రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

4, జులై 2016, సోమవారం

కామెడీ సంగతులు- 3

   హాలీవుడ్ లో ఒక పూర్తి స్థాయి కామెడీ స్క్రిప్టు రాయాలంటే  మొదటి పేజీలోనే నవ్వించగల్గాలి. మొదటి పేజీలో నవ్వించ లేదంటే స్క్రిప్టులు  చదివే స్టూడియో ఎగ్జిక్యూటివ్ దాన్ని పక్కన పెట్టేసే ప్రమాదముంది. మొదటి పేజీలోనే  నవ్వించడమంటే ఇంకా నిద్ర లేవని హీరో మీద బామ్మగారు  బిందెడు నీళ్ళు తెచ్చి గుమ్మరించడంలాంటి అరిగిపోయిన సీను కాదు. ఎప్పటికప్పటి అభిరుచులకి తగ్గట్టు తాజాగా  క్రేజీగా బుర్ర తిరిగిపోయే సరికొత్త కామిక్ ఐడియాతో వుండాలి. తెలుగులో ఇంత  అవసరం రావడంలేదు, మొదటి పేజీ నిబంధన అంటూ ఏదీ లేదు కాబట్టి. ఐతే కామెడీ అనగానే కథలు చాలా ఆషామాషీగా రాసేయడం మాత్రం జరుగుతోంది. జోకులతో నవ్వించడమే కామెడీ అన్నట్టు సాగుతోంది. కథలేని వంద జోకులకన్నా, జోకుల్లేని కథ వున్న సినిమాలు వందరెట్లు బెటర్ అన్పించుకుంటాయి.
        కామెడీ జానర్ కీ, ఇతర జానర్లకీ స్ట్రక్చర్ లో తేడా ఏమీ వుండదు. ఏ జానర్ లో  కథ కైనా స్ట్రక్చర్ ఒకటే.  అదే బిగినింగ్, మిడిల్, ఎండ్ విభాగాలు; వాటిలో వాటి తాలూకు బిజినెస్ లు, ప్లాట్ పాయింట్లు అన్నీ ఒకటే. కాకపోతే ఇవి కామెడీకి హాస్య రూపంలోకి బదిలీ అవుతాయి.  ఈ హాస్య రూపం రివర్స్ మెకానిజం వల్ల  ఏర్పడుతుంది. ఇతర కథల్లో హీరో ఫలానాది జరగాలని ప్రయత్నిస్తూంటాడు, కామెడీల్లో హీరో ఫలానాది జరక్కూడదని చెడగొడు తూంటాడు. జరిగితే తన పరువే పోవచ్చు, లేదా  నల్గురు కలిసి తనని తన్న వచ్చు. అవన్నీ  హీరోకి జరిగి తీరాలని విలన్ తెగ కౌంటర్ పథకా లేస్తూంటాడు. దొంగ పెళ్లి చేసుకున్న హీరో అది బయట పడకుండా ప్రయత్నించడం, మర్డర్ చేశాననుకుని ఫీలవుతున్న హీరో ఎక్కడ పోలీసులకి దొరికిపోతానో అని భయపడి చావడం, స్వయంవరం లో హీరోయిన్ని సొంతం చేసుకుందామని వెళ్ళిన హీరోకి అక్కడ తన గుట్టు తెలిసిన విలన్ ఎదురు పడ్డం...లాంటి ఇరకాటాలే కామెడీ కథల రివర్స్ మెకానిజపు పరికరాలు. 

