రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

3, ఏప్రిల్ 2016, ఆదివారం

తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ -11

జేమ్స్ బానెట్ ప్రకారం గొప్ప కథని సృష్టించాలంటే, ఆదిమధ్యంతాలు
(బిగినింగ్- మిడిల్-  ఎండ్) అన్నిటా దృష్టిలో పెట్టుకోవాల్సిన సృజనాత్మక ప్రక్రియ చాలా వుంటుంది.
metaphors  ( రూపకాలంకరాలు),
archetypes  (ఆది మూలాలు),  hidden truth (నిగూఢ సత్యం), golden paradigm  (ఉత్కృష్ట భూమిక) వంటి ఇంకెన్నో సంక్లిష్ట సంకీర్ణ  స్క్రిప్టింగ్ టూల్స్ జోలికి మనం వెళ్ళనవసరం లేదు. భవిష్యత్తులో కూడా  తెలుగులో గొప్ప కళాఖండాలు నిర్మించే ఉద్దేశంతో ఎవరూ
ఉండకపోవచ్చు. ప్రస్తుత స్ట్రగుల్ అంతా బాక్సాఫీసు దగ్గర ఎంతో కొంత వర్కౌట్ అయ్యే డబ్బులొచ్చే అర్ధవంతమైన  కమర్షియల్స్  కోసమే కాబట్టి, జేమ్స్ బానెట్ నుంచి కొంతే – ఓ ఇరవై శాతమే తీసుకుని అన్వయించుకుంటే సరిపోతుంది...

        సినిమాలకి రాసుకున్న కథల  మీద ఇతరుల చేతులు ఎన్ని పడ్డా పూర్తిగా చెడకుండా ఒక లాక్ లాంటిది వేసుకోవాలన్న ఫార్ములా అన్వేషణలో దొరికిందే జేమ్స్ బానెట్ వెలుగులోకి తెచ్చిన ప్రక్రియ. అంటే గొప్ప కథకి బానెట్ చెబుతున్న నిర్వచనాల్లోంచి కొంతే  తీసుకుని, తెలుగుసినిమాల పరిధులూ ప్రమాణాలతో  సరితూగే  ‘గొప్పకథ’ నే  టార్గెట్ చేసి పునాది వేసుకుంటే, దాని మీద ఎందరి చేతులు ఎలా పడ్డా,  ఆ ‘గొప్పకథ’ పునాదులు ఎంత వదులైనప్పటికీ,  నాణ్యత కనీసం ఓ మంచి కథ అన్పించుకునే స్థాయి దగ్గర   ఆగవచ్చన్న ఆశాభావంతోనే ఈ ఫార్ములా. 


          ఇలా కాకుండా, ఇప్పుడు జరుగుతున్నట్టుగా, సిడ్ ఫీల్డ్ భూమిక (paradigm ) తోనే  కేవలం ఓ మంచి కథకే పునాది వేసుకుంటే, ఆ మంచి కథ అనుకున్నది శిఖరాగ్ర సమావేశాల్లో ఇంకా దిగజారి నీచకథగా తయారయ్యే  ప్రమాదముంది. కనుక ముందే గొప్ప  కథకి పునాది వేస్తే ‘ఫిల్టరై’ మంచి కథగా మిగలొచ్చు, ఇలా కాక ముందే మంచి కథకి మాత్రమే పునాది వేసుకుంటే  ‘ఫిల్టరై’ మహా చెడ్డ కథ చేతికి రావచ్చు. అంటే జేమ్స్ బానెట్  మోడల్ తో కథ చేసుకుంటే,  సిడ్ ఫీల్డ్ మోడల్ దక్కవచ్చన్న మాట. ఇది మంచిదేగా- సిడ్ ఫీల్డ్  మోడల్లో చేసుకున్నవి కూడా మంట గలిసిపోతున్నప్పుడు. 

          కాబట్టి  కథంటే కథ మొత్తానికీ కాకుండా మిడిల్ ని మాత్రమే లాక్ చేసే  ఫార్ములాని బానెట్ నుంచి తీసుకుంటే, గత వ్యాసం లో పేర్కొన్నట్టు, కథంటే పఠితకి / ప్రేక్షకుడికి / శ్రోతకి  చేసే సైకో థెరఫీయే గనుక, ఆ సైకాలజీ లోంచే, ఆ మానసిక అవసరాలకోసమే,  కాన్షస్ -  సబ్ కాన్షస్ మైండ్స్  ని  మధించి పుట్టేదే  కథ గనుక, ఈ సైకలాజికల్ కనెక్షన్ ని ఏర్పాటు చేయడమే లాకింగ్ సిస్టం ఫార్ములా అన్నమాట! 

          అంటే అప్పుడు స్క్రీన్ ప్లే రచనని పూర్తిగా కొత్త కోణంలో చూడాల్సి వుంటుందన్న మాట. ఇక్కడ్నించీ  ఈ రాస్తున్న లైన్లు జాగ్రత్తగా చదవుకోవాలి. ముందేర్పర్చుకున్న నమ్మకాలూ అభిప్రాయాలూ వుంటే తీసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ కన్పించే ప్రతీ లైనూ ఒకటికి పదిసార్లు చదవడమేగాక, ఈ లైన్లు చెప్పే కొత్త విషయాలు  నేర్చుకోవాలి. నేర్చుకున్నది అమల్లో పెట్టుకోవాలి. నిరూపితమైన శాస్త్రం ఎప్పుడూ మోసం చెయ్యదు.

          సమస్త కథలూ మన మానసిక ప్రపంచాలకి ప్రతిరూపాలే. కాన్షస్ – సబ్ కాన్షస్ మైండ్ ల సయ్యాట (ఇంటర్ ప్లే) లే. సౌలభ్యం కోసం పదజాలాన్ని వాడుక భాషలోకి మార్చుకుంటే - కాన్ష మైండ్ అంటే మన వెలుపలి మనసు, సబ్ కాన్షస్ మైండ్ అంటే లోపలి మనసు. వెలుపలి మనసునే ‘మనసు’ అనీ, లోపలి మనసుని ‘అంతరాత్మ’ అనీ అనుకుంటే, మనం మనసుతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాం. ఆ నిర్ణయాలు మంచివో కావో అంతరాత్మ చెబుతుంది. ఈ రెండిటి మధ్య మన ఇగో (అహం) నిర్ణేతగా వుంటుంది.         అదెప్పుడూ అంతరాత్మ విజ్ఞతతో చెప్పే మంచి మాట, శాశ్వత పరిష్కారం  లాంటివి వినదు. మనసు చెప్పే ఆకర్షణీయమైన మాటలే, తాత్కాలిక పరిష్కారాలే  ముచ్చటపడి వింటుంది. ఇదెప్పుడూ చుట్టూ అందంగా కన్పించే బాహ్యప్రపంచాన్నే అనుభవిస్తుంది. లోపల గంభీరంగా కన్పించే ప్రపంచమైన  అంతరాత్మలోకి ప్రయాణించడానికి ఇష్టపడదు. 

          పైపెచ్చు ఆ అంతరాత్మని నొక్కేసే ఎజెండాతోనే ఇగో నిత్యం ప్రవర్తిస్తుంది. ఇగో ఎప్పుడూ ‘మనసు’ తోనే జతకలిసి వుంటుంది. మనసుతోనే చెట్టపట్టాలేసుకుని బాహ్యప్రపంచంలోనే  షికార్లు కొడుతుంది. ఇగో అంటే మనమే. భౌతికంగా మన గుర్తింపు. భౌతికంగా మనం చేసుకునే అలంకరణ, మేకప్ ల ద్వారా నేను ఫలానా అని తెచ్చుకునే గుర్తింపు. అలాటి ‘మనం’  అంతరాత్మలోకి తొంగి చూడ్డానికి ఇష్ట పడం. ఎందుకంటే అక్కడ ఎన్నో నగ్నసత్యాలు, శాశ్వత విలువలూ వంటి మనిషి పుట్టినప్పటినుంచీ జీన్స్ లో నిబిడీకృతం చేసుకుని తిరుగుతున్న చేదు వాస్తవాలతో బాటు,  దేవుడి నియమావళి భయపెడుతూవుంటుంది.

          మనకు (ఇగోకి)  వున్న ఈ లక్షణాలు  పక్కాగా సినిమాల్లో హీరో కుండే లక్షణాలే. అంతరాత్మ తో మనం పడే సంఘర్షణ  సినిమాల్లో  మిడిల్ తో హీరో చేసే సంఘర్షణే. ఇది జాగ్రత్తగా గమనించాలి.  స్క్రీన్ ప్లేలో మిడిల్ అంటే మన అంతరాత్మకి ప్రతి (తెర) రూపమే. అంతరాత్మ సర్వాంతర్యామి. ఈ విశ్వమంతా వ్యాపించి వుంది. అందరిలోనూ వుండేది ఒకే అంతరాత్మ. ఒకే నగ్న సత్యాలు, ఒకే శాశ్వత విలువలు, ఒకే దేవుడి నియమావళి. 

          కానీ  మనం అంతరాత్మలో  ప్రయాణించి ఈ కఠిన విషయాలు తెలుసుకోవడానికి, చేదుగా వుండే  పచ్చి నిజాల్ని రుచి చూడడానికీ  వెనుకాడుతాం. సినిమాలు మన మెడబట్టి ఈ పనే చేయిస్తాయి. మనల్ని- అంటే మనలాంటి  హీరోని, మిడిల్ లోకి నెట్టి సంఘర్షణలో పడేస్తాయి. ఏ అంతరాత్మకి భయపడి దూరంగా వుంటున్నామో, ఆ అంతరాత్మ ( మిడిల్ ) లోకి నెట్టి-  అక్కడి నగ్నసత్యాల పట్ల, ఆ శాశ్వత విలువల పట్ల, ఆ దేవుడి నియమావళి పట్లా మన భయాలని పోగొట్టి ఒడ్డున పడెయ్యడమే కదిలే బొమ్మల రూపంలో సినిమాలు చేసే- చెయ్యాల్సిన పని. 

          బరి లోకి దిగి అమీతుమీ తేల్చుకుంటే తప్ప మన భయాలు పోవు. అంతరాత్మలో పొడసూపే భయ కారకాలతో  పోరాడి,  వాటి పట్ల భయాలు తొలగించుకుని,  విజేతలుగా అవతరించడమే జరిగేది. విజేతలుగా అవతరించడమే స్క్రీన్ ప్లేలో ఎండ్ విభాగం. అంటే అసంపూర్ణ వ్యక్తులుగా, పలాయన వాదం పఠిస్తూ, ప్రియమైన మనసుతో కలిసి షికార్లు కొట్టే మనం(ఇగో),  అంతరాత్మతో భయాలని పోగొట్టుకుని, పరిపూర్ణ వ్యక్తులుగా ఎదగడమే పరోక్షంగా  సినిమా చూపించే సినిమా!

          సింపుల్ గా చెప్పాలంటే మనలోని ఇగోని  మెచ్యూర్డ్ ఇగోగా మార్చే ప్రక్రియే సినిమా. ఏ కథైనా, ఏ పురాణమైనా, ఏ జానపదమైనా, ఇంకేదయినా చేసేది ఒక్కటే-  మనసూ అంతరాత్మల సయ్యాటలతో మనిషిని  మోక్ష మార్గాన నడిపించడం. రాముడి అరణ్య వాసంలో అరణ్యం అంతరాత్మే, అర్జునుడి కురుక్షేత్రంలో కురుక్షేత్రం అంతరాత్మే, ‘తెలివైన ఇంద్రజాలికుడు’ అనే జానపద కథలో ఇంద్ర జాలికుడు అంతరాత్మే.

          బానెట్  కొన్ని  సినిమాలని ఉదహరిస్తారు- ఈటీ, కాంటాక్ట్, అర్మగెడ్డాన్ సినిమాల్లో అంతరిక్షం అంతరాత్మ అయితే,  భూమి వెలుపలి మనసు. ఏలియెన్ లో అంతరిక్ష నౌకలోని కంట్రోల్ రూమ్ అంతరాత్మ అయితే, జురాసిక్ పార్క్ లో కాంపౌండు, మిగతా పార్కూ అంతరాత్మ. టైటానిక్ లో టైటానిక్ నౌక వెలుపలి మనసు అయితే, అది మునిగిపోయిన తర్వాత సముద్ర గర్భం అంతరాత్మ, జాస్ లో లంక అనేది వెలుపలి మనసు అయితే,  దాని చుట్టూ సముద్రం అంతరాత్మ, సముద్రం లోంచి దాడి చేసే సొరచేప నగ్న సత్యాలకి ప్రతీక, ఈ సొరచేపతో తలపడే హీరో మన ఇగోనే! ఈ చిత్రణలు ప్రేక్షకులతో  సైకలాజికల్ గా కనెక్షన్ ని ఏర్పాటు చేసుకుంటాయి.


      తెలుగులోకి వస్తే,  ‘ఏలియెన్’ లో అంతరిక్ష నౌకలోని కంట్రోల్ రూమ్ ఎలాగో, ‘ఒక్కడు’ లో భూమికని దాచిన గది అలా అంతరాత్మకి ప్రతీక అయితే, భూమిక పాత్ర పరిష్కరించాల్సిన  ఆ అంతరాత్మ సంధిస్తున్న పజిల్. మిగతా ఇల్లూ, చార్మినార్ అంతస్తూ అంతా వెలుపలి మనసు. మహేష్ బాబు మన ఇగో. ‘శివ’ లో నాగార్జున పాత్ర మన ఇగో. అతడి కాలేజీ వాతావరణ మంతా వెలుపలి మనసు, అతను తలపడే చీకటి మాఫియా ప్రపంచం అంతరాత్మ, రఘువరన్ విలన్ పాత్ర అంతరాత్మలోంచి పొడసూపుతున్న ఒక చేదు వాస్తవం. 


  ‘ఊపిరి’లో కార్తీ పాత్ర మన ఇగో కాన్షస్, అతను  నాగార్జున బంగళాలోకి ప్రవేశించినప్పుడు నాగార్జున బంగాళా అంతరాత్మ, నాగార్జున పాత్ర ఆ అంతరాత్మ సంధిస్తున్న పరిష్కరించాల్సిన సమస్య.

