రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

22, జులై 2016, శుక్రవారం

రివ్యూ :






రచన- దర్శకత్వం : పా. రంజిత్ 

తారాగణం : రజనీకాంత్, రాధికా ఆప్టే, ధన్సిక, రిత్విక, దినేష్ రవి, కళయరాసన్, జాన్ విజయ్, విన్ స్టన్ చావో, రోస్యమ్ నోర్ తదితరులు 
సంగీతం : సంతోష్ నారాయణ్, ఛాయాగ్రహణం : జి. మురళి 
విడుదల : 22 జులై, 2016 
***
        సూపర్ స్టార్ రజనీకాంత్ తో మారుతున్న ప్రేక్షకాభిరుచిని అర్ధంజేసుకోవడంలో దర్శకులు విఫలమవుతున్నట్టు సూచనలు కన్పిస్తున్నాయి. రజనీతో రొటీన్ మాస్ కమర్షియల్స్ తీయడానికి ఇంకా ఏమీ మిగల్లేదనే, మెగా దర్శకుడు శంకర్ రజనీతో  ‘రోబో’ అనే సైన్స్ ఫిక్షన్ తీసి ప్రేక్షకుల్ని ఓ కొత్త వూహా ప్రపంచంలోకి తీసికెళ్ళాడు. తిరిగి ప్రస్తుతం తనే తీస్తున్న ‘రోబో- 2’ అనే మరో సైన్స్ ఫిక్షన్ తో ఇంకో కొత్త ఊహా ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్నాడు. కానీ ‘రోబో’ అనే సైన్స్ ఫిక్షన్ లో రజనీని ప్రేక్షకులు మరమనిషి గా అంగీకరించారు కదాని, మనంకూడా ఇంకో అడుగు ముందుకేస్తున్నట్టు భ్రమించి, మరమనిషి నుంచి అసలే ప్రాణంలేని త్రీడీ గ్రాఫిక్స్ రూపానికి దించి,  రజనీ కుమార్తె ఐశ్వర్య ‘విక్రమ సింహా’ తో ప్రేక్షకుల్ని అపరిమితంగా  పరిహాసమాడింది. వెంటనే ‘లింగా’ తో అందుకుని, కె ఎస్ రవికుమార్ పాత మూస రజనీ కాంత్ నే మళ్ళీ చూపించి ప్రేక్షకాభిమానుల్ని అనుచితంగా హతాశుల్ని చేశాడు. ఇప్పుడు రియలిస్టిక్ సినిమాల రంజిత్ వచ్చేసి రజనీతో ఏం చేసుకోవాలో అర్ధంగాక ఏమేమో చేసి –ఆఖరికి ప్రేక్షకులు నవ్వుకునే స్థితికి సూపర్ స్టార్  సినిమాని దిగజార్చాడు. 


       ఇంగిత జ్ఞానాన్ని ప్రదర్శించి  ఐశ్వర్య దర్శకుడు రంజిత్ ని ప్రశ్న అడిగింది- మీ స్క్రిప్టులో ఎంటర్ టైన్ మెంట్ అనేది లేదు కదా కాస్త ఉండేట్టు చూడమని. దీనికి రంజిత్- ఇందులో ఎంటర్ టైన్ మెంట్ కుదరదనడం సహజంగానే అతడి నాన్-కమర్షియల్ మైండ్ సెట్ కి మచ్చుతునక. ఇప్పటి రజనీకాంత్ యిప్పటి అమితాబ్ బచ్చన్ కాదని తెలుసుకోకపోవడమే అతడితో వచ్చిన చిక్కు.  తమ రజనీకాంత్ ఎప్పటికీ ఆల్ రౌండరే అని నిద్రలో లేపి అడిగినా సాక్ష్యం చెప్తారు అభిమానులు. 


      ‘కబాలీ’ అనే బ్రహ్మండమైన పవర్ఫుల్ ఇగోయిస్టిక్ టైటిల్, దీనికి తగ్గట్టు విపరీతమైన క్రేజ్ సృష్టించిన ట్రైలర్స్, రెండు పరాజయాల తర్వాత ఈసారి రజనీ చాలా జాగ్రత్త తీసుకుంటారన్న అతిపెద్ద భరోసా, పైగా మొట్ట మొదటిసారిగా ఒరిజినల్ రూపంతో రజనీకాంత్ దర్శనం, దేశవ్యాప్తంగా గొప్ప పండగవాతావరణం...ఇదీ నేపధ్యబలం. దీంతో వెయ్యేనుగుల బలం వచ్చినట్టు ఫీలయ్యి థియేటర్లోకి అడుగుపెడితే...


తెర మీద కన్పించే కథ     
      మ
లేషియాలో కబలీశ్వరన్ అలియాస్ కబాలి (రజనీకాంత్) పాతికేళ్ళు జైలు శిక్ష అనుభవించి విడుదలవుతాడు. మలేషియాలో తరాలుగా జీవిస్తున్న తమిళ బడుగు జీవుల సమస్యలు తీర్చే మాఫియా డాన్ అతను.  జైలు నుంచి వచ్చాక తన పాత శత్రువు టోనీ (విన్ స్టన్ చావో) చేస్తున్న దందాల్ని బంద్ చేయించే ప్రయత్నాలు మొదలెడతాడు. అతణ్ణి చంపడానికి టోనీ అనుచరులు దాడులు ప్రారంభిస్తారు. తన పాత  అనుచరుల పిల్లలు కూడా ఈ మార్గం పట్టకూడదని వాళ్ళకి చదువు చెప్పించే స్కూలు నడుపు తున్న కబాలీ  ఆ స్టూడెంట్స్ అడిగితే  తన గతం చెప్పుకొస్తాడు. 


        ఆ రోజుల్లో సీతారామరాజు ( నాజర్) తమిళుల పెద్ద దిక్కుగా ఉంటాడు. అతను హత్యకి గురవడంతో వారసత్వం కబాలీకి లభిస్తుంది. దీంతో ద్వేషం పెంచుకున్న మరో అనుచరుడు టోనీ తో కుమ్మక్కయి కబాలీని అడ్డు తొలగించే ప్రయత్నంలో గర్భవతి అయిన కబాలీ భార్య కుందనవల్లి (రాధికా ఆప్టే)  మీద దాడి  చేస్తాడు. అతణ్ణి కబాలీ చంపేసి జైలు కెళ్తాడు.

        ఇలాటి గతమున్న తను ఇప్పుడు వృద్ధాప్యంలో భార్య జ్ఞాపకాలతో బాధగా గడుపుతూంటాడు. ఇప్పుడు యోగి (ధన్సిక) అనే అమ్మాయిని కబాలీని చంపేందుకు నియమిస్తాడు టోనీ. తీరా చూస్తే  ఈమె తన కూతురే అని తెలుస్తుంది కబాలీకి. అంతలో భార్య కూడా బతికే వుందని తెలుస్తుంది...


        పాతికేళ్ళ క్రితం టోనీవల్ల తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి పగ తీర్చుకోవడమే ఇక ఇక్కడ్నించీ కబాలీ కథ. 


ఎలావుంది కథ
       
సారి రజనీ జాగ్రత్త పడతారన్న భరోసాకాస్తా అవిరైపోయేలా వుంది కథ. రజనీ ఇందులో ‘బాషా’ ని చూశారా, ‘నాయకుడు’ ని చూశారా, లేక ఏకంగా ‘గాడ్ ఫాదర్’ నే చూశారా? ఈ కథలో తను ప్రజల కోసం పోరాడారా, కుటుంబం గురించి పగదీర్చుకున్నారా? ఈ కథలో తను డానా, ఫ్యామిలీ మ్యానా? రజనీ సార్ తన ఒల్డేజి పాత్రలో బాధపడే దిలీప్ కుమార్ ని చూశారా, మండిపడే అమితాబ్ బచ్చన్ ని చూశారా? చాలా కన్ఫ్యూజన్. కథలో కొత్త దనం లేదు. ఉన్న కథలో హేతుబద్ధత లేదు. కథ దేని గురించన్న స్పష్టత లేదు సరే, నేటివిటీ- కమర్షియాలిటీలు కూడా కరువయ్యాయి. కథలో వున్న ఫ్యామిలీ డ్రామాకి తగిన భావోద్వేగాలు కూడా కరువే. కథ ఎప్పుడూ పాత్ర ద్వారానే వ్యక్తమవుతుంది. నిజ జీవితంలో ఎలా వుండే రజనీని అలాగే వుంచి పాత్రకి సిద్ధం చేయడం ఓ కొత్త ప్రయోగమే, కానీ పాత్రని సీరియస్ పాత్రగా మల్చడమే పొరపాటయి పోయింది. దీంతో చాలా  విషయాల్లో  కమర్షియాలిటీ లేకుండా పోయింది. రజనీ కాంత్ సీరియస్ గా వుండడమంటే ప్రపంచమంతా కూమ్ రివర్ లో కొట్టుకు పోయినట్టే. పాతికేళ్ళ క్రితం ‘చనిపోయిన’ భార్య బిడ్డల గురించే ఇంకా బాధపడే పాత్రా- ఆ పాత్రకి తగ్గట్టు పంచ్ డైలాగుల్లేని, సహజ రజనీ మార్కు హాస్యం లేని, ఏ మ్యానరిజమ్సూ లేని, హుషారు లేని, కసి లేని, ఖుషీ లేని – దుర్భిక్ష పరిస్థితి ఏర్పడిన వాతావరణం. 

ఎవరెలా చేశారు
       
జనీది అంత  ఈలలూ చప్పట్లు పడే పాత్ర కాదని ఈ పాటికే అర్ధమైపోయి వుంటుంది. పోనీ ఫ్లాష్ బ్యాక్ లో యంగ్ రజనీ పాత్రయినా ఎంటర్ టైన్ చెయ్యదు. అసలా యంగ్ గ్ రజనీ కంటే ఓల్డ్ రజనీయే చాలా బెటర్. ఓల్డ్ రజనీ కూడా ఒక్క క్లయిమాక్స్ లో విలన్ తో చెప్పే నాల్గు డైలాగులే పవర్ఫుల్ గా వున్నాయి. ఇంకెక్కడా రజనీకి డైలాగులే సరీగ్గా లేవు. ఇది వాస్తవిక కథాచిత్రమన్నట్టు మాటలు రాశాడు దర్శకుడు. కమర్షియల్ డైలాగ్ రైటింగ్ అనేది ఏ  పాత్రకీ లేదు. 

