రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

17, ఫిబ్రవరి 2016, బుధవారం

రైటర్స్ కార్నర్


    ఒక రోజు సెట్ ని తీర్చిదిద్దడంలో తీవ్ర కృషి చేస్తున్న ఓ కుర్రాణ్ణి చూసి అతను ఆర్ట్ డైరెక్టరా అనడిగారు కన్నడ హీరో రవి చంద్రన్. అతను అసిస్టెంట్ డైరెక్టరని ఎవరో చెప్పడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే ఆ కుర్రాణ్ణి పిలిపించుకుని తను తీయబోయే సినిమాకి నియమించుకున్నారు. ఏడువేల జీతంతో స్క్రిప్టు, డైలాగులు రాసే పని అప్పజెప్పడంతో ఎంతో థ్రిల్ ఫీలయయ్యాడా కుర్రాడు.  అలా 1995లో రవిచంద్రన్ నిర్మించి, దర్శకత్వం వహించి, నటించిన ‘పుట్నంజా’ అనే హిట్ కి ఆ కుర్రాడు డైలాగులు రాశాడు. రాస్తూండగానే జీతం పెంచి 13 వేలు ఇచ్చారు  రవిచంద్రన్. ఆ సినిమా విడుదల రోజున ఆ కుర్రాడు బైక్ వేసుకుని థియేటర్ కి వెళ్తే మధ్యలో  పెట్రోల్ అయిపోయింది. బండి నెట్టుకుంటూ  రవిచంద్రన్ ఆఫీసు కెళ్ళాడు. రవిచంద్రన్ లోపలికి  పిలిచి జీతం ముట్టిందా అనడిగారు. చాలాకాలం క్రితం ముట్టిందన్నాడు కుర్రాడు. ఈ రోజు కూడా ముట్టలేదా అంటే ముట్ట లేదన్నాడు. చేతిలో లక్షా ముప్పయి వేలు పెట్టారు రవిచంద్రన్. షాక్ కి గురయిన కుర్రాడు ఆ డబ్బుతో ఇంటికి పరిగెడితే, ఎక్కడో దొంగతనం చేశాడని భార్య అనుమానించింది. కానీ ఆ సినిమా అతణ్ణి  స్టార్ ని చేసింది. వెంటవెంటనే రెండు సినిమాలకి దర్శకత్వం వహించాడు. అవి ‘టపోరీ’, ‘అర్ధ’ అనే సినిమాలు. ఇంకో 4 వేల ఎపిసోడ్స్ వివిధ సీరియల్స్ కీ కూడా దర్శకత్వం వహించేశాడు.  ‘అర్థ’ కి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం అవార్డులతో గౌరవిస్తే,  2011 లో ప్రకాష్ రాజ్ తో తీసిన ‘పుట్టక్కన హైవే’ కి ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డుతో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం.
          మొత్తం 10 సినిమాలకి రచన, దర్శకత్వం, కొన్నిటికీ నిర్మాణమూ చేపట్టిన కెమికల్ ఇంజనీర్ అయిన బి. సురేష్, కొన్ని సినిమాల్లో నటించారు కూడా.  తాజాగా ప్రకాష్ రాజ్ తో నిర్మించి దర్శకత్వం వహించిన ‘దేవర నాదల్లి’’ ఫిబ్రవరి అయిదున విడుదలయ్యింది. సహాయ పాత్రగా నటించిన ‘బద్మాష్’ 26 వ తేదీన విడుదలవుతోంది. ఈ నేపధ్యంలో ఆదిత్యా సన్వాల్ కి ఆయనిచ్చిన ఇంటర్వ్యూ  పాఠం...
మీరు స్క్రిప్టులు రాయడం ఎప్పుడు ఎలా ప్రారంభించారు?
        నా క్రియేటివ్ జర్నీ నాటకాలతో ప్రారంభమయ్యింది. నాటకాలు చేస్తున్నప్పడు పాపులర్ కన్నడ నటుడు, దర్శకుడు, రచయితా శంకర్ నాగ్ ని కలిశాను. ఆయనే నాకు సినిమాల్లో అవకాశాలు ఇప్పించారు. ఘోస్ట్ రైటర్ గా చాలా స్క్రిప్టులు రాశాను. 1988 లో బీహెచ్ఈఎల్ లో నా రెగ్యులర్ జాబ్ మానేసి ఫుల్ టైం రైటర్ గా మారాను. రైటర్ గా నా మొదటి సినిమా ‘మిథిలేయ సీతేయరు’. అప్పట్నుంచీ నాకు అవకాశాలు బాగా రాసాగాయి. 1992 వరకూ ఆర్టు తరహా సినిమాలే రాస్తూ వున్నాను అసిస్టెంట్ డైరెక్టర్ గా వుంటూనే. రవి చంద్రన్ గారు నన్ను పికప్ చేసినప్పటి నుంచీ కమర్షియల్ సినిమాల్లోకి వచ్చేశాను. ఇది నాకు చాలా ఆర్ధిక స్వాతంత్రాన్ని ఇచ్చింది, కానీ క్రియేటివ్ స్వేచ్ఛన్ని మాత్రం హరించి వేసింది.

మీ రైటింగ్ ప్రాసెస్ గురించి చెప్పండి. ఎంత మేరకు అది రీసెర్చి ప్రధానంగా వుంటుంది?
        సినిమాలకి సంబంధించి నా రైటింగ్ ప్రాసెస్ అంటే రైట్- రీరైట్- రీరైట్ మోర్...ఇంతే! నా అన్ని సినిమా స్క్రిప్టులూ ఎన్నో సార్లు తిరగరాసినవే. సబ్జెక్టు పైన చేసే రీసెర్చి నిరంతరంగా ఆ ఇన్ పుట్స్ కి స్థానం కల్పించే పరిస్థితి తెస్తోంది. ఇందువల్లే అసంఖ్యాక మైన రీరైటింగ్స్. ‘పుట్టక్కన హైవే’. ‘దేవర నాదల్లి’ సినిమాల విషయంలో యంగ్ టీం నాకు రీసెర్చి విషయంలో ఎంతో తోడ్పడ్డారు. ఎక్కడెక్కడినుంచో కొత్త  కొత్త సమాచారాన్ని తీసుకుని నా దగ్గరికి వచ్చేవాళ్ళు. ఈ టీముతోనూ, ఈ సబ్జెక్టు లపైన నిపుణులతోనూ కూలంకషంగా చర్చించే వాణ్ణి. ఆ తర్వాతే స్క్రిప్టులో వాటికి చోటు కల్పించే వాణ్ణి. ఒక అంశంపై ప్రతీ చర్చా భిన్న కొణాల వైపు నుంచి జరిగేది. ఈ చర్చల ఆధారంగా కొత్త వెర్షన్లు తయారు చేసేవాళ్ళం కథలకి. ఇక స్క్రిప్టులు పక్కాగా వచ్చినట్టు టీము ఫీలవగానే కాస్టింగ్ ఎంపికకీ, లొకేషన్ హంట్ కీ వెళ్ళేవాళ్ళం. ఇది చాలా  ఎక్కువ టైము తీసుకునేది. కాస్టింగ్, లోకేషన్స్ ఫైనలైజ్ అయ్యాక స్క్రిప్టుని మళ్ళీ రీరైట్ చేసేవాళ్ళం. ఈసారి డైలాగుల్లో వచ్చే వివిధ యాసలకి కచ్చితత్వాన్ని దృష్టిలో పెట్టుకుని. మూవీ మేకింగ్ మా మొత్తం టీము ఉమ్మడిగా తీసుకునే నిర్ణయం మీదే ఆధారపడేది. షూట్ చేయాల్సిన ఫైనల్ వెర్షన్ ని టీం మొత్తం కలిసి నిర్ణయించేది. ఇది నిర్ణయించాక, తిరిగి ఫైనలైజ్ చేసిన లోకేషన్స్ కెళ్ళి, ఫోటో గ్రాఫ్స్ తీసే వాళ్ళం. 800 షాట్లుగా సినిమా తియ్యాలనుకుంటే,  ఆ 800 షాట్లు ఎలా ఉండాలో 800 ఫోటో గ్రాఫ్స్ తీసేవాళ్ళం. వీటితో ఫైనల్ షూట్ ని ప్లానింగ్ చేసేవాళ్ళం. నా మూవీ  మేకింగ్ ప్రాసెస్ చాలా నెమ్మదిగా సాగుతుంది. అందుకనే చాలా తక్కువ సినిమాలు తీశాను.

మీ సినిమాలు సామాజిక స్పృహ గలవి. సబ్జెక్టుల్ని  మీరెక్కడ నుంచి తీసుకుంటారు- సమాజం లోచి యధాతధంగానా, లేక సమాజంలో జరుగుతున్న వాటికి ని కల్పన చేశా?
       
నాటకాలు, వీధి నాటకాలూ వేస్తున్నప్పుడు ఆ ఇతివృత్తాలన్నీ చుట్టూ వుండే  సమాజంలోంచి వచ్చినవే. ప్రయాణాలంటే నేను ఇష్ట పడతాను. సమాజంలో అట్టడుగు వర్గాలతో ఇంటరాక్ట్ అవడాన్ని కూడా ఇష్టపడతాను. సమాజంలో ప్రతీ ఒక్కరికీ ఒక్కో కథ వుంటుంది. వీటి గురించి నోట్స్ రాసుకుంటాను. ప్రస్తుతం నేను ప్లాన్ చేస్తున్న సినిమా కథ రైతులు- వాళ్ళు  వాడే   క్రిమిసంహారక మందుల గురించి. దురదృష్టమేమిటంటే అవే క్రిమి సంహారక మందులతో వాళ్ళు ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇది నన్ను   బాగా కదిలించిన సామాజిక సమస్య. ఇంకో కథ మత సామరస్యం గురించి...ఇవ్వాళ మతసామరస్యమే ఉద్రిక్త పరిస్థితులకి లోనవుతోంది.

         
ఒక సమస్యని తీసుకున్నాక ముందు కథగా రాసుకుంటాను. ఆతర్వాత మిత్రులతో చర్చించి వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటాను. దాన్ని పూర్తి స్థాయి స్క్రిప్టుగా రాస్తున్నప్పుడు ఇది సినిమాగా తీయ వచ్చా, సీరియల్ గా తీయాలా, లేక నాటకంగా వేయవచ్చా నిర్ణయిస్తాను.

గిరీష్ కాసరవల్లి, పి శషాద్రి వంటి దర్శకులు సామాజిక స్పృహగల
సినిమాలెన్నో  తీశారు. అయితే వాటిని విడుదల చేసుకోవడానికి చాలా ఇబ్బందులు పడ్డారు. కారణ మేమిటంటారువిశాల ప్రాతిపదికన ప్రేక్షక బాహుళ్యంలోకి ఇటువంటి సినిమాలని చేరవేయాలంటే ఏంచేయాలంటారు?
         
