రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

12, జనవరి 2017, గురువారం

Review - Fresh Copy!

రచన- దర్శకత్వం : క్రిష్
తారాగ‌ణం: నంద‌మూరి బాల‌కృష్ణ‌, శ్రియాశ‌ర‌న్‌, హేమమాలిని, క‌బీర్ బేడీ, శివ‌రాజ్ కుమార్, తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్  తదితరులు
మాట‌లు
: సాయి మాధ‌వ్ బుర్రా, పాట‌లు: సీతారామ‌శాస్త్రి, సంగీతం: చిరంత‌న్ భ‌ట్‌ ఛాయాగ్ర‌హ‌ణం: జ్ఞాన‌శేఖ‌ర్‌, నృత్యాలు  : స్వర్ణ
బ్యానర్ :
 ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్మెంట్స్‌, స‌మ‌ర్ప‌ణ: బిబో శ్రీనివాస్‌, నిర్మాతలు: రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు
విడుదల :12 జనవరి, 2017

***
బాలకృష్ణ నందమూరి నూరవ ప్రయత్నంగా చారిత్రాత్మక కథ కావడం, అందులోనూ శాతకర్ణి పాత్ర కావడం ముందుగానే  ఒక ఎస్సెట్ తన ప్రతిష్టకి. రెగ్యులర్ మాస్ మసాలా 
జోకిలి పోకుండా వయసుకి తగ్గ పాత్రతో అభద్రతాభావమనే గ్లామర్ ఇమేజి చట్రాన్ని 
ఒక్క వేటుతో  ముక్కలు చేసి పారేసి ఇవతలపడ్డారు ఈ పండక్కి. 
ఇక కరుడుగట్టిన ఆయన అభిమానులు కూడా నోరెత్తకుండా పండగ చేసుకోవడమే మిగిలింది. వాళ్లకి థియేటర్లో జాతీయ గీతం కూడా ఆనలేదు-  
జై బాలయ్య నినాదాలే ఇచ్చుకున్నారు వీరాభిమానులుగా. 


      దర్శకుడు  క్రిష్ కాల్పనిక  చరిత్ర ( 2015 - ‘కంచె’) నుంచి చరిత్ర కొచ్చారు. ఆయన కూడా ఎవరికీ తెలియని ఒక తెలుగు యోధుడి  విశిష్టతని, తొలి భారత చక్రవర్తి గాథని  తెరకెక్కించాలన్నఆలోచన చేయడం దగ్గరే నూటికి నూరుపాళ్ళూ సక్సెస్ అయ్యారు. అయినా అంత చరిత్రని హడావిడిగా 79 రోజుల్లో ఎలా తెరకెక్కిస్తారనే  దాని గురించి సందేహాలక్కర్లేదు- ‘కంచె’ తో సాధించింది ఇంకొంచెం ఎక్కువే సాధించి చూపిస్తారు ఈ చరిత్రతో. 

        ఒక యోధుడి  చరిత్ర తెరకెక్కిస్తూ సినిమాటిక్ గా న్యాయం  చేయాలంటే ‘రుద్రమ దేవి’ లా ఆల్ ఇన్ వన్ చేయడం గాక - సింపుల్ గా మరేం చేయవచ్చో ఈ కింది విధంగా చేసుకుపోయారు క్రిష్. అదేమిటో చూద్దాం...


కథ 
    శాతకర్ణి (క్రీపూ 78-102)  అమరావతి రాజు శివస్వతి శాతకర్ణి కొడుకు, కరీంనగర్ జిల్లా కోటి లింగాలలో  పుట్టాడు. ఐదేళ్ల వయసులో శాతకర్ణి (బాలకృష్ణ) తల్లి గౌతమీ  బాలాశ్రీ (హేమమాలిని) ని కొన్ని ప్రశ్నలు అడుగుతాడు- యుద్ధాలు ఎందుకు జరుగుతాయని. ఆ తల్లి చెప్పిన సమాధానం విని, అన్ని రాజ్యాలూ ఒకటయితే యుద్ధాలే జరగవు కదా, అలాటి ఒక పెద్ద యుద్ధం చేసి. ఇక యుద్ధాలే అవసరం లేకుండా  రాజ్యాలన్నిటినీ కలిపేస్తానంటాడు. దీన్ని తను పట్టాభిషిక్తుడయ్యేవరకూ గుర్తుంచుకుంటాడు. దేశంలో చిన్న చిన్న రాజ్యాల్ని విదేశీ రాజులు హస్తగతం చేసుకుని ఆ పాలకుల్ని వాళ్ళ కింద సామంత రాజులుగా చేసుకోవడం శాతకర్ణికి ఆగ్రహం తెప్పిస్తుంది. అందుకని భారతదేశంలో రాజ్యాలన్నీ ఒకే  బలవంతుడైన రాజు కింద- ఆ రాజు తను- వుండాలని దక్షిణ రాజ్యాల్ని  జయించి, ఉత్తరాన సౌరాష్ట్ర (మరాఠా) మీద దృష్టి పెడతాడు. అక్కడి కల్యాణ్ దుర్గ్ ని జయిస్తాడు. ఇక నహపాణుడు  (కబీర్ బేడీ)  రాజ్యాన్నీ జయిస్తాడు. ఇక అప్పుడు అలెగ్జాండర్ తర్వాత అంతటి శక్తి శాలియైన  డిమిత్రియస్ అనే గ్రీకు రాజు , అలెగ్జాండర్  సాధించలేనిది తను సాధించాలని మూడులక్షల మంది సైన్యాన్ని వెంటేసుకుని భారీయెత్తున దేశం మీదకి  దండయాత్ర కొస్తాడు....

        దీన్ని శాతకర్ణి ఎలా ఎదుర్కొన్నాడు? అప్పటికే 33 రాజ్యాలని జయించిన శాతకర్ణికి కుటుంబ పరమైన, నైతిక పరమైన ఆటంకాలేం ఎదురయ్యాయి?  అతడి వెన్నుపోటు దార్లెవరు? ప్రాణాలు తీయబోయిన వగలాడి ఎవరు? తల్లితో, భార్య వాశిష్టీ దేవి (శ్రియ) తో సంబంధాలు ఎలా ప్రభావితం చేశాయి? ఆ ఒడిదుడుకుల సంబంధాల్ని ఎలా మేనేజ్ చేశాడు? వీటన్నిటి నడుమ నులుగుతూ, తన చిన్ననాటి కలని ఎలా నిజం చేసుకుని తొలి అఖండ భారత చక్రవర్తి అయ్యాడు?...ఇవన్నీ మిగతా కథలో తెలుస్తాయి.

ఎలావుంది కథ 
   500 సంవత్సరాలు పాలించిన శాతవాహన వంశీయులలో 23 వ రాజైన శాతకర్ణుడి కథ ఈ సినిమాతో ఒక అవగాహనని కల్పిస్తుంది. ఇది మరుగున పడిపోయిన చరిత్రే. దర్శకుడే వ్యాఖ్యానించినట్టు ఇది ఏ గ్రీకు వీరుడి చరిత్రో అయ్యుంటే ఇప్పటికే ఎన్నో సినిమాలు తీసి, ఆస్కార్ అవార్డులు కూడా కొట్టేసే వాళ్ళు. క్రిష్ కి ముందు శాతకర్ణి చరిత్రని సినిమాల పరంగా ఎవరూ ఆలోచన లేదన్నది వాస్తవం. అసలు ఇలాటి యోధుడున్నాడా  అని తెలుగు వాళ్ళకే తెలీదంటే అతిశయోక్తి కాదు. రుద్రమ దేవితోనే సరిపెట్టుకుంటున్న  ప్రభుత్వాలు కూడా చేయలేనిది ఈ సినిమా కథ  చేసి చూపించింది. ఈ కథలో శాతకర్ణి తన పేరు ముందు తనే ఒకానొక ప్రధాన ఘట్టంలో,  ‘గౌతమిపుత్ర’  అని పెట్టుకున్నట్టు చూపించారు. కానీ ఆ కాలంలో రాజులకి ఎందరో భార్యలుండేవాళ్ళు కాబట్టి, సంతానాన్ని వాళ్ళ  తల్లిని బట్టి గుర్తించడానికి అలా తల్లి పేరు కలిపి పెట్టేవారని ఒక చోట రాసివుంది. ఇది సరైనదో కాదో తెలీదుగానీ  - దర్శకుడు క్రిష్  తన పేరు ముందు మాత్రమే కాకుండా, ఈ సినిమాలో నటించిన, పని చేసిన వాళ్ళందరి పేర్లకీ ముందు ఫలానా తల్లి ‘పుత్ర’, 'పుత్రి'  అని కలిపి టైటిల్స్ లో వేశారు. హిందీ దర్శకుడు సంజయ్  భన్సాలీ- ‘లీలా’ అని మధ్యలో తన తల్లి పేరు కలిపి పెట్టుకున్నప్పుడు, కేవలం తల్లి మీద ప్రేమతోనే పెట్టుకున్నాడు - ఎవరి చరిత్రలోంచో  ఉదాహరణ తీసుకుని కాదు. 
       శాతకర్ణుడి చరిత్ర సినిమా కథగా తెర కెక్కడం మాత్రం చారిత్రక ఘట్టమే. తెలుగు సినిమా చరిత్రలో సువర్ణాక్షరం. 

ఎవరెలా చేశారు 
     బాలకృష్ణ ఈ బరువైన పాత్రని- అందులోనూ యుద్ధ ప్రధాన పాత్రని- సర్వశక్తులూ ఒడ్డి పోషించారు. అంతే బలంగా డైలాగుల దుమారం రేపారు- నా బిడ్డ కోసమో నీ గడ్డ కోసమో కాదు నేను పోరాడుతున్నది...ఈ దేశం అంతటినీ ఏక ఖండంగా కలపడానికి- లాంటి డైలాగులు రోమాలు నిక్కబొడుచుకునేలా పేల్చారు. కత్తి యుద్ధాలు, యుక్తి పన్నాగాలూ, మళ్ళీ అటు-  ఎదురు తిరిగే భార్యతో  సుతిమెత్తని సున్నిత వూరడింపులూ- ఈ ద్విముఖ వ్యూహ పాత్రచిత్రణకి తాను తప్ప శరణ్యం లేనట్టు తాను అదృశ్యమైపోయి-  ఈ 21వ శతాబ్దంలోకి శాతకర్ణిని సజీవంగా రప్పించారు బాలకృష్ణ. 

       శ్రియకి  కూడా బలమైన పాత్ర దక్కింది. మాఫియా సినిమాల్లో చూస్తూంటాం-  నాగార్జున మాఫియా అయితే అమల పరిస్థితి, శ్రీ విష్ణు మాఫియా అయితే తాన్యా హోప్ పరిస్థితి...కానీ యుద్ధం, హింస, చావులూ వీటితోనే  గడిపే, ఐదారేళ్ళ కొడుకు పులోమావిని కూడా  యుద్ధానికి తీసికెళ్ళి పోయే శాతకర్ణి లాంటి కటువైన భర్తతో, వాశిష్టీ పాత్రలో శ్రియ మోద ఖేదాల డోలాయమాన స్థితి చాలా ఉన్నతంగా బ్యూటిఫుల్ గా అర్ధవంతంగా చిత్రణ చేశారు.


