రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

15, మే 2016, ఆదివారం

స్క్రీన్ ప్లే సంగతులు -1






   ఒక దుష్ట సైంటిస్టు పాత్రతో మెడికల్ థ్రిల్లర్ మంచి ప్రయత్నమే. రీమేకులు తీస్తూ వచ్చిన తమిళ దర్శకుడు మోహన్ రాజా, సోదరుడు హీరో జయం రవీలు కలిసి  తని ఒరువన్అనే తమిళ స్ట్రెయిట్ సినిమా రూపొందించారు. దీన్నే తెలుగులో రాం చరణ్ తో దర్శకుడు సురేంద్ర రెడ్డి రీమేక్ చేస్తున్నారు. ఇంతవరకూ తమిళ సినిమాల్ని ఈ బ్లాగులో రివ్యూ చేయలేదు. కొంత మంది కోరిక మీద దీన్ని రివ్యూ చేయాల్సి వచ్చినప్పుడు చూస్తే-  డైనమిక్స్ ప్రధానంగా  పరుగులెత్తాల్సిన  ఈ మెడికల్ థ్రిల్లర్ జానర్ లో,   డాక్యుమెంటరీ ఉపన్యాసాలు  జొరబడి  యాక్షన్ కి తక్కువా లెసన్స్ కి ఎక్కువా అన్నట్టు వుంది. తమిళంలో జయం రవి పెద్ద హీరో  కాకపోవడంతో  ఇది చెల్లి పోయిందేమో గానీరాం చరణ్ లాంటి స్టార్ డమ్ వున్న హీరోతో ఇలాగే తీసి  స్టార్ డమ్ కి ఎలా న్యాయం చేకూరుస్తారో వేచి చూడాల్సిందేస్టార్ డమ్ కి తగిన సబ్జెక్టులా లేదన్పించే హిందీ రిమేక్ కి ముందు ఒప్పుకున్న సల్మాన్ ఖాన్, తర్వాత తిరస్కరించినట్టు ఇటీవల వార్తలొస్తున్నాయి.
Meet  Mr. ‘Forrest  Gump’ Mithran, 
too talkative, less active !

        ‘ని ఒరువన్లో మాస్ ఎలిమెంట్స్ కన్నా సీరియస్ కంటెంటే డామినేట్ చేస్తుందిఉన్న హీరో పోలీస్ అధికారి పాత్ర కూడా హైఫై పాత్రఈ స్క్రీన్ ప్లేకి సెకండాఫ్ లో  హీరో శరీరంలో బగ్ అమర్చి విలన్ ఆడుకునే  గేమ్ వల్ల మాత్రమే కొంత కమర్షియల్ గా బలం వచ్చింది. ఈ ట్రాక్ లేకపోతే ఏమీ లేదు. ఇది కూడా కొరియన్ మూవీ  ఐ సా ది  డెవిల్ లో వుందని విమర్శలు వస్తే తిప్పికొట్టాడు దర్శకుడు. కాకపోతే కొరియన్ మూవీలో విలన్ కే  హీరో ఆ బగ్ ని అమరుస్తాడు.

        సమాజాన్ని పీడించే ఘరానా వ్యక్తి ఒక్కడ్ని నాశనం చేసినా వాడికింద వంద మంది  క్రిమినల్స్ నశిస్తారన్న పాయింటుతో తెరకెక్కిన ఈ కథలో నయనతార హీరోయిన్ గా నటించింది, అరవింద్ గోస్వామి విలన్ గా నటించాడు.

కథ
         బిగినింగ్ : సెంగల్వ  రాయన్ (తంబి రామయ్య) అనే పార్టీ కార్యకర్త, వీరాభిమాని పార్టీ జండా కడుతూ నొప్పులు పడుతున్న భార్యని కూడా పట్టించుకోడు. అప్పుడే అక్కడికొచ్చిన పార్టీ నాయకుడు పూల్మణి  (నాజర్) చివాట్లు పెట్టి ఆమెని తన కార్లో ఆస్పత్రికి పంపిస్తూంటే మధ్యలోనే కాన్పు అవుతుంది. పుట్టిన కొడుక్కి పళని అని పేరు పెడతారు. కాలం పదిహేనేళ్ళు తిరిగిపోతుంది. పళని టెన్త్ లో ఫస్ట్  ర్యాంకులో పాసై, తండ్రి సెంగల్వ రాయన్ తో కలిసి, ఇప్పుడు పార్టీ అధ్యక్షుడుగా ఎదిగిన  పూల్మణి ఆశీస్సుల కోసం వెళ్తాడుపూల్మణి  పార్టీ అసమ్మతి  నాయకుడితో గొడవపడుతూంటాడు. అసమ్మతి నాయకుడు కుల ప్రస్తావన తేవడంతో కోపం పట్టలేక పూల్మణి కొడితే  చచ్చిపోతాడు అసమ్మతి నాయకుడు
.
ఏం చెయ్యాలో అర్ధం గాక, ఈ నేరం సెంగల్వ  రాయన్ మీదేసుకో మంటాడు. 15 ఏళ్ల కుర్రాడు పళని అలా కాదని, ఈ నేరం తన మీదేసుకుంటే,   బాల నేరస్థుడిగా కేసు ఈజీగా వుంటుందని, అయితే బదులుగా తన తండ్రికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలనీ కండిషన్ పెడతాడు. విధిలేక ఒప్పుకుంటాడు పూల్మణి. పళని  జైలుకి పోతాడు.

కాలం ఇంకో పదిహేనేళ్ళు  తిరిగిపోతుంది. ఐపీఎస్ ట్రైనీ మిత్రన్ (జయం రవి) తన తోటి ట్రైనీ లతో కలిసి రాత్రి పూట క్యాంపస్ నుంచి జారుకుని బయట క్రిమినల్స్ ని పట్టిస్తూంటాడు. కిడ్నాప్ అయిన ఒక కుటుంబాన్నికూడా  ఇలాగే రక్షించి క్రిమినల్స్ ని పట్టిస్తాడుఈ నేపధ్యంలో ఇంకో సమాచారం అంది  నైట్ క్లబ్ కి వెళ్తాడు. అక్కడ అశోక్ పాండియన్ (నాగినీడు) అనే అనుమానాస్పద వ్యక్తిని రహస్యంగా గమనిస్తాడు. అశోక్ పాండియన్ అక్కడ తన కోసం ఎదురు చూస్తున్న కొంత మందికి విషయం వెల్లడిస్తాడు. రాష్ట్ర ప్రభుత్వం ఓ విదేశీ కంపెనీ భాగస్వామ్యంతో రాష్ట్రం లోకి జనెరిక్ మందుల్ని ప్రవేశపెట్టేందుకు ఆర్డర్ తీసిందని, ఇది గనుక అమలైతే వేలరూపాయల మందులు పది రూపాయలకే పేదలకి దొరుకుతాయనీ, దీన్నాపాలనీ, అయితే చాలా డబ్బు అవసరపడుతుందనీ, మెడికల్ కాలేజీల ద్వారా, కిడ్నీల వ్యాపారం ద్వారా మీరంతా సంపాదించిన డబ్బు అందించి తోడ్పడితే, ఈ మందులు మార్కెట్ లోకి రాకుండా చూస్తామనీ అంటాడు.
 
పోలీస్ మీట్ లో మిత్రన్ తన  కొలీగ్ కి చెప్తాడు- పదేళ్ళ క్రితం ఒక అమెరికన్ని కలసినప్పుడు, మేం అనారోగ్యం పాలైతే పేరున్న ప్రైవేట్ ఆస్పత్రులకి వెళ్తామని చెప్పినప్పుడు, అతను షాకై ప్రభుత్వాసుపత్రుల్లో వుండే అంతంత ఖరీదైన సౌకర్యాలు ప్రైవేట్ ఆస్పత్రుల కెలా వస్తాయని ప్రశ్నించాడని, అది తనకి చెంప పెట్టులాంటి సమాధానమనీ, చాలా ఆలోచింప జేసిందనీ అంటాడు.

        అదే పోలీస్ మీట్ లో  మిత్రన్ ఇంకో కొలీగ్ బాహాటంగానే తనకి స్ఫూర్తి  మిత్రన్ అనే  చెప్తాడు. క్రిమినల్స్ నేరాలు చేయడానికి ఎక్కువ కాలం ఆగడం లేదనీ -16, 17 ఏళ్లకే నేరాలు చేసేస్తున్నారనీ, వీటిని ఆపడానికి మనమే ఏం చెయ్యలా అని ఆలోచిస్తూ కాలం గడిపేస్తున్నామనీ అంటూ మిత్రన్ చేసిన ఈ  విశ్లేషణ తనకి నచ్చిందనీ అంటాడు. మిత్రన్ కి అధికారుల ప్రశంస లందుతాయి.

        మిత్రన్ తోబాటు కొలీగ్స్ కీ ఒక మెసేజి వస్తుంది- రాత్రి పూట మీరేం చేస్తున్నారో తెలిసిందనీ, వచ్చి కేఫ్ లో  కలుసుకోమనీ. తీరా అక్కడి కెళ్తే మహిమ (నయనతార) వుంటుంది. మళ్ళీ ఎందుకొచ్చావనీ మిత్రన్ అంటాడు ఇష్టం లేదని చెప్పేశాకవీళ్ళిద్దరి మధ్య గతంలో ఏం జరిగిందో ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవుతుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ లో  ట్రైన్లో ప్రయాణిస్తున్న మహిమ- తాను పోలీసునని చెప్పి తాగుబోతుల్ని బెదరగొట్టి పంపేస్తుంది. ఇది చూసిన పిల్లలు ఇలాగే  బెదరగొట్టుకుంటూ తగాదా పడుతూంటే, మిత్రన్ వచ్చి ఆపుతాడు. పిల్లల ముందు మనం జాగ్రత్తగా ప్రవర్తించకపోతే వాళ్ళు  ఇలా  తయారవుతారని మహిమకి నీతి బోధ చేస్తాడు. దాంతో ఆమె ప్రేమలో పడిపోతుంది. తీరా  చూస్తే  తను  పోలీస్ ట్రైనింగ్ వెళ్తున్న ముస్సోరికే అతనూ వస్తాడు. దీంతో ఇంకా బలంగా ప్రేమిస్తుంది. తనకి ఇష్టం లేదంటాడు, ఈ ప్రేమా దోమా కన్నా తన మెదడుని దొలిచేస్తున్న విషయాలు వేరే వున్నాయనీ రిజెక్ట్ చేస్తాడు. ఆమె హర్టయి ట్రైనింగ్ కూడా మానుకుని వెళ్ళిపోతుంది.