వారిద్దరి సినిమాలని నేను చాలా ఇష్టపడతాను. వాళ్ళ ప్రయాణంలో వాళ్ళు పట్టిన పట్టు వీడ లేదు. వాళ్ళ సినిమాల్ని రెగ్యులర్ థియేటర్లలో విడుదల చేసుకోవడానికి ప్రయత్నించే వాళ్ళు. అవి కొద్ది రోజుల కంటే ఎక్కువ ఆడేవి కావు. బహుశా అందుక్కారణం వాళ్ళ కథలు చెప్పే పధ్ధతి. కమర్షియల్ ఫ్రెండ్లీగా ఉండేట్టు వాళ్ళెప్పుడూ సినిమాల్ని ఎమోషనలైజ్ చేయలేదు. మెలోడ్రామా, డ్రామా అనేవి కూడా ఇష్టపడే వాళ్ళు కాదుఅందువల్ల ప్రేక్షకులకి  కథల్లో ఇన్వాల్ మెంట్ అసాధ్యంగా వుండేదిపెద్ద పోటీగా కమర్షియల్ సినిమాలు వున్నప్పుడు కథల్ని తరహాలో చెప్తే ఆదరణ ఎక్కడ వుంటుంది

         
కానీ గిరీష్, శేషాద్రిల సినిమాల్ని కర్ణాటకలో  చాలా నగరాల్లో ప్రైవేట్ ప్రదర్శనలుగా వేసేవాళ్ళు ప్రదర్శనలకి  ఒక ప్రత్యేక బృందం ప్రేక్షకులు వుండే వాళ్ళు. మేధావులు అనొచ్చు. కొన్ని సంఘాలు  సినిమాలు ప్రదర్శించేవి. ఫిలిం సొసైటీల ఉద్యమానికి కొనసాగింపుగా సంఘాలు పనిచేసేవి. అలా వచ్చిన సొమ్ములు నిర్మాతలకి పంపేవి. తరహా సినిమాలు సాధారణ ప్రేక్షకుల్లోకి తెసికెళ్ళడం అసాధ్యం. వాటి పోషణకి సంఘాల మీదే ఆధారపడాలి.

 కన్నడలో 30 శాతానికి పైగా రీమేక్స్ ఉంటున్నాయి. దీనిపై మీ అభిప్రాయంఫ్రెష్  గా, డిఫరెంట్ గా వున్న స్టోరీస్ పట్టుకుని కొత్త వాళ్ళు వస్తే వాళ్ళని ప్రమోట్ చేయడానికి మీదగ్గర మార్గాలున్నాయి

     రీమేకులు ఒక శాపమే. కానీ రీమేకులే బాగా హిట్టవు తున్నాయి. దీంతో మరిన్ని రీమేకులు వస్తున్నాయి. కన్నడలోనే కాదు, హిందీ సహా ఇతరానేక భాషల్లో రీమేకుల సందడి నడుస్తోంది. అదేపనిగా వీటిని చూస్తున్న ప్రేక్షకులకీ  విసుగెత్తడం లేదు. కొత్త వాళ్ళని ప్రమోట్ చేయడం గురించి...దీని అవసరం చాలా వుంది. మా మీడియా హౌస్ స్టూడియో సంస్థకొత్త వాళ్లతో ప్రాక్జెక్టుకింద ఇద్దరు కొత్త దర్శకులకి అవకాశా లిచ్చాం. సంవత్సరం మరో ఇద్దరికి  ఇస్తాం. మొత్తం సినిమా పరిశ్రమా యువ టాలెంట్స్ ని ప్రోత్సహించడం చాలా అవసరం. వాళ్ళు కొత్త తరహా కథా కథనాలనే కాదు, కొత్త శక్తిని కూడా పరిశ్రమలో నింపుతారుప్రతీ పరిశ్రమా కొత్త టాలెంట్స్ కి ప్రయోగశాల కావాలి. షార్ట్ ఫిలిమ్స్ కొత్త తరహ కథా కథనాలకి మాత్రమే ప్రయోగశాలలు  కావు, అవి కొత్త టాలెంట్స్ కి లైబ్రరీలు వంటివి కూడాషార్ట్ ఫిలిం మేకర్స్  ఎక్కువ ప్రాధాన్య మివ్వాలి.

కన్నడ లో డబ్బింగులపై  నిషేధం ఇప్పటికీ వివాదా స్పదంగానే వుంది. ఒకవైపు కన్నడ సినిమాల్ని ఇతర భాషల్లోకి డబ్ చేస్తూనే కన్నడలో డబ్బింగులని  నిషేధించడం విచారకరం కాదంటారా?
         
నా అభిప్రాయంలో ఒక భాష నుంచి ఇంకో భాషలోకి డబ్బింగ్ ( లిప్ సింక్ డబ్బింగ్) చేయడం నేరంతో సమానం. ఒక దర్శకుడు  ఉద్దేశపూర్వకంగా కథనీ, నేపధ్య వాతావరణాన్నీ సెట్ చేస్తాడు. ఇందులో నటించే నటుడు వొరిజినల్ వాతావరణంలో ఇమిడిపోయి నటించి, పాత్రకి న్యాయం చేస్తాడు. నేపధ్యంలో వేరొకరు వచ్చి వేరే భాషలో నటుడి గొంతుని అనుకరించడమంటే మొత్తం  సెట్ చేసిన వాతావరణాన్నీ, కథనీ కిల్ చేయడమే అవుతుంది. దర్శకుణ్ణీ నటుణ్ణీ అవమానించడమే అవుతుంది

         
మన  నాట్య శాస్త్రంలో నటనని వాచికం, ఆంగికం, ఆహార్యం, సాత్వికం  అనే నాల్గు డైమెన్షన్లుగా నిర్వచించారు. నాలుగూ కలగలిసిపోతేనే అది అభినయ చతుర్ధం అవుతుంది. అలాంటప్పుడు  ఒక నటుడి వాచికాన్ని మరొకరు వచ్చి తన గొంతుతో మార్చేస్తే అప్పుడా మిగిలిన మూడు డైమెన్షన్లూ వికలమై పోతాయిఅప్పుడా ఒరిజినల్ నటుడి నటనకి అర్ధమే లేకుండా పోతుంది. ఇందువల్ల  డబ్బింగుల్ని నేనెప్పుడూ సమర్ధించను. ఇతర భాషల సినిమాల్ని డబ్బింగులు కాక, సబ్ టైటిల్స్ తో వున్నవే చూడమని నేను చెపుతూంటాను. ఇప్పటి వరకూ నాల్గు సినిమాలకి నేను దర్శకత్వం వహించాను, మరో ఆరు సినిమాలు  నిర్మించాను. దేన్నీ డబ్బింగ్ చెఉఅలెదు. సబ్ టైటిల్స్ తోనే ప్రపంచవ్యాప్తంగా అవి వెళ్ళాయి.

         
ఇక మీరన్నట్టు కన్నడ మార్కెట్లో ఇతర భాషల డబ్బింగులపై  అధికారికంగా నిషేధమూ లేదు. కానీ  1964 నుంచీ ఇతరభాషల సినిమాలని కన్నడలోకి డబ్బింగులు చేయడం  లేదు. కన్నడ సినిమా పరిశ్రమకి దీంతో ఏం సంబంధం లేదు. 1964లో కొందరు ప్రముఖ సాహిత్యవేత్తలకి ప్రజలూ తోడై డబ్బింగులకి వ్యతిరేకంగా ఉద్యమించారు, అంతే మధ్య కొందరు ఐటీ ప్రొఫెషనల్స్ సిసిఐ ( కాంపిటేషన్ కమిషన్ ఆఫ్  ఇండియా) కి కంప్లెయింట్ చేశారు. సిసిఐ చర్య తీసుకుంటే డబ్బింగులపై వున్న నిషేధం తొలగిపోవచ్చు. కానీ ఒక్క సిసిఐ ఆదేశంతో ఆరు దశాబ్దాలుగా అలవాటు పడిన సాంప్రదాయం తొలగిపోతుందనుకోను. కొందరు  తెగించి డబ్బింగులకి పాల్పడవచ్చు. అయితే   ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గరో, అమితాబ్ బచ్చనో డబ్బింగుల్లో వచ్చేసి తమది కాని గొంతుకలతో మాట్లాడుతూంటే కన్నడ ప్రేక్షకులు భరించలేరు.  

మీ  కొత్త సృష్టిదేవర నాదల్లిగురించి చెప్పండి...

 
         ఇది మల్టీ టైం లైన్ నెరేటివ్ మూవీ. ఒక న్యూస్ పేపర్ క్లిప్పింగ్  లోంచి ఐడియా పుట్టింది. 1998 లో దీన్ని చదివి కత్తిరించి పెట్టుకున్నాను. అప్పట్నుంచీ  ఎన్నో వెర్షన్లు రాశాను. ఫైనల్ గా 2014 లో స్క్రిప్టు ని లాక్ చేశాను. సంవత్సరం ఆఖర్లో ప్రొడక్షన్లోకి దిగాను. సమాజం తాను  ఏర్పరచిన చట్టాలకే తానెలా భిన్న భాష్యాలు చెప్తుందో ఇందులో చూపించదల్చుకున్నాను. దర్శకుడిగా మల్టీ టైం లైన్  కథనం నాకు కత్తిమీద సామే. దీన్ని పూర్తిగా ఎంజాయ్ చేశాను

మీకు స్ఫూర్తి నిచ్చిన దర్శకుల గురించి చెప్పండి?
         
అకిరా కురసోవా, ఇంగ్మార్ బెర్గ్ మాన్, ఎమిర్ కుస్తురికా, కిమ్ కీ డాక్, గిరీష్ కాసరవల్లి ...ఇలా ఎందరో. మంచి సినిమా, చెడ్డ సినిమా అని వుండవు నా దృష్టిలో. చూసిన ప్రతీ సినిమా నుంచీ ఏదో ఒక విజువల్ కమ్యూనికేషన్స్ పాఠాన్ని నేర్చుకుంటాను...