        కామెడీ అంటే గందరగోళాలు సృషించే వాళ్ళకీ, ఆ గందరగోళాల  బాధితులకీ మధ్య జరిగే సంఘర్షణ. అయితే ఈ గందరగోళాలకి  మూలం అర్ధంవంతంగా, నమ్మశక్యంగా వుండాలి. ఉదాహరణకి గతవారం విడుదలైన ‘రోజులు మారాయి’ లో కథా మూలం-  హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే వాళ్ళ భర్తలు  మూడ్రోజుల్లో చనిపోతారని బాబా చెప్పడం, అది నమ్మి  తమ వెంట పడుతున్న హీరోలని వదిలించుకోవడానికి హీరోయిన్లు వాళ్ళని పెళ్లి చేసుకోవడం. అంటే హీరోలని చంపెయ్యడమే అన్న మాట. ఇది కన్విన్సింగ్ గా అన్పించదు.  ఈ కథా మూలం ఆధారంగా కామెడీని ఎంజాయ్ చేయడం కష్టం. 
      ఇందుకే  కామెడీకి సెటప్ వాస్తవికంగా వుండాలి, దాని పర్యవసానంగా పుట్టే   హాస్య ప్రహసనాలు మాత్రం  వాస్తవికంగా, లాజికల్ గా వుండ నవసరం లేదు. ఎంత మైండ్ లెస్ కామెడీగా నైనా ఉండొచ్చు ( హిందీ ‘గోల్ మాల్’ సిరీస్ సినిమాలు). కామెడీ కథ పుట్టడానికి మూలమైన సంఘర్షణ, సంఘటన లేదా ఓ కోరిక వాస్తవికంగా, లాజికల్ గా వున్నప్పుడే దాన్ని ఆధారంగా చేసుకుని ఎంత అసంబద్ధ కామెడీ నైనా చేసి ఒప్పించ వచ్చు. సెటైర్స్ ఇలాగే  పుడతాయి. ఒక పాకెట్ సిగరెట్ల కోసం ఐదుమైళ్ళు కారేసుకుని తండ్రి వెళ్ళడం చూసిన కొడుకు, వాటర్ బాటిల్ కోసం అదే కారేసుకుని వంద మైళ్ళు వెళ్లి రెండ్రోజుల తర్వాత రావడం అబ్సర్డ్ కామెడీ. తండ్రి చేసింది దుబారా కింద కన్విన్సింగ్ గానే అన్పించుకుంటుంది, ఈ సాకుతో కొడుకు చేసింది చాలా అతి. ఇదీ  అబ్సర్డ్ కామెడీ. ఇంకా కొడుకు ఆ కారునే కుదువ బెట్టి వాటర్ బాటిల్ కొనుక్కుని బస్సెక్కి కూడా రావచ్చు. ఇంకెలాటి పిచ్చి పనులైనా చెయ్యవచ్చు, లిమిట్ లేదు. ఎందుకంటే తండ్రి దుబారా అనే మూలం కన్విన్సింగ్ గా వుంటుంది కాబట్టి. ‘అహ నా పెళ్ళంట’ లో పిసినారి కోట శ్రీనివాస రావు ఎదురుగా కోడిని వేలాడదీసుకుని, దాన్ని చూస్తూ చికెన్ కలుపుకుని తింటున్నట్టు ఫీలవుతూ అన్నం తినడం అబ్సర్డ్ కామెడీ. ఎదురుగా కోడి ఉనికి, దాన్ని తింటారనే వాస్తవమూ  లేకపోతే  ఈ కామెడీ పండదు. 

        కామెడీ  పర్ఫెక్షన్ ని కోరుకోదు. పర్ఫెక్షన్ అనేది భ్రాంతి అనుకుంటుంది. కాబట్టి ఒక కామెడీ హీరో చాలా జోకర్ పనులు చేసి చిటికెలో  అద్భుతాలు సాధిస్తాడు. ఈ మాత్రం దానికి  గొప్ప మేధావియే కానక్కర్లేదని చురక అంటిస్తాడు. చార్లీ చాప్లిన్ తర్వాత అలాటి  సైలెంట్ మూవీ కామిక్ సిరీస్ తో పాపులరైన లారెల్ అండ్ హార్డీలు ఈ కోవకి చెందుతారు. 

        కామిక్  హీరో పాసివ్ గా వుండడు, చాలా కమర్షియల్ గా యాక్టివ్ గా వుంటాడు. కథని తనే నడిపిస్తాడు. అతడికీ ప్లాట్ పాయింట్ వన్ దగ్గర గోల్ ఏర్పడుతుంది, అతడికీ ఆ గోల్ కోసం సంఘర్షణ  వుంటుంది. అతనూ ఆ గోల్ ని సాధించి తెరిపిన పడతాడు.  

       
కామెడీ జానర్ లో కి అనేక సబ్ జానర్స్ వున్నాయి. అన్నీ ప్రయత్నించ వచ్చు, లేదా ఏదో ఒకదాన్ని స్పెషలైజ్ చేస్తూ కొనసాగవచ్చు. ప్రధానంగా కామెడీలో రోమాంటిక్ కామెడీ (అహ నా పెళ్ళంట), కామెడీ డ్రామా(బృందావనం), యాక్షన్ కామెడీ (కృష్ణ) , కామిక్ థ్రిల్లర్ (స్వామి రారా), హార్రర్ కామెడీ (ప్రేమ కథా చిత్రం), ఫాంటసికల్ కామెడీ (సోగ్గాడే చిన్ని నాయనా), బ్లూ కామెడీ (ఈరోజుల్లో),  స్పూఫ్ ( సుడిగాడు), ఫార్స్  (రోజులు మారాయి),  బ్లాక్ కామెడీ (మనకి లేదు), సెటైర్ ( మనకి లేదు), పేరడీ ( మనకి లేదు), రాజకీయ కామెడీ (మనకి లేదు)...ఇలా 35 వరకూ వున్నాయి. 

