రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

22, మే 2016, ఆదివారం

స్క్రీన్ ప్లే సంగతులు

     మనుషులు- మమతలు, ఆస్తులు- అంతస్తులు, ఉమ్మడి కుటుంబం- ఒకే కుటుంబం,  నా ఇల్లు నా వాళ్ళు- మంచి కుటుంబం, మన సంసారం- వింత  సంసారం, కలసి వుంటే కలదు సుఖం- మనసే మందిరం,  సాంప్రదాయం- శ్రావణ మాసం, పసుపు కుంకుమలు- బంగారు గాజులు, తోడికోడళ్ళు – భలే కోడళ్ళు, ఇల్లరికం- ఇంటి దొంగలు, తండ్రీ కొడుకులు-పెత్తందార్లు, గొప్పవారి గోత్రాలు-  పంతాలు పట్టింపులు, సీతా కల్యాణం- రుక్మిణీ కల్యాణం, కల్యాణ మంటపం- ఊరంతా సంక్రాంతి, లోకం చుట్టిన వీరుడు- చుట్టాలొస్తున్నారు జాగ్రత్త, ఊరికి ఉపకారి- మనిషి రోడ్డునపడ్డాడు...
          ఈ సినిమా టైటిల్సే ‘బ్రహ్మోత్సవం’ కథ!  ఇంకా  హమ్ ఆప్ కే హై కౌన్ – హమ్ సాథ్ సాథ్ హై,  మై ప్రేమ్ కీ దీవానీ హూ- వివాహ్ లాంటి సూరజ్ బర్జాత్యా ఆడవాళ్ళ విందులూ వంటకాల –పాటల పోటీల సినిమాల టైటిల్స్  కూడా కలుపుకోవచ్చు. 


          కొత్త సినిమాలో పాత  సినిమాల వాతావరణం వుండకూడదని కాదు. మారుతీ కారు వుంది, ఇంకా అది పాత మారుతీ కారులా లేదు. అప్పుడూ ఇప్పుడూ పోలీసు వున్నాడు గానీ, ఇంకా పాత నిక్కర్లేసుకు లేడు. ఇప్పుడు పాత సినిమాల వాతావరణం ఉండొచ్చు గానీ, ఇంకా పాత  వాసనలు  వేస్తేనే సమస్య. పాయింటు సమకాలీనమై వుంటే వాతావరణం పాత సినిమాల వాతావరణంలా వున్నా, కొత్త వాసనతో సర్దుకు పోవచ్చు. పాయింటూ ఆనాటిదే, వాతావరణమూ వాసనా ఆనాటివే  అయినప్పుడు, ఇంకా ఈ కాలపు దర్శకులెందుకు?  పాత సినిమాలే చూసుకుంటారు ప్రేక్షకులు. ప్రతీ రెండేళ్ళ  కోసారి కొత్త యువతీ యువకులు సినిమాలు చూసే  ప్రేక్షకుల వుతూంటే, వాళ్ళ కాలం కాని కాలపు సినిమాలు వాళ్ళ కెలా  కనెక్ట్ అవుతాయి? వాళ్ళకున్న కాలీన స్పృహ సినిమాలు తీసే వాళ్ళకి అస్సలు వుండక పోవడమేమిటి?  

     యూత్ సినిమాలు  ఫ్యామిలీల కోసం తీయకపోవచ్చు గానీ, ఫ్యామిలీ సినిమాలు తప్పక యూత్ కోసం కూడా తీయాలి- ఆ స్టార్ కి వాళ్ళూ  ఫ్యాన్స్ అయి వుంటారు గనుక. ఫ్యామిలీ సినిమా ఫ్యామిలీస్ కీ  యూత్ కీ  కనెక్ట్ అయ్యేట్టు మధ్యే మార్గంగా తీయాల్సి వుంటుంది. కానీ యూత్ ని  విస్మరించి, ఫ్యామిలీ సినిమా అంటూ ప్రిన్స్ మహేష్ బాబుతో  ‘బ్రహ్మోత్సవం’ అనే  చాదస్తం తీశారు. పోనీ ఈ చాదస్తం ఫ్యామిలీస్ కైనా కనెక్ట్ అయ్యే పాయింటుతో  ఉందా అంటే అదీ లేదు. ఫ్యామిలీ ప్రేక్షకులంటే  ఎవరు? అత్యధికంగా 45 లోపు వయస్కులే. వీళ్ళల్లో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పరిచయమున్న వాళ్ళు, అనుభవించిన వాళ్ళు, కోరుకుంటున్న వాళ్ళూ ఎందరుంటారు. దాదాపు వీళ్ళ తల్లి దండ్రులే ఆ వ్యవస్థలో వుండి వుండరు. అప్పటికి జమీందారీ ఫ్యూడల్ వ్యవస్థ పోయింది. దాంతో బాటే ఉమ్మడి కుటుంబ వ్యవస్థా అంతరించిపోతూ వచ్చింది. ఇప్పటి 45 లోపు వయస్కుల తల్లిదండ్రులకి  ఉమ్మడి కుటుంబ వ్యవస్థతో తెగిపోతూ వచ్చింది. వీళ్ళ నుంచి వేర్పడి వీళ్ళ పిల్లలు కొత్త చదువులు చదువుకుని ప్రపంచీకరణలో భాగమవుతున్నారు- దూర తీరాలకి తరలిపోతున్నారు. తప్పనిసరై న్యూక్లియర్ ఫ్యామిలీస్ గా ఏర్పడుతున్నారు. న్యూక్లియర్ ఫ్యామిలీల ట్రెండ్ రెండు దశాబ్దాల క్రితమే మొదలైంది. ఈ రెండు దశాబ్దాల కాలంలో వృద్ధులై పోయిన తల్లిదండ్రులు సర్దుకు పోయారు - అది కూడా ఉమ్మడి కుటుంబ వాతావరణాన్ని అనుభవిస్తూనే- కాకపోతే ఇది వర్చువల్ రియాలిటీ. కావలసినంత టెక్నాలజీ తో ప్రపంచమే ఒక కుగ్రామమై పోయాక ఇంకా అందరూ కలిసే వుండాలని ఎవరు దబాయిస్తారు- బడాయిగా కొందరు దర్శకులు తప్ప?  న్యూక్లియర్ ఫ్యామిలీస్ మళ్ళీ ఉమ్మడి కుటుంబాలుగా మారిపోతాయనా? అప్పట్లో టైము కాగానే దూరదర్శన్ చిత్ర లహరి పాటల కోసం టీవీల ముందు కొలువు దీరినట్టు- ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ ట్రెండ్ లో కూడా రాత్రి  కాగానే కంప్యూటర్ ఆన్ చేసుకుని స్కైప్ లో ఎక్కడెక్కడో వున్న తమ వాళ్ళని చూసుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ, నవ్వుకుంటూ, కాలసినంత సమయం ఆనందలహరిలా గడిపేసి-  దీని తస్సాదియ్యా, ఇంతకంటే ఏం కావాల్రా మనిషి జన్మకీ? -  అని జాడించి  ముసుగు తన్ని పడుకుంటున్నారు!  

      ఎవరన్నారు అందరూ కలిసి వుండడం లేదని? ప్రపంచమే ఒక కుగ్రామమై పోయింది. ఆ కుగ్రామమే ఉమ్మడి కుటుంబం, వసుధైక కుటుంబం. పోగొట్టుకున్నది తిరిగి  ప్రకృతే మరో రూపంలో ఇస్తుంది, ఏమీ దిగులుపడ నవసరం లేదు. ఒకవేళ ఇంకా దిగులు పెట్టుకుంటే ఆ దిగులు తీర్చే సినిమాలుండాలి గానీ, సమస్యతో సంబంధంలేని పాత సంగతులు  చెబితే ఆ సినిమాలది వేరే దారి అయిపోతుంది. అనుబంధాలెప్పుడూ అర్జెంటు సమస్యే కాదు, డబ్బే అర్జెంటు సమస్య. డబ్బులేక పస్తులు పడుకుంటున్నాయి కుటుంబాలు. సంపాదన వుంటేనే అబ్బాయికి పెళ్లి సంబంధం కుదురుతోంది, ఇంటి నిండా  బంధువులుంటే కాదు. మిగతావన్నీ- అనుబంధాలూ ఆత్మీయతలూ చుట్టరికాలూ సెంటిమెంట్లూ ఫీలింగులూ - ఇవన్నీ సెకండరీ.  
***
        ‘బ్రహ్మోత్సవం’ సమస్య ఐడియాతో బాటు స్ట్రక్చర్ సమస్య కూడా. డబుల్ ట్రబుల్ అన్నమాట. స్ట్రక్చర్ లేకపోయినా కొన్ని సార్లు స్టార్ సినిమాలు ఆడేస్తాయి- ఐడియా లేకపోతే మాత్రం మొరాయిస్తాయి. సామాజిక సమస్య అయినా, రాజకీయ సమస్య అయినా, కుటుంబ సమస్య అయినా  వర్తమాన కాలపు సమస్యల్ని ప్రతిబింబిస్తేనే అమ్ముడుపోయే ఐడియా అవుతుంది. ఇప్పటి తరానికి  తెలీని ఏనాటివో ఉమ్మడి కుటుంబాల కథలూ సమస్యలూ తీసినప్పుడు, వరకట్న కథలు, బాల్య వివాహాల కథలూ, వితంతు వివాహాల కథలు, సతీ సహగమనాల కథలూ, బాంచెన్ దొరా కథలు కూడా తీయాలి కదా? అవేం పాపం చేసుకున్నాయి? ఉమ్మడి కుటుంబాల కథలే రూపం మార్చుకుని కాలానికి తగ్గట్టు ఫ్యాక్షన్ కుటుంబాల కథలుగా మారిపోయాయి. అవి కూడా అరిగిపోయాయి. అసలు ఏ ఇజాలూ, నీతులూ లేని ‘మనం’ లాంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఎంత హాయిగా వుందని?
\
        ‘బ్రహ్మోత్సవం’లో  ఇంటి పెద్ద సత్యరాజ్ ది తన వాళ్ళందరూ తన చుట్టూ వుండాలన్న మనస్తత్వం. జీవితాన్ని పదిమందితో కలిసి సంబరంగా గడుపుకోవాలని కోరిక. ఏ చిన్న అవకాశం  దొరికినా పండగలకీ పబ్బాలకీ బంధువులందర్నీ పిలిపించుకుని భారీ ఎత్తున ఉత్సవాలు జరుపుకుంటాడు. అలా నల్గురు బావమరుదుల్ని ఏనాడో వాళ్ళ కుటుంబాలు సహా ఇంద్రలోకాన్ని తలపించే భవనంలో తెచ్చి పెట్టుకున్నాడు. ఆనాడెప్పుడో మామ దగ్గర నాలుగు వందలు తీసుకుని ఈనాడు నాల్గు వందల కోట్ల విలువజేసే  పెయింట్స్ తయారుచేసే ఫ్యాక్టరీకి యజమానిగా ఎదిగాడు.  బావమరుదులందరికీ ఫ్యాక్టరీలో వాటాలిచ్చాడు. కానీ వాళ్ళకే పెత్తనమూ వుండదు. ప్రతీదానికీ  ముందు నేను మాట్లాడాలీ అంటాడు. తనే మాట్లాడతాడు. తన ప్రకారమే అన్నీ జరుగుతాయి ఇంటా బయటా. ముగ్గురు బావ మరుదులు ఇదేదో తిని ఎంజాయ్ చేయడానికి బావుందన్నట్టు ఆ ఇల్లరికాన్ని అనుభవిస్తున్నా, పెద్ద బావమరిది రావురమేష్  మాత్రం ఆత్మాభిమానం కలవాడు. ఈ వాతావరణంలో ఇమడలేకపోతాడు. అతడిది అస్తిత్వ సమస్య. బానిసలా బతకలేకపోతాడు. మనిషికూడా మొహాన ఏ నవ్వూ లేకుండా పిచ్చాడిలా ఉంటాడు- ‘అహ నా పెళ్ళంటా’ లో కోట శ్రీనివాసరావు లాగా, ‘హేరాఫేరీ’ పరేష్ రావల్ లాగా. 

        భార్య జయసుధ అతడికి సర్ది చెబుతూ వుంటుంది- హనుమంతుడి స్థానం రాముడి పాదాల చెంతే అయినా అతణ్ణి మనం పూజించడం లేదా? – అని. రావురమేష్ కి హనుమంతుణ్ణి  అవ్వాలని వుండదు. తన కూతురు ప్రణీతని మేనల్లుడు మహేష్ బాబు కిచ్చి చేస్తే ఈ ఇంట్లో తనకో గుర్తింపు వస్తుందన్నఆశతో ఉంటాడు. కానీ  ఈ విషయం బావగారు సత్యరాజ్ తో చెప్పలేక పోతాడు. 

        ఇలా వుండగా ఫారిన్నుంచి సత్యరాజ్ స్నేహితుడి కూతురు కాజల్ అగర్వాల్ వస్తుంది. మహేష్ బాబు ఈమెతో ప్రేమలో పడతాడు. ఇతడికి ఇంట్లో వున్న మరదలు ప్రణీత నచ్చదు. ఇక రావు రమేష్ మనసులో మాట ఎవరో చెప్తే సత్యరాజ్ కి తెలుస్తుంది. దీనికి తన నిర్ణయం ఏమిటో చెప్పడు. అంతా కలిసి టూరుకి వెళ్తారు. అక్కడ కాజల్ చెప్పేస్తుంది మహేష్ బాబుకి- తను ఇంత పెద్ద కుటుంబంలో ఇమడలేనని. అంటే పెళ్లి చేసుకుని తనని బయటికి రమ్మంటోందని అర్ధమైపోయిన మహేష్ బాబు, ఆమెకో కిస్ పెట్టి బై చెప్పేస్తాడు.  దేని గురించీ అతను ఎక్కువ ఆలోచించడు. ఏదైనా అనేశాక లేక చేసేశాక, ఎక్కువ ఆలోచించ లేదనేస్తాడు.  ఈ ముద్దు సీను రావు రమేష్ చూసి అపార్ధం జేసుకుంటాడు. ఇక తన కూతురు ఈ ఇంటి కోడలు కాదన్న బాధకి, తను బానిసగా పడివుంటున్నాడన్న ఆక్రోశం కూడా తోడై, సత్యరాజ్ ని నానా మాటలంటాడు. ఈ మాటలకి సత్యరాజ్  తీవ్రంగా హర్ట్ అవుతాడు. మహేష్ బాబుతో కూర్చుని వేదాంతంలోకి వెళ్లి పోతాడు. తన ఏడుతరాల బంధువుల్ని ఒక దగ్గర చూడాలన్న కోరిక చెప్పి చనిపోతాడు. 

        లండన్ నుంచి మహేష్ బాబు చెల్లెలి ఫ్రెండ్ నని చెప్పుకుని సమంత వస్తుంది. ఈమెతో కలిసి మహేష్ బాబు ఏడుతరాల వేటలో పడతాడు. హరిద్వార్, వారణాసిలకి  వెళ్లి అక్కడ పూర్వీకుల వివరాలతో పూణే,  సోలాపూర్, కర్ణాటకలో ఇంకేదో వూరు, ఇంకో చోటు,  ఇంకో నగరం ఇలా తిరిగేస్తూ బంధువుల్ని కలుసుకుని ఒకచోట ఉందాం రమ్మంటాడు. పనిలో పనిగా సమంతా తో ప్రేమలో పడతాడు. ఆఖర్న ఒక చోట రావు రమేష్ ఎదురవుతాడు. 

        ఇక ఉమ్మడి కుటుంబం లోంచి వెళ్ళిపోయిన రావురమేష్ కూతురు ప్రణీతకి వేరే సంబంధం చూసి పెళ్లి చేస్తూంటాడు. ఈ పెళ్ళికి మహేష్ బాబునీ, అతడి తల్లినీ పిలవడు. పిలవకపోయినా తండ్రి చెప్పులేసుకుని, తల్లిని తీసుకుని వెళ్తాడు మహేష్ బాబు. అక్కడ రావురమేష్ తన తప్పు తెలుసుకుని కలిసి పోయేట్టు చేస్తాడు. 

        ఇదీ కథ. ఈ కథలో రెండు ఐడియాలు కన్పిస్తూనే వున్నాయి : ఉమ్మడి కుటుంబంలో అపార్ధాలు తొలగించడం, ఏడు తరాల వారసుల్ని వెతకడం. ఈ రెండూ  పొసగని ఐడియాలని కూడా తెలుసు. సత్యరాజ్ మరణం వరకూ ఒక ఐడియా, మరణం తర్వాత ఇంకో ఐడియా. సత్యరాజ్ మరణం వరకూ రావు రామేష్ తో సమస్య, మరణం తర్వాత సత్యరాజ్ కోరిక తీర్చే సమస్య. సత్యరాజ్ మరణం ఫస్టాఫ్ వరకూ రావురమేష్ ఆత్మాభిమానం, అమ్మాయి పెళ్లి సమస్య; సత్యరాజ్ మరణం తర్వాత సెకండాఫ్ లో సత్యరాజ్ కోరిక ప్రకారం మహేష్ బాబు ఏడుతరాల  బంధువుల్ని వెతికే సమస్య. 

