రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

28, జనవరి 2017, శనివారం

రివ్యూ!




స్క్రీన్ ప్లే- దర్శకత్వం : రాహుల్ ఢొలాకియా 

తారాగణం : షారుఖ్ ఖాన్, మాహిరా ఖాన్, నవాజుద్దీన్ సిద్దిఖీ, షా మహ్మద్ జీషాన్ ఆయూబ్, షీబా చద్దా, అతుల్ కులకర్ణి, సన్నీ లియోన్ తదితరులు
రచన : రాహుల్ ఢొలాకియా, హరిత్ మెహతా, ఆశీష్ వశి, నీరజ్ శుక్లా
సంగీతం : రామ్ శుక్లా, ఛాయాగ్రహణం : కె యు మోహనన్
బ్యానర్ : రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్మెంట్, ఎక్సెల్ ఎంటర్ టైన్మెంట్
నిర్మాతలు : రీతేష్ సిధ్వానీ, ఫర్హాన్ ఖాన్, గౌరీ ఖాన్
విడుదల : జనవరి 25, 2017

***
        సూపర్ స్టార్ షారుక్ ఖాన్ ‘రయీస్’ తో వూరించీ వూరించీ రిపబ్లిక్ డే సందర్భంగా బాక్సాఫీసుకి చేరుకున్నాడు. పాకిస్తానీ హీరోయిన్ మాహిరా ఖాన్ తో రచ్చ జరిగీ జరిగీ క్షేమంగా  బయటపడి బాక్సాఫీసు దగ్గర తేల్చేద్దామని ఎదురు చూస్తున్న ప్రేక్షకుల ముందు కొచ్చింది ‘రయీస్’. ‘పర్జానియా’ తో జాతీయ అవార్డు పొందిన దర్శకుడు రాహుల్ ఢొలాకియా తిరిగి గుజరాత్ కథనే చెప్పాలనుకుని ‘రయీస్’ కి తెరతీశాడు. రిపబ్లిక్ డేకి షారుఖ్ ‘రయీస్’ తో బాటు హృతిక్ రోషన్ ‘కాబిల్’ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోటీకి దిగింది. తెలుగులో ఇద్దరు పెద్ద స్టార్లు నువ్వా నేనా అన్నట్టు సంక్రాంతి బరిలోకి దిగినట్టు- అసలే ఆసక్తికరంగా మారిన  రయీస్- కాబిల్ ల అమీతుమీలో  మొదటిది జాతి వ్యతిరేకమనీ, రెండోది దేశభక్తియుతమనీ,  రెండో దానికే జైకొట్టాలనీ బిజెపి నేత నిప్పు రాజెయ్యడంతో, ఇదేంటో చూద్దామని ప్రేక్షకులు పనిగట్టుకుని బిజీ అయిపోయారు. కొందరు నేతలు బాక్సాఫీసులు కళ కళ లాడేట్టు చేయడానికే పుడతారు!
కథ 
       1970- 90 ల మధ్య కాలంలో గుజరాత్ లోని ఫతేపూర్ లో జరిగే కథ. గాంధీ  పుట్టిన రాష్ట్రం గుజరాత్ లో మద్య నిషేధం అమల్లో వున్నా,  నాటు సారా తయారీ, అమ్మకపు సిండికేట్లు  యదేచ్ఛగా కొనసాగుతున్న రోజులవి. పేద కుటుంబంలో పుట్టి పెరిగిన రయీస్ (షారుఖ్ ఖాన్) చిన్నప్పుడు తల్లి (షీబా చద్దా) చెప్పిన మాటల్ని బాగా వొంటబట్టించుకుంటాడు.  ఏ దందా (బిజినెస్) కూడా దేనికంటే తక్కువది కాదనీ, అలాగే ఏ దందా కంటే కూడా మతం గొప్పది కాదనీ చెబుతుంది తల్లి.  మొదటి ‘నేరం’ గాంధీ విగ్రహానికున్న కళ్ళద్దాల్ని దొంగిలించడంతో చేస్తాడు. అతడికి చిన్నప్పుడే దృష్టి లోపం. కళ్ళజోడు అరువు మీద ఇస్తానని పార్సీ వైద్యుడు అన్నా,  ఆత్మాభిమానంతో అప్పు తీసుకోదు రయీస్ తల్లి. దాంతో గాంధీ కళ్ళద్దాలు దొంగిలిస్తాడు. స్కూల్లో  చదివే రోజుల్లోనే జైరాజ్ (అతుల్ కులకర్ణి)  అనే బనియా (వ్యాపారి) గ్యాంగ్ లో చేరతాడు. జైరాజ్ తనకి బనియా బుర్ర కి తోడూ ముసల్మాను ధైర్యం కూడా వుందని ఉబ్బి తబిబ్బు అవుతూంటాడు. సారా స్మగ్లింగ్, గ్యాంబ్లింగ్ దందాలు నిర్వహిస్తూంటాడు. పోలీసులు ఇతడితో చేతులు కలుపుతారు. పెద్దయ్యాక రయీస్ కి సొంత దందా మొదలెట్టుకోవాలన్పిస్తుంది. దీంతో జైరాజ్ తో తేడా వస్తుంది. మూసా (నరేంద్ర ఝా) అనే ఇంకో సారాకింగ్ తో స్మగ్లింగ్ దందా మొదలెడతాడు. చూస్తూండగానే తనే డాన్ అయిపోతాడు. పేద ప్రజలకి నాయకుడు  అవుతాడు (రయీస్ అంటే నాయకుడు లేదా గొప్ప వాడు అని అర్ధం). ఒక ప్రతిపక్ష పార్టీ మొదలెట్టిన “యాత్ర” ని శాంతి భద్రతల దృష్ట్యా అడ్డుకుని ప్రజల్లో మరింత అభిమానం సంపాదించుకుంటాడు. సీఎం దృష్టిలో పడతాడు. సీఎం తన దందాలకి, రాజకీయాలకీ  వాడుకోవడం మొదలెడతాడు. తేడా వచ్చి జైల్లో పడేస్తాడు. జైల్లోంచే ఎమ్మెల్యేగా గెలిచి వస్తాడు రయీస్. ఇప్పుడు ప్రజాబలంతో తిరుగు లేని నాయకుడైన రయీస్ చరిత్రని ఎలాగైనా ముగించాలని సీఎం అదే ప్రతిపక్ష నాయకుడితో చేతులు కలుపుతాడు...
    ఈ కథలో ఇంకా రయీస్ ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆసియా (మాహిరా ఖాన్) వుంటుంది, రయీస్ ఏకైక అనుచరుడు సాదిక్ (షా మహ్మద్ జీషాన్ ఆయూబ్) వుంటాడు. ఇంకా రయీస్ దందాలు ఖతం చేయాలనుకుని ప్రయత్నించే ఎసిపి జైదీప్ అంబాలాల్ మజ్ముదార్ (నవాజుద్దీన్ సిద్దిఖీ) వుంటాడు.

ఎలావుంది కథ
     ఇది అప్పట్లో గుజరాత్ అండర్ వరల్డ్ డాన్ అబ్దుల్ లతీఫ్ నేరచరిత్ర  ఆధారంగా తీసిన కథ అని తెలిసిందే. కాకపోతే ఆ నేరచరిత్రని వున్నదున్నట్టుగా  సినిమాగా తీయడం సాధ్యం కాదు- తీస్తే గొడవలవుతాయి. కాంగ్రెస్ పార్టీ పరువు మళ్ళీ పోతుంది, బిజెపి ప్రతిష్ఠ ఇంకా పెరుగుతుంది. లతీఫ్ వల్లే గుజరాత్ లో కాంగ్రెస్ భూస్థాపితమైంది, లతీఫ్ వల్లే గుజరాత్ లో బిజెపి తిరుగులేని పార్టీ అయింది. పార్టీల విషయం అలావుంచితే, కరుడు గట్టిన నేరస్థుడు లతీఫ్ జీవితం ఎవరికీ ఆదర్శం కాదు  సినిమాగా తీయడానికి. కనీసం అతడిలో హాజీ మస్తాన్, వరదరాజన్ ల లాంటి పూర్వపు ముంబాయి డాన్ లలో వున్న దయాగుణం లేదు- లౌకిక తత్త్వం లేదు. అతను దావూద్ ఇబ్రహీంతో చేతులు కలిపిన మతోన్మాది, టెర్రరిస్టు కూడా.          సారా దందాతో ప్రారంభమయ్యాడు లతీఫ్. అల్లా రఖా గ్యాంగులో చేరి  గాంబ్లింగ్ డెన్లు నడిపాడు. అల్లా రఖా నుంచి విడిపోయి సొంత దందా నడుపుకుంటూ స్మగ్లర్లతో, క్రిమినల్స్ తో, పోలీసులతో, రాజకీయ నాయకులతో సంబంధాలు ఏర్పరచుకున్నాడు. ఈ వెన్ను దన్నులతో బలవంతపు వసూళ్లు, కిడ్నాపులు, హత్యలు మొదలెట్టాడు. మరోవైపు దావూద్ ఇబ్రహీంతో గ్యాంగ్ వార్స్ మొదలెట్టాడు.
      తన గ్యాంగులో మైనారిటీ వర్గానికి చెందిన వాళ్ళనే చేర్చుకునే వాడు. మైనారిటీ పేదలకే సాయపడేవాడు. ఆ విధంగా తను మైనారిటీ వర్గానికి పెద్ద దిక్కు అన్నట్టు ప్రవర్తించేవాడు. మైనారిటీ వర్గంలో తగినంత ఓటు బ్యాంకు నిర్మించుకుని, 1986-87 లో అహ్మదాబాద్  మున్సిపల్ ఎన్నికల్లో ఐదు వార్డుల్ని గెల్చుకున్నాడు. ఆ సమయంలో జైల్లో వున్నాడు. 
     కానీ అతడి ఎన్నికని  కోర్టు కొట్టేయడంతో అతడి రాజకీయ జీవితం అక్కడే సమాప్తమైంది. అయినా మైనారిటీల్లో అతడికున్న పట్టు చూసి కాంగ్రెస్ నేతలు దగ్గరవసాగారు. తాము  ఎన్నికలు గెలవడానికీ, ప్రత్యర్ధుల్ని ఎదుర్కోవడానికీ అతడితో చేతులు కలిపారు. కాంగ్రెస్ లో అతడి పలుకుబడి ఎంతగా పెరిగిందంటే, తన చిన్న నాటి స్నేహితుడు హసన్ లాలాని  గుజరాత్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా చేసిపారేశాడు. 

     1980 లలో రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమాన్ని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం లతీఫ్ ని దింపింది. ఆ ఆందోళనని అతను  మతకలహాలుగా మార్చేశాడు. అక్కడ్నించీ రాష్ట్రంలో ఎక్కడ మతకలహాలు జరిగినా అందులో అతడి గ్యాంగులు వుండేవి. మెజారిటీ వర్గ ప్రజలే చనిపోయేవారు. దీంతో రాష్ట్రంలో, ముఖ్యంగా అహ్మదాబాద్ లోని మెజారిటీ వర్గ ప్రజలు అతడి  నుంచి తమని కాపాడే నాయకుడి కోసం ఎదురుచూసే వాళ్ళు. 

     లతీఫ్ బలం గురించి తెలుసుకున్న దావూద్ ఇబ్రహీం కూడా అతడితో సంధి చేసుకున్నాడు. దీంతో 1992 లో వాడుకోవడానికి ఏకే ఫార్టీ సెవెన్లు చేతికొచ్చాయి. ఒక జిమ్  ఖానాలో త్రివేదీ అనే వ్యక్తిని  చంపిరమ్మని ఏకే ఫార్టీ సెవెన్లు ఇచ్చి  గ్యాంగుని పంపిస్తే, వాళ్ళు త్రివేదిని గుర్తు పట్టక పోవడంతో, అక్కడున్న వాళ్ళందర్నీ కాల్చెయ్య మన్నాడు లతీఫ్. ఆ విచ్చలవిడి కాల్పులకి తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆహ్మదాబాద్ నగరం ఈ దుశ్చర్యకి వణికిపోయింది. 

      అక్కడ్నించీ లతీఫ్ టెర్రర్ కి హద్దులేకుండా పోయింది. 1993లో ముంబాయి పేలుళ్లు జరిపిన దావూద్, లతీఫ్ సాయం తీసుకోకపోయినా, గుజరాత్ లో మాత్రం లతీఫ్ మెజారిటీ వర్గానికి టెర్రర్ గా మారిపోయాడు. కాంగ్రెస్ ఏమీ చేయలేకపోయింది. 1995 ఎన్నికల ప్రచారంలో బిజెపి లతీఫ్ టెర్రర్ ని ప్రధానాంశం చేసి, అతణ్ణి జైల్లో వేస్తామని వాగ్దానం చేసింది. ఎన్నికల్లో బిజెపి ఘనవిజయం సాధించి, కాంగ్రెస్ ఇక ఎప్పటికీ కోలుకోలేనంతగా దెబ్బతిని పోయింది. యాంటీ టెర్రరిజం స్క్వాడ్ లతీఫ్ ని పట్టుకుని జైల్లో వేసింది. రెండేళ్ళ తర్వాత అతను పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకుంటూ ఎన్ కౌంటరయ్యాడని వార్తలొచ్చాయి...


