రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

17, డిసెంబర్ 2016, శనివారం

రివ్యూ!



దర్శకత్వం : ఇ. సత్తిబాబు
తారాగ‌ణం: పృథ్వీ, నవీన్‌చంద్ర, సలోని, శృతిసోధి, సన, జయప్రకాష్‌ రెడ్డి, పోసాని కృష్ణమురళి, మురళీశర్మ, రఘుబాబు, ప్రభాస్‌ శ్రీను, ధన్‌రాజ్‌ తదితరులు
కథ, మాటలు: నాగేంద్రకుమార్‌ వేపూరి, కథా విస్తరణ: విక్రమ్‌రాజ్‌, డైలాగ్స్‌ డెవలప్‌మెంట్‌: క్రాంతిరెడ్డి సకినాల, సంగీతం: శ్రీవసంత్‌, ఛాయాగ్రహణం: పి. బాల్‌రెడ్డి, బ్యానర్ : శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్‌
నిర్మాత: కె.కె.రాధామోహన్‌
విడుదల : 16-12-2016
***

         
క్యారెక్టర్ ఆర్టిస్టు పృథ్వీని హీరోగా చేస్తూ ఆయన శైలిలో కామెడీ తీశారు. పృథ్వీ అంటే పేరడీలకి ప్రసిద్ధి కాబట్టి మరోసారి ఆ కోణాన్ని చూపెడుతూ వెరైటీగా సినిమాలో సినిమా చూపించారు. ఈవీవీ శిష్యుడు, అరడజను సినిమాలు తీసిన దర్శకుడు ఇ. సత్తిబాబు దీని రూపకర్త. ‘అధినేత’, ‘బెంగాల్ టైగర్’ లవంటి ఐదు సినిమాలు తీసిన కేకే రాధా మోహన్ నిర్మాత. ‘మర్యాదరామన్న’ ఫేమ్ సలోని హీరోయిన్. టైటిల్ వచ్చేసి ‘మీలో ఎవరు కోటీశ్వ రుడు’. ఇలా అనేక ఆకర్షణలతో ప్యాకేజీ చేసిన ఈ తాజా కమర్షియల్లో తాజాదనమెంత? సినిమాలో సినిమా చూపించాలన్న  వెరైటీ ఆలోచన ఎంతవరకు ఫలించింది? హీరోని వేరియే షన్ స్టార్ అంటూ కామెడీ చేసిన ఈ పేరడీలో ఎంటర్ టైన్మెంట్ ఎంత? ఇవన్నీ ఈ కింద తెలుసుకుందాం.
 

కథ 

     రాత్రి పూట తాగి రోడ్డున పడ్డ తనని ఏమీ చేయకుండా ప్రశాంత్ (నవీన్ చంద్ర) అనే అతను క్షేమంగా ఇంటిదగ్గర దిగబెట్టాడని తెలుసున్న ప్రియ (శృతీ సోధి), తనని అతనేమీ చేయకపోవడం తన ఆడతనానికే అవమానంగా భావించుకుని అతడి వెంట పడుతూంటుంది – తనని ఏమైనా చెయ్యమని రెచ్చగొడుతూ. ఆమె డబ్బు గలది. అతను సామాన్యుడు. చదువుకుంటున్న అతను  ఆమెని దూరం పెడుతూంటాడు. ఒకానొక సందర్భంలో ఆమెని ప్రేమించడం మొదలెడతాడు. కానీ అంతస్తుల తేడాలు చూపించి సంపన్నుడైన ఆమె తండ్రి ఏబీఆర్ (మురళీ శర్మ) పెళ్ళికి తిరస్కరిస్తాడు. అప్పుడు డబ్బుతో శాశ్వత ఆనందం లభించదని, తాత్కాలిక సంతోషమే లభిస్తుందనీ - ఓడి గెలిచిన వాడికే ఆనందం అంటే ఏమిటో అర్ధమవుతుందనీ తన ఐడియాలజీ విన్పిస్తాడు ప్రశాంత్. విన్పించి, ఏదైనా వ్యాపారం చేసి నష్టపోతే మీకే తెలుస్తుందంటాడు. దీంతో ఆలోచనలో పడ్డ ఏబీఆర్, కొత్త వ్యాపారం పెట్టి నష్టపోవడానికి సిద్ధపడి- అలాటి నష్టపోయే ఐడియా ఇచ్చిన వాళ్లకి కోటి రూపాయలు బహుమతి ప్రకటిస్తాడు. తాతారావు (పోసాని) అనే సినిమాలు తీసి నష్టపోయిన నిర్మాత ఈ అవకాశాన్ని కొట్టేస్తాడు. ఒక దరిద్రగొట్టు  దర్శకుడు రోల్డ్ గోల్డ్ రమేష్ (రఘుబాబు) అనే వాడితో పది కోట్లతో సినిమా తీస్తే,  పూర్తిగా నష్టపోవడం ఖాయమన్న ఇతడి ఐడియా ఏబీఆర్ కి నచ్చి,  సినిమా తీయించడం మొదలెడతాడు. తాతారావు- రమేష్ లు కలిసి చిన్న చిన్న వేషాలేసుకునే వీర బాబు (పృథ్వీ) ని వేరియేషన్ స్టార్ గా పరిచయం చేస్తూ, సమంత (సలోని) ని హీరోయిన్ గా తీసుకుని సినిమా తీసి విడుదల చేస్తారు. ఆ సినిమా ఏమిటి? అది తీసి ఏబీఆర్ నష్టపోయడా? లాభాలార్జించాడా? ప్రశాంత్ చెప్పిన ఆనందం ఎలా పొందాడు? కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానన్నాడా లేదా?...అన్నవి మిగతా కథలో తెలిసే  అంశాలు.  
ఎలావుంది కథ?
       డబ్బున్న వాడిదగ్గర ఆనందం ఉండదనీ, కేవలం తాత్కాలిక సంతోషమే వుంటుందనీ, డబ్బు లేనివాళ్ళు మాత్రమే ఆనందంతో హాయిగా జీవిస్తారన్న ఒక మూఢ విశ్వాసం హీరో చేసే సమర్ధింపుగా ఈ కథకి మూలం. కానీ మనం ఆలోచిస్తే ఇది తిరోగమన వాదమని ఇట్టే అర్ధమైపోతుంది. ఎలాగంటే, ఇలాటి  మూఢ విశ్వాసంతో పేదవాళ్ళు పేదవాళ్ళుగానే వుండి పోతారు. వాళ్ళ దృష్టిలో డబ్బు పాపిష్టిది గానే వుండిపోతుంది. డబ్బు (లక్ష్మి) పాపిష్టిది కాదు, కేవలం డబ్బుతో వ్యవహరించే కొందరు మనుషులే పాపిష్టి వాళ్ళు కావొచ్చు. అలాకూడా మనుషుల్ని జడ్జి చేయకూడదు. డబ్బుతో ముడి పెట్టి మనుషుల్ని నెగెటివ్ గా జడ్జి చేసినంత కాలం ఆ డబ్బు (లక్ష్మి) మన దగ్గరికి కూడా రాదు. ఆర్ధిక సంస్కరణల పుణ్యమా అని దేశం ఆర్ధికంగా కళకళ లాడుతున్న వేళ నోట్ల రద్దుని అడ్డుపెట్టుకుని, ఒక నంబర్ వన్ జాతీయ ఆంగ్ల ఛానెల్ ‘డర్టీ క్యాష్’ అంటూ డబ్బుని తిట్టడం మొదలెట్టింది. చాలా అధ్వాన్నంగా ఉంటోంది డబ్బుని అర్ధం జేసుకోవడం. సమస్య మనుష్యుల్లో వుంటే, డబ్బుని చూపించి ఇలాటి కథలు చేయడంవల్ల –చివరికి చెప్పాలనుకున్నది కూడా స్పష్టంగా చెప్పలేకపోతారు- ఈ కథలో లాగే. చివరికి డబ్బుగల ఏబీఆర్ పాత్రకి ఆనందం ఎలా లభించిందో మనకి అర్ధంకాని విధంగా చెప్పి ముగించారు. అతను హీరో చెప్పిన ఆనందాన్ని అర్ధంజేసుకోవడం పోయి, అతణ్ణి ప్రేమిస్తున్న కూతురి ప్రేమని అర్ధం జేసుకున్నట్టుగా  తయారయ్యింది కథ. 

ఎవరెలా చేశారు 
      పృథ్వీ తన ట్రేడ్ మార్క్ నటనే కనబర్చాడు. అయితే బయట వీరబాబుగా, సినిమాలో మహేష్ బాబు పాత్రగా వేరియేషన్ చూపించి వుంటే బావుండేది. స్టార్స్ ని అనుకరిస్తూ డైలాగులు కొట్టే ఫార్మాలిటీని ఇంకోసారి మొక్కుబడిగా పూర్తి చేశాడు. మహేష్ పాత్రగా తాను జ్యూనియర్ ఇంటర్ చదవడమన్నది- నాటి హీరోల మీద మంచి సెటైరే. ఆ వయసులో స్టూడెంట్ గా నటించడమన్నది తెలుగు హీరోలకి ఒకప్పుడు అలవాటే. కాకపోతే ఇక్కడ మైనం పాటి భాస్కర్ రాసిన సెటైర్ గుర్తొచ్చేలా వుంది పృథ్వీ మహేష్ బాబు పాత్ర ఎంట్రీ. ఇరవై ఏళ్ల క్రితం మైనంపాటి భాస్కర్ రాసిన సెటైర్లో,  యాభై ఏళ్ల తెలుగు హీరో ఇంట్లోకి పిల్ల మొగ్గేసి తల్లిని కావిలించుకుని- ‘అమ్మా నేను బియ్యే పాసయ్యా!’ అంటాడు. పృథ్వీ కూడా ఇంట్లోకి జంప్ చేసి-  ‘అమ్మా నేను టెన్త్ పాసయ్యా!’ అంటాడు!!

