రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

19, ఆగస్టు 2016, శుక్రవారం

రివ్యూ!






కథ- స్క్రీన్ ప్లే –దర్శకత్వం: వీరభద్రం చౌదరి

తారాగణం : ఆది, నమితా ప్రసాద్. సాయికుమార్, అలీ, రఘుబాబు, పృథ్వీ, అభిమన్యు సింగ్, షకలక శంకర్, సురేఖావాణి, అన్నపూర్ణ, మాళవిక తదితరులు
సంగీతం : ఎస్ ఎస్ తమన్, ఛాయాగ్రహణం :
ఎస్ అరుణ్ కుమార్
బ్యానర్ : శ్రీ ఐశ్వర్య లక్ష్మి మూవీస్, ఎస్ ఆర్టీ ఎంటర్ టైన్ మెంట్స్
నిర్మాతలు : ప్రసాద్ తలారి, రామ్ తాళ్ళూరి
విడుదల:  19 ఆగస్టు, 2016

***

       హీరో ఆది - దర్శకుడు వీరభద్రం ఓ సక్సెస్  కోసం స్ట్రగుల్ చేస్తున్న వాళ్ళే. ఎందుకు సక్సెస్ అనేది వీళ్ళకి అందని చంద మామ అయిందో ఈ కింద చూద్దాం...

కథ
        బీటెక్ చదివిన బాబ్జీ (ఆడి) ఒక బ్యాంకుకి రికవరీ ఏజెంట్ గా పనిచేస్తూంటాడు. కావ్య(నమితా ప్రసాద్)  అనే అమ్మాయి పరిచయమవుతుంది ఈమె ఎసిపి (అభిమన్యు సింగ్) చెల్లెలు. తన చెల్లెలితో ఎవరు మాట్లాడినా కాల్చేసే రకం ఇతను. చెల్లెలి పెళ్లి చేయాలని ప్రయత్నిస్తూంటాడు. బాబ్జీ తన చెల్లెల్ని కలుస్తున్నాడని తెలిసి నిఘా పెట్టిస్తాడు.  పోలీస్ సిబ్బంది ఒకరోజు కాల్పులు జరపడంతో బాబ్జీ పారిపోతాడు.  కావ్యతో తన కెలాటి  సంబంధం లేదని చెప్పడానికి ఎసిపి ఇంటికి వెళ్తాడు బాబ్జీ. పెళ్లి ఇష్టం లేని కావ్య అప్పుడే  ఇంట్లోంచి పారిపోతూంటుంది. ఆమెతో బాబ్జీని చూసిన ఎసిపి సిబ్బందిని ఎగదోస్తాడు. వాళ్ళని తప్పించుకుని బాబ్జీ కావ్యతో రైలెక్కేస్తాడు. ఇంకో గ్యాంగ్ కూడా కావ్య కోసం  వెంటబడుతుంది. ప్రయాణంలో ఈ రెండు గ్యాంగ్స్ ని  ఎదుర్కొంటూ కావ్యని తన వూరికి తీసుకుపోతాడు బాబ్జీ. 

        మోతుబరి అయిన బాబ్జీ తండ్రి (సాయి కుమార్) కి కావ్యని తన ఫ్రెండ్ గా  పరిచయం చేస్తాడు. ఇంట్లో ఆడవాళ్ళు బాబ్జీ పెళ్లి చేయాలనీ పట్టుబడతారు. బాబ్జీ తండ్రి ఒక సంబంధం చూస్తాడు. ఇది ఇష్టం లేని బాబ్జీ కావ్య సహాయంతో ఆ పెళ్లి చూపుల్ని చెడగొడతాడు. కావ్య కోసం గ్యాంగ్ మళ్ళీ ఎటాక్ చేస్తుంది. ఎసిపి గ్యాంగ్ కూడా ఎటాక్ చేస్తుంది. ఈ రెండు గ్యాంగ్స్  ని ఎదుర్కొని కావ్యని బాబ్జీ ఎలా సొంతం చేసుకున్నాడన్నదే మిగతా కథ. 

ఎలావుంది కథ
        కొత్తదనమూ విషయమూ రెండూ లేని పాతచింతకాయ కథ. దీనికి బిసి సెంటర్లలో కూడా దృశ్యం ఉంటుందనేది అనుమానమే. ఇలాటి కథతో కోటి రూపాయల చిన్న బడ్జెట్ సినిమా కూడా తీయరేమో. ఆరేడు కోట్లు పెట్టి అట్టహాసంగా తీశారు. ఎవరికీ ఉపయోగపడని వ్యవహారం. సగంలో చాలా మంది లేచిపోవడమే ఇందుకు తార్కాణం. 

ఎవరెలా చేశారు
       
మాస్ హీరో, యాక్షన్ హీరో, ఆల్ రౌండర్ స్టార్ అవ్వాలని ఆది  ఎంత ప్రయత్నించినా వర్కౌట్ కావడం లేదు. అడకత్తెరలో పోక చెక్క పరిస్థితి ఇంకా తప్పడం లేదు. రఫ్, గరమ్ లతో చెడు అనుభవా లెదురయ్యాక కూడా అదే బాట  పడితే తనని దేవుడు కూడా కాపాడలేడు. ఇలాటి మూస మాస్ సినిమాలు తన లాంటి యంగ్  హీరో చేయాల్సినవి కావు- కొత్తగా చేయడానికీ వీటిలో ఏమీ వుండదు. ఆల్రెడీ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లు ఏనాడో చేసేశారు. వాళ్ళే బాగా చేశారు. ఆది ప్రయత్నించాల్సింది ఈ  తరం యువ ప్రేక్షకులకోసం. ‘చుట్టాలబ్బాయి’ ఏ కోశానా యూత్ కి కనెక్ట్ అయ్యే అవకాశమే లేదు. పది  నిమిషాలకో ఫైట్ చేసేస్తే, డాన్సులు చేసేస్తే యూత్ తో బాటు మాస్ చప్పట్లు కొడతారనుకోవడం అవివేకం. తన తాహతుకి మించిన భారీ డైలాగులు కొట్టినా ఇంతే. 

        ఇక ఈ పాత్రలో ఆకర్షణీయంగా  ఇంకేముంది-  తను హీరోయిన్ ని ప్రేమించనే ప్రేమించలేదు, ఆమె కూడా ప్రేమించలేదు, ఇద్దరి మధ్యా రోమాన్సే లేదు. తన పాత్రకి ఒక లక్ష్యం, దిశా దిక్కూ ఏమీ లేవు. ఈ పాత్రలో తను పరమ పాసివ్ గా ఉన్నాడన్న స్పృహే లేదు. ఎవరో ఫ్రెండ్ చెబితే అమెరికా  వెళ్లి జాబ్ చేయాలన్న ఆలోచన వస్తుంది, హీరోయిన్ పరిచయమైతే అమెరికా  వెళ్ళాలన్న ఆలోచనే ఎగిరిపోతుంది. తండ్రి చెబితే హీరోయిన్ ని తిరిగి తెచ్చుకోవడం కోసం వెళ్తాడు. అక్కడ హీరోయిన్ పెళ్లి జరిగిపోతోంది ఎలా అని కూర్చుంటే- ఇంకో ఫ్రెండ్ అలీ దగ్గరికి తీసికెళ్ళి  అలీ ద్వారా హీరోయిన్ ని కిడ్నాప్ చేయిస్తాడు- సొంతంగా ఆలోచించి తనేం చేశాడు ఆది? చేయనప్పుడు అది పాత్రెలా  అవుతుంది? దాంతో చేసింది నటన ఎలా అవుతుంది?

        చుట్టలబ్బాయ్ టైటిల్ కూడా తన పాత్రకి ఎలా వర్తిస్తుందో కూడా తెలీదు. తను ఎవరికి  చుట్టం? ఎవరికి ముద్దుల అబ్బాయి? ఏమో!

        ఇక హీరోయిన్ సెలెక్షన్ అధమంగా వుంది. ఆమెది ఫోటోజెనిక్ ఫేసు కాకపోగా, నటనకీ నవ్వుకునేలా వుంది. కాస్సేపు వచ్చిపోయే సెకండ్ హీరోయిన్ అయితే, ‘ఐ’ లో విక్రం గూని పాత్ర పోషించినట్టు ముసలమ్మలా వంగిపోయి నడుస్తుంది. అరకొర బట్టలతో అంగాంగ ప్రదర్శన కూడా మెయింటెనెన్స్ సరిగ్గా లేక ఎబ్బెట్టుగా వుంది. చుట్టాలబ్బాయికి చెత్తమ్మాయిలు.

        మిగిలిన నటీనటులు రొటీనే. ఇంతకీ  తెల్ల పంచ- కండువా వేసుకుని తండ్రి పాత్ర పోషించిన సాయికుమార్ ఈ సినిమాలో ఎందుకున్నట్టో? ఏం చేసినట్టో?

        సాంకేతికాల కొస్తే  ఎస్ అరుణ్ కుమార్ ఛాయాగ్రహణానికి వంద మార్కులేయవచ్చు. అలాగే సంగీత దర్శకుడు ఎస్ ఎస్ తమన్ కి. అంతే, ఇంతకి మించి చెప్పుకోవడానికేమీ లేదు. 