        ఇప్పుడిలా ప్రత్యక్షమైంది. ఇంకో రాత్రి మిత్రన్ తన టీముతో  బయటవుండగా ఒక చైన్ స్నాచింగ్ ఘటన జరుగుతుంది. భార్య  బైక్ మీంచి పడిపోతుంది, రామర్ అనే భర్తని చంపేసి పారిపోతారు దుండగులు. వాళ్ళందర్నీ బాస్ పెరుమాళ్ స్వామితో సహా పట్టిస్తారు మిత్రన్  అండ్ టీమ్. ఒక చైన్ కోసం మనిషిని చంపేస్తారా అన్న అపనమ్మకంతో ఉంటాడు మిత్రన్.
 
        మర్నాడే అరెస్టయిన పెరుమాళ్ స్వామి హోం మంత్రితో కలిసి వుండడం చూసి షాక్ అవుతారు మిత్రన్ కొలీగ్స్. ఈ మొత్తం నేపధ్యంలో మిత్రన్ ని అప్పుడప్పడు నిలదీస్తూంటారు కొలీగ్స్- రాత్రి పూట ఒంటరిగా ఎక్కడికి వెళ్లి  వస్తున్నావని. మిత్రన్ చెప్పడు. తన జీవితంలో తెరవని అధ్యాయాలున్నాయని మాత్రం అంటాడు. ఇప్పుడు పెరుమాళ్ వ్యవహారంతో ఇక చెప్పక తప్పదుఒక గదికి తీసికెళ్ళి చూపిస్తాడు. ఎగ్జిబిషన్ లా వుంటుంది. గోడలకి ఫోటోలతో, వివిధ నేరాల పేపర్ కటింగ్స్ తో, డేటాతో, ఇంకేదో సమాచారంతో నిండి వుంటుంది

        నీ క్యారక్టర్ తెలియాలంటే నీ మిత్రు లెవరో చెప్తే చాలు, అదే నీ కెపాసిటీ తెలియాలంటే  నీ శత్రువెవరో చెప్తే చాలుఅని కొటేషన్ ఏదో చెప్పి- వివరిస్తాడు

        జరిగే చిన్న చిన్ననేరాల వెనుక పెద్ద నేరాల్ని  కప్పిపుచ్చే ప్రయత్నం జరుగుతోందని అంటాడు. తమ రిజర్వాయర్ ఆక్రమణకు అడ్డు పడుతున్న సామాజిక కార్యకర్త రామర్ ని చంపేందుకే పైకి కన్పించేలా చైన్ స్నాచింగ్ సంఘటనని సృష్టించారనీ, దీని వెనుక హోంమంత్రితో పాటు, రియల్ ఎస్టేట్ మాఫియా పెరుమాళ్ స్వామి ఉన్నారనీ, వీడొక్కడే కాదు, మొత్తం వీడి అరెస్టయిన 32 మంది గ్యాంగ్ కూడా విడుదలై పోయారనీ వివరిస్తాడు మిత్రన్.

        అంతకి ముందు జరిగిన కిడ్నాప్ కూడా ఇంకో పెద్ద నేరానికి ముసుగు అంటాడు. అలాగే 18  మంది పసి పిల్లలు హాస్పిటల్లో  ఇంక్యుబేటర్లు  షార్ట్ సర్క్యూట్ అయి చనిపోలేదనీ, ఆ పిల్లలు పుట్టుకతోనే  డయాబెటిస్ తో పుట్టడంతో, డయాబెటిస్ మందు తయారీకి వాళ్ళ మీద ప్రయోగాలు జరిపినందుకే చనిపోయారనీ వెల్లడిస్తాడు

        తన పవర్ చూపించాలంటే తను పోలీసు నవ్వాలని అనుకున్నట్టు చెప్తాడు. ప్రజల్ని  రాజకీయ నాయకులు శాసిస్తూంటే, రాజకీయ నాయకుల్ని బడా బిజినెస్ వ్యక్తులు శాసిస్తున్నారంటాడు. వీళ్ళే ప్రజల కోసం ప్రతీదీ నిర్ణయిస్తున్నారని అంటాడు. అలాటి బడా బిజినెస్ వ్యక్తులు 15 మంది ఉన్నారనీవాళ్ళలో తనకి సమ ఉజ్జీ ఎవడో వాణ్ణి చంపుతాననీ, వాడొక్కడు చస్తే వాడి కింద వంద మంది క్రిమినల్స్ కూడా నశించినట్టే నని చెప్పుకొస్తాడు.

        ఐతే మనకి పది రోజుల్లో పోస్టింగ్స్ వున్నాయి కదానని ఆనందం వ్యక్తం చేస్తాడు మిత్రన్ కొలీగ్. మిత్రన్ మరో డెమో వేసి, మైన్స్  మాఫియా చార్లెస్ చెల్లదురై విజువల్స్ చూపిస్తాడు. అలాగే రియల్ ఎస్టేట్ మాఫియా పెరుమాళ్ స్వామి, మెడికల్ మాఫియా అశోక్ పాండియన్ విజువల్స్ కూడా చూపిస్తాడు. రేపు చెల్లదురై మైన్స్ తనిఖీకి  అధికారులు వెళ్తున్నారని, దీన్నాపడానికి మైన్స్ మంత్రిని కలవడానికి అతను వెళ్తున్నాడనీ మిత్రన్ చెప్తాడు. ఆ మైన్స్ మంత్రి సెంగల్వ రాయన్. వీళ్ళ మీటింగ్ తాలూకు డీటెయిల్స్ సంపాదించాక ఎలా ముందు కెళ్ళాలో ఆలోచిస్తానంటాడు.


       మిడిల్ : మర్నాడు చెల్లదురైని వెంబడిస్తే, అతను మంత్రి సెంగల్వ రాయన్ ని కలుస్తాడు. ఇద్దరూ వెళ్లి సిద్ధార్థ్ అభిమన్యు ని కలుస్తారు. మిత్రన్ మొత్తం రహస్యంగా గమనిస్తాడు. సిద్ధార్థ్ అభిమన్యూ ఎంట్రీ తో అతడి చిన్నప్పటి మాంటేజెస్ పడతాయి. చిన్నప్పుడు ఇతనే పళని అనే పదిహేనేళ్ళ కుర్రాడు. జైల్లోంచి విడుదలయ్యాక ఫారిన్ వెళ్లి చదువుకుని సైంటిస్టు అయ్యాడు. పద్మశ్రీ పురస్కారం పొందాడు. ఇప్పుడు తండ్రి, చెల్లదురై వచ్చేసరికి అనన్య అనే గర్ల్ ఫ్రెండ్ తో ఉంటాడు. డిసెంబర్ పదిన స్విస్ ఫార్మా ఓనర్ యాంజలీనా ఇక్కడికి వస్తోందనీ, ఆ రోజు తనకి చాలా ఇంపార్టెంట్ అనీ అంటాడు.

        ఈ సమాచారం తెలుసుకుని మిత్రన్ కొలీగ్స్ తో అభిమన్యుని కనిపెడతాడు. ఒక సీఎం ( ఇప్పుడు పూల్మణి సీఎం గా ఉంటాడు) పాల్గొంటున్న సభలో అభిమన్యు ప్రసంగిస్తూ, నిన్న మధురైలో జరిగిన కుల ఘర్షణలని ప్రస్తావించి- నిరసిస్తాడు. ఇది విని మిత్రన్ కొలీగ్స్ కి వివరిస్తాడు పేపర్ కటింగ్స్ తో. అభిమన్యు తన అనుచరుడి గొంతు మీద గాయం చేసి వాడి కులం పేరు రాసి మధురైలో ఘర్షణలు సృష్టించాడనీ, దీంతో యంత్రాంగం వీటి మీద దృష్టి పెట్టడంతో , నిన్న చెల్లదురై  మైన్స్ తనిఖీకి వెళ్ళలేక పోయారనీ వివరిస్తాడు. తనిఖీని ఆపడానికే ఆ ఘర్షణలని చెప్తాడు.

        ఇప్పుడు తను ఎంపిక చేసుకోవాల్సిన  శత్రువెవరో తెలిసిందనీ, అభిమన్యు జీవితంలో డిసెంబర్ పది ని మర్చిపోలేని రోజుగా చేస్తాననీ  అంటాడు మిత్రన్. ఇక ట్రైనింగ్ పూర్తయి పాసింగ్ అవుట్ పెరేడ్ లో ముఖ్య అతిధిగా అభిమన్యూయే వస్తాడు. మిత్రన్ కి మెడల్ అందిస్తాడు. మిత్రన్ కి ఒక బెరెట్టా పిస్టల్ వున్న బాక్సుని బహూకరిస్తాడు అభిమన్యు. మిత్రన్ ఏఎస్పీ గా జాయిన్ అవుతాడు. జాయిన్ అయిన వెంటనే అశోక్ పాండియన్, చెల్లదురై, పెరుమాళ్  స్వామిల బ్యాంకు ఖతాల్ని స్తంభింప జేస్తాడు. వీళ్ళు తమ ఖాతాల్లోంచి  7.5 బిలియన్ డాలర్లు మలేషియాలో  బ్యాంకు బ్రాంచీ కి ట్రాన్స్ ఫర్ చేయబోతున్నారని అంటాడు. ఆ డబ్బుతో యాంజలీనా కంపెనీని కొనేసి, ఆమె జనెరిక్ మందుల ఒప్పందం ప్రభుత్వంతో కుదుర్చుకోకుండా ఆపబోతున్నారని వివరణ ఇస్తాడు

        యాంజలీనా రాగానే ఆమెని మీటవుతాడు
. క్యాన్సర్ మందుల గురించి చర్చించుకుంటారు. మిత్రన్ పరిస్థితి చెప్తాడు. రేపు ప్రభుత్వంతో మీటింగ్ కి వెళ్తే ప్రమాదమని,  తనకి డబుల్ గా మహిమని ఉపయోగించి తనకి ప్రమాదం లేకుండా  చూస్తాననీ అంటాడు.