        పృథ్వీ టీనేజి హీరోగా నటించే సినిమా టైటిల్ ‘తమలపాకు’. తండ్రిగా తిట్టి కొట్టే పాత్రలో జయప్రకాష్ రెడ్డి  ఉంటాడు. వీళ్ళిద్దరూ పాత సినిమాల్లోని అతి డ్రామాని ప్రకటిస్తారు. పృథ్వీ సరిగ్గా చదువుకోడం లేదనో, హీరోయిన్ వెంట తిరుగుతున్నాడనో జయప్రకాష్  రెడ్డి చావగొట్టినప్పుడల్లా-  ‘ఒక్కగానొక్క  చిన్న కొడుకండీ’ అంటూ తల్లిపాత్ర చేసే ఓవరాక్షన్ కూడా మంచి సెటైరే పాత సినిమాల మీద (ఈ కాలంలో యూత్ సినిమాల పేరుతో  ఇంకా వస్తున్న ‘నాన్న- నేను- నా బాయ్ ఫ్రెండస్’ లాంటి పాత డ్రామెడీలకి కూడా సెటైర్లు ఈ చిత్రణలు).  

       
కానీ పృథ్వీ ఇటీవల ‘మనవూరి రామాయణం’ లో నటించినంత ప్రతిభావంతంగా నటించి ఇక్కడ ముద్ర వేయలేకపోయాడు. కారణం, ఒక విజన్ లేకుండా ‘తమలపాకు’ సినిమాకథా కథనాలు సాగడమే. పోతే చాలాకాలం తర్వాత సలోని కన్పించింది గానీ ఆమె పాత్రకూడా కృతకమే. ఇక పోసాని- రఘుబాబులది భరించడం కష్టమైపోయే కామెడీ. ఎందుకు వీళ్ళిద్దరు అంత  గొంతు చించుకుని అరుస్తూ మాట్లాడతారో అర్ధంగాదు. ప్రేక్షకులు చెవిటి వాళ్లనా? వీళ్ళ వాయిసులు నరాల మీద సుత్తి మోతలు. జయప్రకాష్  రెడ్డి గొంతు అయితే పక్కా శబ్దకాలుష్యమే. ఇలా శబ్ద సౌందర్యం లేకుండా డబ్బింగులు చేస్తే ఏదో చీప్ క్వాలిటీ  సినిమా చూస్తున్నట్టు వుంటుంది. నిర్మాత రాధామోహన్ ఇదివరకు కాస్త సాంకేతిక విలువలున్న సినిమాలు తీసిన వాడే. 

        మురళీ శర్మ  సీన్స్ ని రక్తి కట్టించగలడు గానీ, ఆ పాత్రకి దర్శకుడు న్యాయం చేయగలగాలి. అదిక్కడ జరగలేదు. చివరికి హీరో ఫిలాసఫీని ఏమర్ధం జేసుకున్నాడో తెలీదు. తను చెత్తగా తీసి నష్టపోవాలనుకున్న సినిమా తనకే  గొప్పగా ఏదో నేర్పిందనుకుంటాడు- ఏమిటది? మనకైతే అర్ధంగాలేదు. బిజినెస్ లో నష్టపోయి, ఆ నష్టంలోంచి బిజినెస్ ని లాభాల బాట పట్టిస్తే, ఆ విజయం ఇచ్చే ఆనందం అసలైన ఆనందమని, అది కలకాలం వుంటుందనీ హీరో ఫిలాసఫీ (?) గా మనం అర్ధం జేసుకోవాలి. దీని ప్రకారం మురళీశర్మ పాత్రకి ముగింపు లేదు. తను తీసిన ‘తమలపాకు’ సినిమాలో హీరోయిన్ కి హీరో కిడ్నీ దానమిచ్చి బతికించుకుంటే- అది ధనిక పేదా తేడాల్ని తుడిచి పెట్టేసిందని ఫీలైపోయి, కూతురి పెళ్ళికి ఎస్ అనేస్తాడు. దీనికీ హీరో ఎంకరేజి చేసిన ఫిలాసఫీకీ సంబంధమేమిటి?

        పైగా హీరో చివరికి- ఆ సినిమా కథ తానే రాసి ఇచ్చానని ట్విస్ట్ ఇస్తాడు. ఇది మరీ చోద్యంగా వుంది. మురళీ శర్మ ఏదో చెత్త సినిమా తీసి నష్టపోవాలనుకుంటే, అది హీరో ఫిలాసఫీ ప్రకారం కరెక్టే అనుకుంటే, హీరో గొప్ప కథ ఇచ్చి మురళీ శర్మ కళ్ళు తెరిపించాలనుకోవడ మేమిటి తన ప్రేమకోసం? చక్కగా ఏ టైటానిక్కో, లైలా మజ్నూనో, మరో చరిత్రనో చూపించి కళ్ళు తెరిపిస్తే సరిపోతుంది కదా? సంతోష ఆనందాల వేరియేషన్స్ చెప్పి మురళీ శర్మని అంత శ్రమ పెట్టడమెందుకు? మురళీ శర్మ నేర్చుకోవాల్సింది ఒకటైతే, సోషలిజం నేర్పడమేమిటి?

        హీరోగా నవీన్ చంద్రది నామమాత్రపు పాత్ర. నటన కూడా ఏమీ మార్పు లేకుండా అదే చాలా పూర్ నటన. అసలున్నాడో లేడో అన్నట్టుంటాడు ఈ సినిమాలో కూడా. ఇక హీరోయిన్ శృతీ సోధిలో అతిగా నార్త్ ఇండియన్ నెస్ నేటివిటీకి చెల్లుచీటీ రాసేసింది. సాంకేతిక విలువలూ సంగీత సాహిత్యాల గురించి చెప్పుకోవాల్సిందేమీ లేదు. 

చివరికేమిటి?
        థ, స్క్రీన్ ప్లే, మాటలే కాకుండా, మళ్ళీ కథా విస్తరణ, డైలాగ్స్ డెవలప్ మెంట్ అంటూ రాత పనిని ఇంత విభజించుకుని కూడా,  ఇందరూ  కలిసి అసలు కాన్సెప్ట్ ని రీసెర్చి చేసినట్టు కన్పించడం లేదు. ఫలానా ఈ కాన్సెప్ట్ తో ఏఏ సినిమాలు వచ్చాయో పరిశీలించుకున్నట్టు లేదు. సినిమాలో ‘తమలపాకు’ అనే ఇంకో సినిమా చూపించాలనుకోవడం బాగానే వుంది. ఆ ‘తమలపాకు’ చెత్త సినిమాగా తీస్తున్నారు కాబట్టి హాస్యాస్పదంగా అవే పాత – కాలం చెల్లిన పాత్రలూ –కథా- సన్నివేశాలూ  కలిపికొట్టి ప్రేక్షకుల మీద రుద్దితే, కోరుకున్న అట్టర్ ఫ్లాపు వస్తుందనుకోవడం మంచి అయిడియాతో కూడిన కాన్సెప్టే.  పనిలోపనిగా సినిమాలమీద, సినిమా రంగం మీదా సెటైర్స్ కూడా వేసుకోవచ్చు. కానీ ఇది వర్కౌట్ కాలేదు. కారణం, అసలీ కాన్సెప్ట్ ని ఎలా ప్రెజెంట్ చేయాలో గ్రహించకపోవడం.

          విద్యా బాలన్- నసీరుద్దీన్ షా లతో ‘డర్టీ పిక్చర్’ తీశారు. అది ఏనభై లనాటి సిల్క్ స్మిత జీవితం ఆధారంగా తీశారు. ఆనాడు సినిమాలు ఎలా తీసేవాళ్ళో, వయసు మళ్ళిన హీరోలు హెవీ మేకప్పులేసుకుని, విచిత్ర కాస్ట్యూమ్స్ వేసుకుని,  ఎలా గెంతే వారో;  అప్పటి పాటలూ మ్యూజిక్ (బప్పీ లహరీ టైపులో) ఎలావుండేవో, హీరోయిన్ల కట్టుబొట్టు ఎలా ఉండేవో- నవ్విస్తూ అచ్చు గుద్దినట్టు తీసి అవతల పడేశారు. పెద్ద హిట్ చేశారు నేటి కాలపు ప్రేక్షకులు కూడా. అలాటి వయసుమళ్ళిన ఓవరాక్టింగ్ హీరోగా నసీరుద్దీన్ షా ఎలా ఉన్నాడో పృథ్వీ చూసివుంటే, లేదా అప్పటి హీరోయిన్ గా- డాన్సర్ గా - విద్యాబాలన్ ఎలా వుందో సలోని  చూసివుంటే- మొత్తంగా టీం అంతా ఈ సినిమా చూసి వుంటే,  ఈ కాలానికి ఆ కాలపు సినిమా చూపిస్తూ గతాన్ని గొప్పగా రీక్రియేట్ చేసి వుండేవాళ్ళు. క్రియేటివిటీ అనేది సినిమాలో సినిమా చూపిస్తున్నాం కాదా అనుకోవడం దగ్గరే ఆగిపోయిందిక్కడ. ఎలా క్రియేట్ చేయాలనే దాని  గురించి ఇన్నోవేషన్ లేదు- అదీ సమస్య. మొదటి అరగంట హీరో హీరోయిన్ల ప్రేమట్రాకు పసలేని పరమ బోరు. అరగంట తర్వాత మురళీ శర్మ  ఐడియా కోసం ప్రకటన  ఇచ్చే ప్లాట్ పాయింట్ వన్ తో మనకి కొత్త హుషారు వస్తుంది గానీ, అది పోనుపోనూ శిరోభారంగా పరిణమిస్తుంది...


-సికిందర్ 
cinemabazaar.in

12, డిసెంబర్ 2016, సోమవారం

ఆనాటి సినిమా!