        స్టీవెన్ స్పీల్ బెర్గ్ తీసిన ‘షిండ్లర్స్  లిస్ట్’ వుంది. ఇందులో  హీరో లియాం నీసన్ ఒక హోటల్ రూమ్ లో ఒపెనవుతాడు. ముఖం కనపడదు. వస్తువులు కనబడుతూంటాయి. ఖరీదైన వాచీ ధరిస్తాడు. షర్ట్ కఫ్ లింక్స్ పెట్టుకుంటాడు. కోటు కి నాజీ పార్టీ గుర్తుగల పిన్ పెట్టుకుంటాడు. టేబుల్ సొరుగు లోంచి గుప్పెడు కరెన్సీ నోట్లు తీస్తాడు. నైట్ క్లబ్ లోకి ఎంటర్ అవుతాడు...ఇలాగే వుంటుంది జైల్లో రజనీకాంత్ ఎంట్రీ సీను కూడా. ఇది సరిపోలేదు, ఇంకా హైప్ వుండాల్సింది. రజనీకాంత్ తాను పాత్ర వయసుకి తగ్గట్టు గంభీరంగా నటిస్తున్నాననుకున్నారే గానీ, నిజానికి అది కుటుంబ ట్రాజడీ బాధ బరువు కింద కమర్షియాలిటీని ఖూనీ చేస్తున్నా ననుకోలేదు. 

        ఇక రాధిక ఆప్టే, ధన్సిక లు నటించారు గానీ, అవి రియలిస్టిక్ పాత్రలు. విలన్స్ లో కిషోర్, చైనీస్ నటుడు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరెవరో చిల్లరమల్లర తమిళ కొత్త ముఖాలుగా వున్నారు. రజనీ డాన్సుల్లేవు. వయసుకి తగ్గట్టు తుపాకీ కాల్పులతో యాక్షన్ సీన్స్ వున్నాయి. మ్యూజికల గానూ బలహీనంగా వుంది సినిమా. 


చివరికేమిటి
        సూపర్ స్టార్ రజనీ కాంత్ తో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు రెండు సినిమాల కొత్త దర్శకుడు రంజిత్. ఒల్డేజి రజనీని వెండితెర మీద చూపించడమంటే ఆయన్ని వేగంగా అటు నడిపించడానికీ, లేదా హడావిడిగా ఇటు అడుగులేయించడానికీ మించి విజువలైజేషన్ కన్పించదు  దర్శకుడిలో. రకరకాల సూట్స్ ధరిపంజేయడంలో కనబర్చిన  శ్రద్ధ, ఆ స్టయిలిష్ నెస్ కి తగ్గట్టు మాటల తూటాలు విసిరే ఫన్నీ కోణాన్ని పట్టుకోలేక్పోయాడు. 

        పాతికేళ్ళ తర్వాతా భార్యా బిడ్డలు పోయారన్న విచారంతో వుండే పాత్రగా చిత్రించడం పూర్తిగా-సైకలాజికల్ గా-  అవగాహనా రాహిత్యం. అసలు పాతికేళ్ళ క్రితం జరిగిన దాడిలో గర్భవతైన భార్య  పోవడమనే ఆలోచన పాత్రకి కల్పించడమే అర్ధరహితం.  బహిరంగంగా జరిగిన దాడిలో దాడి  చేసిన వాణ్ణి తాను చంపేస్తే,  పోలీసులు తనని అరెస్టు చేసి పట్టుకెళ్తే, భార్య ఏమయ్యిందో తెలుసుకోడా? చనిపోతే పోలీసులు ఆ సంగతి చెప్పి అంతక్రియలకి అనుమతించారా? చనిపోకుండా ఆస్పత్రిలో ప్రసవిస్తే బిడ్డ పుట్టిన విషయం కూడా చెప్పరా పోలీసులు? భర్త జైలు కెళ్లాడని బతికున్న భార్యకి కూడా తెలీదా పాతికేళ్ళూ? హేతుబద్ధత లేని ఈ ఫ్లాష్ బ్యాక్ మీద పునాది కట్టి మొత్తం కథ నడిపాడు దర్శకుడు. 


        రజనీకాంత్ జైల్లోంచి వచ్చిన పదినిమిషా వరకూ వుండే ఆసక్తి  ఆతర్వాత కథా కథనాల్లో కన్పించక పోవడం, ఇంటర్వెల్  దగ్గర భార్య ఫలానా వూళ్ళో  జీవిస్తోందని తెలిశాక, ఆ తర్వాతి సీన్లో డైరెక్టుగా ఆమెతో కలిపెయ్యకుండా, సెకండాఫ్ లో ఆమెకోసం కావాలని రజనీకాంత్ ని ఊరూరా తిప్పడం (‘బ్రహ్మోత్సవం’  లో మహేష్ బాబు ఏడుతరాల బంధువుల కోసం తిరిగే సీన్లు జ్ఞప్తికి తెస్తూ),  ఆ భార్య కలవగానే- శత్రువుల దాడితో క్లయిమాక్స్ కి వెళ్ళిపోవడం...ఇదంతా విషయలేమిని పట్టి చూపుతుంది. 


        ప్రజల కోసం కబాలీ ఏం చేశాడన్నది ఎక్కడా కన్పించదు. కుటుంబం కోసం పరితపించేవాడు కబాలీ అని బిల్డప్ తో పేరు పెట్టుకుని తిరగనవసరం లేదు. అది కాబూలీవాలా తిరిగి నట్టు వుంటుంది. జైల్లోంచి వచ్చాక అక్కడి ప్రజల కోసం పాటుబడుతూ (ఔటర్ ఎమోషన్), లోలోపల కుటుంబం కోసం బాధపడుతోంటే (ఇన్నర్ ఎమోషన్) - అప్పుడది సమగ్ర పాత్రవుతుంది. ఔటర్ ఎమోషన్ తో ప్రజలకోసం ప్రత్యర్ధుల్ని చీల్చి చెండాడే ప్రచండుడిగా చెలరేగుతోంటే కబాలీ మామూలుగా వుండడు- అడ్వాన్సు బుకింగ్స్ ని దాటి మళ్ళీ వారం కూడా గర్జిస్తూనే వుంటాడు- ఇంకా ఇంకా కలెక్షన్స్ కావాలని!!



-సికిందర్    


18, జులై 2016, సోమవారం

స్క్రిప్ట్ నోట్స్!


హాలీవుడ్ లో స్క్రిప్టుల మీద స్టూడియో ఎగ్జిక్యూటివ్ లకి చాలా అధికారాలుంటాయి. కళాత్మక- వ్యాపారాత్మక విలువల దృష్టితో స్క్రిప్టులు చదివి ఎడా పెడా  స్క్రిప్ట్ నోట్స్ పంపిస్తూంటారు రైటర్లకి. ఆ ప్రకారం రైటర్లు మార్పు చేర్పులు చేస్తూపోవాలి. దరిమిలా స్క్రిప్టు తామే గుర్తు పట్టలేనంతగా మారిపోనూ వచ్చు. రెండు సార్లు ఆస్కార్ అవార్డులు పొందిన ప్రసిద్ధ రచయిత ఇంప్రూవ్ మెంట్ పేర, ఓ రచయిత రాసిన స్క్రిప్టు మీద మరికొందరు రచయితలతో కలిసి పని చేశాక- తీరా సినిమా చూస్తే-  తాను రాసిన డైలాగు చిట్టచివర్లో ఒకే ఒక్కటి వుందట! వెరసి ఈ స్క్రిప్ట్ నోట్స్ అనేవి పెద్ద జోకు కింద  మారిపోయాయని ఆడిపోసుకునే వాళ్ళూ లేకపోలేదు. ప్రముఖ హ్యూమరిస్టు  బ్రియాన్ కల్డిరోలా తాజాగా గత ఏప్రిల్ లో ‘టైటానిక్’  సినిమా స్క్రీన్ ప్లే పేజీ మీద స్టూడియో ఎగ్జిక్యూటివ్ లు  ప్రతాపం చూపిస్తే దాని రూపం ఎలా వుంటుందో- తానే కరెక్షన్స్ తో ఒక స్క్రిప్టు నోట్ ని  తయారు చేశారు. ‘టైటానిక్’  స్క్రీన్ ప్లే లో ఒక సీను పేపర్ మీద ఎగ్జిక్యూటివ్ ఎన్ని తప్పులు పట్టుకుని,  ఎలాటి కామెంట్ లు చేస్తాడో తెలుపుతూ బ్రియాన్ కల్డిరోలా సృష్టించిన కామెడీని  ఈ కింద  మీరే చూడండి! 


***

16, జులై 2016, శనివారం

సాంకేతికం!

అళగర్ సామి 







        తెలుగులో నేటి మెగా బడ్జెట్ల  హై - ఎండ్ టెక్నాలజీ సినిమాల్లో ఏది గ్రాఫిక్స్, ఎంతవరకు కళాదర్శకుడి పరిధీ అన్నది తెలియనంతగా పాలూ నీళ్ళలా కలగలిసిపోయి,  ఈ రెండు విభాగాలూ ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ఒకసారి మహేష్ బాబు నటించిన ‘అర్జున్’ లో మధుర మీనాక్షి దేవాలయ సముదాయం సెట్ నే చూడండి- అదంతా కళా దర్శకుడి అద్భుత ప్రతిసృష్టి లాగే అన్పిస్తుంది చూసే కళ్ళకి. కానీ అందులో గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే కళాదర్శకుడు వేసిన సెట్ అనీ, మిగతా పై అంతస్తులన్నీ గ్రాఫిక్స్ తో చేసిన కల్పనే అనీ తెలిస్తే భలే ఆశ్చర్య పోతారు! అదీ అళగర్ సామి ప్రతిభ. ‘దశావతారం’ లో కమలహాసన్ ని విగ్రహాకి కట్టి  జలసమాధి చేసే యాక్షన్ దృశ్యం కూడా అళగర్ సామి గ్రాఫిక్  సృష్టే. నిజానికక్కడ సముద్రమనేదే లేదు, అపరబ్రహ్మలా అళగర్ సామి సృష్టించిన గ్రాఫిక్స్ సముద్రమే తప్ప!

          ‘భిన్న ప్రాంతాలనుంచి విభిన్న సంస్కృతుల  నుంచీ యానిమేటర్లు ఈ రంగంలోకి వస్తున్నా కొద్దీ మనం అంతర్జాతీయ స్థాయిని మించిపోతాం!’ అని అంటారీయన గర్వంగా. అన్నట్టు హైదరాబాద్ ఐటీ కూడలి అన్నది పాత మాట.గ్రాఫిక్స్ కి కూడా జంక్షన్ అనేది తాజా మాట. అళగర్ సామి చెన్నై లోని స్టూడియో కేంద్రంగా పనిచేస్తున్నా, ఆరు నెలల క్రితం హైదరాబాద్ లో వెన్ శాట్  టెక్ సర్వీసెస్ పేరుతో  సంస్థ ప్రారంభించి వైస్ ప్రెసిడెంట్ గా వుంటున్నారు.తెలుగులో అల్లు అర్జున్ నటించిన  ‘వరుడు’ కి గ్రాఫిక్స్ సమకూర్చారు. 2003 ఓ ‘ఒక్కడు’ నుంచీ గుణశేఖర్  సినిమాలకి సేవలందిస్తున్నారు.