        అందులో పరిపక్వ నటనతో శ్రియ కొన్ని  చోట్ల కంట తడికూడా పెట్టిస్తారు. మాఫియా సినిమాల్లో ఫ్లాట్ గా వుండే భార్య పాత్రలు ఇంత బలంగా కట్టి పడెయ్యవు.  హేమమాలిని అయితే మహారాణి ఎలా వుంటుందో అలాగే వుంటారు. ఈ మూడే ముఖ్యపాత్రలు. మూడు సీన్లలో కన్పించే ఇంకో అతిధిపాత్ర ( కత్రినా కైఫ్ లా వున్న విదేశీ నటి పేరు తెలియదు- గ్రీకు యువతి పాత్ర పోషించింది) కూడా ఆ మూడు సీన్లకి హైలైట్.
      
        ఈ సినిమా ఒక సాంకేతిక విజయం కూడా. ఈ 79 రోజులనేది ప్రధాని మోడీ 50 రోజుల్లాగా బాగా పాపులర్ అయిపోయింది. రెండున్నర నెలల్లో ఇంత సినిమా- ఇంత చారిత్రక యుద్ధాలతో, విశేషాలతో, సెట్సూ ఆభరణాలతో తీస్తారా అనేది రేపు ఒక  అధ్యయన అంశంగా మారవచ్చు. 79 రోజుల్లో ఇంత సినిమా తీయడం బడ్జెట్ విజయం కూడా- ఇలాటి చారిత్రికాలు తీయడానికి బాలీవుడ్ కార్పొరేట్స్ కూడా పరికించి చూసే ఒక మోడల్. 


    పూర్తిగా అంతర్జాతీయ స్థాయి మేకింగ్ ఇది- జ్ఞాన శేఖర్ ఛాయాగ్రహణం, సీతారామ శాస్త్రి సాహిత్యం, చిరంతన్ భట్  (‘కంచె’ ఫేం) సంగీతమూ సరే (ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఉదిత్ నారాయణ్ లు కూడా పాడారు), స్వర్ణ నృత్యాలూ సరే, ఇక ఎడిటింగ్ (రామకృష్ణ అర్రం- సూరజ్ జగ్తాపీ), ఆర్ట్ ( భూపేష్ ఆర్ భూపతి, అజీజ్ హమిచి), కాస్ట్యూమ్స్- జివెలరీ (నీతా లుల్లా), కాస్టింగ్ (హమీద్ తిమఘ్రిత్), సౌండ్ (జస్టిన్ జోస్, పరీక్షిత్ లల్వానీ), విజువల్ ఎఫెక్ట్స్ (ప్రైమ్ ఫోకస్), యాక్షన్ ( రామ్- లక్ష్మణ్, యూనస్ అఫ్రోఖ్, మహమ్మద్ అతోగీ, హామీ బెలాల్, బ్రహీం బౌకిజూ, యూసుఫ్ మర్చౌకి, అబ్దుల్లా ఔకేష్)...వీళ్ళందరూ కూడా శాతకర్ణికి నివాళులు అర్పిస్తున్నట్టే కళాపోషణ చేశారు.          
       
      యుద్ధ దృశ్యాలు టెక్నికల్ వండర్స్. కానీ గ్రాఫిక్స్ టెక్నిక్ లా  అన్పించవు. మొదటి సముద్ర యుద్ధం దగ్గర్నుంచి, చివరి హిమాచల్ ప్రదేశ్ పచ్చిక బయళ్ళ, మంచు కొండల మయమైన ప్రాంత రణరంగం వరకూ యాక్షన్ కొరియోగ్రఫీ హేమా హేమీల చేతుల్లో ఒక రికార్డు. అయితే ఈ యుద్ధాల్లో ఎన్నో గుర్రాలుంటే వాటిని ఎక్కడా ప్రత్యేకంగా హైలైట్ చేసే షాట్లు తీయలేదు. గ్రూపుగా గుర్రాలు ఒక లయతో స్లో మోషన్ లో దౌడు తీస్తూంటే  ('బెన్హర్') ఆ విజువల్స్ ఆ యుద్ధ దృశ్యాల్లో మరింత ఉత్తేజాన్ని నింపడమేగాక, కళాత్మకంగా వుండేది.   

       ఇకపోతే ఒక కలం వీరుడు సాయినాథ్ బుర్రా కూడా వున్నారు. నిన్ననే ఈయన మెగాస్టార్ (ఖైదీ నెం -150) కి  డైలాగులు రాసి, ఇవ్వాళ బాలకృష్ణతో వచ్చారు. రైటర్ గా ఈయన ఏ తరహా సినిమాలకి బెస్టో ఇక్కడ అప్రస్తుతం గానీ, ప్రస్తుత సినిమాకి నిజంగా ఈయన చేసింది ఒక ఆర్టు. ఈ ఆర్టుకి సినిమా మొత్తం కలిపి  ‘శంకరాభరణం’ లాగా పాతిక పేజీలకి మించి డైలాగులు వుండవు! ఇందులో బాలకృష్ణ కెన్నుంటాయి- ఆయనేం పేల్చినట్టు- అన్నది పిచ్చి ప్రశ్న! వెళ్లి సినిమా చూడండి.

చివరికేమిటి? 
        హై కాన్సెప్ట్ సినిమాల స్క్రిప్టులు సింపుల్ గానే  వుంటాయి. ఒక సింగిల్ లైన్, ఒక లక్ష్యం,  ఒక సంఘర్షణ, ఒక విజయం, అంతే. శాతకర్ణి చరిత్రకి దీన్నే అప్లై చేశారు క్రిష్. ప్రారంభంలో చిన్నప్పుడు శాతకర్ణి ఏ గోల్ నైతే వెల్లడిస్తాడో, దాన్నాధారంగా చేసుకునే మొత్తం ఈ కథ నడిపారు. అందుకని రాజుగా ఇందులో రాజ్యపాలనా, ఆనాటి సామాజిక పరిస్థితులూ, సమస్యలూ, రాజుగా ఆయనకు అభిషేకాలూ, పొగుడుతూ ప్రజల బృందగానాలూ వగైరా అనవసరం.  యోధుడిగా  ఏ లక్ష్యంకోసం శాతకర్ణి యుద్ధాలు చేశాడన్నదే ఈ కథ. వర్మ 'కిల్లింగ్ వీరప్పన్' తీసినప్పుడు పోలీసులు వీరప్పన్ ని ఎలా ఎన్ కౌంటర్  చేశారన్నదే కథ-  కనుక వేరే వీరప్పన్  జీవితం అనవసరం. అదింకో సినిమా తీసుకోవచ్చు. అటెన్ బరో 'గాంధీ' తీసినప్పుడు అందులో మహాత్మా గాంధీ చేసిన స్వాతంత్ర్య సమరంతోనే కథకి పని. కొడుకుతో వివాదాస్పదమైన ఆయన సంబంధాల గురించి వేరే 'మై ఫాదర్  గాంధీ'  అని తీసుకోవచ్చు. జీవిత చరిత్రల్ని పుస్తకాల్లో నింపినట్టు  సినిమాల్లో నింపలేరు. ఆ జీవితంలో ఏదో ఒక పార్శ్వమో,ఖండమో తీసుకుని, లక్ష్యం - సంఘర్షణ- విజయం లేదా అపజయం- అనే  స్క్రీన్ ప్లే సూత్రాల్లోనే  సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తారు. ఏ జీవిత చరిత్ర అయినా ఇంతే. ఆ మాట కొస్తే రామాయణ భారతాలు సినిమాలుగా తీసినా ఇంతే. దీన్ని అర్ధం జేసుకోవాలి ప్రేక్షకులు. ఇలాకాక శాతకర్ణి  పాలనా, ఆయన  చేసిన అభివృద్ధీ, సంక్షేమ పథకాలూ, ప్రజలకి తాయిలాలూ, చీరెల పంపకాలు, సాగునీటి పారుదలా, శాంతి భద్రతలూ, ఈ సినిమాకి టికెట్లూ- వాటికి  వినోద పన్ను మినహాయింపూ  - ఇంకా మాటాడితే ట్రాఫిక్ రూల్సూ, ఎలక్షన్ హామీలూ, పాల్పడిన అక్రమాలూ, స్కాములూ, బ్లాక్ మనీ, పెద్ద నోట్ల రద్దూ   చూపించ లేదన్నట్టు వుంటున్నాయి చాలా మంది ప్రేక్షకుల కామెంట్స్ ! పేపర్లు  చదవడం వేరు, సినిమలుచూడ్డం వేరని గుర్తించాలి ఈ కాలంలో కామన్ సెన్స్ లేని ఇలాటి ప్రేక్షకులు. 

           అంతమాత్రాన మరీ యుద్ధాలు మాత్రమే చేసుకునే  మరమనిషిగా ఏమీ చూపించలేదు శాతకర్ణిని- అతడి యుద్ధ జీవితంతో బాటు సమాంతరంగా కుటుంబ జీవితమూ చూపించుకొచ్చారు. ఈ రెండు సమాంతర రేఖల మధ్య మళ్ళీ  ఆయన పాలనా గీలనా చూపించుకుంటూ కూర్చుంటే కథేమిటో అస్సలు అర్ధం కాదు. డాక్యుమెంటరీ గా మాత్రం అర్ధమౌతుంది. కానీ డాక్యుమెంటరీ చూడ్డానికి ప్రేక్షకులు రారు. శాతకర్ణికి ప్రధానంగా యుద్ధాలు - కుటుంబ జీవితం ఈ రెండే పరస్పరం సంఘర్షించుకుంటూ వున్నాయి.  కాబట్టి కథకి ఇవే ప్రధానం. ఈ కథనాల్లో అక్కడక్కడా సంభాషణల పరంగా శాతకర్ణి పాలనా, విధానాలు, విశ్వాసాలు, రాజకీయ నిర్ణయాలూ  మొదలైన వాటి గురించి సమాచారం అందుతూనే వుంటుంది ప్రేక్షకులకి టూకీగా. 



        మొత్తం శాతకర్ణి భారత్ ని ఏకం చేయాలన్న లక్ష్య గాథని నాల్గే  నాల్గు సీక్వెన్సుల్లో సింపుల్ గా చూపించారు ( సాధారణంగా సినిమాల్లో ఆరు సీక్వెన్సులుంటాయి). ఫస్టాఫ్ రెండు, సెకండాఫ్ మరో రెండు సీక్వెన్సులు. ఫస్టాఫ్ లో కేవలం రెండు ఘట్టాలు- సెకండాఫ్ లో కేవలం మరో రెండు ఘట్టాలు. వీటితో చెప్పాలనుకున్న అఖండ భారత చక్రవర్తిగా శాతకర్ణి ఎదిగిన క్రమమంతా కళ్ళకి కడుతుంది. చరిత్ర అనగానే మూడేసి గంటలు ఏవేవో చూపిస్తూ  కూర్చోకుండా, కేవలం రెండు గంటలా 12 నిమిషాల్లో సూటిగా సాఫీగా సింపుల్ గా శుభం!