దర్శకత్వం : కోడి రామకృష్ణ 

తారాగణం : డాక్టర్ రాజశేఖర్. జీవిత, ఎంఎస్ రెడ్డి, రామి రెడ్డి, బాబూమోహన్, ప్రసాద్ బాబు తదితరులు 
కథ : ఎం. ఎస్. ఆర్ట్ మూవీస్ యూనిట్, సంగీతం : సత్యం, చాయాగ్రహణం : కె. ఎస్. హరి
బ్యానర్ : ఎం. ఎస్. ఆర్ట్ మూవీస్,
నిర్మాత : ఎం. శ్యాం ప్రసాద్ రెడ్డి
విడుదల : 1990
***
         స్టార్ డమ్ దానికదే వరించాలి, వేరే తయారీ విధానం లేదు దానికి. 
          స్ట్రగుల్ చేసే హీరోలు హీనపక్షం స్టార్ గా  రూపాంతరం చెందాలంటే ఏదో అనుకోని ప్రమాదం జరగాలి. ఇలా అనుకుని స్టార్స్ అయిన చరిత్ర లేదు గనుక, అనుకోకుండా అయిన ఆశ్చర్యాలే వున్నాయి.
           అలాంటి ఒక ఆశ్చర్యం అమితాబ్ బచ్చన్, ఇంకో ఆశ్చర్యం రాజ శేఖర్.
          1973 లో సలీం - జావేద్ లు వాళ్ళ క్రియేటివిటీ కొద్దీ ఓ యాంగ్రీ యంగ్ మాన్ పాత్రకి పోలీసు యూనిఫాం తొడిగి ‘జంజీర్’ అనే స్క్రిప్టు రాస్తే, ఆ పాత్ర వేసిన అమితాబ్ బచ్చన్ అనే ఓ స్ట్రగుల్ చేస్తున్న ఛోటా హీరో, అమాంతం స్టార్ అయిపోయాడు. ఆ పైన సూపర్ స్టార్ డమ్ ని కూడా సాధించేశాడు

         
స్టార్ కావడమనేది ప్యూర్ యాక్సిడెంటల్. అమితాబ్ అయినా, రాజశేఖర్ అయినా యాక్సిడెంటల్  స్టార్సే. కాకపోతే అమితాబ్ కి పనికొచ్చిన ‘జంజీర్’ ఫార్ములాని  ఉద్దేశపూర్వకంగా రాజశేఖర్ కి అప్లై చేయలేదు. యదాలాపంగా ‘అంకుశం’ అనే ఓ పోలీసు మూవీ తీస్తే ఆయన స్టార్ అయి కూర్చున్నాడు. పవర్ ఫుల్ పోలీసు పాత్రలో మలయాళం లో సురేష్ గోపీ స్టార్ అవుతాడని  వూహించి ‘ఏక లవ్యన్’ తీయలేదు. అలాగే తమిళంలో ‘కాక కాక’ తో సూర్య సంగతి కూడా. 

          యాక్సిడెంటల్  మాటెలా వున్నా, పోలీసు పాత్రలతో అమాంతం స్టార్లయిన నట చతుష్టయం - అమితాబ్, రాజశేఖర్, సురేష్ గోపి, సూర్యలే! పోలీస్ పాత్రల్ని ఫేమస్ చేసిన ఓంపురి (అర్ధ సత్య), సాయికుమార్ (పోలీస్ స్టోరీ) లది వేరే కేటగిరీ.

          మూడో నాల్గో విషాదకర బాల్యపు దృశ్యాలు, ఓ యాంగ్రీ యంగ్ మాన్ ఫేసు, ఫ్రెష్ పోలీసు యూనిఫాం ఒకటి, వ్యక్తిగత సమస్య లేదా సామాజిక రుగ్మత ఒకటి, యాక్షన్ కి సరిపడా విలన్లు కొందరు, పవర్ఫుల్ డైలాగులు చాలినన్ని, ఎమోషనల్ సీన్లు నాల్గైదు మోతాదులు, ఓ పెద్ద సీసాడు రివెంజి సీను, ఓ బుట్టెడు తుపాకులూ తూటాలూ- ఇవి చాలు పవర్ఫుల్ పోలీస్ పాత్రని పరివేష్టించి వుండి వెండి తెర మీద క్షణక్షణం జ్వాలలు రగిలించెయ్యడానికి. 

          1985 లో ‘వందేమాతరం’ తో యాక్టరైన డాక్టర్ రాజశేఖర్, 1990 లో ‘అంకుశం’ సంచలన విజయంతో స్టారయ్యాక, అదే పోలీసు పాత్ర మీద మక్కువ చావక ‘ఆహుతి’, ‘ఆగ్రహం’, ‘మగాడు’  చేస్తూ పోయారు.

         ఎమ్మెస్ రెడ్డి , శ్యాం ప్రసాద్ రెడ్డి, కోడి రామకృష్ణలు కలిసి ‘అంకుశం’ తీసిన ఉద్దేశం వేరు. నిజ జీవితంలో నీతీ నిజాయితీలు ఓడిపోతున్నాయనీ, దీన్ని హైలైట్ చేయడానికే ఈ సినిమా తీశామనీ కోడి రామకృష్ణ ఉద్ఘాటన. అలా ఈ సినిమా 1989 లో ‘శివ’ తర్వాత మరో విప్లవాత్మక మార్పు. ఇది కేవలం రగిలిన పోలీసు గుండె కథలాగా వుండి పోలేదు, ఆ కథని కొత్త పంథాలో బిగిసడలని దర్శకత్వపు విలువలతో దౌడు తీయించిన టాలెంట్ షోగా కూడా చరిత్ర కెక్కింది. దీనికి మచ్చు తునక ఆ వొక్క సీను- రామిరెడ్డిని రాజ శేఖర్ అరెస్టు చేయడాని కొస్తాడు. రామిరెడ్డి ఎదురు తిరుగుతాడు. అతడి మెడ బట్టి చార్మినార్, అసెంబ్లీ, ట్యాంక్ బ్యాండ్ ల మీదుగా పబ్లిగ్గా ఈడ్చు కెళ్తూ చావచితకదంతాడు రాజశేఖర్. చిరిగిపోయి పోగులుగా వేలాడుతున్న బట్టలతో ‘ఖిలోనా’ లో సంజీవ్ కుమార్  లా వుంటాడు రామిరెడ్డి. ‘తేరే నామ్ కా దీవానా...’  అనే  పాటొక్కటే తక్కువ. ఈ దృశ్యాన్ని అప్పటి ప్రేక్షకులెంత ఎంజాయ్ చేశారంటే, దాంతో సహజంగా వాళ్ళల్లో వుండే బహిరంగ శిక్షా కాంక్ష చాలా బాగా సంతృప్తి పడింది. గంగి గోవు పాలు గరిటెడైనా చాలన్నట్టు, ఆ వొక్క సీను తో కడుపు నిండి పోయింది. ‘అంకుశం’ భావికాలంలో మనిషి బయట పెట్టుకునే సహజాతానికి అలా భవిష్య వాణి చెప్పిందేమో. ఈ రోజుల్లో అడపా దడపా మనకి కన్పిస్తున్నసంఘటనలు- ఏదో తప్పు  చేశాడని సాటి మనిషనే కనికరం లేకుండా, చెట్టుకో కరెంటు స్థంభానికో కట్టేసి, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని, దారుణంగా శిక్షిస్తున్న ఇరుగు పొరుగు జనం మూక మెంటాలిటీ మేట వేసిన అలాటి బహిరంగ శిక్షా కాంక్షేనేమో. 

          అయితే నిజంగా తప్పు చేస్తే అలా శిక్షించే చేతులు పవిత్రంగా వుండాలని పురాణాలు చెప్తాయి, యేసు క్రీస్తు కూడా చెప్తాడు. దీనికీ, ‘అంకుశం’ మూల కథకీ చాలా సంబంధం వుంది. స్వయంగా ఎమ్మెస్  రెడ్దియే పాట రాశారు రాజశేఖర్ పాత్రకి- ‘చాటు నుంచి చంపలేదా వాలిని రాముడు, ధర్మ రాక్షణార్ధమనే పేరుతో  కృష్ణుడు చేయించిన తప్పులన్నీ పొందలేదా మెప్పులు...ఆనాటి ఆ ధర్మం అదే నాకు ఆదర్శం...’ అంటూ.  

      విజయ్ అనే మొండి వాడి పాత్రలో కన్పిస్తాడు రాజశేఖర్. ఎందుకంటే ఆ మొండితనం, తల్లి అతణ్ణి కని కుప్పతొట్లో పడేసి పోయింది. ఈ అవమానంతో చావకుండా మొండిగా బతికాడు. అడుక్కు తినడానికి చావు తన్నులు తిన్నాడు. అదృష్టవశాత్తూ  ఏ బాలనేరస్థుడో కాలేదు. ఓ దయగల మాస్టారి చేతిలో చదువుకున్న వాడయ్యాడు. పోలీసు ఇన్స్ పెక్టర్ కొలువులో చేరాడు. అప్పటికా మాస్టారు ముఖ్యమంత్రి అయ్యాడు. అతణ్ణి దింపేందుకు హోం మంత్రి పావులు కదపడం మొదలెట్టాడు. అందులో  భాగంగా జరిగిన ఓ నాయకుడి హత్య కేసు దర్యాప్తు చేపట్టాడు ఆ ఇన్స్ పెక్టర్ విజయ్. దీంతో హోంమంత్రి వర్గంలో ముసలం పుట్టింది. పై అధికారి మాట వినే రకం కాదు విజయ్. అతడి సిన్సియారిటీ కాస్తా మొండితనం రూపం తొడిగింది. ఇదే తనకీ ప్రతిబంధకంగా మారింది. 