నమ్మలేని నిజాలు
గ్రాఫిక్స్ కి ముందు   
      ‘వరుడు’ లో కీలక సన్నివేశాల వెనుక నమ్మలేని నిజాలున్నాయి. లైవ్ డెమో సాక్షిగా అది చూపించారు అళగర్ సామి. చూస్తే- మొదట బ్లూమ్యాట్ నేపధ్యంగా కళ్యాణ మండపం సెట్ తప్ప మరేమీ లేదు. దాని చుట్టూ అందమైన పూదోట గానీ, పైన సూర్యోదయపు సువిశాలాకాశం గానీ లేవు. కథ ప్రకారం ఉదయం ఏడున్నరకి పెళ్లి ముహూర్తం. ఆ సన్నివేశాల చిత్రీకరణకి కొన్ని రోజులైనా పట్టొచ్చు. అన్ని రోజులూ అదే ప్రాతఃకాలపు టెంపరేచర్ టోన్ నీ, మేఘాల ఆవరణాన్నీ, చుట్టూ పూల మొక్కల తాజా దనాన్నీ, యధాతధ స్థితిలో వుంచేందుకు ఏం చేయాలన్న సమస్యతో దర్శకుడు గుణశేఖర్ వస్తే, అళగర్ సామి ఇచ్చిన ప్లానే  ఈ లైవ్ డెమోలో ఇప్పుడు చూపిస్తున్న తర్వాతి షాట్లు. ఇప్పడు బ్లూమ్యాట్ కట్ అయిపోయింది. మండపం చుట్టూ ముగ్ధ మనోహర పూదోటా, పైన ఉదయకాలపు బంగారు వన్నెతో మెరిసిపోయే గగనతలమూ, అంతా అళగర్ సామి మాయాజాలం! మళ్ళీ ఇది చాలనట్టూ - పిల్ల వాయువులు వీస్తున్నట్టూ, దాంతో నాజూకైన పూల రేకలు అటూ ఇటూ కదులుతున్నట్టూ అదనపు ఎఫెక్ట్! సినిమాలో తర్వాత మొత్తం మండపం కూలిపోయే సీను కూడా గ్రాఫిక్సేనని చెప్పారు.

గ్రాఫిక్స్ తర్వాత 

    క్లయిమాక్స్  సీన్లో 120 అడుగుల ఎత్తుగల పొగ గొట్టం మీద అల్లు అర్జున్ - విలన్ ఆర్యల మధ్య పోరాట దృశ్యాలు ఇంకా వేరే గ్రాఫిక్స్ కళ. ఇందుకు  రామోజీ ఫిలిం సిటీలో సెట్ వేశారు. 20 అడుగుల ఎత్తులో నిర్మించిన బావి లాంటి సెట్ మీద అర్జున్ - ఆర్య లు కలబడతారు. దీన్ని కూడా బ్లూమ్యాట్ బ్యాక్ డ్రాప్ లోనే షూట్ చేశారు. ఇలా గ్రాఫిక్స్ కోసం సృష్టించే ఏదైనా సెట్ ని రిఫరెన్స్ పాయింట్ అంటారు. ఇలాటి ఈ ‘బావి’ అనే రిఫరెన్స్ పాయింటుని  ఆధారంగా చేసుకుని  గ్రాఫిక్స్ తో 120 అడుగుల ఎత్తున్నట్టు పొగ గొట్టాన్ని సృష్టించి, దాని మీద 20 అడుగుల బావి సెట్ మీద చిత్రీకరించిన అర్జున్- ఆర్యల పోరాటాన్ని తెచ్చి ప్రతిష్ఠించారు. ఇంకా ఆ పోరాటం ధాటికి పొగ గొట్టం పెచ్చు లూడుతున్నట్టు అదనపు ఎఫెక్ట్ కల్పించారు. 


        ఈ క్లయిమాక్స్ దృశ్యం ‘ఎక్స్ మెన్ వోల్వోరిస్’ అనే హాలీవుడ్ మూవీ లోనిది కదా అంటే, ఒప్పుకున్నారు అళగర్ సామి. ‘ఈ సినిమాలో మనం చూస్తే హీరో - విలన్ లిద్దరికీ అతీంద్రయ శక్తులుంటాయి. అందువల్ల అంత ఎత్తులో వాళ్ళ పొగ గొట్టం ఫైట్ కి విశ్వసనీయత చేకూరింద
నుకోవచ్చు. అదే అల్లు అర్జున్ కి ఇక్కడ ఈ ఫైట్ లో అలాటి మానవాతీత శక్తులు లేవు. సైకో కాబట్టి ఆర్యకి వున్నాయన్న భ్రమ కల్గించారు. ఇందువల్లే ఈ క్లయిమాక్స్ ని ప్రేక్షకులు ఎంజాయ చేయలేక పోయారేమో?’ అంటే, ఇదీ ఒప్పుకున్నారు అళగర్ సామి.

        ‘దేశంలో బాలీవుడ్ తర్వాత ధైర్యమున్న పరిశ్రమ టాలీవుడ్డే’  అని కుండబద్దలు  కొట్టారు. తమిళంలో 10 సినిమాలు నిర్మిస్తే అందులో బిగ్ బడ్జెట్స్ రెండో మూడో వుంటాయనీ, అదే తెలుగులో అయిదారు వుంటున్నాయనీ అభిప్రాయపడ్డారు.  తెలుగులో గుణశేఖర్ సినిమాలతో బాటు ‘స్టాలిన్’, ‘శ్రీ రామదాసు’, ‘పోకిరి’, ‘అతడు’, ‘అతిధి’, ‘సైనికుడు’, ‘దేశముదురు’, ‘వర్షం’, ‘అరుంధతి’, ‘కిక్’, ‘కొమరం పులి’  మొదలైన సినిమాలకి గ్రాఫిక్స్ సమకూర్చారు. 

       ఇంతకీ గ్రాఫిక్స్ లో కెలా వచ్చారంటే, 1994 లో ‘జురాసిక్ పార్క్’ చూసి ఎక్సైట్ అయి యానిమేషన్ కోర్సులో చేరిపోయానన్నారు. అది పెంటా మీడియా సంస్థలో ప్రవేశం కల్పించిందనీ, అక్కడ వార్నర్ బ్రదర్స్, పండోరా ఫిలిమ్స్ వంటి అంతర్జాతీయ కంపెనీలకి  లెక్కలేనన్ని యానిమేషన్ చిత్రాలు రూపొందించాననీ వివరించారు.  ‘పాండవాస్’ అనే ఇంకో  యానిమేషన్ కి అవార్డు వచ్చిందనీ, ఆ తర్వాత 1998 లో శంకర్ తీసిన ‘జీన్స్’ తో సినిమారంగ ప్రవేశం చేశాననీ చెప్పుకొచ్చారు ఫ్రెండ్లీ గా వుండే అళగర్ సామి.

         అక్కడ్నించీ ‘రోబో’ వరకూ శంకర్ తీసిన సినిమాలన్నిటికీ పని చేశానన్నారు. హిందీతో కలుపుకుని అన్ని భాషల్లో 250 సినిమాల వరకూ గ్రాఫిక్స్ చేశానన్నారు. వీటిలో 95 వరకూ విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్ గా చేసిన సినిమాలున్నాయనీ , ఇవన్నీ చేస్తూనే మరోవైపు ఎంబీఏ కూడా పూర్తి చేశాననీ,  తన  స్వస్థలం మధురై సమీపంలోని చిన్న గ్రామమనీ చెప్పారు. 

        సరే, మళ్ళీ మొదటి కొస్తే- ఇలా కళాదర్శకత్వం - గ్రాఫిక్స్ రెండూ కలగలిసి
పోయినప్పుడు, స్థూలదృష్టికి ఆ క్రెడిట్ కళాదర్శకుడికే పోతుంది, అలాగే యాక్షన్ దృశ్యాల క్రెడిట్ యాక్షన్ డైరెక్టర్లకి పోతుంది. మరి గ్రాఫిక్స్ నిపుణుల స్థాన మెక్కడ? వాళ్ళు అస్తిత్వ బాధితులుగా ఇలా మిగిలిపోవాల్సిందేనా?’ అని అడిగితే,  ఇది ఆయన ఎదురు చూడని ప్రశ్న అయింది...ఈ పాయింట్ తన కెప్పుడూ తట్టనే లేదట! 

        ఇక్కడే వున్నమార్కెటింగ్ చీఫ్ సుఖ్విందర్ సింగ్ అయితే కాసేపటి వరకూ తేరు కోలేకపోయారు. ఇక్కడే వున్న సీనియర్ మేనేజర్ కొండల రెడ్డి- ‘మేమెంత వర్క్ చేశామో, ఆర్ట్ డైరెక్టర్లు, యాక్షన్ డైరెక్టర్లూ ఎంత చేశారో లోలోపల మాకు తెలుస్తుంది’ అని ఏదో సర్ది చెప్పుకోబోయారు. 

        ఈలోగా సుఖ్విందర్ సింగ్ తేరుకుని- ‘మా ప్రొఫెషన్ లో ఈ ప్రశ్న మాకే తట్టలేదు, ఇంతవరకూ ఇలాటి ప్రశ్న ఇంకెవరూ ఎవరూ వేయలేదు’ అని  చెంపలు రుద్దుకున్నారు. అయితే తెలుగు మీడియాలో మొట్ట మొదటి సారిగా ‘ఆంధ్రజ్యోతి’ ద్వారా తమ  ఉనికి గురించి బయటి ప్రపంచానికి ఇలా తెలుస్తోంది గనుక ఇక నిశ్చింతగా  వుంటామన్నారు.


-సికిందర్
(సెప్టెంబర్ 2010, ఆంధ్రజ్యోతి- ‘సినిమా టెక్’ శీర్షిక’)

15, జులై 2016, శుక్రవారం

రివ్యూ!