        కారులో వెళ్తున్న మహిమని యాంజలీనా అనుకుని ఎటాక్ చేస్తారు అభిమన్యు ఆదేశాలందుకున్న గ్యాంగ్. కొద్దిలో తప్పించుకుంటుంది మహిమ. మిత్రన్ వాళ్ళ మీద తిరిగి ఎటాక్ చేసి మహిమని కాపాడుకుంటాడు. ప్రభుత్వంతో యాంజలీనా మీటింగ్ సక్సెస్ అయి అభిమన్యు షాక్ తింటాడు. అదే సమయంలో బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ అయ్యాయని తెలుసుకుని నీరుగారి పోతాడు. మిత్రన్  అనే ఒక కొత్తగా  వచ్చిన ఏఎస్పీ తనకి  శత్రువుగా మారాడని తెలుసుకుంటాడు. పెరుమాళ్ స్వామి తమ్ముడు విక్కీతో హోటల్ రూమ్ లో  యాంజలీనాని చంపించేస్తాడు. అక్కడే వున్న మిత్రన్ తీవ్రంగా గాయపడతాడు

        అభిమన్యు  మిత్రన్ గదికి వెళ్లి గోడలకి తన గురించి అంటించిన మ్యాటర్ అంతా గమనిస్తాడు.  హాస్పిటల్ కి వచ్చి ఒక ఎలక్ట్రానిక్ బగ్ (జిపిఎస్ + ఆడియో ట్రాన్స్ మిటర్) ఇచ్చి మిత్రన్ శరీరం లో అమర్చమని  చెప్పి వెళ్లిపోతాడు. ఆ బగ్  ద్వారా  మిత్రన్ మాటలు,  ప్లాన్స్ అన్నీ వినేస్తూంటాడు. కోలుకున్న మిత్రన్ కి అభిమన్యు గురించి ఇంకో రహస్యం తెలుస్తుంది. అభిమన్యు  కంపెనీలో పనిచేసిన ఒక ఫార్మసిస్టు డయాబెటిస్ కి మందు కనిపెడితే, దాన్ని కొట్టేసి ఆమెని చంపేసిన రహస్యం ఒక  ఎస్డీ కార్డులో బాయ్  ఫ్రెండ్ దగ్గర వుంటుంది. ఇది మిత్రన్ తెలుసుకున్నాడని తెలుసుకున్న అభిమన్యు ఆ ఎస్డీ కార్డు కోసం బాయ్ ఫ్రెండ్ నీ, మిత్ర కొలీగ్ నీ చంపించేస్తాడు. ఎస్డీ కార్డు మాత్రం దొరకదు. 

        ఈ సంఘటనలతో డిస్టర్బ్ అయిన మిత్రన్ తన గదికి వచ్చి చూస్తే, అభిమన్యు వచ్చి వెళ్ళాడని తెలుస్తుంది. గదిలో
2011 నాటి మిస్ ఇండియాకి  కి సంబంధించిన ఒక ఫోటోమీద ఒక అనన్య అనే మోడల్ కి పిన్ గుచ్చి వుండడం గమనిస్తాడు. వెంటనే ఆ పిన్ మీద వేలిముద్రలు సేకరిస్తుంది మహిమ. ఆ వేలిముద్రలు మిత్రకి అభిమన్యు బహూకరించిన పిస్టల్ బాక్సు మీద అభిమన్యు వేలిముద్రలతో సరిపోతాయి. ఈ విషయం అటు అభిమాన్యుకీ  తెలిసిపోయి, తన గర్ల్ ఫ్రెండ్ అనన్య జ్ఞాపకం వస్తుంది. ఆ మిస్ ఇండియా పోటీల్లో పాల్గొంటున్న ఆమె  మీద కన్నేసి- ఆమె కోసం ఆమె తండ్రిని చంపి, ఆ పోటీల్లో పాల్గొనలేక విధిలేక ఆమె తన చార్టెడ్ ఫ్లైట్ లో స్వస్థలానికి ప్రయాణించేలా చేస్తాడు. అప్పట్నించీ ఆమె అతడికి దగ్గరై సహజీవనం చేస్తోంది. 

        అభిమన్యు తన ఫ్లాట్ ని కూడా బగ్గింగ్ చేసి ఉంటాడని మిత్రన్ కి డౌట్ వచ్చి, డిటెక్టర్ తెప్పించి  చెక్ చేస్తూంటే అది అదేపనిగా ఎలర్ట్స్ ఇస్తూంటుంది.  కానీ ఎక్కడా బగ్స్ దొరకవు, బగ్ తన ఛాతీ లోపలే అమర్చి వుందని అతడికి తెలీదు. మహిమ వాదన పెట్టుకుంటుంది. అభిమన్యుని చంపి ఏం సాధిస్తావని. అతను నీకంటే పవర్ఫుల్ అనీ, అతడికి ఈ పగే కావాలో,  తన ప్రేమే కావాలో తేల్చుకొమ్మని చెప్పేస్తుంది. బగ్ ద్వారా ఇదంతా విన్న అభిమన్యు,  మహిమ కోసం జీవితాంతం మిత్రన్ ఏడ్వాలని ఆమెని చంపేసేందుకు ప్లానేస్తాడు. దీన్ని విఫలం చేస్తాడు మిత్రన్. అప్పుడు ఒక సందర్భంలో బగ్ తన ఛాతీ లోనే వుందని తెలుస్తుంది మిత్రన్ కి.


       ఎండ్ : మిత్రన్ కి తన కొలీగ్ ని ఎటాక్ చేసిన చోట ఎస్డీ కార్డు కూడా  దొరుకుతుంది. అటు అనన్య కి అభిమన్యు ఆమె కోసం ఆమె తండ్రిని చంపిన దుర్మార్గం గురించి చెప్పేస్తుంది మహిమ.   ఒక సభలో మంత్రి సెంగల్వ రాయన్ ముఖ్యమంత్రి పూల్మణి సమక్షంలో ఓ నోట్ చదివేస్తాడు. అది తన కొడుకు అభిమన్యు రాసిచ్చిందనుకుని తెగ చదివేస్తూంటాడు. నిజానికి అది మిత్రన్ మార్చేసిన నోట్. అందులో జెనెరిక్ మందులు రాకుండా చేసిన కుట్ర వివరాలన్నీ వుంటాయి. దాన్నలాగే చదివేసి కలకలం సృష్టిస్తాడు. తండ్రి చేసిన ఈ వెధవపనికి అతణ్ణి చంపించేస్తాడు అభిమన్యు. ఆ నేరం ముఖ్యమంత్రి  పూల్మణి మీదేసి బ్లాక్ మెయిల్ చేస్తాడు. సెంగల్వ రాయన్ కి అధికారిక  లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు,  అభిమన్యు పుచ్చుకున్న చితాభస్మం అతడి తండ్రిది కాదనీ, అతను చంపిన తన కొలీగ్ దనీ మిత్రన్ చెప్తాడు. అభిమన్యు తండ్రి బతికే వున్నాడనీ వెల్లడిస్తాడు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఎస్డీ కార్డు ఆధారంగా అభిమన్యు ని అరెస్ట్ చేస్తాడు. 

        కోర్టులో తన నేరాలేవీ ఒప్పుకోని అభిమన్యుకి ఇంకో రోజు గడువిస్తుంది కోర్టు.
మిత్రన్ అతణ్ణి కస్టడీలోకి తీసుకుంటాడు. ఫార్మాసిస్టుని చంపి  కొట్టేసిన మందు ఫార్ములా ఆమె పేర పేటెంట్ అయి ఉందనీ, అది జనెరిక్ మందుగానే ఉత్పత్తి అవుతుందనీ, కాబట్టి అభిమన్యు దాంతో ఏమీ చేయలేడనీ చెప్తాడు మిత్రన్. తిరిగి రేపు అభిమన్యు ని కోర్టుకి తీసుకుపోతున్నప్పుడు, ఎన్ కౌంటర్  చేస్తామని సిద్ధమవుతారు మిత్రన్ కోలీగ్స్. ఈ విషయం అభిమాన్యుకి చెప్పి, అతను బతకాలంటే  నేరాలన్నీ చెప్పేయాలంటాడు, అప్పుడు ఒక బులెట్ ప్రూఫ్ జాకెట్ ఇస్తానంటాడు. అది తొడుక్కుని తన కొలీగ్స్ షూట్ చేస్తే, చావు నటించాలంటాడు. 

        అభిమన్యుని మిత్రన్ కోర్టుకి తీసుకుపోతున్నప్పడు, అతను బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించలేదని గమనిస్తాడు మిత్రన్. అదే క్షణంలో మిత్రన్ కొలీగ్ షూట్ చేస్తాడు. మిత్రన్ అభిమన్యుని పక్కకి తప్పిస్తాడు. అంతలో అభిమన్యు గర్ల్ ఫ్రెండ్ అనన్య అతణ్ణి కాల్చేసి తన తండ్రి హత్యకి పగ దీర్చుకుంటుంది. చచ్చిపోతూ- తన నేరాలన్నీ ఎస్డీ కారులో రికార్డ్ చేసి బులెట్ ప్రూఫ్ జాకెట్ లో పెట్టానని చెప్తాడు అభిమన్యు. దీంతో కథ ముగుస్తుంది.


(Next : పోస్ట్ మార్టం)

-సికిందర్

11, మే 2016, బుధవారం

పాత కళ -కళ!

