రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

23, ఫిబ్రవరి 2016, మంగళవారం

రివ్యూ!

రచన – దర్శకత్వం : సత్య ప్రభాస్ పినిశెట్టి


తారాగణం : ఆది పినిశెట్టి,  నిక్కీ గల్రానీ, రిచా పల్లోడ్, ప్రగతి, మిథున్ చక్రవర్తి, హరీష్ ఉత్తమన్, నాజర్, పశుపతి తదితరులు.
సంగీతం : ప్రసన్-  ప్రవీణ్ – శ్యామ్ , ఛాయాగ్రహణం : షణ్ముగ సుందరం
బ్యానర్ : ఆదర్శ చిత్రాలయా ప్రైవేట్ లిమిటెడ్
నిర్మాత : రవిరాజా పినిశెట్టి
విడుదల : 19   ఫిబ్రవరి 2016

***

2006 లో ఒక విచిత్రం ద్వారా తేజ పరిచయం చేసిన ప్రసిద్ధ దర్శకుడు రవిరాజా పినిశెట్టి రెండో కుమారుడు ఆది పినిశెట్టి ఆతర్వాత ఓ పది  సినిమాలతో తమిళ హీరోగా స్థిరపడ్డాడు. రవిరాజా పెద్ద కుమారుడు సత్య ప్రభాస్ దర్శకుడుగా మారాడు. ఈ ముగ్గురి కాంబినేషన్లో (హీరో- దర్శకుడు- నిర్మాత)  2015 లో యాగావరాయినం నా కాక్కాఅనే తమిళ థ్రిల్లర్ విడుదలయ్యింది. తమిళంలో అంత ఆశాజనకంగా ఫలితాలు సాధించని దీన్ని తెలుగులోకి మలుపుగా డబ్ చేసి ఈ నెల 19 న విడుదల చేశారు. చెన్నై లో ఒక యదార్ధ సంఘటన ఆధారంగా దీన్ని నిర్మించామంటున్న దర్శకుడు సత్యప్రభాస్ చిత్రీకరణలో తనదంటూ  ఒక శైలిని ఏర్పాటు చేసుకుని దీన్నెలా రూపొందించాడో  ఈ కింద చూద్దాం

 కథేమిటి
      సగా అనే సతీష్ గణేష్ ( ఆది), శివ ( శ్రీ కార్తీక్), రాజేష్ ( శ్యాం కుమార్), కిషోర్ ( సిద్ధార్థ్ గోపీనాథ్) ముగ్గురూ బీకాం ఫైనల్ కొచ్చిన క్లోజ్ ఫ్రెండ్స్. ఎంతటి క్లోజ్ ఫ్రెండ్స్ అంటే, తన ముగ్గురు ఫ్రెండ్స్ పేర్లలోని మొదటి అక్షరాలతో ఎస్ ఆర్ కేఅని సగా  పచ్చబొట్టు పొడి పించుకునేంత.  కాబట్టి పరీక్షలు రాసేస్తే రేపట్నుంచీ తండ్రులు వేరే బాధ్యతలు అప్పజెప్పేస్తారని పరీక్షలు ఎగ్గొట్టి ఇంకో ఆర్నెల్లు కలిసి ఎంజాయ్ చేద్దామనుకుంటారు. సగా కి తల్లి దండ్రులు (ప్రగతి, ఆడుకాలం నరేన్), ఓ అక్కా (అనితా అయ్యర్) వుంటారు. ఆ ఫ్రెండ్స్ మంచి వాళ్ళు కాదని తండ్రి మందలిస్తున్నా సగా వినకుండా వాళ్ళతో తిరుగుతూంటాడు. అతడికి లాస్య ( నిక్కీ గల్రానీ) అనే అమ్మాయి పరిచయమై తన దూకుడు స్వభావంతో ముప్పు తిప్పలు పెడుతూంటుందిపెళ్లి వరకూ లాక్కెళ్ళి వెళ్ళిపోతుంది

          ఈలోగా డిసెంబర్ 31 రాత్రి న్యూ ఇయర్ వేడుకలొస్తాయి. ఒక రెస్టారెంట్ కెళ్తారు. అక్కడ (ప్రియ)  రిచా పల్లోడ్, సూర్య (శ్రవణ్) అనే లవర్స్ తో సగా ఫ్రెండ్స్ గొడవ పడతారు. ఆ గొడవ అక్కడే తన్నులాటకి దారి తీసి పోలీసుల్ని రప్పిస్తుంది. ఆ అమ్మాయి మరెవరో కాదు, ముంబాయి డాన్ ముదలియార్ ( మిథున్ చక్రవర్తి ) కుమార్తె. ఇది తెలుసుకున్న సగా భయపడిపోయి జరిగినదానికి ముదలియార్ కి క్షమాపణ చెప్పుకునేందుకు ముంబాయి బయల్దేరతాడు... ఇక ముంబాయిలో ముదలియార్ తో ఏం జరిగిందీ, అక్కడ్నించీ  ముదలియార్ ఉక్కు హస్తాల్లో ఇరుక్కుని సగా ఎన్ని కష్టాలు పడ్డాడు, ఇరుక్కున్న హత్యా నేరంలోంచి ఫ్రెండ్స్ ని కాపాడుకుంటూ ఎలా బయట పడ్డాడూ అన్నవి మిగతా కథ

ఎవరెలా చేశారు
     మొదటి మార్కులు మాత్రం ఆదికీ, హీరోయిన్ నిక్కీకీ పడతాయి. ప్రధాన కథలో  నిక్కీకి పెద్దగా పాత్ర లేకపోయినా దానికి ముందు నడిచే ప్రేమ ట్రాకులో  ఆమె హైలైట్ అవుతుంది. ‘కుమారి 21 ఎఫ్ లో హెబ్బా పటేల్ హార్డ్ కోర్ పాత్ర ప్రవర్తనకి పాలిష్ చేసిన నేటివ్ వెర్షన్ గా  నిక్కీ ఎంటర్ టైన్ చేస్తుంది. ఈ క్యారక్టరైజేషన్ గనుక ఈమెకి లేకపోయి వుంటే ఫస్టాఫ్ అంతా ఆక్రమించుకున్న లవ్ ట్రాక్ రిస్కులో పడి వుండేది. లవ్ ట్రాకుల్లో ఈ రోజుల్లో  కావలసింది లవ్ కాదు, క్రేజీగా వుండే లవర్స్ ప్రవర్తనలే. అది నిక్కీ పాత్రతో వర్కౌట్ అయ్యింది. ఆమె మంచి ఎక్స్ ప్రెజషన్స్ ఇవ్వగలదు, నవ్వించ గలదు.

          ఆది నటిస్తున్నా నన్న స్పృహ లేకుండా పాత్రలో లీనమైపోతాడుఅతడిలో సందర్భానికి తగ్గ భావప్రకటనా సామర్ధ్యం వుంది. పాత్రపరంగా దాని దైన్యాన్ని ప్రదర్శించే దృశ్యాల్లో, ముఖ్యంగా డాన్ మిథున్ చక్రవర్తిని బతిమాలుకునే దృశ్యాల్లో గుర్తుండిపోయే నటనని ప్రదర్శించాడు. క్లయిమాక్స్ లో బుద్ధి తెచ్చుకుని ఫ్రెండ్స్ తో వెళ్ళిపోయే హృదయవిదారక దృశ్యంలో కూడా ఇంతే. తప్పకుండా ఆది ఇలాటి సెమి రియలిస్టిక్ పాత్రలకి  న్యాయం చేయగలడు

          డాన్ గా మిథున్ చక్రవర్తి, హీరో తల్లిగా ప్రగతి లకి మంచి పాత్రలే దొరికాయి. ఎక్కువగా పరిస్థితిని ఆకళింపు జేసుకునే ముఖకవళికలు, తక్కువ మాటలు కఠినంగా మాటాడే  స్వభావం ఈ రెండూ మిథున్ క్యారక్టర్ ని నిలబెట్టాయి- నిలబడేలా ఆయన చేశాడు. తెలుగు సినిమాల్లో ఏవో   అంటీ ముట్టని తల్లి పాత్రలు చేయిస్తూ తెలుగు దర్శకులు ప్రగతిని ఎంత వృధా చేసుకున్నారో ఈ సినిమాలో తల్లి పాత్రలో ఆమెని చూస్తే  తెలుస్తుంది

          సంగీతానికి పెద్దగా ప్రాధాన్య మివ్వలేదు. మ్యూజికల్ థ్రిల్లర్స్ అనేవి పూర్వకాలంలో గడిచిపోయిన సంగతులు. ఇప్పట్లో ఆశించరాదు. కెమెరా వర్క్ మాత్రం ఉన్నతంగా వుంది. ఇది దర్శకుడి విజన్ వల్ల సాధ్య పడింది. ఒక కథని ఏవిజన్ లో,  ఎలాటి మూడ్ ని క్రియేట్ చేస్తూ చూపాలా  అన్న దృక్పథం దృశ్య మాధ్యమానికి చాలా అవసరమే అయినట్టు, ఆ కథని కూడా  ఏ విజన్ లో పెట్టి నడపాలా అన్నదానిపై కూడా అవగాహన అవసరం. దర్శకుడు సత్య ప్రభాస్ కి  మొదటిది వుండి,  రెండోది లేకుండా పోయింది.

చివరికేమిటి
     అంతా బాగానే వుంది గానీ,  యదార్ధ సంఘటన అని చెప్పుకున్న ఈ కథలో  ఆ యాదార్ధ్యం కేంద్ర బిందువు కాకుండా పోయే, ప్రధానాకర్షణ కూడా కాకుండా పోయే కథనమే యమపాశం లా మారింది. సస్పెన్స్ థ్రిల్లర్ అనగానే పనిగట్టుకుని ఏవో తోచిన కథన టెక్నిక్కులు ప్రదర్శిస్తే గానీ మనస్సూరుకోని నేటి దర్శకులని చూస్తున్నాం.  ఈవారం మలుపుతో బాటే విడుదలైన నీరజఅనే హిందీ హైజాక్ డ్రామాలో ఏ  టెక్నిక్ బిల్డప్పులు లేకుండానే, ఫ్లాష్ బ్యాకులే కాకుండా, ఇంటర్ కట్స్ తో కలిపి అంత అర్ధవంతమైన ఎఫెక్టివ్ డ్రామాగా  తీశారు. ‘మలుపు దర్శకుడు మల్టీ పుల్ ఫ్లాష్ బ్యాకులతో చేయరాని హాని చేసుకున్నాడు. ఈ ఫ్లాష్ బ్యాకుల వల్ల ఫస్టాఫ్ అంతా గడిచిపోయినా కథేమిటో, దేనికోసం ప్రయత్నాలు జరుగుతున్నాయో తెలియకుండా పోయింది. సెకండాఫ్ తర్వాత పది  నిమిషాలకి గానీ అసలు కథేమిటో తెలిసి- ఫ్లాష్ బ్యాకుల హడావిడి తగ్గి,  సూటి కథనం నడవదు. ఈ దృష్ట్యా అసలు ఫస్టాఫ్ అవసరమే లేదు. ఫస్టాఫ్ వరకూ సినిమా తీయకున్నా నష్టమేమీ లేదు- సెకండాఫ్ లోనే కథా  ప్రారంభం, దాని ముగింపులున్నాయి కాబట్టి

          దృశ్యపరంగా ఏ విజన్ లో  కథ చూపాలన్న అవగాహన వున్నట్టు, ఏ విజన్ లో కథ చెప్పాలన్న దానిపై  విషయపరిజ్ఞానం లోపించడం వల్ల ఇదొక బలహీన థ్రిల్లర్ గా తయారయ్యింది

          క్లైమాక్స్ అనేక ములుపు తిరుగుతూంటుంది. ఇదంతా భరించాలంటే మొదట ఫస్టాఫ్ లో ఫ్లాష్ బ్యాకులతో అంత భారం మోపి వుండకూడదు. క్లయిమాక్స్ లో ఇరవై నిమిషాలు కోర్టులో భారీ డైలగులతో బరువైన సన్నివేశాలుంటాయి కాబట్టి,  అదంతా ప్రేక్షకులకి బోరు కొట్టకుండా తట్టుకోవడానికి,  దాసరి నారాయణరావు బొబ్బిలిపులి లో ఫస్టాఫ్ నుంచే క్లయిమాక్స్ వరకూ జరిగే కథని సీనుకొక్క డైలాగు చొప్పున మాత్రమే ఉండేట్టు తేలికపాటి  కథనం చేశారు. ‘మలుపులో ఈ టెక్నిక్ లేకపోగా, క్లైమాక్స్ లో అనేక ట్విస్టులకి తోడు మితిమీరిన హింస అదనపు భారమైపోయింది. ముగింపు దృశ్యం హృదయవిదారకంగా వున్నా- ఈ ముగింపుతో ఏం  చెప్పదలిచాడు దర్శకుడు? అనవసరంగా గొడవలు పెట్టుకుంటే అనుభవిస్తారనేనా? అలాగే అన్పిస్తుంది ముగింపు సందేశం

           కానీ అనవసరంగా భయపడితే అనుభవిస్తారనే సందేశం కూడా కథ మధ్య లోనే వెళ్ళింది. ఎలాగంటే, తెలీక డాన్ కూతురితో గొడవపడ్డారు, అంత మాత్రానా ఏదో జరిగిపోతుందని భయపడిపోయి అతడికి క్షమాపణ చెప్పుకోవడానికి  ముంబాయి దాకా పరిగెత్తడ మెందుకు?  కథలోనే ఇంకో మాట అనిపించారు :  తప్పు చేయనప్పుడు భయపడనవసరం లేదని. మరి ఎందుకు అంతగా భయపడడం? యదార్ధ సంఘటన అంటున్నారు కాబట్టి ఆ ఫ్రెండ్స్ ఎవరో అలాగే అర్ధం పర్ధం లేకుండా  ప్రవర్తించి ఉండవచ్చు. అయితే ప్రేక్షకులు తీసుకోవాల్సిన సందేశాల్లో ఈ వైరుధ్యాల్ని తొలగించి వుండాల్సింది.తప్పే  చేయనప్పుడు మీరు భయపడితే, ఆ చేయని తప్పే మిమ్మల్ని వెంటాడి మీరు అనుభవించేలా చేస్తుందనే  సందేశం వచ్చేలా చూసుకోవాల్సింది

          అలాగే ఈ కథలో ఇంకో సందేశం కూడా ఉత్పన్న మవుతోంది- వీళ్ళు జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి ఎన్నుకున్నమార్గం పరీక్షలు ఎగ్గొట్టడం. ఇది అక్రమమే. ఇలా అక్రమంగా  ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి అందుకు ఇలా అనుభవించారనే అర్ధం కూడా వస్తోందా?