        ప్రారంభంలో సముద్రం మీద కల్యాణ్ దుర్గ్ జయించడం కోసం మొదటి యుద్ధం, తర్వాత న హపానుణ్ణి  జయించే యుద్ధం- దీంతో ఇంటర్వెల్. దీంత్తర్వాత రాజసూయ యాగమూ  దాని కీలక పరిణామాలు, ఆ తర్వాత డిమిత్రియాస్  మీద యుద్ధం...ఈ నాల్గు సీక్వెన్సుల్లో భాగంగానే తల్లితో, భార్యతో అతడి సంబంధాల సీన్లూ వస్తాయి. ఇవే అన్ని సీక్వెన్సుల్లో అంతర్లీనంగా బాలకృష్ణ పాత్రకి ఎమోషనల్ థ్రెడ్ గా వుంటాయి- యాక్షన్ థ్రెడ్ వచ్చేసి బయట చేసే యుద్ధాలు. 

        అయితే సినిమాటిక్ అనుభవంకోసం కథలో ఏకైక విలన్ వుండడం అవసరం. ఇక్కడ విలన్లు అనే వాళ్ళు ఎప్పటి కప్పుడు లొంగిపోయే, చచ్చిపోయే రాజులుగా వుంటున్నారు. కాబట్టి పై సీక్వెన్సులన్నిటినీ కలిపి సాగే ఒక మెయిన్ విలన్  అంటూ లేకపోవడంతో  యాక్షన్ థ్రెడ్ లో కంటిన్యూ అవాల్సిన హీరో తాలూకు ఎమోషన్ వుండదు. అయితే విడివిడిగా ఈ యుద్ధాల్లో అప్పటికప్పుడు శత్రువులతో ఏర్పడే భారీ ఎమోషన్స్, సెంటిమెంట్స్  లేకపోలేదు.  అవేమిటంటే, మొదటి యుద్ధంలో యవనుడు (గ్రీకు) పరిథాస్ ని శాతకర్ణి చంపిన విధానం ప్రత్యేకంగా ఎస్టాబ్లిష్ అవుతుంది. కథా ప్రారంభం కాబట్టి శాతకర్ణి పాత్రని పరిచయం చేసే ఈ యుద్ధంలో పరిథాస్ ని చంపడమనే అతడి లక్ష్యం లోంచి పుట్టిన  ఆ చర్య బలమైన ఎమోషన్ గా  కన్పిస్తుంది.  కానీ ఈ పరిథాస్ ని అంత కసిగా  చంపడమే చివరి యుద్ధంలో శాతకర్ణి ప్రాణాల మీదికి తెస్తుంది. రెండో యుద్ధంలో శాతకర్ణి కొడుకుని తీసి కెళ్ళి పణంగా పెట్టే ఎమోషనల్ - సెంటిమెంటల్ దృశ్యాలు వస్తాయి. ఇక్కడ నహపాణుడు 
 బందీలుగా పెట్టుకున్న సామంతుల పిల్లల్ని కూడా విడిపించాల్సి వుంటుంది శాతకర్ణికి. చివరి యుద్ధానికి సెంటిమెంట్లు, ఎమోషన్సు  భార్యతో ముడిపడి వుంటాయి. భార్యకి పీడకలు రావడమనే ప్రిమానిషన్ ని కూడా లెక్క చేయకుండా శాతకర్ణి యుద్ధానికెళ్ళి విషప్రయోగం పాలబడి, రణ రంగంలో మంచాన పడిపోతాడు...

       ఇలా ఏ ఎపిసోడ్ కా ఎపిసోడ్ విడివిడి ఎమోషన్స్ సెంటిమెంట్స్ ఉత్పన్నమవుతూ  ఆ ఎపిసోడ్స్ తో బాటే అవికూడా ముగిసి పోతూంటాయి. జస్ట్ లైక్- స్టార్ట్ అండ్ స్టాప్ అనే డాక్యుమెంటరీ లకి వాడే  ట్రీట్ మెంట్ లాంటిదన్నమాట. కానీ సినిమా అన్నాక ఆదిమధ్యాంతాలన్నిటా చెప్పాలనుకున్న పాయింటుకి సంబంధించిన ఒకే మేజర్ ఎమోషన్ ని పాత్ర మోస్తూండాలి. మోయాలంటే ఒకే విలన్ వుండాలి. ఒక లక్ష్యం, ఒక విలన్, అతడితోనే  సంఘర్షణ -అనే  సూత్రం చాలా జీవిత చరిత్రలకి అసాధ్యమైపోతుంది. అందుకని జీవిత చరిత్రలు కమర్షియల్ సినిమాయేతర గాథలుగా వుంటాయి. గాథల్లో ఆర్గ్యుమెంట్ వుండదు. ఒకే విలన్ అంటూ వుంటే అప్పుడు ఆర్గ్యుమెంట్ పుట్టి అది 'గాథ' అవక సినిమా 'కథ' లా వుంటుంది. ఆర్గ్యుమెంట్ సహితంగా  కథలే వుంటాయి, గాథ లుండవు. అవి స్టేట్ మెంట్ మాత్రంగానే వుంటాయి. 

     శాతకర్ణి పాత్రకి ఒక లక్ష్యమైతే  వుందిగానీ, ఆ లక్ష్యంకోసం  సంఘర్షించడానికి ఒకే  విలన్ అంటూ లేడు. తనతో  తనే ఆర్గ్యూ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదీ సమస్య. 
 ఈ సమస్య ‘కంచె’ లో కూడా వుంది. రెండు వేర్వేరు కాలాల్లో జరిగే రెండు కథలకీ కలిపి ఒక ‘హుక్’ అందులో లేనట్టే,  ఇక్కడ కూడా  నాల్గు సీక్వెన్సుల్నీ కలిపి వుంచే ఒక  హుక్-  ఒకే విలన్ లేడు.  concentric circles అయితే వున్నాయిగానీ వాటిని కలిపివుంచే హుక్ లేదు. ఇది చరిత్రకి చేసిన కథ కాబట్టి ఏకైక విలన్ అనేది కుదరలేదు. ఆ మాటకొస్తే అటెన్ బరో తీసిన ‘గాంధీ’ కూడా ఇంతే- నాల్గు వేర్వేరు సీక్వెన్సులు- ప్రత్యర్థులు ఎందరో! 

        అప్పుడు దీనికి పరిష్కార మార్గం- శాతకర్ణి చివరి యుద్ధం ఎవరితోనైతే చేస్తాడో,  ఆ డిమిత్రియాస్ నే మెయిన్ విలన్ గా  పెట్టుకుని కథ ప్రారంభించాలి. మిగతా  రాజులతో యుద్ధాలు ఫ్లాష్ బ్యాక్స్ గా చెప్పుకురావాలి. ఇలా వర్కౌట్ అవుతుందా? చెప్పలేం, ఇదొక  ప్రయోగం. కానీ వర్మ తీసిన బలహీన 'వంగవీటి' కి ఇదే కరెక్ట్ సొల్యూషన్. 

        ఒక్కోసారి  క్యారక్టర్ పోషిస్తున్న స్టార్  కొన్ని లోపాల్ని తనే హేపీగా జయించేస్తూంటాడు. యువరత్న బాలకృష్ణ  నటసింహుడే  కాబట్టి, ఇలాటి లోపాల్ని నమిలేయడం  సినిమాలో  ఆయన చీమా - సింహం కథ చెప్పినంత తేలిక!

        సినిమా చివర గౌతమీ పుత్ర శాతకర్ణికి నిరాజనాలు పలికే వాక్యాలు గొప్పగా వున్నాయి!

-సికిందర్
http://www.cinemabazaar.in





11, జనవరి 2017, బుధవారం

రివ్యూ!







స్క్రీన్ ప్లే- దర్శకత్వం : వి.వి.వినాయక్

తారాగ‌ణం: చిరంజీవి, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, త‌రుణ్ అరోరా, బ్ర‌హ్మానందం, అలీ, పోసాని కృష్ణ మురళి, జయప్రకాష్ రెడ్డి, ర‌ఘుబాబు, నాజర్, నాగబాబు తదితరులు 

కథ : ఏ ఆర్. మురుగదాస్, రచన : ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్‌, రచనా సహకారం : సత్యానంద్, మాటలు: సాయిమాధ‌వ్ బుర్రా, వేమారెడ్డి 
సంగీతం: దేవిశ్రీప్ర‌సాద్‌, ఛాయాగ్ర‌హ‌ణం: ర‌త్న‌వేలు
బ్యానర్ : కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, నిర్మాత: రామ్‌చ‌ర‌ణ్‌
విడుదల : జనవరి 11, 201

***

బాస్ ఈజ్ బ్యాక్ అంటూ మెగా స్టార్ చిరంజీవి పునరాగమన ‘ఖైదీ నెం. 150’ ఎప్పుడెప్పుడా అని కళ్ళు కాయలు చేసుకున్న ప్రేక్షకాభిమానులకి సంక్రాంతి కానుకగా వచ్చేసింది. తన రెండు దశాబ్దాల ఏకఛత్రాధిపత్య సినిమా రంగాన్ని సన్యసించి పదేళ్ళు వనవాసాని కెళ్ళిన చిరంజీవి, అక్కడ ఢక్కామొక్కీలు తిని తిరిగి వచ్చారు తన సామ్రాజ్యాన్ని తిరిగి క్లెయిమ్ చేసుకోవడానికి. పదేళ్ళ గ్యాప్ తర్వాత నూట యాభయ్యోవ సినిమా స్థాయి దేవుడెరుగు- అసలు వెళ్ళిన బాసు బాస్ లాగా తిరిగి రాకపోతే, తను లేని కాలంలో రకరకాల పాగాలు వేసుకున్న యంగ్ స్టార్ లతో పోటీ పడే స్టామినాతో, స్టయిలింగ్ తో  రీఎంట్రీ ఇవ్వకపోతే, అంతా బురదలో పోసిన పన్నీరైపోతుంది. ఈ పరీక్షే చిరంజీవి ముందున్న అతిపెద్ద ఛాలెంజి. దీన్ని  ఆయనెలా ఎదుర్కొన్నారు? ఎదుర్కొని సక్సెస్ అయ్యారా? సినిమా స్థాయి కంటే  చిరంజీవి స్థాయినే తెరమీద ప్రతీక్షణం, ప్రతీ కదలికలో గమనించడంలో లీనమైపోతారు ప్రేక్షకులు- కాబట్టి మెగా స్టార్ గా చిరంజీవి  తిరిగి అదే తన పూర్వ ఇమేజిని నిలబెట్టుకున్నారా లేదా అన్నదే ప్రధాన పాయింటై పోతుంది. ఇందులోకి వెళ్ళే ముందు కథెలా వుందో ఒకసారి చూద్దాం...


