రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

16, మే 2016, సోమవారం

స్క్రీన్ ప్లే సంగతులు -3








క్స్ పొజిషన్ –వివరణ అనేది స్క్రీన్ ప్లేకి బద్ధ శత్రువు లాంటిది. ఒక పాత్ర గురించో, జరిగిపోయిన సంఘటనల గురించో తెలియ జేయడానికి క్లాస్ రూమ్ పాఠం లాగా ఇంకో పాత్ర వచ్చి చెబుతూ పోతూంటే అది డాక్యుమెంటరీ అవుతుంది. ఇందుకే ‘తని ఒరువన్’ ప్లాట్ పాయింట్  వన్ తొమ్మిది నిమిషాలూ సినిమా చూస్తున్నట్టు గాక, న్యూస్ రీల్ చూస్తున్నట్టు వుంటుంది. అయితే వివరణ ఇవ్వాల్సి వస్తే,  ఇలా పాఠంలా చెప్పకుండా, సినిమా కళలో కలిసిపోయే నాటకీయ ప్రక్రియతో చెప్తే స్క్రీన్ ప్లే శిల్పం దెబ్బ తినదు. ఐతే ‘తని ఒరువన్’ ప్లాట్ పాయింట్  వన్ లో,  కథతో సంబంధం లేని అంశాలతో ఆ సుదీర్ఘ ఉపన్యాసం అవసరమే లేదన్నది వేరే విషయం. కానీ ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ఎక్స్ పొజిషన్ తో ఈ బిగినింగ్ విభాగం ముగిశాకా, మిడిల్ విభాగం మొదలవగానే  మళ్ళీ  విలన్ గురించి ఇంకో  చాంతాడంత డాక్యుమెంటరీ మొదలవుతుంది. ఈ ఎక్స్ పొజిషన్  అక్షరాలా ఆరు నిమిషాలు వుంటుంది!
No rules please,
Rules are for fools!

       ఒకవేళ విలన్ అభిమన్యు చరిత్రని  ఎక్స్ పొజిషన్ తో చెప్పాల్సే వస్తే, 1972 లో ‘గాడ్ ఫాదర్’ లో అనుసరించిన పద్ధతిని పాటించాల్సింది. సినిమా ప్రారంభంలోనే గాడ్ ఫాదర్ కూతురి  పెళ్లి  వేడుకల్లో  గాడ్ ఫాదర్ కుటుంబానికి ఎంత భయానక మాఫియా చరిత్ర వుందో ఒకటిన్నర నిమిషాల్లో నాటకీయంగా ఒక సన్నివేశం కల్పించడం ద్వారా విజువల్ గా చూపించేస్తారు -  అదీ నిలిచిపోయే సినిమాటిక్ కళ అంటే!

      మిడిల్ : మిడిల్ అంటే ప్లాట్ పాయింట్ వన్ దగ్గర  గుర్తించిన సమస్యతో/ శత్రువుతో హీరో ఎదుర్కొనే  సంఘర్షణ. పడుతూ లేస్తూ సాగించే ప్రయాణం. చివర్లో పరిష్కార మార్గం కనుగొనడం.
 
        ప్లాట్ పాయింట్ వన్ తో ఏం చేసుకోవాలో ఎటూ తెల్చుకోలేకపోయిన మిత్రన్,  దాన్నలా అసంపూర్ణంగా వదిలేసి, బైపాస్ రోడ్లో మిడిల్లోకి ఎంటరవాలని ట్రై చేస్తాడు, కానీ ఒక టోల్ గేట్ దగ్గర దొరికిపోతాడు. స్క్రీన్ ప్లే కి ఈ ప్లాట్ పాయింట్ వన్ ని కనిపెట్టిందెవరా అన్నదే అతడి బాధ. దీంతో లేనిపోని చావొచ్చింది. ఈ మిడిల్లో అసలు తన సమస్య ఏమిటో, ఎవరితో పోరాడాలో ఇంకా స్పష్టత లేదు. ఇలాటి కథనం ఇంకే సినిమాలోనూ చూసి వుండం బహుశా. చీకట్లో రాయి విసిరి చూద్దా మన్నట్టు- ఎవరో మైన్స్ మాఫియా చెల్లదురైని కనిపెట్టాలనుకుంటాడు. పట్ట పగలు వెంబడిస్తాడు. రాత్రి పూటే పోలీస్ అకాడెమీ క్యాంపస్ నుంచి ఎలా జారుకుంటున్నాడనే ప్రశ్న ఉండగానే, ఇప్పుడు పట్ట పగలు  ట్రైనింగ్ కి హాజరవకుండా ఎలా  నగరంలో కొలీగ్స్ ని వెంటేసుకుని యధేచ్చగా సంచరిస్తున్నాడన్న ఇంకో ప్రశ్న లేవనెత్తుతాడు.

                                                ***
        మూస ఫార్ములా కథ సహేతుకంగా, హేతుబద్దంగా వుండాలని లేదు. కానీ పోలీస్ ప్రొసీజురల్- ఇన్వెస్టిగేషన్ ఆధారిత కథ లాజికల్ గా ఉండి తీరాల్సిందే. ఒక వాస్తవం చెప్పుకుంటే, మిగతా అన్ని రకాల కథల కన్నా పోలీస్ ఇన్వెస్టిగేషన్ జానర్ కథలు రాసుకోవడం అందరి వల్లా కాదు. మూస ఫార్ములా మైండ్ సెట్ వదులుకుని, దర్శకుడు మరింత ప్రొఫెషనల్ గా మారి, తనలోంచి పక్కా క్రైం ఫిక్షన్  రైటర్ తొంగి చూసేలా చూసుకోవాల్సిందే. లేకపోతే హాస్యాస్పదంగా తయారవుతుంది. ఇలాటి సినిమాలకన్నా సోనీ టీవీలో గత 19 ఏళ్లుగా సక్సెస్ ఫుల్ గా ప్రసారమవుతున్న క్రైం ఇన్వెస్టిగేషన్ సిరీస్  సీఐడీచూసుకోవడం ఉత్తమం. శివాజీ  సతమ్ నేతృత్వంలో సీఐడీ టీమ్ చేసే నేరపరిశోధనలు చాలా రియలిస్టిక్ గా, విజ్ఞాన దాయకంగా వుంటాయి. 
                                                ***


        మిత్రన్ అలా చెల్లదురైని వెంబడించి వెళ్తే, చల్లదురై మైన్స్ మంత్రి సెంగల్వ రాయన్ ని కలుసుకుని ఇద్దరూ కలిసి  సైంటిస్టు అభిమన్యు దగ్గరికి వెళ్తారు. అక్కడ అశోక్ పాండియన్, పెరుమాళ్ స్వామి కలుస్తారు. నల్గురూ కలిసి అభిమన్యు దగ్గరికి వెళ్తారు. ఇలా ఇప్పుడు మాత్రమే విలన్ గా వున్న అభిమన్యు ని చూడగల్గుతాడు మిత్రన్!

        ఈ ఏర్పాటు  ఎంత మభ్య పెట్టే  విధంగా వుందో చూద్దాం- 

        చెల్లదురై  మైన్స్ మాఫియా. రేపు మైన్స్ తనిఖీ జరక్కుండా ఆపాలని తన సిండికేట్ లో భాగస్థుడైన మంత్రి సెంగల్వ రాయన్ ని కలిశాడు. అప్పుడు సింపుల్ గా మైన్స్ మంత్రి సెంగల్వ రాయనే ఆదేశాలిస్తే తనిఖీలు ఆగిపోతాయి కదా? ఇద్దరూ కలిసి  అభిమన్యు దగ్గరి కొచ్చి చెప్పుకోవడమెందుకూ!!

        అంటే మిత్రన్ కి విలన్ అభిమన్యు గురించి తెలియాలంటే ఎట్లా అని దర్శకుడు ఆ లోచించి, ఈ అర్ధం లేని కథనం చేశాడన్నమాట.  
    
        ఇలా అర్ధరహితంగా  సెంగల్వ రాయన్, చెల్లదురైలు విలన్ అభిమన్యు దగ్గరికి పోతే- అర్జెంటుగా ఒక విలన్ అవసరమున్న మిత్రన్ చీకట్లో రాయి వేస్తూ వీళ్ళ వెంటపడి పోతాడు. అప్పుడే చూడగల్గుతాడు విలన్ని! అంతకాలం తను అంత రీసెర్చ్ చేస్తూంటే నగరంలోనే ఉంటున్న అభిమన్యు గురించి ఇప్పుడే తెలియడ మేమిటి
? మెడికల్ మాఫియా అశోక్ పాండియన్ మీద నైట్ క్లబ్ నాడే కన్నేసి వుంటే,  అభిమన్యు ఎప్పుడో తెలిసిపోయేవాడు కదా!  ప్లాట్ పాయింట్ వన్ దగ్గర కూడా తన కథకి విలన్ ఎవరో తెలియని దౌర్భాగ్యం ఏర్పడేది కాదు కదా? ఒక ఐపీఎస్ కి ఉండాల్సిన  లోచనా సరళి ఇది కాదు కదా? ఈ పాత్ర దర్శకుణ్ణి/కథకుణ్ణి మించిపోయి వుండాలికదా? 

        మిత్రన్ సైంటిస్టు అభిమన్యు ని చూశాక  స్క్రీన్ ప్లేలో ఇంకో తప్పు జరిగిపోతుంది. మళ్ళీ ఆరు నిమిషాలపాటు అభిమన్యు పరిచయ డాక్యుమెంటరీ ప్రారంభమవుతుంది. మిత్రన్ ఇంకో వ్యక్తిని కలుస్తాడు. ఆవ్యక్తి చిన్నప్పటి పళని గురించి చెప్తాడు. పళనీయే ఈ అభిమన్యు అని చెప్పి, ఇప్పుడు మంత్రిగా వున్న సెం గల్వ రాయన్ కొడుకే అని చెప్పి, ఆనాడు ఇతను జైలు నించి విడుదలయ్యాక ఫారిన్ వెళ్లి సైంటిస్టు  అయ్యాడనీ చెప్పి,  పద్మశ్రీ అవార్డు  కూడా పుచ్చుకున్నాడనీ కూడా చెప్పి- ఎలా క్లిప్పింగ్స్ తో వివరణ ఇస్తారు. 
       
        ఇలా ఈ ఆరు నిమిషాలతో పాటు, ప్లాట్ పాయింట్ వన్ దగ్గర తొమ్మిది నిమిషాలూ  కలుపుకుని  ఎకబిగిన మొత్తం 15 నిమిషాలూ అసలు కథలోకి వెళ్ళకుండా, స్క్రీన్ టైముని తినేస్తూ, కార్యకారణ సంబంధాల వివరణ లిచ్చుకోవడంతోనే సరిపోతుంది. 

       
 ఐనప్పటికీ ఇతనే నా విలన్ అని ఇప్పుడు కూడా   నిర్ణయించుకోడు మిత్రన్! విలన్ ఎవరో ప్రేక్షకులకి ఎప్పుడో తెలిసిపోయి వాళ్ళు చాలా ముందుంటే, మిత్రన్ ఇంకా నసుగుతూ వెనకబడి ఉంటాడు. ఈ ఫటాఫట్ కాలంలో యాక్షన్ మూవీకి డైనమిక్స్ కూడా అక్కర్లేదేమో!

        ఇక్కడ మెడికల్ మాఫియా అశోక్ పాండియన్ యాంజలీనా గురించి చెప్తాడు. అప్పుడు ఆమె వచ్చే డిసెంబర్ పది తనకి ఇంపార్టెంట్ తేదీ అని చెప్తాడు విలన్ అభిమన్యు. ఆ రోజు  ఫారిన్ నుంచి ఒప్పందం కోసం వస్తున్న  స్విస్ ఫార్మా కంపెనీ యజమానురాలు యాంజలీనాని చంపేస్తానని నర్మగర్భంగా అంటాడు. కళ్ళెదుటే ఇంత ఎవిడెన్స్ ని మిత్రన్ వెంటనే సెల్ ఫోన్లో  చిత్రీకరించాలనుకోడు!  చిత్రీకరించి అప్పుడే టెలికాస్ట్ చేయించి వుంటే అభిమన్యు ఖేల్ ఖతం - దుకాన్ బంద్ అయిపోయేది కదా? యాంజలీనా జీవించి వుండేది కదా!

