రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

17, జూన్ 2016, శుక్రవారం

షార్ట్ రివ్యూ...





స్క్రీన్ ప్లే- మాటలు- దర్శకత్వం : మోహనకృష్ణ ఇంద్రగంటి

తారాగణం : నాని, సురభి, నివేద థామస్, శ్రీనివాస్ అవసరాల, రోహిణి, ‘వెన్నెలకిశోర్, తనికెళ్ళభరణి, ‘సత్యంరాజేష్ తదితరులు
కథ : డేవిడ్ నాథన్, సంగీతం : మణిశర్మ, ఛాయాగ్రహణం : పి.జి.విందా
బ్యానర్ : శ్రీదేవి మూవీస్, నిర్మాత : శివలెంక కృష్ణప్రసాద్
విడుదల :  17 జూన్, 2016
                       ***
            ఎనిమిదేళ్ళ క్రితం ‘అష్టాచమ్మ’ లో నానిని పరిచయంచేసిన మోహనకృష్ణ ఇంద్రగంటి తిరిగి నానితో ‘జంటిల్ మన్’ అనే రోమాంటిక్ సస్పన్స్ జానర్ ని టచ్ చేయడం ఇద్దరికీ కొత్తే. ‘చిన్నోడు –పెద్దోడు’,  ‘ఆదిత్య -369’,  ‘వంశానికొక్కడు’, ‘మిత్రుడు’ వంటి సినిమాలు నిర్మించిన శివలెంక కృష్ణ ప్రసాద్ ఎనిమిదేళ్ళ తర్వాత  ఈ రోమాంటిక్ కి సస్పెన్స్ ని నిర్మించడం తనకీ కొత్త జానరే.  ఖచ్చితంగా ఇలాటి స్క్రిప్టులు తెలుగు రచయితలూ దర్శకుల నుంచి రావు కాబట్టి ఇది డేవిడ్ నాథన్ అనే తమిళ రచయిత  అందించిన స్క్రిప్టు. ఇక చాలా కాలానికి సంగీత దర్శకుడు మణిశర్మ కూడా తన స్వరాలు విన్పించడానికి ముందుకురావడం ఈ సినిమా ఇంకో ప్రత్యేకత. ఇన్ని ప్రత్యేకతలు పెరుకే వున్నాయా, లేకపోతే సినిమా సక్సెస్ అవడానికి ఏమైనా పనికొచ్చాయా ఓసారి చూద్దాం...

కథ 
      కేథీ అలియాస్ కేథరిన్ (నివేదా థామస్), ఐశ్వర్య (సురభి) లు ఫ్లయిట్ లో హైదరాబాద్ వస్తూ పరిచయమవుతారు. ఇద్దరూ ఒకరి బాయ్ ఫ్రెండ్ గురించి ఒకరు చెప్పుకోవడం ప్రారంభిస్తారు. ముందుగా కేథీ చెప్తుంది తన బాయ్ ఫ్రెండ్ గౌతమ్  (నాని) గురించి. మొదటి చూపులోనే తన వెంట పడ్డం ప్రారంభించిన గౌతమ్ ప్రేమలో తనూ పడుతుంది. అయితే తనకో పెళ్లి చేసుకోమని వేధించే మేనమామ వుంటాడు. ఇతను  గౌతమ్ మీద కక్షగడతాడు. ఇక కేథీ గౌతమ్ లు గాఢంగా  ప్రేమించుకున్తున్నాక,  కంపెనీ పనిమీద కేథీ లండన్ వెళ్ళాల్సి  వస్తుంది. నెలరోజుల తర్వాత ఇప్పుడు  తిరిగి వస్తోంది- ఇక గౌతమ్ తో తన భావిజీవితం గురించి కలలుగంటోంది... 

        ఐశ్వర్య  తన బాయ్ గ్రెండ్ జై (నాని ద్విపాత్రాభినయం) గురించి చెప్పుకొస్తూ, అతనో పెద్ద కంపనీకి అధిపతి అనీ, తన తండ్రి అతడితో సంబంధం కుదిర్చాడనీ, దీన్ని పురస్కరించుకుని తామిద్దరూ కొడైకెనాల్ వెళ్లి సరదాగా గడిపి వచ్చామనీ, ఇక ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాక ఎంగేజ్ మెంట్ చేసుకుంటామనీ అంటుంది... 

        ఇద్దరూ ఏర్ పోర్టులో దిగేసరికి రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన గౌతమ్ ని సంతోషంతో చూస్తుంది కేథీ. కానీ గౌతమ్ ఆమె ని గుర్తు పట్టనట్టు ఐశ్వర్యని పలకరిస్తాడు. వాళ్ళిద్దరూ ఆనందంగా కలుసుకుంటారు. అసలేం జరిగిందో తెలుసుకోవడానికి కేథీ గౌతమ్ ఇంటి కెళ్తుంది.  గౌతమ్ తల్లి రోహిణి గౌతమ్ యాక్సిడెంట్ లో చనిపోయాడని చెప్తుంది. కేథీ షాక్ అవుతుంది. అయితే తను ఐశ్వర్యతో చోసింది గౌతమ్ ని కాదనీ, అతను గౌతమ్ లాగే  జైయేననీ అర్ధం జేసుకుంటుంది. ఇంతలో ఒక రిపోర్టర్ వచ్చి గౌతమ్ ని జై చంపి వుంటాడని అనుమానం వెలిబుచ్చుతుంది. అసలు గౌతమ్ ఎలా చనిపోయాడో జై ని కేంద్రబిందువుగా  చేసుకుని ఇద్దరూ పరిశోధించడం ప్రారంభిస్తారు.

        గౌతమ్ ని జై చంపి వుంటే ఎందుకుచంపాడు, వంశీ అనే వాడి బ్లాక్ మెయిల్ కి లొంగి జై ఎందుకు డబ్బు సమర్పించుకుంటున్నాడు. మధ్యలో కేథీ మేనమామ పాత్రేంటి...అన్నవి ఈ పరిశోధనలో బయటపడతాయి...

ఎలావుంది కథ 
       ఫస్టాఫ్ రెండు సరదా ప్రేమ కథలు, సెకండాఫ్ సీరియస్ సస్పెన్స్ కథా వున్న రో మాంటిక్ సస్పెన్స్ ఇది. అయితే సెకండాఫ్ లో పూర్తిగా రోమాంటిక్ అప్పీల్ ని మిస్సవడంతో పేరుకే రోమాంటిక్ సస్పెన్స్ అనేట్టుంది. జై చేసిన హత్యని బయటపెట్టే దృష్టితో జరిగే సంఘటనలతో రోమాంటిక్ ఫీల్, వినోదం పాలు పూర్తిగా మృగ్యమయ్యాయి. 2002 లో అబ్బాస్ మస్తాన్ లు  అభయ్ డియోల్- అమీషా పటేల్- అక్షయ్ ఖన్నా లతో తీసిన రోమాంటిక్ థ్రిల్లర్  ‘హమ్ రాజ్’ కావలసినంత థ్రిల్  తోబాటు,  పెళ్ళయిన స్త్రీ సంసారం ప్రమాదంలో పడే బలమైన ఫ్యామిలీ ఎలిమెంట్ వుంది. దీన్ని ‘పర్ ఫెక్ట్ మర్డర్’ (1998) అనే హాలీవుడ్ హిట్  నుంచి కాపీ కొట్టారు. ఈ ‘పర్ ఫెక్ట్ మర్డర్’  కూడా 1954 లో ఆల్ ఫ్రెడ్ హిచ్ కాక్ తీసిన ‘డయల్ ఎమ్ ఫర్ మర్డర్’ కి రీమేక్.  అంటే ప్పట్లో హిచ్ కాక్ తన సస్పెన్స్ లో ఫ్యామిలీ డ్రామా కూడా మిళితం చేసిన మాస్టర్ అన్నమాట.

        రోమాంటిక్ సస్పెన్స్ అన్నాక జై ని కేథీ అనుమానించి పరిశోధిస్తే అతను  తన బాయ్  ఫ్రెండ్ కాదు కాబట్టి అది రివెంజి డ్రామా అవుతుంది. జై ని అతడి గర్ల్ ఫ్రెండ్ ఐశ్వర్యే అనుమానించి పరిశోదిస్తూంటే అప్పుడు అది అచ్చమైన బాయ్ ఫ్రెండ్- గర్ల్ ఫ్రెండ్ ల మద్య రోమాంటిక్ సస్పెన్స్ అన్పించుకుని ఎక్కువ బాక్సాఫీసు అప్పీలుకి దోహదం చేస్తుంది. అమితాబ్ బచ్చన్ ‘డాన్’ లో అమితాబే తన అన్నని చంపిన డాన్ అనుకుని  జీనత్ అమన్ పగబట్టడం, అమితాబ్ ఆమెని రోమాంటిక్ యాంగిల్లో చూడ్డం...ఇందులో అమితాబ్ అమాయకుడని ప్రేక్షులకి తెలుసు కాబట్టి ఆ రివెంజి డ్రామా పండింది.  కానీ ఇప్పుడున్న నాని రెండో పాత్ర హంతకుడే అన్న అనుమానం కల్గిస్తూ కథ నడిపించడంతో, ఇది ఎలాటి రోమాంటిక్ యాంగిల్ కూడా లేని రివెంజి డ్రామాగా – ఒక డ్రై మూవీగా  తయారయ్యింది. 