        హోదా అనేది రాగ ద్వేషాలు పెంచుకోవడంకోసం వరించదు, మార్గనిర్దేశం చేసేందుకోసం సంక్రమిస్తుంది. కరుడుగట్టిన సాంప్రదాయవాది శంకరాభరణం శంకరశాస్త్రే గనుక  ఆధునిక పోకడలకి ఛీత్కార మంత్రమే పఠించి వుంటే, కె. విశ్వనాథ్ కి తన దర్శకత్వ ప్రతిభతో ఇంత చమత్కారం చేసే అవకాశమే దక్కేది కాదు. ఎంతో ఉదారంగా శంకర శాస్త్రి ఊఁ..సరే, కానీయ్!అని భుజంతడితే గానీ విశ్వనాథ్ తనపని తను చేసుకుపోయే వీలు చిక్కలేదు. తీరా చూస్తే- అదొక మాటలకందని అద్భుత సృష్టి అయి, పండిత-పామర- పురాతన-ఆధునిక అగాధా లన్నిటినీ పూడ్చేస్తూ, సినిమా సక్సెస్ సూత్రాల్నికూడా  తిరగ రాసేస్తూ, ఒక మహోజ్వల వినోద సాధనమై కూర్చుంది మాహా దర్జాగా!

        ఆధునికత్వంతో సాంప్రదాయం అభ్యుదయంగా సాగితే దాని  ఔన్నత్యమే  వేరు. ఏ కాలంలోనైనా మాతృస్థానం లో  వుండే సాంప్రదాయ వాదం ఆధునిక పోకడల్ని నిరసిస్తే, దూరం పాటిస్తే, అప్పుడు దారీతెన్నూ తెలీని ఆధునిక పోకడలు మరింత కాలుష్యాన్నే సృష్టిస్తాయి! ఇందుకే  విన్ స్టన్ చర్చిల్ మహాశయుడు కూడా అన్నాడు- సాంప్రదాయం ములుగర్రతో పొడుస్తూ ఉండకపోతే, గొర్రెల మందలాంటి ఆధునికత్వం చెల్లా చెదు రైపోతుందని!

        శంకరాభరణం  ఫక్తు దర్శకుడి సినిమా. ఖాయంగా డబ్బులు రావని తెలిసికూడా సోమయాజులూ మంజూ భార్గవి ల్లాంటి ఏ బాక్సాఫీసు అప్పీలూ లేని నటులతో ఆడిన మహా జూదం. చోద్యంగా మారే ప్రమాదాన్ని కాచుకున్న మహా దృశ్య కావ్యం. మాట-పాట-ఆట-తీతా అన్నిటా సంభ్రమానికి గురిచేసే ఒక మహాద్భుత వైవిధ్య ప్రదర్శన.

       
పాశ్చాత్య సంగీత వ్యామోహంలో దేశీయ వారసత్వ సంపదైన శాస్త్రీయ సంగీతాన్ని అలక్ష్యం చేయడాన్ని జీర్ణించుకోలేని సంగీత విద్వాంసుడు శంకర శాస్త్రి కథ ఇది. శంకర భరణం రాగంలో నిష్ణాతుడు. ప్రయోగాల పేరుతో అమృతతుల్యమైన సంగీతాన్ని అపవిత్రం చేయడాన్ని అస్సలు సహించడు. సంగీతానికి అతడి దృష్టిలో కులమతాల్లేవు, భాషా భేదాలూ స్వపర అంతరాలూ లేవు. 

      ఒకరకమైన సంగీతం గొప్పదనీ, మరొకటి అథమమనీ చెప్పడానికి మనమెవరమ న్న వివేచనకూడా అతడికుంది. సంగీతంలో ఆధునిక పోకడలపట్ల ధర్మాగ్రహమే తప్ప తానేదో గొప్పవాణ్ణి అన్న అహంకారం  కాదది. సంప్రదాయానికేదో అపచారం జరిగిపోతోందనీ ద్వేషభావంతో కళ్ళూ చెవులూ మూసుకుని, తనలోకి తానూ ముడుచుకుపోయే సంకుచిత్వమూ, పలాయన వాదమూ లేవు. అలాటి అర్భకుల్ని దిశానిర్దేశం చేసి  సన్మార్గంలో పెట్టాలన్నతపనే వుంది.  పాప్ మ్యూజిక్ కుర్ర గ్యాంగ్ అయినా, ప్రయోగాల పిచ్చి మాస్టా రైనా, శంకరశాస్త్రి దృష్టిలో  అర్భకులే. వాళ్ల కంటే దివ్యంగా పాప్ కూతలు తనూ  కూయగలడు. అసలంటూ శాస్త్రీయ సంగీతపు పునాదులుంటే కదా, ఏ సంగీతమైనా  అర్ధవంతంగా పాడగల్గేది - అనేసి క్లాసూ  పీకుతాడు!

       
వృత్తి గతంగా ఇంతటి అభ్యుదయమున్న శంకర శాస్త్రికి వ్యక్తిగత జీవితంలోనూ విశాల దృక్పథమే వుంటుంది. లోకులు ఛీ థూ అని తనకి దూరమైనా, తానొక నిష్టాగరిష్టుడైన సద్బ్రాహ్మణుడన్న  భేషజాలేవీ పెట్టుకోకుండా, నిమ్న కులస్థురాలైన వెలయాలి కూతుర్ని చేరదీస్తాడు. ఆమె నాట్యాభిలాషని ప్రోత్సహిస్తాడు. సంగీతంలో మాత్రమే తను అభ్యుదయవాది కాదు, జీవన సంగీతంలోనూ అభ్యుదయ వాదే. అందుకే అంటాడు- ఆచార వ్యవహారాలు మనుషుల్ని సన్మార్గంలో పెట్టడానికే తప్ప, మనుషుల్ని కులమనే పేరుతో  విడదీయడానికి కాదుఅని.

      గ్రేట్ పర్సనాలిటీ! అయితే ఇంతటి  సెక్యులర్ శాస్త్రి శాస్త్రీయ సంగీతానికి గనుక హాని జరుగుతోందని తెలిస్తే, కన్నకూతురి పెళ్లి సంబంధమైనా  చెడగొట్టుకోవడానికీ వెనుకాడడు! కూతురి గళాన ఆందోళనగా హిందోళ రాగం హింసపడి, మరోవైపు కాబోయే అల్లుడి స్వరపేటికలో విషభ వృషభాలు మెలికపడి జరగరాని విధ్వంసం జరిగిపోతే - శంకర శాస్త్రి కంఠంలోంచి ఒక్క ప్రళయ గర్జనతో పెళ్ళిసంబంధం పటాపంచాలే. 

        కళాకారులిలాగే వుంటారు. ఒకప్పుడు ఇండోర్ ఘరానాకి చెందిన  ఉస్తాద్ షామీర్ ఖాన్ పుత్ర రత్నంతో ఇలాగే జరిగింది. ఓ సంగీత సమ్మేళనంలో పుత్రుడు అమీర్ ఖాన్ అమోఘమైన ఆలాపనలతో వహ్వా లందుకుని, ఇంటికి  తిరిగొస్తే బెత్తం పుచ్చుకుని చావబాదేశాడు షామీర్ ఖాన్. దాంతో కొన్నాళ్ళు ఎక్కడికో పారిపోయాడు ఉస్తాద్ అమీర్ ఖాన్. మొత్తం 22 శృతుల్నీ 22 ఏళ్ల పాటూ  అభ్యాసం చేసి పట్టు సాధించాకే  ఆలాపనలో “ఆ..!’ అని నోరు తెరవాలని కఠిన నిబంధన వుంటే,  దాన్ని అతిక్రమించినందుకే ఆనాడు  ఆ బడితె పూజ.

        ఇలాటి శంకరశాస్త్రికి మంజూ భార్గవి తోడవుతుంది. శాస్త్రిది శాస్త్రీయ సంగీతాన్ని సజీవంగా ఉంచాలనే  పాసివ్ ఆశయం. మంజూ భార్గవిది  తన కొడుకుని ఆ  శాస్త్రి దగ్గరే శిక్షణ  నిప్పించాలన్న యాక్టివ్ లక్ష్యం. ప్రశాంత తటాకం అతనైతే, తీరానికి చేరాలనుకునే నావ ఆమె. ఈ విధంగా ఇది  సంగీత నాట్యాల సంగమం, చివరికి మరణంలోనూ ఇదే  సంగమం. 

        ఈ పాత్రల్ని విశ్వనాథ్ చిత్రించిన తీరు, తెర మీద చూపించిన విధం- ఒక నూతన ప్రయోగం. ఈ ఇద్దరి మధ్యా మాటలే లేకుండా సినిమా అంతటినీ లాక్కు రావడం, దాన్ని ప్రేక్షకులు చూస్తారన్న నమ్మకమూ వుండడం  మామూలు ఆత్మవిశ్వాసం కాదు. పైగా  సాత్విక నటనకే స్థానమిచ్చారు. ఆఖరికి తనని చెరచిన జమీందారుని చంపి వచ్చి, ఆ రక్తాన్ని ఆమె తన గురువు పాదాలకి పూస్తున్నప్పుడూ సాత్వికమే.

        ఒక దృశ్యంలో ఒక విషయముంటుంది. దాన్ని సంభాషణల ద్వారా వెల్లడించకుండా, కేవలం ఆ ఫీల్ ప్రేక్షకులు అనుభవించేలా చేస్తే అది సబ్ టెక్స్ట్. ఎన్నో సినిమాలకి  గ్రాండ్ ఫాదర్ లాంటి  ‘గాడ్ ఫాదర్’ లో  తండ్రీ కొడుకులైన మార్లన్ బ్రాండో, అల్ పాసినోల మధ్య ‘ఐ లవ్యూ’ అని చెప్పించకుండా పరస్పరం వాళ్ళు  ప్రేమని వెల్లడించుకునే సబ్ టెక్ట్స్ ఎలాగబ్బా అని, దర్శకుడు ఫ్రాన్సిస్  ఫోర్డ్ కపోలా రచయితలతో మల్లగుల్లాలు పడుతోంటే, తేలిందేమిటంటే- వాళ్ళిద్దరూ ఒకరి పట్ల ఒకరికున్న ఫీలింగ్స్ గురించి ఎప్పుడూ మాట్లాడుకోలేదు గనుక, వాళ్ళ  మధ్య మౌనమే వాళ్ళు పరస్పరం వెల్లడించుకునే ప్రేమ అనేసి!