        ఏది తీసుకున్నా స్ట్రక్చర్ ఒకటే.  బిగినింగ్ లో పాత్రల పరిచయం, కథా నేపధ్యం ఏర్పాటు, సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పన, సమస్య ఏర్పాటు (ప్లాట్ పాయింట్-1). దీంతో బిగినింగ్ విభాగం ముగియడం అనేవి వుంటాయి. 

          ప్లాట్ పాయింట్ -1 అంటే అసలు కథా ప్రారంభమనీ, హీరోకి ఒక గోల్ ఏర్పడ్డ మనీ తెలిసిందే. ‘అహ నా పెళ్ళంట’ లో పిసినారి కోట కూతుర్ని పెళ్లి చేసుకోవాలంటే, తను కూడా పీనాసిలా మారాలని ( నటించాలని) రాజేంద్ర ప్రసాద్ నిర్ణయించుకోవడం గోల్, అసలు కథా ప్రారంభం. 

        ఈ గోల్ లో కోరిక, పణం, పరిణామాల హెచ్చరిక, ఎమోషన్ అనే నాల్గు ఎలిమెంట్స్ వుంటాయని తెలిసిందే. ఉన్నప్పుడే కథ బలంగా వుంటుంది. ‘ఆహ నా పెళ్ళంట’ లో పరమ పిసినారి కోట శ్రీనివాసరావు కూతురు రజనీని రాజేంద్ర ప్రసాద్ చేసుకోవడం కోటీశ్వరుడైన రాజేంద్ర ప్రసాద్ తండ్రి నూతన్ ప్రసాద్ కిష్ట ముండదు. తను కోటీశ్వరుడి  కొడుకని చెప్పుకోకుండా కోటని ఒప్పించి అతడి కూతుర్ని చేసుకోగల్గితే ఓకే అని షరతు పెడతాడు. ఇందుకో  గడువు విధిస్తాడు. ఈ గడువులోగా ఇది జరక్కపోతే తను చూసిన సంబంధం చేసుకోవాలంటాడు.  

        పదిహేనవ నిమిషంలోనే ఏర్పాటయ్యే ఈ ప్లాట్ పాయింట్ -1 నుంచి బయల్దేరే  రాజేంద్ర ప్రసాద్ కి- 1. గడువు లోగా గోల్ సాధించుకోవాలన్న కోరిక, 2. తండ్రి షరతుతో రిస్కు వున్నా తన ప్రేమనే పణంగా పెట్టడం, 3. తను పిసినారిలా నటిస్తే అది కోట కి తెలిసిపోగల పరిణామాల హెచ్చరిక, 4. తండ్రి పెట్టిన  షరతు వల్ల  పుట్టిన ఎమోషన్ అనే నాల్గు గోల్ ఎలిమెంట్సూ వున్నాయి. 

        ఈ ప్లాట్ పాయింట్ -1  సీన్ ని ఇంకా గమనిస్తే ఇది సీరియస్ గా వుండదు. తండ్రీ కొడుకుల సవాళ్ళు కామెడీగానే వుంటాయి. ఇదే ఒక ప్రేమ కథనో, ఫ్యామిలీ కథనో అయివుంటే ఈ సీను కామెడీగా ఉండకపోవచ్చు. తండ్రీ కొడుకులు సీరియస్ గా ఘర్షణ పడొచ్చు ఆ కథల జానర్ మర్యాద ప్రకారం. కామెడీకి కామెడీగానే ఈ సీను  వుండడం జానర్ మర్యాద. రసభంగం కలిగించని  రస పోషణ అంటారు దీన్ని. 

        మరొకటేమిటంటే, తండ్రీ కొడుకులు ఇంత కామెడీగా సవాళ్లు విసురుకున్నా దీని బ్యాక్ డ్రాప్ కామెడీగా కాక సీరియస్ గానే  వుంటుంది. గోల్ ని సాధించుకోవాలన్న కోరికలో సీరియస్ నెస్, ప్రేమని పణంగా పెట్టడంలో వున్నసీరియస్ నెస్, పిసినారిలా నటిస్తే అది కోట కి తెలిసిపోగల పరిణామాల హెచ్చరిక లో సీరియస్ నెస్, తండ్రి పెట్టిన  షరతు వల్ల  పుట్టిన ఎమోషన్ లోనూ  సీరియస్ నెస్...ఇలా ఈ సీరియస్ బ్యాక్ డ్రాప్ లో కథనం మాత్రం కామెడీ గానే నడవడం! ఇంత సీరియస్ బ్యాక్ డ్రాప్ లో హీరో పాల్పడే చేష్టలు కామెడీగానే వుండడం! 