                                         ***
     
ఇలా వున్న లతీఫ్ నేరచరిత్రని రయీస్ కథగా సినిమాగా తీసినప్పుడు అతనో  గొప్పవాడుగా చిత్రించారు. హిందూ ముస్లిం ఎవరూ ఆకలితో వుండరాదన్న డైలాగులు పలికించి సెక్యులర్ గా మార్చేశారు. తెలియకుండా తను బాంబు పేలుళ్ళకి కారకుడయ్యాడ ని తెలుసుకుని, నిష్కృతిగా పోలీసు చేతిలో మరణాన్ని  కోరుకున్న మహోన్నతుడిగా గ్లామరైజ్ చేశారు.  

          ఒక క్రిమినల్ నేర చరిత్రని షారుఖ్ కోసం గ్లామరైజ్ చేశారా, లేకపోతే ప్రపంచానికి తెలిసిన ఆ క్రిమినల్ నేర చరిత్ర తప్పని షారుఖ్ నుపయోగించుకుని చెప్పాలనుకున్నారా అర్ధంగాదు. కానీ రెండూ తప్పుగానే కన్పిస్తాయి. పైగా ఆ ఏదోవొకటి చెప్పడంలో కూడా రచయితలకీ, దర్శకుడికీ, షారుఖ్ కీ ఎవరికీ కమిట్ మెంట్ గానీ, అవగాహనగానీ లేవని తెలిసిపోతూంటుంది. చాలా తమాషాగా నేరచరిత్రని ఫిక్షన్ చేశారు. ఇది మాత్రం అర్ధం పర్ధం లేని క్రియేటివిటీ అని అర్ధమైపోతుంది... ఎంతగా నంటే,  నవ్వొచ్చే విధంగా!

ఎవరెలా చేశారు 
     1975 లో సలీం- జావేద్ లు రాసి, యశ్ చోప్రా తీసిన ‘దీవార్’ లో అమితాబ్ బచ్చన్ పాత్రతో గానీ,  1987 లో మణిరత్నం తీసిన ‘నాయకన్’ లో కమల్ హాసన్ పాత్రతోగానీ పోలికలేని పాత్ర షారుఖ్ ఖాన్ నటించాడు. హాజీ మస్తాన్, వరదరాజన్ ముదలియార్ ల పాజిటివ్ డాన్ ల పాత్రలు అమితాబ్, కమల్ లవి. ఈ పాత్ర చిత్రణలకి అంతర్జాతీయంగా కూడా ఎన్నో పేరుప్రఖ్యాతు లొచ్చాయి. అబ్దుల్ లతీఫ్ నెగెటివ్ డాన్ పాత్ర షారుఖ్ ది. నెగెటివ్ ని పాజిటివ్ గా మార్చినా, ఈ పాజిటివిజంలోనూ సారా అమ్ముకునే పాత్రగా షారుఖ్ స్థాయికి తగని యాంటీ హీరో పాత్రయి పోయింది. సారా అమ్మడం, చంపడం, చివరికి చచ్చిపోవడం బాక్సాఫీసు అప్పీల్ కి తగని వ్యవహారమైపోయింది. పూర్తిగా డార్క్ షేడ్స్ తో, డార్క్ మూడ్ ని క్రియేట్ చేసే వాతావరణంతో  ఈ పాత్ర అభిమానులతో,  రెగ్యులర్ ఫ్యామిలీ ఆడియెన్స్ తో ఎలా వర్కౌట్ అవుతుందనుకున్నారో ఏమో. షారుఖ్ నుంచి వాళ్ళు ఆశించేది గ్లామరస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ అనుకుంటాం. మైనారిటీల ఇమేజిని పెంచడానికి షారుఖ్ వరసగా మైనారిటీ  పాత్రలు పోషిస్తున్నాడని ఇప్పటికే విమర్శ వుంది. గాంధీ పుట్టిన రాష్ట్రంలో  లతీఫ్ సారా అమ్మడమే తప్పు. ఆ తప్పుని షారుఖ్ గ్లామరైజ్ చేస్తే అది మైనారిటీల ఇమేజిని పెంచడమెలా అవుతుందో అర్ధంగాదు. ఒక సూపర్ స్టార్ గా ఏవొక వర్గ కొమ్ము కాస్తున్నట్టూ తను కన్పించకూడదసలు. 
          ఇక ఈ పాత్రలో షారుఖ్ ఎలా నటించాడన్న ప్రశ్నే తలెత్తదు. పాత్రల్లో ఆదర్శ పాత్ర, మంచి పాత్ర, అమాయక పాత్ర, దుష్ట పాత్ర మొదలైనవి చాలా వుంటాయి. ఇలాటి దుష్ట పాత్రలో  సూపర్ స్టార్ ఎలా నటించాడో చెప్పడానికేమీ వుండదు-  దుష్ట (విలన్)  పాత్రలేసే నటుడెవరైనా ఈ పాత్ర  పోషించి వుంటే చెప్పుకోవడానికి చాలా వుండేది- ఇరగ దీశాడని, విరగబూశాడని! ఇప్పుడు మనం షారుఖ్ ని పొగిడితే రేపు ఇంకో స్టార్ ఇలాటి పాత్ర వేస్తాడు. 

          ఎన్నో  వివాదాలకి కారణమైన హీరోయిన్ మాహిరా ఖాన్ కూడా కథ ప్రకారం
80ల నాటి పాత్రలోనే కనిపిస్తుంది. ఈ పురాతన పాత్రలోనే  ఇంకే బాలీవుడ్ టాప్ హీరోయిన్ కన్పించినా ఈలలు పడేవి. మాహిరా ఇలా కూడా ప్లస్ కాలేకపోయింది. ఈమెతో ఇంత నిస్తేజంగా సీన్లు వెళ్లిపోతూంటే, కోరి ఈమెని ఎందుకు పెట్టుకుని కష్టాలు తెచ్చుకున్నట్టో! పాత్ర కూడా షారుఖ్ బయట ఏం చేసినా ఆమోదించేలా వుంటుంది. ఒక సన్నివేశంలో కొట్ట బోతాడు- అప్పుడైనా వాకౌట్ చేస్తే పాత్ర యాక్టివ్ అయ్యేది. ప్రేమించడంలో, భార్యగా బ్రతకడంలో, పిల్లాణ్ణి కనడంలో వున్న మెళకువలు ఈ తరానికి నేర్పుతున్నట్టు వుంటుంది. 

          ఎసిపి గా నవాజుద్దీన్ సిద్ధిఖీ ఇంకో వృధా అయిన టాలెంట్. షారుఖ్ కి వ్యతిరేక పాత్రగా తను చేసేదేమీ వుండదు- చివర్లో వచ్చి రెండు గుళ్ళు పేల్చి చంపడం తప్ప. షారుఖ్ అంతు చూసేందుకు ముఖ్యమంత్రికే  విలనీ పెరిగిపోవడంతో – అప్పుడప్పుడు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్స్ తో సింగిల్ లైన్ పంచ్  డైలాగులు కొట్టడమే నవాజుద్దీన్ నమ్మిన కార్యక్రమమై పోయింది.

          ఈ సినిమాకి సరైన సంగీతం ఇద్దామని సంగీత దర్శకుడుకి కూడా కమిట్ మెంట్ లేదు, రెమ్యునరేషన్ తాలూకు అగ్రిమెంట్ తప్ప. పాట వచ్చినప్పుడల్లా బి గ్రేడ్ సినిమా పాట చూస్తున్నట్టు వుంటుంది. ఏం మ్యూజిక్ కొట్టాడో ఎంతకీ అర్ధంగాదు. కెమెరా మాన్ కూడా- కానీ కెమెరా మాన్ దర్శకుడు కోరుకున్న రెగ్యులర్ కమర్షియల్ లుక్ కాని డార్క్ మూడ్ కెమెరా వర్కే చేశాడు కథ ప్రకారం. రిచ్ లుక్ అన్నమాటకి తావే లేదు.

         ఇరుకు గల్లీలు, పాత ఇళ్ళు, బస్తీ జనం- సారాబట్టీలు, సీసాలూ - వీటితో కళా దర్శకత్వం కథా కాలానికి తగ్గట్టే వుంది. కానీ అప్పటి కథాకాలం ఇప్పుడెవరికి అవసరం, ఫ్రెష్ గా ఇప్పుడు జరుగుతున్న కథలు కాక!

చివరికేమిటి 
     ‘కబాలీ’ ని చూసి ఎంత నవ్వొచ్చిందో, ‘రయీస్’ నీ చూస్తే అంతే నవ్వొస్తుంది. ఈ రెండిటి దర్శకులూ సమాంతర సినిమా ప్రేమికులే.  సమాంతరం నుంచి అమాంతంగా కమర్షియల్ గా రూపాంతరం చెందాలని  సూపర్ స్టార్స్ నే బలిచేశారు.

     ‘కబాలీ’ తీసిన పా. రంజిత్ గతంలో ‘అట్టకత్తి’, ‘మద్రాస్’ అనే రెండు సమాంతర సినిమాలు తీసి పేరు తెచ్చుకున్నాడు. చాలా పూర్వం కమర్షియల్ సినిమాలనుంచి ఆర్ట్ (సమాంతర) సినిమాల్ని ఇట్టే గుర్తు పట్టేవాళ్ళు ప్రేక్షకులు. ఇప్పుడా ఆర్ట్ సినిమాలు చచ్చి పోయాయనుకుంటున్నారు. అవి బతికే వున్నాయి.  కాకపోతే గుర్తు పట్టలేకుండా క్రాసోవర్, మల్టీ ప్లెక్స్, ఇండీ ఫిలిమ్స్ రూపాల్లో. ఈ స్కూలు నుంచి వచ్చిన రంజిత్, రజనీకాంత్ తో ‘కబాలీ’ అనే బిగ్ కమర్షియల్ తీస్తే,  అది ఇందుకే అలావుంది-  ఏ కథా లక్షణాలూ లేకుండా. 

          రాహుల్ ఢొలాకియాది డాక్యుమెంటరీల పోర్టుఫోలియో. మూడు డాక్యుమెంటరీలు తీశాక, ఒక ‘పర్జానియా’ అనే సమాంతరం తీసి జాతీయ అవార్డు తీసుకున్నాడు. ఆ ‘పర్జానియా’ 2002 గుజరాత్ అల్లర్లలో తప్పిపోయిన పార్సీ బాలుడి కథ. ఇలాటి పోర్టుఫోలియోతో ఇప్పుడు  షారుఖ్ లాంటి సూపర్ స్టార్ తో  ‘రయీస్’ తీస్తే, ఇది  ‘పెద్ద పర్జానియా’ అయింది, అంతే.

          సమాంతర సినిమాలకి కథా లక్షణాలుండవు. కమర్షియల్ సినిమాలకి చాలా కథా లక్షణాలుంటాయని ఎందుకు తెలుసుకోరో రూపాంతరం చెందాలనుకునే సమాంతర వాసులు. దీంతో సూపర్ స్టార్ల అభిమానుల ప్రాణాల మీదికొస్తోంది ఈ సినిమాలు చూడలేక. స్టార్లు పర్మిషనిస్తే సమాంతరం కమర్షియల్ గా రూపాంతరం చెందిపోదు.  ఎందుకంటే ఈ దర్శకులకి ఎంత తెలుసో స్టార్స్ కీ, సూపర్ స్టార్స్ కీ అంతే తెలుసు. అన్ని కథలూ కమర్షియల్ కథల్లాగే కన్పిస్తాయి, అన్ని పాత్రలూ కమర్షియల్ పాత్రల్లాగే అన్పిస్తాయి. ఈ లెక్కన కొంత కాలం పోయాక,  ఓ షార్ట్ ఫిలిం చూసి ఆ టీనేజర్ ని కూడా దర్శకుడిగా పెట్టుకుని కబాలీని మించిన కబాలీ, రయీస్ ని మించిన రయీస్ తీస్తారు. 

          కమర్షియల్ గా ఏ కథయినా ఒక పాయింటు చుట్టే వుంటుంది, కమర్షియల్ గా బయోపిక్ తీసినా ఒక పాయింటు చుట్టే వుంటుంది. ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ గణరాజ్యాల్ని  ఏకం చేసే పాయింటు చుట్టే వుంటుంది. ఒక పాయింటూ, దాంతో సంఘర్షణా అంటూ వుండనిది సమాంతర సినిమా కథలకే. ‘రయీస్’ కథ కూడా ఇలాటిదే, సరీగ్గా చెప్పుకోవాలంటే ఇది కథ కాదు గాథ. గాథ కమర్షియల్ జాతి కాదు, సమాంతర జాతి. 