ఎవరెలా చేశారు
       రెండు పాత్రల్లో నాని మెప్పిస్తాడు, అయితే రెండో పాత్రతో బాటు సెకండాఫ్ అంతా  సీరియస్ అయిపోవడంతో ఆ మూడ్ లో నటనకి మాస్ అప్పీల్ సమస్య తలెత్తుతుంది. సెకండాఫ్ లో  తనతో ఎలాటి కమర్షియల్ ఎలిమెంట్సూ  కూడా లేకపోవడం పెద్ద లోపం. ఫస్టాఫ్ లో ఇద్దరు హీరోయిన్లతో వేర్వేరు లవ్ ట్రాక్స్ లో అతను  పాల్పడే చేష్టలు కొత్తగానే వుంటూ ప్రేక్షకుల మెప్పు పొందుతాయి. సెకండాఫ్ కొచ్చేసరికి నాని నుంచి ఇంకెలాటి  ఎంటర్ టైన్ మెంట్ నీ ఆశించే పరిస్థితి లేదు. ఇదంతా ఫస్ట్ హీరోయిన్ రివెంజి డ్రామా కావడం వల్ల వచ్చిన సమస్య.  పాత కాలంలో సినిమాలు చూసి ప్రేక్షకులు- ఫస్టాఫ్ కామెడీ- సెకండాఫ్   స్టోరీ అనేవాళ్ళు. ఫస్టాఫ్ లో కామెడీ నంతా ఎంజాయ్ చేసి, ఇక సెకండాఫ్ లో ప్రారంభమయ్యే ఎంతటి సీరియెస్ కథనైనా ఇన్వాల్వ్ అయిపోయి చూసేవాళ్ళు. ఈ రోజుల్లో ఈ పరిస్థితి వుందా? ఇప్పుడు సినిమా సాంతం ఎంటర్ టైన్ మెంటే కావాలి!

        ఫస్ట్ హీరోయిన్ నివేదా  థామస్ ఫస్ట్ క్లాస్ గా వుంది. భావప్రకటనా సామర్ధ్యం పుష్కలంగా వుంది. అదే సెకండ్ హీరోయిన్ తో లేదు. రిపోర్టర్ గా నటించిన శ్రీముఖి ఇన్వెస్టిగేషన్ తక్కువగానూ, సమాచార మివ్వడం ఎక్కువగానూ వుంది. ఇక ఆఫీస్ కామెడీతో వెన్నెల కిషోర్- సత్యం రాజేష్ లు కొన్ని కొన్నిచోట్ల బాగానే నవ్విస్తారు. శ్రీనివాస్ అవసరాల విలన్ పాత్రలో ప్రశ్నార్ధకంగా ఉంటాడు. 

        సినిమాకి విందా ఛాయాగ్రహణం ఒకరకంగా వున్నా, మణిశర్మ సంగీతం మాత్రం హైలైట్ అనే చెప్పాలి. నేపధ్య సంగీతంతో బాటు,  ఫస్టాఫ్ లో వచ్చే రెండో పాట డ్రమ్ బీట్స్ తో  బాగా ఇంప్రెస్ చేస్తుంది. రవీందర్ కళాదర్శకత్వం, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ ఓ మోస్తరుగా వున్నాయి. 

చివరికేమిటి 
      లైటర్ వీన్ కథల దర్శకుడు క్రితం సినిమా ‘బందిపోటు’ అనే మాస్ కమర్షియల్ దగ్గర చేతులెత్తేసినట్టే ఇప్పుడు సస్పన్స్ బిజినెస్ తో తికమక పడిపోయారు. ఈ సినిమాలో నటీనటుల నుంచి నటనల్ని రాబట్టుకోవడం, షాట్స్ తీయడం వగైరా వరకూ తను ఓకే. కానీ ఈ రోమాంటిక్ సస్పన్స్ కథ- దీని స్క్రీన్ ప్లేల  విషయంలో మాత్రం రాణించలేకపోయారు. సస్పెన్స్ అంతా  చివర్లో ఓపెన్ చేసి ఫ్లాష్ బ్యాక్ గా చెప్పుకు వచ్చే ఎండ్ సస్పెన్స్ విధానం ప్రింట్ మీడియాకే తప్ప,  సినిమా అనే విజువల్ మీడియాకి ఇక పనికి రాదని, ముప్పై ఏళ్ల క్రితమే హాలీవుడ్ తేల్చేసుకుని ఇక దాని జోలికి వెళ్ళడం లేదు. 

        మొన్నే రవితేజతో ‘బెంగాల్ టైగర్’ అనే భారీ బడ్జెట్  సినిమా ఎండ్ సస్పెన్స్ కథతో వచ్చి ఏమైందో  తెలిసిందే. తెలుగు సినిమాల ప్రధాన  జాడ్యాలు మూడు- పాసివ్ హీరో పాత్ర, సెకండాఫ్ సిండ్రోమ్, ఎండ్ సస్పెన్స్- ఈ మూడూ పదేపదే రిపీటవుతూనే వున్నాయి- ఇలాగే తీస్తూ వుంటారు. ఇంద్రగంటి స్క్రీన్ ప్లేలో ఈ ఎండ్ సస్పెన్స్ లో కూడా అసలా జరిగిన మూల సంఘటన ఏమిటీ అన్నది చూపించే సరికి అదికూడా బలహీనంగా తేలిపోయింది. మొత్తం సస్పెన్స్ బిజినెస్ కి మూలమైన సంఘటనే  బలహీనంగా వున్నప్పుడు ఇక కథ బలంగా ఎలావస్తుంది. పైగా సెకండాఫ్ నిడివి కూడా బాగా పెరిగిపోయింది. ఇక చివరికొస్తే, ఫ్లాష్ బ్యాక్ లో చెప్పిన ప్రకారమైతే  హీరో  అరెస్టయి తన నిజాయితీ నిరూపించుకోవాలి. అప్పుడే జంటిల్ మన్ అని అన్పించుకో గలడు. అంతకాలం చట్టాన్ని ఏమార్చి,  పోలీసుల్ని తప్పుదోవపట్టించే సాక్ష్యాధారాలు సృష్టించి ఈ సస్పెన్స్ అంతా నడిపించాడు. ఆ పోలీసులు ఏమయ్యారు? అటూ ఇటూ కుటుంబ సభ్యులందరూ హీరో చేసింది గొప్ప అని మెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే సరిపోయిందా? హీరో తల్లికూడా హీరోకి సహకరించింది కదా, ఆమెకూడా చట్టానికి లొంగి పోవాల్సిందే. 

        ఇది సమగ్రమమైన కథా చిత్రమన్పించుకోదు. ఇలాటి కథకి పరిపూర్ణమైన ముగింపు నివ్వడం సాధ్యంకాదు. ఇస్తే హీరో అతడి తల్లీ ముందు జైల్లో వుండాల్సిన ఖర్మ పడుతుంది.

-సికిందర్
http://www.cinemabazaar.in





       
 




















11, జూన్ 2016, శనివారం

షార్ట్ రివ్యూ!

రచన- దర్శకత్వం : రాజసింహ 
తారాగణం: సందీప్‌ కిషన్‌, నిత్యామీనన్‌, రవికిషన్‌, రాహుల్ దేవ్, అలీ, నళిని, అజయ్‌, రోహిణి, సప్తగిరి, పృధ్వీ, తాగుబోతు రమేష్‌, ఝాన్సీ తదితరులు
సంగీతం: మిక్కీ జె. మేయర్‌, ఛాయాగ్రహణం: ఛోటా కె. నాయుడు
బ్యానర్‌: అంజిరెడ్డి ప్రొడక్షన్స్‌, నిర్మాత: భోగాది అంజిరెడ్డి
విడుదల :  జూన్‌ 10, 2016
***
     ఒక్క హిట్ కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్న సందీప్ కిషన్ మళ్ళీ ప్రయోగాలబట్టి ‘ఒక్క అమ్మాయి తప్ప’ లో నటించాడు. మొన్నే ‘రన్’ అనే ప్రయోగాత్మకంలో నటించి విఫలమయ్యాడు. ప్రస్తుత ప్రయత్నం తెలుగు సినిమాల్లో ఇంతవరకూ ఎవరూ చేయని సాహస ప్రయోగమే నిజానికి. తెలుగు సినిమాల్ని మూస నుంచి కమర్షియల్ గా కొత్త బాట పట్టించే ప్రయోగాలు తప్పకుండా  జరగాల్సిందే. కొత్త దర్శకుడు రాజసింహ ఈ కొత్త ప్రయోగం చేస్తూ వీలైనన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఇందులో ప్రవేశపెట్టాడు. దర్శకుడి విజన్ ని  పూర్తిగా నమ్మిన సందీప్ కిషన్ పారితోషికాన్నికూడా  త్యాగం చేసి, ప్రముఖ హీరోయిన్ నిత్యామీనన్ తో కలిసి నటించాడు. మరైతే ఈ త్యాగం, దర్శకుడి విజన్ ఏమైనా సార్ధకమయ్యాయా లేక షరామామూలు బాక్సాఫీసు తిరస్కరణకి గురయ్యాయా ఓసారి చూద్దాం... 