        మిత్రన్ రూమ్  నిండా పెట్టుకున్నది పాసివ్ గా సేకరించిన క్లిప్పింగ్సే, ఫోటోలే, డేటానే. ఎక్కడా తను స్వయంగా కనిపెట్టి లైవ్ గా సేకరించిన సమాచారం లేదు. స్టింగ్ ఆపరేషన్ లేదు. జీవితంలో ఫస్ట్ టైమ్ లైవ్ గా చూస్తున్న ఇప్పటి విషయాన్నికూడా  వెంటనే రికార్డు చేయాలనీ అనుకోడు! కళ్ళప్పగించి చూస్తూంటాడు. 

        ఇక్కడే ఇప్పుడే పట్టుకుంటే, ఇంకో గంట సేపున్న సినిమా అప్పుడే ముగించెయ్యలా అని నిలదీయవచ్చు-  అలాంటప్పుడు ఈ సీన్లో మిత్రన్ వుండనే కూడదు
, వుంటే ఆటోమేటిగ్గా నెక్స్ట్ కథ ముగిసిపోయే సీనే వస్తుంది, దేవుడు కూడా ఆపలేడు!

        ఎప్పుడైతే కథకుడు కథ నడిపిస్తాడో ఇలాటి గోతులే ఎదురవుతాయి. ఎప్పుడైతే కథానాయకుడు కథ నడిపిస్తాడో గోతులుండవు- గంగోత్రిలా పారిస్తూంటాడు కథని గలగలా...  

        అడుగడుగునా విఫలమయ్యే ఈ కథానాయక పాత్ర, కథకుడు కథ నడపడం వల్ల అన్యాయమైపోయిన కనిపించని పాసివ్ పాత్ర. 

                                                         ***
       ఇదే సీన్లో విలన్ అభిమన్యు ఒక ఘోరానికి పాల్పడతాడు. చెల్లదురై సమస్య తెలుసుకుని,  మెషిన్  తీసుకుని ఒక అనుచరుడి గొంతు మీద ఏదో చెక్కేస్తూంటాడు. ఒక ట్రైనీ ఐపీఎస్ అధికారిగా వెంటనే ముందుకు దూకి ఈ దుష్కృత్యాన్ని ఆపాలి మిత్రన్ నిజానికి!  అక్కడికక్కడే హత్యాయత్నం నేరం మీద  అభిమాన్యుని అరెస్ట్ చేయించాలి, బాధితుణ్ణి హాస్పిటల్ కి తరలించాలి. 

        ఇది కూడా చెయ్యకుండా చూస్తూంటాడు నక్కి. అది చేతకాకపోతే కనీసం సెల్ ఫోన్లోనైనా చిత్రీ కరించాలి. ఈ పని ఇప్పుడు కూడా చేయాలనుకోడు! ఇవన్నీ చేస్తే సినిమా ఇప్పుడే ముగిసిపోతుంది కదయ్యా అని ఈసారి అడ్డుతగుల్తున్న ఈ వ్యాసకర్తని కొట్టొచ్చుకూడా  మిత్రన్. 

        ఇలాటి తను సమఉజ్జీ అయిన శత్రువుని ఎలా కోరుకుంటాడు?

        దీంతో అయిపోలేదు- ఇదే సీన్లో ఇంకోటి కూడా వుంది. అభిమన్యు ప్రయోగ శాల ఓపెన్  అవుతుంది. ఇక్కడ ఒక పసిపిల్లాడికి డయాబెటిస్ ఇంజెక్షన్ ఇచ్చి ప్రయోగాలు చేస్తూంటాడు. ఇది కూడా బొమ్మలా నిలబడి చూస్తాడు ఐపీఎస్ ట్రైనీ మిత్రన్!

        నాజీవితంలో ఏం జరుగుతోంది? అశోక్ పాండియన్, ఛార్లెస్ చెల్లదురై, పెరుమాళ్ స్వామి –ఈ ముగ్గుర్లో నాకు సరైన శత్రువు ఒక్కణ్ణి సెలెక్టు చేసుకుందామంటే, అభిమన్యు తెరపైకి వచ్చాడే- అని కోలీగ్ దగ్గర వాపోతాడు మిత్రన్. 

         అసలు ఈ ముగుర్లో ఒక్కణ్ణి సెలెక్టు చేసుకుంటాననే గొడవేంటి? సంఘ శ్రేయస్సు కోసం ముగ్గురి అంతూ చూడాలి. ఇలాకాక తన బలప్రదర్శన కోసమే అన్నట్టు  సమఉజ్జీ ఒక్కడు కావాలంటాడేమిటి? 

        ఇంతకీ విలన్ అభిమన్యు అనుచరుడి గొంతు మీద ఏం చెక్కాడు, ఎందుకు చె క్కాడూ అంటే- అదో గొప్ప మేధావి తనంతో కూడిన మాస్టర్ ప్లాన్!

        ఇది  కూడా ఎంత అర్ధరహితంగా వుంటుందో చూద్దాం. దీని తర్వాత ఒక సభలో ప్రసంగిస్తూంటాడు అభిమన్యూ. షరా మామూలుగా అక్కడి కెళ్ళి అతన్ని చూస్తూంటాడు మిత్రన్. అంటే ఇంకా ఇతనే తన విలన్ అని డిసైడ్  చేసుకోలేదన్న మాట. ఈ సభలో అభిమన్యు నిన్న మధురై  లో జరిగిన కులఘర్షణలని ప్రస్తావించి హిత బోధ చేస్తూంటాడు. మిత్రన్ తన కొలీగ్ తో చెప్తాడు ఆ కులఘర్షణలకి వీడే కారకుడని. వెంటనే నిన్నటి న్యూస్ కటింగ్స్ పడతాయి. అంటే ఇంకో ఎక్స్ పొజిషన్ అన్నమాట! అభిమన్యు అనుచరుడి గొంతు మీద కులం పేరు చెక్కడం వల్ల – మధురైలో కులఘర్షణలు చెలరేగాయనీ, పథకం ప్రకారమే ఇది చేశాడనీ, ఇలా చేయడం ద్వారా ప్రభుత్వ యంత్రాంగం ఘర్షణలు  ఆపడంలో నికి బిజీ  అయిపోయి, చెల్లదురై  మైన్స్ తనిఖీకి వెళ్ళ లేకపోయారనీ, అలా తనిఖీని అడ్డుకున్నాడనీ ఇంకో బారెడు ఎక్స్ పొజిషన్!

        1. కులఘర్షణలు మైన్స్ వున్న మధురైలోనే జరుగుతాయని అభిమన్యు ఎలా ఊహించాడు?
        2. అది శాంతి భద్రతల సమస్య. దాంతో గనుల శాఖాధి కార్లకేం పని -వాళ్ళు కూడా ఘర్షణలని  ఆపడానికి బిజీ అయిపోవడానికి?
        3. గొంతు చెక్కుతూంటే కళ్ళారా  చూసిన మిత్రన్ అప్పుడే అడ్డుకుని వుంటే కుల ఘర్షణనలే జరిగేవి కాదు కదా?
        4. ఇప్పుడేదో ఘనకార్యం చేసినట్టు క్లిప్పింగ్స్ చూపిస్తూ ఇంకో లెక్చర్ ఇస్తాడేమిటి?
        5. ఒకవేళ వుంటే అసలిది బిగినింగ్ విభాగంలో ఉండాల్సిన కథనమా, మిడిల్ లో వుండే కథనమా?
        6. స్ట్రక్చర్ కూడా అవసరం లేదనుకోవడం నేటి ఫటాఫట్ సినిమాల కొత్త రూలా?

                                                ***
         ఇన్ని ఘోరాలు చూశాక హమ్మయ్యా అని ఇప్పుడు తను ఎంపిక చేసుకోవాల్సిన  శత్రువెవరో తెలిసిందనీ, అభిమన్యు జీవితంలో ఆ రానున్న డిసెంబర్ పదిని మర్చిపోలేని రోజుగా చేస్తాననీ  ప్రతిన బూనుతాడు మిత్రన్!

        ఇక్కడ ఒక సందేహం రావచ్చు.  మిత్రన్ కి తన శత్రువెవరో నిర్ణయమై, గోల్ ఏర్పడింది ఇక్కడే గనుక, ఇదే ప్లాట్ పాయింట్ వన్ ఎందుకు కాకూడదూ అని.

        1. ఎప్పుడైనా బిగినింగ్ లో ఒక సెటప్ ఏర్పాటు చేశాక  దాన్ని పే ఆఫ్ చేస్తున్నప్పుడే ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడుతుంది.
        2. ‘శివ’ లో నాగార్జున జేడీ అగడాల్ని చూసీ చూసీ (సెటప్),  ఇక తిరగబడి అతణ్ణి కొట్టేశాక (పే- ఆఫ్) ప్లాట్ పాయింట్ వన్ వచ్చి, గోల్ ఏర్పడుతుంది.
        3. ‘24’ లో గడియారమున్న తెరచుకోని పెట్టెని రకరకాల పనిముట్టుగా అటు విసిరి ఇటు విసరీ వాడుకున్నాక (సెటప్), దాని తాళం చెవి దొరికి తెరవడంతో (పే-ఆఫ్) ప్లాట్ పాయింట్ వన్ వచ్చి,  చిన్న సూర్యకి గోల్ ఏర్పడుతుంది.
        4. ఇలాగే ‘తని ఒరువన్’ లో కూడా రాత్రి పూట నువ్వు ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నావని అప్పుడప్పుడు కొలీగ్స్ అడగడం  (సెటప్),  ఒక తప్పనిసరి పరిస్థితిలో మిత్రన్ వాళ్ళని తన గదికి తీసికెళ్ళి తన రీసెర్చి ప్రపంచాన్ని చూపడం ( పే- ఆఫ్ ) తో అక్కడే ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడిపోయింది. ఇది తెలుసుకోక పోవడంవల్ల గోల్ ఏర్పడక స్ట్రక్చర్ చెదిరిపోయింది.
       
5. సినిమాల్లో ప్లాట్ పాయింట్ వన్ ఎక్కడుందో గుర్తించాలంటే సెటప్ ని ఫాలో అవుతూంటే చాలు, అది పే- ఆఫ్ అయ్యే సీనే ప్లాట్ పాయింట్ వన్ అవుతుంది.

        స్ట్రక్చర్ చెదిరి పోవడం వల్ల, విషయంకన్నా వివరణలు ఇచ్చుకోవడం ఎక్కువై పోవడంవల్లా, ఈ  సినిమా నిడివి రెండు గంటలా 40 నిమిషాలకి చేరింది. ఇంకా మున్ముందు కూడా వివరణలున్నాయి. మొత్తం కలుపుకుని 20 నిమిషాలకి పైగా ఇలా  అసందర్భ, అనవసర  ప్రేలాపనే  వుంది. ఇది తీసేస్తే రెండు గంటలా 20 నిమిషాలకి నిడివి తగ్గుతుంది.