-సికిందర్
cinemabazaar.in






15, ఫిబ్రవరి 2016, సోమవారం

వీకెండ్ కామెంట్



మినీ థియేటర్ల  అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. ఎనిమిది నెలల క్రితమే ఈ ప్రతిపాదన గురించి విన్నాం. చిన్న నిర్మాతగా చిన్న సినిమాలు తీసి బాధలుపడ్డ చదలవాడ శ్రీనివాసరావు, ‘తెలుగు చలన చిత్ర పరిరక్షణ సమితి’ అనే సంస్థని స్థాపించి చిన్న సినిమాల ప్రదర్శనావకాశాల్ని మెరుగు పరచడానికి తీవ్ర కృషి చేస్తున్నారు.  తిరిగి మొన్న ఈ అంశం పై తాజా ప్రకటన చేశారు. నాలుగు బృందాలుగా వెళ్లి మహారాష్ట్ర, గుజరాత్, మధ్య ప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాల్లో మినీ థియేటర్ల పని తీరుని  పరిశీలించి వచ్చామని, అక్కడ అవి విజయవంతంగా నడుస్తున్నాయనీ, త్వరలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ  అయిదు వేల థియేటర్లు నిర్మించే ప్రాజెక్టు చేపడతామనీ ప్రకటించారు. గుజరాత్ లో అయితే సర్కస్ టెంట్ తరహా నెలకొల్పిన మినీ థియేటర్లు నిర్వహిస్తున్నారనీ, ఈ తరహాలో మన రాష్ట్రాల్లో కూడా ప్రారంభించే ఆలోచన ఉందనీ అన్నారు. చదలవాడ చేపట్టిన ఈ బృహత్కార్యాన్ని ఎవరైనా అభినందించాల్సిందే.

  భారీ ప్రాజెక్టుని తన భుజాలకెత్తుకోవడానికి ఆయన చెప్పే కారణం- చిన్న బడ్జెట్ సినిమాలు నిర్మిస్తున్న నిర్మాతలకి రెండు రాష్ట్రాల్లోనూ  థియేటర్లు లభించడం లీజ్ హోల్డర్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి న్యాయం జరక్కపోవడమే. ఈ మినీ థియేటర్లు ఏరియాని బట్టి 50 నుంచి 200 సీట్ల మధ్య కేపాసిటీతో ఉంటాయన్నారు. వెయ్యి గజాల నుంచి, 5 వేల గజాల స్థలం ఒక్కో థియేటర్ కి సరిపోతుందని, ఒక్కో మినీ థియేటర్  నిర్మాణానికి పన్నెండు నుంచి చ 20 లక్షల రూపాయల వ్యయం అవుతుందనీ పేర్కొన్నారు. టికెట్ల ధరలు కూడా చవకగా 30 నుంచి 50 రూపాయల మధ్యే వుంటాయి. రెసిడెన్షియల్ కాలనీల్లో, బస్ డిపోల్లో, మండల, ఆర్డీఓ కార్యాలయాల్లో వీటిని ఏర్పాటు చేస్తామని చెప్పారు.  

అయితే ఎనిమిది నెలల క్రితమే  ఈ  అంశంపై ‘తెలుగు చలన చిత్ర పరిరక్షణ సమితి’ భారీ యెత్తున రామోజీ ఫిలిం సిటీలో సమావేశం జరిపింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఆర్ ఎఫ్ సి చైర్మన్ రామోజీరావు,  చదలవాడ ప్రయత్నాన్ని  శ్లాఘించారు. 250 మందికి పైగా చిన్ననిర్మాతలు, ఎగ్జిబిటర్లు పాల్గొన్న ఈ సమావేశంలో రామోజీ రావు మాట్లాడుతూ, తను కోట్ల రూపాయలు వెచ్చించి భారీ సినిమాలు నిర్మించవచ్చు గానీ, కథా బలమున్న సినిమాలపైనే తనకి దృష్టి వుండడం వల్ల చిన్న బడ్జెట్ సినిమాలే నిర్మిస్తున్నాననీ చెప్పుకొచ్చారు. మినీ థియేటర్ల నిర్మాణాన్ని ఆహ్వానిస్తున్నా నన్నారు. ఇక అప్పట్లో చదలవాడ నిధులు సమకూర్చుకుని రెండు రాష్ట్రాల ప్రభుత్వాధినేతల్ని కలవడమే మిగిలింది.

ఈ మినీ థియేటర్ల వైపు చిన్న నిర్మాతలు ఆశగా చూస్తున్నారు. కాలం చాలా మారిపోయింది. పెద్ద సినిమాలకే థియేటర్లు లభించి,  చిన్న సినిమాలకి థియేటర్లు దొరకని రోజులు పూర్వ మెప్పుడూ లేవు. భారీ సినిమాలైనా, చిన్న సినిమాలైనా పెద్ద పెద్ద థియేటర్ల దగ్గర్నుంచి టూరింగ్ టాకీసుల వరకూ అన్నిటా ఆడేవి. ఎన్టీఆర్ ‘బొబ్బిలి పులి’ కూడా గ్రామాల్లో టూరింగ్ టాకీసుల్లో భారీ వసూళ్లతో ఆడిందే. ఎన్టీఆర్ ని ముఖ్యమంత్రిని చేయడంలో టూరింగ్ టాకీసుల పాత్ర కూడా  తక్కువేం కాదు. టూరింగ్ టాకీసుల్ని చిన్న సినిమాలకే పరిమితం చేయాలనీ ఎవరూ అనలేదు.

కానీ ఇవ్వాళ్ళ  థియేటర్లని పెద్ద సినిమాలకే పరిమితం చేశారు. అయితే ఏ మాట కామాటే చెప్పుకోవాలి : చిన్న సినిమాల నాణ్యత పూర్వమున్నట్టు ఇప్పుడు వుండడం లేదు. ఏడాదికి 70 మంది చొప్పున కొత్త నిర్మాతలూ దర్శకులూ వస్తూ, ఆ 70 సినిమాల్ని అట్టర్ ఫ్లాపు చేసుకుని వెళ్ళిపోతున్నారు.  ఏటేటా జరిగే ఈ తంతుని బాగా గమనించ వచ్చు.  ఈ సినిమాలకి ఎంత ప్రధాన సెంటర్ థియేటర్లలో వేసినా ఓపెనింగ్స్ వుండవు, రెండు రోజులు  ఓపిక పట్టినా 15 శాతానికి మించి ఆక్యుపెన్సీ పెరగదు. నాణ్యత ఇలా వుంటే వీటికి థియేటర్లు ఇచ్చి మాత్రమేం లాభం. చుక్క నూనె రాలని వేరుశనగ వస్తూంటే నూనె మిల్లులు కట్టి లాభం లేదు కదా? చిన్న సినిమాల్లో ‘నూనె’ వుందంటే అది రెండు రోజుల్లో తెలిసిపోతుంది. వెంటనే పెద్ద వర్గాలు వాటిని టేకప్ చేసి థియేటర్లు కూడా పెంచి ఆడించు కుంటున్నారు. కాబట్టి థియేటర్లు ఇస్తున్నారా లేదా అన్నది కాదు ప్రశ్న, చిన్న సినిమాల్లో ‘నూనె’ ఉంటోందా లేదా అన్నదే పాయింటు. కచ్చితంగా నూటికో కోటికో తప్ప నూనె వుండదని బాండ్ రాసిచ్చేయొచ్చు. మరి వీటి కోసమే మినీ థియేటర్లు భారీ యెత్తున నిర్మించడం ఎంతవరకు సబబో మనకైతే తెలీదు.

ప్రదర్శనల సంగతి తర్వాత, ముందు అత్యవసరంగా చిన్న సినిమా నాణ్యతా ప్రమాణాలు పెంచడానికి ఏంచేయాలన్నది ఆలోచించాలి. పెద్ద సినిమాలు నాణ్యత లేకపోయినా స్టార్ వేల్యూతో ఆడేస్తాయి. చిన్న సినిమాలకి నాణ్యతే గీటు రాయి. చిన్న సినిమాల నాణ్యతా ప్రమాణాలు రెండు సార్లు పతన మయ్యాయి : ఒకటి, 2000 సంవత్సరం మొదలుకొని అయిదేళ్ళ పాటూ ఎవరెవరో కొత్తకొత్త వాళ్ళతో యూత్ సినిమాలంటూ వేలం వెర్రిగా తీసి పడేసినప్పుడు; రెండు చిన్న సినిమాలకి దాదాపు పెట్టుబడి అంతా శాటి లైట్ రైట్స్ రూపంలో వచ్చెయ్యడంతో చెత్త చెత్త సినిమాల్ని చుట్టేయడంతో.

ఇప్పుడొచ్చి, మినీ థియేటర్లు మన కోసమే కదా అని ఇంకింతమంది తలా ఓ డిజిటల్ కెమెరా పట్టుకుని వచ్చేసి నానా చెత్తని ఉత్పత్తి చేస్తే ఎంత కాలం తట్టుకుని నిలబడగలవు  మినీ థియేటర్లు? చిన్న సినిమాలు చాలా డేంజరస్ వైరస్.

ఇది ఆలోచించాలి.  చదలవాడ శ్రీనివాసరావు చిన్న సినిమాల క్వాలిటీని కూడా పరిరక్షించాల్సి వుంటుంది. అలాటి వాటికే స్థానం కల్పించాల్సి వుంటుంది. ఫిల్టర్ చేస్తే దారికొ స్తారు చిన్న సినిమాలు తీసేవాళ్ళు. అప్పుడు మినీ థియేటర్ల స్వప్నం  సార్ధకమవుతుంది. 
***



13, ఫిబ్రవరి 2016, శనివారం

షార్ట్ రివ్యూ!

దర్శకత్వం : ఆర్ ఆర్ మదన్
తారాగణం : ఆది, అదా శర్మ, బ్రహ్మానందం, పోసాని, జయప్రకాష్ రెడ్డి, శకలక శంకర్, మధు నందన్, కబీర్ సింగ్, తదితరులు
సంగీతం : అగస్త్య , ఛాయాగ్రహణం : విజయ్ సి చక్రవర్తి
బ్యానర్ : ఆర్కే స్టూడియోస్, నిర్మాత : పి సురేఖ
విడుదల : 12 ఫిబ్రవరి, 2016
***
‘లవ్లీ రాకీ స్టార్’ ఆది వెళ్లి వెళ్లి  చాలా మ్యాడ్ మ్యాడ్ గా మాస్ స్టార్ అయిపోవాలనీ, లేకపోతే జీవితమే వృధా అనీ డిసైడ్ అయిపోయి, ఇంకో వీర మాస్ సినిమాతో ఇరగదీయాలనుకుని ప్రేక్షకుల మాడు పగులగొట్టాడు. హిందీలో అప్పట్లో లవర్ బాయ్ గా వచ్చిన సన్నీ డియోల్,  కష్టపడి ఐదు కిలోల బరువున్న రెండు హస్తాలు బాగా డెవలప్ చేసుకుని,  విరగ బాదుతూంటే ప్రేక్షకులు పెట్టిన కేకలకి అమాంతం మాస్ స్టార్ అయిపోయినట్టు- అలాటి ట్రిక్ ఏదో ఆదికి పట్టు బడ్డం లేదు పాపం.  
ది సరే, మామూలు సాఫ్ట్ సినిమాలు తీస్తూ వుండిన దర్శకుడు మదన్ కూడా తను గట్టిగా హార్డ్ అవకపోతే  లోకం లెక్కపెట్టదని, తద్వారా గిట్టుబాటు కాదనీ డిక్లేర్ చేసుకున్నట్టు-  ఈ వీర మాస్ తో సిగపట్లకి దిగడం విచిత్రం. ఏమంటే తన అసిస్టెంట్  చెప్పిన కథకి ఫిదా అయిపోయినట్టు చెప్పుకోవడం...ఏమిటా అసిస్టెంట్ చెప్పిన అంత ఫిదా అయిపోయేట్టు చేసిన కథ దాని కమామిషు?