చివరి కేమిటి?
        ర్శకుడు వీరభద్రంకి కాలానుగుణమైన సినిమాలు తీయడానికి ఇంకా  మనస్కరించడం లేదు. ఎప్పుడో ఇతర దర్శకుల దగ్గర తను పనిచేసిన నాటి విషయాన్నే నేటికీ ప్రేక్షకుల మీద రుద్దుతున్నారు. కాలం చెల్లిన కథని కాస్సేపు పక్కన పెడదాం, దీనికి చేసిన స్క్రీన్ ప్లే కి స్ట్రక్చర్ అంటూ ఒకటుందా? దీనికి రాయించిన మాటలకి ఒక వొరవడి అంటూ వుందా? ఇంగ్లీష్ పదాలతో ప్రాస డైలాగులే డైలగులవుతాయా? ఎక్కడైనా కామెడీ అంటూ పండిందా? అది సారంలేని కామెడీ కాదా? ఆ ఇంటర్వెల్ సీనేమిటి, ఎక్కడో ఆపాలి కాబట్టి ఆపాలన్నట్టు లేదూ- అదీ గ్యాంగులతో యాక్షన్ సీను మధ్యలో? అప్పటి వరకూ అసలు నడించిన కథేమిటి? పాత్రల్ని ఒక రైలు ఎక్కించి రౌడీల్ని వెంట తరమడమేనా? వాళ్ళని హీరో ఎదుర్కొనే రిపీటయ్యే సీన్లేనా?  ఒక హోమ్లీ సినిమా తీయాలనుకుంటే ఈ రౌడీ గ్యాంగులతో గోలేమిటి? సెంటి మెంట్లో, సాంప్రదాయాలో, అవి పెట్టుకుని పల్లెటూళ్ళో హాయైన వ్యవహారం నడుపుకోవచ్చుగా? ఒక మ్యూజికల్ రూరల్ ఎంటర్ టైనర్ ని  ఇవ్వొచ్చుగా, నాగార్జున ఇచ్చినట్టు? 

        ఈ దర్శకుడు, హీరో- వీళ్ళిద్దరి మైండ్ సెట్ మారనంత వరకూ తెలుగు సినిమాకి ఈ టార్చర్ తప్పదు!



-సికిందర్ 
cinemabazaar.in








17, ఆగస్టు 2016, బుధవారం

రివ్యూ!


దర్శకత్వం : టినూ సురేష్ దేశాయ్

తారాగణం : అక్షయ్ కుమార్, ఇలియానా, ఈషా  గుప్తా, అర్జన్ బజ్వా, 
పవన్ మల్హోత్రా, ఉషా  నాదకర్ణి, సచిన్ ఖేడేకర్, కుముద్ మిశ్రా,
అనంగ్ దేశాయ్, కన్వల్ జిత్ సింగ్, తదితరులు
 కథ : నానావతీ కేసు ఆధారం, స్క్రీన్ ప్లే - మాటలు : విపుల్ కె రావల్,
సంగీతం : అంకిత్ తివారీ, జీత్  గంగూలీ, ఆర్కో, రాఘవ్ సచార్
ఛాయాగ్రహణం : సంతోష్ తుండియిల్
బ్యానర్ :  జీ స్టూడియో - ప్లాన్ సి స్టూడియోస్
నిర్మాతలు : నీరజ్ పాండే, అరుణా భాటియా తదితరులు
విడుదల : 12  ఆగస్టు, 2016
***
    కోర్టు రూమ్ డ్రామాల్ని రసవత్తరంగా చిత్రించే సినిమాలు అరుదుగా వస్తూంటాయి. సినిమాల్లో సర్వసాధారణంగా సీరియస్ గా నడిచే కోర్టు విచారణలు కేవలం ఫార్ములా ప్రకారం వాటిలోని సస్పెన్స్ ఎలిమెంటుతో కట్టిపడెయ్యాలని ప్రయత్నిస్తూంటాయి. కానీ నిజజీవితంలో కోర్టుల్లో సందర్భానుసార హాస్యం కూడా అప్పుడప్పుడు పెల్లుబుకుతూంటుంది. దీన్ని పట్టుకుని గంటన్నర కోర్ట్ రూమ్ డ్రామాని వినోదభరితంగా మార్చిన  ప్రయోగంగా ‘రుస్తుం’ నిలబడుతుంది. మూస ఫార్ములాల్ని బద్దలు కొట్టి కేవలం కథకే ప్రాధాన్య మిచ్చి, కథతో బాటూ పాత్రల మనోభావాల చిత్రణకీ కాస్త చోటిస్తే ప్రేక్షకులు కదలకుండా కూర్చుని వీక్షిస్తారనేందుకు కూడా తార్కాణంగా నిలుస్తుంది ‘రుస్తుం’ 

     మూస మాస్ హీరో అక్షయ్ కుమార్ ఆ చట్రంలోంచి బయటపడి వాస్తవిక పాత్రలు కూడా నటిస్తూ తనదైన ఒక ఓకొత్త శైలిని పెంచి పోషించుకుంటున్నాడు. బేబీ, స్పెషల్ 26, ఏర్ లిఫ్ట్ వంటి ఏ పాత్రలోనైనా ఒదిగిపోగల ఈజ్ తో ప్రేక్షకులకి వెరైటీని అందిస్తున్నాడు. ప్రేక్షకులకి ఇక వెరైటీని అందించడమే కాలంతీరిన సీనియర్ స్టార్ ల పరమావధి అయినప్పుడు,  మన విక్టరీ వెంకటేష్ కూడా ఇంకా ‘బాబు బంగారం’ లాంటి తనే ఎప్పుడో వాడేసిన పాత మూసకి బదులు- అక్షయ్ కుమార్ నటించిన ‘రుస్తుం’ లాంటివి బ్రహ్మాండంగా ప్రయత్నించి సీనియారిటీని సార్ధకం చేసుకోవచ్చు. ‘రుస్తుం’ కథతో, పాత్రతో వున్న సౌలభ్యమేమిటంటే-  దీన్ని ఏ భాషలో ఎవరైనా నటించవచ్చు. 

        ఒక వైవాహిక బంధం వివాహేతర సంబంధానికి దారితేస్తే,  సైనికుడైనా చట్టాన్ని ఉల్లంఘిస్తాడని తెలిపే ‘రుస్తుం’ - సరిహద్దులో సైనికుడు కాపాలా కాస్తూంటే, వూళ్ళో అతడి భార్య మీద కన్నేయడం నీచాతి నీచమన్న వాదనని తెరపైకి  తెస్తుంది. 

కథ 
      నావికాదళ కమాండర్ రుస్తుం పావరీ (అక్షయ్ కుమార్) ఆర్నెల్లు డ్యూటీకెళ్ళి అనుకోకుండా ముందుగానే ఇంటి కొస్తాడు. భార్య సింథియా (ఇలియానా) ఇంట్లో వుండదు. మొన్ననగా ఎక్కడికో వెళ్ళిన మనిషి ఇంకా రాలేదని అంటుంది పని మనిషి జమునా బాయి (ఉషా నాదకర్ణి). రుస్తుంకి ఇంట్లో కొన్ని ప్రేమలేఖలు దొరుకుతాయి. అవి విక్రం మఖీజా (అర్జన్ బజ్వా) అనే ఇండస్ట్రియలిస్ట్ సింథియాకి రాసినవి. రుస్తుం ప్రపంచం తలకిందు లవుతుంది. సింథియా రాగానే ఉత్తరాలు చూపిస్తాడు. ఆమెకి ఏడ్పే మిగులుతుంది. విక్రం నావల్ బేస్ కెళ్ళి తన రివాల్వర్ తీసుకుంటాడు. నేరుగా విక్రం మఖీజా దగ్గరికెళ్ళి కాల్చి పారేస్తాడు. అలాగే పోలీసుల దగ్గరి కెళ్ళి లొంగి పోతాడు. 

        కోర్టులో విచారణ ప్రారంభమవుతుంది. రుస్తుం తన కేసు తనే వాదించు కుంటాడు. మరో వైపు నావికాదళ అధికారుల నుంచి ఒక వొత్తిడి వుంటుంది రుస్తుం కి. వేరే ఒక వ్యవహారానికి సంబంధించిన ముఖ్యమైన పత్రాలు రుస్తుం దగ్గర వుంటాయి. వాటికోసం ప్రయత్నిస్తూంటారు. రుస్తుం లొంగకపోతే హత్య కేసులో రుస్తుంకి వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారం విడుదల చేసేస్తారు.

        ఈ కేసుని జడ్జీతో  బాటు జ్యూరీ కూడా పరిశీలిస్తుంది. వాదోపవాదాలు ముగిశాక  బంతి జ్యూరీ కోర్టులో పడుతుంది. అప్పుడు జ్యూరీ ఏమని తీర్పు ఇచ్చింది? తన కేసు తనే  వాదించుకున్న రుస్తుం ఇందులో విజయం సాధించాడా? విక్రం చెల్లెలు, పోలీసులూ ప్రాసిక్యూటర్ ఎలాటి కుట్రలు చేశారు? పార్సీ మతస్థుడైన రుస్తుంకి మద్దతుగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టేందుకు పార్సీ పత్రికా యజమాని ఎలాటి వార్తలు రాయించాడు? సింథియా  ఏమైంది? ఆమెని రుస్తుం క్షమించాడా? ఇవన్నీ తెలియాలంటే థియేటర్ కెళ్లాల్సిందే. 