కథ 
      కృష్ణ వచన్ (సందీప్ కిషన్)  రెండో తరగతి చదివేటప్పుడు క్లాస్ మేట్ మ్యాంగో (నిత్యామీనన్) ని ప్రేమిస్తాడు. స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఆమెకు జాతీయ పతాకం అందిస్తూ పెళ్లి చేసుకుంటానని ప్రామీస్ చేస్తాడు (పుట్టే పిల్లల గురించికూడా మాట్లా డేస్తాడు- ఏమంటే వీడి మాటల్ని కామెడీగా తీసుకుని మనం నవ్వాలి!). ఆమె తిప్పి కొట్టేస్తుంది. పెద్దయ్యాక వచన్ కి చదువు నచ్చక కాలేజీ మానేసి, పేకాటలో ఆరితేరతాడు. జీవితంలో గెలవాలంటే మ్యానిపులేషన్స్ కాదనీ, క్యాలిక్యులేషన్స్ అవసరమనీ చెప్తూంటాడు(ఆవారా హీరోల పాత్రలు ఇలాగే  గాలి కొటేషన్లు చెప్తూంటాయి). ఒకరోజు ఏదో పనిమీద బైక్ మీద వెళ్తూంటే ఫ్లై ఓవర్ మీద రెండు లారీలు గుద్దుకుని ట్రాఫిక్ జామ్ అయి అందులో చిక్కుకుంటాడు. ఒక షేర్ ఆటోలో ప్రయాణిస్తున్న మ్యాంగో కూడా ఆ జామ్ లో చిక్కుకుంటుంది. ఆమె చిన్నప్పటి మ్యాంగో అని తెలీక టీజ్ చేస్తాడు వచన్. ఈ ట్రాఫిక్ జామ్ ని కావాలనే  అన్వర్(రవికిషన్)  అనే హైటెక్ టెర్రరిస్టు సృష్టిస్తాడు. అక్కడ పెట్టిన బాంబుల్ని పేల్చేస్తానని బెదిరించి జైల్లో వున్న ఇంకో టెర్రరిస్టు అస్లం ఖాన్(రాహుల్ దేవ్) ని విడుదల చేయించుకోవాలని పథకం వేస్తాడు. అయితే బాంబులకి కనెక్షన్స్ ఇవ్వడానికి పంపించిన అనుచరుడు మాయమవడంతో అయోమయంలో పడ్డ అన్వర్, ఫ్లై ఓవర్ మీద చిక్కుకున్న వచన్ ని టార్గెట్ చేసి ఆ పని అతడితో చేయించుకోవాలనుకుంటాడు. దూరంగా బిల్డింగ్ లోంచి ఈ పథకం వేస్తున్న అతను- ఆటోలో వున్న మ్యాంగో మీద టెలిస్కోపిక్ రైఫిల్ ని గురిపెట్టి బెదిరిస్తూ, వచన్ ని లొంగ దీసుకుంటాడు. 

        ఇదీ విషయం. ఇప్పుడు వచన్ ఏం చేశాడు? అన్వర్ బెదిరింపులకి లొంగిపోయిన తను అతను  చెప్పినట్టే చేశాడా? మ్యాంగో తన చిన్ననాటి లవర్ అని ఎప్పుడు తెలుసుకున్నాడు? ప్రమాదంలో వున్న ఆమె ప్రాణాలనీ,  మిగతా ప్రజల ప్రాణాలనీ  ఎలా కాపాడాడు? చివరికేమైంది? ఇవన్నీ వెండితెర మీద చూసి తెలుసుకోవాల్సిన  విషయాలు.

ఎలావుంది కథ
     ర్శకుడు రాజసింహ కొన్నేళ్ళ పాటు ఈ కథ పట్టుకుని నిర్మాతల చుట్టూ తిరిగాననీ, అప్పట్లో ఎవరికీ నచ్చలేదనీ  చెప్పుకున్నాడు. 1960 లో ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్ కి రైటర్ లారీ కోహెన్ ఓ కథ చెప్పాడు. ఐడియా  బాగానే వుంది గానీ దీన్నెలా తీయాలబ్బా అని సందేహంలో పడ్డాడు హిచ్ కాక్. దర్శకుడు రాజసింహ నాల్గేళ్ళ  క్రితం హీరో సందీప్ కిషన్ కి ఇదే కథ చెప్పి ఒప్పించానని చెప్పుకున్నాడు. రైటర్ లారీ కోహెన్ చివరికి 1990లలో తన కథకి ఒక తుపాకీ గురిపెట్టిన విలన్ ని సృష్టిస్తే అప్పడు కథ దారిలో పడింది. రాజసింహ తన సినిమాకి అదే తుపాకీ గురిపెట్టిన  విలన్ ని పెట్టుకున్నాడు. రైటర్ లారీ కోహెన్ స్క్రిప్టు చివరికి 2002 లో తెరకెక్కింది. రాజసింహ సినిమా చివరికి 2016 లో తెరకెక్కింది. లారీ కోహెన్ సినిమా వచ్చేసి  ‘ఫోన్ బూత్’ అయితే, రాజసింహ సినిమా వచ్చేసి ‘ఒక్క అమ్మాయి తప్ప’. లారీ కోహెన్ ఒరిజినల్ ఐడియాని పట్టుకుని 42 ఏళ్ల పాటూ శ్రమిస్తే, లారీకోహెన్ ఐడియాని చప్పున కాపీ కొట్టేసిన రాజసింహ పన్నెండేళ్ళ పాటూ నిర్మాతల చుట్టూ తిరగడానికి పరిశ్రమించాడు. ఐతే కాపీలూ లీకులూ ఒకరితో ఆగవు. అవి పవిత్ర తీర్ధ జలాలు, అలా ప్రవహిస్తూనే వుంటాయి. రాజసింహ కథలో టెర్రరిజం పార్టు కొంచెం మార్పులతో ఉన్నదున్నట్టు మొత్తం ఇంకో కొత్త నిర్మాత దగ్గర ఫైలు సిద్ధంగా వుంది, ఆయన దానితో పరిశ్రమిస్తున్నాడు. దాంతో ఎటూ తెగక అదృష్టవశాత్తూ ఈ వ్యాసకర్త ఆయన పరిశ్రమలో పాలుపంచుకోవడం మానేసి తప్పించుకున్నాడు! కొన్ని మిరకిల్స్ ఇలా జరుగుతూంటాయి...

        ప్రేమ- టెర్రరిజం సజాతి కమర్షియల్ జానర్లే. టెర్రరిస్టు కోరిక థ్రిల్లింగ్ పాయింటే. కాకపోతే ఈ ఐడియాని అమలు పరచడానికి దర్శకుడు ‘బర్నింగ్ ట్రైన్’ అనే హిందీ, ‘ట వరింగ్ ఇన్ ఫెర్నో’  అనే హలీవుడ్ డిజాస్టర్ మూవీస్ కూడా చూసివుంటే ఒక మంచి అవగాహన ఏర్పడేది. ‘ఫోన్ బూత్’  ఐడియా చాలా చిన్నది. అదో పర్సనల్ కథ. ఫోన్ బూత్ కి  ఫోన్ చేయడాని కెళ్ళిన  హీరోకి అక్కడే ఓ కాల్ వస్తుంది. అతను భార్య కళ్లుగప్పి సాగిస్తున్న రహస్యప్రేమాయణం గురించి విలన్ చెప్పి- ఈ దాగుడు మూతల్ని ఇద్దరికీ ఓపెన్ చేయకపోతే చంపేస్తానని బెదిరిస్తాడు, రహస్యంగా టెలిస్కోపిక్ రైఫిల్ తో కనిపెడుతూ. ఈ విలన్ అనైతిక ప్రవర్తనలని సహించడు.  ఇప్పడు హీరో కుటుంబ జీవితం, రంకు జీవితం, సొంత ప్రాణాలూ ఏమయ్యాయనేదే కథ. 

        రాజసింహకి హిచ్ కాక్ కంటే  బ్రహ్మాండమైన ఐడియా వచ్చి ఈ కథ ఫ్లై ఓవర్ కెక్కింది. సువిశాలమైంది. తను హేండిల్ చేయలేనంత విశ్వరూపం ధరించింది. ముప్పాతిక వంతు సినిమా ఫ్లై ఓవర్ మీద అనే కాన్సెప్టు వరకూ ఆహ్వానించదగ్గదే, దీన్ని అమలు పర్చేసరికి కాన్సెప్టు చెల్లా చెదురయ్యింది.  కారణం స్క్రీన్ ప్లేనే!