          ‘క్షణం’ లో అడవి శేష్ పాత్ర మన ఇగో, మిస్సయిన పాప అంతరాత్మ; ‘సూర్య వర్సెస్ సూర్య’ లో నిఖిల్ పాత్ర మన ఇగో, అతను భయపడే సూర్య కాంతి- పగటి వెలుతురు అంతరాత్మ; ‘స్వామీరారా’ లో పాత్రలన్నీ మన ఇగోకి వివిధ రూపాలు, స్వామి విగ్రహం అంతరాత్మ; ‘కంచె’ లో వరుణ్ తేజ్ మన ఇగో, అతను పాల్గొనే రెండో ప్రపంచ యుద్ధం అంతరాత్మ, కాపాడాల్సిన పాప ప్రాణాలు అంతరాత్మ నొక్కి చెబుతున్న శాశ్వత విలువలకి ప్రతీక;


       ‘కుమారి-21ఎఫ్’ లో హీరోయిన్ పాత్ర అంతరాత్మ, హీరో పాత్ర మన ఇగో. ‘శ్రీమంతుడు’ లో మహేష్ బాబు దత్తత తీసుకునే గ్రామం అంతరాత్మ, అతడి పాత్ర మన ఇగో, నగరంలో అతను తిరుగాడే  వాతావరణం వెలుపలి మనసు. ‘అల్లూరి సీతారామరాజు’ లో  అడవి అంతా  అంతరాత్మ ప్రతిరూపం, అందులో బ్రిటిష్ ప్రభుత్వం ఆ అంతరాత్మ సంధించే  ప్రశ్న, అల్లూరి పాత్రలో హీరో కృష్ణ  ఆ ప్రశ్నతో తలపడే మన ఇగో.
  

     బానెట్ తన పుస్తకంలో – నిజజీవితంలో అంతరాత్మ సంధించిన ప్రశ్నతోనే పోలాండ్ లో ఒక  లెక్ వాలెసా అవతరించాడనీ, చెకస్లోవేకియాలో ఒక వాక్లావ్హావెల్ అవతరించాడనీ, అమెరికాలో మార్టిన్ లూథర్ కింగ్ ఉద్భవించాడనీ  రాశారు.


         నిజజీవితంలోనే దక్షిణాఫ్రికాలో మామూలు గాంధీని  జాత్యాహంకారంతో తెల్లవాడు రైల్లోంచి తోసేసి నప్పుడు,  ఆయన అంతరంగం సంధించిన ప్రశ్నే స్వాతంత్ర్య పోరాటానికి పురిగొల్పి ,ఆయన్ని మహాత్ముణ్ణి చేసింది. అంతరంగం / అంతరాత్మ అనేది  లేకపోతే ప్రపంచంలో  ఏ గొప్ప పనీ సాధ్యం కాదు. మన చుట్టూ కూడా ఏ మంచి పనీ చేయలేం. చరిత్రలో హిట్లర్ లాంటి వాళ్ళు, ఈదీ అమీన్ లాంటి వాళ్ళు అంతరాత్మని చంపేసుకుని, తుంటరి మనసు చెప్పినట్టల్లా ఇగోతో ఆటాడారు, మారణహోమాలు సృష్టించారు.

        ‘కోయీ మిల్ గయా’ లో గ్రహాంతర జీవి అంతరాత్మ, మానసికంగా బలహీనుడైన హృతిక్ రోషన్ మన ఇగో, ‘పీకే’ లో అమీర్ ఖాన్ మన కాన్షస్ ఇగో అయితే, అంతరిక్షం  లోంచి అతను ప్రవేశించిన భూవాతావరణం అంతరాత్మ, ‘భజరంగీ భాయిజాన్’ లో పాప పాత్ర సర్వాంతర్యామి అయిన అంతరాత్మ.  

          హార్రర్ సినిమాల్లో దెయ్యాల కొంపలు  అంతరాత్మలు. పాత్రలు మన ఇగోలు. రొమాంటిక్ కామెడీల్లో ఎంతకీ ప్రేమలో పడని హీరోయిన్ అంతరాత్మ, హీరో ఆ అంతరాత్మలోకి దూకి లక్ష్యం (ప్రేమ) కోసం మునకలేసే మన ఇగో. ట్రాజడీల్లో ఎదురయ్యే సమస్య అంతరాత్మ, పరిష్కరించుకోలేక పతనమయ్యే పాత్ర మన ఇగో. 


         థ్రిల్లర్స్ లో విలన్ అతడి చుట్టూ  వాతావరణం అంతరాత్మ సెటప్, ఆ సెటప్  లోకి దూకే హీరో మన ఇగో. మర్డర్ మిస్టరీల్లో  మిస్టరీ అంతా మన అంతరంగం, మిస్టరీని చేధించే హీరో మన ఇగో. ఆర్ట్ సినిమాల్లో  ‘దొర’ అనే వాడు  భయపెట్టే అంతరాత్మ, జీతగాడు ఆత్మస్థైర్యం కోల్పోయిన మన ఇగో. కమ్యూనిస్టు అయిన ఆర్. నారాయణ మూర్తి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన సినిమాల్లో ఉద్యమాలు, పోరాటాలు అన్నీ వెలుపలి మనసు- లోపలి మనసుల సయ్యాటలే. లేకపోతే ఆ సినిమాలే ఆడవు.


        మొత్తంగా చూస్తే  కథలన్నీ మన అంతరంగంలోకి లేదా అంతరాత్మలోకి మన ఇగో చేసే ప్రయాణాలే. కథంటే అంతరంగంలోకి ఇగో చేసే ప్రయాణం...దీన్ని రామకోటిలా రాసుకోవాలి.  అంతరంగం స్క్రీన్ ప్లేలో మిడిల్ అయితే, ఇగో మనమే, అంటే మనం అభిమానించే హీరో!

          ఇగో ని మెచ్యూర్డ్ ఇగోగా మార్చే దిశగా ప్రయాణింప జేసేదే మంచికథ!
          ‘క్షణం’ లో చూడండి... అతనెప్పుడో  నాల్గేళ్ళ క్రితం ఇగో ప్రేరేపిస్తే హీరోయిన్ తో శారీరకంగా కలిసి వెళ్ళిపోయాడు. ఆ విషయం ఇక పట్టించుకోలేదు. తీరా తిరిగి వచ్చి తప్పిపోయిన ఆ హీరోయిన్ పాపకోసం వెతికే ‘ప్రయాణం’లో, చివరికి ఆ పాపే తనదని తెలుసుకున్నాడు- మెచ్యూర్డ్ ఇగోగా ఎదిగాడు. ఆ పాపని (అంతరాత్మని) తన కూతురిగా స్వీకరించి మోక్షం పొందాడు. మోక్షం ఇంకెక్కడో దొరకదు, మన అంతరాత్మని మనం శిరస్సు వంచి స్వీకరించగల్గితే  అదే మోక్షం. ఇంకే మోక్షమూ ఎక్కడా లేదు. 

           మనలోని ఇగోని చంపి పారేసుకోవడం చచ్చినా సాధ్యం కాదు. అందుకని పాడు పన్లు చేయించే ఇగోని సంస్కరించి మంచి ఇగోగా, మన దోస్తుగా మార్చుకోవడమే మనం చేయాల్సింది. అప్పుడే మనకి మోక్షం. మంచి సినిమా కథలు ఈ పనే చేస్తాయి- ఇగోని మెచ్యూర్డ్ ఇగోగా మార్చడం. ఆవారా హీరోని (ఇగోని) ఎలాగో కిందా మీదా పడి తెలిసిన నాటు వైద్యం (సైకో థెరఫీ) చేసి, మారిన  మనిషిగా (మెచ్యూర్డ్ ఇగోగా) తేల్చి ముగిస్తూనే వుంటారు అప్పుడప్పుడు మన సినిమాల్లో. 


          ఒకప్పుడు వదిలేద్దాం, ఇప్పుడు ‘మా సినిమాల్లో మంచి మెసేజ్ వుందం’ టారు, ఆ మెసేజ్ ఇచ్చే విధానం చాలా తికమక పెట్టేస్తుంది. అసలు మెసేజ్ లెక్చర్ ద్వారా ఎందుకివ్వాలి. కథలోకి ఇగోని ప్రయాణింపజేసి, మెచ్యూర్డ్ ఇగోగా మార్చే కథలకి,  ఏ మె సేజూ ఓరల్ గా ఇచ్చే అవసరం రాదు- ‘క్షణం’ లాంటి థ్రిల్లర్ కూడా సైకలాజికల్ గా కనెక్ట్ అయి,  డీఫాల్డుగా వుండే అత్యుత్తమ మెసేజిని ఇవ్వకనే ఇచ్చేస్తోంది.


          ఇగోని  మెచ్యూర్డ్ ఇగోగా మార్చే కథల్లో డీఫాల్డుగానే దైవవాణి వుంటుంది. దైవవాణికి మించిన మెసేజి ఏముంటుంది? యాక్షన్, ఫ్యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ, లవ్, హార్రర్, థ్రిల్లర్, విప్లవ, దేశభక్తి, దైవభక్తీ...ఇంకే కథలకైనా ఒకే దైవవాణి( మెసేజ్) వుంటుంది - న్యాయం, ధర్మం, నైతిక విలువలు పాటించుకోమని.


          స్క్రీన్ ప్లే అంటే  ‘just  character  and  structure , conflict  and  turning  points’  మాత్రమే కాదనీ, అలాటి స్క్రీన్ ప్లేలు ‘don’t  make  a psychological connection,  they  lack  hidden  wisdom  and  truth, and  they  are not really  that entertaining…’  అని బానెట్ రాశారు. దురదృష్టవశాత్తూ హాలీవుడ్ లో కొత్త వాళ్ళు వచ్చేసి ఇలాగే రాసేస్తున్నారనీ, you  have  an  entire  industry  manufacturing something  it  doesn’t  understand.  If  they  did  it  in Detroit,  manufactured cars  without  a  clue  to their  real  purpose,  it  would  be  a  joke. The  motor would  be  in  the  back  seat  and  the wheels  would  be  in the  trunk. You’d have chaos!’   అన్నారు. 

        ‘without   clue  to their  real  purpose’  తో కథ తయారు చేస్తే ఎలా వుంటుందంటే, ఉదాహరణకి ‘ఊపిరి’ లో కార్తీ పాత్రకి పెట్టిన కుటుంబ కష్టాల చాంతాడంత కథ. కార్తీ నాగార్జున దగ్గరికి అంతరాత్మలోకి జర్నీ చేసే ఇగోగా ప్రవేశించాక, మళ్ళీ అవతల కుటుంబ కష్టాలతో కూడిన ఇంకో అంతరాత్మలోకి జర్నీ  ఏమిటి? మనిషికి రెండు అంతరాత్మ లుంటాయా? దీనికి  ఏ మాత్రం సైకలాజికల్ కనెక్ట్ వుంటుంది? 

          అలాగే ‘సూర్య వర్సెస్ సూర్య’ లో సూర్యరశ్మి పడని  జబ్బుతో వుండే  హీరో / ఇగో  కథ- ఆ సూర్య రశ్మి అనే అంతరంగ ప్రపంచంలోకి ప్రవేశించిన తర్వాత,  దాంతో అమీ తుమీ తేల్చుకోకుండా, హీరోయిన్ తో ప్రేమాయణమే తన ప్రయాణంగా మార్చుకుంటే, సైకలాజికల్  కనెక్ట్ అంతా ఏమైపోవాలి? అంటే  Manufacturing   stories   without   clue  to their  real  purpose  అన్నమాట! ఏం చేస్తున్నామో, అసలేం చెయ్యాలో తెలీక ఏదో చేసెయ్యడం! 

          ఒకసారి పునశ్చరణ చేసుకుందాం :           

            1. కథ ప్రయోజనం ఇగోని మెచ్యూర్డ్ ఇగో దిశగా ప్రయాణింప జేయడం.          
    2. స్క్రీన్ ప్లే అంటే కాన్షస్ (వెలుపలి మనసు) – సబ్ కాన్షస్ (అంతరాత్మ) ల ఇంటర్ ప్లే (సయ్యాట).          
3. హీరో అంటే మనం, మన ఇగో.          
     4. వెలుపలి మనసు అంటే స్క్రీన్ ప్లే లో బిగినింగ్ విభాగం.         
    5. వెలుపలి మనసుతోనే మన ఇగో/ మనం ఎంజాయ్ చేస్తూంటాం.          
      6. వెలుపలి మనసు లాంటి బిగినింగ్ విభాగంలో హీరో కూడా ఎంజాయ్ చేస్తూంటాడు.
          7. ఆనందంగా వున్న మనకి సమస్యలొస్తాయి. అంతరాత్మతో సంఘర్షణలో పడతాం.
          8. బిగినింగ్ విభాగంతో హీరోకి / మన ఇగోకి కూడా హనీమూన్ ముగిసి సమస్యలో ఇరుక్కుంటారు.
          9. నిజజీవితంలో మనం అంతరాత్మతో సంఘర్షణ కి దిగితాం. 
          10. కథలో హీరో / ఇగో అంతరాత్మలాంటి మిడిల్ లోకి ప్రవేశించి  సంఘర్షణ ప్రారంభిస్తాయి.

          (వచ్చేవారం సైకలాజికల్ లాకింగ్ ఫార్ములా తెలుసుకుందాం)

-సికిందర్







         

          

          













            
            





          

2, ఏప్రిల్ 2016, శనివారం

రివ్యూ !

రచన- దర్శకత్వం : రాం గోపాల్ వర్మ
 తారాగణం : మంచు మనోజ్, జగపతి బాబు, వడ్డే నవీన్, ప్రకాష్ రాజ్, సురభి, మంజుభార్గవి, పూనమ్ కౌర్, అభిమన్యు సింగ్, నర్సింగ్ యాదవ్, చలపతి రావు తదితరులు
సంగీతం
: రవిశంకర్, ఛాయాగ్రహణం : అంజి
బ్యానర్ : సికె ఎంటర్ టైన్మెంట్స్ – శుభ శ్వేతా ఫిలిమ్స్
నిర్మాతలు : స్వెట్లానా, వరుణ్, తేజా, సివి రావు
సమర్పణ : సి. కళ్యాణ్
విడుదల : ఏప్రెల్ 1, 2016
***
రాం గోపాల్ వర్మతో ఒక భరోసా వుంటుంది. ఆయన అంబాసిడర్ కారు నడుపుకుంటూ ఎప్పుడూ రాడు. కొత్త కొత్త మోడల్ కార్లు డ్రైవ్ చేసుకుంటూ వస్తాడు. ఇవాళ్టి దర్శకులు కొందరు ఇంకా ‘సావిత్రి’ లాంటి పాత అంబాసిడర్ కారునే చోద్యంగా తోలుకుంటూ వస్తూంటే, వర్మ తిప్పితిప్పి తీసేవి రెండు మూడు జానర్లే అయినా, వాటి ఉన్న బడ్జెట్ లోనే నిర్మాతకి ఎక్కువ క్వాలిటీనీ కొత్తదనాన్నీ  ఇవ్వాలని ప్రయత్నిస్తూ, ‘హై ఎండ్ కార్లని’ వాడేస్తూంటాడు. పాతికేళ్ళుగా సినిమాలు తీస్తున్నా పాతబడి పోకుండా,  పాత స్కూల్ అన్పించుకోకుండా, ఎవరు నేర్చుకున్నా నేర్చుకోక పోయినా,  ఎవరు చూసినా చూడకపోయినా, స్క్రిప్టులో కొత్త టెక్నిక్స్ నీ, మేకింగ్ లో కొత్త టెక్నిక్స్ నీ ప్రవేశపెడుతూ జోరుగా డ్రైవ్ చేసుకుంటూ తన మానాన తను వెళ్లిపోతూంటాడు- ‘ఛోటీసీ యే దునియా పహెచానే రాస్తే హై..తుమ్ కహీఁ తో మిలోగే,  తో పూఛేంగే హాల్ ..’ అనిపాడుకుంటూ.

