రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

7, అక్టోబర్ 2016, శుక్రవారం

రివ్యూ!


రచన- దర్శకత్వం : చందు ఎం.
తారాగ‌ణం: చైత‌న్య అక్కినేని, శృతీహాస‌న్‌, అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, మ‌డోన్నా సెబాస్టియ‌న్‌, అవంతికా వందనపు, పృథ్వీ, బ్రహ్మాజీ, నర్రా శీను, శ్రీనివాస‌రెడ్డి, అరవింద్ కృష్ణ, చైతన్య కృష్ణ, ప్ర‌వీణ్‌, వైవా హర్ష, నోయెల్‌, అక్కినేని నాగార్జున‌, ద‌గ్గుబాటి వెంక‌టేష్‌ త‌దిత‌రులు
కథ :
అల్ఫోన్స్ పుథ‌రిన్‌, సంగీతం : గోపీసుంద‌ర్‌, రాజేష్ మురుగ‌న్‌, ఛాయాగ్రహణం : కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని
బ్యానర్ : సితార
ఎంట‌ర్ టైన్మెంట్స్‌, నిర్మాత: సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ
విడుదల : 7 అక్టోబర్, 2016

***
      నాగచైతన్యకి ఓ హిట్ కావాలి. లేకపోతే పెళ్లి ముందు ఏమీ బాగోదు. దీన్ని ఎప్పట్నించో ప్లాన్ చేస్తూ వూరిస్తూ, రకరకాల వూహాహగానాలని భరిస్తూ, చివరికి అనుకున్న మలయాళ రీమేక్ ‘ప్రేమమ్’ తో ప్రేక్షకుల ముందు కొచ్చాడు. గత దసరాకి తండ్రి నాగార్జున వచ్చి ‘సోగ్గాడే చిన్నినాయనా’ తో హోరెత్తించినట్టు ఈ దసరాకి తను వచ్చాడు. వచ్చింది హోరెత్తించడానికేనా,  లేకపోతే  బోరెత్తించడానికా ఈ కింద తెలుసుకుందాం.

కథ
    మొదటి కథ : తాడేపల్లి గూడెంలో పదో తరగతి చదివే విక్రం వాత్సల్య అలియాస్ విక్రం ప్రేమ కవితలు రాస్తూ సుమ (అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్‌) ని ప్రేమిస్తాడు. ఆమె వెంట పడే ఇంకెంత మందో ప్రేమికుల్ని అధిగమించి చివరికెలాగో చిన్న పిల్ల సింధు (అవంతికా వందనపు) కిచ్చి ప్రేమ లేఖ పంపుతాడు. రెస్పాన్స్ గా సుమ అతడింటికి వస్తానని అంటుంది. ఆనంద పడతాడు విక్రం. సుమ విక్రం ఇంటికి  తన బాయ్ ఫ్రెండ్ ని తీసుకు వచ్చి పరిచయం చేస్తుంది. ఖంగు తిన్న విక్రం ఆమె మోసం చేసిందని తిట్టుకుని, మర్చిపోవడానికి ప్రయత్నిస్తాడు. 

        రెండో కథ : ఐదేళ్ళ తర్వాత విక్రం ఇంజనీరింగ్ చదువుతూంటాడు. ఎదిగిన యువకుడి పౌరుషం, దౌర్జన్యం వగైరాలతో కాలేజీలో గ్యాంగ్ ని మెయింటెయిన్ చేస్తూ బాస్ లా చెలామణీ అవుతూంటాడు. ఆ కాలేజీకి గెస్ట్ లెక్చరర్ గా సితార (శృతీ హాసన్) వస్తుంది. మరాఠీ అయిన ఈమెని చూడగానే ప్రేమలో పడతాడు విక్రం. ఇతడితో బాటు ఓ లెక్చరర్ (నర్రా శీను) కూడా ప్రేమలో పడతాడు. ఇతడికి తోటి లెక్చరర్ (బ్రహ్మాజీ) ఐడియా లిస్తూంటాడు. విక్రం ఫీలింగ్స్ ని సితార గుర్తిస్తుంది. ఇంతలో సెలవులు రావడంతో సొంతవూరు పుణేకి బయల్దేరుతుంది. ఆ బస్సు యాక్సిడెంట్ అయి జ్ఞాపకశక్తి కోల్పోతుంది. వెళ్లి చూసిన విక్రం ఆమె తనని గుర్తించకపోవడంతో బాధపడి ఆమెని మర్చిపోవడానికి ప్రయత్నిస్తాడు. ఇంతలో  ఆమె కజిన్ (అరవింద్ కృష్ణ)  తో ఆమె పెళ్లి నిశ్చయమైందని  కబురు వస్తుంది. 

        మూడో కథ :  పదేళ్ళ తర్వాత విక్రం ఒక రెస్టారెంట్ నడుపుతూంటాడు. ముప్పయి దాటుతున్న వయసులో మెచ్యూరిటీతో వుంటాడు. ఇప్పుడు ఇంకో అమ్మాయి (మడోన్నా సెబాస్టియన్) పరిచయమవుతుంది. ఇప్పుడీమెతో ప్రేమలో పడ్డ విక్రం కథ ఏ మలుపులు తిరిగిందన్నది మిగతా కథ. 

ఎలావుంది కథ 
    మలయాళీ కథ కావడంతో వారం వారం  వెక్కిరించి  వెళ్ళిపోతున్న మన ఇడ్లీ కథలా లేదు. మనవాళ్ళందరూ కొన్నాళ్ళు కేరళలో జీవించి వస్తే తెలుగులో ఇలాంటి డిఫరెంట్ కథలు స్వయంగా తయారు చేసుకోవడంలో ప్రతిభాశాలురు కాగలరు. ఇది మూడు దశల హీరో ప్రేమ ప్రయాణం. ‘పెళ్లి చూపులు’ లాగా సెమీ రియాలిస్టిక్ కథలా సాగే ఈ కథలో మళ్ళీ మలుపులూ ముగింపూ వచ్చేసి రొటీన్ ఫార్ములా ప్రకారం వుండడమే లోపం. ఈ మలుపులూ ముగింపూ వున్నంత కృత్రిమత్వంతో పోటీ పడుతూ మళ్ళీ భావోద్వేగాలు కూడా ఒక దశనుంచి ఇంకో దశలోకి ప్రభావవంతంగా బదీలీ కాకపోకాడం ఇంకో లోపం. ఈ విషయంలో ఒరిజినల్ నే తుచా తప్పకుండా ఫాలో అయ్యరేతప్ప సరిదిద్దుకోలేదు. సరిదిద్దితే ఏమవుతుందో నన్న భయం కావచ్చు. ఏమైనా మూస ప్రేమ సినిమాలే కుప్ప తెప్పలుగా వచ్చిపడుతున్న మార్కెట్ లోకి,  కాస్త స్వచ్ఛ భారత్ పనిని  చేపట్టి వాటిని ఊడ్చేసే వూపుతో తెలుగులో ఓ ఫ్రెష్ కథ వచ్చినందుకు ఆనందించక తప్పదు.

ఎవరెలా చేశారు
      ఎక్కడ్నించో ఓ కథ పట్టుకొచ్చి రీమేక్ చేస్తే తప్ప నాగచైతన్య కి ఓ సక్సెస్ దక్కలేదు. దీన్ని బట్టి ఒక యువ స్టార్ ని నిలబెట్టడానికి తెలుగులో ఎంత సృజనాత్మక దారిద్ర్యం వుందో తెలిసిపోతోంది. ఈ అవకశాన్ని చైతన్య కష్టపడి సద్వినియోగం చేసుకున్నాడు. ఇలాటిదే కథ, పాత్ర,  తెలుగులో ఎవరైనా ఒరిజినల్ గా చేసుకుని వస్తే స్వీకరించే వాడా అన్నదీ ప్రశ్నార్ధకమే. ఇంకో భాషలో ప్రూవ్ అయితే తప్ప కొత్తదనం అక్కర్లేదనుకునే మైండ్ సెట్ స్టార్లనుంచి కూడా పోవాలి. నాగచైతన్య ఈ మూడు పాత్రల్ని ఏ పాత్రకా పాత్ర ఎదుగుదలని దృష్టిలో పెట్టుకుని సహజ నటనతో పట్టాలు తప్పకుండా చూసుకున్నాడు. పదహారేళ్ళ కుర్రాడి పాత్ర, రఫ్ గా తిరిగే యువకుడి పాత్ర, మళ్ళీ డీసెంట్ గా ప్రవర్తించే ముప్పయ్యో పడిలో పడ్డ పాత్ర. అమ్మాయిలతో వియోగాలన్నీ కూడా నిగ్రహంతో పోషించాడు. అయితే ఆ బాధ- బ్యాక్ డ్రాప్ తర్వాతి దశల్లోకి బదిలీ అయి వుంటే ఇంకా బలంగా వుండేది పాత్ర. హీరో గతం తెలుస్తున్నప్పుడు (సర్కిల్ ఆఫ్ బీయింగ్) ఆ గతం తాలూకు బాధ ప్రస్తుత జీవితంలో ప్రతిఫలించినప్పుడే ఎఫెక్టివ్ గా వుంటుంది పాత్ర చిత్రణ.

        ఇక హీరోయిన్లు ముగ్గురిలో శృతీ హాసన్ కే ఎక్కువ భాగం కథ వుంది. లెక్చరర్ పాత్రని హూందాగా పోషించుకొచ్చింది. మళ్ళీ చివర్లో వచ్చి ఫినిషింగ్ టచ్ ఇవ్వడంతో  సెంటిమెంట్స్ ని ఎలివేట్ చేసినట్టయ్యింది. మిగతా ఇద్దరు  హీరోయిన్ల పాత్రలకి ఇంత ఎమోషనల్ టచ్ లేకపోవడంతో అంతంతమాత్రంగా కన్పిస్తారు. 

        అతిధి పాత్రకి సరైన నిర్వచనం ఇప్పుడు కుదిరింది. అదీ వెంకటేష్ తో. ఆ అయిదు నిమిషాలూ కన్పించిపోయే సన్నివేశంలో ఒక సెటైర్, ఒక చరుపు, ఒక చమత్కారం, ఒక ముద్రవేసి వెళ్ళడం ఎప్పటికీ గుర్తుండి పోయే అతిధి పాత్రాభినయం. 

        అక్కినేని నాగార్జున ముగింపులో వచ్చేసి- ఇంట్లో ముద్దు చేయాల్సిన కొడుకుని ఉప్పొంగిపోతూ విశాలమైన వెండితెర మీద బహిరంగంగా చేసి - మరోసారి వియ్ ఆర్ ఫ్యామిలీ అని అనవసరంగా చాటారు. ఇది ప్రేక్షకులకి ఎప్పుడో తెలిసిందే. 

        ఇతర పాత్రల్లో ప్రతి ఒక్కరూ శృతిమించకుండా నటించారు, కొందరు నవ్వించారు. మూడో కథకి శ్రీనివాస రెడ్డి కామెడీ ప్రధాన ఆకర్షణ.
        సంగీతం, ఛాయాగ్రహణం, లొకేషన్స్, ప్రొడక్షన్ విలువలూ అన్నీ బావున్నాయి.

చివరికేమిటి 
       దర్శకుడు చందూ ఎం. మలయాళ ‘ప్రేమమ్’ ని అదే పేరుతో రీమేక్ చేసి చెడగొట్టలేదు. ఐతే గురుదత్ తీసిన ‘ప్యాసా’ లో మ్యాటరాఫ్ ఫ్యాక్ట్ తరహా కథనానికీ తను చేసిన కథనానికీ తేడా వుంది. తను చేసిన దానికి ఎమోషన్లు  ఒక కాలావధి లోంచి ఇంకో కాలావధి లోకి క్యారీ కాలేదు. ఒకటి ముగిసిపోయిన ప్రేమ దశ- దాని ప్రస్తావన గానీ ఛాయలు గానీ తర్వాతి దశలో కనిపించనక్కర్లేదనుకోకుండా,  పాత్ర దాన్ని ఫీలవుతున్నట్టు పాత్ర చిత్రణ చేసి వుంటే కథ ఇంకా బలంగా వుండేది. అదే గురుదత్ హీరో పాత్ర ఎక్కడికక్కడ బాధాకరమైన అనుభావాలని మెలోడ్రామా లేకుండా దర్శకుడు కట్ చేస్తున్నా, ఆ బాధని మనమింకా ఫీలవుతూ వుండేలా హీరో పాత్ర అప్రతిహతంగా దాన్ని మోస్తూనే వుంటుంది. 