          నిజజీవితంలో జరిగే సంఘటనలకి అర్ధం పర్ధం వుండదు. ఎవరి జీవితమూ బిగినింగ్- మిడిల్- ఎండ్ అన్న స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ లో క్రమపద్ధతిలో సాగదు. కానీ జీవితాన్ని సినిమా చేసేటప్పు సంఘటనల్ని ఒక అర్ధవంతమైన క్రమంలో  కూర్చి స్ట్రక్చర్లో పెట్టాల్సి వుంటుంది...


      కే  కథని ఒకే  పాత్ర దృక్కోణంలో మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకులతో చూపించిన ఏ సినిమా బాగుపడింది లేదు. ఈ మధ్యే హిందీ ‘కట్టీ బట్టీ’ కూడా ఈ విషయం నిరూపించింది. ఒకే కథని ఒకే పాత్ర దృక్కోణంలో మల్టీపుల్ ఫ్లాష్ బ్యాక్స్ తో చూపిస్తే ఆ కథకి ఏ కథా లక్షణాలూ వుండవు. ‘కంచె’ లో చూపించినట్టుగా రెండు వేర్వేరు కథల్ని ఒకే పాత్ర దృక్కోణంలో మల్టీపుల్ ఫ్లాష్ బ్యాక్స్ తో చూపించ వచ్చు. అలాగే ఒకే సంఘటన గురించి వేర్వేరు వ్యక్తులు కథనాలు చెప్తున్నప్పుడు ( రోషోమన్) మల్టీ పుల్ ఫ్లాష్ బ్యాక్స్ వర్కౌట్ అవుతాయి. కానీ ఒకే కథ ఒకే పాత్ర దృక్కోణంలో  మల్టీ పుల్ ఫ్లాష్ బ్యాక్స్ గా పనికిరాదు. ఈ తేడాలు  తెలుసుకోకపోతే  ‘మలుపు’ లాంటి ప్రమాదాలు  మరిన్ని తప్పవు.

మామూలుగా మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకులు కాకుండా, ఒకే  పెద్ద ఫ్లాష్ బ్యాక్ వేయడమంటేనే నడుస్తున్న కథని వెనక్కి తిప్పడమే. మళ్ళీ గంటో అరగంటో  గడిచాక ఆపిన చోటుకొచ్చి మళ్ళీ  ముందుకు  నడపడమే. ఈ ఫ్లాష్ బ్యాక్ లో కథ బలంగా వుంటే ఫర్వాలేదు, లేదా నడుస్తున్న అసలు కథ మీద ప్రేక్షకులకి ఫోకస్ చెదిరిపోతుంది. అలాటిది మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకులేస్తే తడవతడవకీ ఎన్ని సార్లు నడుస్తున్న కథ వెనక్కి వెళ్తుంది! ఈ సందర్భంలో ఆడియెన్స్ ఫోకస్ చెదరడం కాదు- అదెప్పుడో చచ్చూరుకుంటుంది ఓపికతో సహా – ఏకంగా దర్శకుడి ఫోకస్సే చెల్లా చెదురై పోతుంది. స్ట్రక్చర్ గల్లంతై పోతుంది. సీక్వెన్సులు ముక్కలవుతాయి. ప్లాట్ పాయింట్స్ సెకండాఫ్ లోనే ఏర్పడతాయి. క్యారక్టర్ గ్రోత్ మటాషై పోతుంది. టెన్షన్ తెల్లారిపోతుంది. సస్పెన్స్ అయిపు లేకుండా పోతుంది. టెంపో సెలవు తీసుకుంటుంది...ఇవన్నీ ‘మలుపు’ లో ఫస్టాఫ్ అంతా కనిపించే లోపాలే. 

        ఒకసారి మలుపు’  కథని సూటిగా ‘ప్రధాన సంఘటన’కి  ముందు, ప్రధాన ‘సంఘటనకి తర్వాత’ గా చూస్తే, అదిలా వుంటుంది : నల్గురు ఫ్రెండ్స్ పరీక్షలు ఎగ్గొట్టి చదువు పేరుతో  ఇంకో ఆర్నెల్లు ఎంజాయ్ చేద్దామని పథకం వేస్తారు. ఆ ప్రకారం ఎంజాయ్ చేస్తూంటారు. హీరోకి హీరోయిన్ పరిచయమవుతుంది.  అది ప్రేమగా మారుతుంది. హీరో అక్క పెళ్లి సంబంధం చూడ్డం,  ఆ పెళ్లి ఏర్పాట్లలో వుండడం జరుగుతుంది. రేపు న్యూ ఇయర్ అనగా ఇంట్లో వాళ్ళందరూ వూరెళ్తారు

          (ప్రధాన సంఘటన) :  ఫ్రెండ్స్ తో న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కి హీరోయిన్ తో రెస్టారెంట్ కి బయల్దేరతాడు హీరో. అప్పటికే  రెస్టారెంట్ లో హీరో ఫ్రెండ్స్ లో ఒకడు ఒకమ్మాయిని ఫోటో తీస్తాడు. ఆమె అభ్యంతరం చెప్తుంది. అయినా మళ్ళీ ఫోటో తీస్తాడు తాగిన మైకంలో. ఆమె బాయ్ ఫ్రెండ్ కి చెప్తుంది. బాయ్ ఫ్రెండ్ కీ  హీరో ఫ్రెండ్ కీ గొడవై కొట్టుకుంటారు. హీరో వచ్చి చూసి బాయ్ ఫ్రెండ్ నే బాదుతాడు. పోలీసులు వచ్చి అరెస్ట్ చేయబోతే, హీరో ఫ్రెండ్స్ లో ఒకడు పోలీసు కమీషనర్ కొడుకూ, ఇంకొకడు ఎంపీ కొడుకూ అని తెలుస్తుంది. వీళ్ళని వదిలేసి బాయ్ ఫ్రెండ్ నే  పట్టుకుపోతారు. ఆ అమ్మాయిని ఎక్కువ మాటాడితే బ్రోతల్ కేసు పెడతానని ఇన్స్ పెక్టర్ అవమానిస్తాడు. పోలీసు  కమీషనర్ కి ఆ అమ్మాయి అన్న నుంచి ఫోన్ కాల్ వస్తుంది. అప్పుడు ఆ అమ్మాయి ముంబాయి డాన్ ముదలియార్ కూతురని తెలిసి కంగారు పడతాడు. వాళ్ళు చంపడానికి వచ్చేస్తారని ఫ్రెండ్స్ నల్గుర్నీ అజ్ఞాతంలోకి పంపేస్తాడు కమీషనర్. కానీ అక్క పెళ్లి పనులుండడంతో  హీరో అజ్ఞాతంలోకి వెళ్ళడు. ముదలియార్ గ్యాంగ్ వచ్చేసి హీరో మీద ఎటాక్ చేస్తారు. ముదలియార్ స్థానిక ఏజెంటు  హీరోని కాపాడి, పరిస్థితి తెలుసుకుని, వెళ్లి సారీ చెప్పుకోమంటాడు ముదలియార్ కి. ముదలియార్ అర్ధం జేసుకుని క్షమిస్తాడని భరోసా ఇస్తాడు. హీరో పిస్తోలు తీసుకుని ముంబాయి బయల్దేరతాడు.


           (ఈ ‘ప్రధాన సంఘటన’ కి తర్వాత) : పిస్తోలు తీసుకుని హీరో ముంబాయి చేరుకున్న సమయంలోనే ముదలియార్ మీద హత్యా యత్నం జరుగుతుంది. ముదలియార్ ని చూడ్డానికి తరలివచ్చిన జనంతో కలిసి హీరో కూడా చూస్తాడు. తర్వాత ముదలియార్ అసిస్టెంట్ ని కలిసి తనని చెన్నైలో స్థానిక ఏజెంటు  పంపాడని చెప్తాడు. ముదలియార్ మీద హత్యా యత్నం చేసింది వీడేనని వాళ్ళు కొడతారు. తను ఎందుకొచ్చిందీ ముదలియార్ కి చెప్పుకుంటాడు  హీరో.  అది విన్న ముదలియార్, అరెస్టయిన బాయ్ ఫ్రెండ్ ని తన కూతురు  విడిపించుకుందనీ, కానీ ఆ రాత్రి నుంచీ వాళ్ళిద్దరూ కన్పించకుండా పోయారనీ అంటాడు. దీనికి మీరే కారణమని, ఫ్రెండ్స్ ఎక్కడున్నారో చెప్పమని హింసిస్తాడు. చెప్పక పోతే హీరో కుటుంబం బతికి ఉండదని వార్నింగిస్తాడు. రేపు పదింటికల్లా ఫ్రెండ్స్ ని తీసుకుని రావాలని గడువు పెడతాడు.

        చెన్నై తిరిగి వచ్చి ఫ్రెండ్స్ ని వెతికి పట్టుకుంటాడు హీరో. దాక్కుని వున్నవాళ్ళు విషయం తెలిసి బెదిరిపోతారు. హీరో మీద మ ఎటాక్ జరుగుతుంది. అతను తప్పించుకుంటాడు. కానీ ముదలియార్ చెన్నై ఏజెంట్ గాయపడతాడు. ఈ ఎటాక్ అప్పుడే ముదలియార్ చేయించడానికి వీల్లేదనీ, తన ఫ్రెండ్స్ తండ్రులే తమ కొడుకుల్ని కాపాడుకోవడానికి కమీషనర్  సాయంతో తనని చంపించడానికి  ప్రయత్నిస్తున్నారనీ అనుమానిస్తాడు హీరో. దీంతో ఫ్రెండ్స్ దాక్కుని వున్న చోటు గురించి ముదలియార్ కి సమాచారం ఇచ్చేస్తాడు. గాయపడ్డ చెన్నై ఏజెంట్ వున్న హాస్పిటల్ కెళ్తే కొత్త విషయం తెలుస్తుంది హీరోకి. అతడి మీద దాడి చేసిన వాడి చేతి మీద పచ్చ బొట్టు వుందని. అలాటి పచ్చబొట్టు తను ముదలియార్ కూతురి బాయ్ ఫ్రెండ్ చేతి మీద చూసినట్టు గుర్తు కొస్తుంది హీరోకి. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్ కెళ్తాడు హీరో.  ఆ ఫ్లాట్ లో మంచుతో గడ్డ కట్టుకు పోయిన బాయ్ ఫ్రెండ్ శవం కన్పిస్తుంది. అక్కడే ఆ బాయ్ ఫ్రెండ్ మాజీ గర్ల్ ఫ్రెండ్ హీరో మీద ఎటాక్ చేస్తుంది. ఈమె సైకో. ఈ బాయ్ ఫ్రెండ్ ముదలియార్ కూతురితో తిరగడం సహించలేక ఇద్దర్నీ చంపేసింది. ముదలియార్ కూతురి శవం బీచికి కొట్టుకొస్తుంది. ఇక ముదలియార్ హీరో సహా ఫ్రెండ్ ముగ్గుర్నీ చంపెయ్యమని ఆదేశాలిస్తాడు.

        ముదలియార్ ముందే ఈ చంపే కార్యక్రమం మొదలవుతుంది. దోషులు తాముకాదని ఎంత చెప్పుకున్నా ముదలియార్ విన్పించుకోడు. అసలు దీనికంతటికీ తనే బాధ్యుడనీ, వాళ్ళని వదిలేసి తనని చంపెయ్యమనీ బతిమాలుకుంటాడు ఫోటోలు తీసి గొడవకి కారణమైన  ఫ్రెండ్. ముదలియార్ చలిస్తాడు. ఒకరి కోసం ఒకరు ప్రాణాలిచ్చుకోవడానికి సిద్ధపడ్డారంటే,   వీళ్ళు తన కూతుర్ని చంపివుండరని తీర్మానించుకుంటాడు. 

బ్రతుకుజీవుడా అని హీరో, అతడి ఫ్రెండ్స్ కుంటుకుంటూ వెళ్లిపోతూంటే కథ ముగుస్తుంది. 

విషయం వెతుక్కోవాలి

లా ప్రారంభ ముగింపుల్ని వరసక్రమంలో చెప్పుకుంటూ పోతే ఇందులో ఏం తగ్గిందని? టెంపో, థ్రిల్, సస్పెన్స్  వంటివి ఏమైనా తగ్గాయా? ముందు పాత్రల పరిచయం,  తర్వాత ప్రేమ వ్యవహారం, ఆ తర్వాత  ప్రధాన సంఘటన, దీని తర్వాత దాని పరిణామాలు...ఈ వరసలో ఆసక్తి కరంగానే వుంది కథనం పైన చెప్పుకున్నట్టు. దీన్ని ముక్కలు ముక్కలుగా  చేసి, ఫ్లాష్ బ్యాకులతో  ప్రారంభ ముగింపుల వరసని మార్చేస్తూ చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? 

                 
సినిమా ప్రారంభం ఇలా వుంటుంది...డిసెంబర్ 31 రాత్రి ఒక ఫ్లాట్ లో ఒక యువతి ఎమర్జెన్సీ కాల్ చేస్తూ తనని చంపకుండా కాపాడమని సాయం అడుగుతూంటుంది...
        హీరో ముంబాయిలో దిగుతాడు...
        కథ నాలుగు నెలలు వెనక్కి వెళ్తుంది హీరో దృక్కోణంలో...
        ఫ్లాష్ బ్యాక్- ఇక్కడ కాలేజీ దగ్గర హీరోలు పరీక్షలు ఎగ్గొట్టి ఆర్నెల్లు ఎంజాయ్ చేయడం గురించి మాటాడు కుంటారు.
        ఇక వాళ్ళ ఎంజాయ్ మెంట్, హీరో కుటుంబ పరిచయం వగైరా జరుగుతాయి. మళ్ళీ ప్రస్తుత కథ ముంబాయిలో చూపిస్తారు. రాత్రి పూట హీరో అనుమానాస్పదం గా సంచరిస్తూంటే పోలీసులు ఆపుతారు.
        మళ్ళీ ఫ్లాష్ బ్యాక్.  పూర్వ కథ కంటిన్యూ. హీరోకి హీరోయిన్ పరిచయం వగైరా.
        మళ్ళీ ముంబాయిలో హీరోతో ప్రస్తుత కథ... 