        ఇలా సమాంతర ‘రయీస్’ కి ఒక పాయింటు అంటూ వుండదు, ఫలితంగా సంఘర్షణ  కూడా వుండదు. ఒక్కో ప్రత్యర్ధితో ఒక్కో సమస్య పుట్టినప్పుడల్లా దాన్ని అణుస్తూ పోవడమే జరుగుతూంటుంది. ఎపిసోడ్లు గా కథనం సాగుతూంటుంది. అఆ అంటూ మొదలెట్టి అం అః వరకూ అదే వరస. కమర్షియల్ కథలు ‘అఆ’ అంటూ మొదలెట్టినా ‘ఋ’ దగ్గరో, ‘ఎ’ దగ్గరో పాయింటు  కొచ్చి, దాంతో పోరాడి ‘అం అః’ అన్పిస్తాయి. రయీస్ రాగం తీయడమే గానీ పల్లవే అందుకోదు. చిన్నప్పటి కథ పూర్తి  చేయడానికే చాలా సమయం తీసుకుంటుంది. పెద్దయ్యాక జైరాజ్, మూసా, ఎసిపి, సీఎం ఇలా ప్రత్యర్ధులు ఒకరితర్వాత ఒకరు వస్తూంటారు. ఇందరు విలన్లతో కథేమిటో అర్ధంకాదు, మొదలు కాదు. ఎసిపి నాంకే వాస్తే వుంటాడు, సీఎం విలన్ పార్టు అందుకున్నా క్లయిమాక్స్ లో అతను కూడా వుండడు – ఎవరో  అదృశ్య విలన్ వుంటాడు. ఉన్న వాళ్లతో కథ కుదరడం లేదన్నట్టు అదృశ్య విలనెవరో వుంటాడు. తను స్మగ్లింగ్ చేస్తున్నవి బాంబులని తెలియకుండా రయీస్ సరఫరా చేస్తే, నగరంలో పేలుళ్లు జరిగి చాలామంది ప్రాణాలు కోల్పోతారు. వాటిని ఎవరికి పంపాడో కూడా రయీస్ కి తెలీదు. ఆ పేలుళ్ళకి తనే కారణమని  ఎన్ కౌంటర్ అయిపోవడానికి సిద్ధ పడతాడు. ఒక పాసివ్ క్యారక్టర్ లా కథ ముగించుకుంటాడు. ఆ శత్రువెవరో వాణ్ణి పట్టుకుని చంపి లొంగి పోవచ్చుగా? ‘వాణ్ణి’ ఎందుకు వదిలేశాడు? ‘వాణ్ణి’ పట్టుకుంటే  వున్న మాహిరా ఖాన్ తో కష్టాలు కాక, మరిన్ని కష్టాలు  చుట్టుకుంటాయనేమో!

          చాలా కన్వీనియెంట్ గా కథలో  ‘వాణ్ణి’  లేకుండా చేశారు. కానీ లతీఫ్ చరిత్రలో దావూద్ ఇబ్రహీం స్పష్టంగా వున్నాడు. వీళ్ళ గ్యాంగ్ వార్స్  ని ఆపాలని, 1989 నవంబర్ లో దుబాయిలో ఒక  మత పెద్ద ఇద్దర్నీ కూర్చోబెట్టి, మతగ్రంధం మీద ప్రమాణం చేయించాడు-  కొట్టుకోకుండా కలిసి పనిచేసుకోవాలని! 

          లతీఫ్  నేరచరిత్రలో ఇది కీలక ఘట్టం. కానీ రయీస్ ని గొప్పవాడుగా చిత్రించే పనిలో దీన్ని పక్కన పెట్టారు. ఇందుకే కథకి  కేంద్ర బిందువైన పాయింటు అంటూ లేకుండా పోయింది. దర్శకుడి పోర్టు ఫోలియో ప్రకారం చూసినా తన సమాంతర ధోరణికి కేంద్ర బిందువు వుం టుందని కూడా తట్టే అవకాశం లేదు. ఇందుకే సంబంధంలేని సంఘటనలు ఒకదానివెంట ఒకటి వచ్చేస్తూంటాయి. ఫస్టాఫ్ లో "యాత్ర" తీస్తే అదే అంతిమ యాత్రవుతుందని హెచ్చరించడం, ఆ యాత్రని శాంతియుతంగా అడ్డుకోకుండా, హింస ద్వారానే అడ్డుకోవాలన్నట్టు పెట్రోలు సీసాలతో ఆ ప్లానింగ్ అంతా ముందే చేసుకుని హింసకే పాల్పడడం నవ్వు తెప్పిస్తుంది. “యాత్ర” తీస్తే శాంతిభద్రతలు దెబ్బ తింటాయన్న వాడే  ఇలా ప్రవర్తిస్తాడు. ఇక సెకండాఫ్ లో అలా జైలు కెళ్ళి ఇలా ఎన్నిక గెల్చి వచ్చేసే ఎపిసోడ్ అతిబలహీన కమర్షియలేతర చిత్రణ పాటతో కలుపుకుని. చాలా పాత సినిమాల్లో చూస్తూంటాం ఇలాటిది. ఇంకా ఆ వెంటనే 2002 గుజరాత్ అల్లర్లు, ఆ వెంటనే 1993 ముంబాయి బాంబు పేలుళ్లు- ఇలా తేదీలు కూడా ఫాలో అవకుండా ప్రేక్షకుల్ని ఫూల్స్ చేయాలనుకున్నారు. కాస్త ధైర్యం చేయడం, అమ్మో ‘వాడు’ న్నాడు మనకెందుకని వెనక్కి తగ్గడం - ఈ డైనమిక్సే గత్యంతరం అయ్యాయి స్ట్రక్చర్ లేని స్క్రీన్ ప్లేకి. కాసేపు లతీఫ్- కాసేపు కటీఫ్, ఇంతే.

-సికిందర్
http://www.cinemabazaar.in
         
         




         

26, జనవరి 2017, గురువారం

రివ్యూ!





కథ దర్శకత్వం : రాజకిరణ్ 

తారాగణం : విష్ణు మంచు, హన్సిక, తనికెళ్ళ, జయప్రకాష్, పోసాని, ప్రభాస్ శీను, సత్యం రాజేష్, ఎం వివి సత్యనారాయణ తదితరులు
 స్క్రీన్ ప్లే- మాటలు : డైమాండ్ రత్నబాబు, సంగీతం : అచ్చు రాజమణి, ప్రవీణ్ లక్కరాజు,   ఛాయాగ్రహణం : పిజి విందా
బ్యానర్:  ఎంవివి సినిమా
నిర్మాత : ఎంవివి సత్యనారాయణ
విడుదల : జనవరి 26, 2017
***
త సంవత్సరం ‘ఈడో రకం-  ఆడో రకం’ తో అంతగా సక్సెస్ ని  చవిచూడని మంచు విష్ణు,  రిపబ్లిక్ డే కి మళ్ళీ విడుదల వాయిదా పడిన ‘యముడు -3’ స్పేస్ ని ఉపయోగించు కుంటూ హడావిడిగా విడుదల తేదీని ప్రకటించుకుని ఇప్పటికిప్పుడు  ‘లక్కున్నోడు’ తో తిరిగి వచ్చేశాడు. 2015 లో ‘శంకరాభరణం’ తీసి ఫ్లాప్ నెదుర్కొన్న నిర్మాత ఎంవివి సత్యనారాయణ, ఈసారి సినిమా జాతకం ఎలా తేలినా విలన్ గా మాత్రం తను నిరూపించుకుందామని ప్రేక్షకుల ముందుకొచ్చారు. విష్ణు పక్కన తొలిసారిగా హీరోయిన్ గా నటిస్తూ హన్సిక వచ్చేసింది. ‘గీతాంజలి’ అనే హార్రర్ కామెడీతో వెలుగులోకొచ్చిన దర్శకుడు రాజ కిరణ్, ‘త్రిపుర’ తో ప్రతిష్ఠ మసకబారి ఇప్పుడు కామెడీతో అదృష్టాన్ని  పరీక్షించుకుందామని - అదే సమయంలో సరైన కామెడీలు తీయగల దర్శకులు ఇప్పుడున్నారా అనే ప్రశ్నకి సమాధానం కూడా చెపుదామని అన్నట్టుగా జానర్ జంప్ చేశారు. ఇన్నీ కలిసి ఈ ప్రయత్నం అనుకున్న ఫలితం రాబట్టిందా లేదా ఈ కింద చూసుకుంటూ వెళ్దాం... 

కథ
          లక్కీ ( విష్ణు) అదృష్ట జాతకుడు కాదు. చిన్నప్పట్నించీ ఏది పట్టుకున్నా కుటుంబానికి  దురదృష్టమే వెంటాడేసరికి తండ్రి భక్త వత్సలం (జయప్రకాష్) విపరీతమైన ద్వేషం పెంచుకుంటాడు. తల్లీ చెల్లెలు సానుభూతితోనే వుంటారు. పుట్టాక పేరు పెట్టేటప్పుడు కూడా ఆ ముహూర్తానికి లక్కీ వల్ల జరిగిన అనర్ధానికి పేరే పెట్టకుండా వదిలేస్తాడు భక్తవత్సలం. అవమానపడుతూ అలాగే పేరు లేకుండా పెరిగిన లక్కీ, హైదరాబాద్ వచ్చేస్తాడు ఫ్రెండ్ (సత్యం రాజేష్) దగ్గరికి. రాగానే ఆ ఫ్రెండ్ దివాలా తీసి వీధిన పడతాడు.

          పాజిటివ్ పద్మ (హన్సిక) అనే అమ్మాయి పరిచయమవుతుంది- ఈమె ఇంట్లో అందరూ కీడు జరిగినా పాజిటివ్ గానే ఆలోచిస్తారు. గడ్డం గీసుకునేప్పుడు చర్మం చిట్లి రక్తం వచ్చినా తండ్రి (తనికెళ్ళ భరణి) పీక తెగనందుకు సంతోషించాలని పాజిటివ్ గా ఆలోచిస్తాడు. ఇల్లుపోయినా గుండాగి చావనందుకు సంతోషించాలని పాజిటివ్ గా చెప్తుంది వదిన. ఇలా పాజిటివ్ పద్మ లక్కీకి పరిచయమైనా అతడిని శని వెంటాడుతూనే వుంటుంది. తనకి రావాల్సిన ఉద్యోగం ఆమెకొస్తుంది. 

          ఇలావుండగా, చెల్లెలి నిశ్చితార్థానికి ఇంటికి వెళ్తాడు లక్కీ. అక్కడొక బాధ్యత నెత్తినేసుకుని  నగరానికి వస్తే, దురదృష్టంతన్ని చెల్లెలి పెళ్లి ఆగిపోయే గతి పడ్తుంది. దీంతో ఆత్మహత్య చేసుకోబోతూంటే, ఒక దొంగోడు (ప్రభాస్ శీను) జొరబడి డిస్టర్బ్ చేస్తాడు. ఇంకో  క్రిమినల్ వచ్చి, తన దగ్గరున్న బ్యాగు ఈ పూట వుంచుకుంటే కోటి రూపాయలిస్తానని ఆఫర్ చేసేసరికి- లక్కీ తన లక్ దారిలో పడిందని ఓకే అంటాడు- ఈ ఓకే తో అతడి కథ ఏ మలుపులు తిరిగిందో వెండి తెర మీద చూడాలి. 

ఎలావుంది కథ
          కథ పాతదే అయినా ఇదొక కుటుంబ సమస్యతో కూడిన సమంజసమైన కథ. దర్శకుడి తాజా దృష్టివల్ల ఈ కథ కొత్త ఫీల్ తో ఫన్నీగా మారింది. ఈనాటికి అవసరమైన యూత్ అప్పీల్ తో, ఒక ఫన్నీ ఫ్యామిలీ ఎంటర్ టైనరయ్యే అవకాశాలన్నీ వున్నాయి దీనికి. దురదృష్టవశాత్తూ  ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోలేదు. ఫస్టాఫ్ వరకే ఈ తాజాదనాన్ని ప్రదర్శించి ఆ తర్వాత చేతులెత్తేశారు. ఫస్టాఫ్ లో సున్నిత హాస్యంతో, అదుపులో వుంచిన భావోద్వేగాలతో ఒక పూర్తి  స్థాయి కామెడీ జానర్ అన్పించేట్టు చేసుకొచ్చి, ఆ  తర్వాత కథతోనూ  జానర్ తోనూ మర్యాద తప్పి, ఏదేదో గోల కామెడీ చేసేశారు. పైగా దీనికి క్లయిమాక్స్ లో రచయిత తనకు తానే ఇలా కీర్తించుకుంటాడు- “ఇది ఎంటర్ టైన్మెంట్ ఫార్ములా అనుకున్నా, రివెంజి ఫార్ములానా! వాటే స్క్రీన్ ప్లే సర్జీ!” అని ఒక పాత్ర చేత అన్పిస్తాడు- క్లయిమాక్స్ కొచ్చేసరికి  ఇది కూడా పూర్తిగా ఓ స్టేజి నాటకంలా మారిపోయి ప్రేక్షకులు లేచిపోతున్నా ... స్క్రీన్ ప్లే అనీ, ఫార్ములాలనీ అంటాడు. ఇకనైనా  సినిమాల్ని అల్లాటప్పాగా మార్చేస్తున్న ఈ ఫార్ములాల వంటకాల్ని మానుకుని, జానర్ల మాట మటాడుకుంటే స్క్రీన్ ప్లేలు బాగుపడతాయేమో.

