రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

27, డిసెంబర్ 2015, ఆదివారం

చరిత్రకి స్క్రీనీకరణ!








 దర్శకత్వం : స్టీవెన్ స్పీల్ బెర్గ్ 

తారాగణం : లియాం నీసన్, బెన్ కింగ్స్ లే, రాల్ఫ్ ఫిన్నెస్, కరోలిన్ గూడాల్, జోనాథన్ సాగాల్, ఎంబెత్ డేవిట్జ్  తదితరులు
కథ : థామస్ కెనెల్లీస్క్రీన్ ప్లే : స్టీవెన్ జిలియన్సంగీతం : జాన్ విలియమ్స్, ఛాయాగ్రహణం : జానస్ కామిన్ స్కీ , కూర్పు : మైకేల్ కాన్ 
బ్యానర్ : యాంబ్లిన్  ఎంటర్ టైన్ మెంట్ , నిర్మాతలు : స్టీవెన్ స్పీల్ బెర్గ్, గెరాల్డ్ మోలెన్, బ్రాంకో లస్టిగ్ 
విడుదల : నవంబర్ 30, 1993 

              మహోజ్వల చిత్రరాజాలు చరిత్ర పుటల్ని ఓసారి తిరగేస్తాయి. ప్రజలకి తెలియని, తెలిసినా మర్చిపోయిన కఠోర సత్యాల్ని మరొక్క సారి గుర్తుకు తెస్తాయి. ప్రపంచానికి అద్దం  పట్టడం మహోజ్వ చిత్ర రాజం నిర్వర్తించే మహా కార్యమైతే,  దానికి పట్టం గట్టడం మిగతా సభ్య ప్రపంచపు కర్తవ్యం. పట్టం గట్టడమే ఏమిటి,  అవార్డుల పంటలతో సమాదరిచకుండా మానవాళి కూడా నిద్రపోదు. నిద్రపోనివ్వని నిజాల చిత్రణకి అంతటి విలువ వుంటుంది. ఆ విలువని చాటిన ఒక అపురూప కళాఖండమే  హాలీవుడ్ విజువల్ మాంత్రికుడైన స్టీవెన్ స్పెల్ బెర్గ్ సృష్టి  ‘షిండ్లర్స్ లిస్ట్’.

           షిండ్లర్స్ లిస్ట్ అనగానే హిట్లర్ పాలనలో శవాల గడ్డగా మారిన నాటి జర్మనీ చటుక్కున మనో ఫలకాల మీద మెరుస్తుంది. ఒడలు జలదరించేట్టుగా హిట్లర్ సాగించిన దురాగతాలు ఒకటొకటిగా కళ్ళ ముందు కదలాడతాయి. ఈ దారుణ మారణ హోమాన్ని  చరిత్రలోంచి తవ్వి తీసి చలన చిత్రంగా నిర్మించాలన్న కోరిక స్టీవెన్ స్పీల్ బెర్గ్ కి బలపడింది. కానీ ఈ కలని నిజం చేసుకోవడానికి పదేళ్ళూ పట్టింది. అయినా ఇది ప్రపంచ వెండి  తెరలకి ఎక్కేటప్పటికి ప్రేక్షకులు దీని తీవ్రతకి దిగ్భ్రాంతి చెందారు. ఇంకిలాటి చరిత్ర అస్సలు పునరావృతం కాకూడదని ఎలుగెత్తి చాటారు. ప్రేక్షకుల్ని ఇంతలా కదిలించిన ఈ దృశ్య  బీభత్సంలో అసలేముందో తెలుసుకుంటే...

       తెలుసుకునే ముందు,  ఒకసారి హిట్లర్ ఈ దుష్కృత్యాలకి ఎప్పుడు, ఎందుకు, ఎలా పాల్పడ్డాడో తెలుసుకుందాం...1933 లో హిట్లర్ అధికారం లోకొచ్చి రెండో ప్రపంచ యుద్ధ సన్నాహాలు ప్రారంభించాడు. అతను యూదు మతస్థుల్నీ, జిప్సీలనీ (బంజారా జాతి), స్వలింగ సంపర్కుల్నీ, వికలాంగులనీ అపరిశుద్ధులుగా ప్రకటించాడు. వీళ్ళందర్నీ కట్టగట్టి జర్మనీ నుంచీ తద్వారా, మొత్తం మిగతా ప్రపంచాన్నుంచీ సమూలం గా తుడిచిపెట్టేయాలనీ  తీర్మానించాడు. 1935  లో న్యూరెంబర్గ్ చట్టాన్ని తీసుకొచ్చాడు. దీని ప్రకారం యూదు తండ్రికి పుట్టిన సంతానం మాత్రమే  యూదులవుతారని గాకుండా, వారికి ముగ్గురు క్రైస్తవులైన  తాతలుండి, తర్వాత తండ్రులు మతం మారినా యూదులవుతారని నిర్ణయించాడు. ఒక్క ఆర్యన్ జాతి వాళ్ళు  మాత్రమే పరిశుద్ధులనీ, కనుక మిగతా యూదులందర్నీ తుదముట్టించేందుకు  వీలుగా ఈ చట్టాన్ని తెచ్చాడు.

          దీంతో 1938 లో
  నేషనల్ సోషలిస్ట్ జర్మన్ వర్కర్స్ ( అంటే నాజీలు) యూదులకి చెందిన వ్యాపార కేంద్రాలని ధ్వంసం  చేయడం ప్రారంభించారు. యూదు జాతి అంతానికి ఇదే నాంది అన్నట్టుగా ఈ విధ్వంసాలతో ఒక  హెచ్చరిక పంపారు.

          1939 లో పోలాండ్ మీద జర్మనీ దాడి చేసేటప్పటికే జర్మనీ ఆక్రమణలో ఉన్న ప్రాంతాలన్నీ యూదుల సంహారంతో అట్టుడికి పోతున్నాయి. ఇక పోలాండ్ లోనూ యూదులని వాళ్ళ ఇళ్ళల్లోంచి బయటికి లాగి మురికి వాడల్లోకి
, వాళ్ళని చంపేందుకు ఏర్పాటు చేసిన  కాన్సంట్రేషన్ క్యాంపులనే నరక కూపాల్లోకీ తండోప తండాలుగా తరలించి కుక్కారు. ఇళ్ళల్లోంచి బయటికి లాగినప్పుడు వాళ్ళని యూదులుగా గుర్తు పట్టేందుకు చేతులకి పట్టీలు కట్టారు. క్రాకోవ్ అనేది అలాటి ఒక మురికివాడ. ఇక్కడ ఇరవై వేలమందిని పశువుల్లా కుక్కారు. వాళ్ళతో కూలి పనులు చేయించుకోసాగారు. అప్పుడప్పుడు మొబైల్ యూనిట్లు వచ్చి వాళ్ళల్లో కొందర్ని సరదాగా చంపేసి  వెళ్ళిపోసాగాయి.