మరో ఆవారా వరాల బాబు
        వరాల బాబు ( ఆది) వూళ్ళో చదువు పట్టక ఆవారాగా తిరిగే కొడుకు. తన ప్రవర్తనతో ఇంట్లో తల్లిదండ్రుల్ని ఏడ్పించడం హీరోయిజం అనుకుంటాడు. పక్కింటి ఫ్రెండ్ రవి ( చైతన్య కృష్ణ) బుద్ధిగా చదువుకుంటూ పైకొస్తూంటాడు. చిన్నపట్నుంచీ ఇద్దరూ బద్ధ శత్రువులు.  రవి ఉద్యోగమొచ్చి  హైదరాబాద్ వెళ్ళిపోయినా వరాలబాబు  వూళ్ళోనే అదే ఆవారాతనంతో తిరుగు తూంటాడు. ఒకానొకరోజు ఇగో తన్నుకొచ్చి గొప్పవాడవ్వాలని హైదరాబాద్ వెళ్ళిపోతాడు. బస్సు దిగగానే ఓ అమ్మాయిని చూసి మళ్ళీ ఆవారాగా మారిపోతాడు. ఆ సమీరా ( అదా శర్మ) అనే ముస్లిం అమ్మాయి వెంట పడి ప్రేమించ మంటూంటాడు. ఓ ముఠా  ఓ ఫోటో పట్టుకుని ఒకణ్ణి గాలిస్తూంటారు. గాలిస్తున్నవాడు ఇంకా చావకుండా హాస్పిటల్లో ఉన్నాడని తెలుసుకుని  వచ్చేసి చంప బోతారు- ఆ బాధితుడు రవి. అప్పుడు  వరాలబాబు రివ్వున వచ్చేసి తనకి బద్ధ శత్రువైన రవిని కాపాడుకుని,  తను మాయమై పోయిన రవి కోసమే హైదరాబాద్ వచ్చాడు  తప్ప మరొకందుకు కాదని గొప్ప రహస్యం విప్పుతాడు.

        ఇంతకీ రవిని ఎవరు ఎందుకు చంపాలనుకుంటున్నారు, వాళ్ళే  సమీరా వెంట కూడా ఎందుకు పడుతున్నారూ అన్నవి తెలుసుకోవాలంటే ఓపిగ్గా ఈ సినిమా పూర్తిగా చూడగలగాలి.  

ఎలావుంది కథ
        ఏదో కొత్త పాయింటుని పట్టుకున్నామనుకుని దానికి పాత చింతకాయ కథనం చేస్తే చల్లారిన చద్దన్నం లా తయారయ్యింది. ఉన్నత చదువులు చదివిన వాళ్ళు చిరుద్యోగాలు చేస్తూ, అరకొరగా చదివిన వాళ్ళు మంచి జాబులు కొట్టేస్తున్నారని, దీన్ని సరిదిద్దేందుకు ఒక ఎన్నారై ఓ సంస్థని స్థాపిస్తే  దాన్ని అతడి భాగస్తులు కొట్టేయాలని ప్రయత్నిస్తే ఏం జరిగిందనేది ఈ కథ. 

        ఈ కథని చెప్పిన విధానం ముక్కు ఎక్కడుందంటే  చుట్టూ తిప్పి చూపించినట్టుంది. స్క్రీన్ ప్లే తో ఏదో పాండిత్యం ప్రదర్శించబోయారు. ఈ పాండిత్యం ఎలా వుందంటే తాము చేస్తున్న స్క్రీన్ ప్లే ‘ఎండ్ సస్పెన్స్’ అనే కమర్షియల్ సినిమాలకి పనికిరాని మాయదారి  కథనం కోవకి చెందుతుందని, ఈ  కథనంతో చేస్తే సినిమా గోవిందా అవుతుందని తెలియకపోవడం. గతంలో ఎన్నో సినిమాలు ఎండ్ సస్పెన్స్ తో వచ్చి అట్టర్ ఫ్లాపయినా అది పరిశీలించకపోవడం. అసలు స్క్రీన్ ప్లే శాస్త్రం తెలిస్తే కదా దాంతో ఏం చేయాలో తెలిసేది. చేయకూడనిది ఏం చేస్తే వెళ్లి ఫ్లాపు గుండంలో పడతామని తెలిసేది. కోట్లు పెట్టి సినిమా చేస్తున్నప్పుడు కథతో కనీసావగాహన ఇంకా ఈ కాలంలో కూడా లేకపోతే ఏమనుకోవాలి?

        మొదట్నించీ ఈ సినిమా చూస్తూ పోతూంటే, కథేమిటో మొదటి అరగంటలో తెలియదు, గంటం పావు తర్వాత ఇంటర్వెల్ లోనూ తెలీదు, పోనీ ఇంటర్వెల్ తర్వాత హీరో ఇంకో అరగంట చెప్పే పరమ బోరు పాత సినిమా ఏడ్పుల ఫ్లాష్ బ్యాక్ తర్వాత కూడా తెలీదు. అసలు కథేమిటి, హీరో ఏం సాధించాలను కుంటున్నాడూ అన్నవి- క్లయిమాక్స్ లో హీరోయినమ్మ మరో ఫ్లాష్ బ్యాక్ తో కరుణిస్తే  తప్ప తెలిసిరాదు  మనకి! 

        అంటే మొత్తం కథలో వున్న పాయింటుని, ఆ పాయింటుతో హీరో చేసే సంఘర్షణనీ  చివరాఖరి వరకూ చెప్పకుండా ‘ఎండ్ సస్పెన్స్’ గా పెట్టుకుని- ఇంత సినిమా చూపించారన్న మాట. ఇందుకే  ఇంత  సహన పరీక్ష,  ఇంత బోరు. అసలు కథేమిటో, పాత్రలు ఎందుకోసం అటూ ఇటూ తిరుగుతున్నాయో కూడా చెప్పకుండా,  అంతా మూసిపెట్టడం ఇదేదో బ్రహ్మాండమైన స్క్రీన్ ప్లే అని తమకి  తామే అనుకున్నట్టుంది సిల్లీగా !!!

        గాడ్ సేవ్ దెమ్.

ఎవరెలా చేశారు
        ఆది తన ఫిజిక్ కి, ఫేస్ కట్ కి సూటవని మాస్ పాత్రలంటే పడుతున్న మోజు ఈ సినిమాతో తీరిపోవాలి. ఇక బుద్ధిగా నీటైన పాత్రలతో నీతివంతమైన, నల్గురికి పనికొచ్చే సినిమాల మీద దృష్టి పెడితేనే కెరీర్ వుంటుంది. ఫైట్లు, డైలాగులు, పిచ్చి కామెడీ, ఓవరాక్షన్ లేకపోతే కొంపలేం అంటుకోవు. అద్దె గది కోసం వెళ్ళి ఆవిడతో అంత కంగాళీ గోలగోల గంతులతో ఆ ఓవరాక్షన్ ఏమిటి- దీన్నిఏ  మాస్ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారని థియేటర్లలో? ఎవడు పక్కనుంటే వాళ్ళని ఎడా పెడా లెంపకాయలు కొట్టడం కామెడియా? యాక్టింగ్ స్కూల్లో ఇలాటివి చెప్పి వుండరేమో? మందు కొట్టి, సిగరెట్లు తాగే చదువు సంధ్యల్లేని  ఆవారా పాత్రలు దాదాపు అందరు హీరోలూ చేస్తున్నవే- లవ్లీ రాకీ స్టార్ ఆది కూడా తనకి సూటవని ఈ మురికి అంటించుకోవాలా?  

        హీరోయిన్ అదా శర్మ బురఖాలోనే వుంటుంది. తీస్తే చూడలేకపోతాం. ఎందుకంటే ఆమె తన పాత్రేమిటో తనకే తెలీకుండా, అయోమయంగా అలా తిరుగుతూంటుంది. కాబట్టి బురఖాలో మొహం దాచుకుని ఉంటేనే బావుంటుంది. 

        సాంకేతికంగా కూడా చెప్పుకోవడానికేమీ లేదు. ఒక నిర్మాత చేతిలో ఆగిపోయిన ఈ సినిమాని ఆది తండ్రి సాయికుమార్ పూనుకుని పూర్తి చేయడం కొసమెరుపు.

చివరికేమిటి?
        దర్శకుడు మదన్ రాక రాక చాలా కాలం  తర్వాత వస్తే, టైటిల్ ని బట్టే ఈయనేదో తప్పు చేస్తున్నాడని తేలిపోయింది. ఆది కున్న మాస్ మేనియాని  తనూ పూసుకుని అన్యాయమై పోవడం తప్ప ఒరిగిందేమీ లేదు.  ఇప్పటికైనా ఈ మాస్ గరం తగ్గిపోతే ఇద్దరూ కలిసి ఇంకో మర్యాదకరమైన క్లాస్ సినిమా చేసుకోవడం మంచిది. మాస్ సినిమా అంటే అదొక మంకీ బిజినెస్సే- అందరికీ పనికొచ్చేది కాదు.


-సికిందర్

12, ఫిబ్రవరి 2016, శుక్రవారం

షార్ట్ రివ్యూ!






రచన - దర్శకత్వం : హను రాఘవపూడి
తారాగణం : నాని, మెహరీన్ కౌర్ పీర్జదా, సత్యం రాజేష్, పృథ్వీ, సంపత్ రాజ్, మహదేవన్, మురళీ శర్మ,
సంగీతం : విశాల్ చంద్ర శేఖర్, ఛాయాగ్రహణం :
బ్యానర్ : 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్, నిర్మాతలు : రాం ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర
విడుదల : 12 ఫిబ్రవరి, 2016
           ***



      సక్సెస్ ఫుల్ సినిమాలతో ముందుకు దూసుకుపోతున్న ‘నేచురల్ స్టార్’ నాని ఇంకో వెరైటీ పాత్రతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. సొంత విజువల్ సెన్స్ గల  ‘అందాల రాక్షసుడు’ దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో నాని నమ్మి చేసిన, టైటిల్ ప్రకారం రొమాంటిక్ కామెడీ లా కన్పిస్తున్నఈ సరికొత్త ప్రయత్నంలో నానితో బాటు దర్శకుడు, దీన్ని నిర్మించిన ప్రముఖ నిర్మాతలు ముగ్గురూ- ఏ అవగాహనతో దీన్ని రూపొందించి, ఏమేరకు సఫలమయ్యారనేది ఈ కింద చూద్దాం. 