ఎవరెలా చేశారు
          మంచు విష్ణుకి నిజానికిది  సెన్సిబుల్ పాత్ర ఫస్టాఫ్ వరకూ. తన దురదృష్టాలతో  స్ట్రగుల్ చేస్తూ ప్రతీమాటా హాస్యంగా, ప్రతీ ఆలోచనా  హాస్యంగానే వుంటూ, యూత్ అప్పీల్ తో  – బాక్సాఫీసు అప్పీల్ తో చాలా ఫ్రెష్ గా, చూపులు తిప్పుకోలేనంతగా  వుంటుంది  క్యారక్టర్. తన పాత్రని నిలబెట్టడానికి ఫస్టాఫ్ అంతా గత జీవితాన్ని మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకులుగా  చెప్పడం బాగా తోడ్పడింది. కథలో ఇప్పటి వరకూ పోషించుకుంటూ వస్తున్న ఈ  కామెడీ జానర్ లోనే  ఇంటర్వెల్ కూడా-  దొంగోడితో, క్రిమినల్ తో- బాగా నవ్వొచ్చే బ్యాంగు ఇచ్చింది- ‘స్వామి రారా’ ఇంటర్వెల్ ని గుర్తుకు తెస్తూ- తర్వాతేమిటో  వెంటనే చూడలన్నంత ఉత్కంఠని రేకెత్తిస్తూ. ఇలా సెకండాఫ్ మీద ఆసక్తి రేపే ఇంటర్వెల్ ‘స్వామిరారా’ తర్వాత మళ్ళీ ఇదే. నైస్ క్రియేషన్ క్రియేటివిటీతో. 

          దీన్తర్వాత తద్దినం పెట్టడం మొదలయ్యింది తన పాత్రకి. ఆ జీవితం, ఆ హాస్యం ఎటుపోయాయో,  ఆ ఫస్టాఫ్ ఫన్ ఎటుపోయిందో, అసలు కథ వదిలేసి కొసరు సీరియస్ యాక్షన్ కథ పట్టుకుని –కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్టయి పోయింది. ఆ గోదారిలో నీళ్ళు కూడా లేవు. పోలవరం వెళ్ళినా పనిజరిగేట్టు లేదు, అప్పటికి స్టేజి నాటకమైపోయింది. పాటలూ ఫైట్లూ బాగానే చేసినా అవి కథలో, పాత్ర చిత్రణలో కలిసిపోయి వుంటేనే ఎవరికైనా తదనుగుణ హుషారు తెప్పిస్తాయి- లేకపోతే వూరికే శబ్ద కాలుష్యాన్నే సృష్టిస్తాయి. 

          పాజిటివ్ పద్మగా హన్సిక ఫస్టాఫ్ ఫన్నీ క్యారక్టర్ కాస్తా- సెకండాఫ్ లో పాత్రకి పనిలేక క్లయిమాక్స్ కి దర్శనమిస్తుంది. ప్రభాస్ శీను, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్ ఫ్రెష్ కామెడీని అందించారు. తండ్రి పాత్రలో జయప్రకాష్ ఒక్కడే  సీరియస్ గా వుంటాడు. కథలో మిగతా పాత్రలన్నీ హాస్యంగా మాటాడేవే. ఇక విలన్ గా వేసిన నిర్మాత సత్యనారాయణ, బలమైన విలన్ గా నటించి తన నటనాభిలాషకి న్యాయం చేసుకున్నారు. తెలుగు విలన్లు కరువైన ఈ రోజుల్లో తను ప్రకాశించ వచ్చు.

          పాటల గురించి చెప్పుకోవడానికేమీ లేదుగానీ, పిజి విందా ఛాయాగ్రహణం అత్యంత కలర్ఫుల్ గా వుంది. డైమండ్ రత్నబాబు రాసిన మాటలు, స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ వరకే సినిమాకి పనికొచ్చాయి. ఫస్టాఫ్ లో తను ఇంతకి  ముందు లేని క్రియేటివిటీతో ఆశ్చర్య పర్చాడు. సెకండాఫ్ కథనేం చేసుకోవాలో అర్ధంగాక కలగాపులగం చేసేశాడు.

చివరికేమిటి
          ఒక మంచి ఫన్నీ  ఫ్యామిలీ డ్రామా, నవంబర్ ఎనిమిదిన దేశంలో ఏం జరిగిందో,  అలా ఇంటర్వెల్ తర్వాత  చెల్లని చిత్తు కాగితమైపోయింది. కొత్త నోట్ల దోపిడీతోనే ఈ కథ మొదలవుతుంది గానీ, ఈ కొత్త నోట్ల కొసరు కథే  సెకండాఫ్ లో అసలు కథై కూర్చుంది – దోపిడీ దొంగల రొటీన్ తో. ఫ్యామిలీలో అంత పనికొచ్చే ప్రాబ్లమ్స్ తో అసలు కథని వదిలేశారు. ఇంటర్వెల్ కి హీరో చుట్టూ చాలా వ్యక్తిగత సమస్యలుంటాయి. దురదృష్ట జాతకుడుగా తండ్రి తో సంబంధాలు పూర్తిగా చెడిపోయి ఒక నింద మోస్తాడు, చెల్లెలి పెళ్లి ప్రమాదంలో పడి, మరో వైపు హీరోయిన్ కూడా చీదరించుకుని చాలా దయనీయ పరిస్థితిలో హీరో పడతాడు.  పాత్రకి బలమైన ఎమోషన్, ఆ ఎమోషన్ తాలూకు గోల్, శత్రువులా వెంటాడే దురదృష్టం...కానీ వీటితో ఏనాడూ కోల్పోని ధైర్యం, చాలా హాస్యప్రియత్వమూనూ...

          ‘భలే భలే మగాడివోయ్’ లో ఇలాటిదే లోపముంటుంది హీరోకి- మతిమరుపనే లోపం. దీంతో  ప్రేమలో చివరంటా దేకుతూ వుంటాడు నవ్వుపుట్టిస్తూ. విష్ణు పాత్రకి కూడా అంతర్గత శత్రువులా వెంటాడే దురదృష్టం అనే లోపం పుట్టుక నుంచీ వుంది- కానీ ఇంటర్వెల్ తర్వాత పాత్ర దీన్నుంచి తెగిపోవడంతో  తెగిన గాలిపటంలా అయిపోయింది.

           దర్శకుడు రాజకిరణ్ కామెడీ జానర్ ని ప్రయత్నించడం మంచిదే. కానీ కామెడీ జానర్ లో దీన్ని ఫ్యామిలీ కామెడీ చేయాలనుకున్నారా, రొటీన్ గా అరిగిపోయిన పనికి రాని  యాక్షన్ కామెడీ చేయాలనుకున్నారా స్పష్టత తెచ్చుకోవాల్సింది. స్పష్టత లేకుండా రెండూ కలిపేస్తే కలవవు. పైగా ఏది అసలు కథ, ఏది కొసరు కథ అన్న స్పష్టత కూడా లేకపోతే ఏం చెప్పాలనుకున్నారో తెలియకుండా పోతుంది. 

          చివర్లో కొడుకు మీద తండ్రి అభిప్రాయం మారడానికి వేసిన సీను ఫస్టాఫ్ లాంటి సీన్లలాగా అర్ధవంతంగా వుందా?  కాబోయే మతిమరుపు వియ్యంకుడు హీరో ఇచ్చిన డబ్బు తీసుకుని మర్చిపోతాడని ప్రేక్షకులకి అప్పుడే తెలిసిపోయేలా లేదూ?  కథలో ఒక సమస్య ఏర్పాటు చేస్తున్నప్పుడు అందులో ఎంత  గోప్యత, సస్పన్స్  పాటించాలి?  ఆ డబ్బు తీసుకుని అతను మర్చిపోవడమే హీరో చెల్లెలి పెళ్లి కొచ్చిన కష్టం. 

          తనకెంత మతిమరుపున్నా పాతిక లక్షలు తీసుకున్న విషయం మర్చిపోయేంత మతిమరుపు కాదంటాడు కాబోయే వియ్యంకుడు. ఆ డబ్బు హీరో చేతిలో ఎక్కడ మిస్సయి  ఎక్కడ దొరికిందో సాక్ష్యాలుండగా ఆ సంగతి ఎందుకు చెప్పడు హీరో తండ్రితో? చెప్తే  ఇక్కడితో కథ అయిపోతుందనా?  చటుక్కున కథ అయిపోయే విధంగా సమస్య ఎందుకు ఏర్పాటు చేయాలి?  ‘శతమానం భవతి’ లో ఇదే జరిగిందిగా? ఇంత జరిగాక చివరి సీనులో ఇదే వియ్యంకుడు,  డబ్బు తీసుకున్న విషయం మతిమరుపు వల్ల  మర్చిపోయానని తనే ముందు కొచ్చి ఎలా అనేస్తాడు? అతనే ప్రాబ్లం క్రియేట్ చేసి అతనే క్లియర్ చేస్తే, ఇక హీరో ఎందుకు? కథలో అతను చేసే దేమిటి?

          సస్పెన్స్ అన్నది క్రైం, మర్డర్, హార్రర్, యాక్షన్ మొదలైన కథల్లోనే వుంటుందని అనుకోవడం వల్ల, ఫ్యామిలీ కథలకీ ప్రేమల కథలకీ ఇలాటి తిప్పలు తప్పడం లేదు. సస్పెన్స్ అనేది ప్రతీ జానర్ కీ ప్రాణం. కాబోయే వియ్యంకుడికి మతి మరుపని అసలు ముందు  చెప్పకుండా, డబ్బు తీసుకుని తిరగబడ్డాక – ఆ  క్యారక్టర్ ని వ్యవహారం కంటిన్యూ చేస్తూ- అంచెలంచెలుగా మతిమరుపు లక్షణాల్ని ఓపెన్  చేస్తూ- చివరికి ఈయనకి మతిమరుపని హీరో పట్టుకుని నాల్గు దులిపితే బావుంటుందా- అమ్మో అది సస్పెన్స్,  అలా వుం డకూడదని- ఏర్పాటు చేసిన ప్రాబ్లంలో ఎలిమెంట్స్ ని కిల్ చేసుకుని, తెలిసిపోయేలా కథ నడిపితే బావుంటుందా ఆలోచించుకోవాలి.

-సికిందర్
http://www.cinemabazaar.in





         



         






రిపబ్లిక్ డే స్పెషల్!




వీరుడి మరణ దృశ్యమిది...
    
ద్యం మత్తులో జోగుతున్న ఆ సైనికుడు తుపాకీ ఎత్తి- ‘ఏంటాలోచిస్తున్నావ్? ఈ దెబ్బకి అమరుడై పోవాలనే?’ అన్నాడు వ్యంగ్యంగా. ఆలోచన తన అమరత్వం గురించి కాదన్నాడు తుపాకీ ఎదురుగా గుండె దిటవుతో వున్నతను. తన ఈ విప్లవ జ్వాల భావితరాలకి  స్పూర్తి కావాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు. వెటకారంగా నవ్వాడు సైనికుడు. ‘ఏంటా నవ్వు? కాల్చారా నన్ను పిరికి పందా!  నువ్వు కాల్చి చంపేది నీ ఎదుట నిస్సహాయంగా వున్న మనిషినే – బెదరకు, కానీయ్!’ అరిచాడు గట్టిగా, తాళ్ళతో బంధించి  బందీగా వున్నతను. చావంటే భయం లేని అతణ్ణి చూసి పిచ్చెత్తి పోయిన సైనికుడు తుపాకీ దడదడ లాడించేశాడు క్షణమాలస్యం చెయ్యకుండా.  నిట్ట నిలువునా శరీరాన్ని జల్లెడ చేసేశాయి తొమ్మిది తూటాలూ.  అతడి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. జగత్ప్రసిద్ద విప్లవకారుడతను – ఎర్నెస్టో చేగువేరా!

         
చాలా అరుదుగా విప్లవకారులకి చట్టరీత్యా శిక్షలు పడతాయి. సూపర్ స్టార్ కృష్ణ 1974  లో అల్లూరి సీతారామరాజు చరిత్రని వెండి తెర కెక్కించి నప్పుడు అప్పటి ప్రేక్షకులకి ఎన్ కౌంటర్ అనే పదం తెలిసివుండదు. అలాటి దృశ్యాలు సినిమాల్లో కూడా చూసి వుండరు. తెలుగు సినిమాకి మొదటి కలర్ కౌబాయ్, మొదటి సినిమా స్కోప్, మొదటి 70 ఎంఎం, మొదటి ఆప్టికల్ స్టీరియో సౌండ్...ఇలా ప్రపంచంలో  ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా తనే మొదటిసారిగా తెలుగులో అందిస్తూ కొత్త చరిత్రలు రాసుకుంటూ పోయిన డేరింగ్, డాషింగ్, డైనమిక్ హీరోగా కృష్ణని  ఇప్పటి వరకూ కీర్తించడం జరుగుతోంది.  

     అభ్యుదయకరంగా  ఈ వినూత్న సాంకేతిక దృష్టే కాకుండా, ‘అల్లూరి సీతారామ రాజు’ తో కృష్ణ చరిత్రలోంచి అసంకల్పితంగా ఇంకేం శంఖం పూరించారో గ్రహించి గ్రంథస్థం చేయలేదెవరూ. సూపర్ స్టార్ కృష్ణ మొట్ట మొదటి సారిగా తెలుగు సినిమాల్లో- తర్వాతి కాలంలో పోలీసులు చేపడుతూ పోయిన, ఇంకా ఇప్పటికీ చేపడుతూ వస్తున్న ‘ఎన్ కౌంటర్’ అనే చర్యని ఆనాడే అల్లూరి చరిత్ర ద్వారా ఎత్తి చూపారని మనం చెప్పుకు తీరాలి.