         
నిన్న ‘కిల్లింగ్ వీరప్పన్’ అనే డాషింగ్ డాక్యూ డ్రామా తీస్తే, ఇవ్వాళ ‘ఎటాక్’ అనే గ్యాంగ్ స్టర్ థ్రిల్లర్ తీశాడు. జీవిత చరిత్రని మరోకోణంలో చిత్రానువాదం ఎలా చేయాలనే దానికి ‘కిల్లింగ్ వీరప్పన్’  ని గైడ్ లా అందిస్తే,  ఒపెన్స్ సస్పెన్స్ తో ఎండ్ సస్పెన్స్ అనే  ఊబిలో పడకుండా ఎలా బయటపడొచ్చో ‘ఎటాక్’ ని రూల్ బుక్ లా అందించాడు. తెలుసుకోవాలన్న ఆసక్తి వుందా?  అయితే కథలోకి వెళ్దాం...

కథ 

     హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఒకప్పుడు రౌడీయిజంతో బతికిన గురురాజ్  (ప్రకాష్  రాజ్), రౌడీయిజానికీ కుటుంబ యోగ క్షేమాలకీ లంకె కుదరని, రౌడీయిజాన్ని వదిలేసి ‘చార్మినార్ గ్రూప్స్’ అనే కంపెనీని  పెట్టుకుని కుటుంబంతో సంతోషంగా గడుపుతూంటాడు. అయినంత మాత్రాన పాత జీవితం వెన్నాడక పోదని అప్రమత్తంగా ఉంటాడు. భయపడినట్టు జరగనే జరుగుతుంది- ఒకరోజు గుడి కెళ్ళి వస్తున్న తనని మాటు వేసిన శత్రువులు చంపేస్తారు.

          గురురాజ్ కి ముగ్గురు కొడుకులు, భార్య. పెద్ద కొడుకు కాళి (జగపతి బాబు) తండ్రి హత్యకి బాధ్యుడు పాత శత్రువు నర్సింహులేనని వాదిస్తాడు. చాలా కాలంగా నలుగుతున్న భూవివాదమే ఈ హత్యకి కారణమనీ, ఆ నర్సింహులుని వదిలిపెట్టే ప్రసక్తే లేదనీ అంటాడు.  

          రెండో కొడుకు గోపి ( వడ్డే నవీన్) ఇంకా  ఈ చంపుకోవడాలు వద్దంటాడు, ఆ భూమిని వదిలేద్దామంటాడు. చిన్న కొడుకు రాధ ( మనోజ్) పెద్దన్న కాళీనే సపోర్టు చేస్తాడు. రాధని ప్రేమిస్తున్న వల్లి ( సురభి) కంపెనీ బిజినెస్  చూసుకోకుండా మళ్ళీ  గొడవల్లోకి తలదూర్చావంటే వెళ్ళిపోతానని హెచ్చరిస్తుంది.

          కాళి మాత్రం పగబట్టిన త్రాచులా నర్సింహులు కోసం గాలిస్తూనే వుంటే, ఓ పోలీస్ ఇన్స్ పెక్టర్ ఉప్పందిస్తాడు, నర్సింహులు ఫలానా టైములో ఫలానా చోట వుంటాడని. ఈ సమాచారంతో తన గ్రూపుతో అక్కడికెళ్ళిన  కాళీని మాటువేసి చంపేస్తారు గ్రూపుతో సహా ప్రత్యర్ధులు. దీంతో ఇక వూరుకోననీ, తండ్రినీ, అన్ననీ చంపిన వాళ్ళందర్నీ, చంపడానికి తోడ్పడ్డ వాళ్ళందరితో సహా,  అంతమొందిస్తానని  ప్రకటించి ఎటాక్ కి బయల్దేరతాడు రాధ. 

          తెరపైకి రాని  మూల శత్రువు నర్సింహులెవరో వాణ్ణి కనుక్కోవడం రాధ టాప్ ప్రయారిటీగా వుంటుంది. ఎందుకంటే,  తనకి తెలిసి ఎప్పుడో పదిహేనేళ్ళ  క్రితం తన చిన్నప్పుడు, తన తండ్రీ- నర్సింహులు ప్రత్యర్ధులని వినడమే గానీ నర్సింహులుని చూసింది లేదు.
          ఈ నేపధ్యంలో రాధ వేట మొదలెడతాడు..


ఎలావుంది కథ
        పాతదే. కానీ మెసేజ్ రెబెల్ ధోరణిలో వుంది. రామాయణ భారతాల్ని చూపిస్తూ శత్రువుల్ని మంచితనంతో క్షమించరాదనీ, వధించడమే ధర్మమనీ చెబుతున్నాడు వర్మ. నేరం చేసిన వాణ్ణి శిక్షించడం దేవుడితో మనిషి కూర్చుని  రాయించుకున్న ధర్మ సూత్రమని హీరో పాత్రద్వారా అన్పిస్తాడు (ఈ డైలాగు మాత్రం టెర్రిఫిక్ గా, ఎమోషనల్ గా వుంది). చట్టాల్ని సీనులోకి తీసుకు రాకుండా, ఎవరి చట్టం వాళ్ళే రాసుకుని శత్రువుని చంపెయ్యాలనీ  చెబుతున్నాడు. దీన్నెవరూ సీరియెస్ గా తీసుకోరు, అది వేరే విషయం...కానీ ఈ వాదంతో తన సేఫ్టీ కోసం రామాయణ మహా భారతాలని ఉటంకించినట్టు కన్పిస్తాడు. మతగ్రంధాలకి తప్పుడు భాష్యాలతో టెర్రరిస్టులు చేస్తున్నది ఇదేగా? కాకపోతే వర్మ వక్ర భాష్యాలు చెప్పడం లేదు. 

          ఏదోవొక వివాదాస్పద అంశాన్ని జోడిస్తే గానీ రొటీన్ కథలు నిలబడవని కావొచ్చు. అయితే, దీన్నయినా  మన మానసిక చీకటి కోణాల్లో ఎక్కడో సమర్ధించుకుని రహస్యంగా  సంతృప్తి పడాలన్నా,  కాస్త సన్నివేశ బలం అవసరం. ఆ సన్నివేశ బలం ఏమిటో, అదెందుకు  లేదో తర్వాత చూద్దాం. అయితే గ్యాంగ్ స్టర్ థ్రిల్లర్ డిమాండ్ చేసే జానర్ మర్యాదలన్నిటినీ తుచ తప్పకుండా వర్మ పాటించి- ఈ కథని చివరంటా కళ్ళప్పగించి చూడగలిగేట్టు కథనం చేశాడు- అదీ గొప్పతనం. 


ఎవరెలా చేశారు

       ఇందులో హేమాహేమీలు నటించడం బాక్సాఫీసు అప్పీల్ కి ప్లస్ అయింది. ఓపెనింగ్స్ బాగానే వున్నాయి. ఆ హేమాహేమీలతో ఇది ఉత్త తాటాకుల చప్పుళ్ళే  అని అన్పించకుండా వాళ్ళ పాత్రల్నీ, నటనల్నీ సమర్ధవంతంగా తెరకెక్కించాడు వర్మ. మారిన మనిషిగా ప్రకాష్ రాజ్ హుందాతనంతో కూడిన నటన, హావభావాలూ   మైక్రోస్కోపిక్ విజన్ తో శోధిస్తున్నట్టు విస్పష్టమైన  క్లోజప్స్ తో  కట్టి పడేస్తాయి. 

          అలాగే జగపతిబాబులోని  ప్రతీకారేచ్ఛతో కూడిన ముఖభావాలూ మనల్ని వెన్నాడతాయి. మంచుమనోజ్ నుంచి కూడా కమర్షియల్ కి దూరంగా రియలిస్టిక్ అప్రోచ్ తో ప్రదర్శించిన నటనని ఎంజాయ్ చేయగలం. మంజుభార్గవి కూడా ఒక కీ లక సన్నివేశంలో ఇచ్చిన టైట్ క్లోజప్ ఒక క్లాసిక్ ఆర్ట్. ఆ షాట్ ని అలాగే కత్తిరించి ఫ్రేము కట్టించి గోడకి పెట్టుకుంటే, మొనాలిసాతో పోటీ పడుతుంది. 

          గొడవలు వద్దని ఎప్పుడూ మనోజ్ ని సాధిస్తూ వుండే పాత్రలో సురభికి, ఎప్పుడూ అవే సీన్లు అరడజను సార్లు మార్చి మార్చి వస్తూంటాయి. ఇక విలన్ అభిమన్యు సింగ్ కి వాంప్ పాత్రలో పూనమ్ కౌర్, వర్మే తీసిన ‘కంపెనీ’ లో మనీషా కోయిరాలకి చెల్లెలు అన్పించే చేష్టలతో వుంటుంది. అభిమన్యు సింగ్ ఈ సినిమాలో తొలిసారిగా ప్లే బాయ్ లుక్ తో కన్పిస్తాడు. ఇంకా చిన్న చిన్న రౌడీలున్నారు. ఆయా సన్నివేశాల్లో వాళ్ళ విచిత్రమైన క్లోజప్స్ కూడా  సన్నివేశాలకి బలం చేకూరుస్తాయి. ఇక తెరపైకి తిరిగి వచ్చిన ఒకప్పటి హీరో వడ్డే నవీన్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. 

        కెమెరా వర్క్  ఈ థ్రిల్లర్ ని చాలా నిలబెట్టింది. జానర్ మర్యాదకి తగిన ఛాయగ్రహణం ప్రాణం ఈ సినిమాకి. ఈ కెమెరా వెనుక కన్ను అంజిది. అద్భుతమైన దృశ్య ఫలితాల్ని ఇచ్చాడితను.   ఒక రివెంజి డ్రామాని కూడా కంటికింపైన రంగులతో తీయవచ్చా అన్నది ఎప్పుడూ ప్రశ్న కాలేదు. కాకపోతే వర్మ ఎప్పుడూ ఇలా తీయలేదు. ఆయనదెప్పుడూ గ్రే- బ్రౌన్- ఎల్లో టింట్సే.

          ఈసారి మాత్రం  కలర్ గ్రేడింగ్ ని   రెడ్- పింక్ టింట్స్ లకి మార్చేశారు. ఇదెంతో విజువల్ ట్రీట్ ని సంతరించి పెట్టింది. ఏ కలర్ తోనూ, ఏ లైటింగ్ తోనూ ఎక్కడా డార్క్ మూడ్ అనేదే క్రియేట్ చేయకుండా, టేబుల్ మీద నోరూరించే తియ్యటి కేక్ ని అమర్చి పెట్టినట్టుగా దృశ్యాల్ని మనోరంజితం చేశారు.

          ఓల్డ్ సిటీ, పురనాపుల్, నయాపుల్, మూసీ నదుల ఏరియల్ షాట్స్ అయితే మైండ్ బ్లోయింగే. ఇలాటి ఓల్డ్ సిటీ  షాట్స్ ఇంతవరకూ ఏ తెలుగు సినిమాలోనూ రాలేదు.ఓల్డ్ సిటీ భవనాలూ గల్లీలూ కూడా, పింక్ టింట్ తో అద్భుతంగా  వెలిగిపోతూంటాయి. నడిబజార్లో ప్రకాష్ రాజ్ ఓపెన్ ఇల్లు నేటివిటీకి నిలువెత్తు సాక్ష్యంలా వుంటుంది.

          యాక్షన్ సీన్ల చిత్రీకరణ కూడా కాస్త భిన్నంగానే వున్నా, క్లయిమాక్స్ లో విలన్ తో మనోజ్  పోరాడుతున్నప్పుడు ఎంతసేపూ ఇద్దరూ పెనుగులాడుకోవడమే సరిపోయింది- పంచులిచ్చుకోకుండా. అరటి పండుకోసం చిన్న పిల్లలిలాగే పెనుగులాడుకుంటారు. అలాగే గన్ షాట్స్  ఎఫెక్ట్స్ మూస పద్ధతిలో వున్నాయి. ఒక రివాల్వర్ ఒకసారి పేలిందంటే దాని  శబ్దంతో గుండెలదరాలి- వయోలెంట్ యాక్షన్లో వెపన్స్ కూడా వయోలెంట్ గానే  వుండాలికదా. 

       ఇక జగపతి బాబుని నిలువెల్లా కాల్చేసింతర్వాత, అతను  సీన్లోంచి అవుట్ అవడం, దర్శకుడు  కట్ చెప్తే  నటన విరమించుకుని వెళ్లి పోయినట్టుంది- ఇలాటిదే ఇంకో యాక్షన్ సీన్లో మనోజ్ తోనూ  జరిగింది. ఈ రెండూ అన్వర్ అలీ ఎడిటింగ్ లో వుండాల్సినవి కావు.
          

         ఇక సినిమా ప్రారంభంలో ప్రకాష్ రాజ్ హత్య, ఇంటర్వెల్ దగ్గరలో జగపతి బాబు హత్య, అలాగే సెకండాఫ్ లో మనోజ్ ని చంపడానికి ఎటాక్ - ఈ మూడూ స్ట్రక్చర్ ని విజువలైజ్ చేసే  మంచి ప్లేస్ మెంట్సే. 

          అయితే ఈ  మూడూ మూసలో ఉండకుండా చూడాల్సింది. ప్రకాష్ రాజ్ ని చంపేటప్పుడు పావురాల గుంపుతో యాక్షన్ ఒక మూస,  జగపతి బాబుని చంపేటప్పుడు వర్షంలో గొడుగులతో యాక్షన్ ఇంకో మూస,  దోభీ ఘాట్ లో మనోజ్ మీద ఎటాక్ చేయడం  మరింకో మూస. ఈ పావురాలూ గొడుగులూ దోభీ ఘట్లూ ఏనాటి మూసో!  వీటిని మారుస్తూ కొత్త ‘మూసని’ కనిపెట్టాల్సింది వర్మ. 

          పోతే, ప్రకాష్ రాజ్ ని క్లోజప్ లో కూడా అంత మంది అన్ని సార్లు కాల్చినపుడు, ఆయన తెల్ల చొక్కా మీద ఒకే ఒక్క గాయం మాత్రమే అయినట్టు  రక్తం కారడం ఏమీ బాగాలేదు.

