని, కసి లేని, ఖుషీ లేని – దుర్భిక్ష పరిస్థితి ఏర్పడిన వాతావరణం. 

ఎవరెలా చేశారు
       
జనీది అంత  ఈలలూ చప్పట్లు పడే పాత్ర కాదని ఈ పాటికే అర్ధమైపోయి వుంటుంది. పోనీ ఫ్లాష్ బ్యాక్ లో యంగ్ రజనీ పాత్రయినా ఎంటర్ టైన్ చెయ్యదు. అసలా యంగ్ గ్ రజనీ కంటే ఓల్డ్ రజనీయే చాలా బెటర్. ఓల్డ్ రజనీ కూడా ఒక్క క్లయిమాక్స్ లో విలన్ తో చెప్పే నాల్గు డైలాగులే పవర్ఫుల్ గా వున్నాయి. ఇంకెక్కడా రజనీకి డైలాగులే సరీగ్గా లేవు. ఇది వాస్తవిక కథాచిత్రమన్నట్టు మాటలు రాశాడు దర్శకుడు. కమర్షియల్ డైలాగ్ రైటింగ్ అనేది ఏ  పాత్రకీ లేదు. 

        స్టీవెన్ స్పీల్ బెర్గ్ తీసిన ‘షిండ్లర్స్  లిస్ట్’ వుంది. ఇందులో  హీరో లియాం నీసన్ ఒక హోటల్ రూమ్ లో ఒపెనవుతాడు. ముఖం కనపడదు. వస్తువులు కనబడుతూంటాయి. ఖరీదైన వాచీ ధరిస్తాడు. షర్ట్ కఫ్ లింక్స్ పెట్టుకుంటాడు. కోటు కి నాజీ పార్టీ గుర్తుగల పిన్ పెట్టుకుంటాడు. టేబుల్ సొరుగు లోంచి గుప్పెడు కరెన్సీ నోట్లు తీస్తాడు. నైట్ క్లబ్ లోకి ఎంటర్ అవుతాడు...ఇలాగే వుంటుంది జైల్లో రజనీకాంత్ ఎంట్రీ సీను కూడా. ఇది సరిపోలేదు, ఇంకా హైప్ వుండాల్సింది. రజనీకాంత్ తాను పాత్ర వయసుకి తగ్గట్టు గంభీరంగా నటిస్తున్నాననుకున్నారే గానీ, నిజానికి అది కుటుంబ ట్రాజడీ బాధ బరువు కింద కమర్షియాలిటీని ఖూనీ చేస్తున్నా ననుకోలేదు. 

        ఇక రాధిక ఆప్టే, ధన్సిక లు నటించారు గానీ, అవి రియలిస్టిక్ పాత్రలు. విలన్స్ లో కిషోర్, చైనీస్ నటుడు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరెవరో చిల్లరమల్లర తమిళ కొత్త ముఖాలుగా వున్నారు. రజనీ డాన్సుల్లేవు. వయసుకి తగ్గట్టు తుపాకీ కాల్పులతో యాక్షన్ సీన్స్ వున్నాయి. మ్యూజికల గానూ బలహీనంగా వుంది సినిమా. 


చివరికేమిటి
        సూపర్ స్టార్ రజనీ కాంత్ తో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు రెండు సినిమాల కొత్త దర్శకుడు రంజిత్. ఒల్డేజి రజనీని వెండితెర మీద చూపించడమంటే ఆయన్ని వేగంగా అటు నడిపించడానికీ, లేదా హడావిడిగా ఇటు అడుగులేయించడానికీ మించి విజువలైజేషన్ కన్పించదు  దర్శకుడిలో. రకరకాల సూట్స్ ధరిపంజేయడంలో కనబర్చిన  శ్రద్ధ, ఆ స్టయిలిష్ నెస్ కి తగ్గట్టు మాటల తూటాలు విసిరే ఫన్నీ కోణాన్ని పట్టుకోలేక్పోయాడు. 