        సినిమాలో ఈ ఎన్ కౌంటర్ లేదా రాజ్య హింస అనే దుశ్చర్య  స్వాతంత్ర్య పూర్వం తెలుగు ప్రాంతంలో జరిగిందే. కాకపోతే అప్పట్లో బ్రిటిష్ ఏలుబడిలో వుంది. ఆనాడు బ్రిటిషర్లు అల్లూరి సీతారామారాజుతో పాల్పడింది ఎన్ కౌంటరే – కాకపోతే పక్కా బూటకపు ఎన్ కౌంటర్, పచ్చి హత్య. ఆ బ్రిటిష్ అధికారి కనీసం దీనికి ఎన్ కౌంటర్ అనే ముసుగు కూడా వేయకుండా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని,  అల్లూరిని ఎలా హతమార్చాడో కళ్ళకి కట్టారు కృష్ణ.

     సినిమాని సర్వకళా సమ్మేళనమనగానే సరిపోదు. అందులో ప్రజల చైతన్య పరిధిని విస్తృత పర్చే విషయం లేకపోతే ఆ కళలన్నీ వృధాయే. కళే ఒక సాధనం. సృజనాత్మక దృష్టితో కళల్తో  ఏమైనా సాధించవచ్చు. అల్లూరి సీతారామ రాజు చరిత్ర ఫక్తు డ్రై సబ్జెక్టు అనుకుంటూ సినిమా తీయడానికి పదిహేడేళ్ళుగా ఎన్టీఆర్ తాత్సారం చేస్తూంటే, అప్పటికి 34  ఏళ్ల హీరో కృష్ణ, ఆ డ్రై నెస్ ని కాస్తా  భక్తిరస పారవశ్యాలతో సస్యశ్యామలం చేసేశారు!
        అల్లూరి సీతారామ రాజు అనే విప్లవ వీరుడుకి దైవత్వాన్ని కూడా ఆపాదించి నడిపిన అద్భుత సన్నివేశాలే సినిమాకి జీవం పోసి డ్రై నెస్ ని వెళ్ళగొట్టాయి.  విప్లవకారుడి మత దృష్టి రాజకీయ నాయకుడి మత దృష్టిలా విభజించదు, కలుపుకుంటుంది. నాస్తికులైన విప్లవకారులు ఉద్యమాలు నడపడంలో విఫలమైపోతూంటారు. 

    విప్లవకవిత్వంలో భావ కవిత్వ వుండదు. కానీ ఈ సినిమా ఈ రూలునే బ్రేక్ చేసింది. రూల్సు బ్రేక్ చేయాలంటే అసలంటూ రూల్స్ ఏమిటో తెలిసివుండాలి. ఈ సినిమాకి ఏకైక రచయితగా త్రిపురనేని మహారథి స్థాయికి ఇదేం పెద్ద సమస్య కాదు. ఓ వైపు సామాజికంగా అమాయక గిరిజనుల కోసం పోరాడే వీరుడిగా అల్లూరిని చూపిస్తూనే, మరో వైపు కథా శిల్పం చెడకుండా- జానర్ దెబ్బ తినకుండా- అల్లూరిని మహిషాసుర మర్ధిని స్తోత్రం పాడగల పారంగతుడిగానూ చిత్రించడం ఆయనకే చెల్లింది. విప్లవపాత్రలో పురాణ పాత్ర మమేకమన్న మాట. ఇలా మెజారిటీ ప్రజల సెంటిమెంట్సుని దృష్టిలో పెట్టుకునే కళే ఎన్నాళ్ళయినా బ్రతుకుతుందని కూడా రుజువు చేశారు.


      చరిత్ర పుస్తకాలు, డాక్యుమెంట్లు, పోలీసు ఫైళ్ళు, చింతపల్లి - కృష్ణ దేవిపేట అడవులు, అల్లూరి పరిచయస్థులూ ...ఇవన్నీ ఈ తొలి తెలుగు సినిమా స్కోప్ సినిమా కథా రచనలో  తోడ్పడ్డాయి మహారథికి  (ఈ వ్యాసం చదివాక ఫోన్ చేసి, తనని కలిసి వుంటే ఇంకా చాలా సమాచారం అందించే వాణ్ణని అన్నారు మహారథి- కానీ ఏ వారానికా వారం మూడురోజుల్లో ఈ సినిమా వ్యాసాలందించే డెడ్ లైన్ల కారణంగా కొన్నిసార్లు కొందర్ని కలవడం సాధ్యం కాలేదు). “రెండ్రోజుల క్రితం వేసుకున్న చొక్కా ఇమ్మంటేనే ఏడుస్తున్నావ్, 200 ఏళ్ల నుంచీ పరిపాలిస్తున్న తెల్లోడు స్వరాజ్యం ఇమ్మంటే ఇస్తాడ్రా సన్నాసీ?” అన్న డైలాగు మహారథి పేల్చ గల్గారంటే, అది ఆ  ప్రజల మధ్య తిరుగాడితేనే  తప్ప, ఏసీ రూంలో ఎంచక్కా కొలువుదీరి చొక్కా నలక్కుండా కూర్చుంటే రాదు. 


       మన్యం వీరుడు అల్లూరి (1897-1924) . విశాఖ ఏజెన్సీలో బ్రిటిష్ ప్రభుత్వం మద్రాసు అటవీ చట్టం (1882) ని పరమ ఆటవికంగా అమలు చేస్తూ గిరిజనుల పొట్ట కొడుతూంటే చూసి చలించాడు అల్లూరి. ఇక సమస్తం త్యజించి ఆ గిరిజనుల కోసం తెల్లవాడితో ప్రాణాంతక పోరాట బాట పట్టాడు. జీవితం నీ కిచ్చిన పిలుపుని నువ్వు నిరాకరించావంటే, నిన్ను సృష్టించిన శక్తిని నువ్వు అవమానించుకున్నట్టేనని అంటాడు రాబిన్ శర్మ- ‘ది మాంక్ హూ సోల్డ్  హిజ్ ఫెరారీ’ అన్నతన  పాపులర్ పుస్తకంలో. అలా తనకి జీవితం ఇస్తున్న పిలుపు నందుకుని ఆలోచించకుండా ముందుకే సాగి పోయాడు అల్లూరి. చదువు నైన్త్ దగ్గరే ఆగి పోవచ్చు, పాతిక నిండకుండానే అతడి రాజకీయ పరిజ్ఞానం అపారమైనది. తటాలున తుపాకీ పట్టి బరిలోకి  దూకలేదు, ముందుగా కాంగ్రెస్ సభకి హాజరవుతాడు. నేతలు అక్కడ స్థానిక పరిపాలన మన చేతుల్లో వుండాలని ప్రసంగిస్తూంటారు. స్థానిక పాలన కాదు, మొత్తం దేశ పాలనే  మన చేతికి రావాలని యావద్దేశ సంక్షేమాన్నీకాంక్షిస్తాడు అల్లూరి. ఆ సంపూర్ణ స్వరాజ్యం కోసం పోరాటమెలా సాగించాలో తెలుసుకునేందుకు దేశాటన  చేస్తానని ప్రేమించిన సీతతో చెప్తాడు. “ ఏ మార్గంలో స్వాతంత్ర్యం లభిస్తుందో, ప్రజాభిప్రాయానికీ, దేశ ప్రగతికీ ప్రయోజనకరమో గ్రహించాలంటే,  ముందుగా దేశ పరిస్థితిని ఆకళింపు చేసుకోవాలి,  ప్రజా సమస్యల్ని అర్ధం జేసుకోవాలి”  అని చెప్పి దేశాటనకి  వెళ్ళిపోతాడు. 

       తిరిగి వచ్చి, “అజ్ఞానంలో, శోకంలో ఈ జాతి ఎంత భయంకరంగా బతుకుతోందో చూశాను. విదేశీయుల కసాయి పాలన నుంచి దేశాన్ని విముక్తం చేసే ముందు దేశ ప్రజలు తమ దాస్య బుద్ధి నుంచి విముక్తం కావాలి. అందుకు విప్లవ మార్గ మొక్కటే శరణ్యం” అని సీతకి చెప్పి మళ్ళీ  సాగిపోతాడు. 

        కాంట్రాక్టర్ల మెడలు వంచి గిరిజనులకి కూలీ డబ్బు లిప్పిస్తాడు. తగాదాలు మీరే పరిష్కరించుకోండి  గానీ పోలీసుల దగ్గరికి వెళ్ళవద్దని జాగ్రత్త చెప్తాడు. కూలీ డబ్బులు కడుపు నిండా తాగడానిక్కాదనీ, మీ భార్యా బిడ్డలు కడుపు నిండా తినడానికనీ చెప్పి తాగుడు మాన్పిస్తాడు.

         గిరిజనుల దాస్య బుద్దిని ఇలా పటాపంచలు చేస్తున్న అతడి నిశబ్ద విప్లవం చూసి ఠారెత్తి పోతారు తెల్లవాడి తొత్తులు. ఇక అతను  చెట్లు నరికి, పోడు  వ్యవసాయం కూడా చేపట్టడంతో రసకందాయంలో పడుతుంది కథ. అప్పటికి గిరిజనుల్లో దైవ సమానుడిగా ఎదిగిన అల్లూరి తనతో బాటు అనుచరులైన ఘంటం దొర, మల్లన్న దొర, అగ్గి దొర తదితరుల్ని దళంగా చేసుకుని,  బ్రిటిష్ పాలకుల మీద ప్రత్యక్ష పోరాటానికి దిగుతాడు. మొదట స్పెషల్ పోలీసుల్ని ఓడించి, చివర్న అస్సాం  రైఫిల్స్ రెజిమెంటుకి చిక్కి, వైజాగ్ కలెక్టర్ రూథర్ ఫర్డ్ ఎదుట నిలబడతాడు బందీగా  చింతపల్లి అడవుల్లో. అతడి ఇంత దేశభక్తినీ, ప్రజాపోరాటాన్నీ ఏమాత్రం గుర్తించని రూథర్ ఫర్డ్-  కాల్పులకి ఆదేశిస్తాడు. కానీ కాల్చబోతే  సిబ్బందికి చేతులు రావు. అల్లూరిలో ఒక రాముడు, ఒక జీసస్, ఒక అల్లాయే కన్పిస్తూంటారు. ఆఖరికి విప్లవ నినాదాలతో గర్జిస్తూనే తుపాకీ గుళ్ళకి నేలకొరుగుతాడు అల్లూరి సీతారామరాజు.

       ఇది ఓపెన్ మర్డర్. చేగువేరా విషయం వేరు. కనీసం ఆ బొలీవియా అధ్యక్షుడు ప్రపంచ భయంతో చేగువేరా మరణం ఎన్ కౌంటర్ లా కన్పించాలని ఆదేశించాడు. రూథర్ ఫర్డ్ ది  దేని  భయామూ లేని బరితెగింపు. భూమ్మీద న్యాయ వ్యవస్థకి తామే పట్టు గొమ్మలమని చెప్పుకునే బ్రిటిషర్లు ఇలా ఆటవిక న్యాయాన్ని అమలు చేయడం సిగ్గు చేటైన విషయం. దీన్ని ఎత్తి చూపిస్తున్న ఈ మహోజ్వల చిత్రరాజం ప్రయోజనం ఇంతకంటే నెరవేరడం వుండదు. 
         
          ఈ మహాయజ్ఞంలో తెర వెనుక రచయిత మహారథితో బాటు, దర్శకుడు రామచంద్ర రావు, ఆయన హఠాన్మరణంతో  దర్శకుడు కె ఎస్ ఆర్ దాస్, ఛాయాగ్రాహకుడు వీఎస్ఆర్ స్వామి, సంగీత దర్శకుడు ఆదినారాయణరావు, గీత రచయితలు  సినారె, కొసరాజు, ఆరుద్ర, శ్రీశ్రీ...అపూర్వ  సేవలందించారు. తెలుగు వీర లేవరా,  వస్తాడు నారాజు వంటి ఆల్ టైం హిట్ పాటల సంగతి  చెప్పుకోనక్కర్లేదు. ‘తెలుగు వీర లేవరా’  పాట రచనకి మహాకవి శ్రీ శ్రీకి  జాతీయ ఉత్తమ గీతం అవార్డు లభించింది. అలాగే సంగీత  దర్శకుడు ఆదినారాయణ రావు రాసిన ‘హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్’ అనే పూర్తి ఇంగ్లీషు పాటకూడా వుంది. తెలుగు సినిమాల్లో ఇంగ్లీషు పాటకూడా ఇదే తొలిసారి. 