కథ 


     కత్తి శీను (చిరంజీవి) ఒక జైలు పక్షి. కలకత్తా జైలునుంచి పారిపోయి వచ్చి పాత  నేస్తం మల్లి (అలీ)తో  కలిసి బ్యాంకాక్ పారిపోయేందుకు ప్లానేస్తాడు. ఇంతలో అందాల బొమ్మ సుబ్బలక్ష్మి (కాజల్ అగర్వాల్) కన్పించడంతో ఆమె ఆకర్షణలో  పడి బ్యాంకాక్ ఆలోచన మానుకుంటాడు. ఓ రాత్రి తన ఎదుటే శంకర్ అనే వ్యక్తి  మీద హత్యా యత్నం చేసి పారిపోతుంది ఓ గ్యాంగ్. ఆ శంకర్ (చిరంజీవి రెండో పాత్ర) ని కాపాడేందుకు వెళ్ళిన  శీను కి తన పోలికలతోనే అతను కన్పిస్తాడు. దీంతో మల్లితో ప్లానేసి, శంకర్ ని శీనులా ఆస్పత్రిలో జాయిన్ చేసి, తను శంకర్ వుండే అడ్రసుకి శంకర్ లా వెళ్తాడు. ఆ ఒల్డేజీ  హోంలో వుంటున్న వృద్ధులు శీనుని శంకర్ గానే నమ్ముతారు.  అటు శీను కాని శంకర్ శీనుగా  ముద్రపడి కలకత్తా జైల్లో బందీ అయిపోతాడు. శీనుని శంకర్ గా నమ్ముతున్న ఒల్డేజీ  హోంలో వృద్ధులదో  కథ. వాళ్ళందరికీ శంకర్ నాయకుడు. నీరూరు అనే ఒక వూళ్ళో వీళ్ళ భూములు లాక్కుని కూల్ డ్రింక్స్  ఫ్యాక్టరీ పెట్టేందుకు కుట్రలు చేస్తున్నాడు అగర్వాల్ (తరుణ్ అరోరా) అనే కార్పొరేట్ అధిపతి. ఈ కథ తెలుసుకున్న శీనులో పరివర్తన వస్తుంది- ఇక శంకర్ ఆశయం  కోసం శంకర్ లా అగర్వాల్ తో తలపడేందుకు సిద్దమవుతాడు...

ఎలావుంది కథ
    2014 లో తమిళంలో ఏఆర్ మురుగదాస్ విజయ్ తో తీసిన ‘కత్తి’ కి రిమేక్ కథ ఇది. కథలో మార్పేమీ చేయలేదు. రైతు సమస్య కేంద్రంగా పరిభ్రమించే యాక్షన్ మసాలా కథతో కూడిన తమిళ ఒరిజినల్ కి సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ తో బాటు, ఫిలిం ఫేర్, విజయ్ అవార్డ్స్ లలో  మొత్తం 26  అవార్డులు లభించాయి. 2018 లో మురుగదాస్ దీన్నే హిందీలో ‘ఇక్కా’ అనే టైటిల్ తో అక్షయ్ కుమార్ తో నిర్మించబోతున్నాడు. ఈ కథ చిరంజీవికి సూట య్యిందా  లేదా అన్నదే ప్రశ్న. పక్కాగా  సూటయ్యింది. రెండు పాత్రల్లో  తన ఫిక్స్డ్ ఇమేజికి తగ్గ పని దొరికింది. ఈ కథ చాలా జాగ్రత్తగా సేఫ్ సైడ్ చూసుకునే దర్శకుడు వివి వినయక్ కీ సూటయ్యింది. ఈ కథలో తండ్రి చేత నటింపజేస్తూ నిర్మాతగా బోణీ చేసిన రామ్ చరణ్ కీ వర్కౌట్ అయ్యింది. 

ఎవరెలా చేశారు  
     ఇందులో ఇతర తారాగణం ఎవరెలా చేశారని చెప్పుకోవడానికి ప్రత్యేకంగా ఏమీ లేదు. సహాయ నటులూ కమెడియన్లు సహా సీన్లు నిలబెట్టడానికి వాళ్ళ ప్రయత్నం రొటీన్ గానే చేసుకుపోయారు. అయితే ముళ్ళపూడి మార్కు మాటలతో హాస్యం పండించడానికి ప్రయత్నించడం వల్ల ఓల్డ్ లుక్ కన్పిస్తుంది. చిరంజీవి కామెడీకి కూడా ఇలాటి మాటలే వాడారు. ఈ తరహా సాత్విక డైలాగులు ఇంకా చిన్న తరహా కామెడీ  సినిమాలకైతే సరిపోతాయన్నట్టున్నాయి. సెకండాఫ్ ప్రారంభంలో పోసాని అండ్ గ్రూపుతో చిరంజీవి చేసిన సీను ఒక్కటే పక్కా మాస్ కామెడీతో బాగా పేలింది ఈ స్థాయి బిగ్ కమర్షియల్ కి తగ్గట్టుగా. 

          హీరోయిన్ కాజల్ అగర్వాల్ ది ఏమీ చెయ్యని పాత్ర. అనేక సీన్లలో బ్యాక్ గ్రౌండ్ లో అలా నిలబడి వుంటుందంతే. అయితే ఆమెతో చిరంజీవికి రోమాంటిక్ సీన్లు పెట్టకుండా, అదే పనిగా ఆమెని లవ్ లో పడెయ్యడానికి చిరంజీవి టీజ్ చేసే సీన్లు లేకుండా జాగ్రత్త పడ్డారు. ఒక మాట అనుకుని, పాటల్లోకి వెళ్ళిపోయే రోమాన్సే ఇబ్బంది లేకుండా. 

          విలన్ పాత్రధారి తరుణ్ అరోరా చాలా మైనస్ ఈ సినిమాకి. బొమన్ ఇరానీ వుండి  వుంటే మెగా స్టార్ కి దీటుగా వుండేవాడు. సినిమాలో హీరోయిన్, విలన్ పాత్రధారులు తప్ప మిగిలిన సహాయ నటులూ కమెడియన్లూ వయసులో పెద్ద వాళ్ళే. చిరంజీవి తన కాలపు నటుల్నే  పెట్టుకుని చాలా పొరపాటు చేశారు. కనీసం  కమెడియన్ లైనా నేటి వెన్నెల కిషోర్ లాంటి యంగ్ స్టర్స్ ని  తీసుకుని వుంటే ఫ్రెష్ నెస్ వచ్చేది. ఈ సినిమాలో అదేమిటో గానీ యువ ప్రాతినిధ్యమే లేదు. ఇది చాలా నిరుత్సాహం యువప్రేక్షకులకి. ఇప్పుడు మళ్ళీ ఆనాటి చిరంజీవి సినిమా చూస్తున్నట్టు వుండకూడదుగా.

          ఇక చిరంజీవి విషయానికొస్తే ఆయన రాటుదేలి  రీ ఎంట్రీ ఇచ్చారు. ఇందులో సందేహం లేదు. యువ స్టార్స్ ఆయనతో కలిసి నటించేందుకు పోటీ పడేంతగా, వాళ్ళే ఈర్ష్య పడేంతగా మేకోవర్ తో, ఫిట్ నెస్ తో నవయువకుడై తిరిగి వచ్చారు. బాస్ ఈజ్ బ్యాకే బ్యాక్ అయిపోకుండా. దొంగోడు- మంచోడు ఈ రెండు పాత్రల్లో సరిపోయారు. క్లయిమాక్స్ లో రైతుల గురించి చేసే ప్రసంగం హూందా తనాన్ని నిలబెట్టింది- ఆయనలోని రాజకీయ నాయకుణ్ణి  కాకపోయినా. కామెడీ లో అదే తన పూర్వ టైమింగ్, ఫైట్స్ లో వేగమూ  తగ్గలేదు. రెండు మాస్ పాటలకి డాన్సుల్లో మాత్రం ఇప్పటి యంగ్  స్టార్స్  చేసే  ఎరోబిక్స్ కి దూరంగా వున్నారు. వయసు రీత్యా అవసరమే గానీ- ఆ పాటలకి అంత కిక్ వచ్చిందా అన్నదే ప్రశ్న.  

          ప్రతీ సీనులో, ప్రతీ పాటలో కన్పించే డ్రెస్సింగ్ తో చిరంజీవిని మాత్రం ఎవరూ బీట్ చేయలేరు. ఎప్పుడూ అవే ఫెడెడ్ జీన్స్, డిజైనర్ టీషర్ట్స్ తో యువ స్టార్స్ ని చూసి చూసి విసిగిన కళ్ళకి,  చిరంజీవి కూల్ కాస్ట్యూమ్స్- ముఖ్యంగా మార్చిమార్చి ఆయన ధరించిన వేర్వేరు ఓవర్ కోట్స్  గ్రేస్ ఫుల్ లుక్ నిచ్చాయి. ఆయన మాస్ పనులు చేస్తూనే  జంటిల్ మాన్ గా కన్పిస్తారు. 


          దేవీశ్రీ ప్రసాద్ ఇంకో హీరో ఈ సినిమాకి. పాటలూ నేపధ్య సంగీతమూ తన ప్రాణం అన్నట్టుగా పోషించుకున్నారు. కెమెరా మాన్ రత్నవేలూ, కళాదర్శకుడు తోట తరణీ, ఫైట్ మాస్టర్లు రామ్- లక్ష్మణ్ తదితర సాంకేతికులంతా ఈ నూట యాభయ్యోవది తమకి ప్రతిష్టాత్మకం అన్నట్టుగా కృషి చేసి సత్ఫలితాచ్చారు. నిర్మాతగా రామ్ చరణ్ ఎక్కడా తగ్గకుండా రిచ్ ప్రొడక్షన్ విలువల్ని కలిపి తన తండ్రికి కానుకగా ఇచ్చారు ఈ ప్రయత్నాన్ని. 