ఎలావుంది కథ
          ది మౌలికంగా క్రైం కథ. 1959లో అప్పటి బొంబాయిలో జరిగిన నిజ కథ. దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించడమే కాదు, దేశ న్యాయ వ్యవస్థలో కీలకమైన ఒక శాఖ రద్దుకూ దారితీసిన చారిత్రాత్మక కేసు. కెఎం  నానావతి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్రగా ప్రసిద్దిపొందిన ఈ కేసు మీద అనేక గ్రంధాలూ కొన్ని సినిమాలూ వెలువడ్డాయి. 1963 లో సునీల్ దత్, లీలా నాయుడు, రెహ్మాన్ లతో దర్శకుడు ఆర్ కె నయ్యర్ ‘యే రాస్తే  హై ప్యార్ కే’  (దారి తప్పిన ప్రేమలు) తీశారు. సునీల్ దత్ అభిమాన రచయిత ఆఘా జానీ కశ్మీరీ కథ రాశారు. కానీ 2010 లో లీలా నాయుడు తన అనుభవాలు గ్రంథస్థం చేసినప్పుడు, ఈ సినిమాకథ నానావతి  కేసు కంటే ముందే రాశారనీ, కాకతాళీయంగా తర్వాత జరిగిన కేసు ఈ కథని పోలి వుందనీ  రాశారు. అయితే ఈ సినిమా అప్పట్లో ఫ్లాపయ్యింది. 

        ఆ తర్వాత 1973 లో గుల్జార్ ‘అచానక్’  (అకస్మాత్తుగా) అని తీశారు. జర్నలిస్టు, రచయితా అయిన కె ఎ అబ్బాస్ కథ రాశారు. వినోద్ ఖన్నా, లీలా చక్రవర్తి, ఓం శివ్ పురి లు నటించారు. ఇది హిట్టయ్యింది. 

        ఈ సినిమాలతో సహా ‘రుస్తుం’ కూడానూ కేసుని ఉన్నదున్నట్టు చూపించ లేదు. ఏ సినిమాకా సినిమా చాలా కల్పనలు చేశారు- కేవలం ఒక వివాహేతర సంబంధం, దాని పర్యవసానంగా  హత్య అనేదే వీటిలో సామాన్యాంశం. ఈ నేపధ్యంలో అసలు నిజంగా ఏం  జరిగిందో తెలుసుకోవడం అవసరం ( 2010 లో  ‘ఆంధ్ర జ్యోతి’ ఆదివారం అనుబంధంలో ‘అపరాధి’ శీర్షిక కింద క్రైం కథలు రాస్తున్నప్పుడు నానావతి కేసు మీద కూడా ఓ కథ రాశాడు ఈ వ్యాసకర్త).

     క్లుప్తంగా చెప్పుకుంటే, నావికాదళ కమాండర్ కవస్ మానెక్ షా నానావతి పారసీయుడు. అతను బ్రిటిష్ యువతి  సిల్వియాని వివాహమాడాడు. వాళ్లకి ముగ్గురు పిల్లలు. నానావతి తరచూ డ్యూటీ  మీద నెలల తరబడీ వెళ్ళడంతో  ఒంటరిదైన సిల్వియా,  ప్రేమ్ అహుజా అనే యువ పారిశ్రామిక వేత్తతో ప్రేమలో పడింది. శారీరక సంబంధం పెట్టుకుంది.

       కానీ తనని పెళ్ళాడతానన్న ప్రేమ్ మాట మార్చడంతో భగ్గుమంది. ఈ నేపధ్యంలో డ్యూటీ నుంచి వచ్చిన  భర్త నానావతికి తన గుట్టంతా  తనే చెప్పుకుని పశ్చాత్తాప పడింది(ఇలా చెప్పడం ద్వారా తనే భర్తని ప్రేమ్ మీదికి ఉసిగొల్పిందన్న వాదన కూడా వుంది).  ఆమె విశ్వాసఘాతం తట్టుకోలేక నానావతి సీసాతో పొడుచుకుని చావబోయాడు. ఆమె అడ్డుకుంది.

        ఇక నానావతి ఒక నిర్ణయం తీసుకుని,  భార్యా పిల్లల్ని సినిమాహాలు దగ్గర దిగబెట్టి సినిమా చూడమని చెప్పి,  తను నావల్ బేస్ లో తన రివాల్వర్ తీసుకుని  వెళ్లి ప్రేమ్ ఆహుజాని కాల్చి చంపేశాడు. అట్నుంచి వెస్టర్న్ నావల్  కమాండ్ లో ప్రొవోస్ట్ మార్షల్ ఎదుట లొంగిపోయాడు. ఆ అధికారి బొంబాయి డిసిపి కి అప్పగించాడు. 

       కోర్టులో విచారణ ప్రారంభమయింది. నానావతి స్వయంగా వాదించుకోలేదు. అతడి తరపున కార్ల్ ఖాండావాలా వాదిస్తే, ప్రాసిక్యూషన్ లాయర్ గా రామ్ జెఠ్మలానీ పనిచేశారు. ఒకే ఒక్క పాయింటు మీద కేసంతానడిచింది- నానావతి క్షణికావేశంలో చంపాడా, లేక పథకం ప్రకారమే  చంపాడా అనేది. మొదటిదైతే శిక్ష స్వల్పంగా పడొచ్చు, రెండోదైతే పదేళ్ళు తప్పదు. 

          కేసు నానా మలుపులు తిరిగి చివరికి తీర్పుకి జ్యూరీ ఎదుట కొచ్చింది. జ్యూరీ అంటే మరేమిటో కాదు, కొందరు పుర ప్రముఖులతో కూడిన జట్టు. నేరుగా జడ్జీలు తీర్పు చెప్పే విధానం అప్పట్లో లేదు. జ్యూరీలో ఓటింగే శరణ్యం. ఆ ఓటింగ్ తర్వాత జడ్జి ఎటువైపు తన ఓటేస్తే దాన్ని బట్టి నిందితుడు దోషియో నిర్దోషియో అవడం జరిగేది. 

          జ్యూరీలో ఎనిమిది మంది సభ్యులూ  ఏకగ్రీవంగా ‘క్షణికావేశంలో చేసిన హత్య’  కోణానికే ఓటేశారు. జస్టిస్ మెహతా వ్యతిరేక ఓటేశారు. ఇలా నానావతి మీద కేసు వీగిపోవడంతో, ఇది జ్యూరీ ఇచ్చిన తప్పుడు తీర్పు అని,  హైకోర్టుకి కి రిఫర్ చేశారు జస్టిస్ మెహతా.  హైకోర్టు ‘పథకం ప్రకారమే చేసిన హత్య’ కోణాన్నే  సమర్ధించి, నానావతికి యావజ్జీవం విధించింది. సుప్రీం కోర్టు కూడా హైకోర్టు తీర్పుని సమర్ధించింది. ఇక నానవతికి అన్ని దారులూ  మూసుకు పోయాయి.

        ఇప్పుడే ఒకమలుపు తిరిగింది కథ.  కింది కోర్టులో ఈ కేసు విచారణ సందర్భంగా చెలరేగిన ప్రజాందోళనలకీ, పత్రికా కథనాలకీ జ్యూరీ సభ్యులు ప్రభావితం కావడం, అటుపైన సాక్ష్యా ధారాల్ని బట్టి కాక, నిందితుడి పట్ల సానుభూతితో  భావావేశాలకి లోనై  ఓటింగ్ చేయడమూ గమనించిన భారత ప్రభుత్వం, ఏకంగా బ్రిటిష్ కాలం నాటి ఆ జ్యూరీ విధానాన్నే రద్దు చేసి పారేసింది. 

      ఇదొక చారిత్రక ఘట్టం న్యాయవ్యవస్థలో. ఇదొక ఎత్తయితే, నానావతికి వ్యతిరేకంగా సుప్రీం తీర్పు కూడా రావడంతో,  పార్సీ వర్గాలు ఉద్యమించాయి. పార్సీ మతస్థుడైన ప్రఖ్యాత ‘బ్లిట్జ్’ పత్రికా సంపాదకుడు రూసీ కరంజీయా,  మొదట్నించీ ఈ కేసుమీద కథనాలు ప్రచురిస్తూనే వున్నాడు. ఇక సుప్రీం తీర్పు తర్వాత ఆయన పార్సీల ఆందోళనకి మద్దతుగా నానావతి విడుదల వాదాన్ని ఎత్తుకున్నారు. నావికా దళం సైతం నానావతికి మద్దతు పలికింది.

        నానావతి  చేతిలో మరణించిన ప్రేమ్ ఆహుజా సింధీ కులస్థుడు. ఇక సింధీలంతా నానావతికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఒక విచిత్ర మేమిటంటే,  నానావతి మీద ప్రాసిక్యూషన్ నడిపిన సింధీ కులస్థుడైన రామ్ జెఠ్మలానీ, ఇప్పుడు పార్సీలతో కలిసిపోయి నానావతికి జైకొట్టడం మొదలెట్టారు!