1941 లో ఫైనల్ సొల్యూషన్ ని అమలుపర్చారు. అంటే  మొత్తం యూదుల్నీ, జిప్సీలనీ  భారీ ఎత్తున పోగేసి హతమార్చడమన్న మాట.  మానవ చరిత్రలో అత్యంత చీకటి అధ్యాయమది. ఇంతకంటే అమానుష కృత్యాలు మానవ చరిత్రలో ఎక్కడా కన్పించవుయూదుల్ని డెత్ క్యామ్పులకీ, గ్యాస్ ఛాంబర్లకీ తీసికెళ్ళి  అమానుషంగా చంపడం మొదలెట్టారు. ఆ మృత కళేబరాల్ని పెద్ద పెద్ద పొయ్యిల్లో వేసి బూడిద చేశారు. ఆ నల్లని పొగ మేఘాలు సమీప పట్టణాలని  కమ్మేసేవి, చితాభస్మాలు ధూళి మేఘాల్లా ఎగిరి వచ్చి మీద పడేవి.

          క్రాకోవ్ లో దుర్మతుల ఈ మానవసంహారం కొనసాగుతున్న నేపధ్యంలోఆస్కార్ షిండ్లర్ అనే  అతను  తెరపైకొచ్చాడుఇతను యుద్ధ పనుల కాంట్రాక్టర్, పైగా స్త్రీ లోలుడు. ఇతను తన ఫ్యాక్టరీ లో పనిచేస్తున్న 1100 వందల మంది యూదుల ప్రాణాల్ని కాపాడాడు. ఆ యూదులు మేము షిండ్లర్ యూదులంఅని గర్వంగా, ఒక లైసెన్సు లాగా  చెప్పుకునేంతగా వాళ్ల బానిస జీవితాలకి తోడ్పడ్డాడు. హిట్లర్ కొనసాగించిన యూదుల మారణ హోమంలో లక్షల మంది యూదులు ప్రాణాలు కోల్పోయారు. అలాటి వాళ్ళని ఓ 11 వందలమందిని షిండ్లర్  కాపాడితే అదేమంత గొప్ప విషయంగా కన్పించక పోవచ్చు.  కానీ యూదు జాతికి అంటూ మిగిలిన ఆ 11 వందల మందే తర్వాతి కాలంలో ఆరు వేలమంది సంతానాన్ని  కనీ జాతిని వృద్ధి చేసుకున్నారు. దీనికి కారకుడైన  షిండ్లర్,   11 వందల మందిని  ప్రాణాలతో సజీవంగా ఉంచడానికి తన ప్రాణాలని సైతం అడ్డేయడమే గాకుండా, తన సర్వస్వమూ ధారపోశాడు. సంపదనంతా  ఖర్చు పెట్టేశాడు.

         1983 లో థామస్ కెల్లీ అనే ఆస్ట్రేలియన్ రచయిత షిండ్లర్స్ ఆర్క్అనే నవల రాశాడు. నాటి మారణహోమానికి ప్రత్యక్ష సాక్షులైన యూదుల కథనాలు ఆధారంగా ఆ నవల రాశాడు. అది స్పీల్ బెర్గ్ దృష్టిని ఆకర్షించింది. అప్పుడే దాన్ని చలన చిత్రంగా నిర్మిం చాలని నిర్ణయించుకున్నాడు.

          ఇక్కడ విశేష మేమిటంటే,  స్పీల్ బెర్గ్ కూడా యూదు జాతీయుడే. 1947 లో అమెరికాలో పుట్టి పెరిగాడు గానీ తన మూలాల్ని మర్చిపోయాడు. ఆ నవల తన అస్తిత్వాన్ని
, చేపట్టాల్సిన మహాత్కార్యాన్నీ గుర్తు చేసింది. అయితే 1993 లో గానీ ఇది సాధ్యం కాలేదు.

షిండ్లర్స్ స్టోరీ

క్లోజప్ లో రెండుచేతులు  ఒక కొవ్వొత్తిని వెలిగించడాన్ని చూపుతూ సినిమా ప్రారంభమవుతుంది. మతాచారం ప్రకారం సబ్బాత్ ( విశ్రాంతి సమయం) నాడు వెలిగించే కొవ్వొత్తిని సబ్బాత్ కొవ్వొత్తి అంటారు. ఈ ప్రారంభ దృశ్యం సినిమాలో వున్న కొద్ది పాటి కలర్ సీన్లలో ఒకటి. ఆ కొవ్వొత్తి ఆరిపోయి సన్నటి పొగ కెరటం దూసుకు పోతుంది. డిజాల్వ్ అయి ఆ పొగ కెరటం తర్వాతి సీనుకి మారుతుంది. అక్కడ రైలింజను పొగలో సూపర్ ఇంపోజ్  అవుతుంది. ఇది తెలుపు- నలుపు దృశ్యం. అది క్రాకోవ్ రైల్వే స్టేషన్. ప్లాట్ ఫాం మీద ఒక ఫోల్దింగ్ టేబుల్ దగ్గర ఒక యూదు కుటుంబం తమ వివారాలు నమోదు చేయించుకుంటారు. ఆ ఒక్క టేబుల్ మరిన్ని టేబుళ్లు గా, అసంఖ్యాకమైన టేబుళ్లు గా మారిపోతాయి..ఆ ఒక్క యూదు కుటుంబం అనేక యూదు కుటుంబాలుగా, అసంఖ్యాక యూదు కుటుంబాలుగా దృశ్యం కడతాయి..అంటే భారీ ఎత్తున యూదు కుటుంబాల్ని ఇక్కడి మురికి వాడల్లో కుక్కడానికి నాజీలు తరలిస్తున్నారన్న మాట.