ఎవరెలా చేశారు
       సందీప్ కిషన్ దురదృష్ట మేమిటో గానీ నటించగల శక్తి వున్నతనకి, ఫాలోయింగ్ కూడా వున్న తనకి సినిమాలు హేండిచ్చేస్తున్నాయి. నటన అంటే పాత్రే  కాదనీ, పాత్ర చిత్రణ కూడాననీ గ్రహిస్తే ఈ తిప్పలు తప్పుతాయేమో.  గెలవాలంటే మ్యానిపులేషన్స్ కాదనీ, క్యాలిక్యులేషన్స్ అవసరమనీ చెప్పుకున్న తన పాత్రే,  విలన్ మ్యానిపులేషన్ ని తన క్యాలిక్యులేషన్ తో తిప్పికొట్ట గల అవకాశమున్నా బేలగా మిగిలిపోవడం నటన అన్పించుకోకపోగా,  ఆ నటన పేలవంగా,  అర్ధరహితంగా వుంటుంది. తను విలన్ చెప్పినట్టు బాంబులకి కనెక్షన్ ఇవ్వకముందు జరిగే బోలెడు డ్రామాలో,  నిత్యామీనన్ ని అటు పక్కనుంచి ఆటో దింపేసి తీసికెళ్ళి పోయుంటే విలన్ చేసేదేమీ వుండదు. 

        నిత్యా మీనన్ కి షేర్ ఆటోలో కూర్చుని డైలాగులు చెప్పడం, డ్రీమ్ సాంగులేసుకోవడం తప్ప చేయడానికేమీ లేకుండా పోయింది. బాగా విర్రవీగి నటించింది మాత్రం టెర్రరిస్టు పాత్రలో రవికిషనే. రాహుల్ దేవ్ జైలుకి పరిమిత మైపోయాడు. కమెడియన్లు అలీ, సప్తగిరి, తాగుబోతు, ధన రాజ్, వేణు, ఫిష్ వెంకట్ లు- ఫ్లై ఓవర్ యాక్షన్ మధ్య మధ్యమ్  అకస్మాత్తుగా వూడిపడి కామెడీలు  చేస్తూంటారు. ఈ కామెడీల్ని విడిగా ఎంజాయ్ చేయగలమేమో గానీ,అర్ధం లేకుండా ఫ్లై  ఓవర్ డ్రామా లోకి జొరబడుతూంటేనే ఇబ్బంది. 

        ఈ సినిమాకి అసలైన హీరో సందీప్ కిషన్ మేనమామ ఛోటా కె. నాయుడు. తన కెమెరా వర్క్ తో నాయుడు ఇంకో మెట్టు పైకెక్కారు. తెలుగు సినిమాకి- అందునా ఓ థ్రిల్లర్ కి-  ఇంత క్వాలిటీ విజువల్స్, దానికి మళ్ళీ  వరల్డ్ క్లాస్ డీఐ కూడా ఇవ్వడం ఇదే ప్రథమం. ఆద్యంతం కళ్ళప్ప గించి చూసేలా చేసి,  ఈ సినిమాలో అన్ని లాజిక్ పరమైన లోపాలనీ మటుమాయం చేయగల్గిన మంత్రజాలం ఆయనదే. అయినా అంతిమంగా ప్రతికూల ప్రభావాన్నే  ఈ సినిమా చవి చూసిందంటే ప్రధాన కారణం స్క్రీన్ ప్లేనే. 

చివరికేమిటి
     క్కడో చూసి తను రాసుకున్నదే వేదం అనుకోకుండా కొత్త దర్శకుడు రాజసింహ కాస్త స్క్రీన్ ప్లే మీద కూడా రీసెర్చి చేసుకోవాల్సింది. ఫ్లై ఓవర్ మీద మందిని పోగేసి ‘ఫోన్ బూత్’ ఐడియాని అమలు చేసే ముందు- ఆ మందిని పోగేసే క్రమం ఎలా వుంటుందో, ప్రమాద ఘంటికలు ఎప్పుడు మోగుతాయో ఆ టైమింగ్ ని తెలుసుకోవాల్సింది- ‘బర్నింగ్ ట్రైన్’, ‘టవరింగ్ ఇన్ ఫెర్నో’, ఆఖరికి ‘టైటానిక్’ కూడా చూసి! 

        ‘బర్నింగ్ ట్రైన్’ లో జరగబోయే ప్రమాదం ప్రేక్షకులకి కూడా ముందు తెలీదు. ఈ మల్టీ స్టారర్ లో  ఒకరొకరే స్టార్లు  ట్రైన్ ఎక్కడం, వాళ్ళ పలకరింపులు, పరిచయాలు, జీవితాలు, ప్రేమలు, పాటలూ ఇవన్నీ స్క్రీన్ ప్లేలో బిగినింగ్ విభాగపు బిజినెస్  కింద పూర్తయ్యాక, ప్రయాణిస్తున్న ట్రైను ట్రైను బ్రేకులూడదీసి బాంబులు పెట్టారని తెలుస్తుంది. ఇలా మిడిల్ విభాగం ప్రారంభమవుతుంది. ఇక బిగినింగ్ విభాగంలో చూపించిన బిజినెస్ తాలూకు అంశాలేవీ ఇక్కడ అడ్డుపడవు. మిడిల్ అంటే సంఘర్షణే  కాబట్టి పాత్రలన్నీ ప్రమాదంలో పడ్డ ప్రయాణంతో రకరకాలుగా సంఘర్షించడమే మొదలెడతాయి. హేమా హేమీలతో ఈ హిట్ ని 1979 లో బీఆర్ చోప్రా నిర్మించారు.  

         ‘ది టవరింగ్ ఇన్ ఫెర్నో’  లో ఒక 135 అంతస్తుల ఆకాశహార్మ్యం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఆహ్వానితులందరూ రావడం మొదలెడతారు. ‘బర్నింగ్ ట్రైన్’ లో లాంటి బిగినింగ్ విభాగపు బిజినెస్సే వుంటుంది. గంట సేపటి తర్వాత అగ్నిప్రమాదం సంభవించి మిడిల్ విభాగంలో పడుతుంది కథ. ఇక అప్పుడు ప్రాణాలకోసం అందరూ సంఘర్షించడమే వుంటుంది. హేమాహేమీలతో 1974 లో తీసిన దీనికి ఆస్కార్ ఉత్తమ చిత్రం అవార్డు నామినేషన్ దక్కింది. ఇతర విభాగాలో ఐదు ఆస్కార్ అవార్డులు సాధించింది. 

        ‘టైటానిక్’ కూడా ప్రేమకథ ఎష్టాబ్లిష్ అయ్యాకే(బిగినింగ్ విభాగం) నౌక ప్రమాదంలో పడుతుంది. 

        రాజసింహ స్క్రీన్ ప్లేకి ఇలాటి అంక విభజన లేదు. బిగినింగ్, మిడిల్ కలగాపులగమైపోయాయి. మిడిల్ విభాగంలో ఓపెన్ చేయాల్సిన కుట్రకి సన్నాహాల్ని బిగినింగ్ లో హీరో ప్రేమని ఎస్టాబ్లిష్ చేస్తున్న బిజినెస్ తో కలిపేశారు. కామెడీలూ గీమిడీలూ అన్నీ ఇష్టారాజ్యం చేశాయి ఎక్కడబడితే అక్కడ. దీంతో స్క్రీన్ ప్లేకి వుండే విభాగాలూ,  వాటిలో వేటికవి జరగాల్సిన బిజినెస్సులూ  దర్శకుడికి తెలియవేమో అన్న సందేహాలేర్పడ్డాయి.

        శుభ్రంగా  బిగినింగ్ ని ప్రారంభించి అందులో హీరో చిన్నప్పటి ఫ్లాష్ బ్యాక్, ఆతర్వాత హీరోయిన్ పరిచయం, ఆమెతో ట్రాకు, ఇద్దరూ పరస్పరం గుర్తించుకుని ప్రేమలో పడ్డం, ఇతర కమెడియన్ల ట్రాకులూ వగైరా  నడిపి- ఓ శుభోదయాన ఎవరి పనులమీద వాళ్ళు, ఇంకా ఆ ప్రయాణంలో మరి కొన్ని కొత్త పాత్రలూ కలిసి వెళ్తున్నప్పుడు, అకస్మాత్తుగా  ఫ్లై ఓవర్ మీద లారీలు గుద్దుకుని ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో,  మొత్తం పరిచయం చేసిన పాత్రలన్నీ అందులో చిక్కుకోవడంతో బిగినింగ్ విభాగాన్ని ముగిస్తే సరిపోయేది. 

        ఇప్పుడు మిడిల్ ని ప్రారంభిస్తూ అసలా లారీలతో ప్రమాదాన్ని  విలన్ సృష్టించాడని ఓపెన్ చేస్తూ,  వాడి అసలు కుట్రని బయటపెడితే  ఈ ట్విస్ట్  షాకింగ్ గా  వుండి - మిడిల్ లో పాత్రల పరిచయాలూ, ప్రేమ ట్రాకులూ, ఇంకే కాలక్షేప కామెడీలూ లేకుండా పాయింటుతో ఏకత్రాటి పైకొచ్చేసేది కథ. ప్రమాదంలో పడ్డాక ‘టైటానిక్’ లో ప్రేమ కథ ఎలా సాగిందో చూసుకోవచ్చు. అగ్ని ప్రమాదం సంభవించాక ఒకటి కాదు, ఐదు ప్రేమ కథలూ ఎలా కొనసాగాయో ‘ది టవరింగ్ ఇన్ ఫెర్నో’లో పరిశీలించుకోవచ్చు. 

        పరిశీలన లేకుండా తోచినట్టూ రాసేసుకుంటే అది స్క్రీన్ ప్లే అవదు, దానికి ప్రేక్షకులు దాసోహం కారు!