        ఇక మలుపులూ ముగింపూ మళ్ళీ మూస ఫార్ములాయే. రీమేక్ ని అనడంలేదు, ఒరిజినల్ దర్శకుడే వీటికీ విరుగుడు కనిపెట్టివుంటే ఇప్పుడు తెలుగులో ఇంకో ఎడ్యుకేషన్ లా వుండేది. ఫస్టాఫ్ లో మొదటి కథ, రెండో కథ సగమూ బలమైన వీక్షణానుభవాన్ని ఇవ్వకపోవడానికి కారణాలివే. సెకండాఫ్ లో శృతీ హాసన్ తో కొనసాగే కథ తప్ప మళ్ళీ మూడో కథ మామూలే. అయితే పరమ పాత మూస ప్రేమ సినిమాల్ని ఈ రోజుల్లో కూడా ఎంతో ఔదార్యంతో భరిస్తున్న తెలుగు ప్రేక్షకులకి ఈ వారం ‘ప్రేమమ్’ ని ప్రీమియం ఎంటర్ టైనర్ గా ఎంజాయ్ చెయ్యొచ్చు.


-సికిందర్
http://www.cinemabazaar.in


6, అక్టోబర్ 2016, గురువారం

రివ్యూ

రచన- దర్శకత్వం: మహదేవ్‌
తారాగణం : నిఖిల్‌ గౌడ, దీప్తీ సతి, జగపతిబాబు, బ్రహ్మానందం, రఘుబాబు, సంపత్‌ రాజ్, ఆదిత్యామీనన్‌, అవినాష్‌, సుప్రీత్‌, రావు రమేష్‌, రమ్యకృష్ణ తదితరులు
కథ : విజయేంద్ర ప్రసాద్,
సంగీతం: ఎస్ ఎస్ తమన్‌,  ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస
బ్యానర్ :
చన్నాంబికా  ఫిల్మ్స్‌, సమర్పణ: హెచ్‌.డి. కుమారస్వామి,
నిర్మాత: అనితా కుమారస్వామి
విడుదల: అక్టోబర్ 6,  2016
         ***
       మాజీ ప్రధాని  హెచ్ డి దేవె గౌడ మనవడు, మాజీ కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్ డి కుమారస్వామి గౌడ కొడుకూ అయిన  నిఖిల్ గౌడ హైపర్ యాక్షన్ హీరోగా అట్టహాసంగా కన్నడ- తెలుగు వెండి తెరలకి ఈవారం పరిచయమయ్యాడు. భారీగా ఓపెనింగ్స్ వచ్చాయి. ఎస్ ఎస్ రాజమౌళి క్యాంపు నుంచి విజయేంద్ర ప్రసాద్ కథ అందించి, మహాదేవ్ దర్శకత్వం వహించి ‘జాగ్వార్’ అనే ఈ బిగ్ బడ్జెట్ సినిమాని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. దక్షిణాదిలో 75 కోట్ల బడ్జెట్ తో ఓ  కొత్త హీరోతో నిర్మించిన మొదటి సినిమాగా రికార్డుల కెక్కిన ఈ తెలుగు- కన్నడ బై లింగ్వల్ లో జగపతిబాబు, బ్రహ్మానందం, రఘుబాబు, సంపత్‌ రాజ్, ఆదిత్యామీనన్‌,  రావు రమేష్‌, రమ్యకృష్ణల వంటి హేమాహేమీల్ని  నటింపజేసి కన్నడ వాసనలు సోకకుండా జాగ్రత్త తీసుకున్నారు. ఉన్నత శ్రేణి సాంకేతికులు, ఉన్నత నిర్మాణ విలువలూ కలిగిన ఈ యాక్షన్ మూవీలో అసలు విషయమేమిటి? సూపర్ మాన్, బ్యాట్ మాన్ లాగా  జాగ్వార్ ఒక సూపర్ హీరో కథనా? టెక్నో థ్రిల్లర్ అనిపించే ఒక స్వాప్నిక జగత్ విహారమా? ఇది తెలుసుకోవాలంటే ఓసారి విషయంలో కెళ్ళాలి...
కథ  
    శౌర్యప్రసాద్ (సంపత్ రాజ్) ఎస్ ఎస్ టీవీ ఛానెల్ యజమాని. ఓ రాత్రి అతడి ఛానెల్లో ఓ హత్యా దృశ్యం లైవ్ గా ప్రసారమవుతుందని ప్రచారమవుతుంది. లక్షలాది ప్రేక్షకుల సాక్షిగా  ఓ ముసుగు వీరుడు ఓ జడ్జి (రవి కాలే) ని హత్య చేసి పారిపోతాడు. ఈ సంచలనంతో సీబీఐ అధికారి జేబీ (జగపతి బాబు)  ఆ ముసుగు వీరుణ్ణి పట్టుకోవడానికి రంగంలోదిగి, వాడికి  జాగ్వార్ అని నామకరణం చేస్తాడు. జాగ్వార్ అయిన ఎస్ ఎస్ కృష్ణ అనాధ నని చెప్పుకుని  ఏమీ తెలీనట్టు మెడికల్ కాలేజీలో చేరతాడు. ఆ మెడికల్ కాలేజీ - కమ్ - ఆస్పత్రి చైర్మన్ గా ఆదిత్య (ఆదిత్యా మీనన్) వుంటాడు. ఇదే కాలేజీలో ఆర్య (ఆదర్శ్ బాలకృష్ణన్), అతడి చెల్లెలు ప్రియ ( దీప్తీ సతి) చదువుతూంటారు. చలాకీ కుర్రాడైన ఎస్ ఎస్ కృష్ణ  ప్రియని తన ప్రేమలో పడేసుకుంటానని ఆమె అన్నని ఉడికిస్తూ  ఆమె వెంటపడుతూంటాడు. కాలేజీలో విద్యార్థి నాయకుడైన ఆర్య, ఆస్పత్రిలో అక్రమాలు జరుగుతున్నాయని ఆందోళన లేవదీస్తాడు. ఈ ఆందోళనని అణచడానికి వచ్చిన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్  శంకర్ (సుప్రీత్) ని రాత్రి పూట చంపుతూ, అదే టీవీ ఛానెల్లో మరో లైవ్ ఇస్తాడు జాగ్వార్ కృష్ణ. తమ ఛానెల్ ని ఎవడో జాగ్వార్ గాడు హ్యాక్ చేసి ఇలా హత్యల్ని లైవ్ ఇస్తున్నాడనీ ఆగ్రహించిన యజమాని శౌర్యప్రసాద్- అలాగే తమ ఆస్పత్రి అక్రమాలపై విద్యార్దులు ఆందోళన చేస్తున్నారనీ చైర్మన్ ఆదిత్యాలు- ఆర్యని  జాగ్వార్ గా అనుమానించి అతణ్ణి చంపడానికి ప్లానేస్తారు. ఈలోగా సీబీఐ అధికారి జేబీ  తన ఏజెంట్ గా పద్మనాభం  (బ్రహ్మానందం) ని  ఆదిత్య ఇంట్లోకి దింపుతాడు. కృష్ణ కూడా అదే ఇంట్లో చేరతాడు. ఇలా విలన్ల ఇంట్లో పాగావేసిన ఈ ఇద్దరూ- ఏం చేశారు? అసలు విలన్ల మీద కృష్ణ పగకి కారణ మేమిటి? ఇంకెంత మందిని ఇలా చంపుతాడు? దీనికి అతడి తల్లిదండ్రులతో (రమ్యకృష్ణ, రావురమేష్) లతో సంబంధ మేమిటి? ... ఇవన్నీ తెలుసుకోవాలంటే మిగతా సినిమా చూడాల్సిందే! 

ఎలావుంది కథ 
      తెలుగులో ప్రతీవారం వస్తున్న ఇడ్లీ కథలాగే వుంది. ఇందులో ఇంకో మాటకి తావులేదు. ఓల్డ్ మాస్టర్ విజయేంద్రప్రసాద్ చాలా ఓల్డ్ రివెంజి డ్రామాని రాసేసి శిష్యుడు మహదేవ్ కి ఇచ్చేశారు. ‘జాగ్వార్’  అంటే ఇదేదో ‘మ్యాట్రిక్స్’ లా, ‘ధూమ్ -3’ లా టెక్నో థ్రిల్లర్ అయివుంటుందని భావించుకుని కళ్ళకద్దుకుని కొత్త కుర్రాడి మీద తీసేశాడు దర్శకుడు మహాదేవ్. కొత్త కుర్రాడికి పాతిక ముప్పయ్యేళ్ళ క్రితం కథలిలా వుండేవని ఏం తెలుస్తుంది. పైగా ఒక రేస్ బైక్, స్పై కెమెరా, బ్లాక్ కాస్ట్యూమ్స్ అందిస్తే కొత్త కొత్తగానే కన్పిస్తుంది అంతా. చాలా పాత మోడల్ కథకి అత్యాధునిక హంగులు జతచేస్తే కొత్తకాలానికి చెల్లిపోదని ఈ కథతో రుజువవుతోంది. తన చిన్నప్పుడు తల్లిదండ్రులకి జరిగిన అన్యాయానికి పగదీర్చుకునే హీరో కథే పాత అనుకుంటే, ఇందులో మళ్ళీ కోన వెంకట్ బ్రాండ్- ‘సెకండాఫ్ కథలో విలన్ ఇంట్లో హీరో చేరి వాళ్ళని బకారాలని చేయు’ అనబడు సింగిల్ విండో స్కీమ్ కథ  మళ్ళీ ఇక్కడా ప్రత్యక్షమయ్యింది- ఈ మధ్య ఇలాటి కథలతో  సినిమాల గొడవ వదిలిందనుకుంటే. రచయిత విజయేంద్ర ప్రసాద్ తను ఒక సినిమా కథ రాసేముందు  విధిగా ‘షోలే’ చూస్తానన్నారు. ‘షోలే’ నే చూస్తూంటే ఎలా, ఓసారి ‘ది మాగ్నిఫిషెంట్ సెవెన్’  చివరి భాగంకూడా చూసి వుంటే ప్రస్తుత పాత కథకే  ఎంతో  వన్నె చేకూర్చే వారయ్యే వారు. పాత కథలకి వన్నె చేకూర్చేది కొత్త కథన టెక్నిక్కులే తప్ప- ఎలాటి పిక్చరైజేషన్ టెక్నాలజీ కాదు. 

ఎవరెలా చేశారు 
    కొత్త హీరోగా అడుగు పెట్టిన నిఖిల్ గౌడ శారీరకంగా సమసౌష్టవంగా వున్నా, వ్యావహారికంగా ఇంకా వికసించాల్సి వుంది. మన హీరో కాదు కాబట్టి ఎక్కువ చెప్పుకోవాల్సిన పని లేదు. జగపతి బాబు ఈ సినిమాలో ఎందుకు నటించినట్టో అర్ధంగాదు. చంపుతున్న హీరోకి జాగ్వార్ అని తనే నామకరణం చేసి, పట్టుకునే తంతు లేకుండా,  హత్యలుచేస్తూంటే ఆపే పనే లేకుండా,  సెకండాఫ్ లో కాసేపటికి సినిమాలోంచే హాయిగా అదృశ్యమైపోయే ‘నిరుద్యోగ పాత్ర’ ఎందుకు పోషించినట్టో సినిమా కథని మించిన మిస్టరీగా వుంది. కథలో విజయేంద్ర ప్రసాద్ ఇవ్వలేని లేని మిస్టరీని,  ఇలా హాయిగా తన అదృశ్యంతో తీర్చినట్టుంది. బ్రహ్మానందం, రఘుబాబుల పాత్రలు కూడా డిటో- అర్ధోక్తిలో హాయిగా అంతర్ధానమై పోతాయి. రమ్యకృష్ణ, రావురమేష్ లుకూడా హాయిగానే జీవంలేని పాత్రల్లో  కన్పిస్తారు. రావురమేష్ చాలా అనాసక్తిగా వున్నట్టన్పించే  పాత్ర పోషణ ఇదే బహుశా. ఇద్దరు విలన్లు- సంపత్ రాజ్, ఆదిత్యా మీనన్ లు- వీళ్ళే  రొటీన్ గానే అయినా కాస్త హడావిడీ చేస్తూ కన్పిస్తారు. ఇక హీరోయిన్ దీప్తీ సతి గురించి చెప్పుకోవడానికేమీ లేదు- పాటలకి, ప్రేమ సీన్లకి కన్పించే గ్లామర్ బొమ్మ పాత్ర కాబట్టి. చివరి పాటలో ఐటెం గర్ల్ గా దర్శన మిచ్చే తమన్నాతో  ఆ కాసేపూ హుషారొస్తుంది ప్రేక్షక దేవుళ్ళకి. 