        పాతికేళ్ళ తర్వాతా భార్యా బిడ్డలు పోయారన్న విచారంతో వుండే పాత్రగా చిత్రించడం పూర్తిగా-సైకలాజికల్ గా-  అవగాహనా రాహిత్యం. అసలు పాతికేళ్ళ క్రితం జరిగిన దాడిలో గర్భవతైన భార్య  పోవడమనే ఆలోచన పాత్రకి కల్పించడమే అర్ధరహితం.  బహిరంగంగా జరిగిన దాడిలో దాడి  చేసిన వాణ్ణి తాను చంపేస్తే,  పోలీసులు తనని అరెస్టు చేసి పట్టుకెళ్తే, భార్య ఏమయ్యిందో తెలుసుకోడా? చనిపోతే పోలీసులు ఆ సంగతి చెప్పి అంతక్రియలకి అనుమతించారా? చనిపోకుండా ఆస్పత్రిలో ప్రసవిస్తే బిడ్డ పుట్టిన విషయం కూడా చెప్పరా పోలీసులు? భర్త జైలు కెళ్లాడని బతికున్న భార్యకి కూడా తెలీదా పాతికేళ్ళూ? హేతుబద్ధత లేని ఈ ఫ్లాష్ బ్యాక్ మీద పునాది కట్టి మొత్తం కథ నడిపాడు దర్శకుడు. 


        రజనీకాంత్ జైల్లోంచి వచ్చిన పదినిమిషా వరకూ వుండే ఆసక్తి  ఆతర్వాత కథా కథనాల్లో కన్పించక పోవడం, ఇంటర్వెల్  దగ్గర భార్య ఫలానా వూళ్ళో  జీవిస్తోందని తెలిశాక, ఆ తర్వాతి సీన్లో డైరెక్టుగా ఆమెతో కలిపెయ్యకుండా, సెకండాఫ్ లో ఆమెకోసం కావాలని రజనీకాంత్ ని ఊరూరా తిప్పడం (‘బ్రహ్మోత్సవం’  లో మహేష్ బాబు ఏడుతరాల బంధువుల కోసం తిరిగే సీన్లు జ్ఞప్తికి తెస్తూ),  ఆ భార్య కలవగానే- శత్రువుల దాడితో క్లయిమాక్స్ కి వెళ్ళిపోవడం...ఇదంతా విషయలేమిని పట్టి చూపుతుంది. 


        ప్రజల కోసం కబాలీ ఏం చేశాడన్నది ఎక్కడా కన్పించదు. కుటుంబం కోసం పరితపించేవాడు కబాలీ అని బిల్డప్ తో పేరు పెట్టుకుని తిరగనవసరం లేదు. అది కాబూలీవాలా తిరిగి నట్టు వుంటుంది. జైల్లోంచి వచ్చాక అక్కడి ప్రజల కోసం పాటుబడుతూ (ఔటర్ ఎమోషన్), లోలోపల కుటుంబం కోసం బాధపడుతోంటే (ఇన్నర్ ఎమోషన్) - అప్పుడది సమగ్ర పాత్రవుతుంది. ఔటర్ ఎమోషన్ తో ప్రజలకోసం ప్రత్యర్ధుల్ని చీల్చి చెండాడే ప్రచండుడిగా చెలరేగుతోంటే కబాలీ మామూలుగా వుండడు- అడ్వాన్సు బుకింగ్స్ ని దాటి మళ్ళీ వారం కూడా గర్జిస్తూనే వుంటాడు- ఇంకా ఇంకా కలెక్షన్స్ కావాలని!!



-సికిందర్    


18, జులై 2016, సోమవారం

స్క్రిప్ట్ నోట్స్!


హాలీవుడ్ లో స్క్రిప్టుల మీద స్టూడియో ఎగ్జిక్యూటివ్ లకి చాలా అధికారాలుంటాయి. కళాత్మక- వ్యాపారాత్మక విలువల దృష్టితో స్క్రిప్టులు చదివి ఎడా పెడా  స్క్రిప్ట్ నోట్స్ పంపిస్తూంటారు రైటర్లకి. ఆ ప్రకారం రైటర్లు మార్పు చేర్పులు చేస్తూపోవాలి. దరిమిలా స్క్రిప్టు తామే గుర్తు పట్టలేనంతగా మారిపోనూ వచ్చు. రెండు సార్లు ఆస్కార్ అవార్డులు పొందిన ప్రసిద్ధ రచయిత ఇంప్రూవ్ మెంట్ పేర, ఓ రచయిత రాసిన స్క్రిప్టు మీద మరికొందరు రచయితలతో కలిసి పని చేశాక- తీరా సినిమా చూస్తే-  తాను రాసిన డైలాగు చిట్టచివర్లో ఒకే ఒక్కటి వుందట! వెరసి ఈ స్క్రిప్ట్ నోట్స్ అనేవి పెద్ద జోకు కింద  మారిపోయాయని ఆడిపోసుకునే వాళ్ళూ లేకపోలేదు. ప్రముఖ హ్యూమరిస్టు  బ్రియాన్ కల్డిరోలా తాజాగా గత ఏప్రిల్ లో ‘టైటానిక్’  సినిమా స్క్రీన్ ప్లే పేజీ మీద స్టూడియో ఎగ్జిక్యూటివ్ లు  ప్రతాపం చూపిస్తే దాని రూపం ఎలా వుంటుందో- తానే కరెక్షన్స్ తో ఒక స్క్రిప్టు నోట్ ని  తయారు చేశారు. ‘టైటానిక్’  స్క్రీన్ ప్లే లో ఒక సీను పేపర్ మీద ఎగ్జిక్యూటివ్ ఎన్ని తప్పులు పట్టుకుని,  ఎలాటి కామెంట్ లు చేస్తాడో తెలుపుతూ బ్రియాన్ కల్డిరోలా సృష్టించిన కామెడీని  ఈ కింద  మీరే చూడండి! 