        బ్రిటన్ లో వి.కె. కృష్ణ మీనన్  ఇండియన్ హై కమీషనర్ గా పనిచేస్తున్నప్పుడు  ఆయనకి డిఫెన్స్ అటాచీగా పనిచేసిన అనుభవం కూడా వుంది  నానావతికి. అంతేగాదు, ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ కుటుంబానికి నానావతి సన్నిహితుడు కూడా. అయినా నానావతికి క్షమాభిక్ష పెడితే సింధీల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుందని భయపడింది నెహ్రూ ప్రభుత్వం. 

       సరీగ్గా అప్పుడు,  ఒక సింధీ స్వాతంత్ర్య యోధుడు ఒక లైసెన్సు దుర్వినియోగ కేసులో శిక్షపడి, క్షమాభిక్ష అర్జీ  పెట్టుకున్నాడు. దాంతో జెఠ్మలానీ  రంగంలోకి దిగిపోయి చకచకా పావులు కదిపారు. మరణించిన ప్రేమ్  అహుజా కి మామీ ఆహుజా  అనే చెల్లెలుంది. ఆమెని జెఠ్మలానీ ఒప్పించి, తన అన్నని చంపిన నానావతిని  తను క్షమిస్తున్నట్టు లిఖితపూర్వక వాంగ్మూలం తీసుకుని గవర్నర్ కి సమర్పించారు. ఒక వైపు ఈ సింధీ స్వాతంత్ర్య యోధుడి క్షమాభిక్ష అర్జీ, మరో వైపు నానావతి క్షమాభిక్ష వినతీ   రెండూ పరిశీలించిన గవర్నర్, పండిట్ నెహ్రూ సోదరి అయిన  విజయలక్ష్మీ పండిట్, ఇద్దరికీ క్షమాభిక్ష పెట్టి వదిలేశారు. జెఠ్మలానీ చేసిన ఈ సింధీ- పార్సీ సమన్యాయ గిమ్మిక్కు నానావతికి స్వేచ్ఛని ప్రసాదించింది.  

        ఇలా సుప్రీం తీర్పు తర్వాత రాజకీయ-సామాజిక- కుల- మత సమీకరణాలన్నీ మూడేళ్ళూ జైల్లో మగ్గిన నానావతికి కలిసొచ్చాయి. జైల్లోంచి విడుదలై  భార్యా పిల్లల్ని తీసుకుని కెనడా వెళ్ళిపోయాడు. 2003 లో 76 వ యేట అక్కడే కన్ను మూశాడు.
        ***
  ‘రుస్తుం’ సహా నానావతి మీద తీసిన ఇతర రెండు సినిమాలలోనూ  ఈ హై ప్రొఫైల్ మర్డర్ కేసు చారిత్రక ప్రాముఖ్యాన్నీ, కేసు విస్తృతినీ  ప్రేక్షకుల ముందు సవివరంగా పెట్టకుండా కేవలం సాదాసీదా హత్య కేసుగానే చెప్పి ముగించేశారు. పైగా నానావతి కేసు ఆధారంగా అని ప్రచారం చేయడంతో, ‘రుస్తుం’ లో ఎలా కల్పన చేసి చూపించారో అలాగే నానావతి సంఘటన జరిగి ఉంటుందని  నేటి ప్రేక్షకులు అపోహపడే అవకాశ మేర్పడింది. నానావతి రాజకీయ సంబంధాలు, ఆనాడు జరిగిన వర్గ ఉద్యమాలూ వంటి వివాదాస్పద అంశాల జోలికి వెళ్లకపోయినా- కనీసం ఈ కేసు పుణ్యాన జ్యూరీ వ్యవస్థ రద్దయినట్టు అయినా చెప్పి ఉండాల్సింది.   ‘Three shots that shook the nation’ అని టైటిల్ కి పెట్టిన క్యాప్షన్ కూడా ఆనాడు ‘బ్లిట్జ్’ పత్రిక పతాక శీర్షిక లోనిదే. ఇంకొకటేమిటంటే,   రుస్తుం భార్యకి క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఇంకో కథ తెచ్చి కలపడం, ఆ కథ తేలిపోవడం.  దీన్నొక కోర్టు రూమ్ డ్రామాగా మాత్రమే చూస్తే – ఒక పరిధి వరకూ రసవత్తరమే. అసలిది నానావతి నిజకథ  అని ప్రచారం చేయకుండా విడుదల చేసి వుంటే,  సినిమా చూసిన ప్రేక్షకుల నుంచే పెద్ద పెట్టున చర్చ జరిగేది. అమ్మో ఇది నానావతి కథరా, ఎంత తెలివిగా మార్చేసి తీశాడు- అని ప్రేక్షకులే చర్చించుకునే వాళ్ళు. మెచ్చుకునే వాళ్ళు ఆ తెలివైన క్రియేటివిటీకి. నానావతి కథ అని ముందే చెప్పేయడంవల్ల కథలో లోపాలే ఎన్నుతారు ఎవరైనా. క్రియేషన్ ఎప్పుడూ గుంభనంగా జరిగిపోవాలి. ఐన్ స్టీన్ చెప్పినట్టు -The  secret of creativity is knowing how to hide your sources- కదా?

ఎవరెలా చేశారు 

      నానావతి పాత్రకి ఇంతలా సరిపోయే నటుడు ఇంకొకరు వుండరు. ఇందుకు నూటికి నూరు మార్కు లేయవచ్చు అక్షయ్ కుమార్ కి. ఆద్యంతం యూనిఫాంలో నేవీ కమాండర్ హూందాతనాన్ని పకడ్బందీగా పోషించాడు. భార్య మోసం చేసిందని తెలిసినప్పుడు కూడా సంయమనం కోల్పోకుండా, అదే సమయంలో ప్రేక్షకులనుంచి సానుభూతిని కూడా ఆశించకుండా, ఒక డిఫెన్స్ ఉద్యోగిగా తనదైన ప్రొఫెషనలిజంతో చర్యలు చేపడతాడు. తనపై వచ్చిన ఆరోపణలకి మెలో డ్రామాకి అవకాశమివ్వకుండా, హేతుబద్ధమైన సమాధానాలతో తిప్పి కొడతాడు. ఒక గ్రేట్ క్యారక్టర్ ని అర్ధం జేసుకుని గ్రేట్ గా పోషించాడు అక్షయ్ కుమార్. 

     దర్శకుడు- రచయితా భార్యా భర్తల్లా ఒకటైతే పాత్రలన్నీ అద్భుతాలు చేస్తాయి. దర్శకుడిది హార్డ్ వేర్ పని, రచయితది సాఫ్ట్ వేర్ పని. రెండూ ఒకటైతేనే అర్ధవంతమైన చిత్రీకరణలు తెర మీద మెరుస్తాయి. మాటల కెంత ప్రాముఖ్యమిచ్చారో,  మాట్లాడేముందు నటీనటుల ఆలోచనలకి, హవాభావాలకీ అంటే ప్రాధాన్య మిచ్చారు. ఇలియానా సున్నిత పాత్ర, ఈషా గుప్తా దూకుడు పాత్రా-  వాటి హాహభావాలూ  కెమెరా మాన్ కూడా పట్టుకున్న తీరు బలమైన ముద్ర వేస్తాయి. ఇలియానాకి హిందీలో దక్కుతున్నట్టు ఇలాటి సున్నిత హోమ్లీ పాత్రలు తెలుగులో దక్కలేదు. ఈ పాత్రల్లో ఆమె ఎలాటి ప్రావీణ్యం ప్రదర్శిస్తోందో తెలుగు ప్రేక్షకులకి తెలీదు.

        ప్రతీ పాత్రా కొన్నాళ్ళు గుర్తుండి పోయేదే.  విచారణాధికారి  అయిన సీనియర్ ఇన్స్ పెక్టర్ విన్సెంట్ లోబో పాత్రలో పవన్ మల్హోత్రా-  1959 మోడల్  మనిషిగా, పోలీసుగా ఒక ఎక్సెలెంట్ - క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. అలాగే పత్రికా యజమాని ఎరక్ బిల్లిమోరియా గా కుముద్ మిశ్రా కన్పిస్తే చాలు సున్నిత హాస్యాన్ని పండించిన తీరు కూడా క్లాసిక్ టచ్చే. ప్రాసిక్యూటర్ లక్ష్మణ్ ఖంగానేగా సచిన్ ఖడేకర్, డిఫెన్స్ సెక్రెటరీ   బక్షీగా కన్వల్ జిత్ సింగ్ హేమా హేమీలై నటించారు. చాన్నాళ్ళ తర్వాత హిందీ తెర మీద కన్పించిన అనంగ్ దేశాయ్ జడ్జి పాత్రతో, పనిమనిషిగా ఉషా నాదకర్ణి గమ్మత్తైన కామిక్ సెన్స్ తో  దృశ్యాల్ని  ఉత్తేజభరితం చేస్తారు. పారిశ్రామిక వేత్త విక్రం మఖీజాగా అర్జన్ బజ్వా మాత్రం అక్షయ్ కి దీటుగా సరిపోని  ఫిజిక్ తో  ప్రతినాయక పాత్రలో అంతగా ఆకట్టుకోడు. 