        రాముడు పుచ్చకాయ కోసం ఇంట్లో గొడవ పడుతూంటే రంగడు  వంకాయల కోసం ఎలా వెళ్తాడు? గొడవ ఇంకా పెంచే ఉద్దేశముంటే వెళ్ళొచ్చు. నువ్వెంత నీ పుచ్చ కాయెంత? (నువ్వెంత నీ ఆత్మాభిమానం, నీ కూతురి పెళ్ళీ ఎంత?), నువ్వు పోతే మాకు
వంకాయల్లేవా? (ఏడుతరాల బంధువులు లేరా?)
అని చూపించి అవమాన పర్చడానికైతే తప్పకుండా వెళ్లి రావొచ్చు. అలాజరిగిందా?

           
కాబట్టి ఈ కథని  ఐడియా దశలోనే చిన్న పిల్లలకి కూడా చెప్పి నమ్మించలేమని తేలుతోంది. చిన్న పిల్లలు కూడా- రావు రమేష్ మామయ్య పుచ్చకాయ అడిగితే పుచ్చకాయ ఏదీ?- అని చంపి వదిలి పెడ్తారు.   

        ఐడియాలో కూడా స్ట్రక్చర్ వుండాలి. స్ట్రక్చర్ తో బాటు కథకి అవసరమైన ఆర్గ్యుమెంట్ వుండాలి.  ఆర్గ్యుమెంట్ ఉంటేనే అది కథవుతుందనీ, కమర్షియల్ సినిమాలకి ఇదే పని కొస్తుందనీ;  కానీ ఆర్గ్యుమెంట్ కాకుండా  స్టేట్ మెంట్ మాత్రంగా వుంటే అది కథగా కాక,  గాథ అవుతుందనీ,  గాథలు కమర్షియల్ సినిమాలకి పనికి రావనీ గతంలో కొన్నిసార్లు చెప్పుకున్నాం. ఇక ఐడియాలో స్ట్రక్చర్ లేకపోతే కథగా విస్తరించడానికి పనికి రాదనేది చాలా జనరల్ నాలెడ్జి. ఒక అయిడియా అనుకుంటే అందులో బిగినింగ్ (సమస్య)  మిడిల్ (సంఘర్షణ), ఎండ్ (పరిష్కారం)  ఉంటేనే ఆ ఐడియాని పనికొస్తుంది.  

       
ఓ పెళ్ళయిన జంట నాగ చైతన్య- సమంత రోడ్డు ప్రమాదంలో మరణిస్తారు ( బిగినింగ్- సమస్య), వాళ్ళ కొడుకు నాగార్జున పెద్దయి పునర్జన్మ ఎత్తిన తన తండ్రి నాగ చైతన్యని చూసి, అతణ్ణి తల్లి సమంత తో కలపాలని అన్వేషణ ప్రారంభిస్తాడు (మిడిల్- సంఘర్షణ), ఆ అన్వేషణలో పూర్వ జన్మలో తన భార్య శ్రియని, తామిద్దరి కుమారుడే అయిన అక్కినేని నా గేశ్వరరావునీ చూసి, మొత్తం అందర్నీ ఒకటి చేస్తాడు ( ఎండ్- పరిష్కారం). 

       
ఇదీ మనంస్టోరీ ఐడియా.
        ఈ ఐడియాలో బిగినింగ్-మిడిల్- ఎండ్ లతో ఒక స్ట్రక్చర్ కన్పిస్తోంది.

        ‘బ్రహ్మోత్సవం’ స్టోరీ ఐడియా ఇలా వుంటుంది  – ఉమ్మడి  కుటుంబంలో తన స్థానం కోసం, కూతురి పెళ్లి కోసం  రావు రమేష్ తపిస్తూంటాడు (బిగినింగ్- సమస్య),   మహేష్ బాబు కాజల్ ని ముద్దాడడం చూసి తన సంగతి తేల్చుకోవడానికి రావురమేష్ సత్యరాజ్ తో గొడవ పడతాడు (మిడిల్ –సంఘర్షణ), మహేష్ బాబు ఏడుతరాల వారసుల్ని వెతకమన్న తండ్రి కోరికతో వారసుల అన్వేషణ ప్రారంభిస్తాడు ( ఎండ్- పరిష్కారం).

 
       ఈ ఐడియాలోనే స్ట్రక్చర్ లేదు. మొదలైన సంఘర్షణ  ఒకటైతే  పరిష్కార మార్గం వెతకడం ఇంకొకటిలా వుంది.  

       
కాబట్టి ఈ రెండూ విడివిడి ఐడియాలు. వీటిని ఒకే కథగా చేయాలంటే ఒకదాన్ని  ప్రధాన కథ చేసి, రెండో దాన్ని ఉపకథగా మార్చాలి. కానీ రెండూ భిన్న కథా వస్తువులు, కుదరదు.  అప్పుడు ఇంటర్వెల్ల్ దగ్గర ఆగిపోయిన ఉమ్మడి కుటుంబం కథని సెకండాఫ్ లో పూర్తిగా కొనసాగించి ముగించాలి, లేదా ఇంటర్వెల్ నుంచీ ప్రారంభమైన ఏడుతరాల కథని సినిమా ప్రారంభంనుంచీ మొదలెట్టాలి. అంటే ఏదో ఒక ఐడియాతోనే ఈ సినిమాకి కథ అనేది సాధ్యమవుతుందన్న మాట. 

         మొదటి ఐడియా ఉమ్మడి కుటుంబం కథనే కొనసాగించాలంటే ( రావురమేష్ తో సమస్య పరిష్కారం) అది మహేష్ బాబు లాంటి బిగ్ స్టార్ కి సరిపోదు. చిన్న హీరోతో చిన్న కుటుంబ కథా  చిత్రంగా తీసుకోవాలి సమకాలీనం చేసి. 

        మహేష్ బాబుతో ఏడుతరాల కథనే చేయాలంటే – ఇది కూడా  పదిసార్లు ఆలోచించాలి. ఎందుకంటే, ఎంత వెతికినా అసలు ఒక హీరో తన వంశ మూలాల్ని వెతుక్కునే కథతో సినిమాలే కనిపించడంలేదు. వుంటే డాక్యుమెంటరీలున్నాయి, లేకపోతే టీవీ సీరియల్స్ వున్నాయి అమెరికాలో. ఇలాటి ఐడియాతో సినిమా చేస్తే డాక్యుమెంటరీ ఫీల్ వస్తుందనేమో- ‘బ్రహ్మోత్సవం’ ఇలాగే  తయారయ్యింది కదా డాక్యుమెంటరీ చూస్తున్నట్టు.  అందుకే మూలాల్ని వెతుక్కునే సినిమా కథలు పునర్జన్మ కథలుగా ఉంటున్నాయోమో. పునర్జన్మ సినిమాలకి వర్కౌట్ అయ్యే కమర్షియల్ ఫార్ములా. మూలాల్ని వెతుక్కునే కథతో ‘మనం’ కూడా పునర్జన్మల కథే గా? 

        కాబట్టి ఈ రెండు ఐడియాలూ - ఒకటి కాలదోషం పట్టి, ఇంకోటి ప్రాప్త కాలజ్ఞత లోపించి భారీ నష్టాల్ని తెచ్చిపెట్టాయి. నిజంగా ఒక ఐడియా జీవితాల్నే మార్చేస్తుంది!
***
స్ట్రక్చర్  సంగతులు
    సినిమా ప్రారంభం మొదలుకుని అరగంట సేపూ పెళ్లి వేడుకలూ ఇంకేవో సంబరాలే. సత్యరాజ్ కూతురి పెళ్ళితో ప్రారంభం.  ఇది పావుగంట సేపు సాగుతూనే వుంటుంది. దీన్ని అడ్డం పెట్టుకుని ఆ ఉమ్మడి కుటుంబంలో ఆనందాలన్నీ, విందూ వినోదాలన్నీ, కోలాటాల్నీ కూడా  చూపించారు. తెలుగుదనం @ 112 డిగ్రీలు. పెళ్ళవగానే ఇంకేవో వేడుకలు. మొత్తం 50, 60 మంది చిన్న పెద్దా ఆడవాళ్ళే ఎప్పుడు చూసినా గుంపులు కట్టి కనపడతారు. ఖరీదైన వస్త్రాలూ ఆభరణాలూ ధరించి కారాలు దంచడం, పచ్చళ్లేసుకోవడం లాంటి తెలుగుదనపు పనులు చేస్తూంటారు. ఇన్ని కుటుంబాల్లో మగపిల్లలే పుట్టలేదా మహేష్ బాబు తప్ప అన్నట్టు వుంటుంది మొత్తం ఆడ జనాభాని చూస్తూంటే. లేక పుడుతూంటే చంపేశారా ఆడ శిశువుల హత్యలకి నిరసనగా? బేటీ బచావో బ్రిగేడా వీళ్ళంతా? మహేష్ బాబు ఒక్కడే ఎలాగో తప్పించుకున్నాడా? ఇదేదో విచారణకి ఆదేశించాల్సిన పెద్ద గూడుపుఠాణీ. 

        పోతే మహేష్ బాబుకి ఫ్రెండ్స్ కూడా ఉండరా? డ్రీమ్ సాంగ్స్ అప్పుడు మాత్రం సడెన్ గా మగ డాన్సర్లు దూకి  ఆడేస్తూంటారు. అంత మంది ఆడవాళ్ళతో  మహేష్ బాబు ఒక్కడే ఆటాపాటా. ఇలా చూపించి  దర్శకుడు ఆడవాళ్ళందరూ గోపికలన్నట్టూ, మహేష్ బాబు గోపికల మధ్య కృష్ణుడన్నట్టూ తప్పుడు అర్ధం వచ్చేలా చేశాడు. 

        అంత మంది కుటుంబ సభ్యులయిన ఆడవాళ్ళలో గానీ, వేడుకలకి వచ్చిన అమ్మలక్కల్లో గానీ,  ఒక్కరూ నవ్వించే కోవై సరళ, ఝాన్సీ, హేమ లాంటి కమెడియన్సే లేకపోవడం పెద్ద లోపం. ఇక మగ కమెడియన్స్ అయితే పత్తా లేరు, సెకండాఫ్ లో ఎప్పుడో వెన్నెల కిషోర్ వచ్చికాస్సేపు ఏదో కామెడీ చేయడం తప్ప. 

        ఈ అరగంటలో నాలుగు పాటలు పెట్టేశారు (విడుదలైన రోజు సాయంత్రానికి సినిమా మీద 12 నిమిషాల కత్తెరేసినప్పుడు  ఈ పాటల్లోంచి ఒకటి పోయింది). ఇంత సేపూ ప్రధాన పాత్ర మహేష్ బాబు అప్పుడప్పుడు మాత్రమే కన్పిస్తూ, నల్గురు అత్తలతో, తల్లితో అంటీ ముట్టనట్టు సెంటిమెంట్లు ఒలికిస్తాడు. చెల్లెలి పెళ్లిలో ఓ చెయ్యేస్తున్న అన్నలా పెద్దరికం వహిస్తూ తిరగడు (సినిమా సాంతం ఓ ఫ్యాషన్ పరేడ్ లా, క్యాట్ వాక్ లా తన ఇమేజిని ప్రదర్శించుకోవడం తప్ప, పాత్రలో విషయం లేదు. అర్జెంటుగా పవర్ఫుల్ పాత్రలతో పక్కా  కమర్షియల్స్  చేస్తే తప్ప ఈసారి ఆయన అభిమాన సంఘాలు కూడా వూరుకునేట్టు లేవు).

       
అరగంట తర్వాత కాజల్ అగర్వాల్ వచ్చాకే ఇంతసేపూ ఆటాపాటలతో సాగిన మొనాటనీ పోతుంది. ఇక కాజల్ తో ప్రేమకథ గా స్వరం మార్చుకుంటుంది సినిమా. కౌంటర్ గా రావు రమేష్ ఆశయం వుంటుంది. ఈ ప్రేమ ట్రాకులోనే రెండు కీలక సన్నివేశాల్లో  ‘సీనస్ ఇంటరప్టస్’ అనే దృశ్యభంగ అనౌచిత్యాలకి పాల్పడ్డారు. ఇవి తీవ్ర అసంతృప్తికి గురిచేస్తాయి. 

        1. కాజల్ తన తండ్రితో తన ప్రేమ విషయం  చెబుతూ పూర్తిగా చెప్పకుండా ఆపేస్తుంది, మళ్ళీ దీని కొనసాగింపు వుండదు. వాళ్ళిద్దరి మధ్య దాని ఊసే వుండదు. 

        2. కూతురి పెళ్లి గురించి రావురమేష్ అనుకుంటున్నాడని  సత్యరాజ్ తెలుసుకుని మహేష్ బాబుతో మాట్లాడాలనుకున్నప్పుడు ఇద్దరి మధ్యా కామెడీగా దాగుడు మూతలు పెట్టారు – ఏంటీ ఏదో చెప్పాలనుకుంటున్నారూ?- అని డైలాగేదో మహేష్ పలికేసరికి చెప్పలేక పోతాడు  సత్యరాజ్.  ఈ సీన్ కూడా అక్కడ అలాగే కట్ అయిపోతుంది.

        కథ పట్ల, పాత్రలపట్ల పూర్తి  అవగాహన లేనప్పుడే దాటవేస్తూ ఇలాటి ‘సీనస్ ఇంటరప్టస్’ కి పాల్పడతారు. ఒక కీలక మలుపుకి దారితీసే విషయమేదో మనం తెలుసుకోబోతున్నామని ఉత్సుకతకి లోనవుతూంటే, దాని మీద నీళ్ళు గుమ్మరించడం ప్రమాదకరమైన ఆట, మొత్తానికి మొత్తం సినిమాకి సినిమాయే మునిగిపోవచ్చు.  స్ట్రక్చర్ లో సమస్యల వల్ల, క్యారక్టరైజేషన్స్ లో సమస్యల వల్ల ఈ పరిస్థితి  ఏర్పడుతుంది. వెనక్కి వెళ్లి వాటిని సరిదిద్దాలి. లేదూ, సరిదిద్దితే అనుకున్న ప్రకారం ఇంటర్వెల్ రాదంటే దీని ఫలితం కూడా అనుభవించక తప్పదు.

       1. కాజల్ తండ్రితో ఏం చెప్పాలనుకుంది అసలు? ప్రేమ ఇష్టమనా? ఇష్టం లేదనా? ఇష్టమైతే మహేష్ తండ్రి సత్యరాజ్ తో మాట్లాడమని చెప్పాలనుకుందా? అయ్యుండదు, ఆమెకి ఇంకో స్పష్టత రావాల్సి వుంది మహేష్ నుంచి- ఇది తర్వాత వచ్చే సీన్లో ఆమె బయట పెడుతుంది- ఉమ్మడి కుటుంబంలో ఉండలేనని. మరి అలాంటప్పుడు తండ్రితో ప్రేమ ఇష్టం లేదని కూడా ఇప్పుడు చెప్పాలనుకుని వుండదు. మరెందుకు ఈ సీను పెట్టినట్టు? దీని ప్రయోజనమేమిటి? దీన్ని ఎత్తేస్తే వచ్చే నష్టమేమిటి? ఈ సీను వుండాల్సిందేనని అంటే,  ఇది ఈమాత్రం ప్రేమ ట్రాకులో కన్ఫ్యూజన్ గా లేదా?  పైగా ‘సీనస్ ఇంటరప్టస్’ తో ఆశాభంగం కలిగించడం లేదా?