        సంగీత దర్శకుడు తమన్ మళ్ళీ తన పూర్వ వైభవం కోసం విఫల యత్నం చేస్తున్నట్టు మళ్ళీ కన్పిస్తుంది ఈ సినిమాలో. బిజిఎం కూడా సరీగ్గా కుదరలేదు. మనోజ్ పరమహంస సమకూర్చిన ఛాయాగ్రహణం ఎప్పట్లాగే తన బ్రాండ్ విలువలతో చెప్పుకోదగ్గదిగా వుంది. క్లైమాక్స్ లో రామ్  - లక్ష్మణ్ లు సమకూర్చిన యాక్షన్ కొరియోగ్రఫీ చాలా కాలం తర్వాత మొనాటనీని బద్దలు కొట్టి ఫ్రెష్ గా వుంది.

చివరికేమిటి 
     నందమూరి బాలకృష్ణతో గతంలో ‘మిత్రుడు’ తో విఫలయత్నం చేసిన దర్శకుడు మహదేవ్ ప్రస్తుత మెగా మూవీతోనూ అడుగు ముందుకు వేయలేకపోయాడు. ప్రధాన కారణం స్క్రిప్టే. ప్రొడక్షన్ విలువలతో స్క్రిప్టు విలువలు సరితూగకపోవడం. ఇంత భారీ బడ్జెట్ తో ఈ స్క్రిప్టు పదునైన కత్తిలా వుండాల్సింది. మనస్కరిస్తే అలా ఉండేందుకు చాలా అవకాశముంది- కానీ ‘రుజువైన, ప్రేక్షకులకి కొట్టిన పిండి అయిన పాత ఫార్ములాయే’  చాలు మనకి సేఫ్ అనుకుంటే సానబెట్టేందుకు ఏమీ వుండదు, అసలుకే ఎసరొస్తుంది.  కానీ ‘ది మాగ్నిఫిషెంట్ సెవెన్’ కాలానికంటే  ముందుంది  కథనానికి. అందుకనే ఇవ్వాళ్ళ రిమేక్ చేసినా ఇవాల్టి సినిమాలాగే వుంది తప్ప- ‘జాగ్వార్’ లా గడిచిపోయిన కాలపు చాదస్తంలా లేదు. ముసుగు వీరుడు జాగ్వార్ మెరపులా ఎక్కడ్నించి వస్తాడో, ఎవర్ని చంపుతాడో అంతుచిక్కని మిస్టరీగా వుండాల్సింది- అతణ్ణి  రొడ్డ కొట్టుడుగా, నవ్యత లేకుండా  అదే అరిగిపోయిన కాలేజీ స్టూడెంట్ గా  మార్చేసినప్పుడే కిక్, పెప్ అంతా పోయింది. ఎన్ని సార్లు ఈ కాలేజీ కజ్జాలూ, వారం వారం చూస్తున్న అదే ఫార్ములా ప్రేమలూ పాటలూ చూస్తూ ఇంటర్వెల్ వరకూ సహనం వహించాలి? అన్ని ఆర్ధిక వనరులూ, సాంకేతిక సహాయమూ వున్న ఇలాటి మెగా మూవీస్ కూడా సగటు సినిమా విషయ విన్యాసాలతో విసుగెత్తేలా వుండాల్సిందేనా? జరుగుతున్న అక్రమా లపై  విద్యార్ధులు చేస్తున్న ఆందోళనలకి అదృశ్య శక్తిగా, ఆపద్బాంధవుడిగా, జేజేలందుకునే ఒక ఆరాధ్య దైవంలా జాగ్వార్ వుండాల్సింది పోయి- పాత మోడల్ డ్రామా లేస్తూ విలన్ ఇంట్లో కూర్చోవడమేమిటి? ఎన్ని సార్లు ఇదే చూపిస్తారు? అతనొక హ్యాకర్, టెక్నో క్రాట్, లోకానికి ఐడెంటిటీ తెలీని హైటెక్ కిల్లర్- అలాటివాడు లోకకల్యాణం కోసమే అస్త్రశస్త్రాలు ప్రయోగించాలే  తప్ప- ఓపెన్ గా సొంత పగేదో తీర్చుకుంటూ దిగజారి పోవడమేమిటి? మాకు జాగ్వారే కావాలి, జాగ్వారే రావాలి – అంటూసమాజం ఎలుగేత్తేలా ఆ వేషధారణతో,  మానవాతీత వ్యూహాలతో ఒక పురాణ పాత్ర (మిథికల్  క్యారక్టర్) లా ఆత్మిక దాహాన్ని తీరుస్తూ వుండాలే గానీ- తన స్వార్ధం కోసం తన దాహం తాను తీర్చుకునే అట్టడుగు వ్యక్తిలా వుండడ మేమిటి? 

        డెంజిల్ వాషింగ్టన్ ‘ది మాగ్నిఫిషెంట్ సెవెన్’ లో తన కౌబాయ్ గ్రూపుతో గ్రామానికి విలన్ ముఠా పీడా విరగడ చేయడానికి ఆపద్బాంధవుడిలా వస్తాడు. పీడా విరగడ చేసి, చివరికి విలన్ని చంపుతూ - ‘నా చిన్నప్పుడు  మా అమ్మనీ, ఇద్దరు చెల్లెళ్ళ నీ నువ్వు చంపావ్ గుర్తుందా?’ అంటాడు. ఈ ఎండింగ్ స్టేట్ మెంట్ కి మనం కూడా షాకవుతాం. విలన్తో అతడికి పాతపగ వుందని మనకి కూడా అప్పటివరకూ తెలియదు. ఇలా చివరికి తెలిసినప్పుడు వాషింగ్టన్ పాత్ర ఎంతో ఉన్నతంగా కన్పిస్తుంది. అతను ఇంత బాధ దాచుకుని గ్రామం కోసం చేశాడన్న మాట. హీరో అనేవాడి  మొదటి ప్రాధాన్యం  పర సుఖమే, తన సుఖం తర్వాత!

-సికిందర్
http://www.cinemabazaar.in





        


3, అక్టోబర్ 2016, సోమవారం

రివ్యూ!


సాంకేతికం :




కప్పుడు కంప్యూటర్లతో డిజైన్ చేసిన సినిమా పోస్టర్లంటే అంత దూరం పారిపోయేది  తెలుగు సినిమా రంగం. తర్వాత  అదే డిజిటల్ డిజైన్లని రుచి మరిగాక  కావాలీ-  ఇంకా కావాలీ అంటూ వెంట పడసాగింది తెలుగు సినిమా ప్రపంచం. దేశంలోనే కాదు, విదేశాలలోనూ ఏ  సినిమాకీ వుండనన్ని పోస్టర్ డిజైన్లు ఒక్క తెలుగు సినిమాలకే వుండడం కూడా టాలీవుడ్ సాధించిన ఒక  రికార్డు.

          ఎందుకిలా? ఎందుకంటే, ఇక్కడి ప్రేక్షకుల అభిరుచీ, నిర్మాతల తాపత్రయమూ కారణమని రాంరెడ్డి అలియాస్ రాము సమాధానం. రవితేజ నటించిన ‘వీర’ తో దర్శకుడిగా మారిన రమేష్ వర్మ స్థాపించిన సుప్రసిద్ధ కిరణ్ యాడ్స్ వ్యవహారాలు చూసుకుంటున్న ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ పి.  రాము నిజానికి మాన్యువల్ తరం నుంచి వచ్చిన కళాకారుడు. నల్లగొండ జిల్లా వెలిగొండ మండలం ఆరూరు గ్రామానికి చెందిన వ్యవసాయదారుడైన తండ్రికి గల చిత్రలేఖనం హాబీని చూసి తనూ కుంచె పట్టిన రాము, ప్రఖ్యాత పబ్లిసిటీ డిజైనర్ గంగాధర్ కుమారుడు శంకర్ దగ్గర శిష్యరికం చేసి, తన కళకి మరింత పదును  పెట్టుకుని వచ్చి కిరణ్ యాడ్స్ లో చేరిపోయారు.

          అప్పుడదంతా కంప్యూటర్స్ ప్రపంచం. 1998లో ఓ కంప్యూటర్ మీదే స్వతంత్రంగా తన మొదటి సినిమా పోస్టర్ డిజైన్ చేశారు రాము. ఆ సినిమా పేరు ‘బావగారూ బావున్నారా?’. అప్పటినుంచీ  కొన్ని వందల స్టార్ సినిమాలకి పోస్టర్స్ వేస్తూ వస్తున్నారు.

          అసలు కంప్యూటర్ పోస్టర్స్ డిజైనింగ్ ని దక్షిణాదిన పరిచయం చేసింది రమేష్ వర్మే. పూర్తిగా మాన్యువల్ కి అలవాటైన ఆ కాలంలో నిర్మాతలు కంప్యూటర్ పోస్టర్లని అస్సలు ఒప్పుకునే వాళ్ళు కాదు. అలాటిది నెమ్మదిగా వాటిని అలవాటు చేశారు వర్మ. అలాగే స్టిల్ ఫోటోగ్రఫీ లోనూ డిజిటల్ కెమెరాని ప్రవేశ పెట్టింది తనే. వినైల్ బోర్డుల్ని పరిచయం చేసింది కూడా తనే. ఇంతే కాదు, బొటాబొటీగా సంపాదించుకుంటూ, పెద్దగా గుర్తింపు కూడా పొందని పబ్లిసిటీ ఆర్టిస్టులకి  చీఫ్ టెక్నీషియన్ గా గుర్తింపు తీసుకొచ్చి అత్యధిక పారితోషికం (5 లక్షలు) పొందిన ఘనత కూడా ఈయనదే.

      స్టూడియోలో రాము తన కుంచె పనిని (లోగోలు వేసే పనిని) అవుట్ సోర్సింగ్ ఇచ్చేసి పూర్తిగా ఫోటోషాప్ కి అంకితమైపోయారు. బయటి ఆర్టిస్టులు రూపొందించిన లోగోలని మెరుగు పరచి సెలక్షన్  కోసం నిర్మాతలకి పంపిస్తారు. అయితే ఇప్పుడు శతదినోత్సవాల సినిమాల్లేని కాలంలో, పోస్టర్  డిజైనింగ్ స్టూడియోల దగ్గర నుంచీ ప్రింటింగ్ ప్రెస్సుల వరకూ పనీపాటలు  తగ్గిపోలేదా అంటే, పనీపాటలు  ఇంకా బాగా పెరిగాయన్నారు రాము. రెండు మూడు వారాల్లోనే వసూళ్లు రాబట్టుకునే వ్యూహంతో వందలాది థియేటర్లలో సినిమాలు విడుదల చేస్తున్నప్పుడు  పబ్లిసిటీ వ్యయం భారీగా పెరిగిందన్నారు. ఇదివరకు ఇరవై లక్షల రూపాయలు సరిపోతే, ఇప్పుడు ముప్పయి కోట్ల సినిమాకి 3 కోట్ల రూపాయలు పబ్లిసిటీకి ఖర్చవుతొందన్నారు. ఈ లెక్కన పబ్లిసిటీ రంగం అభివృద్ధి పథంలోనే వుందని వివరించారు.