        ఇలా పూర్వ  కథ పూర్తయ్యేవరకూ. ముంబాయి, చెన్నై ల మధ్య రెండు కాలాలకి సంబంధించిన సీన్లు వచ్చి పోతూంటాయి. ఇలా  అసలు కథ, పూర్వ కథ వంతులేసుకుని ఆల్టర్నేట్ గా ఇంటర్వెల్ వరకూ సాగడంతో..దేంట్లోనూ అసలు విషయమేమిటో బోధపడదు.  

ఇంకా సెకండాఫ్ లో పడ్డాక ఓ పది నిమిషాలు మళ్ళీ పూర్వ కథ నడిచాకనే ఆ పూర్వ కథలో భాగమైన ‘ప్రధాన సంఘటన’  అంటే పైన చెప్పిన రెస్టారెంట్ లో  జరిగిన గొడవ మొదలవుతుంది.


దీంతో ఫ్లాష్ బ్యాకుల వడ్డన ముగిసి అసలుకథ డాన్ వర్సెస్ హీరోగా సూటిగా పరుగులు తీస్తుంది. ఇక్కడ్నించీ మనం తెరిపిన పడతాం.

సెటప్స్ - పే ఆఫ్స్ 
    లా విషయమంతా సెకండాఫ్ లోనే వుంది. ఇందుకే ఫస్టాఫ్ సినిమా తీయకున్నా నష్టం లేదు. అది బడ్జెట్ కలిసివస్తూ చాలా లాభం. ఫస్టాఫ్ అంతా  మల్టీ పుల్ ఫ్లాష్ బ్యాక్స్ వేస్తూ చెప్పిన సంగతేమిటి? పాత్రల పరిచయం, కుటుంబం పరిచయం, హీరోయిన్ తో లవ్, హీరో అక్క పెళ్లి పనులు..ఇవీ. వీటితో ప్రధాన సంఘటనకి ఏ సంబంధమూ లేదు, ప్రధాన సంఘటనకి ఇవేవీ దారి తీయవు- ఒక్క పరీక్షలెగ్గొట్టి ఎంజాయ్ చేద్దామన్న ఫ్రెండ్స్ నిర్ణయం తప్ప. అయితే ఈ నిర్ణయం ప్రధాన సంఘటనకి దారితీయడానికి ఒక ట్రాక్ అంటూ వేసుకోవడమే మర్చిపోయారు. 

        ఎక్కడికక్కడ ఏర్పాటు చేసే పాయింట్లు అక్కడి కక్కడ ముక్కలే.  అంత కష్టపడి మల్టీపుల్ ఫ్లాష్ బ్యాక్స్ లో చూపించుకొచ్చిన రోమాన్స్, అక్క పెళ్లి వ్యవహారం సెకండాఫ్ లో ఏమయ్యాయో జాడ వుండవు.

        గొప్పగా సెటప్స్ అయితే వుంటాయి- వాటి పే ఆఫ్సే  వుండవు. కథంతా ప్రారంభమవడానికి కారణమైన ‘పరీక్షలెగ్గొట్టి ఎంజాయ్ చేద్దామన్ననిర్ణయం’ అన్న సెటప్ కి కూడా పే ఆఫ్ నిర్వహణ సరీగ్గా లేదు. ఇక్కడ సెటప్ వేసి, ఎక్కడో ప్రధాన సంఘటన  చూపించి పే ఆఫ్ చేసేశారు. కానీ సెటప్ కీ దాని పే ఆఫ్ కీ మధ్య అందుకనుగుణమైన సీన్లు వుంటాయి. వాటి జాడ లేదు. ప్రధాన సంఘటన అనే సెటప్ కి మాత్రమే తదనుగుణ  పరిణామాలతో కూడిన సీన్లు దాని పే ఆఫ్ వరకూ వున్నాయి.

వాటికి స్థానం లేదు
      మల్టీపుల్ ఫ్లాష్ బ్యాక్స్ ముంబాయి చేరిన హీరో దృక్కోణంలో వచ్చేవే. అతనెందుకు, ఏది, ఎలా గుర్తుచేసుకుంటున్నాడు? అతను ముంబాయి డాన్ ని కలవడానికి వెళ్ళిన అర్జెంటు పనికీ తను నడిపిన రొమాన్సు తో, అక్క పెళ్లి వ్యవహారాలతో సంబంధమేమిటి? అవెందుకు గురుకొచ్చి ఫ్లాష్ బ్యాకు లేసుకుంటున్నాడు? సరదాకా? సరదా సమయమా అది? మన ప్రాణాల మీదికేదో సమస్య వచ్చి, ఫిర్యాదు చేయడానికి పోలీసు స్టేషన్ కి పరిగెడుతున్నప్పుడు,  సరదా పుట్టి  ప్రేమ వ్యవహారాలు గుర్తు చేసుకుంటామా? ఆ సమయంలో సరదాలు పుడతాయా, ప్రాణాల మీది కొచ్చిన సమస్య వేధిస్తూంటుందా? ఆ సమస్య తాలూకు సంఘటన మెదులుతూంటుందా? How the  mind works?

        చాలా సినిమాల్లో ఫ్లాష్ బ్యాకులు అసందర్భంగా, పరిస్థితితో  సంబంధం లేని విషయాలతో ఆషామాషీగా  ప్రారంభమవుతూంటాయి. కానీ ‘ఖైదీ’ లో చిరంజీవి ఎంతటి విపత్కర పరిస్థితిలోనూ తన కేం జరిగిందో చెప్పడు. పోలీసులు కొట్టినా చెప్పడు. సినిమా ప్రారంభమయిన అరగంటకి,  సుమలత మోరల్ డైలెమా లో పడసినప్పుడే ఇక తప్పదనుకుని తన కథ చెప్పుకోవడం మొదలెడతాడు...సూటిగా తను ఇలా అయిపోవడానికి కారణమైన ప్రేమ కథే! సరదాపడి ఇంకేదో సోదితో ఫ్లాష్ బ్యాక్ కాదు. Mind ఇలా work చేస్తుంది..

        ‘కంచె’  లో రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొంటున్న హీరోకి అసలలా యుద్ధానికి రావడానికి కారణమే తన ప్రియురాలు కాబట్టి, ఆమెకి జరిగిన అన్యాయాన్ని గుర్తు చేసుకుంటూ మల్టీ పుల్ ఫ్లాష్ బ్యాక్స్ కి వెళ్తాడు. Mind ఇలా work చేస్తుంది..

        అలాగే ‘మలుపు’ లోనూ  అత్యవసర పరిస్థితిలో  హీరోకి ఆ ప్రధాన సంఘటన తాలూకు విషయాలే గుర్తుకు రావడం కాకతాళీయ న్యాయం. That’s how mind works! 

        ‘ఖైదీ’ లో పోలీస్ స్టేషన్లో చిరంజీవిని హింసిస్తున్నప్పుడు రెండు మాంటేజెస్ పడతాయి. వెనుకనుంచి పోలీసు మెడకి లాఠీ పెట్టి వొత్తుతున్నప్పుడు వూళ్ళో తనని బండికి కట్టి పైకి లేపిన ఫ్లాష్ కట్, మళ్ళీ చిడతల  అప్పారావు మంగలి కత్తితో గాయపర్చినప్పుడు, వూళ్ళో రావుగోపాలరావు మంగలి కత్తితో మీదికొస్తున్న ఫ్లాష్ కట్. రెండూ తనకి జరిగిన అన్యాయం తాలూకు మ్యాచింగ్ దృశ్యాలే. That’s how mind works!

        ఈ ఫ్లాష్ కట్స్ వేసి చిరంజీవి గతం తెలుసుకోవాలన్న ఆసక్తిని చాలా పెంచారు రచయితలు  పరుచూరి బ్రదర్స్, దర్శకుడు ఎ. కోదండ రామిరెడ్డి. అలా ఫ్లాష్ బ్యాక్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసేట్టు ఇక్కడ్నించే విజువల్ శాంపిల్స్ తో  దానికి లీడ్ వేశారు.

        ‘మలుపు’లో కూడా హీరోకి ఆ ప్రధాన సంఘటన తాలూకు విజువల్ శాంపిల్సే పడ్డం మళ్ళీ కాకతాళీయ న్యాయం.

        అంటే ఏ  మల్టీపుల్ ఫ్లాష్ బ్యాక్స్ అయితే చూపించుకొచ్చారో అదంతా ప్రధాన సంఘటనకి దారి తీసే  సంఘటనల కూర్పుగానే వుండాలి తప్ప-  ఇంకేదో ప్రేమకథ కాదు, అక్క పెళ్లి కథా కాదు.

        అంటే ఈ రెండిటికీ ఫస్టాఫ్ కథలో స్థానం ఉండకూడదన్న మాట. ఫస్టాఫ్ కథ ఎత్తుగడకి -(‘పరీక్షలెగ్గొట్టి ఎంజాయ్ చేద్దామన్ననిర్ణయం’ అన్నసెటప్ కి ) న్యాయంగా పే ఆఫ్ జరిగే దిశగా సదానికి సంబంధించిన న్నివేశాల కూర్పు అన్నమాట! ఇదెలాగో తర్వాత చూద్దాం.

లీనియర్  కోణంలోనే ప్రాణం 

    సలు మొట్ట మొదట మనం చూసిందాని ప్రకారం కథా క్రమం బిగినింగ్- మిడిల్- ఎండ్ అనే లీనియర్ కోణంలో సజావుగానే వుంది.  ప్రధాన సంఘటనకి ముందు కథ, తర్వాత ప్రధాన సంఘటన, ఆ ప్రధాన సంఘటనకి తర్వాతి కథ..బిగినింగ్- మిడిల్- ఎండ్ స్ట్రక్చర్ లోనే వున్నాయి. 

        ప్రధాన సంఘటనకి ముందు కథ బిగినింగ్ విభాగ మనుకుంటే, ప్రధాన సంఘటన అంటే రెస్టారెంట్ లో జరిగిన గొడవ  మొదటి మూలస్థంభం ( ప్లాట్ పాయింట్ -1) అవుతుంది.  ఇక్కడ్నించీ  హీరో తన ఫ్రెండ్స్ గురించి ముదలియార్ కి హీరో సమాచారం ఇచ్చేయ్యడం వరకూ మిడిల్ విభాగం అవుతుంది. అక్కడ్నించీ ముగిపు వరకూ ఎండ్ విభాగం.

        ముంబాయి సీన్లతో కలుపుకుని ఫ్లాష్ బ్యాకులుగా వస్తున్న బిగినింగ్ విభాగాన్నే చూసినా అది ఇంటర్వెల్ పైగానే సాగింది. ప్రధానసంఘటన ( ప్లాట్ పాయింట్ -1) ఇంకో పది  నిమిషాల తర్వాత వచ్చింది. అంటే ఇంటర్వెల్ లోపు రావాల్సిన ప్రధానసంఘటన ( ప్లాట్ పాయింట్ -1)  రాకుండా స్ట్రక్చర్ చెదిరిపోయింది. ఒకేఒక్క  కథని ఒకే పాత్ర దృక్కోణంలో మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకులతో చూపిస్తే జరిగే ప్రమాదమే ఇది.  ఇలా ‘కట్టీ బట్టీ’ లో క్లయిమాక్స్ లో తప్ప ప్లాట్ పాయింట్ -1  అనే బాధిత ప్రాణి రాదు. అప్పటివరకూ ప్రేక్షకులు కథేమిటో అంతుచిక్కక బోరు కొట్టించుకునీ కొట్టించుకునీ ఇక వెళ్ళిపోవడానికి సిద్ధమైపోతారు. విచిత్రమేమిటే, ఇలాటి సినిమాలు తీస్తున్న  దర్శకులకి అసలేం  బోరు కొట్టదు. ఈ కథన టెక్నిక్కే బావుందని చూసుకుని సంతోషిస్తారు. అంటే  సదరు దర్శకులకి  సగటు ప్రేక్షకుడి పద్ధతిలో కూడా సినిమా చూడ్డం రాదనుకోవాలా?

 లాంగ్ ఫ్లాష్ బ్యాక్  

   కథని  మిడిల్- బిగినింగ్ - ఎండ్ ( 2 - 1 - 3) అనే ఒకే ఫ్లాష్ బ్యాక్ మోడ్ లో పెట్టి చూసినా- హీరో ముంబాయిలో  దిగుతాడు, ముదలియార్ మీద ఎటాక్ జరుగుతుంది, పోలీసులనుంచి హీరో తప్పించుకుంటాడు,  అప్పడేదో లీడ్ తో ఫ్లాష్ బ్యాక్ మొదలు పెట్టామనుకుందాం... అప్పుడు ఫ్లాష్ బ్యాక్ లో హీరో రోమాన్సు, అక్క పెళ్లి ప్రయత్నాలూ బిగినింగ్ విభాగమంతా చూపించుకొచ్చి, అరగంట నలభై నిమిషాలో బిగినింగ్ ని ముగించి ప్లాట్ పాయింట్ -1 వేస్తూ, రెస్టారెంట్ సంఘటన సృష్టించామనుకుందాం...ఈ సంఘటన తర్వాత తను ముంబాయి వెళ్లేందుకు దారి తీసిన సీన్లు కూడా వేసేస్తూ మిడిల్  విభాగంలో కొచ్చా మనుకుందాం...ముంబాయికి వచ్చాక ముదలియార్ మీద జరిగిన ఎటాక్ తాలూకు సీన్ల దగ్గర ఫ్లాష్ బ్యాక్ ని ముగించేసి- అక్కడ హీరో  ముదలియార్ ని కలిసి జరిగింది చెప్పుకోవడం కాడ్నించీ ఏకబిగిన అతను ఫ్రెండ్స్ గురించి సమాచార మిచ్చేవరకూ మిగతా మిడిల్ ని పూర్తి చేసేసి- అక్కడ్నించీ యధాతధంగా ఎండ్ విభాగాన్ని ప్రారంభించి ముగింపు వరకూ వెళ్ళామనుకుందాం...