         ఆ హత్యకి ప్రత్యక్ష సాక్షి  అయిన ఓ పళ్ళమ్ముకునే అమ్మాయిని రక్షించి పెళ్ళాడాడు. కడుపుతో వున్న ఆమెని హోంమంత్రి తొత్తు కడదేర్చాడు. వాణ్ణి అరెస్టు చేసి లోపలేస్తే చక్కా విడుదలై పోయాడు. ఓ కర్ఫ్యూ రోజున వాణ్ణి ఎన్ కౌంటర్ చేసి పారేశాడు విజయ్. విద్యార్థుల ఆందోళనని అడ్డుపెట్టుకుని ముఖ్యమంత్రిని ఇరికించాలని చూశాడు మళ్ళీ హోంమంత్రి. ఆ కుట్రని కూడా భగ్నం చేశాడు విజయ్. హోంమంత్రి పెద్ద తొత్తు నీలకంఠం అనే వాణ్ణి రోడ్లమీద తన్నుకుంటూ తీసి కెళ్ళి లాకప్ లో వేశాడు. ముఖ్యమంత్రి మాస్టారు విజయ్ నే వ్యతిరేకించి సస్పెండ్ చేశాడు. తన మీద జరుగుతున్న కుట్రలేవీ సుతరామూ నమ్మే స్థితిలో లేడు మాస్టారు. అప్పుడేకంగా మస్టారుకే స్పాట్ పెట్టేందుకు పన్నిన మహా కుట్రని విజయ్ అడ్డుకోవాలి...ఎలా? 

          పై కథా సంగ్రహంలో వ్యక్తమవుతూన్న వివిధ దృశ్యా లెందుకు అంత ఉత్కంఠ రేపుతున్నాయో ఎవరైనా చెప్పగలరా? బ్యాక్ డ్రాప్... మొదట బ్యాక్ డ్రాప్ ని ఎర్పాటు చేసి  అప్పుదండులోకి  హీరోని  ప్రవేశ పెట్టడం వల్ల! దీంతో వెంటనే కథ వొంటబట్టి,  సీట్లకి అతుక్కుపోతారు ప్రేక్షకులు. తోటంతా చూసుకుంటూ వెళ్లి మధ్యలో ఫౌంటెయిన్ని చూసి థ్రిల్లవడం లాంటిదన్న మాట. శివ- షోలే- బొబ్బిలిపులి... ఇలాంటివే కథనపు మరికొన్ని సినిమాలు. అలా విలన్లు పన్నుతున్న కుట్రల బ్యాక్ డ్రాప్ లో అడుగుపెట్టిన ఇన్స్ పెక్టర్ విజయ్  పాత్ర, ఇక వాళ్లతో తలపడుతూ వుంటుంది. అంటే విలన్ గారి కార్యక్రమాలని బట్టి హీరో గారికి పనుంటుందన్న మాట. ఎంత సేపూ విలన్ పన్నాగాలకి పాసివ్ గా రియాక్ట్ అవుతూ తిప్పికొట్టడమే తప్ప, తను యాక్టివ్ గా మారి పరిస్థితిని తన గుప్పెట్లోకి తెచ్చుకుంటూ– అదే విలన్ని ఆటాడించే సెంట్రల్ పాయింటు కాదన్న మాట. ఇది సిడ్ ఫీల్డ్ లాంటి ఆధునిక స్క్రీన్ ప్లే గురువులు చెప్పే వాటికి విరుద్ధమే. ఐతే ప్రొఫెసర్ విలియం ఫ్రోగ్ లాంటి పాత స్కూలు పండితులు అసలు త్రీ యాక్ట్ (మూడంకాల) స్క్రీన్ ప్లే అనేదే మిధ్య అనీ, ప్రాచీనకాలంలో అరిస్టాటిల్ చెప్పింది కూడా కేవలం కథలో ఆదిమధ్యంతాల (బిగినింగ్-మిడిల్-ఎండ్) గురించేననీ వాదిస్తారు. ఈ లెక్కన చూస్తే, ‘అంకుశం’ ఈ పాత స్కూలు  విధానంలోకే వస్తుంది. అంటే మనసుకి ఎలా నచ్చితే అలా కథ చెప్పుకుపోవడమన్న మాట. అది  ఆత్మాశ్రయ ధోరణి అన్పించుకున్నా మొహమాట పడడం వుండదు (కానీ కమర్షియల్ సినిమా కథ ఇలా సబ్జెక్టివ్ గా కాకుండా, ఆబ్జెక్టివ్ గా వుండాలనేదాని విషయంలో అంతా ఏకీభవిస్తారు మళ్ళీ!).  ఏవో రూల్సంటూ తమ సృజనాత్మకతలకి సంకెళ్ళు వేసుకోవడ మంటూ కూడా వుండదు. ఈ బాపతు కథల్ని నిలబెట్టేది కేవలం పాత్ర బలమే. అలా ‘అంకుశం’ బలం స్ట్రక్చర్ కి అతీతంగా తీర్చిదిద్దిన రాజశేఖర్ పాత్ర బలమే. తన అనితరసాధ్య భావప్రకటనా సామర్థ్యంతో అడుగడుగునా పాత్రని మండిస్తూ పోతాడు. అలా కథని పతాక సన్నివేశం దాకా నడిపించి ముక్తి కల్గిస్తాడు. 

         అలా విలువలతో బతికే పాత్ర విలువలతోనే చచ్చిపోతుంది. జానీ డెప్ నటించిన ‘డాన్ జువాన్ డీ మార్క్’  అనే హాలీవుడ్ సినిమాలో అతనంటాడు- ‘జీవితంలో ఎన్నదగిన ప్రశ్నలు నాల్గే నాల్గు. ఏది పవిత్రం? ఏది ఆత్మకి మూలం? దేనికోసం జీవించడం? దేనికోసం మరణించడం?...అన్నవి. వీటన్నిటికీ కలిపి ఒకటే జవాబు- అదే ప్రేమ! స్వచ్ఛమైన ప్రేమ!’ అని.  

          త్యాగ కారణాలు ఎక్కడైనా ఒకలాగే వుంటాయి. మాస్టారి మీద తనకి గల అపారమైన ప్రేమ కొద్దీ  ప్రాణత్యాగం చేశాడు. ఎవరు ధృవీకరించినా  ధృవీకరించకపోయినా, కళంకిత మైన నీతీనిజాయితీల్ని అలాటి మరణమే ధృవీకరిస్తుంది...కడిగిపారేస్తుంది. 

          ఇందులో జీవిత పళ్ళమ్ముకునే బస్తీ అమ్మాయి. ఎమ్మెస్ రెడ్డి ముఖ్యమంత్రి పాత్రధారి. ముఖ్యమంత్రి పాత్రకి రొటీన్ బిల్డప్పులు లేకుండా మన పక్కింటి పెద్దాయనలా కన్పించడం ఈయన ప్రత్యేకత. సినిమాకి మరో ఆకర్షణ విలన్ గా పరిచయమైన రామిరెడ్డి.  ‘స్పాట్ పెడతా’ అని ఇతను పలికే డైలాగు తెలుగు భాషలో భాగమై పోయింది. అంతేకాదు- దినపత్రికల బ్యానర్ లని కూడా అలంకరించే దాకా పోయింది వార్తలకి (ఫస్ట్ బ్యానర్ ‘ఈనాడు’లో ఓ వార్తకి! ) సత్యం సంగీతం, కెఎస్ హరి ఛాయాగ్రహణం మరో రెండు ఆకర్షణలు. హిందీలో మెగా స్టార్ చిరంజీవి ప్రవేశ చిత్రంగా ‘ప్రతిబంధ్’ పేరుతో  రీమేకైన ‘అంకుశం’ నిజానికి మూసఫార్ములా కథలకే గురి చూసి స్పాట్ పెట్టిందనాలి!


-సికిందర్
(2009 నవంబర్ ‘సాక్షి’)
         



         




11, డిసెంబర్ 2016, ఆదివారం

సాంకేతికం

     కాస్ట్యూమ్స్...నటీనటుల కొక అలంకారం, గుర్తింపు. దీన్నే ఆహార్యమన్నారు. పౌరాణిక సినిమాలతో మొదలై ప్రస్తుతం ఫాంటసీల దాకా వచ్చాయి కాస్ట్యూమ్స్ అనేవి.  మధ్యమధ్యలో చారిత్రక, భక్తి, జానపద, సాంఘీక, కౌబాయ్, క్రైం, లవ్ మొదలైన సినిమా పాత్రలకీ ఆయా శైలుల్లో శోభ తెచ్చాయి. ఆహార్యాన్ని అభినయమని కూడా అన్నారు. చతుర్విధాభినయాల్లో అదొకటి. లేకపోతే  నటుడు గొంతెత్తి ఎన్ని పద్యాలు పాడినా, అతడి చేతిలో గద, తల మీద ఓ కిరీటం, కాళ్ళకి కిర్రు చెప్పులూ, ఒంటి మీద పట్టు వస్త్రాలూ మెరవకపోతే ఆ పాత్ర దుర్యో ధనుడని ఎవరూ  అనుకోరు. ఒకడు సిటీ మొత్తాన్నీ అతలాకుతలం చేసేస్తానని ఎన్ని రంకెలేసినా- ఓ చింకి పాత జీన్సు, మాసిన డెనిమ్ షర్టు, మురికి పట్టిన బూట్లు, చేత డొక్కు పిస్తోలూ లేకపోతే,  వాడొక  మాఫియా క్యారక్టర్ అని ఎవరూ నమ్మరు. తగిన డ్రెస్సు లేకపోతే  ఎవరే పాత్ర నటిస్తున్నారో అస్సలు అంతుపట్టదు.