***

16, జులై 2016, శనివారం

సాంకేతికం!

అళగర్ సామి 







        తెలుగులో నేటి మెగా బడ్జెట్ల  హై - ఎండ్ టెక్నాలజీ సినిమాల్లో ఏది గ్రాఫిక్స్, ఎంతవరకు కళాదర్శకుడి పరిధీ అన్నది తెలియనంతగా పాలూ నీళ్ళలా కలగలిసిపోయి,  ఈ రెండు విభాగాలూ ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ఒకసారి మహేష్ బాబు నటించిన ‘అర్జున్’ లో మధుర మీనాక్షి దేవాలయ సముదాయం సెట్ నే చూడండి- అదంతా కళా దర్శకుడి అద్భుత ప్రతిసృష్టి లాగే అన్పిస్తుంది చూసే కళ్ళకి. కానీ అందులో గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే కళాదర్శకుడు వేసిన సెట్ అనీ, మిగతా పై అంతస్తులన్నీ గ్రాఫిక్స్ తో చేసిన కల్పనే అనీ తెలిస్తే భలే ఆశ్చర్య పోతారు! అదీ అళగర్ సామి ప్రతిభ. ‘దశావతారం’ లో కమలహాసన్ ని విగ్రహాకి కట్టి  జలసమాధి చేసే యాక్షన్ దృశ్యం కూడా అళగర్ సామి గ్రాఫిక్  సృష్టే. నిజానికక్కడ సముద్రమనేదే లేదు, అపరబ్రహ్మలా అళగర్ సామి సృష్టించిన గ్రాఫిక్స్ సముద్రమే తప్ప!

          ‘భిన్న ప్రాంతాలనుంచి విభిన్న సంస్కృతుల  నుంచీ యానిమేటర్లు ఈ రంగంలోకి వస్తున్నా కొద్దీ మనం అంతర్జాతీయ స్థాయిని మించిపోతాం!’ అని అంటారీయన గర్వంగా. అన్నట్టు హైదరాబాద్ ఐటీ కూడలి అన్నది పాత మాట.గ్రాఫిక్స్ కి కూడా జంక్షన్ అనేది తాజా మాట. అళగర్ సామి చెన్నై లోని స్టూడియో కేంద్రంగా పనిచేస్తున్నా, ఆరు నెలల క్రితం హైదరాబాద్ లో వెన్ శాట్  టెక్ సర్వీసెస్ పేరుతో  సంస్థ ప్రారంభించి వైస్ ప్రెసిడెంట్ గా వుంటున్నారు.తెలుగులో అల్లు అర్జున్ నటించిన  ‘వరుడు’ కి గ్రాఫిక్స్ సమకూర్చారు. 2003 ఓ ‘ఒక్కడు’ నుంచీ గుణశేఖర్  సినిమాలకి సేవలందిస్తున్నారు.