        2. రావు రమేష్  చెప్పలేక పోతున్న కూతురి పెళ్లి విషయం తెలుసుకున్న సత్యరాజ్ కి,  కొడుకుతో మాట్లాడడానికి అంత మొహమాట మెందుకు? అసలు కొడుకుతో మాట్లాడ్డ మేమిటి, అన్నీ తన నిర్ణయాల ప్రకారమే జరుగుతున్నాయిగా? అసలు బావమరిది రావు రమేష్ తో ఈ దూరాలేమిటి? ఇదేనా తను ప్రవచించే కలివిడితనం? పిలిచి కూర్చో బెట్టుకుని సంగతేంటో తేల్చెయ్యొచ్చుగా-అంత పెద్దరికం అనుకున్నప్పుడు? కొడుకుతో కూడా  ఆ దాగుడు మూతలేంటి? సత్యరాజ్ ఎస్ అంటే, ఇక్కడే మహేష్ తను కాజల్ని ప్రేమిస్తున్న సంగతి చెప్పేస్తే,  ఇంటర్వెల్లో ముందు నిర్ణయించుకున్న ప్రకారం సత్యరాజ్ చావు సీను రాదనా? సత్యరాజ్ నో అంటే, ఇక్కడే రావురమేష్ తగుల్కుని ఇంటర్వెల్లో రావాల్సిన సత్యరాజ్ చావుసీను ఇంటర్వెల్ లోపు జరిపేస్తాడనా? సత్యరాజ్ మహేష్ తో మాట్లాడినా, రావురమేష్ తో మాట్లాడినా,  కాజల్ కూడా ఇక్కడే ఈ సీనులోకే రావాల్సిన అగత్యమేర్పడి- ఉమ్మడి కుటుంబంలో నేనుండను, వస్తే నాతోరా!- అనేసి  ఇక్కడే మహేష్ బాబుతో చెప్పేసి వెళ్ళిపోతుందనా? అప్పుడు  రావు రమేష్ శాంతించి, సత్యరాజ్ కి చావులేక, ఇంటర్వెల్లే లేకుండా పోతుందనా?  సత్యరాజ్ ని చంపడానికి ఇన్ని దాటవేతలా? 

 
           సత్యరాజ్ కి రావురమేష్ మనో కామన తెలియడం వల్లే ఈ చిక్కులన్నీ . తెలియకపోతే? పై తండ్రీ కొడుకుల స్పష్టత లేని  ఇన్ని ప్రశ్నలు లేవనెత్తే ఈ  దాగుడు మూతల సీనే వుండదు, సీనస్ ఇంటరప్టస్ తో అసంతృప్తే వుండదు. ఇంటెర్వల్ దగ్గర రావురమేష్ నోటినుంచే అన్ని విషయాలూ అప్పుడే విని చనిపోతే చనిపోతాడు సత్యరాజ్. ఈ చావుకి కూడా అర్ధం ఉండదనేది వేరేసంగతి. 

        3. ఇంకో సీనస్ ఇంటరప్టస్ కూడా వుంది. వెనకటి ఒక సీన్లో  ఫ్యాక్టరీ అమ్మవద్దని నిర్ణయించుకున్నప్పుడు, ఆ మాటలు వింటూ ఉంటాడు మహేష్. సత్యరాజ్ అతడి అభిప్రాయమడిగితే ఏదో చెప్పబోతున్నట్టు లేచి, వెనక్కి తాతల ఫోటోల వైపు వెళ్లి చూస్తూ ఉంటాడు. ఏమీ చెప్పకుండా ఒకరకమైన కొంటెతనంతో ఇటు చూసి మ్యాటర్ కట్ చేస్తాడు. వీడు  తెలిసి చెప్పడం లేదా, తెలియక చెప్పడం లేదా అని ప్రేక్షకులకి మెదిలే ప్రశ్నే వేస్తాడు సత్యరాజ్. చెల్లెలి పెళ్ళిలో ఇన్వాల్వ్ మెంట్ కోరుకోలేదు పోనీ, వ్యాపార విషయం లోనైనా తన దృక్పథం ఏమిటో చెప్తాడని ఇప్పుడు ఎదురు చూసే వాళ్లకి తీవ్ర ఆశాభంగం తప్పదు. ఇదీ కథానాయకుడి తీరు! ఈ పాత్ర అర్ధమవడానికి దీని దృక్పథం ఏమిటో ఎక్కడా తెలీదు మనకి. ఎలా వున్న పాత్ర అలా  స్క్రీన్ ప్లే ని ఉత్తేజితం చేయడానికి తోడ్పడే క్యారక్టర్ ఆర్క్ లేకుండా, నేలబారుగానే కింద పడుంటుంది. 

      ఇక పెద్ద ట్రూపుగా అందరూ కలిసి టూర్ కి వెళ్ళడమూ, అక్కడ కాజల్ తన మనసులో మాట మహేష్ కి చెప్పడమూ. ఈ కాలపు అమ్మాయిగా ఆమె కరెక్టుగానే చెప్పింది. అంత మంది మనుషుల మధ్య ఉండలేనని. ఆమె ఉండలేదు, అతను బయటికి రాలేడు. కిస్ పెట్టి ఆమెని వదిలేస్తాడు. ఆమె ఎంత బాధ పడివుంటుందో. ఈ సీను తర్వాత ఇక కాజల్ కన్పించదు. ఈ సీన్లో చాలామంది మహేష్ ముద్దు పెట్టాడంటే ఆమెని చేసుకుని బయట కాపురం పెడతాడనే అనుకున్నారు. ఒకరిద్దరు రివ్యూ రైటర్లు కూడా ఆ తర్వాత కాజల్ ఏమైందో జుట్టు పీక్కున్నా అర్ధం కాలేదని రాశారు. దాన్ని  గుడ్ బై కిస్ గా తీసుకోవాలని దర్శకుడి కవి హృదయమని నిజానికి ఈ వ్యాసకర్తకి కూడా ముందు తట్ట లేదు! ఇలా వుంటే ఇక మూవీ డైనమిక్ గా ఎందుకుంటుంది? మోనాలిసా నవ్వుకి అర్ధం తెలీనట్టే ఈ ముద్దుకి అర్ధంకూడా రకరకాలుగా తీయ్యొచ్చు- అందులో ఒకటి,  చాటుగా రావురమేష్ చూస్తున్నాడని కావాలనే  కిస్ పెట్టాడని! లాంగ్ కిస్ బిగ్ ఫైట్! 

        బిగ్ ఫైట్ కి సిద్ధమవుతాడు రావురమేష్. తన నికృష్టపు జీవితం గురించి ఎన్ని చెప్పాలో అన్నీ  చెప్పేసి, ఇక ఈ ఇంట్లో వుండనంటాడు. కూతురి పెళ్లి ఆశలు కూడా వమ్ము చేసినందుకు తూలనాడతాడు. సత్యరాజ్ సహా కుటుంబ సభ్యులు షాకవుతూంటే, మహేష్ మందలిస్తూంటాడు. అతడికి అర్ధమై పోయే వుండాలి పరిస్థితి- అప్పుడు  రావురమేష్ ని పక్కకి తీసికెళ్ళి, అతను చూసింది నిజమే గానీ, కాజల్ ని తను వదులుకున్నానని అపార్ధం తొలగించాలి. ఇది జరగదు. రావురమేష్ కూతురి పెళ్లి కోరిక తెలిసీ నంగనాచిలా వున్న సత్య రాజ్ ఇప్పటికైనా నోరు విప్పాలి. ఇది కూడా జరగదు. తోడుదొంగల్లా తండ్రీ కొడుకులు  రావురమేష్ ని ఇంట్లోంచి వెళ్లి పోనిచ్చి నట్టే వుంటుంది సీను!

        తర్వాతి సీన్ ఇంటర్వెల్ సీన్. ఇది ప్లాట్ పాయింట్ వన్ అనుకుందాం. కానీ ప్లాట్ పాయింట్ వన్ కి కథని చేరవేసిన విధానం ఎలా వుంది? ఈ ప్లాట్ పాయింట్ వన్ దగ్గర నుంచే అసలు కథ ప్రారంభమవుతున్నప్పుడు, ఇక్కడ ఏమేం సెట్ చేయబోతున్నారు? 

        రావురమేష్ మాటలకి ఒకటేబాధ పడిపోతూ ఉంటాడు సత్యరాజ్. అన్నేళ్ళల్లో ఒక్క రోజైనా - ఏమిటి నువ్వలా ఎందుకుంటావ్, మనమంతా కలిసిమెలిసి హేపీగా వుండాలి,  నీకేం కావాలో చెప్పూ - అని అతడి మనోభావాల్ని కనుక్కున్నాడా? అతడి కూతుర్ని తన కొడుక్కి చేసుకునే విషయంలో ఏనాడైనా ఒక స్పష్టత ఇచ్చాడా? అసలు విడిపోయి గౌరవంగా బతకాలన్న రావురమేష్ మనోభావాల్ని గౌరవించాడా? బలవంతంగా కలిసి వుండమనడ మేమిటి? కలిసి వుండాలనడం ఒక విలువ, విడిపోవాలనుకోవడం హక్కు. హక్కుల్ని గౌరవించాల్సిందే, పరిష్కరించాల్సిందే. నానబెడితే ఇలాగే తిరుగుబాట్లతో పెద్దరికాన్ని మంట గలుపుతాయి.  

        ఇక్కడ తండ్రీ కొడుకుల మధ్య మాటల్లో ప్రణీత గురించి కూడా ప్రస్తావనే వుండదు. ఇప్పుడైనా సత్యరాజ్ ప్రణీత గురించి ఏమనుకుంటున్నాడో బయట పడడు. వెనకటి సీన్లో మహేష్ తో దాగుడు మూతలాడి నప్పుడు ప్రణీత విషయం అడగాలనే ప్రయత్నించాడు సత్య రాజ్.  అంటే తనకిష్టమే నన్నమాట. మరి ఈ రొచ్చు అంతా ఎందుకు? ఇప్పుడైనా మహేష్ ని ఎందుకు అడగడు? మహేష్ కూడా అసలు తనవల్ల ఏం జరిగితే రియాక్ట్ అయి రావురమేష్ అలా ప్రవర్తించాడో తండ్రికి చెప్పేసి ఇప్పటికైనా హీరోగా ఎందుకు అభిశంసనకి నిలబడడు? ఇంత ఆదర్శ కుటుంబమని చెప్పుకునే వాళ్ళకి ఈ దొంగాటకాలేమిటి?

        ఇవన్నీ పక్కకి  పెట్టేసి వేదాంత ధోరణిలో బంధుత్వాల గురించి ఏదో చెప్పి, ఏడుతరాల బంధువుల్ని ఒక చోట చేర్చే కోరికేదో చెప్పి, గుండెపోటుతో చనిపోతాడు సత్యరాజ్. అతడి మరణం అతడి స్వయంకృతమే తప్ప రావురమేష్ దోషమేం లేదని కథనమే, పాత్రచిత్రణలే చెప్తున్నాయి. 

           
ఈ ప్లాట్ పాయింట్ వన్ లో సెట్ చేయాల్సిన అంశాలు : 1.  హీరోకి గోల్, 2. ఆ గోల్ లో ఎమోషన్, 3. గోల్ సాధించడానికి రిస్క్ చేస్తున్న అంశం, 4. గోల్ కి పూనుకుంటే తలెత్తే పరిణామాల హెచ్చరిక. 

        ఈ కథలో సెట్ చేసింది : 1. గోల్ వచ్చేసి ఏడు తరాల్ని గాలించడం. తలెత్తిన సమస్య అది కాదు కాబట్టి, ఆ సమస్యని పరిష్కరించడానికి ఇదో మార్గం కూడా కాదు కాబట్టి,  ఇది గోల్ కాకుండా పోయింది, పైగా ఇది గోలే అనుకున్నా దీనికి యూత్ అప్పీల్ లేదు; 2. ఈ  గోల్ లో ఎమోషన్ ఉండేందుకు తండ్రి కోరికని ఆశ్రయించి వున్నమరణాన్ని మహేష్ బాబు ఫీలవుతున్నాడేమోగానీ, మనకి ఏ ఫీలూ కలగడం లేదు, ఆ మరణం అతడి స్వయంకృతం కాబట్టి, మన ఫీల్ రావురమేష్ మీద కేంద్రీకృతమైంది కాబట్టి;   3. గోల్ ని సాధించడానికి మహేష్ బాబు చేస్తున్న రిస్కు ఏదీ లేదు, తనకి ప్రత్యర్ధి కూడా ఎవరూ లేరు, రావురమేష్ ప్రత్యర్ధి అనుకుంటే అతను  కథలోంచి వెళ్లి పోయాడు; 4. ప్రత్యర్ధి  లేకపోవడంతో పరిణామాల హెచ్చరిక కూడా ఏమీ లేదు.
        కనుక గోల్ నిల్.
        ప్లాట్ పాయింట్ వన్ అనేది లేదు. 

       లేకపోగా స్క్రీన్ ప్లే నిట్ట నిలువునా మధ్యకి ఫ్రాక్చర్ అయ్యింది- రభస, జ్యోతిలక్ష్మి, చక్కిలిగింత, అశోక్, ఊసరవెల్లి  తదితర ఎన్నో ఫ్లాపయిన సినిమాల్లాగే ఇంటర్వెల్ ముందొక కథ,  తర్వాతొక కథగా ‘బ్రహ్మోత్సవం’ కూడా  దర్శన మిచ్చింది. దీని కథ కూడా  ఈ ఫ్రాక్చర్ తో, సెకండాఫ్ సిండ్రోమ్ తో, ఆ  ఫ్లాపయిన సినిమాల దృష్ట్యా,  అట్టర్ ఫ్లాప్ అవుతుందని ఐడియా దశలోనే తెలిసిపోతుంది. కానీ తెలుసుకోలేదు.
        ఈ సమస్య రెండు ఐడియాల కథవల్ల వచ్చింది. ఉమ్మడి కుటుంబం- ఏడుతరాలు. ఫస్టాఫ్ ఉమ్మడి కుటుంబం, సెకండాఫ్ ఏడుతరాలు. రెండిటికీ కలిపి ఓ స్ట్రక్చర్ ఎలా వస్తుంది? ఇంత చిన్న విషయం తెలుసుకోవడానికి  ఇంత పెద్ద ఫ్లాప్ సినిమా తీశారు. 

        సరే, ఇదలా వుంచితే, ఈ కథ తాను ప్రవచిస్తున్న  ఉన్నత  ఆదర్శాల గురించి, సంస్కృతీ సాంప్రదాయాల గురించీ, కుటుంబ విలువల గురించీ, ఐకమత్యం గురించీ, ఇంకా చాలా ఉదాత్త భావాల గురించీ  ప్రతిపాదించే ఐడియాలజీకి ఈ కథే తూట్లు పొడుచుకుంటుంది. నీ కుటుంబంలో నేను ఇమడలేనని కాజల్ వెళ్ళిపోతుంది, నీ పెద్దరికానీకో నమస్కారమని రావు రమేష్ వెళ్లిపోతాడు, కూతురు పెళ్లి చేసి ఇంట్లోనే అందరితో పాటూ ఉంచుకోకుండా ఆదర్శాల సత్యరాజ్ లండన్ పంపించేస్తాడు. ఆ కూతురూ అల్లుడూ అతను చనిపోయినా రానే రారు. మసాలా యాక్షన్ సినిమాలకి లాజిక్ లేకపోయినా జనం చూసేయ గలరు. ఎందుకంటే ఆ జీవితాలతో వాళ్ళకి అనుభవముండదు కాబట్టి. కానీ కుటుంబ కథలు అందరూ నిత్య జీవితంలో అనుభవించేవే. తండ్రి చనిపోతే కూతురూ అల్లుడూ రారా అని ఎవరికైనా లాజిక్ తోస్తుంది. 

        కూతురు బదులు కూతురి ఫ్రెండ్ నని చెప్పుకుని హీనంగా  సమంతా వస్తుంది. వస్తూ అది విషాదం సంభవించిన ఇల్లని కూడా చూడకుండా, బెజవాడ కనకదుర్గమ్మ యాత్ర్రీకులని చెప్పి బస్సు నిండా జనాన్ని వెంటబెట్టు కొచ్చి ఆ  ఇంట్లో బస చెయ్య మంటుంది! ఇది కామెడీ అట! దీని అవసరం ఇప్పుడట! పాపం భర్త పోయిన ఆ మహాతల్లి రేవతి వాళ్ళందరికీ వండి పెడుతుంది. మహేష్ బాబేమో సమంత చేసిన ఈ చిలిపి పనికి (!) అడ్మైరింగ్ గా చూస్తూంటాడు ఆమెని. ఎందుకంటే ఇక లవ్ ట్రాక్ మొదలెట్టుకోవాలిగా? ఇంట్లో కూర్చుని ఇంటికొచ్చిన ఆడపిల్లల్నే  ప్రేమిస్తాడు తప్ప, బయట తిరిగి ప్రపంచాన్ని చూసి అసలు ఇప్పుడు ప్రేమలంటే ఏమిటో తెలుసుకోడు. ప్రేమంటే ఇదీ అని కాజల్ లాంటి అమ్మాయిలు  వచ్చి చెప్పాలి. ఇదీ హీరో  పాత్రచిత్రణ! పూర్తిస్థాయి పాసివ్ పాత్ర... ఈ పాసివ్ పాత్రకి ఇప్పుడైనా ప్రణీత గుర్తుకు రాదు. కలిసివుందామనే ఐడియాలజీ తో ఆమెని బాధపెట్టింది గాక, కాజల్ వెంట పడి దెబ్బ తిని, మళ్ళీ సమంత వెంట పడ్డం! ఈ కథ  ఆదర్శాల ఐడియాలజీ లో ప్రణీతని కూడా కోన్ కిస్కా చేయడం! 