          పోస్టర్ల మీద సెన్సార్ సర్టిఫికేట్ల ముద్రణ ఎందుకు మానేశారని అడిగితే,  విడుదలకి చాలా ముందే పోస్టర్లు తయారై పోతాయి గనుక, విడుదలకి రెండ్రోజుల ముందు సినిమా సె న్సారైనప్పుడు U, U/A, A  మొదలైన రేటింగ్స్ ని ముద్రించడం ఎలా కుదురుతుందన్నారు. బాలీవుడ్లో  నెల రోజుల ముందే సెన్సారవడం వల్ల అక్కడ పోస్టర్ల మీద సెన్సార్ సర్టిఫికెట్లు ముద్రించడం కుదురుతోందన్నారు రాము.

         ఒక పోస్టర్ని సృష్టించాలంటే రాముకి ఒక్కోసారి అరగంటే పట్టొచ్చు, ఒక్కోసారి రోజంతా కూడా పట్టొచ్చు. సమయం ఎంత పట్టినా క్వాలిటీ మీద దృష్టి పెడతారు. షూటింగ్ స్పాట్స్ లో స్టిల్స్ తీసి అందించే  స్టిల్ ఫోటోగ్రాఫర్లు తమ స్టిల్స్ ఎలా వచ్చినా అవి రాము చేతిలో క్వాలిటీని సంతరించుకుంటాయన్న నమ్మకంతో వుంటారు. లోగోలని రాము అవుట్ సోర్సింగ్ ఇవ్వడానికి కారణం నల్గురి నుంచి వైవిధ్యం వస్తుందనే. అదే తనే వేస్తె మొనాటనీ వుండొచ్చు. మరి ఆ మొనాటనీ పోస్టర్ డిజైనింగ్ తో వుండదా అని ప్రశ్నిస్తే, ఈ రంగంలో టాప్ పొజిషన్లో  వుండాలంటే అనుక్షణం కొత్తదనం కోసం పాటుపడాల్సిందే నన్నారు రాము.

-సికిందర్
(జులై 2011 ఆంధ్రజ్యోతి)




30, సెప్టెంబర్ 2016, శుక్రవారం

రివ్యూ!

రచన - దర్శకత్వం: సంతోష్‌ శ్రీన్‌వాస్‌
తారాగణం: రామ్‌, రాశీఖన్నా, సత్యరాజ్‌, మురళీశర్మ, రావు రమేష్‌, పోసాని కృష్ణమురళి, హేమ, ప్రియ, ప్రభాస్‌ శ్రీను తదితరులు.
మాటలు: అబ్బూరి రవి సంగీతం: జిబ్రాన్‌ చాయా గ్రహణం: సమీర్‌రెడ్డి,
నిర్మాణ సంస్థ: 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌
నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌సుంకర
విడుదల : సెప్టెంబర్ 30, 2016
***


         
కైనెటిక్ స్టార్ రామ్ మళ్ళీ తన మాస్ మసాలా వ్యామోహంతో ఆ వర్గ ప్రేక్షకులకోసం ‘హైపర్’ అంటూ వచ్చేశాడు. రామ్ తో ‘కందిరీగ’  తీసిన దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ఈ సారి రామ్ తో తండ్రీ కొడుకుల అనుబంధంతో  మాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవచ్చనుకున్నాడు. ఇద్దరూ కలిసి మాస్ కోసం ఏమేమో చేసుకుంటూ పోయారు. ఇన్ని చేసినా  ఎంత నిబద్ధతతో చేశారో ఈ  కింద చూద్దాం. 

కథ 

        బీటెక్ చదివిన సూరి (రామ్) ఫ్రెండ్స్ తో ఆవారాగా తిరుగుతూంటాడు. వెనకనుంచి ఓ అమ్మాయి( రాశీ ఖన్నా) నడుం చూసి ఆమె ప్రేమలో పడిపోయి, అమ్మాయిల బ్యాక్ లు చూస్తూ ఆమెకోసం వెతుకుతూంటాడు. ఇతడికి తండ్రి నారాయణ మూర్తి (సత్యరాజ్) అంటే ఇ తడి మాటల్లోనే ‘పిచ్చ ప్రేమ’. ఆ ప్రేమతో తండ్రి కోసం ఏమైనా చేస్తాడు. భవంతుల నిర్మాణాలకి  అనుమతులిచ్చే శాఖలో పనిచేస్తూంటాడు తండ్రి.  తండ్రి తో బాటు ఓ తల్లీ చెల్లెలూ వుంటారు సూరికి. ఓ రోజు తండ్రిని ఓ రోడ్డు ప్రమాదం నుంచి కాపాడతాడు గజ (మురళీ శర్మ) అనే గూండా. దీంతో సూరి గజ వెంటపడి వాడికోసం ఏ పనైనా  చేసేస్తూంటాడు. సూరీ గజా ఇద్దరూ ఫ్రెండ్స్ అవుతారు. ఇప్పుడు మంత్రి రాజప్ప  ( రావురమేష్) కట్టబోయే ఓ పెద్ద కాంప్లెక్స్ నిర్మాణపు  ఫైలు తండ్రి దగ్గరి కొస్తుంది. అది సక్రమంగా లేదని సంతకం పెట్టనంటాడు సూరి తండ్రి. రాజప్ప గజకి పురమాయించి వెళ్ళిపోతాడు. నారాయణ మూర్తి సూరి తండ్రి అని తెలియక బెదిరిస్తూంటాడు గజ. తర్వాత తెలుసుకుని చేతులెత్తేస్తే, మళ్ళీ మంత్రి రాజప్ప రంగంలోకి దిగుతాడు. వీళ్ళ కుట్ర తెలిసిపోయిన సూరి,  రాజప్ప చేతే అతడి రాజీనామా లేఖ మీద సంతకం పెట్టిస్తానని ఛాలెంజి చేస్తాడు. ఈ ఛాలెంజిగా  సాగేదే మిగతా కథ. 

ఎలావుంది కథ 
        ఇడ్లీ బండీవాడు రోజూ ఇడ్లీలే వేస్తూంటే జనాలు తినడం లేదూ? అలాగే ఇడ్లీలూ సినిమాలూ ఒకటేనని భావించుకుని చూసేసే మొహం మొత్తని జనాలకోసం అన్నట్టు వుంది ఈ రొడ్ద కొట్టుడు రొటీన్ కథ. టాలీవుడ్ ని ‘ఇడ్లీవుడ్’ గా వుంచేస్తూ తన వంతు కూడా కృషిచేస్తున్న స్టైలిష్ కైనెటిక్ స్టార్ రామ్ ని అభినందిస్తూ, కలకాలం తను ఇలాగే కొనసాగాలని కోరుకోవాలన్నంత ‘పిచ్చపిచ్చ’ గా వుందీ కథ. ఇందులో ‘హైపర్’ గా ఏముందో వెతుక్కోలేనంత భారీ ప్యాకేజీతో వుందీ కథ. ఈ ప్యాకేజీలో స్టోరీ పాయింటు వచ్చేసి ‘జనతా గ్యారేజ్’ మున్సిపల్ ఆఫీసు సీనుగానూ, హీరో వచ్చేసి విలన్ ని ప్రేమించే ‘జక్కన్న’ టైపు క్యారక్టర్ గానూ, ఇక  క్లయిమాక్స్ వచ్చేసి టీవీ ఛానెల్స్ తో ‘రేసుగుర్రం’ మార్కు క్లయిమాక్స్ గానూ వుండేసి-  చూసిందే చూడమని- పనిలోపనిగా - ప్రభుత్వోద్యోగులకి ఓ ప్రభోదాత్మక సందేశమిచ్చే  సెమీ- నారాయణమూర్తి కథలాగానూ వుంది. 

ఎవరెలా చేశారు 
      కైనెటిక్ స్టార్ రామ్ 4 - జి కాలంలో ఇంకా 2- జి సినిమాల దగ్గరే ఆగిపోవడం చాలా ఆశ్చర్యం కల్గించే విషయం. సినిమాలెప్పుడూ ఇంకా 1-జి,  2- జిలు గానే వుంటాయను కోవడం విచారకరం. సరే, ఈ పాతచింతకాయ  మూస మాస్ కథనైనా, పాత్రనైనా, కాస్త చూడబుల్ గా ఉండాలంటే ఏం చేయవచ్చో కూడా ఆలోచించకపోవడం అన్నిటికన్నా విషాదం. చాలా సింపుల్ గా, అదే సమయంలో బలంగానూ చెప్పే అవకాశమున్న కథని, పాత్రనీ  ఏమేమో చేసి ఏదేదో చేసి బుర్ర తినేస్తే ఎలా? తండ్రిని పిచ్చగా ప్రేమించడమనే పాయింటు తనకి  ఆకర్షణీయంగా కన్పించినంత మాత్రాన మిగతా అంశాలూ ఆకర్షణీయంగా ఉండేట్టు చూసుకోవాల్సిన అవసరం లేదా?  ఇంతా  చేసి క్లయిమాక్స్ ని ప్రారంభించింది కూడా ఒక హీరో పాత్రగా తను కాకపోతే ఎలా?  హీరోయిన్ తో చాలా బోరు కొట్టే ప్రేమలో పడేసే సీన్లు రొటీన్ ఇడ్లీ కల్చర్ లో భాగమే అనుకుందాం, ఆ ఇడ్లీలో మినపప్పు కూడా వేయరా?  ఇలా 5-జి ఇడ్లీలు తయారు చేద్దామనుకుంటున్నారా?

          హీరోయిన్ రాశీ ఖన్నా ని ఆ పాత్రలో చూస్తే చాలా జాలేస్తుంది. ముందు అమాయకంగా వుండే తను తర్వాత రామ్ కంటే హైపర్ గా మారిపోతుంది. సడెన్ గా ఈ మార్పు  ఒవర్ యాక్షన్ లాగా వుంటుంది. కానీ మాస్ కోసం ఈ సినిమా కాబట్టి ఎలా వున్నా అదే వరమని  చూసేస్తారు తప్పదు.

          తండ్రి పాత్ర సత్య రాజ్ ది  ఏకపక్ష వ్యవహారమే. తనని అంత  ప్రేమించి, తన కోసం అంత చేసే కొడుక్కి ఏమీ ఇచ్చినట్టు కన్పించడు. తండ్రీ కొడుకుల అనుబంధం- మధ్యలో విలన్ తో సమస్య- ఆ సమస్యని తీర్చడం అని సింపుల్ గా ఉండాల్సిన పాయింటులోకి ఎన్నెన్నో విషయాలు, ఉపకథలూ, ఒకడి మీద ఇంకో విలన్ పాత్రలూ పెట్టేసి గందరగోళం సృష్టించడంతో సత్యరాజ్- రామ్ ల బాండింగ్ గల్లంతయి పోయింది. కనీసం వాళ్ళిద్దరి మీద ఒక పాట పెట్టినప్పుడే కదా ఆ అనుబంధమైనా బలంగా నాటుకునేది. తండ్రీ కొడుకుల మీద పాట ప్రేక్షకులు ఒప్పుకోరనా? 

          ఒకటో విలన్ గా మురళీ శర్మ, రెండో కృష్ణుడు రెండో విలన్ గా, మంత్రిగా రావురమేష్, రెండో నంబర్ మంత్రి గా జయప్రకాష్ రెడ్డి, ముఖ్యమంత్రిగా విశ్వనాథ్, ఇంకా సత్యరాజ్ పైన ఒకటో నంబర్ ఆఫీసర్ గా సాయాజీ షిండే తదితరుల సోపానక్రమం క్రమంగా బలహీనపడి పోతుంది కథలో.

          మలయాళ సంగీత దర్శకుడు జిబ్రాన్ తెలుగుపాటలు కుదరలేదు- ఒక్క చివరి టైటిల్ సాంగ్ తప్ప. సమీర్ రెడ్డి ఛాయాగ్రహణం హైపర్ గా ఏమీ లేదు. ‘హైపర్’ టైటిల్ కి తగ్గట్టుగా స్టయిలిష్ గా ఏమీ తీయలేదు.