        చిరంజీవి ‘ఖైదీ’లో వున్నది ఈ స్ట్రక్చరే గా? 

సీదా కథనంతోనే లైఫ్
 అయితే ఈ కథని ఏ  ఫ్లాష్ బ్యాకుల అవసరమే లేకుండా స్ట్రెయిట్ నేరేషన్ లో 1-2- 3 సాంప్రదాయ పద్ధతిలో చెప్పడమే న్యాయమని మొట్ట మొదట ప్రారంభ ముగింపులు ఒక వరస క్రమంలో రాసుకుని చూసుకున్న కథనమే  చెప్తోంది. లీనియర్ కోణంలోనే  ప్రాణం. 

        మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకులకి ఇదేం ‘కంచె’ లాగా రెండు కథానికల కథ కాదు.

‘కంచె’ లో Concentric Circles (CC) గా కలిసి వుంటాయి. ఫ్లాష్ బ్యాక్స్ లో వస్తూ  వుండే పూర్వ ప్రేమ కథకీ, ప్రస్తుత యుద్ధ కథకీ కలిపి ఒకే కథాంశం కేంద్ర బిందువై వుంటుంది. ఆ  కథాంశం జాతి రక్తం. ప్రేమ కథలో కులాల సంఘర్షణ, యుద్ధ కథలో జాతుల సంఘర్షణ. అక్కడా ఇక్కడా హీరోకి జాతిరక్తమనే  మౌఢ్యంతో పోరాటం. అక్కడ తను కులీనుడు కాదని ప్రేమని దూరం చేశారు, ఇక్కడ తమ ఆర్యన్ జాతి రక్తం కలుషితమయిందని యూదు పసి దాన్ని చంపడానికి నాజీలు వెంటపడ్డారు. ఈ రెండూ ఒకే కథాంశం చుట్టూ నడవడంతో CC గా ఏర్పడ్డాయి. లోపలి వృత్తం పూర్వ కథతో మల్టీపుల్ ఫ్లాష్ బ్యాక్స్, వెలుపలి వృత్తం ప్రస్తుత ప్రధాన కథ.

        ‘మలుపు’ కి ఇంత సీను లేదు. వుంటే Concentration  చెదిరిపోయే Circles మాత్రమే వున్నాయి- రోమాన్సుతో, అక్కపెళ్ళి వ్యవహారంతో. కాబట్టి ఎలాటి టెక్నిక్కులకీ పాల్పడకుండా సీదా సాదా సాఫీ కథనంతోనే దీనికి లైఫ్ వుంది. అప్రస్తుతమైన బ్యాక్ స్టోరీ పేరు చెప్పి అడుగడుగునా బ్రేకు లేసుకోవడంలో యాక్సిడెంట్ లే వున్నాయి. 



ఇదిగో ఎత్తుగడతో విధానం

      
థ ఎత్తుగడ- పరీక్షలెగ్గొట్టి ఇంకో ఆర్నెల్లు ఎంజాయ్ చేద్దామన్ననిర్ణయం.
        దీని కొనసాగింపు-  అలా ఎంజాయ్ చేస్తున్నారు, హీరోయిన్ పరిచయమైంది, ఆమెతో నల్గురూ పోటీలు పడ్డారు, హీరోనే సెలెక్టు చేసుకుంది, కలిసి తిరుగుతున్నారు, ఇంకొటేదో జరిగి పేరెంట్స్ కి దొరికిపోయారు, మరింకేదో జరిగి అసలు పరీక్షలే  రాయకుండా డీ బార్ అయిపోయారు, అయినా లెక్క చేయకుండా  ఎంజాయ్ చేస్తూంటే హీరోయిన్ పెళ్లి ప్రస్తావన తెచ్చింది, ఇది  పెళ్లి ఎపిసోడ్ కాదన్నారు, హీరోయిన్ కి వొళ్ళు మండి  వీళ్ళు బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి కావాలనే పరీక్ష లెగ్గొట్టారని అసలు సంగతి పేరెంట్స్ కి చెప్పేసింది, వాళ్ళని ఇంట్లోంచి వెళ్ళ గొట్టేశారు,  డబ్బుల్లేక తిప్పలు పడుతున్నారు, పేరెంట్స్ డబ్బుతో ఆర్నెల్లు మజా అనుకుంటే  మూన్నాళ్ళకే బికారులయ్యారు, అప్పులు చేసి మళ్ళీ ఎంజాయ్ చేస్తున్నారు. న్యూ ఇయర్ వచ్చింది, అప్పుకూడా పుట్టక జేబులు కొట్టి హీరోయిన్ తో రెస్టారెంట్ కెళ్ళారు. అక్కడ ముంబాయి డాన్ కూతుర్ని చూసి- ఎవరీ కోతి పిల్ల అని -ఫేస్ బుక్కులో పెడదామని ఫోటోలు తీసింది తగిన మైకంలో హీరోయిన్, గొడవ య్యింది, కొట్టుకున్నారు, హీరోతో బాటు ఫ్రెండ్స్ కూడా హీరోయిన్ తప్పుని కవర్ చేస్తూ తమ మీదేసుకున్నారు, పోలీసులు వచ్చారు, ప్రముఖుల కొడుకులని వీళ్ళని వదిలేసి డాన్ కూతురి బాయ్ ఫ్రెండ్ ని  పట్టుకెళ్ళారు...

        ఎత్తుగడ అనే సెటప్ అడుగడుగునా సస్పెన్స్ తో, థ్రిల్ తో ఇలా పే ఆఫ్ అయింది. ఈ ట్రాక్ ఇలాగే వుండాలని కాదు, ఉదాహరణకి మాత్రమే ఇది. ప్రధాన సంఘటనకి ఎవరో ఫ్రెండ్ కాకుండా హీరోయినే  ఎందుకు కారణమవ్వాలంటే, సినిమాకథకి హీరోయిన్ వల్ల వచ్చే Feminine Appeal  మంచి  ప్లస్ అవుతుంది కాబట్టి. అక్కడినించీ కథ హీరోయిన్ చేసిన తప్పు తమ మీదేసుకుని ఫ్రెండ్స్ పడే కష్టాలతో వేడెక్కితే బావుంటుంది కాబట్టి. అమ్మాయి క్షేమం కోరి కష్టాలూ త్యాగాలూ అనేవి ఎప్పుడూ బాక్సాఫీసు అప్పీలుండే  కథలే.

        ఇప్పుడు హీరోయిన్ క్షేమం కోసం ముంబాయి వెళ్లి డాన్ కాళ్ళ మీద పడ్డా, ఏడ్చి మొత్తుకున్నా అర్ధం పర్ధం వుంటుంది. ఎమోషన్ వుంటుంది. అక్కడ పిస్తోలు పట్టుకుని తిరిగితే ఎమోషన్ వుండదు. పిస్తోలేందుకు పట్టుకెళ్ళాడు హీరో? అర్ధం లేని బిల్డప్ కోసం పెడితే అది డాన్ ని కాల్చి చంపడానికని అర్ధం రావడం లేదా? నిజాయితీగా తప్పు ఒప్పుకోవడానికి వెళ్తూ ఆయుధం చేబట్టడం అతడి సిన్సియారిటీ నే ప్రశ్నించడం లేదా? అదే పిస్తోలుతో డాన్ కాల్చి పారేస్తే?



-సికిందర్



 

 

 

 

 

 

 

 

 

 

 




షార్ట్ రివ్యూ!




స్క్రీన్ ప్లే – దర్శకత్వం : వాసూ వర్మ 

తారాగణం: సునీల్‌, నిక్కీ గల్రానీ, డింపుల్‌ చోపడే, ఆశుశుతోష్‌ రాణా, అజయ్‌, తులసి, ముఖేష్‌ రిషి, పవిత్రా లోకేష్‌, బ్రహ్మానందం, సప్తగిరి, పృధ్వీ, వైవా హర్ష తదితరులు
కథ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, సంగీతం: దినేష్‌, ఛాయాగ్రహణం: చోటా కె. నాయుడు’ 
బ్యానర్‌: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, నిర్మాత: రాజు

విడుదల : ఫిబ్రవరి 19, 2016


రేళ్ళ క్రితం తెలుగు సినిమా హీరోల సరసన తనుకూడా చేరిపోయిన స్టార్ కమెడియన్ సునీల్, ‘కమెడియన్ ముదిరితే గ్యారంటీగా హీరో అవుతాడు’ అనుకుంటున్న కొత్త ఇమేజి మేకోవర్ కోసం ఇంకా స్ట్రగుల్ చేయాల్సే వస్తోంది. పెద్ద పెద్ద స్టార్లే కామెడీలు చెయ్యందే సినిమాల్ని వదలనప్పుడు కమెడియన్లంతా కంగారుపడిపోతోంటే, తన లాంటి స్టార్ కమెడియన్  హీరోనై పోవాలనుకోవడం అప్పటికి ముందు జాగ్రత్త చర్యే.  కానీ తను వేసిన ప్లానుకి కౌంటర్ గా హీరోలే   ‘హీరో ముదిరితే సెంట్ పర్సెంట్ గ్యారంటీగా కమెడియన్ అవుతాడు’ అన్న ఐడియాలజీని ఆల్రెడీ డెవలప్ చేసుకుని సాగిపోతూంటే, తగుదునమ్మా అని ఇటొచ్చి తను ఇంకా సీరియస్ ఎమోషనల్ పాత్రలతో హీరోగా ఏదో  సాధించాలనుకోవడం తప్పటడుగే. రెండేళ్ళ విరామం తర్వాత ‘కృష్ణాష్టమి’ కి  ఇంత  కష్టపడి యమ సీరియస్ పాత్రలో ఫైట్లూ అవీ చేసేస్తూ పదేళ్ళ క్రితం అయిపోయిన ఆటే మళ్ళీ ఆడుకుంటూంటే ట్రెండ్ ఎలా ఒప్పుకుంటుందన్న ప్రశ్న ఎదురవుతోంది. ఉట్టి కొట్టాల్సిన ఈ కృష్ణాష్టమి ఆటకి సపోర్టుగా ఇతర స్టార్ల పాత్రలూ, వాళ్ళు నటించేసిన సీన్లే వాడుకుంటే,  హిట్టు కొట్టడం కూడా కనా కష్టమేనని తేలుతోంది.   


         స్టార్ నిర్మాత దిల్ రాజు స్టార్లతోనే  బ్యాలెన్స్ తప్పడం జరగాల్సిన పని కాదు. స్టార్లు వస్తూంటారు పోతూంటారు, ఓ వ్యవస్థగా స్థిరంగా నిలబడాల్సిన  పని స్టార్ ప్రొడ్యూసర్ గా తనది. ఏ  మీడియాలోనూ స్థిరత్వం అనేది లేదు, రోజురోజుకీ మారిపోయే స్వరూపాలే తప్ప. ఇంకా దిల్ రాజు తనకి అలవాటయిన పాత మూస కుటుంబ కథలే తెలుగు ప్రేక్షకులకి శిరోధార్యం అనుకోవడం తన స్థిరత్వం చేజారిపోతూండడానికి కారణం. యశ్ చోప్రా ఫిలిమ్స్ ఈ జాడ్యం వదిలించుకున్నారు. కరణ్ జోహార్ కూడా వదిలించుకుని ముందుకెళ్తున్నాడు. దిల్ రాజు వదలకపోవడం వ్యూహాత్మక తప్పిదంన్నర తప్పిదం. 

        2009 లో ‘శివ’ లాంటి ‘జోష్’ తీసి  దెబ్బతిని, 2016 లో అంకె చూసుకుని జేమ్స్ బాండ్ 116 లా తిరిగి వచ్చిన దర్శకుడు వాసూవర్మ,  ‘కృష్ణాష్టమి’ ని ఎన్నో దిల్ రాజు తీసిన, ఇతరులూ తీసిన  సినిమాల చద్దన్నంలా తయారు చేసి వడ్డించడం చాలా కామెడీ. ఈసారి కమెడియన్ సునీల్ సినిమాలో కామెడీ అనేది లేకపోయినా ఆ లోటుని సినిమా చుట్టూ జరిగిన  చాలా కామెడీలు తీరుస్తాయి- వదిలేద్దాం.

        ఒకే ఒక్క సినిమాతో తిరుగులేని కమెడియన్ గా ఎస్టాబ్లిష్ అయిన సునీల్, ఆరేళ్లుగా అయిదు సినిమాలు నటిస్తున్నా హీరోగా తన భవితవ్యం ఏమిటో తనేకే తెలీని సందిగ్ధావస్థ లో వుండడం త్రిశంకు స్వర్గం లాంటిదే.

        ‘కృష్ణాష్టమి’ తో ప్రేక్షకుల్ని కూడా త్రిశంకు స్వర్గంలో పడెయ్యడం పరాకాష్టకి చేర్చింది. చూసిందే చూడమంటున్న ఈ సినిమాలో అసలేముందో ఇక చూద్దాం...