         ఈ కథ చెప్పే ఆదర్శాల గురించి ఇంకా చెప్పాలంటే, సత్యరాజ్ చనిపోయాక ఇంట్లో ఒక్కరూ పత్తా వుండరు- ఇప్పుడు మహేష్ బాబు, రేవతి ఇద్దరే వుంటారు. ఉమ్మడి కుటుంబంలో మిగతా వాళ్ళందరూ పరార్. రావు రమేష్ వెళ్లి పోయాడంటే దానికో సబబైన కారణముంది. మిగతా వాళ్ళకీ? మిగతా వాళ్ళు ఇప్పుడు ఈ ఆదర్శాల కథకి ఇబ్బంది కాబట్టి వెళ్ళిపోయారా? 

        ఇంతేనా? తెలుగువారి సాంప్రదాయాల గురించి చెప్పాలంటే ఇంకా వుంది. మనిషి ఇలా పోయాడో  లేదో అలా సంబరాలు మొదలై పోతాయి. ఇంకోసారి అటు అమ్మాయి తరపు వాళ్ళు, ఇటు అబ్బాయి తరపు వాళ్ళ మధ్యా  మాటకు మాట జుగల్బందీ. ఇదో అంత్యాక్షరి లాంటి వేడుక. పోతేపోయాడు ఆదర్శాల మూలపురుషుడు, సత్యరాజ్ శని వదిలింది అన్నట్టుంది.  

        ఇక మహేష్- సమంతా ఏడుతరాల వేటకి వెళ్ళినప్పుడు హరిద్వార్ లో, అక్కడ కాదని వారణాసిలో చావుల చిట్టాలు తిరగేస్తారు పూర్వీకుల సమాచారం కోసం. కానీ మహేష్ బాబు అక్కడికి వెళ్తూ తండ్రి చితాభస్మంతో వెళ్ళడు! ఇది కూడా తెలుగు సంస్కృతే నేమో.
        ఈ వారసుల్ని వెతికే ట్రాక్ అంతా రకరకాల ఊళ్లలో వారసుల్ని కనుగొని పలకరించే, వాళ్ళని కలిసుందాం రమ్మని ఆహ్వానించే సీన్లతో వుంటుంది. డాక్యుమెంటరీ ధోరణికి డ్రైగా మరిపోయిన ఈ సుదీర్ఘ ట్రాకులో ఎక్కడైనా ఈ అన్వేషణలో ఒక అద్భుతం జరుగుతుందని ఆశించడానికి లేదు. ఏడు తరాలంటే 175 సంవత్సరాలు. ఏ మహాత్మా గాంధీ పక్కన పోరాటం చేసిన వాళ్ళ వారసులో, లేదా అల్లూరి సీతారామరాజు తో కలిసి పోరాడిన వాళ్ళ వారసులో, ఇంకా లేదా ఎపిజే అబ్దుల్ కలాంతో  కలిసే వారసత్వమున్న వాళ్ళో తేలి,  ఒక ట్విస్ట్ ఇచ్చి, కథని  కొత్త మలుపు తిప్పుతారని ఎదురు చూడ్డానికీ లేదు [వెనకటి తరాల్ని శోధిస్తూ పోతే,  చాలా మంది వాళ్ళ వారసులు ఇప్పుడు ముస్లింలుగా, క్రైస్తవులుగా, సిక్కులుగా కన్పిస్తారని , హరిద్వార్ లో జీనియాలజీ (వంశావళి) రిజిస్టర్లు నిర్వహించే పండితులే చెప్తున్నారు].

       
ఏదీ తేలనప్పుడు కథనమంతా అనవసరమే కదా? ఇక్కడ సెకండాఫ్ ప్రారంభం నుంచీ మిడిల్ విభాగం వుండాలి. దేని మిడిల్ విభాగం? ప్రారంభించిన ఉమ్మడి కుటుంబం కథ బిగినింగ్ ముగిసి ఇంటర్వెల్ కే ఉరికంబం ఎక్కింది. దానికి మిడిల్ కి నోచుకునే అదృష్టం లేదు. ఇక సెకండాఫ్ లో ప్రారంభమైన ఏడుతరాల రెండో కథతో మళ్ళీ బిగినింగే. ఇది ఎక్కడా మిడిల్లో పడదు. మిడిల్ అంటే గోల్ కోసం సంఘర్షణ. గోల్ కోసం మహేష్ ఎక్కడా సంఘర్షించడు.  కాబట్టి ఈ రెండో కథ బిగినింగ్ గానే సాగుతుంది తప్ప మిడిల్ ని ఏర్పాటు చేయదు. ఎండ్ మాత్రమే వుంటుంది  అన్వేషణలో రావు రమేష్ కన్పించడంతో. ఎక్కడ బయల్దేరామో అక్కడికే వచ్చామనుకుంటాడు మహేష్. కనుక సినిమా ప్రారంభం నుంచీ ప్రేక్షకులు మొదటి కథకీ బిగినింగ్ నే, రెండో కథకి కూడా  బిగినింగ్ నే చూస్తూంటారన్న మాట. ఎక్కడా మిడిల్ తాలూకు సంఘర్షని చూడరు. ఏ సినిమాకైనా కథంతా వుండేది మిడిల్లోనే.  అందుకే ఈ సినిమాలో ఏ కథా ఓ కథ కాకుండా పోయింది!

        రెండు ఐడియాలు : రెండిటికీ బిగినింగ్ లు + ఎండ్ లు - నో మిడిల్ = టోటల్ గా  నో స్టోరీ. 

        ఇక క్లైమాక్స్ : రావు రమేష్ తన మానాన తను  కూతురు  ప్రణీత పెళ్లి చేసుకుంటూంటాడు. మహేష్ నీ, రేవతినీ పిలవడు. అయినా తండ్రి చెప్పులేసుకుని కొత్త జమీందారులా కొత్త శాసనాలు చేయడానికా అన్నట్టు మహేష్ రేవతిని తీసుకుని వెళ్తాడు. అక్కడ డైరీలో తండ్రి రాసిన ఒక పేజీ చూపిస్తాడు. అది చూసి రావు రమేష్ కరిగిపోయి కన్నీళ్ళు కార్చేసి, తనదే తప్పు క్షమించమంటాడు.  అసలు జరిగిన గొడవే మహేష్ అపా ర్ధాన్ని తొలగించక పోవడం వల్ల. సత్యరాజ్ పలాయన వాదం వల్ల. జరిగింది ఇప్పటికైనా చెప్పేసి క్షమించమని అడగాల్సింది మహేష్.  రివర్స్ లో పాపం భోళా మనిషి రావురమేష్ మళ్ళీ సత్యరాజ్ వంశ కోరల్లో మళ్ళీ తలకాయ పెడతాడు క్షమాపణలు చెప్పుకుని. సత్యరాజ్ తనకి ఆస్తి రాసినంత మాత్రానా అన్ని మానసిక గాయాలూ మాసిపోతాయా? అదేనా తన ఆత్మాభిమానం?

        డైరీలో పేజీ రాసుకోవడం, తానే మనుకుంటన్నాడో పైకి చెప్పకపోవడం, అపార్ధాలతో గొడవలు మీదికి తెచ్చుకుని చచ్చిపోవడం-  ఇదీ కలిసి జీవితాల్ని ఉత్సవంగా బ్రహ్మోత్సవంగా గడుపుకోవాలని చెప్పే సత్యరాజ్ కథ కాని కథ!

        ఇక చివరిగా ఆర్గ్యుమెంట్ సంగతి. ఐడియాలో ఆర్గ్యుమెంట్ కూడా కన్పించాలన్నాం. అప్పుడే అది కథ అన్పించుకుటుంది. ఒక పాయింటుని ఏర్పాటు చేసి, దాని గురించి ఇరువర్గాలు చేసుకునే తప్పొప్పుల పోరాటంలో ఎవరి వాదన గెలిచిందీ చూపడం. ఇది కథకి వుండే ప్రాథమిక లక్షణం. ఇలాటి ఆర్గ్యుమెంట్ సహిత కథలే కమర్షియల్ సినిమాలకి పనికొస్తాయి. ఇలా కాకుండా- నేనిలా చేస్తే మా నాన్నకి ఇలా జరిగింది...నాన్న కోసం నేనిలా చేస్తే... పెద్ద మామయ్యతో నాకిలా జరిగిందీ- అని పాసివ్ గా,  స్టేట్ మాత్రంగా ఇచ్చుకుని ముగిసేవి గాథలు. సినిమాకి పనికిరావు. కృష్ణవంశీ  ఫ్లాపయిన ‘మొగుడు’  కూడా చూడండి, చక్కగా  ఓ కథగా ఆర్గ్యుమెంట్ ని ప్రతిపాదించి, సెకండాఫ్ లో స్టేట్ మెంట్ తో గాథగా ఫిరాయిస్తుంది...


-సికిందర్


       
.


       


















21, మే 2016, శనివారం

స్క్రీన్ ప్లే సంగతులు -4

బిగినింగ్ లేకపోతే ఎండింగ్ లేదు, ఏదైనా మొదలెడితే కదా ముగించడానికి...ఎండింగ్ డైనమిక్ గా, కమర్షియల్ గా వుండాలని ఆశిస్తాం. బిగినింగ్స్ డైనమిక్ గా, కమర్షియల్ గానే వుండొచ్చు. కానీ బిగినింగ్ లో విషయం లేకపోతే ఎండింగ్ ఎంత డైనమిక్ గానూ , కమర్షియల్ గానూ  వున్నా అందులోనూ  విషయముండక బలహీనంగా వుంటుంది. ఐతే  విషయమూ లేక, డైనమిక్సూ కమర్షియాలిటీ కూడా లేక  పేలవమైన ఎండింగ్ తో ఓ సినిమా ఎదురైతే  అదెలా వుంటుంది? సరీగ్గా ‘తని ఒరువన్’ లా వుంటుంది. యథా ప్లాట్ పాయింట్ వన్ తథా ఎండింగ్ అని అన్నారిందుకే...
To hell with plot point-1
We have our own ‘paatlu’!

          చూసే వాళ్ళు  మూర్ఖులని తీసే వాళ్ళు నమ్మి, తీసేవాళ్ళు తెలివైన వాళ్ళని  చూసే వాళ్ళూ నమ్మి,  పరస్పరం వాళ్ళూ వాళ్ళూ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని సినిమాల్ని ఆడిస్తూంటే మధ్యలో మనమేం చేయగలం, ఇలా రాసుకోవడం తప్ప?  సినిమా హిట్టయ్యాకా ఇంకా ఈ రాతలు చూసి నల్గురూ నవ్విపోతారు. ఏదో సరదా రౌండేసి వద్దామని సర్ది చెప్పుకుని రాయడం మొదలెట్టామే గానీ, మొదలెట్టాకా గానీ తెలీలేదు ఇదో థర్డ్ డిగ్రీ  టార్చర్ అని.  ఇన్ని చిక్కు ముళ్ళున్న  వ్యవహారం ‘పోలీస్’  తర్వాత ఇదే.  ఏ పోటీ పరీక్షల్లోనో దీన్ని  ప్రశ్నాపత్రంగా  పెడితే,  మొత్తం అందరూ ఫెయిలైపోయి ఉద్యోగాలిచ్చే బాధ తప్పిపోతుంది!

        కథానాయకుడు మిత్రన్ ప్లాట్ పాయింట్ వన్ దగ్గర తప్పించుకుని బై పాస్ రోడ్లో ఎలాగో మిడిల్లో పడ్డాడు కదా, ఇక ఎండ్ కి చేరక పోతాడా, అక్కడ దొరక్క పోతాడా అని చూస్తూంటే,  ఓ  టోల్ గేట్ దగ్గర అడ్డంగా దొరికిపోయాడు. ఇప్పుడు చెప్పు, ఏమిటి నువ్వు చెప్పాలనుకుని చెప్పలేక తప్పించుకుని తిరుగుతున్నది- అని నిలేస్తే, నాకేమీ తెలీదు -నేను అమాయకుణ్ణి- నిర్దోషినీ -ఇంకేదో-  అని రాగాలు తీశాడు. మరెందుకలా మొత్తమంతా తిరిగేస్తున్నావంటే, డైరెక్టర్ వైపు వేలు చూపిస్తాడు. డైరెక్టరేమో తొమ్మిది నెలలు కష్ట పడ్డానంటాడు. కానీ జన్యు పరమైన లోపాలతో పుట్టింది స్క్రిప్టు. ఆ జనెరిక్ మందులూ, డయాబెటిస్ ఫార్ములా వగైరావగైరా ఏవో  ముందు దీనికే  వాడాలేమో చూడాలిగా! 

        ఈ  ప్లాట్ పాయింట్లూ మన్నూ మశానాలూ  మాకనవసరం బాస్, మా పాట్లు మాకుంటాయి- ఎంతో పాటుపడి సినిమాల్ని ఎలాగో గట్టెక్కించుకుంటాం, మందుమాకులూ  మాకివ్వొద్దు ప్లీజ్ –అని తిరగబడ్డా  ట్రీట్ మెంట్ ఇవ్వక తప్పదు, ధర్మ సంస్థాపన కోసం. 

        కథా సూత్రాలు  ఎవరో ఆకాశంలోకి  చూస్తూ ఆలోచించలేదు. విజయవంతమైన సినిమాలు చూసే,  అవి ఎలా వుండి విజయవంతమవుతున్నాయో వాటి ప్రకారం స్ట్రక్చర్ ని తీసే, స్కెచ్ వేశారు. పుస్తకాలూ రాస్తున్నారు, పాఠాలూ బోధిస్తున్నారు. న్యూటన్ ఆకాశంలోకి చూస్తూ గురుత్వాకర్షణ సిద్ధాంతం చేయలేదు. ఆపిల్ పండు నెత్తి మీద పడితేనే ఆ సిద్ధాంతం తట్టింది. దృగ్గోచరంగా వున్న  వాటిలోంచే శాస్త్రాలు పుట్టాయి, పుడుతున్నాయి.  దీన్ని కాదనుకునే  వాళ్ళే కథ ఎలా తయారు చేయాలా అని ఆకాశంలోకి చూస్తూ, ఊహాగానాలతో పేజీలు  నింపు కుంటున్నారు...స్వకపోల కల్పితాలతో  నూటికి 90 శాతం ఫ్లాపులు తీస్తున్నారు, తీస్తూనే వుంటారు. దీనికి ముగింపు లేదు.

                                                          ***
          ఎండ్ : మిడిల్ ముగుస్తూ ప్లాట్ పాయింట్ టూ దగ్గర తన ఛాతీలోనే బగ్ అమర్చారని తెలుసుకున్న మిత్రన్ వెంటనే దాన్ని తీసేయించుకోడు. దాంతో అభిమన్యుతో కౌంటర్ గేమ్ మొదలెడతాడు. ఇది మంచి డైనమిక్స్. ఈ ఎండ్ విభాగంలో పక్కాగా అభిమన్యుని వలలో  బిగించే వివిధ ప్రయత్నాలే జరుగుతాయి. ఈ కథా పథకం బావుంది. ఇలా ఎండ్ విభాగం బిజినెస్ ముందు బ్రహ్మాండంగా కన్పిస్తుంది. కొన్ని విషయాలు సెటిల్ చేసుకోవాల్సి వుంది. మిడిల్ విభాగంలో తన కొలీగ్ ని చంపిన విక్కీ అనే అభిమన్యు అనుచరుడి సంగతి చూడాల్సి వుంది. అందుకు ఫలానా చోట వున్న విక్కీని అరెస్టు చేయాలనీ కొలీగ్స్ తో కావాలని మిత్రన్ మాట్లాడుతూ అభిమన్యుని ట్రాప్ చేస్తాడు. బగ్ ద్వారా ఇది విన్నఅభిమన్యు , విక్కీ అరెస్ట్ అయి తన గుట్టు విప్పకుండా వెంటనే వెళ్లి చంపేస్తూ కెమెరాకి చిక్కుతాడు. 