స్క్రీన్ ప్లే – దర్శకత్వం : జి. ఈశ్వర్ రెడ్డి


తారాగణం : అల్లరి నరేష్, సాక్షీ చౌదరి, కామనా రణౌత్, రవిబాబు, పృథ్వీ, నాగినీడు. సప్తగిరి, షకలక, సత్య తదితరులు
మాటలు : డైమండ్ రత్నం, సంగీతం : సాయికార్తీక్, ఛాయాగ్రహణం : లోకనాథ్
 బ్యానర్ : ఏకే ఎంటర్ టైన్మెంట్ – గోపీ ఆర్ట్స్
నిర్మాత : చలసాని రామబ్రహ్మం చౌదరి
విడుదల : 15 జులై, 2016  
 ***

       అల్లరి నరేష్ కి ఇంకా అల్లరి తక్కువ అయోమయం ఎక్కువా అన్నట్టు తయారయ్యింది. 2012 లో ‘సుడిగాడు’  తర్వాత ఇంతవరకూ ఇంకో హిట్ కూడా లేని (వరసగా 9 ఫ్లాపులు) తనకి ఇప్పడు మరో ఫ్లాపు కూడా తోడయ్యింది. తన బ్రాండ్ అల్లరిని పూర్తిగా మర్చిపోయి, ఎంతసేపూ  ‘సుడిగాడు’ నే అనుకరిస్తూ,  అదేపనిగా ఇతర హీరోలని పేరడీ చేసే మూసలో పడిపోవడం ఈ ఏకైక కామెడీ హీరోకి  ట్రాజెడీగా పరిణమించింది. పేరడీలమయమైన ‘సెల్ఫీరాజా’ టైటిల్ ని  ‘స్పూఫీ రాజా’ గా పెట్టుకుని ఇది మరో పేరడీ గారడీ అని  డైరెక్టుగా చెప్పేస్తే సరిపోయేది- ‘సెల్ఫీ రాజా’  టైటిల్ తో ఈ సినిమా కథ(?) కేం సంబంధం లేదు!

       దర్శకుడు జి. ఈశ్వర్ రెడ్డి ఇంకా గత శతాబ్దంలోనే వుండిపోవాలనుకుంటే వుండి పోవచ్చు. కానీ బయ్యర్లూ ప్రేక్షకులూ  ఈ శతాబ్దంలో వుండాలనుకుంటున్నారు. అందుకు పది వారాలుగా ‘బిచ్చగాడు’ ని ఆడిస్తున్నారు. ఇంకా కథా కాకరకాయా లేని పేరడీలూ; పాములతో, మారు వేషాలతో, దాగుడుమూతల దొంగాటలతో చెలామణి చేద్దామనుకునే చైల్డిష్  కామెడీల్ని, బూతు వ్యవహారాల్నీ ఎంజాయ్ చేసే ఓపికతో  ప్రేక్షకులు లేరు. గృహమే కదా స్వర్గసీమా అన్నట్టు ఈ దర్శకుడు తనలోకంలో తాను  ఎంజాయ్ చేసిందే కామెడీ అనుకుంటూ సబ్జెక్టివ్ గా ప్రేక్షకుల నెత్తిన రుద్దిన ‘సి’ గ్రేడ్ సరుకులా వుందిది. 

        కథంటూ వుంటే అది ఇంటర్వెల్ లోపే అయిపోవడం,  ఆపైన సాగదీసిందంతా తలాతోకాలేని, ఏమిటో అర్ధంకాని, గజిబిజి గందరగోళం కావడం-  ఇదంతా ఈసారి కామెడీతో పరాకాష్టకి చేరిన అల్లరి నరేష్ పరిహాసంలా వుంది! 

కథ 
      రాజా (అల్లరి నరేష్) సెల్ఫీ  పిచ్చితో ఇతరుల్ని ఇబ్బంది పెట్టడం, నోటి దూలతో తనే ఇబ్బందుల్లో పడ్డం జీవితంగా గడుపుతూంటాడు. ఏం చేస్తూంటాడో మనకి  తెలీదు, చెవిటి వాళ్ళయిన బాబాయ్- పిన్నీలతో  వుంటాడు. ఒకరోజు పోలీస్ కమిషనర్ (నాగినీడు) కూతురు శ్వేతతో (సాక్షీ చౌదరి) తో ప్రేమలో పడతాడు. ఈమె కూడా ఏం చేస్తూంటుందో మనకి తెలీదు. ఇద్దరికీ పెళ్లి నిశ్చయమై  ఆ పెళ్లి  కాస్తా జరిగిపోతుంది. మొదటి రాత్రి  రాజా గర్ల్  ఫ్రెండ్ ఒక గిఫ్ట్ పంపడంతో రాజాతో కొట్లాడి శ్వేత విడిపోతుంది. ఆమెకి నచ్చజెప్పాలని ప్రయత్నిస్తాడు, వెళ్లి చావమంటుంది. చావడానికి విఫలయత్నాలు చేస్తాడు. ఒక కాకి (కాంట్రాక్ట్ కిల్లర్- రవిబాబు) కన్పిస్తాడు. అతడికి డబ్బిచ్చి తనని చంపమంటాడు.  ఇంతలో శ్వేత వచ్చి రాజా గర్ల్ ఫ్రెండ్ గురించి తను తప్పుగా అర్ధం చేసుకున్నానని  కాళ్ళ మీద పడుతుంది. రాజా కంగారు పడతాడు, తనని చంపకుండా కాకి నుంచి తప్పించుకునే ప్రయత్నాలు ప్రారంభిస్తాడు...

 ఎలావుంది కథ 
        పైన చెప్పుకున్నంత వరకే కథ- ఆపైన కథ వుండేందుకు అవకాశం లేదు. ఎప్పుడైతే  శ్వేత వచ్చి కాళ్ళ మీద పడిందో ఆ గంట లోపే కథ ఖతం! ఇంకో గంట కథ ఉండాలి కాబట్టి లేని కథకి – ఎలాగైతే ‘ఎక్స్ ప్రెస్ రాజా’ లో ఇంటర్వెల్ నుంచీ వేరే  దొంగల కథ తెచ్చి అతికించారో -  అలా అంతకంటే రసాభాసగా అర్ధంపర్ధంలేకుండా నింపేశారు. ‘ఎక్స్ ప్రెస్ రాజా’ కి కవల తమ్ముడు ‘సెల్ఫీ రాజా’. 

 ఎవరెలా చేశారు 
      ఎవరూ ఏమీ చేయలేదు. చేసి వుంటే మొదటి గంట లోపే - కథ ఉన్నంత సేపే- అల్లరి నరేష్, సప్తగిరి, తాగుబోతు రమేష్, పృథ్వీ, మరికొందరు జబర్దస్త్ కమెడియన్లు చేశారు. ఆ తర్వాత చేసిందంతా తలకాయనొప్పి. బూతు- చివరి షాటు వరకూ ‘‘గే’ కామెడీ. మొదటి గంటలోపు కామెడీకి ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్ - థాంక్స్ టు  డైమండ్ రత్నం డైలాగ్స్- రెండో గంటంతా లేదు. ఇక రెండో పాత్రలో అల్లరి నరేష్ దిగడం వున్న అర్ధంకాని వ్యవహారానికి ఇంకా సహన పరీక్షయి కూర్చుంది. సినిమా అంటే నిమిషానికో పాత్రని దింపుకుంటూ పోవడమే అన్నట్టుంది- ఏ పాత్ర ఏమిటో ఎందుకో అర్ధంగాక ఫాలో అవడం మానేస్తాం మనం. ఇక హీరోయిన్లకి పాత్రలే లేవు- వున్నట్టుండి వచ్చే పాటల్లో  కన్పించి వెళ్లిపోతూంటారు. వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్  కూడా ఏమంత గ్లామరస్ గా లేదు. పాత్ర ఎలా ఎస్టాబ్లిష్  అయింది, ఎలా చిల్లర కామెడీ కింద దిగజారిందీ తెలిసీ పాపం రవిబాబు నానా కంగాళీ చేస్తూంటే జాలిపడాల్సి వస్తుంది మనకి.  

        సాయికార్తీక్ కూర్చిన పాటలు మాత్రం క్యాచీగా వున్నాయి, అలాగే లోకనాథ్ ఛాయాగ్రహణం ప్లెజంట్ గా వుంది. ఈశ్వర్ రెడ్డి కథా నిర్వహణ, దర్శకత్వం మాత్రం చాలా దిగువ స్థాయిలో  వున్నాయని చెప్పక తప్పదు. అతనింకా బేసిక్ గా సినిమా అంటే ఏమిటో, ప్రేక్షకులతో ఎలా కనెక్ట్ అవాలో అ ఆ ల దగ్గర్నుంచీ నేర్చుకోవాల్సి  వుంది- కళాఖండాల గురించి కాదు, ఉత్త కమర్షియల్స్ గురించే!

చివరికేమిటి
        అరగంట లోపు బిగినింగ్ ని సెటప్ చేస్తే అది ప్రాణాంతాకంగా మారడం పరిపాటైంది ఈ మధ్య తెలుగు సినిమాలకి. అరగంటలోపే  హీరోని సమస్యలో పడేశాక ఆతర్వాత మిగతా గంటన్నరో, రెండు గంటలో కథ ఎలా నడపాలో అంతుచిక్కక  ఇంటర్వెల్ కల్లా చేతు లెత్తేస్తున్నారు. తాజాగా  ‘రోజులు మారాయి’ లోకూడా చూశాం. ఇప్పుడు ‘సెల్ఫీ రాజా’ లోనూ అరగంటలో అల్లరి నరేష్ పెళ్లి చేసేసి భార్యతో సమస్యలో పడేస్తూ ఆశ్చర్య పరుస్తుంది. ఇక్కడ్నించీ ఫస్టాఫ్ అంతా, ఇంకా సెకండాఫ్ అంతా ఆ సమస్యతో ఎలా నడుపుదామని?

         
దర్శకుడు అల్లరి నరేష్ కిచ్చింది యాక్టివ్ క్యారక్టరేనా? అది పాసివ్ క్యారక్టర్ కాదా? మరైతే భార్య తనని అనుమానించినప్పుడు- అసలా గిఫ్ట్  పంపిన ఆకాశరామన్న  ఎవడో  తనే తెలుసుకుని-  భార్య  అనుమానం తీర్చకుండా వూరికే భార్యకి నచ్చజెప్పుకునే విఫలయత్నా లెందుకు చేస్తాడు? ఆకాశరామన్న ఎవడో  పోలీస్ కమీషనర్  అయిన మామ తెలుకోవాల్సి వచ్చింది! అప్పుడు భార్య వచ్చి కాళ్ళ మీద పడితే అల్లరి నరేష్ సమస్య తీరిపోయింది! ఇది పాత్రేనా? దీంతో ఇదొక కథేనా?