నమ్మలేని నిజాలు
గ్రాఫిక్స్ కి ముందు   
      ‘వరుడు’ లో కీలక సన్నివేశాల వెనుక నమ్మలేని నిజాలున్నాయి. లైవ్ డెమో సాక్షిగా అది చూపించారు అళగర్ సామి. చూస్తే- మొదట బ్లూమ్యాట్ నేపధ్యంగా కళ్యాణ మండపం సెట్ తప్ప మరేమీ లేదు. దాని చుట్టూ అందమైన పూదోట గానీ, పైన సూర్యోదయపు సువిశాలాకాశం గానీ లేవు. కథ ప్రకారం ఉదయం ఏడున్నరకి పెళ్లి ముహూర్తం. ఆ సన్నివేశాల చిత్రీకరణకి కొన్ని రోజులైనా పట్టొచ్చు. అన్ని రోజులూ అదే ప్రాతఃకాలపు టెంపరేచర్ టోన్ నీ, మేఘాల ఆవరణాన్నీ, చుట్టూ పూల మొక్కల తాజా దనాన్నీ, యధాతధ స్థితిలో వుంచేందుకు ఏం చేయాలన్న సమస్యతో దర్శకుడు గుణశేఖర్ వస్తే, అళగర్ సామి ఇచ్చిన ప్లానే  ఈ లైవ్ డెమోలో ఇప్పుడు చూపిస్తున్న తర్వాతి షాట్లు. ఇప్పడు బ్లూమ్యాట్ కట్ అయిపోయింది. మండపం చుట్టూ ముగ్ధ మనోహర పూదోటా, పైన ఉదయకాలపు బంగారు వన్నెతో మెరిసిపోయే గగనతలమూ, అంతా అళగర్ సామి మాయాజాలం! మళ్ళీ ఇది చాలనట్టూ - పిల్ల వాయువులు వీస్తున్నట్టూ, దాంతో నాజూకైన పూల రేకలు అటూ ఇటూ కదులుతున్నట్టూ అదనపు ఎఫెక్ట్! సినిమాలో తర్వాత మొత్తం మండపం కూలిపోయే సీను కూడా గ్రాఫిక్సేనని చెప్పారు.

గ్రాఫిక్స్ తర్వాత 

    క్లయిమాక్స్  సీన్లో 120 అడుగుల ఎత్తుగల పొగ గొట్టం మీద అల్లు అర్జున్ - విలన్ ఆర్యల మధ్య పోరాట దృశ్యాలు ఇంకా వేరే గ్రాఫిక్స్ కళ. ఇందుకు  రామోజీ ఫిలిం సిటీలో సెట్ వేశారు. 20 అడుగుల ఎత్తులో నిర్మించిన బావి లాంటి సెట్ మీద అర్జున్ - ఆర్య లు కలబడతారు. దీన్ని కూడా బ్లూమ్యాట్ బ్యాక్ డ్రాప్ లోనే షూట్ చేశారు. ఇలా గ్రాఫిక్స్ కోసం సృష్టించే ఏదైనా సెట్ ని రిఫరెన్స్ పాయింట్ అంటారు. ఇలాటి ఈ ‘బావి’ అనే రిఫరెన్స్ పాయింటుని  ఆధారంగా చేసుకుని  గ్రాఫిక్స్ తో 120 అడుగుల ఎత్తున్నట్టు పొగ గొట్టాన్ని సృష్టించి, దాని మీద 20 అడుగుల బావి సెట్ మీద చిత్రీకరించిన అర్జున్- ఆర్యల పోరాటాన్ని తెచ్చి ప్రతిష్ఠించారు. ఇంకా ఆ పోరాటం ధాటికి పొగ గొట్టం పెచ్చు లూడుతున్నట్టు అదనపు ఎఫెక్ట్ కల్పించారు. 


        ఈ క్లయిమాక్స్ దృశ్యం ‘ఎక్స్ మెన్ వోల్వోరిస్’ అనే హాలీవుడ్ మూవీ లోనిది కదా అంటే, ఒప్పుకున్నారు అళగర్ సామి. ‘ఈ సినిమాలో మనం చూస్తే హీరో - విలన్ లిద్దరికీ అతీంద్రయ శక్తులుంటాయి. అందువల్ల అంత ఎత్తులో వాళ్ళ పొగ గొట్టం ఫైట్ కి విశ్వసనీయత చేకూరింద
నుకోవచ్చు. అదే అల్లు అర్జున్ కి ఇక్కడ ఈ ఫైట్ లో అలాటి మానవాతీత శక్తులు లేవు. సైకో కాబట్టి ఆర్యకి వున్నాయన్న భ్రమ కల్గించారు. ఇందువల్లే ఈ క్లయిమాక్స్ ని ప్రేక్షకులు ఎంజాయ చేయలేక పోయారేమో?’ అంటే, ఇదీ ఒప్పుకున్నారు అళగర్ సామి.

        ‘దేశంలో బాలీవుడ్ తర్వాత ధైర్యమున్న పరిశ్రమ టాలీవుడ్డే’  అని కుండబద్దలు  కొట్టారు. తమిళంలో 10 సినిమాలు నిర్మిస్తే అందులో బిగ్ బడ్జెట్స్ రెండో మూడో వుంటాయనీ, అదే తెలుగులో అయిదారు వుంటున్నాయనీ అభిప్రాయపడ్డారు.  తెలుగులో గుణశేఖర్ సినిమాలతో బాటు ‘స్టాలిన్’, ‘శ్రీ రామదాసు’, ‘పోకిరి’, ‘అతడు’, ‘అతిధి’, ‘సైనికుడు’, ‘దేశముదురు’, ‘వర్షం’, ‘అరుంధతి’, ‘కిక్’, ‘కొమరం పులి’  మొదలైన సినిమాలకి గ్రాఫిక్స్ సమకూర్చారు. 