        ఏమిటిది? పోలీస్ అధికారిగా హీరో పాత్రకి నైతికపరంగా ఇది కరెక్టేనా? కొలీగ్ ని విక్కీ చంపినంత మాత్రానా అభిమన్యు ని ట్రాప్ చేసి,  అతడి  చేత విక్కీని చంపేలా రెచ్చగొట్టి ఇరికించడం న్యాయమేనా? ఇది తను చేయించిన మర్డర్ కాదా? తనూ మిగతా కొలీగ్స్ తమ కొలీగ్ ని విక్కీ ఎలా డ్రగ్స్ కుక్కి చంపాడో, అలాటి  శాడిజంతో  డ్రగ్స్ కుక్కి,  అభిమన్యుని ట్రాప్ చేసి, అతడి చేత చంపించారంటే,  ఆటవిక న్యాయాన్ని అమలు చేస్తున్నారా? ఓ పోలీసు అధికారిగా  కాకుండా హీరో బాధితుడైన సగటు పౌరుడిగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నాడంటే అర్ధముంది. ఇలా పోలీసు అధికారిగా హీరో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని చంపడం ఏ సినిమాల్లోనూ రాలేదు. 

        ఇక మిత్రన్ కి ఫార్మాసిస్ట్ హత్యా దృశ్యాలున్న ఎస్డీ కార్డు దొరకడం ఒక మలుపు. కానీ అభిమన్యు గర్ల్  ఫ్రెండ్ కి మహిమ వెళ్లి,  అభిమన్యు ఆమె తండ్రిని చంపి ఎలా ఆమెని తన మీద  ఆధార పడేలా చేసుకున్నాడో చెప్పడం బ్యాడ్ రైటింగ్. ప్రతీ చోటా మహిమ పాత్ర చిత్రణ అర్ధరహితంగానే వుంటోంది. ఈమె గర్ల్ ఫ్రెండ్ కి ఇలా చెపితే, ఇది క్లయిమాక్స్ లో ఆ గర్ల్ ఫ్రెండ్ అభుమన్యు ని చంపి షాకివ్వడానికి లీడ్ సీన్ గా ఉంటుందని భావించి నట్టుంది. కానీ క్లయిమాక్స్ లో అది పండకపోగా, ఇక్కడ మహిమ ఇలా చెప్పడం ప్రశ్నార్ధకంగా మారింది. ఎంతసేపూ మిత్రన్ తెర వెనుక వుండి ప్రాక్సీ హత్యలు చేయిస్తున్నాడు. దీని ఫలితం క్లయిమాక్స్ లో అనుభవించాడు కథ తను ముగించలేక. లేకపోతే పని గట్టుకుని మహిమని పంపించి గర్ల్  ఫ్రెండ్ కి అలా చెప్పించడంలో ఉద్దేశ మేమిటి? 

        ఇక మిత్రన్ చనిపోయిన ఫార్మాసిస్టు చేసిన డయాబెటిస్ మందు పరిశోధనా వివరాలతో
,  ‘ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ ఇండియా’  అనే కల్పిత సంస్థకి వెళ్ళే డైనమిక్స్ కూడా డీలా పడిపోతుంది. 

        ఇక్కడ పేటెంట్ హక్కుల సమస్య మింగుడు పడకుండా  వుంటుంది- ఆమె డయాబెటిస్ కి మందు కనిపెడితే, అది ఆమె పనిచేసిన అభిమన్యు  కంపెనీ ప్రాపర్టీ  అవుతుంది. దాని మీద హక్కులు తనకి దఖలు పడే విధంగా అగ్రిమెంటు లేనప్పుడు ఆమె వాదన చెల్లకుండా పోతుంది. ఎంత కనిపెట్టినా ఆమె ఆ కంపెనీలో ఉద్యోగినియే. ఆర్ అండ్ డీ కోసం కంపెనీలు వందల కోట్లు ఖర్చు పెట్టి  మందులు కనిపెడతాయి. అలాంటప్పుడు ఉత్తపుణ్యానికి ఆదామె సొంతమెలా అవుతుంది?

        ఇక్కడ ఆమెతో అతడికి అసలు గొడవేమిటంటే, తను కనిపెట్టిన ఆ మందుని అతను యాంజలీనాని చంపి కొనుగోలు చేసిన కంపెనీ ద్వారా ప్రపంచమంతా మార్కెట్ చేసుకుంటాడని. ఆ డయాబెటిస్ మందు మన దేశం దాటి వెళ్ళిపోతే మనం కొనుక్కోలేనంత  ఖరీదైపోతుందని.  దీన్ని జనెరిక్ మందుగా దేశంలోనే చవగ్గా అమ్మాలని. ఇదంతా ఆమె సెంటిమెంటల్ వాదన. ఆ మందు మీద ఆమె మమకారం అర్ధవంతంగా ఉండాలంటే, దాని మీద ఆమె దగ్గర లిఖిత పూర్వక యాజమాన్య హక్కులుండాలి.  

        ఆ కల్పిత సంస్థ అధికారులు మేం ఓకే చేస్తాం  పొమ్మంటారు. వాళ్ళదేం పోయింది, తాంబూలా లిచ్చేశాం తన్నుకోమంటారు. అది ఓకే అవడానికి దశాబ్దాలు పడుతుంది. ఒక తరం మధుమేహ వ్యాధి పీడితులంతా స్వర్గస్థులై వుంటారు అక్కడ ఫార్మాసిస్టుని వెతుకుతూ.
        అసలు దీన్ని ఇంత  ఇష్యూ చేయడం అవసరమా- ఇప్పటికే ఈ కథలో రకరాల టాపిక్స్ పైన ఎన్ సైక్లోపీడియా లెక్చర్లిచ్చి తలబొప్పి కట్టించింది చాలదా? పొసగని పేటెంట్ హక్కుల గొడవ లేకుండా, ఆ మందు ఫార్ములా తను దుర్వినియోగం చేస్తాడని ఆమె లాబ్ దాటించేస్తుందని అనుమానించి, చంపేశాడని చెప్పేస్తే చాలదా సింపుల్ గా?

                                    ***
       ఈ డయాబెటిస్ మందు పేటెంట్ హక్కుల గొడవ  తర్వాత,  తర్వాతి సీను జనెరిక్ మందుల మీదికి మళ్ళుతుంది!!
        మళ్ళీ ఉపోద్ఘాతం: స్వర్గీయ యాంజలీనా తో జరిగిన అప్పటి ఒప్పందాన్ని గౌరవిస్తామనీ, త్వరలో ఆమె కంపెనీ నుంచి జనెరిక్ మందులు మనకి అందుతాయనీ గౌరవ ముఖ్యమత్రి పూల్మణి ఉద్ఘాటన !

        ఇంకెక్కడి  యాంజలీనా కంపెనీ! ఆమెని చంపేసి అభిమన్యు ఎప్పుడో ఆ కంపెనీని కొని పారేసి వేరే గ్రాండ్ ప్లాన్స్ తో వున్నాడు -ఇంకెక్కడి జెనరిక్ మందులు! ఇంకెక్కడి రాష్ట్ర ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు! 

        అయినా దీన్ని బేస్ చేసుకుని తర్వాతి డైనమిక్స్ బావున్నా, బేస్ కే అర్ధం లేకపోవడంతో అవి కూడా తేలిపోతాయి. జనెరిక్ మందుల ఆగమనం గురించి గొప్పగా సభ ఏర్పాటవుతుంది. ఇందులో మంత్రి సెంగల్వ రాయన్ ప్రసంగించాలి. ఏం ప్రసంగించాలో అభిమన్యు నోట్ రాసేస్తాడు. ఆ నోట్ ని తను రాసిన వేరే నోట్ తో అభిమన్యు గర్ల్ ఫ్రెండ్ చేత మార్పించేస్తాడు మిత్రన్. ఈ నోట్ చదివేస్తూంటాడు మంత్రి సెంగల్వ రాయన్. ఇందులో దొంగలందరూ దొరికిపోయే వివరాలే వుంటాయి. అలా చదివేస్తూ మంత్రి ముఖ్యమంత్రి ఆగ్రహానికి గురవుతాడు. నా కొడుకు ఇలా రాశాడేమిటీ  అని మంత్రి గుండెపోటు నటించి హాస్పిటల్లో పడతాడు. ఇలా ఈ డైనమిక్స్ బావున్నా, అసలు యాంజలీనా కంపెనీయే లేనప్పుడు ప్రభుత్వం ఈ సభ ఏర్పాటు చేయడమనే బేస్ హాస్యాస్పదమవడంతో, ఈ ఉత్తుత్తి బేస్ ని ఆధారం చేసుకున్న  ఈ డైనమిక్స్ లో అన్ని చర్యలూ తేలిపోయాయి. 

        ఇంతకీ అభిమన్యు రాసిన అసలు నోట్ లో వున్న విషయమేమిటి? అది మిత్రన్ చేజిక్కించుకున్నాడు కదా, మరి అందులో ఏముందో చూడలేదా? ఇది చూపించాలిగా ప్రేక్షకులకి? అభిమన్యు పాజిటివ్ గా రాశాడా? జనెరిక్ మందులు రావడం ఇష్టంలేని తను పాజిటివ్ గా ఎందుకు రాస్తాడు? పోనీ నెగెటివ్ గా రాశాడా? మిత్రన్ కూడా నెగెటివ్ గానే రాసి మంత్రి చేత చదివించాడుగా, ఇద్దరూ నెగెటివ్ గానే రాసినప్పుడు ఈ సీన్ కి అర్ధమేం వుంది? అంటే అభిమన్యు ఏం రాయాలో దర్శకుడు తేల్చుకోలేక, ఆ నోట్ ని కప్పిపుచ్చుతూ-  మిత్రన్ నోట్ తో మ్యాజిక్ చేస్తే సరిపోతుందనుకున్నాడా! అభిమన్యు నోట్ ఉంటేనే మిత్రన్ నోట్ తో సీన్ వస్తుంది- అభిమన్యు నోట్ ఏంటో తెలీకపోతే మిత్రన్ నోట్ తో మంత్రి సీనే వుండదు! ఇటీజ్ ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ దట్. 

        ఈ మొత్తం ప్రహసనం – దీని పర్యవసానంగా చైన్ రియాక్షన్ గా వచ్చే అభిమన్యు తన తండ్రి సెంగల్వ రాయన్ ని చంపించే సీను, తండ్రి చావుని సీఎం మీదికి తోసి అరెస్ట్ వారెంట్ రాకుండా అభిమన్యు బ్లాక్ మెయిల్ చేసే సీనూ, ఆ తర్వాత తండ్రి చితాభస్మంతో ఇంకో సీనూ హాస్యాస్పదంగా మారాయి!

        ప్రభుత్వ ప్రకటన దగ్గర్నుంచి, చితాభస్మం వరకూ ఈ మొత్తం సీక్వెన్స్  ఇక్కడ అవసరమే లేదు. ఇది ఎండింగ్ విభాగం 50 నిమిషాలదాకా చాంతాడంత పెరిగేందుకే పనికొచ్చింది తప్ప కథకి మరే ఉపయోగమూ లేదు. 

        మిత్రన్ దగ్గర వున్న  రెండు సాక్ష్యాధారాలు - ఫార్మాసిస్టుని, విక్కీనీ అభిమన్యు చంపిన రికార్డింగ్స్- కూడా కోర్టులో పనికి రానివే. ఇదెలాగో తర్వాత చూద్దాం. 

        సభలో అలా నోట్ చదివినందుకు ఆగ్రహంతో అభిమన్యు తండ్రి కారుని యాక్సిడెంట్ చేయించి చంపించినట్టు చూపిస్తారు. కారు భస్మీపటలమవుతుంది. మంత్రి చితాభస్మం పెట్టి పోలీసు గౌరవ వందనంతో అంత్యక్రియలు చేస్తారు. ఆ చితాభస్మమున్న కలశాన్ని అభిమన్యు అందుకుంటాడు. సీఎం కనుసైగతో మిత్రన్ ఆ కలశాన్ని లాక్కుని, అభిమన్యు చేతిలో తన ఛాతీ లోంచి తీయించుకున్న బగ్ పెడతాడు. అభిమన్యు షాక్ అవుతాడు. అరెస్ట్ హిమ్  అంటాడు  సీఎం.  అభిమన్యుని  అరెస్ట్ చేస్తాడు మిత్రన్.

***
    వెంటనే కోర్టు సీను. ఇక్కడ అభిమన్యు చేశాడని చెప్తున్న ఆ రెండు (ఫార్మాసిస్టు, విక్కీ)  హత్యా దృశ్యాల వీడియోల  ప్రదర్శన. ఫార్మాసిస్టు వీడియోలో గాయపడివున్న ఆమె, తను కనిపెట్టిన డయాబెటిస్ మందుతో అభిమన్యు చేస్తున్న కుట్ర గురించి స్టేట్ మెంట్. అంతలో ఆమె వెనక దూరంగా కర్ర పట్టుకుని తిరుగుతున్న అభిమన్యు షాట్. దీంతో కట్. 
        విక్కీ హత్యా దృశ్య వీడియోలో, అభిమన్యు అతణ్ణి కాల్చి చంపడానికి ముందు అతను  ఇస్తున్న స్టేట్ మెంట్. ఆ స్టేట్ మెంట్ లో మిత్ర కొలీగ్ ని అభిమన్యు ఆదేశాలతో తనే చంపినట్టు ఒప్పుకోలు. 

         వీటితో పాటు ఇంకా ఇతరుల మౌఖిక సాక్ష్యాలూ విన్న జడ్జి- నోరు విప్పకుండా కూర్చున్న అభిమన్యు తో- రేపటికల్లా నువ్వు నోరు విప్పక పోతే నీ మీద ఈ అభియోగాల్ని నేను అంగీకరిస్తాను- అంటాడు. అతణ్ణి సబ్ జైలుకు పంపమని ఆదేశిస్తాడు. 

        ఇక్కడే వుంది ప్రేక్షకుల్ని మాయ చేయడమంతా! అసలుకైతే ఇక్కడ ఈ కోర్టు హాలు కాకలుతీరిన అభిమన్యు లాయర్ల బృందంతో నిండిపోవాలి. మిత్రన్ ని గడగడ లాడించాలి.  

        1. ఏదీ ఆ అమ్మాయి వీడియోలో అభిమన్యు ఆమెని చంపుతున్నట్టు ఎక్కడుంది? దూరంగా కర్ర పట్టుకు తిరుగుతున్నంత మాత్రానా అతను  చంపినట్టా?
        2. విక్కీ వీడియోలో అతనిచ్చిన స్టేట్ మెంట్ ఎవరికిచ్చాడు? ఆ సమయంలో అక్కడ ఇంకెవరున్నారు? ఆ స్టేట్ మెంట్ ని తనని చంపడాని కొచ్చిన అభిమన్యు కైతే ఇవ్వడుగా? అది సీసీ కెమెరా అయితే ముందు నుంచీ  వెనక నుంచీ షాట్లు ఎలా తీసింది? 

        ఈ ప్రశ్నలు చాలు,  మిత్రన్ తను క్లియర్ గా కిల్లర్ గా దొరికిపోయేట్టున్నానని  కోర్టు లోంచి లాంగ్ జంప్ చేసి, అటుపైన స్క్రీన్ ప్లేలో టోల్ గేట్లన్నీ తోసుకుంటూ దర్శకుడికి  ఇక దొరక్కుండా, వాటంగా 100 k రన్ మొదలెట్టడానికి! గాడ్డామిట్, ఏం చేస్తాడు- బైపాస్ రోడ్డు కూడా పనికి రావడం లేదాయె!      

        కానీ - కానీ- జడ్జి కూడా అభిమన్యు ని లాయర్ గురించే అడగడు. మిలార్డ్, దయచేసి మీరు మాత్రం అభిమన్యుని నీ లాయర్స్ ఏరీ? అని అడక్కండి, నా స్క్రీన్  ప్లేకి చాలా ఇబ్బంది- అని దర్శకుడు అనివుంటాడు. సినిమా బాగా ఆడాలని జడ్జి తలూపి ఉంటాడు. 

        అంత  షార్ప్ స్టయిలిష్ మాస్టర్ మైండ్ అభిమన్యు  కూడా ఆ వీడియోల భాగోతం  చూసి- పోనీలే హీరోగాడు బతుకుతాడు- అనుకుని నోర్మూసుకుని కూర్చుని ఉంటాడు. 

        అసలు ఆ వీడియోలు చూస్తూనే జడ్జికి ఇది అల్లాటప్పా కేసు అని అర్ధమైపోవాలి-మిత్రన్ పసి మనస్సుతో  ఏదో తప్పు చేశాడు, నీ మీద అభియోగాల్ని కొట్టి వేస్తున్నాను, నువ్వింటి కెళ్ళిపో! -అని అభిమన్యుని విడుదల చేసేయాలి. అప్పుడు అభిమన్యు సరదాగా వెళ్ళిపోయి, మిత్రన్ బ్యాంకులో స్థంభింప జేసిన  ఆ 7.5 బిలియన్ డాలర్లకి పరువునష్టం దావా వేసి మోత మోగించవచ్చు- ఇలాగే వుంటాయి పాత్రల సహజ రియాక్షన్స్.  