          ఒక హోటల్ రూమ్ లో ఆస్కార్ షిండ్లర్ ఓపెనవుతాడు. అతడి ముఖం కనపడదు. వస్తువులు కనబడుతూంటాయి. ఖరీదైన వాచీ ధరిస్తాడు. షర్ట్ కఫ్ లింక్స్ పెట్టుకుంటాడు. కోటు కి నాజీ పార్టీ గుర్తుగల పిన్ పెట్టుకుంటాడు. టేబుల్ సొరుగు లోంచి గుప్పెడు కరెన్సీ నోట్లు తీస్తాడు. నైట్ క్లబ్ లోకి ఎంటర్ అవుతాడు. అక్కడ ఒక టేబుల్ దగ్గర కూర్చుని వున్న నాజీ ఉన్నతాధికారిని చూసి
, అతడి దగ్గరికి ఖరీదైన డ్రింకూ, ఫుడ్డూ పంపిస్తాడు. అధికారుల్ని మంచి చేసుకుని లంచాలతో మేపి యుద్ధ పనుల కాంట్రాక్టుల్ని కొట్టేయడం షిండ్లర్ నిత్య కార్యక్రమం. చూస్తూండగానే ఈ సీను గుంపుగా చేరిన  నాజీ అధికార్లకి షిండ్లర్ బ్రహ్మాండమైన పార్టీ నిచ్చే మాస్టర్  సీనుగా మారిపోతుంది. వాళ్లతో ఫోటోలు కూడా దిగుతాడు.

తర్వాత షిండ్లర్  యూదుల క్యాంపుకి వెళ్తాడు. అంతులేని బారులు తీరి  నించున్న ఆ యూదుల్ని చూసుకుంటూ అక్కడున్న తన ఎక్కౌంటెంట్ ఐజాక్ స్టెన్ ని కలుసుకుంటాడు. తను పెట్టబోతున్న ఎనామిల్ వంట సామగ్రి ఫ్యాక్టరీకి పెట్టుబడిదార్లుగా కొందరు యూదులు కావాలని అంటాడు. ఆ ఫ్యాక్టరీని ఐజాకే నడిపేందుకు ఆఫరిస్తాడు. యూదులు వ్యాపారాలు చేయడానికి వీల్లేదు గాబట్టి వాళ్ళు తమ శ్రమని పెట్టుబడిగా పెట్టాలి. వాళ్లకి ఉత్పత్తుల రూపం లో తను  చెల్లింపులు చేస్తాడు.అక్కడ్నించీ ఒక చర్చికి వెళ్తాడు. అక్కడ యూదు స్మగ్లర్లు స్మగ్లింగ్ కార్యాకలాపాలు సాగిస్తూంటారు. పాడ్లాక్ అనే స్మగ్లర్ దగ్గరికి వెళ్లి,  రానున్న రోజుల్లో తనకి విలాసవంతమైన వస్తుఫులు సరఫరా చేయాలనీ కోరతాడు.
  మార్చి 20, 1941 అని అక్షరాలూ పడతాయి. సమూహం గా యూదుల్ని మురికి వాడల్లోకి తీసుకుపోతున్న దృశ్యం. షిండ్లర్ తన ఖరీదైన ఫ్లాట్ కొస్తాడు. ఆ ఫ్లాట్ యూదు కుటుంబానిది. ఆ యూదు కుటుంబాన్ని అవతలి దృశంలో  నాజీలు మురికి వాడ  వైపుకు నడిపిస్తూంటారు.

         
ఇక షిండ్లర్, ఎక్కౌంటెంట్  ఇజాక్ సహాయంతో ఎనామిల్ ఫ్యాక్టరీ పెడతాడు. అక్కడి యూదు కార్మికులకి  ఎస్సెన్షియల్స్అనే గుర్తిపుని నాజీల నుంచి సాధిస్తాడు. అంటే వాళ్ళని ఇక డెత్ క్యాంపు లకి తరలించడం నుంచి మినహాయింపు లభించిందన్న  మాట.  ఈ అవకాశంతో వీలైనంత ఎక్కువ మంది యూదుల్ని తీసుకొచ్చి ఫ్యాక్టరీ ని నింపేస్తాడు ఐజాక్.
          ఒక చోట లేబర్ క్యాంప్ నిర్మాణం ప్రారంభమవుతుంది. నాజీ కర్కోటకుడు అమోన్ గోలియెత్ ఆ పనులు చూస్తూంటాడు. దీని నిర్మాణం పూర్తయ్యాక క్రాకోవ్ మురికి వాడల్లో కుక్కిన యూదుల్ని ఇక్కడికి తరలించి చంపుతారన్న మాట. ఈ దృశ్యాన్ని షిండ్లర్ తన గర్ల్ ఫ్రెండ్ తో దూరం నుంచి చూస్తూంటాడు. యూదుల సమూహం తో నడుస్తున్న ఒక చిన్న పాపని చూసి గర్ల్ ఫ్రెండ్ కన్నీళ్లు పెట్టుకుంటుంది. షిండ్లర్  అమోన్ దగ్గరికి వచ్చి- తన ఫ్యాక్టరీలో యూదు కార్మికుల కోసం ఒక సబ్ క్యాంపు  నిర్మించుకోవడానికి ఒప్పిస్తాడు.


         షిండ్లర్ కి యూదు కార్మికులని ఉపయోగించుకుని ఫ్యాక్టరీ  ద్వారా బాగా డబ్బు గడించాలన్నదే ఆశయం. ఏం చేసినా ఈ దృష్టితోనే చేస్తూంటాడు. అయితే ఇందాక యూదు సమూహంతో నడుస్తున్న చిన్నపాప  దృశ్యం అతడికి ఎక్కడో కలుక్కు మన్పిస్తూనే వుంటుంది.
        రెజీనా అనే మరొక చిన్న పాప షిండ్లర్ దగ్గరికి వచ్చి,  తన తల్లి దండ్రుల్ని ఫ్యాక్టరీ లో చేర్చుకొమ్మనీ, లేకపోతే  వాళ్ళని కూడా నాజీలు పట్టుకు పోతారనీ ఏడుస్తుంది. ఆమెని కోప్పడి వెళ్ళ  గొట్టేస్తాడు. అడ్డంగా యూదుల్ని కాపాడేందుకు తను  ఫ్యాక్టరీ పెట్టాడా ఏమిటీ అని ఐజాక్ మీద అరుస్తాడు. మళ్ళీ  శాంతించి ఆలోచిస్తాడు. తన బంగారపు వాచీని ఐజాక్ కి ఇచ్చేసి, ఆ పాప తల్లిదండ్రుల్ని తీసుకు రమ్మంటాడు. ఇక్కడ్నించీ షిండ్లర్ యూదుల్ని కాపాడడం పైనే  దృష్టి పెడతాడు. తన దగ్గరున్న డబ్బుతో బాటు ఖరీదైన వస్తువులూ ఖర్చులకి ఐజాక్ కి ఇచ్చేస్తూ,  వీలైనంత మంది యూదు బాధితుల్ని ఫ్యాక్టరీకి కి తరలించ మంటాడు.