కథ
    అనంతపురం జిల్లాలోని ఓ గ్రామంలో కృష్ణ (నాని) బోరు బావులు వేసే కార్మికుడుగా ఉంటాడు. అదే వూళ్ళో చిన్నప్పటి నుంచీ మహాలక్ష్మి మెహరీన్) ని ప్రేమిస్తూంటాడు. మహాలక్ష్మి కూడా అతన్ని ప్రేమిస్తుంది గానీ ఇది బయట పెట్టుకోకుండా పైకి పోట్లాడు కుంటున్నట్టు నటిస్తూంతారు. మహాలక్ష్మి ఫ్యాక్షన్ లీడర్ రాజన్న ( మహాదేవన్) కూతురు. ఆమెకో అన్న రామరాజు ( రామకృష్ణ) ఉంటాడు. ఇతడంటే కృష్ణకి చచ్చే భయం. సహజంగానే పిరికివాడయిన కృష్ణకి తను మహాలక్ష్మిని ప్రేమిస్తున్నట్టు రామరాజుకి చెప్పే ధైర్యం చాలదు. తనకి  పెళ్లి ప్రయత్నాలు చేయకుండా డిగ్రీ పదేపదే  ఫెయిలవుతూ వుంటుంది మహాలక్ష్మి.

    ఇలా వుండగా అప్పిరెడ్డి అనే  రాజన్న ప్రత్యర్ధి వర్గం గ్యాంగ్ రాజన్న  ఇంటిమీద పడి మారణహోమం సృష్టిస్తారు. రామరాజు  అన్న ఎసిపి (సంపత్ రాజ్) పిల్లలు ముగ్గురూ పండగ  సెలవులకి వచ్చి ఇక్కడే వుంటారు. వీళ్ళని ని కాపాడేందుకు తీసుకుని హైదరాబాద్ పారిపొమ్మంటాడు కృష్ణతో రామరాజు. ఈ పని చేస్తే చెల్లెల్నిచ్చి  పెళ్లి చేస్తానంటాడు. తన ప్రేమ సమస్యకి ఇలా పరిష్కారం లభించడంతో కృష్ణ ఆ ముగ్గురు పిల్లల్ని తీసుకుని హైదరాబాద్ దారి పడతాడు. అదే సమయంలో హైదరాబాద్ వచ్చిన దుబాయ్ డాన్  డేవిడ్ భాయ్ ( మురళీ శర్మ) మనుషులు ఎసిపి మీద పగబట్టి అతడి పిల్లల్ని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తూ కృష్ణ వెంట పడతారు. ఈ గ్యాంగ్ బారి నుంచి కృష్ణ పిల్లల్ని కాపాడి ఎలా మహాలక్ష్మి తో పెళ్ళికి రూటు క్లియర్ చేసుకున్నాడన్నది ఇక్కడ్నించీ సాగే మిగతా కథ.

ఎవరెలా చేశారు
    నాని ఇందులో ఫక్తు పాసివ్ పాత్ర పోషించాడు. పిరికితనం అనే లక్షణంతో పాసివ్ గానే చివరంటా కొనసాగుతాడు. ఇక్కడ రెండున్నాయి : కథ మొత్తమ్మీద హీరో పాసివ్ పాత్ర గా వుంటే సినిమా ఫ్లాప్ అవడం ఖాయం. కథలో సగం మేరకు పాసివ్ గా వుండి, అప్పుడు సమస్యలో ఇరుక్కున్నాక  లక్ష్యం ఏర్పడినప్పుడు, యాక్టివ్ గా మారితే ఫ్లాపయ్యే ముప్పు తప్పుతుంది. నాని పాత్ర కి పాసివ్ నెస్ అనేది పిరికితనం అనే క్యారక్టరైజేషన్ వల్ల ఏర్పడడంతో, ఫస్టాఫ్ వరకూ దీన్ని కొనసాగించి వుండాలి. ఆపైన యాక్టివ్ గా మారిపోతే పాత్రతో బాటు కథనం కూడా ఎలివేట్ అయ్యే అవకాశం వుండేది.

       పిల్లల కోసం ఎవరు ఎందుకు వెంటబడుతున్నారనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేయకుండా, విలన్లు దాడి  చేసినప్పుడల్లా ఎదురు దాడి జరిపి పారిపోవడం యాక్టివ్ హీరోయిజం అనిపించుకోదు. అది రియాక్టివ్ హీరోయిజం  అవుతుంది. దాడి చేస్తున్న దెవరు, అసలు తనెలాటి సమస్యలో ఇరుక్కున్నాడూ తెలుసుకునే ప్రయత్నం చేసివుంటే పక్కా యాక్టివ్ క్యారక్టర్ అయ్యేవాడు.  లేదూ పిరికి వాడుగా పాసివ్ గానే  కొనసాగాలని నిర్ణయిం చుకునివుంటే,  ఆ పిరికితనం అనే క్యారక్టరైజేషన్ ని క్రమం తప్పకుండా  ఎలివేట్ చేస్తూ, ఆ చేష్టలతో విలన్లతో కామిక్ సీన్స్ పండించి వుండాలి. అప్పుడు సినిమా ఎంటర్ టైన్మెంట్ వేల్యూ పెరిగేది. క్యారక్టరైజేషన్ ని పక్కన బెట్టడంతో, హీరో- విలన్లూ- పోలీసులూ అందరూ వయొలెంట్ యాక్షన్ కిందికి మార్చేశారు  మొత్తం సినిమాని. కానీ స్వాభావికంగా ఈ కథ పిల్లల పాత్రలతో వయొలెంట్ యాక్షన్ జానర్ కాదు. సాఫ్ట్ యాక్షన్ కామెడీగా సరదాసరదాగా ఉండాల్సిన జానర్. ఈ గల్లంతయిన జానర్ లో పాత్ర చిత్రణ విఫలమైన నాని ఇబ్బందికరంగా కన్పిస్తాడు. నటన వరకూ తను ఓకే, కానీ పాత్రతో కలిపి చూస్తే ఇబ్బందికరమే. 

    ఇక హీరోయిన్ మెహరీన్ పాత్ర  సోసోగా సాగేదే. టార్గెట్ పిల్లలే అయినప్పుడు సింహభాగం సీన్లు హీరోకి ఆ పిల్లలతోనే సరిపోయాయి. ఇతర  పాత్రలన్నీ ఫ్యాక్షన్, మాఫియా, పోలీసు పాత్రలు కావడం- వీటిలో కొన్నయినా యాక్షన్ కామెడీకి తగ్గట్టు ఫన్నీగా లేకపోవడంతో,  సినిమా రన్ హార్డ్ కోర్ యాక్షన్ గానే సాగుతుంది. దర్శకుడి దృష్టిలో కామెడీ అంటే మాటి మాటికీ లెంపకాయలు కొట్టుకోవడమే అన్నట్టుంది. ఒక దశ కొచ్చేసరికి ఈ లెంపకయాల మోతలతో కామెడీ భరించలేని స్థితి కొచ్చింది. కామెడీకి కూడా వయొలెన్సే ఆధారమయ్యిందని దర్శకుడు గమనించినట్టు లేదు.

    దర్శకుడికి మంచి విజువల్ సెన్స్ వుంది. మేకింగ్ పరంగా తనదైన ముద్ర కూడా వుంది. ఈ క్రియేటివిటీని  జానర్ మర్యాదని కాపాడుతూ పాత్రలకి, కథా కథనాలకి కూడా వర్తింప జేసివుంటే ఇంకా చాలా బావుండేది.

    తెలిసో తెలీకో వయొలెంట్ గా మారిపోయిన మూవీకి నేపధ్య సంగీతం కూడా అంతే  హార్డ్ కోర్ గా వుంది. పాటలు ఓ మాదిరిగా వుంటే, కెమెరా వర్క్ ఒక్కటే దాని పని అది ప్రతిభావంతంగా చేసుకుపోయింది, దర్శకుడి విజువల్ సెన్స్ పుణ్యాన.

చివరికేమిటి?
    స్వామి రారా, భలేమంచిరోజు, ఎక్స్ ప్రెస్ రాజా ల కోవలో ఇది కూడా మరో రోడ్ మూవీ తప్ప మరేం కాదు. కాకపోతే పై మూడింటిలో వున్న ఫన్ ని ఇక్కడ మిస్ అయింది. గత సంవత్సరం బేషరతుగా హిట్టయిన సినిమాల్ని గమనిస్తే, అవన్నీ జానర్ మర్యాదని కలుషితం చేయకుండా నిగ్రహం పాటించడం వల్లే హిట్టయ్యాయని తెలుస్తుంది.  అన్ కాన్షస్ గానే ప్రేక్షకులు జానర్ మర్యాద వుంటే సినిమాల్ని అక్కున జేర్చుకుంటున్నారు. దర్శకుడు హను రాఘవ పూడి భవిష్యత్తులో ఇది గుర్తు పెట్టుకోవడం మంచిదేమో!


-సికిందర్   
filmyfreak.com

9, ఫిబ్రవరి 2016, మంగళవారం

రైటర్స్ కార్నర్











స్క్రీన్ రైటింగ్ గురు మైకేల్ హాగ్ స్వయంగా డెవలప్ చేసిన బేసిక్ ప్లాట్ స్ట్రక్చర్ గురించి చాలాచోట్ల చాలాసార్లు చెప్పి వున్నారు. ఒక పుస్తకమే దీని మీద రాశారు. తన థియరీకి  సిడ్ ఫీల్డే  ఆధారమని  ఈయన చెబుతున్న స్ట్రక్చర్ ఎలా వుంటుంది... సమాంతర సినిమాలని వదిలేస్తే, ప్రధాన స్రవంతి సినిమాలకి స్ట్రక్చర్ అనేది ఎక్కడైనా మారుతుందా? ప్రామాణికమైన త్రీ యాక్ట్ ( మూడంకాల) స్ట్రక్చర్ కాకుండా ఇంకేముంటుంది? అదెలా వుంటుంది? దీన్నెలా వివరిస్తారు మైకేల్ హాగ్? ఇది తెలుసుకోవడానికే డెన్నిస్ మాగీ ఫాలన్ కి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ పాఠంలోకి వెళ్తున్నాం...


మీరు రాసిన పుస్తకం The Hero’s Two Journeys లో మీసొంత బేసిక్ ప్లాట్ స్ట్రక్చర్ ని డెవలప్ చేశారు. ఎందుకు?

స్ట్రక్చర్ ని  సరళీకృతం చేయడానికే. స్ట్రక్చర్ అంటే అదేదో సంకిష్ట పదార్ధమనే  అభిప్రాయం వుంది. ఇది నిజం కాదు. స్ట్రక్చర్ అంటే సంఘటనల సీక్వెన్స్ మాత్రమే. కథలో ఏం జరుగుతుంది, అదెప్పుడు జరుగుతుందీ అని చెప్పేదే స్ట్రక్చర్. విజయవంతమైన కథల్నీ, స్క్రీన్ ప్లేల్నీచూస్తే పటిష్టంగా ఆరుభాగాలుగా విడగొట్టి వుంటాయి. ఈ ఆరుభాగాలూ  ఐదు టర్నింగ్ పాయింట్స్ వల్ల ఏర్పడతాయి.