-సికిందర్ 
http://www.cinemabazaar.in/

10, జూన్ 2016, శుక్రవారం

షార్ట్ రివ్యూ

దర్శకత్వం : మను
తారాగణం : సుమంత్ అశ్విన్, పూజా జావేరీ, పావని జి,  ప్రభాకర్, నాజర్, జీవా, రాజారవీంద్ర, తాగుబోతు రమేష్, షకలక శంకర్, ధనరాజ్
మాటలు : డార్లింగ్ స్వామి. సంగీతం : జేబీ, ఛాయాగ్రహణం : శేఖర్ వి. జోసెఫ్
బ్యానర్ : శ్రీ సత్య ఎంటర్ ప్రైజెస్, నిర్మాత : జె. వంశీ కృష్ణ
విడుదల : 10.6.16
***
     హీరోగా నిలదొక్కుకునేందుకు విఫలయత్నాలు చేస్తున్న సుమంత్ అశ్విన్ మలయాళ రీమేకుని  ఆశ్రయించాడు. కొత్త దర్శకుడు మనునీ, ‘బాహుబలి’ ప్రభాకర్ నీ, హీరోయిన్ పూజా జావేరీనీ, ఒక బస్సునీ  టీముగా ఏర్పాటు చేసుకుని కలెక్షన్స్ కోసం కండక్టరుగా నటించాడు. బస్సుతో సినిమాలు అనేకం వచ్చాయి. మొన్నే దాసరి తీసిన ‘ఎర్రబస్సు’ తో బాటు, భీమనేని శ్రీనివాసరావు తీసిన ‘స్పీడున్నోడు’ వచ్చాయి. మలయాళంలో ‘ఆర్డినరీ’ పేరుతో విడుదలై ఘనవిజయం సాధించిన ప్రస్తుత సుమంత్  రీమేకు బస్సు, ఎంత ఎక్స్ ట్రార్డినరీగా వుందో, ఎన్ని టికెట్లు కొడితే ఎంత వచ్చిందో  ఈ కింద చూసుకుంటూ వెళ్దాం...  

కథ 
      రవి (సుమంత్ అశ్విన్) కొత్తగా ఆర్టీసీ బస్సు కండక్టర్ గా చేరతాడు. గవిటి  అనే ఏజెన్సీ  ప్రాంతానికి ఒక ట్రిప్పు వేసే ఆ బస్సుకి  డ్రైవర్ గా వున్న  శేషు (ప్రభాకర్) తో దోస్తీ కుదురుతుంది. శేషు మద్యం సేవించి బస్సు నడుపుతాడు. గవిటి లో సర్పంచ్ విశ్వనాథం విశ్వనాథం (నాజర్),  ఆయన కుటుంబం వుంటారు. చనిపోయిన తన మిత్రుడి కూతుర్ని తనింట్లోనే ఉంచుకుని కొడుక్కిచ్చి పెళ్లి చేద్దామను కుంటున్నాడు. అదే వూళ్ళో కల్యాణీ  అనే టౌన్ లో ఓ సెల్ ఫోన్ షోరూం లో పని చేసే అమ్మాయి వుంటుంది. రోజూ ట్రిప్పులేస్తున్న రవికి ఆమెతో సాన్నిహిత్య మేర్పడుతుంది. ప్రేమని వెల్లడిస్తాడు. ఆమె సరేనంటుంది. శేషుతో రవి వూళ్ళో షికార్లు  తిరుగుతూ, టౌనుకి ట్రిప్పులు వేస్తూ ఉంటాడు. ఒకరోజు వెళ్తున్న బస్సు ఫెయిలవుతుంది. డిపో నుంచి మెకానిక్ (జీవా) వస్తాడు. ఇతనూ శేషూ మద్యం సేవిస్తూ కూర్చుంటారు, అసిస్టెంట్ బస్సుని బాగుచేస్తాడు. బయల్దేరబోతూ తాగి వున్న శేషు బస్సు నడపబోతే, అడ్డుకుని రవి నడుపుతాడు. కొంత దూరంలో యాక్సిడెంట్ చేస్తాడు. ఆ యాక్సిడెంట్, దాని తర్వాతి పరిణామాల్లో విశ్వనాథం కొడుకు చనిపోతాడు. రవీ శేషూ ఇరకాటంలో పడతారు. విషయం బయటపడి పోలీసులు రవిని అరెస్టు చేస్తారు. ఇక ఈ కేసు లోంచి బయటపడేందుకు రవి ఏం చేశాడనేది మిగతా కథ.

ఎలావుంది కథ
    ఈ కథతో మలయాళ ఒరిజినల్  ఎప్పుడో 2012 లో తీశారు. వెంటనే 2013లో తమిళంలో  రీమేక్ చేశారు. రెండూ అప్పట్లో సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు ఆలస్యంగా 2016 లో తెలుగులో తీశారు. దీంతో దీని నావెల్టీ తగ్గడమేగాక, యూత్ అప్పీల్ ని కోల్పోయింది. పైగా తెలుగులో సినిమాగా దీన్ని రీమేక్ చేయడానికి ఈ కథకున్న  విస్తృతి సరిపోయేలా లేదు, షార్ట్ ఫిలింకి సరిపోతుందేమో. రెండోది అసలుకి ఈ కథే గత శతాబ్దానికి చెందిన పురాతనమైన కథ. శోభన్ బాబుతో ‘ఖైదీ బాబాయ్’, కృష్ణ తో ‘నేరము- శిక్ష’ సినిమాలు ఇలాటి కథలే. సుమంత్ అశ్విన్  తండ్రి గారే (ఎంఎస్. రాజు) ఈ నేరం- శిక్ష బాపతు జానర్ తో 2002 లో ‘నీ స్నేహం’ (‘తుమ్ బిన్’ రిమేక్) తీశారు. భూమి గుండ్రం గా వున్నట్టు తనయుడు మళ్ళీ ఇలాటిదే వ్యవహారంలో నటించాడు. ఐతే ఈ నేరం-శిక్ష పాయింటుతో గతంలో వచ్చిన సినిమాలు నిజంగా హీరో నేరం చేసినవే- ఆ పశ్చాత్తాపంతో కుమిలిపోయే మెలోడ్రామాలు. ఈ పాయింటు మెలోడ్రామాతోనే వర్కౌట్ అవుతుంది. అలాగాక  సస్పెన్స్ కోణాన్ని జతచేస్తే, ఆ సస్పెన్స్ ఆధారంగా సులువుగా  హీరోని బయట పడేసే ప్రయత్నం చేస్తే, అంత వర్కౌట్ అయ్యే వ్యవహారంగా కనపడదు. 

ఎవరెలా చేశారు
       సుమంత్ అశ్విన్ నటించ గలడు  గానీ పాత్రలే కుదరడంలేదు. బస్సు కండక్టర్ అయినంత మాత్రాన పాత్రకి గ్లామర్ లేదని, చీటికీ మాటికీ ఈశ్వరా అనే ఊతపదంతో చాదస్తంగా కనపడాల్సిన అవసరం లేదు. కుర్ర కండక్టర్లు చాలా ఫాస్ట్ గా వుంటారు. ఫస్టాఫ్ లో ఏదో సరదాగా నటించేసినా- వయసులోనూ, శారీరకంగానూ భారీగా వుండే ప్రభాకర్ తో దోస్తీ – కెమిస్ట్రీ కుదరలేదు. అదంతా కృతకంగా వుంది. ఇక సెకండాఫ్ పూర్తిగా సీరియస్ కథ కాబట్టి, అది కూడా చప్పున ముగిసిపోయే కథ కాబట్టి నటనకి పెద్దగా స్కోపు లేక యాక్షన్ తో సరిపెట్టేశాడు. కండక్టరుగా ప్రేక్షకులకి అందించడానికి తను పోగేసిన కలెక్షన్ అంతా అవుట్ డేటెడ్. 

        ఇలాటి సాఫ్ట్ పాత్రలో ఎందుకనో ప్రభాకర్ ఆకట్టుకునేలా లేడు. అతను రఫ్ పాత్రలు వేసుకుంటేనే మంచిదేమో. హీరోయిన్ పూజా జావేరీ గురించి చెప్పుకోవడానికేమీ లేదు. ప్రొఫైల్ లో ఆమెని చూపించకుండా వుంటే బావుండేది. కమెడియన్లు తాగుబోతు రమేష్, షకలక శంకర్, ధన రాజ్ ముగ్గురూ వున్నా కామెడీ కూడా ఏమీ లేదు. ఇక ఇతర పాత్రధారుల గురించి కూడా చెప్పుకోవడానికేమీ లేదు.  
        సంగీతం, ఛాయగ్రహణం అవుట్ డేటెడ్ గా వున్నాయి.