        ఇలాటి సబ్ టెక్స్టే సోమయజులూ మంజూ భార్గవిల మధ్య ప్లే అవుతూంటుంది మాటలు లేని మౌనంతో. వాళ్ళవి డీ- గ్లామరైజ్డ్  ఫేసులు కాబట్టే ఈ సినిమాని అంతగా రక్తికట్టించ గలిగారు. సినిమా మొత్తం మీద  హైలైట్ అనదగ్గ దృశ్యాలు మూడుంటాయి- అవి, సోమయాజులు పాదాలకి మంజూ భార్గవి రక్తాన్ని పూసే దృశ్యం, ‘మెరిసే మెరుపులు  మురిసే పెదవుల..’ చరణంలో గాలివాన హోరులో సోమయాజులి తాండవ దృశ్యం, ముగింపులో తన సంగీత వారసుడిగా మంజూ భార్గవి కొడుకుని ప్రకటిస్తూ సోమయాజులు కూలిపోతే,  ఆయన కాళ్ళు పట్టుకుని మంజు భార్గవి తనూ ప్రాణాలొదిలే దృశ్యం!

       సినిమా పాత్రల్లో దిగ్గజంలా మెరిసే  శంకర శాస్త్రికి బ్రహ్మ రధం పట్టారు ప్రేక్షకులు. విశ్వ నాథ్ కి అంతర్జాతీయ ఖ్యాతి దక్కింది. దేవదాసుకి  ఘంటసాల ఎలాగో, శంకర శాస్త్రికి  బాలసుబ్రహ్మణ్యం అలాగ. దేవదాసుకి సుబ్బరామన్ ఎలాగో, శంకరాభరణంకి కేవీ మహదేవన్ అలాగ. దేవదాసుకి  సముద్రాల ఎలాగో, శంకరాభరణంకి వేటూరి అలాగ. ఇక సంభాషణలు రాసిన జంధ్యాల, ఛాయాగ్రహణం సమకూర్చిన బాలూ మహేంద్రా, ఈ కళాఖండాన్ని మనసుపెట్టి నిర్మించిన ఏడిద నాగేశ్వరరావూ... ఇలా ఇందరేసి కళాకారులంతా ఒకచోట చేరి ఓ మహోజ్వల సంగీత రస చలన చిత్రాన్ని తెలుగు వాళ్ళ తరపున ప్రపంచానికి అందించారు.  
      
        అభ్యుదయ వాదులు సాంప్రదాయ వాదాన్ని తిరస్కరించవచ్చు. కానీ అభ్యుదయ వాదాన్ని కూడా కలుపుకుపోయేదే సాంప్రదాయ వాదమన్న గొప్ప అర్ధాన్ని ప్రకటిస్తూ  కె. విశ్వనాథ సృష్టించిన ఈ కళాఖండం నేటి తరం నుంచీ, ఇంకా ముందు తరాలనుంచీ కూడా వందనాలందుకుంటుంది తప్పక.


-సికిందర్
(ఆగస్టు 2009, ‘సాక్షి’)


9, మే 2016, సోమవారం

తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్- 13


న్ని సినిమా కథలూ ప్లాట్ పాయింట్ వన్ దగ్గరే పుడతాయి. దీని కంటే ముందు జరిగేదంతా ప్రిపరేషన్- సెటప్. ప్లాట్ పాయింట్ వన్ దగ్గర, సోల్  - హీరో - గోల్ : ఈ త్రిముఖాలని మిళితం చేసుకుని కథ పుడుతుంది. కథ పుట్టాక ఈ త్రిముఖా లేర్పడవు. కథ పుడుతూనే ఈ త్రిముఖాలతో పుడుతుంది. ప్లాట్ పాయింట్ వన్ కథ పుట్టడం బిగ్ బ్యాంగ్ లాంటిది. ఇంటర్వెల్ బ్యాంగ్ వుంటే ఉండొచ్చు, కానీ దానికంటే ముందు బిగ్ బ్యాంగ్ వుంటుంది ప్లాట్ పాయింట్ వన్ దగ్గర. ఈ బిగ్ బ్యాంగ్ (మహా విస్ఫోటనం) లోంచే కథ త్రిముఖాలతో పరివ్యాప్త మవుతుంది. విశ్వంలో మహా విస్ఫోటనం జరక్క ముందు కాలం లేదు, స్పేస్ లేదు, భౌతిక- రసాయన సూత్రాలూ లేవు, ప్రాణి పుట్టడానికి అవసరమైన సోల్ కూడా లేదు. వీటన్నిటినీ  మహా విస్ఫోటనంలోంచే మోసుకుంటూ విశ్వం ఏర్పడింది. ప్రకృతి సూత్రాలనేవి ఆల్రెడీ మహావిస్ఫోటనానికి ముందే ఆ బిందువులో సాఫ్ట్ వేర్ గా ఏర్పడి వున్నాయి. అలాగే ప్లాట్ పాయింట్ వన్ దగ్గర నుంచి కూడా త్రిముఖాలని అన్ని సూత్రాలతో  మోసుకుంటూ కథ పుడుతుంది. స్క్రీన్ ప్లే మిడిల్ విభాగంలో వాటిని వెదజల్లుతుంది.

          ప్పుడదొక కథా ప్రపంచం. అంటే ప్రేక్షకుల మానసిక ప్రపంచం. వాళ్ళ మానసిక ప్రపంచపు మెకానిజంనే తిరిగి వాళ్లకి వెండితెర  తెర మీద చూపించడం. ఏమిటా మానసిక ప్రపంచపు మెకానిజం? 1.వెలుపలి మనసు- 2. అంతరాత్మ - మధ్యలో ఇగో. అంటే బిగినింగ్- మిడిల్- మధ్యలో హీరో. ఇక్కడ కీలకం హీరో. అంటే ఇగో. మనిషికుండే ఇగోకి హీరోపాత్ర ఎంత సరిపోలినట్టుగా చిత్రిస్తామో, అంత ప్రేక్షకులకి ఆ హీరో పాత్ర దగ్గరవుతుందని జేమ్స్ బానెట్ అంటారు. అదే హీరో పాత్ర ఇంకేదో పాత్రకి రోల్ మోడల్ గా వుంటే ఇంకా బలంగా నాటుకుంటుందని కూడా అంటారు.

          ఇక్కడే జోసెఫ్ క్యాంప్ బెల్ ఎంటరవుతారు. ప్రపంచ పురాణాల మైథాలజిస్టు అయిన ఈయన,  కథల్లో హీరో ప్రయాణం ఎలాగెలా కొనసాగుతుందో వివరించారు. క్లయిమాక్స్ వరకూ ఈ దశలు పన్నెండు వుంటాయి. మన ప్రస్తుత టాపిక్ ఈ ప్రయాణం గురించి కాక, వెలుపలి మనసుకీ అంతరాత్మకీ ( బిగినింగ్, మిడిల్లకి) కలిపి లాక్ వేయడమే కనుక,  ఇందుకు సంబంధించి క్యాంప్ బెల్ దగ్గర నుంచి మూడో మజిలీ, నాలుగో మజిలీ మాత్రమే తీసుకుని వీటిని ఎలా అన్వయించాలో చూద్దాం. 

         బిగినింగ్ విభాగం ప్లాట్ పాయింట్ వన్ దగ్గర హీరోకి సమస్య ఎదురయ్యాక, అతను ఓ పట్టాన దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధం కాడు. ఈ మజిలీని refusal of the call  అన్నారు క్యాంప్ బెల్. కురుక్షేత్రంలో అర్జునుడు ఓ పట్టాన యుద్ధం చేయడానికి సిద్ధపడలేదు. కృష్ణుడు ఒప్పించాల్సి వచ్చింది. ఈ ఒప్పించే పాత్రకి సంబంధించిన మజిలీని meeting with the mentor  అన్నారు క్యాంప్ బెల్. ఈ mentor  చేసే ఉపదేశంతో ఇక సమస్యని ఎదుర్కోవడానికి కార్యరంగంలోకి- మిడిల్లోకి- దూకుతుంది హీరో పాత్ర.    ఇక్కడ ఈ మజిలీ ఒక mentor  ఎవరో చేసే ఉపదేశంతోనే వుండాలని లేదు. (ఈ mentor గా కమెడియన్ కూడా ఉంటాడు కథని బట్టి) కళ్ళు తెరిపించే ఏదైనా సంఘటన కావొచ్చు, అనుభవం కావొచ్చు, అంతరాత్మ ప్రబోధం కావొచ్చు... సమస్య జోలికి వెళ్ళ వద్దనుకున్న హీరో ఇంటిని ప్రత్యర్ధులు తగలబెట్టే సంఘటన జరగ వచ్చు. అప్పుడు సమస్యలోకి దూకక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది హీరోకి. ఇదీ meeting with the mentor  మజిలీ. 

          జేమ్స్ బానెట్ కూడా ఇందుకే అన్నారు- హీరో పాత్ర ఇంకేదో పాత్రకి రోల్ మోడల్ గా వుంటే ఇంకా బలంగా నాటుకుంటుందని. హీరోలో అర్జునుడు కన్పిస్తూంటే అంతకంటే ఇంకేం కావాలి. ఇలాటి పాత్రల్ని మిథికల్ క్యారక్టర్స్ అంటారు. ఇవే ఎక్కువ ఆకట్టుకుంటాయి. ఎందుకంటే ఇవి ప్రేక్షకుల ఆత్మిక (సోల్) దాహాన్ని తీరుస్తాయి. రాముడు, కృష్ణుడు, సీత, రాధ, రావణుడుల వంటి ఎన్నో పౌరాణిక పాత్రలు ప్రతిఫలించే సినిమాలెన్నో ఇందుకే వస్తూంటాయి.  హాలీవుడ్ లో  ఒకప్పుడు కౌబాయ్ పాత్రలు ఆత్మిక దాహాన్ని తీర్చేవి. తర్వాత సూపర్ మాన్, స్పైడర్ మాన్ లాంటి పాత్రలు తీర్చసాగాయి..