దీన్ని వివరిస్తారా?

మొదటి భాగాన్ని ‘సెటప్’ అంటాన్నేను. ఇది కథలో పది శాతం వుంటుంది. ఇందులో హీరోని పరిచయం చేస్తాం. అతడి రోజువారీ జీవితాన్నీ చూపిస్తాం. మున్ముందు ఈ జీవితం ఒడిదుడుకుల పాలవుతుంది  గాబట్టి ఈ సెటప్ లో దీన్నెలా చిత్రిస్తామన్నది  కీలకం అవుతుంది. ఈ పది శాతంతో మొదటి భాగం ముగిసి మొదటి టర్నింగ్ పాయింట్ వస్తుంది. ఇక్కడ్నించీ  రెండో భాగం లో హీరోకి ఓ పరిస్థితి ఎదురవుతుంది, ఇంతకి  ముందు సెటప్ లో ఎదురవని అసాధారణ పరిస్థితి. దీన్ని ‘న్యూ సిట్యుయేషన్’ అంటాను. ఈ పరిస్థితిలోంచి తదనుగుణమైన కొన్ని సంఘటనలు పుట్టి,  ఇంకో పదిహేను శాతం కథ పూర్తవగానే, అంటే ఇప్పటి వరకూ ఇరవై అయిదు శాతానికి కథ చేరుకోగానే  ఆ ‘న్యూ సిట్యుయేషన్’ ఇంకా  క్లిష్ట స్థితి కిందికి  మారుతుంది. ఇది రెండవ టర్నింగ్ పాయింట్.

మీరంటున్న ఈ రెండు  దశలు సింపుల్ గా ఫస్ట్ యాక్టే కాదంటారా?

అవును. ఇంకోలా చెప్పాలంటే, ఫస్ట్ యాక్ట్ కథంతా ఈ ఇరవై ఐదు శాతానికి  చేరుకోగానే ఈ అత్యంత క్లిష్ట పరిస్థితి అనే రెండో టర్నింగ్ పాయింటునే టచ్ చేస్తుంది. ఫస్ట్ యాక్ట్ బిజినెస్ అంతా ఈ సెకండ్ టర్నింగ్ పాయింటుకి రన్నప్ లాంటిదే నన్నమాట. దీనికి ‘ఛేంజ్ ఆఫ్ ప్లాన్స్’  అని పేరుపెట్టాను. కొన్ని సార్లు ఈ పాయింటుని గుర్తించడం కష్టమే అవుతుంది. ఫస్ట్ యాక్ట్ నుంచి త్వరగా బయటపడమని రైటర్స్ మీద వొత్తిడి తేవడం వల్ల ఈ రెండో టర్నింగ్ పాయింటు వుండీ లేనట్టు ఉండిపోతుంది. కథని సెటప్ చేసే మొదటి పది పేజీలూ   చాలా ముఖ్యమైనవి. అయితే హీరోకి గోల్ అనేది రెండో టర్నింగ్ పాయింటు దగ్గరే ఏర్పడుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చరల్ సూత్రం. హీరో గోల్ ఏదైనప్పటికీ ఈ రెండో టర్నింగ్ పాయింటు దగ్గర్నుంచే మొదలవ్వాలి.

అర్ధమయింది. ఇప్పడు కథలో మూడో భాగం గురించి చెప్పండి.

రెండో టర్నింగ్ పాయింటు నుంచీ మొదలయ్యే కథలో మూడో భాగాన్ని ‘ప్రోగ్రెస్’ అంటాన్నేను. ఇందులో హీరో తన గోల్ సాధించడానికి ప్రయత్నాలు మొదలెడతాడు. ఒక ఆలోచన ప్రకారం సాగిపోతూంటాడు...ఆ ఆలోచన పనిచేస్తున్నట్టే వుంటుంది... అప్పుడు మూడో టర్నింగ్ పాయింట్ అనే  మిడ్ పాయింట్ వచ్చేస్తుంది. దీన్ని ‘పాయింటాఫ్  నో  రిటర్న్’ అంటాను. ఇక్కడ హీరో తన ఆలోచనని కార్యరూపంలో, లేదా మాటల రూపంలో తిరుగులేని విధంగా బలంగా ప్రకటిస్తాడు. దీంతో నాల్గవ భాగంలోకి ప్రవేశిస్తాం. దీన్ని ‘కాంప్లికేషన్స్ అండ్ హయ్యర్ స్టేక్స్’ అంటాన్నేను. ఆ నాల్గవ భాగంలో హీరో చుట్టూ వున్న ప్రపంచం మూసుకుపోతుంది. అవాంతరాలు ఒకదాని తర్వాత ఒకటి పెరుగుతూ పోతాయి...


అప్పుడు నాల్గవ టర్నింగ్ పాయింటు వస్తుంది. దీన్ని ‘మేజర్ సెట్ బ్యాక్’ అంటాను. దీంతో సెకండ్ యాక్ట్ ముగుస్తుంది. యాక్ట్ టూ అనేది స్క్రీన్ ప్లే  మిడిల్ లో వుండే యాభై శాతం కథ. ఇది ¼ – ½ – ¼  అనే సిడ్ ఫీల్డ్ నిర్వచించిన త్రీ యాక్ట్ స్ట్రక్చరల్ మోడల్. ఆయనకి  నేను చాలా రుణపడివుంటాను. ఆయన్ని ఎంత మెచ్చుకున్నా తనివితీరదు. నా స్ట్రక్చరల్ మోడల్ కి ఆయన్నుంచే స్ఫూర్తి పొందాను. ఇక సెకండ్ యాక్ట్ ముగింపులో హీరోకి జరగరానిది జరగాలి. ఇక అతడికి దారులన్నీ మూసుకుపోవాలి. ఇది ఐదవ భాగానికి దారి తీస్తుంది. దీన్ని ‘ఫైనల్ పుష్’ అన్నాను. ఇక్కడ హీరో నెమ్మదిగా తేరుకుని అంతిమ పోరాటం ప్రారంభిస్తాడు. ఇది ఐదో టర్నింగ్ పాయింటు. దీంతో కథ పూర్తవుతుంది.   

ప్లాట్ స్ట్రక్చర్ కి మీరు పర్సెంటేజీల గురించి చాలా మాట్లాడారు. పరిచయానికి పదిశాతం, మొదటి  టర్నింగ్ పాయింటుకి ఇరవై ఐదు శాతం. మిడిల్ మొత్తం యాభై శాతం, డెబ్బై ఐదో శాతానికి సెట్ బ్యాక్...గణిత శాస్త్ర సమీకరణల్లాగే వున్నాయివీ...

దీనికి చాలా విమర్శలే ఎదుర్కొన్నాన్లెండి. ప్రతీ టర్నింగ్ పాయింటూ కథ  ఫలానా ఇంత శాతం పూర్వగానే రావాలని  నేను చెప్పడం వ్యతిరేకతనే సంపాదించుకుంది. కానీ నేను చెబుతున్న ఆరు భాగాల స్ట్రక్చరల్ మోడల్ అదేదో కచ్చితమైన కొలతలతో కూడుకున్నదేం కాదు. ఒక గైడ్ మాత్రమే. విజయవంతమైన ఒక వెయ్యి సినిమాల స్ట్రక్చర్ లోంచి వచ్చిందే ఇది. కచ్చితంగా పర్సెంటేజీలు పాటించమనడం లేదు. స్క్రీన్ ప్లే ఆకట్టుకోవాలంటే ఈ పర్సెంటేజీలకి దగ్గరగా ఉండమనే నేను చెప్తున్నది...

అయితే రైటర్స్ ఈ పర్సెంటేజీ పాయింట్లు దృష్టిలో ఉంచుకుని స్క్రీన్ ప్లేలు చేసుకోవాలంటారు?

        ఓ  హెచ్చరిక చేస్తాను. మొదటి రఫ్, రెండో రఫ్ రాస్తున్నప్పుడు అస్సలు పర్సెంటేజీ లని పట్టించుకోవద్దు. కొందరు రచయితల్ని చూశాను- పర్సెంటేజీలు పెట్టుకుని కథలు అల్లుతూంటారు. దాంతో క్రియేటివిటీ దెబ్బతిని పోతోందని గమనించరు. కథని సృష్టించకుండానే ఎడిట్ చేయలేరు కదా. అందుకని స్వేచ్చగా, ఏ సంకెళ్ళూ లేకుండా, విస్తారంగా కథని సృష్టించుకున్న తర్వాత, పర్సెంటేజీల ప్రకారం టర్నింగ్  పాయింట్సు వచ్చేలా కథని ఎడిట్ చేసుకోవడం చేయాలి.

ఆరుభాగాలుగా విడగొట్టి  మీరు స్ట్రక్చర్ అంటే  భయాన్ని పోగొట్టారు, థాంక్స్.  

 

(నోట్ : పై ఆరుభాగాల మోడల్ నే ఆరు బ్లాకుల మోడల్ గా ఎప్పటినుంచో చెప్పుకుని మనం చేస్తున్నదే. యాక్ట్స్ అనీ, ప్లాట్ పాయింట్స్ అనీ పండిత  భాష మాటాడి వ్యతిరేకత మూటగట్టుకోకుండా, ఎదుటి వాళ్లతో ఆమ్ ఆద్మీలా కలిసిపోయి పనిచేసుకోవాలంటే అర్ధమయ్యే ‘బ్లాకుల’ భాష మాట్లాడ్డమే మేలు.  త్రీ యాక్ట్స్ లో బిగినింగ్ వరకూ ఒక బ్లాకుగా, మిడిల్ ఇంటర్వెల్ వరకూ రెండుగా చేసి మరో రెండు బ్లాకులుగా, మిడిల్ ఇంటర్వెల్ తర్వాత మరో రెండు బ్లాకులుగా, ఎండ్ ఇంకో బ్లాకుగా కథని విభజించి మొత్తం ఆరు బ్లాకులుగా  చేసి కథనం చేస్తూంటే, ఇంత సింపులా అని  అందరూ ఆనందపడుతూ అంగీకరిస్తారు. ఇలా బ్లాకుల వారీగా కథని గుర్తుంచుకుని, చర్చలో కూడా రెండో బ్లాకులో ఇలా చేద్దాం, ఐదవ బ్లాకులో ఇలా చేద్దాం అని వాళ్ళు చెబుతూంటే వినసొంపుగా వుంటుంది. మైకేల్ హాగ్ మోడల్ తెలియకముందే మనమిక్కడ అమల్లో పెట్టేశాం. కాకపోతే మైకేల్ హాగ్ ఎంత సింప్లీ ఫై చేసినా ఆ సాంకేతిక పదాలు, పర్సెంటేజీలూ  ఇక్కడ వాడలేం, అవన్నీ మనసులో పెట్టుకుని ఆ ప్రకారమే కథ అల్లుకోవచ్చు   -సికిందర్)

 

 


.
.