       ఇంతకీ గ్రాఫిక్స్ లో కెలా వచ్చారంటే, 1994 లో ‘జురాసిక్ పార్క్’ చూసి ఎక్సైట్ అయి యానిమేషన్ కోర్సులో చేరిపోయానన్నారు. అది పెంటా మీడియా సంస్థలో ప్రవేశం కల్పించిందనీ, అక్కడ వార్నర్ బ్రదర్స్, పండోరా ఫిలిమ్స్ వంటి అంతర్జాతీయ కంపెనీలకి  లెక్కలేనన్ని యానిమేషన్ చిత్రాలు రూపొందించాననీ వివరించారు.  ‘పాండవాస్’ అనే ఇంకో  యానిమేషన్ కి అవార్డు వచ్చిందనీ, ఆ తర్వాత 1998 లో శంకర్ తీసిన ‘జీన్స్’ తో సినిమారంగ ప్రవేశం చేశాననీ చెప్పుకొచ్చారు ఫ్రెండ్లీ గా వుండే అళగర్ సామి.

         అక్కడ్నించీ ‘రోబో’ వరకూ శంకర్ తీసిన సినిమాలన్నిటికీ పని చేశానన్నారు. హిందీతో కలుపుకుని అన్ని భాషల్లో 250 సినిమాల వరకూ గ్రాఫిక్స్ చేశానన్నారు. వీటిలో 95 వరకూ విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్ గా చేసిన సినిమాలున్నాయనీ , ఇవన్నీ చేస్తూనే మరోవైపు ఎంబీఏ కూడా పూర్తి చేశాననీ,  తన  స్వస్థలం మధురై సమీపంలోని చిన్న గ్రామమనీ చెప్పారు. 

        సరే, మళ్ళీ మొదటి కొస్తే- ఇలా కళాదర్శకత్వం - గ్రాఫిక్స్ రెండూ కలగలిసి
పోయినప్పుడు, స్థూలదృష్టికి ఆ క్రెడిట్ కళాదర్శకుడికే పోతుంది, అలాగే యాక్షన్ దృశ్యాల క్రెడిట్ యాక్షన్ డైరెక్టర్లకి పోతుంది. మరి గ్రాఫిక్స్ నిపుణుల స్థాన మెక్కడ? వాళ్ళు అస్తిత్వ బాధితులుగా ఇలా మిగిలిపోవాల్సిందేనా?’ అని అడిగితే,  ఇది ఆయన ఎదురు చూడని ప్రశ్న అయింది...ఈ పాయింట్ తన కెప్పుడూ తట్టనే లేదట! 

        ఇక్కడే వున్నమార్కెటింగ్ చీఫ్ సుఖ్విందర్ సింగ్ అయితే కాసేపటి వరకూ తేరు కోలేకపోయారు. ఇక్కడే వున్న సీనియర్ మేనేజర్ కొండల రెడ్డి- ‘మేమెంత వర్క్ చేశామో, ఆర్ట్ డైరెక్టర్లు, యాక్షన్ డైరెక్టర్లూ ఎంత చేశారో లోలోపల మాకు తెలుస్తుంది’ అని ఏదో సర్ది చెప్పుకోబోయారు. 

        ఈలోగా సుఖ్విందర్ సింగ్ తేరుకుని- ‘మా ప్రొఫెషన్ లో ఈ ప్రశ్న మాకే తట్టలేదు, ఇంతవరకూ ఇలాటి ప్రశ్న ఇంకెవరూ ఎవరూ వేయలేదు’ అని  చెంపలు రుద్దుకున్నారు. అయితే తెలుగు మీడియాలో మొట్ట మొదటి సారిగా ‘ఆంధ్రజ్యోతి’ ద్వారా తమ  ఉనికి గురించి బయటి ప్రపంచానికి ఇలా తెలుస్తోంది గనుక ఇక నిశ్చింతగా  వుంటామన్నారు.


-సికిందర్
(సెప్టెంబర్ 2010, ఆంధ్రజ్యోతి- ‘సినిమా టెక్’ శీర్షిక’)