        దీనికంటే ముందు విసిగిన భార్య వెళ్లి చావమంటుంది. నరేష్ చావాలనుకోవడం మంచి మలుపే. కానీ దీనికి తగ్గ సెటప్ ఏదీ? బిగినింగ్ ని ముగిస్తూ భార్య విడిపోయినప్పుడు,  నరేష్ కి పెట్టిన సమస్య కి - అపార్ధం తొలగించాలన్న గోల్ కీ - ఉండాల్సిన సీరియస్ బ్యాక్ గ్రౌండ్ ఏదీ? కామేడీల్లో బ్యాక్ గ్రౌండ్ సీరియస్ గా లేకపోతే   హీరోకి కామెడీతో సమస్య ఎలా పుడుతుంది? గోల్ ఎలా ఏర్పడుతుంది? ఆపైన కామెడీ ఎలా వర్కౌట్ అవుతుంది? కామెడీల్లో బ్యాక్ గ్రౌండ్  సీరియస్ గా వుండి, హీరో సీరియస్ గా వుండనవసరం లేదు కదా?  బ్యాక్ గ్రౌండూ సీరియస్ గా లేకుండా, నరేష్  కామెడీగా వుండడం వల్లే కదా అతను చావాలనుకోవడం అల్లాటప్పా వ్యవహారంగా మారిపోయింది?

        చావాలనుకోవడం పాసివిజం కాదు, బ్యాక్ గ్రౌండ్ సీరియస్ గా వుంటే! నరేష్  తనే ఆకాశ రామన్నని పట్టుకుని నిజం నిరూపించినా ఎందుకో నమ్మని భార్య- ఇంకా బలమైన మాటలతో  గాయపరిస్తే - అప్పుడు మాత్రమే చావాలనుకోవడం వర్కౌట్ అవుతుంది. సానుభూతి కూడా పుడుతుంది. ఐరనీ లోంచే హాస్యం పుడుతుంది. ‘మై మేరీ పత్నీ ఔర్ వో’ అనే హిందీ హిట్ కామెడీ లోనూ ఇంతే. అప్పుడు చావాలకునే గోల్ తో నరేష్  ఎంత అసంబద్ధ కామెడీ నైనా సృష్టించవచ్చు. చావడానికి రెండో ప్రయత్నంగా అల్లరి నరేష్ బిల్డింగ్ ఎక్కినప్పుడు తాగుబోతు రమేష్ అతణ్ణి తోసెయ్యడం, అక్కడ్నించీ ఇంకెవరొచ్చినా   తోసిపారేస్తూ వుండడం పడీ పడీ నవ్వించ గల్గిన కామెడీనే. ఇంత సామర్ధ్యం ఆతర్వాత దర్శకుడిలో ఏమైపోయింది? బ్యాక్ గ్రౌండ్ లో సీరియస్ నెస్ లేకపోయినా ఇది వర్కౌటయింది. కానీ పదే పదే వర్కౌట్ కాదు. అప్పుడు తనని చంపమని కాకికి సుపారీ ఇచ్చాడు నరేష్. అంటే ఈ పాయింటుతో కథ ఇక్కడ్నించీ రన్ అవుతుందని అర్ధం. ఈ పరిణామాలన్నీ సమస్యతో నరేష్ చేస్తున్న సంఘర్షణలో భాగం  కిందికే వస్తాయి. 

        దీంతో అభ్యంతరం లేదు గానీ- భార్య వచ్చి కాళ్ళ మీద పడగానే ఓ ఫ్లాష్ బ్యాక్ వేసి అంతకి ముందు కాకికి తను కాంట్రాక్ట్ ఇచ్చింది చూపించి వెంటనే ఇంటర్వెల్ వేసెయ్యడం  ఉరుములేకుండా పిడుగు పడేసినట్టుంది. హఠాత్తుగా  ముగించి పారేసే సినిమాల్ని చూశాం గానీ, ఇలా హఠాత్తుగా ఇంటర్వెల్ వేసే సినిమాల్ని చూసి వుండం! తెల్లబోయి ఖాళీ వెండి తెర కేసే చూడ్డం మన వంతవుతుంది! 

     వాస్తవానికి భార్య దారికొచ్చి నప్పుడే  అల్లరి నరేష్ ఏమీ చేయకుండానే ఇంటర్వెల్ లోపే కథ సుఖాంతమైంది. ఇక మిగిలింది కాకి గురించిన ఫినిషింగ్ టచ్చేనా? ఒకసారి కాంట్రాక్టు తీసుకున్నాక చంపకుండా వదలనన్న వాడి గురించేనా? వాడి సంగతి కూడా నెక్స్ట్ సీన్లోనే పోలీస్ కమీషనర్ మామ చూసుకుని ఫినిషింగ్ టచ్ ఇస్తాడుగా- ఆపైన ఇంటర్వెల్ లేకుండా శుభం కార్డు వేసేస్తూ?


        చంపాలన్న కాకి ఏటో పోతాడు. కమీషనర్ తో ఇరవైఏళ్ల పగ వున్న  రౌడీ ఒకడు   నరేష్ ని చంపాలని వెంటబడతాడు. పోలీస్ ఇన్స్పెక్టర్ పృథ్వీ చేసిన బూతు పనికి ఇద్దరు ఆడవాళ్ళు వాళ్ళ గుంపుతో అతడి వెంటపడతారు. రవిబాబు, అతడితో బాటు నరేష్ తన పాములతో పాల్పడిన ఇంకో బూతుకి అవి చచ్చాయని ఓ పాములోడు షకలక శంకర్ వాళ్ళిద్దరి వెంటా  పడతాడు. రవిబాబు తమ్ముణ్ణి అంటూ ఇంకో అల్లరి నరేష్ దిగుతాడు. ఇతన్ని చంపడానికి ఇంకెవరో....గోలగోలగా అరుపులూ, కొట్టుకోవడాలూ పారిపోవడాలూ...అసలు మొదలెట్టిన కథేమిటి? ఫోకస్ చెదిరి జరుగుతున్న దేమిటి? 

        భార్య అప్పుడే కాళ్ళ మీద పడకుండా,  తనని చంపమని కాకికి అల్లరి నరేష్ ఇచ్చిన కాంట్రాక్టుతో మరో కోణంలో మరిన్ని విఫలయత్నాలు చూపిస్తూ కథని ఫోకస్ లో పెట్టుకోకుండా,  దర్శకుడు తానొక్కాడు ఆనందిస్తే చాలు అదే కామెడీ అనుకోవడం నిజానికి కామెడీ అనుకోవాలి ఇక్కడ!


-సికిందర్
http://www.cinemabazaar.in

14, జులై 2016, గురువారం

సాంకేతికం!











     ఎనభై  శాతం మేకప్, 20 శాతం మేమూ కలిస్తే ఒక నటుడు పుడతాడు- అని దిలీప్ కుమార్ కామెంట్. మహా నటులెప్పుడడూ  మేకప్ లాంటి ప్రాచీన కళని చిన్న చూపు చూడరు. అయితే ఒకప్పుడు వేసుకున్న మేకప్ ని సెట్లో అనుక్షణం కాపాడుకుంటూ రావడం ఎంత కష్టంగా వుండేదో  అనుభవిస్తే గానీ తెలీదు. మేకప్ మెటీరియల్ నానాటికీ పరిస్థితులకి తట్టుకునే పటుత్వంతో అందుబాటు లోకి రావడం మేకప్ మాన్ పనిని సులువు చేస్తోందన్నది నిజమే. ఇప్పుడు ప్రాస్మెటిక్ మేకప్ లేదా మేకప్ ఎఫెక్స్ గా కొత్త పుంతలు తొక్కుతున్న మేకప్ కళతో నటీనటుల రూపురేఖల్ని ఏకంగా మార్చేసే మాస్కులు కూడా వస్తున్నాయి. కాబట్టి ఈ రోజుల్లో వేసుకున్న మేకప్ ని  సెట్లో కాపాడుకోవడం పెద్ద సమస్య కావడం లేదు. రెయిన్ ఎఫెక్ట్ లోనే మేకప్ ని చెక్కు చెదరకుండా వుంచగల మెటీరియల్ ఇప్పడు మరింత అభివృద్ధి  చెందినపుడు,  మేకప్ ఆర్టిస్టులకి అంత శ్రమగా  లేదని అంటున్నారు మేకప్  చీఫ్ మల్లెమూడి ఈశ్వర్. 


          యాక్షన్ దృశ్యాల్లో ముష్టి ఘాతాలు, రక్తసిక్త గాయాలూ ఇప్పుడు ఇట్టే సృష్టించెయ్యగలమని చెబుతూ, అండర్ వాటర్ దృశ్యాల విషయానికొస్తే  పెద్దగా మేకప్ అవసరం లేదనీ, అదెవరూ పట్టించుకోరనీ వివరించారు. పౌరాణిక, జానపద, చారిత్రక సినిమాల నాటికంటే ఇప్పుడొస్తున్న సినిమాల్లో మేకప్ నామ మాత్రంగా వుంటోందనీ, అయితే ఈ సినిమాలతో కూడా పేరు తెచ్చుకోవాలంటే యాక్షన్ దృశ్యాల్లో బాగా కష్టపడి పని చేయడమే మార్గమన్నారు ఈశ్వర్. 

          ‘పేరెందుకొస్తుంది? అసలు మేకప్ మాన్ ని ఎవరు గుర్తిస్తున్నారు? టెర్రిఫిక్ గా ఎంత ఫాంటసీ రూపాల సృష్టి చేసినా మేకప్ అదిరింది అనే ప్రేక్షకులే లేరు- గ్రాఫిక్స్ అదరగొట్టాయి  గురూ అనే ప్రేక్షకులు తప్ప!’ అని  బాధపడ్డారు.   
మేకప్ మాన్ ని ఎవరు గుర్తించినా గుర్తించక పోయినా రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తోందన్నారు. ప్రతీ ఏటా టీవీ- నాటక- సినిమా రంగాలకి చెందిన మేకప్ ఆర్టిస్టులని ప్రభుత్వం నంది అవార్డులతో సత్కరించడం అపూర్వ విషయమన్నారు. తెర వెనుక వుండిపోతున్న మేకప్ ఆర్టిస్టులని ప్రముఖుల సమక్షంలో స్టేజి ఎక్కించి సన్మానించడం గొప్ప విషయమన్నారు. 