చివరికేమిటి?
       ‘కందిరీగ’ తో సెకండాఫ్ సిండ్రోమ్ ని  అంత బాగా అధిగమించగల్గిన దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ఆ తర్వాత  ‘రభస’ తో, మళ్ళీ ఇప్పుడు ‘హైపర్’  తో స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ అనేదొకటుంటుందని పూర్తిగా మర్చిపోయినట్టుంది.  తూర్పుకి తిరిగి రోడ్డు వేసుకుంటూ పోతూంటే  బెజవాడకి  రూటు అదే పడుతుందన్నట్టు, ఏమేమో సీన్లు వేసుకుంటూ పోయారు. అనవసర సీన్లు వేసుకుంటూ పోయారు. బలహీనంగా,  హీరోని పాసివ్ గా మార్చేసే సీన్లు  ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అమర్చుకుంటూ పోయారు- ఈ అమరికలో మాటల  రచయిత పాత్ర  కూడా ఉందేమో తెలీదు. ఈ కథ మొత్తాన్నీ పరిశీలిస్తే హీరో కిడ్నాపయ్యే సీను ప్లాట్ పాయింట్ వన్ గా పెట్టుకోవాలి. అంటే హీరో తండ్రి మీద విలన్ వొత్తిడి తెచ్చే క్రమమంతా ఈ లోపే అరగంటలో ముగిసిపోవాలి. ఆ తర్వాత హీరో కాబోయే బావని కిడ్నాప్ చేసి- హీరోని తండ్రి నుంచి విడగొట్టే మెయిన్ విలన్ అయిన మంత్రి కుట్ర తో ఇంటర్వెల్ రావాలి. ఈ టైమింగ్స్ తో ఈ రెండు మూలస్థంభాల  ఆధారంగా ఈ మొత్తం కథా  నడిపివుంటే- కేవలం సంతకం చుట్టూ కథ అని కాకుండా, సంతకం చెయ్యని కారణంగా భౌతికంగా ఇంకేదో భారీ నష్టం కూడా చూపించి వుంటే -  ఇడ్లీ కథయినా చూడబుల్ గా వుండేది! 


-సికిందర్
http://www.cinemabazaar.in

26, సెప్టెంబర్ 2016, సోమవారం

స్పెషల్ ఆర్టికల్ :






ముంబాయిలో మకాం వేసి బాలీవుడ్  సినిమాల్లో నటిస్తున్న, పాడుతున్న  పాకిస్తాన్ కళాకారులు 48 గంటల్లో దేశం  విడిచి వెళ్ళిపోవాలని, లేకపోతే  మెడబట్టి గెంటేస్తామనీ గత  శుక్రవారం అల్టిమేటం ఇచ్చిన మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్), మొన్న సోమవారం పాకిస్తాన్ కళాకారులు దేశం విడిచి వెళ్లిపోయారని ప్రకటించింది. ఇంకెవరైనా ముంబాయిలో తలదాచుకుంటే వేటాడతామని కూడా హెచ్చరించింది. మహారాష్ట్రలో బిజెపితో అధికారాన్ని పంచుకుంటున్న శివసేన తానులో ముక్కే అయిన, వేరు కుంపటి పెట్టుకున్న రాజ్ థాకరే నాయకత్వం లోని పార్టీ ఎన్ఎంఎస్. దీని సినీ కార్మికుల విభాగం చిత్రపట్ కర్మచారి సేన అధ్యక్షుడు అమే ఖోప్కర్ ఈ బహిష్కరణల పర్వానికి తెర తీశారు. కారణం ఉరీ ఘటన. 19 మంది భారత సైనికుల్ని హతమార్చిన పాక్ ఉగ్రవాదుల ఘాతుకం. అయితే ఇప్పుడు పాక్ కళాకారులు దేశం విడిచి వెళ్లి పోయారని ఎంఎన్ఎస్ నేతలు ఇచ్చుకుంటున్న ప్రకటనలే తప్ప, ప్రభుత్వ  ధృవీకరణ లేవీ లేవు

       
సలు ఎన్ఎంఎస్ పార్టీ హెచ్చరిక జారీ చేసిన వెంటనే ముంబాయి పోలీసులు ఆ పార్టీకి నోటీసు లిచ్చారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుని ఇలాటి హెచ్చరికలు చేస్తే సహజంగానే చట్టం వూరుకోదు. పైగా భారత ప్రభుత్వం జారీ చేసిన వీసాలున్న విదేశీయులెవరూ భయపడనవసరం లేదనీ, కోరితే వాళ్ళకి రక్షణ కల్పిస్తామని కూడా ముంబాయి పోలీసులు ప్రకటించారు. కానీ పాక్ కళాకారులెవరూ పోలీసుల్ని ఆశ్రయించినట్టు లేదు- ఎన్ఎంఎస్ చెబుతున్న దాని ప్రకారం దేశం విడిచి వెళ్ళిపోయారు. 

        పాకిస్తాన్ నుంచి వచ్చి బాలీవుడ్ లో కొనసాగుతున్న పాక్ నటుల్లో, గాయకుల్లో ఫవాద్ ఖాన్, మాహిరా ఖాన్, అలీ జాఫర్, అలీ అజ్మత్, ఆతిఫ్ అస్లం, షఫ్ఖత్ అమానత్ అలీ ఖాన్, రాహత్ ఫతే అలీ ఖాన్, సల్మాన్ అహ్మద్ మొదలైన వారు ప్రస్తుతం వున్నారు. 

       
ఎన్ఎంఎస్ కాదుగానీ, ఆమధ్య ఏకంగా శివసేన పార్టీయే ప్రసిద్ధ పాకిస్తానీ ఘజల్ గాయకుడు గులాం అలీని ముంబాయిలో ప్రోగ్రాం పెట్టనీయకుండా అడ్డుకుంది. పాకిస్తాన్ నటులు, క్రికెటర్లు ఎవరైనా సరే మహారాష్ట్ర గడ్డ మీద అడుగు పెట్టనీయబోమని హెచ్చరించింది. ఈ రెండు పార్టీలూ మరాఠాల ఆత్మగౌరవ ఎజెండాతోనే అతివాదంతో అల్లరి చేస్తూంటాయి. ముంబాయిలో మహారాష్ట్రీయులకి ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తున్నారని తమిళుల మీద, బీహారీల మీద, ఇతర ఉత్తరాది రాష్ట్రాల వాళ్ళ  మీదా దాడులు చేసిన ఈ పార్టీలు టెర్రరిజం అనేసరికి పాక్ కళాకారుల మీద పడతాయి. 2008 లో తమ సొంత ముంబాయిలోనే  జరిగిన అంతటి టెర్రర్ మారణహోమంలో కూడా ఈ పార్టీలు నోరెత్త లేదు, పత్తా లేవు. దేశ ప్రయోజనాల కోసం కాకుండా  మహా రాష్ట్ర సెంటి మెంట్లని రెచ్చగొడుతూ ఈ పార్టీలు అడపదపా వివాదాలు సృష్టిస్తూంటాయి. 

      ప్రస్తుత వివాదంలో కేంద్రబిందువుగా వున్న ఫవాద్ ఖాన్, మాహిరా ఖాన్ అనే పాక్ హీరో హీరోయిన్లలో (వీళ్ళు పాక్ టీవీ సీరియల్స్ నుంచి ఏకంగా బాలీవుడ్ స్టార్స్ గా ప్రమోటయిపోయారు) ఫవాద్ ఖాన్ ఆదివారమే రహస్యంగా పాకిస్తాన్ వెళ్లిపోయాడని వార్త లొచ్చాయి. మళ్ళీ ఇప్పట్లో వచ్చే సూచనలు కూడా లేవట. ఫవాద్ ఖాన్ నటించిన ‘యే దిల్ హై ముష్కిల్’  (ఈ మనసు కష్టమైనది) దీపావళికి విడుదలవుతోంది. ఇందులో తను అతిథి పాత్ర మాత్రమే పోషించాడు. హీరో హీరోయిన్లుగా రణబీర్ కపూర్- ఐశ్వర్యా రాయ్ లు నటించారు. గతంలో ఫవాద్ ఖాన్ హీరోగా నటించిన ‘ఖూబ్ సూరత్’, ‘కపూర్ అండ్ సన్స్’ లతో మనదేశంలో పాపులారిటీ సంపాదించుకుని 2.5 కోట్ల రూపాయల పారితోషికం డిమాండ్ చేసే స్టార్ గా ఎదిగాడు. బుల్లితెర  హీరోగా జీ – జిందగీ ఛానెల్ ప్రసారం చేసిన అనేక పాకిస్తానీ సీరియల్స్ ద్వారా మన దేశంలో ఇంటింటికీ  తెలిశాడు. టీవీ సీరియల్స్ లో నటిస్తున్నప్పుడు ఎపిసోడ్ కి రెండు లక్షలు తీసుకునే వాడు. 

       ఇక   షారుఖ్ ఖాన్ టిస్తున్న రయీస్’ (సంపన్నుడు)లో మాహిరా ఖాన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈమె కిదే  తొలి బాలీవుడ్ అవకాశం. ఇది జనవరి 26విడుదల కాబోతోంది. పాకిస్తానీ సీరియల్స్ లో నటిస్తున్నప్పుడు ఈమె ఎపిసోడ్ కి మూడు లక్షలు తీసుకునేది. ‘రయీస్’ కి ఎంతిస్తున్నారో వెల్లడి కావడం లేదు. ఈ రెండు భారీ సినిమాల విడుదలలని  అడ్డుకుంటామని కూడా హెచ్చరించింది ఎంఎన్ఎస్ పార్టీ. కానీ ఈ బెదిరింపుల్ని మాహిరా ఖాన్ సీరియస్ గా తీసుకున్నట్టు లేదు. పాకిస్తాన్ నుంచి ఒక తుంటరి, ‘నువ్వింకా ఇండియా చేతి లాఠీ  దెబ్బలు తిననట్టుంది’ అని ట్వీట్ చేస్తే,  దీనికి మాహిరా- ‘మీ అమ్మ చేతిలో నీ వీపు పగిలి వుంటే ఇలాటి వెధవ వాగుడు వాగవురా’ అని ఇలాటి విపత్కర పరిస్థితిలో కూడా కామెడీ చేసింది. ఈమె ఇంకా స్వదేశం వెళ్ళిపోకుండా ముంబాయిలోనే దాక్కుందేమోనన్న అనుమానాలున్నాయి. ఈమె ట్వీట్ కి ఎంఎన్ఎస్ రెస్పాన్స్ కూడా లేదు. వాళ్ళకీ వాళ్ళమ్మ గుర్తొచ్చిందేమో. 