         
డ్రెస్సులే ప్రేక్షకుల్లో చాలా ఫ్యాషనయ్యాయి. మరీ కలర్ సినిమాల్లో ఎన్టీఆర్ వేసుకునే చెమ్కీ కోటు నెవరూ వేసుకోలేదు గానీ, రాజేష్ ఖన్నా పాపులర్ చేసిన చెప్పులేసుకుని మాత్రం బాగా తిరిగారు ఆలిండియా జనం. వాణిశ్రీ చీరకట్టు సరే, అది చూసి బొడ్డు కింద చీర కట్టుకుని తిరిగారు ఆడవాళ్ళు పూర్తి స్వేచ్ఛతో. అయితే ఇప్పుడీ పరిస్థితి తారుమరైందని అంటారు ప్రముఖ కాస్ట్యూమర్ జనకముని. మార్కెట్లోకి వచ్చే కొత్త కొత్త రెడీమేడ్ దుస్తులే స్టార్స్ కిప్పుడు అలంకారాలవుతున్నాయని ఆయనంటారు. స్టార్లు మార్కెట్ కి ఫ్యాషన్లు ఇస్తున్న కాలం పోయి, స్టార్లే మార్కెట్ నుంచి ఫ్యాషన్లు తీసుకుంటున్న ట్రెండ్  నడుస్తోందని అంటారు జనకముని.

          ‘కుదిరితే కప్పు కాఫీ’ కాస్ట్యూమ్స్ చీఫ్ గా ప్రమోటైన జనకముని, మార్కెట్లో  వచ్చే కొత్త డిజైన్లు ప్రజల చేతుల్లో పడకముందే స్టార్లు చేజిక్కించుకుంటున్నారని చెప్పారు. “సరికొత్త ఫారిన్ డిజైన్లు మొదట ముంబాయి కొస్తాయి. తర్వాత బెంగళూరు కొస్తాయి. ఆ తర్వాతే హైదరాబాద్ కొస్తాయి. ఈలోగానే స్టార్లు తెప్పించుకుని సినిమాల్లో వాడేస్తూంటారు” అన్నారు. 

           కాస్ట్యూమర్లు మిషన్ మీద కుడుతూ వున్న కాలంలో వీటిని ఫ్యాషన్ అన్నారు. రెడీ మెడ్ గా మార్కెట్లో కోనేసుకుంటున్న ఈ కొత్త మిలీనియంలో స్టయిల్ స్టేట్ మెంట్ అన్న కొత్త పదం వాడకంలోకి తెచ్చారు. ఈ స్టయిల్ స్టేట్ మెంట్ లో యాటిట్యూడ్ ప్రధానంగా వ్యక్త మవుతూంటుంది. హీరో హీరోయిన్లు ఇప్పుడు పోషిస్తున్నవి డిజైనర్ పాత్రలు. ‘రగడ’ లో అనూష్కా, ‘బిల్లా’ లో ప్రభాస్ ఇందుకు సరపోతారు. అయితే జనకముని అభిప్రాయంలో ఈ ట్రెండ్ కాస్ట్యూమర్లకి అంతగా  మేలు చేయడం లేదు. 

          ఆయన ప్రకారం కాస్ట్యూమ్స్ చీఫ్స్ , వాళ్ళ కింద ఫస్ట్ అసిస్టెంట్స్, అసిస్టెంట్లు, ఇస్త్రీ వాళ్ళు, డ్రెస్ మాన్లూ మొత్తం కలిపి 445 మంది వరకూ ఇప్పుడు ఫీల్డులో వున్నారు. వీరంతా రెడీమేడ్ దుస్తులకి అలవాటు పడ్డ హీరో హీరోయిన్లని మినహాయించి, మిగతా  ప్యాడింగ్ ఆర్టిస్టుల దుస్తులకే పరిమిత మవాల్సి వస్తోంది.

           “పవన్ కళ్యాణ్ కి నేను పర్సనల్ కాస్ట్యూమర్ గా ‘తమ్ముడు’, ‘బద్రి’, ‘ఖుషీ’ సినిమాల వరకూ పనిచేశాను.  ఆయన ఫారిన్ నుంచి బుక్స్  తెప్పించి ఆ డిజైన్లు కుట్టమనే వారు. ‘బద్రి’ లో మేడిన్ ఆంధ్రా సాంగ్ కి నేను తయారు చేసిన కాస్ట్యూమ్ బాగా హిట్టయ్యాయి. ‘ఖుషీ’ తర్వాత ఆయన ఏడాది దాకా సినిమా చెయ్యనని నాకు యాభై  వేలిచ్చి పంపారు. ఆ డబ్బుతో టైలరింగ్ షాపు పెట్టుకుని బిజీ అయ్యాను. ఎవరైనా పిలిస్తే కంపెనీ కాస్ట్యూమర్ గా వెళ్లి పని చేస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు జనకముని. 

      హీరో హీరోయిన్లకి ప్రత్యేకంగా కాస్ట్యూమర్లు లేకపోతే, వాళ్ళతో కలుపుకుని మొత్తం ఆర్టిస్టు లందరికీ డ్రెస్సులు సమకూర్చే అతన్ని కంపెనీ కాస్ట్యూమర్  అంటారనీ, హీరో హీరోయిన్లకి పర్సనల్  కాస్ట్యూమర్లుంటే అప్పుడు మిగతా ఆర్టిస్టుల డ్రెస్సుల సంగతి చూసేదీ కంపెనీ కాస్ట్యూమరేనని  వివరించారు. అయితే మనీష్ మల్హోత్రా, రోహిత్ బల్, నీతా లుల్లా ల్లాంటి ప్రసిద్ధ ఫ్యాషన్ డిజైనర్లు సినిమా రంగంలోకి రావడాన్ని మీరెలా  చూస్తారని అడిగినప్పుడు- తెలుగులో అలాంటి పరిస్థితి లేదని చెప్పారు. పదిహేనేళ్ళ క్రితం మాత్రం తమిళ కాస్ట్యూమర్లతో  పోటీ వుండే దన్నారు. ముప్ఫై  ఏళ్ల క్రితం వరకూ కాస్ట్యూమర్లకి విలువ వుండేదనీ, ఆ తర్వాత నుంచీ సన్నగిల్లిందనీ బాధ పడ్డారు. అప్పట్లో  కాస్ట్యూమర్ ని  కూడా కూర్చో బెట్టుకుని నిర్మాత, దర్శకుడు, రచయిత, మేకప్ మాన్, కళా దర్శకుడూ కథ గురించీ, పాత్రల గురించీ చర్చించి, దుస్తులు నిర్ణయించేవారన్నారు. ఏ దృశ్యానికి ఏ దుస్తులు నప్పుతాయో కాస్ట్యూమర్ చెప్పే వాడనీ, పాటల  విషయంలో కూడా కాస్ట్యూమర్ ని సంప్రదించే వారనీ,  షూటింగ్ కి పది పదిహేను రోజుల ముందే అందరి దుస్తులూ సిద్ధం చేసుకుని పెట్టుకునే వాళ్ళమనీ చెబుతూ పాత రోజుల్ని గుర్తు చేసుకున్నారు  జనకముని.

          విశాఖ పట్నం దగ్గర, చిట్టివలసకి చెందిన ఈయన 1995 లో సినిమా రంగానికొ చ్చారు. ‘కామ్రేడ్’ కి అసిస్టెంట్ గా చేసి, ‘గోకులంలో సీత’ నుంచి ‘తొలిప్రేమ’ వరకూ పవన్ కళ్యాణ్ కి పర్సనల్ అసిస్టెంట్ గా చేసి, ‘బద్రి’ తో పర్సనల్ కాస్ట్యూమర్ అయ్యానరు. మొత్తం కలిపి 18  సినిమాలు చేశారు. 

          వీటిలో చంద్రశేఖర్ యేలేటి తీసిన ‘ప్రయాణం’ కి తనకో వింత అనుభవం ఎదురయిందిట. ఆ సినిమా షూటింగ్ బ్యాంకాక్ లో జరిగింది. అది మంచు మనోజ్- పాయల్ ల మధ్య ఓ మూడు గంటల సేపు మాత్రం జరిగే కథతో కూడిన సినిమా. అంటే ఆ ఇద్దరూ సినిమా యావత్తూ అదే డ్రెస్ లో వుండాలన్న మాట. ఆ షూటింగ్ జరిగిన 45 రోజూలూ ఆ ఇద్దరి రెండు జతల దుస్తుల్నీ కాపాడుకోవడం కత్తి మీద సామే అయింది జనకమునికి. అవి మాసిపోతే వాషింగ్ చేయవచ్చుగానీ, లైటింగ్ తీవ్రతకి రంగులు వెలసిపోతే మాత్రం అంతే సంగతులు. దర్శకుడు చంద్రశేఖర్ సెలెక్టు చేసుకున్న ఆ డ్రెస్సులు ఎలాంటివంటే మార్కెట్లో ఎక్కడా వాటికి మారు జతల్లేవు. అంటే ‘బేబీస్ డే అవుట్’  లో ఒక చంటి పిల్లాడు షూటింగ్ లో అలసిపోతే,  వాడి కవలని పెట్టి తీసే లాంటి అదృష్టం ఇక్కడ జనకమునికి లేదన్నమాట.

          ఇలాటి వింత అనుభవాలతో భోజ్ పురి, బెంగాలీ సినిమాలకి కూడా పనిచేశారు. తెలుగు కాస్ట్యూమర్స్ యూనియన్ కి 2005-09 మధ్య ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు జనకముని.


-సికిందర్
(2011 మార్చి ఆంధ్రజ్యోతి ‘సినిమాటెక్’ శీర్షిక) 

9, డిసెంబర్ 2016, శుక్రవారం

రివ్యూ!

