రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

16, ఆగస్టు 2016, మంగళవారం

రైటర్స్ కార్నర్!




బాలీవుడ్ లో నవతరం రచయితలు జోరు మీదున్నారు. విజయాలు సాధించిన కొందరు నవతరం రచయితల్ని చూసి మరింతమంది కొత్త రచయితలు వచ్చేస్తున్నారు -  ఈరంగంలో అదృష్టాన్ని పరీక్షించుకుందామని. అయితే విజయాలు సాధిస్తూ  రోల్ మోడల్స్ గా కన్పిస్తున్న ఈ  నవతరం రచయితలకీ అటు తర్వాత కూడా అదే  స్ట్రగుల్ తప్పడం లేదు. అనామకులుగా బాలీ వుడ్ లో ప్రవేశించి నేడు ప్రముఖులైపోతున్న నవరతం రచయితలూ రచయిత్రులూ  ఆ వెంటనే అనామకులైపోయే ప్రమాదంలోనూ  పడుతున్నారు. బాలీవుడ్ లోకి వస్తున్న కొత్త రచయితల సంఖ్యా పెరిగిపోయి-   నిర్మాతలకీ  ఛాయిస్ లు పెరగడంతో  వున్న ప్రముఖ నవతరం రచయితలూ కమాండ్ చేయలేని, డిమాండ్ కూడా చేయలేని సగటు రచయితల పరిస్థితిలో పడిపోతున్నారు. పీకూ, ఎన్ హెచ్- 10, తనూ వెడ్స్ మను రిటర్న్స్, దమ్ లగాకే హైసా...మొదలైన నవతరం రచయితలు  రాసిన సినిమాలు బాగా సొమ్ములు చేసుకుని వుండవచ్చు గాక, విధూ వినోద్ చోప్రా లాంటి నిర్మాత- దర్శకుడు, రణవీర్ సింగ్ లాంటి స్టార్ కలిసి రచయితలకి మంచి పారితోషికాలివ్వాలని రచయితల తరపున మాట్లాడి వుండవచ్చు గాక – కానీ వాస్తవ పరిస్థితుల్లో మార్పేమీ రావడం లేదు. కారణం- ప్రధానంగా మంచి స్క్రిప్టుని  గుర్తించి ఓకే చేయగల్గినా, దాని విలువని అంచనా వేయలేకపోవడమే. సినిమా పూర్తయ్యే వరకూ  కూడా అదెంత మేరకు  కలెక్ట్ చేయగలదో వూహించ లేకపోవడమే. దీంతో  కొత్త రచయితలకి బొటాబొటీ ఇచ్చేసి పంపించేస్తున్నారు. తీరా ఆ స్క్రిప్టుతో తీసిన సినిమా పెద్ద హిట్టయి కూర్చుంటోంది...నిర్మాతకి  ఊహించని లాభాలు, రచయితకి  ఆ దక్కిన బొటాబొటీ తోనే జీవితం. 

          సినిమా రచయితల  సంఘాన్ని ఆధునికంగా ఏర్పాటు చేసుకున్నారు- కానీ అక్కడ రచయితల సమస్యలు ఇంకా పురాతన మైనవే. ఆర్ధికంగా రచయితలుగా కొనసాగలేక ఇంకో వృత్తి కూడా చూసుకోవాల్సిన పాత సమస్యల్నే ఇంకా ఎదుర్కొంటున్నారు. 

జుహీ చతుర్వేదీ
        అయినా ఇదేమీ గుర్తించకుండా నవతరం రచయితలుగా పాపులరైన  జుహీ చతుర్వేదీ, ఉర్మీ జువేకర్, హిమాంశూ శర్మల వంటి వాళ్ళని చూసి బాలీవుడ్ లోకి కొత్త కొత్త రచయితలు  వచ్చి పడుతున్నారు. ఇది మంచిదే. దర్శకులే రచనలు చేసుకుంటున్న కాలంలో  ఎవరైనా దర్శకులవుదామనే మోజుపడుతున్నారు తప్ప, రచయితలవుదా మనుకోవడం లేదు. అయితే పైన చెప్పుకున్న ఆ ముగ్గురు రచయితల స్పూర్తితో ఇప్పుడు తండోపతండాలుగా రచయితలవుదామని రంగ ప్రవేశం చేస్తున్నారు.  కానీ ఇక్కడి వాస్తవ పరిస్థితులు వాళ్ళూ గమనించడం లేదు. ఈ నేపధ్యంలో విక్కీ డోనార్, పీకూ ల వంట టి డిఫరెంట్ సినిమాలకి రాసిన జుహీ  చతుర్వేదికి అసలు స్ట్రగుల్ చేయాల్సిన అవసరమే రాలేదు. ఆమెకి ఆల్రెడీ అడ్వర్ టైజింగ్ కెరీర్ వుంది. కాబట్టి ఆర్దిక సమస్యలు లేవు.  ‘నేను విక్కీ డోనర్ రాస్తున్నప్పుడు  రాస్తున్నానని ఎవరికీ  తెలీదు. జాబ్ చేసుకుంటూనే రాశాను. ఆ జాబ్ కూడా ఉదయం నుంచీ రాత్రి పొద్దు పోయేవరకూ వుండేది. ఆ తర్వాతే రాసేదాన్ని. ఎన్నో నెలల పాటు రాత్రి పూట రెండు మూడు గంటలు మాత్రమే నిద్రపోయాను. ప్రాక్టికల్ గా ఆలోచిస్తే కేవలం సినిమా రచన మీదే దృష్టి పెట్టి కొనసాగడానికి పరిస్థితులు అనుకూలంగా లేవు’ అంటారామె.

          లక్నోలో పుట్టి పెరిగిన ఆమె, అక్కడే  లొరెట్టో  కాన్వెంట్ లోనూ, ఆ తర్వాత లక్నో కాలేజ్  ఆఫ్ ఆర్ట్స్ లోనూ  విద్య పూర్తి చేశారు. 1996 లో ఢిల్లీ వచ్చి ప్రసిద్ధ  ఒజిల్వీ అండ్  మాథర్ యాడ్ ఏజెన్సీలో కాపీ  రైటర్ గా చేరారు. లజ్ పత్ నగర్ లో అద్దెకున్నారు. అక్కడి పరిసరాల వాతావరణమే ఆమె రాసిన ‘విక్కీ డోనర్’ లో కన్పిస్తుంది.  2008 లో ఢిల్లీ నుంచి  ముంబాయి వచ్చి  లియో బార్నెట్ అనే యాడ్ కంపెనీ లో చేరారు. అప్పుడే మొదటి సినిమా ‘షూ బైట్’  కి మాటలు రాశారు. కానీ అది విడుదల కాలేదు. 2012 లో సొంతంగా ‘విక్కీ డోనర్’ రాసే ముందు సంవత్సరం జాబ్ వదిలేశారు. 

          ‘పీకూ రాసిన తర్వాత కూడా నా అడ్వర్టైజింగ్ కెరీర్ అనే ఒక అండ ఉందన్న ధైర్యంతోనే  సినిమాల్లోకి రావడానికి సాహసం  చేశానని చెప్పగలను. ఢిల్లీలోనైనా ముంబాయి లోనైనా ముందు బ్రతకడానికి డబ్బుకావాలి. ఇక్కడ స్క్రిప్టూ దాంతోబాటు రైటర్లూ ఎంతో ముఖ్యమనే చెప్తారు. అయినా పారితోషికాలు చాలా తక్కువ వుంటాయి. అడ్వాన్సు తీసుకున్నప్పటి నుంచీ సినిమా అపూర్తయ్యే వరకూ చాలాకాలం పడుతుంది. అంత కాలం పాటు  అప్పుడప్పుడు అందే డబ్బుతో ముంబాయిలో జీవనం కష్టమైపోతుంది’ అనికూడా జుహీ అంటారు.

హిమాంశూ శర్మ
         హిమాంశూ శర్మ కైతే ముంబాయిలో అద్దెలు కట్టుకోవడమే పెను సమస్యగా మారింది. తను కూడా లక్నో నుంచి వచ్చాడు. ‘తనూ వెడ్స్ మను రిటర్న్స్’  తో జాక్ పాట్  కొట్టాడు. 
‘సినిమా అనేది దర్శకుల మీడియా కాబట్టి దర్శకుణ్ణి అవుదామనే నేను ముంబాయి వచ్చాను. కానీ అసిస్టెంట్  డైరెక్టర్ గా చేరడం మాత్రం నా కిష్టముండేది కాదు. రైటర్ గా అయితే రాసుకోవడానికి ఎవర్నీ అడుక్కోనవసరం లేదు. దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ ని కలిసి నా సబ్జెక్టు  విని అభిప్రాయం చెప్పమన్నాను. ఆ సబ్జెక్టు  ఆయనకు నచ్చి డెవలప్ చేయమన్నారు. నెలకు ఇరవై  వేలు చొప్పున శాలరీగా ఇచ్చారు. అసిస్టెంట్ డైరెక్టర్ కి కూడా అంతేకదా వస్తుది, పైగా అది ఘోరమైన జాబ్’ అంటారు తను. అయితే ఈ మాట అసిస్టెంట్ గా పని చేసిన అనుభవంతోనే చెప్తారు. 

          హిందీ సాహిత్యంలో పట్టభద్రుడైన హిమాంశూ ఎన్డీ టీవీ లో ఓ హెల్త్ కేర్ షోతో కెరీర్ ప్రారంభించారు. అక్కడ్నించీ రిస్క్ తీసుకుని బాలాజీ సీరియల్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా ప్రయత్నిద్దామని ముంబాయి వచ్చారు. ఒకటి రెండు సీరియల్స్ చేసి ఆనంద్ రాయ్ కి అసిస్టెంట్ గా  వెళ్ళారు. తర్వాత 2008 లోవిజయ్ కృష్ణ ఆచార్య  తీసిన ‘తాషాన్’ కి కూడా అసిస్టంట్ గా పనిచేశారు. అసిస్టెంట్ వృత్తి అధ్వాన్నమైనదని అప్పుడు గుర్తించి రచన మీదికి దృష్టిని  మళ్ళించారు. 

          ఇక ఊర్మీ జువెకర్ కైతే మొదటి నుంచీ సినిమా రచయిత్రి కావాలనే వుంది. 2015 లో దిబాకర్ బెనర్జీ తీసిన ‘డిటెక్టివ్ బియోంకేష్ బక్షీ’  కి సహ రచయిత్రిగానూ, 2012  లో ‘షాంఘై’ కీ, ఇంకా ముందు  2008 లో ‘ఓయ్ లక్కీ ఓయ్’  కీ సహ రచయిత్రిగా పనిచేసిన ఈమె పూర్వం డాక్యుమెంటరీ లకి పనిచేశారు. ‘పదహారేళ్ళ క్రితం నుంచీ ఈ రంగంలోనే పాట్లు పడుతున్నాను.  అప్పట్లో ఇంకా సినిమా వాళ్ళంటే మన ఇరుగుపొరుగులో అంత గౌరవ భావం వుండేది కాదు. అలాటి పరిస్థితుల్లోంచి  ఇప్పుడు విలువ ఇస్తున్న కాలంలోకి నా ప్రయాణం సాగించాను. నాకింకా వేరే ఏ పనీ చేతగాకనే ఈ రంగంలో కొచ్చాను’ అంటారీమె. 

          తను  ఎంత కృషి చేసినా, ఎంత ప్రావీణ్యం చూపినా వచ్చే ఆదాయం నెలఖర్చులకి చాలేది కాదు. ‘ఒక దర్శకుడు ఒక హిట్ ఇస్తే రెండు మూడు సినిమాలకి అడ్వాన్సు తీసుకునే అవకాశముంది, రచయితలకి ఆ అవకాశం లేదు. ఒక బిగ్ బడ్జెట్ సినిమాకి రాసే అవకాశం వస్తే అప్పుడు కేవలం మన టాలెంట్ నే నమ్ముకుని ప్రూవ్ చేసుకోవాలి తప్ప, మరి దేన్నీ కాదు. షార్ట్ కట్స్ ఇక్కడ పనిచెయ్యవు, పసి గట్టేస్తారు. ఇక రాసిన స్క్రిప్టులు ఓకే కాక మురిగిపోవడం,  నా ఐడియాలు ఇతరులు తస్కరించడం ఇవన్నీ అనుభవించాను. ఈ రంగంలో ఇది సహజమే, ఈ  వృత్తిలో ఇవి కూడా ఒక భాగం’ అని కుండబద్దలు కొడతారు. 

ఉర్మీ జువెకర్
        కెరీర్ భద్రత తలమీద కత్తిలా వేలాడ్డం విజయవంతమైన రచయితలూ అనుభవించేదే నని జుహీ అంటారు. ‘దీనికి నేనేం భయపడను.  కానీ మనం కాస్త ఎక్కువ డబ్బు సంపాదిస్తాం చూడండి, అప్పుడు చాలా మంది అదో రకంగా చూస్తారు. విక్కీ డోనర్ తర్వాత నేను కాస్త గౌరవప్రదమైన పారితోషికానికి నోచుకుంటే కొందరికి కడుపు మండి పోయింది. అలాగని ఎక్కువ డబ్బొంచ్సిందనీ సంతోషించలేం, ఆ మేరకు పిండి పారేస్తారు మనల్ని’ అని జుహీ వాస్తవం చెప్తారు. 