         అయితే  ఈ పాకిస్తానీ నటులతో ఎన్ఎంఎస్ చేస్తున్న రాద్ధాంతం విచిత్రంగా కూడా వుంది.  ఈ రెండు సినిమాల నిర్మాతల్నీ నిలదీస్తూ - మీకు ప్రోత్సహించడానికి లోకల్ టాలెంట్సే కన్పించలేదా, ఎందరో మన వాళ్ళ  కడుపులు కొట్టి పాకిస్తానీయుల్ని పోషిస్తారా, దీన్ని మేం సహించం- అని ఉత్తరాలు రాశారు. పాకిస్తానీ  సీరియల్స్ ప్రసారం చేస్తున్న ఛానెల్స్ కి కూడా ఇలాగే రాశారు. ఇది చాలా పాత గొడవే. ఈ గొడవకి అందరికంటే ముందుండే వాడు సింగర్ అభిజిత్. పాకిస్తానీలు వచ్చి మా కడుపులు కొడుతున్నారంటూ ఏకంగా బూతులే ట్వీట్ చేస్తాడు. అయితే ఇప్పటి సమస్య తమ కడుపులు కొడుతున్నరనా, లేకపోతే అంత మంది సైనిక జవాన్ల ప్రాణాలు  తీశారనా? ఏది బర్నింగ్ ఇష్యూ? ఏది దేశ ప్రజల ఆగ్రహానికి కారణమౌతోంది? ఇలా వుంటుంది ఎన్ఎంఎస్ మరాఠా ప్రాంతీయతత్వపు దేశభక్తి. ఉరీకి భుక్తి సమస్య లింకు చేసి మరాఠా ఓట్లు కూడా పొందవచ్చన్న ఎత్తుగడలా వుందిది. ఉరీని పురస్కరించుకుని అన్ని రాజకీయపార్టీలూ ఒకే మాట మాట్లాడాలని కీచులాడుకుంటూంటే, ఎంఎన్ఎస్ స్థానిక కళాకారుల భుక్తి సమస్య ఇందులోకి లాగింది. ఇంకొక విచిత్రమేమిటంటే,  దాద్రీ ఘటనలో వివాదాస్పదుడైన బిజెపి నేత సంగీత్  సోమ్  అయితే- ఉరీ దుశ్చర్యలో పాకిస్తాన్ ప్రభుత్వ పాత్ర వుందని ఫవాద్ ఖాన్ గనుక బహిరంగంగా ప్రకటిస్తే,  అతను ఈ దేశంలో వుండడానికి తనకే అభ్యంతరంలేదని ప్రకటించాడు! ఒక పార్టీ మావాళ్ళ భుక్తి కోసం వెళ్ళిపోవాలని అంటూంటే, ఇంకో పార్టీ నేత ఫవాద్ అలాటి ప్రకటన చేస్తే సరిపోతుందని అంటున్నాడు!

     ఫవాద్ నిర్మాత కరణ్ జోహార్ని ప్రశ్నిస్తూ- ‘సినిమాలో బుక్ చేసుకోవడానికి మీకు ఫవాద్ ఖాన్ ఒక్కడే కన్పించాడా? షారుక్ ఖాన్, అక్షయ్  కుమార్ లలాంటి గొప్ప నటులు కనిపించనే లేదా?’ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు సంగీత్ సోమ్! సమస్య షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్ల అవకాశాల గురించా, లేకపోతే ప్రాణాలు కోల్పోయిన సైనికుల గురించా? ఏ అంశాన్ని పట్టుకుని నిలదీయాల్సి వుంటుంది? ఇలా ఒక స్పష్టత లేని, ఐక్యత లేని నేతల నోటి దూలతోనే అసలు సమస్య. 

        ఉరీని పురస్కరించుకుని మన నాయకులూ, మేధావులు ఏకత్రాటి పై లేరు. ఇదే పాకిస్తాన్లో అయితే ఐఎస్సైలు, సైనికులు, టెర్రరిస్టులు, నాయకులు, మేధావులూ - ఇంత గుంపూ గీత గీసుకుని ఒకే గొంతుకతో ఇండియా మీద విరుచుకు పడతారు! ప్రతీరాత్రి మన ఛానెల్స్ లో ఉరీ మీద మన నేతల, మేధావుల ఐక్యత లేని కీచులాటల్ని పాకిస్తాన్ లో కూర్చుని అక్కడి ఐఎస్సై- సైనిక క్యాంపులు, టెర్రర్ శిబిరాలూ వినోదిస్తూనే వుంటాయి. వాళ్ళక్కావాల్సింది ఇదే - ఈ అనైక్యతే!

బాలీవుడ్ వర్సెస్ లాలీవుడ్ 
       ఎంఎన్ఎస్ రాద్ధాంతం మీద బాలీవుడ్ కూడా డివైడ్ టాక్ తో వుంది. కళలకి రాజకీయాల్ని దూరంగా వుంచాలని కొందరంటే, పాక్ కళాకారుల్ని తరిమి కొట్టాలని మరికొందరు ఆగ్రహించారు. కరణ్ జోహార్, మహేష్ భట్ లాంటి వాళ్ళే  మన నెత్తి మీదికి పాక్ కళాకారులని తెచ్చి పెడుతున్నారని, వీళ్ళే అసలు ద్రోహులనీ గాయకుడు అభిజిత్ తీవ్రంగా విరుచుకుపడితే, మరో గాయకుడు  కైలాస్ ఖేర్, పాక్ కళాకారులు ద్వేషాన్ని వెదజల్లనంత వరకూ  వాళ్ళని బహిష్కరించాల్సిన అవసరం లేదని సమర్ధించారు. ఎంఎన్ ఎస్ ఇంకో అడుగు ముందుకేసి తప్పుడు ఆరోపణ చేసింది. మన సినిమాల్ని పాకిస్తాన్ లో ఆడనియ్యరు గానీ, పాకిస్తాన్ వాళ్ళు వచ్చి ఇక్కడ పని చేస్తారని ఆరోపిస్తే, నిర్మాత వాసూ భగ్నానీ దీన్ని ఖండించారు. ‘భజరంగీ భాయిజాన్’  లాంటి మన సినిమాలు పాకిస్తాన్లో విరగబడి ఆడుతున్నాయనీ,  కాబట్టి బాలీవుడ్ కి  పాక్ కళాకారులు వస్తే అభ్యంతరం ఎందుకనీ - సమస్యంతా టెర్రరిజంతోనే అనీ సమాధాన మిచ్చారు.

        అసలొక విధంగా చెప్పాలంటే, బాలీవుడ్ సినిమాలు లాలీవుడ్ ( పాకిస్తాన్ సినిమా పరిశ్రమ) ని కుదేలు చేశాయి. అయితే విచిత్రంగా బాలీవుడ్ సినిమాల మీద- అంటే బాలీవుడ్ సినిమాలు  ప్రదర్శించే అక్కడి థియేటర్ల మీద టెర్రరిస్టులు దాడులు చేయడం లేదు. సైనిక, ప్రభుత్వ, ఇతర రాజకీయ, మేధావి వర్గాలు కూడా వీటి జోలికి పోవడం లేదు. ఎఫ్ ఎం రేడియోల్లో హిందీ పాటలు మార్మోగుతున్నా- మా సంస్కృతీ చట్టు బండలూ అని గొడవ చేయడం లేదు. వాళ్ళ సంస్కృతి  ఇండియా మీద తుపాకులతో దాడులు చేయడమే కాబోలు (వాళ్ళ విదేశాంగ విధానం టెర్రరిజమే).  అంతేగానీ ఇండియన్ సినిమాల్నీ పాటలనీ పట్టించుకుని, మన ఎంఎన్ఎస్  లాగా వాటిని నిషేధించేంత తీరికా, సాంస్కృతికాభిమానమూ వాళ్ళ బుర్రలకి లేదు. కేవలం అక్కడి నిర్మాతలే, పంపిణీదారులే బాలీవుడ్ సినిమాల ధాటికి లాలీవుడ్ నాశనమవు తోందని అరణ్య రోదన చేస్తున్నారు. వాళ్ళ ప్రభుత్వం లాలీవుడ్ చక్కగా అభివృద్ధి చెందుతోందని ప్రకటనలు  చేస్తోంది.
పాకిస్తాన్లో ‘భజరంగీ భాయిజాన్’ తో పాటూ విడుదలై హిట్టయిన ‘బిన్ రోయే’ (దుఃఖపడకుండా) అనే మాహిరా ఖాన్ నటించిన రోమాంటిక్ డ్రామా ‘భజరంగీ భాయిజాన్’ తో పాటే ఇండియాలో 60 థియేటర్లలో విడుదల చేయాలనీ ప్లాన్ చేశారు. అంతే, మహారాష్ట్రలో ఎంఎన్ఎస్ పార్టీకి మంచి మేత దొరికినట్టయింది. దాన్ని నంజుకు తిని విడుదల కాకుండా ఆపేసింది. తర్వాత పశ్చిమ బెంగాల్లో విడుదల చేసి సొమ్ములు చేసుకున్నారు పంపిణీ దార్లు. ఇలా ఎన్ని పాక్ సినిమాలు ఇండియాలో విడుదల అవుతున్నాయి? పాకిస్తాన్లో బాలీవుడ్ సినిమాలు ఆడించుకుని ఎందరెందరు  బాలీవుడ్ నిర్మాతలు లాభపడుతున్నారు? ఆ పాపపు పాక్ సొమ్ము తినొద్దని ఎందుకని ఎంఎన్ఎస్ అడ్డు పడ్డం లేదు? బాలీవుడ్ లో పాక్ కళాకారులు స్థానిక కళాకారుల పొట్టలే కొడుతూండ వచ్చు గాక, మన సినిమాలు వెళ్లి వాళ్ళ లాలీవుడ్ నే నాశనం చేస్తున్నాయిగా? అక్కడి కళాకారులూ కార్మికుల పొట్ట లేమైపోవాలి. ఎవరి పొట్ట ఏ రేంజిలో ఎవరు కొడుతున్నారు? ఇంత జరుగుతున్నా అక్కడి నవాజ్ షరీఫ్ ప్రభుత్వం కూడా పట్టించుకోవడమే లేదుగా? 

       
400 సినిమాలకి పైగా నటించిన అక్కడి నటుడు- దర్శకుడు గులాం మొహియుద్దీన్ భారీ బడ్జెట్లతో తీసే వందలాది బాలీవుడ్ సినిమాలతో తమ సినిమా పరిశ్రమ నాశన మయ్యిందని అవేదన వ్యక్తం చేశారు. అసలే అతి చిన్నమార్కెట్ గల తాము బాలీవుడ్ అంతటి భారీ బడ్జెట్లతో తీసి ప్రేక్షకుల్ని ఆకట్టుకో లేమనీ, ప్రేక్షకులు టెక్నికల్ గానూ ఉన్నతమైన బాలీవుడ్ సినిమాల వెంటే పడుతున్నారనీ విచారం వ్యక్తం చేశారు. పైగా ఒకప్పుడు పాకిస్తాన్ లో 650 థియేటర్లుంటే ఇప్పుడు 140 కి పడిపోయాయనీ, 1980 లలో వంద సినిమాలు తీసే వాళ్ళు కాస్తా ఇప్పుడు 20 కూడా తీయడం లేదనీ వాపోయారు.

     ఆరేళ్ళ క్రితం పాకిస్తాన్  సాంస్కృతిక - టూరిజం శాఖ చైర్ పర్సన్ నిలోఫర్ భక్తియార్ గోవాలో ఒక చలన చిత్రోత్సవానికి హాజరైనప్పుడు- బాలీవుడ్ తో సంబంధాల్ని పెంచుకుంటే లాలీవుడ్ చక్కబడుతుందనీ, ఇండియన్ సినిమాలు అత్యంత అభివృద్ధి చెందాయనీ, ఇండియన్ ఫిలిం మేకర్లు తమతో కలిసి పనిచేస్తే బావుంటుందనీ, తమ నటులకీ దర్శకులకీ బాలీవుడ్ లో తగిన శిక్షణ నిప్పిస్తే ఇంకా బావుంటుందనీ అన్నప్పుడు- పాకిస్తాన్ సినిమా ఓనర్స్ సంఘం కార్యదర్శి ఖైసర్ ఖాన్ ఇంతెత్తున లేచారు. ఇలాటి ఒప్పందాలు చేసుకుంటే పాకిస్తాన్ నుంచి టాలెంట్ అంతా బాలీవుడ్ కి తరలిపోతుందనీ, అక్కడి పారితోషికాలకి వాళ్ళు అలవాటు పడితే తిరిగి ఇటువైపు చూడరనీ, ఇప్పటికే ఇక్కడ స్టూడియోలన్నీ మూతబడ్డాయనీ విమర్శించారు.