          తీయడంలో ఇలాటి టెక్నికల్ లోపాలు కొన్ని దొర్లినా, కథ చెప్పడంలో దర్శకుడుగా ఎక్కడా ఫోకస్ కోల్పోలేదు వర్మ. అలాగే చిత్రీకరణలో, సన్నివేశాలకి  డెప్త్ తీసుకురావడానికి మింగిల్ చేసిన పక్క పాత్రల ‘బిజినెస్’ షాట్స్ తో, వర్మ సంస్కారవంతమైన దర్శకత్వం వహించాడు.

        ఇక సంగీతం విషయానికొస్తే, బ్యాక్ గ్రౌండ్ లో రెండూ థీమ్ సాంగ్సే. ఈమధ్య ఇలాటి సినిమాలు వర్మ తీస్తూ పెడుతున్న విచిత్రమైన గొంతుకల, హింసని ప్రేరేపించే  అరుపుల పాటలు ఇందులో కూడా వున్నాయి. 

చివరికేమిటి     
     కొ
న్ని స్క్రీన్ ప్లే సంగతులు చెప్పుకుని ముగిద్దాం. వర్మ సెట్ చేసుకున్న ఈ స్క్రీన్ ప్లేని త్రీ యాక్ట్స్ కింద విభజిస్తే, జగపతిబాబుకి నర్సింహులు ఆచూకీ చెప్తానని ఇన్స్పెక్టర్ అనడం, కథలో ప్రధాన సమస్యకి  దారితీసే పరిస్థితుల  కల్పనలో భాగంగా వచ్చే ఒక బీట్. ఇది సుమారు నలభై  నిమిషాలకి వస్తుంది. 

          ఇక్కడ్నించీ జగపతి బాబు  నర్సింహులు కోసం వెళ్ళడం, తనే హత్యకి గురి కావడం, హాస్పిటల్లో చనిపోవడం ఇంకో అయిదు నిమిషాల్లో జరిగిపోతుంది. బిగినింగ్ ముగుస్తుంది. ఇంటర్వెల్ పడుతుంది.  అంటే ముప్పావు గంటలో ఇంటర్వెల్ వచ్చేస్తుందన్న మాట.

          ఇలా ఇంటర్వెల్ సీనే బిగినింగ్ ముగింపు సీను కావడం బహుశ ఇదే మొదటి సారి చూడ్డం. ఇంటర్వెల్ తర్వాత  కథకి హీరో అయిన మనోజ్ కి ఇక శత్రువు లందర్నీ చంపెయ్యాలన్న గోల్ ఏర్పడుతుంది – అంటే ప్లాట్ పాయింట్- 1 అన్న మాట.  

          అంటే కథ మిడిల్లో పడిందన్న మాట.  మిడిల్ అంటే గోల్ కోసం హీరో చేసే స్ట్రగులే కాబట్టి- హంతకుడైన నర్సింహులు ని కనుక్కోవడానికి వివిధ ప్రయత్నాలు చేసి, చివరికి వాణ్ణి పట్టుకుంటే అసలు రహస్యం తెలిసి,  ఆ తెలుసుకున్న రహస్యంతో అసలు విలన్ని పట్టుకుంటాడు.

          రెండో అన్నతో బాటు హీరోయిన్ కూడా ఎదురు తిరగడంతో,  ఆ విలన్ తో రాజీ ప్రయత్నానికి సిద్ధమవుతాడు హీరో. ఇక్కడ మిడిల్ ముగిసి ప్లాట్ పాయింట్ - 2 ఏర్పాటయింది.

          మిడిల్ ముగియడమంటే గోల్ కోసం హీరో చేస్తున్న స్ట్రగల్ కి చివరి ఎత్తుగడ పన్నడమే కాబట్టి- అలా ఈ ప్లాట్ పాయింట్-  2 దగ్గర నుంచీ రాజీ మంత్రంతో విలన్ ని ఆశ్రయిస్తాడు మనోజ్. అంటే ఎండ్ లో పడింది కథ. ఆ రాజీమంత్రమే అస్త్రంగా క్లైమాక్స్ వైపు పయనం! 

          హీరో ఎవరు? గురురాజ్ చిన్న కొడుకు (బిగినింగ్
), ఇతను ఇరుక్కున్న సమస్యేమిటి? తన తండ్రిని, అన్నని చంపిన శత్రువు లందర్నీ చంపడం (మిడిల్),  ఈ సమస్య లోంచి ఎలా బయట పడ్డాడు? రాజీ మంత్రంతో ( ఎండ్). 

          పోతే, ఈ స్క్రీన్ ప్లే బలమేమిటి? థ్రిల్లర్ సినిమాకి నష్టం చేసే ఎండ్ సస్పెన్స్ కథనాన్ని ఎవాయిడ్ చేస్తూ ఓపెన్ సస్పెన్స్ ని మెయిం టెయిన్ చేయడం. 

          అదెలా? ‘కథాకళి’..  ‘కథాకళి’ లాంటి ఇంకెన్నో  సినిమాలూ చూస్తే తెలుస్తుంది. ఏముంది వాటిలో? ‘కథాకళి’ నే తీసుకుందాం. విలన్ ని ఎవరో చంపితే ఆ నేరం హీరో మీద పడుతుంది.  హీరో తో సహా ప్రేక్షకులకి కూడా హంతకుడెవరో తెలీదు. కొందరు  అనుమానితులుగా  కన్పిస్తూంటారు. 

          వీళ్లల్లో  హంతకుడెవరా అని మనం గెస్ చేస్తూ వుంటాం. చివరికి – కథ నడిపీ నడిపీ ఎండ్ లో ఆ సస్పెన్స్ విప్పి ఇదిగో ఈ ఫలానా వాడే  హంతకుడని చూపించేశారు. సినిమాలకి ఈ విధానం పనికి రాదని చాలా సార్లు చేతులు  కాల్చుకున్న తర్వాత హాలీవుడ్ తెలుసుకుంది. 

          ప్రేక్షకుల ఓపికని ఇది  చాలా పరీక్షిస్తుంది. హీరోకి విలన్ (హత్య చేసిన వాడు) కన్పించక  ఏక్  నిరంజన్ లా, లింగు లిటుకుమని, తాడూ బొంగరం లేనివాడిలా కథంతా వేస్టుగా పాసివ్ గా తిరుగుతూ, టైం ( బుర్ర కూడా) తినేస్తూంటాడు. వీణ్ణి పట్టి  అమెజాన్ అడవుల్లో పడెయ్యాలన్పిస్తుంది. గోల్ వుంటుంది, విలన్ లేక కాన్ ఫ్లిక్టే వుండదు. 

           ఇలా కాకుండా,  హత్య చేసింది ఫలానా హంతకుడని హీరోకి, ప్రేక్షకులకీ తెలిసిపోయే ట్టు కథనముంటే, అప్పుడు ఆ హంతకుణ్ణి పట్టుకునే యాక్షన్ లోంచి  యాక్టివ్ పాత్ర, థ్రిల్లింగ్ కథనం సాధ్యమవుతాయి. దీన్ని సీన్ - టు – సీన్ సస్పెన్స్ అంటారు. ఎందుకంటే తెలిసిన కిల్లర్ ఎలా పట్టుబడతాడా అని సీను సీనుకీ సస్పెన్స్ ని పెంచుతూ కథనం – కాన్ ఫ్లిక్ట్- పరస్పర ఎత్తుగడలూ వుంటాయి గనుక.

          ఇంకో పధ్ధతి  మర్డర్ చేస్తున్నప్పుడు కిల్లర్ ని  ప్రేక్షకులకి మాత్రమే చూపించేసి, హీరోకి చూపించకపోవడం. అయితే ప్రేక్షకులకి తెలిసి హీరోకి తెలియని కథనంతో బలహీన మవుతుంది. 

          ఉత్తమ కథనానికి గుర్తు- ప్రేక్షకులు హీరోని ఫాలో అవుతూ అతను కనుగొంటున్న ర హస్యాల్ని అదే  సమయంలో  అతడితో బాటే తెలుసుకుంటూ- హీరో తో బాటే థ్రిల్లవడం. టై అప్ జర్నీ చేయడం.

          ‘ఎటాక్’ లో జరిగిందేమిటంటే, ఎండ్ సస్పెన్స్ కాదు, సీన్ టు సీన్ సస్పెన్స్ కూడా కాదు- పైన చెప్పుకున్న టై అప్ జర్నీ. అంటే ఓపెన్ సస్పెన్స్. 

          సస్పెన్స్ అన్నది ఒక అంశం అనుకుంటే, ఆ అంశానికి రెండు పార్శ్వా లుంటాయి : ఎవరు? ఎందుకు? అనేవి. 

          వీటిలో ఒకటే ఓపెన్ చేసి రెండోది  మూసి పెట్టినప్పుడు,  ఆ మూసిపెట్టిన పార్శ్వమే కథని నడిపిస్తూ వుంటుంది. ఫలానా వాడు హత్య చేశాడని చూపించి, ఎందుకు చేశాడో మూసిపెట్టి నడపడం, లేదా ఎందుకు చేశాడో చూపించి, వాడెవడో మూసిపెట్టడం...అన్నమాట!
          ‘ఎటాక్’  లో రెండోది జరిగింది. 

        మొట్టమొదట ప్రకాష్ రాజ్ ని  ఒకడి నాయకత్వంలో వచ్చి కొందరు చంపుతారు. ఈ నాయకుణ్ణి చూస్తే  కథకి విలన్ లాగే వుంటాడు (ఇలాటి ఆర్టిస్టుల్ని పెట్టి మిస్ లీడ్ చేయడం సస్పెన్స్ థ్రిల్లర్స్ లో మామూలే). ప్రకాష్ రాజ్ ని ఎందుకు చంపారో కథనంలో చెప్పేశారు, ఎవరు చంపి వుంటారో కూడా నర్సింహులు అనే పేరుని  వెల్లడి చేస్తూ చెప్పేశారు. కానీ ఆ నర్సింహులు ఎవరో మనకి చూపించలేదు. కానీ మనం చూసిన ఆ విలన్ లాంటి వాడే అయ్యుంటాడని మనకి దొలుస్తూ వుంటుంది. వాడేనా కాదా, వాడెక్కడున్నాడు,  ఎలా దొరికిపోతాడు,  అన్న రకరకాల సస్పెన్సులు ఏర్పడి ఊపిరి బిగబట్టి చూడడమే మనపని.

            ఇలాటి థ్రిల్లర్ కథనం ఎలా ఉంటుందంటే,  ఫస్టాఫ్ సెకండాఫ్ కనిపించని కవలల్లాగా వుంటాయి. ఫస్టాఫ్ లో హీరోకి గోల్ ఏర్పడడానికి ఒకటి కాదు రెండు మూడు సంఘటనలు  జరుగుతాయి- లేకపోతే గోల్ ఏర్పడేందుకు తగ్గ ఎమోషన్ వుండదు. ఫస్టాఫ్ లో తండ్రి చావు చూశాక, అన్న చావుకూడా చూశాక ఇక విజృంభించాడు మనోజ్.

           సెకండాఫ్ లో ఏం జరుగుతుందంటే, ఫస్టాఫ్ లో హీరో పాత్ర  రెండు సంఘటనలతో వేడెక్కి రెండు మెట్లు ఎక్కినట్టే, సెకండాఫ్ లో వేడి తగ్గి  రెండు మెట్లు దిగుతాడు.

           ఫస్టాఫ్ లో వేడెక్కించిన ఆ రెండు మెట్లూ తండ్రి చావు, అన్న చావులైతే-
           సెకండాఫ్ లో వేడి తగ్గి దిగివచ్చిన ఆ రెండు మెట్లూ- ఒకటి, మనం భావిస్తున్నవాడు నర్సింహులే కాదని తేలడం;  రెండు, నర్సింహులునే పట్టుకుంటే వాడికి హత్యలతో సంబంధమే  లేదని తేలడం!

          ఈ పోలికలతో ఫస్టాఫ్  సెకండాఫ్ రెండూ కవలలు. ఇలా ఉన్నప్పుడే రెండూ ఒకదానితో ఒకటి బ్యాలెన్స్ చేసుకుంటూ కుప్పకూలకుండా వుంటాయి.

          నర్సింహులు కూడా కాకపోతే ఇంకెవరన్నది ట్విస్ట్. సెకండాఫ్ లో రెండు మెట్లు జారి కింది కొచ్చిన  హీరో ఈ ట్విస్టుతో మళ్ళీ మొదటి కొచ్చాడన్న మాట. యాదృచ్చికంగా ఈ ట్విస్టే  ప్లాట్ పాయింట్ -2 అవుతుంది.

          ఓపెన్ సస్పెన్స్ ఎప్పుడూ కథని పొరలు పొరలుగా విప్పి చూపుతూంటుంది...
         
ఇక హీరో ప్రవచించే కంటికి కన్ను, పంటికి పన్ను న్యాయం కాన్సెప్ట్ రహస్యంగానైనా ఆనందిద్దామంటే మనకి అడ్డు పడుతోందేమిటంటే- మన కంతగా ‘కచ్చి’  పుట్టడం లేదు. ప్రకాష్ రాజ్ ని, జగపతినీ చంపడం మనం కళ్ళారా చూసినప్పటికీ, మనోజ్ రివెంజ్ కాన్సెప్ట్ కి మనం కనెక్ట్ కాలేక పోతున్నాం.  మన కళ్ళ ముందు ఆ చావులు చాలక, చావులకి కారణమయ్యాడని అంటున్న వాడితో గతం తాలూకు ఫ్లాష్ బ్యాకు లేక! ప్రకాష్ రాజ్ మంచి వాడిగా ఎలా బతికాడో వాటి తాలూకు మాంటేజెస్ మాత్రమే అప్పుడప్పుడూ చూపడం వల్ల! 

          నర్సింహులుతో ప్రకాష్ రాజ్ కి ఫ్లాష్ బ్యాక్ వేస్తే నర్సింహులెవరో  ప్రేక్షకులకి ముందే తెలిసిపోతుందనుకోవడం వల్ల!!

          దీనికేమిటి మందు? 
          మందుంటే మర్డర్లు చేయమని ప్రకృతి చెప్పినట్టే. కాబట్టి మందు లేదు!


          -సికిందర్  
http://www.cinemabazaar.in













           





1, ఏప్రిల్ 2016, శుక్రవారం

రచన- దర్శకత్వం : పవన్ సాదినేని
తారాగణం : నారా రోహిత్ , నందిత, ధన్యా బాలకృష్ణ, పోసాని, మురళీశర్మ, అజయ్, రవిబాబు, జీవా తదితరులు
సంగీతం : శ్రవణ్,  ఛా యాగ్రహణం : వసంత్
బ్యానర్ : విజన్ ఫిలిం మేకర్స్,  నిర్మాత : డా. విబి రాజేంద్రప్రసాద్
విడుదల : ఏప్రెల్ 1,  2016
***
          కప్పుడు నారా రోహిత్ అంటే భిన్నమైన కథలకి అవకాశమిస్తాడని పేరుండేది. బాణం, రౌడీ ఫెలో, అసుర లాంటి ప్రయోగాత్మక  సినిమాలతో తనదంటూ ఒక రూటు ఏర్పాటు చేసుకున్నాడని ఆనందిస్తున్నంతలోనే,  తిరోగమించి రొటీన్ మసాలాల, పాత మూస ఫార్ములాల బాటపట్టాడు! న్యూ జనరేషన్ నుంచి, ఎవరికీ పట్టని  ఓల్డ్ జనరేషన్ సినిమాలకి యూ టర్న్ తీసుకున్నాడు. సెల్ ఫోన్స్ కూడా ఇవ్వాళ 4 జి కి అప్డేట్ అవుతూంటే,  తను  ఎక్కడో 2 జి సినిమాల దగ్గరే ఉండిపోవాలని ఉబలాటపడుతున్నాడు!