        మిత్రన్ ఎంత నిర్లక్ష్యంగా కేసు పెట్టాడో ఇంకా చెప్పుకుంటే- అభిమన్యు విదేశీ కంపెనీ యాజమనురాలు యాంజలీనాని  చంపించాడు. దీని ఊసే లేదు! అదే సమయంలో అభిమన్యు జరిపించిన దాడిలో మిత్రన్ ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళాడు, దీని ప్రసక్తే లేదు!!

        కథలో ఈ రెండు ప్రధాన సంఘటనలని వదిలేసి ఇంకేవో కేసులు పెడితే దీన్ని కథ అనాలా, కాకమ్మ కబుర్లు  అనాలా? 

        ఇక జడ్జి అభిమన్యుని సబ్ జైల్లో పెట్టి రేపు హాజరుపర్చ మంటాడేగానీ, పోలీస్ కస్టడీకి ఇవ్వలేదు. అభిమన్యు జ్యూడీషియల్ కస్టడీలో వుంటే, మిత్రన్ సబ్ జైలుకెళ్ళి సబ్ జైల్లో డీల్ కుదుర్చుకుంటాడు!

        అసలు అభిమన్యుని జైల్లో పెట్టాక మిత్రన్  కొలీగ్స్ ఆవేశ పడిపోతారు వాణ్ణి చంపాలని. ఎందుకంటే వాడు ఎస్డీ కార్డు కోసం తమ కొలీగ్ ని విక్కీ తో చంపించాడు గనుక.  రేపు కోర్టుకు తీసుకు పోతున్నప్పుడు ఎన్ కౌంటర్ చేస్తామంటారు. రాజ్యాంగం తమ  కిచ్చిన అధికారాన్ని వాడుకుని- విక్కీని అభిమన్యు చేత పథకం ప్రకారం చంపించింది గాక,  మళ్ళీ  ఇప్పుడు అభిమన్యుని ఎన్ కౌంటర్ చేస్తారట.  ఆదర్శాలు వల్లించుకుని నిజాయితీగల పోలీసాఫిసర్లలా  నిన్నగాక మొన్న కొత్తగా జాయినై, అప్పుడే కరుడు గట్టిన పోలీసుల్లా న్యాయస్థానాన్ని  బుకాయించడానికి తెగిస్తున్నారు. ఇదీ చట్టాలంటే ఈ ఆదర్శ పాత్రల కున్న గౌరవం. అభిమన్యుని చంపాలనుంటే యూనీఫామ్స్ తీసేసి ఎపుడో చంపెయ్యాలి- వ్యక్తి గత కక్షలకి అధికారాన్ని వాడుకునే ఇవేం ఆదర్శపాత్రలు. చట్ట ప్రకారం శిక్షించడానికి స్ట్రగుల్ చేస్తూంటే సానుభూతి అయినా దక్కుతుంది,  గొప్పోళ్ళనిపించుకునే అవకాశముంది.
***
        క జైల్లో అభిమన్యుతో డీల్-  మిత్రన్ రూమ్ లోకి రాగానే అభిమన్యు టేబుల్ మీద కాళ్ళు బార జాపుకుని కూర్చుని ఉంటాడు. ఈ సెషన్ మొత్తం ఇలాగే కూర్చుని ఉంటాడు. తన ప్రత్యర్ధి, ఇప్పుడు నిందితుడూ  అయిన అభిమన్యు అలా కూర్చుని వుంటే, తానొక ఐపీఎస్ అధికారి నన్న ఫీలింగ్ కూడా లేకుండా, అతడి ముందు కూర్చుని మాట్లాడు తూంటాడు మిత్రన్. సమఉజ్జీ అయిన శత్రువుని కోరుకున్నమిత్రన్, తనే సమఉజ్జీగా వుండడు. ఇంకొకరైతే రాగానే రెండు పీకి, సరిగ్గా కూర్చోబెట్టే వాళ్ళు అభిమన్యుని. పాత్ర చిత్రణలు, సన్నివేశ కల్పనలు ఇలా వున్నాయి. 


       ఇక్కడ మళ్ళీ డేటా ప్రదర్శన. తన సిండికేట్ లో వున్న ఘరానా వ్యక్తులు ఎవరో చెప్ప మంటాడు మిత్రన్. ఈ సీను చాలా సేపు సాగుతుంది. సారాంశ మేమిటంటే, రేపు కోర్టుకి తీసుకుపోతున్నప్పుడు అభిమన్యుని పోలీసులు ఎన్ కౌంటర్ చేయాలనుకుంటున్నారు, ఇప్పుడు గనుక తను డేటా ఇచ్చేస్తే మిత్రన్ ఆ ఎన్ కౌంటర్ లోంచి కాపాడతాడు. 

        అభిమన్యు ఇంతవరకూ ఆర్గనైజ్డ్ క్రైమ్సే చేశాడు, అతడికి ఎమోషనల్ క్రైం రుచి తెలీదు. ప్రజల్లో కూడా అభిమన్యు మీద ఎంత ఆగ్రహం కట్టలు తెంచుకుంటోందో చూడమని,  ఆ క్లిప్పింగ్స్- బైట్స్ చూపిస్తాడు. అభిమన్యు కనిపిస్తే కొట్టి చంపేసేట్టున్నారు. కనుక ప్రజల బారి నుంచి కూడా అభిమన్యుని కాపాడి కోర్టుకి తీసికెళ్ళాలంటే, అతనిప్పుడు సిండికేట్ గురించి డేటా ఇచ్చేయాలి. అప్పుడు  తనొక  బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఇస్తాడు. అది తొడుక్కుని వెళ్తున్నప్పుడు ఎన్ కౌంటర్ జరిగినా ప్రమాదముండదు కానీ, చచ్చిపోయి నట్టు నటించాలి. తను సురక్షితంగా కోర్టుకి చేరేస్తాడు.

        ఇలా చెప్పి ఆలోచించుకోమని, బుల్లెట్ ప్రూఫ్  జాకెట్ అభిమన్యు ముందు పెట్టి వెళ్ళిపోతాడు మిత్రన్.
***
       తే- ఐతే-
       ఈ సీను మధ్యలో ఇంకో  గమ్మత్తు వుంది!  అదేమిటంటే, ఫార్మాసిస్టు ప్రస్తావన తెస్తాడు మిత్రన్. పేటెంట్ రైట్స్ ఆమె పేర రిజిస్టర్ అవబోతోందని అంటాడు. అభిమన్యు కలవరపడి- దాని పేరు పెట్టేశావా? అదేదో వాగితే ఫార్ములా దానిది అయిపోతుందా? అది నేను కనుగొన్న ఫార్ములా, దానికేం సంబంధం లేదు- అంటాడు. 


        అప్పుడు మిత్రన్ - అది నువ్వు కనుగొన్న ఫార్ములాయే, ఆమె తనదని వాగలేదు, వాగినట్టు నేను ఎడిట్ చేశా - అని ఆ ఎస్డీ కారు వేసి చూపిస్తాడు. అందులో ఫార్మాసిస్టు- ఆ ఫార్ములా అభిమన్యు కనుగొన్నదేననీ, అయితే ఫారిన్ కి అమ్మేస్తూంటే వద్దని వారించాననీ, అతను  తన మందు తనిష్టమని చంపడానికి వచ్చాడనీ.. ఇలా చెబుతూంటుంది!

        ఇలా చెబుతున్న ఆమె మాటల్ని మిత్రన్ ఎడిట్ చేసి, అది ఆమె కనుగొన్న ఫార్ములాగా చెప్పినట్టు మాటల్ని మార్చాడట!!

        ఇదే మాట రేపు అభిమన్యు కోర్టులో చెప్పేసి కలకలం సృష్టిస్తే? ఇంత ఫూలిష్ గా ఎలా ప్రవర్తిస్తాడు మిత్రన్? అప్పడు మిత్రన్  కోర్టుకి చూపిన వీడియో ప్రశ్నార్ధకమవుతుంది- కోర్టుని తప్పుదోవ పట్టించడం కూడా అవుతుంది. ఆ వీడియోని పరీక్షకి పంపితే ఎడిట్ చేసిన తనే దొరికిపోతాడు!

         ఫార్మాసిస్టుని చంపిన కేసు కూడా అభిమన్యు మీద నిలబడదు- ఎందుకంటే, ఒరిజినల్ వీడియోలో,  అతడి ఫార్ములా అతను అమ్ముకుంటూంటే వద్దని ఆమె వారించానంది. అంత మాత్రాన ఆమెని చంపేస్తాడా? ఆమె అడ్డు పడితే అమ్మకం ఆగిపోతుందా?
        రెండోది- వెనకటి సీన్లో ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ ఇండియాకి మిత్రన్ సబ్మిట్ చేసింది బోగస్ క్లెయిమ్ అని కూడా బయటపడి అక్కడా దొరికిపోతాడు! ఇవన్నీ పోలీస్ యూనిఫాం లో ఒక విలన్ చేయాల్సిన దుశ్చేష్టలు. హీరో చేస్తే నీచంగా ఉంటాడు.

***
     యిపోలేదు ...ఇంకొకటుంది!
     ఇదే జైలు సీన్లో- అభిమన్యు తండ్రి బతికే వున్నాడనీ, అభిమన్యు చేయించిన  కారు యాక్సిడెంట్ ని బూటకంగా మార్చింది తానేననీ  అంటాడు మిత్రన్. కాబట్టి ప్రభుత్వ లాంఛ నాలతో పోలీసులు గౌరవ వందనం చేసిన చితాభస్మం అభిమన్యు తండ్రిది కాదనీ, ఆ చితాభస్మం అభిమన్యు చంపించిన తన కొలీగ్ దనీ అంటాడు మిత్రన్!

        మిత్రన్ మెంటల్ హాస్పిటల్లో ఉండాల్సిన వాడు. యాక్సిడెంట్ లో పోయిన వ్యక్తి చితాభస్మానికి పోలీసులు గౌరవ వందనం చేస్తున్నారంటే అతను కాలి బూడిదయ్యాడు కాబట్టని అర్ధం జేసుకోవచ్చు. మిత్రన్ కొలీగ్ చనిపోయి డెడ్ బాడీ దొరికితే దాని చితాభస్మానికి గౌరవ వందన మేమిటి? పోలీసులు మృత దేహానికి గౌరవ వందనం సమర్పించి కదా బంధువులకి అప్పగిస్తే అంత్య క్రియలు జరిపిస్తారు. అంత్య క్రియలు జరిపాక చితాభస్మానికి గౌరవ వందన మేమిటి ???!!!
        మిత్రన్ పిచ్చెక్కి ఇష్టమొచ్చిన ఆటలాడుతున్నాడు.
***
       ఇక కోర్టుకి తీసుకుపోయే ఎపిసోడ్!
       
బయటికి తీసుకువస్తున్నపుడు జైలు బిల్డింగ్ పైనుంచే (!!) ఒక కొలీగ్ రైఫిల్ గురి పెట్టి ఉంటాడు ఎన్ కౌంటర్ చేయడానికి. ఎంత సిల్లీ సీన్ ఇది! జైలు బుల్దింగ్ పైనుంచి ఎన్ కౌంటర్- సెక్యూరిటీ సిబ్బంది లేరా? బయట అభిమన్యు మీద దాడి చేయడానికి జనం ఎగబడుతూంటారు. ఒకడు కత్తితో దాడి చేయ బోతూంటే అభిమన్యు ని పక్కకి లాగేస్తాడు మిత్రన్. అప్పుడా స్పర్శకి అభిమన్యు జాకెట్ తొడుక్కోలేదని తెలుస్తుంది. ఎందుకిలా  చేశావని కేకలేస్తాడు మిత్రన్. కొలీగ్ ఫైర్ చేసేస్తాడు. దాన్నుంచి కూడా అభిమన్యుని కాపా డేస్తాడు మిత్రన్. ఇంతలో ఇంకో ఫైరింగ్ జరుగుతుంది- మిత్రన్ షాక్ అయిచూస్తే, అభిమన్యు గర్ల్ ఫ్రెండ్ వుంటుంది- తన తండ్రి  హత్యకి అభిమన్యు మీద పగ దీర్చుకుంటూ! 

        చచ్చిపోతూ చెప్తాడు అభిమన్యు- తన డేటా  ఎస్డీ కార్డులో రికార్డు చేసి జాకెట్ లో పెట్టానని. ఇక ఆప్త మిత్రుడు చనిపోతున్నట్టే ఎమోషన్ తో ఎలాగెలాగో అయిపోతాడు మిత్రన్...

***
 1. డీల్ ప్రకారం డేటా  తీసుకోకుండానే మిత్రన్ ఎలా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఇచ్చేస్తాడు?
        2. కోర్టుకి తీసుకు పోతున్నప్పుడు ఆ జాకెట్ దగ్గరుండి తొడిగించడా? అభిమన్యు నిందితుడా, అభ్యాగతుడా?
        3. బయటికి తీసుకొస్తున్నప్పుడు తొడుక్కున్నావా అని నామ్ కే వాస్తే అడుగుతాడు మిత్రన్. తొడుక్కున్నా నంటే నమ్మేస్తాడా? దీంతో తొడుక్కోలేదని మనకే అన్పిస్తుంది.
        4. తీరా దాడి జరిగినప్పుడు తొడుక్కోలేదా అని మిత్రన్ కేకలేయడమేమిటి- ఖచ్చితంగా తొడుక్కోడు విలన్ అన్నాక!
        5. సడెన్ గా అభిమన్యు గర్ల్ ఫ్రెండ్ వచ్చి ఎటాక్ చేసి చంపడం ఈ  కథకి పెద్ద మాస్టర్ స్ట్రోకేం గాదు, రాం గోపాల్ వర్మ ‘కంపెనీ’ ముగింపు ఇదే- చాలా అనూహ్యంగా, చాలా  షాకింగ్ గా- మర్చిపోలేనట్టుగా.
        6. డేటాని ఎస్డీ కార్డులో రికార్డు చేసి జాకెట్లో పెట్టానన్న అభిమన్యుకి జైల్లో ఆ కార్డు ఎక్కడిది? ఎలా రికార్డు చేశాడు? ఇప్పటికైనా తను ముందు డేటా తీసుకోకుండా జాకెట్ ఇచ్చేశాడని మిత్రన్ కి గుర్తొచ్చిందా?
        7. ఈ ముగింపుతో ఏం సాధించాడు మిత్రన్? కథ తను ముగించాడా? అభిమన్యు గర్ల్ ఫ్రెండ్ ముగించిందా?
        8. అసలు కథ తను మొదలు పెట్టాడా?
***
    క ఇంటర్వ్యూలో దర్శకుడు- చాలా    యాక్షన్ థ్రిల్లర్స్ లో విలన్ తో హీరో ఎందుకు పోరాడుతున్నాడనే దానికి ఒక ఫ్లాష్ బ్యాక్ వేస్తారనీ,  ‘తని ఒరువన్’ లో దుష్ట శక్తుల్ని ఓడించడం హీరో బాధ్యతగా చూపించాననీ, దానధర్మాలు చేయడానికి ఎలా కారణాలు అవసరం లేదో, ఇది కూడా అంతేననీ  అన్నాడు. 

        కారణం లేకుండా కార్యం లేదు. దీన్నే కాజ్ అండ్ ఎఫెక్ట్ సూత్రం- కార్యకారణ సంబంధం- అన్నారు. మన ఆలోచన, మాట, చేత అన్నీ దీని మూలంగానే పుడు తున్నాయి. మొత్తం సృష్టే దీని ఆధారంగా నడుస్తోంది. కాబట్టి హీరో కారణం లేకుండా పోరాడలేడు. దాన ధర్మాలు చేయడానికీ కారణం ఉంటుంది- దానం పుచ్చుకుంటున్న వాడు బావుండాలన్న కారణం. కదా? కుక్క కూడా యజమాని బావుండాలన్న కారణంతోనే బతుకుతుంది. అలాగే ఈ కథలో హీరో పోరాటానికి కారణం ఉండే వుంటుంది. జరుగుతున్న నేరాలు చూసి (కాజ్) తను పోలీసాఫీసర్ అవ్వాలనుకున్నానని (ఎఫక్ట్) మిత్రనే  స్వయంగా చెప్పుకున్నాడు. అయితే కాజ్ ఎంత బలంగా వుంటుందో ఎఫెక్ట్  అంత బలంగానూ  వుంటుంది. కాజ్ ఎంత బలహీనంగా వుంటుందో ఎఫెక్ట్ అంత బలహీనంగానూ  వుంటుంది. ప్రతీ చర్యకీ సమానమైన వ్యతిరేక ప్రతి చర్య ఉంటుందని న్యూటన్  మూడో చలన సూత్రం కదా? బంతిని ఎంత  బలంగా గోడకి కొడితే అంత బలంగా వెనక్కి వస్తుంది. 