         ఇదీ పాకిస్తాన్ పరిస్థితి. అక్కడెవరూ కోరుకుని పాక్ కళాకారుల్ని బాలీవుడ్ మీదికి తోసెయ్యడం లేదు. పాక్ కళాకారులకి కూడా సిఫార్సులు చేయించుకుని బాలీవుడ్ ఛాన్సులు కొట్టేసే అవకాశమే లేదు. బాలీవుడ్ నిర్మాతలే టాలెంట్ హంట్ చేసి వాళ్ళని పట్టుకొస్తున్నారు.  2003 లో ప్రసిద్ధ దర్శకుడు, నిర్మాత మహేష్ భట్ ఈ లాలీవుడ్  కళాకారుల వలసకి తెరలేపారు. ఆ సంవత్సరం ఆయన ఒక ఫిలిం  ఫెస్టివల్లో పాల్గొనడానికి కరాచీ వెళ్ళినప్పుడు- ఆతిఫ్ అస్లం అనే గాయకుణ్ణీ, మీరా అనే నాయకినీ పట్టుకొచ్చేశారు. దాంతో మొదలయ్యింది ఇతర నిర్మాతలూ ఈ దారి పట్టడం. 2005 – 16 మధ్య కళ్ళు తిరిగే సంఖ్యలో పాక్ కళాకారులు వచ్చి పడ్డారు. తాజాగా ‘హేపీ భాగ్ జాయేగీ’ లో నటించిన మోమల్ షేక్ సహా మావరా లోకెన్, లైలాఖాన్, సారా లారెన్, హుమైమా మాలిక్, సోనియా జహాన్, మీషా షఫీ, మోమ్మల్ దోబారా, హుమాయున్ సయీద్, సనా నవాజ్, ఇమ్రాన్ అబ్బాస్, ఆదీల్ చౌదరి, మీకల్ జుల్ఫీకర్, షెహరోజ్ సబ్జ్వారీ, అలీ ఖాన్, రషీద్ నాజ్, జావేద్ షేక్, సల్మాన్ షాహిద్, వీణా మాలిక్ ...అలీజాఫర్, ఫవాద్ ఖాన్, మాహిరా ఖాన్...ఇంకో ఆరుగురు గాయకులూ!

        ఇలా ఇంతమంది వచ్చి పడుతున్నందుకు మొదటినుంచీ శివ సేన, ఎంఎన్ఎస్ పార్టీలు చేస్తున్న ఆందోళన సబబైనదే. కానీ ఈ సమస్యని ఇప్పుడు ముందుకు లాగడం సందర్భం కాదు. అలాగే మరాఠా ఆత్మగౌరవం కోసం పనిచేస్తున్న ఈ పార్టీలు కేవలం మరాఠీలకే బాలీవుడ్ అవకాశాలివ్వాలనీ కోరడం లేదు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి స్ట్రగుల్ చేస్తున్న వాళ్ళ కిస్తే ఈ పార్టీలకి అభ్యంతరం ఏమీ వుండదు. ఈ కోవలో చూస్తే, బాలీవుడ్ నిర్మాతల పాక్ పైత్యాన్ని ఖండించాల్సిందే.

స్థానికులకి దెబ్బే! 
         గత పదేళ్లుగా ఈ ట్రెండ్ అప్రతిహతంగా సాగుతూన్నా నిజానికి ఇంకా  పూర్వమే పాక్ కళాకారులకి అవకాశాలిచ్చిన సందర్భాలున్నాయి. అది 80 లలో. అప్పట్లో బీఆర్ చోప్రా తీసిన సూపర్ హిట్ ‘నిఖా’లో పాక్ నటి- గాయని సల్మా ఆఘా నటించి, సూపర్ హిట్ పాటలు పాడుకుంది. బాలీవుడ్ కౌబాయ్ ఫిరోజ్ ఖాన్ తీసిన ‘ఖుర్బానీ’ అనే హిట్ లో ‘ఆప్ జైసా కోయీ మేరే జిందగీ మేఁ ఆయే’ సోలో పాట దేశంలో ఎలా మార్మోగిందో తెలిసిందే. దాన్నిపాడి ప్రపంచవ్యాప్తంగా పాపులరయ్యింది  పాక్ పాప్ సింగర్ నాజియా హుస్సేనే. సుభాష్ ఘాయ్ తీసిన మరో సూపర్ హిట్ ‘హీరో’ లో ‘లంబీ జుదాయీ’ (తీరని వియోగం) అనే బాగా హిట్టయిన పాట పాడింది పాక్ జానపద గాయని రేష్మా. రణధీర్ కపూర్ తీసిన ‘హెన్నా’ (గోరింటాకు) లో పాక్ నటి జేబా భక్తియార్ హీరోయిన్ గా నటించింది. ఇలా అతికొద్ది సినిమాలే 80 లలో పాక్ కళాకారులతో వచ్చాయి. 90 లో అనితా ఆయూబ్, సోమీ అలీ, తలత్ హుస్సేన్, మొహిసిన్ అలీ, నదీం అనే హీరో హీరోయిన్లు వచ్చారు. 2005 నుంచే మహేష్ భట్ చలవతో చిలుకల్లా వచ్చి వాలడం మొదలెట్టారు. ఇది స్థానిక కళాకారులకి కచ్చితంగా దెబ్బే.

కళకీ సరిహద్దులు 
       మన స్టార్లూ పాక్ సినిమా రంగాన్ని పావనం చేయకపోలేదు. నందితా దాస్, కిరణ్ ఖేర్, నేహా ధూపియా, నసీరుద్దీన్ షా, ఓంపురి లాంటి ఆల్రెడీ బాలీవుడ్ లో స్థిరపడ్డ వాళ్ళే కొందరు వెళ్లి నటించారు. సోనూ నిగమ్, అంకిత్ తివారీ, సుఖ్విందర్ సింగ్, శ్రేయా ఘోషల్, హర్స్ దీప్  కౌర్, రేఖా భరద్వాజ్ లాంటి గాయనీ గాయకులూ పాక్ సినిమాల్లో పాడారు. 

        అలాగే ఓ రెండు సినిమాలు ఇండో- పాక్ భాగస్వామ్యంలో తీశారు. కరీనా కపూర్, సోనం కపూర్, అమృతా అరోరా, అర్జున్ కపూర్, సిద్దార్థ్ మల్హోత్రా లాంటి మన స్టార్లు పాకిస్తాన్ వ్యాపార ప్రకటనల్లో కన్పిస్తున్నారు. 

        అతివాదులు ఆరోపిస్తున్నట్టు పాకిస్తాన్ నుంచి బాలీవుడ్ కి వన్ వే ట్రాఫిక్కే లేదు- బాలీవుడ్ నుంచి కూడా లాలీవుడ్ కి ట్రాఫిక్ వుంది. ఈ టూవే ట్రాఫిక్ లో బాగా లాభ పడుతోంది మాత్రం బాలీవుడ్డే. బాలీవుడ్ సినిమాలు, పాటలు లాలీవుడ్ ని నామరూపాల్లేకుండా చేస్తున్నాయి. అక్కడి కళాకారులకి పనిలేకుండా చేసి వందల కోట్లు బాలీవుడ్ కి చేరుతున్నాయి. దీని ముందు పాక్ కళాకారులు బాలీవుడ్ లో దోచుకుంటున్నారని చేస్తున్న ఆరోపణలు నిలబడేవి కావు. పాక్  టీవీ నటుల్ని బాలీవుడ్ సినిమాల్లో నటింప జేసుకుని తిరిగి ఆ సినిమాల్ని పాక్ కే పంపిస్తే, తమ నటుల్ని చూసేందుకు కూడా సహజంగానే అక్కడి ప్రేక్షకులు ఎగబడుతున్నారు. పాక్ కళాకారులకి బాలీవుడ్ లో అవకాశాలిస్తే, పాక్ లో కూడా వ్యాపారం చేసుకోవచ్చనే వ్యూహం కావచ్చు ఇది. పేరుకి టూవే ట్రాఫిక్కే గానీ, పెద్దన్నలా బాలీవుడ్ చేతిలో వున్నది  పూర్తిగా వన్ వే ట్రాఫిక్కే.  దీన్ని ఇండియాలో అందరూ గుర్తించి ఒకటే పరిష్కారం చెప్పాల్సి వుంటుంది : బాలీవుడ్ సినిమాలు పాక్ లో ఆడుతున్నట్టు, పాక్ సినిమాల్ని కూడా ఇండియాలో ఆడనివ్వాలి. చూసేవాళ్ళు చూస్తారు లేని వాళ్ళు లేదు. పాక్ కళాకారుల్ని బాలీవుడ్ సినిమాల్లో, బాలీవుడ్ కళాకారుల్ని  పాక్ సినిమాల్లో అనుమతించ కూడదు. ఎవరి సినిమాలు వాళ్ళ కళాకారులతో వాళ్ళు తీసుకుంటూ ఇరుదేశాల్లో పోటీ పడినప్పుడే ఎలాటి ఫిర్యాదులకీ అవకాశం వుండదు. ఈ పోటీలో ఎవరి సామర్ధ్యమేమిటో  వాళ్ళు తేల్చుకుంటారు. 

        ఐతే ఇదంతా ఎప్పుడు? పాక్ తో మితృత్వం వున్నప్పుడు. తెల్లారి లేచింది ఏ సందులోంచి ఇండియాలోకి జొరబడాలా, ఎక్కడ బాంబులు పేల్చలా అని ఆలోచించే దేశం పాక్ తో మిత్రుత్వం ఎలా వుంటుంది? ఉరీ ఉదంత నేపధ్యంలో పాక్ కళాకారుల్ని వెనకేసుకొస్తున్న బాలీవుడ్ తో పాటు రాజకీయ, మేధావి వర్గాలు- 1) కళకి సరిహద్దుల్లేవనీ, 2) కళకి రాజకీయాలతో సంబంధం కూడా లేదనీ, 3) రెండు దేశాల మధ్య సాంస్కృతిక మార్పిడి కొనసాగాలనీ,  4) పాక్ పాలకులు వేరు, ప్రజలు వేరు అనీ వాదిస్తున్నారు. వాళ్లకి హతులైన  జవాన్ల రూపాలే మెదలడం లేదు. 

        1) కచ్చితంగా కళ సరిహద్దుల్ని చూడదు. కానీ ఆ సరిహద్దుల్ని పదేపదే అకృత్యాలతో  ధ్వంసం చేస్తూంటే తప్పకుండా కళ సరిహద్దుల్ని నిర్ణయించుకుంటుంది. కళాకారులు ఒక దేశానికి ప్రతినిధులై వుంటారు. ఎలాటి దేశానికి ప్రతినిధు లయ్యారనేది లెక్కలోకొస్తుంది. రేపు సిరియా ఐసిస్ గుడారంలోంచి ఓ తుగ్లక్ వస్తే- కళకి సరిహద్దుల్లేవని  వాణ్ణి హీరోగా చేసేయరు కదా? పాకిస్తాన్లో నాలుగు అధికార కేంద్రాలున్నాయి. ఐఎస్సై, సైన్యం, టెర్రర్, ప్రభుత్వ అధికార కేంద్రాలు. చివరిది పేరుకే అధికార కేంద్రం, పెత్తనమంతా మిగతా మూడు కేంద్రాలదే. ఈ మూడిటి దుర్గంధమే టెర్ర్రరిజం. దీంతో వాళ్ళ దేశంలోనే కాక ఇరుగు పొరుగు దేశాల్లోనూ అకృత్యాలు చేస్తున్నారు. ఇలాటి దేశానికి చెందిన కళాకారులు ఎలాటి ప్రతినిధులై వుంటారు? తస్లీమా నస్రీన్ లా ఎదిరించి పారిపోయి వచ్చివుంటే కాపాడుకోవచ్చు- కానీ తమ కెరీరే తప్ప నోరే  విప్పని పాక్ కళాకారులకి ఏ ప్రోటోకాల్ తో భాయ్ భాయ్ అంటూ సంఘీభావం ప్రకటిస్తారు? సరిహద్దు మర్యాదే పాటించని తమ వాళ్ళ అకృత్యాలకి కచ్చితంగా కళ కూడా సరిహద్దు గీత గీసేస్తుంది. 