                                                ***
        ఇప్పుడు మిత్రన్ కి అభిమన్యు ముఖాముఖీ అవుతాడు- మిత్రన్ ట్రైనింగ్ పూర్తయి పాసింగ్ అవుట్ పెరేడ్ లో ముఖ్య అతిధిగా అభిమన్యూయే వస్తాడు. అతన్నుంచి మెడల్ అందుకుంటాడు. అభిమన్యు అందించే  ఒక బెరెట్టా పిస్టల్ వున్న బాక్సుని అందుకుంటాడు మిత్రన్. అది సర్వీస్ వెపన్. ఇక్కడే  కథా సౌలభ్యం కోసం ఒక గిమ్మిక్కు చేస్తాడు దర్శకుడు. మిత్రన్ ఈ సీనులో చేతులకి గ్లవ్స్ తొడుక్కుని ఉంటాడు. ఇంకే ట్రైనీ కూడా అలా వుండడు. ఇలా ఎందుకు జరిగిందో ముందు ముందు  రాబోయే సీన్లో మనం తెలుసుకుని తెల్లమొహం వేద్దాం...

        మిత్రన్ ఇక ఏఎస్పీగా జాయినవుతాడు (జిల్లాల్లోలాగా నగరాల్లో ఎస్పీ వ్యవస్థ వుండదు, పోలీస్ కమీషనరేట్ వ్యవస్థ వుంటుంది. ఈ వ్యవస్థలో ఏఎస్పీ పోస్టు వుండదు, ఏసిపి పోస్టు వుంటుంది). ఏఎస్పీగా జాయినవుతూనే పెద్ద చర్య తీసుకుంటాడు( కొత్తగా ఏఎస్పీ అనేది ప్రొబేషనరీ పోస్టు, స్వయంగా చర్యలు తీసుకోలేడు). అదేమిటంటే, అశోక్ పాండియన్, చెల్లదురై, పెరుమాళ్  స్వామిల బ్యాంకు ఖతాల్ని స్థంభింపజేయడం. వీళ్ళు తమ
ఖాతాల్లోంచి
  7.5 బిలియన్ డాలర్లు మలేషియాలో  బ్యాంకు బ్రాంచీ కి ట్రాన్స్ ఫర్ చేయబోతున్నారని అంటాడు. ఆ డబ్బుతో యాంజలీనా కంపెనీని కొనేసి, ఆమె జనెరిక్ మందుల ఒప్పందం ప్రభుత్వంతో కుదుర్చుకోకుండా ఆపబోతున్నారని వివరణ ఇస్తాడుదీనిగురించిన సమాచార సేకరణతో మరి కొన్ని క్లిప్పింగ్స్ హడావిడి చేస్తాయి. మలేషియా బ్యాంకు  అధికారిణి  కూడా మిత్రన్ కి సమాచారం ఇచ్చేసి, మీరు వొత్తిడి చేశారు గనుక చెప్పేశానంటుంది, ఓహ్ గాడ్!!

        ఇక్కడ అస్సలు అర్ధం కానిదేమిటంటే, 7.5 బిలియన్ డాలర్లంటే మామూలు మొత్తం కాదు. అంత భారీ కంటే భారీ మొత్తం వైట్ లో అశోక్ పాండియన్, చెల్లదురై, పేరుమాళ్ స్వామీల ఖాతాల్లో వుండడం అసంభవం. వుంటే వాళ్ళ దగ్గర అంత మొత్తంలో నల్ల ధనమే వుండి, ఏ స్విస్ బ్యాంకు ఖాతల్లోనో వుండాలి!  దర్శకుడు ఎలా తోస్తే అలా కథ రాసేశాడు ఏం చేస్తాం!

        రోహిత్ శెట్టి తీసే భారీ కమర్షియల్ యాక్షన్ సినిమాలు అర్ధంపర్ధం లేకపోయినా, మనం కాసేపు మెదడు ఇంటి దగ్గర వదిలేసి ఎంజాయ్ చేసి రాగలం. అవి ఫుల్ మజా నిస్తాయి. కానీ ఒక ‘తని ఒరువన్’ లాంటి మెథడాలాజికల్ కథ ఇంత తప్పులతడకలా వుంటే ఎలా ఎంజాయ్ చేయగలం.

        ఇక ఎప్పుడెప్పుడా అని అరగంట నుంచీ ఎదురు చూస్తున్న యాక్షన్ రానే వస్తుంది. ఇది కూడా ఎలా వుందో చూద్దాం- 

        ఫారిన్ నుంచి
యాంజలీనా రాగానే ఆమెని మీటవుతాడు మిత్రన్. క్యాన్సర్ మందుల గురించి చర్చించుకుంటారు. స్టోరీ పాయింటు జనెరిక్ మందుల ప్రస్తావనే వుండదు. మిత్రన్ ఇక్కడి పరిస్థితి చెప్తాడు. రేపు ప్రభుత్వంతో మీటింగ్ కి వెళ్తే ప్రమాదమని తనకి డబుల్ గా తన గర్ల్ ఫ్రెండ్ మహిమని ఉపయోగించి తనకి ప్రమాదం లేకుండా  చూస్తాననీ అంటాడు. ఐపీఎస్ తెలివితేటలు ఇంత హీనంగా ఉంటాయా? 

        కారులో  యాంజలీనా బదులు మహిమని ఎక్కించి శత్రువుల్ని ఏమార్చడం మామూలు పరిస్థితుల్లోనైతే ఓకే.  కానీ ఈ కారే  యాంజలీనా వున్న కారనుకుని శత్రువులు ఫాలో మాత్రమే కారు, ఆమె ప్రభుత్వంతో సమావేశ స్థలానికి చేరేలోపే లేపేసే పక్కా ప్లాన్ తో వున్నారు. ఈ సంగతి మిత్రన్ కి తెలుసు. మరి తెలిసికూడా ఆ ఎటాక్ జరిగే పరిస్థితిలోకి మహిమని ఎలా నెడుతున్నాడు? మహిమ చచ్చిపోయినా తన క్కావాల్సింది వేరే కార్లో వేరే రూట్లో యాంజలీనా క్షేమంగా చేరడమా?
 

        అనుకున్నట్టే ఎటాక్ జరుగుతుంది. కారద్దం పగిలి వెంట్రుక వాసిలో మహిమ తల పక్కనుంచి దూసుకుపోతుంది బుల్లెట్. ఆమె పడిపోతుంది. ఫాలో అవుతున్న మిత్రన్ అప్పుడు  ఎలర్ట్ అయి, దుండగుల మీద కాల్పులు జరిపి మహిమని కాపాడుకుంటాడు. ఆమె బుల్లెట్ తగిలి చచ్చిపోయి వుంటే? దీన్నెలా నివారించగలననుకున్నాడు? ఇదేం పోలీస్ సీక్రెట్ ఆపరేషన్? 

                                               
***

         మొత్తం మీద కథ ఇప్పుడు గాడిలో పడినట్టు వుంటుంది. మిడిల్ బిజినెస్ ప్రకారం హీరో విలన్ల మధ్య యాక్షన్ రియాక్షన్ ల సంకులసమరం మొదలై – ఈ గంటా ఐదవ నిమిషం దగ్గర నుంచీ మొదలై, గంటా 50 వ నిమిషం వరకూ ముప్పావు గంట సేపూ ఈ యాక్షన్ ట్రాక్ ఒక్కటే ఈ స్క్రీన్ ప్లేకి బలంగా వుంటుంది. ఫస్టాఫ్ లో 49 వ నిమిషంలో మొదలయ్యే మిడిల్ విభాగం, సెకండాఫ్ లో గంటా 50 వ నిమిషం దగ్గర ముగుస్తుంది. అంటే సుమారు గంట సేపన్న మాట. ఈ గంట సేపట్లో పైన చెప్పుకున్న ముప్పావు గంటే  బలం. మొత్తం రెండు గంటలా 40 నిమిషాల నిడివిలో ముప్పావు గంట సేపే ఈ  స్క్రీన్ ప్లే బలంగా ఉంటుందన్న మాట. లెక్కకైతే  రెండు గంటలా 40 నిమిషాల నిడివిలో 50 శాతం, అంటే గంటా 20 నిమిషాలూ మిడిల్ విభాగం కొనసాగి బలంగా వుండాలి. 49 నిమిషాలు బిగినింగ్ కి పోగా, 60 నిమిషాలూ మిడిల్ కి పోయి, మిగిలిన 51 నిమిషాలూ ఎండ్ విభాగం సాగుతుందన్న మాట! ఇంత బారెడు ఎండ్ విభాగం ఎక్కడా వుండదు. అయితే ఇది కూడా బలహీనమే. ఒక్క మిడిల్లో 45 నిమిషాలే ఈ స్క్రీన్ ప్లే బలంగా వుంటుంది.  ఎందుకని? సౌజన్యం : కొరియన్ మూవీ ‘ఐ సా ది డెవిల్’!

        ‘ఐ సా ది డెవిల్’ ట్రాక్ ఒక్కటే ఆ 45 నిమిషాల బలం. ఇదికూడా లేకుండా ఈ 45  నిమిషాల కథనూ దర్శకుడే స్వయంగా తాయారు చేసుకుని వుంటే ఎలా ఉండేదో, ఇంతవరకూ చేసుకొచ్చిన ఈ పోస్ట్ మార్టమే చెప్తుంది. ఈ కొరియన్ ట్రాక్ తో మిడిల్ ముగియగానే, మళ్ళీ సొంత సృష్టితో దర్శకుడి ఎండ్ విభాగం ఇంకా గందరగోళం! 
                                                  ***
        అభిమన్యు తాను చేయించింది మహిమ మీద ఎటాక్ అని తెలుసుకోవడంతో ఈ సారి మిత్రన్ ని బాగా ఏమార్చి, హోటల్ గదిలోనే అతడి కళ్ళెదుటే యాంజలీనాని చంపిం చేస్తాడు. గాయపడ్డ మిత్రన్ ఆపరేషన్ కోసం హాస్పిటల్లో చేరతాడు. ఇప్పుడే మిత్రన్ ఇన్వాల్వ్ మెంటు గురుంచి తెలుసుకున్న అభిమాన్యు మిత్రన్ గది కెళ్ళి వ్యవహారమంతా చూస్తాడు. అక్కడే గోడకున్న 2011 నాటి మిస్ ఇండియా ఫోటోలో తన గర్ల్ ఫ్రెండ్ మొహం మీద కసితో పిన్ గుచ్చుతాడు. ఈ మిస్ ఇండియా ఫోటో మిత్రన్ ఎందుకు పెట్టుకున్నాడు? అభిమన్యు వస్తాడనీ, వస్తే పిన్ను గుచ్చి పోవాలనా!
         అబిమన్యుకి వొళ్ళు మండిపోయి, ఒక బగ్ ని ఆపరేషన్ చేస్తున్న మిత్రన్ ఛాతీలో అమర్చమని ఇచ్చి వెళ్ళిపోతాడు.. అప్పట్నుంచీ ఆ బగ్ ద్వారా మిత్రన్ ఏమేం చేస్తున్నాడో, చేయబోతున్నాడో అన్నీ తెలుసుకుంటూ ఆ ప్లాన్స్ ని తిప్పి కొడుతూంటాడు.  ఇద్దరి మధ్య ఈ ట్రాక్ ఆసక్తి రేపుతూ సాగుతూంటుంది.
        ఇందులోంచి మళ్ళీ ఇంకో ట్రాక్ మొదలవుతుంది.
అభిమన్యు  కంపెనీలో పనిచేసిన ఒక ఫార్మసిస్టు డయాబెటిస్ కి మందు కనిపెడితే, దాన్ని కొట్టేసి ఆమెని చంపేసిన రహస్యం ఒక  ఎస్డీ కార్డులో బాయ్  ఫ్రెండ్ దగ్గర వుంటుంది. ఇది మిత్రన్ తెలుసుకున్నాడని తెలుసుకున్న అభిమన్యు ఆ ఎస్డీ కార్డు కోసం బాయ్ ఫ్రెండ్ నీ, మిత్ర కొలీగ్ నీ చంపించేస్తాడు. ఎస్డీ కార్డు మాత్రం దొరకదు. 
       