       టెక్నికల్ గా అత్యున్నతంగా వున్న ఈ మూవీ కి కళ్ళు చెదిరే కెమెరా వర్క్ చేశాడు సంతోష్ తుండియిల్. రంగులతో, వెలుగు నీడలతో ఒక స్వర్గ లోకాన్ని ఆ విష్కరిస్తున్నట్టు చేశాడు. అయితే ఆ రంగులూ - కళాదర్శకత్వం కొన్ని చోట్ల డిజైనర్ లుక్ ని తెచ్చిపెట్టి  సహజత్వానికి దూరమయ్యాయి. కథే డిజైనర్ చరిత్రగా  వునప్పుడు చిత్రీకరణా అ లావుండాలని లేదుగా?
        పాటలకి ప్రాధాన్యం లేదు- ఒక టైటిల్ సాంగ్, ఇంకో బ్యాక్ గ్రౌండ్ సాంగ్ తప్ప. 



చివరికేమిటి?
     ఒక మంచి ప్రయత్నం. దర్శకుడికి మంచి పట్టు వుంది. చిత్రీకరణలకి సంబంధించి మంచి అయిడియాలున్నాయి- టెక్నాలజీతో కలుషితం చేయకుండా.  అయితే రుస్తుం, అతడి భార్య పాత్రలు పాల్పడిన నేర పూరిత, అనైతిక  చర్యల్ని ఎలా జస్టిఫై చేయాలన్న ప్రయత్నంలో తప్పటడుగులేశారు. ఉన్న కథని ఇంకో కథతో పొడిగించడం వల్ల ఈ సమస్య వచ్చింది. చివరికి వ్యవస్థే నానావతి కథని ఎలా సుఖాంతం చేసిందో చరిత్రలో చూశాక- ఈ పాట్లన్నీ ఎందుకనేలా ఉంది. ఇదలా ఉంచితే, క్వాలిటీ సినిమా చూడాలనుకునే ప్రేక్షకులకి-  ఈ కోర్ట్ రూమ్ డ్రామా మాత్రం కొత్త అనుభవాన్నిచ్చే మాంచి వినోద కాలక్షేపం!


-సికిందర్  
( స్క్రీన్ ప్లే సంగతులు రేపు!)
(Watched at 7pm on 16th  Aug)




16, ఆగస్టు 2016, మంగళవారం

రైటర్స్ కార్నర్!




బాలీవుడ్ లో నవతరం రచయితలు జోరు మీదున్నారు. విజయాలు సాధించిన కొందరు నవతరం రచయితల్ని చూసి మరింతమంది కొత్త రచయితలు వచ్చేస్తున్నారు -  ఈరంగంలో అదృష్టాన్ని పరీక్షించుకుందామని. అయితే విజయాలు సాధిస్తూ  రోల్ మోడల్స్ గా కన్పిస్తున్న ఈ  నవతరం రచయితలకీ అటు తర్వాత కూడా అదే  స్ట్రగుల్ తప్పడం లేదు. అనామకులుగా బాలీ వుడ్ లో ప్రవేశించి నేడు ప్రముఖులైపోతున్న నవరతం రచయితలూ రచయిత్రులూ  ఆ వెంటనే అనామకులైపోయే ప్రమాదంలోనూ  పడుతున్నారు. బాలీవుడ్ లోకి వస్తున్న కొత్త రచయితల సంఖ్యా పెరిగిపోయి-   నిర్మాతలకీ  ఛాయిస్ లు పెరగడంతో  వున్న ప్రముఖ నవతరం రచయితలూ కమాండ్ చేయలేని, డిమాండ్ కూడా చేయలేని సగటు రచయితల పరిస్థితిలో పడిపోతున్నారు. పీకూ, ఎన్ హెచ్- 10, తనూ వెడ్స్ మను రిటర్న్స్, దమ్ లగాకే హైసా...మొదలైన నవతరం రచయితలు  రాసిన సినిమాలు బాగా సొమ్ములు చేసుకుని వుండవచ్చు గాక, విధూ వినోద్ చోప్రా లాంటి నిర్మాత- దర్శకుడు, రణవీర్ సింగ్ లాంటి స్టార్ కలిసి రచయితలకి మంచి పారితోషికాలివ్వాలని రచయితల తరపున మాట్లాడి వుండవచ్చు గాక – కానీ వాస్తవ పరిస్థితుల్లో మార్పేమీ రావడం లేదు. కారణం- ప్రధానంగా మంచి స్క్రిప్టుని  గుర్తించి ఓకే చేయగల్గినా, దాని విలువని అంచనా వేయలేకపోవడమే. సినిమా పూర్తయ్యే వరకూ  కూడా అదెంత మేరకు  కలెక్ట్ చేయగలదో వూహించ లేకపోవడమే. దీంతో  కొత్త రచయితలకి బొటాబొటీ ఇచ్చేసి పంపించేస్తున్నారు. తీరా ఆ స్క్రిప్టుతో తీసిన సినిమా పెద్ద హిట్టయి కూర్చుంటోంది...నిర్మాతకి  ఊహించని లాభాలు, రచయితకి  ఆ దక్కిన బొటాబొటీ తోనే జీవితం. 

          సినిమా రచయితల  సంఘాన్ని ఆధునికంగా ఏర్పాటు చేసుకున్నారు- కానీ అక్కడ రచయితల సమస్యలు ఇంకా పురాతన మైనవే. ఆర్ధికంగా రచయితలుగా కొనసాగలేక ఇంకో వృత్తి కూడా చూసుకోవాల్సిన పాత సమస్యల్నే ఇంకా ఎదుర్కొంటున్నారు. 

జుహీ చతుర్వేదీ
        అయినా ఇదేమీ గుర్తించకుండా నవతరం రచయితలుగా పాపులరైన  జుహీ చతుర్వేదీ, ఉర్మీ జువేకర్, హిమాంశూ శర్మల వంటి వాళ్ళని చూసి బాలీవుడ్ లోకి కొత్త కొత్త రచయితలు  వచ్చి పడుతున్నారు. ఇది మంచిదే. దర్శకులే రచనలు చేసుకుంటున్న కాలంలో  ఎవరైనా దర్శకులవుదామనే మోజుపడుతున్నారు తప్ప, రచయితలవుదా మనుకోవడం లేదు. అయితే పైన చెప్పుకున్న ఆ ముగ్గురు రచయితల స్పూర్తితో ఇప్పుడు తండోపతండాలుగా రచయితలవుదామని రంగ ప్రవేశం చేస్తున్నారు.  కానీ ఇక్కడి వాస్తవ పరిస్థితులు వాళ్ళూ గమనించడం లేదు. ఈ నేపధ్యంలో విక్కీ డోనార్, పీకూ ల వంట టి డిఫరెంట్ సినిమాలకి రాసిన జుహీ  చతుర్వేదికి అసలు స్ట్రగుల్ చేయాల్సిన అవసరమే రాలేదు. ఆమెకి ఆల్రెడీ అడ్వర్ టైజింగ్ కెరీర్ వుంది. కాబట్టి ఆర్దిక సమస్యలు లేవు.  ‘నేను విక్కీ డోనర్ రాస్తున్నప్పుడు  రాస్తున్నానని ఎవరికీ  తెలీదు. జాబ్ చేసుకుంటూనే రాశాను. ఆ జాబ్ కూడా ఉదయం నుంచీ రాత్రి పొద్దు పోయేవరకూ వుండేది. ఆ తర్వాతే రాసేదాన్ని. ఎన్నో నెలల పాటు రాత్రి పూట రెండు మూడు గంటలు మాత్రమే నిద్రపోయాను. ప్రాక్టికల్ గా ఆలోచిస్తే కేవలం సినిమా రచన మీదే దృష్టి పెట్టి కొనసాగడానికి పరిస్థితులు అనుకూలంగా లేవు’ అంటారామె.

          లక్నోలో పుట్టి పెరిగిన ఆమె, అక్కడే  లొరెట్టో  కాన్వెంట్ లోనూ, ఆ తర్వాత లక్నో కాలేజ్  ఆఫ్ ఆర్ట్స్ లోనూ  విద్య పూర్తి చేశారు. 1996 లో ఢిల్లీ వచ్చి ప్రసిద్ధ  ఒజిల్వీ అండ్  మాథర్ యాడ్ ఏజెన్సీలో కాపీ  రైటర్ గా చేరారు. లజ్ పత్ నగర్ లో అద్దెకున్నారు. అక్కడి పరిసరాల వాతావరణమే ఆమె రాసిన ‘విక్కీ డోనర్’ లో కన్పిస్తుంది.  2008 లో ఢిల్లీ నుంచి  ముంబాయి వచ్చి  లియో బార్నెట్ అనే యాడ్ కంపెనీ లో చేరారు. అప్పుడే మొదటి సినిమా ‘షూ బైట్’  కి మాటలు రాశారు. కానీ అది విడుదల కాలేదు. 2012 లో సొంతంగా ‘విక్కీ డోనర్’ రాసే ముందు సంవత్సరం జాబ్ వదిలేశారు. 

          ‘పీకూ రాసిన తర్వాత కూడా నా అడ్వర్టైజింగ్ కెరీర్ అనే ఒక అండ ఉందన్న ధైర్యంతోనే  సినిమాల్లోకి రావడానికి సాహసం  చేశానని చెప్పగలను. ఢిల్లీలోనైనా ముంబాయి లోనైనా ముందు బ్రతకడానికి డబ్బుకావాలి. ఇక్కడ స్క్రిప్టూ దాంతోబాటు రైటర్లూ ఎంతో ముఖ్యమనే చెప్తారు. అయినా పారితోషికాలు చాలా తక్కువ వుంటాయి. అడ్వాన్సు తీసుకున్నప్పటి నుంచీ సినిమా అపూర్తయ్యే వరకూ చాలాకాలం పడుతుంది. అంత కాలం పాటు  అప్పుడప్పుడు అందే డబ్బుతో ముంబాయిలో జీవనం కష్టమైపోతుంది’ అనికూడా జుహీ అంటారు.