          ఇంతకీ స్క్రీన్ ప్లే లో refusal of the call  మజిలీ ఎందుకేర్పడుతుంది? ఎందుకేర్పడాలి? ఇక్కడ హీరోని ఇగోగా చూస్తే సమాధానం దొరుకుతుంది. ఇగో వెలుపలి మనసుని ఏలుకుంటూ మజా చేస్తుంది. స్క్రీన్ ప్లే బిగినింగ్ విభాగం (వెలుపలి మనసు) లో హీరోల పాత్రలు ఇందుకే ఆ వారాగా తిరుగుతూ ఎంజాయ్ చేస్తూంటాయి. వెలుపలి మనసులో ఎంజాయ్ చేసే ఇగోకి నీతులు చెప్పే అంతరాత్మ అంటే వొళ్ళు మంట. దాని వైపే చూడదు. ఇందుకే బిగినింగ్ విభాగంలో ఇంట్లో తిట్లు తింటున్నా  ఆవారా హీరోకి బాధ్యతలు పట్టవు.  బాధ్యతల జోలికి వెళ్తే ఈ మజా పోతుందన్న బాధ. ఇగో కూడా వెలుపలి మనసుతో  మజా వదులుకోలేకే అంతరాత్మకి దూరంగా వుంటుంది- తప్పించుకు తిరుగు వాడు ధన్యుడు సుమతీ అన్నట్టు. ఇగో కి తాను పరిష్కరించాల్సిన సొంత సమస్య లున్నాయని తెలుసు. కానీ వాటి జోలి కెళ్లదు, వాయిదా వేస్తూంటుంది. లేదా సరైన సమయంలో సరైన నిర్ణయమంటూ రాజకీయ కాలక్షేపం చేస్తూంటుంది. 

          ఇగోకి ఈ దశ refusal of the call  మజిలీ. ఇది ప్లాట్ పాయింట్ వన్ లోపే వుంటుంది. దీని పర్యవసానంగా meeting with the mentor  మజిలీ ఏర్పడితేనే ప్లాట్ పాయింట్ వన్ వస్తుంది. సినిమాల్లో ఈ రెండు మజిలీలూ మిస్సవుతున్నాయి. దీంతో చాల సినిమాల్లో ప్లాట్ పాయింట్ వన్ లో పస లేకపోగా, మిడిల్ కూడా బలహీనంగా తయారవుతోంది.

     ‘షోలే’ లో గబ్బర్ సింగ్ ని పట్టుకోవడానికి తోడు దొంగలైన అమితాబ్, ధర్మేంద్ర లని సంజీవ్ కుమార్ ఇంటికి పట్టుకొస్తే, వాళ్లకి ఈ పోరాటంలో ఏమాత్రం ఆసక్తి లేక డబ్బు కొట్టేసి పారిపోవాలనుకుంటారు. ఇది refusal of the call  మజిలీ. అప్పుడు జయబాధురి కళ్ళబడి సిగ్గు తెచ్చుకున్నప్పుడు,  meeting with the mentor  మజిలీ. అప్పుడా తర్వాత గబ్బర్  తన ముఠా తో వచ్చి వూరి పడి  మీద దాడి చేసినప్పుడు, అతణ్ణి ఎదుర్కోవడా నికి సిద్ధపడ్డం ప్లాట్ పాయింట్ వన్ కి అంకురార్పణ.         

        కానీ ‘శివ’ లో ఎలా వుంటుందంటే, జేడీ చేష్టల్ని చూస్తూ ఓపిక పట్టి వుండే  నాగార్జున, అమలని జేడీ డాష్ ఇస్తే రియాక్టయి కొడతాడు. దీంతో ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడుతుంది. ఇక్కడ మొదట్నించీ నాగార్జున ఫ్రెండ్స్,  జేడీ సంగతి చూడాల్సిందేనని చెప్పేదీ వుండదు, నాకెందుకని నాగార్జున పట్టించుకోకుండా refusal of the call  మజిలీ ఏర్పడేదీ వుండదు. లేదూ  పట్టించుకోవాల్సిందేనని ఏదో విధంగా meeting with the mentor  మజిలీ ఏర్పడేదీ వుండదు.

          ఈ రెండు పరిస్థితుల్ని జాగ్రత్తగా గమనించాలి. ‘షోలే’  బిగినింగ్ లో ఇగో లక్షణాలు ప్లే అవుతూంటే,  ‘శివ’ లో హీరో మాత్రమే ప్లే అవుతున్నాడు, ఇగోతో పని లేకుండా. అంటే ఇది తప్పని కాదు, సిడ్ ఫీల్డ్ ప్రకారం ఒప్పే. కానీ సిడ్ ఫీల్డ్  విధానంకూడా అమలుకాని దయనీయ స్థితి తెలుగు సినిమాల్లో వుంటున్నందుకే జోసెఫ్ క్యాం బెల్ నీ, జేమ్స్ బానెట్ నీ ఆశ్రయించాం. వీళ్ళ స్థాయిలో కథ చేసుకుంటే, దాన్ని ఇతరులు కోతలు పెట్టి ఎంత తగ్గించినా  అది  ‘శివ’ లాంటి సిడ్ ఫీల్డ్  కి స్థాయికి  తగ్గదన్న నమ్మకంతో. ఇలాకాక సిడ్ ఫీల్డ్ స్థాయిలోనే కథ చేసుకుంటే, కోతలు పడ్డప్పుడు అది కూడా అన్యాయమై పోవచ్చు. కష్టపడి తోడేసుకుని పెరుగు తయారు చేసుకుంటే, దాంట్లో నీళ్ళు కలిపి మజ్జిగ తయారు చేసుకునే దాకా పోవచ్చు- ఇంకా నీళ్ళు కలిపి మజ్జిగని కూడా నాశనం చేసుకోక పోవచ్చు. 

           డిటెక్టివ్ సాహిత్యంలో సర్ ఆర్ధర్ కానన్ డాయల్  డిటెక్టివ్ పాత్ర షెర్లాక్ హోమ్స్ కూడా మొదటే ఏ కేసూ తీసుకోడు. కొమ్మూరి సాంబశివరావు నవలల్లో డిటెక్టివ్ యుగంధర్ కూడా కేసు మొదట తీసుకోవడానికి అయిష్టంగా ఉంటాడు. ఎర్ల్ స్టాన్లీ గార్డెనర్ లాయర్ పాత్ర పెర్రీ మేసన్ కూడా ఇంతే. ప్రేమ కథలో  దేవదాసు కూడా ఇంతే-  తనని చేపట్టమని అర్ధరాత్రి వచ్చే పార్వతిని  డొంకతిరుగుడు కారణాలు చెప్పి తిరస్కరిస్తాడు.  స్టార్ వార్స్, మ్యాట్రిక్స్, రైడర్స్ ఆఫ్ ది  లాస్ట్ ఆర్క్, లార్డ్ ఆఫ్ ది  రింగ్స్, స్పైడర్ మాన్, హేరీ పాటర్ సిరీస్, సైలెన్స్ ఆఫ్ ది  లాంబ్స్, ఎంటర్ ది  డ్రాగన్, జాస్, ప్రిన్సెస్ బ్రైడ్, కాసా బ్లాంకా, ఆల్మోస్ట్ ఫేమస్, అవతార్, షేక్స్ పియర్ ఇన్ లవ్, థెల్మా అండ్ లూయీస్, స్కార్లెట్ లెటర్...ఇలా ఎన్నో సినిమాల్లో  తప్పనిసరిగా
refusal of the call  మజిలీ భాగంగా వుంటుంది.



          ‘శివ’ లో లాగే , మొన్న వచ్చిన థ్రిల్లర్ ‘క్షణం’ లోకూడా హీరోకి refusal of the call  మజిలీ వుండదు. హీరోయిన్ పిలిచి తన కూతురు కన్పించడం లేదనగానే వెతకడం ప్రారంభిస్తాడు. ‘24’  లో విలన్ సూర్య వాచీ కోసం ప్రకటన వేసినప్పుడు హీరో సూర్య స్పందించడానికి జంకుతాడు. (ఇది refusal of the call  మజిలీ). పక్క కమెడియన్ పాత్ర ప్రోత్సహించడంతో ముందు కెళ్ళడానికి సాహసిస్తాడు  (ఇది meeting with the mentor  మజిలీ).

         
సర్వసాధారణంగా ‘శివ’ లో లాగా ఈ రెండు మజిలీలు లేకుండా తెలుగు సినిమాలు వస్తూంటాయి. కురుక్షేత్రంలో అర్జునుడు మాత్రం ఈ రెండు మజిలీలు లేకుండా ముందు కెళ్లడు . ఎందుకంటే మనిషి ఇగోనే అలా వుంటుంది.  జేమ్స్ బాండ్ లాంటి సాహసోపేత పాత్ర అలా ముందూ వెనుకా చూడకుండా దూకేస్తాడనీ, ఆ పాత్రలు ఇగో భయసందేహాల్ని అధిగమించి వుంటాయనీ అంటారు. కానీ  ఇంకా బిగినింగ్ విభాగంలోనే  ‘శివ’ లాంటి పాత్ర జేమ్స్ బాండ్ లక్షణాలతో ఎలావుంటుంది? ‘క్షణం’ లో మాత్రం?