       కొంత కాలం గడుస్తుంది. శాడిస్ట్ అమోస్ పదివేల మంది యూదుల్ని ఊచకోత కోస్తాడు.  షిండ్లర్ తన యూదు వర్కర్లకి  ప్రమాదాన్ని శంకిస్తాడు. ఫ్యాక్టరీ లోనే కాక బయట వున్న యూదుల్నీ కాపాడేందుకు ఇక  నడుం కడతాడు. ఒక లిస్టు తయారు చేస్తాడు. అమోస్ దగ్గరికి వెళ్లి యూదుల్ని తనకి అమ్మాలని కోరతాడు. అమోస్ దగ్గరున్న యూదు పని మనిషి హెలెన్ ని కూడా తనకి అమ్మేసేందుకు ఒప్పిస్తాడు. వీళ్ళందరూ చెకెస్లోవేకియాలో వున్న తన ఫ్యాక్టరీలో పనిచేసిందుకు అవసరమని నమ్మిస్తాడు. రెండు రైళ్లల్లో  యూదుల్ని చెకెస్లోవేకియాకి తరలిస్తున్నప్పుడు, ఒక చోట స్త్రీలున్న రైలుని  దారి మళ్ళించి నాజీలు మళ్ళీ షిండ్లర్ కి బేరం పె డతారు. వాళ్ళని మళ్ళీ కొనుక్కుంటాడు షిండ్లర్.  వాళ్ళందర్నీ  చెకెస్లోవేకియాలో తన ఫ్యాక్టరీ కి తరలిస్తాడు. ఇక యుద్ధం ముగిసే దాకా వాళ్ళు అక్కడే క్షేమంగా వుంటారు.
          యుద్ధం ముగిశాక,  మీకిక స్వేచ్చ లభించింది పొమ్మని  ప్రకటిస్తాడు షిండ్లర్.  అయితే యుద్ధ  నేరస్తుడిగా తను పట్టుబడే అవకాశం ఉన్నందున  ఈ అర్ధరాత్రి పారిపోతాననీ అంటాడు. విషణ్ణ వదనాలతో వాళ్ళందరూ ఒక బంగారపుటుంగరాన్ని అతడికి బహూకరిస్తారు. దాని మీద – ‘ఎవరైతే ఒక్క ప్రాణాన్ని కాపాతారో వారు మొత్తం ప్రపంచాన్ని కాపాడినట్టే’  అన్న  అక్షరాలు  చెక్కి వుంటాయి. షిండ్లర్  బాగా ఏడ్చేస్తాడు. తను ఇంకా ఎక్కువ మందిని రక్షించి వుండాల్సిందని విపరీతంగా బాధ పడతాడు. ఆ తర్వాత  భార్యని తీసుకుని  పారిపోతాడు. 


       మర్నాటి ఉదయంయూదుల దగ్గరికి రష్యన్ సైనికుడు  వచ్చి- మీరందరూ ఇక స్వేచ్చా జీవులని ప్రకటిస్తాడు. యూదులందరూ కోలాహలంగా సమీప పట్టణానికి తరలి పోతూంటారు. ఈ సీను డిజాల్వ్  అయి యూదులందరూ ఒక సమాధి దగ్గర నివాళులర్పిస్తూ వుంటారు. ఆ సమాధి అఖండ మానవతా వాది ఆస్కార్ షిండ్లర్ దే!
 నటనలు అమోఘం 

‘షిండ్లర్స్ లిస్ట్’  సమయంలో స్టీవెన్ స్పీల్ బెర్గ్
     హృదయాల్ని కెలికేసే ఈ మానవ చరిత్రలోని ఒక చీకటి అధ్యాయం ఇంకే దేశపు నియంతా ఇలాటి దారుణానికి పాల్పడకూడదన్న అంతర్లీన  సందేశం తో వుంటుంది. ఒక యూదు జాతీయుడుగా స్పీల్ బెర్గ్  విజన్  ని ఇది అపూర్వ స్థాయికి తీసుకు వెళ్ళింది. ముఖ్యంగా ఇందులో నటీనటుల నుంచి రాబట్టుకున్న నటనలు ప్రత్యేకమైనవి. ప్రధాన పాత్ర షిండ్లర్ ని పోషించిన నటుడు లియాం నీసన్ అయితే నిజజీవిత షిండ్లర్ ని ఆవాహన చేసుకున్నట్టే నటిస్తేఎక్కౌంటెంట్ గా నటించిన బెన్ కింగ్స్ లే చాలా నిగ్రహం తో కూడుకున్న నటనని కనబరుస్తాడు. ఈయన మరెవరో కాదుసర్ రిచర్డ్ అటెన్ బరో తీసిన ఆజరామరమైన గాంధీ’ లో మహాత్మా గాంధీ పాత్ర పోషించి జేజేలందుకున్న మేటి నటుడు. ఇక నాజీ అమోన్ గా శాడిస్టు పాత్రలో రాల్ఫ్ ఫిన్నెస్షిండ్లర్  భార్యగా ఎమిలీ గూడాల్ తదితరులు ఆయా సన్నివేశాల్ని రక్తికట్టిస్తారు.
         స్పీల్ బెర్గ్  ఈ చీకటి చరిత్రకి  చిత్రణ తెలుపు నలుపులో వుంటేనే ప్రభావ శీలంగా ఉంటుందని భావించి, అదికూడా డాక్యుమెంటరీ విధానంలో చిత్రీ కరించాడు. నలభై శాతం సినిమాని హేండ్ హెల్డ్ కెమేరాతో చిత్రీ కరించాడు ఛాయా గ్రహకుడు జానస్ కామిన్ స్కీ.  క్రాకోవ్ లోని నిజ లొకేషన్ లలోనే   73 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశారు. జాన్ విలియమ్స్ సంగీతం ఈ క్లాసిక్ కి మరో ఎస్సెట్ అనవచ్చు. స్పెల్ బెర్గ్ ఈ సినిమా కి కమర్షియల్  గా అంత  సక్సెస్ ఉండదని భావించి, బడ్జెట్ ని బాగా కుదించి కేవలం 22 మిలియన్ డాలర్లతో నిర్మిస్తే, విడుదలయ్యాక  ఇది కళ్ళు చెదిరే విధంగా ప్రపంచవ్యాప్తంగా 321 మిలియన్ డాలర్లు వసూలు చేసింది!
         ఐతే ఇంత  లాభం గడించినా స్పీల్ బెర్గ్ ఒక్క డాలర్  కూడా పారితోషికంగా తీసుకోలేదు. అలా తీసుకోవడం ఆ నెత్తుటి డబ్బు తీసుకోవడమేనని తిరస్కరించి, ఒక ఫౌండేషన్ కి విరాళంగా ఇచ్చాడు.
        స్పీల్ బెర్గ్ షూటింగ్ పూర్తి చేశాక విఖ్యాత సంగీత దర్శకుడు జాన్ విలియమ్స్ కి చూపిస్తే  ఆయన కదిలిపోయి మాట రాక బయటికి వెళ్ళిపోయాడు. చాలా సేపటికి తిరిగివచ్చి, ఈ మహోజ్వల  సృష్టికి  తన కంటే ఉత్తమమైన సంగీత దర్శకుణ్ణి  ఎంపిక చేసుకోవాల్సిందిగా  కోరాడు. వాళ్ళందరూ చనిపోయారని స్పీల్ బెర్గ్ చెప్పాడు.