          అయితే పారితోషికాల విషయంలో హిమాంశూకి సదభిప్రాయమే వుంది. దశాబ్ద కాలంగా పరిస్థితి మెరుగు పడిందంటారు- ‘మనం ఎంత బాగా రాస్తే అంత  ఎక్కువ ఇస్తున్నారు. అంత  మాత్రాన ప్రతీ దర్శకుడూ ప్రతి రచయితా ధనికులైపోతున్నారని కాదు, కానీ బెటర్ పొజిషన్ లోకే వస్తున్నారు. ఒకప్పుడు  సలీం- జావేద్ లు బాలీవుడ్ ని శాసించారు. అలాటి అదృష్టం మాత్రం ఇప్పుడెవరికీ వరించదు’ 

          కాబట్టి సారాంశంలో తేలేదేమిటంటే బాలీవుడ్ లో సినిమా రైటింగ్ ని  ఒక వృత్తిగా ఎంచుకుని పరుగులు తీసి రావడం- అదీ ఓ ఇద్దరు ముగ్గురు నవతరం రచయితల సక్సెస్ ని  చూసి ఆవేశ పడ్డం అంత ఉచితమైనది కాదు. ఈ ముగ్గురు సక్సెస్  సాధించిన నవతరం రచయితలూ కూడా దశాబ్దానికి పైబడి కృషి చేస్తేనే ఇప్పుడు నవతరం రచయితలు  కాగలిగారు. పైగా వీళ్ళకి రచయిత లవడానికి తగిన సాంస్కృతిక నేపధ్య ముంది. పేరొచ్చాక కూడా పరిస్థితుల్లో  మార్పేమీ లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని, రాత్రికి రాత్రే ఎవరూ పాపులర్ రచయితలు  కాలేరనీ, ఎవరికీ ఎర్రతివాచీలు పర్చి స్వాగతం పలకరనీ వాస్తవాలు గుర్తించి ఆ పైన నిర్ణయించుకుంటే మంచిది.

-మిడ్ డే సౌజన్యంతో.










15, ఆగస్టు 2016, సోమవారం

నాటి సినిమా!






 సినిమా అనే మూడక్షరాల కళని మించిన కనికట్టేది? కథానాయకుణ్ణి  కమెడియన్ గా చూసి వున్న కళ్ళతో ట్రాజడీని చూస్తే సినిమా సాంతం కొత్తదనమే. కథలు అవే వున్నప్పుడు పాత్రధారి రివర్స్ ఇమేజితో దర్శన మిస్తే కథల  మొనాటనీ వెళ్లి మూసీలో కలిసిపోవాల్సిందే- ఉన్న కాసిని కథలతో పండించుకున్నన్ని కాంబినేషన్లు గనుక మనకుంటే!

        కానీ ‘ఈ తరం ఫిలిమ్స్’ అధినేత పోకూరి బాబూ రావు కామెడీ కింగ్ రాజేంద్ర ప్రసాద్ తో సీరియస్ సినిమా అనుకున్నప్పుడు, ఆయనకి  పై బాక్సాఫీసు మంత్రాలేవీ మెదల్లేదు. సామాజిక దుస్థితిని ఎండగట్టే ఆయన తృష్ణకి ఏ కమర్షియల్ అవసరాలూ ముఖ్యమని తోచలేదు. కళ ఎప్పుడూ పాపులారిటీ కోసం ప్రాకులాడకూడదని అన్నాడు ఆస్కార్ వైల్డ్. అలాటి కళే కలకాలం నిల్చి వుంటుంది. కనుక తన రచయితలతో కలిసి బాబూరావు తయారు చేసుకున్న నంది అవార్డు లభించబోయే పాత్రకి ప్రత్యేకించి రాజేంద్ర ప్రసాద్ ని అనుకోవడానికి, సింపుల్ గా ‘సగటు మనిషి’ లో రాజేంద్ర ప్రసాద్ కమెడియన్ గా కన్పించక పోవడమే స్ఫూర్తి. రాజేంద్ర ప్రసాద్ ని కమెడియన్ గానే ముద్రవేశారు గానీ, ఆయనలో విభిన్న కోణాల విలక్షణ నటుడు దాగి వున్నాడని ఎవరూ సరిగ్గా గుర్తించలేదు. అందుకని బాబూరావు ఆయన్ని పిలిపించుకుని ‘ఎర్రమందారం’ కథ విన్పించారు. వినిపిస్తే రాజేంద్ర ప్రసాద్ వినేసి మాట్లాడకుండా వెళ్ళిపోయారు. ఏమిటిలా వెళ్ళిపోయాడు? చేస్తాడా, చెయ్యడా చెప్పడే? కథ నచ్చలేదా?  నచ్చకపోతే చెప్పేసి వెళ్లి పోవచ్చుగా? ... లాంటి రకరకాల సందేహాలతో బాబూరావుంటే, గంట తర్వాత రాజేంద్ర ప్రసాద్ ఫోన్ చేసి- ‘పదే పదే అదే గుర్తు కొస్తోంది...చాలా ఫీలవుతున్నాను... ఆ క్యారక్టర్ నేను చేస్తాను...దానికిలా సమ్మర్ కటింగ్ చేయించుకుని,  ఇలా డ్రెస్ చేసుకుంటాను... ఇలా మాట్లాడతాను...’  అని చెప్పేస్తూ పాత్రలో కెళ్ళి పోయి దాన్ని తనదిగా చేసుకున్నారు రాజేంద్ర ప్రసాద్. 

        చాప్లిన్ టు చలం నవ్వించి ఏడ్పించారు. . అది సేఫ్ బెట్. కానీ  దీన్ని కూడా త్రోసి రాజని రాజేంద్ర ప్రసాద్ నవ్వుని కాసేపు పక్కన పెట్టేసి, మొత్తంగా ఏడ్పించే రిస్కు తీసుకున్నారు సాహసోపేతంగా. కథలో సినిమా బండి రాముడుగా ప్రవేశించి, ఊరి దొర చేతిలో కీలుబొమ్మయ్యే దళిత సర్పంచ్ గా స్థిర పడి, తిరగబడి, చివరికి చచ్చి పోతాడు. పంచాయితీ రాజ్ వ్యవస్థలో రిజర్వేషన్ల ప్రహసనానికి ఈ పాత్ర, ఈ సినిమా మచ్చు తునకలు.

      ట్రాజడీల్లో పాత్రల మనస్తత్వాల పైన ముగింపులు  ఆధార పడతాయి. ‘మనుషులు మారాలి’ లో శోభన్ బాబు పాత్ర మరణం, శారద పాత్ర మానసిక స్థితి వల్ల  మరో విషాదాంతానికి దారి తీస్తుంది.  అదే ‘ఎర్రమందారం’ లో రాజేంద్ర ప్రసాద్ పాత్ర మరణం,  యమున  పాత్ర మానసిక బలం వల్ల  విజయానికి దారితీస్తుంది. వైఫల్య సాఫల్యాలు రెండూ వాటి నేపధ్య బలాలతో సినిమా విజయానికి తోడ్పడతాయి. చాలినంత నేపధ్య బలం లేకపోతే  ఏ సినిమాలూ నిలబడలేని ముగింపులు ఎదురవుతాయి. 

        ‘ఎర్రమందారం’ లో రాజేంద్ర ప్రసాద్ పాత్ర మరణానికి ముందే చాలినంత  నేపధ్య బలం కల్పించారు. ఇందులో ఊరి దొర  నడిపే సినిమా టాకీసుకి, సినిమా బండిని తిప్పే చదువురాని బడుగు జీవి ‘రాముడు’ గా ఉంటాడు ది మల్టీ డైమెన్షనల్ రాజేంద్ర ప్రసాద్. ఈ జగ్గన్న అనే దొర  (దేవ రాజ్) కరుడు గట్టిన ఫ్యూడలిస్టు. ఇటు ప్రజల్నీ, అటు ప్రభుత్వాన్నీ దోచి పారేస్తూ దర్జాగా ఉంటాడు. ఇతను  ప్రవచించే సమన్యాయం ఐడియాలజీ తన స్వార్ధం కోసమే. తను బడుగుల వ్యతిరేకి కాదని తెలిసేందుకు గుళ్ళో దొంగతనానికి పాల్పడ్డ పండిత పూజారి మెడలో చెప్పుల దండ వేయించి,  గాడిద మీద ఊరేగించే ఘనకార్యం కూడా చేస్తాడు. 

        ఇలాటి జగ్గన్న దగ్గర ఊడిగం చేస్తున్న రాముడికి లక్ష్మి అనే కోడి పుంజుని  వెంటేసుకు తిరిగే అరుంధతి (యమున) తో సరసాలుంటాయి. ఈ సరసాలు పెళ్ళికి దారి తీసి ఓ ఇంటి వాడయ్యేసరికి, పంచాయితీ ఎన్నికలొస్తాయి. ఈసారి ఈ స్థానాన్ని రిజర్వుడు స్థానంగా ప్రకటించారు. దీంతో చక్కటి బలి మేకలా రెడీగా కన్పిస్తున్న దళితుడైన రిజర్వేషన్  హీరో రాముడిని పిలిచి, ఏక గ్రీవ ఎన్నిక పేరుతో  ఎంచక్కా వధ్యశిల నెక్కించేస్తాడు జగ్గన్న. ఇక సర్పంచ్ స్థానంలో కూర్చున్న వాడి చేత అడ్డంగా సంతకాలు చేయించుకోవడం, అభివృద్ధి నిధులు దండిగా జేబులో వేసుకోవడం లాంటి స్వకార్యాలు చక్క బెట్టుకుంటాడు జగ్గన్న. సర్పంచ్ గా ఎన్నికైన రాముడు వూరి కోసం ఏదో చేస్తాడని జనం ఎదురు చూస్తూంటారు. ఏదీ చెయ్యక పోగా, పాత రిక్షా బండి రాముడి లాగే జగ్గన్నకి దాస్యం చేయవలసి రావడం చూస్తూంటే  తనకే అసహ్యమేసి మీద తిరగబడతాడు రాముడు. దీంతో జగ్గన్న కి వొళ్ళు మండిపోయి రాముణ్ణి హత్య కేసులో ఇరికించేస్తాడు. రాముడు జైలు కెళ్ళి తిరిగొచ్చే నాటికి ఊళ్ళో తెలుగు గంగ ప్రాజెక్టు పేరుతో  భూములు పోతూంటాయి. ఈ భూముల వ్యవహారం  ఆరా తీస్తే ఏముంది- అవన్నీ తన లాంటి బడుగుల పేర పట్టాలు చేయించుకుని బినామీగా జగ్గన్న దొర అనుభవిస్తున్నవే. దీంతో మళ్ళీ తిరగబడ్డ రాముడికి మరణమే మిగుల్తుంది. 

        ఇక్కడ జగ్గన్న మరో నాటక మాడతాడు. ఆ శవం రాముడిది  కాదనీ, తన ఈరి గాడిదనీ, ఆ ఈరిగాణ్ణి రాముడే చంపి పారిపోయానీ పంచనామాలో రాయిస్తాడు. ఈ అక్రమాన్ని కళ్ళారా చూసిన రాముడి భార్య అరుంధతి-  ఆ పంచనామా మీద సంతకం పెట్టేస్తుంది. ఇక కొడుకుని వెంటేసుకుని తన రహస్య ఎజెండా  అమలు పరుస్తుంది. ఈ క్రమంలో దొరకి తను ఉంపుడుగత్తె అయ్యిందన్న పుకార్లు లేచినా లెక్క చెయ్యదు.  దాష్టీకపు దొర జగ్గన్నని ఊరించి ఊరించీ.... చివరికి వూరి చివర అతడి బంగళాకే రప్పించి- కొడుకు అందించిన ఆయుధంతో కస్సక్ మన్పిస్తుంది. 

        సంచలనం! అరుంధతి దొరని చంపి పారేసింది! ....ఈ సంచలనం మధ్య ఇంకో షాకి స్తుంది అరుంధతి పోలీసులకి- పారిపోయిన తన భర్త రాముడే వచ్చి దొరని చంపేశాడని!  ఏ మాటలతో తనని మభ్య పెట్టారో-  అలాటి మాటలే పోలీసుల నోట్లో కుక్కి వెళ్ళిపోతుంది ఎర్ర మందారమై. 

        ఇందులో స్క్రీన్ ప్లే పరిభాషలో చెప్పుకోవాలంటే, యమునది డెడ్ హ్యాండ్- ఆఫ్ పాత్ర. కొన్ని సినిమాల్లో ప్రధాన పాత్ర తాత్కాలికంగా కనుమరుగై, దాని ఆశయ సాధన కోసం ఇంకో పాత్ర కథని కొంతవరకు ముందుకు నడిపించి, తిరిగి ఆ ప్రధాన పాత్ర ప్రవేశించగానే ఆ ఆశయాన్ని లేదా  విజయ పతాకాన్ని ప్రధాన పాత్రకి అప్పగించి తప్పుకుంటుంది. ఇది హ్యాండ్ - ఆఫ్ పాత్ర.  ఇలాకాక ప్రధాన పాత్రే మధ్యలో మరణిస్తే, చివరంటా దాని ఆశయాన్ని ముందుకు నడిపించే డెడ్ హ్యాండ్-  ఆఫ్ పాత్ర యమున పోషించిన పాత్ర లాంటిది. ఇంతకీ ఈ కథ ఏ పాత్ర కథ అన్న  ప్రశ్న వస్తే, బాబూరావే చెప్పినట్టు- ఏ పాత్రదీ కాదు,  అదొక కథ అంతే! 

        ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో ఈ సినిమా నడక ఆర్ట్ ఫిలిం కి దగ్గరగా వుంటుంది. సినిమాకి లాభం  రాకపోయినా నష్టం రాలేదు. అయితే రాజేంద్ర ప్రసాద్ కి ఆ సంవత్సర (1991) ఉత్తమ నటుడిగా సినిమాకి ఉత్తమ కథ చిత్రంగా, జాలాదికి ఉత్తమ గేయ రచయితగా, దేవ రాజ్ కి ఉత్తమ విలన్ గా, గౌతమ్ రాజుకి ఉత్తమ ఎడిటర్ గా ...ఇన్ని నంది అవార్డు లొచ్చాయి... దీంతో సినిమా పట్ల క్రేజ్  పెరిగి వీడియో క్యాసెట్లు  బాగా అమ్ముడు పోయాయి.

        ఇందులో కొడుకు పాత్ర పోషించిన కిరణ్  బాబూరావు సోదరుడి కుమారుడే. ఈయన ప్రస్తుతం అమెరికాలో డాక్టర్. చైల్డ్ ఆర్టిస్టుగా ఈయన నటన ఒక ఆశ్చర్యం గొలిపే సంఘటన. చక్రవర్తి స్వరపరచిన పాటల్లో జాలాది రాసిన గీతం గురించి చిన్న నేపధ్యం చెప్పారు బాబూరావు. ‘ఎర్రమందారం’ తీయడానికి పూర్వం ఎప్పుడో జాలాది బాబూరావు దగ్గరికి వచ్చి- ‘కళ్ళు తెరిస్తే ఉయ్యాల, కళ్ళు మూస్తే మొయ్యాల’ అని పల్లవి విన్పించే సరికి, కదిలిపోయిన బాబూరావు దాన్ని మరెవ్వరికీ ఇవ్వకుండా అట్టి పెట్టుకున్నారు. ‘ఎర్రమందారం’  తీస్తున్నప్పుడు ఆ  పల్లవికి తగ్గట్టు సన్నివేశాన్ని చాలా యాతన పడి సృష్టించి-  మిగతా చరణాలు రాయించేశారు జాలాది చేత! దీనికే నంది అవార్డు వచ్చింది...

స్క్రిప్టు వెనుక క్రాఫ్టు 
       ‘ఎర్ర మందారం’ స్క్రిప్టు ఎలా తయారయ్యింది? ఇటీవల  ‘యజ్ఞం’, ‘రణం’, ‘ఒంటరి’ లాంటి భారీ సినిమాలు నిర్మించిన పోకూరి బాబూరావు అప్పట్లో ‘నేటిభారతం’, ‘రేపటి పౌరులు’, ‘దేశంలో దొంగలు పడ్డారు’ వంటి హిట్స్ కూడా నిర్మించి వున్నారు. ఒకరోజు ‘ఆంధ్ర జ్యోతి’  దీపావళి ప్రత్యేక సంచికలో ఎంవిఎస్ హరనాథ రావు రాసిన ‘ లేడి చంపిన పులి నెత్తురు’ కథ చదివి ఇన్స్ పైర్ అయ్యారు బాబూరావు. 

        దీన్ని సినిమాగా తీద్దామంటే, దీనికి  సరిపడా సినిమా లక్షణాల్లేవని తోసిపుచ్చారు హరనాథ రావే. బాబూరావు పట్టుబట్టడంతో ఇక తప్పదనుకుని ఆయనతో కలిసి కూర్చుని ఒక ఔట్  లైన్ తయారు చేశారు హరనాథ రావు. అది బాబూరావుకు నచ్చింది. కానీ హరనాథ రావుకి సంతృప్తి కలగలేదు. కథలో లైఫ్ మిస్ అయినట్టు వుందని, డాక్యుమెంటరీలా ఉందనీ చెప్పి ఇంకో పది  రోజులు టైం తీసుకున్నారు. అప్పుడొచ్చి పూర్తిగా మార్చేసిన కొత్త ఔట్ లైన్ విన్పించారు. 

        ఇంతకీ పత్రికలో వచ్చిన అసలు ఒరిజినల్ కథేమిటి? ఊరి దొర చేతిలో భర్తని పోగొట్టుకున్న పడతి, ఆ దొర మీద పగదీర్చుకోవడం అచ్చులో వచ్చిన  స్టోరీ లైన్. ఇందులో పూర్వం జరిగిన భర్త హత్య గురించి రేఖా మాత్రమైన ప్రస్తావనే తప్ప, కథగా వుండదు. పూర్తి కథ ఆమె పరంగా నడిచేదే. దళితవాడ నుంచి పెట్రేగిన స్త్రీ కథ. కథలో దొర ఆమెని అనుభవిస్తాడు కూడా. కొడుకు ఆమెకి సాయంగా వున్నా, దొర హత్యలో పాలుపంచుకోడు.  

        ఈ చిన్న కథని సినిమాకి తీసుకునే సరికి భర్త పాత్రని పెంచుతూ  రిజర్వేషన్ల అంశం జోడించి, దొర చేతిలో అతను హతమయ్యేందుకు అవసరమైన నేపధ్య బలమంతా కల్పించారు. కథానాయికని దొర అనుభవించే ఘట్టం తొలగించి, సినిమా కాబట్టి హీరోయిన్ పాత్ర పావిత్ర్యాన్ని కాపాడుతూ, అదే సమయంలో కొడుకు పాత్రని దొర హత్య కి తగు విధంగా యాక్టివేట్ చేశారు. ఇలా మారిపోయిన కొత్త  ఔట్ లైన్ బాబూరావుకి ఇంకా బాగా నచ్చి, మరో రచయిత సంజీవితో సీనిక్ ఆర్డర్,  ట్రీట్ మెంట్ వగైరా కానిచ్చారు. ఫైనల్ గా హరనాథ రావు డైలాగ్ వెర్షన్ రాశారు. ఇందులో ఆయన సోదరుడు, రచయిత మరుధూరి రాజా స్వల్ప పాత్ర పోషించారు. స్క్రీన్ ప్లే క్రెడిట్ బాబు రావు – సంజీవీలు తీసుకుంటే, కథ -మాటలు హరనాథ రావు వేసుకున్నారు. 

        ఈ స్క్రిప్టు దర్శకుడు ముత్యాల సుబ్బారావు చేతిలో ఎలా తెరకెక్కిందంటే, ఆయన లెఫ్ట్ కి ఎక్కువ ప్రాధాన్య మిచ్చినట్టు కన్పిస్తుంది. ముఖ్యంగా  రాత్రి పూట లాంతరు పట్టుకుని భర్త కోసం యమున వెతికే దృశ్యాల్లోని  మైన్యూట్ డిటైల్స్ అన్నీ, అచ్చం స్క్రీన్ ప్లేలో రాసిన వర్ణనలతోనే  చిత్రీకరించడంతో, అదంతా ఒక సినిమా చూస్తున్నట్టు వుండదు, సినిమాని చదువుతున్నట్టు వుంటుంది. అదీ సుబ్బయ్య టాలెంట్. దీనికి ఆర్. రామారావు కెమెరా వర్క్ క్లాసిక్ టచ్. 

        సాధారణంగా సినిమాల్లో విలన్ ఎంట్రీ ని కన్పించగానే,  ప్రత్యక్షంగా అక్కడికక్కడే ఏదో దారుణానికి పాల్పడ్డంతో  చూపిస్తూంటారు.  కానీ  ‘ఎర్ర మందారం’ స్క్రీన్ ప్లేలో విలన్ అయిన దొరని చూపించకుండానే అనుచరుల చేత అతడి దాష్టీకాన్ని చూపిస్తూ- చెప్పుల దండతో  గుడి పూజారిని ఊరేగించే దృశ్యంతో –ఇలాటి కర్కోటకుడు విలన్ అని పరోక్షంగా తెలియజేయడం  ఎంతో రిలీఫ్ నిస్తుంది రొటీన్ మూస నుంచి! విలన్ పాత్ర పరిచయం ఇలా ఎంత హాయిగా అన్పించిందో బాబూ రావుకి చెపితే, ఆయన కూడా హాయిగా చిరునవ్వుతో చూశారు.


-సికిందర్
(ఆగస్టు 2010-  ‘సాక్షి’)
       
 

       
       

 


13, ఆగస్టు 2016, శనివారం

రివ్యూ!








దర్శకత్వం : సునీల్ రెడ్డి

తారాగణం : సాయి ధరం తేజ, లారిస్సా బొనెసీ, మన్నారా చోప్రా, వెన్నెల కిషోర్, అజయ్, పోసాని, సప్తగిరి, సత్య, రఘుబాబు తదితరులు
కథ- స్క్రీన్ ప్లే : షేక్ దావూద్, మాటలు : లక్ష్మీ భూపాల్- హర్షవర్ధన్
సంగీతం : తమన్, ఛాయాగ్రహణం : గుహన్
బ్యానర్ : శ్రీ వెంకటేశ్వరా మూవీ మేకర్స్
నిర్మాతలు : డా. రోహిత్ రెడ్డి
విడుదల : 13 ఆగస్టు, 2016
***
        ఒకవేళ మన రెండు  రాష్ట్రాల్లో  పోలీసులకి నేరస్థుల్ని దండించే పని కష్టంగా తోస్తే, వాళ్ళ థర్డ్ డిగ్రీ టార్చర్ ని మించిపోయే  ‘తిక్క’ అనే తలతిక్క  సినిమా చూపిస్తే చాలు - గిలగిల కొట్టుకుని అక్కడికక్కడే చస్తారు నేరస్థులు. ఎన్ కౌంటర్ చేయలన్నా ఈ సినిమా ప్రయోగిస్తే  సరిపోతుంది. ఈ సినిమా పేరు చెబితే నేరస్థులిక తెలుగు రాష్ట్రాల్లో  వుండరు. నేరస్థులకే ఇలా వుంటే మనలాంటి  వాళ్ళ పరిస్థితేమిటో ఊహించుకోవాల్సిందే. ఈ సినిమాలో హీరోతో బాటు అతడి తండ్రి చీటికీ మాటికీ విషం బాటిల్ తీసి తాగెయ్యబోతారు. ఈ సినిమా కెళ్తే మనం కూడా ఓ విషం బాటిల్ ఎందుకు తెచ్చుకోలేదా అని విలవిల్లాడి పోతాం. ఎడాపెడా సినిమా పెట్టే టార్చర్ ని తట్టుకునే శక్తిలేక చచ్చిపోవడమే బెటరని ఆక్రందిస్తాం. ఈ సినిమా టికెట్స్ తో బాటు కౌంటర్స్ లో విషం బాటిల్స్ కూడా  పెట్టి ప్రేక్షకులకి సరఫరా చేసే ఏర్పాటు నిర్మాత చేసివుంటే ఎంతో పుణ్యం కట్టుకున్న వాళ్ళయ్యే వాళ్ళు. 

          ఈ తలతిక్క సినిమా తీసిన, రాసిన వాళ్ళెవరికీ  అసలు సినిమా అంటే ఏంటో కనీస జ్ఞానం లేదని అడుగడుగునా బట్టబయలై పోతూంటుంది. చిన్న పిల్లలు ఒక చోటచేరి చేసే పిల్ల కాయచేష్టల్లా నిర్మాత పెట్టిన డబ్బుతో ఇష్టమొచ్చినట్టు ఆడుకున్నారు. కామెడీ అంటే తమకి తామే కితకితలు పెట్టుకుని కిలకిలా నవ్వుకోవడంగా భావించుకుని ఒక పిచ్చి వాళ్ళ స్వర్గాన్ని వాళ్లకి వాళ్ళే సృష్టించుకుని అందులో  ఓలలాడారు. వాళ్ళ గెస్ట్ హౌస్ లో వాళ్ళే వేసుకుని ఆనందించుకుంటే సరిపోయే దానికి ప్రేక్షకుల మీదికి వదిలి ఇంత అరాచకం సృష్టించారు. ఒక్క చోటైనా ప్రేక్షకుడనే నిర్భాగ్యుడు నవ్వితే ఒట్టు. తెలుగు చలన చిత్ర చరిత్రలో సినిమా పేరుతో  ఇంత నరకప్రాయమైన చెత్త ఎప్పుడూ వచ్చి వుండదు. 