        అన్నట్టు ఈశ్వర్ నాటకాలతో మొదలై టీవీ సీరియళ్ళ మీదుగా సినిమాల్లో కొచ్చారు.  ‘పల్నాటి భారతం’ అనే నాటకానికి నంది అవార్డు  కూడా తీసుకున్నారు. తెలుగులో మొట్ట మొదటి డైలీ సీరియల్ ‘రుతురాగాలు’ కి మేకప్ మాన్ గా తనే పనిచేశారు. ఇప్పటికీ ‘నీలంపాటి అమ్మవారి చరిత్ర’, ‘చంద్ర వంశం’, ‘ఆకాశ గంగ’ లాంటి పౌరాణిక సీరియల్స్ కి పని చేస్తున్నారు. తమిళ దర్శకుడు కన్మణి  సినిమాలన్నిటికీ ఈయనే  మేకప్ మాన్. ఐతే తన  కెరీర్ లో మొట్ట మొదట సినిమాకి పనిచేసింది 2003లో నగేష్ కుకునూర్ హైదరాబాద్ ముషీరాబాద్ జైల్లో తీసిన ‘తీన్ దీవారే’  అనే హిందీకి. ఇందులో నసీరుద్దీన్ షాకి, గుల్షన్ గ్రోవర్ కీ మేకప్ చేశారు ఈశ్వర్. నాటి నుంచి మొత్తం వందకి పైగా సినిమాలకి పనిచేసిన ఈశ్వర్,  అల్లు  అర్జున్ నటించిన ‘బద్రీనాథ్’ కి మేకప్ మాన్ గైర్హాజరీలో తను వెళ్లి పని చేశారు. 1988 నాటి నుంచీ మేకప్ వృత్తినే నమ్ముకుని కొనసాగుతున్నారు 

       ఎక్కువగా స్పెషల్  గెటప్స్ వేయాలని తనకి ఆసక్తి అన్నారు.  కానీ తెలుగులో అలాటి మేకప్ కి అవకాశమిచ్చే సినిమాలు రావడం లేదనీ, హాలీవుడ్ నుంచి వారానికొకటి చొప్పున దిగుమతి అవుతున్నాయనీ, అలాగే బాలీవుడ్ నుంచీ మేకప్ ఆర్టిస్టులు మన దగ్గర కొచ్చి హడావిడి చేస్తున్నారనీ వివరించారు. మళ్ళీ బాలీవుడ్ లో హాలీవుడ్ మేకప్ నిపుణుల బెడద కూడా వుందనీ, వీళ్ళకి రెండు మూడు కోట్లు ఇచ్చి రప్పించుకుంటున్న నిర్మాతలు – మన మేకప్ మాన్ లకి అందులో పదో వంతు కూడా ఇవ్వరనీ  విచారం వ్యక్తం చేశారు. ఏడాదంతా కష్టపడితే ఒక బాలీవుడ్ మేకప్ ఆర్టిస్టు 18 – 20 లక్షలకి మించి సంపాదించ లేడనీ, అదే తెలుగు మేకప్ మాన్ లైతే  ఇది కూడా సంపాదించలేరనీ  బాధగా అన్నారు.
          గుంటూరుకి చెందిన ఈశ్వర్,  ఈటీవీ మురళి దగ్గర శిష్యరికం చేసి అటుపైన మేకప్ చీఫ్ గా ఎదిగారు. పౌరాణిక సీరియల్స్ కి ఎక్కువ పని  చేసిన అనుభవంతో ఒకటే చెప్పారు- ఇందులో గుర్తింపు ఎక్కువ వస్తుందని. అయితే పురాణ పాత్రల్లో  నటించే వాళ్ళకి కళ్ళు పెద్దవిగా వుండాలన్నారు. కళ్ళని ఎక్కువ  హైలైట్ చేస్తామనీ, కనురెప్పలకి హెవీ మేకప్ వేస్తామనీ వివరించారు. సీరియల్స్ కీ, సినిమాలకీ  ముఖ్యంగా బడ్జెట్స్  ని దృష్టిలో పెట్టుకుని వేర్వేరుగా మేకప్ చేస్తామన్నారు. ఇప్పుడు సినిమాలకి డిజిటల్ టెక్నాలజీ వచ్చింది, రెడ్ కెమెరా  వాడుతున్నారు- దీనితోనూ, సాంప్రదాయ ఎనలాగ్ కెమెరాలతోనూ మేకప్ పరంగా మార్పులేవీ లేవనీ, ఒకే మెటీరియల్ ని వాడుతున్నమనీ చెప్పారు ఈశ్వర్.


-సికిందర్
(మే 2011, ఆంధ్రజ్యోతి- ‘సినిమాటెక్’ శీర్షిక)
          

13, జులై 2016, బుధవారం

నాటి సినిమా!


సినిమా దర్శకుడు భావుకత గల రచయిత కూడా అయినపుడు (సినిమా రచయిత కాదు) అతడి సినిమాలు పర్సనల్ డైరీలవుతాయి. వెంటనే  అర్ధంగాక పోస్ట్ ప్రొడక్షన్లోనే  గొడవలైపోతాయి. అతను ‘గాడ్ ఫాదర్’ తీసివున్న కపోలా అయితేనో, ‘సిరిసిరిమువ్వ’ తీసివున్న విశ్వనాథ్ అయితేనో ఫర్వాలేదు.  కపోలా, విశ్వనాథ్ లు కమర్షియల్ గా నిరూపించుకున్నాకే ‘యూత్ వితవుట్ యూత్’, ‘శంకరాభరణం’ లాంటి పర్సనల్ సినిమాలు తీసి డిస్ట్రిబ్యూటర్లని ఒప్పించుకోగల్గారు. కానీ లేడికి  లేచిందే పరుగన్నట్టు, ఓ భావుకత గల కొత్త దర్శకుడు రంగ ప్రవేశం చేసింది లగాయతు అదేపనిగా పర్సనల్ సినిమాలే తీస్తూ పోతే దీన్నేమనాలి?


        ది లేడి కాబట్టి పచ్చని ప్రకృతిలో తిరుగాడుతుంది. గోదావరీ పరివాహక ప్రాంతాల్లో తచ్చాడుతుంది. అడవుల్లో చెట్లే దారి  చూపుతాయన్నట్టు, జీవితాలకి అంతటి మట్టి వాసనల కథలే  మార్గం చూపుతాయి. అలాటి కమ్మటి నేటివ్ వాసనల కథలు సినిమాలకి అవసరపడతాయనుకున్న లేడి, ఫార్ములా పులి చంపిన లేడి నెత్తురై పోకుండా, కీకారణ్యం  లాంటి మూస మాస్ మసాలాల క్రియేషన్ల  మధ్య, తనదైన ఓ ప్రత్యేక ముద్రతో కూడిన బాణీని విన్పిస్తూ యావత్ప్రజానీకాన్నీ మంత్రముగ్ధుల్ని చేయడం సామాన్య విషయమా? 

         చాలామంది సాహితీపరులు సినిమా దర్శకులుగా కన్పిస్తారు. వాళ్ళు సినిమా దర్శకత్వానికి సరిపోరనే అభిప్రాయాన్నే కల్గించారు. ఒక జర్నలిస్టుగా మారిన రచయితని యుద్ధ రంగానికి పంపిస్తే, అతను యుద్ధ వార్తలు  రాయకుండా ఆ చుట్టూ ప్రకృతి అందాలని  అద్భుతంగా వర్ణిస్తూ పోయాడట. ఇలాకాక, చాప కింద నీరు లాంటి ఇలాటి చాపల్యాన్ని ఈదేసిన గజఈత గాడు కూడా అయ్యింది పైన చెప్పుకున్న లేడీ. లేకపోతే  అచ్చులో కథలు రాసుకునే వాడికి జన్మకి సినిమా డైరెక్షన్ అబ్బే పరిస్థితి లేదా రోజుల్లో.


        ఇలా వంశీ అనే హైలీ ఇండివిడ్యువలిస్టిక్ డైరక్టర్ గురించి ఇంత చాలు.  తీసిన మొట్ట మొదటి ‘సితార’ తోనే తను బాపు, విశ్వనాథ్ ల సరసన చేరిపోయాడు. ముత్యాలముగ్గు (1975), శంకరాభరణం (1980),  మేఘసందేశం (1982), సితార (1984) ... ఈ నాల్గూ ఒకే అచ్చులో పోసిన కళా ఖండాలుగా కన్పిస్తాయి. వీటిలో కామన్ గా కన్పించేది ఒక్కటే : అతి తక్కువ సంభాషణలు! అసలు డైలాగు లేవీ అని ఫైనాన్షియర్లు గొడవ పడేంతగా, దృశ్యానికో  పోలియో చుక్క లాంటి  ఏకవాక్య సంభాషణ మాత్రమే వీటి ప్రత్యేకత! ప్రేక్షకులు హారతులు పట్టిన ఈ విజయవంతమైన కమర్షియలార్టు పంథాకి  ఎవరు మొదట  బీజం వేసి,  ఎవరెవరు పెంచి పోషిస్తూ పోయారో పై నాల్గు సినిమాల విడుదల  క్రమాన్ని చూస్తే  తెలిసిపోతుంది.

        ‘మహల్లో కోకిల’ అని వంశీయే రాసిన నవల ‘సితార’ గా తెర కెక్కింది. ‘శంకరాభరణం’ , ‘సాగర సంగమం’ లాంటి రెండు ఘన విజయాలు సాధించి వున్న ఏడిద నాగేశ్వరరావు దీని నిర్మాత.  తమిళ రీమేకుగా వంశీ మొదటి సినిమా ‘మంచు పల్లకి’  హిట్ అవలేదు. రెండో సినిమా ‘సితార’ తో నిర్మాత చేసింది సాహసమే. ఈ సినిమా చారడేసి కళ్ళ భానుప్రియని పరిచయం చేసింది. అప్పటికామెకి పచ్చి కొబ్బెర లాంటి పదిహేడేళ్లే.  అప్పటికే మంచి డాన్సర్ కూడా అయిన ఆమె నృత్యాలతో  ‘సితార’  విక్షణాసక్తత బాగా పెరిగింది. తెర వెనుక ఇళయరాజా హిట్ బాణీలు కన్పించని దేవుడిలా అభయహస్తమిచ్చాయి.


          మరో కన్పించని మాంత్రికుడు ఛాయాగ్రాహకుడు ఎంవీ రఘు. గ్రామీణ అందాల్ని చూపించడంలో దిట్ట. అక్కడే తచ్చాడే వంశీలాంటి దర్శకుడ్ని ఈయన కాపేసి పట్టుకుంటే ఇక చెప్పనక్కర్లేదు- వెండి తెరమీద సినిమా రీళ్ళు తిరగవు, రంగులరాట్నం తిరుగుతుంది.