అవార్డుల సంరంభం!        
         క 1993 ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో పెద్ద రికార్డుల్నే సృష్టించింది షిండ్లర్స్ లిస్ట్.  ఆస్కార్ ఉత్తమ చలన చిత్రం ఆవార్డు మాత్రమే గాక, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ సంగీతం, ఉత్తమ ఎడిటింగ్, ఉత్తమ ఛాయాగ్రణం, ఉత్తమ కళా దర్శకత్వంలకీ  పురస్కారాలు అందుకుంది.  ఉత్తమ నటుడుగా లియాం నీసన్ కి నామినేషన్ మాత్రం దక్కింది.   

-సికిందర్





26, డిసెంబర్ 2015, శనివారం

తారుమారు!!




దర్శకత్వం : జి. శ్రీనివాస రెడ్డి

తారాగణం : అల్లరి నరేష్, మోహన్ బాబు, పూర్ణ, మీనా, రమ్యకృష్ణ, వరుణ్ సందేశ్, అలీ, జీవా, కృష్ణ భగవాన్, రఘుబాబు, రాజా రవీంద్ర, సురేఖా వాని తదితరులు 
సంగీతం : కోటి, రఘు కుంచె, అచ్చు , ఛాయాగ్రహణం : బాలమురుగన్
బ్యానర్ : 24 ఫ్రేమ్స్ ఫిలిం ఫ్యాక్టరీ
నిర్మాత : విష్ణు మంచు
విడుదల : 25 డిసెంబర్, 2015
***
        కుటుంబ కథా చిత్రాల పేరుతో ఇవ్వాళ్ళ వస్తున్న సినిమాలు అయితే రాక్షస కుటుంబాల కథలుగా, కాకపోతే 1990 లనాటి పాత వాసన కథలుగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇటీవలే లోఫర్, సౌఖ్యం వంటి నరుక్కునే రాక్షస కుటుంబాల ‘ఫ్యామిలీ సినిమా’లు మళ్ళీ మళ్ళీ  ప్రేక్షకులు చూశాక, ఈసారి ‘మామ మంచు- అల్లుడు కంచు’ పేరుతో  1990 ల నాటి ‘ఫ్యామిలీ కామెడీ’ని వడ్డించేందుకు సిద్ధమయ్యారు దర్శకుడు జి. శ్రీనివాస రెడ్డి. ఇందుకు మోహన్ బాబు- అల్లరి నరేష్ లతోబాటు,  నాటి హీరోయిన్లు మీనా- రమ్యకృష్ణ లతో కలర్ ఫుల్ గా  కాంబినేషన్లు సెట్ చేసుకున్నారు. అయితే ఎంత కలర్ ఫుల్ గా సినిమా తీర్చిదిద్దారన్న కుతూహలం ఈ సినిమాకిచ్చిన పబ్లిసిటీతో ప్రేక్షకులకి ఏర్పడుతుంది. అలాటి  కుతూహలాన్ని శ్రీనివాస రెడ్డి ఎలా తీర్చారు, అసలు తీర్చాలా లేదా తెలుసుకోవాలని మనకి వుంటుంది. ఆ ప్రయత్నం చేద్దాం...

స్టోరీ @ 1990
        బిజినెస్ మాన్ భక్తవత్సలం నాయుడు (మోహన్ బాబు) కి ఇద్దరు భార్యలు. ఒక భార్య సూర్య కాంతం (మీనా) భర్తని  ‘బాయ్యా’ (బావయ్యా కి షార్ట్ ఫాం) అని ప్రేమగా పిలుస్తూ కూకట్ పల్లిలో వుంటుంది. ఇంకోభార్య ప్రియంవద ( రమ్యకృష్ణ) భర్తకి కడుపునిండా తిండి పెడుతూ జూబ్లీ హిల్స్ లో వుంటుంది. ఆమెకి శృతీ నాయుడు ( పూర్ణ) అనే కూతురుంటుంది, ఈమెకి గౌతమ్ నాయుడు ( వరుణ్ సందేశ్) అనే కొడుకుంటాడు. ఇలా ఇద్దరు భార్యల్నీ సపరేట్ గా వుంచి వాళ్లకి తెలీకుండా సీక్రెట్ గా మెయింటెయిన్ చేస్తూంటాడు భక్తవత్సలం. ఖర్మకాలి ఓనాడు ఆ శృతీ- ఈ గౌతమ్ లు లవ్ లో పడతారు. భక్తవత్సలం కొంపలంటుకుంటాయి. పిక్చర్లోకి బాలరాజు ( నరేష్) ఎంటరవుతాడు. భక్తవత్సలం ఇచ్చిన ప్లాను పట్టుకుని శృతి దృష్టిని  గౌతమ్ మీంచి మళ్ళించడానికి పూనుకుంటాడు. ఖర్మకాలి శృతితో తనే లవ్ లో పడతాడు. మళ్ళీ భక్తవత్సలం కొంపలంటుకుంటాయి. స్నేహితుడు ఇస్మాయిల్ (అలీ) ఎంటరవుతాడు. ఇక ఇటు భార్యనీ, అటు భార్యనీ, ఇటు కూతుర్నీ అటు కొడుకునీ కన్ఫ్యూజ్ చేసి పరిస్థితిని చక్కబెట్టేందుకు రంగంలోకి దూకుతారు. మధ్యలో తన కూతురు ప్రేమిస్తున్న బాలరాజుని అవుట్ చేసేందుకు భక్తవత్సలం ఎత్తుగడలతో... భక్తవత్సలంని తిప్పికొట్టేందుకు అతడి  ఫ్యామిలీ సీక్రెట్స్ తెలిసిపోతాయి బాలరాజుకి. ఇక తను ఆడుకోవడం మొదలెడతాడు..