చివరికేమిటి?
       కొత్త దర్శకుడు ‘మను’ తన తొలిప్రయత్నంగా రీమేక్ కి పూనుకోవడమే గాక, చాలా పాత విషయం తలకెత్తుకోవడం, అదీ కొత్తగా చెప్పలేకపోవడం, చాలా స్లోగా కథ నడపడం, ఇంటర్వెల్ వరకూ స్క్రీన్ ప్లే బిగినింగ్ విభాగంతోనే కాలక్షేపం చేయడం లాంటి స్పీడ్ బ్రేకర్లతో నిరుత్సాహ పరుస్తాడు. కొత్తగా టిఫిన్ సెంటర్ పెట్టిన వాడుకూడా వంటకాలతో కసకస లాడి స్తాడు. ఈ కొత్త దర్శకుడు కసకసలు, మిసమిసలు లేని చద్దన్నం ఎందుకు వడ్డించాలనుకున్నాడో అర్ధంగాదు.


-సికిందర్

http://www.cinemabazaar.in



        

5, జూన్ 2016, ఆదివారం






దర్శకత్వం : ముప్పలనేని శివ
తారాగణం : కృష్ణ, విజయనిర్మల, అంగనా రే, మురళీ శర్మ, పోసాని, సాయికుమార్, పృథ్వీ, ఎల్బీ శ్రీ రామ్, డా. రవి తదితరులు.
సంగీతం :
ఈ ఎస్ మూర్తి,  ఛాయాగ్రహణం :  సతీష్ ముత్యాల
కథ : రమేష్ డీఓ  ప్రొడక్షన్స్,  కాన్సెప్ట్  రైటర్ : కల్యాణ్ జీ, మాటలు :  రామ్ కంకిపాటి
నిర్మాతలు
: శ్రీసాయి దీప్ చాట్ల, వై. బాలు రెడ్డి, షేక్ సిరాజ్
విడుదల :  3. 6. 2016

***
రికార్డు స్థాయిలో 350 సినిమాల సూపర్ స్టార్ కృష్ణ,  గోల్డెన్ జూబ్లీని  పూర్తి  చేసుకుంటూ ‘శ్రీ శ్రీ’ అనే యాక్షన్  మూవీతో హీరోగా విచ్చేశారు- అమితాబ్ బచ్చన్ గెటప్ తో - కాకపోతే నేచురల్ బ్లాక్ గడ్డంతో. ‘డెత్ విష్’  ఫేమ్ ‘విజిలాంటీ’ ఛార్లెస్ బ్రాన్సన్ పాత్రని పోషిస్తూ  దుష్ట శిక్షణ గావించారు. సీనియర్ దర్శకుడు ముప్పలనేని శివ,  ఘట్టమనేని వంశీకులతో ఓ ‘మనం’ కూడా చేద్దామనుకున్నారు దీన్ని, ఇది కుదర్లేలేదు

    
క లా ప్రొఫెసర్ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఎలా వుంటుంది?  చాలా కొత్తగా వుంటుంది. కళ్ళ ముందు నేరం జరుగుతున్నప్పుడు లా ప్రొఫెసర్ ఏం చేస్తే బావుంటుంది? నేరాన్ని అడ్డుకుంటే బావుంటుంది. నేరాన్ని అడ్డుకోలేనప్పుడు ఏం చేస్తే  బావుంటుంది? తన దగ్గరున్న సెల్ ఫోన్లో ఆ నేరాన్ని చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టేస్తే బావుంటుంది. అప్పటికీ చట్టం సరిగ్గా పని చెయ్యక పోతే ఏం చేస్తే బావుంటుంది? సినిమా కాబట్టి చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే బావుంటుంది. లా ప్రొఫెసర్ చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే కొత్తగా వుండడం వేరు, బావుండడం వేరు. కొత్తగా ఉండడానికి క్యారక్టరైజేషన్ అవసరం లేదు, బావుండడానికి అవసరం. 

     శ్రీ శ్రీ ( శ్రీరంగం శ్రీపాద రావు) ఒక లా ప్రొఫెసర్. సుమతి (విజయనిర్మల) అనే భార్య, ఓ పెళ్ళయిన కొడుకూ పెళ్లి కాని  కూతురూ వుంటారు. కూతురు శ్వేత ఒక టీవీ రిపోర్టర్. నగరంలో జేకే (మురళీశర్మ) అనే బడా పారిశ్రామికవేత్తా, అతడి తొత్తు డాక్టర్ ముసుగులో ఆర్ఎంపీ క్వాక్  భిక్షపతీ ( పోసాని) వుంటారు. పోతురాజుల గూడెం అనే గిరిజన ప్రాంతం. అక్కడ ఫార్మా కంపెనీ నడుపుతూంటారు. దాంతో జల వాయు కాలుష్యా లేర్పడి భూములు బీడు పోతాయి. ఇంకో పక్క ఏదో కొత్త మందు కోసం మనుషుల మీద ప్రయోగాలు చేస్తూ, వాళ్ళు  చచ్చిపోతే ఒక శిథిలమైన క్వారీలో శవాల్ని పడేస్తూంటారు. వీటికి వ్యతిరేకంగా పోరాడేవాడు సూర్యారావు ( సాయి కుమార్). ఇతడికి తోడయ్యింది శ్వేత. ఈమె తీస్తున్న డాక్యుమెంటరీ విషయం తెలిసి జేకే ఆదేశాలపై అతడి కొడుకు, భిక్షపతి కొడుకు, ఇంకొకడి కొడుకూ కలిసి ఛానల్ కార్యాలయంలో శ్వేత మీద దాడి చేస్తారు పెన్ డ్రైవ్ కోసం. ఆ సమయంలో అక్కడే వున్న శ్రీశ్రీ అడ్డుకోబోతే  కొట్టి పడేస్తారు. అవతల అద్దాల గదిలో తన కూతురు మీద జరుగుతున్న దాడిని కళ్ళారా చూస్తూ ఏమీ చేయలేక తల్లడిల్లిపోతాడు శ్ర్రీ శ్రీ.  పెన్ డ్రైవ్ దొరక్క ఆమెని చంపేసి వెళ్ళిపోతారు ఆ ముగ్గురు కొడుకులూ.   

        వీళ్ళే హంతకులని  కేసు నమోదవుతుంది. కానీ  సరైన  సాక్ష్యాధారాల్లేక విడుదలైపోతారు. శ్రీ శ్రీ ఇంకా తల్లడిల్లి పోతాడు. భార్య సుమతి ఇక ఒకటే మార్గముందని చెప్తుంది. పేపర్లో పడిన ఆ ముగ్గురు హంతకుల ఫోటోలలో ఒకడి ఫోటోని  మార్క్ చేసి,  శ్రీ శ్రీని యుద్ధానికి పంపిస్తుంది. వెళ్లి చంపేసి వస్తాడు. రెండో వాణ్ణీ  మార్క్ చేసి ముహూర్తం పెడుతుంది. ఇంకో విధంగా చంపేసి వస్తాడు. 

     ఇప్పుడు ఎసిపి అజయ్ కుమార్ (నరేష్)  రంగంలోకి వస్తాడు. ఈ హత్యలు ఎవరు చేస్తున్నారో అర్ధం జేసుకోలేకపోతాడు. అయితే  రెండో హత్య చేస్తున్నప్పుడు మంకీ క్యాప్ వేసుకుని వచ్చిన హంతకుడి పోలికలు చెప్తాడు ఆ ఇంటి పనివాడు. ఆ పోలికలతో ఒక ఊహా చిత్రం తయారు చేయిస్తాడు  ఎసిపి అజయ్. ఈ మంకీ క్యాప్ వ్యక్తి  ఎవరో అంతుపట్టదు. అప్పుడు శ్రీ శ్రీ ఒక ఫైలు పంపిస్తాడు. అప్పట్లో తను పోరాడిన తన కూతురి హత్య తాలూకు కేసు వివరాలు అందులో వుంటాయి. ఆ ఫైలు చదువుకున్న అజయ్, అందులోనే శ్రీ శ్రీ పంపుకున్న శ్రీశ్రీ  ఫోటో చూసి, ఊహా చిత్రంతో  మ్యాచ్ చేసుకుని శ్రీశ్రీని అరెస్ట్ చేయడానికి బయల్దేరడంతో సగం కథ ముగుస్తుంది.

     ఈ కథ శ్వేత చనిపోయి, కేసు కొట్టేసిన వాతావరణ నేపధ్యంలో ప్రారంభమవుతుంది. ఆమె ఎలా వుండేదీ, ఏం చేసి ఎలా హత్యకి గురయ్యిందీ అంచెలంచెలుగా  మల్టీ పుల్ ఫ్లాష్ బ్యాకులతో ఇంటర్వెల్ లోపే  తెలిసిపోతుంది. నడుస్తున్న కథలో అప్పటికి శ్రీశ్రీ ఇద్దరు హంతకుల్ని కూడా చంపేస్తాడు.  అజయ్ అరెస్ట్ చేయడానికి వస్తే, ముందు పోతురాజుల గూడెం వెళ్లి అక్కడ్నించీ నీ దర్యాప్తు చేసుకో –అని సుమతి దబాయిస్తుంది. లాగి ఓటిచ్చుకుంటుంది కూడా ( ఎంతైనా తెరవెనుక కన్నతల్లే కాబట్టి కొడితే ఓర్చుకుని ఉంటాడు నరేష్, కాస్సేపు పాత్రని  హాయిగా మర్చిపోయి- ఇలా డ్రామా బాగా పండుతుందనుకుని). అజయ్ పోతురాజుల గూడెం వెళ్తే అక్కడున్న సూర్యా రావు తనదైన ఫ్లాష్ బ్యాక్ తో శ్వేత కథ మొదలెడతాడు. ఓ పాట కలుపుకుని ఇరవై నిముషాలు సాగే ఈ ఫ్లాష్ బ్యాక్ నిజానికి అవసరమే లేదు- ఆమె కథ మొత్తం ఫస్టాఫ్ లో చెప్పెశాక. ఇంకా ఆమె అక్కడ ఉద్యమం తీసి పోరాడుతున్నట్టు చూపడం కూడా అసహజం. ఒక రిపోర్టర్ రిపోర్టింగ్ మాత్రమే చేయగలదు, ఉద్యమాలు లేవదీయడం తీయడం ఆమె పని కాదు. ఆ రిపోర్టింగ్ కూడా ఛానెల్ అనుమతిలేకుండా కూడా చేయలేదు. 