          మూడేళ్ళ క్రితం ‘ఓం’ అనే త్రీడీ తో కళ్యాణ్  రామ్ ని నిండా పాతిక కోట్లకి ముంచేసి, తిరిగి ఇప్పుడు నిర్మాత రోహిత్ రెడ్డి జేబులు కూడా ఖాళీ చేయించిన దర్శకుడు సునీల్ రెడ్డి పాలబడి ఇప్పుడిప్పుడే పైకొస్తున్న  హీరో సాయి ధరమ్  తేజ కూడా బలైపోయాడు. సినిమా  అంటే ఏంటో సగటు ప్రేక్షకులకున్న  అవగాహన కూడా లేకుండా రచన పేరుతో, దర్శకత్వం పేరుతో అనర్హులు చేరి నిర్మాతనీ, హీరోనీ భ్రష్టు పట్టించారు.  ఈ సినిమా దర్శకుడు, రచయితలూ వెనక్కి వెళ్లి సినిమా అంటే ఏమిటో అ ఆ లు నేర్చుకుని వస్తే నిర్మాతలూ హీరోలూ ప్రేక్షకులూ బతికిపోతారు- బయ్యర్లు కూడా!

          ఎక్కడైనా ఎప్పుడైనా సినిమా కథ ఇలా ఉంటుందా....ఆదిత్య (సాయి ధరమ్ తేజ్) అనే కార్పోరేట్ ఉద్యోగి ఉద్యోగం తక్కువ తాగితందానా లాడి, అమ్మాయిల వెంట పడ్డం ఎక్కువగా చేసే ఒక తిక్కలోడు. బాగా డబ్బున్న వీడి తండ్రి (రాజేంద్ర ప్రసాద్) కూడా తాగి తందానా లాడి ఆడ పిచ్చితో తిరిగే మరో తిక్క శాల్తీ. కొడుకు కారు నడుపుతూంటే వెనక సీట్లో తెచ్చుకున్న అమ్మాయితో సరసాలాడే కామ పిశాచి. పట్టపగలు కారులోనే తప్ప తాగుతూ డ్రైవ్ చేస్తూ అడ్డంగా పోతాడు ఆదిత్య. అంజలీ( లారిస్సా బొనేసా) అనే  వెర్రిబాగుల హీరోయిన్ కారు ఆ కారుని గుద్దెయ్యడంతో మనవాడికి చచ్చేంత పనై ప్రేమలో పడిపోతాడు. నమ్మశక్యంగాని  ఓవరాక్షన్ తో, వెర్రి చేష్టలతో ఏమేమో  చేస్తూ ఆమెని ప్రేమలో పడేసుకుంటాడు.  కానీ  వీడు కొన్ని తేదీలు గుర్తుంచుకోలేదని ఆ వెర్రిబాగుల హీరోయిన్ వీడికి కటీఫ్ చెప్పేసి తండ్రి  చూసిన హాఫ్ మగాడ్ని (వెన్నెల కిషోర్) చేసుకో  బోతూంటుంది. ఇక మనవాడికి పిచ్చి బాగా ఎక్కిపోయి టెర్రరిస్టులు దాడులు చేసినట్టుగా, మావోయిస్టులు కాల్పులు జరిపినట్టుగా (ఇలా పోలీస్ బాసే  అనుకుంటాడు పాపం)  పెట్రోల్ బంకుతో సహా పేల్చేసి నానా బీభత్సం సృష్టిస్తాడు. పోలీసులు వీణ్ణీ వీడి ఫ్రెండ్స్ నీ బొక్కలో వేస్తారు. ఇప్పుడు వీడి ప్రేమ ఎలా తిరిగి దక్కాలి? ఇందుకేం చేయాలి? ఏమైనా చేశాడా? రకరకాల గుంపుల మధ్య పడి అసలు కన్పిస్తాడా, గుంపుకో చోటా విలన్ చొప్పున వున్న గ్యాంగులు తలా ఒక్కో అమ్మాయిని వెతుక్కుంటూ గోలగోలగా పిచ్చాసుపత్రి పేషంట్స్ లా తిరుగుతోంటే అసలు మన వాడెక్కడున్నాడు? ఉన్నాడా, ఇంత సినిమా చాలనుకుని చెక్కేశాడా?  రైటర్ షేక్ దావూద్ సాబ్ హీరోయిన్ తో బాటు మిగతా ఇద్దరు ముగ్గురు అమ్మాయిలకీ తన మతాచారాన్ని  తెచ్చి పూస్తూ, బురఖాలు తొడిగించేసి సాంతం కన్ఫ్యూజ్ కామెడీ చేసుకు పోతూంటే- హీరోయిన్ తో బాటు అమ్మాయిల మొహాలే, గ్లామరే కన్పించని తాలిబానిజంతో సినిమాకే గతి పట్టింది?  తాలిబాన్లకి చూపిస్తే సూపర్ హిట్టయ్యే ఈ సినిమా ఎందుకొచ్చి తెలుగు వాళ్ళ మధ్య పడింది? దావూద్ సాబ్ కి తాలిబాన్ల నుంచి వార్నింగ్స్ వచ్చి ఈ విధంగా బురఖాలు తొడిగించేశారా? కానీ ఇప్పుడు బురఖా లేసుకుని కన్పించకుండా తిరగాల్సింది ఈ సినిమా రచయితలూ దర్శకుడే! నిర్మాతకి మాత్రం పెద్ద బురఖా తొడిగేశారు. అదేం బురఖా, కాస్ట్లీ దుబాయ్ బుట్ట బురఖాయేనా?

          మాటల రచయితలుగా దర్శన మిచ్చిన లక్ష్మీ భూపాల్, హర్షవర్ధన్ అనే వాళ్ళు ఒక్కసారి థియేటర్లో కూర్చుని తాము రాసింది చూడగలరా? వినగలరా? ఒక్క క్షణమైనా ఆ మాటల దాడి నుంచి విరామం ఇచ్చారా? ఒకరా ఇద్దరా-  ప్రతీ సీన్లో గుంపులు గుంపులుగా ఎందరో నటీనటులు చేరి-  కామెడీ పేరుతో  గోలగోలగా ఎవరేం మాట్లాడుతున్నారో- అరుచుకుంటున్నారో – చెవులు పోటెక్కే సౌండ్ పొల్యూషన్ తో – చేపల బజార్లా ఏమేం చేస్తున్నారో – తాము ఫాలో అయి రెండు ముక్కల్లో సూటిగా ఈ కథేమిటో చెప్పగలరా? 

          వెంటనే సూటిగా రెండు ముక్కల్లో ఈ చేపల బజార్ కథేమిటో చెప్ప గల్గితే ప్రేక్షకులు ఆత్మహత్యా ప్రయత్నాలు మానుకోగలరు. 

          ఈ సినిమా తీయడానికి ఎన్ని కోట్లయ్యిందో అన్ని తలా ఓ కోటి కృష్ణా నగర్- ఫిలిం నగర్ లలో ఏళ్ల తరబడి ఒక్క అవకాశమూ దక్కక, దిక్కులేక తిరుగుతున్న  అసిస్టెంట్లు ఓ పాతిక మందికి ఇచ్చి వుంటే-  నిర్మాత రోహిత్ రెడ్డికి నీతిగా నిజాయితీగా ఎంతో న్యాయం చేసి పెట్టే వాళ్ళు. ఆయన మరో పాతిక సినిమాలు తీయడానికి రెడీ అయ్యే వాళ్ళు. పాతికలో పది పోయినా లా ఆఫ్ ఎవరేజేస్ కింద తను లాభాల్లోనే వుండే వాళ్ళు. ఒకప్పుడు సేలంకి చెందిన మోడరన్ థియేటర్స్ సంస్థ అనుసరించిన సక్సెస్ ఫుల్ పంథా ఇది.


-సికిందర్





12, ఆగస్టు 2016, శుక్రవారం

రివ్యూ!







రచన- దర్శకత్వం :  మారుతి

తారాగణం ; వెంకటేష్, నయనతార, షావుకారు జానకి, సంపత్ రాజ్, జయప్రకాష్, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, పృథ్వీ, పోసాని తదితరులు
సంగీతం : జిబ్రాన్ , ఛాయాగ్రహణం : రిచర్డ్ ప్రసాద్, కూర్పు : ఉద్ధవ్,
పోరాటాలు : రామ్ –లక్ష్మణ్, రవివర్మ
బ్యానర్ : సితార ఎంటర్ టైన్ మెంట్స్
నిర్మాతలు : సూర్య దేవర నాగవంశీ,  పిడివి ప్రసాద్
విడుదల : 12 ఆగస్టు,  2016
***
      వెంకటేష్ – మారుతీ అనే జనరేషన్ గ్యాప్ వున్న కాంబినేషన్ తో,  ‘బాబు బంగారం’ అనే సంసారపక్ష టైటిల్ తో,  కొంత కాలంగా కుతూహలం రేకెత్తిస్తున్న వెంకీ మార్కు కుటుంబ కథా చిత్రం- ఎన్ని విచిత్రాలు చేసిందో ఈ కింద చూద్దాం...

కథ : 
          
కృష్ణ (వెంకటేష్) జాలిగల ఎసిపి. నేరస్థులని కొట్టాలన్నా అతడికి మనసొప్పదు. అలాటి వాడు  ఇంకో జాలి గుండెగల శైలజ (నయనతార) ని చూసి మనసు పారేసుకుంటాడు. వెంటనే సెలవు పెట్టేసి ఆమెని ప్రేమించడానికి బయల్దేరతాడు. ఆమె నడిపే మెస్  సాధక బాధకాల్లో పాలు పంచుకుంటాడు. ఆమెది పెద్ద కుటుంబం. అందరూ ఆడవాళ్లే-  బామ్మ, అమ్మ, ముగ్గురు చెల్లెళ్ళూ.  ఒక హత్య కేసులో ఇరుక్కున్న తండ్రి శాస్త్రి (జయప్రకాష్) అజ్ఞాతంలో ఎక్కడున్నాడో తెలీసు. అతడి ఆచూకి కోసం మల్లేష్ (సంపత్ రాజ్)  ముఠా  శైలజని వేధిస్తూంటారు. తన కుటుంబానికి కృష్ణ చేసిన మంచి పనులకి శైలజ అతణ్ణి ప్రేమిస్తుంది. ఇంతలో కృష్ణ తనతో  ప్రేమ నటించాడనీ, తన తండ్రి ఆచూకీ కోసమే  తనకి దగ్గరయ్యాడనీ అసహ్యించుకుని దూరమవుతుంది శైలజ. ఈమెతో ప్రేమా లేక, ఆమె తండ్రి నిర్దోషి అని నిరూపించే  అవకాశమూ లేక డైలమాలో పడతాడు కృష్ణ. ఇక్కడ్నించీ ఈ రెండు లక్ష్యాలూ సాధించడానికి ఏం చేశాడు కృష్ణ అన్నది మిగతా సెకండాఫ్ కథ. 

ఎలా వుంది కథ 
        చాలా చాలా పాత వాసనలతో వుంది. చూసి చూసి వున్న మూస ఫార్ములా కథతో,  పాత్రలతో అనాసక్తి కరంగా వుంది. అసలిదొక కథగా వుండే అవకాశం కూడా లేదనే  లాజిక్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఈ తరం దర్శకుడు మారుతీ,  వెంకటేష్ తో ఈ కాలపు కథ తీసుకోకుండా, వెంకటేష్ కాలపు కథనే తీసుకోవడంతో, పాత వెంకటేష్ సినిమా చూస్తున్నట్టే వుంది. ఇలాటి సినిమాలు ఎందరో అప్పటి దర్శకులు తీసేశారు- ఇంకా ఇప్పుడు ఇప్పటి ప్రేక్షకుల కోసం ఇప్పటి దర్శకుడు మారుతి కూడా తీయాలా!

          . ‘దృశ్యం’, ‘గోపాల గోపాల’ లాంటి వినూత్న ఇమేజియేతర కథలతో కాలంతో బాటు ముందుకు కదులుతున్న వెంకీని వెనక్కి లాక్కొచ్చి పాత పీఠం మళ్ళీ ఎక్కించినట్టుంది.  ఇందుకు పూర్తిగా మారుతీ బాధ్యుడనలేం, వెంకీ కూడా ‘ఊఁ...తీయ్!’ అనకపోతే ఈ పురాతన కహానీ కుహనా కమర్షియల్ గా నయా జమానాలో వచ్చే అవకాశమే లేదు. ఫస్టాఫ్ ప్రేమలో పడేసే రొటీన్ ట్రాక్ తో వుంటే, సెకండాఫ్ విలన్లతో యాక్షన్ కామెడీ కథగా మారుతుంది. ఈ యాక్షన్ కామెడీ కథలో క్రియేటివిటీ లోపించడంతో మూసఫార్ములా సన్నివేశాలే రాజ్యమేలి నిద్రపుచ్చుతాయి. పైగా ఫస్టాఫ్ ముగియగానే  ఈ సెకండాఫ్ కథేమిటో తెలిసిపోవడంతో చూడ్డాని కేమీ మిగలదు. 

          ఆపదల్లో వున్న హీరోయిన్ కుటుంబాన్ని కాపాడి ఆమె ప్రేమని పొందే కథలతో స్టార్ సినిమాలు ఇంకా ఎన్ని సార్లు తీస్తారనేది మిలియన్ డిస్కుల ప్రశ్న. 