        అసలు భక్తవత్సలం ఎందుకు ఇద్దర్నీ పెళ్ళిచేసుకున్నాడు, ఆ నిజమేమిటి, అది తెలుసుకున్న బాలరాజు భక్తవ్సలం ఫ్యామిలీ సమస్యనీ, తన లవ్ సమస్యనీ ఎలా తీర్చుకున్నాడు,  చివరికి భార్యలతో భక్తవత్సలంకి సుఖాంతమయిందా, దుఖాంతమయిందా తెలుసుకోవాలంటే ఈ ఫ్యామిలీ కామెడీ- డ్రామా పూర్తిగా చూడాల్సిందే- 1990 స్టయిల్లో. 

ఎవరెలా చేశారు
       
నిజానికి మోహన్ బాబు దారి తప్పి ఈ సినిమాలో నటించారు గానీ, లేకపోతే ఇప్పటికీ  చెక్కుచెదరని ఫిజిక్ తో, యాక్టింగ్ లో టైమింగ్ తో, డైలాగ్ డెలివరీతో వేరే పవర్ఫుల్ సినిమా ఏదైనా చేసివుంటే 181 వ సినిమా ధన్యమయ్యేది. ప్రస్తుత సినిమాలో ప్రధాన కథ తనదే, అల్లరి నరేష్ ది కాదు. అల్లరి నరేష్ ది తోడ్పడే పాత్ర మాత్రమే. ఇది బాగా మైనస్ అయింది యూత్ అప్పీల్ కి. పూర్తిగా మోహన్ బాబు సినిమానే అన్నట్టు తయారవడంతో యువ ప్రేక్షకులు ఫస్టాఫ్ లోనే, కొందరు ఇంటర్వెల్లోనే వెళ్ళిపోతున్న దృశ్యాలు మనం చూస్తాం. అల్లరి నరేష్ మెయిన్ రోల్ దక్కే కథలో మోహన్ బాబు సపోర్టింగ్ రోల్ వేయాల్సిన లెక్కలు తారుమారయ్యాయి. దీంతో మోహన్ బాబు ఈ పాత్రలో ఎంత బాగా చేసినా, నవ్వించినా  బూడిదలో పోసిన పన్నీరే  అయింది. నరేష్ సంగతి చెప్పక్కర్లేదు. తను ఎప్పటినుంచో ప్లాన్ చేసుకుంటున్న 50 వ సినిమా కూడా ప్లస్ కాని పరిస్థితి.

        హీరోయిన్ పూర్ణ ఎంతసేపూ చిరునవ్వుతో చూడ్డం తప్ప ఇంకేమీ చేయదు. సీనియర్ హీరోయిన్ లిద్దరూ వాళ్ళ టాలెంట్ బాగానే చూపించుకున్నా,  ఇదీ మోహన్ బాబు పాత్రకి లాగే యూత్ అప్పీల్ కి నప్పలేదు. హీరోకి కత్తి లాంటి ఇద్దరు యువ హీరోయిన్లు, సీనియర్ హీరోకి ఒక సీనియర్ హీరోయినూ వుండి రక్తి కట్టించాల్సిన కామెడీ  ఇది. అంటే అల్లరి నరేష్ కే ఇద్దరు భార్యలుండాల్సిన ట్రెండీ కామెడీ, కాంబినేషన్లు తారుమారై కాలం చెల్లిన రూపాన్ని సంతరించుకుంది.
        అలీకి సినిమా ఆసాంతమూ చిక్కుల్ని పరిష్కరించే పాత్రదక్కింది. పాత్రకి ఆడపిచ్చి అతి గా మారింది. ఇతరపాత్రల్లో మిగిలిన నటీనటులు- వరుణ్ సందేశ్ సహా సోసోగా నటించేశారు.

        టెక్నికల్ గా, సంగీత సాహిత్యాల పరంగా చెప్పుకోవడానికేమీ లేదు.

చివరికేమిటి?
        ర్శకుడు ఈ సినిమాతో ప్రేక్షకుల కుతూహలం తీరుస్తున్నాననుకుంటూ నీరుగార్చాడు. ఉత్త డైలాగుల మోతతో సినిమా అంతా కామెడీగా నడుపుదామనుకోవడంలో కూడా వెనకబాటు తనమే కనిపిస్తోంది. టేకింగ్ కూడా పాత సినిమా శైలిలో వుంది. ఆఫ్ కోర్స్, ఈ డైలాగుల మోతతోనే కొన్ని చోట్ల బాగా నవ్వొచ్చేట్టు  సీన్లు తీసిన మాట నిజమే. ఇలాగైనా వీలైనన్ని చోట్లా సీన్లు స్టాండప్ కామెడీగా తీసివుండాల్సింది. ఇక మోహన్ బాబు పాత్ర రెండు పెళ్ళిళ్ళు చేసుకోవాల్సిన అగత్యం గురించి తెలిపే ఫ్లాష్ బ్యాక్ విషయంలో కూడా అలసత్వమే కనబరచాడు దర్శకుడు. మోహన్ బాబు- మీనా- రమ్య కృష్ణలు ఆనాడు నటించిన ‘అల్లరిమోగుడు’ దృశ్యాల్లోంచే క్లిప్పింగ్స్ తీసి ఫ్లాష్ బ్యాక్ గా వేశారు. ముందు పెళ్లి చేసుకున్న భార్యగా మీనా పాత్ర వుండగా, రెండో పెళ్లి ఆమెకి తెలీకుండా రమ్యకృష్ణ పాత్రని ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో చెప్పిన  కారణాన్ని  ‘ జీవిత చక్రం’ లోంచి ఎత్తేశారు. నందమూరి తారకరామారావు నటించిన ‘జీవిత చక్రం’ లో కమల (శారద) జబ్బుతో మరణం ఖాయమైపోయిన స్థితిలో చివరి కోరిక కోరుతుంది. రాజా (ఎన్టీఆర్) చేత తాళి కట్టించుకుని తృప్తిగా కన్ను మూయాలని. రాజా ఆమె కోరిక తీరుస్తాడు. ఆ తర్వాతే కథ అడ్డం తిరుగుతుంది- కమల బతికి బాగుపడుతుంది! కలవర పడిపోతుంది. చివరి కోరిక తీర్చుకుని చచ్చి ఈ లోకం లోంచి వెళ్ళిపోవాల్సిన తనే,  ఇలా సుశీల (వాణిశ్రీ) కి కి అడ్డు అయ్యిందేమిటి? రాజాకీ ఏమీ తోచని స్థితి! ఇదీ ట్విస్టు.