          కాబట్టి ఈ సైకలాజికల్ లాక్ ని కూడా ప్రధానంగా  తీసుకుని ప్లాట్ పాయింట్ వన్ ని పూర్తి  చేయాల్సివుంటుంది. అంటే ప్లాట్ పాయింట్ వన్ దగ్గరే ఈ లాక్ వేయాలన్న మాట. అప్పుడు బిగినింగ్ కీ మిడిల్ కీ (వెలుపలి మనసుకీ అంతరాత్మకీ) కలిపి లాక్ వేసినట్టు వుంటుంది. ఇలా లాక్ వేయడం పాత్రని ఇగో లక్షణాలతో చూస్తేనే సాధ్యమవుతుంది...



-సికిందర్






8, మే 2016, ఆదివారం

స్పెషల్ ఆర్టికల్ ...

విడుదలయ్యే సినిమాల  గురించి అసలేం తెలుసుకోకుండా సినిమాలు  చూస్తే  ఎలాటి ప్రయోజనాలుంటాయి రైటర్స్ కి? ఈ ప్రశ్నని తాజాగా గతవారం విడుదలైన ‘24’ మీద ప్రయోగిస్తూ, అసలా సినిమా గురించి ప్రింట్, విజువల్, ఆడియో సమాచారాన్నంతటినీ బ్యాన్ చేసుకుని, వాటి వైపు చూడకుండా,  సినిమా గురించి ఏమీ తెలీని అమాయకుడిలా ఈ వ్యాసకర్త ఆ సినిమా కెళ్తే, ఒక అద్భుత ప్రపంచం ఆవిష్కారమైంది. అంటే సగటు ప్రేక్షకుడి పాయింటాఫ్ వ్యూలో కాదు ఆ  అద్భుత ప్రపంచం.. దాని కథా కథనాలు, పా త్రలు, నటనలు, పాటలు, ఫైట్లు వగైరా విషయపరమైన సమాచారానికి సంబంధించి అనుభవమైన ఎడ్యుకేషన్. సినిమాల గురించి ముందస్తు సమాచారంతో, అంచనాలతో ఒక అభిప్రాయం ఏర్పరచుకుని చూడడం వేరనీ, అసలేం తెలుసుకోకుండా ప్రత్యక్ష ప్రమాణం (direct perception) తో చూడడం వేరనీ తెలిసొచ్చింది…


        అంటే సినిమాలకి పబ్లిసిటీ  ఉండకూడదని కాదు. కచ్చితంగా అవసరమే. ప్రేక్షకుల్ని బలవంతంగా ఆకర్షించడానికి పబ్లిసిటీ వుండాల్సిందే.  వద్దన్నా అంత బలవంతంగా ఆకర్షిస్తే తప్ప,  ఇవ్వాళ ఇన్నేసి వివిధ దృశ్య మాధ్యమాల ప్రభావంలో కొట్టుకు పోతున్న ప్రేక్షకులు ఓ పట్టాన సినిమాల్ని పట్టించుకునేలా లేరు. కాబట్టి బలవంతంగా బరితెగించి వాళ్ళని ఆకర్షించాల్సిందే. తాళ్లూ సంకెళ్ళూ వేసి వాళ్ళని థియేటర్లకి లాగాల్సిందే. 

        కానీ ఒక వృత్తిలో వున్న రైటర్స్ వినియోగాదరుల్లా కాకుండా (ప్రేక్షకులుగా కాకుండా) ఉత్పత్తిదారుల్లా వుంటే బావుంటుంది, ఇంకో వృత్తిలో వున్న రివ్యూ రైటర్స్ కూడా వినియోగదారుల్లా కాకుండా (ప్రేక్షకులుగా  కాకుండా)  ఉత్పత్తిదారుల్లా వుంటేనే బావుండొచ్చు. సినిమాల గురించి ముందస్తు అంచనాలూ అభిప్రాయాలూ అనేవి ట్రేడ్ పండితుల సంగతి.  రైటర్స్ కి దీంతో పనిలేదు పనికిరాని టైం పాస్ కి తప్ప. సినిమాలు చూసే ముందు రాబోయే సినిమాల గురించి అంచనాలు, ముందస్తు అభిప్రాయాలూ అనేవి రైటర్స్ ఏర్పర్చుకోకుండా వుండాలంటే, విడుదలయ్యే ముందు ఆ  సినిమాల పబ్లిసిటీ వైపు కన్నెత్తి  చూడకూడదు. ఆ ఫస్ట్ లుక్ లో హీరో గెటప్ చూడకూడదు, ట్రైలర్స్ లో పంచ్ డైలాగులు వినకూడదు, కథేమిటో తెలుసుకోకూడదు, విజువల్స్ చూడకూడదు, మేకింగ్ ఎలా వుందో చూడకూడదు, ఆడియో అస్సలు వినకూడదు, పోస్టర్లు, పత్రికల్లో ప్రకటనలూ కూడా చూడకూడదు. సినిమాలు చూసే ముందు రివ్యూలు కూడా చదవకూడదు, సినిమా ఎలా వుందని ఎవర్నీ అడక్కూడదు, చర్చలు పెట్టకూడదు. ఇవన్నీ ప్రత్యక్ష ప్రమాణ పధ్ధతి  అందించే ప్రయోజనాలకి విఘాతం  కల్గిస్తాయి. 

       టీవీ ఛానెల్స్ లో వంటావార్పూ ప్రోగ్రాముల్లో యాంకర్ కి తనేం రుచి చూడబోతోందో ముందు అస్సలు తెలీదు. చూద్దామన్నా మార్కెట్ లో ఆ వంట తాలూకు శాంపిల్ కూడా దొరకదు, పబ్లిసిటీ కూడా వుండదు. ఆ వంటతను వండి పెట్టనంత వరకూ ఆ వంటకం రుచే, రూపు రేఖలే తెలీవు ఆమెకి. పరీక్షా హాల్లోకి వెళ్ళే వరకూ ప్రశ్నాపత్రం ఎలా వుంటుందో  తెలీనట్టూ, ఆ వంటతను వండి పెట్టాకే రుచి చూసి- అపుడు అన్ని ప్రోగ్రాముల్లో  ఒకే ఎక్స్ ప్రెషన్ తో, ఒకేలాంటి  డైలాగుతో  -అబ్బ,  ఎంతబావుందో-  అంటుంది. ఇంతకి  మించి  వాళ్లకి వేరియేషన్స్ వుండవు. అన్ని వంటల రుచికీ  ఒకటే  లైబ్రరీ షాట్ కామెంట్ -కం -ఎక్స్ ప్రెషన్ ఇంటర్ ప్లే. అలాటి యాంకర్స్ జీవితంలా వుండాలి రైటర్స్ జీవితం. వంట చేస్తూంటే- ఈయన  బాగా వండుతున్నాడు, దీని గురించి నేను బాగా చెప్పాలి-  అని ఏ యాంకరూ అనుకోదు బహుశా. కానీ సినిమా చూస్తూ - మా హీరో సార్  బాగా నటించేస్తున్నారు, సినిమా చాలా బావుంది- అనే భజన  భక్తి భావంతో రైటర్ నిరభ్యంతరంగా అనుకోవచ్చు. అతడిష్టం. దీంతో ప్రత్యక్ష ప్రమాణం మాత్రం ఏర్పడదు. అది ముందు ఏర్పరచుకున్న అభిప్రాయంతో అనుపలబ్ది (non - perception) ప్రమాణం అవుతుంది.

        ప్రత్యక్ష ప్రమాణం వర్కౌట్ అవాలంటే- దాని ప్రయోజనాల గొప్ప తెలియాలంటే- చూడబోయే సినిమా గురించి పబ్లిసిటీకి కళ్ళూ చెవులూ మూసుకుని, జీరో నాలెడ్జితో, ఒక ఏమీ తెలీని అమాయకుడిలా రైటర్ వెళ్లి సినిమాలు చూడాలి. జీరో నాలెడ్జి ఎందుకంటే, రైటర్ ఒక హీరోకో, నిర్మాతకో, దర్శకుడికో కథ చెప్పబోయే ముందు వాళ్ళా కథ గురించి జీరో నాలెడ్జి తోనే , ఫ్రెష్ మైండ్ తోనే  వుండి వింటారు కాబట్టి.  అలాటి జీరో నాలెడ్జితో, ఫ్రెష్ మైండ్ తోనే  రైటర్ కూడా సినిమాలు చూడాలని కమిటవాలి. ప్రేక్షకులు పబ్లిసిటీ చూసి పూర్తి నాలెడ్జితో బుద్ధిపూర్వకంగా  సినిమాల కెళ్తే, రైటర్ అప్పుడే  బస్సు దిగి సిటీ చూస్తున్న పల్లెటూరి వాడిలా, జీరో నాలెడ్జితో యాంత్రికంగా వెళ్ళాలి. థియేటర్ దగ్గరి కెళ్లి సినిమా చూసి వస్తున్న ప్రేక్షకులతో, - సినిమా ఎలా వుంది బాబూ- అని  ఎగ్జిట్ పోల్ సర్వే  కూడా నిర్వహించకూడదు. ఎర్లీ మార్నింగ్ బెనిఫిట్ షో అవగానే రిజల్ట్ కోసం ఆదరాబాదరా ఫోన్లు కూడా చేయకూడదు- అది తన కథతో వచ్చిన సినిమా అయితే తప్ప. ఇక చూడదల్చుకోని చిన్నా చితకా సినిమాలతో ఈ నిషేధాలు  అవసరమే  లేదు. 