ఎవరెలా చేశారు
        వీలైనంత ఫన్నీ గా తన పాత్రలో వెంకీ కన్పించడానికి  ప్రయత్నించారు. కానీ  లేని కథే ఈ పోలీస్ పాత్రకి తోడ్పడలేదు. దీంతో కృతకంగా కన్పిస్తుంది పాత్ర.  పైగా వెంకీ పాత్రకి సరయిన నయనతార పాత్ర సహకారం లేదు. వెంకీ చేసే ఫన్ కి దీటుగా నయన్  కూడా చేసి వుంటే ఈ ఇద్దరు సీనియర్లు మళ్ళీ ఓ ఊపు ఊపే వారు ఈ రొటీన్ మూసతో. కానీ నయన్  పాత్రని దర్శకుడు అస్తమానం శోక పాత్రగా కొనసాగించడంతో- ఎప్పుడూ కుటుంబ బాధలతో ఆమెకి ఏడుపే మిగిలింది. ఈ రెండు పాత్రల సంకలనాన్ని ఈ రోజుల్లో కూడా బాక్సాఫీసు అప్పీల్ కి వ్యతిరేకంగా ఇంత  నిస్తేజంగా ఎలా ప్రెజెంట్ చేస్తారో తెలీదు. బాక్సాఫీస్ ఎప్పుడూ యూత్ ఫుల్ గానే వుంటుంది మరి. నయన్  మెస్ నడపడం, వెంకీ సహకరించడం ఇటీవలి ‘పెళ్లి చూపులు’ లో వచ్చిన వ్యవహారమే. ఇక పాటల్లో కూడా ఇద్దరి కెమిస్ట్రీ వర్కౌట్ కాలేదు. నయన్ జస్ట్ వేస్టయిన గ్లామర్ తార అనొచ్చు ఈ సినిమాలో. 

          ఇక యాక్షన్ కామెడీ వచ్చేసరికి వెంకీ- తన ఇరవై ఆరేళ్ళ నాటి  ‘బొబ్బిలి రాజా’ ఎలిమెంట్స్ ని అరువు దెచ్చుకున్నారు. ఫైట్ చేస్తున్నప్పుడు ‘అయ్యో అయ్యో’ అనే ఊతపదం, క్లయిమాక్స్ ఫైట్ లో ‘బలపం పట్టి భామ వొళ్ళో’   పాట పేరడీ వంటి గిమ్మిక్కుల్ని ఆశ్రయించారు. కామెడీ అనేది కథలోంచి సహజంగా పుట్టుకురావాలి గానీ, ఇలా ఇంకో సినిమా పేరడీలు తెచ్చుకుని, స్పూఫ్ లు తెచ్చుకుని నింపే ప్రయత్నం చేస్తే దీనికి మారుతి ఎందుకు? క్రియేటివిటీ చచ్చిపోతే  వచ్చి చేరేది -ఈ సినిమాలో పదేపదే వాడిన  పదంలాగా -  పుచ్చిన బత్తాయిల్లాంటి  కృషి ఫలాలే. కుళ్ళిన బత్తాయిలనకుండా పుచ్చిన బత్తాయిలనడం కూడా పట్టాలు తప్పిన మారుతీ ఎక్స్ ప్రెస్ తడాఖా నేమో!

          గ్లామర్ పరంగా, ఫిజిక్స్ పరంగా ఆకర్షణీయంగా వెంకీ వున్నంత స్థాయిలో, తన కథా కథనాలతో మారుతీ కూడా పోటీపడి వుంటే  బావుండేది. పృథ్వీ తో మళ్ళీ ‘నాన్నకు ప్రేమతో’ పేరడీ కి న్యూవేవ్ దర్శకుడు మారుతి కెందుకు? ఇంకొకరి మూస మార్గం మారుతి కెందుకు? బత్తాయి లమ్మే బాబ్జీ పాత్రలో పృథ్వీ, నయన్ పాత్రని ప్రేమించే బావగా నానా హంగామా చేయడం బాగానే వుంది ఫన్నీగా, కానీ ఆమె వెంకీ ప్రేమకి లొంగిందని తెలుసుకుని- సంగతి చూస్తానని తొడలు కొట్టుకుని సవాళ్లు చేసి వెళ్ళిన  వాడు- మళ్ళీ కన్పించడెందుకో అర్ధం కాదు. ఎమ్మెల్యే పిచ్చయ్యగా పోసాని, మేజీసియన్ గా బ్రహ్మానందం వీళ్ళిద్దర్లో పోసానికి ఎక్కువ కామెడీకి అవకాశం దక్కింది. అయితే సెకండాఫ్ లో కామెడీ ఒక్కో విడివిడి ఎపిసోడ్ లుగా కాకుండా- కథని ముందుకునడిపించే రెండు సీక్వెన్సులుగా వచ్చి వుంటే కమెడియన్ లందరూ ఒక వెలుగు వెలిగే వాళ్ళు. దురదృష్ట మేమిటంటే కథని ముందుకు పరిగెత్తించే సీక్వేన్సులుగా గాక, వంతు లేసుకున్నట్టు విడివిడి ఎపిసోడ్లు కమెడియన్లు పంచుకోవడంతోనే ఫస్టాఫో సెకండాఫో విషయం లేక కుప్పకూలుతున్నాయి. 

          విలన్ గా సంపత్ రాజ్, బామ్మగా షావుకారు జానకి, నయన్ తండ్రిగా జయప్రకాష్ కన్పిస్తారు. వెన్నెల కిషోర్ కి సరైన పాత్ర, కామెడీ కూడా లేవు.
          ఛాయాగ్రహణం, సంగీతం చెప్పుకునేంత ప్రత్యేకంగా ఏమీ లేవు. 

చివరికేమిటి 
          
సెకండాఫ్ తోనే సమస్య. హీరోయిన్ తండ్రి దగ్గర విలన్ల తాలూకు ఒక వీడియో వుంటే, అది పెన్ డ్రైవ్ రూపంలో హీరో చేతికి చేరితే, ఆ పెన్ డ్రైవ్ ని కొట్టేయడం కోసం విలన్లు చేసే ప్రయత్నాలే కథగా మారడంతో పూర్తిగా అనాసక్తికరంగా మారిపోయింది. ఇలాటిది ఇంకెన్ని సార్లు ఎన్ని సినిమాల్లో చూస్తాం. పైగా హీరోకి బలమైన గోల్, దానికి తగ్గ ప్రత్యర్ధి వర్గమూ లేకపోవడం కూడా మారుతీ కథనపు బలహీనతగా తయారయ్యింది. అసలా హీరోయిన్ తండ్రి ఆ వీడియోతో పారిపోయి ఎక్కడో భయపడుతూ బతకడం కంటే, కుటుంబాన్ని విలన్ల ఆగడాలకి వదిలేయడం కంటే, పారిపోయినప్పుడే  ఆ ఎసిపి అయిన హీరోనే ఆ వీడియోతో ఆశ్రయిస్తే సరిపోయేదిగా? అప్పుడు ఈ కథంతా వుండే అవకాశమే లేదుగా?  కథగా ఇదంతా ఉండేందుకు అవకాశమే లేనప్పుడు ఈ కథంతా కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు సినిమాగా తీసినట్టు? ఫ్లాష్ బ్యాక్ లో హీరోయిన్ తండ్రి ఆ విలన్ల వీడియో తీసినప్పుడు, విలన్లకి ఈ సంగతి తెలిసి వెంటబడినప్పుడు,  హీరోయిన్ తండ్రి నేరుగా  పోలీస్ స్టేషన్ కి వెళ్ళిపోతే ఆ ఫ్లాష్ బ్యాక్ తోనే కథ ముగిసిపోయే వ్యవహారం కదా? ఎందుకు ఇంత పెద్ద వ్యవహారం పెట్టుకున్నారు? లాజిక్ తట్టకనా, లేకపోతే ప్రేక్షకులకి లాజిక్ ఏం తెలుస్తుందనా?

          ఇంత కాలం గ్యాప్ తర్వాత వెంకీ ‘బాబు బంగారం’ అంటూ ఒక ఫీల్ గుడ్ టైటిల్ తో వచ్చినప్పుడు సినిమా కూడా ఎంత వెచ్చ వెచ్చగా, నులి వెచ్చగా - చలిమంట వేసుకున్న అనుభవంలా  ఆహ్లాదపర్చాల్సింది - నిలువెత్తు ఒరిజినాలిటీతో!


-సికిందర్ (దీనికి స్క్రీన్ ప్లే సంగతులు 
అవసరం లేదు)
http://www.cinemabazaar.in






11, ఆగస్టు 2016, గురువారం

స్క్రీన్ ప్లే సంగతులు!

పాత్రలేకుండా విడిగా కథ వుండదు, కానీ కథ లేకుండా పాత్ర ఉండగలదు. ఎందుకంటే కథని పుట్టించేదే పాత్ర. కథ వచ్చేసి ఎంత ప్రయత్నించినా పాత్రని పుట్టించలేదు. కథని – పాత్రని పక్కన పెడదాం : ఓ సంఘటన ఏదైనా తీసుకుందాం. ఓ మనిషో ఓ జంతువో లేకుండా ఓ సంఘటన జరుగుతుందా?  బస్సు దాని కదే వెళ్లి లోయలో పడిపోతుందా? డ్రైవర్ తీసికెళ్తేనే కదా వెళ్లి లోయ పడే సంఘటన  జరిగేది. కుక్క కరిస్తేనే కదా ఎవరైనా కుయ్యో మొర్రోమనే  సంఘటన జరిగేది. కాబట్టి జీవులు మాత్రమే సంఘటనల్ని  జరపగలవు. జీవుల్లాంటి చైతన్యమున్న ప్రకృతి సైతం సంఘటనలని జరిపించగలదు. పాత్రంటే జీవియే. అలా అది మాత్రమే కథని సృష్టించగలదు. కథ వచ్చేసి పాత్రని సృష్టించలేదు. కానీ కొందరు కథకులతో ఎలా ఉంటుందంటే- కుక్క కూర్చుని వుంటే మనిషే దాని దగ్గరి కెళ్ళి సరదాపడి కరిపించుకున్నట్టు, బస్సు దానికదే హుషారుగా వెళ్లి లోయలో పడిపోయినట్టు చిత్రిస్తూ కథని అల్లేస్తూంటారు. పర్యవసానం :  కథ (కథకుడు) నడిపించినట్టూ నడుచుకునే పాసివ్ పాత్రలు, దాంతో బలహీన కథనాలు. 

          ఇంకా వివరంగా చెప్పుకుంటే,  ధీరజ్ కుమార్ చెల్లెల్ని కిడ్నాప్ చేశారన్న వార్త గుప్పుమన్న దనుకుందాం. అప్పుడు ధీరజ్ కుమార్ బయల్దేరాడు. వీధిలో ఒకర్ని అడిగాడు- నా చెల్లెల్ని మీరు చూశారా అని. నీ చెల్లెల్ని ఎవరో కార్లోకి లాక్కుని వెళ్లిపోయారని ఆ పెద్ద మనిషి అన్నాడు. బాధతో విలవిల్లాడాడు ధీరజ్ కుమార్. తన చెల్లెలు ఎంత గుణవంతురాలో, ఆమె లేకపోతే తనెలా బతకలేడో  చెప్పుకుని వాపోయాడు. ఆ మనిషి జాలిపడి అలా వెళ్లి ఎంక్వైరీ చేయమన్నాడు. ధీరజ్ కుమార్ ముందుకెళ్ళి ఇంకొకర్ని అడిగాడు. ఆ కారు పంజగుట్ట వైపు వెళ్లి నట్టుందని ఆ మనిషి అన్నాడు. బోలెడు సిస్టర్ సెంటిమెంటు ఫీలవుతూ ధీరజ్ కుమార్ పంజగుట్ట చేరుకుని అక్కడ వచ్చేపోయే కార్లని చూస్తూ నిలవడ్డాడు. అతడి వాలకం చూసి జనాలు వాకబు చేశారు. విషయం తెలుసుకుని అయ్యో పాపమనుకుని, అయితే వెంటనే వెళ్లి పోలీస్ కంప్లెయింట్ ఇమ్మన్నారు. వెంట వాళ్ళు కూడా వచ్చారు. ఇంతమంది తోడ్పాటుతో ధీరజ్ కుమార్ పోలీస్ స్టేషన్ కెళ్ళి భోరుమన్నాడు. చెల్లెలు లేకపోతే  చచ్చిపోతానన్నాడు.  అతడి ఎమోషన్ కి బోలెడు ఫీలై పోయారు పోలీసులు కూడా...

        ఎక్కడ చూసినా ధీరజ్ కుమార్ సానుభూతిని  పొందాలని చూస్తున్నాడు. చెల్లెలి గుణ గణాలని వర్ణిస్తూ సిస్టర్  సెంటి మెంటుని తెగ వెళ్ళబోసుకుంటున్నాడు. ఆపదలో వున్న సిస్టర్ క్షేమం కన్నా, ఆమెని కనుక్కోవాలన్న ఆదుర్దా కన్నా,  తన మీద జాలి పుట్టించుకునే ప్రయత్నమే  చేస్తున్నాడు...ఎందుకని?  తనుగాక కథకుడు ఏదో ఫీలైపోవడం వల్ల... కథకుడు ఫీలైపోయిన భావోద్వేగాలతో ధీరజ్ కుమార్ పట్ల ప్రేక్షకులు కళ్ళ నీళ్ళ పర్యంతమైపోతారని, బాగా ఏడ్చేసి  సిస్టర్ సెంటిమెంటు అద్భుతంగా పండించారని హర్షాధ్వనాలు చేస్తారనీ అనుకోవడం వల్ల.  ఆ సిస్టర్ అవతల ప్రమాదంలో ఉందన్న అర్జెన్సీ కన్నా- లాజిక్ కన్నా- ఇక్కడ ఆమె పేర సెంటిమెంటల్ డ్రామాతో  ఏడ్వడమే ముఖ్యం,  అవతల ఆమెని రేప్ చేసి పడేసినా ఫర్వాలేదు. రేప్  చేసి పడేస్తే భోరుమని  అదింకో సెంటిమెంటల్ ఎపిసోడ్. 