స్క్రీన్ ప్లే- దర్శకత్వం : సురేంద్ర  రెడ్డి
తారాగణం : రాం చరణ్, రకుల్ ప్రీత్ సింగ్, అరవింద్ స్వామి. పోసాని కృష్ణ మురళి తదితరులు
కథ : మోహన్ రాజా ( ‘తని ఒరువన్’ తమిళ కథ) మాటలు : వేమా రెడ్డి,  సంగీతం : హిప్ హాప్ తమిళ, ఛాయాగ్రహణం : పీఎస్ వినోద్
బ్యానర్ : గీతా ఆర్ట్స్
నిర్మాతలు : అల్లు అరవింద్, ఎన్వీ ప్రసాద్
 
విడుదల: 9 డిసెంబర్,2016
***
       గోవిందుడు అందరి వాడేలే,  బ్రూస్ లీ లవంటి రెండు వరస పరాజయాలతో సందిగ్ధంలో పడ్డ రాం చరణ్ తమిళ రీమేక్ ‘తని ఒరువన్’ ని ఆశ్రయించాడు. ఈ మధ్య పరాజయాల్లో వున్న కొందరు స్టార్స్ ని రీమేకులే కాపాడినట్టు, రాం చరణ్ ని కూడా ఇదే కాపాడాలి. దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా కిక్ -2 పరాజయం నుంచి ఈ రిమేక్ తో రింగులోకి రావాలని ప్రయత్నించాడు. గీతా ఆర్ట్స్ హంగూ ఆర్భాటాలని కూడా కలుపుకుని మొత్తానికి ‘ధృవ’  విడుదలయ్యింది. ఇదెలా వుందో ఈ కింద చూద్దాం.
కథ 
        ధృవ (రాం చరణ్)  ఒక ఐపీఎస్ ఆఫీసర్. తోటి యువ ఐపీఎస్ లతో ఒక లక్ష్యం పెట్టుకుంటాడు. ఐపీఎస్ ట్రైనీగా వున్నప్పుడు నగరంలో జరుగుతున్న కొన్ని నేరాల్ని గమనిస్తూంటాడు. ఈ చిన్న చిన్న నేరాల వెనుక కొన్ని పెద్ద నేరాలని దాచే కుట్ర సాగుతోందని పసిగడతాడు. ఈ పెద్ద నేరాలు చేసే ఘరానా వ్యక్తులు పదిహేను మంది వున్నారని తెలుసుకుంటాడు. వీళ్ళల్లో ఎవర్ని పట్టుకుంటే వీళ్ళ కింద పనిచేస్తున్న వంద నేరగాళ్ళు క్లోజ్ అవుతారో వాళ్ళని కనిపెట్టాలనుకున్నప్పుడు, ఓ ముగ్గురు ఘరానా పెద్ద మనుషుల వెనుక  సిద్ధార్థ్ ( అరవింద్ స్వామి) అనే సైంటిస్టు వున్నాడని అర్ధమవుతుంది. ఇతన్ని టార్గెట్ చేస్తాడు. ప్రభుత్వం తీసుకు రావాలనుకుంటున్న చవక ధరల జెనెరిక్ మందుల్ని అడ్డుకుని మెడికల్ మాఫియా ని కొనసాగించుకోవాలని సిద్ధార్థ్ చూస్తూంటాడు. దీనికి ధృవ  బీటలు కొట్టడం మొదలెడతాడు. ఇది గమనించిన సిద్ధార్థ్ ఒక కాల్పుల సంఘటనలో గాయపడ్డ ధృవ  శరీరంలోకి  మైక్రో చిప్ ని పెట్టించి అతడి కదలికల్ని, మాటల్నీ గ్రహిస్తూంటాడు. ధృవకి ఆప్తులైన వాళ్ళని టార్గెట్ చేసి ధృవని  బలహీన పర్చాలని చూస్తూంటాడు. ఈ పోరాటంలో చివరికి ఎవరిది, ఎలా పైచేయి అయ్యిందన్నదే మిగతా కథ.
ఎలావుంది కథ 
       ఒరిజినల్ కి ట్రూ కాపీ, అక్కడక్కడ చాలా స్వల్ప మార్పులు తప్పితే. ఇదొక మైండ్ గేమ్ తో కూడిన కథ అన్నారు. ఈ మైండ్ గేమ్ లో, మొత్తం కథా కథనాల్లో,  ఒరిజినల్లో వున్న సవాలక్ష తప్పులే దొర్లాయి. ఈ తప్పులతోనే తమిళంలో ఇలాగే హిట్టయింది కాబట్టి, ఆ సెంటిమెంటు పెట్టుకుని అలాగే తీసేశారు. ప్రేక్షకులందరూ తమ జీవితాల్లో అనుభవంలోకి రాని మైండ్ గేమ్స్ నీ, ఇతర ఇంటలెక్చువల్ అంశాలనీ తెలుసుకోగలిగే ఎక్స్ పర్ట్స్ కాలేరు కాబట్టి,  పైపైన యాక్షన్ చూసేసి ఇదే  చాలనుకోవచ్చు.  అయితే జయం రవితో తమిళ ప్రేక్షకులు వేరు, రాం చరణ్ తో తెలుగు ప్రేక్షకులు వేరు. జయం రవి,  రాం చరణ్ అంత పెద్ద స్టార్ కాదు. తమిళంలో  ఒక  స్టార్ డమ్, దాంతో వుండే అంచనాలూ వంటి ఏ బాదరబందీ లేకుండా ఒక న్యూవేవ్ థ్రిల్లర్ లాగా వచ్చి విజయం సాధించింది. తెలుగులో స్టార్ డమ్, దాంతో అంచనాలూ రెండూ వుంటాయి కాబట్టి,  అలాటి కమర్షియల్ మసాలాలూ లేని ఈ కథ ని ఒక సీరియస్ యాక్షన్ గా సిద్ధపడి చూడాల్సి వుంటుంది.
ఎవరెలా చేశారు 
        రాం చరణ్ చేయడానికి ఈ సినిమాలో ఒక సూపర్ ఎమోషన్ అంటూ, బాధ అంటూ లేదు. యాక్షన్ హీరోగా మాత్రమే చేసుకుంటూ పోతూ కన్పిస్తాడు. క్యారక్టర్ కి ఔటర్ యాక్షనే తప్ప, తన లాంటి స్టార్ తో  ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యే ఇన్నర్ యాక్షన్ లోపించడంతో ప్రేక్షకుల్ని అంతగా  సమ్మోహితుల్ని చేసే నటన కనపడదు. తనతో వుండే కామెడీ, అల్లరి. అలాటి పాటలూ వుండవు. క్లయిమాక్స్ కూడా ఏమాత్రం యాక్షన్ లేకుండానే ముగిసిపోవడం ఒక మైనస్సే. పైన చెప్పుకున్నట్టు జయం రవి స్థాయికి కి సరిపోయిన పాత్ర రాం చరణ్ కి చాల్లేదని కచ్చితంగా చెప్పాలి.
     ఇక హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కి తమిళం ఒరిజినల్లో  నయన తారకి లాగే పెద్దగా పాత్రలేదు. ప్రేమ కోసం వెంటపడే, పాటలు పాడే అవసరాలకి పనికొచ్చే గ్లామర్ బొమ్మ పాత్రగా వుండిపోతుంది. విలన్  గా వేసిన అరవింద్ స్వామి తమిళంతో తను వేసిన పాత్రకి డిటోనే. తమిళం చూడని ప్రేక్షకులకి కొత్తగా అన్పిస్తాడు. 
       టెక్నికల్ గా సినిమాతో వచ్చిన పెద్ద ఇబ్బంది ఏమిటంటే, హిప్ హాప్ తమిళ అనే కొత్తగా వస్తున్న సంగీత దర్శకుడి గందరగోళం గోల! ఎక్కడా ఒక్క నిమిషం కూడా తెరిపి నివ్వకుండా, చెవిపోటు వచ్చే  హారిబుల్ నేపధ్య సంగీతాన్ని వాయించేశాడు. అసలే కథా కథనాలు, సన్నివేశాలూ ప్రేక్షకులు బాగా బుర్ర పెట్టి ఆలోచిస్తూ చూడాల్సిన హైటెక్ –కొన్ని చోట్ల సైంటిఫిక్ మైండ్ గేమ్  అయితే, అలాటి ఏకాగ్రతకి అవకాశమే ఇవ్వకుండా  ఇష్టమొచ్చిన శబ్ద కాలుష్యాన్ని సృష్టిస్తూ థ్రిల్ ని చంపేశాడు. కనీసం ఏ కీలక డైలాగు దగ్గర తన హోరు ఆపితే ఆ డైలాగు ఎఫెక్టివ్ గా వుంటుందో కూడా తెలీనట్టు తలనొప్పి పుట్టించి వదిలాడు. దర్శకుడు సురేందర్ రెడ్డి దీనికి ఎందుకు అంగీకరించినట్టో తెలీదు. ఇక పాటలు ఘోరం. ఒక్క ఎస్ వినోద్ కెమెరా వర్క్ మాత్రం ఫర్వాలేదు. కానీ ఎంత స్టయిలిష్ చిత్రీకరణ వుండీ ఏం లాభం సంగీత దర్శకుడు అలావుంటే? 
చివరికేమిటి 
      ఒక స్టార్ సినిమాతో బి, సి సెంటర్ల ప్రేక్షకులకి అలవాటైన మసాలాలేవీ ఇందులో కన్పించవు. ఈ సినిమాని ఆ ప్రేక్షకులు ఒక మెట్టు పైకెదిగి రాం చరణ్ చేసిన ఒక డిఫరెంట్ ప్రయత్నంగా తీసుకుని చూడాలి. అయితే విషయం గ్రహించడానికి కష్టపడాల్సిన ఈ హైటెక్-సైంటిఫిక్  మైండ్ గేమ్స్ కంటెంట్ ని దెబ్బకొట్టే,  హిప్ హాప్ తమిళ సంకట సంకర సంకీర్ణ  సంగీతాన్ని గట్టిగా  కాచుకోవాల్సి వుంటుంది. ఎప్పుడు ఉండుండి ఏ విచిత్రమైన ట్యూన్లు వాయిస్తాడో తెలీదు. దాంతో ఈ ట్యూనేమిట్రా దేవుడా అని దృష్టి సీన్ల మీంచి చెదిరి ఆ ట్యూన్ల మీదికి పోతుంది. అతి పెద్ద విలన్ ఈ సినిమాకి హిప్పు హాప్పుల సంగీత దర్శకుడే. జీవితంలో కొట్టాల్సిన సంగీత పరికరాలన్నీ తెచ్చి కొట్టి పారేశాడు. ఇతణ్ణి ఒక్క సీనులోనైనా ఆ పరికరాలతో చూపించి వుంటే బావుండేది.
    