ఎన్నారై ఇన్ ట్రబుల్ !
         ఎన్నారై కృష్ణ వరప్రసాద్ (సునీల్) కి అందరు ఎన్నారై హీరో పాత్రల్లాగే ఇండియా అంటే చచ్చే ప్రేమ. ఇక్కడి సంస్కృతీ సాంప్రదాయాలంటే చాలా ప్రాణం. అమెరికా వదిలి ఇండియా వచ్చేసి తన గ్రామంలో సెటిలవ్వాలని తాపత్రయం. ఈ తాపత్రయానికి ఇండియాలో  వుండే పెదనాన్న ( ముఖేష్ రిషి) పెద్ద అడ్డంకి. పద్దెనిమిదేళ్ళ నుంచీ ఇండియా రానియ్యడం లేదు. పైగా ఇప్పుడు అమెరికాలోనే  పిల్లని చూసి పెళ్లి  కూడా చేసేద్దామనుకుంటున్నాడు. ఇది  భరించలేక ‘మిస్టర్ పర్ఫెక్ట్’ లో ప్రభాస్ లా అమెరికాలో వీడియో గేమ్  డిజైనర్ గా ఉంటున్నకృష్ణ, ఫ్రెండ్ గిరి ( సప్తగిరి) ని వెంట బెట్టుకుని చెప్పా పెట్టకుండా ఇండియా బయల్దేరతాడు. ‘ఇష్క్’ లో నితిన్ కి జరిగినట్టు కనెక్టింగ్ ఫ్లైట్ (యూరోప్ లో ) ఆలస్యం కావడంతో మూడ్రోజులూ అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. అప్పుడు ‘ఇష్క్’ లోనే  నితిన్ రోమాన్స్ కి నిత్యా మీనన్ దొరికినట్టు కృష్ణకి పల్లవి ( నిక్కీ గల్రానీ) అనే అమ్మాయి దొరుకుతుంది. ఈమె పవనిజం లాగా తన పల్లవిజం అనే ఫిలాసఫీ చెబుతూ బెలూన్లతో జనాలకి కౌన్సెలింగ్ చేస్తూ తిరుగుతూంటుంది  ‘బాద్షా’ లో కాజల్  క్యారక్టర్ లాగా.

        ఈమెని ప్రేమలో పడెయ్యడానికి  ‘1- నేనొక్కడినే’ లో భ్రాంతులకి లోనయ్యే  మానసిక వ్యాధి పీడితుడైన మహేష్ బాబు ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని కృష్ణ అలా నటిస్తూంటాడు. ఈమెని ప్రేమలో పడెయ్యడం పూర్తయ్యాకా ఫ్లైట్ టైమవుతుంది.

        ఈ జనవరి- ఫిబ్రవరీల్లోనే  వచ్చిన ‘ఎక్స్ ప్రెస్ రాజా’, ‘స్పీడున్నోడు’, ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ ల్లాగే రొటీన్ గా మళ్ళీ రాయలసీమకే కథని లాక్కెళ్తూ  చిత్తూరులో దిగుతాడు కృష్ణవరప్రసాద్ తన ఫ్రెండ్ తో కలిసి. ఈ ప్రయాణంలో ‘సంతోషం’ లో నాగార్జునలా ఓ పి ల్లాణ్ణి వెంటేసుకుని డాక్టర్ అజయ్ ( అజయ్) తగుల్తాడు. వెంటనే ఇతడి మీద ఫ్యాక్షన్ ఎటాక్ జరగడంతో  కోమాలోకి వెళ్ళిపోతాడు. ఇతణ్ణి హాస్పిటల్లో పడేసి పిల్లాడితో వాళ్ళింటికి వెళ్తాడు  కృష్ణ.  ఆ ఇల్లు రెడ్డి (ఆశుతోష్ రాణా) అనే ఫ్యాక్షనిస్టుది. కోమాలో వున్న డాక్టర్ అజయ్ ఇతడి అల్లుడే.

        గతంలో చచ్చిపోయిన పెద్ద కూతురు పెళ్లి చేసుకున్నప్పుడు పెళ్ళికొడుకు అజయ్ ని  ఈ రెడ్డి చూడలేదు కాబట్టి, కృష్ణే తన అల్లుడనుకుని మర్యాదలు చేస్తూంటాడు. ఇక్కడ అజయ్ మరదలు ( డింపుల్ చోపడే) బావగారనుకుని హద్దులు మీరి కృష్ణని కవ్విస్తూంటుంది. ఈమెతో కృష్ణకి పెళ్లి కూడా అనుకునేస్తారు. అప్పుడు అసలు సంగతి కృష్ణకి తెలుస్తుంది. తనే  అనుకుని అజయ్ మీద హత్యాయత్నం చేశారని, నిజానికి తనని చంపడానికే  ఈ ఇంట్లోంచి  ప్రయత్నాలు జరుగుతున్నాయనీ, ఈ ఇంట్లోనే ‘మర్యాదరామన్న’ లో హీరోలా ( ఇదీ సునీలే!) తానుంటున్నాడనీ.. ఇపుడేం చెయ్యాలి?

       చేయడానికి చాలా సినిమా బిట్లున్నాయి. ఒక్కోటి తీసి వాడుకోవడమే. ‘రెడీ’, ‘బృందావనం’, ‘మిర్చీ’, ‘అతడు’ ఇలా సెకండాఫ్ లో కూడా చూసేసిన  సినిమాల కత్తిరింపులే  మనకి చూపించి సంతోష పెడతారు.

ఎవరెలా చేశారు      సునీల్ బిగిసుకు పోయి చేశాడు. హీరోగా నటించాలంటే తనలోంచి అది సహజంగా రావడం లేదే అన్న బెంగతో మెగాస్టార్ లా కాస్సేపు, ప్రిన్స్ మహేష్ బాబులా కాస్సేపూ నటించుకు పోతున్నట్టు కన్పిస్తాడే తప్ప ఈజ్ లేదు.  చాలా సీన్లలో దీన్ని గమనించ వచ్చు. పైగా నలభైల్లో పడ్డాడని కాబోలు, ఇదివరకు ‘పూలరంగడు’ లో వున్న పంచ్ కూడా అక్కడక్కడా వున్న కామెడీలో వేయలేకపోతున్నానూ అన్నట్టు అలసటతో కన్పిస్తాడు. సిక్స్ ప్యాక్ చూపించి ఫైట్ చేసినంతమాత్రానే సినిమాకి చాలదు కదా? సీరియెస్ నెస్ కితోడు, చాలా సీన్లలో పాత్ర ఉదాత్తమైనదిగా కన్పిస్తుంది. ఇది తనకి అవసరమా? తనలోని  కమెడియన్ని మర్చిపోయి, గుమ్మడిని చూడమనడమా? పాత్ర ఏదో త్యాగం చేస్తోంది సరే, దాన్ని అంత బరువుగా చూపించడం కూడా అవసరమా? పైగా పది సినిమాలు గుర్తొచ్చేలా బిట్స్ ని పట్టుకుని నటించేసి ఇంతే తన వల్లయ్యేదని చాటుకుంటే ఎలా? 

        బిట్స్ అతికింపులని మరిపించాలంటే క్యారక్టర్ అనే మంత్రదండాన్నే  ప్రయోగించాలి. ‘భలే భలే మగాడివోయ్’ లో  కథకి స్ట్రక్చర్ లేకపోయినా ఆ లోపం తెలియకుండా, పదినిమిషాలకో గట్టి బ్యాంగ్ చొప్పున ఇచ్చుకుంటూ  హల్చల్ చేసే నాని పాత్ర చిత్రణే  సినిమాని సూపర్ హిట్ చేసింది. సునీల్ పాత్రకూడా కథనంలో వున్నఅన్ని లోపాలనీ చిత్తు చేసి, చదును చేసి, తొక్కుకుంటూ రాచబాట వేసుకుంటూ  వెళ్ళిపోయే సూపర్ ఫాస్ట్ కామిక్ సెన్స్ తో తొణికిసలాడాల్సింది. కథలో తనబాట తను బలంగా వేసుకోలేని వాడు కథానాయకుడెలా అవుతాడు.  

        హీరోయిన్ల గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. సినిమాకొక హీరోయిన్ చొప్పున వచ్చిపోతూంటే వాళ్ళ గురించి ఇప్పుడే చెప్పుకోనవసరం లేదు, అదృష్టవంతురాళ్లై  ఇంకో రెండు సినిమాల్లో కన్పిస్తే అప్పుడు వాళ్ళ గురించి ఆలోచించడం మొదలెడదాం. చివర్లో వచ్చే బ్రహ్మానందం క్యారక్టర్, మొదట్నించీ  వుండే పోసానీ, సప్తగిరిల క్యారక్టర్స్ –వీటితోనే కాస్సేపు నవ్వుకోగాల్గుతాం. 

        బహుశా ఛాయాగ్రాహకుడుగా ఛోటా కె. నాయుడు చేసిన ఓ విషయం లేని ఇదే. పాటలకి సంగీతం కూర్చిన దినేష్ నుంచీ  ఒక్క క్యాచీ సాంగ్ కూడా రాలేదు. నిర్మాతగా దిల్ రాజు ప్రొడక్షన్ విలువలకి ఏ లోటూ రానివ్వకుండా డబ్బు ఖర్చుపెట్టారు. కానీ బ్యానర్ విలువ ఇలా నిలబడుతుందా?

        దశాబ్దానికి పైబడి దిల్ రాజు కాంపౌండ్ లో ఉంటూ పౌరసత్వం సంపాదించుకున్న వాసూవర్మ, ప్రేక్షకుల హృదయాల్లో స్థానికత పొందాలంటే ఇలా బిట్సు దోపిడీలు చేస్తే కాదు, పురాతన శైలిలో దర్శకత్వం వహిస్తే కూడా కాదు, రాంగోపాల్ వర్మ ఒక్కడే ఎందుకుంటున్నాడు, ఇంకో వర్మని ఎందుకు యాక్సెప్ట్ చేయడం లేదూ అని దీని మీదే కథ ఆలోచించడం మొదలెడితే ఒరిజినాలిటీ, నావెల్టీ అన్నీ వాటికవే వచ్చి పలకరిస్తాయి.


-సికిందర్
http://www.cinemabazaar.in/






       







20, ఫిబ్రవరి 2016, శనివారం

స్క్రీన్ ప్లే సంగతులు!



     సినిమా బావుందనే రివ్యూలు వచ్చాయి, బాక్సాఫీసు కలెక్షన్లే ఆశించినంతగా లేవు...అంటూ పునరాలోచనలో పడ్డాయి ట్రేడ్ వర్గాలు. రెండే సందర్భాల్లో ఇలా జరుగుతుంది : అది క్లాస్ సినిమా అయి, అది బావుందని రివ్యూలు వచ్చినా బాక్సాఫీసు తన్నేసినప్పుడు ఒక సందర్భం;  అది మాస్ సినిమా అయి బావుందని రివ్యూలు వచ్చినా బాక్సాఫీసు బై బై చెప్పేసినప్పుడు రెండో సందర్భం. మొదటి సందర్భాన్ని అర్ధం జేసుకోవచ్చు. కమల్ హాసన్ నటించిన ‘చీకటి రాజ్యం’  లాంటి  క్లాస్ సినిమా బావుందని అనుకున్నా మాస్ కి నచ్చక ఫ్లాప్ అవడంలో అర్ధముంది. కానీ ఒక మాస్ సినిమా బావుందని రివ్యూలిచ్చాకా మాస్ ప్రేక్షకులే చూడకపోతే, రివ్యూలు విఫలమైనట్టే. రివ్యూల్లో బయటపడని నగ్నసత్యం మాస్ ప్రేక్షకులేప్పుడో కనిపెట్టేసినట్టే- మాస్ సినిమాల పేరుతో  తమమీద వరసగా రుద్దుతున్నది ఒకే నాటు దర్శకత్వాలతో వుండే మోటు సినిమాలేనని! వినియోగదారుడి స్పృహ వినియోగదారుడి స్పృహే! ఇదే జరిగింది ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాథ’ విషయంలోకూడా. రివ్యూలదో దారి, ఈ వీర ప్రేమ గాథదో దారి...ఒకదారి అని  కాదు, ఎన్నో దారులు వీర ప్రేమ గాథకి : ఏ దారిని ఫాలో అవ్వాలో తెలీలేదు  ప్రేక్షకులకి. అదీ సమస్య!  

        అందుకే ఏకసూత్రత అనే రూలుని పాటించమన్నారు. కానీ ఏకసూత్రత అంటే దర్శకుడు హను రాఘవపూడికి పడదో, లేక అసలు దాని గురించి తేలీదో మనకి తెలీదు. కానీ 2012  లో తన మొదటి ప్రయత్నం ‘అందాల రాక్షసి’ లో ఇంతే, ఇప్పుడు నాల్గేళ్ళ తర్వాత ఈ రెండో ప్రయత్నంలోనూ ఇంతే. ఏకసూత్రత శివార్పణం!

        గత రెండు వారాల్లో ‘లోఫర్’ లాంటి మూడు సినిమాలని  ( కృష్ణ గాడి వీర ప్రేమ గాథ, గరం, స్పీడున్నోడు) విశ్లేషించుకుంటే, ఇవి తేడా లేకుండా  అచ్చు గుద్దినట్టు ఒకదానికొకటి నకళ్ళుగా తెలిసిపోతాయి. ఇలాటి నకళ్ళని చాలా భరించి భరించి వున్నారు  ప్రేక్షకులు. ఈ మూడింట్లోనూ  అవే మాస్ కథలు. అవే హీరోల ఆవారా పాత్రలు, అవే మొరటుగా వుండే కథా కథనాలతో నాటు దర్శకత్వాలు. తెలుగు సినిమా కథకి సంస్కారం అక్కర్లేదనుకోవడం, సున్నితత్వం అసలే  పనికి రాదనుకోవడం, ఎంత
నాటుగా వుంటే అంత జనం చూస్తారనుకోవడం – ఇదే నేటి కొత్తా పాతా  దర్శకులకి  ఆదర్శమైనప్పుడు- రివ్యూల్లోఎక్కడా నిరసన వ్యక్తం కాకపోవడం విచిత్రం. 