        2) దేశాల మధ్య శత్రుత్వం తలెత్తినప్పుడు కళకి రాజకీయాలతో సంబంధం వుంటుంది. లేకపోతే దేశభక్తి అనే మాటకే అర్ధం లేదు. కళకి రాజకీయం లేకపోతే దేశభక్తి కూడా వుండదు. అలాటి కళని కోరుకోవాలా? దేశంకంటే కళ గొప్పది కాదు. ఒకటొకటే పాక్ కి అన్ని దారులూ మూసేస్తోంది కేంద్ర బ్రభుత్వం. బాలీవుడ్ కూడా దారులు మూసేయాలని ఆదేశిస్తే ఇది రాజకీయమని ధిక్కరిస్తుందా? మామూలు పరిస్థితుల్లో అడ్డొచ్చే రాజకీయాలే ఉద్రిక్త పరిస్థితుల్లో దేశ ప్రయోజనాలతో కూడిన రాజకీయాలవుతాయి. 

       3) రెండు దేశాల మధ్య సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాలు అవసరమే. కానీ ఎప్పుడు? అవతలి దేశానికో సంస్కృతి వున్నప్పుడు. అవతలి దేశపు సినిమా పరిశ్రమ ప్రపంచాని కేమిచ్చింది? ఒక మొఘలే ఆజం, మదర్ ఇండియా లనిచ్చిందా? ఒక దిలీప్ కుమార్, అమితాబ్ బచ్చన్ లనిచ్చిందా? ఒక సత్యజిత్ రే, సుభాష్ ఘాయ్ లనిచ్చిందా? ఒక లతా రఫీ ఆశా కిషోర్ లనిచ్చిందా? ఒక లక్ష్మీకాంత్-ప్యారేలాల్, ఏఆర్ రెహ్మాన్ లనిచ్చిందా? ఏమిచ్చింది? మనది ఇచ్చి వాళ్ళది తెచ్చుకోవడానికి ఏమి దాచి పెట్టింది? పోనీ మనతో చేయీ చేయీ కలిపినా ఏనాటికైనా  కనీసం ఒక ‘హేపీ భాగ్ జాయేగీ’ అయినా ఇవ్వగలదా? సాంస్కృతిక మార్పిడికి అక్కడ ఒకే ఒక్కటి వుంది- అది టెర్రరిజం. 

        4) పాక్ పాలకులు వేరు, ప్రజలు వేరూ కాదు. ఆ ప్రజలతోనే మనకి సమస్య వస్తోంది. టెర్రరిజానికి అందుతున్న కుర్రాళ్ళు ఎక్కడ్నించీ వస్తున్నారు? కసబ్ ఎక్కడ్నించి వచ్చాడు? పఠాన్ కోట్, ఉరీ ముష్కరులు ఎక్కడ్నుంచి వచ్చారు? ఆ ప్రజలు కని వదిలేస్తేనే కదా? పాక్ ప్రజలు చాలా మంచి వాళ్ళు, మనం వెళ్తే చాలా ప్రేమతో చూస్తారు అనే మాటలు అర్ధం లేనివి. ఆ ప్రజలు బాధ్యత లేకుండా జీవిస్తున్నారు. టెర్రరిజానికి ప్రధాన కారకులు వాళ్ళే. పిల్లల్ని సరీగ్గా పెంచితే టెర్రరిజం వైపు ఎందుకుపోతారు?  

      ఫవాద్ ఖాన్, మాహిరా ఖాన్ తదితర పాక్ సెలెబ్రిటీలు ఇక్కడ ఉరీ కి వ్యతిరేకంగా ఎందుకు నోరు విప్పరంటే,  సైనికుల కుటుంబాలకి ఎందుకు సంతాపం ప్రకటించరంటే, వాళ్ళ దేశంలో అలా వుంది మరి. 2008 నుంచీ నేటి వరకూ చూసుకుంటే, 13మంది పాక్ కళాకారుల్ని అక్కడి మతోన్మాదులు, ఉగ్రవాదులు పొట్టన బెట్టుకున్నారు. 

        తాజాగా గత జూన్ లో  ప్రసిద్ధ ఖవాలీ గాయకుడు అమ్జాద్ సాబ్రీని ప్రోగ్రాం ఇస్తూండగానే కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఇక మోడల్ సంగమ్ రాణాని  వురి తీసి చంపారు. టీవీ ఆర్టిస్టు మష్రత్ షాహీన్ ని షూట్ చేసి చంపారు. ఆర్టిస్టు సనా, డ్రమ్మర్ ఇబ్రహీంలని దారి కాచి చంపేశారు. గాయకురాలు గుల్నార్ ని కూడా కాల్చి చంపారు. మరో గాయకురాలు సీమా నాజ్ ని కూడా అలాగే చంపారు. ఇంకో సింగర్ ఘజలా జావేద్ ని ఆమె తండ్రితో పాటు షూట్ చేసి చంపారు. టీవీ నటి యాస్మీన్ గుల్, డాన్సర్ అఫ్సానా లని కూడా కాల్చి చంపారు. కమాల్ మెహసూద్ అనే సింగర్  కూడా తుపాకీ కాల్పులకి బలయ్యాడు. ఆయుమన్ ఉదాస్ అనే గాయకురాలు కూడా ఇలాగే  ప్రాణాలు కోల్పోయింది. మరొక ప్రముఖ డాన్సర్  షాహీన్ తనని గొంతు కోసి చంపవద్దనీ, కాల్చి చంపమనీ ప్రార్ధించినా గొంతు కోసి చంపారు. ఆమె సంపాదించిన డబ్బునీ, నటించిన సీడీల్నీ ఆమె శవం మీద చెల్లా చెదురుగా పడేసి పోయారు. ఇంకో సంగీతకారుల బృందం మీద దాడి చేస్తే,  వాళ్ళలో అన్వర్ గుల్ అనే హర్మోనిస్టు మరణించాడు. ఆఖరికి మోడల్, నటి ఫౌజియా అజీమ్ అలియాస్ ఖందీల్ బలూచ్ ని కూడా గత జులైలోనే  హతమార్చారు. 

         ఇలా కళాకారుల్ని హతమారుస్తున్నప్పుడు, చేతగాక ప్రభుత్వం చూస్తున్నప్పుడూ ఎవరు ఈ ఉగ్ర మూకలకి వ్యతిరేకంగా మాట్లాడతారు? అసలిలా కళాకారుల్ని ఎందుకు చంపుతున్నారని చూస్తే,   ప్రేమే సందేశంగా ప్రవర్తించే సూఫీ ఇస్లాం సంస్కృతిని ఈ కళలు ప్రతిబింబిస్తున్నాయి కాబట్టి. వహాబీ ఇస్లాం దీన్ని గానీ, పాశ్చాత్యీకరణని గానీ ఒప్పుకోదు. ఇది కరుడుగట్టిన మతాన్ని రుద్దాలని చూస్తుంది. ప్రపంచంలో ముస్లింలందర్నీ వహాబీ సంస్కృతి కిందికి తేవాలని ప్రయత్నిస్తోంది. ఇందులో బాగంగానే ఐసిస్ పుట్టుక. టెర్రర్రరిస్టులందరూ ఎప్పుడూ ఈ వాహాబిస్టులే. అరబ్ మూల కేంద్రంగా వీళ్ళ అడుగులకి మడుగులొత్తుతూ పాక్ పెత్తందార్లు టెర్రరిస్టుల్ని పోషిస్తున్నారు.  పాక్ ని వహాబీ దేశంగా మార్చెయ్యాలని పన్నాగాలు పన్నుతున్నారు. అందుకే సూఫీయిజానికి ప్రతీకలైన కళాకారుల మీద దాడులు. ఇండియాలో సూఫీ ఇస్లాం వుంది. కాశ్మీర్ లో కూడా మహెబూబా ముఫ్తీ ప్రభుత్వాన్ని పడగొట్టి వాహాబీస్టుల్ని అధికారంలోకి తేవాలన్న కుట్రలో భాగంగానే అక్కడ రెచ్చ గొడుతున్న అల్లర్లని బయటపడింది. 

           
ఇప్పుడు ఫవాద్ గానీ, మాహిరా గానీ ఉరీ ఘతుకాన్ని ఖండిస్తే వాళ్ళకీ మూడుతుంది. ఇలాగని సానుభూతితో వాళ్ళని చూసీ చూడనట్టు కొనసాగనిద్దామని మనమనుకుంటే- వీళ్ళ ఘనకార్యాలు అడ్డు పడుతున్నాయి. వీళ్ళమీద జాలిపడి వదిలెయ్యడానికి వెళ్లేం తమ పనేదో తాము చేసుకునే అమాయక కళాకారులు కాదు. అన్నీ తెలిసిన ఇంటలెక్చువల్స్. పారిస్ లో ఉగ్ర దాడి జరిగినప్పుడు దాన్ని ఖండిస్తూ రెచ్చిపోయి ట్వీట్ చేశాడు ఫవాద్. అలీ జాఫర్ కూడా తన నిరసనని ట్వీట్ చేశాడు. మాహిరా కూడా, ‘నా గుండె రోదిస్తోంది, ఎలాటి ప్రపంచంలో మనం వున్నాం’ అంటూ ట్వీట్ చేసింది. అలాటి ప్రపంచం పాకిస్తాన్ లోనే వుందని తెలీనట్టు!  వీళ్ళెవరూ తమ దేశపు కళాకారులని హతమారుస్తోంటే ట్వీట్ చేయలేదు. మన దేశంలో పఠాన్ కోట్, పాంపోర్, ఉరీ ఘటనలప్పుడైతే మరీ మౌనం. మొన ఐక్యరాజ్య సమితిలో నవాజ్ షరీఫే ఉరీ ఘటనని ప్రస్తావించ లేకపోయాడు. చీటికీ మాటికీ పాకిస్తాన్లో ఆర్మీతో మంతనాలాడుతూ వాళ్ళు చెప్పిన ప్రసంగ పాఠమే చదివేశాడు - ఉరీ ఘటన అసలు జరగనట్టే! ప్రధానికే ఈ పరిస్థితి వుంటే నటులకెలాంటి పరిస్థితి వుంటుంది?

        కనుక ఒకవైపు ఇలాటి పాక్ కళాకారులకి అవకాశాలిస్తూ, మన తరపున వాళ్ళు మాట్లాడ్డం లేదని కోపాలు ప్రదర్శించడమే శుద్ధ అవివేకం. అలాగని మెడబట్టి గెంటెయ్యడం, ఎక్కడున్నా వేటాడడం లాంటి అనాగరిక చర్యలకి పాల్పడితే మొట్ట మొదట సంతోషించేది పాక్ టెర్రర్- ఆర్మీ వర్గాలే. వాళ్ళు చేస్తున్న పని కూడా ఇదే- కాకపోతే హతమారుస్తున్నారు. వాళ్ళ పనులు మనం చేసిపెడితే అంతకంటే వాళ్లకి కావాల్సిందేముంది? శత్రు దేశపు వాళ్ళయినా సాటి కళాకారుల్ని మర్యాదగా చెప్పి సాగనంపాలి. వాళ్ళు లేకపోతే బాలీవుడ్ కేం నష్టం లేదు. నిజానికి వాళ్ళుంటేనే సినిమాలు చూడాలంటే నేటివిటీకి అడ్డు. 

        ఇప్పుడు ఈ నెలలోనే రెండు కీలక నిర్ణయాలు తీసుకున్న యశ్ రాజ్ ఫిలిమ్స్ తో బాటు శ్రీదేవి- ఇకపైన ఏం చేస్తారో చూడాలి. అలీ జాఫర్ తమ్ముడు దన్యాల్ జాఫర్ ని హీరోగా పరిచయం చేస్తూ కొత్త సినిమా ప్రకటించింది యష్ రాజ్ సంస్థ.  శ్రీదేవి తనే నిర్మాతగా నటిగా, పాకిస్తానీ సీరియల్స్ నటి సజల్ అలీని పెట్టుకుని ‘మామ్’ అనే సినిమా తీస్తున్నారు. ఒకవైపు కేంద్రప్రభుత్వం పాకిస్తాన్ కి ఎలా బుద్ధి చెప్పాలా అని ప్రతిరోజూ తర్జ నభర్జనలు పడుతోంటే, మరోవైపు బాలీవుడ్ పాకిస్తాన్ కళాకారులకి ఎలా అవకాశాలు కల్పించాలా అని మల్లగుల్లాలు పడుతోంది, శభాష్!


-సికిందర్
http://www.cinemabazaar.in