-సికిందర్
http://www.cinemabazaar.in

8, డిసెంబర్ 2016, గురువారం

రివ్యూ!


స్క్రీన్ ప్లే దర్శకత్వం : సుజోయ్ ఘోష్
తారాగణం : విద్యాబాలన్,అర్జున్ రాంపాల్, నైషా సింగ్, టునీషా శర్మ, అంబా సన్యాల్, మానినీ చద్దా, ఖరజ్ ముఖర్జీ, జుగల్ హన్స్ రాజ్ తదితరులు
కథ : సుజోయ్ ఘోష్, సురేష్ నాయర్, మాటలు : రీతేష్ షా
సంగీతం : క్లింటన్ సెరెజో, చాయాగ్రహణం : తపన్ బోస్
బ్యానర్ : బౌండ్ స్క్రిప్ట్ మోషన్ పిక్చర్స్, పెన్ ఇండియా లిమిటెడ్
నిర్మాతలు : సుజోయ్ ఘోష్, జయంతీలాల్ గడా
విడుదల :  2డిసెంబర్ 2016
***
          2012 కహానీకి సీక్వెల్ గా చెప్పుకుంటూ విడుదలైన కహానీ -2’ నిజానికి కొనసాగింపు కథేమీ కాదు, పాత్రలూ వేరు. కథ, పాత్రలు వేరైనప్పుడు సీక్వెల్ అనలేం. అయితే  దర్శకుడు సుజయ్ ఘోష్ దీనికింకో విధంగా చెప్పాడు- ‘కహానీఅనేదాన్ని  ఒక ప్రత్యేక  జానర్ కి పర్యాయపదంగా తీసుకోవాలని. స్త్రీని శక్తివంతంగా చూపించే జానర్ ని  కహానీఅనాలని. కాబట్టి  ఇకనుంచి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్ని కహానీ సినిమాలుఅనాలేమో. కానీ కహానీల్నిక్రైం ఎలిమెంట్స్ ని మిక్స్ చేస్తూ సుజయ్- విద్యా బాలన్ ద్వయం తప్ప ఇంకెవరూ తీయలేరనేంత  గట్టి ముద్ర వేసి వదుల్తున్నారు- మొదటి కహానీఎంత పవర్ ఫుల్లో, ఇప్పుడు రెండో కహానీ’  అంతకంటే పవర్ఫుల్ ! మధ్యలో వచ్చిన అనిరుథ్ రాయ్ చౌధురి- తాప్సీల పింక్లాంటివి అరుదుగా వస్తాయి. శక్తివంతమైన స్త్రీని చూపించడ మంటే ఇక్కడ ఏ ఉద్యమనాయకురాల్నో చూపించడం కాదు- నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యల్ని హీరోయిన్  పాత్ర చుట్టూ సస్పెన్స్  థ్రిల్లర్స్ గా చేసి చూపించడం. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్ని నేటి యూత్ ఫ్రెండ్లీ సినిమాలుగా మార్చి వినోదపర్చడం...సొమ్ము చేసుకోవడం... 

         
దివరకు చెప్పుకున్నట్టు బాలీవుడ్ లో బస చేసిన బెంగాలీ దర్శకులు విలక్షణమైన సినిమాలు తీస్తున్నారు. ఇటీవలే పింక్తర్వాత ఇప్పుడు కహానీ -2 అంతటి కళ్ళు తిప్పుకోనివ్వని పకడ్బందీ థ్రిల్లర్. సినిమా చూస్తూ రివ్యూ రైటర్ మెమోలో ఏదైనా పాయింటు ఫీడ్ చేసుకోవాలన్నా ఏకాగ్రత దెబ్బతినేసేంత బిగిసడలని కథాకథనాల క్రియేటివ్ ప్రాసెస్ ఇది. ఒక విద్యాబాలన్ కోమాలో కెళ్ళిపోయి, ఇంకో విద్యాబాలన్  హేండాఫ్ క్యారక్టర్లా యాక్షన్లో కొచ్చి  కుతకుతలాడే కసినంతా తీర్చుకునే విలాసవంతమైన క్వాలిటీ మూవీ...

కథ 
      విద్యా సిన్హా (విద్యా బాలన్) ఒక ఉద్యోగం చేసుకుంటూ పధ్నాల్గేళ్ళ  కూతురు మిన్నీ (టునీషా శర్మ) ని పోషించుకుంటూ వుంటుంది. కాళ్ళు పడిపోయిన కూతురు చక్రాల కుర్చీకీ, మంచానికీ బందీ అయిపోయి వుంటుంది. ఉంటున్నది కలకత్తా దగ్గరలో చందాపూర్ అనే చిన్న టౌన్లో. కూతురికి వైద్యం అమెరికాలో సాధ్యపడుతుందని డాక్టర్ అంటే  అమెరికా తీసికెళ్ళే ప్రయత్నాల్లో వుంటుంది. ఇంతలో కూతుర్ని కిడ్నాప్ చేశామని కాల్ వస్తుంది. విద్యాసిన్హా ఆదరాబాదరా పరిగెడుతూ యాక్సిడెంట్ పాలయ్యి కోమాలో కెళ్ళిపోతుంది. సబిన్స్ పెక్టర్ ఇందర్జిత్ సింగ్ (అర్జున్ రాంపాల్) రంగంలో కొస్తాడు. కోమాలో వున్న విద్యా సిన్హాని చూడగానే షాకవుతాడు. డాక్టర్ ఆమె ఐడీ చూపించి, ఈమె విద్యా సిన్హే అంటాడు. కాదు ఈమె కలింపాంగ్ లో వుండాల్సిన దుర్గా రాణీ  సింగ్ అని ఇందర్జిత్  సింగ్ ఆమె ఇంటికెళ్ళిపోయి  సోదా చేస్తాడు. ఓ డైరీ దొరుకుతుంది. ఆ డైరీ చదువుతూంటే దిమ్మదిరిగిపోతుంది...

      తర్వాత పైఅధికారి ఇందర్జిత్ కి ఒక హేండ్ బిల్ అందించిఈ వాంటెడ్ కిల్లర్ ని పట్టుకోవాలని ఆదేశిస్తాడు. ఆ ఫోటో చూస్తే దుర్గా రాణీ సింగ్ దే. కలింపాంగ్ లో ఎనిమిదేళ్ళ క్రితం ఒక మర్డర్ చేసి, ఇంకో కిడ్నాప్ చేసి పారిపోయిన దుర్గా రాణీ సింగ్ ని పట్టుకుంటే ప్రమోషన్ వస్తుందంటాడు పై అధికారి. ఒకవైపు కోమాలో వున్న విద్యాసిన్హా, ఇంకో వైపు చేతిలో దుర్గా రాణీ సింగ్ గురించిన డైరీ...ఇందర్జిత్ కి బుర్ర వేడెక్కిపోతుంది.

        అసలు విద్యా సిన్హాగా పేరు మార్చుకున్న దుర్గా రాణీ సింగ్ ఎవరు? ఆమె ఎందుకు ఎవర్ని మర్డర్ చేసి, ఎవర్ని కిడ్నాప్ చేసింది? ఇప్పుడు కిడ్నాపైన కూతురు ఎక్కడుంది? ఎవరు ఎందుకు కూతుర్ని కిడ్నాప్ చేశారు? కోమాలో వున్న విద్యా సిన్హా కి మాత్రమే  తెలిసిన ఈ కూతురి కిడ్నాప్ గురించి ఇందర్జిత్ సింగ్ ఎప్పుడు తెలుసుకున్నాడు? విద్యాసిన్హా కోమాలోంచి మేల్కొంటుందా లేదా? ఈలోగా ఇందర్జిత్ సింగ్ పై అధికారినుంచి విషయాలు దాస్తూ ఏం పాట్లు పడ్డాడు? అసలెందుకు విషయాలు దాస్తున్నాడుపెళ్ళయిన ఇతడికి దుర్గా రాణీ సింగ్ తో వున్న సంబంధమేమిటి? ఈ సంబంధం బయటపడితే పీక్కునే దేంటి?....ఇన్ని చిక్కు ప్రశ్నలన్నిటికీ ఒకటే సమాధానం. అదేమిటో తెరపైనే చూడాలి.

ఎలావుంది కథ 
      ఈ పైకి కన్పిస్తున్నదంతా కథ కాదు. ఇదంతా ఇంకో కథకి కథ. 2014 లో ఆలియా భట్- రణదీప్ హుడా లతో ఇంతియాజ్ అలీ తీసిన హైవేలో చివర బయట పడే కథే, ‘కహానీ -2’  లో మందు
పాతరలా మధ్యలో పేల్తుంది. కాకపోతే హైవేలో అది హీరోయిన్ ఆలియా భట్ పాత్ర అనుభవమైతే, ‘కహానీ -2’ లో బాల పాత్ర మిన్నీ వ్యధ. ఎక్కడో ఓ చోట, ఇళ్ళల్లో  చిన్న పిల్లలతో  పాల్పడుతున్న చైల్డ్ ఎబ్యూజ్ అనేది ఎవ్విరీ డే న్యూజ్ లాగా మారిపోయిన ప్రస్తుత కాలంలో, అందులోంచి తనకేమీ కాని ఆరేళ్ళ ఓ పిల్లని కాపాడేందుకు ఓ సాధారణ స్కూలు ఉద్యోగిని తెగించి ఏమేం చేసిందన్నది, ఈ క్రమంలో ఏమేం కోల్పోయిందన్నదీ అసలు కథ. నిత్యజీవితంలో సమస్యల్ని ఇంకా ప్రేక్షకుల్ని ఏడ్పిస్తే డబ్బులొస్తాయనే రొడ్డకొట్టుడు ఏడ్పు కథగా కాకుండా, సస్పెన్స్ థ్రిల్లర్ గా చేసి చూపిస్తూఓ సరికొత్త వీక్షణానుభవాన్నిచ్చే వుమన్ ఎంపవర్ మెంట్ కథ.