6, ఫిబ్రవరి 2016, శనివారం

వీకెండ్ కామెంట్




       ప్పుడూ దక్షిణ సినిమాల్ని రీమేక్ చేయాలన్నా, ఒకప్పుడు దక్షిణ హీరోయిన్లకి పెద్ద పీట వేయాలన్నా బాలీవుడ్ చూపే/ చూపిన  ఉత్సాహం దక్షిణ హీరోల్ని ప్రోత్సహించడం పట్ల ఏనాడూ చూపలేదు. అయినా అడపాదడపా తెలుగు, తమిళ, మళయాళ స్టార్లు హిందీ సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తూంటారు. ఒకప్పుడు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, కమల్ హాసన్, రజనీకాంత్, మాధవన్, మమ్ముట్టీ, మోహన్ లాల్ మొదలైన స్టార్లు హిందీ సినిమాల్లో నటించారు. కమల్ హాసన్ తప్పితే మిగిలిన వాళ్ళు ఒకటి నుంచి మూడు సినిమాల మధ్యే హిందీ సినిమాల్లో నటించి మళ్ళీ అటువైపు చూడలేదు. 

          స్పష్టంగా ద్రవిడ- ఆర్యన్ తేడాల వల్ల  అక్కడి  నిర్మాతలు కాకపోయినా హిందీ ప్రేక్షకులు  సౌత్ స్టార్స్ కి  అలవాటు పడలేకపోయారు అప్పట్లో. కానీ ఉత్తరాది హీరోలు  కేవలం హిందీ రాష్ట్రాలకే పరిమిత మైలేరు. సిక్కిం వంటి ఈశాన్య రాష్రాల నుంచి వచ్చికూడా  పాపులర్ అయ్యారు. పాకిస్తాన్ నుంచి కూడా వచ్చి హీరోలుగా, హీరోయిన్లుగా నటిస్తున్నారు. హాలీవుడ్ లో, హాలీవుడ్ సినిమాలు చూసే ప్రేక్షకుల్లో ఎలాటి తరతమబేధాల్లేవు. రంగు తేడాల్లేవు.  రంగు లేకపోయినా అక్కడ గొప్ప స్టార్స్ అయిన నటులున్నారు. ఆస్కార్ అవార్డ్స్ కూడా అందుకున్నారు. ఆసియా దేశాలనుంచి వచ్చి కూడా అక్కడ స్టార్లయ్యారు.


        దక్షిణ హీరోల్ని హిందీ ప్రేక్షకులు ఇంకా మద్రాసీలు అనే తేలిక భావంతో చూడడం, అందుకు తగ్గట్టు మన స్టార్స్  హిందీ మాట్లాడలేకపోవడం, డబ్బింగ్ వాయిసులతో నటించడం వంటి లోపాలవల్ల కూడా  హిందీ ప్రేక్షకులకి  అప్పట్లో దగ్గర కాలేకపోయారు. తెలుగు,  తమిళ హీరోయిన్లకి ఈ బాధ ఎప్పుడూ లేదు. 1960 ల  నుంచీ పద్మిని, వైజయంతీ మాలా, హేమమాలిని, రేఖ, శ్రీదేవి, జయప్రద వంటి తారామణులు కొన్నేళ్ళపాటు బాలీవుడ్ ని ఏలుకున్నారు. హిందీ ప్రేక్షకుల కలల రాణులయ్యారు.
     వీళ్ళలో కొందరికి భాష రాకపోయినా పట్టించుకోలేదు హిందీ ప్రేక్షకులు. ఆనాడు పక్కా ఆంధ్ర ప్రదేశ్ కి, తమిళనాడుకీ చెందిన తెలుగమ్మాయిలు, తమిళ అమ్మాయిలే పైన చెప్పుకున్న తారల రూపంలో బాలీవుడ్ లో వెలిగి పోయారు. ఇప్పుడలాటి తెలుగు తమిళ అమ్మాయిలూ తెలుగు తమిళ రంగాల్లో టాప్ హీరోయిన్లుగా ఎక్కువ లేరు. అనూష్కా, నయనతార, త్రిష, లాంటి కొందరు తప్ప. వీళ్ళల్లో త్రిష, అసిన్ లు బాలీవుడ్ వెళ్లి శ్రీదేవి లాగానో, జయప్రద లాగానో నిలదోక్కుకోలేకపోవడం విచిత్రం.  అంటే శ్రీదేవులు, జయప్రదలు ఇక అక్కరలేదన్నట్టు హిందీ ప్రేక్షకుల అభిరుచి మారిపోయిందా? అలాగేం  అన్పించదు. ఇక్కడి తెలుగమ్మాయిలే కాదు,  ఇక్కడి కొచ్చి స్టార్లయిన  పక్కా హిందీ  అమ్మాయిలు  తమన్నా, కాజల్, హన్సిక, ఇలియానా, శ్రియ, జెనీలియా వంటి ఎందరో  హిందీ అమ్మాయిలూ హిందీలోకి వెళ్లి వెనక్కొచ్చారు. మొత్తంగా దక్షిణం నుంచి ఏ హీరోయిన్ వెళ్ళినా హిందీలో స్థానం లేకుండా పోయింది.

దీనికంతటికీ ఒకటే కారణం కన్పిస్తుంది... గత కొన్నేళ్లుగా హిందీ ఛానెళ్ళలో  తెలుగు తమిళ సినిమాల హిందీ డబ్బింగులు విపరీతంగా ప్రసారమవుతున్నాయి. మహేష్ బాబు, సూర్య వంటి టాప్ స్టార్స్ సినిమాలకి కూడా ఈ హిందీ డబ్బింగుల నుంచి మినహాయింపు లేదు. కేవలం ఆయా  ఛానెల్స్  తమ స్లాట్స్ ని భర్తీ చేసుకోవడం కోసం తెలుగు తమిళ సినిమాలు కొనుక్కుని హిందీలోకి విపరీతంగా డబ్బింగ్ చేసుకుంటున్నారు. ఈ డబ్బింగుల్లో పైన చెప్పుకున్న హీరోయిన్లు త్రిషనయనతార, తమన్నా, కాజల్, హన్సిక, ఇలియానా, శ్రియ, జెనీలియా లాంటి అందరూ కన్పిస్తారు. 


ఇలా టీవీల్లో డబ్బింగుల్లో దర్శనమిచ్చేసరికి  వీళ్ళు విలువ కోల్పోతున్నారు. ఇక ఫ్రెష్ గా హిందీ సినిమాల్లోకి వెళ్లి  నటిస్తే హిందీ ప్రేక్షకులు డబ్బింగుల్లో చూసేసిన తేలిక భావంతో తీసుకుంటున్నారు. ఇదే పరిస్థతి హిందీ డబ్బింగుల్లో కన్పించే  నేటి తెలుగు తమిళ స్టార్స్ ది కూడా. ఒక విధంగా ఇక్కడ టాప్ రేంజిలో ఉంటున్న హీరో హీరోయిన్లే హిందీ డబ్బింగుల్లో కనిపించేసరికి హిందీ ప్రేక్షకుల దృష్టిలో బిగ్రేడ్ కి పడిపోతున్నారు. ఒకప్పుడు మద్రాసీ లని దూరం పెట్టేవాళ్ళు, ఇప్పుడు  బిగ్రేడ్ అనీ, డబ్బింగ్ హీరో హీరోయిన్లనీ  తప్పుకుంటున్నారు.

ఇలాంటప్పుడు రాం చరణ్ వెళ్ళినా, దగ్గుబాటి  రానా వెళ్ళినా, ఇంకా తమిళం నుంచి కొత్తగా సిద్ధార్థ్ వెళ్ళాలనుకుంటున్నా, ఇప్పుడు హిందీలో ఒరిగేదేం వుండదు. ఎన్ని ఘజనీ దండ యాత్రలు చేసినా బిగ్రేడ్, ‘డబ్బింగ్ హీరోలుఅనే ముద్ర ఇప్పట్లో చెరిగిపోయేది కాదు. ఇదంతా తెలిసే కాబోలు, ఇటీవల మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్,  మళ్ళీ హిందీలోకి వెళ్లి నేను కొత్తగా నిరూపించుకునేది ఏముంటుందన్నారు.

ముందుగా దక్షిణ స్టార్లు హిందీ టీవీ డబ్బింగుల్ని నిషేధింప జేసుకుని, కనీసం ఒక తరం ప్రేక్షకులు గడిచిపోయాక, అప్పుడు హిందీ కెళ్ళి ప్రయత్నిస్తే, కొత్తతరం ప్రేక్షకుల ముందు ఫ్రెష్ గా కన్పించవచ్చు.


-సికిందర్








5, ఫిబ్రవరి 2016, శుక్రవారం

షార్ట్ రివ్యూ







స్టోరీ డెవలప్ మెంట్, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం : భేమనేని శ్రీనివాసరావు