        కథల్లో కాజ్ రెండు జోన్స్ లోంచి పుడుతుంది : వ్యవస్థ లోంచి, పౌరజీవితం లోంచి. వ్యవస్థ లోంచి కాజ్  పుట్టాలంటే వ్యక్తిగత అన్యాయమో నష్టమో జరిగి ఉండనవసరం లేదు. ఆ అధికారి, లేదా ఉద్యోగి ఉద్యోగ ధర్మమే కాజ్ అవుతుంది. దాంతో చర్య తీసుకుంటారు (ఎఫెక్ట్). అదే పౌర జీవితంలో అయితే వ్యక్తిగతంగా అన్యాయం జరక్కుండా (కాజ్) అన్యాయాల్ని ఎదుర్కోలేరు (ఎఫెక్ట్). ఒక ఆటో డ్రైవర్ అన్యాయాల్ని ఎదుర్కొవాలంటే (ఎఫెక్ట్) వ్యక్తిగతంగా అతడికి అన్యాయం జరిగి వుండాలి (కాజ్).

        ‘
శివ’లో పౌర జీవితంలో ఉండే నాగార్జున తన సన్నిహితురాలు అమలతో జేడీ మిస్ బిహేవ్ చేసినందుకే (కాజ్) జేడీని కొట్టి మాఫియా ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తాడు (ఎఫెక్ట్).  ఇక్కడ ‘కాజ్’ కి పౌర జీవితంలో జరిగిన వ్యక్తిగత నష్టమే.

        ‘డెత్ విష్’  అనే ప్రసిద్ధ సినిమాలో పౌర జీవితంలో వుండే బిజినెస్ మాన్ అయిన ఛార్లెస్ బ్రాన్సన్, దోపిడీ దొంగలు తన భార్యని చంపి, పెళ్ళయిన కూతుర్ని రేప్ చేసిన అన్యాయంతో వ్యవస్థతో విసిగి( కాజ్),  ఇలా మరొకరికి జరక్కూడదని, రాత్రిపూట తనే నగరంలో దొంగల్ని ట్రాప్ చేసి చంపుతూంటాడు(ఎఫెక్ట్). ఇక్కడ కూడా ‘కాజ్’  పౌర జీవితంలో జరిగిన వ్యక్తిగత నష్టమే.

        ‘బొబ్బిలిపులి’ లో వ్యవస్థలో భాగంగా సైనికుడైన ఎన్టీఆర్ సొంతవూరికి వచ్చి పెళ్లి కుదుర్చుకుని పోతూ విలన్ల దురాగతాలు చూసి, తన డ్యూటీ (కాజ్) సరిహద్దుల్లో కాదనీ, ఇక్కడే ననీ డిసైడ్ అయిపోయి, సంఘవిద్రోహుల  మీద సమరభేరి మోగిస్తాడు (ఎఫెక్ట్). ఇక్కడ ‘కాజ్’ వ్యవస్థలో భాగంగా డ్యూటీ పట్ల స్పృహే. వ్యక్తిగత నష్టం జరిగి ఉండాల్సిన అవసరం లేదు. 

        ‘సరైనోడు’ లో సైనికుడిగా తన డ్యూటీ (కాజ్) సరిహద్దుల్లో కాదనీ, దేశం లోపలే దుష్టుల  పని పట్టడమేనని వచ్చేసి వివాదాలు సెటిల్ చేస్తూంటాడు అల్లు అర్జున్ (ఎఫెక్ట్). ఇక్కడ కూడా ‘కాజ్’ వ్యవస్థలో భాగంగా డ్యూటీ పట్ల స్పృహే గానీ వ్యక్తిగతం కాదు.  అయితే ఇది బలహీన కాజ్. ఇలా ఫీలవడానికి పేపర్స్ లో వార్తలేవో చదివి వుంటాడేమో తప్ప, ఇదమిత్థంగా ఓ ప్రత్యక్ష సంఘటన చూడలేదు. అందుకే ఇది బలహీన కాజ్. దీని ఎఫెక్టు కూడా అంతే  బలహీనంగా వుంటుంది- కథ వేరే పాయింటు మీదికి వెళ్ళిపోతూ. ‘బొబ్బిలిపులి’ లో  ఇలాకాకుండా, ఎన్టీఆర్ సంఘవిద్రోహుల కరాళనృత్యం కళ్ళారా చూస్తాడు గనుక, అది బలమైన కాజ్. దాని ఎఫెక్ట్ కూడా ఆద్యంతం అంతే  బలంగా వుంటుంది. 

        ఇక వ్యవస్థలో భాగమైన పాత్రలు వ్యక్తిగత నష్టా లెదుర్కొనే కథలు కూడా వున్నాయి. ఈ పాత్రలు ఉదాత్తంగా వ్యక్తిగత నష్టాన్ని ఓర్చుకుని పదవీ బాధ్యతలకే ప్రాణమిస్తాయి. ఉదాహరణకి ‘కొండవీటి సింహం’ లో పోలీస్ అధికారి అయిన ఎన్టీఆర్ కొడుకుని విలన్ కిడ్నాప్ చేసి బేరం పెడితే లొంగడు.  అలాగే ‘అంకుశం’ లో సీఎంని కాపాడే ఇన్స్పెక్టర్ పాత్రలో రాజశేఖర్ భార్యని విలన్లు చంపేస్తే, సీఎంని రక్షించడానికే పోరాడతాడు రాజశేఖర్! ఇలాటి పాత్ర లు చాలా సానుభూతిని పొంది బలంగా కనెక్ట్ అవుతాయి.
***
       మన మిత్రన్ విషయానికొస్తే, ఇతడికి బలమైన కాజ్ వుందా? వున్న ఆ బలహీన కాజ్ కూడా పోలీసు కాక ముందే వుంది. జరుగుతున్న ఘరానా వ్యక్తుల నేరాలు చూసే పోలీసు అవ్వాలనుకున్నానని అంటాడు. అంటే అప్పుడతను పౌర జీవితంలో ఉంటూ ఈ రకంగా  ఫీలయ్యాడు. ఆ నేరాల తాలూకు వివరాలు గోడల మీద అతికించుకున్నాడు. అయితే అవేవీ అతను ప్రత్యక్షంగా  చూసినవి కావు, బాధితుల్ని పరామర్శించినవీ కావు. నిజానికి నడుస్తున్న కథతో కనెక్ట్ అయ్యే హీరో తాలూకు పూర్వానుభావాల కథని సర్కిల్ ఆఫ్ బీయింగ్ అంటారు. దీన్ని విజువల్ గా ఆనాడు హీరోకేం అనుభవమైందో ఒక ఫ్లాష్ బ్యాక్ ద్వారా  చూపిస్తారు (మాటలతో చెప్తే ఎఫెక్టివ్ వుండదు కాబట్టి). నడుస్తున్న కథకి ఇంధనం (ఎమోషనల్ శక్తి)  ఇక్కడ్నించే అందుతుంది. ఈ సినిమా దర్శకుడేమో-  చాలా యాక్షన్ థ్రిల్లర్స్ లో విలన్ తో హీరో ఎందుకు పోరాడుతున్నాడనే దానికి ఒక ఫ్లాష్ బ్యాక్ వేస్తారని తృణీకార భావంతో అంటాడు.   వేయకపోతే ఎమౌతుందంటే, ఇలాగే  కటౌట్ పాత్ర అవుతుంది, ఉత్సవ విగ్రహంలా వుంటుంది. వీణ్ణి చివరిదాకా మోయలేక చావాలి రైటర్. 

        ఇలా ‘కాజ్’ లో బలం లేనప్పుడు సహజంగానే ఎఫెక్ట్ కూడా బలహీనమైపోయింది ఈ కథలో. బ్యాక్ డ్రాప్ లో ‘కాజ్’  కి సరైన బలం లేకపోవడం వల్ల, ప్లాట్ పాయింట్ వన్ దగ్గర అసలు గోలే (ఎఫెక్ట్) ఏర్పడలేదని గమనించాం.

        ఎప్పుడైతే ప్లాట్ పాయింట్  వన్ బలహీనంగా వుంటుందో, లేక అసలే ఏర్పడదో,  అప్పుడు  ఎండ్ విభాగంలో బిజినెస్ కూడా గందరగోళమై పోతుంది, క్లయిమాక్స్ కుప్పకూలుతుంది. బిగినింగ్ కీ ఎండ్ కీ అవినాభావ సంబంధముంటుంది. కథకి ముగింపు కథా ప్రయోజనం లోనే వుంటుంది. కథా ప్రయోజనం లేకపోతే  కథకి ముగింపే  దొరకదు.

        సిడ్ ఫీల్డ్ ప్రకారం - ఈ కింది రుగ్మతలు పొడసూపుతాయి..
          
1. story  resolution may not be paid off
            2. the  ending will not work
            3. the ending will be too soft, too weak, confusing
            4. the ending will be contrived, too predictable, unsatisfying
            5. main character dies (easy solution)
            6. the main character will disappear at the end
            7. a surprise twist comes out of nowhere.
            8. ending  will not be big, or commercial enough
            9. ending will be too long, and there might be a budget problem
            10. there will be no emotional impact

            వీటిలో 7వ దైన main character dies ని విలన్ క్యారక్టర్ మరణంగా మార్చుకుంటే,  పైన సిడ్  ఫీల్డ్ చెప్పినవన్నీ ఈ సినిమా ఎండ్- క్లయిమాక్స్ లో కన్పించే రుగ్మతలేగా? అంత సరీగ్గా ఎలా చెప్పగల్గాడు సిడ్ ఫీల్డ్? దొంగ చాటుగా ఈ సినిమా చూసి, అప్పటికప్పుడు కన్పించిన విషయాల్ని తప్పులన్నట్టు ఎంచి చెప్పేశాడా? అమెరికానుంచీ అనకాపల్లి దాకా- ఇలా చేస్తే ఈ తప్పు జరుగుతుందని  అతను చెప్పినట్టే సినిమా లెందుకుంటున్నాయి? 

         ఈ కథలో అభిమన్యుని కోర్టుకి తీసుకుపోవడానికి జైల్లోంచి మిత్రన్ బయటికి తీసుకొచ్చే ముగింపు ఘట్టం,  పై  సిడ్ ఫీల్డ్ ఫీల్డ్ చెక్ లిస్టు ప్రకారం-
        1. కథా ప్రయోజనం నెరవేరిందా? అసలు కథా ప్రయోజనం ఏమిటని?
        2. ముగింపు తేలిపోలేదూ?
        3. ముగింపు సాఫ్ట్ గా,  బలహీనంగా, కన్ఫ్యూజింగ్ గా లేదూ?
        4. ముగింపు కల్పించినట్టు, తెలిసిపోయేట్టు, అసంతృప్తి కరంగా లేదూ?
        5. ఈజీ సొల్యూషన్ గా విలన్ చనిపోలేదూ?
        6. హీరోపాత్ర గల్లంతై పోలేదూ?
        7. ఆకాశంలోంచి ఊడిపడ్డట్టు విలన్ గర్ల్ ఫ్రెండ్ తో సర్ప్రైజ్ ట్విస్టు ఇవ్వలేదూ?
        8. ముగింపు భారీ యాక్షన్ తో కమర్షియల్ గా లేదు కదూ?
        9. ముగింపు తెగసాగి  బడ్జెట్ ని పెంచెయ్యలేదూ?
        10. ముగింపులో ఎమోషనల్ ఇంపాక్ట్ ఏమీ లేదు కదూ?  
***
        కథకైనా ఒక ప్రయోజనముంటుంది. ఆ ప్రయోజనం లోంచే ముగింపు దానికదే పుడుతుందే తప్ప- ముగింపుని  ఇటు మార్చి,  అటు మార్చి కృత్రిమం చేయలేరు. ఆ కథాప్రయోజనం లోంచి పుట్టే ముగింపు నచ్చక పోతే, కథనే తీసి  అవతలపడెయ్యాలి తప్ప ఇంకేవో ముగింపులు తెచ్చి అతికించుకుంటూ కూర్చోకూడదు. కథలో కథా ప్రయోజనం ఎక్కడంటుంది? ప్లాట్ పాయింట్ వన్ లో వుంటుంది. అక్కడ హీరోకి ఏర్పడే గోల్ కథా ప్రయోజనాన్ని ఏర్పాటు చేస్తుంది. అందులోంచే ముగింపు పుడుతుంది. అందుకని యథా ప్లాట్ పాయింట్ వన్ తథా ముగింపు  అన్నారు. గోలే లేకపోతే  కథా  ప్రయోజనమూ లేదు, ముగింపూ లేదు, కథే లేదు! 

        ముగింపుకి సంబంధించి లాజోస్ ఎగ్రీ  ‘ది ఆర్ట్ ఆఫ్ డ్రమెటిక్ రైటింగ్’ (1946) అనే ప్రసిద్ధ గ్రంథంలో సింపుల్ గా ఇలా చెప్తాడు -  కథల్లో ప్రారంభం అనేది సంఘర్షణకి మూలం కాదు, అది మొత్తానికి ముగింపుకే  మొదలు. కథా ప్రారంభమే ముగింపుకి మొదలు. పాత్ర ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అంతర్గత క్లయిమాక్స్ ని అనుభవించి, ఆ నిర్ణయం ప్రకారం చర్యకి దిగుతుంది. దాంతో  సంఘర్షించి తాను కలగన్న  బహిర్గత క్లయిమాక్స్ ని సాధిస్తుంది...

       
దీన్నిలా చూడవచ్చు- మనమొక పని చేయాలనుకున్నప్పుడు దాని  ఫలితాన్ని వూహించుకుంటాం ( అంతర్గత క్లయిమాక్స్) ఆ వూహలకి తగ్గటు ఫలితాన్ని సాధించేందుకు ప్రయత్నిస్తాం (బహిర్గత క్లయిమాక్స్).  అంతే,  ఇంత సింపుల్!

        అంటే ప్లాట్ పాయింట్ వన్ దగ్గర కథ ప్రారంభమవుతుందనుకుంటే, ఆ ప్లాట్ పాయింట్ వన్ లోనే క్లయిమాక్స్ కూడా  వుందన్న మాట. పెళ్ళితో ఒక జంట ఏకమయ్యిందంటే, ఆ పెళ్ళిలోనే క్లయిమాక్స్ కూడా ఉందన్న మాట- రాబోయే కాలంలో పిల్ల పుట్టడం! పెళ్ళికి ఉద్దేశించే  క్లయిమాక్స్ ఇది. ఇది పెళ్లి ప్రయోజనం. ‘శివ’ లో నాగార్జున ప్లాట్ పాయింట్ వన్ దగ్గర జేడీని  తిప్పితిప్పి చితకబాదితే అందులోనే క్లయిమాక్స్, ముగింపూ, కథాప్రయోజనమూ అన్నీ వున్నాయి- అంతిమంగా రఘువరన్ మాఫియా ప్రపంచానికి ఎసరు పెట్టడం! వీణ్ణి కొడితే వాడు పోయే కాలం కూడా వస్తుందని, అంతిమ ఫలితాన్ని ఊహించుకునే జేడీని అలా కొట్టి ఉంటాడు నాగార్జున!

        మరి మన మిత్రన్ ఎలర్జీతో ప్లాట్ పాయింట్ వన్ ని తప్పించుకున్నా,  స్క్రీన్ ప్లేలో అడ్డ మార్గాల్లో ( పోలీసుగా కూడా అడ్డ మార్గాల్లోనే ) ఏం సాధించాలని కలగన్నాడు? ఈ ప్రపంచానికి అభిమన్యు పీడా  తొలగించాలనే కదా? మరి తొలగించాడా? ఆ ముగింపుకి కథని చేర్చడా? ఆ ముగింపుతో కథా ప్రయోజనాన్ని నెరవేర్చాడా? ఇంకెవరో వచ్చి కదా అతడి కలల్నీ, కథా ప్రయోజనాన్నీ, ముగింపునీ,  హీరోయిజాన్నీ చెడగొట్టింది! 

        కథా  ప్రయోజనం గురించి లాజోస్ ఎగ్రి ఇలా చెప్తాడు- ఓ మనిషి దొంగతనం చేస్తాడు. అది సమస్య. అతణ్ణి వెంటాడతారు. ఇది సంఘర్షణ. అతను పట్టుబడతాడు. ఇది సంక్షోభం. న్యాయస్థానంలో శిక్ష పడుతుంది. ఇది ముగింపు.  అతణ్ణి జైల్లో పెడతారు. ఇది కథా ప్రయోజనం. 

       
అన్యాయాలు చేసిన వాడిపై న్యాయమే గెలిచినట్టు, చట్టాల్ని అతిక్రమించిన వాడిపై చట్టమే గెలిచినట్టూ పూర్తిగా చూపించి ముగించడమే  ఉత్తమ కథా లక్షణం .