ఈ సంఘటనలతో మిత్రన్ డిస్టర్బ్ అయి తన గదికి వచ్చి చూస్తే, అభిమన్యు వచ్చి వెళ్లినట్టు అనుమానం వేస్తుంది. ఈ క్రమంలోనే దర్శకుడి సొంత క్రియేషన్ మళ్ళీ జొరబడి అభాసు అవుతుంది. అదేమిటంటే, ఫోటో మీద గుచ్చిన పిన్ను మీద వేలి ముద్రలు తీయాలంటుంది మహిమ. సడెన్ గా ఆమె చేతిలో ఫోరెన్సిక్ కిట్ అంతా వుంటుంది- కంప్యూటర్, సాఫ్ట్ వేర్స్ తో సహా. అసలు ఐపీఎస్సే మానుకున్న ఆమె ఫింగర్ ప్రింట్ ఎక్స్ పర్ట్ అవతార మెత్తుతుంది.  ఐపీఎస్ లకి కూడా ఈ శిక్షణ వుండదు. ఫోరెన్సిక్ సైన్సు సపరేట్ కోర్సు, సపరేట్ కాలేజీలూ, సపరేట్ డిగ్రీలూ. ఐపీఎస్ కూడా మానేసి బలాదూరు తిరుగుతున్న మహిమ,  జమాయించి పిన్ను మీద ఇంత పౌడరు కొట్టిపారేసి, సేల్లోఫేన్ టేప్స్ మీద వేలిముద్రలు ట్రేస్ చేసేస్తుంది. 
        మరి ఇవి అభిమన్యు వేలిముద్రలేనని తెలిసేదెట్లా? అప్పుడు మిత్రన్ కి తన సర్వీస్ వెపన్ వున్న బాక్సు గుర్తు కొస్తుంది. ఈ బాక్సు ఆనాడు అభిమన్యు తనకి బహూకరించిందే. అది తెచ్చి, దీని మీద అభిమన్యు వేలిముద్రలుంటాయనీ, ఇది అందుకున్నప్పుడు తాను చేతులకి గ్లవ్స్ తొడుక్కుని వుండడం వల్ల  తన వేలిముద్రలు పడలేదనీ అంటాడు.  

        1. మిత్రన్ గ్లవ్స్ తొడుక్కుని వున్నాడు కాబట్టి బాక్సు మీద తన వేలి ముద్రలు పడవు సరే, ఆ బాక్సుని మిత్రన్ కి అందించమని అభిమాన్యుకి  ఉన్నతాధికారి అందించాడుగా. అప్పుడా ఉన్నతాధికారి వేలిముద్రలు కూడా బాక్సు మీద పడతాయిగా. 
ఈ రెండు రకాల వేలిముద్రల్లో ఏదో ఒక టైపు వేలిముద్రలు పిన్ను మీద పడిన వేలిముద్రలతో సరిపోవాలి. అవే అభిమన్యు వేలిముద్రలని ఎలా చెప్పగలరు? ఉన్నతాధికారి వేలిముద్రలు కూడా అయి ఉండొచ్చుగా? ఉన్నతాధికారి ఇక్కడకొచ్చి పిన్ను ఎందుకు గుచ్చుతాడనా? ఏమో!  సాక్ష్య  నిర్ధారణ డౌట్స్ లేకుండా జరగాలిగా?
        2. ఆ బాక్సు అందుకుంటున్నప్పుడు అసలు మిత్రన్ గ్లవ్స్ తొడుక్కుని ఎందుకున్నాడు? ఫలానా రాబోయే సీన్లో మహిమ వేలిముద్రలు తీస్తున్నప్పుడు ప్రాబ్లం ఉండకుండా అవసరం కాబట్టి, ఇప్పుడు గ్లవ్స్ తొడుక్కోమని దర్శకుడు చెప్పాడా?
        3. ఇంతకాలం ఇంట్లో పెట్టుకున్న ఆ బాక్సుని గ్లవ్స్ తొడుక్కునే హేండిల్ చేస్తున్నాడా?
        4. నడుముకి పెట్టుకుని తిరగాల్సిన అధికారిక సర్వీస్ వెపన్ ని,  పెట్టెలోనే పెట్టేసి ఇంట్లో పెట్టుకున్నాడా ఈ అవసరం కోసం?
        దర్శకుణ్ణి నమ్మి బాగానే దెబ్బ తింటున్నాడు మిత్రన్ విచిత్రంగా.

                                                ***

        క ఉన్న ఉపోద్ఘాతాలు చాలనట్టు, మళ్ళీ అభిమన్యు గర్ల్ ఫ్రెండ్ ఎవరు, అతడికి ఎప్పుడు ఎలా పడిందని ఇంకో పాఠం మన తలకెక్కించుకోక తప్పదు. ఇక అభిమన్యు తన ఫ్లాట్ ని కూడా బగ్గింగ్ చేసి ఉంటాడని మిత్రన్ కి డౌట్ వచ్చి, డిటెక్టర్ తెప్పించి  చెక్ చేసుకోవడం, అభిమన్యు ఏకకాలంలో మహిమనీ, గర్ల్ ఫ్రెండ్ ని చంపే పథకం వేయడం వగైరా ఇంటరెస్టింగ్ బీట్స్ తో సాగి, చివరికి తన ఛాతీ లోనే బగ్ వుందని మిత్రన్ తెలుసుకోవడంతో ఈ మిడిల్ విభాగం ముగుస్తుంది. బగ్ ఎక్కడుందో తెలిసిందంటే, సమస్యకి పరిష్కార మార్గం దొరికినట్టే. సంఘర్షణల పరంపరలో పరిష్కార మార్గం దొరికిందంటే, ప్లాట్ పాయింట్ టూ ఏర్పడి మిడిల్ ముగిసినట్టే. 

        ఈ మిడిల్లో బగ్ ట్రాకు తప్ప మిగిలినదంతా కథకాదు, కథకి కార్యకారణ వివరణే. ఇంతా చేస్తే మిడిల్ జనెరిక్ మందులనే స్టోరీ పాయింటు మీద కూడా సరీగ్గా నడవదు. మధ్యలో డయాబెటిస్ మందు ప్రయోగాలూ, కనుగొన్న ఆ మందుకోసం హత్యా, దానికి సంబంధించి ఎస్డీ కార్డులో సాక్ష్యమూ... ఇలా పక్కదోవ పట్టడం. అసలు విలన్ గోల్ ఏమిటి? జనెరిక్ మందులు రాకుండా చూడ్డమా, లేక డయాబెటిస్ మందు ఫార్ములా కొట్టేయడమా? హీరో గోల్ ఏమిటి? మెడికల్ మాఫియా, రియల్ ఎస్టేట్ మాఫియా, మైన్స్ మాఫియా, జనేరిక్ మందులు, డయాబెటిస్ మందు ఇవన్నీనా? వీటన్నిటితో  స్టోరీ పాయింటు ఒక కలగూర గంపా? ప్రేక్షకులు ఎవరికేది కావాలో అది ఎంపిక చేసుకుని దాని కథ చూడాలా? ఒక కథ ఒక పాయింటు మీద నడిచే కాలం పోయిందా? రేపు హీరోయిన్ ని ప్రేమించిన హీరో, ఎలా పెళ్లి చేసుకుంటాడనే పాయింటు లేవనెత్తి ,దాన్ని వదిలేసి –ఇప్పుడు సెకండ్ హీరోయిన్ని ఎలాప్రేమిస్తాడో చూడమని ఇంకో పాయింటు ఎత్తుకునే సినిమలొస్తాయా?


  (Next : ఎండ్ కి టెండర్ )

 -సికిందర్









15, మే 2016, ఆదివారం

స్క్రీన్ ప్లే సంగతులు -2





 కథాకథనాల గురించి సరదాగా చెప్పుకుందాం. తమిళంలో ప్రేక్షకులు సూపర్ హిట్టని తీర్పు ఇచ్చేశాక వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీయడం బావుండదు. ఇంతకి ముందొకసారి చెప్పుకున్నట్టు- దర్శకులు, రచయితలు, హీరోలు, నిర్మాతలూ తమ కంటే ఎక్కువ ఆలోచనా పరులని నమ్మి, వాళ్ళు ఏది ఎలా చూపిస్తే, అది అలా నిజమనేసి చూసేస్తారు  ప్రేక్షకులు. కాబట్టి ఆ దర్శకుల, రచయితల, హీరోల, నిర్మాతల మనోభావాల్ని కూడా దెబ్బతీయకుండా, ఇంతమంచి హిట్ ఇచ్చినందుకు  అభినందిస్తూ-  డీఫాల్టుగా మనకీ ఎంతో కొంత భావస్వేచ్చ వుండింది గనుక, ఓ సరదా రౌండేసి వచ్చేద్దాం!

Who cares? Movie watching
is a phata - phat affair, yar!

        బిగినింగ్ : ప్రారంభ దృశ్యాలు రొటీన్ ని బ్రేక్ చేస్తాయి. ఈ దృశ్యాల్లో చిన్నప్పుడు పళనిని చూపిస్తూంటే అతనే హీరో అనుకునే అవకాశాలున్నాయి. ఎందుకంటే, ఓపెనింగ్ లో చిన్నప్పటి కథలు హీరోహీరోయిన్లవే అయివుంటూ  వస్తున్నాయి. ఇందుకు భిన్నంగా ఇక్కడ విలన్ చిన్నప్పటి కథతో సినిమా ప్రారంభించారు. నెగెటివ్ గా చూపించిన ఈ పళనియే  పెద్దయ్యాక హీరో పాత్ర మిత్రన్ అనుకుంటాం (తెలుగు రీమేక్ కి ఈ మిస్టేకెన్ ఐడెంటిటీ ఎలిమెంటు ఏమాత్రం పనిచెయ్యదు, ఎందుకంటే అప్పటికే తమిళ ఒరిజినల్ కథ తెలిసిపోయి వుంటుంది). అయితే ఈ ఎలిమెంటుని ఒరిజినల్ దర్శకుడు ఎంతవరకూ సద్వినియోగం చేసుకుని  ప్రేక్షకుల్ని వెర్రెత్తించాడో  మిడిల్ విభాగంలో చూద్దాం.

        ఇదలా వుంచితే, పదిహేనేళ్ళ పళని గురించి... ఇతను టెన్త్ ఫస్ట్ ర్యాంకులో పాసైన తెలివైన విద్యార్ధి. అంత చదువుపట్ల శ్రద్ధ వున్న  విద్యార్థికి క్రిమినల్ ఆలోచనలు చాలానే   వున్నాయిఆ పదిహేనేళ్ళ వయసులోనే హత్య మీదేసుకుని, బాల నేరస్థుల చట్టాల గురించి కూడా మాట్లాడేసి, తండ్రి కోసం ఎమ్మెల్యే టికెట్ కి ఓ పెద్ద నాయకుడికే కండిషన్ పెట్టేసి, ఇంకా ప్రాణంతో వున్న వాణ్ణి  కూడా పూర్తిగా చంపేస్తేనే తన మీద కేసు నిలబడుతుందని తెలిసి...ఇలా ఇలా ఇదంతా  చాలా అతిగా వున్నట్టు లేదూ?
 
        పదిహేనేళ్ళ తర్వాత ఐపీఎస్ ట్రైనీగా మిత్రన్  తెరపైకి వస్తాడు. ఇతను రాత్రి పూట ఏదో కాలేజీ హాస్టల్లోంచి కన్నుగప్పి వెళ్ళినంత సింపుల్ గా, తోటి ట్రైనీస్ తో పోలీస్ అకాడెమీ క్యాంపస్ కెమెరాలని ఏమార్చి, గోడదూకి నగరంలోకి వెళ్లి క్రిమినల్స్ ని పట్టిస్తూంటాడు. పోలీస్ అకాడెమీ రూల్స్ కే ఇది విరుద్ధం. డీ బార్ అయిపోయే నేరం. ఎలాగూ రేపు పోలీస్ అధికారిగా పోస్టింగ్ అయ్యేవాడికి ఇప్పట్నించే ఈ తొందరెందుకో పాత్ర అర్ధంగాదు.
నైట్ క్లబ్ లో అశోక్ పాండియన్ అనే మెడికల్ మాఫియా సమావేశం ఎలా ఉంటుందంటే, క్లబ్ మధ్యలో తన వాళ్ళ మధ్య నిలబడి బాహాటంగా లెక్చర్ ఇస్తూంటాడు తాము చేయాల్సిన కుట్ర గురించి. ఎదురుగానే అంత స్పష్టంగా మిత్రన్ నిలబడి వింటున్నా పట్టించుకోడు!