తారాగణం : బెల్లంకొండ సురేష్, సొనారికా భడోరియా, ప్రకాష్ రాజ్, రావురమేష్, ఝాన్సీ, పృథ్వీ, పోసానీ, అలీ, శ్రీనివాసరెడ్డి, షకలక శంకర్, సత్య, మధు తదితరులు
కథ : ఎస్ ఆర్ ప్రభాకరన్, సంగీతం : శ్రీ వసంత్, ఛాయాగ్రహణం : విజయ్ ఉలగనాథ్
బ్యానర్ : గుడ్ విల్ సినిమా, నిర్మాతలు : భీమనేని సునీత, రోషితా సాయి.
విడుదల : 5 ఫిబ్రవరి, 2016
***
      ర్శకుడు భీమనేని శ్రీనివాసరావు మళ్ళీ ఓ రీమేకుతో ఎప్పుడొస్తారా అని ఎదురుచూసే ప్రేక్షకులకి, నాల్గేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత  తమిళ రీమేకుతో వచ్చేశారు. బెల్లంకొండ శ్రీనివాస్ తో  తమిళ హిట్ ‘సుందరపాండియన్’ పాత్ర చేయిస్తూ అతడి సక్సెస్ గ్రాఫ్  ని పెంచే బాధ్యత తీసుకున్నారు. టైటిల్  కూడా  స్పీడున్న కమర్షియల్ - మాస్ టైటిల్ పెట్టి  వీలైనంత మసాలా సినిమా తీద్దామనుకున్నారు. కానీ తీశారా? శ్రీనివాస్ కి న్యాయంచేశారా? ఎంతో గ్యాప్ ని ఎదుర్కొన్న శ్రీనివాస్ నిజంగానే ఇప్పుడు స్పీడున్నోడు అన్పించుకుని  ముందుకు దూసుకుపోతాడా? ఈ సందేహాలు తీర్చుకోవడానికి అసలు సినిమా ఎలా వుందో చూద్దాం.
కథ
        రాయలసీమ గ్రామం. అక్కడ నాయడు ( ప్రకాష్ రాజ్ ) అనే పెద్దమనిషి. ఆ పెద్దమనిషికి శోభన్ ( బెల్లంకొండ శ్రీనివాస్) అనే కొడుకు. వెంకటా పురం అనే ఇంకో గ్రామం. ఇక్కడ రామచంద్రప్ప ( రావురమేష్) అనే ఇంకో పెద్దమనిషికి కాలేజీలో చదివే వాసంతి ( సొనారికా భడోరియా) అనే కూతురు. రెండూళ్ళ మధ్య ఒక బస్సు. దాని పేరు ‘ప్రేమపావురం’. ఈ బస్సులో కాలేజీ కెళ్ళే అమ్మాయిలూ అబ్బాయిల ప్రేమాయణాలు. వెంకటాపురం గ్రామ  నీతి  ప్రకారం తమ అమ్మాయిల వెంట ఎవడైనా పడితే వాణ్ణి క్వారీలో ఖతం చేస్తారు. అలా ఖతమవబోతున్న వాణ్ణి శోభన్ కాపాడుతాడు. వాడు శోభన్ ఫ్రెండ్. ఫ్రెండ్స్ అన్నా ఫ్రెండ్షిప్ అన్నా  శోభన్ కి ప్రాణం. వాళ్ళ కోసం ఏమైనా చేస్తాడు. ఇంకో ఫ్రెండ్ ఉంటాడు మధు అని. ఇతను సాక్షాత్తూ వాసంతినే  ఏకపక్షంగా ప్రేమిస్తూంటాడు. ఇందులో హెల్ప్ చేయమని శోభన్ ని కోరతాడు. ప్రేమపావురాలే వాహనం గా వాసంతి మధుతో ప్రేమలో పడేట్టు ప్రయత్నాలు ప్రారంభిస్తాడు శోభన్. కానీ తనతోనే  వాసంతి ప్రేమలో పడుతుంది. ఎందుకంటే గతంలో శోభన్ ఈమె వెంట పడితే ఇష్టంలేక ఒప్పుకోలేదు. ఆమెని వదిలేశాడు. ఇప్పుడు ఇష్టపడుతోంది. కాబట్టి ఫ్రెండ్ మధుని తప్పించేసి, వాసంతితో తన లవ్ ని సెట్ చేసుకుంటాడు శోభన్. ఈ ప్రేమికులిద్దర్నీ వాసంతి తండ్రి విడదీసి, జగన్ అనే వాడితో ఆమె పెళ్లి ప్రయత్నాలు ప్రారంభిస్తాడు.

        ఇలావుండగా, పాత  రోమియో ఒకడు (సత్య) మళ్ళీ వాసంతి వెంట పడితే, ఆ ఘర్షణలో ప్రమాదవశాత్తూ శోభన్ చేతిలో వాడు చనిపోతాడు. శోభన్ జైలుకెళ్ళి బెయిల్ మీద వస్తాడు. తండ్రి జోక్యంచేసుకుని వాసంతి తండ్రిని  రాజీ చేయించడంతో, జగన్ తో పెళ్లి రద్దయి శోభన్ తో కుదుర్తుంది. జగన్ శోభన్ మీద పగబడ్తాడు. ఇదీ విషయం. ఇప్పుడేమైందో తెలుసుకోవాలంటే మిగతా సినిమా చూడాలి.

ఎలావుంది కథ
       
విషయపరంగా, చిత్రీకరణ పరంగా యూత్ అప్పీల్ తో మాత్రం లేదు. ఈ కథ చాలా పాతదైన కాలం చెల్లిన కథైనా, తమిళ ఒరిజినల్లో, దాని కన్నడ రీమేక్ లో కూడా కొత్త దర్శకుల రియలిస్టిక్  అప్రోచ్ వల్ల నూతనత్వం వచ్చింది. తెలుగులో ఇదే కొరవడి పాత మూసఫార్ములా కిందికి మారిపోయిది. పైగా ఫ్రెండ్ షిప్ గురించి కథ అన్నప్పుడు, ముందుగా ఆ ఫ్రెండ్ షిప్ ని మందుకొట్టి, సిగరెట్లు తాగే ఆవారాతనంతో గాక, విశ్వాసం- విధేయతా అనే సెంటిమెంట్లతో బలంగా చిత్రించాల్సి వుంటుంది. ఏదైతే చివర్లో నెగెటివ్ అవుతుందో దాన్ని ముందుగా పాజిటివ్ గా బలంగా చూపిస్తే ఎమోషనల్ కనెక్ట్ వుంటుంది. దీన్ని వదిలేసి పైపైన కథనీ, పాత్రల్నీ చూపించుకుంటూ పోయారు. ఒరిజినల్ సక్సెస్ కి ఏదైతే ప్రాణ ధారగా వుందో,  దాన్నే నిర్లక్ష్యం చేసి స్టోరీ డెవలప్ మెంట్ అని దర్శకుడు భావిస్తే అంతకంటే  పప్పులో కాలేయడం వుండదు.

ఎవరెలా చేశారు
       
తొలి సినిమా ‘అల్లుడు శ్రీను’ లోనే ఓకే అనుకున్నాం బెల్లంకొండ శ్రీనివాస్ ని. కాబట్టి ఇక్కడా ఆ స్థాయిలోనే  డాన్సులూ ఫైట్లూ మాత్రం చేశాడు. కామెడీ,  కాస్త బలమైన  ఎమోషన్స్ అనేటప్పటికి మాత్రం ఈసారి విఫలమయ్యాడు. ప్రేమ సన్నివేశాలూ డిటో. పాత్రని ఉండాల్సినంత బలంగా తీర్చిదిద్దడంలో దర్శకుడు వెనుకబడిపోయిన పర్యవసానమిది. పాత్ర ఎంత వుంటే నటన అంతే ఉంటుందికదా. పైగా అప్ కమింగ్ హీరో అన్నాక, పాత్రచిత్రణే ఏకైక లక్ష్యంగా దర్శకుడుండాలి. కనీసం టైటిల్ కైనా న్యాయం చేయాలికదా? ఈ పాత్రలో ఏం స్పీడుంది? సెకండాఫ్ లో నైతే  పాసివ్ సుడిగుండంలో పడి చాదస్తంగా పరమ స్లోగా మారిపోయింది. హీరోలు తాము పోషిస్తున్నది పాసివ్ పాత్రలని అర్ధంజేసుకోలేక ఘోరంగా దెబ్బ తినిపోతున్నారు. 

        డిటో హీరోయిన్ సోనారికా. ఒక సినిమాతో వెళ్ళిపోయే హీరోయిన్ల పాత్రలూ వాటిలో హీరోలకంటే సోసోగానే వుంటాయి. దీన్నే ఇక్కడా వర్తింప జేశారు. ఇక ఈ సినిమాలో ఒక విలన్ అంటూ లేకపోవడం,  స్నేహితులే విలన్స్ గా తేలడం అనే కథ కాబట్టి, విద్రోహ ఫ్రెండ్స్ గా నటించిన వాళ్ళు మాత్రం పాత్రలకి సరైన న్యాయం చేసినట్టుగా కన్పిస్తారు. ఎందుకంటే ఈ కథలో తాము హీరోకి చేసిన ద్రోహం కంటే,  హీరో తమతో పాల్పడిన  అనైతికతే ఘోరమైనది. ఇది దర్శకుడు కూడా గుర్తించినట్టు లేదు.

        అసలు ఒరిజినల్లోనే అర్ధవంతమైన కాన్సెప్ట్ కాదు. హీరోకి లేనిపోని గొప్ప ఆపాదించారు. ఫ్రెండ్షిప్ కి అంత విలువిచ్చే విలువలుగల హీరో, ఇప్పుడు హీరోయిన్  తనని ప్రేమిస్తోందని చెప్పి,  ఆమెని ప్రేమిస్తున్న ఫ్రెండ్ ని ఎలా తప్పించేసి ఆ ప్రేమని తను హైజాక్ చేస్తాడు. ఇది ఒకటో సారి. రెండోసారి, ఆమెకి జగన్ అనే వాడితో పెళ్లి  రద్దు చేసి హీరోతో జరిపిస్తున్నప్పుడు...ఆ జగన్ తన ప్రాణమిత్రుడే అని తెలిసినప్పుడు హీరో ఏం చేయాలి? తను తప్పుకుని అతనితోనే ఆ పెళ్లి జరిపించేందుకు ప్రయత్నించాలి కదా? ఇలా రెండు సార్లూ ఫ్రెండ్స్ కి తనే ద్రోహం చేసిన స్వార్ధపరుడిగా తెలిసిపోతూంటే.. ఆ ఫ్రెండ్స్ ని  ద్రోహులుగా చిత్రించడం ఏమిటి? వాళ్ళ  వైపు నుంచి వాళ్ళు  హీరోని చంపాలనుకోవడం న్యాయమే. తను చావబోయే పరిస్థితుల్ని తనే కల్పించుకున్నాడు హీరో.

ఇక ప్జ్ప్రకాష్ రాజ్,  రావు రమేష్ పెద్దగా సంఘర్షణకి  తావులేని పాత్రలు. ఉండడానికి ఇంకా పృథ్వీ, పోసానీ, అలీ, ఝాన్సీ న్సీ లాంటి నటీనటులున్నా ఆ పాత్రలూ యాంత్రికంగానే వున్నాయి. 

        పాటలు, ఇతర ప్రొడక్షన్ విలువలూ మాత్రం బావున్నాయి. కానీ పాటల్ని భరించాలంటే ముందు ఈ సినిమా కథని భరించగాల్గాలి.

చివరికేమిటి?
        సీనియర్ దర్శకుడు కూడా కాన్సెప్ట్ తో తప్పులో కాలేశారు. రెండోది ట్రెండ్ లో ఉండేలా, యూత్ అప్పీల్ కి న్యాయం చేస్తూ, ఒరిజినల్ లోని రియలిస్టిక్ అప్రోచ్ ని అర్ధం జేసుకుని ఆమేరకు చిత్రీకరణ కూడా చూసుకోలేదు. దీంతో  మరో పాత లుక్ మూస ఫార్ములాలాగా రిజల్టు వచ్చింది. పెద్దగా కథా కథనాలూ పాత్రలూ పట్టించుకోకుండా కళ్ళప్పగించి సినిమాలు చూసే ప్రేక్షకులకే తప్ప, బుర్రపెట్టి చూసేవాళ్ళకి- ఇందులో స్పీడూ కన్పించదు, సెన్సూ వుండదు.


-సికిందర్