       సినిమా ట్రైలర్స్ కూడా కథ తెలిసిపోయే విధంగా ఉంటున్నాయి. లేదా ఫలానా టైపు సినిమాగా  తెలిసిపోయేట్టు ఉంటున్నాయి. ట్రైలర్స్ అన్నీ ఆ సినిమాలో  హీరో చుట్టే  వుంటాయి. హీరో పంచ్  డైలాగ్- ఒక ఫైట్- ఒక పాట. ఒక్కో పంచ్ డైలాగుతో ఒక్కో ట్రైలర్ విడుదల చేస్తూంటారు. ఇవి వినీ వినీ థియేటర్ కి వెళ్లి చూసేసరికి ప్రేక్షకులకి ఏం థ్రిల్ మిగిలి వుంటుందో గానీ, రైటర్లు సర్ప్రైజ్ లిమెంట్ ని కోల్పోతారు. కథాగమనంలో వచ్చే డైలాగులు అప్పటికప్పుడు ఆ ప్యాకేజీలో- దాని నేపధ్యంతో పాటు కలిపి  చూసి- అక్కడి కక్కడే  ఎలా వర్కౌట్ అయ్యిందో గమనించడం వేరు, విడిగా ముందే డైలాగులు  వినీవినీ ఒక అభిప్రాయంతో వెళ్లి కథాగమనంతో పాటూ చూసి ఆ డైలాగు వర్కౌట్ అయిన విధం  పసిగట్టడం వేరు. ‘షోలే’ లో ఒక అమ్జాద్ ఖాన్ డైలాగులో, ‘ముత్యాలముగ్గు’ లో ఒక రావుగోపాలరావు డైలాగులో బయట ఎన్నెన్ని సార్లు విన్నా, తెర మీద మళ్ళీ మళ్ళీ చూడాలన్పించడానికి కారణం- ఆ డైలాగులకి దడి కట్టిన అత్యుత్తమ పాత్ర చిత్రణలు, వాటి అనితరసాధ్యమైన డ్రమెటిక్ నేపధ్యాలూ.  రైటర్లు ఎన్ని లక్షల సార్లు ఈ డైలాగులు విన్నా, సినిమా చూసినప్పుడల్లా ఒక్కో కొత్త కోణం, ఒక్కో కొత్త భావం స్ఫురిస్తూనే వుంటుంది తప్పకుండా. 

        హాలీవుడ్ సినిమాల ట్రైలర్స్ కి  సాధారణంగా ఒక పద్ధతిని అవలంబిస్తారు. అవి స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ లాగే వుంటాయి. బిగినింగ్ లోంచి హీరో ఎవరో తెలిపే కొన్ని కట్స్, మిడిల్లోంచి హీరో ఎదుర్కొనే సమస్యలోంచి కొన్ని కట్స్, చివర ఎండ్ లోంచి చాలా ఎక్సైటింగ్ యాక్షన్ కట్సూ తీసుకుని,  గొప్ప సస్పన్స్ నీ, ఇంటరెస్ట్ నీ  క్రియేట్ చేస్తారు-  
వీటిని ఫాలో అవుతూ మూడు ఆడియో, విజువల్, వెర్బల్ క్యూస్ (సంకేతాలు) తో సినిమా చూడాలన్న ఆత్రుత, ఆందోళనా  ఇంకా  పెంచేస్తారు. వాళ్ళు విషయపరంగా  ఆడియెన్స్ ని టీజ్ చేస్తారు, తెలుగులో కేవలం  హీరో విన్యాసాల పరంగా టీజర్స్ చూపిస్తారు.
  
        సినిమా చూస్తున్నప్పుడు ‘విషయం’  ఎలాగెలా రివీల్ అవుతూ ఎక్కడెక్కడ ఎలాగెలా   ఆసక్తిరేపే బీట్స్ తో వర్కౌట్ అయిందో,  రైటర్ ఒక ఉత్పత్తి దారుడి మెంటాలిటీ తో  ఫస్ట్ హేండ్ నాలెడ్జి తో గమనించాలంటే, ముందు నుంచీ పబ్లిసిటీ కి ఏమాత్రం ఎక్స్ పోజ్ కాకూడదు.

‘24’ అనే గతవారం విడుదలైన సూర్య నటించిన  సైన్స్ ఫిక్షన్ సినిమా  విషయంలో, ఈ వ్యాసకర్త ఈ ప్రయోగాన్నే దృష్టిలో పెట్టుకుని, సినిమా గురించి జీరో నాలెడ్జితో  పరీక్షకెళ్ళే విద్యార్థిలా వెళ్లి చూస్తే. ఒక కొత్త అనుభవం ఎదురయ్యింది- ఇంతకాలంగా  సినిమాలు చూస్తూ వస్తున్న తీరుతో అనుభవం వేరు, ఇప్పుడు వేరు. ఇంతకాలం ముందుగానే  సినిమా గురించిన  సమాచారం మెదడు కెక్కించుకుని చూడ్డంవల్ల యాంత్రికంగా చూసినట్టు అన్పిస్తే, ఇప్పుడు ఏమీ తెలుసుకోకుండా చూస్తూంటే ఎడిటింగ్ టేబుల్ దగ్గరో, ఫస్ట్ కాపీ వచ్చినప్పుడో, ఇంకెలాటి మీడియా ఓవర్ లోడ్ ప్రారంభం కాకముందే ఒరిజినాలిటీతో చూస్తున్న ఫీలింగ్.  

DISTRACTED? NO WORRIES!  Courtesy: www.fulfilmentdaily.com

 ఒక్క సైన్స్ ఫిక్షన్ అని మాత్రమే ఈ సినిమా గురించి తెలుసు తప్ప, ఇందులో సూర్య ది త్రిపాత్రాభినయమని కూడా తెలీదు. విషయమేమేటో  ప్రత్యక్ష ప్రమాణంతో మనం తెలుసుకుని ఆ మంచీ చెడ్డలు అనుభవించాలి తప్ప, ఇతరత్రా తెలుసుకున్న ఉపమాన ప్రమాణం (comparison- perception) ముందు పెట్టుకుని, పోల్చుకుంటూ సెకెండ్ హేండ్ విశ్లేషణ చేసుకోవడం తగదని తెలిసొచ్చింది. ముందు తెలుసుకున్న సమాచారం ఏమీ లేకపోవడంతో,  ఫ్రెష్ గా ఏకాగ్రత అంతా చెక్కుచెదరకుండా చూస్తున్న సినిమా మీదే కేంద్రీకృతమై వుంది. దీని ఏ ట్రైలర్ లోని విజువల్సూ అడ్డు పడలేదు. దీని ఏ ఆడియో పాటా గుర్తుకు రాలేదు. అంతా ఎలైస్ ఇన్ వండర్ లాండ్ లాంటి ప్రపంచం. త్రిపాత్రాభినయమనీ తెలీదు, ‘24’ అంటే అర్ధమేమిటో ఏమిటో తెలీదు, విజువల్స్ ఎలా ఉంటాయో తెలీదు, పాటలెలా ఉంటాయో తెలీదు...ఏమీ తెలీదు! ఇప్పుడే ప్రత్యక్ష ప్రమాణంతో తెలుసుకోవవడం. అప్పుడప్పుడు దర్శకులు తాము రాసుకున్న కథలు విన్పిస్తూంటారు. వాటి గురించి ముందుగా మనకేమీ తెలీదు. చెప్తున్నప్పుడే తెలుస్తూంటుంది. ఫలానా అతను  ఫలానా ఈ విధంగా వున్న కథ చెప్తాడు,  వినండి-  అని ఎవరైనా అంటే, ఓహో అలాటి కథా అనే అంచనానో అభిప్రాయమో ముందుగానే మనకేర్పడిపోతుంది. అతను కథ చెప్తున్నప్పుడు చెప్తున్నదాంతో ముందుగా ఏర్పడ్డ ఇంప్రెషన్ అడ్డుతగులుతూ తులనాత్మక పరిశీలనకి  దారి తీస్తూ వుంటుంది. ఇదే వద్దనేది.

రైటర్ అనేవాడు ఎలాటి ఇన్ పుట్స్  లేకుండా సినిమాలు చూస్తూంటే, తను నిర్మాతకో దర్శకుడికో హీరోకో కథ చెప్తూ, తన కథ గురించి ముందుగా ఏమీ తెలీని వాళ్లకి ఎలాటి థ్రిల్లో నిల్లో కలిగించగలడో, సరీగ్గా అలా తను సినిమాలు చూస్తున్నప్పుడూ అలాటి ఒరిజినాలిటీతో థ్రిల్లో నిల్లో  వినియోగదార్లయిన ప్రేక్షకులకంటే ఉత్పత్తి దారుగా ఎక్కువ ఫీలవగలడు. 

        అలా చూసిన సినిమాలకి నోట్స్ రాసి పెట్టుకుంటే అవే వాటి ఫస్ట్ హేండ్ ఇన్ఫర్మేషన్ గా తర్వాత రాస్తున్న కథలకి రిఫరెన్సుగా ఏర్పడతాయి. మరొకటేమిటంటే, ఇలా ప్రత్యక్ష ప్రమాణాన్ని దృష్టిలో పెట్టుకుని సినిమాలు చూస్తూంటే, రాసుకుంటున్న స్క్రిప్టు మీద కూడా ఇంకా దేని ప్రభావమో పడకుండా ఒరిజినాలిటీతో, సొంత బ్రాండింగ్ తో తొణికిస లాడుతుంది. స్వావలంబన చేకూరుతుంది. ఎవర్నో గురువుగానో, గైడ్ గానో పెట్టుకునే అవసరమే వుండదు. రైటర్స్ కి గురువులూ గైడ్సూ వుండరు, ఎందుకంటే 
వాళ్ళే సమాజానికి గురువులూ  గైడ్సూ  కాబట్టి!

-సికిందర్

PS. ఇప్పటికీ ఈ వ్యాస కర్తని అడుగుతూంటారు- ఆ సినిమా టీజర్ చూశారా, ఈ సినిమా ట్రైలర్ చూశారా అని. చూడలేదంటే విచిత్రంగా చూస్తారు. ఆ మధ్య ఒక వెబ్సైట్ కి టీజర్ రివ్యూలూ, ట్రైలర్ రివ్యూలూ రాయాల్సి వచ్చినప్పుడు చూడడమే తప్ప, మళ్ళీ ఎప్పుడూ చూడలేదు. సినిమాలు చూసేముందు ఏ రివ్యూలూ చదవలేదు, టాక్ ఏమిటో తెలుసు
కోలేదు. మనకి అనవసరం. ఎవరేమనుకున్నా ఏమీ తెలీని అజ్ఞానిలా జీరో నాలెడ్జితో వెళ్లి ప్రత్యక్ష ప్రమాణంతో చూడ్డమే అవసరం!
(2.7.20)