చివరికేమిటి 
      చిరంజీవి పరీక్షకి నిలబడాల్సి రావడమే ఒక పెద్ద ఐరనీ. గ్యాప్ లేకపోతే ఈ పరీక్ష ఎదురయ్యేది కాదు. ఈ పరీక్షని  చాలా ఈజ్ తో, అసలు తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవాలని  తపన పడుతున్నట్టు ఎక్కడా కన్పించకుండా,  నెగ్గేశారు. అనుక్షణం తెరమీద ఆయన్నే పట్టి పట్టి చూస్తున్న ప్రేక్షుకుల కళ్ళు  ఈ రీ- ఎంట్రీని ముక్త కంఠంతో అంగీకరించక తప్పలేదు. అలాగే దర్శకుడు వివి వినాయక్ విషయం కూడా. చాలా ఆత్మ విశ్వాసంతో ఆయన ఇప్పుడు చిరంజీవిని హేండిల్ చేయడం, సినిమాని నిలబెట్టడం ఈ సంక్రాంతి సందడికి న్యాయం చేశాయి. అయితే రైటింగ్ సైడ్ ఓల్డ్ టైపు నడకలు పోకపోలేదు. సీన్లు ట్రెండీ గా వుండాల్సింది. నటుల్లో యువ ప్రాతినిధ్యం కూడా వుంటే ఆ  పెప్ రైటింగ్ లో కూడా వచ్చేదేమో. ఫస్టాఫ్ సీన్లు మరీ సాదాగా వున్నాయి. హాయ్ ల్యాండ్ సభలో పాల్గొన్న చిరంజీవియే చెప్పారు- తను సినిమాలు మానేసినప్పుడు  ఆరేడు ఏళ్ల  వయసున్న పిల్లలకి తను పరిచయమే లేడు-  అలాటి వాళ్ళు ఇప్పుడు టీనేజీ  కొచ్చి తనని చూసి ఇంతలా కేరింతలు కొట్టడం ఆశ్చర్య పర్చిందని. సినిమా లెప్పుడూ యూత్ కే మిఠాయి పొట్లాలు. అందుకే అవి యూత్ ఫుల్ గానే వుండాలి ఎప్పుడూ. ‘దంగల్’ లో యూత్ ఫుల్ గానే నవ్విస్తూ కవ్విస్తూ అంత భారీ మాస్- క్లాస్ కథ చెప్పారుగా! 


-సికిందర్
http://www.cinemabazaar.in

         




స్పెషల్ ఆర్టికల్-2

          (‘ఓపెనింగ్ సీనే టీజర్’ తరువాయి భాగం)
        సోషల్ మీడియాలో వైరల్ కంటెంట్ వెనుక గల సైకాలజీని సినిమా స్క్రీన్ ప్లే కి ఎలా అన్వయించుకోవచ్చో   తెలిపే ప్రసిద్ధ ‘ది న్యూయార్కర్’ మ్యాగజైన్ ఆర్టికల్ ప్రకారం ఆ పరిశోధనాంశాల్లోకి మళ్ళీ వెళితే- సోషల్ మీడియాలో కంటెంట్ వైరల్ అవడానికి కారణమయ్యే నెటిజనుల మనస్తత్వ విశ్లేషణలో తేలిన అంశాలు- 1. ఇంటరెస్ట్, 2. ఆరిస్టాటిల్ సూత్రాలు, 3. ఎమోషనల్ అప్పీల్, 4. క్వాలిటీ...ఈ నాల్గూ ఏమిటో వివరంగా చూద్దాం : ఇంటరెస్ట్ విషయానికొస్తే- ఏదైనా ఆసక్తికరంగా అన్పిస్తేనే నెటిజనులు షేర్ చేస్తారు. కంటెంట్ ఎంత సంచలనాత్మకంగా అన్పిస్తే అంత శరవేగంగా క్షణాల్లో  షేర్ అయి వైరల్ అయిపోతుంది. ఆసక్తి రేపని కంటెంట్ షేర్స్ అంతంత మాత్రంగా వుంటాయి.

         
రిస్టాటిల్ సూత్రాలు : ఒక కంటెంట్ ఆసక్తి ఎందుకు కల్గిస్తుంది? గ్రీకు తత్త్వవేత్త అరిస్టాటిల్ (క్రీపూ 384 - 322) మూడు కారణాలు వివరిస్తాడు. ఇథాస్ (ethos), పేథాస్ (pathos), లేగాస్ (logos) ఈ మూడూ కారణమౌతాయి.  ఇథాస్ నైతికతలకి సంబంధించింది; పేథాస్ ఎమోషనల్ అప్పీల్ కి సంబంధించింది; లేగాస్ లాజిక్ కి సంబంధించింది. నైతికత, ఎమోషనల్ అప్పీల్, లాజిక్ ఈ మూడు మానసిక కారణాలూ  కంటెంట్ పట్ల ఆసక్తి కలగడానికి బీజాలు వేస్తున్నాయి. అలాగే ఈ మూడింట్లో ఏ ఒకటి లోపించినా సినిమాలు ఎక్కువ మందిని ఆకర్షించే అవకాశం లేదని ఈ ఆర్టికల్ వివరిస్తోంది. విశ్వసనీయత, ప్రేక్షకులతో అనుబంధం, హేతుబద్ధత ఈ మూడూ మంచి కథకి పునాది రాళ్ళ వంటివి. 

        ఎమోషనల్ అప్పీల్ : ‘ది న్యూయార్కర్’ ఆర్టికల్  ఎమోషనల్ అప్పీల్ కి ఇలా భాష్యం చెప్తోంది- పాజిటివిటీ, ప్రేరేపణ ఈ రెండూ నెటిజనుల షేరింగ్ బిహేవియర్ ని ప్రభావితం చేస్తున్నాయి.  విషయం లేని సినిమాలు కూడా సక్సెస్ అవుతూంటాయి. కానీ ఎక్కువ మంది హీరో పాత్ర ప్రయాణంలో ఎమోషనల్ అప్పీల్ కి కనెక్ట్ అవుతారు. ఎమోషనల్ అప్పీల్ వాళ్ళ దృష్టినీ, హృదయాలనీ కట్టి పడేస్తుంది. ఎమోషనల్ గా ప్రేక్షకులకి ఏమీ ఇవ్వని హీరో పాత్ర,  ప్రేక్షకుల్లో తన పట్ల పాజిటివిటీనీ, ప్రేరణనీ కల్గించుకోదు. దీంతో  ప్రేక్షకులు తమ ఎమోషనల్ ఇన్వెస్ట్ మెంట్  పే-ఆఫ్ కాకుండా వేస్ట్ అయ్యిందే అని వెలితిగా ఫీలవుతారు.

          క్వాలిటీ : విజువల్ గా, వెర్బల్ గా క్వాలిటీ లేని కంటెంట్ షేర్ కాదు. అలాగే సినిమాలూ క్వాలిటీ కథ లేకపోతే సక్సెస్ కావు ( మనదగ్గర సక్సెస్ అయిపోతాయి!). క్వాలిటీ కథకున్న మన్నిక కలకాలం దాన్ని గుర్తుంచుకునేలా చేస్తుంది...

       ఇప్పుడు టీజర్ విషయానికొద్దాం. మన సినిమాల్లో ప్రారంభ దృశ్యాలు, లేదా ఓపెనింగ్ బ్యాంగులు ఏ సరళిలో వుంటున్నాయి? ఈ ప్రారంభ దృశ్యాలు గానీ, ఓపెనింగ్ బ్యాంగులు గానీ  పైన చెప్పుకున్న వైరల్ కంటెంట్ లా, వైరల్ కంటెంట్ సైకాలజీని పుణికిపుచ్చుకుని  వుంటున్నాయా? ప్రారంభ దృశ్యాలు, ఓపెనింగ్ బ్యాంగులు అనే భాష కంటే ఇప్పుడు కాలీన స్పృహతో టీజర్ అంటే ఎక్కువ సూటిగా మనసులో నాటుకుని, ఆ దిశగా సృష్టించుకునేందుకు ప్రేరణ అవుతుంది. సినిమాలకి ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ కంటెంట్ లా గంగవెర్రులెత్తిస్తే ఆ సినిమా ఏ స్థాయిలో వుంటుందో గత వ్యాసంలో వివరించుకున్న ‘డిస్కో డాన్సర్’ దృష్టాంతమే చాలు- ఆనాడు అప్పటికే వైరల్ అయిన ఆ సూపర్ హిట్ సాంగ్ తో ఓపెనింగ్ పిచ్చిగా పిచ్చిగా వైరల్ కంటెంటే! ఆ టీజర్ ఎక్కుపెట్టిన బాణంలా ప్రేక్షకుల హృదయాంతరాళ్ళల్లో సూటిగా నాటుకుపోయి లాక్కెళ్ళింది. సినిమా రాళ్ళూరప్పల పాలు కాలేదు.


          బయట చేసేపనే సినిమాలోనూ చేసుకుంటే మంచిదని  ‘ది న్యూ యార్కర్’ వ్యాసం తేల్చి చెబుతున్న సారాంశం. బయటంతా  సోషల్ మీడియాలో కంటెంట్ ని వైరల్ బాట పట్టించడానికి ఏ సైకాలజీ మనకి పనికొస్తోందో అదే  సైకాలజీని సినిమాల్లోనూ ఉపయోగిస్తూ కథలు చేసుకోవాలిగా? కథ చెప్పే టెక్నిక్ ని సినిమాలు సోషల్ బిహేవియర్ లోంచి  కూడా నేర్చుకోవాలిక. ఇంకా కాలం చెల్లిపోయిన పాత నడకలు నడవకుండా, కొత్త నడకల్ని ఎవరికి వాళ్ళు కనిపెట్టి ఆశ్చర్య పరుస్తూండాలి. తెలుగు సినిమాల ఓపెనింగ్ బ్యాంగులు వ్యాపార దృక్పథంతో వుండడం లేదని గత వ్యాసంలో చెప్పుకుందిందుకే. కాలంతో సంబంధం లేకుండా కేవలం క్రియేటివ్ ప్రదర్శనలతో అవి వెలవెలబోతున్నాయి. కాలం అంటే ఇప్పటి మార్కెట్. క్రియేటివిటీ అన్న పదం ఎప్పుడూ అపార్ధాలకి లోనవుతూ వుంది. కమర్షియాలిటీ  పూత  లేని క్రియేటివిటీ ఒక క్రియేటివిటీయే అన్పించుకోదు  కమర్షియల్ సినిమాలకి సంబంధించి. కమర్షియాలిటీ పూతని మార్కెట్టే నిర్ణయిస్తుంది. మార్కెట్ నుంచే కమర్షియల్ విలువల్ని తీసుకోవాలి. ఈ మార్కెట్ యాస్పెక్ట్ లో మిళితమై వుండే కమర్షియాలిటీని కాలమే అందిస్తూ వుంటుంది ఎప్పటికప్పుడు- ఇప్పుడు చెప్పుకుంటున్న సోషల్ మీడియాలో వైరల్ కంటెంట్ క్రేజ్ కి లాగే- ఈ క్రేజ్ వెనకాలున్న సైకాలజీకి లాగే. 
                                                                ***