      ఇక వస్తాడు నారాజు...’ పాట తర్వాత  సన్నివేశం గురించి చెప్పుకోవాలి. గానకోకిల పి. సుశీల కంఠ స్వరంలో విజయనిర్మల మీద చిత్రీకరించిన ఈ పాట భావాత్మకంగానే కాదు, ఆథ్యాత్మికంగానూ  మనల్ని ఏ లోకాలకో   తీసికెళ్ళి పోతుంది తనవెంట. పాట  పూర్తవుతూండగా, దేశాటన ముగించుకుని కృష్ణ వస్తాడు. వెళ్తున్నప్పుడు కార్తీక  పౌర్ణమి నాటికి  తిరిగి వచ్చి ప్రేమ విషయంలో నిర్ణయం చెప్తానని చెప్పి  వెళ్ళాడు. ఈ నిరీక్షణలోనే ఆ పాట పాడుకుందామె. ఇప్పుడతను వచ్చాక ఈ సీనుని  ఎలా ప్రారంభించాలి? ఇవాళ్టి  డివిడిల ‘రచైత’ పాత్ర అంతరంగంలోకి వెళ్ళకుండా, పాత్రని ఉన్నతీకరించకుండా- ‘నేనొచ్చేశా సీతా!’ అని చైల్డిష్ గా కృష్ణ  చేత పలికించేస్తాడనడంలో ఎలాటి సందేహమూ అక్కర్లేదు. లేదా కాస్త వెనకటి వీడియో టేపు తరం ‘రచైత’ ఐతే – ‘వచ్చావా నాథా!’ అని ప్రేమోన్మాదిలా అరిపించేస్తాడు విజయనిర్మల చేత. మిడిమేలపు ప్రేక్షకులేమో  ఈలలేసి చప్పట్లు కొట్టేస్తారు సూపర్ డైలాగు అనేసి!

          విజయనిర్మల పాత్ర సీతది అంత నేలబారు పాత్రేం  కాదు. ఆమె ప్రేమని ఇచ్చేదే గానీ కోరుకునేది కాదు. అతడి మనసెరిగి మాటాడే స్వభావమామెది. అప్పుడతను అలా తిరిగి ఇంటికి రాగానే చూసి  తన గురించి  సర్వమూ మర్చిపోయి, అతడి సంఘర్షణలో తనూ బేషరతుగా భాగస్వామిని అయిపోతున్నట్టూ, దేశాటనలో అతను పొంది వుంటాడనుకుంటున్న  జ్ఞాన సంపదని వూహించుకుని ఉప్పొంగిపోతూ,  ఒకే మాట అంటుంది- ఒకే మాట మెచ్యూర్డ్ గా చటుక్కున - “దేశమంతా చూశావా?” అని! 

          మతులు పోవాల్సిందే మనుషులకి ఇలా అన్న ఆమెని చూసి.  గ్రేట్ క్యారక్టర్. పాత్ర అంతరంగ మెరిగి, పాత్రోచితంగా ఇంత గొప్ప  డైలాగు సృష్టించిన మహారథి  నిజంగా జీనియస్!


***
       1965  లో రంగ ప్రవేశం చేసిన హీరో కృష్ణకి తొమ్మిదేళ్ళకే  1974 లో వందవ సినిమా ఇది!  ఇవాళ్టి హీరోలు ఇది చూసి కళ్ళు తేలేయాల్సిందే. రెండు ప్రధాన పాత్రల్లో కృష్ణ- విజయనిర్మలతో బాటు, కె జగ్గయ్య రూథర్ ఫర్డ్ గా కన్పిస్తే,  గుమ్మడి వెంకటేశ్వరరావు, ( ఘంటం దొర) ప్రభాకర రెడ్డి, (మల్లన్న దొర),  బాలయ్య (అగ్గి దొర) మన్యం వీరులుగా కన్పిస్తారు. పేకేటి శివరాం, రాజనాల, త్యాగరాజు బ్రిటిష్ అధికారులుగానూ, కల్పిత పాత్రల్లో మోహన్ బాబు, చంద్ర మోహన్, అల్లురామలింగయ్య, కెవి చలం, రాజబాబు, మంజుల జయంతి,  రాజశ్రీ కన్పిస్తే, ఓ ప్రత్యేక పాత్రలో  టి ఎల్ కాంతారావు  దర్శనమిస్తారు. 



       హిందీలో కమల్ అమ్రోహీ ‘పాకీజా’ తీసినప్పుడు వాడిన కెమెరాలూ  లెన్సులూ తెప్పించుకునే ఈ సినిమా స్కోపు యజ్ఞానికి తెరతీశారు కృష్ణ. 19  కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకున్న ‘అల్లూరి సీతారామ రాజు’ కి రాష్ట్రప్రభుత్వ నంది అవార్డు లభించింది. హిందీలో ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ గా డబ్ అయింది.

-సికిందర్
( ‘సాక్షి’- 2009 ఆగస్టు)







23, జనవరి 2017, సోమవారం




      కలం కోతి  చూసీ చూసీ ఇక ఇలా ఓపెన్ అయిపోవాలనుకుంటోంది - ఈ బ్లాగులో వెలువడే సినిమా రివ్యూలు నెగెటివ్ గా వుంటాయని చెబుతున్న వాళ్ళు ఒక విషయం గ్రహించాలి – ఈ రివ్యూలు నెగెటివే  అయితే,  ఏళ్లతరబడి ప్రతీ ఏటా తొంభైకి 90 శాతమూ పక్కా అట్టర్ ఫ్లాపులు తీసి నిర్మాతల్ని నిండా ముంచేస్తున్న తాము పాజిటివా? ఎందుకుంటున్నారు ఫీల్డులో? ఆ  ముంచడంలో కూడా రకరకాల వెరైటీలు వున్నాయి- మిడి మిడి జ్ఞానంతో బడ్జెట్లు కూడా పెంచేసి సినిమాలు తీయడం (ఎంజాయ్ చేయడం),  నిర్మాతకి తెలీకుండా నొక్కేస్తూ సినిమా ఏమైపోయినా  ఫర్వా లేదు -ముందు  ఆర్ధికంగా తాము సెటిలై పోతే చాలనుకోవడం లాంటివెన్నో. ఇవి పాజిటివ్ లక్షణాలా? ఈ సినిమాలు చూసి నాల్గు డబ్బులు జేబులో వేసుకుని ‘పాజిటివ్’ గా రివ్యూలు రాస్తే ఓకేనా? ఈ బ్లాగులో రివ్యూలు నెగెటివ్ గానూ వుండవు, పాజిటివ్ గానూ వుండవు- తటస్థి వైఖరితో ‘నిర్మాణాత్మకంగా’ మాత్రమే వుంటాయి. ‘నిర్మాణాత్మక విమర్శ’ అని ఒకటుంటుందని ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిది. నిర్మాణాత్మక విమర్శ బెటర్ మెంట్ కోసమే వుంటుంది. బెటర్ మెంట్ కోసమే శాస్త్రమో, ఇతర సినిమాలో ఇంకేవో, ఎక్కడ్నించో సమాచారాన్ని వెతికి పట్టుకొచ్చి  రివ్యూలు రాస్తే,  అది నెగెటివ్ అనుకోవడం అజ్ఞానాల్లో కెల్లా అజ్ఞానం.  విజ్ఞానాన్ని ఖండించే వాళ్ళు ఇక నేర్చుకునేదేమీ వుండదు, 90 శాతం మంది నిర్మాతల డబ్బుని ఎంజాయ్ చేసి వెళ్ళిపోవడమే. ఈ బ్లాగు సినిమాలకి వ్యతిరేకమే అయితే, గత పదిహేనేళ్ళుగా తమ కథలతో ఈ బ్లాగు రచయితని ఎందుకు సంప్రదిస్తున్నారన్న ప్రశ్న వొకటి వస్తోంది. ఎందుకు ఇంతమంది అసోషియేట్లు, కుర్ర అసిస్టెంట్లూ ఈ బ్లాగు పాఠకులుగా పెరుగుతున్నారన్న మరో ప్రశ్న వస్తోంది.  ప్రతీ రోజూ బ్లాగులో వ్యాసం రాయకపోతే ఎందుకు పదే పదే  క్లిక్ చేసి చూసుకుంటున్నారన్న ఇంకో  ప్రశ్నా వస్తోంది. ఇంకా పది  పన్నెండు దేశ విదేశాల నుంచి ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారన్నసందేహమూ వస్తోంది....
-సికిందర్




21, జనవరి 2017, శనివారం



 సంక్రాంతికి  విడుదలైన ‘శతమానం భవతి’  ఫ్యామిలీ డ్రామా ప్రారంభంలోనే  బయటపడుతున్న  ఒక రహస్యాన్ని గుర్తించ గల్గితే  ఇలాటి కుటుంబ కథల్లో గొప్ప ముందడుగునీ,  ఒక వేళ ఆ రహస్యాన్ని గుర్తించినా పట్టుదలకి పోతే  అంతే గొప్ప ఆశాభంగాల్నీ పొందాల్సి రావొచ్చు భవిష్యత్తులో! టీవీ సీరియల్స్ మొదలైన కొన్నేళ్ళ వరకూ కుటుంబ కథలతో సినిమాలు తీయాలంటే జంకే వాళ్ళు. తర్వాత ఫ్యాక్షన్ సినిమాల్లో  కుటుంబ కథల్ని కలిపి కొన్నాళ్ళు  కాలక్షేపం చేశారు. ఈ నరుక్కునే రాక్షసుల కుటుంబ కథలు కూడా ముగిశాక, కుటుంబ కథలకి దూరంగా యాక్షన్ సినిమాలకీ, యాక్షన్ కామెడీలకీ  వెళ్ళిపోయారు. మళ్ళీ కుటుంబ కథ టీవీ సీరియల్స్ నీ, ఫ్యాక్షన్ సినిమాల్నీ బీట్ చేసే మార్గాన్ని ఎంచుకుని, కుటుంబ కథలకి పాత సంసారాల వాసనల్నీ, పెల్లుబికిన హింసాప్రవృత్తినీ వదిలిస్తూ, ‘మనం’ రూపంలో నూతన శకపు క్రియేటివ్ – ఇన్నోవేటివ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చేసి ఆబాలగోపాలాన్నీ అలరించింది అనూహ్యంగా. కుటుంబ కథలకి పాత సంసారమో, విపరీత హింసో అనే  నిర్వచనాన్ని తిరగ రాసింది. ఈ పూర్వరంగంలో  ఇప్పుడు తగుదునమ్మా అని  ‘శతమానం భవతి’ వచ్చేసి మళ్ళీ వెనక్కి- చాలా వెనక్కి - ముగిసిపోయిన పాత శకంలోకి లాక్కెళ్తోంది. కానీ యూ ట్యూబ్ లో చూస్తే ఎప్పట్నించో తెలుగు వంటకాలకి పాత పోకడలు వదిలిపోయాయ్. పూర్వీకులనుంచి సాంప్రదాయంగా వస్తున్న గోంగూర పప్పు, పాలకూర పప్పు, పాలకూర వేపుడు, చుక్క కూర టమాటా లాంటి ఏకాకు కూరస్వామ్యంతో విసిగి, రెండు మూడు రకాల ఆకు కూరల్ని కూడా కలిపి  జానర్  మిక్సింగ్  చేసి ట్రెండీగా వండి చూపించేస్తున్నారు. ఆకు కూరల్నెప్పుడూ  ఒకే ఆకుకూరగా  వండాలన్న రూలుని  బ్రేక్  చేసిన  ఈ తరం ఆడవాళ్ళు- కోడళ్ళూ    వంటల్లో ఇంత ట్రెండీగా ముందడుగు వేస్తూంటే, నేటి యువ సినిమా రచయితలేమో  అదే  పాత రోట్లో అదే  పాత చింతకాయ పచ్చడి చెమట్లు  కక్కుకుంటూ నూరుకుంటూ, 21వ శతాబ్దపు  న్యూ ఏజ్ లేడీస్ కి ఫ్యామిలీ సినిమాలంటూ వడ్డించాలని ఉబలాట పడుతున్నారు.  పాపం పుణ్యం ప్రపంచ మార్గం ఏమీ తెలీని  అమాయక పసి బాలలు కదా!

            క్కటి గ్రహించడం లేదు, ఇవాళ్టి రోజున ఫ్యామిలీ సినిమాల పేరుతో తీస్తున్నవి ఓ నలభై  ఏళ్ల క్రితం వరకూ ఏర్పడిన ఒక నమూనాని అనుసరించేనని. ఆ కాలానికి అప్పుడు స్థిర పడిన నమూనానే అని. అప్పటి కాలం ఏమిటి? 1970-80 ల వరకూ కూడా భూస్వామ్య వ్యవస్థా,  దాన్నాశ్రయించి ఉమ్మడి కుటుంబ వ్యవస్థా  కొనసాగుతున్నప్పుడు ఆ నేపధ్యంలోంచి అలాటి కథలు వచ్చేవి. అప్పుడున్న అవసరాన్నిబట్టి ఉమ్మడి కుటుంబ వ్యవస్థని కాపాడే విలువలతో- కలిసి జీవించడంలో వుండే ఆనందాలు, అనుబంధాలు, ఆత్మీయతలూ ఆకూపోకలతో  కూడిన సినిమాలు వచ్చేవి. 1940- 50 లలో మొదలు పెట్టి  ‘ఇల్లాలు’, ‘తోడి కోడళ్ళు’ లాంటి కుటుంబ సినిమాలు,  1970- 80 లలో ‘పండంటి కాపురం’, ‘ఆదిదంపతులు’ వరకూ కొనసాగి కొన్ని వందలు వచ్చాయి. 