          ఇంకోటి జాగ్రత్తగా గమనించాలి : ధీరజ్ కుమార్ ఎక్కడా సొంత బుర్రని ఉపయోగించడం లేదు. వాళ్ళనీ వీళ్ళనీ అడుగుతూ, లేదా అడిగించుకుంటూ,  వాళ్ళూ వీళ్ళూ ఇచ్చే  డైరెక్షన్స్ తో చెల్లెల్ని వెతుక్కుంటున్నాడు. 

          ఇదే ధీరజ్ కుమార్ చెల్లెలు కిడ్నాప్ అయిందని తెలుసుకుని ఇంకోలా రియాక్ట్ అయ్యాడనుకుందాం. వెంటనే లేచి పరిగెత్తాడు. సంఘటనా స్థలానికి వెళ్లి ఆరా తీశాడు. ఓ పక్క పోలీస్ కంట్రోల్ రూమ్ కి కాల్ చేసి ఎలర్ట్ చేశాడు. సంఘటనా స్థలంలో కారు నంబర్ సమాచారం దొరికించుకుని, అది పోలీసులకి అందజేస్తూ ఆ కారు వెళ్ళిన దిశలో దూసుకు పోయాడు.  ఓచోట ట్రాఫిక్ హెవీగా, స్లోగా వుంది. ఆ కారు కోసం ఎక్స్ రే కళ్ళతో చూస్తూ చివరికి కొన్ని కార్ల మధ్య పట్టుకున్నాడు. అతడి ధాటికి తట్టుకోలేక దుండగులు పారిపోబోయారు చెల్లెల్ని వదిలేసి.  వాళ్ళల్లో  ఇద్దర్ని పట్టుకుని చితకబాది, పోలీసులకి అప్పగించాడు ధీరజ్ కుమార్. చెల్లెల్ని హగ్ చేసుకున్నాడు...

       ఇక్కడ జరిగిన సంఘటనకి తానేం చెయ్యాలో తనకి బాగా తెలుసు ధీరజ్ కుమార్ కి. ఎవర్నీ అడుక్కుంటూ తిరగలేదు. తనే ఆరా తీస్తూ బుర్ర నుపయోగించుకుని ఆఘమేఘాలమీద దూసుకుపోయాడు. కథకుడు  అడ్డుపడడం లేదు, ధీరజ్ కుమార్ ఎటు వెళ్తూంటే అటు తనూ పరుగులు తీస్తున్నాడు కథకుడు. చెల్లెల్ని కాపాడుకోవడానికి పరుగెత్తడమే చెల్లెలి సెంటి మెంటు అని ధీరజ్ కుమార్ తీసుకుంటున్న చర్యలే తెలియజేస్తున్నాయి. ఎవరో దుండగుల్ని  పట్టుకుని చెల్లెల్ని  క్షేమంగా తనకి అప్పగించకుండా, తనే దుండగుల్ని  పట్టుకుని చెల్లెల్ని విడిపించుకున్నాడు. ఇది యాక్టివ్ పాత్ర- కథకుడు సృష్టించి దాని ఇష్టానికి వదిలేసిన పాత్ర. తనే కథని నడుపుకుంటూ పోయిన కథానాయక పాత్ర, నాల్గు డబ్బు లొచ్చే కమర్షియల్ సినిమాపాత్ర. 

          దీనికి ముందు పైన చెప్పుకున్న మొదటిది పాసివ్  పాత్ర. కథకుడు తన చాదస్తం కొద్దీ అడుగడుగునా అడ్డు పడుతూ నడిపించిన  డమ్మీ పాత్ర. కథ తానే నూ ముందు పుట్టినట్టు పోజు కొడుతూ నడిపిస్తే నడుచుకుంటూ పోయిన అనుత్పాదక పాత్ర. రూపాయి కూడా రాని ఆర్ట్ సినిమా పాత్ర.

          ఈ మొదటి తరహాలోనే పాసివ్ గా ఉంటున్నాయి అనేక సినిమాల్లో హీరోల పాత్రలు.  మన సినిమాలు కమర్షియల్ సినిమా ముసుగేసుకున్న ఆర్ట్ సినిమాలని ఇందుకే గతంలో కొన్ని సార్లు చెప్పుకున్నాం. ఎన్ని సార్లు చెప్పుకున్నా ఎవరు పట్టించుకుని బాగుపడతారు గనుక. బాగు పడాలన్న కోరిక,  కమిట్ మెంట్ లేనివి ప్రపంచంలో తెలుగు సినిమాలే. యాక్టివ్ పాత్ర చిత్రణకి - పాసివ్ పాత్ర చిత్రణకి  వాటి స్పందనల రీత్యా  వున్న తేడాని తెలుసుకోకపోవడం వల్ల. 

          ఈ రెండూ కాక మూడోది పాసివ్- రియాక్టివ్  పాత్ర అనేదొకటుంది.  ఇది యాక్టివ్ పాత్ర లాగే ప్రవర్తిస్తుంది. వాళ్ళనీ వీళ్ళనీ ఎడా పెడా తిడుతుంది, తంతుంది- బోలెడు యాక్షన్ లోవుందే అన్నట్టు భ్రమ కల్గిస్తుంది. పైన చెప్పుకున్న మొదటి కేసులో లాగే ఇది పాసివ్వే. అయితే పాసివ్ గా ఉండక రియాక్ట్ అయి తంతుంటుంది. ఆఁ..నీ డబ్బా మొహం  చెల్లెలు అంత  గొప్పదేటి?-  అని ఎవడో అన్నాడనుకుందాం, నా చెల్లెల్నే అంటావురా!-  అని వీర లెవెల్లో రియాక్ట్ అయి బాదేస్తూంటాడు  మన ధీరజ్ కుమార్. మళ్ళీ ఇంకొకళ్ళని చెల్లెలి జాడ అడుక్కుంటూ  తిరుగుతూంటాడు. ఈ కోపం, ఈ ప్రతాపం  అసలు కిడ్నాపర్స్ మీద చూపించాలని మాత్రం అనుకోడు...ఇలా వుంటుంది  పాసివ్ రియాక్టివ్ పాత్ర చిత్రణ. 


        ఇవన్నీ ఒకెత్తయితే, ఇప్పుడు ‘శ్రీరస్తు శుభమస్తు’ లోకొస్తే, హీరోయిన్ ని ఈ పాసివ్- రియాక్టివ్ క్యారక్టర్ గా ముస్తాబు చేయడం కొత్తేమీ కాకపోతే- కొత్తగా వున్న దేమిటి? ఏమిటంటే హీరో పాసివ్ కాదు, రక్షించారు. పోనీ యాక్టివా అంటే  పూర్తి యాక్టివూ కాదు. ఎందుకంటే దీనికి పూర్తి జ్ఞానం లేదు. లేకపోవడం వల్ల రాంగ్ రూట్లో గోల్ ప్రయాణం కట్టింది. గోలే రాంగై పోయింది, చేయాల్సిన పని ఒకటుండగా ఇంకోటి చేసుకుపోయింది...

          చేయాల్సిన పని : తనింట్లో ఆల్రెడీ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వదిన ఐదేళ్లుగా హీనంగా బతుకుతోంది. ఇంట్లో పరిస్థితిని, ఈమె జీవితాన్నీ చక్కదిద్దాలి. 

          చేసిన పని : ఆల్రెడీ వదిన వున్న కూపంలోకి ఇంకో మధ్యతరగతి అమ్మాయిని తన భార్యగా తీసుకురావాలనుకోవడం.

          మనకి కథాప్రారంభంలోనే బాగా ధనవంతుడైన ప్రకాష్ రాజ్ ఇంట్లోకి పెద్ద కొడుకు మధ్యతరగతి అమ్మాయిని పెళ్లి చేసుకుని వస్తే మధ్యతగతి పట్ల ఏహ్య భావమున్న ప్రకాష్ రాజ్  ఆమెని హీనంగా చూడ్డం  మొదలెడతాడు. ఇది అయిదేళ్ళూ కొనసాగాక, ఇప్పుడు చిన్న కొడుకు అల్లు శిరీష్ ఇంకో మధ్య తరగతి అమ్మాయిని ప్రేమించానంటాడు. ప్రకాష్  రాజ్ వ్యతిరేకిస్తాడు. మధ్యతరగతి వాళ్ళు గొప్పింటి సంబంధం  చేసుకుని లైఫ్ లో సెటిలైపోవాలని చూస్తారనీ, వాళ్ళు మనల్ని చూసి గాక, మన డబ్బు ని చూసి వస్తారనీ పాత పాటే పాడతాడు. దమ్ముంటే నువ్వు గొప్పింటి కొడుకువని ఆ అమ్మాయికి చెప్పుకోకుండా, పెళ్ళికి ఒప్పించుకోడానికి ట్రై చెయ్ నీకే తెలుస్తుంది-  అంటాడు ప్రకాష్ రాజ్. అల్లు శిరీష్ ఈ ఛాలెంజిని స్వీకరించి, అలా ఒప్పించలేకపోతే  నువ్వు చూసిన గొప్పింటి సంబంధమే చేసుకుంటా నంటాడు...

          ఇదీ  ప్లాట్ పాయింట్ వన్ ఘట్టం . అంటే హీరో కి ఒక గోల్ ని ఏర్పాటు చేసే మలుపు. ఈ గోల్ లో వున్న బలమెంత? ఎందుకంటే,  ఐదేళ్లుగా ఇంట్లో వదినతో పరిస్థితి చూస్తూ ఇంకో మధ్య తరగతి అమ్మాయిని తెస్తానంటున్నాడు అల్లు శిరీష్. అంటే ఆ అమ్మాయిని కూడా తండ్రి రాచి రంపాన పెట్టడానికా? ఒక హీరో పాత్ర తన ప్రేమ తప్ప ఇంకేదీ ముఖ్యం కానట్టు స్వార్ధంతో ఉంటుందా ? 

        ప్లాట్ పాయింట్ వన్ దగ్గర రకరకాల కథల్లో రకరకాల సమస్యలు పుడతాయి. ఎన్ని రకాల కధలున్నా ఆ సమస్యలు ఉండేవి ఏడు రకాలే. వీటిలో  సమస్య మిస్టరీగా వుంటే ఆ రహస్యాన్ని ఛేదించడం  గోల్ గా వుంటుంది. ఏదైనా ప్రమాదం సమస్యగా వుంటే రక్షణ కోసం ప్రయత్నించడం గోల్ గావుంటుంది, కన్ఫ్యూజన్ సమస్యగా వుంటే స్పష్టత కోసం ప్రయత్నించడం గోల్ అవుతుంది. అలాగే డోలాయమాన స్థితి సమస్యైతే ఓ నిర్ణయం తీసుకోవడం గోల్ గా వుంటుంది, అజ్ఞానమే సమస్యయితే  జ్ఞానం గోల్ అవుతుంది, సమస్య ఓ ప్రశ్నని లేవనెత్తితే దానికి జవాబు గోల్ గానూ, ఇక ఆఖరిదైన సంక్షోభం తలెత్తితే శాంతిని నెలకొల్పడం గోల్ గానూ వుంటాయి.

          ఈ సినిమాలో కుటుంబంలో వున్న  సంక్షోభమే సమస్యగా వుంది. అంటే ఇక్కడ శాంతిని నెలకొల్పడం గోల్ గా వుండాలి. ఇక్కడ శాంతిని నెలకొల్పకుండా తనవరకూ తన ప్రేమని తెచ్చి స్థాపించుకోడం  సంక్షోభాన్ని రెట్టింపు చేయడమే. 

          అంటే ఇంట్లో పరిస్థితిని చక్కదిద్దుతూ మరో వైపు హీరోయిన్ ని ప్రేమిస్తూ ఉండమని కాదు. తండ్రి అలా షరతు పెట్టినప్పుడు తను కూడా ఇలా అని వుండాలి : నువ్వన్నట్టే నేనా  ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని వస్తే ఆ అమ్మాయితోబాటు వదినని కూడా నువ్వు బాగా చూసుకుంటావా- ఈ కౌంటర్ ఛాలెంజిని ఒప్పుకుంటావా?

          తండ్రి పెట్టిన షరతు తండ్రికే బూమరాంగై వదిన జీవితమూ తన ప్రేమా ఒడ్డున పడి  తద్వారా ఇంట్లో సుఖసంతోషాలు నెలకొనాలన్న ద్విముఖ వ్యూహంతో హీరో గోల్ ని సెట్ చేసుకుని వుంటే అప్పుడు తానొక హీరో అన్పించుకునే వాడు.