       ‘డిస్కో డాన్సర్’ టీజర్ ఒక్కటే  జిందా తిలిస్మాత్ కాదు. అన్ని సినిమాలకీ అదే వర్తించదు.  ఆ టీజర్ నేరుగా కథ చెప్పేస్తోంది. అంటే థీమాటిక్ టీజర్ అన్నమాట అది. అన్ని సినిమాలకీ ఇదే పెట్టుకుంటే వికటిస్తుంది. అన్ని కథలకీ ఇదే కుదరదు కూడా. కథని బట్టి, జానర్ ని బట్టి వేర్వేరు  టీజర్లు వుంటాయి. అవేమిటో చూద్దాం –ఈ సందర్భంగా హాలీవుడ్ ఓపెనింగ్ సీన్లు ఎలా వుంటున్నాయా అని ఇప్పటి ఎవేర్ నెస్ తో టీజర్స్ గా పరిశీలిస్తే – సంభ్రమాశ్చర్యాలకి లోనవక తప్పదు. వాళ్ళు టీజర్లు ఎప్పట్నించో ప్రయోగిస్తున్నారు!  కాకపోతే వాటిని టీజర్స్ అనలేదు. ఓపెనింగ్ ఇమేజ్ అన్నారు. ప్రేక్షకుల సంగతి దేవుడెరుగు, ముందు స్క్రీన్ ప్లే ప్రారంభంలో స్టూడియో ఎగ్జిక్యూటివ్ ని కట్టిపడెయ్యాల్సిన అగత్యముంది- అందుకని మొదటి పేజీలోనే ఆ సబ్జెక్టు ఇమేజిని ప్రతిష్టించడం మొదలెట్టారు. పదీ పదిహేను పేజీల్లోగా స్క్రిప్టుతో ఎగ్జిక్యూటివ్ ని ఆకట్టుకోవాలనే ఎత్తుగడకి దీటుగా- అంతవరకూ కూడా వెయిట్ చేయకుండా మొదటి పేజీలో థీమాటిక్ ఇమేజితో థ్రిల్ కల్గించడం మొదలెట్టారు.
                                    
           ఈ ఓపెనింగ్ ఇమేజిలు ఎలా వుంటున్నాయో చూద్దాం. ఓపెనింగ్ ఇమేజిని  1975 లోనే దర్శకుడు స్టీవెన్  స్పీల్ బెర్గ్ తన క్లాసిక్ మూవీ ‘జాస్’ తో  ప్రవేశపెట్టినట్టు చెబుతున్నారు. కాకపోతే అది సరిగ్గా కుదర్లేదు. క్లుప్తత కరువయ్యింది. టైటిల్స్ పడుతున్నప్పుడే ఇమేజి స్టార్ట్ అయిపోతుంది- సముద్ర గర్భంలో జలచరాల్ని చూపిస్తూ- బ్లూ టింట్ లో-  అండర్ వాటర్ షూట్ తో. టైటిల్స్  పూర్తవగానే విజువల్స్ సముద్ర గర్భంలోంచి బీచి పైకి మారుతాయి. చూస్తే అది రాత్రిసమయం. ఆ సమయంలో బీచిలో ఒక గ్రూపు పార్టీ చేసుకుంటూ వుంటారు. నిశిరాత్రి సముద్రపుటొడ్డున పార్టీ జరుగుతున్న వాతావరణమంతా  ఒక మిస్టీరియస్ ఫీలింగునిస్తుంది- ఏదో జరగబోతుందన్నట్టుగా... సరే, ఆఖరికి ఉన్నట్టుండి సముద్రంలోంచి సొరచేప దూసుకొచ్చి దాడిచేసి ఒకమ్మాయిని లాక్కెళ్ళి పోతుంది...ఇదంతా ఎక్కువ సేపు సీనుగా సాగుతుంది. కానీ టైటిల్స్ తో ముందు సముద్ర గర్భం చూపిస్తూ, అక్కడ్నించి కెమెరా సముద్రపుటొడ్డుకి పొజిషన్ తీసుకోవడమనే విజువల్ కంటిన్యూటీ ముంచుకురానున్న ఉపద్రవాన్ని సూచిస్తోంది. అది సముద్ర గర్భం లోంచే ముంచు కొచ్చింది సొర చేప రూపంలో. ఇలా ఈ  ఓపెనింగ్ ఇమేజి ఇప్పుడు సోషల్ మీడియాలో షేరయ్యే బాపతు వైరల్ కంటెంట్ నే  పోలివుంది- అదే సైకలాజికల్ కనెక్ట్ తో. ‘డిస్కో డాన్స’ ది  అరటి పండు వొల్చి చేతిలో పెట్టినట్టు కథ విప్పేస్తున్న ‘థీమాటిక్ టీజర్’ అయితే, ఈ ‘జాస్’ లో మనం చూసేది నర్మగర్భంగా, సంకేత భాషలో కథనం చేస్తున్న ‘ప్లాట్ టీజర్’ అనవచ్చు. 

     ఇలాటిదే మరొకటి : 2000 లో  క్రిస్టఫర్ నోలాన్ తీసిన  ‘మెమెంటో’ లో చూస్తే,  ‘జాస్’ లో లాగే టైటిల్స్ తో ఇమేజి మొదలవుతూ,  ఒక పోలరాయిడ్ ఫోటోలో మనిషి మృతదేహం క్రమంగా ఫేడ్ అవుటయ్యే స్టాటిక్ షాట్ పడుతూంటుంది. ఆ ఫోటో ప్రింట్ పూర్తిగా తెల్లగా మారిపోయి- టైటిల్స్ పూర్తయి- కెమెరా పట్టుకున్న క్యారక్టర్ ఫిలిం ప్లేట్ ని లోడ్ చేస్తూ ఓపెనవుతాడు...ఈ మొత్తం దృశ్యం రివర్స్ లో జతుగుతున్నట్టు మనకి అర్ధమై ఎన్నో ప్రశ్నల్ని  రేకెత్తిస్తుంది ముందు ముందు  చూడబోయే కథ పట్ల...  దీన్ని మురుగదాస్ తమిళ హిందీ భాషల్లో ‘గజినీ’ గా తీశాడు. తెలుగులో ఇదే పేరుతో డబ్ అయ్యింది. మురుగ దాస్ మేకింగ్ లో ఈ ఓపెనింగ్ ఇమేజి వుండదు. ఏముందంటే- బ్లూ టింట్ లో మనిషి మెదడు అంతర్భాగ కదలికలతో టైటిల్స్ ప్రారంభమవుతాయి. టైటిల్స్ పూర్తయ్యాక షార్ట్ టర్మ్ మెమరీ లాస్ మీద పాత్రలు చర్చిస్తాయి. ఇలా ‘జాస్’ లో, ‘మెమెంటో’లో వున్నలాంటి  టైటిల్స్ నుంచి సీన్లోకి వచ్చే విజువల్ కంటిన్యూటీ ఇక్కడ లేదు. సీను ద్వారాలు తెరచుకుని టైటిల్స్ కంటెంట్ సీన్లోకి ప్రవహించలేదు. ‘జాస్’ లో టైటిల్స్ కంటెంట్ లోంచి సొర చేప సీన్లోకి వచ్చి దాడి చేసినట్టో, ‘మెమెంటో’లో టైటిల్స్ కంటెంట్ లోని పోలరాయిడ్ ఫోటో గ్రాఫ్ పూర్వపు ఫిలిం స్థితికి మారుతూ సీన్లోకి జొరబడినట్టో మురగదాస్ క్రియేషన్ లేదు. టైటిల్స్ కంటెంట్ లోని మనిషి మెదడు అంతర్భాగ చిత్రణ కట్ అయిపోయి – డిటాచ్డ్ గా వేరే సీనులో పాత్రలు షార్ట్  టర్మ్ మెమరీ లాస్ గురించి చర్చించడం  మొదలవుతుంది. ఇది ఓపెనింగ్ బ్యాంగ్ కాకపోగా, వైరల్ కంటెంట్ లాంటి టీజర్ కూడా కాలేకపోయింది. క్రిస్టఫర్ నోలాన్ మర్డర్ అనే తీవ్రాసక్తి కల్గించే ఓపెనింగ్ ఇమేజితో కథకి కనెక్ట్ చేస్తూ ప్రారంభిస్తే, మురుగదాస్ టైటిల్స్ కంటెంట్ తో, చర్చతో, ఇంకా ఉపోద్ఘాతం చెప్పే దగ్గరే ఉండిపోయాడు. ఇది థీమాటిక్ టీజర్ కాలేదు సరికదా, ప్లాట్ టీజర్ కూడా కాలేకపోయింది. ఇందుకే మన సినిమాల్లో ఓపెనింగ్ సీన్లు, బ్యాంగులు అర్ధం లేకుండా వుంటున్నాయని చెప్పేది. 

          డేవిడ్ ఫ్లించర్ తీసిన ‘ఫైట్ క్లబ్’ (1999) కూడా మురగ దాస్ చేసిన పొరపాటుని  ఎత్తి చూపిస్తుంది. ఇందులో ఎలా వుంటుందంటే, మనిషి మెదడు అంతర్భాగ కదలికలతో టైటిల్స్ పడుతూ పడుతూ బ్లాస్ట్ అయి,  పాత్ర క్లోజప్ తో సీను మొదలవుతుంది అతడికి ముచ్చెమట్లు పట్టేస్తూ! అతను సెకండ్ హీరో ఎడ్ నార్టన్. అతడి  మెదడులో భయాందోళనలే నన్నమాట ఆ మెదడు అంతర్భాగపు కదలికలు. అవి ముఖం మీదికి చెమట రూపంలో తేలాయన్న మాట!  మెదడు లోంచి ముఖం పైకి ఈ విజువల్ కంటిన్యూటీ, టైటిల్స్ కంటెంట్ లోంచి సీన్లోకి భయాందోళనలు ప్రవహించి కలిసిపోవడమూ - ఇదీ అసలైన ఓపెనింగ్ బ్యాంగ్ అన్నా, ఓపెనింగ్ ఇమేజి అన్నా- లేదా టీజర్ అన్నా. దీంతో అయిపోలేదు- ఎందుకతడికి భయాందోళనలతో చెమట్లు పట్టేస్తున్నాయి? ఎందుకంటే,  అతడి నోట్లో పిస్తోలు కుక్కి నించున్నాడొకడు! తను చావబోతున్నాడు! ఇదీ కదా వైరల్ కంటెంట్ వున్న టీజర్ అంటే! ఇది కూడా ప్లాట్ టీజరే. 