        రాచరికపు పంజరంలో బందీ అయిపోయిన అందాల బొమ్మ జీవితాన్ని ‘సితార’ చూపిస్తుంది. ఆస్తులూ  పరువు ప్రతిష్టలూ సమకూరడానికి  ఏయే న్యాయమైన కారణాలైతే తోడ్పడ్డాయో, వాటిని గౌరవించుకోకపోతే, ఆ కారణాలూ తొలగిపోయి ఆస్తులూ పరువు ప్రతిష్టలూ మంట గలిసిపోతాయని ఒక సూక్తి.  ఇలాంటి దుర్గతే సూడో జమీందారు చందర్ ( శరత్ బాబు) ది. ఇతడి జమీందారు తండ్రి విలాసాలు మరిగి ఆస్తులు గుల్ల చేశాడు. దుర్భర దారిద్ర్యాన్ని కొడుక్కి మిగిల్చిపోతూ, ఆస్తి పాస్తులు ఇక లేవన్న విషయం బయటి ప్రపంచానికి తెలీనివ్వకూడదని, వంశ ప్రతిష్ట నిలబెట్టాలనీ మాట తీసుకుని స్వర్గానికో ఇంకెక్కడికో  వెళ్ళిపోయాడు. లోన చిరిగిన చొక్కా,  పైన వంశ హోదా వెలగబెడుతూ కోటూ -  ఇదీ చందర్ డబుల్ యాక్షన్ జీవితం. తగాదాల్లో వున్న  పొలం మీద ఎలాగో కేసు గెల్చుకుని, తండ్రి కిచ్చిన మాట ప్రకారం పూర్వవైభవం కల్పించుకుందామని లాయర్ (జెవి సోమయాజులు) తో కలిసి ఎంత ప్రయత్నించినా పప్పులుడకడం లేదు. 

        ఇలాటి చందర్ కి ఓ చెల్లెలు కోకిల (భానుప్రియ) అని. బంగళాలో ఈమెని బందీ చేసి వుంచాడు. ఏమంటే, ‘పరదాలు, ఘోషాలు మా రాజవంశపు సాంప్రదాయం’  అంటూ గొప్పలు. ‘ఆ చీకటి గోడల మధ్య మీ స్త్రీలు పడే హింస గమనించావా?’  అని ఎవరైనా ప్రశ్నిస్తే, సాంప్రదాయం పట్ల  గౌరవమే వుంటే  హింసే అన్పించదనీ, అయినా ఒంటరిగా వుంచకుండా వాళ్ళ కాలక్షేపం కోసం నాట్యం, సంగీతం నేర్పిస్తామనీ, కోకిల కూడా వాటితో కాలక్షేపం చేస్తోందనీ సమర్ధన. ఆమె ఏదో స్వేచ్ఛ అంటూ సాంప్రదాయాన్ని కాల దన్నుకోదని ప్రగాఢ విశ్వాసం  కూడా చందర్ కి.

      గృహ నిర్బంధంలో వున్న కోకిలకి రాజు  (సుమన్) దగ్గరవుతాడు. వూళ్ళో జరుగుతున్న  జాతరకి పగటి వేషగాళ్ళ బృందంతో వచ్చిన కళా కారుడితను. ఇతడి ఆటా పాటా కోకిలలోని  నాట్యకళాకారిణిని  తట్టి లేపుతాయి. ఇక నాట్య విన్యాసాలే నాట్య విన్యాసాలు. విరహ గీతాలే గీతాలు ప్రేమలో. చందర్ కిది తెలిసిపోయి  రాజుని చంపించేసి, తండ్రి  మాట నిలబెట్టలేకపోయానని ఆత్మ హత్య చేసుకుంటాడు. 

        ఈ జరిగిందంతా దేవదాసు ( శుభలేఖ సుధాకర్) కి చెప్పుకొస్తుంది కోకిల. ఇతనొక ఫోటోగ్రాఫర్. ఇలా తన ఆశ్రయం పొందిన  కోకిలని సినిమా హీరోయిన్ ని చేస్తాడు. ఇంతలో తన గతమంతా పేపర్లకెక్కి బెంబెలెత్తిపోతుంది కోకిల. ఏ వంశ గుట్టు కాపాడతానని తను అన్న కిచ్చిన మాట ఇలా అయ్యిందో, ఇక దీనికి ఒకే ఒక్క  పరిష్కార మార్గంగా  వయసుమళ్ళిన  డాక్టర్ (ప్రభాకర రెడ్డి) ని తన తో పెళ్ళికి ఒప్పిస్తుంది. ఇది కూడా బెడిసి కొట్టి తను ఆత్మహత్య చేసుకోబోతున్నప్పుడు, చనిపోయాడనుకున్న రాజు బయల్దేరి వస్తూంటాడు. 

        ముందు కోకిలగా, తర్వాత సితారగా రెండు విభిన్న పాత్రల్లో కన్పించే భాను ప్రియ కిది తెలుగులో అడుగు పెడుతూనే సూపర్ హిట్ ఎంట్రీ. తను తెలుగే అయినా దీనికి ముందు  ఒక తమిళం చేసింది. మాస్ కమర్షియల్ హీరోగా కొనసాగుతున్న సుమన్ కిది ఒక జ్ఞాపిక లాంటిది. సినిమాలో భానుప్రియ జ్ఞాపికగా ఇచ్చే పళ్ళెం పట్టుకుని తన బృందాన్ని బాధ పెట్టి వెళ్ళిపోయే సీను ఒక్కటి చాలు సుమన్ హావభావ ప్రకటనా సామర్థ్యానికి. 

        వంశీ విజువల్ సెన్స్ కి శృంఖలాల్లే

వనడానికి ఓ మూడు సీన్లు చూస్తే చాలు-  1. పంజరాల్లో చిలుకలు తల్లడిల్లే షాట్లు, 2. ఎగిరే చిలుకని పట్టుకుందుకు సుమన్- భాను ప్రియల రాపాడే చేతుల శృంగారభరిత విజువల్స్, 3. హాలు నిండా వాద్య పరికరాల మధ్య సుమన్- భానుప్రియలతో వుండే ఒక సన్నివేశం ...ఇక పాటల చిత్రీకరణ చెప్పనే అక్కర్లేదు. ఇవన్నీ చాలా సూపర్ హిట్  పాటలే ఇప్పటికీ. 


        ఇంత కళాఖండంలోనూ  లోపాలూ లేకపోలేదు. లోపాలతోనే కళాఖండాలకి  అందం వస్తుందేమో. ఇందులో భానుప్రియ పాత్ర ఎంతకీ ఎదగదేమిటి? సుమన్ ఆమె చెర విడిపించాక ఆమె పూర్తి స్వేచ్ఛా జీవియే. ఇంకా తన స్వేచ్ఛని హరించిన వంశప్రతిష్ట గురించి ప్రాకులాట ఎందుకు? తన అన్న సుమన్ ని చంపించాడని  తెలిసీ అన్నంటే సెంటి మెంట్లు ఎందుకు? బాధపడాల్సింది చనిపోయాడనుకున్న సుమన్ గురించి కాదా? అంతలోనే ముక్కలైన అతడితో తన ప్రేమ గురించి కాదా? ఇంకా అన్న గురించీ, సాంప్రదాయాల గురించీ ఆలోచిస్తే ముందు కెళ్ళిపోయిన పాత్ర ఎలా ఎదుగుతుంది? ఎదగ వద్దన్న ఫ్యూడలిజాన్ని బోధిస్తున్నట్టా ఈ పాత్రతో? 

        ఇక తను ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు చీటీ రాసి ప్రభాకర రెడ్డికి పంపడమెందుకు? తనని కాపాడేందుకా? అలా చీటీ రాసి ఆత్మహత్యా యత్నం ఒక నాటకంగా పాత్ర దిగజారి పోలేదా? (ఈ వ్యాసం చదివి వంశీ తర్వాత లోపాలు ఒప్పుకున్నారు). క్లయిమాక్స్ బలహీనంగా తేలిపోవడానికి శరత్ బాబు ఆత్మహత్య చేసుకునే దగ్గర కథ  బలహీన పడడమే కారణం. హాలీవుడ్ ఇంద్రజాలికుడు స్టీవెన్ స్పీల్ బెర్గ్ ఇందుకే అన్నాడేమో- కథ ఎలా చెప్పాలో మర్చిపోతున్నారు. కథలకి మిడిల్, ఎండ్ లు ఏమాత్రం వుండడం లేదు, ఎంత సేపూ బిగినింగే .. ఈ బిగినింగ్ కూడా ఎంత సేపటికీ ముగియదు..అని!

         అసలు బిగినింగ్, మిడిల్, ఎండ్ అంటే ఏమిటో తెలిస్తేగా అవి వుండడానికి. ఈ చిన్న విషయం  వంశీకి తెలీదనుకోలేం. నవలని సినిమాగా మారుస్తున్నప్పుడు ఆ  నవలా కథనమే స్క్రిప్టులో జొరబడినట్టుంది. కానీ కెరీర్ కొత్త లోనే ఇంత సాహసమూ సృజ నాత్మకతా  ప్రదర్శించినందుకు వంశీని అభినందిద్దాం. వంశీ మరో ‘సితార’ లాంటిది తీయడు, తీయలేడు కూడా- పర్సనల్ డైరీ అనేది ఒక్కటే వుంటుంది కాబట్టి.

పట్టపగలే చుక్కలు!

          వాళ్ళందరికీ ‘సితార’ ని చూసి పట్టపగలే చుక్కలు కన్పించాయి... వాళ్ళందరూ-  నిర్మాత, దర్శకుడు, ఫైనాన్షియర్లూ- ప్రివ్యూ థియేటర్లో కొలువుదీరారు ‘సితార’ చూద్దామని. ఇంకా రీ రికార్డింగ్ మిగిలి వుంది. ముందు డబుల్ పాజిటివ్ పోస్ట్ ప్రివ్యూ చూద్దామనుకున్నారు. అంతాకలిసి చూశారు. ఇదేం సినిమా? డైలాగులేవీ? ఆ కళ్ళు, చేతులు, కాళ్ళూ చూపించడమేమిటి మాటిమాటికీ? ఆ నీడలేంటి?  ఆ పడవ లేంటి? ఐపోయింది! పనైపోయింది! పూర్ణోదయా వారి పని గోవిందా! పదండి వెళ్లి పోదాం,  చెక్కేద్దాం- అనేసి ఫైనాన్షియర్లు చెక్కేశారు. వంశీ బొమ్మలా నిలబడిపోయాడు. 