     ఈ ఫ్లాష్ బ్యాక్ ముగింపు ఏమిటంటే, ఆ దుష్ట త్రయం సూర్యా రావు కాలు విరగ్గొట్టడం! దీంతో ఫ్లాష్ బ్యాక్ ముగించుకుని ఈ లోకంలో కొచ్చేస్తాడు సూర్యారావు. ‘షోలే’  లో సంజీవ్ కుమార్ చేతులని  గబ్బర్ సింగ్ నరకగానే ఫ్లాష్ బ్యాక్ అయిపోయినట్టు-  అలాటి షోలేయిజం కోసం కాలు విరగ్గొట్టి తాపత్రయ పడినట్టుందే తప్ప, మరే ప్రయోజనమూ లేదు. సూర్యారావు కాలు విరిగితే ఏమిటి, చేతులిరిగితే ఏమిటి? దీనికి బదులు ఇంటర్వెల్లో ఆపిన శ్ర్రీశ్రీ ని ఢీకొనడానికి వచ్చిన ఎసిపి అజయ్ తో కథని ముందుకు నడిపించి వుంటే బావుండేది. 

     ఎసిపి అజయ్  శ్రీశ్రీ ఇంటికి వచ్చేముందు  సూర్యారావు వచ్చి శ్రీశ్రీతో మాట్లాడుతూంటాడు. కట్ చేస్తే ఎసిపి అజయ్ వస్తాడు. ఇప్పుడు చూస్తే  శ్రీశ్రీ గాఢనిద్రలో వుంటాడు. ఎసిపిని చూసి సూర్యారావు దాక్కుని ఉంటాడు. ఇదెలా సంభవం ఒకపక్క ఇంటికొచ్చిన సూర్యారావు ఉండగానే శ్రీశ్రీ నిద్రపోవడం? ఎసిపి వచ్చి మాట్లాడుతున్నా మెలకువ రాకపోవడం, సుమతి చెంపఛెళ్లు మన్పించినా లేవకపోవడం? చెంప వాయింప జేసుకుని ఎసిపి వెళ్తున్నప్పుడే లేస్తాడు శ్రీశ్రీ. అతణ్ణి ఏదోలా చూసుకుంటూ వెళ్ళిపోతాడు అజయ్. కామెడీగా వుటుందీ సీరియస్ సీను- సూర్యారావు కాలు విరిగే సీనులాగే. సినిమాలో కామెడీ లేని లోటు ఇలా తీర్చినట్టున్నారు.

      ఇక శ్రీశ్రీ విషయం. ఛానెల్లో ఆ యెత్తున కూతురి మీద దాడిజరుగుతున్నా మొత్తం ఛా నెల్లో ఇంకెవరూ లేకపోవడం,  సెక్యూరిటీ సిబ్బంది  కూడా లేకపోవడం పోనీలే అని సరిపెట్టుకున్నా, లా ప్రొఫెసర్ శ్రీశ్రీ పోలీసులకి ఫోను చేయకుండా, కూతురి మీద  జరుగుతున్న ఘొరాన్ని  కనీసం చిత్రీకరించకుండా వూరికే తల్లడిల్లి పోతూంటాడు. ఇక కేసెలా గెలుస్తాడు, కేసు గెలవక పోవడానికి తనే కారకుడైనప్పుడు వ్యవస్థ మీద కోపమెందుకు?

       శ్రీశ్రీ చేసే ఇంకో పోరపాటేమిటంటే పనిమాలా కేసు ఫైలు తన ఫోటోతో  సహా ఎసిపికి పంపడం! పాత్ర ఇలా చేయదు, కథ ముందుకు నడవడం కోసం దర్శకుడు, రచయితలూ జోక్యం  చేసుకుని ఇలా చేశారు! 

      ఆ శ్రీశ్రీ రాసి చూపిస్తే, ఈ శ్రీశ్రీ చేసి చూపిస్తాడని ఇచ్చుకున్న బిల్డప్  ప్రకారం కృష్ణ పాత్ర బలంగా గానీ, చేసే హత్యలు ఎమోషనల్ గా గానీ  లేకపోవడం చాలా మైనస్ ఈ సినిమాకి. ఇప్పుడు ఈ తారాగణంతో ఈ సినిమా ఏదో అద్భుతం చేయగలదని కాదు, కనీసం కథా కథనాల్లో, పాత్రచిత్రణల్లో బలంవున్నా, వయసురీత్యా స్టామినా  తగ్గినప్పటికీ అదే ఎస్సెట్ అయ్యేది కృష్ణ పాత్రకి. వయోభారంతో ఓ పెద్ద బాధ్యత మీదేసుకున్న పెద్దమనిషి సతమతమయ్యే మానసిక, శారీరక సంఘర్షణలతో పాత్ర అద్భుతంగా నిలబడేది.  ఆయన కష్టం చూడలేక భార్యా కొడుకూ ఆ ప్రతీకార కాండలో చేతులు కలిపితే ఆ దృశ్యాలు కమర్షియల్ గా మరింత  ప్లస్ అయ్యేవి.    కానీ ఇవేవీ పట్టించుకోకుండా ఒక మూసలో వుండిపోయి,  పాత మూస తరహాలో ఈ సినిమా తీశారు - ఎక్కడా ఆసక్తి గానీ టెన్షన్ గానీ పుట్టించకుండా. దర్శకుడు ముప్పలనేని శివ టేకింగ్ పద్ధతులు కూడా అప్ డేట్ కాలేదు. 

       నాల్గు పాటలూ ఛాయాగ్రహణమూ అంతంత మాత్రంగా వున్నాయి. కృష్ణలో చురుకుదనం తగ్గింది, విజయనిర్మలలో బాగా పెరిగింది. స్ప్లిట్ స్క్రీన్ లో వీళ్ళిద్దరి పాత సినిమాల బిట్లు వేయడం ఓ గిమ్మిక్కు. ఎసిపి పాత్రలో నరేష్ ప్రొఫెషనల్ గా కన్పిస్తాడు. సూర్యారావుగా సాయికుమార్ ఇంకో నారాయణ మూర్తి అనుకోవాలి. ఇక శ్వేత పాత్ర నటించిన అంగనా రే పాత్రకి మించిన చురుకుదనంతో ఓవరాక్టింగ్ చేస్తున్నట్టు వుంటుంది. విలన్లు మురళీశర్మ, పోసానీలు షరామామూలే.

     సినిమా మహేష్ బాబు వాయిసోవర్ తో ప్రారంభమవుతుంది. ఈ వాయిసోవర్ ముగింపులో కూడా వుంటుంది. మహేష్ బాబు, కృష్ణ, విజయనిర్మల, నరేష్ ల తర్వాత ఇక చిట్టచివర్లో- ‘మనం’ లో మిగిలిన అక్కినేని వంశాంకురం అఖిల్ వచ్చినట్టు- ఇక్కడ సుధీర్ వచ్చేసి- మొత్తం ఘట్టమనేని అల్బంని కంప్లీట్ చేస్తాడు! 

     ఇలాటి క్రియేటివిటీని కాస్త కథమీద కూడా చూపించి వుంటే బావుండేది.

-సికిందర్






2, జూన్ 2016, గురువారం

షార్ట్ రివ్యూ!






రచన –దర్శకత్వం : త్రివిక్రం 

తారాగణం :   నితిన్‌, సమంత, అనుపమా పరమేశ్వరన్‌,  నరేష్‌, నదియా, ఈశ్వరీరావు, అనన్య, శ్రీనివాస్‌ అవసరాల,  రావు రమేష్‌, పోసాని కృష్ణమురళి తదితరులు 
సంగీతం: మిక్కీ జె.మేయర్‌, ఛాయాగ్రహణం: నటరాజన్‌ సుబ్రమణ్యం 
బ్యానర్ :  హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌,నిర్మాత: ఎస్‌.రాధాకృష్ణ 
రచన : దర్శకత్వం: త్రివిక్రమ్‌ 
విడుదల: 02-06-2016
        ***

       ఒకే ఫార్ములాతో వరసగా రెండు ఫ్యామిలీ సినిమాలు తీసిన త్రివిక్రం నుంచి మళ్ళీ  అదే ఫార్ములా రిపీట యింది.  విడిపోయిన కుటుంబాలు కలుసుకునే ‘అత్తారింటికి దారేది’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ల తర్వాత  ‘అ ఆ’ సైతం  అదేబాటలో   ‘విడిపోయిన అత్త గారు ఎలా కలిశారు’  ఫార్ములాని రిపీట్ చేసింది. అయితే  ఈసారి హుషారైన రోమాంటిక్ సినిమాలతో క్రేజ్ పెంచుకున్న హీరో  నితిన్ ఇమేజిని కావలసినంత కుదించి,  సమంతాతో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాగా తీయడం ప్రత్యకత. కానీ  సమంతా కైనా ఆ హీరోయినిజం సరీగ్గా లేకపోవడంతో, రెండు కుటుంబాలు వాళ్ళు వాళ్ళు ముచ్చట్లాడుకునే సోప్ ఒపేరాలా కొత్త రూపం ధరించింది. వివరాల్లోకి వెళ్దాం...