   ఇక్కడే  స్టోరీ పాయింటు ఎస్టాబ్లిష్ అవుతుంది : జనెరిక్ మందుల కోసం విదేశీ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోబోతోందని, దీన్ని ఆపేందుకు అశోక్ పాండియన్ అండ్ గ్రూపు కుట్ర చేస్తున్నారనీ. కానీ ఈ విషయంగా మిత్రన్ ఏమీ చెయ్యడు. రాత్రి పూట అంత సాహసించి నేరస్థులని పట్టుకునే ఇతను ఈ విషయంలో మాత్రం ఏమీ చెయ్యడు. కానీ మర్నాడు పోలీస్ మీట్ లో కోలీగ్ తో- పదేళ్ళ క్రితం అమెరికన్ని కలిసినప్పుడుప్రైవేట్ ఆస్పత్రుల్లో అంతంత ఖరీదైన సౌకర్యాల గురించి అతను ప్రశ్నించడం గురించి చెప్పిచాలా  ఫీలవుతాడు. దీనికీ నైట్ క్లబ్ లో తాను  తెలుసుకున్న దానికీ సంబంధమేమిటో అర్ధం గాదు. జనెరిక్ మందుల గురించి ఈ మెడికల్ థ్రిల్లర్ అయినప్పుడు, దాంతో సంబంధం లేని ఆస్పత్రుల అక్రమాలతో కన్ఫ్యూజ్ ఎందుకు చేస్తాడో దర్శకుడు అర్ధం గాదు.

        ఇక్కడే మిత్రన్ మరో కోలీగ్, మిత్రన్ తనకి స్ఫూర్తి  అని-  16, 17 ఏళ్లకే నేరాలు  చేస్తున్న వాళ్ళ గురించి
మిత్రన్ చేసిన విశ్లేషణ  గొప్పగా చెప్తాడు. పోలీస్ అకాడెమీలో తమని తీర్చి దిద్దిన అనుభవజ్ఞులైన  ఆఫీసర్లే  స్ఫూర్తి అనకుండా, ట్రైనింగ్ పొందడానికి వచ్చిన ఎవరో తనలాటి కొలీగ్ స్ఫూర్తి అనడం ఇమ్మెచ్యురిటీ. నవ్వుకుంటారు అధికారులు. హీరో పాత్రని ఎలివేట్ చేయడమంటే ఇలా కాదు!

        దీని తర్వాత ఈ బిగినింగ్ విభాగంలో  రోమాంటిక్ ట్రాక్ మొదలవుతుంది. ఫస్టాఫ్ ని నింపడం కోసం తాజాగా ఇప్పుడే  హీరోయిన్ వెంట హీరో పడే  బారెడు రొటీన్ లవ్ ట్రాక్ ని  ప్రారంభించకుండా, హాఫ్ వేలో- ఆల్రెడీ గతంలో లవ్ ట్రాక్ వుందన్న అర్ధం లో హీరోయిన్ మహిమతో సీన్ ఓపెన్ చేశారు. ఇది మంచిదే తలనొప్పి లేకుండా. ఈ సీన్ ఫ్లాష్ బ్యాక్ కి దారి తీస్తుంది. ఇక్కడే ప్రేమ మొదలవుతుంది ట్రైన్లో. కానీ మిత్రన్ ఏదో అద్భుత  కొటేషన్ చెప్పేసి తనని ఆలోచింప జేశాడని మహిమ ఠకీ మని ప్రేమలో పడిపోవడం సగటు మూస ఫార్ములా హీరోయిన్ పాత్రలా అయింది. 

        ఒక ఐపీఎస్ చదువుతున్న అమ్మాయి ఎవరో ముక్కూ మొహం తెలీని వాడి మాటలకి ప్రేమలో పడిపోవడం
...ఈ సినిమా మూసఫార్ములా కాదు, పోలీస్ ప్రోసీజురల్-  సీరియస్ ఇన్వెస్టిగేటివ్ జానర్ కథ అనే ధోరణిలో తనని తాను మేధావిగా భావించుకుని నడిపిస్తున్నాడు దర్శకుడు. పోలీస్ అకాడెమీ సాక్షిగా ట్రైనింగ్ పొందుతున్న ట్రూ ప్రొఫెషనల్స్ గురించిన కథ చెప్తున్నాడు. పానకంలో పుడకలా హీరోయిన్ పాత్ర తయారయ్యింది. ఇక మిత్రన్ రిజెక్ట్ చేసేసరికి హర్ట్ అయి ట్రైనింగే మానేసుకుని ఆమె వెళ్ళిపోవడం బ్యాడ్ ఇంప్రెషన్ ని క్రియేట్ చేస్తుంది.

        దీనితర్వాత మెయిన్ స్టోరీ ముందుకు సాగుతూ  చైన్ స్నాచింగ్ ఘటన వస్తుంది. పడిపోయిన భార్య గొలుసు లాక్కున్నాక, దూరంగా పడిపోయిన భర్తని అంత దారుణంగా ఎందుకు చంపుతున్నారో మనకర్ధంగాని విధంగా చిత్రీకరించాడు దర్శకుడు. దీనర్ధం తర్వాత మిత్రన్ వెల్లడిస్తాడు- పెద్ద నేరాల్ని కప్పి పుచ్చేందుకు ఇలాటి చిన్న నేరాలని!

        ఇక మిత్రన్ ని అపుడప్పుడు రాత్రి పూట ఎక్కడికి వెళ్లి వస్తున్నావని నిలదీస్తూంటారు కొలీగ్స్ . మనకి చూపిస్తున్న దాని ప్రకారమైతే  అందరూ కలిసే వెళ్తున్నారు. వాళ్ళ నుంచి విడిపోయి మిత్రన్ ఎక్కడికో వెళ్తున్నట్టు చూపిస్తే వాళ్ళలా అడగడాన్ని అర్ధం జేసుకోవచ్చు. అలాకాక, మనకు చూపించేదొకటి, వాళ్ళు అడిగేదొకటిగా తయారైతే మనకేం  అర్ధమవుతుంది  ఈ గొడవేంటో. అంటే సస్పెన్స్ తో  నిండుకుండలా ఉండాల్సింది,  మనకి విజువల్ గా చూపించక పోవడంవల్ల- వీళ్ళ  ప్రశ్నలతో వెర్బల్ గా  డొల్లగా మారిందన్న మాట. ఇక్కడి కొచ్చేసి 40  నిమిషాలూ  గడిచిపోతాయి.


     మనం ప్లాట్ పాయింట్ వన్ కోసం ఎదురు చూస్తున్నాం.  40 వ నిమిషంలో మిత్రన్ తన రహస్య గదికి తీసికెళ్ళి చూపిస్తాడు. క్యాంపస్ లో ఉండాల్సిన వాడు ఈ రహస్య గది పెట్టుకుని, రహస్య కార్యకలాపాలు  ఎలా సాగిస్తున్నాడో మనకి తెలీదు. ఆ గదిలో తన రిసెర్చి తాలూకు ఎగ్జిబిషన్ అంతా చూపిస్తూ సుదీర్ఘ లెక్చర్ మొదలెడతాడు. ఇది పూర్తిగా 9 నిమిషాలూ సాగుతుంది! దర్శకుడు కొత్తగా వచ్చిన క్రైం రిపోర్టర్లా తెగ రిపోర్టింగ్ చేస్తాడు..

        మన బ్రెయిన్ లోకి మనం అలసిపోయేలా ఈ అవసరం లేని  రీసర్చి మ్యాటర్ అంతా ఫీడ్ చేస్తూంటాడు. ఒక్కోసారి ఇతను చెప్పేది ఫాలో అవడం కూడా కష్ట మైపోతుంది. ఒక్కోసారి వేదాంతిలా ఫిలాసఫీ చెప్తాడు. ఇంతా చేసి స్టోరీ పాయింటు తో దీనికేం సంబంధం వుండదు.
నీ క్యారక్టర్ తెలియాలంటే నీ మిత్రు లెవరో చెప్తే చాలు, అదే నీ కెపాసిటీ తెలియాలంటే  నీ శత్రువెవరో చెప్తే చాలు- అని చెప్పే తన కొటేషన్ ప్రకారం, తన శత్రు వెవడో చెప్పే పరిస్థితిలో కూడా వుండడు!

 తనకి సరైన శత్రువు ఎవరో వెతికి చెప్తానంటాడు! హౌ సిల్లీ! కథలో ఈ దశలో ఇంకా ఇలాటి మాట! మరి ఈ రీసెర్చి  అంతా ఎవరిని టార్గెట్ చేసి చేస్తున్నట్టు? ఇది కూడా మనకి తెలీదు. జరిగే చిన్న చిన్ననేరాల వెనుక పెద్ద నేరాల్ని  కప్పిపుచ్చే ప్రయత్నం జరుగుతోందని అంటాడు. ఈ ఆ నేరాలన్నీ స్టోరీ పాయింటుతో సంబంధమున్నవా అంటే అది కూడా కాదు. జనెరిక్ మందుల్ని  ఆపే కుట్ర కోసం కాదు. ఏవో రియల్ ఎస్టేట్ గొడవలు. వాటితో స్టోరీ పాయింటు కేం సంబంధం? జరుగుతున్న చిన్న చిన్న నేరాలన్నీ జనెరిక్ మందుల్ని ఆపే మహా కుట్రకి ముసుగులని, ఆ మెడికల్ మాఫియా ఆగడాలు చూపించుకు రావాలి నిజానికి. ఈ కథలో రియల్ ఎస్టేట్, మైన్స్ మాఫియాల గొడవలకి స్థానమే లేదు.

        అలాగే
18 మంది పసి పిల్లలు హాస్పిటల్లో  ఇంక్యుబేటర్లు  షార్ట్ సర్క్యూట్ అయి చనిపోలేదనీ, ఆ పిల్లలు పుట్టుకతోనే  డయాబెటిస్ తో పుట్టడంతో, డయాబెటిస్ మందు తయారీకి వాళ్ళ మీద ప్రయోగాలు జరిపినందుకే చనిపోయారనీ వెల్లడిస్తాడు. కానీ ఈ సంఘటన కథలో మనకి చూపించ లేదు. ఎప్పుడో జరిగిందని దాని గురించి డెమో ఇస్తూ అదర గొట్టేస్తాడు. ఇది కూడా స్టోరీ పాయింటు అయిన జెనెరిక్ మందులకి సంబంధించి కాదు. ఏదో  డయాబెటిస్ మందు కనిపెట్టడం గురించి! ఇది మరో ఏకాగ్రతా - పోనీ ఏక సూత్రతా భంగం. మళ్ళీ  కన్ఫ్యూజన్ గా మెడికల్, రియల్ ఎస్టేట్,  మైన్స్ మాఫియాల ప్రదర్శన ఇస్తూ వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలన్నీ చెప్పుకొస్తాడు. 