        సంక్రాంతికి పోటీపడ్డ సినిమాలమధ్య ‘సోగ్గాడే చిన్నినాయనా’ ఒక్కటే ఎందుకు సూపర్ హిట్టయ్యిందంటే అది రొడ్డకొట్టుడు ధోరణుల నుంచి దూరం పాటించినందువల్లే. దీని ఘన విజయాన్ని పురస్కరించుకునే మాస్ ప్రేక్షకులు కోరుకుంటున్న మార్పేమిటో తెలిసివచ్చింది. ఈ నేపధ్యంలో  స్పీడున్నోడు, గరం, క్రిష్ణగాడి వీర ప్రేమ గాథ...లాంటి మరిన్ని నకళ్ళకి దక్కాల్సిన చోటే దక్కుతుంది.
                                                ***
కలగాపులగం!
     గమ్మత్తేమిటంటే ఏక సూత్రతకి ఎసరు పెడుతూనే మళ్ళీ  మూడు నాలుగు జానర్స్ ని తెచ్చి కలిపేసి రసభంగం కూడా గావించుకోవడం. కృష్ణ గాడి ప్రేమ కథకి ( ‘గాథ’ అనడానికి ఇది అంత గొప్ప మహోజ్వల ప్రేమ కథేం కాదు, దేవదాసు లాంటి అమర ప్రేమికుణ్ణి పేరడీ చేసి నవ్వించినప్పుడు ఆ అర్ధంలో  ‘గాథ’ అన్నా కామెడీగా సరిపెట్టుకునే వీలుండేది- దేవదాసుని మోడరన్ లవర్ గా బ్లాక్ కామెడీ చేసి అనురాగ్ కాశ్యప్ ‘దేవ్ డి’ అనే  హిట్ తీసినట్టు) ఫ్యాక్షన్ పాత్రలతో హింస జోడించారు, అది సరిపోనట్టు మాఫియా పాత్రలతో  ఇంకా కూడా హింస జోడించారు, ఇది కూడా సరిపోనట్టు టెర్రరిజంతో  కన్ఫ్యూజ్ చేస్తూ నడిపించారు, మళ్ళీ ఈ మొత్తాన్నీ ఒక రోడ్ మూవీగా  కూడా చేశారు. ఇలా ఇన్ని సజాతి- విజాతి జానర్స్ నీ కలిపేసిన రసభంగంతో సినిమా చూసి బయటికొచ్చే ప్రేక్షకుల మొహాల్లో అసలేం చేశామబ్బా అన్న క్వశ్చన్.

        ఈ వారమే హాలీవుడ్ లో కూడా ఇదే పరిస్థితి. 1813లో జేన్ ఆస్టిన్ ప్రసిద్ధ నవల ‘ప్రైడ్ అండ్ ప్రెజుడీస్’ లోని జగమెరిగిన గొప్ప ప్రేమకథని ఆఫ్రికన్ జాంబియాలతో కలిపి సెటైర్లు వేసి ప్రేక్షకుల్ని పారిపోయేలా ‘ప్రైడ్ అండ్ ప్రెజుడీస్ అండ్ జాంబీస్’ తీసి అట్టర్ ఫ్లాపయ్యారు. ఆఫ్రికాలో వూడూ విద్యద్వారా శవాల్ని లేపి వాటి చేత పనులు చేయించుకుంటారు. వీటిని జాంబీ లంటారు. వీటిమీద ఎన్నో హార్రర్ సినిమాలు వచ్చాయి. ఇలాటి ఒక హార్రర్ జానర్ ని ఆల్ టైం క్లాసిక్ గా నిలచిపోయిన ప్రేమకథలో జొప్పించి సెటైర్ చేసే ప్రయత్నం అలా బెడిసి కొట్టినట్టు, కృష్ణ గాడు కూడా  కలగాపులగమైపోయాడు! 

        ఇక్కడ మరొక్క సారి చెప్పుకుంటే, గత సంవత్సరం హిట్టయిన ఐదారు సినిమాలు కూడా మాస్ ప్రేక్షకుల మద్దతుతో జానర్ మర్యాదని కాపాడినవే! ఒక జానర్ లో  కథ చెప్తున్నప్పుడు ఆ జానర్ లక్షణాలనుంచి అంగుళం కూడా పక్కకెళ్ళని సినిమాలకే పట్టం గడుతున్నారిప్పుడు- రసభంగాన్ని సహించడం లేదు. సూక్ష్మస్థాయిలో ఈ పరిశీలన చేసుకోకపోతే సినిమాలు తీసి సాధించేదేం వుండదు.
                                                ***
ఆదిలోనే రసభంగం! 
      రాయలసీమలో కృష్ణ గాడు బోర్ వెల్ కార్మికుడు. మహాలక్ష్మిని చిన్నపట్నుంచీ ప్రేమిస్తూంటాడు. ఆమె కూడా ప్రేమిస్తూంటుంది గానీ, ఆమె అన్న భయంతో బయటపడకుండా వుంటారు. అన్న అక్కడి ఫ్యాక్షనిస్టు కుడి భుజం. బాలకృష్ణ ని అభిమానించే కృష్ణ గాడు చాలా పిరికివాడు. గొడవలంటే భయం. అందుకే మహాలక్ష్మి అన్నతో జాగ్రత్తగా ఉంటాడు. 

        ఇంకో వూళ్ళో ఈ ఫ్యాక్షనిస్టు ప్రత్యర్ధి ఉంటాడు. ఇతను తన ముఠాని పంపి ఈ ఫ్యాక్షనిస్టు ఇంటి మీద దాడి జరిపిస్తాడు. ఈ ఇంట్లో ముగ్గురు చిన్న పిల్లలుంటారు. వాళ్ళు ఈ ఫ్యాక్షనిస్టు తమ్ముడి పిల్లలు. ఈ తమ్ముడు హైదరాబాద్ లో ఎసిపి. ఇంటి మీద దాడి జరుగుతున్నప్పుడు మహాలక్ష్మి అన్న ఓ పని అప్పజెప్తాడు కృష్ణ గాడికి. పిల్లల్ని తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోతే చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తానంటాడు. కృష్ణగాడు  ఆ పిల్లల్ని తీసుకుని పారిపోతాడు. ఈ పిల్లల కోసం దుబాయికి  చెందిన మాఫియా/టెర్రరిస్టు  అనుచరులు వెంటబడతారు. వీళ్ళకి ఎసిపి మీద పగ వుంటుంది.  ఈ అనుచరుల దాడులనుంచి ఎలా తప్పించుకుని కృష్ణ గాడు పిల్లల్ని హైదరాబాద్ చేరవేశాడన్నది ముగింపు.

        ఈ కథలో  సముచితమైన సమయం అరగంట గడుస్తూండగా బిగినింగ్ విభాగం ముగుస్తుందన్న సూచనలు కన్పిస్తాయి. ఆ ఘట్టం రానే వస్తుంది. హీరోయిన్ అన్న హీరోని వూరి బయటికి తీసికెళ్ళి చూపిస్తూ  ప్రత్యర్ధుల్ని నరుకుతూంటాడు. ఇదొక ప్లాట్ పాయింటుని ఏర్పాటు చేసేలాటి మాస్టర్ షాట్స్ తో కూడిన పెద్దసీను. బిగినింగ్ విభాగంలో ఇంత పెద్ద క్రిటికల్ సీను వచ్చిందంటే, ఇక బిగినింగ్ విభాగం ముగుస్తూ స్టోరీ పాయింటు ఎష్టాబ్లిష్ అవుతోందని  ఆశిస్తాం. అంటే మొదటి మూల స్థంభం ( ప్లాట్ పాయింట్ – 1) వచ్చేసిందని భావిస్తాం.

       
కానీ ఇది జరగదు.  కేవలం తన చెల్లెలికి దూరంగా ఎందుకుండాలో హీరోకి  శాంపిల్ చూపించడానికే ఇంత మేజర్ సీను వేశారని అర్ధమవుతుంది. ఇదొక రసభంగ కారణం. ఏ కథలో నైనా ఒక సీను వుందంటే దానికి ఈ రెండిట్లో ఏదో  ఒక ప్రయోజనం లేకపోతే  అది సీనే కాదు : 1)  ఏదైనా పాత్ర గురించి తెలియజెప్పెందుకు, లేదా 2. కథని ముందుకు నడిపించేందుకు. ఈ రెండూ జరగలేదిక్కడ. పాత్రల గురించి మనకి ముందే తెలుసు- హీరో పిరికి వాడు,  హీరోయిన్ అన్న చాలా కౄరుడు. కాబట్టి  ఈ సీను వేసి పాత్రల గురించి కొత్తగా చెప్పడాని కేమీ లేదు.

        పోతే ఈ సీను కథని ముందుకి నడిపించేందుకైనా పనికొచ్చిందా అంటే, ఇది కూడా జరగలేదు. ఈ సీను తర్వాత కూడా కథలో తిరిగి యధాపూర్వ స్థితే. హీరో ఇంతకి  ముందు ఎలా ఉన్నాడో అదే ధోరణిలో అలాగే వున్నాడు, ఆ సీను ప్రభావం అతడి మీద ఏమాత్రం లేదు. హీరోయిన్ అన్న కూడా డిటో.  ఇలాకాక ఆ నరికివేతల మేజర్  సీను దెబ్బకి తన క్యారక్టరైజేషన్ కి తాను న్యాయం చేసుకుంటూ పిరికివాడయిన హీరో వూరు విడిచి పదిమైళ్ళ దూరం పారిపోయి వుంటే, కథని ముందుకు నడిపించే టూల్ గా ఆ సీను సార్ధకమయ్యేది. ఇదీ జరగలేదు. మరి కథకి ఏ ప్రయోజనాన్నీ సమకూర్చని ఇంత భారీ యాక్షన్ సీను ఎందుకు అన్ని లక్షలు పోసి చిత్రీకరించినట్టు? దీంతో వచ్చిన లాభమేమిటి-  రసభంగమేనా? 

        రసభంగం ఎలాగంటే, ఈ సీనుతో కథ ములుపు తిరిగి మొదటి మూలస్థంభం ఏర్పడుతుందన్న న్యాయమైన, సూత్రబద్ధమైన ఫీలింగ్ ని భంగపర్చింది.

        ఇలా మొదటి మూలస్థంభమూ కాలేకా, పోనీ పాత్రల గురించి కొత్తగా చెప్పడానికీ లేకా, కథని ముందుకు నడిపించడానికీ పనికి రాకా, ఇన్ని రకాలుగా భ్రష్టు పట్టిన ఈ సీను సినిమా ప్రారంభ ఘట్టాల్లోనే స్క్రీన్ ప్లే ఎంత అశాస్త్రీయంగా వుందో తెలియజెప్పింది.
                                               
***
స్టార్ట్...స్టాప్...
     సడెన్ గా పిడుగుపాటులా ఇంకో బిట్ వచ్చి పడుతుంది. ఒక మాఫియా ఎవరో హైదరాబాద్ లో వచ్చి వాలిపోయినట్టు రొడ్డ కొట్టుడుగా షాట్లూ, రీరికార్డింగ్ వేసేసి కట్ చేసేస్తారు. ఇక్కడేదో కథ నడుస్తోంది కదా, ఇదింకా బిగినింగ్ విభాగమే కదా, కానీ మిడిల్ విభాగంలో వున్నట్టు ఈ పిడుగుపాటేమిట్రా బాబూ అని ఇంకో వ్యధ.
        ఈ రెండో రసభంగాన్ని కూడా ఓర్చుకున్నాక, ఇంటర్వెల్ కోసం వీరప్రయత్నం జరుగుతుంది. కథని ఇంటర్వెల్ కి చేరవేయడానికి వేస్తూ పోయిన సీన్లు  ఎలా వున్నాయంటే, ఇదిగో ఈ సీనుతో ఇంటర్వెల్ పడిపోతోంది- అనిపించగానే, ఇంకో సీను వస్తుంది. ఇదిగో ఈ సీనుతో ఇంటర్వెల్ ఇప్పుడు పడిపోతోంది- అనుకోగానే ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇంకో సీను - కంటిన్యూ - ఇంకో సీను - కంటిన్యూ...ఇలా స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ తో తంటాలు. అప్పటికి టైము గంటా ఇరవై నిమిషాలు!

        వెనక, ఇదిగో మొదటి మూలస్థంభమని ఎలా ఆడుకున్నారో, అలా ఇదిగో ఇంటర్వెల్ అంటూ ఎంతకీ తెగని ఆట. 

        మరి మొదటి మూల స్థంభం ఎప్పుడు వచ్చింది?
                                               
***
ప్రపోజల్ – ఛాలెంజ్ 
      మొదటి మూలస్థంభం : ఏ  పార్టుకా పార్టు మొదటి మూలస్థంభాన్ని పోస్ట్ మార్టం చేస్తేనే  సినిమా జాతకం తెలిసేది. మదర్ బోర్డు ఇక్కడే వుంది. ఇక్కడ్నించే మొదలయ్యే అసలు కథకి అన్ని రకాల కమ్యూనికేషన్స్ ప్రసారమౌతాయి. దీనికి ఎటాచ్ చేసిన సౌండ్ కార్డో, వీడియో కార్డో, డాటర్ కార్డో, గ్రాండ్ డాటర్ కార్డో  మరోటో పనిచేయనప్పుడు, లేదా అసలవి  లేనప్పుడు, ఇక్కడ్నుంచీ  మొదలయ్యే అసలు కథతో కమ్యూనికేషన్ ఉండకపోవచ్చు, లేదా తప్పుడు కమ్యూని కేషన్స్ వెళ్తూండొచ్చు. అప్పుడు మొత్తం వ్యవస్థ కుప్పకూలుతుంది- థియేటర్ పైకప్పు మినహా. 

        ఇంటర్వెల్ ముందు  ఫ్యాక్షనిస్టు ఇంటి మీద దాడి జరుగుతున్నప్పుడు పిల్లల్ని తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోతే చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తానని హీరోయిన్ అన్న హీరోతో అనడం మొదటి మూలస్థంభంగా ఏర్పాటయిన మలుపు. 

        దీంతో హీరోకి గోల్ ఏర్పడింది : పిల్లల్ని హైదరాబాద్ చేరేస్తే తన పెళ్ళయిపోతుంది. ఈ గోల్ బలిమికి  ఉండాల్సిన విటమిన్లు 1. కోరిక, 2. పణం, 3. పరిణామాల హెచ్చరిక, 4. ఎమోషన్
 మొదలైన వాటి  సంగతి తర్వాత- అసలు ఈ గోల్ ఏర్పడ్డానికి హీరోయిన్ అన్న పెట్టిన ప్రపోజల్ కి అర్ధముందా?  