        కానీ ఒక పోలీసు అధికారిగా మిత్రన్  చట్టాల్ని ఏమార్చడమే హీరోయిజమనుకుంటే ఏ కథాప్రయోజనం నెరవేరుతుందని? 

        ఇటీవల ఒక పేరున్న మీడియం హీరోతో సినిమా తీసిన దర్శకుడు పోలీసు కథ చెప్పారు. అది చాలా కన్ స్ట్రక్టివ్ గా, ప్రొఫెషనల్ గా, కమర్షియల్ గా వుంది- ముగింపు పక్క పాత్ర చేతికి వెళ్ళడం తప్ప. దాన్ని హీరో కి మార్చి, ఇందులో ఇంకెవరూ ఎక్కడా వేలు పెట్టనివ్వకుండా ఎలా రాశారో అలా తీయమని చెప్పాడు ఈ వ్యాసకర్త. ఇదీ స్క్రీన్ ప్లే యాక్టర్లకీ, స్క్రీన్ ప్లే క్రియేటర్లకీ వున్న తేడా!  


-సికిందర్        
       


               






20, మే 2016, శుక్రవారం

షార్ట్ రివ్యూ


రచన – దర్శకత్వం : శ్రీకాంత్ అడ్డాల

తారాగణం : మహేష్ బాబు, సమంత, కాజల్ అగర్వాల్, ప్రణీత, రేవతి, జయసుధ, తులసి, శరణ్య, అర్చన, సత్య రాజ్, రావు రమేష్, తనికెళ్ళ భరణి, నాజర్, సాయాజీ షిండే, నరేష్, కృష్ణ భగవాన్, జయప్రకాష్ రెడ్డి, వెన్నెల కిషోర్ తదితరులు
సంగీతం : మిక్కే జే మేయర్,  ఛాయాగ్రహణం : రత్న వేలు
బ్యానర్ : పివిపి సిని మా- మహేష్ బాబు ఎంటర్ టైన్ మెంట్స్  ప్రై. లి.
నిర్మాతలు : పొట్లూరు వి. ప్రసాద్, మహేష్ బాబు 
విడుదల : 20 మే, 2016
***
       శ్రీకాంత్ అడ్డాల ఫిలసాఫికల్ ఫ్యామిలీ డ్రామాల  పరంపర ఇంకా కొనసాగుతోంది. ఇందులోకి మరోసారి మహేష్ బాబు జాయినయ్యాడు. ఒక పెద్ద నిర్మాత దీనికి తోడయ్యాడు, భారీ తారా గణమంతా  వరసకట్టారు, అగ్రస్థాయి సాంకేతిక నిపుణులూ కలిశారు. ఇంతమంది హేమీ హేమీలని కలిపి చూస్తేనే ఇదొక బ్రహ్మోత్సవం. సూపర్ స్టార్ కృష్ణ నటించి నిర్మించిన ‘దేవుడు చేసిన మనుషులు’ కూడా ఇలా హేమా హేమీలతో ఓ పెద్ద బ్రహ్మోత్సవమే ఆనాడు- థియేటర్ల లోపలా బయటా! ఇప్పుడు ‘బ్రహ్మోత్సవం’  టైటిల్ తోనే వచ్చిన ఈ హేమా హేమీల ‘బ్రహ్మోత్సవం’  థియేటర్ లోపల వెండి తెర మీద కూడా బ్రహ్మోత్సవాన్నే వెలిగించిందా? ప్రేక్షక భక్తులు ఈ బ్రహ్మోత్సవపు భక్తి ప్రవాహ రసంలో కొట్టుకుపోయేలా చేసిందా?  ఓసారి చూద్దాం...

కథ
        విజయవాడలో సత్య రాజ్ -రేవతి లకి మహేష్ బాబు ఏకైక కొడుకు. సత్య రాజ్ మామ దగ్గర నుంచి నాలుగు వందలు తీసుకుని ఇప్పుడు నాల్గు వందల కోట్లు చేసే పెయింట్స్ కంపెనీ  అధిపతి అయ్యాడు. తన చుట్టూ ఎప్పుడూ పదిమంది వుండి జీవితం పండగలా, బ్రహ్మోత్సవంలా గడపాలని అతడికుంటుంది. బావమరుదులైన రావురమేష్, నరేష్, సాయాజీ షిండే, కృష్ణ భగవాన్ నల్గురికీ కంపెనీలో భాగస్వామ్యం ఇచ్చి ఇంట్లోనే పెట్టుకుంటాడు. అలా అందరూ ఆటాపాటా పండగలూ పబ్బాలతో నవ్వుతూ హాయిగా జీవించేస్తూంటారు- ఒక్క రావు రమేష్ తప్ప. రావు రమేష్ కి ఇలా బావ పంచన పడి బతకడం అస్సలు ఇష్టముండదు. అలాగని బయటికి పోతానని చెప్పలేడు. భార్య జయసుధ, కూతురు ప్రణీత వుంటారు. కూతుర్ని మహష్ బాబుకిచ్చి చేసుకుంటే అలాగైనా ఈ ఇంట్లో తన ప్రాధాన్యం పెరుగుతుందన్న ఆశతో ఉంటాడు. అలాటిది సత్యరాజ్ స్నేహితుడి కూతురు కాజల్ అగర్వాల్ రావడంతో రావు రమేష్ ఆశలు కరిగిపోతాయి. కాజల్ మహేష్ ఇద్దరూ ప్రేమలో పడతారు. 

        మహేష్ బాబు అందరికీ ప్రియమైన వాడు.  ఏ కష్టం తెలీకుండా అలా అలా జీవితం గడిపేస్తూంటాడు.  మాట అనే ముందు, ఏదైనా చేసే ముందు ఎక్కువ ఆలోచించడు. రావు రమేష్ తన కూతుర్ని మహేష్ కి చేసుకోమని చెప్ప లేకపోతున్నాడని సత్యరాజ్ కి తెలుస్తుంది. అయినా మౌనంగా ఉంటాడు. అంతా కలిసి టూర్ కి వెళ్తారు. అక్కడ కాజల్ మనసు విప్పుతుంది. తనది స్వేచ్చా ప్రపంచమని, ఇంటినిండా మనుషుల మధ్య వుండలేననీ అంటుంది. మహేష్ బాబు అర్ధం జేసుకుని బై చెప్పేస్తూ కిస్ ఇస్తాడు. ఇది చూసి రావు రమేష్ ఇక రెచ్చిపోతాడు. కూతురు పెళ్లి ఇక మహేష్ తో జరగదన్న ఆక్రోశంతో సత్య రాజ్ ని నానా మాటలంటాడు. ఈ  బానిస బతుకు బతకలేనని వెళ్ళిపోతాడు. సత్యరాజ్ గుండె పోటుతో చనిపోతాడు. చనిపోయే ముందు  మహేష్ తో తన కోరిక చెప్తాడు. ఆ కోరిక ప్రకారం ఏడుతరాల బంధువుల్ని వెతకడానికి మహేష్ బాబు బయల్దేరతాడు. ఇదీ కథ. 

ఎలా వుంది కథ
       
ది పాత రోజులనాటి ఉమ్మడి కుటుంబపు కథైనా,  దీన్ని ఇప్పటి కాలానికి అన్వయించి చెప్పలేకపోయారు. సమస్య ఏమిటంటే, తెలుగులో ఫ్యామిలీ సినిమాలంటూ వస్తే నరుక్కునే రాక్షసులైన ఫ్యాక్షన్ - మాఫియా కుటుంబాల కథలొస్తాయి, లేదంటే 1960-70 లనాటి కాలం చెల్లిన సెంటిమెంట్ల కథలొస్తాయి. ఈ రెండూ తప్ప ప్రేక్షకులకి వెరైటీ అనేదే లేదు.  ఈ కథ కూడా అదే పాత మూసలో, అవే కాలం చెల్లిన విలువలకోసం ప్రాకులాడే చాదస్తపు పాత్రలతో చెప్పారు. కాలం మారింది, జీవనోపాధి మార్గాలూ పెరిగిపోయాయి. వ్యవసాయానికో వ్యాపారానికో ఉమ్మడి కుటుంబంగా గడపాల్సిన అగత్యం ఇప్పుడు లేదు.  కుటుంబ సభ్యులు ఎవరి  అవకాశాలు వాళ్ళు వెతుక్కుంటూ వెళ్ళి ఇంకా బాగా అభివృద్ధిలో కొస్తున్నారు. మనుషులు భౌతికంగా దూరమైనా మానసికంగా దగ్గరగా వుండే టెక్నాలజీ వుంది. పాత తరం కొత్త కాలంలోకి రావాలే గానీ,  కొత్త తరాన్ని  పాత కాలంలోకి లాగాలనుకోవడం మూర్ఖత్వం. నిజమే, కలిసి వుండాలని అనడం శాశ్వత విలువే – కానీ ఇలాగే కలిసుండా లనడం పాత విలువ. శాశ్వత విలువలూ సత్యాలూ మారవు గానీ, పాత విలువలూ అభిప్రాయాలూ మరిపోతూంటాయి. దీన్నర్ధం జేసుకోలేక బాధలు పడుతున్న వాళ్లెందరో వున్నారు. ఈ సంధి కాలంలో ఇలా చిక్కుకు పోయిన కుటుంబాలకి విముక్తి కల్గించే సమకాలీన పరిష్కార మార్గాలు  చెప్పాలే గానీ- ఇష్టమున్నా లేకపోయినా అంతా ఒక చోటే కలిసి వుండాలి, ఒకడి మాటే వినాలీ అని సందేశాలిచ్చి ముగిస్తే- మిగిలేది ఈ కథలో లాగే గుండె పోటు మరణాలే.

ఎవరెలా చేశారు
       
హేష్ బాబు ఈ సినిమాలో ఏమీ చేయకపోయినా అలా కన్పిస్తూంటే చాలు,  అదే మహాభాగ్యం అన్నట్టు వుంటుంది అభిమానులకి. అలాటి వాళ్ళకి ఈ సినిమాలో మహేష్ బాబు ఒక అందమైన రాకుమారుడు. ఈ  రాకుమారుడు ఏం చేశాడూ అని మాత్రం చూడకూడదు. రాకుమారుడికి ఏం పనుంటుంది? ఇతరులు చేస్తూంటారు. ఈ రాకుమారుడి తరహా చూసి విసిగి పోయి మొత్తమంతా రావు రమేష్ భుజానే సుకుని చేసుకొచ్చాడు. రాకుమారుడుగా మహేష్ బాబు మాత్రం జస్ట్ అలా మెరిసిపోయే అందచందాలతో, కాస్ట్యూమ్స్ తో, ఓ చిరునవ్వుతో, అలా అలా పాత్రల మధ్య కన్పిస్తూ, ఒక్కో డైలాగు అలా అలా విసురుతూ సరదాగా తిరిగేస్తూంటే, హీరోయిన్లతో కలిసి పాటలు పాడేస్తూంటే చాలు- ఇంతకంటే ఇంకేమీ  చేయనవసరం లేదు. 

        హీరోయిన్లు సమంతా, కాజల్, ప్రణీత లు పాపం తమ పాత్రలతో బాగానే కష్ట పడ్డారు. కాజల్ అగర్వాల్ చివరి సీనులో బెస్ట్ గా నటించి, ఆలోచనాత్మకంగా తన హృదయాన్ని విప్పుతుంది. ఇది ఈ సినిమాకి ల్యాండ్  మార్క్ సీన్. ఇంకో ల్యాండ్ మార్క్ సీన్ దీని తర్వాత ఇంటర్వెల్ ముందు వచ్చే రావు రమేష్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే సీను. ఈ రెండూ తప్ప ఇంకో ఎమోషనల్ సీను వుంటే ఒట్టు. 

        సమంత కి కూడా ఒక చక్కటి పాత్ర చిత్రణ వుంది-యాసలో చెప్తే తప్ప వర్కౌట్ కాదన్న ఊత పదంతో. ప్రణీతదే నిర్లక్ష్యం చేసిన పాత్ర.  ఇంట్లో మరదలు ప్రణీతని ఉంచుకుని తడవకో పరాయి అమ్మాయి వెంట పడతాడు మహేష్. ప్రణీతని బాధ పెట్టడం ఆ ఉమ్మడి కుటుంబపు ఆనందాల్లో భాగమా? 

        సహాయ పాత్రలు లెక్కకి మించి వున్నాయి. విచిత్ర మేమిటంటే ఏ సంబరంలో చూసినా బృందాలుగా ఆడవాళ్లే. మహేష్ బాబు తప్ప ఇంకో మగాపిల్లాడే పుట్టలేదా ఆ కుటుంబాల్లో? కనీసం అతడికి ఫ్రెండ్స్ కూడా లేరా? ప్రతీ గ్రూప్ డాన్సుల్లో కూడా మొత్తం ఆడవాళ్ళేనా? విజయవాడలో మగకుర్రాళ్ళే లేరా?

        ఒక్క రావురమేష్ తో పాటు సత్య రాజ్  మాత్రమే - వాళ్ళు పడే సంఘర్షణతో గుర్తుండిపోయే పాత్రధారులుగా మిగిలిపోతారు. 

        మిక్కీ జే మేయర్ పాటలు టైటిల్ ని ఎలివేట్ చేసేట్టు లేవు. రత్నవేలు ఛాయాగ్రహణం, ఇతర అన్ని సాంకేతిక విలువలూ ఉన్నతంగా వున్నాయి. డబ్బు వ్యయం చేస్తే ఎంత గొప్ప సాంకేతిక విలువలైనా దక్కొచ్చు- కానీ ఎంత డబ్బు వ్యయం చేసినా ఆ సాంకేతిక విలువలతో సరితూగే స్క్రిప్టు దక్కడం లేదే? 

చివరి కేమిటి?
       
హేష్ బాబు అందచందాల కోసం చూడొచ్చు. అదే బ్రహ్మోత్సవం. అంతకంటే ఆశిస్తే ఆశాభంగం తప్పదు. ఫస్టాఫ్ మొదటి అరగంట లోనే నాల్గు పాటలు  వస్తాయి. సెకండాఫ్ లో ఒకే ఒక్క చిన్న ఫైట్ వుంటుంది. కమెడియన్లు లేరు, సెకండాఫ్ లో వచ్చే వెన్నెల కిషోర్ తప్ప. ఇంటర్వెల్లో  తండ్రి చనిపోయాక, తండ్రి కోరిక ప్రకారం  ఏడుతరాల బంధువులని ఒక దగ్గర చేర్చేందుకు మహేష్ బాబు వివిధ నగరాలు తిరిగే దృశ్యాలతో వేరే దోవ పడుతుంది కథ. అసలు రావురమేష్ గొడవ పడి  విడిపోవడానికి కారకులే సత్య రాజ్, మహేష్ బాబులు. కూతురి పెళ్లి గురించి రావురమేష్ అడగలేక పోతున్నాడనీ తెలిసీ సత్యరాజ్ మౌనం దాల్చడం ఒక తప్పు, కాజల్ అగర్వాల్ ని ముద్దు పెట్టుకున్న దృశ్యాన్ని అపార్ధం జేసుకున్నావనీ, ఆమెతో తను  విడిపోయాడనీ రావురమేష్ కి మహేష్ బాబు చెప్పక పోవడం రెండో తప్పు. తండ్రీ కొడుకులే రావురమేష్ గొడవ పడి విడిపోవడానికి కారకులయ్యారు తప్ప మరోటి కాదు. అలాంటప్పుడు తప్పు తెలుసుకుని రావు రమేష్ ని కలుపుకోవాల్సింది పోయి,  ఎక్కడో ఏడుతరాల బంధువుల్ని కలపడం కోసం తిరగడం ఏం కథో! ఈ బంధువులకోసం తిరిగే నలభై నిమిషాలూ నిద్రపోయినా నష్టం లేదు. 

        ఫిలాసఫీతో కూడిన డైలాగులు చాలా  చోట్ల అర్ధం గావు. ఏం చెప్పాడా అని ఆలోచించుకునే లోగా మరో  డైలాగు వచ్చేస్తుంది. దర్శకుడు ఈ కథని సీరియస్ గా తీసుకుని వేదాంత ధోరణిలో చాలా స్లోగా, బరువుగా చెప్పుకొస్తాడు- తన సొంత డైరీ రాసుకుంటున్నట్టు. ముగింపు మీద కూడా ఆశ పెట్టుకో నక్కరలేదు. కేవలం మహేష్ బాబు గ్లామర్ ప్రదర్శన కోసమైతే వెంటనే చూడొచ్చు - ఎందుకంటే మళ్ళీ మహేష్ బాబు తెరపైకి ఎప్పుడొస్తాడో!


       ఇంకోసారి ‘దేవుడు చేసిన మనుషులు’ చూసేందుకు ప్రేరేపించే బ్రహ్మోత్సవం ఇది.



-సికిందర్