        తన పవర్ చూపించాలంటే తను పోలీసు నవ్వాలని అనుకున్నానని అంటూ, దేశాన్ని శాసిస్తున్న బడా బిజినెస్ వ్యక్తులు
15 మందిలో సమఉజ్జీని చూసుకుని  చంపుతాననీ ఊహాజనిత వ్యాఖ్య చేస్తాడు. వాడొక్కడు చస్తే వాడి కింద వంద మంది క్రిమినల్స్ కూడా నశించినట్టే నంటాడు. ఈ ప్లాట్ పాయింట్ వన్ దగ్గర కూడా తన శత్రువెవడో- ఈ కథకి విలన్ ఎవడో చెప్పి తన గోల్ ని ప్రకటించుకోలేని స్థితిలో వుంటాడు! కథేమిటో ఇక్కడ కూడా అంతు పట్టని లెక్చర్ లిస్తాడు. 

        స్టోరీ పాయింటుతో సంబంధం లేని ఈ  తొమ్మిది నిమిషాల సీనులో  సాగేది అంతా నసే. నసతప్ప మరేం కాదు. సూటిగా స్పష్టంగా ఇదిగో ఈ ఫలానా ఈ  అభిమాన్యు  అనే సైంటిస్టు దుర్మార్గుడుగా మారి, జనెరిక్ మందులు రాకుండా  పేదలకి అన్యాయం చేస్తున్నాడు, వీడి మీద చేసిన రీసెర్చే ఇదంతా-  అని అభిమన్యు గురించి మాత్రమే క్షణాల్లో కళ్ళు తిరిగే విజువల్స్ ముగించి- రేపు ప్రభుత్వంతో విదేశీ కంపెనీ ఒప్పందం జరక్కుండా ఎంతకైనా తెగించేలా వున్నాడు- ఇప్పుడు నేనేం చెయ్యాలో  మీరే చెప్పండి- అని కొలీగ్స్ తో సూటిగా స్పష్టంగా,  టు ది పాయింట్ గా విషయం చెప్తే- ఒనగూడే లాభాలు-


1. ఎక్కడ  మనకి తగలాలో సరీగ్గా ఈ ప్లాట్ పాయింట్ వన్ దగ్గర మనం ఎదురు చూస్తున్న విలన్ ఠపీ మని తగిలి, యాక్షన్ సినిమా డైనమిక్స్ కి తనవంతు పూర్తి న్యాయం చేసేవాడు వొళ్ళు దాచుకోకుండా. 

        2. వాణ్ణి చూసి- వార్నీ వీడా! పళని అంటే మిత్రా అనుకున్నామే ఛండాలంగా - అని ఈ టర్నింగ్ కి  మనం ముక్కున  వేలేసుకుని బోలెడు ఆశ్చర్య పోయేవాళ్ళం.

3. హీరో -విలన్ ఎదురెదురు శక్తులతో ప్లాట్ పాయింట్ వన్ యాక్షన్ ఓరియెం టెడ్ గా బలంగా, సూటిగా, స్పష్టంగా  ఎస్టాబ్లిష్ అయ్యేది.

4. ప్లాట్ పాయింట్  వన్ బలహీనంగా వుంటే, క్లయిమాక్స్ కూడా బలహీనంగా ఉంటుందన్న బండ గుర్తు ప్రకారం, క్లయిమాక్స్ లో విలన్ తో బలమైన ముగింపు వచ్చేది.

5. స్టోరీ పాయింటు సూటిగా బాణంలా మనకి తగిలి ఉలిక్కి పడేవాళ్ళం.

6. ప్లాట్ పాయింట్ వన్ సంబంధం లేని విషయాల ఉపన్యాసాలతో వెర్బల్ గా నసగా ఉండక, క్లియర్ కట్ గా యాక్షన్ తో వుండేది. నాటకాల్లో తప్పదు కాబట్టి వెర్బల్ గా వుంటుంది. సినిమా నాటకం కాదు, బుర్ర కథ కూడా కాదు కాబట్టి యాక్షన్ తో వుండాలి.

7. జనెరిక్ మందుల ఒప్పందం ఎక్కడ ఎప్పుడు జరగబోతోంది, అప్పుడు ఎలాటి పరిణామాలు జరగబోతున్నాయన్న ఉత్కంఠ ఏర్పడేది.

8. ఇంత టెన్షన్ పుట్టిస్తున్న విలన్ అభిమాన్యుని ప్రత్యక్షంగా ఎప్పుడప్పుడు చూ స్తామా అని ఉత్సుకత బయల్దేరేది.

వెనకటి కథలో హీరోకి ఈ ఎమోషన్ పుట్టడానికి ఒక కారణం చూపించి, ఈ గోల్ కి సమకట్టడం వల్ల దేన్ని పణంగా పెడుతున్నాడో సూచించి, పరిణామాల హెచ్చరిక కూడా చేసి వుంటే- 41-42 వ నిమిషంలోనే ప్లాట్ పాయింట్ వన్ బ్రహ్మాండంగా విస్ఫోటించేది!

        ఇంతకీ ఈ సీన్ ముగింపు కూడా ఏమిటి? మైన్స్ మాఫియా మైన్స్ తనిఖీ జరక్కుండా మంత్రిని కలవ బోతున్నాడట- వాణ్ణి ఫాలో అయితే మిత్రన్ కి తనేం చేయాలో మార్గం  దొరకచ్చట! ఇదీ ప్లాట్ పాయింట్ వన్ దగ్గర కథేమిటో తెలీక తెలుసుకోవడం కోసం ఇంకా ప్రయత్నిస్తానంటున్న హీరోగారి ప్రొఫెషనలిజం...ఈ కథకి (ఏ కథకి?) మళ్ళీ ఈ మైన్స్ మాఫియా ఎవడు?

దీంతో  అయిపోలేదు- పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో ఉపన్యాస కాండ మిడిల్ విభాగం ప్రారంభం కాగానే మళ్ళీ పుంజుకుంటుంది - పుంజులా కొక్కోరోక్కో అని మనల్ని పిలుస్తూ!


(Next : మిడిల్లో రిడిల్)

-సికిందర్







స్క్రీన్ ప్లే సంగతులు -1






   ఒక దుష్ట సైంటిస్టు పాత్రతో మెడికల్ థ్రిల్లర్ మంచి ప్రయత్నమే. రీమేకులు తీస్తూ వచ్చిన తమిళ దర్శకుడు మోహన్ రాజా, సోదరుడు హీరో జయం రవీలు కలిసి  తని ఒరువన్అనే తమిళ స్ట్రెయిట్ సినిమా రూపొందించారు. దీన్నే తెలుగులో రాం చరణ్ తో దర్శకుడు సురేంద్ర రెడ్డి రీమేక్ చేస్తున్నారు. ఇంతవరకూ తమిళ సినిమాల్ని ఈ బ్లాగులో రివ్యూ చేయలేదు. కొంత మంది కోరిక మీద దీన్ని రివ్యూ చేయాల్సి వచ్చినప్పుడు చూస్తే-  డైనమిక్స్ ప్రధానంగా  పరుగులెత్తాల్సిన  ఈ మెడికల్ థ్రిల్లర్ జానర్ లో,   డాక్యుమెంటరీ ఉపన్యాసాలు  జొరబడి  యాక్షన్ కి తక్కువా లెసన్స్ కి ఎక్కువా అన్నట్టు వుంది. తమిళంలో జయం రవి పెద్ద హీరో  కాకపోవడంతో  ఇది చెల్లి పోయిందేమో గానీరాం చరణ్ లాంటి స్టార్ డమ్ వున్న హీరోతో ఇలాగే తీసి  స్టార్ డమ్ కి ఎలా న్యాయం చేకూరుస్తారో వేచి చూడాల్సిందేస్టార్ డమ్ కి తగిన సబ్జెక్టులా లేదన్పించే హిందీ రిమేక్ కి ముందు ఒప్పుకున్న సల్మాన్ ఖాన్, తర్వాత తిరస్కరించినట్టు ఇటీవల వార్తలొస్తున్నాయి.
Meet  Mr. ‘Forrest  Gump’ Mithran, 
too talkative, less active !

        ‘ని ఒరువన్లో మాస్ ఎలిమెంట్స్ కన్నా సీరియస్ కంటెంటే డామినేట్ చేస్తుందిఉన్న హీరో పోలీస్ అధికారి పాత్ర కూడా హైఫై పాత్రఈ స్క్రీన్ ప్లేకి సెకండాఫ్ లో  హీరో శరీరంలో బగ్ అమర్చి విలన్ ఆడుకునే  గేమ్ వల్ల మాత్రమే కొంత కమర్షియల్ గా బలం వచ్చింది. ఈ ట్రాక్ లేకపోతే ఏమీ లేదు. ఇది కూడా కొరియన్ మూవీ  ఐ సా ది  డెవిల్ లో వుందని విమర్శలు వస్తే తిప్పికొట్టాడు దర్శకుడు. కాకపోతే కొరియన్ మూవీలో విలన్ కే  హీరో ఆ బగ్ ని అమరుస్తాడు.

        సమాజాన్ని పీడించే ఘరానా వ్యక్తి ఒక్కడ్ని నాశనం చేసినా వాడికింద వంద మంది  క్రిమినల్స్ నశిస్తారన్న పాయింటుతో తెరకెక్కిన ఈ కథలో నయనతార హీరోయిన్ గా నటించింది, అరవింద్ గోస్వామి విలన్ గా నటించాడు.

కథ
         బిగినింగ్ : సెంగల్వ  రాయన్ (తంబి రామయ్య) అనే పార్టీ కార్యకర్త, వీరాభిమాని పార్టీ జండా కడుతూ నొప్పులు పడుతున్న భార్యని కూడా పట్టించుకోడు. అప్పుడే అక్కడికొచ్చిన పార్టీ నాయకుడు పూల్మణి  (నాజర్) చివాట్లు పెట్టి ఆమెని తన కార్లో ఆస్పత్రికి పంపిస్తూంటే మధ్యలోనే కాన్పు అవుతుంది. పుట్టిన కొడుక్కి పళని అని పేరు పెడతారు. కాలం పదిహేనేళ్ళు తిరిగిపోతుంది. పళని టెన్త్ లో ఫస్ట్  ర్యాంకులో పాసై, తండ్రి సెంగల్వ రాయన్ తో కలిసి, ఇప్పుడు పార్టీ అధ్యక్షుడుగా ఎదిగిన  పూల్మణి ఆశీస్సుల కోసం వెళ్తాడుపూల్మణి  పార్టీ అసమ్మతి  నాయకుడితో గొడవపడుతూంటాడు. అసమ్మతి నాయకుడు కుల ప్రస్తావన తేవడంతో కోపం పట్టలేక పూల్మణి కొడితే  చచ్చిపోతాడు అసమ్మతి నాయకుడు
.
ఏం చెయ్యాలో అర్ధం గాక, ఈ నేరం సెంగల్వ  రాయన్ మీదేసుకో మంటాడు. 15 ఏళ్ల కుర్రాడు పళని అలా కాదని, ఈ నేరం తన మీదేసుకుంటే,   బాల నేరస్థుడిగా కేసు ఈజీగా వుంటుందని, అయితే బదులుగా తన తండ్రికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలనీ కండిషన్ పెడతాడు. విధిలేక ఒప్పుకుంటాడు పూల్మణి. పళని  జైలుకి పోతాడు.