          దేనికీ కారణం కాని  సీను ఒక సీనే కాదు అన్నట్టు - ఇదీ మురగదాస్ టైటిల్స్ కంటెంట్ వ్యవహారం. క్రిస్టఫర్ నోలాన్ అలా ఎందుకు తీశాడో అతను  ఆలోచించలేదు. దాదాపు అన్ని సినిమాల్లో ఇలా ఉత్సుకత రేపని బలహీన ప్రారంభాలే వుంటున్నాయి.  హాలీవుడ్డీయులు  తీసే ఏ సీనుకైనా అర్ధం లేకుండా వుండదు. వాళ్ళు చేతిలో పెన్నూ కెమెరా వున్నాయి కదాని పవిత్రమైన స్క్రీన్ స్పేస్ నీ, స్క్రీన్ టైమునీ దుర్వినియోగం చెయ్యరు. కవిత్వంలో వుండే సంక్షిప్తతని తెర మీద సాధించడానికి ప్రయత్నిస్తారు. జాస్ అయినా, మెమెంటో అయినా, ఫైట్ క్లబ్ అయినా ఆ ప్రారంభాలు తెర మీద పోయెట్రీలే. టీవీల్లో  టీజర్స్ చూసి ఆ ఉత్సాహంతో సినిమా కెళ్తే గజినీ లోలాగా  సముచితం కాని విధంగా, చప్పగా వుంటున్నాయి మన ప్రారంభాలు. ప్రారంభమే ఒక టీజరవ్వాలి. దాన్నందుకుని తారాజువ్వల్లా ఆడియెన్స్ ఆ సినిమా కథా ప్రపంచంలోకి దూసుకెళ్ళి పోవాలి. దీన్నెవరు కాదంటారు?
                                         ***
           ప్లాట్ టీజర్ తర్వాత  కామెడీ టీజర్ ఎలా వుంటుందో చూద్దాం. మొన్న వచ్చిన ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ అనే కామెడీ ఓపెనింగ్ సీను జానర్ తో సంబంధం లేని కాల్ మనీ వ్యవహారం లాంటి కామవికార విషయంతో, ఆ తర్వాత అతి కిరాతకమైన చైన్ స్నాచింగ్స్ సీనుతో రసభంగం కల్గిస్తూ రచయిత మానసిక స్థితిని బయట పెడుతూ వుంటుంది. దీని తమిళ ఒరిజినల్ ‘తిరుడాన్  పోలీస్’ లో నేరుగా హీరో అతడి ఫ్రెండ్ (ఇద్దరూ పోలీసు అధికారుల కొడుకులే) ఏదో తేడా వచ్చి రోడ్డు మీద కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్లోకి పరుగెత్తి,  అక్కడా కొట్టుకుని గలాభా సృష్టించి, మళ్ళీ బయటికి పారిపోతూ కొట్టుకుని... ఇలా ఓపెనింగ్ సీను తోనే కామెడీ జానర్ ఎస్టాబ్లిష్ అయిపోతుంది. రీమేక్ ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ లో ఈ హాస్యరసం గల్లంతై  జానర్- టీజర్ రెండూ కూడా  కాకుండా పోయాయి. 

          కనీసం ఒకటి చేసి వుండాల్సింది- ఏమిటంటే, ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ ని  లాజిక్ లేని ఒక మైండ్ లెస్ కామెడీ గా మార్చేసినప్పుడు (మత్తు ఇంజెక్షన్ లిచ్చి మనుషుల చేతులు నరుక్కుని వెళ్ళిపోవడం) ఆ మైండ్ లెస్ కామెడీకి  ప్రారంభం నుంచే ప్రేక్షకుల్ని మానసికంగా సిద్ధం చేసి వుండాల్సింది. అలాటి ఒక మైండ్ లెస్ కామెడీ సీనుతోనే  సినిమా ప్రారంభించి వుంటే- తామెలాటి  సినిమా చూడబోతున్నారో ప్రేక్షకులకి ముందే అర్ధమైపోయి సర్దుకునే అవకాశం వుండేది.  ‘దేర్ ఈజ్ సంథింగ్ ఎబౌట్ మేరీ’ అనే సూపర్ హిట్ రోమాంటిక్ కామెడీ వుంది. ఇది మైండ్ లెస్ కామెడీయే. ప్రేక్షకులు తిట్టుకోకుండా ఇది మైండ్ లెస్ కామెడీయేరా  బాబూ, క్షమించండి  మమ్మల్నీ – అన్నట్టు  ముందే జంట దర్శకులు పీటర్ ఫరెల్లీ- బాబీ ఫరెల్లీలు ఒక తలాతోకా లేని కామెడీ సీనుతో ప్రారంభోత్సవం  చేస్తారు. హై స్కూలు పిట్ట గోడ మీద తీరి కూర్చుని ఒకడు ఏదో పాడుతూ, ఇంకొకడు వాయిస్తూ బుర్రకథ చెబుతున్నట్టు ప్రారంభమవుతుంది ఓపెనింగ్ సీను. హిందీలో రోహిత్ శెట్టి తీసిన హిట్టయిన ‘గోల్ మాల్’ మైండ్ లెస్ కామెడీ సిరీస్ సినిమాల ప్రారంభాలు కూడా ఇలాగే వుంటాయి మైండ్ లెస్ గా. సమస్య ఎక్కడ వచ్చిందంటే, కామెడీ ఏదైనా ఒకటే అనే తప్పుడు అవగాహన వల్ల. లాజిక్ వుండని మైండ్ లెస్ కామెడీలు  వేరనీ,  దీన్ని అందరు ప్రేక్షకులూ భరించలేరనీ, అందుకే ముందే  ఈ విషయం స్పష్టం చేస్తూ అలాటి మైండ్ లెస్ కామెడీ సీను టీజర్ గా వేయాలనీ గ్రహించకపోవడం. గ్రహించివుంటే ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’  ఓపెనింగ్ అలా అర్ధం లేకుండా వుండేది కాదు. ఆ తర్వాత టోన్ (స్వరం) మారిపోయిన ఆ కామెడీ కూడా మైండ్ లెస్ కామెడీ అవతారమెత్తి అందుకు ముందే సిద్ధంగా లేని ప్రేక్షకుల్ని హడలెత్తించేది కాదు. అనుక్షణం ప్రేక్షకుల మనసెరిగి సినిమానే కాదు, సీన్లు కూడా తీయాలనేది ఇందుకే. ఒక స్క్రీన్ ప్లే ట్యూటర్ అన్నట్టు- స్క్రీన్ ప్లే రచన ఎంత ప్రమాదకరమైన వ్యవహారమంటే, అప్రమత్తంగా వుండకపోతే ఏ క్షణంలో నైనా  ప్రేక్షకుల్ని కోల్పోవచ్చు! 

          కామెడీ టీజర్ గా శుభ్రంగా ‘తిరుడాన్ పోలీస్’ లో లాంటిది, మైండ్ లెస్ కామెడీకి .  ‘దేర్ ఈజ్ సంథింగ్ ఎబౌట్ మేరీ’ లో లాంటిదీ  వేసుకుంటే సరిపోతుంది.

(మిగతా రేపు)
-సికిందర్


8, జనవరి 2017, ఆదివారం

స్పెషల్ ఆర్టికల్!

సినిమా రచన పక్కా వ్యాపారం చేసుకునే కళయినప్పుడు, పక్కా వ్యాపార దృక్పథంతోనే ఓపెనింగ్ సీను వుండాలని  తెలిసిందే గానీ, తెలిసినట్టు వుండడం లేదు చిత్రీకరణలు. సినిమా వ్యాపారం కోసం ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్, ఆడియో ఫంక్షన్ మొదలైన ప్రచార సాధనాలుపయోగించినట్టే, సినిమా కథనీ  ఒక ‘టీజర్’ తో మొదలెడితే అది ఆ కథని ప్రేక్షకులకి హాట్ కేకులా అమ్ముడుబోయే సరుకుగా మార్చేసే వీలుంది. సినిమా ప్రచారంకోసం ప్రసారం చేసే టీజర్ ఆ సినిమా మొత్తంగా ఏమిటో, దేని గురించో చెప్పవచ్చు. కథకి ఉపయోగించే ‘టీజర్ సీను’  ఆ చెప్పాలనుకున్న కథకి ప్రేక్షకులు వెంటనే అతుక్కుపోయేలా చేస్తుంది. హాలీవుడ్ లెక్కల్లో స్క్రీన్ ప్లే మొదటి పదీ పదిహేను పేజీల్లో ఆకట్టుకోకపోతే ఆ స్క్రీన్ ప్లేని నిర్మాతలు తిరస్కరిస్తారు. టాలీవుడ్ లెక్కల్లో  ఇంటర్వెల్ సమయం ముంచుకొస్తున్నా కథ ఆకట్టుకోకపోతే  నిర్మాతలకి ఏమీ అన్పించక పోవచ్చుగానీ  ప్రేక్షకులకి ఏదో అన్పిస్తుంది. ఇలాకాకుండా మొదటి పేజీతో నే, లేదా మొదటి షాటుతోనే, లేదా మొదటి సీనుతోనే, ఇంకా లేదా మొదటి  సీక్వెన్సు తోనే అయస్కాంతంలా కథకి ఆకర్షిస్తే అంతకన్నా బలమైన చిత్రణ వుండదు- పైగా ఎన్నో విధాలుగా కాలం కూడా పొదుపయ్యే అవకాశం వుంటుంది- స్క్రీన్ టైముని సేవ్ చేసుకునే అవకాశం.  


      ఆల్రెడీ తెలుగు సినిమాల్లో ఓపెనింగ్ బ్యాంగులు లేవా? వున్నాయి. వాటితో ప్రేక్షకుల్ని కట్టి పడెయ్యడం లేదా? లేదు. ఎందుకులేదు? వాటితో  వ్యాపార దృక్పథం కాక గొప్ప క్రియేటివిటీ ఏదో ప్రదర్శించుకోవాలన్న కోణం వుండడం వల్ల. గ్లామర్ కి కళ తోడయినప్పుడే రాణిం చినట్టు, పక్కా వ్యాపార యావ వున్నప్పుడే కమర్షియల్ సినిమా క్రియేటివిటీ క్రియేటివిటీ అన్పించుకుంటుంది. లేకపోతే కొందరు మేధావులు చూసే ఆర్ట్ సినిమా హస్తకళా నైపుణ్యం అన్పించుకుంటుంది. తెలుగు సినిమాల ఓపెనింగ్ బ్యాంగులు  హస్తకళా నైపుణ్యాలు. కమర్షియల్ బ్యాంగు లిచ్చే లెక్క వేరే వుంటుంది. అదే తెలుసుకోబోతున్నాం.

          ప్రేక్షకుల్ని థియేటర్లకి పరిగెత్తించడానికి రకరకాల క్రేజీ టీజర్లు ఛానెళ్ళలో వదుల్తారు. తీరా ఆ సినిమాల్ని చూస్తే బలహీనంగా ఎత్తుకుంటాయి కథని. టీజర్లు చూసి ఏ ఉత్సాహంతో ప్రేక్షకులు థియేటర్లకి వస్తారో, ఆ ఉత్సాహం రెట్టింపయ్యేలా సినిమా ఓపెనింగ్ దృశ్యాలున్నప్పుడే బయటి టీజర్లకి అర్ధంపర్ధం వుంటుంది. అడ్వర్టైజింగ్ కొత్త పుంతలు తొక్కుతూంటే, సినిమా మేకింగ్ మాత్రం అదే పాత హొయలు పోతోంది. కొందరంటారు- రేపు టీజర్ కి కట్ చేయాల్సిన షాట్లని దృష్టిలో పెట్టుకునే సీన్లు తీస్తున్నామని. టీజర్! టీజర్ ని దృష్టిలో పెట్టుకుని షాట్లు! కథని దృష్టిలో పెట్టుకుని కాదు! ఫోటో షూట్స్ తోనూ ఇలాగే చేస్తున్నారు. పోస్టర్ల కోసం చేసే ఈ క్రేజీ ఫోటో షూట్ దృశ్యాలు సినిమాల్లో  వుండవు. ఇలా ఆధునిక వ్యాపార దృక్పథం సినిమా చుట్టే కన్పిస్తుంది- సినిమాలోపల పక్కా వ్యాపార దృక్పథం ఏమీ వుండదు. 