          ఇలా కాకుండా వదిన ఎలా ఏడిస్తే నాకెందుకు- తండ్రి మీద గెలిచి మధ్యతరగతి అమ్మాయినే తెచ్చుకుంటా అని బయల్దేరతాడు హీరో. తన మీద గెలిచాడన్న కసితో ఆ తండ్రి ఈ అమ్మాయిని కూడా వదిన పక్కన పడేసి ఇద్దర్నీ కలిపి నంజుకు తింటే? అప్పుడది సీక్వెల్ గా ఇంకో సినిమా తీయవచ్చనా?

          కానీ మధ్యతరగతి అమ్మాయిని పరీక్షిస్తూ మధ్యతరగతి వాడిలా నటించే ఈ పాయింటు కూడా వెంటనే చీలిపోయింది. ఎందుకంటే అసలు ఏ తరగతి వాణ్ణీ ప్రేమించే మూడ్ లో హీరోయిన్ లేదు. చదువు తప్ప ఆమె కింకో ఆలోచనే లేదు. అతడి మీద విరుచుకు పడుతూ, తిడుతూ, వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తూ, జాడించి తంతూ వుంటుంది కథ ముగిసే వరకూ. కాబట్టి ఇక్కడ ప్రేమే లేనప్పుడు అంతస్తుల అంతరాల ప్రశ్నెక్కడిది? అంతస్తుల అంతరాల ప్రశ్నే లేనప్పుడు మధ్య తరగతి వాడి వేషం హీరో కెందుకు? అసలు హీరోయిన్ ప్రేమిస్తోందో లేదో, ప్రేమించకపోతే ప్రేమించేలా చేసుకుని, అప్పుడు తండ్రికి చెప్పి వుంటే-  అప్పుడేర్పడాలి  నిజానికి పైన చెప్పుకున్న ప్లాట్ పాయింట్ వన్.

          అసలు హీరోయిన్ తనని ప్రేమిస్తోందా, తన డబ్బుని ప్రేమిస్తోందా అని మధ్యతరగతి వాడిలా నటిస్తూ గూఢచర్యం నెరపడమే ఆమెపట్ల అపచారం. ఇలాటి వాడు రేపు ఆమె శీలాన్ని కూడా శంకించి ఇంకెలాటి మారువేషాలేస్తాడో. 

          హీరో హీరోయే అయితే,  ఉన్నదున్నట్టు తన అంతస్తు తెలిసిపోయేలా ప్రేమిస్తూ,  ఆమె తన అంతస్తుని ప్రేమిస్తోందా- లేక మనసుని ప్రేమిస్తోందా పారదర్శక ప్రవర్తవతో తెలుసుకుంటే ఎవరికీ నష్టం లేదు. 


           చివరికి హీరోయిన్ పెళ్లింట్లో తన గుట్టురట్టయి, అల్లరై ఇంటికి తిరిగి వచ్చేస్తాడు హీరో- వచ్చేసి తండ్రితో సుదీర్ఘ మోనోలాగ్ తో నోర్మూయించేస్తాడు- నేను ఓడిపోయి రాలేదు, ఈ ఇంట్లో వదిన పరిస్థితే నేను ప్రేమించినమ్మాయి పరిస్థితి కాకూడదని వదిలేసి వచ్చానంటాడు!!!

          ఇది పెద్ద జోకులా వుంది. అవతల తనకి శృంగభంగమైతే తప్ప  ఇవతల వదిన పరిస్థితి గుర్తుకు రానట్టుంది. హీరోయిన్ ని ప్రేమించాలని శ్రీకారం చుడుతున్నప్పుడు హీనమైన వదిన బతుకు కళ్ళముందు మెదల్లేదేమో. ఒక హీరో అనే వాడు ఇంట్లో ఒక అన్యాయాన్ని సహిస్తూ- ఏళ్ల పాటూ ఎలావుండగల్గుతాడు? 

          ఈ మొత్తం అసహజత్వానికి ఒక్కటే కారణం : కథా ప్రారంభం. ప్రకాష్ రాజ్ పెద్ద కొడుకు సామాన్యమైన కోడల్ని ఇంటికి తీసుకురావడం, దాని మీద ప్రకాష్ రాజ్ తిరగబడి అలాటి వాళ్ళమీద తన నీచమైన అభిప్రాయం చెప్పి- ఆ కోడల్ని పనిమనిషి కంటే హీనంగా చూడ్డమనే క్యారక్టర్ ఎస్టాబ్లిష్ మెంట్ సీన్లే – ఆ తర్వాత అల్లు శిరీష్ క్యారక్టర్ ని కలగాపులగం చేసేశాయి. ఈ పెద్ద కొడుకు -కోడలు అనే ఎపిసోడ్ లేకపోతే, కథలో ఈ పాత్రలే లేకపోతే అల్లుశిరీష్ పాత్రకి తోకలా వదిన వుండేది కాదు. అల్లు శిరీష్ ప్రేమించిన అమ్మాయి గురించి చెప్పినప్పుడే ప్రకాష్ రాజ్ క్యారక్టర్ ఏంటో బయటపెడితే  సరిపోయేది. ఒక పాత్ర ఫలానా ఇలాంటిది అని చెప్పడానికి రెండేసి మూడేసి  ఉదాహరణలతో పునరుక్తిగా, ప్రేక్షకులకి స్పూన్ ఫీడింగ్ చేస్తూ చెప్తూ పోతే- ఇదిగో  ఇలాగే అర్ధం లేకుండా తయారవుతాయి  పాత్రలూ- కథా.

          హీరో యాక్టివ్వే, కాకపోతే అతడి ఇంటి పరిస్థితుల సమాచారాన్ని బ్లాకవుట్ చేశాడు దర్శకుడు- దాన్ని చివర్లో చెప్పించి బ్యాంగ్ ఇద్దామనుకున్నాడు. అది బూమరాంగైంది. ఒక్క సారిగా పాత్ర పడిపోయింది. పాత్ర పెరిగిపోయిందని చాలా మంది ప్రేక్షకులు చప్పట్లు కొడుతున్నారు... మంచిదే,  లాజిక్ అలోచించడం కంటే  ఎమోషన్ లో కొట్టుకుపోయి సముద్రంలో కలవడంలోనే అదో సుఖం!

-సికిందర్
http://www.cinemabazaar.in
       

       
       
       
       
       

6, ఆగస్టు 2016, శనివారం

రివ్యూ!


రచన- దర్శకత్వం : ఏలేటి చంద్రశేఖర్

తారాగణం : మోహన్ లాల్, గౌతమి, ఊర్వశి, విశ్వంత్, అనూషా అంబ్రోస్, 

రైనా రావు, నాజర్, పరుచూరి వెంకటేశ్వర రావు, గొల్లపూడి మారుతీ రావు, హర్షవర్ధన్, ఎల్బీ శ్రీరామ్, వెన్నెల కిషోర్, చంద్ర మోహన్, అయ్యప్ప శర్మ తదితరులు 

మాటలు : రవిచంద్ర తేజ, పాటలు : రామజోగయ్య శాస్త్రి, వశిష్టా శర్మ

సంగీతం : మహేష్ శంకర్, ఛాయాగ్రహణం : రాహుల్ శ్రీవాస్తవ్ 
బ్యానర్ : వారాహి చలన చిత్ర 
నిర్మాతలు : సాయి కొర్రపాటి, రజనీ కొర్రపాటి 
విడుదల : 5 ఆగస్టు, 2016
***

       గతవారం ‘పెళ్లిచూపులు’ తర్వాత ఈవారం  ‘మనమంతా’ మళ్ళీ తెలుగులో క్వాలిటీ సినిమాల రాకని రుతుపవనాలంత ఆహ్లాదకరంగా రికార్డు చేస్తున్నాయి. అభిరుచిగల తెలుగు ప్రేక్షకులు ఏ హిందీ లోనో ఇంకెక్కడో ఇలాటి సినిమాల్ని చూసే అగత్యాన్ని ఇవి తప్పిస్తున్నాయి. ‘పెళ్లి చూపులు’ ప్రేమకథకి రియలిస్టిక్ టచ్ ఇచ్చి  ప్రేక్షకుల్ని సమ్మోహితుల్ని చేశాక,  కుటుంబ కథకి కూడా రియలిస్టిక్ అప్రోచ్ సాధ్యమేనంటూ  ‘మనమంతా’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. కమర్షియల్ ఫార్ములాలకి  ప్రత్యాన్మాయంగా అవే జానర్స్ ని ఇంకో కోణంలో తీసి మొనాటనీతో విసిగిన ప్రేక్షకులకి వెరైటీని అందించవచ్చని ఇవి చెబుతున్నాయి. పైగా సినిమా కళకి అంటరాని పదార్ధమై పోయిన క్రియేటివిటీని కూడా ఇవి హృద్యంగా ప్రదర్శిస్తున్నాయి. 

       
ర్శకుడు ఏలేటి చంద్ర శేఖర్, నిర్మాత సాయి కొర్రపాటి చాలా సాహసించి తెలుగు సినిమాకి చాలా మేలు చేశారు. కమర్షియల్ ఆకర్షణలు వుండని వాస్తవిక సినిమా ఆకర్షణంతా దాని మాస్టర్ స్ట్రోక్ లోనే వుంటుందని, ఈ మాస్టర్ స్ట్రోకే  కమర్షియాలిటీని ఇస్తుందనీ   చాటుతూ - డ్రైగా వుండే వాస్తవిక సినిమాలు తీసే వాళ్ళని పునరాలోచనలో పడేశారు. శుష్కంగా వుండే వాస్తవిక సినిమాలకి హై ఎండ్ క్రియేటివ్ మైండ్ తో వాటిదైన మాస్టర్ స్ట్రోక్ ఇస్తే తప్పకుండా సామాన్య ప్రేక్షకులూ  వాటికి  ఆకర్షితులవుతారు. 

        గతంలో అనేక భాషల్లో అనేక ‘నాల్గైదు కథల’ సినిమాలొచ్చాయి. వాటిలో తెలుగులో వచ్చినవైతే మాస్టర్ స్ట్రోక్ లేక చతికిల బడిపోయాయి. వివిధ పాయలుగా సాగే కథలు ఒక చోట సంగమించే దగ్గర చమత్కృతి చేయలేక చప్పగా ముగిసిపోయే వైఖరినే ప్రదర్శిస్తూ వున్నాక, ‘మనమంతా’ దీన్ని చక్కదిద్దే స్టడీ మెటీరియల్ గా వచ్చి నిలబడుతోంది.
        నాల్గు కథల ‘మనమంతా’ లో అందరూ కమర్షియల్ నటీనటులే వున్నారు...


కథలు
     సాయిరాం (మోహన్ లాల్) సూపర్ మార్కెట్ లో పనిచేసే అసిస్టెంట్ మేనేజర్. ఎప్పుడూ ఆర్ధిక ఇబ్బందుల్లో వుండి వర్కర్( ధన్ రాజ్)  దగ్గర చేబదుళ్లు తీసుకుంటూ వుంటాడు. ఇంకో అసిస్టెంట్ మేనేజర్ విశ్వనాథ్ (హర్షవర్ధన్) కీ ఇతడికీ పరస్పరం పడదు. స్టోర్ మేనేజర్ (పరుచూరి వెంకటేశ్వర రావు) త్వరలో రిటైర్ కాబోతున్నాడు. ఆ పోస్టు తనకంటే ఎక్కువ చదువుకున్న  విశ్వనాథ్ కే వచ్చే  అవకాశాలు  వుండడంతో సాయిరాం తీవ్రాలోచనలో పడతాడు. తనకి ఈ  మేనేజర్ పోస్టు దక్కితే ఆర్ధిక ఇబ్బందులు తొలగుతాయన్న నమ్మకం అతడిది.

        ఇంకోవైపు గాయత్రి (గౌతమి) అనే మధ్యతరగతి గృహిణి వుంటుంది. పొదుపుగా ఎలా కుటుంబాన్ని నిర్వహించాలి, ఎలా ఆదా చేయాలీ అని నిత్యం ఆరాటపడుతూ, పొరుగింటి వదినగారు (ఊర్వశి) తో పథకాలేస్తూ వుంటుంది. ఆ మేరకు ఏవి కొనాలని ఏ బజారు కెళ్ళినా ఆ పొదుపు కాస్తా దుబారా అయిపోయి బెంబేలెత్తి పోతూంటుంది. 

        మరో వైపు అభి (విశ్వంత్) అనే చదువే లోకంగా జీవించే ఇంజనీరింగ్ స్టూడెంట్ ఐరా(అనూశా అంబ్రోస్)  అనే అమ్మాయితో ప్రేమలో పడి ప్రేమే జీవితంగా గడుపుతూంటాడు.

        మరింకో వైపు మహతి (రైనారావ్) అనే స్కూలు బాలిక నాల్గేళ్ళ స్లమ్ కుర్రాణ్ణి చూసి వాణ్ణి చదివించాలని ప్రయత్నిస్తూంటుంది...