ఎవరెలా చేశారు
     విద్యాబాలన్ గురించి ఇంకా చెప్పుకోవాల్సిందేముటుంది. సరైన పాత్ర ఇస్తే దాని దుంపతెంచుతుంది. మేకప్ కూడా అవసరం లేకుండా నటించి పారేస్తుంది. గ్లామర్ కోసం పాత్ర లబోదిబోమన్నా చెప్పినట్టు పడుండమంటుంది. ఫ్రీ స్టయిల్ నటన ఆమెది. రెండు పాత్రలతోనూ  సస్పెన్స్ థ్రిల్లర్ ని హై వోల్టేజ్ డ్రామాలాగా మార్చేస్తుంది. ఫ్లాష్ బ్యాక్ పాత్ర ( దుర్గా రాణీ సింగ్)కి వ్యతిరేకంగా సంపన్నుల కుటుంబం, స్కూలు యాజమాన్యం, లేడీ కానిస్టేబుల్ చేసే అన్యాయాలకి తనదైన వ్యూహరచనా సామర్ధ్యంతో ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంది. మళ్ళీ ప్రస్తుత  విద్యాసిన్హా పాత్రలో వాంటెడ్ కిల్లర్ గా చందా నగర్ నుంచీ కలకత్తా దాకా పోలీసుల్ని కిందామీదా చేసేస్తుంది. మిన్నీని అమెరికా తీసికెళ్ళే తన ప్రయాణాన్ని ఎవరూ ఆపలేరు- ఆపితే అయిపోయారన్నట్టే ఒక్కొక్కళ్ళూ. ఆమెని కిల్లర్ గా భావించుకునే మనుషులేగానీ, ఆమె తల్లికాని తల్లి  మనసుని కూడా ఎవరూ పట్టించుకోని విషాదం పాత్రచుట్టూ వుంటుంది. స్కూల్ టీచర్లు స్టూడెంట్స్ ని సొంత పిల్లల్లాగా చూసుకుంటారో లేదో గానీ, ఒక స్కూలు క్లర్క్ గా, పెళ్ళికాని దుర్గా రాణి ఎందుకు ఒక స్కూలు బాలిక కోసం సింగిల్ మదర్ గా జీవితాన్ని డిసైడ్ చేసుకుందన్నది పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నకి ఆమె కథే సమాధానం. విద్యాబాలన్ వి ఈ రెండూ ఆదర్శ పాత్రలు

    సబిన్స్ పెక్టర్ గా అర్జున్ రాం పాల్ ది కూడా చాలాసహజ  పాత్ర
కాస్త ఏమీ పట్టని తత్త్వంతను వస్తూంటే కానిస్టేబుల్ కూర్చుని వున్నా పెద్దగా పట్టించు
కోడు
ఎంక్వైరీ కెళ్ళినప్పుడు పేపరు చదువుకుంటున్న  ఒకడ్ని అడ్రసు అడిగితే,  వాడు పేపరు పేపరు చదువుకోవడమే తప్ప తనని పట్టించుకోకపోయినా-  ఏం చేస్తాం..అనుకుంటూ వెళ్ళిపోయే రకం  అర్జున్ రాం పాల్ సబిన్స్ పెక్టర్ పాత్ర.  కోపమనేదే వుండదుఇదే బెంగాలీ బ్యాక్ డ్రాప్ లో కహానీ’ లో కూడా పోలీసు పాత్రలు ఇలాటి  డిఫరెంట్ ఫీల్ నే ఇస్తాయిఅర్జున్ రాం పాల్ లాగే  పై అధికారి పాత్రలో ఖరజ్ ముఖర్జీ ఆసక్తికర పాత్ర పోషించాడు.

        మిన్నీగా ఆరేళ్ళ బాలికగా నైషా ఖన్నా నటిస్తేపధ్నాల్గేళ్ళ బాలికగా టునీషా శర్మ నటించిందిఇద్దరూ లైంగికంగా తనకేం జరుగుతోందో తెలీని పసితనపు  మిన్నీ అంతరంగాన్ని సున్నితంగా ఆవిష్కరించారుమిన్నీ నానమ్మ పాత్రలో అంబా సన్యాల్ ది టెర్రిఫిక్ నటనఆమె కొడుకు పాత్రలో జుగల్ హన్స్ రాజ్లేడీ కానిస్టేబుల్ పాత్రలో మానినీ  చద్దా మరో రెండు నెగెటివ్ పాత్రలు పోషించారు.  

      నటనలకినటింప జేయడాలకీ ఒక పర్ఫెక్ట్ గైడెన్స్ లా వుంటుంది దర్శకుడి ప్రతిభక్లింటన్ సెరేజో సంగీతం లోని మూడు బ్యాక్ గ్రౌండ్ పాటల్లో లమ్హోకే రస్ గుల్లే’ ( రసగుల్లా ల్లాంటి క్షణాలుపాట టాప్తపన్ బసు ఛాయాగ్రహణం రియల్ లోకేషన్స్ లోముఖ్యంగా నైట్ ఎఫెక్ట్స్ లో ఓ కళాత్మక చిత్రణసబ్ కాన్షస్ గా ప్రేక్షకుల్ని సన్నివేశాల్లో సంలీనం చేసేందుకు బ్యాక్ గ్రౌండ్ లో వెలిగే వర్ణ కాంతులతో ఒక అద్భుత ప్రయోగం చేశారురోడ్ల మీద పసుపు పచ్చ కాంతి ప్రసరింపజేయడం కూడా అందులో ఒకటి. ‘బ్యాక్ టు ది ఫ్యూచర్’ లో వివిధ రూపకాలంకారాల్ని వాడినట్టు ఇక్కడ వర్ణకాంతుల్ని ఉపయోగించారుసినిమాకి ఛాయాగ్రహణంతో కూడా చాలా పనుంటుందని ఇక్కడ నిరూపించారుకథ కాన్షస్ లెవెల్లో ప్రేక్షకులకి అందితేఇలాటి ఛాయాగ్రహణం లోతుగా సబ్ కాన్షస్ లెవెల్ కి తీసికెళ్తుందిఒక హిప్నాటిక్ లోకాన్ని సృష్టిస్తుందిబెంగాల్లోని చందా నగర్కలింపాంగ్కలకత్తా లొకేషన్స్  కాసేపు ఈ హిందీ సినిమాని కొత్త లోకాలకి తీసికెళ్తాయి.

చివరికేమిటి 
       మొదలెట్టింది లగాయత్తూ  ముగిసేదాకా ఒక్క క్షణం కూడా కళ్ళు తిప్పుకోనివ్వని సస్పెన్స్ థ్రిల్లర్ గా దీన్ని రెండు మూడు సార్లు చూడొచ్చు. ప్రతి సీనూ, ప్రతీ షాటూ క్షణం క్షణం కథని ముందుకు పరిగెత్తించేవే తప్ప ఎక్కడా కథని ఆపి కాలక్షేపం కోసం లేవు. చాలా పూర్వం అగర్, ఔర్ కౌన్ లలాంటి సస్పెన్స్ థ్రిల్లర్స్ ని గుర్తుకు తెచ్చేలా వుండే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఇప్పటి కాలానికి హై టెన్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ గా మారింది. మొదటి పదినిమిషాల్లోపు పాత్రకి యాక్సిడెంట్ అయ్యే ప్లాట్ పాయింట్ వన్ వచ్చేసిమళ్ళీ చివర పదిహేను  నిమిషాల  ముందు పాత్ర కోమాలోంచి లేవడంతో ప్లాట్ పాయింట్ టూ వచ్చేసి- మధ్యలో అంతా  గత/ వర్తమాన కాలపు యాక్షన్స్ తో సంక్షుభితంగా వుంటుంది మిడిల్. నడుస్తున్న కథకి ఎలా స్పష్టమైన బిగినింగ్-మిడిల్-ఎండ్ లుంటాయో, అలా  గడిచిపోయిన కథకీ వుంటాయి. డైరీపేజీల్లోంచి వంతులవారీగా వచ్చే ఫ్లాష్ బ్యాక్స్ తో ఈ గడిచినపోయిన కథ వుంటే, ప్రస్తుత కాలంలో కేసుతో పోలీసుల సంఘర్షణగా  వుంటుంది

        పకడ్బందీ రచన, పకడ్బందీ నటనలు ఎందుకు సాధ్యం కావు మనసుంటే- ఏదో నడిచిపోతుందని స్టార్ వేల్యూ మీద ఆధారడిపోయి చుట్టేస్తే అదొక సినిమా అన్పించుకుంటుందా? ప్రేక్షకులు దొంగ నోట్లు ఇవ్వడంలేదు దొంగ సినిమాలు చూపించడానికి- దొంగ సినిమాల మధ్య అప్పుడప్పుడు ఇలాటి దొర సినిమాలు వస్తున్నా, తేడా పసిగట్టలేని ప్రేక్షకులు వుంటున్నందువల్లే బరితెగించి దొంగ సినిమాలు వస్తూంటాయి.... ‘కహానీ -2’ దొరసాని సినిమా!


-సికిందర్
http://www.cinemabazaar.in