          కానీ ఎనభైల తర్వాత ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అంతరించిపోతూ వచ్చింది. కారణాలనేకం. పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, విద్యా ఉద్యోగావకాశాలు, స్త్రీవిద్య, పాశ్చాత్యీకరణ, వివాహ వ్యవస్థలో మార్పులు, అధిక జనాభా; వ్యవసాయ రంగం,  కుటీర పరిశ్రమల రంగం క్షీణించడం, సమాచార రవాణా వ్యవస్థలు మెరుగవడం, ఇరుకు నివాసాలు, కుటుంబ కలహాలతో పాటూ - హిందూ వారసత్వ, స్త్రీ ఆస్తి హక్కు, వివాహ, ప్రత్యేక వివాహ, వరకట్న నిరోధక చట్టాల సవరణల నేపధ్యంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ చరిత్ర పరిసమాప్తమయ్యిందని సామాజిక వేత్తలు విశ్లేషించారు.  

          దీంతో  ఇక ’90 లలో కొంతకాలం కుటుంబ సినిమాలు ‘రౌడీ అల్లుడు’, ‘అల్లరి అల్లుడు’, ‘ముద్దుల మేనల్లుడు’, ‘కలెక్టర్ గారి అల్లుడు’ లాంటి ఫక్తు ఎంటర్ టైనర్స్ గా మారిపోయాయి. కానీ అంతరించిన ఉమ్మడి కుటుంబ వ్యవస్థ బాధని మరిపించడానికా అన్నట్టు- 1994 లో హిందీలో ‘హమ్  ఆప్ కే  హై కౌన్’ మరిన్ని వెలుగుజిలుగులతో, వంటకాల ఆరగింపులూ త్రేన్పులతో, ఆడీపాడే  వ్యాయామాలతో,  మార్వాడీ కల్చర్ నేసుకుని అట్టహాసంగా రావడంతో,  దాన్ని అనుసరించి 1996 లో తెలుగులో ‘నిన్నే పెళ్ళడతా’,  ‘పెళ్లి సందడి’ వచ్చాయి.  అక్కడ్నించీ మొదలయ్యింది  గుంపుగా ఆభరణాల ధగధగలతో, పట్టు  చీరెల ఫెళపెళలతో, అనవసరంగా పడీ పడీ నవ్వుతూ, వొయ్యారాలుపోతూ, ఎడాపెడా ఆటాపాటలతో,  వ్యాపార యుగపు వెండితెరని ఆడవాళ్ళ (పాత్రల) తో నింపెయ్యడం. వీటిలో కథ హీరో హీరోయిన్ల పెళ్లి జరిపించడమే
.

అయినా ఉమ్మడి బడిలోనే 
     ఇదే సమయంలో 1991 లో ప్రవేశపెట్టిన ఆర్ధిక సంస్కరణల ఫలితాలు 2000  నాటికి కనిపించ సాగాయి. యువతరం చదువులు, వృత్తి ప్రాథమ్యాలూ సమూలంగా మారిపోయి విదేశాల బాట పట్టడం ప్రారంభమయ్యింది.  ఈ చారిత్రిక  మూల మలుపులో గమనించాల్సిన ముఖ్యాంశమిటంటే- కుటుంబ సంబంధాలు పరోక్ష సంబంధాలుగా మారిపోయే క్రమం మొదలయ్యింది. కానీ రెండు దశాబ్దాలు వెనక్కెళ్ళి చూస్తే, ఎనభైల తర్వాత ఎలాగైతే ఉమ్మడి కుటుంబాల ఉపసంహార నేపధ్యంలో, న్యూక్లియర్ కుటుంబాల  ఏర్పాటు క్రమం మొదలయ్యిందో,  అప్పుడు ఉమ్మడి కుటుంబాల్లోని కొడుకులు, కూతుళ్ళు తల్లిదండ్రుల్ని వదిలి వేరే పట్టణాల్లో కాపురాలు పెట్టడమనే ట్రెండ్ మొదలయ్యింది న్యూక్లియర్ కుటుంబాలు అని  నామకరణం చేసుకుని. ఉమ్మడి కుటుంబాలు పైన మూడో పేరాలో వివరించుకున్న కారణాలతో చిన్న చిన్న (న్యూక్లియర్) కుటుంబాలుగా విడిపోయినా,  కనీసం ఆ కొడుకులు  కూతుళ్ళూ రాష్ట్రంలోనే, దేశంలోనే ఏదో ఒక పట్టణంలో వున్నార్లే అన్న తృప్తి వుండేది కన్నవాళ్ళకి. రాకపోకలు, ఇచ్చి పుచ్చుకోవడాలు అలాగే కొనసాగేవి. విచిత్రమేమిటంటే,  ఈ న్యూక్లియర్ కుటుంబాలతో దూరంగా వెళ్ళిన వాళ్ళే ఇబ్బందులు, బాధలూ  పడేవారు. దీని మీద ఇతర భాషల్లో సినిమాలు కూడా వచ్చేవి. తెలుగు సినిమాలు మాత్రం ఈ ముఖ్య దశని  రికార్డు చేయలేకపోయాయి. అవెంత సేపూ ‘హమ్ ఆప్ కే  హై కౌన్’ ని పట్టుకుని లేని సమూహిక సంబరాలే చిత్రించుకున్నాయి. టీవీ సీరియళ్ళ విజృంభణతో ఈ తరహా సామూహిక సంబరాల కథలు కూడా ఖతం అయ్యాయి.  దీంతో యాక్షన్ జోడించి ఫ్యాక్షన్ కుటుంబాల కథలు మొదలయ్యాయి. 

          కానీ ఇప్పటికి గ్లోబలైజేషన్ ఊపందుకుని, ఉమ్మడి  కుటుంబాల ఊసూ ఉనికీ పూర్తిగా కాలగర్భంలో కలిసిపోయి, న్యూక్లియర్ కుటుంబాలే ఆధునిక కుటుంబ వ్యవస్థకి గుర్తులుగా మారాయి. ఇప్పుడు ఇవే న్యూక్లియర్ కుటుంబాల నుంచి విదేశాలకి యువత వలసలు మొదలయ్యాయి. ఇక్కడొచ్చింది సమస్య. ఆనాడు ఉమ్మడి కుటుంబాల నుంచి తాము విడిపోతే ఆ తరం పెద్దలు ఎంత బాధ పడ్డారో, ఇప్పుడు న్యూక్లియర్ కుటుంబాల నుంచి తమ పిల్లలూ  విడిపోతూంటే ఈ తరం పెద్దలకి  అలాటి బాధే  మొదలయ్యింది. అయితే ఉమ్మడి కుటుంబ పెద్దలకి ఎదురవని తీవ్ర  కష్టాలు న్యూక్లియర్ కుటుంబ పెద్దలకి ఎదురవసాగాయి. పలకరించే నాథుడు లేక వాళ్ళు వృద్ధాశ్రమాల పాలవసాగారు. కొందర్ని వాళ్ళ  పిల్లలే వదిలించుకుని వెళ్ళిపోయారు. ప్రవచనకారుడు చాగంటి కోటేశ్వరరావు ఓ 
వృద్ధాశ్రమంలో  తన కెదురైన దిగ్భ్రాంతికర అనుభవాన్ని చెప్పుకొచ్చారు.  ఇప్పుడే వస్తానని వృద్ధాశ్రమం బయట వదిలి విదేశాలకి వెళ్ళిపోయిన కొడుకు కోసం, ప్రతిరోజూ ఆ వృద్ధురాలు బయట నిలబడి ఎదురు చూసేదట అదే సూటుకేసు పట్టుకుని ...

          ఈ వ్యాసకర్తకి బాగా తెలిసిన విద్యాధికుడు, వ్యాపార వేత్తా, సంపన్నుడూ అయిన ఒకరు ఎనిమిది పదుల వయసులో, హృద్రోగంతో వున్నా, నగరంలో అందరూ వుండీ 
వృద్ధాశ్రమం  పాలయ్యారు. హైదరాబాద్ లో ఒకప్పుడు లేని అనాధాశ్రమాలు ఇప్పుడు నాల్గు వందలకి పైగా పెరిగాయి. కొడుకులు నగరంలోనే వుంటున్నా అనేక మంది తల్లి దండ్రులు వృద్ధాశ్రమాల్లో వుండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. వృద్ధాశ్రమాలు  పెద్ద ఇండస్ట్రీ గా ఎదిగాయి.  

          ఇంకో కుటుంబంలో రెండేళ్ళ క్రితం నగలమ్మి కొడుకుని విదేశం  పంపిస్తే నాల్గు నెలలు డబ్బు పంపి, ఐదో నెలలో తగ్గించాడు. ఆరో నెలలో పంపించనా? అన్నాడు. నీ ఇష్టముంటే పంపమన్నారు. పంపడం మానేశాడు. ఇలాటి కేసులు కొన్ని ఎప్పుడూ వుంటాయి. చాలా వరకూ సంబంధాలు  బాగానే వుంటున్నాయి – సెల్, స్కైపుల వంటివి కల్పించే  పరోక్ష సంబంధాలతో. ఇక  ఏడాది కోసారైనా రాకపోకలు కూడా వుంటున్నాయి. ఉమ్మడి కుటుంబాలప్పటి  పెద్దల మైండ్ సెట్ ఇప్పటి న్యూక్లియర్ కుటుంబ పెద్దలకి అంతగా లేదు. పరిణామాలని వాళ్ళు పాజిటివ్ గా తీసుకుంటున్నారు. 

          కానీ ఈ పరిణామాల్లోంచి సినిమాలకి కథలవసరం. దీన్ని ఇంకోలా మార్చి, రోమాంటిక్ యాంగిల్లో మేనరికాల కథలుగా తీర్చి దిద్ది, పాతికేళ్ళ క్రితమో  ముప్పై ఏళ్ల క్రితమో తెగిపోయిన  బంధుత్వాల్ని అతికించే ఎన్నారై కథాకళులు మొదలయ్యాయి. ఒకే దర్శకుడు ‘అత్తారింటికి దారేది’ తీసి,  వెంటనే  ‘సన్నాఫ్ సత్య మూర్తి’ తీశాడు. ఆతర్వాత ‘అ ఆ’ కూడా! ఇక ‘చిన్నదానా నీకోసం’, ‘పండగ చేస్కో’ ఇదే దారిపట్టాయి...

కాలం చెప్పని కథలు
       ఈ మేనరికాల కథలు రిపీట్ అవుతున్నాయని కావొచ్చు, ఇద్దరు స్నేహితుల కుటుంబాల్ని కలిపే ‘ఆటాడుకుందాం రా’ అంటూ వచ్చాయి. మరోవైపు రెండు కుటుంబాల కథల నుంచీ జరిగి ఒకే కుటుంబంలో దూరమయ్యే కొడుకుల కథలతో ఇప్పటికి ‘శతమానం భవతి’ దగ్గర కొచ్చి ఆగాయి.   ఈ ట్రెండ్ లో గత ఏడెనిమిది నెలల  కాలంలో ఇలాటి ఓ మూడు స్క్రిప్టులు ఈ వ్యాసకర్త దగ్గరికి వచ్చాయి. కలిసుందాం, కలిసుందాం, కలుపుకుందామని నినదిస్తూ వున్న ఈ కథల మూలాలెక్కడున్నాయని రీసెర్చి చేసుకొస్తే,  బయటపడినవే పై పేరాల్లో చెప్పుకున్న కుటుంబ, సామాజిక పరమైన పరిణామాలతో కూడిన  అంశాలు. ఉమ్మడి కుటుంబాల పైన, న్యూక్లియర్ కుటుంబాల పైనా  ఐపీ దేశాయ్, బిపి అగర్వాలా, మిల్టన్ సింగర్, హెచ్ లక్ష్మీ నారాయణ్ ల వంటి సామాజిక వేత్తలు చేసిన పరిశోధనలు. 

          పరిశోధనలు ఇలా వుంటే, ఇప్పటి సమస్య న్యూక్లియర్ కుటుంబాల సమస్యే  అయితే, ఈ కథలు ఇంకా ఉమ్మడి కుటుంబాలనే పట్టుకుని వున్నాయి అవే వాసనలతో. ఉమ్మడి కుటుంబాలప్పటికీ ఇప్పటికీ భావోద్వేగాలు ఒకటే కావొచ్చు. భావోద్వేగాలెప్పుడూ ఒకటే- బాహ్య పరిస్థితులే మారతాయి. కాలీన స్పృహ లేని బాహ్య పరిస్థితుల కల్పన భావోద్వేగాల నుంచి వేర్పడిపోతుంది. ఏ కాలానికి అప్పటి పరిస్థితుల కల్పనే జరగాలి. ఎంత ఊహా కల్పనైనా వాస్తవాల పునాదుల మీద జవాబుదారీ గా నిలబడాల్సిందే తప్ప, పలాయన వాదం పనికి రాదు. ఇదంతా నేటి సీదా సాదా కమర్షియల్ సినిమాల గురించే- భారీ కళాఖండాల గురించి కాదు. చెప్పుకోవాలంటే బాధపడాల్సివస్తున్న  నేటి యువ సినిమా రచయితలు,  తామే అనుభవించని జాయింట్ ఫ్యామిలీల ముచ్చట్లు అంతగా తీర్చుకోవాలని వుంటే – ‘1979 – ఓ ఉమ్మడి కుటుంబం కథ’ అని కథని ఆ కాలంలో స్థాపించుకుని రాసుకోవచ్చు. ఇప్పుడు ముంబాయిలో మఫియాలే  లేకపోయాక,  ‘ఒన్స్ అపాన్ ఏ టైం ఇన్ ముంబాయి’  అని మాఫియాల కాలంలోనే  కథని స్థాపించి తీశారు. అదే ఇప్పుడింకా మఫియాలున్నట్టుతీస్తే, ముందు రాం గోపాల్ వర్మకే  జీవితం మీద విరక్తి పుట్టి ఎటో వెళ్ళిపోయే అవకాశముంది.