        రీరికార్డింగ్ మొదలైంది. ఇళయరాజాని చూస్తూంటే వంశీకి ఒకటే గుబులుగా వుంది.  ఈయన కూడా పారిపోతే?  అలా చేయలేదు ఇళయరాజా.  సినిమా సాంతం చూసి నె మ్మదిగా లేచారు. వంశీ దగ్గరి కొచ్చారు. ‘భలే బ్యూటిఫుల్ కాన్వాస్ ఇచ్చావయ్యా! థాంక్యూ...ఎవ్విరీ మినట్ ఈ పిక్చర్ ని ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తా!’ అనేసరికి  వంశీ ఎక్కడికో వెళ్ళిపోయాడు!

        12 కేంద్రాల్లో వంద రోజులాడింది సినిమా. మంచి మ్యూజికల్ హిట్. పైగా జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు, ఉత్తమ గాయనిగా ఎస్. జానకికి మరో జాతీయ అవార్డు, ఉత్తమ ఆడియోగ్రాఫర్ గా ఎస్వీ రామనాథన్ కి మరింకో జాతీయ అవార్డు సంపాదించి పెట్టింది ‘సితార’.



-సికిందర్
(“సాక్షి” –నవంబర్ 2009)
           


12, జులై 2016, మంగళవారం

సాంకేతికం!

Add caption
     ఇవ్వాళ్ళ  ఫ్యాషన్ టెక్నాలజీ క్యాట్ వాక్ లతో వొయ్యారాలు పోతూ ఎలక్ట్రానిక్  మీడియాని కూడా ఎంటర్ టైన్ చేస్తోంది. అది దానికదే ఒక కొత్త పరిశ్రమగా మనగల్గితే మంచిదే. కానీ సినిమా రంగంలో కూడా జొరబడి కాస్ట్యూమర్ల వృత్తినే ప్రశ్నార్ధకం చేయడం ప్రారంభమైంది. ఫ్యాషన్ డిజైనర్  కోర్సులు చేసి నేరుగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టి, దివినుంచి దిగివచ్చిన అద్భుత వ్యక్తులుగా కన్పించి అంతలోనే అదృశ్య మైపోతున్నారు. ఈ కాస్తా హనీమూన్ చాలు కాస్ట్యూమర్లకి చుక్కలు చూపించడానికి. ఇలా ప్రాక్టికల్ అనుభవం లేకుండా డిజైన్లు  సజెస్ట్ చేసే కన్సల్టెంట్స్ లా చెలామణి కావడం ఫ్యాషన్ డిజైనర్ల వృత్తికే కాకుండా, కాస్ట్యూమర్ల  భృతికీ మంచిది కాదనే వాళ్ళూ వున్నారు. అలాటి వాళ్ళల్లో పిల్లా రవికుమార్ ఒకరు. ఈయన ఇంకో గమ్మత్తు చెప్పారు -

      ‘హీరోలకి పబ్స్ లో పరిచయమై స్నేహాలు పెంచుకుంటున్న కొందరు హఠాత్తుగా ఓ రోజున ఆ హీరోలకే కాస్ట్యూమర్లుగా అవతారమెత్తేస్తున్నారు. దీనికి వాళ్ళు స్టైలిష్ గా పెట్టుకున్న పేరు ‘స్టయిలిస్ట్’ అని!” 

        దట్సిట్. అంటే కాస్ట్యూమర్లూ కనుమరుగవుతున్నారు, ఫ్యాషన్ డిజైనర్లూ అదృశ్యమవుతున్నారు... ఇక స్టయిలిస్ట్ ల కాలం వచ్చేసిందన్న మాట!

        అసలు చరిత్రలో మొట్ట మొదటి కాస్ట్యూమర్ ఎవరని అడిగితే -  సినిమా,  దానికంటే ముందు నాటకం, దానికీ ముందు నాట్యమూ ఉండేవన్నారు. అయితే నాట్యం దగ్గర్నుంచే మొట్ట మొదటి కాస్ట్యూమర్  పుట్టాడా అంటే కాదన్నారు రవికుమార్.  కొంత తర్జన భర్జన జరిగాక, మరింకా పూర్వ కాలంలో తోలుబొమ్మలాటల దగ్గర తొలి కాస్ట్యూమర్  పుట్టాడన్నారు. రిఫరెన్సులు కూడా లేని నాటి పురాతన కాలంలో పురాణ పాత్రలకి  పకడ్బందీగా వూహించి ఆహార్యం నిర్ణయించినవాడే చరిత్రలో మొట్ట మొదటి కాస్ట్యూమర్ అని తేల్చారు రవికుమార్! 

        అలాగే తెలుగు కాస్ట్యూమర్లు  పిఠాపురం నుంచే వెళ్ళారని ఇంకో రహస్యం విప్పారు. అప్పట్లో పిఠాపురం రాజావారు మద్రాసు సినిమా కంపెనీలకి దర్జీలని - అంటే- టైలర్స్ ని వెంట బెట్టు కెళ్ళి ‘వీడు కుడతాడు, వీణ్ణి కాస్ట్యూమర్ గా పెట్టుకో!’  -  అని హుకూం జారీ చేసే వారన్నారు రవికుమార్. 

        రవికుమార్ పిఠాపురం వాసియే. అయితే రాజా వారితో ఏ సంబంధమూ లేదు. రాజావారి హయాం తర్వాత 1995 లో హైదరాబాద్ చేరుకుని ‘మేజర్ చంద్ర కాంత్’ కి కాస్ట్యూమ్స్  అసిస్టెంట్ గా పనిచేశారు. రెండేళ్ళు తిరిగేసరి కల్లా 1997 లో ‘ప్రేమించుకుందాం రా’ కి కాస్ట్యూమర్ గా ప్రమోటయి, హీరో వెంకటేష్ కి పర్సనల్ కాస్ట్యూమర్  గా ఎనిమిదేళ్ళూ  కొనసాగారు. ‘మనసంతా నువ్వే’ నుంచీ  ఎంఎస్ రాజు అన్ని సినిమాలకీ, ‘ఆర్య’ నుంచీ దిల్ రాజు అన్ని సినిమాలకీ, పూరీ జగన్నాథ్ తో అనేక సినిమాలకీ పని చేస్తూ వస్తున్నారు.  

        అయితే ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయనీ బాధ పడ్డారు. స్టార్లు బ్రాండ్ల మీద  మోజు పెంచుకుని విదేశాలనుంచి కాస్ట్యూమ్స్ తెప్పించుకోవడం, ఇద్దరు ముగ్గురు ప్రముఖ దర్శకుల భార్యలు కాస్ట్యూమ్స్ డిజైనర్లుగా రంగ ప్రవేశం చేయడం, దీనికి తోడు  కొత్తగా ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులు చేసిన ఔత్సాహికుల సందడీ, మళ్ళీ వీటికి తోడూ పాటలకి ప్యాకేజీ  పద్ధతీ, వచ్చేసి చాలా స్ట్రగుల్ చేస్తున్నామన్నారు.

        ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ అహ్మద్ ఖాన్ లాంటి వారికి పాటల ప్యాకేజీ ఇవ్వడంతో, కాస్ట్యూమ్స్ కూడా వాళ్ళే రూపొందిస్తున్నారని అన్నారు రవికుమార్.

        ‘మన కల్చర్ వేరే కల్చర్ చేతుల్లోకి వెళ్లిపోయాక జరుగుతున్న పరిణామాలివి. మన కల్చర్ లో వుంటే ట్రేడిషనల్ గా మన కాస్ట్యూమ్స్ వుంటాయి. శేఖర్ కమ్ముల, వంశీ లాంటి దర్శకులు ట్రేడిషన్ ని  కాపాడుతున్నారనాలి’ అని అభిప్రాయపడ్డారు.

        ప్రధానంగా స్టార్ల కాస్ట్యూమ్స్  ప్రేక్షకుల దృష్టి నాకర్షిం చాలంటే  వాళ్ళు పోషించే క్యారక్టర్లు బావుండాలన్నారు రవికుమార్. ‘ఆరెంజ్’ లో రాం చరణ్ అంత  మంచి దుస్తులు ధరించినా ఆ పాత్ర బావుండక పోవడం వల్ల  ప్రేక్షకులు ఆ కాస్ట్యూమ్స్ నీ పట్టించుకో లేదన్నారు. ‘బృందావనం’ లో కాజల్ అగర్వాల్ పోషించిన సాంప్రదాయ పాత్రకి కుట్టిన హాఫ్ శారీలు  మంచి క్రేజ్ సృష్టించాయన్నారు. రిఫరెన్స్ లేకుండా కాస్ట్యూమ్స్ తయారు చేయలేమనీ, రిఫరెన్సుల్ని మోడిఫై చేసి మల్చుకుంటామనీ కొన్ని నమూనాల్ని లాప్ టాప్ లో చూపించారు. 

        కాస్ట్యూమ్స్ పాత్రల  బయోడేటాయేనని వివరిస్తూ, ‘బొమ్మరిల్లు’ లో పాత్రలకి తగ్గట్టుగా అతి లేకుండా తాను డిజైన్ చేసిన సింపుల్ దుస్తుల గురించి సభల్లో కూడా గొప్పగా చెప్పుకున్నారని సంతోష పడ్డారు. 

        మరి ఆ సభల్లో మీ పేరు కూడా ప్రస్తావించే వాళ్ళా అనడిగినప్పుడు- లేదన్నారు బాధగా. దటీజ్ ది  ప్రాబ్లం. కాస్ట్యూమర్లు, మేకప్ మాన్ లులాంటి కళాకారుల్ని కూడా సభలు పెట్టి ఎందుకు సన్మానించరని  అడిగితే, విషాదంగా నవ్వి వూరుకున్నారు రవికుమార్. 

        ఇక దర్శకుడుగా మారబోతున్నాడు తను. ఈ సడెన్ టర్నింగ్ ఎందు కిచ్చుకున్నారంటే, అసలు 1995 లో వచ్చిందే డైరెక్టర్ అవ్వాలని- పరిస్థితుల కారణంగా ఇలా అయిపోయానన్నారు. లాప్ టాప్ లో ఇంగ్లీషులో సిద్ధం చేసుకున్న స్క్రిప్టు, నోటు పుస్తకాల్లో మంచి చేతి వ్రాతతో ఇంగ్లీషులోనే రాసుకున్న నోట్సూ చూపించారు. ఇక్కడ ఒకటి అర్ధమైంది. ఎవరైనా ఆసక్తి పెంచుకున్న రంగంలో ఢక్కా మొక్కీలు ఎన్నైనా తింటూ అలాగే కొనసాగగల్గితే, విద్యార్హతలతో సంబంధం లేకుండా భాష లొచ్చేస్తాయేమో నన్పిస్తుంది టెన్త్  వరకే చదివిన రవికుమార్ ని చూస్తే!

-సికిందర్
(ఏప్రెల్ 2011, ఆంధ్రజ్యోతి- ‘సినిమా టెక్’ శీర్షిక)