       రెండు వారాల క్రితమే ‘తుంటరి’ తో సహనాన్ని పరీక్షించాక, తిరిగి ఇప్పుడు ‘సావిత్రి’ అంటూ పరమ చాదస్తంతో ‘సి’ సెంటర్లో కూడా ఆడని విషయంతో పరీక్ష పెట్టాడు ప్రేక్షకుల్ని. తన ఫిజిక్ పట్ల శ్రద్ధ ఎలా చూపడంలేదో, అలా సినిమాల ఎంపిక లోనూ అలసత్వం ప్రదర్శిస్తున్నట్టు తోస్తోంది  చూస్తూంటే. ప్రస్తుతం ‘సావిత్రి’ తో నైతే ఈ అలసత్వం పరాకాష్టకి  చేరింది!  ఇలా ఇంత భయపెట్టేస్తే, అసలే తగ్గిన తన ప్రేక్షకులు, ఇంకో తన సినిమాకి అసలు తొంగి చూస్తారా అని సందేహం!  

          గతంలో ‘ప్రేమ- ఇష్క్- కాదల్’  అనే ప్రేమ సినిమా తీసిన దర్శకుడు పవన్ సాదినేని ఇప్పుడు అతి చాదస్తపు, పాతవాసనల  సినిమాని, పాత దర్శకుడెవరో  తీసినట్టు తీసి అవతల పడేశాడు.

కథ
        సావిత్రి ( నందిత) ఓ పెళ్లి పందిట్లో పుట్టిన కారణంగా తను కూడా  త్వరగా పెళ్లి చేసుకుని అలాటి పెళ్లి సందడి  చూసుకోవాలన్న ఆరాటంతో వుంటుంది. పెళ్లి తప్ప ఇంకో ఆలోచనే వుండదు ఆమెకా  పల్లెటూళ్ళో. ఆమె తండ్రి (మురళీ శర్మ)  పెద్ద కూతురి ( ధన్యా బాలకృష్ణ ) పెళ్లి చేశాక,  ఇక సావిత్రికి కూడా సంబంధం చూస్తాడు. ఇదిలా వుండగా నానమ్మ తో కలిసి సావిత్రి షిర్డీ బయల్దేరుతుంది. ఈ రైలు ప్రయాణంలో ఆమెకు రిషి  ( రోహిత్) పరిచయమవుతాడు. ఇతను  ఎం బీ బీ ఎస్ చదివి(!)  ఆవారా తిరుగుళ్ళు తిరుగుతూ తల్లి చేత చివాట్లు తింటూంటాడు (ఇంతే కదా తెలుగు సినిమాల్లో, సైంటిస్టు కూడా ఆవారానే!).   ఇప్పుడు సావిత్రిని చూడగానే ప్రేమలో పడి  వెంటపడతాడు. ఒక ప్రేమ జంట పారిపోయి వచ్చి ఇదే రైలెక్కుతుంది. వీళ్ళ కోసం ఒక ముఠా వెంటపడుతుంది.  ఆ ముఠా బారి నుంచి ఆ జంటని కాపాడి, సావిత్రికి తన ప్రేమని వ్యక్తం చేస్తాడు రిషి. ఆమె తిప్పి కొడుతుంది. తమతో వున్న జంట కేమైందో కళ్ళారా చూసిన సావిత్రి, పెద్దలు కుదిర్చిన సంబధమే చేసుకుంటానంటుంది. రిషి నేరుగా వెళ్లి ఆమె తండ్రితో మాట్లాడతాడు.  అప్పటికే ఆమె తండ్రి సంబంధం చూసిన కుర్రాడు ఆ సంబంధం రద్దు చేసుకుంటాడు. ఇప్పుడు రిషిని కోప్పడి పంపించేస్తాడు సావిత్రి తండ్రి. సావిత్రిని ఎలాగైనా చేసుకుంటానని రిషి పంతం పడతాడు. ఇదీ కథ. 

ఎలావుంది కథ?
          ‘1980 – ఒక పాత పెళ్లి కథ’ అంటూ తీస్తే ఎలా వుంటుందో అలావుంది కథ.   ఇంత పురాతనమైన కథని ఈ రోజుల్లో ప్రేక్షకుల చేత ఒప్పించగలనని దర్శకుడు భావించడం చాలా తెగింపు. ఇంకా మూడు పదుల దర్శకుడే యూత్ సినిమాని ఈ తీరున పెళ్ళిళ్ళ చాదస్తంతో తీస్తే, ఇంకెవరు తెలుగు సినిమాని కాపాడతారన్నట్టుంది. దేశంలో ఎక్కడైనా ఇవ్వాళ యూత్ వీలైనంత ఎక్కువ కాలం సింగిల్ గా గడిపేద్దాం అనుకుంటున్నారు. ఈ సింగిల్ లైఫ్ లో పెళ్ళిళ్ళ గోల కాదు కదా, సీరియస్  ప్రేమలకి కూడా దూరంగా వుంటున్నారు. కేవలం కెరీర్ మైండెడ్ గా కొనసాగుతూ ఫ్లర్టింగ్ తో టైం పాస్ చేసేద్దామనుకుంటున్నారు. బాలీవుడ్ చేసిన  సర్వే రిపోర్టే ఇదంతా వెల్లడిస్తోంది- ఈ నేపధ్యంలో యూత్ సినిమాల్ని బాలీవుడ్ ఏనాడో పునర్నిర్వచించుకుని,  ఆ పోకడలతో తీస్తూ తిరిగి యూత్ ని తన వైపుకు తిప్పుకుంటోంది.

          తెలుగులో ఇలాటిది చేస్తే పాపం అనుకుంటున్నారు మూఢ నమ్మకాల జీవులు. అందుకు బాక్సాఫీసు దగ్గర అనుభవిస్తూనే వున్నారు.  తాము చూసిన అవే నాల్గు పాత తెలుగు సినిమా కథల్ని రీసైక్లింగ్ చేస్తూ, ఇదిగో ఇలాటి ‘సావిత్రి’ లాంటివి తీసి వీటికి  లేని మార్కెట్ పైన ఘరానాగా రుద్ది చేతులు దులుపుకుంటున్నారు. 

ఎవరెలా చేశారు
         
వర్నీ ఒక్క నిమిషం పాటు భరించడమే కష్టం. ఉన్న పదీ పదిహేను మందిలో ఇంటర్వెల్ కే సగం మంది ప్రేక్షకులు పరార్. రోహిత్ కాదుకదా, నందిత కాదుకదా, కమెడియన్లు కాదుకదా, ఇంకే సూపర్ స్టార్లు నటించినా వాళ్ళని కూడా భరించలేం ఈ సినిమాలో. కెమెరా, సంగీతంల సంగతి చెప్పనక్కర్లేదు. కథలాగే అన్నీ చప్పగా వున్నాయి. దర్శకుడి టేకింగ్, స్క్రీన్ ప్లే, మేకింగ్ ప్రతీదీ నాసిరకంగా వున్నాయి. 

చివరికేమిటి?
          ఏమీ లేదు, దర్శకుడు తన మూడు పదుల వయసులో ముప్పై పదుల సినిమా తీశాడు. ముదుసలులు కూడా చూసి తమ పాతజ్ఞాపకల్లో విహరిస్తారా అంటే, వాళ్ళు కూడా అప్పుడెపుడో ఓ రాజుని ఓ రుషి శపించినట్టు- యువదర్శకుణ్ణీ, రోహిత్ నీ ‘వృద్ధులైపోండి!’ అని దీవించేట్టున్నారు. 

          పోతే, గంట సేపు ట్రైన్ లోనే సాగే  సీన్లని తీయడానికి ఎన్ని తిప్పలో. కాస్సేపు ట్రైను ముందుకు పోతున్నట్టు, ఇంకాస్సేపు వెనక్కి పోతున్నట్టు చెట్లూ చేమలూ కదుల్తూ కన్పిస్తాయి. పోనిద్దాం- గత డిసెంబర్ లోనే గోపీచంద్ నటించిన ‘సౌఖ్యం’ లోనే ఈ తిప్పలు పడగా లేంది ఇదెంత!!


-సికిందర్
http://www.cinemabazaar.in/

PS :  సినిమాల్ని సమాజం ఫాలో అవదు,
సినిమాలే సమాజాన్ని ఫాలో అవుతాయి. 

30, మార్చి 2016, బుధవారం

సాంకేతికం...

ఎస్ రఘునాథ్ వర్మ 
                                                                                                   
      ఈ డిజిటల్ యుగంలో సినిమా క్రాఫ్టులు ఇంకా 24 శాఖలకే పరిమితమైలేవు. ఇప్పుడు 24 క్రాఫ్ట్స్  అనేందుకు కాలం చెల్లిపోయింది. గ్రాఫిక్స్, డీటీఎస్, డిజిటల్  ఫిలిం మేకింగ్, డీఐ  టెక్నాలజీ...ఇలా బహుముఖాలుగా విస్తరిస్తున్న కొత్తకొత్త  క్రాఫ్ట్స్ సంఖ్య పెరుతూ పోతోంది. డిజిటల్  ఇంటర్మీడియేట్ (డీఐ) విషయానికి వస్తే, అది డీఐ  ప్రభావమని తెలీక కొందరు సినిమా రివ్యూ రచయితలే ‘ఫోటోగ్రఫీ’ అద్భుతంగా వుందని రాసేసి ఆనందిస్తున్నారు. కంటికి కన్పించిందే నిజం కానవసరం లేదెప్పుడూ. కళలు వచ్చేసి ఓవర్ లాప్ అవుతున్న ఈ ఆధునిక సందర్భంలో, గ్రాఫిక్స్ ని చూస్తే  అది కళా దర్శకత్వమని అన్పించ వచ్చు. డీఐ ని చూస్తే అద్భుత ‘సినిమాటోగ్రఫీ’ లానూ తోచవచ్చు. గ్రాఫిక్స్ పార్టు కూడా దానికదే వైభావోపేతమనీ అన్పించవచ్చు.
      అసలు జరుగుతున్న దేమిటంటే, ఆ గ్రాఫిక్స్ చేసిన దృశ్యాలకి కూడా డీఐ చేయడం. గ్రాఫిక్స్ తో సృష్టించిన, బయట షూట్ చేసిన,  దృశ్యాల రంగుల్నీకాంతుల్నీద్విగుణీకృతం చేసే ప్రక్రియ డీఐ టెక్నాలజీ తో సమీప భవిష్యత్తులో ఒక్కటి గ్యారంటీగా జరగబోతోంది- ఈస్ట్ మన్ కలర్ రాకతో ఎలా బ్లాక్ అండ్ వైట్ సినిమాలు వెలవెలబోయాయో, డీఐ చేయని కలర్ సినిమాలు కూడా అలా కళావిహీనంగా కన్పిస్తాయి. తద్వారా అటువంటి సినిమాలకి ప్రేక్షకులు కూడా దూరమైపోతారు. అయితే-


          ‘చెన్నై లో థియేటర్లన్నీ  డిజిటల్ ప్రొజెక్షన్ కి మారిపోయాయి. కాబట్టి అన్ని తమిళ సినిమాలకీ డీఐ అవసరమవుతోంది. ఒకప్పుడు ఇక్కడ 130 సినిమాలు నిర్మిస్తే, వంద వరకూ డిజిటల్ ఫార్మాట్  లో ఉండేవి. తెలుగులో 30 మాత్రమే ఉండేవి. ‘హేపీడేస్’ తో తెలుగులో చిన్న సినిమాలకి కూడా ప్రారంభమైన డీఐ ప్రక్రియ మెల్ల మెల్లగా ఇంకా లోబడ్జెట్ సినిమాలన్నిటికీ ప్రాకిపోయింది’ అని చెప్పుకొచ్చారు చెన్నైలో ప్రముఖ డిఐ కలరిస్టుగా వ్యవహరిస్తున్న సోమల రఘునాథ్ వర్మ అలియాస్ రఘు. 

          ఐతే తనకి ఎనలాగ్ (ఫిలిం) ఫార్మాటే మంచి ఆట స్థలంగా వుండేదన్నారు. ఎందుకంటే, ఫిలిం మీద అక్ష రేఖ (టాప్- బాటమ్ ల మధ్య స్పేస్) ఎక్కువ కాబట్టి, డిఐతో ఆడుకోవడానికి అదో మంచి ప్లే గ్రౌండ్ గా ఉండేదన్నారు. ఫిలింమీద సూపర్ 35 కెమెరాతో షూటింగులు  మొదయ్యాక డీఐ తప్పని సరైందన్నారు.

          ‘ఏ మాయ చేశావే’ సినిమా చూస్తున్నంత సేపూ కళ్ళు తిప్పుకోలేకపోయారు ప్రేక్షకులు. అటు దీని తమిళ మాతృక చూసిన తమిళ ప్రేక్షకుల పరిస్థితీ ఇంతే. డీఐ వల్ల వీటికి  జతకలిసిన దృశ్యాత్మక నాణ్యత అలాంటిదన్నమాట. మళ్ళీ ఈ వైభవాలు తెలుగు, తమిళం రెండు చోట్లా వేర్వేరు రంగుల పొందికతో, కాంతుల ప్రసరణలతో వున్నాయని మన కెవరైనా చెప్పారా? ఆ రహస్యం రఘు  విప్పారు. తెలుగు తమిళ ప్రాంతీయ అభిరుచుల్ని దృష్టిలో పెట్టుకుని, తెలుగుకి గాఢమైన రంగులతోనూ, తమిళానికి లైట్ కలర్స్ తోనూ  డీఐ చేశామన్నారు.

          మరి ఇలా కెమెరా మాన్ కష్టపడి తనక్కావలసిన లైటింగ్ ఏర్పాట్లూ అవీ చేసుకుని, తను సంతృప్తి పడి షూట్ చేసుకొచ్చిన దృశ్యాల మీద కలరిస్టుగా మీరు చేయి చేసుకుంటే, కెమెరామాన్ ఒరిజినాలిటీ కనుమరుగైపోతుందికదా అంటే- అలా జరగదన్నారు. పై పెచ్చు కెమెరా మాన్ లే తమ వర్క్ అద్భుతంగా  కన్పించేందుకు నిర్మాతలకి డీఐ ని సిఫార్సు చేస్తున్నారన్నారు. దీంతో గ్రాఫిక్స్ నిపుణుల్లాగే తామూ ప్రీ ప్రొడక్షన్ దశ నుంచీ, సినిమా నిర్మాణంలో పాలుపంచుకోవాల్సి వస్తోందన్నారు. 