హిమాంశూ శర్మ
         హిమాంశూ శర్మ కైతే ముంబాయిలో అద్దెలు కట్టుకోవడమే పెను సమస్యగా మారింది. తను కూడా లక్నో నుంచి వచ్చాడు. ‘తనూ వెడ్స్ మను రిటర్న్స్’  తో జాక్ పాట్  కొట్టాడు. 
‘సినిమా అనేది దర్శకుల మీడియా కాబట్టి దర్శకుణ్ణి అవుదామనే నేను ముంబాయి వచ్చాను. కానీ అసిస్టెంట్  డైరెక్టర్ గా చేరడం మాత్రం నా కిష్టముండేది కాదు. రైటర్ గా అయితే రాసుకోవడానికి ఎవర్నీ అడుక్కోనవసరం లేదు. దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ ని కలిసి నా సబ్జెక్టు  విని అభిప్రాయం చెప్పమన్నాను. ఆ సబ్జెక్టు  ఆయనకు నచ్చి డెవలప్ చేయమన్నారు. నెలకు ఇరవై  వేలు చొప్పున శాలరీగా ఇచ్చారు. అసిస్టెంట్ డైరెక్టర్ కి కూడా అంతేకదా వస్తుది, పైగా అది ఘోరమైన జాబ్’ అంటారు తను. అయితే ఈ మాట అసిస్టెంట్ గా పని చేసిన అనుభవంతోనే చెప్తారు. 

          హిందీ సాహిత్యంలో పట్టభద్రుడైన హిమాంశూ ఎన్డీ టీవీ లో ఓ హెల్త్ కేర్ షోతో కెరీర్ ప్రారంభించారు. అక్కడ్నించీ రిస్క్ తీసుకుని బాలాజీ సీరియల్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా ప్రయత్నిద్దామని ముంబాయి వచ్చారు. ఒకటి రెండు సీరియల్స్ చేసి ఆనంద్ రాయ్ కి అసిస్టెంట్ గా  వెళ్ళారు. తర్వాత 2008 లోవిజయ్ కృష్ణ ఆచార్య  తీసిన ‘తాషాన్’ కి కూడా అసిస్టంట్ గా పనిచేశారు. అసిస్టెంట్ వృత్తి అధ్వాన్నమైనదని అప్పుడు గుర్తించి రచన మీదికి దృష్టిని  మళ్ళించారు. 

          ఇక ఊర్మీ జువెకర్ కైతే మొదటి నుంచీ సినిమా రచయిత్రి కావాలనే వుంది. 2015 లో దిబాకర్ బెనర్జీ తీసిన ‘డిటెక్టివ్ బియోంకేష్ బక్షీ’  కి సహ రచయిత్రిగానూ, 2012  లో ‘షాంఘై’ కీ, ఇంకా ముందు  2008 లో ‘ఓయ్ లక్కీ ఓయ్’  కీ సహ రచయిత్రిగా పనిచేసిన ఈమె పూర్వం డాక్యుమెంటరీ లకి పనిచేశారు. ‘పదహారేళ్ళ క్రితం నుంచీ ఈ రంగంలోనే పాట్లు పడుతున్నాను.  అప్పట్లో ఇంకా సినిమా వాళ్ళంటే మన ఇరుగుపొరుగులో అంత గౌరవ భావం వుండేది కాదు. అలాటి పరిస్థితుల్లోంచి  ఇప్పుడు విలువ ఇస్తున్న కాలంలోకి నా ప్రయాణం సాగించాను. నాకింకా వేరే ఏ పనీ చేతగాకనే ఈ రంగంలో కొచ్చాను’ అంటారీమె. 

          తను  ఎంత కృషి చేసినా, ఎంత ప్రావీణ్యం చూపినా వచ్చే ఆదాయం నెలఖర్చులకి చాలేది కాదు. ‘ఒక దర్శకుడు ఒక హిట్ ఇస్తే రెండు మూడు సినిమాలకి అడ్వాన్సు తీసుకునే అవకాశముంది, రచయితలకి ఆ అవకాశం లేదు. ఒక బిగ్ బడ్జెట్ సినిమాకి రాసే అవకాశం వస్తే అప్పుడు కేవలం మన టాలెంట్ నే నమ్ముకుని ప్రూవ్ చేసుకోవాలి తప్ప, మరి దేన్నీ కాదు. షార్ట్ కట్స్ ఇక్కడ పనిచెయ్యవు, పసి గట్టేస్తారు. ఇక రాసిన స్క్రిప్టులు ఓకే కాక మురిగిపోవడం,  నా ఐడియాలు ఇతరులు తస్కరించడం ఇవన్నీ అనుభవించాను. ఈ రంగంలో ఇది సహజమే, ఈ  వృత్తిలో ఇవి కూడా ఒక భాగం’ అని కుండబద్దలు కొడతారు. 

ఉర్మీ జువెకర్
        కెరీర్ భద్రత తలమీద కత్తిలా వేలాడ్డం విజయవంతమైన రచయితలూ అనుభవించేదే నని జుహీ అంటారు. ‘దీనికి నేనేం భయపడను.  కానీ మనం కాస్త ఎక్కువ డబ్బు సంపాదిస్తాం చూడండి, అప్పుడు చాలా మంది అదో రకంగా చూస్తారు. విక్కీ డోనర్ తర్వాత నేను కాస్త గౌరవప్రదమైన పారితోషికానికి నోచుకుంటే కొందరికి కడుపు మండి పోయింది. అలాగని ఎక్కువ డబ్బొంచ్సిందనీ సంతోషించలేం, ఆ మేరకు పిండి పారేస్తారు మనల్ని’ అని జుహీ వాస్తవం చెప్తారు. 

          అయితే పారితోషికాల విషయంలో హిమాంశూకి సదభిప్రాయమే వుంది. దశాబ్ద కాలంగా పరిస్థితి మెరుగు పడిందంటారు- ‘మనం ఎంత బాగా రాస్తే అంత  ఎక్కువ ఇస్తున్నారు. అంత  మాత్రాన ప్రతీ దర్శకుడూ ప్రతి రచయితా ధనికులైపోతున్నారని కాదు, కానీ బెటర్ పొజిషన్ లోకే వస్తున్నారు. ఒకప్పుడు  సలీం- జావేద్ లు బాలీవుడ్ ని శాసించారు. అలాటి అదృష్టం మాత్రం ఇప్పుడెవరికీ వరించదు’ 

          కాబట్టి సారాంశంలో తేలేదేమిటంటే బాలీవుడ్ లో సినిమా రైటింగ్ ని  ఒక వృత్తిగా ఎంచుకుని పరుగులు తీసి రావడం- అదీ ఓ ఇద్దరు ముగ్గురు నవతరం రచయితల సక్సెస్ ని  చూసి ఆవేశ పడ్డం అంత ఉచితమైనది కాదు. ఈ ముగ్గురు సక్సెస్  సాధించిన నవతరం రచయితలూ కూడా దశాబ్దానికి పైబడి కృషి చేస్తేనే ఇప్పుడు నవతరం రచయితలు  కాగలిగారు. పైగా వీళ్ళకి రచయిత లవడానికి తగిన సాంస్కృతిక నేపధ్య ముంది. పేరొచ్చాక కూడా పరిస్థితుల్లో  మార్పేమీ లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని, రాత్రికి రాత్రే ఎవరూ పాపులర్ రచయితలు  కాలేరనీ, ఎవరికీ ఎర్రతివాచీలు పర్చి స్వాగతం పలకరనీ వాస్తవాలు గుర్తించి ఆ పైన నిర్ణయించుకుంటే మంచిది.

-మిడ్ డే సౌజన్యంతో.










15, ఆగస్టు 2016, సోమవారం

నాటి సినిమా!






 సినిమా అనే మూడక్షరాల కళని మించిన కనికట్టేది? కథానాయకుణ్ణి  కమెడియన్ గా చూసి వున్న కళ్ళతో ట్రాజడీని చూస్తే సినిమా సాంతం కొత్తదనమే. కథలు అవే వున్నప్పుడు పాత్రధారి రివర్స్ ఇమేజితో దర్శన మిస్తే కథల  మొనాటనీ వెళ్లి మూసీలో కలిసిపోవాల్సిందే- ఉన్న కాసిని కథలతో పండించుకున్నన్ని కాంబినేషన్లు గనుక మనకుంటే!