        ఒఠ్ఠి పిరికివాడైన హీరోకి అంతటి విపత్కర పరిస్థితుల్లో పిల్లల్ని తీసుకుని హైదరాబాద్ దాకా పారిపొమ్మనడం హీరోకి పెట్టే పరీక్ష అవదు. కాబట్టి ఇక్కడ భలే వుందే ఛాలెంజ్ అని ప్రేక్షకులు థ్రిల్ అవడానికేమీ లేదు. 

        పిరికివాడైన హీరోకి పెట్టే పరీక్షలో అతడి సొంత మాన ప్రాణాలకే రిస్కు వుండాలి తప్ప, పిల్లల ప్రాణాలకి  కాదు. ఇందాక పైన చెప్పుకున్న ముప్ఫయ్యో నిమిషంలో హీరోకి ఇదే హీరోయిన్ అన్న తను పాల్గొని చూపించిన మేజర్ యాక్షన్ సీన్ లోనే, నువ్వెళ్ళి వాళ్ళందర్నీ చంపి వస్తే చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తానని వుంటే, అప్పుడది  హీరోకి పెట్టే నిఖార్సైన పరీక్ష అయ్యేది. ఇందుకు కూడా ఆ సీను ఉపయోగించుకోలేదు. 

        అలాంటి  భయానక మారణహోమం సీను హీరోకి చూపించి ఇంకింత బెదరగొట్టేసిన వాడే, ఇప్పుడు ఇంటి మీదికి  శత్రువులొచ్చిన ఇంతటి ప్రమాదకర పరిస్థితుల్లో,  పూర్తిస్థాయి పిరికివాడుగా ముద్రేసుకున్న హీరో చేతిలోనే  ఆ పిల్లల ప్రాణాలు పెట్టి, కాపాడమనడమేమిటి? 

        కనుక అర్ధం లేని ప్రపోజల్ ఇది. ఇంకొకటేమిటంటే, చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తాననడం. అంటే హీరో పిరికి వాడైనందుకే పెళ్లి చేయడం లేదా, ధైర్యశాలి అయితే ఓకేనా? అంటే  హీరో మీద లోలోపల ఇష్టమేనా? అతను ధైర్యశాలిగా ఎదగాలని కోరుకుంటున్నాడా? మరలాంటప్పుడు ఇరవై మందిని తెగనరికే సీను చూపించి ఇంకింత  బెదరగొట్టడమెందుకూ? ఒకవేళ హీరో భయం పోగొట్టడానికే ఆ సీను చూపించాడా? అలా లేదే?

        ఒక పిరికివాడి చేతిలో పిల్లల్ని పెట్టి పెళ్లి చేస్తాననడం విఫలమైన పాత్ర చిత్రణ. పిల్లల ప్రాణాల కోసం కాళ్ళ బేరానికి రావడానికి హీరో సూపర్ మాన్ కాదు,  స్పైడర్ మాన్ కూడా కాదు.
ఇలా కథకి కేంద్రబిందువైన మొదటి మూలస్థంభం ఏర్పడ్డానికి కారణమే ప్రశ్నార్ధకం కావడంతో, ఈ మొదటి మూలస్థంభంలో గోల్ ఎలిమెంట్స్ కూడా ప్రశ్నార్ధక మయ్యాయి.
                                               
***

k + p + ph + e = G
       గోల్ ఎలిమెంట్స్ = కోరిక, పణం, పరిణామాల హెచ్చరిక, ఎమోషన్.
        ఈ నాల్గూ ఎలావున్నాయో చూద్దాం. 1) కోరికయితే వుంది, అది పెళ్ళిచేసుకోవడం. పెళ్లి కోసం నిజాయితీగానే స్ట్రగుల్ చేస్తున్నాడు కాబట్టి ఈ కోరిక అనే ఎలిమెంట్ బలంగానే వుంది.
        2. మరి ఈ కోరిక తీర్చుకోవడానికి దేన్ని పణంగా పెట్టాడు? ఎందుకంటే ఈ లోకంలో ఫ్రీ మీల్స్ అనేది లేదు. ఒకటి పొందాలంటే ఇంకోటి డిపాజిట్ గా పెట్టాల్సిందే. అలా డిపాజిట్ – అంటే పణంగా ఏం పెట్టాడు? ‘శివ’ లో నాగార్జున మొదటి మూలస్థంభం దగ్గరే  జేడీ మీద తిరగబడి కొట్టేసి, మాఫియాతో యుద్ధానికి తెర లేపినప్పుడు, తన అన్న కుటుంబాన్నే పణంగా పెట్టాడు. తను పాల్పడిన ఈ చర్య తన అన్న కుటుంబానికి హాని కలిగించ వచ్చని తెలుసు. ఆ ప్రకారం గత సీన్లలో రికార్డయింది.  ఇది తెలిసీ తెగించాడు.  హీరోయిజాన్ని ఎలివేట్ చేసేందుకు పనికొచ్చే పణం అనే  ఎలిమెంట్ అంటే ఇదే, ఇంత పవర్ఫుల్ గా , ఎప్పుడు పేలుతుందో తెలీని అణుబాంబులా వుంటుంది.

        కృష్ణ గాడు పణంగా గా పెట్టడానికి అతడికేమీ లేదు. నా అనే వాళ్ళు లేరు, హీరోయిన్ తప్ప. ఆమె పణంగా పెట్టే  డివైస్ కాదు, దేన్నయితే గెలవాలని గోల్ గా పెట్టుకుంటామో  దాన్నే పణంగా పెట్టలేం. పోనీ పిల్లల ప్రాణాలు? డెలివరీ ఇవ్వాల్సిన సరుకునే పణంగా పెట్టడం జరగదు. మరి తన ప్రాణాలు? ఇదీ కరెక్టు. పిరికివాడు ఈ ఆపరేషన్ ని చేపట్టడం నిజానికి ప్రాణాల్ని పణంగా పెట్టడమే. అయితే ఈ భావం ఈ సీన్లో ఉందా? లేదు, ఈ భావం ఉట్టి పడేలా ఈ సీను రూపకల్పన జరిగి వుంటే కృష్ణ గాడి క్యారక్టర్ చాలా పైకి లేచేది. పిరికివాడికి కోరికలుండ వచ్చుగానీ, ఆ కోరికలు తీర్చుకోవడానికి ప్రాణాల్నే పణంగా పెట్టేందుకు తెగిస్తున్నాడంటే, ప్రేమకోసం ప్రాణాలకే తెగిస్తున్నాడంటే ( లేకపోతే వీర ప్రేమ గాథ అని టైటిల్ ఎందుకు) అది అద్భుతమైన క్యారక్టర్ గ్రోత్ మాత్రమేగాక, యూనివర్సల్ గా కనెక్ట్ అయ్యే సెంటిమెంటల్ ప్లే. పిరికివాడైతే  ప్రాణాలకి తెగించేలా చూపడం, ధైర్యవంతుడైతే  ధైర్యం కోల్పోయే ఘట్టం ఎదురయ్యేలా చూపడం- ఇదే  ద్వంద్వాల పోషణతో ఆసక్తికరమైన డైనమిక్స్ ని క్రియేట్ చేయడమంటే.

        దురదృష్టవశాత్తూ ఈ భావం స్ఫురించేలా ఈ సీను చిత్రీకరణ జరగలేదు. అంతా  రొడ్డ కొట్టుడు చిత్రీకరణ అవడం వల్ల. ఇలా పణం అనే పవర్ఫుల్ ఎలిమెంట్ ఆవిరైపోయింది.

        3. మరి పరిణామాల హెచ్చరిక? హీరోకి ప్రత్యర్ధిలా కన్పిస్తున్న హీరోయిన్ అన్నే ఈ  ప్రపోజల్ పెట్టడంతో, ఆ అన్న రాజీ ధోరణికి వస్తున్నట్టే. కాబట్టి అతడితో ఇక ప్రమాదం లేనట్టే. పిల్లల్ని హైదరాబాద్ లో అప్పజెప్పేస్తే తన పెళ్లి చేసేస్తాడు, అంతే. ఇంకేముంది? ఇదే ఇంకో పాత్ర వచ్చి కృష్ణ గాడితో – నీకిదే అవకాశం, పిల్లల్ని అపాయం నుంచి నువ్వే కాపాడు, అప్పుడు ఆ అన్న తనే దారికొస్తాడు నీ  ధైర్యానికి మెచ్చి- అన్నాడనుకుందాం,   అప్పుడు ఆ ప్రకారం హీరో చేస్తే, తను తీసుకుంటున్న ఈ చొరవకి ఆ అన్నఎలా రియాక్ట వుతాడో నన్న శంక పీకుతూనే వుంటుంది. ఇదే పరిణామాల హెచ్చరిక అంటే!

        ‘శివ’ లో నాగార్జున జేడీ ని కొట్టడం తీవ్ర పరిణామాలకి  హెచ్చరికగా వుంటుంది.  వెళ్లి వెళ్లి మాఫియా రఘువరన్ మనిషినే కొట్టి కాలేజీ మీద ఆధిపత్యానికి సవాలు విసిరాడు. ఇక రఘువరన్ వైపు నుంచి ఏఏ ప్రమాదాలు ముంచుకొస్తాయోనన్న ఆదుర్దా సృష్టించాడు. ఇందుకే కదా ‘
What is character but the determination of incident? What is incident but the illumination of character? ―   అని  సాహిత్యంలో సైంటిస్టు లాంటి హెన్రీ జేమ్స్ అన్నాడు. 

       
ఇలాటిది కృష్ణ గాడి విషయంలో జరగ లేదు. ఎందుకంటే కొట్టేవాడు (అన్న) కాస్తా పెట్టే దోస్తుగా మారిపోయాడు. రివర్స్ లో ఇలాటి సీను ఎందుకు క్రియేట్ అయ్యిందంటే,  హీరో పాసివ్ పాత్ర  అవడం వల్లే. పాసివ్ పాత్ర తను సీన్ క్రియేట్ చేయదు. ఎవరో క్రియేట్ చేసిన  సీన్లోంచి అప్పనంగా తనప్రయోజనాలు నెరవేరుతూంటే సంతోషిస్తుంది. కాబట్టి ఈ  సీను ఎలాటి పరిణామాల హెచ్చరికకీ తావివ్వకుండా చప్పగా ఉండిపోయింది.  

        4. ఎమోషన్ విషయానికొస్తే పాసివ్ పాత్రకి కోరిక అప్పనంగా తీరుతూంటే ఎమోషన్  ఏముంటుంది. కోరికయితే వుంది, పణంగా పెట్టదానికేమీ లేదు, పరిణామాల హెచ్చరికకీ అలాటి చర్యకి పాల్పడలేదు. ఈ రెండూ లేకపోయాక నాల్గోదైన ఎమోషన్ లేదు.
పై నాల్గింట్లో కోరిక మాత్రమే వుంది, పణం, పరిణామాల హెచ్చరికా, ఎమోషన్ లేకపోవడంతో, వీటన్నిటి బలం తో ఏర్పడే గోల్ 75 శతం డొల్లగా మారింది. 

       
 k (కోరిక) 25% +  p (పణం) 25 % + ph (పరిణామాల హెచ్చరిక) 25 % + e ( ఎమోషన్) 25 % = 100% G (గోల్).
          వీటిలో p, ph, e  లు జీరో అయ్యాక ఆ నష్టం 75%. వెరసి G = 25 %. అంటే  చాలా బలహీన కథ.

         
హీరోకి గోల్ ఇవ్వడమంటే బంతి చేతిలో పెట్టి గోల్ కొట్టుకో పొమ్మనడం లాంటిది కాదు - ఇరుపక్షాల మధ్య ఆ బంతి చుట్టూ ఆవేశించి వుండే ఎలిమెంట్స్ ని కూడా పరిగణనలోకి తీసుకుని గోల్ ని నిర్మించడం. గోల్ కి స్ట్రక్చర్ లేకపోతే స్క్రీన్ ప్లేకి ఏ దిక్కూదిశా వుండవు.
                                       
        ***
ఇదే మోడల్?   
       పై పరిస్థితికి కారణమేమిటి? పాత్ర పాసివ్ కావడమే. పిరికివాడు పాసివ్ గానే ఉంటాడు నిజమే, అది ఎంతవరకూ అన్నది కాన్సెప్ట్ డిసైడ్ చేస్తుంది. గోల్ ఎదురయ్యవరకూ పాసివ్ గానే  వుండి  అక్కడ్నించీ యాక్టివ్ గా మారడమా, లేక గోల్ తోకూడా పాసివ్ గానే మొత్తం కథంతా కొనసాగడమా అనుకున్న అన్నది కాన్సెప్ట్ ని బట్టి వుంటుంది. పాత్ర గోల్ దగ్గరి నుంచీ యాక్టివ్ గా మారాలని సినాప్సిస్ లో రాసుకున్న కాన్సెప్ట్ అయితే, గోల్ వరకూ పాసివ్ గానే ఉంటాడు. ‘శివ’ లో నాగార్జున గోల్ సమయం ఆసన్నమయ్యే వరకూ జరుగుతున్న మైనర్ సంఘటనలకి ప్రేక్షకపాత్ర వహిస్తూ ఉంటాడు. ఎప్పుడయితే ఆ  మేజర్ సంఘటన ఎదురవుతుందో ఇక  యాక్షన్ లోకి దిగిపోతాడు. కథ మొత్తాన్నీ తన చేతిలోకి తీసుకుంటాడు. కృష్ణ గాడి విషయంలో ఒకవేళ ఆసాంతం నవ్వించే వెర్రి చేష్టలతో పిరికి పాత్రగానే కథంతా విన్యాసాలు చేస్తూ, చివరకి యాక్సిడెంటల్  హీరో ఐపోవడం అనే కాన్సెప్ట్ అనుకుంటే ఇదీ ఓకేనే. కాబట్టి సినాప్సిస్ లో కాన్సెప్ట్ ఏమని రాసుకున్నారు? ఈ రెండు మోడల్స్ కాదని సినిమా చూస్తే తెలుస్తోంది. ఈ రెండూ కాక, లేని- ఉండని - మూడో మోడల్ ని ఎలా కనిపెట్టి రాశారు? ఆ రహస్యం చెపితే నేర్చుకునే వాళ్ళు చాలా మంది వుంటారు హాలీవుడ్ దాకా.
                                       