         ఒకప్పుడు టీవీ ఛానెళ్ళే లేనప్పుడు, థియేటర్ లకి మాత్రమే కొన్ని సినిమాల ట్రైలర్లు వచ్చేవి. థియేటర్లో ట్రైలర్లు చూసి థియేటర్లకే  వెళ్లి సినిమాలు చూసేవాళ్ళు. రెండూ అక్కడే కానిచ్చుకోవడం.  కొన్ని సినిమాలు ఆ ట్రైలర్లు ఇచ్చే కిక్కు కంటే ఎక్కువ కిక్కుతో కథని ఎత్తుకునేవి. అలాటి ఒక సినిమా 1982 లో మిథున్ చక్రవర్తి మ్యూజికల్ సూపర్ హిట్ ‘డిస్కో డాన్సర్’ (బాలకృష్ణతో ‘డిస్కో కింగ్’). విడుదలకి ముందే అన్నీ సూపర్ హిట్ సాంగ్సే బప్పీ లహరీ సంగీతంలో. సినిమా ప్రారంభమే డిస్కో డాన్సర్ సిగ్నేచర్ ట్యూన్ తో ఉత్సాహపరుస్తూ టైటిల్స్ పడతాయి- టైటిల్స్ పూర్తవగానే వెంటనే చాలా సర్ప్రైజింగ్ గా ఇంకో పాటతో కిక్కిస్తూ దృశ్యం  మొదలవుతుంది. బయట వింటూ వున్న ఈ పాట ఇప్పుడే వుంటుందని ఎవరూ వూహించరు. చాలా ఆనందపడి పోతారు. ఇంతే కాదు,  ఇంకా సర్ప్రైజింగ్ గా ఈ పాటలో సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా కన్పిస్తాడు! రాజేష్ ఖన్నా చిన్నప్పుడు మిథున్ చక్రవర్తి తండ్రిగా  అప్పీయరెన్స్ ఇస్తాడు! ఈ రాజేష్ ఖన్నా- చిన్నప్పటి మిథున్ చక్రవర్తిల మీద వీధిలో చుట్టూ జనం మధ్య సూపర్  హిట్ సాంగ్ మొదలవుతుంది. ఈ సాంగ్ ద్వారా (ఓపెనింగ్ సీన్ ద్వారా) మిథున్ చిన్నప్పుడే ఒక నిరుపేద స్ట్రీట్ సింగర్ కొడుకనీ, తనకీ ఆ విద్య అబ్బిందనీ మనకి తెలిసేలా చేస్తాడు దర్శకుడు. అంతే కాదు, వీధిలో తండ్రితో కలిసి పాడుతూంటే, ఎదుటి బంగళా లోంచి  రిచ్ బాలిక (హీరోయిన్ అన్నమాట) చూస్తూంటుంది...  ఇంతకీ ఆ సూపర్ హిట్ పాట – ‘గోరోఁ కీ నా కాలోఁ కీ,  యే దునియా హై దిల్ వాలోఁ కీ...(తెల్లోళ్ళదీ కాదు, నల్లోళ్ళదీ కాదు, ఈ లోకం మనసున్నవాళ్ళదే!). ఇలా పాటతో కలిపి కథ చెబుతూ ఈ ఓపెనింగ్ సీనుని ఒక పరిపూర్ణ ఈవెంట్ గా మార్చేశాడు దర్శకుడు బి. సుభాష్. 


          ప్రారంభ సీనుని  ఒక ఈవెంట్ గా మార్చడం! మళ్ళీ ఒక ‘గాడ్ ఫాదర్’ లోనే చూస్తాం! కానీ  ఈ సుభాష్ ఓపెనింగ్ సీను నేడు  చెప్పుకుంటున్న ఓపెనింగ్ బ్యాంగే! కమర్షియల్ విలువలతో కూడిన ఈ ఓపెనింగ్ బ్యాంగు ఒక టీజర్ లా పనిచేస్తోంది కథకి! ఇది చూసింతర్వాత ఇక కథ మొత్తం చూడాలని ఉత్సుకతకి లోనవకుండా వుంటారా ప్రేక్షకులు! దటీజ్ రియల్ టీజర్ అన్నమాట స్టోరీకి!  

          టీజర్ సినిమాలో ఉండాలే గానీ, బయట ఎన్నుంటే ఏం లాభం. ఒకసారి  ‘డిస్కో డాన్సర్’ వీడియో యూ ట్యూబ్ లో చూస్తే బాగా అర్ధమవుతుంది  స్టోరీ టీజర్ మహత్తు. ఎప్పట్నుంచో  టీజర్ పేరుతో కాదుగానీ, ఒక క్యాచీ ట్యూన్ గల పాటతో తో సినిమా ప్రారంభిస్తే కమర్షియల్ గా బాగా వర్కౌట్ అవుతుందని ఎందరికో చెప్పి చూశాడీ వ్యాసకర్త. ఇందులోని మజా వాళ్ళకి తెలీడం లేదు. బోరు ఫీలవుతూ సినిమాలకి ఆలస్యంగా వచ్చే వాళ్ళు కూడా ఆ పాట చూడాలని ముందే వచ్చేస్తారు...


          నేటి సినిమాల క్రియేటివిటీ వీలైనన్ని కోణాల్లో కమర్షియాలిటీలో భద్రతని చూసుకోవాల్సి వుంటుంది. ఇదివరకు చెప్పుకుంటూ వున్న ‘తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్’ వ్యాసాల్లో భాగంగా సినిమా కథకి క్రియేటివ్ యాస్పెక్ట్ తో బాటు, మార్కెట్ యాస్పెక్ట్ కూడా వుండాలని చెప్పుకున్నాం. తమలోకంలో తాముండి  రాసే వాళ్ళకి, తీసే వాళ్ళకీ ప్రపంచ పోకడ అంతగా పట్టదు. తాము రాసిందే, తీసిందే ఎప్పటికీ చెల్లుబాటు అవుతుందను కుంటారు. కానీ మార్కెట్ ఎప్పటి కప్పుడు మారిపోతూ వుంటుంది. సినిమా రంగాన్ని కాస్సేపు పక్కన పెడదాం, పత్రికా రంగాన్నే తీసుకుంటే అది క్షణం క్షణం సోషల్ మీడియాతో పోటీ పడాల్సి వస్తోంది. పత్రికలే కాకుండా ఛానెళ్ళూ సోషల్ మీడియా వేగాన్ని అందుకోవడానికి ఉరుకులు  పరుగులు తీయాల్సి వస్తోంది. వార్త వీటికి అందేలోగా సోషల్ మీడియాలో ప్రపంచం చుట్టేస్తోంది. పైగా మీడియా సంస్థలకి ఏ వార్త ఎలా ఇవ్వాలో ఒక పాలసీ వుంటుంది. స్వేచ్చా విహంగమైన సోషల్ మీడియాకి ఏ పాలసీ వుండదు గనుక నిజాలు ఆ వేదికపై బయటపడుతూంటాయి. ఇది కూడా తలనొప్పిగా మారింది మీడియా సంస్థలకి. అయితే నిజాల కంటే అబద్ధాలే సులువుగా బాగా త్వరగా అర్ధమవుతాయి కాబట్టి ఈ వంకతో సోషల్ మీడియా అభిశంసనలకి గురవుతూంటుంది సదా. అయినా ఒక్కోసారి మీడియా సంస్థలకి శృంగభంగం తప్పడం లేదు- ఎలాగంటే, ఇటీవలే ఒక తెలుగు ఛానెల్లో ఒక ‘వివాదాస్పద అంశం’ పైన అన్ని పక్షాల వాళ్ళూ కూర్చుని వేడివేడిగా వాదించుకుంటున్నారు. అంతలో ఒకాయన ఫోన్ చేసి, అదేం చర్చ- ఈ అంశంపైన కోర్టు స్టే ఇస్తే ఇక ఒకర్నొకరు నిందించుకునే పాయింటు ఎక్కడిది – అనేసరికి అందరి పరువూ పోయి తెల్లమొహాలేశారు యాంకరు సహా! వేగంలో, వేడిలో కోర్టు స్టే ఇచ్చిన విషయం కూడా తెలుసుకోకుండా భారీ చర్చపెట్టుకుని తమ విశ్వసనీయతే కోల్పోయారు. ఇదంతా సోషల్ మీడియాతో ఎడతెగని పోటీ వల్లే!

           సినిమా రంగం కూడా దీనికి అతీతం కాదు.
ఇటీవల ‘న్యూ యార్కర్’  మ్యాగజైన్ ఒక ఆర్టికల్ ని ప్రచురించింది. సోషల్ మీడియాలో షేర్ చేసే వైరల్ కంటెంట్ ఫండమెంటల్స్ ని వివరిస్తూ రాసిన ఈ ఆర్టికల్ సినిమా రైటర్స్ కి పనికొస్తుందని తెలిపింది. వైరల్ కంటెంట్ ఫండమెంటల్స్ మీద  రీసెర్చర్లు ఇంకా పరిశోధనలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో అసంఖ్యాక నెటిజనులు వైరల్ కంటెంట్ ని షేర్ చేయడం వెనుక గల సైకలాజీ ఏమిటన్న దాని  మీద ఈ పరిశోధనలు జరుపుతున్నారు. ఇప్పటికి వెలువడిన ఫలితాలు  విజయవంతమైన స్క్రీన్ ప్లేలు రాయాలంటే ఇక పైన ఏం చేయాలో సూచిస్తాయి.

        సోషల్ మీడియాలో కొన్ని కంటెంట్స్ మాత్రమే వైరల్ అవుతూ, కొన్నిఅంతగా షేర్ అవకపోవడం వెనకాల నెటిజనుల సైకాలజీ ఏమిటంటే ఒకటి- ఆ కంటెంట్ ఇంట్రస్టింగ్ గా వుండాలి, రెండు- అరిస్టాటిల్ సూత్రాలకి న్యాయం చేయాలి, మూడు- ఎమోషనల్ అప్పీల్ వుండాలి, నాల్గు- క్వాలిటీ వుండాలి...ఈ నాల్గు ఎలిమెంట్స్ వున్న కంటెంట్ మాత్రమే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

(మిగతా రేపు)
-సికిందర్
http://www.cinemabazaar.in