ఈ ట్విస్టే పెట్టి  ఫ్లాష్ బ్యాక్ చెప్పారు దర్శకుడు శ్రీనివాస రెడ్డి. ఆనాడు దర్శకుడు, గొప్ప కథా రచయిత సిఎస్ రావు పెట్టిన ఈ ట్విస్టు గొప్ప సంచలనమైతే ...ఈనాడు..???


-సికిందర్















25, డిసెంబర్ 2015, శుక్రవారం

మూస మీద దాడి!




దర్శకత్వం : శ్రీ రామ్ ఆదిత్య టి.



తారాగణం : సుధీర్ బాబు, వమిఖా గబ్బి, ధన్యా బాలకృష్ణ, సాయి కుమార్, పోసాని కృష్ణ మురళి, పరుచూరి గోపాల కృష్ణ, చైతన్య కృష్ణ  తదితరులు

కథ- స్క్రీన్ ప్లే : శ్రీ రాం ఆదిత్య టి., మాటలు : అర్జున్- కార్తీక్, సంగీతం : సన్నీ ఎం ఆర్, ఛాయాగ్రహణం : శ్యాందత్  సైనుద్దీన్, నృత్యాలు : చిన్ని ప్రకాష్, సుచిత్రా చంద్రబోస్, విజయ్, కూర్పు : ఎం ఆర్ వర్మ, పోరాటాలు : అన్బరీవ్, రామ్ సుంకర 
బ్యానర్ : 70 ఎం ఎం ఎంటర్ టిన్ మెంట్స్, నిర్మాతలు : విజయ కుమార్ రెడ్డి, శశిధర్ రెడ్డి 
విడుదల : 25 డిసెంబర్,  2015
****



ప్రేమకథా చిత్రం’ తో ఓ మంచి హిట్ సాధించిన సుధీర్ బాబు, మళ్ళీ అలాటి ఒక సక్సెస్ కోసం విఫలయత్నాలు చేస్తున్నప్పటికీ,  కొత్తదనాన్ని ప్రయత్నించడం మానుకోక పోవడం అతడి ప్లస్ పాయింట్. దొంగాట, మోసగాళ్ళకు మోసగాడు, కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ- అనే గత భిన్నమైన మూడు ప్రయత్నాలతో  అపజయాల బాట పట్టినప్పటికీ,  మళ్ళీ ఓ కొత్తదనాన్నే ఆశ్రయించి, కొత్త దర్శకుడ్నే పూర్తిగా నమ్మి,  ‘భలే మంచి రోజు’ తో తిరిగొచ్చాడు. కొత్త దర్శకుడు శ్రీ రామ్  ఆదిత్య న్యూవేవ్  థ్రిల్లర్ గా అందించిన  ఈ తొలి  ప్రయత్నానికి,  ‘స్వామిరారా’  స్ఫూర్తి అన్నట్టు స్పష్టంగా అన్పించినా, ఆ రేంజి సక్సెస్ కి ఇది చేరుకో గల్గిందా లేదా చూద్దాం...

కథ

రామ్ ( సుధీర్ బాబు) అనే నిరుద్యోగి  ప్రేమించిన గర్ల్ ఫ్రెండ్ ( ధన్యా బాలకృష్ణ) మోసం చేసి ఇదే రోజు పెళ్లి చేసుకుంటోందని,  ఆమెని  నాల్గు తన్ని వద్దామని ఫ్రెండ్ (ప్రవీణ్) తో కలిసి బయల్దేరతాడు. దార్లో ఫ్రెండ్ తో వాగ్వాదం తో ఆ కారు వెళ్లి ఇంకో కారుకి డాష్ ఇవ్వడంతో-ఆ కార్లో కిడ్నాపైన ఇంకో పెళ్లి కూతురు సీత ( వమిఖా గబ్బి) కారు దిగి పరారవుతుంది. దీంతో గ్యాంగ్ లీడర్ శక్తి ( సాయికుమార్) రామ్ ఫ్రెండ్ ని బంధించి, ఆ సీతని వెతికి తీసుకొచ్చే బాధ్యత రామ్  మీదేస్తాడు. రామ్ కి ఇద్దరు క్రిమినల్స్ యూసుఫ్- ఆల్బర్ట్ (వేణు- శ్రీరాం) లు  తగుల్తారు. సీత కూడా ఓ చోట తగుల్తుంది. ఈ క్రిమినల్స్ సాయంతో సీతని పట్టుకుని, శక్తి దగ్గరికి తీసుకోస్తూంటే ఇంకో గ్యాంగ్ కిడ్నాప్ చేస్తుంది.. ఏమిటీ  కిడ్నాపులు? మొత్తం ఎన్ని గ్యాంగులు పనిచేస్తున్నాయి? వాళ్ళెవరెవరు? ఒకర్నొకరు ఎందుకు డబుల్ క్రాస్ చేసుకుంటున్నారు? మధ్యలో సీత పెళ్లి కథేంటి? ఒక్క రోజులో ఈ చిక్కులన్నీ ఇందులో ఇరుక్కున్న  రామ్ ఎలా పరిష్కరించాడు- మొదలైన ప్రశ్నలకి సమాధానాలు కావాలంటే మిగతా సినిమా చూడాల్సిందే.

ఎలావుంది కథ
నిన్నటి ‘సౌఖ్యం’ దెబ్బకి ఇహ తెలుగు సినిమా కథంటే భయపడి పారిపోయే పరిస్థితి పరాకాష్ఠ కి  చేరుకున్నాక- ‘భలే మంచి రోజు’ కథ క్రిస్మస్ పండక్కి పండగ మూడ్ ని నాశనం చేయకుండా, ఈ మంచి రోజుని మంచిరోజులాగే ఉంచుతూ కొండంత ధైర్యాన్నిస్తుంది చూసే ప్రేక్షకులకి. ఇదేరోజు మళ్ళీ అవతల ‘మామ మంచు- అల్లుడు కంచు’ చూసే వాళ్ళ పరిస్థితి  వేరు, అదలా ఉంచుదాం. ఒక సహజంగా జరిగే కథ చూడడం ఎవరికైనా మూస సినిమాల నుంచి చాలా రిలీఫ్ నిస్తుంది.  సహజ సంఘటనలు, సహజ క్రిమినల్ పాత్రలు, సహజ కామెడీ, వీటితో థ్రిల్, సస్పెన్స్, వినోదం  కలగలిసి ఫ్రెష్ గా  తయారైన కథ ఇది. ముందే చెప్పినట్టు, ‘స్వామిరారా’ పంథాలో వుంటుంది. అయితే ‘స్వామిరారా’ తో ప్రామిజింగ్ దర్శకుడిగా కన్పించిన  సుధీర్ వర్మ అంతలోనే  రెండో ప్రయత్నం పాత మూస ‘దోచేయ్’ తో ఎంత షాకిచ్చాడో  తెలిసిందే. ప్రస్తుత కొత్త దర్శకుడు అలా కాకుండా ఆ ‘స్వామిరారా’  ప్రమాణాల కోసం- ఆ ఫీల్ కోసం తెగ ప్రయత్నం చేయడం ఇక్కడ తెర నిండా కన్పిస్తుంది.