        కానీ ‘ఈ తరం ఫిలిమ్స్’ అధినేత పోకూరి బాబూ రావు కామెడీ కింగ్ రాజేంద్ర ప్రసాద్ తో సీరియస్ సినిమా అనుకున్నప్పుడు, ఆయనకి  పై బాక్సాఫీసు మంత్రాలేవీ మెదల్లేదు. సామాజిక దుస్థితిని ఎండగట్టే ఆయన తృష్ణకి ఏ కమర్షియల్ అవసరాలూ ముఖ్యమని తోచలేదు. కళ ఎప్పుడూ పాపులారిటీ కోసం ప్రాకులాడకూడదని అన్నాడు ఆస్కార్ వైల్డ్. అలాటి కళే కలకాలం నిల్చి వుంటుంది. కనుక తన రచయితలతో కలిసి బాబూరావు తయారు చేసుకున్న నంది అవార్డు లభించబోయే పాత్రకి ప్రత్యేకించి రాజేంద్ర ప్రసాద్ ని అనుకోవడానికి, సింపుల్ గా ‘సగటు మనిషి’ లో రాజేంద్ర ప్రసాద్ కమెడియన్ గా కన్పించక పోవడమే స్ఫూర్తి. రాజేంద్ర ప్రసాద్ ని కమెడియన్ గానే ముద్రవేశారు గానీ, ఆయనలో విభిన్న కోణాల విలక్షణ నటుడు దాగి వున్నాడని ఎవరూ సరిగ్గా గుర్తించలేదు. అందుకని బాబూరావు ఆయన్ని పిలిపించుకుని ‘ఎర్రమందారం’ కథ విన్పించారు. వినిపిస్తే రాజేంద్ర ప్రసాద్ వినేసి మాట్లాడకుండా వెళ్ళిపోయారు. ఏమిటిలా వెళ్ళిపోయాడు? చేస్తాడా, చెయ్యడా చెప్పడే? కథ నచ్చలేదా?  నచ్చకపోతే చెప్పేసి వెళ్లి పోవచ్చుగా? ... లాంటి రకరకాల సందేహాలతో బాబూరావుంటే, గంట తర్వాత రాజేంద్ర ప్రసాద్ ఫోన్ చేసి- ‘పదే పదే అదే గుర్తు కొస్తోంది...చాలా ఫీలవుతున్నాను... ఆ క్యారక్టర్ నేను చేస్తాను...దానికిలా సమ్మర్ కటింగ్ చేయించుకుని,  ఇలా డ్రెస్ చేసుకుంటాను... ఇలా మాట్లాడతాను...’  అని చెప్పేస్తూ పాత్రలో కెళ్ళి పోయి దాన్ని తనదిగా చేసుకున్నారు రాజేంద్ర ప్రసాద్. 

        చాప్లిన్ టు చలం నవ్వించి ఏడ్పించారు. . అది సేఫ్ బెట్. కానీ  దీన్ని కూడా త్రోసి రాజని రాజేంద్ర ప్రసాద్ నవ్వుని కాసేపు పక్కన పెట్టేసి, మొత్తంగా ఏడ్పించే రిస్కు తీసుకున్నారు సాహసోపేతంగా. కథలో సినిమా బండి రాముడుగా ప్రవేశించి, ఊరి దొర చేతిలో కీలుబొమ్మయ్యే దళిత సర్పంచ్ గా స్థిర పడి, తిరగబడి, చివరికి చచ్చి పోతాడు. పంచాయితీ రాజ్ వ్యవస్థలో రిజర్వేషన్ల ప్రహసనానికి ఈ పాత్ర, ఈ సినిమా మచ్చు తునకలు.

      ట్రాజడీల్లో పాత్రల మనస్తత్వాల పైన ముగింపులు  ఆధార పడతాయి. ‘మనుషులు మారాలి’ లో శోభన్ బాబు పాత్ర మరణం, శారద పాత్ర మానసిక స్థితి వల్ల  మరో విషాదాంతానికి దారి తీస్తుంది.  అదే ‘ఎర్రమందారం’ లో రాజేంద్ర ప్రసాద్ పాత్ర మరణం,  యమున  పాత్ర మానసిక బలం వల్ల  విజయానికి దారితీస్తుంది. వైఫల్య సాఫల్యాలు రెండూ వాటి నేపధ్య బలాలతో సినిమా విజయానికి తోడ్పడతాయి. చాలినంత నేపధ్య బలం లేకపోతే  ఏ సినిమాలూ నిలబడలేని ముగింపులు ఎదురవుతాయి. 

        ‘ఎర్రమందారం’ లో రాజేంద్ర ప్రసాద్ పాత్ర మరణానికి ముందే చాలినంత  నేపధ్య బలం కల్పించారు. ఇందులో ఊరి దొర  నడిపే సినిమా టాకీసుకి, సినిమా బండిని తిప్పే చదువురాని బడుగు జీవి ‘రాముడు’ గా ఉంటాడు ది మల్టీ డైమెన్షనల్ రాజేంద్ర ప్రసాద్. ఈ జగ్గన్న అనే దొర  (దేవ రాజ్) కరుడు గట్టిన ఫ్యూడలిస్టు. ఇటు ప్రజల్నీ, అటు ప్రభుత్వాన్నీ దోచి పారేస్తూ దర్జాగా ఉంటాడు. ఇతను  ప్రవచించే సమన్యాయం ఐడియాలజీ తన స్వార్ధం కోసమే. తను బడుగుల వ్యతిరేకి కాదని తెలిసేందుకు గుళ్ళో దొంగతనానికి పాల్పడ్డ పండిత పూజారి మెడలో చెప్పుల దండ వేయించి,  గాడిద మీద ఊరేగించే ఘనకార్యం కూడా చేస్తాడు. 

        ఇలాటి జగ్గన్న దగ్గర ఊడిగం చేస్తున్న రాముడికి లక్ష్మి అనే కోడి పుంజుని  వెంటేసుకు తిరిగే అరుంధతి (యమున) తో సరసాలుంటాయి. ఈ సరసాలు పెళ్ళికి దారి తీసి ఓ ఇంటి వాడయ్యేసరికి, పంచాయితీ ఎన్నికలొస్తాయి. ఈసారి ఈ స్థానాన్ని రిజర్వుడు స్థానంగా ప్రకటించారు. దీంతో చక్కటి బలి మేకలా రెడీగా కన్పిస్తున్న దళితుడైన రిజర్వేషన్  హీరో రాముడిని పిలిచి, ఏక గ్రీవ ఎన్నిక పేరుతో  ఎంచక్కా వధ్యశిల నెక్కించేస్తాడు జగ్గన్న. ఇక సర్పంచ్ స్థానంలో కూర్చున్న వాడి చేత అడ్డంగా సంతకాలు చేయించుకోవడం, అభివృద్ధి నిధులు దండిగా జేబులో వేసుకోవడం లాంటి స్వకార్యాలు చక్క బెట్టుకుంటాడు జగ్గన్న. సర్పంచ్ గా ఎన్నికైన రాముడు వూరి కోసం ఏదో చేస్తాడని జనం ఎదురు చూస్తూంటారు. ఏదీ చెయ్యక పోగా, పాత రిక్షా బండి రాముడి లాగే జగ్గన్నకి దాస్యం చేయవలసి రావడం చూస్తూంటే  తనకే అసహ్యమేసి మీద తిరగబడతాడు రాముడు. దీంతో జగ్గన్న కి వొళ్ళు మండిపోయి రాముణ్ణి హత్య కేసులో ఇరికించేస్తాడు. రాముడు జైలు కెళ్ళి తిరిగొచ్చే నాటికి ఊళ్ళో తెలుగు గంగ ప్రాజెక్టు పేరుతో  భూములు పోతూంటాయి. ఈ భూముల వ్యవహారం  ఆరా తీస్తే ఏముంది- అవన్నీ తన లాంటి బడుగుల పేర పట్టాలు చేయించుకుని బినామీగా జగ్గన్న దొర అనుభవిస్తున్నవే. దీంతో మళ్ళీ తిరగబడ్డ రాముడికి మరణమే మిగుల్తుంది. 

        ఇక్కడ జగ్గన్న మరో నాటక మాడతాడు. ఆ శవం రాముడిది  కాదనీ, తన ఈరి గాడిదనీ, ఆ ఈరిగాణ్ణి రాముడే చంపి పారిపోయానీ పంచనామాలో రాయిస్తాడు. ఈ అక్రమాన్ని కళ్ళారా చూసిన రాముడి భార్య అరుంధతి-  ఆ పంచనామా మీద సంతకం పెట్టేస్తుంది. ఇక కొడుకుని వెంటేసుకుని తన రహస్య ఎజెండా  అమలు పరుస్తుంది. ఈ క్రమంలో దొరకి తను ఉంపుడుగత్తె అయ్యిందన్న పుకార్లు లేచినా లెక్క చెయ్యదు.  దాష్టీకపు దొర జగ్గన్నని ఊరించి ఊరించీ.... చివరికి వూరి చివర అతడి బంగళాకే రప్పించి- కొడుకు అందించిన ఆయుధంతో కస్సక్ మన్పిస్తుంది. 

        సంచలనం! అరుంధతి దొరని చంపి పారేసింది! ....ఈ సంచలనం మధ్య ఇంకో షాకి స్తుంది అరుంధతి పోలీసులకి- పారిపోయిన తన భర్త రాముడే వచ్చి దొరని చంపేశాడని!  ఏ మాటలతో తనని మభ్య పెట్టారో-  అలాటి మాటలే పోలీసుల నోట్లో కుక్కి వెళ్ళిపోతుంది ఎర్ర మందారమై. 