 కథ :
        బిజినెస్ వుమన్ మహాలక్ష్మి (నదియా) అంటే భర్తకీ కూతురికీ హడల్. భర్త రామలింగం ( నరేష్), కూతురు అనసూయ ( సమంతా) ఒక జట్టుగా మహాలక్ష్మికి వ్యతిరేకంగా పథకాలేస్తూంటారు.  బెనర్జీ (గిరిబాబు) మనవడు శేఖర్ ( అవసరాల శ్రీనివాస్) తో మహాలక్ష్మి అనసూయకి సంబంధం చూస్తే  నచ్చక ఆత్మహత్యా యత్నం చేస్తుంది అనసూయ. ఆమెని మందలించి, ఈ సంబంధం చేసుకోవాల్సిందేనని,  పది రోజులు పని మీద చెన్నై వెళ్తుంది మహాలక్ష్మి. ఇక్కడ బోరు కొట్టి ఎక్కడికైనా వెళ్తానని మహాలక్ష్మి అంటుంది. ఆమెని ఏనాడో దూరమైన తన బావగారి వూరు కల్వపూడికి రహస్యంగా పంపించేస్తాడు రామలింగం- వెంట హైదరాబాద్ లోనే పనిచేస్తున్న మేనల్లుడు ఆనంద విహరి( నితిన్) నిచ్చి. ఆనంద్ తో వెళ్లి అనసూయ వాళ్ళింట్లో దిగుతుంది. ఆమె ఎవరో తల్లి కామేశ్వరి ( ఈశ్వరీ రావు)కీ, చెల్లెలు భాను (అనన్య) కీ పరిచయం చేస్తాడు ఆనంద్. అక్కడ తన డిమాండ్లతో, చిలిపి పన్లతో సరదాగా కాలం గడుపుతున్న అనసూయకి- ఆనంద్ ఏనాడో వూరిపెద్ద పల్లం వెంకన్న  ( రావురమేష్) కూతురు వల్లి ( పరమేశ్వరన్)తో సంబంధం కుదిరిందని తెలిసి జెలసీ ఫీలవుతుంది. ఇంతలో తను హైదరాబాద్ లో ఇంట్లో లేదన్న సంగతి తల్లికి తెలిసిపోయి వచ్చేస్తూంటే, ఆనంద్ ఆమెని తీసుకుని ఆమె తల్లి చేరుకునే లోగా ఇంటిదగ్గర దిగ బెట్టేస్తాడు. 

        ఇప్పుడేం జరిగింది? ఆనంద్ లేకుండా అనసూయ ఇంటిదగ్గర వుండగల్గిందా? ఆనంద్ నాగవల్లిని చేసుకోవడానికి ఒప్పుకోవడానికి కారణమేమిటి? మహాలక్షికి అనసూయ కల్వ పూడికి వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందా? తెలిస్తే ఏం జరిగింది? మహా లక్ష్మికి  ఆనాడు తన అన్నతో జరిగిన గొడవేంటి? ఎందుకు విడిపోయారు? ఇప్పుడెలా కలిశారు?...ఇవీ మిగతా కథలో తీర్చుకోవాల్సిన సందేహాలు. 

 ఎలావుంది కథ
        ముందుగానే చెప్పుకున్నట్టు మేనరికాల పాత కథే. విడిపోయిన కుటుంబాల రొటీన్ కథే. చూసి చూసి చూసి వున్న రీసైక్లింగ్ కథే. ఇన్నేసి సార్లు తీస్తున్న వాళ్లకే  విసుగులేనప్పుడు, కొందరు చూసే వాళ్ళకి ఎందుకుండాలి? మళ్ళీ మళ్ళీ చూసేయాలి. తప్పకుండా చూడాలి.

 ఎవరెలా చేశారు 
         ఓపెనింగ్ సీనుతో మొదలెడితే,  తన వాయిసోవర్ తో అక్కడక్కడా కథా గమనాన్ని చెప్తూ సాగే సమంతాకి కేవలం గ్లామరస్ పాత్రే ఇది. ఈ విషయంలో ఈ సినిమాకి హైలైట్ గా కనిపిస్తుంది, పాత్రపరంగా చెప్పుకోవాలంటే హీరోయిన్ ఓరియెంటెడ్ అయిన ఈ కథలో తనకి కథ నడిపే పనికూడా లేదు, కేవలం దర్శకుడు ఏర్పాటు చేసే ఆయా సీన్లలో చిలిపిగా నటించుకుపోవడమే. 

        ఇది నితిన్ కథతో సినిమా కాదు కాబట్టి పాసివ్ పాత్ర అని కూడా అనలేకుండా సహాయ పాత్రగా కన్పిస్తాడు. సహాయ పాత్ర కాబట్టి ఒక హీరో కుండే గోల్, సంఘర్షణ వగైరా లేక- చూస్తే  చూడండి, పోతే పోండి - అన్నట్టు వుంటాడు. ఈ సినిమా కథ విషయంలో, ప్రధాన పాత్ర విషయంలో ఇక నిర్వచనాలు మార్చుకోవాలన్న ధోరణిలో వుంటుంది. 

        ఇతర పాత్రల్లో నదియా, నరేష్ లు ఆకట్టుకుంటారు. అయితే రావురమేష్ ఉన్న కొన్ని సీన్లలో ఎక్కువ ప్రభావం చూపిస్తాడు- ఫన్నీ డైలాగులతో. సినిమా ముగింపు షాట్ అతడిమీదే వుంటుంది- అప్పుడు పలికే చిన్న డైలాగుతో బాగా హోరెత్తించేస్తాడు. హిందీ విలన్లు రాజ్యమేలుతున్న కాలంలో రావు రమేష్ ఒక్కడే విలనీకి తెలుగుదనాన్ని నూరిపోస్తున్నాడు. 

        మిక్కీ జె మేయర్ పాటలు తెర మీద చూస్తున్నంత సేపే- బయటికొస్తే ఒక్కటీ గుర్తుండవు. ఈ పాటలకీ,  మిగతా అన్ని దృశ్యాలకీ నటరాజన్ సుబ్రహ్మణ్యం కెమెరా పనితనం క్లాస్ లుక్ ని తీసుకొచ్చింది. నితిన్ కి తొలిసారిగా చాలా పెద్ద బడ్జెట్ తో ఎక్కువ సాంకేతిక ప్రమాణాలున్న సినిమా దక్కింది.

చివరికేమిటి!
        చూసిందే చూడాలనుకుంటే చూడొచ్చు. షరతులు వర్తిస్తాయి : ఏ హీరోయినిజమూ, హీరోయిజమూ ఆశించకూడదు. త్రివిక్రమ్ సినిమాల్లో ఏ స్క్రీన్ ప్లే స్ట్రక్చరూ, క్యారక్ట రైజేషన్  లూ వుండవన్న నిర్ధారిత సత్యానికి ఈ సారి మాటల బలం కూడా లేకుండా పోయింది. ఇదలా ఉంచితే, చాలా తక్కువ చోట్ల మాత్రమే సీన్లలో పెప్, హుషారు కన్పిస్తాయి. అలాగే  పాత్రలకి గోల్ లేకపోవడంతో సెకండాఫ్ లో కూడా ఎంత సేపూ కథ ప్రారంభంకాక, చాలా సేపూ డల్  అయిపోతుంది. క్లయిమాక్స్ కొచ్చేసరికి, అది  నితిన్ పాత్ర మీద బలవంతంగా రుద్దిన ముగింపులా  కన్పిస్తుంది. సమంతాని అతను  వాళ్ళింట్లో అప్పజెప్పేసి వెళ్తున్నప్పుడు నితిన్ చెల్లెలి పాత్ర అనే ఒక మాటతో- “నా ఆనందం  నా గెలుపులో చూసుకోవాలి, ఎదుటి వాడి ఆనందంలో  ఎందుకు చూడాలి” - అని వెనక్కి వెళ్లి తండ్రి దగ్గర్నుంచి సమంతాని లాక్కుంటాడు.  నితిన్ పాత్ర  పాజిటివ్ అయివుంటే ఇలా చేయదు- త్యాగం చేసి వెళ్లి పోవాల్సిందే. అసలు ఎదుటి వాళ్ళ విజయాల్ని మనం ఎంజాయ్  చేస్తేనే  అలాటి విజయాలు మనకొస్తాయ్ - ఇది పాజిటివ్ అవుట్ లుక్!


-సికిందర్
cinemabazaar.in