ఎవరెలా చేశారు
        సుధీర్ బాబు కచ్చితంగా ఇంప్రూవ్ అయ్యాడు. పైగా ప్రారంభం నుంచీ  ముగింపు వరకూ సినిమాని తన భుజాన మోస్తూ ఒక పక్కా యాక్టివ్ క్యారెక్టర్ కి నిదర్శనంగా నిలచాడు. ఫ్రెండ్ కోసం హీరోయిన్ని కిడ్నాప్ చేస్తే, మళ్ళీ తల్లిదండ్రుల కోసం తప్పి పోయిన హీరోయిన్ ని మళ్ళీ పట్టుకునే బాధ్యత కూడా   మీద పడే, నిత్యం కర్తవ్యానికీ- హీరోయిన్ తో నైతిక బాధ్యతకీ  నడుమ  నలిగే పాత్రని  సమర్ధవంతంగా పోషించాడు. గత ఫ్లాపుల బాధ దీంతో తీరిపోవచ్చు.  

పంజాబీ హీరోయిన్ వమిఖా గబ్బీ కి ఇదే తొలి తెలుగు అయినా,  హిందీలో 2007 లో ‘జబ్  వి మెట్’  లో కరీనా కపూర్ చెల్లెలిగా వేసి నప్పట్నించీ వుంది. అంత  గ్లామరస్ కాకపోయినా,  గోదావరి జిల్లా అమ్మాయి పాత్రకి సరిపోయింది. రెండో హీరోయిన్ ధన్యా బాలకృష్ణ కెక్కువ కథలేదు. హీరో తండ్రిగా కార్ల షెడ్డు నడిపే పరుచూరి గోపాల కృష్ణ పాత్ర గమ్మత్తయినది. అలాగే చర్చి ఫాదర్ గా పోసానీ పాత్రకూడా బిన్నమైన కామిక్ పాత్రే. క్లయిమాక్స్ లో  వచ్చి గందరగోళం సృష్టించే పృథ్వీ తో క్లయిమాక్స్ కే బలం పెరిగింది. అయితే ఎంత సేపూ  సినిమాల్ని పేరడీ చేసే పాత్రలే ఆయనకి  దక్కుతున్నాయి. తన కామెడీకి ఇక  రూటు మార్చుకుంటే మంచిదేమో. హీరో చెల్లెలి పాత్రలో విద్యుల్లేఖా  రామన్ కూడా ఫన్నీ పాత్రే. ఓల్డ్ సిటీలో మూతబడ్డ థియేటర్ లో పాత సినిమాలేసుకు ఎంజాయ్ చేసే,  మెయిన్ విలన్ గా సాయికుమార్ దో  భిన్నమైన పాత్రా, నటనా. వీళ్ళందరితో బాటు, జంట క్రిమినల్స్ గా కమెడియన్ వేణు- శ్రీరాంలు సైతం కథని మలుపులు తిప్పుతూ ఎక్కడికో తీసికెళ్ళి పోయే పాత్రలే. ప్రతీ పాత్రా కథలో ఎక్కడో కలిసి కథ పరిధిని పెంచేదే.  ఈ సహజత్వం వల్ల ఇవి గుర్తుండి  పోతాయి.

టెక్నికల్ గా ఈ కథ డిమాండ్ చేస్తున్న మేకింగ్ తో వుంది. ‘ఉత్తమ విలన్’, ‘ విశ్వరూపం’ సినిమాల ఫేం కెమెరా మాన్ శ్యాందత్  సైనుద్దీన్ కలర్స్ తో, లైటింగ్ తో, షేడ్స్ తో ఉత్తమ పనితనం కనబరచాడు. అలాగే ‘స్వామిరారా’ లో లాగా జాజ్ మ్యూజిక్ ని ఫ్యూజన్ చేసిన బాణీలతో సన్నీ ఎం ఆర్ కథ ఫ్లేవర్ తగ్గ ట్రెండీ మ్యూజిక్ ఇచ్చాడు. మిగిలిన ఎడిటింగ్, యాక్షన్, కోరియోగ్రఫీ విభాగాలూ కూడా కథ ఏర్పరచిన చట్రంలోనే పని చేశాయి. పోతే మాటలు రాసిన అర్జున్- కార్తీక్ లు ఈ కామిక్ థ్రిల్లర్ కి చాలా స్పూర్తిదాయకమైన క్రియేటివిటీ ని కనబర్చా రు.

చివరి కేమిటి
కొత్త దర్శకుడు శ్రీరామ్  ఆదిత్యలో మంచి టాలెంట్ వుంది. సినిమాలు చూసే జనంగా యువ ప్రేక్షకులే మిగిలినప్పుడు,  వాళ్ళ అభిరుచిని దృష్టిలో పెట్టుకుని టార్గెట్ చేసిన న్యూవ్ వేవ్ థ్రిల్లర్ ఇది. ఇదయినా ‘స్వామి రారా’ అయినా ‘పల్ప్ ఫిక్షన్’ తో క్వెంటిన్ టరాంటినో పాపులర్ చేసిన తరహా సినిమాలే.  అవలా ఉంచితే,  మొత్తం థ్రిల్లర్ కుండాల్సిన స్పీడు, పెప్, టెంపో లోపించాయి.  షాట్స్ లో కెమెరా స్పీడు కూడా లేదు. అలాగే ఈ కథంతా ఒక్క  రోజులో జరుగుతోందన్న ఫీల్ కూడా తీసుకు రాలేకపోయారు. ఇవన్నీ స్క్రీన్ ప్లే సంగతుల్లో చూద్దాం. ఏమైనా కొత్త దర్శకుడు అప్పుడే పర్ఫెక్టుగా వుండాలని ఆశించలేం. ఈ కొత్త దర్శకుడి మీద విశ్వాసంతో అవకాశమిచ్చిన సుధీర్ బాబు, నిర్మాత లిద్దరూ అభినందనీయులే.


-సికిందర్
(స్క్రీన్ ప్లే సంగతులు రేపు!)