          ఇదిలా వుంటుంది : ఒక సినిమాకి ఓ లొకేషన్ ని నిర్ణయిస్తే, రఘు  ఆ లొకేషన్ కి వెళ్లి పాత్రలకి తగ్గ కాస్ట్యూమ్స్ తో టెస్ట్ షూట్ చేయిస్తారు. డిఐ తర్వాత ఈ దృశ్యాలు తెర మీద ఎలా కనపడవచ్చో ముందుగానే అంచనా వేసుకుని, అవసరమైన మార్పు చేర్పులు లోకేషన్లోనే చేసుకుని షూట్ చేస్తారు.

          దృశ్యాల్ని డీఐ చేశాక కెమెరా మాన్ కి నచ్చక పోతే, మరో మూడు నాల్గు ఆప్షన్స్ చేసి చూపిస్తామన్నారు. వాటిలో  కెమెరా మానే తనకి కావాల్సింది ఎంపిక చేసుకుంటాడ న్నారు. 

          ‘డీఐ కేవలం కలరిస్టుకి సంబంధించిన  ఇండివిడ్యువల్ క్రియేటివిటీ, అయినప్పటికీ  కెమెరా మాన్ తో  మ్యూచువల్ చఅండర్ స్టాండింగ్ తో పోతాం’ అని స్పష్టం చేశారు.

          ఓ  తెలుగు సినిమా- ‘ఆవకాయ్ బిర్యానీ’  అనుకుందాం - అందులో అవుట్ డోర్ లొకేషన్స్  కి చేసిన డీఐ (రఘు కాదు) కృత్రిమంగా పెయింటర్ వేసిన నిశ్చల చిత్రాల్లా వుందెందుకనీ అని అడిగితే - అది కెమెరామాన్ జడ్జ్ మెంట్ కావొచ్చన్నారు. లొకేషన్లకి వాటిదైన నేటివ్ ఫీల్ వుంటుందనీ, ‘ఏ మాయ చేశావే’ లో దాని హైదరాబాద్ నేటివిటీకి ఒక లాంటి ఫీల్ తో, ఈ సినిమాలోనే కేరళ దృశ్యాల నేటివిటీకి దాని ఫీల్ తో, చివరికి అమెరికా దృశ్యాలకి అక్కడి నేటివ్ ఫెల్ తోనూ డీఐ చేశానన్నారు.

          చిత్తూరు జిల్లా పుత్తూరుకి చెందిన రఘు,  ఎస్వీ యూనివర్సిటీలో బీసీఏ, ఎంబీఏ కోర్సులు చేశారు. గ్రాఫిక్స్ ని ఇంటి దగ్గరే సాఫ్ట్ వేర్స్ అవీ తెప్పించుకుని స్వయంగా నేర్చుకున్నారు. 2005 లో చెన్నై వెళ్ళిపోయి ఏవీఎం స్టూడియోలో ఎడిటర్ గా చేరారు. అదే సంవత్సరం ముంబాయి వెళ్లి ప్రసాద్ లాబ్స్ లో డిఐ విభాగంలో కన్ఫర్మిస్టుగా  చేరారు. తన పనితీరు నచ్చి యాజమాన్యం చెన్నై ప్రసాద్ లాబ్స్  డీఐ విభాగానికి కలరిస్టుగా నియమించింది. డీఐ విభాగానికి కలరిస్టే చీఫ్.  పది మంది కన్ఫర్మిస్టులు ఆయన కింద పనిచేస్తారు. ఫిలిం వున్నప్పుడు వీళ్ళు నెగెటివ్ ని డిజిటల్ బిట్లుగా స్కానింగ్ చేసి, ఫ్రేముల్ని మ్యాచ్ చేసి, డీఐకి అనువుగా మార్చి, కలరిస్టుకి అందించే వాళ్ళు. వీళ్ళ కింద లైన్ ప్రొడ్యూసర్ ఉంటాడు. ఇతను షెడ్యూలింగ్, కెమెరా మాన్ తో కలరిస్టు మిలాఖత్ ఏర్పాట్లూ అవీ చూస్తాడు. 

          ప్రస్తుతం చెన్నైలో జెమిని ఎఫ్ఎక్స్  డిఐ విభాగంలో కలరిస్టుగా – క్వాంబెల్  పాబ్లో వర్క్ స్టేషన్  మీద సినిమాలకి  సోయగాలు అద్దుతున్న రఘుని, ‘మీ దృష్టిలో గొప్పగా డిఐ చేసిన హాలీవుడ్ మూవీ ఏదో చెప్పండి?’ అంటే,  ‘అన్నీ గొప్పవే!’ అని తప్పించుకున్నారు.

-సికిందర్
(ఆంధ్రజ్యోతి- 2010) 

'ఊపిరి' స్క్రీన్ ప్లే సంగతులు -2


ఇంటచబుల్స్ తో  తెలుగు రీమేక్ కి  ఊపిరులూదడానికి అవసరమైన వరల్డ్ మూవీ స్క్రీన్ ప్లే గురించి  గత వ్యాసంలో  చెప్పుకున్న ‘కిష్టెన్ క్యాచో’  మోడల్ ని ఏమాత్రం అతిక్రమించలేదు, ఆ ఫ్రేములోనే వుంచారు. చాలా షాట్లు కూడా మార్చకుండా అవే తీశారు. అలాగే కథ మొత్తానికీ సెకండ్ యాక్ట్ లో కొత్త ఎలిమెంట్ గా మెరిసిన అదృశ్య ప్రేమికురాలి (శ్రియ) పాయింటునే విధిగా కీలకం చేసి, దాంతో ఫోర్త్ యాక్ట్ ని  ‘ఇంటచబుల్స్’ తరహాలోనే ముగించారు. 
          తే ఒరిజినల్ లో ప్రతీ యాక్ట్ లోనూ వున్న ప్రారంభ ముగింపుల  ఘటనలకి, ఆయా  యాక్ట్స్ లో సాగిన బిజినెస్సులకీ,  తెలుగులో బెల్ట్ షాపుల చందాన అదనపు బిజినెస్సూ, ఘటనలూ క్రిక్కిరిసి క్యూ కట్టాయి. ఉన్న 4 దశల ( యాక్ట్స్) కథలో 40 బెల్ట్ షాపులు వాటి  దారులు అవి  వెతుక్కున్నాయి. ఇక్కడే వరల్డ్ మూవీ సంస్కారానికీ, తెలుగు రీమేక్ సంస్కారానికీ – ఆ మాటకొస్తే మొత్తం తెలుగు సినిమాల సంస్కారానికీ తేడా తెలిసిపోతోంది. దర్శకుడు కూడా నిన్నటి వరకు మాస్ దర్శకుడుగా పేరొందడ మొకటి. 

          సమస్య ఎక్కడ వచ్చిందంటే, ఈ  రీమేక్ ని తెలుగు- తమిళం రెండు భాషల హీరోలతో చేశారు.  దీంతో తెలుగులో అక్కినేని నాగార్జున పెద్దరికాన్ని కాపాడే, అటు తమిళంలో కార్తీ ఇమేజిని కూడా కాపాడే రెండంచుల కత్తిని సానబట్టారు. ఈ సానబట్టడం సమంగా జరక్క, కార్తీ కోసం తమిళ కత్తి వాడిగా తేలి, ప్రేక్షకుల మెడ మీద వేలాడేట్టు తయారయ్యింది ఓ గంట పాటు.

          ఒరిజినల్ కేవలం గంటా 45 నిమిషాల నిడివితో కావలసినంత సంతృప్తిని కల్గిస్తే,  రీమేక్  వచ్చేసి రెండు గంటలా 40 నిమిషాలు సాగినా ఇంకా ఇంకా సాగదీసుకోవాలన్న బలమైన కోరికతో వుంది. ఓపెన్ చేసిన బెల్ట్ షాపులు ఎలా మూయించాలో తెలీక వచ్చిన సమస్య ఇది. ఇక్కడ మొన్న విడుదలైన ‘కళ్యాణ వైభోగమే’ కూడా గుర్తుకు రాక మానడం లేదు... అందులో కూడా పెద్దవాళ్ళు క్లాసు పీకే బెల్ట్ షాపు ఓపెన్ చేసి, ఇక  ఎలా ముగించాలో తెలీక సాగదీస్తూ సాగదీస్తూ అనేక బెల్ట్ షాపులు తెరచి, రెండు గంటలా 38 నిమిషాల వరకూ వెళ్ళారు. బెల్ట్ షాప్ ఓపెన్ చేస్తున్నామని తెలీక పోతే ఇంతే, కాలాన్ని అతిక్రమించిన మాయదారి కత్తులు ప్రేక్షకుల కుత్తుకల మీద కసకస వేలాడ్డమే.

          కథా ప్రారంభం కార్తీ జైలు నుంచి పెరోల్ మీద విడుదల అవడంతో అవుతుంది. దొంగతనాల నేరం మీద  రెండేళ్ళు జైలు శిక్ష పడింది. నాల్గు నెలలు పెరోల్ మీద విడుదలైనట్టు చూపారు. ఇలా ఒరిజినల్లో లేదు. ఒరిజినల్లో సెకండ్ యాక్ట్ లో, ఫిలిప్ ఫ్రెండ్ ఒకడు,  సేవకుడు డ్రిస్ గురించి చెప్తూ,  వీడు  జైలు కెళ్ళొచ్చిన  దొంగ అన్న సంగతి దృష్టికి తెస్తాడు. ఇప్పటి వరకూ డ్రిస్ గతంలో దొంగ అని ప్రేక్షకులకి కూడా తెలీదు. ఇది కొంచెం డిస్టర్బింగ్ గా వుంటుందిక్కడ. కావాలనే చేశారు దర్శకులు.  ఇక్కడ ఈ మాట అన్పించడం ద్వారా  ‘ఫోర్ షాడోవింగ్’ అనే టెక్నిక్  ని ప్రయోగించారు. అంటే ముందేదో జరగబోతోందన్న ఆదుర్దా కల్గించారు. ఇప్పుడు దొంగోడని తెలిసిన ఇతను,  ఈ బిలియనీర్ ఇంట్లోఇంకేం చేయబోతాడో అన్న పాత్రరీత్యా  సస్పెన్స్ పుట్టింది. తెలుగులో ఇంతమంచి కథనాన్ని కిల్ చేశారు. చూపించడమే కార్తీ దొంగ అని ఓపెన్ చేసేస్తూ  క్యారక్టర్ కి షేడ్ లేకుండా, చప్పగా  తయారు చేశారు.

          ఇదలా వుంచితే, అసలు పెరోల్ గొడవేమిటి? సాధారణ దొంగకైనా పెరోల్ ఎప్పుడు లభిస్తుంది?  చట్టంలో వుండే ఆ తొమ్మిదీ పది కారణాల్లో ఒక్కటీ ఇక్కడ కార్తీకి వర్తించవు. కుటుంబ సంబంధాలు/ సామాజిక సంబంధాలు అనే కారణంపై కూడా విడుదల చెయ్యాలన్నా- అసలు కుటుంబ సంబంధాలే  లేవే? తల్లికి అసహ్యం, తమ్ముడికి ధిక్కారం, చెల్లెలికి ఛీత్కారం. ఇక సామాజిక సంబంధాలేమున్నాయని  అవికూడా కొనసాగించుకోవడానికి? ఈ మేరకు పోలీసు ఎంక్వైరీ  రిపోర్టు అందితే, పెరోల్ అప్లికేషన్నే కొట్టేస్తారుగా?

          ఇక నాల్గు నెలలపాటు పెరోల్ గడువు సంగతి. ఏడాది మొత్తం మీద నాల్గో ఐదో వారాలు పెరోల్ కి అనుమతిస్తారేమో. అది కూడా ఒకేసారి కాదు. రెండు విడతలుగా. ఒకసారి రెండు వారాలు, ఇంకోసారి మూడు వారాలు. అంతేగానీ ఏకంగా నాల్గు నెలలు పెరోల్ మీద వదిలేసే చట్టం లేనేలేదు. ఎంత డబ్బూ పలుకుబడీ వున్నా సంజయ్ దత్ కే సాధ్యం కాలేదు. అతడి పెరోల్ ఉల్లంఘనలన్నీ చాలా వివాదాస్పదమయ్యాయి. 

          ఇలా  పెరోల్ మీదున్న కార్తీని,  నాగార్జున తనతో పాటు పారిస్ కి బయల్దేరదీస్తూ,  ఇతడి మ్యాటర్ చూడమంటాడు సెక్రెటరీతో. ఏముంటుంది చూడ్డానికి. పెరోల్ మీద వున్న వాడు యాభై మైళ్ళ పరిధి దాటి వెళ్ళకూడదు. పారిసైనా, ఇంకే విదేశమైనా యాభై మైళ్ళ పరిధిలో వుండదు. పాస్ పోర్టే రాదు. పెరోల్ కండిషన్స్ వుంటాయి. విదేశాలు  వెళ్ళే కోరికలు పెట్టుకుంటే  పెరోల్ క్యాన్సిల్ చేసి జైల్లో కుక్కేస్తారు.

          కార్తీ పెరోల్  మీద  వచ్చాడంటే అతనింకా శిక్షకాలం  పూర్తి  చెయ్యని క్రిమినలే. పెరోల్ మీద వచ్చిన వాణ్ణి నాగార్జున కూడా చట్ట ప్రకారం ఉద్యోగంలో పెట్టుకోలేడు. ఇక కథ చివర్లో, నాగార్జున కార్తీని పంపించేశాక, కార్తీ వెళ్లి ఎంచక్కా క్యాబ్ డ్రైవర్ ఉద్యోగంలో చేరిపోతాడు. డ్రైవింగ్  లైసెన్స్ ఎక్కడిది? జైలర్ అప్పుడే ఇచ్చేశాడా? క్యాబ్ డ్రైవర్ గానే కాదు, నాగార్జున దగ్గర వున్నప్పుడు కూడా  ఆయన్ని కూర్చో బెట్టుకుని కార్లు తెగ నడిపేస్తూంటాడు. 