కాలం ఇంకో పదిహేనేళ్ళు  తిరిగిపోతుంది. ఐపీఎస్ ట్రైనీ మిత్రన్ (జయం రవి) తన తోటి ట్రైనీ లతో కలిసి రాత్రి పూట క్యాంపస్ నుంచి జారుకుని బయట క్రిమినల్స్ ని పట్టిస్తూంటాడు. కిడ్నాప్ అయిన ఒక కుటుంబాన్నికూడా  ఇలాగే రక్షించి క్రిమినల్స్ ని పట్టిస్తాడుఈ నేపధ్యంలో ఇంకో సమాచారం అంది  నైట్ క్లబ్ కి వెళ్తాడు. అక్కడ అశోక్ పాండియన్ (నాగినీడు) అనే అనుమానాస్పద వ్యక్తిని రహస్యంగా గమనిస్తాడు. అశోక్ పాండియన్ అక్కడ తన కోసం ఎదురు చూస్తున్న కొంత మందికి విషయం వెల్లడిస్తాడు. రాష్ట్ర ప్రభుత్వం ఓ విదేశీ కంపెనీ భాగస్వామ్యంతో రాష్ట్రం లోకి జనెరిక్ మందుల్ని ప్రవేశపెట్టేందుకు ఆర్డర్ తీసిందని, ఇది గనుక అమలైతే వేలరూపాయల మందులు పది రూపాయలకే పేదలకి దొరుకుతాయనీ, దీన్నాపాలనీ, అయితే చాలా డబ్బు అవసరపడుతుందనీ, మెడికల్ కాలేజీల ద్వారా, కిడ్నీల వ్యాపారం ద్వారా మీరంతా సంపాదించిన డబ్బు అందించి తోడ్పడితే, ఈ మందులు మార్కెట్ లోకి రాకుండా చూస్తామనీ అంటాడు.
 
పోలీస్ మీట్ లో మిత్రన్ తన  కొలీగ్ కి చెప్తాడు- పదేళ్ళ క్రితం ఒక అమెరికన్ని కలసినప్పుడు, మేం అనారోగ్యం పాలైతే పేరున్న ప్రైవేట్ ఆస్పత్రులకి వెళ్తామని చెప్పినప్పుడు, అతను షాకై ప్రభుత్వాసుపత్రుల్లో వుండే అంతంత ఖరీదైన సౌకర్యాలు ప్రైవేట్ ఆస్పత్రుల కెలా వస్తాయని ప్రశ్నించాడని, అది తనకి చెంప పెట్టులాంటి సమాధానమనీ, చాలా ఆలోచింప జేసిందనీ అంటాడు.

        అదే పోలీస్ మీట్ లో  మిత్రన్ ఇంకో కొలీగ్ బాహాటంగానే తనకి స్ఫూర్తి  మిత్రన్ అనే  చెప్తాడు. క్రిమినల్స్ నేరాలు చేయడానికి ఎక్కువ కాలం ఆగడం లేదనీ -16, 17 ఏళ్లకే నేరాలు చేసేస్తున్నారనీ, వీటిని ఆపడానికి మనమే ఏం చెయ్యలా అని ఆలోచిస్తూ కాలం గడిపేస్తున్నామనీ అంటూ మిత్రన్ చేసిన ఈ  విశ్లేషణ తనకి నచ్చిందనీ అంటాడు. మిత్రన్ కి అధికారుల ప్రశంస లందుతాయి.

        మిత్రన్ తోబాటు కొలీగ్స్ కీ ఒక మెసేజి వస్తుంది- రాత్రి పూట మీరేం చేస్తున్నారో తెలిసిందనీ, వచ్చి కేఫ్ లో  కలుసుకోమనీ. తీరా అక్కడి కెళ్తే మహిమ (నయనతార) వుంటుంది. మళ్ళీ ఎందుకొచ్చావనీ మిత్రన్ అంటాడు ఇష్టం లేదని చెప్పేశాకవీళ్ళిద్దరి మధ్య గతంలో ఏం జరిగిందో ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవుతుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ లో  ట్రైన్లో ప్రయాణిస్తున్న మహిమ- తాను పోలీసునని చెప్పి తాగుబోతుల్ని బెదరగొట్టి పంపేస్తుంది. ఇది చూసిన పిల్లలు ఇలాగే  బెదరగొట్టుకుంటూ తగాదా పడుతూంటే, మిత్రన్ వచ్చి ఆపుతాడు. పిల్లల ముందు మనం జాగ్రత్తగా ప్రవర్తించకపోతే వాళ్ళు  ఇలా  తయారవుతారని మహిమకి నీతి బోధ చేస్తాడు. దాంతో ఆమె ప్రేమలో పడిపోతుంది. తీరా  చూస్తే  తను  పోలీస్ ట్రైనింగ్ వెళ్తున్న ముస్సోరికే అతనూ వస్తాడు. దీంతో ఇంకా బలంగా ప్రేమిస్తుంది. తనకి ఇష్టం లేదంటాడు, ఈ ప్రేమా దోమా కన్నా తన మెదడుని దొలిచేస్తున్న విషయాలు వేరే వున్నాయనీ రిజెక్ట్ చేస్తాడు. ఆమె హర్టయి ట్రైనింగ్ కూడా మానుకుని వెళ్ళిపోతుంది.

        ఇప్పుడిలా ప్రత్యక్షమైంది. ఇంకో రాత్రి మిత్రన్ తన టీముతో  బయటవుండగా ఒక చైన్ స్నాచింగ్ ఘటన జరుగుతుంది. భార్య  బైక్ మీంచి పడిపోతుంది, రామర్ అనే భర్తని చంపేసి పారిపోతారు దుండగులు. వాళ్ళందర్నీ బాస్ పెరుమాళ్ స్వామితో సహా పట్టిస్తారు మిత్రన్  అండ్ టీమ్. ఒక చైన్ కోసం మనిషిని చంపేస్తారా అన్న అపనమ్మకంతో ఉంటాడు మిత్రన్.
 
        మర్నాడే అరెస్టయిన పెరుమాళ్ స్వామి హోం మంత్రితో కలిసి వుండడం చూసి షాక్ అవుతారు మిత్రన్ కొలీగ్స్. ఈ మొత్తం నేపధ్యంలో మిత్రన్ ని అప్పుడప్పడు నిలదీస్తూంటారు కొలీగ్స్- రాత్రి పూట ఒంటరిగా ఎక్కడికి వెళ్లి  వస్తున్నావని. మిత్రన్ చెప్పడు. తన జీవితంలో తెరవని అధ్యాయాలున్నాయని మాత్రం అంటాడు. ఇప్పుడు పెరుమాళ్ వ్యవహారంతో ఇక చెప్పక తప్పదుఒక గదికి తీసికెళ్ళి చూపిస్తాడు. ఎగ్జిబిషన్ లా వుంటుంది. గోడలకి ఫోటోలతో, వివిధ నేరాల పేపర్ కటింగ్స్ తో, డేటాతో, ఇంకేదో సమాచారంతో నిండి వుంటుంది

        నీ క్యారక్టర్ తెలియాలంటే నీ మిత్రు లెవరో చెప్తే చాలు, అదే నీ కెపాసిటీ తెలియాలంటే  నీ శత్రువెవరో చెప్తే చాలుఅని కొటేషన్ ఏదో చెప్పి- వివరిస్తాడు

        జరిగే చిన్న చిన్ననేరాల వెనుక పెద్ద నేరాల్ని  కప్పిపుచ్చే ప్రయత్నం జరుగుతోందని అంటాడు. తమ రిజర్వాయర్ ఆక్రమణకు అడ్డు పడుతున్న సామాజిక కార్యకర్త రామర్ ని చంపేందుకే పైకి కన్పించేలా చైన్ స్నాచింగ్ సంఘటనని సృష్టించారనీ, దీని వెనుక హోంమంత్రితో పాటు, రియల్ ఎస్టేట్ మాఫియా పెరుమాళ్ స్వామి ఉన్నారనీ, వీడొక్కడే కాదు, మొత్తం వీడి అరెస్టయిన 32 మంది గ్యాంగ్ కూడా విడుదలై పోయారనీ వివరిస్తాడు మిత్రన్.

        అంతకి ముందు జరిగిన కిడ్నాప్ కూడా ఇంకో పెద్ద నేరానికి ముసుగు అంటాడు. అలాగే 18  మంది పసి పిల్లలు హాస్పిటల్లో  ఇంక్యుబేటర్లు  షార్ట్ సర్క్యూట్ అయి చనిపోలేదనీ, ఆ పిల్లలు పుట్టుకతోనే  డయాబెటిస్ తో పుట్టడంతో, డయాబెటిస్ మందు తయారీకి వాళ్ళ మీద ప్రయోగాలు జరిపినందుకే చనిపోయారనీ వెల్లడిస్తాడు

        తన పవర్ చూపించాలంటే తను పోలీసు నవ్వాలని అనుకున్నట్టు చెప్తాడు. ప్రజల్ని  రాజకీయ నాయకులు శాసిస్తూంటే, రాజకీయ నాయకుల్ని బడా బిజినెస్ వ్యక్తులు శాసిస్తున్నారంటాడు. వీళ్ళే ప్రజల కోసం ప్రతీదీ నిర్ణయిస్తున్నారని అంటాడు. అలాటి బడా బిజినెస్ వ్యక్తులు 15 మంది ఉన్నారనీవాళ్ళలో తనకి సమ ఉజ్జీ ఎవడో వాణ్ణి చంపుతాననీ, వాడొక్కడు చస్తే వాడి కింద వంద మంది క్రిమినల్స్ కూడా నశించినట్టే నని చెప్పుకొస్తాడు.

        ఐతే మనకి పది రోజుల్లో పోస్టింగ్స్ వున్నాయి కదానని ఆనందం వ్యక్తం చేస్తాడు మిత్రన్ కొలీగ్. మిత్రన్ మరో డెమో వేసి, మైన్స్  మాఫియా చార్లెస్ చెల్లదురై విజువల్స్ చూపిస్తాడు. అలాగే రియల్ ఎస్టేట్ మాఫియా పెరుమాళ్ స్వామి, మెడికల్ మాఫియా అశోక్ పాండియన్ విజువల్స్ కూడా చూపిస్తాడు. రేపు చెల్లదురై మైన్స్ తనిఖీకి  అధికారులు వెళ్తున్నారని, దీన్నాపడానికి మైన్స్ మంత్రిని కలవడానికి అతను వెళ్తున్నాడనీ మిత్రన్ చెప్తాడు. ఆ మైన్స్ మంత్రి సెంగల్వ రాయన్. వీళ్ళ మీటింగ్ తాలూకు డీటెయిల్స్ సంపాదించాక ఎలా ముందు కెళ్ళాలో ఆలోచిస్తానంటాడు.


       మిడిల్ : మర్నాడు చెల్లదురైని వెంబడిస్తే, అతను మంత్రి సెంగల్వ రాయన్ ని కలుస్తాడు. ఇద్దరూ వెళ్లి సిద్ధార్థ్ అభిమన్యు ని కలుస్తారు. మిత్రన్ మొత్తం రహస్యంగా గమనిస్తాడు. సిద్ధార్థ్ అభిమన్యూ ఎంట్రీ తో అతడి చిన్నప్పటి మాంటేజెస్ పడతాయి. చిన్నప్పుడు ఇతనే పళని అనే పదిహేనేళ్ళ కుర్రాడు. జైల్లోంచి విడుదలయ్యాక ఫారిన్ వెళ్లి చదువుకుని సైంటిస్టు అయ్యాడు. పద్మశ్రీ పురస్కారం పొందాడు. ఇప్పుడు తండ్రి, చెల్లదురై వచ్చేసరికి అనన్య అనే గర్ల్ ఫ్రెండ్ తో ఉంటాడు. డిసెంబర్ పదిన స్విస్ ఫార్మా ఓనర్ యాంజలీనా ఇక్కడికి వస్తోందనీ, ఆ రోజు తనకి చాలా ఇంపార్టెంట్ అనీ అంటాడు.

        ఈ సమాచారం తెలుసుకుని మిత్రన్ కొలీగ్స్ తో అభిమన్యుని కనిపెడతాడు. ఒక సీఎం ( ఇప్పుడు పూల్మణి సీఎం గా ఉంటాడు) పాల్గొంటున్న సభలో అభిమన్యు ప్రసంగిస్తూ, నిన్న మధురైలో జరిగిన కుల ఘర్షణలని ప్రస్తావించి- నిరసిస్తాడు. ఇది విని మిత్రన్ కొలీగ్స్ కి వివరిస్తాడు పేపర్ కటింగ్స్ తో. అభిమన్యు తన అనుచరుడి గొంతు మీద గాయం చేసి వాడి కులం పేరు రాసి మధురైలో ఘర్షణలు సృష్టించాడనీ, దీంతో యంత్రాంగం వీటి మీద దృష్టి పెట్టడంతో , నిన్న చెల్లదురై  మైన్స్ తనిఖీకి వెళ్ళలేక పోయారనీ వివరిస్తాడు. తనిఖీని ఆపడానికే ఆ ఘర్షణలని చెప్తాడు.