        ఇందులో స్క్రీన్ ప్లే పరిభాషలో చెప్పుకోవాలంటే, యమునది డెడ్ హ్యాండ్- ఆఫ్ పాత్ర. కొన్ని సినిమాల్లో ప్రధాన పాత్ర తాత్కాలికంగా కనుమరుగై, దాని ఆశయ సాధన కోసం ఇంకో పాత్ర కథని కొంతవరకు ముందుకు నడిపించి, తిరిగి ఆ ప్రధాన పాత్ర ప్రవేశించగానే ఆ ఆశయాన్ని లేదా  విజయ పతాకాన్ని ప్రధాన పాత్రకి అప్పగించి తప్పుకుంటుంది. ఇది హ్యాండ్ - ఆఫ్ పాత్ర.  ఇలాకాక ప్రధాన పాత్రే మధ్యలో మరణిస్తే, చివరంటా దాని ఆశయాన్ని ముందుకు నడిపించే డెడ్ హ్యాండ్-  ఆఫ్ పాత్ర యమున పోషించిన పాత్ర లాంటిది. ఇంతకీ ఈ కథ ఏ పాత్ర కథ అన్న  ప్రశ్న వస్తే, బాబూరావే చెప్పినట్టు- ఏ పాత్రదీ కాదు,  అదొక కథ అంతే! 

        ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో ఈ సినిమా నడక ఆర్ట్ ఫిలిం కి దగ్గరగా వుంటుంది. సినిమాకి లాభం  రాకపోయినా నష్టం రాలేదు. అయితే రాజేంద్ర ప్రసాద్ కి ఆ సంవత్సర (1991) ఉత్తమ నటుడిగా సినిమాకి ఉత్తమ కథ చిత్రంగా, జాలాదికి ఉత్తమ గేయ రచయితగా, దేవ రాజ్ కి ఉత్తమ విలన్ గా, గౌతమ్ రాజుకి ఉత్తమ ఎడిటర్ గా ...ఇన్ని నంది అవార్డు లొచ్చాయి... దీంతో సినిమా పట్ల క్రేజ్  పెరిగి వీడియో క్యాసెట్లు  బాగా అమ్ముడు పోయాయి.

        ఇందులో కొడుకు పాత్ర పోషించిన కిరణ్  బాబూరావు సోదరుడి కుమారుడే. ఈయన ప్రస్తుతం అమెరికాలో డాక్టర్. చైల్డ్ ఆర్టిస్టుగా ఈయన నటన ఒక ఆశ్చర్యం గొలిపే సంఘటన. చక్రవర్తి స్వరపరచిన పాటల్లో జాలాది రాసిన గీతం గురించి చిన్న నేపధ్యం చెప్పారు బాబూరావు. ‘ఎర్రమందారం’ తీయడానికి పూర్వం ఎప్పుడో జాలాది బాబూరావు దగ్గరికి వచ్చి- ‘కళ్ళు తెరిస్తే ఉయ్యాల, కళ్ళు మూస్తే మొయ్యాల’ అని పల్లవి విన్పించే సరికి, కదిలిపోయిన బాబూరావు దాన్ని మరెవ్వరికీ ఇవ్వకుండా అట్టి పెట్టుకున్నారు. ‘ఎర్రమందారం’  తీస్తున్నప్పుడు ఆ  పల్లవికి తగ్గట్టు సన్నివేశాన్ని చాలా యాతన పడి సృష్టించి-  మిగతా చరణాలు రాయించేశారు జాలాది చేత! దీనికే నంది అవార్డు వచ్చింది...

స్క్రిప్టు వెనుక క్రాఫ్టు 
       ‘ఎర్ర మందారం’ స్క్రిప్టు ఎలా తయారయ్యింది? ఇటీవల  ‘యజ్ఞం’, ‘రణం’, ‘ఒంటరి’ లాంటి భారీ సినిమాలు నిర్మించిన పోకూరి బాబూరావు అప్పట్లో ‘నేటిభారతం’, ‘రేపటి పౌరులు’, ‘దేశంలో దొంగలు పడ్డారు’ వంటి హిట్స్ కూడా నిర్మించి వున్నారు. ఒకరోజు ‘ఆంధ్ర జ్యోతి’  దీపావళి ప్రత్యేక సంచికలో ఎంవిఎస్ హరనాథ రావు రాసిన ‘ లేడి చంపిన పులి నెత్తురు’ కథ చదివి ఇన్స్ పైర్ అయ్యారు బాబూరావు. 

        దీన్ని సినిమాగా తీద్దామంటే, దీనికి  సరిపడా సినిమా లక్షణాల్లేవని తోసిపుచ్చారు హరనాథ రావే. బాబూరావు పట్టుబట్టడంతో ఇక తప్పదనుకుని ఆయనతో కలిసి కూర్చుని ఒక ఔట్  లైన్ తయారు చేశారు హరనాథ రావు. అది బాబూరావుకు నచ్చింది. కానీ హరనాథ రావుకి సంతృప్తి కలగలేదు. కథలో లైఫ్ మిస్ అయినట్టు వుందని, డాక్యుమెంటరీలా ఉందనీ చెప్పి ఇంకో పది  రోజులు టైం తీసుకున్నారు. అప్పుడొచ్చి పూర్తిగా మార్చేసిన కొత్త ఔట్ లైన్ విన్పించారు. 

        ఇంతకీ పత్రికలో వచ్చిన అసలు ఒరిజినల్ కథేమిటి? ఊరి దొర చేతిలో భర్తని పోగొట్టుకున్న పడతి, ఆ దొర మీద పగదీర్చుకోవడం అచ్చులో వచ్చిన  స్టోరీ లైన్. ఇందులో పూర్వం జరిగిన భర్త హత్య గురించి రేఖా మాత్రమైన ప్రస్తావనే తప్ప, కథగా వుండదు. పూర్తి కథ ఆమె పరంగా నడిచేదే. దళితవాడ నుంచి పెట్రేగిన స్త్రీ కథ. కథలో దొర ఆమెని అనుభవిస్తాడు కూడా. కొడుకు ఆమెకి సాయంగా వున్నా, దొర హత్యలో పాలుపంచుకోడు.  

        ఈ చిన్న కథని సినిమాకి తీసుకునే సరికి భర్త పాత్రని పెంచుతూ  రిజర్వేషన్ల అంశం జోడించి, దొర చేతిలో అతను హతమయ్యేందుకు అవసరమైన నేపధ్య బలమంతా కల్పించారు. కథానాయికని దొర అనుభవించే ఘట్టం తొలగించి, సినిమా కాబట్టి హీరోయిన్ పాత్ర పావిత్ర్యాన్ని కాపాడుతూ, అదే సమయంలో కొడుకు పాత్రని దొర హత్య కి తగు విధంగా యాక్టివేట్ చేశారు. ఇలా మారిపోయిన కొత్త  ఔట్ లైన్ బాబూరావుకి ఇంకా బాగా నచ్చి, మరో రచయిత సంజీవితో సీనిక్ ఆర్డర్,  ట్రీట్ మెంట్ వగైరా కానిచ్చారు. ఫైనల్ గా హరనాథ రావు డైలాగ్ వెర్షన్ రాశారు. ఇందులో ఆయన సోదరుడు, రచయిత మరుధూరి రాజా స్వల్ప పాత్ర పోషించారు. స్క్రీన్ ప్లే క్రెడిట్ బాబు రావు – సంజీవీలు తీసుకుంటే, కథ -మాటలు హరనాథ రావు వేసుకున్నారు. 

        ఈ స్క్రిప్టు దర్శకుడు ముత్యాల సుబ్బారావు చేతిలో ఎలా తెరకెక్కిందంటే, ఆయన లెఫ్ట్ కి ఎక్కువ ప్రాధాన్య మిచ్చినట్టు కన్పిస్తుంది. ముఖ్యంగా  రాత్రి పూట లాంతరు పట్టుకుని భర్త కోసం యమున వెతికే దృశ్యాల్లోని  మైన్యూట్ డిటైల్స్ అన్నీ, అచ్చం స్క్రీన్ ప్లేలో రాసిన వర్ణనలతోనే  చిత్రీకరించడంతో, అదంతా ఒక సినిమా చూస్తున్నట్టు వుండదు, సినిమాని చదువుతున్నట్టు వుంటుంది. అదీ సుబ్బయ్య టాలెంట్. దీనికి ఆర్. రామారావు కెమెరా వర్క్ క్లాసిక్ టచ్. 

        సాధారణంగా సినిమాల్లో విలన్ ఎంట్రీ ని కన్పించగానే,  ప్రత్యక్షంగా అక్కడికక్కడే ఏదో దారుణానికి పాల్పడ్డంతో  చూపిస్తూంటారు.  కానీ  ‘ఎర్ర మందారం’ స్క్రీన్ ప్లేలో విలన్ అయిన దొరని చూపించకుండానే అనుచరుల చేత అతడి దాష్టీకాన్ని చూపిస్తూ- చెప్పుల దండతో  గుడి పూజారిని ఊరేగించే దృశ్యంతో –ఇలాటి కర్కోటకుడు విలన్ అని పరోక్షంగా తెలియజేయడం  ఎంతో రిలీఫ్ నిస్తుంది రొటీన్ మూస నుంచి! విలన్ పాత్ర పరిచయం ఇలా ఎంత హాయిగా అన్పించిందో బాబూ రావుకి చెపితే, ఆయన కూడా హాయిగా చిరునవ్వుతో చూశారు.


-సికిందర్
(ఆగస్టు 2010-  ‘సాక్షి’)