          ఒరిజినల్లో డ్రిస్ తను చేసిన తప్పుకి జైలు శిక్ష అనుభవించి వచ్చాడు. ప్రభుత్వమిచ్చే నిరుద్యోగ భృతికి కూడా అర్హుడయ్యాడు. ఎవరైనా సమాజంలో అతడికి ఇంకో అవకాశమిచ్చి పనిలో పెట్టుకోవచ్చు. లాజికల్ గా ఆ పనే  చేశాడు ఫిలిప్. తెలుగులో ఇంకో పని కూడా చేస్తారు కార్తీ, అతడి లాయర్ అలీ. సత్ప్రవర్తన సర్టిఫికేట్ తెచ్చుకుంటే శిక్షాకాలం తగ్గుతుందని, కార్తీని అనాధాశ్రమంలో సేవకీ, వృద్ధాశ్రమంలో సపర్యలకీ తిప్పుతాడు అలీ! సత్ప్రవర్తన అనేది జైల్లో ఉన్నప్పడు చూసి సర్టిఫై చేస్తారు. పెరోల్ మీద బయట ఆబోతులా వదిలి పెట్టేసి ఎవడో ఇచ్చిన పనికిమాలిన సర్టిఫికేట్స్ తెచ్చుకోమనరు. 

          ఇలా లాజిక్కులు తీస్తే కథేముంటుంది అనొచ్చు. అసలు కార్తీ ని  పెరోల్ మీద చూపించి సాధించిందేమిటి? కథకైనా పాత్రకైనా వొరిగిందేమిటి? క్యారక్టర్ బిల్డప్ కైనా పనికొచ్చిందా? అడుగడుగునా  లాజిక్ పరమైన ప్రశ్నలు రేకెత్తించడం తప్ప. ఒరిజినల్ దర్శకులు కూడా ఇలా చేసి వుంటే ఈ రీమేక్ కి అవకాశమే వుండేది కాదు- ఎందుకంటే, అక్కడి ఇంటలిజెంట్ ప్రేక్షకులు ఆ ఒరిజినల్ ని ఎప్పుడో తిప్పికొట్టేసే  వాళ్ళు.


విషాదాలే వినోదాలు?


    కార్తీ తల్లి (జయసుధ) పాత్ర సంగతి.
     ఈమెకి ముగ్గురు పిల్లలు. కార్తీ, ఇంకో కొడుకు, కూతురూ. చిన్న ఉద్యోగం ఏదో చేస్తూ కుటుంబ భారమంతా మోస్తోంది. ముఖంలో సుఖ సంతోషాలుండవు. పెద్ద కొడుకు కార్తీ అంటే అస్సలు పడదు. ఆవారాగా తిరుగుతూ దొంగతనాలు మరిగి జైలు కెళ్ళి  వచ్చాక (పెరోల్ మీద) తింటున్న అన్నం మీంచి కూడా లేపేసి వెళ్ళ గొట్టేస్తుంది. ఏదో చెప్పబోతే, చేతులు జోడించి దండం పెడుతూ ఇంట్లోంచి వెళ్లి పొమ్మంటుంది. ఈ చేతులు జోడించి దండం పెట్టడమనే చర్య చాలా అఫెండింగ్ గా వుంటుంది చూడ్డానికి, హెవీగా వుండే సంగతలా వుంచి.

          మనం చూస్తున్నది ‘ఆ నల్గురు’ అనే సినిమా కాదు, ‘కలికాలం’ కూడా కాదు, ‘సూరిగాడు’ అసలే కాదు. అలాటి సినిమాల్లో ఉండాల్సిన సీను ఇక్కడ జొరబడి మూడ్ చెడ  గొట్టడ మేమిటి? ఇది నాగ్ - కార్తీ ల మధ్య  ఒక ఫన్నీ జాయ్ రైడ్ తో కూడిన, ఫీల్ గుడ్ జానర్ మూవీ. ఈ హాస్య రస- అద్భుత రస ప్రధాన కథలో ఇంత కరుడుగట్టిన విషాద దృశ్యాలేమిటి? 

          కార్తీ కి పెట్టిన ఈ ఇంటి కథ ఒక మినీ ‘అంతు లేని కథ’ లా వుంటుంది. తను ఆవా రా సరే,  తమ్ముడు ‘అంతులేని కథ’ లో రజనీ కాంత్ లాంటి వాడు, చెల్లెలు శ్రీ ప్రియ లాంటింది. ఇక తల్లి (జయసుధ)  జయప్రదలాంటిది! వీళ్ళతో ఫ్యామిలీ డ్రామా అంతా ‘అంతులేని కథ’ -1976 బ్లాక్ అండ్ వైట్ స్టయిల్లో వుంటుంది.  కార్తీకి ఈ ప్యాకేజీ తమిళానికి అవసరం కాబట్టేమో,  అక్కడి కె. బాలచందర్ తీసిన ‘అంతులేని కథ’ నే ఆశ్రయించినట్టుగా   వుంటుంది కలెక్షన్ల కోసం.

          సరే, పెద్ద కొడుకు దొంగే అనుకుందాం, చిన్న కొడుకు ఇంకా అసహ్యంగా కన్పించే డ్రగ్స్ బానిస. కూతురు తల్లి చాటున రంకు నేర్చిన పిల్ల.  చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకోబోతూంటే అడ్డుపడిన అన్న (కార్తీ) విలువ తీస్తూ మాటాడుతుంది. ప్రేమించిన వాడి పేరెంట్స్ తో మాటాడి పెళ్లి జరిపిస్తానని కార్తీ మాటిచ్చి, ఆ పేరెంట్ (తనికెళ్ళ) దగ్గరి కెళ్తే అతను హేళన చేస్తాడు. నాగార్జున కి ఇది తెలుస్తుంది. మిత్రుడు ప్రకాష్ రాజ్ ని తనికెళ్ళ దగ్గరికి పంపిస్తాడు. తనికెళ్ళ నాగార్జున దగ్గర కాంట్రాక్టులు పొంది పెరిగిన వాడు. ప్రకాష్ రాజ్ క్లాస్ పీకేసరికి  వచ్చి నాగార్జున కాళ్ళ మీద పడి  పెళ్లికి ఒప్పుకుంటాడు తనికెళ్ళ. నాగార్జున చేసిన ఈ సహాయం కార్తీ కి తెలియాలి కాబట్టి అందుకనుగుణంగా సీను.

          ఆ వెంటనే తనికెళ్ళ వెళ్లి కార్తీ తల్లికి దండాలు పెట్టి ముహూర్తం పెట్టుకోవడం. అన్న చేసిన ఘన కార్యం చెల్లెలికి  తెలియాలి కాబట్టి అదింకో సీను. ఇంద్రుడూ చంద్రుడూ అని ఫోన్లోనే పొగిడేసి అవతల పారేస్తుంది. ఇంకా కార్తీ చేసిన ఘనకార్యం ద్వేషించే  తల్లికి కూడా తెలియాలి కాబట్టి ఆ రకమైన సీన్ల క్రమం...ఇలా చైన్ రియాక్షన్ లా ఒక అంశం చుట్టూ సీన్లు పెరుగుతూ వుంటాయి- బెల్ట్ షాపుల్లా! ఇంతకీ కూతురి  అసలు నంగనాచితనం  ఆ తల్లికి ఏమాత్రం తెలియదు. ఆమె పెళ్లి చేసుకుని పారిపోయి వుంటే ఆ తల్లి ఢామ్మని గుండె పగిలి చచ్చే పనే. కొడుకుల కంటే కూడా ఈ కూతురే డేంజరస్ డైనమైట్  అన్నమాట. అయినా ఈ చిహ్నాలు మహా తల్లి పసిగట్టనే పసిగట్టదు. 

          ఒకరు కాదు ఇద్దరు కాదు, పిల్లలు ముగ్గురూ  ఇలా తయారయ్యారంటే, ఆమె ఎంత చక్కటి మహా తల్లో తెలిసిపోతోంది. దీనికి బాధ్యత వహించాల్సింది పోయి, లోకం ఎప్పుడూ తన సైడే ఉంటుందన్న అపోహతో వుంటుంది.  చాలా మంది తల్లిదండ్రులు ఇలాగే  ఎస్కేప్ అవుతూంటారు, వాళ్ళల్లో ఈమె ఒకత్తి.

          కథ చివర్లో ఇంకో విషయం చెప్తాడు నాగార్జునకి కార్తీ ( ఇంకో బెల్ట్ షాపుకి ముహూర్తం!). ఈ  తల్లి అసలు తన కన్న తల్లే  కాదట. చిన్నప్పుడు తన తల్లి చనిపోతే ఆమె చెల్లెలు – అంటే ఈ తల్లి (తనకి పిన్ని) పెంచుకుందట. భర్త కూడా చనిపోయి పిన్ని కష్ట పడుతూంటే చూడలేక, నాల్గోతరగతిలోనే చదువు మానేశాడట. ఇక్కడ కార్తీకి ఫుల్ మార్కు లెయ్యొచ్చు- అంత చిన్న వయసులో ఇంత పెద్ద మనసుతో ఆలోచించినందుకు!

          అయితే తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్న  పిల్లాడు చదువు మానేసిన మానసిక కారణమేంటో తెలుసుకుని చక్కదిద్దాల్సిన బాధ్యత పెంపుడు తల్లికి లేదా? అక్క కొడుకే కదా. అక్క కొడుకుని తన సొంత పిల్లలకంటే హీనంగా ట్రీట్ చేయడమేంటి? డ్రగ్ బానిసగా అసహ్యంగా వున్న సొంత కొడుకుని పల్లెత్తు మాటనకుండా, అక్క కొడుకుని శత్రువులా చూడ్డమేమిటి? ఇదేనా  చనిపోయిన అక్క పట్ల మర్యాద? ఈ అక్క కొడుకు చిన్నప్పుడు చదువు మానేసిన కారణం చెప్తే ఎక్కడ పెట్టుకుంటుంది మొహం?

          ఇలా జరక్కుండా  పాత్ర అదృష్ట మేమిటంటే, కూతురి రంకు, పెద్దకొడుకు చిన్నప్పటి పెద్ద మనసూ  తెలుసుకోకుండానే అసమగ్ర పాత్రచిత్రణ పాలబడి ముగిసి పోవడం! ఇవి తెలిస్తే సూసైడే!!


కాన్సెప్ట్ ఏమిటి?

           నాగార్జున పాత్రకి కూడా బెల్ట్ షాపుంది...
          ఐదేళ్ళ క్రితం పారిస్ లో ప్రమాదం పాలయినప్పుడు,  ప్రేమిస్తున్న అనూష్కా శెట్టికి కావాలని దూరమయ్యాడు నాగార్జున. కానీ ఆమె ఎక్కడున్నా పెళ్లి చేసుకుని సుఖంగా వుండాలని కోరుకుంటూ జీవిస్తున్నాడు. అసలామె  అలావుందా లేదా అన్న శంకతోనే వున్నాడు. తన మనశ్శాంతిని ఆనాడే పారిస్ లోనే కోల్పోయాడు. కనుక పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని తిరిగి ఇప్పడు పారిస్ కెళ్తే,  అక్కడే కనపడుతుంది అనూష్కా కూతురితో, భర్త (అడివి శేష్) తో కలిసి. నాగార్జున పరిస్థితికి చలించి, ఇన్నాళ్ళూ అపార్ధం జేసుకున్నందుకు బాధ పడుతుంది అనూష్కా. ఆమె పిల్లా పాపలతో సుఖంగా వున్నందుకు నాగార్జున పూర్తి మనశ్శాంతిని పొంది తిరిగొచ్చేస్తాడు.

          ఒరిజినల్లో ఫిలిప్ కి పెళ్ళయి వుంటుంది. ఆ ప్రమాదంలో భార్య చనిపోయి వుంటుంది. ఇపుడు ఐదేళ్ళ తర్వాత ఇంకా ఆ బాధతో లేడతను.  ఇది అతడి  పాత్ర చిత్రణకి  చాలా అవసరం. ఎందుకంటే, వికలాంగుడైన తను పక్షిలా ఎగరాలనుకోవడమే ఇక్కడ  కాన్సెప్ట్. పక్షుల్ని కూడా చూపిస్తూంటారు. భార్య గురించి బాధ పడుతూ కూర్చుంటే ఈ కోరిక కలగక పోవచ్చు. కథ వేరే దారి పడుతుంది. ఒకవైపు భార్య గురించి బాధ పడుతూ- ఇంకో వైపు పక్షిలా ఆనందంగా షికార్లు కొట్టాలనుకోవడం పాత్రని అర్ధ రహితంగా మారుస్తుంది. ఏదో ఒకటే వుండాలి. ఆ ఒకటి పక్షిలా ఎగరాలనుకోవడమే కాన్సెప్ట్  ప్రకారం! కాబట్టి భార్య గురించిన ఎమోషనల్ బ్యాగేజీ లేకుండా చూశారు పాత్రకి. 

          నాగార్జునకి అనూష్కా గురించిన ఎమోషనల్ బ్యాగేజీ ఒక వైపు, చక్రాల కుర్చీకి బందీ  అయిపోయీ అయిపోయీ స్ట్రెస్ పేరుకుపోయి రిలీఫ్ పొందాలన్న ఆరాటం మరో వైపూ.  ఈ స్ట్రెస్ అనూష్కా సుఖ సంతోషాల గురించా, పక్షిలా ఎగరాలనుకోవడం గురించా పోగుపడింది? ( పావురాల్ని చూస్తూంటాడు తదేకంగా). కన్ఫ్యూజింగ్ గా లేదూ పాత్ర? ఒరిజినల్లో లాగే ఇక్కడ కూడా   ఆ ప్రమాదంలో ‘భార్య’ అయిన అనూష్కా చనిపోయి వుంటే,  పాత్ర కాన్సెప్ట్ ప్రకారం పక్షిలా ఎగరాలన్న ఒకే కోరికతో ( ఏకసూత్రతతో) స్పష్టంగా వుండేది. పోగొట్టుకున్న చోటే  వెతుక్కోవడమనే  ఫిలాసఫీ ఒకటి మళ్ళీ. ఆ పోగొట్టుకున్న చోట మనశ్శాంతి పొందితే స్ట్రెస్ దూరమైపోతుందా?  స్ట్రెస్ దాని గురించా,  పక్షిలా ఎగరాలనుకోవడం గురించా? చాలా కన్ఫ్యూజింగ్. ఒరిజినల్లో తెలివిలేకుండా అలా  పాత్రని సృష్టించి వుంటారా! 

          అసలు నాగార్జున లాంటి సీనియర్ పాత్రకి – బిలియనీర్ కి- పెళ్ళయి భార్యని పోగొట్టుకున్న నేపధ్యమే గౌరవప్రదంగా వుంటుంది. ఇంకా పెళ్ళే కాలేదంటే, సంసార సుఖం అనుభవించకుండానే ఇలా పనికిరాకుండా అయిపోయాడంటే, పాత్ర చులకన అవడమే గాక, పాత్ర తాలూకు విషాదం డబుల్ అవుతుంది. కథలో విషాద ఛాయల్ని వీలైనంత తగ్గించడానికి కదా ప్రయత్నించాలి? వొరిజినల్లో లేని విషాదాన్ని ఎందుకు పెంచినట్టు?