        ఇప్పుడు తను ఎంపిక చేసుకోవాల్సిన  శత్రువెవరో తెలిసిందనీ, అభిమన్యు జీవితంలో డిసెంబర్ పది ని మర్చిపోలేని రోజుగా చేస్తాననీ  అంటాడు మిత్రన్. ఇక ట్రైనింగ్ పూర్తయి పాసింగ్ అవుట్ పెరేడ్ లో ముఖ్య అతిధిగా అభిమన్యూయే వస్తాడు. మిత్రన్ కి మెడల్ అందిస్తాడు. మిత్రన్ కి ఒక బెరెట్టా పిస్టల్ వున్న బాక్సుని బహూకరిస్తాడు అభిమన్యు. మిత్రన్ ఏఎస్పీ గా జాయిన్ అవుతాడు. జాయిన్ అయిన వెంటనే అశోక్ పాండియన్, చెల్లదురై, పెరుమాళ్  స్వామిల బ్యాంకు ఖతాల్ని స్తంభింప జేస్తాడు. వీళ్ళు తమ ఖాతాల్లోంచి  7.5 బిలియన్ డాలర్లు మలేషియాలో  బ్యాంకు బ్రాంచీ కి ట్రాన్స్ ఫర్ చేయబోతున్నారని అంటాడు. ఆ డబ్బుతో యాంజలీనా కంపెనీని కొనేసి, ఆమె జనెరిక్ మందుల ఒప్పందం ప్రభుత్వంతో కుదుర్చుకోకుండా ఆపబోతున్నారని వివరణ ఇస్తాడు

        యాంజలీనా రాగానే ఆమెని మీటవుతాడు
. క్యాన్సర్ మందుల గురించి చర్చించుకుంటారు. మిత్రన్ పరిస్థితి చెప్తాడు. రేపు ప్రభుత్వంతో మీటింగ్ కి వెళ్తే ప్రమాదమని,  తనకి డబుల్ గా మహిమని ఉపయోగించి తనకి ప్రమాదం లేకుండా  చూస్తాననీ అంటాడు.

        కారులో వెళ్తున్న మహిమని యాంజలీనా అనుకుని ఎటాక్ చేస్తారు అభిమన్యు ఆదేశాలందుకున్న గ్యాంగ్. కొద్దిలో తప్పించుకుంటుంది మహిమ. మిత్రన్ వాళ్ళ మీద తిరిగి ఎటాక్ చేసి మహిమని కాపాడుకుంటాడు. ప్రభుత్వంతో యాంజలీనా మీటింగ్ సక్సెస్ అయి అభిమన్యు షాక్ తింటాడు. అదే సమయంలో బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ అయ్యాయని తెలుసుకుని నీరుగారి పోతాడు. మిత్రన్  అనే ఒక కొత్తగా  వచ్చిన ఏఎస్పీ తనకి  శత్రువుగా మారాడని తెలుసుకుంటాడు. పెరుమాళ్ స్వామి తమ్ముడు విక్కీతో హోటల్ రూమ్ లో  యాంజలీనాని చంపించేస్తాడు. అక్కడే వున్న మిత్రన్ తీవ్రంగా గాయపడతాడు

        అభిమన్యు  మిత్రన్ గదికి వెళ్లి గోడలకి తన గురించి అంటించిన మ్యాటర్ అంతా గమనిస్తాడు.  హాస్పిటల్ కి వచ్చి ఒక ఎలక్ట్రానిక్ బగ్ (జిపిఎస్ + ఆడియో ట్రాన్స్ మిటర్) ఇచ్చి మిత్రన్ శరీరం లో అమర్చమని  చెప్పి వెళ్లిపోతాడు. ఆ బగ్  ద్వారా  మిత్రన్ మాటలు,  ప్లాన్స్ అన్నీ వినేస్తూంటాడు. కోలుకున్న మిత్రన్ కి అభిమన్యు గురించి ఇంకో రహస్యం తెలుస్తుంది. అభిమన్యు  కంపెనీలో పనిచేసిన ఒక ఫార్మసిస్టు డయాబెటిస్ కి మందు కనిపెడితే, దాన్ని కొట్టేసి ఆమెని చంపేసిన రహస్యం ఒక  ఎస్డీ కార్డులో బాయ్  ఫ్రెండ్ దగ్గర వుంటుంది. ఇది మిత్రన్ తెలుసుకున్నాడని తెలుసుకున్న అభిమన్యు ఆ ఎస్డీ కార్డు కోసం బాయ్ ఫ్రెండ్ నీ, మిత్ర కొలీగ్ నీ చంపించేస్తాడు. ఎస్డీ కార్డు మాత్రం దొరకదు. 

        ఈ సంఘటనలతో డిస్టర్బ్ అయిన మిత్రన్ తన గదికి వచ్చి చూస్తే, అభిమన్యు వచ్చి వెళ్ళాడని తెలుస్తుంది. గదిలో
2011 నాటి మిస్ ఇండియాకి  కి సంబంధించిన ఒక ఫోటోమీద ఒక అనన్య అనే మోడల్ కి పిన్ గుచ్చి వుండడం గమనిస్తాడు. వెంటనే ఆ పిన్ మీద వేలిముద్రలు సేకరిస్తుంది మహిమ. ఆ వేలిముద్రలు మిత్రకి అభిమన్యు బహూకరించిన పిస్టల్ బాక్సు మీద అభిమన్యు వేలిముద్రలతో సరిపోతాయి. ఈ విషయం అటు అభిమాన్యుకీ  తెలిసిపోయి, తన గర్ల్ ఫ్రెండ్ అనన్య జ్ఞాపకం వస్తుంది. ఆ మిస్ ఇండియా పోటీల్లో పాల్గొంటున్న ఆమె  మీద కన్నేసి- ఆమె కోసం ఆమె తండ్రిని చంపి, ఆ పోటీల్లో పాల్గొనలేక విధిలేక ఆమె తన చార్టెడ్ ఫ్లైట్ లో స్వస్థలానికి ప్రయాణించేలా చేస్తాడు. అప్పట్నించీ ఆమె అతడికి దగ్గరై సహజీవనం చేస్తోంది. 

        అభిమన్యు తన ఫ్లాట్ ని కూడా బగ్గింగ్ చేసి ఉంటాడని మిత్రన్ కి డౌట్ వచ్చి, డిటెక్టర్ తెప్పించి  చెక్ చేస్తూంటే అది అదేపనిగా ఎలర్ట్స్ ఇస్తూంటుంది.  కానీ ఎక్కడా బగ్స్ దొరకవు, బగ్ తన ఛాతీ లోపలే అమర్చి వుందని అతడికి తెలీదు. మహిమ వాదన పెట్టుకుంటుంది. అభిమన్యుని చంపి ఏం సాధిస్తావని. అతను నీకంటే పవర్ఫుల్ అనీ, అతడికి ఈ పగే కావాలో,  తన ప్రేమే కావాలో తేల్చుకొమ్మని చెప్పేస్తుంది. బగ్ ద్వారా ఇదంతా విన్న అభిమన్యు,  మహిమ కోసం జీవితాంతం మిత్రన్ ఏడ్వాలని ఆమెని చంపేసేందుకు ప్లానేస్తాడు. దీన్ని విఫలం చేస్తాడు మిత్రన్. అప్పుడు ఒక సందర్భంలో బగ్ తన ఛాతీ లోనే వుందని తెలుస్తుంది మిత్రన్ కి.


       ఎండ్ : మిత్రన్ కి తన కొలీగ్ ని ఎటాక్ చేసిన చోట ఎస్డీ కార్డు కూడా  దొరుకుతుంది. అటు అనన్య కి అభిమన్యు ఆమె కోసం ఆమె తండ్రిని చంపిన దుర్మార్గం గురించి చెప్పేస్తుంది మహిమ.   ఒక సభలో మంత్రి సెంగల్వ రాయన్ ముఖ్యమంత్రి పూల్మణి సమక్షంలో ఓ నోట్ చదివేస్తాడు. అది తన కొడుకు అభిమన్యు రాసిచ్చిందనుకుని తెగ చదివేస్తూంటాడు. నిజానికి అది మిత్రన్ మార్చేసిన నోట్. అందులో జెనెరిక్ మందులు రాకుండా చేసిన కుట్ర వివరాలన్నీ వుంటాయి. దాన్నలాగే చదివేసి కలకలం సృష్టిస్తాడు. తండ్రి చేసిన ఈ వెధవపనికి అతణ్ణి చంపించేస్తాడు అభిమన్యు. ఆ నేరం ముఖ్యమంత్రి  పూల్మణి మీదేసి బ్లాక్ మెయిల్ చేస్తాడు. సెంగల్వ రాయన్ కి అధికారిక  లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు,  అభిమన్యు పుచ్చుకున్న చితాభస్మం అతడి తండ్రిది కాదనీ, అతను చంపిన తన కొలీగ్ దనీ మిత్రన్ చెప్తాడు. అభిమన్యు తండ్రి బతికే వున్నాడనీ వెల్లడిస్తాడు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఎస్డీ కార్డు ఆధారంగా అభిమన్యు ని అరెస్ట్ చేస్తాడు. 

        కోర్టులో తన నేరాలేవీ ఒప్పుకోని అభిమన్యుకి ఇంకో రోజు గడువిస్తుంది కోర్టు.
మిత్రన్ అతణ్ణి కస్టడీలోకి తీసుకుంటాడు. ఫార్మాసిస్టుని చంపి  కొట్టేసిన మందు ఫార్ములా ఆమె పేర పేటెంట్ అయి ఉందనీ, అది జనెరిక్ మందుగానే ఉత్పత్తి అవుతుందనీ, కాబట్టి అభిమన్యు దాంతో ఏమీ చేయలేడనీ చెప్తాడు మిత్రన్. తిరిగి రేపు అభిమన్యు ని కోర్టుకి తీసుకుపోతున్నప్పుడు, ఎన్ కౌంటర్  చేస్తామని సిద్ధమవుతారు మిత్రన్ కోలీగ్స్. ఈ విషయం అభిమాన్యుకి చెప్పి, అతను బతకాలంటే  నేరాలన్నీ చెప్పేయాలంటాడు, అప్పుడు ఒక బులెట్ ప్రూఫ్ జాకెట్ ఇస్తానంటాడు. అది తొడుక్కుని తన కొలీగ్స్ షూట్ చేస్తే, చావు నటించాలంటాడు. 

        అభిమన్యుని మిత్రన్ కోర్టుకి తీసుకుపోతున్నప్పడు, అతను బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించలేదని గమనిస్తాడు మిత్రన్. అదే క్షణంలో మిత్రన్ కొలీగ్ షూట్ చేస్తాడు. మిత్రన్ అభిమన్యుని పక్కకి తప్పిస్తాడు. అంతలో అభిమన్యు గర్ల్ ఫ్రెండ్ అనన్య అతణ్ణి కాల్చేసి తన తండ్రి హత్యకి పగ దీర్చుకుంటుంది. చచ్చిపోతూ- తన నేరాలన్నీ ఎస్డీ కారులో రికార్డ్ చేసి బులెట్ ప్రూఫ్ జాకెట్ లో పెట్టానని చెప్తాడు అభిమన్యు. దీంతో కథ ముగుస్తుంది.


(Next : పోస్ట్ మార్టం)

-సికిందర్