        ఇలా ఈ నల్గురి ప్రయత్నాలూ మలుపు తీసుకుంటాయి : మేనేజర్ గా ప్రమోటవడానికి ఇంటర్వ్యూ రోజున విశ్వనాథ్ తనకి  అడ్డురాకుండా ఒకరౌడీతో క్రిమినల్ పథకమేస్తాడు సాయిరాం. దీంతో విశ్వనాథ్ అదృశ్యమై పోతాడు. ఫలితంగా సాయిరాం పెద్ద చిక్కుల్లో పడిపోతాడు. 

        గాయత్రికి తన పాత ప్రొఫెసర్ (గొల్లపూడి మారుతీ రావు) ఎదురై ఒకప్పుడు ఆమె చేసిన ఆర్ధిక సాయానికి బదులు తీర్చుకుంటూ ఆమెకి సింగపూర్ లో జాబ్ ఆఫరిస్తాడు. దీంతో ఈ వయసులో ఆమె అందర్నీ వదిలేసి ఎలా వెళ్ళగలనని అయోమయంలో పడిపోతుంది. 

        ఐరాని ప్రేమిస్తున్న అభికి ఆ ప్రేమ వికటించి, ప్రేమాలేదు దోమా లేదని ఆమె లాగి కొట్టడంతో చావడానికి సిద్ధమైపోతాడు.  

        చదివించడానికి స్కూల్లో వేసిన స్లమ్ కుర్రాడు అదృశ్యమై పోవడంతో ఆందోళనగా వాణ్ణి వెతుక్కుంటూ తిరుగుతూంటుంది ఇంకోవైపు మహతి...

        ఇలా సమస్యల్లో పడ్డ  ఈ నల్గురికీ ఈ నల్గురితోనే యాదృచ్ఛికంగా ఎలా పరిష్కరాలు లభించాయన్నది మిగిలిన ‘నదుల అనుసంధానపు’ కథ. 


ఎలావుంది కథ 

    ప్రయోగాత్మకమైనది. కమర్షియల్ విలువల కోసం సంయమనం కోల్పోనిది. పాటలు కూడా లేనిది. మల్టిపుల్ ఫ్లాష్ బ్యాక్స్ తో వచ్చే కమర్షియల్ సినిమాల్ని ఆదరిస్తున్నట్టుగా, మల్టిపుల్ కథలతో సమాంతరంగా సాగే  నాల్గైదు కథనాలతో సినిమాలు  వస్తే దూరంగా వుంటున్నారు ప్రేక్షకులు. వాళ్లకి కావలసింది చిన్న చిన్న కథలు కాదు, ఒకే పెద్ద కథ. ప్రచురణ రంగంలో కూడా నవలలు రాజ్యమేలినప్పుడు కథల సంకలనాల్ని ఎవరూ కొనేవాళ్ళు కాదు- పెద్దపెద్ద నవలలే కొనుక్కుని చదివేవాళ్ళు. తెలుగు వాళ్ళ టేస్టే అలాటిది. ఏదైనా తాటి కాయంత వుండాలి. అయితే ‘మనమంతా’ కూడా ఒకే పెద్ద కథే. ఇది చివరికి తెలుస్తుంది. దీ న్ని నాల్గు కథల సమాహారమని ఆంథాలజీగా పబ్లిసిటీ చేయడం ప్రేక్షకుల్ని దూరం చేసుకోవడమే. ఈ కథంతా అతి పెద్ద సస్పెన్సు. కుటుంబ కథల్లో సస్పెన్సు ఉన్నవి రావడం లేదనీ, సస్పెన్సు తో వుంటే (సస్పెన్స్ అంటే ఇక్కడ నేరాలో ఘోరాలో వుండాలని కాదు) కుటుంబ కథలు రొటీన్ మూసలోంచి బయట పడతాయనీ గతంలో చెప్పుకున్నాం. దీనికిప్పుడు  ‘మనమంతా’ తార్కాణంగా నిలుస్తోంది.

        ఇందులో ఉన్నవి నిత్యజీవితంలో కలిగే చిన్న చిన్న కోరికలే. ఇవి తీర్చుకోవడానికి పడే పాట్లే. పెద్ద లక్ష్యాలు, పెద్ద సంఘర్షణలు కమర్షియల్ సినిమాలకి వర్తిస్తాయి. అయితే ఈ మధ్య కొందరు దర్శకులు ఎలా చేస్తున్నారంటే-  ఈ చిన్న చిన్న కోర్కెలు, అవి తీర్చుకునే పాట్లతో  కమర్షియల్  సినిమాలు ఆలోచిస్తున్నారు. రియలిస్టిక్ సినిమాల పనిముట్లని కమర్షియల్ సినిమాలకి వాడి నడిపించాలనుకుంటున్నారు- అలా చేస్తే అవి రెంటికి చెడ్డ రేవడి అవుతాయని తెలుసుకోవడానికి ‘మనమంతా’ చూస్తే  సరిపోతుంది. సాయిరాం పాత్రతో నైతిక పతనం, గాయత్రి  పాత్రతో మధ్యతరగతి మందహాసం, అభి పాత్రతో  బబుల్ గమ్  ప్రేమలు, మహతి పాత్రతో సామాజిక స్పృహా ఇందులో వున్నాయి. రౌడీని నమ్మితే పాముని నమ్మినట్టే నని అయ్యప్ప శర్మ పోషించిన రౌడీ పాత్రతో నీతి కూడా వుంది. హైపర్ లింక్ జానర్ కింది కొచ్చే ఈ కథ ముగింపు మాత్రం 2005 లో విడుదలైన మనీషా  కోయిరాలా నటించిన ‘అంజానే’ ( అనుకోకుండా) ముగింపుని గుర్తుకు తెస్తుంది- కాకపోతే ‘అంజానే హార్రర్ కథ.


ఎవరెలా చేశారు
      మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్  సగటు ఉద్యోగి పాత్రలో సినిమాకొక జీ వితాన్ని దానం చేశారు. ఆర్ధిక ఇబ్బందులతో అప్పులు చేసే సగటు జీవిగా ప్రారంభమై, ఉద్యోగంలో ఒక్క మెట్టు పైకి ఎక్కాలన్న ఆలోచన దురాలోచనకి దారి తీసి- మనసులోని చీకటి కోణాన్ని బయటపెట్టుకుని- ఆతర్వాత తను పన్నిన ఉచ్చులోంచి తను బయటపడేందుకు పడే కష్టాలతో పాత్రలో ఒదిగిన తీరు చెప్పుకోదగ్గది. ఎక్కడా సూపర్ స్టార్ హవా కన్పించకుండా, నేనూ మీలాంటోణ్ణే అన్నట్టు ఆమ్ ఆద్మీకి వెండితెర మీద పట్టం గట్టారు. కమర్షియల్ కీకారణ్యంలో సామన్యులు తమని తాము వెండి తెర మీద చూసుకోగల అదృష్టానికి ఎప్పుడు నోచుకున్నారు గనుక!

        గౌతమి ఈ సినిమాలో చాలా గ్రేస్ ఫుల్ గా కన్పిస్తారు. బాధ, కాస్తంత ఆనందం, మళ్ళీ బాధ, అయోమయం, ఏం చెయ్యాలో పాలుపోని తనం- ఇవన్నీ మెలో డ్రామాకి  దూరంగా అతి సరళంగా నిర్వహించుకురావడం చాలా సహజంగా జరిగిపోయింది. ఈమె పక్కవాద్యం  ఊర్వశి అలవాటు చొప్పున కామిక్ రిలీఫ్ కి బాగా తోడ్పడ్డారు. వీళ్ళిద్దరూ కలిసివుంటే  ఏదోవొక గమ్మత్తు జరుగుతుంది. రోమాంటిక్ సైడ్ విశ్వంత్, అనూషా అంబ్రోస్ లు తమ  మోడరన్ పాత్రలతో  రోమాన్స్ కొరతని తీరుస్తారు. ఇక చైల్డ్ ఆర్టిస్టు రైనారావ్ దగ్గర్నుంచీ ప్రతివొక్కరూ పాత్రలు చిన్నవైనా రియలిస్టిక్ లుక్ తో రక్తి కట్టిస్తారు. జుట్టూ గడ్డం పెరిగిపోయి, కంపుకొట్టే శరీరంతో రౌడీ పాత్రలో అయ్యప్ప శర్మ వర్మ సినిమాల్లో క్యారక్టర్లని గుర్తుకు తెస్తారు. 


        టెక్నికల్ గా కెమెరా వర్క్, సంగీతం, ఎడిటింగ్ వగైరా ఉన్నత విలువలతో వున్నాయి. మాటల  రచయిత రవిచంద్ర తేజ సినిమా డైలాగులు రాయకుండా బతికించారు. సెంట్రల్ హైదరాబాద్ లో మధ్యతరగతి నివాస ప్రాంతాల్ని వాటి నేటివిటీతో చూపించడం ఈ వాస్తవిక సినిమాకి సహజత్వాన్నిచ్చేలా వుంది. 


చివరి కేమిటి 

    కథా నిర్మాణ పరంగా ముగింపు ఎపిసోడ్ దర్శకుడు  ఏలేటి ఇచ్చిన బంపర్ మాస్టర్ స్ట్రోకే సందేహం లేదు- హిందీ ‘అంజానే’ ని గుర్తుకు తెచ్చినప్పటికీ. హిందీ ‘అంజానే’ కూడా ‘ది అదర్స్’ అనే హాలీవుడ్ కి కాపీ అనేది వేరే విషయం. ఫీల్ గుడ్ మూవీ అంటే ఇలా వుం టుందనేలా మాస్టర్ స్ట్రోక్ ఇచ్చి నిరూపించారు ఏలేటి. ఐతే కథనానికే  ఈ మాస్టర్ స్ట్రోక్ పరిమితమై పోయింది తప్ప కథా ప్రయోజనానికి కాదు. చివరికి ఈ కథకి మూల స్థంభంలా తేలిన గాయత్రి పాత్రకి సమగ్ర ముగింపు పలికారా అంటే లేదనే జవాబు వస్తుంది. ఈ పాత్ర ముగింపు అభ్యుదయమా, పురాణాల వడపోతా? గాయత్రి అంతరిక్ష యానం చేసిన కల్పనా చావ్లా అవ్వాలా, లేక సతీ అనసూయగా వుండి పోవాలా? ఇంకో రెండడుగుల్లో కొత్త భవిష్యత్తు ని వెతుక్కుంటూ సింగపూర్ విమాన మెక్కుతోంటే  తిరోగమింప జేసి- నీ స్థానం ఇక్కడి ఇల్లే తల్లీ, ఈ కష్టాలే పడు!- అన్నట్టు జండర్  స్టీరియో టైపింగ్ చేయడమే కథా ప్రయోజనాన్ని దెబ్బ తీసింది.

        సుమారు ఇలాటిదే అయిన సగటు గృహిణి పాత్రలో శ్రీదేవి నటించిన ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ (2012) అనే హిందీ, సనాతన ధర్మాన్ని త్రోసిరాజని అభ్యుదయాన్నే చాటింది. దర్శకుడు ఏలేటి నాల్గు కథనాల సంగమంలో చేసిన చమత్కృతి ప్రేక్షకుల టెన్షన్ ని మాత్రమే సడలించ డానికి  పనికొస్తుంది. అది  ఉపశమనాన్ని మాత్రమే కలిగిస్తుంది.  గాయత్రిని అలా తిరిగి  బందీగా రొటీన్ జీవితంలో పడెయ్యడంతో మెటీరియల్ స్థాయిలోనే ఈ ఉపశమనం మిగిలిపోయింది. ఇలా కాకుండా కల్పనా చావ్లా అంతరిక్షాని కేగినట్టు, విమానమెక్కి రివ్వున గాయత్రి మేడమ్ సింగపూర్ కెగిరిపోతే, అదింకా అత్యున్నత  స్పిరిచ్యువల్ అనుభవంగా చిరకాలం మిగిలేది ప్రేక్షకుల దోసిట్లో.


        ‘గ్లాడియేటర్’ లాంటి మెగా మూవీస్ తీసిన దర్శకుడు రిడ్లీ స్కాట్,  1991 లో ‘థెల్మా అండ్ లూయిస్’ అనే థ్రిల్లర్ తీశాడు. ఇందులో ముగింపులో వెంటాడుతున్న పోలీసులు పట్టుకుంటే మనం వెనక్కెళ్ళి జైల్లో బందీ అయిపోతామని, మనం ముందుకే వెళ్ళాలని (
"keep going")  హీరోయిన్లిద్దరూ నిర్ణయం తీసుకుని- కొండ చరియ పైనుంచి కారుని డ్రైవ్ చేసి స్పీడుగా అనంత లోకాలకి దూసుకెళ్ళి పోతారు. ఇదొక స్పిరిచ్యువల్ అనుభవం. దీనికి ఆస్కార్ ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు లభించింది ఆ సంవత్సరం. మన కమర్షియల్ సినిమాల్లో ఇలాటి స్పిరిచ్యువల్ అనుభవాల ముగింపులు సాధ్యం కాక పోవచ్చు, రియలిస్టిక్ సినిమాల్లో  ప్రయత్నిస్తే పోయేదేం లేదు.


-సికిందర్
(దీనికి స్క్రీన్ ప్లే సంగతులు ఇవ్వడం లేదు.
ఇస్తే ముగింపు  ఎపిసోడ్ వెల్లడించాల్సి వస్తుంది)
http://www.cinemabazaar.in