          జోకేమిటంటే, కార్తీని కూడా పోగొట్టుకున్న చోటే వెతుక్కోమని వాళ్ళమ్మ దగ్గరికి పంపడం! వాట్ అమ్మ? హూజ్  దట్ అమ్మా? ఈ అమ్మ దగ్గర కార్తీ ఏం పోగొట్టుకున్నాడని? నథింగ్. ఆమె వున్నా లేకపోయినా ఒకటే. పోగొట్టుకుంటే కన్న తల్లిని పోగొట్టుకున్నప్పుడే అన్నీ  పోగొట్టుకున్నాడు! ఇంకే అమ్మా భర్తీ చేయలేదు.


        అసలు కాన్సెప్ట్ వదిలేసి ఏదో  పోగొట్టుకుని వెతుక్కునే గొడవేమిటి?
దర్జాగా పబ్ లో ( కేవలం నాగ్- కార్తీల మెయిన్ ట్రాకు ఫన్ లో) మాంచి  మజాగా కిక్కు ఎక్కుతూంటే,  మధ్యలో ఈ బెల్ట్ షాపుల గొడవేమిటి చీప్ లిక్కర్ తో?


మాస్టర్ స్ట్రోక్స్ మిస్!

      ‘ఇంటచబుల్స్’  అసలు ఐడియా ఏమిటంటే,  ఒక ఫ్రీ బర్డ్ లా చక్రాల కుర్చీ లోంచి ఎగిరిపోవాలనుకుంటున్న వికలాంగుణ్ణి, ఇంకో ఆల్రెడీ ఫ్రీ బర్డ్ లా తిరుగుతున్న ఆవారాగాణ్ణీ,  పట్టుకుని ఎదురెదురుగా కాంట్రాస్ట్ గా పెట్టి,  వీళ్ళేం చేస్తారో చూడ్డం!  రాయడానికే చాలా ఇంటరెస్టింగ్ గేమ్ లా ఉత్సాహ పర్చే స్క్రీన్ ప్లే ఇది.  కాన్సెప్ట్ ఇంత స్పష్టంగా క్యాచీగా, క్రేజీగానూ  వుంది. తెలుగులో ఇదంతా మిస్సయి పోయింది- కారణం,  ఒరిజినల్ లో ఈ పాత్రల్ని ఇలా ఎందుకు సృష్టించి, ఇలాగే ఎందుకు నిర్వహించారో అంతరార్ధాన్ని పసిగట్టక పోవడం!  కథని పక్కదారి పట్టించి, హాస్యాస్పదంగా తెలుగు- తమిళ ప్రేక్షకుల కోసమని బోలెడంత కుటుంబ విషాదాలతో నింపేసి, అసలు పాయింటుని గల్లంతు చేసేయడం!!

          62 కోట్ల సినిమాకి  కాన్సెప్ట్ ని ఇంత  మిస్ మేనేజ్ మెంట్ చేసుకోవాలా! ఏ లెవెల్లో కథలు ఆలోచిస్తున్నట్టు? ఇవ్వాళ  తమిళంలో ఈ సినిమాని ప్రేక్షకులు పట్టించుకోవడం లేదటే, విషాద కథలతో కాన్సెప్ట్ గల్లంతయ్యే కాదూ? కొత్త కాన్సెప్ట్స్ కి అక్కడెప్పుడూ ఆహ్వానమే కదా! 

          ఒరిజినల్లో ఒక వుడ్ బీ ఫ్రీబర్డ్ – ఇంకో ఆల్రెడీ ఫ్రీబర్డ్ ల మధ్య సయ్యాట కాబట్టే-  కథ పక్క దార్లు పట్టకుండా డ్రిస్ ని కుటుంబ డ్రామా నుంచి డిటాచ్డ్ గా వుంచారు. మొదట్లో తల్లి వెళ్ళి పొమ్మంటే వెళ్ళిపోయే సీనే తప్ప మళ్ళీ ఆ తల్లి కూడా కన్పించదు. చెల్లెలి ట్రాకే లేదు. యజమాని పిలిప్,  డ్రిస్ కోసం  ఒకే ఒక్క త్యాగం చేస్తాడు- అదీ థర్డ్ యాక్ట్ లో.  డ్రిస్ తమ్ముడేదో ప్రాబ్లంతో రావడం చూసి, ఇంటి కెళ్ళి సమస్యలు తీర్చుకోమని డ్రిస్ ని తన దగ్గర్నుంచి పంపేయడం ఫిలిప్ చేసుకునే త్యాగమే. 

          చివర్లో ఈ తమ్ముడి సమస్య తప్ప, డ్రిస్ పాత్రకి ఇంకే బరువూ పెట్టలేదు. పైగా అతడి స్వభావాన్ని కూడా దేనికీ బాధ పడని ఫన్నీ-  హేపీ గో లక్కీ టైప్ క్యారక్టర్ గా వుంచారు. థర్డ్ యాక్ట్ తో ఫిలిప్ తన గురించి ఆలోచించి ఇంటికి వెళ్లి పొమ్మంటే, ఫోర్త్ యాక్ట్ లో ఫిలిప్  భావిజీవితం గురించి డ్రిస్ ఆలోచించి,  ప్రేమించినమ్మాయితో కలిపేస్తాడు. ఇది పరస్పరం ఇచ్చుకున్న మాస్టర్ స్ట్రోక్స్ . ఫిలిప్ తన త్యాగంతో డ్రిస్ కి ఓ మాస్టర్ స్ట్రోక్ ఇస్తే, వూరుకోకుండా ప్రేమించినమ్మాయితో ఫిలిప్ ని కలిపేస్తూ డ్రిస్ తనదైన స్టయిల్లో మాస్టర్ స్ట్రోక్ ఇచ్చి వెళ్లి పోయాడు. విజువల్ మీడియా  అయిన  సినిమాకి చాలా ప్లస్ అయ్యే  ఈ డైనమిక్స్ ని అర్ధం జేసుకోలేదు తెలుగులో.

          ఎప్పుడు పడితే అప్పుడు ఇస్తే మాస్టర్ స్ట్రోక్ అన్పించుకోదు. కార్తీ చెల్లెలి పెళ్ళికి నాగార్జున ఒకసారి సహాయం చేశాక, మళ్ళీ చివర్లో కార్తీ తమ్ముడు గురించి ఆలోచించి కార్తీని ఇంటికి పంపేస్తే అది మళ్ళీ మాస్టర్ స్ట్రోక్ అవదు. రిపిటీషన్ – పునరుక్తి అవుతుంది. దీని ఎఫెక్ట్ ఫీల్ కాం. 


       అలాగే కార్తీ ఒకసారి నాగార్జునని  పారిస్ లో అనూష్కాతో కలిపి, మళ్ళీ వూళ్ళో ప్రేమించినమ్మాయితో కలిపితే మాస్టర్ స్ట్రోక్ అన్పించుకోదు- ఒక ప్రేక్షకుడు ఇలా కామెంట్ చేశాడు కూడా థియేటర్లో - 'వీడు బ్రోకర్లా వున్నాడురా'  అని!  చెల్లెలి ట్రాక్ ఇంత నష్టం చేసింది మెయిన్ ట్రాకుకి. చివరి అరగంట సేపూ దారీ తెన్నూలేక కార్తీ కుటుంబ విషాదమే హెవీగా మారిపోయి- హేవీగానే సినిమా ముగిసి, హేవీగానే మనం బయటికి రావాల్సిన అవసరమేమిటి? ఇది నాగ్- కార్తీ ల మధ్య కథా? కార్తీ - అతడి ఫ్యామిలీ మధ్య కథా? చాలా కన్ఫ్యూజింగ్!

          ఒరిజినల్లో హెవీ లేకుండా సింపుల్ గా డ్రిస్ వచ్చేసి, తనదైన  మాస్టర్ స్ట్రోక్ ఇచ్చి వెళ్లిపోతూంటే,  అప్రయత్నంగా మన కళ్ళు చెమరుస్తాయి, అంతే. ఒక అనిర్వచనీయమైన అనుభూతికి లోనవుతాం-  ఇప్పుడు మళ్ళీ జీరోకొచ్చిన ఈ నిరుద్యోగి తనకేం భవిష్యత్తు  వుందని అంత  ధీమాగా వెళ్తున్నాడని ప్రశ్న వేధిస్తూంటే  ముగుస్తుంది సినిమా. 

          క్లాసిక్ ఎండింగ్. ఎవరి మీద చివరి షాట్ వుంటుందో అతనే  కథకి  హీరో. ఒరిజినల్లో డ్రిస్సే హీరో. తెలుగులో మొహమాటాలకి పోయి ఇద్దర్నీ హీరోలుగా చేసేందుకు విఫలయత్నం చేశారు. చివరి షాట్ నాగ్- శ్రియాల మీద తీశారు. ఇది తేలిపోయింది. ఎందుకంటే కథ ప్రకారం, నాగ్ జీవితంలోకి వచ్చిన వాడు కార్తీ. జీవితంలోంచి వెళ్లి  పోవడా న్ని కూడా అలాగే రికార్డ్ చేస్తూ అతడిపైనే ముగించాలి!  అప్పుడొక స్పష్టమైన ‘స్టోరీ లైన్’ గా కనపడుతుంది మూవీ. 

క్రేజీ  కెమిస్ట్రీకే పట్టం! 
       నాగ్  – కార్తీల మధ్య ప్రతి సన్నివేశమూ బాగా వర్కౌట్ అయ్యింది. కార్తీ ది  స్వాభావికంగానే స్మైలింగ్ ఫేస్ కావడంతో ఆవారా పాత్ర కలర్ ఫుల్ గా మారింది. ఒరిజినల్లో ఈ పాత్ర పోషించిన ఒమర్ సైది మెస్మరైజింగ్ బాడీ లాంగ్వేజ్. స్పీడు కూడా ఎక్కువే. అతనలా ఆకట్టుకుని గుర్తుండి పోతాడు. 

          కార్తీ – నాగ్ ని అన్నయ్యా అని పిలుచుకోవడానికి అనుమతి కోరడం బాండింగ్ ని మరింత బలీయం చేసింది. నాగ్ కూడా తను రోగి కనుక ఏడుస్తూ పాసివ్ గా వుండిపోకుండా,  చక్రాల కుర్చీలోనే యాక్టివ్ క్యారక్టర్ గా వుండడంతో- వీళ్ళిద్దరి బ్రోమాన్స్ చాలా ఫన్నీగా మారింది. ఇద్దరివీ యాక్టివ్ పాత్రలే. మధ్యలో నాగ్ సెక్రెటరీగా తమన్నా వుంది. చూసిన ఫస్ట్ షాట్ లోనే ఈమెకి  రోమాంటిక్ గా ఎటాచ్ అయిపోతాడు కార్తీ. ఒరిజినల్లో ఈ ట్రాక్ లేదు. అయితే తెలుగులో ఈ ట్రాక్ ని చాలా అండర్ ప్లే చేశారు. ఇంకో దర్శకుడైతే కార్తీ తమన్నాల  మధ్య లవ్ ట్రాక్ చాలా అవసరమనుకుని, ఆ  సీన్లూ పాటలతో ఫస్టాఫ్ అంతా నింపేసి, సెకండాఫ్ లో  తిరిగి నాగ్  దగ్గరికి కథని తెచ్చి, కాలం  చెల్లిపోయిన ‘ఫార్మాట్’ ని పట్టుకుని వేలాడే వాడేమో!  

          వంశీ పైడిపల్లి ఈ నిగ్రహం తప్పలేదు. బంగళాలో ఉన్నంత వరకూ కథకి నాగ్ – కార్తీల ట్రాకే ముఖ్యమనుకుని లవ్ ట్రాక్ ని పూర్తిగా పక్కన పెట్టారు. లేకపోతే అమ్మాయి వెంట అబ్బాయి పడే లవ్ ట్రాక్ ని ఈ రోజుల్లో ఇంకా ఎవరు కేర్ చేస్తారు. అక్కడక్కడ మాత్రమే తమన్నాని కార్తీ గిల్లు తూంటాడు. చివర్లో ‘అద్దం’ సీను కూడా హిలేరియస్ వుంది. అలాగే ఒరిజినల్లో నామమాత్రంగా వున్న డ్రిస్  పెయింటింగ్ పిచ్చిని తెలుగులో బాగా వాడుకుని కార్తీకి ఒక పెద్ద ట్రాక్ గా డెవలప్ చేశారు. దీని ముగింపులో ప్రకాష్ రాజ్ తో  మంచి ఫినిషింగ్ టచ్ ని కూడా ఇచ్చారు. ఇలా ఇక్కడ ఫినిషింగ్ టచ్ ని హైలైట్ చేసినట్టే, ముగింపులో నాగ్- కార్తీ మధ్య పరస్పర మాస్టర్ స్ట్రోక్స్ ని  హైలైట్ చేయడం కూడా అత్యవసరమని పైన ఇందాక చెప్పుకున్నది. 

          ఇలా కథ నాగ్  – కార్తీల మధ్య నాగ్ బంగళాలో  కథ తిరుగుతున్నంత సేపూ అదనంగా డెవలప్ చేసిన సీన్లు  సహా బ్రహ్మాండంగా వుంది. ఎప్పుడయితే కథ బయటి కె ళ్తూంటుందో,  ఆ కార్తీ కుటుంబ విషాదాలతో, పెరోల్ ప్రహసనాలతో బెల్ట్  షాపులు పెరిగి- చక్కటి పబ్ లాంటి నాగ్  బంగాళాలో అసలు ఫన్నంతా- కిక్కంతా దిగిపోయే పరిస్థితి ఎదురయ్యింది. భరించలేని  కాక్ టెయిల్ – టార్చర్-  పబ్ లో ఎంజాయ్ చేస్తున్న కాస్ట్లీ డ్రింక్  చీప్ లిక్కర్ తో కల్తీ!

          ఇవాల్టి ప్రేక్షకులకి తక్కువ బరువున్న కథతో , తక్కువ బరువు గల పాత్రలతో, అక్కడక్కడా మాత్రమే భావోద్వేగాల్ని స్పృశిస్తూ, వినోదాత్మకంగా  పరుగులు తీసే సినిమా కదా చూపించాలి. కష్టాలూ బాధ్యతలూ ఉండొచ్చు. వాటికి  కుయ్యోమంటూ మూల్గుతున్నట్టు ఎప్పుడో ఎవరో స్థాపించిన ఇంకా అదే రొటీన్ నిరాశావాదంతోనే  చూపించకుండా, ఆ కష్టాల్నీ బాధ్యతల్నీ బాద్షాలా తీర్చేసుకునే ఆశావహ దృక్పథపు చిత్రీకరణలు కదా ఈ కాలపు జీవనసమరానికి అవసరం?  సినిమా అనేది ఈ రోజుల్లో పాజిటివ్ లుక్ తో  హేండ్సమ్ గా వుండాలి.


-సికిందర్