అదే వరస                                                           
      న్యూక్లియర్ కుటుంబాల నుంచి దూరమవుతున్న నేటి యువతకి ఎప్పటివో తాము పుట్టి వుండనప్పటి  ఉమ్మడి కుటుంబాల్లోని ఆత్మీయతానురాగాలూ,  ఆ సంబంధాలూ, బంధుత్వాలూ తెలీవు. వాళ్ళు  ఫీల్ కారు. మరి ఆ వాతావరణపు  కథలు ఎవరి కోసం? అప్పటి ఉమ్మడి కుటుంబాల్లోని తండ్రులు ఇప్పుడు ముత్తాతలై వుంటారు, వాళ్ళ కోసమా? ఇప్పటి న్యూక్లియర్ కుటుంబాల తండ్రులు  ఇప్పుడు తాతలై వుంటారు,  వీళ్ళ కోసమా? బాక్సాఫీసు అప్పీల్ ఏది? కమర్షియాలిటీ ఏది? తాత ముత్తాతల కథలు చిన్నప్పుడు పడుకునేప్పుడు చిన్న పిల్లలకి చెప్పుకుంటే వాళ్లకి  బావుంటాయి. అదే మీసాలొచ్చాక, చున్నీలేసుకున్నాక కూడా సినిమాలుగా తీసి వెంటాడితే యాక్సిడెంట్లు అవుతాయి బాక్సాఫీసుకి. 

          కుటుంబ కథ అనగానే పైన చెప్పుకున్నట్టు 1980 దగ్గర ఆగిపోయిన ఉమ్మడి కుటుంబ కథలే అన్న వ్యామోహం- ఎటాచ్ మెంట్   పెంచుకున్నారు. ఆనాడు నాల్గు  దశాబ్దాల మన్నికతో ఆ ఉమ్మడి కుటుంబ కథలు తెలియకుండానే కుటుంబ కథలకి ఒక నమూనాగా మనసుల్లో ముద్రేసుకున్నాయి ఇప్పటికీ. ఆ సినిమా కథలే తప్ప, పాత్రలే తప్ప , అవి  ఏ నేపధ్య పరిస్థితుల్లోంచి వచ్చాయీ,  ఆ పరిస్థితులు ఇప్పుడూ వున్నాయా అన్న ఆలోచనే  అక్కర్లేకుండా పోయింది. కాస్త పాపం పుణ్యం ప్రపంచమార్గం తెలీని పసి బాలల స్థితినుంచి, చుట్టూ మారిపోయిన ప్రపంచ, కుటుంబ, ఆర్ధిక సంబంధాల మదింపు చేసుకునే అలవాటు పెంచుకుంటే తప్పకుండా యూత్ అప్పీల్ అవసరమున్న బాక్సాఫీస్ దాహార్తిని తీర్చగల్గుతారు. 

          అయినా సరే మేం రాసుకున్నట్టే ప్రొసీడవుతామనేసరికి, ఆ మూడు స్క్రిప్టుల కథా  ముగిసిపోయింది. ఇప్పుడు ‘శతమానం భవతి’ తర్వాత వాటి భావిష్యత్తేమిటో  చూడాలి.  ఇలాగే ఇంకో ప్యూర్ ఉమ్మడి కుటుంబ కథ- మళ్ళీ  కుటుంబ సభ్యులు ఉమ్మడి కుటుంబాల్లో కి వచ్చెయ్యాలని (!!)డిమాండ్ చేసే కథ కూడా ఈ వ్యాసకర్తని రాచి రంపాన పెట్టి మాయమైపోయింది. 

          అయిపోలేదు- ‘శతమానం భవతి’ విడుదలైన మర్నాడే, ఇలాటిదే ఇంకో పూర్తి  స్థాయి స్క్రిప్టు  కింకర్తవ్యం కోసం ఈ వ్యాసకర్త దగ్గరికి వచ్చి ఎదురుగా టేబుల్ మీద ఆశీనురాలై వుంది. బట్ - ‘శతమానం భవతి’  మొదటి సీన్లలోంచే తొంగి చూస్తున్న సీక్రెట్ తో ఇప్పటికైనా ఒక నూతన శకపు క్రియేటివ్ –ఇన్నోవేటివ్ – బాక్సాఫీసు ఫ్రెండ్లీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ రాకపోతే కాలం క్షమిస్తుందేమో చూడాలి.

ఏమిటా రహస్యం?
        ‘శతమానం భవతి’ విడుదల కాక మునుపు ఆదివారం ఎప్పట్లాగే  వ్యసనాన్ని చంపుకోలేక, మూడు రూపాయలు పెట్టి ఆంగ్ల ఆథ్యాత్మిక పత్రిక ‘స్పీకింగ్ ట్రీ’ కొనుక్కుని చదివాడీ వ్యాసకర్త. అందులో బ్యానర్ ఐటెం గా ములాయం సింగ్ యాదవ్- అఖిలేష్ యాదవ్ తండ్రీ కొడుకుల సిగపట్ల గురించి వుంది. దీని మీద ఓషో రజనీష్ ఏం చెప్పాడో ఆయన మాటల్లోనే పూర్తి వ్యాసం వుంది. ఓషో రజనీష్  జీవితాల్లోనే కాదు, సమాజంలో, రాజకీయంలో, ప్రపంచంలో తలెత్తే సమస్యలకి కారణాలూ, వాటి పరిష్కారాలూ అపూర్వంగా చెప్పేసి 59 ఏళ్లకే మరణించాడు. 
         
       ఈ వ్యాసంలో పాత తరానికీ యువతరానికీ జనరేషన్ గ్యాప్ ( తరాల అంతరం) సమస్య ఎప్పట్నించీ మొదలై ఎందుకేర్పడిందో, పరిష్కార మేమిటో వివరించాడు. జనరేషన్ గ్యాప్ తో సమస్యలు కేవలం తండ్రీ కొడుకుల మధ్యే కాదు, అన్నదమ్ముల మధ్య కూడా ఏర్పడతాయి. అన్నకీ, చివరి తమ్ముడికీ పదేళ్ళకి పైన గ్యాప్ వుందంటే, జనరేషన్ గ్యాప్ తో తమ్ముడు అన్నని అవుట్ డేటెడ్ గా లెక్కేసి దూరంగా వుండే అవకాశాలున్నాయి. అలాగే రక్త సంబంధీకుల మధ్యే కాదు, బయట ఇతర అన్ని సంబంధాలలోనూ ఈ సమస్య తలెత్తుతుంది. బాస్ కీ ఉద్యోగికీ మధ్య, గురువుకీ శిష్యుడికీ మధ్య.....ఇలా తరాల అంతరాలతో  తంపులుంటాయి. ఈ సమస్య ఎప్పట్నించీ ఎందుకని మొదలయ్యిందో, అంతకి ముందు ఎందుకు లేదో, దీనికి సముచిత పరిష్కారమేమిటో ఈ లింక్ ని క్లిక్ చేసి http://www.speakingtree.in/article/leadership-tussle  రజనీష్ మాటల్లోనే తెలుసుకుంటే ఒక కొత్త విజన్ ఏర్పడుతుంది. 

          ఇలా కుటుంబ కథలకి ఒక కొత్త కోణం దొరికిందని నోట్ చేసుకుని, ఆ పై శనివారం ‘శతమానం భవతి’ కెళ్తే,  మొదటి మూడు నాల్గు సీన్లలోనే ఆ కోణం ఇక్కడ కనెక్ట్ అయిపోయి- ‘శతమానం భవతి’ లాంటి స్టక్ అయిపోయిన కథల్ని నవీకరించి ముందుకి నడిపించగల రహస్యం తెలిసిపోయింది!

          ఏమిటా రహస్యం? ప్రకాష్ రాజ్ పాత్ర, జయసుధ పాత్రల ఆక్రోశం ఏమిటంటే, పదేళ్లుగా విదేశాల్లో వుంటున్న కొడుకులు తమని పట్టించుకోవడం లేదని. పట్టించుకోరు, ఐతే ఏంటి? రేపా కొడుకుల పిల్లలు (మనవళ్ళు)కూడా ఆ కొడుకుల్ని(వాళ్ళ తండ్రుల్నీ) పట్టించుకోరు, అప్పుడేంటి? ఇంకాపైన ఆ మనవళ్ళ కొడుకులు కూడా ఆ మనవళ్ళని  పట్టించుకోరు, అప్పుడు కూడా ఏంటి? ఇలా వంశంలో తమ తర్వాత తరాలు ఎలాపోయినా ఫరవా లేదు, తామొక్కరే ఇప్పుడు కొడుకుల కోసం ఆక్రోశించి, వాళ్ళని రప్పించుకుని, సాధించి  సుఖపడితే చాలా?  ప్రకాష్ రాజ్, జయసుధల పాత్రలు ఇలా తమ సుఖం మాత్రమే చూసుకుంటూ, స్వార్ధంతో, అజ్ఞానంతో అరిచి గీ పెడితే  పెద్దరికానికి ఓకేనా? 

          ప్రకాష్ రాజ్ పాత్ర ఇప్పుడు ఇరవయ్యేళ్ళ మనవరాలి (హీరోయిన్) కి తాత అంటే, 1990 లలో ఇరవై ఏళ్ల కూతురికి తండ్రి అయి వుండాలి. అంటే 1970 లలో తన పెళ్ళయి వుండాలి. అంటే అదే పల్లెటూళ్లో ఉమ్మడి కుటుంబం. ఉమ్మడి కుటుంబం చూసింతర్వాత, తన కొడుకుల న్యూక్లియర్ కుటుంబాలూ చూసింతర్వాత, ముందు తరాల్లో ఈ న్యూక్లియర్ కుటుంబాలైనా  ఏమౌతయోనన్న ఆందోళన వుండాలి- అది అప్పుడు ఆ వయసుకి, ఆ అనుభవానికి, పాత్రోచిత న్యాయం అవుతుంది. కుటుంబ పెద్ద పాత్రే  ఇలా ఆలోచించకపోతే అదెలాంటి  పాత్ర చిత్రణ అవుతుంది? ఇది చూసిన ప్రేక్షకులకి ఏం ప్రయోజనం దక్కుతుంది? 

          సరే నా కొడుకువల్ల నాకీ పరిస్థితి వచ్చింది, రేపు వాడి కొడుకువల్ల వాడికి కూడా నాలాంటి పరిస్థితి రాకూడదని ఆ కొడుకు శ్రేయస్సు ఆలోచించే  తండ్రి మనసు గొప్పదా, ఆ మేరకు చర్యలు తీసుకుని పాటుపడితే మంచిదా – లేక ఇలా తనవరకే ఏడుస్తూ కూర్చుని, రేపా కొడుకుల న్యూక్లియర్ కుటుంబాలు కూడా ముక్కలై,  మున్ముందు వంశస్థులు వాయిదాల పద్ధతిలో కోన్ కిస్కా లై తిరుగుతూంటే మంచిదా? ఫలానా కుటుంబరావుగారి వంశమేదీ? ఎక్కడ? – అని ఎవరు ఆరాతీయాలి? 

          ఉమ్మడి కుటుంబాలు పోయాక - 'సబ్ కే సాథ్ సబ్ కా వికాస్’ మంత్రం  ఇక్కడ అస్సలు పని చెయ్యదు. ‘ఉస్కే సాథ్ (మనవళ్ళతో) ఉస్కా (కొడుకుల) వికాస్’ కోసం మాత్రమే తను కృషి చేయాల్సి వుంటుంది.

          ఇలాటి కథల్లో హీరో హీరోయిన్లు కూడా తమ తాతతో పదేళ్ళు పోయినా కలవని తల్లిదండ్రుల్ని ఉత్త పుణ్యానికి  తీసి కెళ్ళి కలిపేస్తూంటారు కామెడీలు చేసి. వాళ్ళు పరిహారం చెల్లించుకోనక్కర్లేదా?  ఈ దిశగా హీరో హీరోయిన్ల పాత్ర చిత్రణలున్నప్పుడే కదా కుటుంబ సినిమాలు కూడా యూత్ అప్పీల్ తో బాక్సాఫీసు కడుపు నింపేది.
                                              ***
         ఉమ్మడి  కుటుంబాల నాటి  
పాటల  సాహిత్యం ఇప్పుడు లేదు,  పాటల బాణీలూ ఇప్పుడు లేవు, ఆ డాన్సులూ ఇప్పుడు లేవు, సంభాషణల్లో ఆ పదాలూ ఇప్పుడు లేవు, పాత్రల తీరు తెన్నులూ అప్పట్లా లేవు,  ఫైట్లూ అప్పట్లా లేవు... అన్నీ మారిపోతూ వచ్చాయి...ఇంకా మారిపోతూ వుంటాయి.  రచయిత రాసుకునే అక్షరాలెందుకు మారవు!! మారిస్తే ట్రెండీ కర్రీస్ లేడీస్ వచ్చి కొడతారా?

-సికిందర్