        ***
దివ్యాభరణం  గల్లంతు 
       ఒక్క నాల్గు పేజీల సినాప్సిస్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్  సహితంగా రాసుకుంటే తప్పులన్నీ  తెలిసిపోతాయి. వాటిని సరిదిద్దుకోవడం ఇక్కడే ఈజీ, సవ్యమైన సినాప్సిస్ వచ్చేదాకా. సినాప్సిస్ నస పెడుతోందంటే సినిమా ఎన్ని  ఆటలేసినా కష్టపెట్టకుండా వుండదు. ఆటలు వేస్తున్న కొద్దీ తప్పులన్నీ ఒకటొకటే అరిగిపోయి, సినిమా తేటగా మారే  ఏర్పాటు ప్రకృతి
కల్పించలేదు. అది పిండి మరకే కల్పించింది, పొట్టూడి పోయి పిండి తేటగా పడేలా.
        పాత్రపట్ల స్పష్టత లేకపోవడం వల్ల మొదటి మూలస్థంభం దగ్గర్నుంచీ కూడా ఏ  నిర్వచనాలకీ అందని పాసివ్ పాత్రగా మారిపోయాడు. పాసివ్ పాత్రలు  రెండే రకాలు - విషాద పాత్రలు, ఫుల్ రేంజిలో కామెడీ పాత్రలు. ఈ రెండూ కాక ఇంకోటి లేదు. కాబట్టి ఒక యాక్షన్ హీరోలా మారిపోయినట్టు పిల్లల్ని తీసుకుని పారిపోతున్నప్పుడు,  తమ మీద దాడులు చేస్తూ వెంటపడుతున్న కొత్తగా ఈ మాఫియా గ్యాంగ్ ఎవరో, ఎందుకు వెంటబడుతున్నారో ఎక్కడా తెలుసుకునే ప్రయత్నం చెయ్యకపోవడం, తనుకాకుండా ప్రత్యర్ధుల్ని ఆత్మరక్షణలో పడేట్టు చేయకపోవడం  విషాద పాత్ర కిందే లెక్క.  ఏమంటే వాళ్ళు దాడి చేసినప్పుడల్లా ఆత్మరక్షణ చేసుకుంటూ ఎదురు దాడి చేస్తూంటాడు.  చూడ్డానికి ఇది హీరోయిజంతో గొప్ప యాక్షన్ కి పాల్పడుతున్నట్టే  వుంటుంది. కానీ మూలంలో ఆ యాక్షన్ దివాలాకోరు రియాక్షనే. ఎవరో దాడి చేస్తూంటే దాన్ని తిప్పి కొడుతూ అప్పటికప్పుడు తాత్కాలికంగా క్షేమంగా ఫీలవడం.. 

         ‘అశోక్’ లో ఎన్టీఆర్ తన మీద దాడులు చేస్తున్న దెవరో, ఆ విలన్ తననెందుకు టార్గెట్ చేశాడో తెలుసుకోవాలనుకోడు. దాడి జరిగినప్పుడల్లా తిప్పి కొట్టడమే పనిగా పెట్టుకుంటాడు. దీన్ని పాసివ్ రియాక్టివ్ క్యారక్టర్ అంటారు. ఇది కథని రక్తి  కట్టించదు. ఎందుకంటే కథ తన చేతిలో వుండదు, దురదృష్టవశాత్తూ విలన్ చేతిలో వుంటుంది. ఇతరపాత్రలు కథ నడిపిస్తూంటే దాన్నిబట్టి వెళ్ళేవాడు సొంతవ్యక్తిత్వం లేని పాసివ్ క్యారక్టరే. 

        కృష్ణగాడు యాక్టివ్ పాత్రయివుంటే ఆ  దాడులు చేస్తున్న దెవరో, ఎందుకు చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేసేవాడు. వూళ్ళో ఫ్యాక్షనిస్టులు కాక, ఇంకెవరో ముఠా కి దీంతో సంబంధమేమిటో ప్రమాదంలో వున్న వాడు తెలుసుకోకుండా ఎలా ఉంటాడు. ఇది కూడా అర్ధం జేసుకోలేని పక్కా  వెర్రి బాగులవాడి క్యారక్టరైజేషన్ అయితే,  ఆ పాత్ర స్వభావం కొద్దీ కామెడీ ఆఫ్ ఎర్రర్స్ తో ఈలవేసుకుంటూ సాగిపోతూనే వుండొచ్చు.

        కానీ  జరిగిందేమిటంటే- సెకండాఫ్ మొదట్నించీ కృష్ణ గాడు పిరికి వాడనే క్యారక్టరైజేషన్ ని వదిలేశారు! ఇక్కడే వచ్చింది చిక్కంతా. నాని గత సినిమా ‘భలే భలే మగాడివోయ్’ లో  మతిమరుపు అనే పాత్రచిత్రణ ని చివరివరకూ నిభాయించారు. ఒక  హాస్య పాత్రకి ఏ లోపమైతే ఆభరణంగా భాసిస్తుందో  అదే కథకి వెన్నెముకవుతుంది. దాన్నెలా విరిచేస్తారు?
                                               
***
అసలు కథ? 
       కృష్ణ గాడు కేవలం ఆత్మరక్షణ చేసుకునే సొంతవ్యక్తిత్వం లేని పాసివ్ – రియాక్టివ్ క్యారక్టర్. ఇందుకే మొదటి మూలస్థంభం దగ్గర తను సృష్టించాల్సిన సంఘటనని తను సృష్టించలేకపోయాడు. ఆ ఫ్యాక్షనిస్టు ఇంటి మీద దాడి జరుగుతున్నప్పుడయినా ధైర్యం తెచ్చుకుని - ఓ నల్గురు దుర్మార్గుల్ని చంపేసి వుంటే, పిరికితనమంతా వదిలిపోయి యాక్టివ్ గా మారిపోయే వాడు. మొదటి మూలస్థంభం వరకూ హీరో పాసివ్ గా అమాయకంగా ఉన్నంతవరకూ అభ్యంతరం లేదు. కానీ అక్కడ్నించీ యాక్టివ్ గా మారకపోతే పాత్రకి అర్ధం లేదు. 

        ‘కోయీ మిల్ గయా’ లో హృతిక్ రోషన్ మానసికంగా దుర్బలుడు. ఆ దుర్బలత్వం తోనే గోల్ కోసం సంఘర్షిస్తూ ఉంటాడు. ఇది భౌతికంగా బాహిర్ సమస్యతో చేసే పోరాటం.  అంతర్గతంగా ఆ దుర్బలత్వాన్ని జయించాలనుకోవడం మానసికంగా అంతర్గత సమస్యతో చేసే పోరాటం. ఇలా ఒక అర్ధవంతమైన ద్వంద్వాల పోషణతో చివరికి తన  దుర్బలత్వాన్ని జయించి ప్రత్యర్ధుల్ని చిత్తు చేస్తాడు. ఇలాటి పర్సనాలిటీ లోపాలున్న క్యారక్టర్ కేస్ స్టడీకి ‘కోయీ మిల్ గయా’  మంచి సబ్జెక్టు.

        కృష్ణ గాడు మొదటి మూల స్థంభం దగ్గర హీరోయిన్ అన్న క్యారక్టర్ కి దిమ్మ దిరిగేలా తనే ఓ నల్గుర్ని చంపేసి వుంటే పిరికితనం వదలడానికీ, యాక్టివ్ గా మారడానికీ అదొక మంచి అవకాశమే కాకుండా, ఇది కళ్ళారా చూసి దిమ్మదిరిగిన హీరోయిన్ అన్న కూడా, హీరో మీద ఇప్పుడు పూర్తి నమ్మకం కలిగి పిల్లల్ని అప్పజెప్పినా అర్ధంపర్ధం వుంటుంది. 

        అయితే ఇక్కడ మరో చిక్కు వుంది. మొదటి  మూలస్థంభం దగ్గర కృష్ణ గాణ్ణి యాక్టివ్ గా మార్చి,  పిల్లల బాధ్యత అప్పజెప్పినా, అది మొదలెట్టిన అసలు కథ అవుతుందా? కచ్చితంగా కాదు. మొదలెట్టిన  ప్రేమకథకి ఉపకథ అవుతుందా? కచ్చితంగా కాదు. 

        విప్పుతున్న కొద్దీ ఇలా ఇందాకట్నించీ, ఒక దాంట్లోంచి ఒకటి పొరలుపొరలుగా ఘోరమైన తప్పులు పైకి తేలుతున్నాయి కదూ?  సినిమా కంటే ఈ మొదటి మూలస్థంభం పోస్ట్ మార్టమే  థ్రిల్లింగ్ గా వుంది...మృతప్రాయమైన మూలస్థంభం ఇంతే. భావి  తరాల    పరిశోధనల కోసం మమ్మీగా తయారు చేసి పెట్టాల్సిందే దీన్ని!
                                                ***



ఎందరో కృష్ణులు- ఎంతో గొడవ!
     
     సెకండాఫ్ లో ఎప్పటి దాకానో ఈ కొత్త కథతో తెగిపోయి ఐపు లేకుండా పోయిన హీరోయిన్ తో ఇంకా రోమాంటిక్ థ్రిల్లర్ ఏమిటి? ప్రేమగాథ ఏమిటి? పిల్లలుంటే వుండనీ హీరోతోబాటు, హీరోయిన్ ని కూడా హీరో ఎత్తుకొచ్చి వుంటే, కథ తెగకుండా మొత్తం వీళ్ళం దరితో  కలిపి ఏకత్రాటిపై సాగేది కాదా?

       ఒకళ్ళు చెప్తే చేసే వాడు యాక్టివ్ హీరో అవడు. యాక్టివ్  హీరో ఓ నల్గుర్ని చంపి పారేసి  హీరోయిన్ ని ఎత్తుకుని  పారిపోవడం రోమాంటిక్  థ్రిల్లర్ జానర్ లక్షణం. ప్రేమగాథ అన్నాక సంఘటనలు లవర్స్ ఇద్దర్నీ కనెక్ట్ చేసేవి గానే వుండాలి కదా? ఒకరికోసం ఒకరు చేసుకునే సాహసాలుగానే వుండాలి కదా? మధ్యలో పిల్లలు వచ్చి హీరోమీద పడిపోవడమేమిటి? 

        పిల్లకాయలొచ్చి కథని హైజాక్ చేశారు. రెండుగా చీలిపోయింది కథ. హీరోయిన్ పక్కకెళ్ళి పోయింది. ఏకసూత్రత దెబ్బ తింది. పిల్లలు రంగంలో కొచ్చారు. కొత్త కథ మొదలయ్యింది. పిల్లలతో పాసివ్ వీర యాత్రగా మారిపోయింది. సెకండాఫ్ సిండ్రోం కింద తిరగ బట్టింది. నిట్టనిలువునా స్క్రీన్ ప్లే ఫ్రాక్చరైంది. ఇన్ని వ్యాధులు బయటపడుతున్నాయి.

        ఇంతేనా? ఇంకోటి కూడా వుంది. అన్న అనే ప్రత్యర్ధి అయిపోయాడు, ఫ్యాక్షనిస్టులూ అయిపోయారు. ఇప్పుడు మాఫియాలు వచ్చేశారు. ఒక సినిమాకి ఒకే విలన్ కదా ఉంటాడు? ఒకటవ కృష్ణుడుగా హీరోయిన్ అన్న, రెండో కృష్ణులుగా ఫ్యాక్షనిస్టులు, మూడో నాల్గో కృష్ణులుగా మాఫియాలు, టెర్రరిస్టులూ..ఏమిటిది? స్థిరంగా ఒక్కడూ లేకుండా ఇంతమంది ఆయారాం గయారాంలా? ఒక్కో జానర్ నుంచి ఒక్కో విలన్ ని తెచ్చుకుని ఒకే సినిమాలో ఇన్ని కథలు చెప్పడమా? 

        ఇదంతా కలిపి అత్యంత క్రూడ్ గా, భరించలేని తలపోటు వచ్చేలా అరుపులతో, శబ్దాలతో హార్డ్ కోర్- వయొలెంట్ నాటు- మోటు - ‘ఎంటర్ టైనర్’ గా తయారుచేయడమా?
                                                ***

కథెందుకు తెగాలి? 


     సెకండాఫ్ లో ఎప్పటి దాకానో ఈ కొత్త కథతో తెగిపోయి ఐపు లేకుండా పోయిన హీరోయిన్ తో ఇంకా రోమాంటిక్ థ్రిల్లర్ ఏమిటి? ప్రేమగాథ ఏమిటి? పిల్లలుంటే వుండనీ హీరోతోబాటు, హీరోయిన్ ని కూడా హీరో ఎత్తుకొచ్చి వుంటే, కథ తెగకుండా మొత్తం వీళ్ళం దరితో  కలిపి ఏకత్రాటిపై సాగేది కాదా?

        మొత్తం కుటుంబాన్నే హతమార్చడానికి వచ్చిన ఫ్యాక్షన్ గ్యాంగ్ హీరోయిన్ని ఎందుకు వదిలి పెడతారు? హీరోయిన్ కోసం ఆ గ్యాంగే వెంటపడుతూ వుంటే, ఇతర కృష్ణుల జానర్ల జాతర తప్పి- మొత్తం ఉన్న హీరో- హీరోయిన్ – విలన్ పాత్రలూ ఏకత్రాటి పైకొచ్చి స్టోరీ పాయింటుకి న్యాయం చేసే వాళ్ళు కాదా?

        ఈ పారిపోవడాలూ వెంట పడ్డాలతో వయొలెన్స్ తగ్గి, ఒక హిలేరియస్ కామిక్ థ్రిల్లర్ లా ఎంటర్ టైన్ చేసేది కాదా? 1993లో మహేష్ భట్ దర్శకత్వం వహించిన సూపర్ హిట్ లైటర్ వీన్ ఎంటర్ టైనర్ ‘హమ్ హై రాహీ ప్యార్ కే’ ( మేము ప్రేమ ప్రయాణికులం) లాగా పిరికివాడి ప్రేమకథ కొత్త గాలితో సరదా సరదాగా వుండేది కాదా? 


-సికిందర్

cinemabazaar.in