     ఈ డైమెన్షన్, ఈ ద్వంద్వాలు,  ఈ కాంట్రాస్ట్, ఈ అదృష్టం ఇంకే జానర్ కథలతోనూ సాధ్యపడదు కామెడీతో తప్ప. ఇతర జానర్ల కథల్లో ఈ బ్యాక్ డ్రాపూ సీరియస్ గానే వుంటుంది, గోల్ కోసం హీరో ప్రయత్నాలూ సీరియస్ గానే వుంటాయని గమనిస్తూంటాం. ఈ తేడా తెలుసుకుని కామెడీ స్ట్రక్చర్ చేసుకోవాలి. 

        ఇంకొకటేమిటంటే,  రోమాంటిక్ కామెడీల్లో ప్రత్యర్ధులు రెండు రకాలుగా వుంటారు : వుంటే హీరో హీరోయిన్లే పరస్పరం ప్రత్యర్ధులుగా వుండడం, లేదా ఇంకోటేదో పాత్ర ( ‘అహ నా పెళ్ళంట’ లో కోట) హీరో హీరోయిన్లు ఇద్దరికీ కలిపి విలన్ గా వుండడం. ఇతర జానర్ల కథల్లో- కామెడీ లో ఇతర సబ్ జానర్లలో సైతం-  హీరో హీరోయిన్లు ప్రత్యర్ధులుగా వుండడం అరుదు. 

        బిగినింగ్ విభాగం ప్లాట్ పాయింట్ -1 తో ఇలా ముగిశాక, మిడిల్ ప్రారంభమవుతుంది. కామెడీల్లో మిడిల్ అంటే కూడా సంఘర్షణే. రాజేంద్ర ప్రసాద్ కోట ఇంట్లో దిగి పిసినారి చేష్టలు చేయడం గోల్ కోసం చేసే సంఘర్షణే. కోట కంటే వెయ్యి రెట్లు ఎక్కువ పిసినారిగా నటిస్తాడు. మిడిల్ బిజినెస్ లో క్యారక్టర్ ఆర్క్ పెరుగుతూ పోవాలి. గోల్ కోసం  అడుగడుగునా హీరో తీసుకునే రిస్క్ మీద ఈ ఆర్క్ ఆధారపడి వుంటుంది. ఎంత రిస్క్ తీసుకుంటే అంత ఆర్క్ పెరుగుతుంది. అంతేగాక హీరో పాత్ర ప్రయాణంలో ఎత్తు పల్లాలు కూడా వుంటాయి. ఇక్కడ హీరోయిన్ కి వేరే పెళ్లి సంబంధం చూడ్డం ఇలాంటిదే. అన్ని అవరోధాలూ అధిగమించి చివరికి కోటని ప్రసన్నం చేసుకుంటే, రాజేంద్ర ప్రసాద్  డబ్బున్న వాడు కాదని మెలిక పెడతాడు కోట. దీంతో మొదటి కొస్తుంది. ఇలా దారులన్నీ మూసుకు పోవడం మిడిల్ బిజినెస్ కి ముగింపని తెలిసిందే. ఇది ప్లాట్ పాయింట్-2. ఇక ఇక్కడ్నుంచీ ఎండ్ ప్రారంభం. మళ్ళీ హీరో కొత్త పరిష్కార మార్గం వెతుక్కుని మొదలవ్వాలి. అలాగే చేస్తాడు రాజేంద్ర ప్రసాద్.  కోటకి బుద్ధి చెప్పడానికి మూడు డబ్బున్నసంబంధాలు తెచ్చి గందర గోళం క్రియేట్ చేసి తన కథ సుఖాంతం చేసుకుంటాడు. 

        ఏ కామెడీ జానర్ కైనా ఇదే స్ట్రక్చర్ వుంటుంది. మిగతా జానర్లకి లాగే ఇక్కడా ప్లాట్ పాయింట్ -1 ప్రాణం. పైన వివరించుకున్నట్టు ఈ ప్లాట్ పాయింట్ -1 తో వచ్చే బ్యాక్ డ్రాప్ ఎంత సీరియస్ గా వుంటే అంత బలంగా కామెడీ వర్కౌట్ అవుతుంది. లేని పక్షంలో ఒట్టి జోకులతో కాలం గడపాల్సి వస్తుంది.  ఫాంటసికల్ కామెడీ ‘సోగ్గాడే చిన్ని నాయనా’ లో  చిన్న నాగార్జున- లావణ్యలు విడాకుల కోసం రావడం సీరియస్ బ్యాక్ డ్రాప్. ‘స్వామిరారా’ అనే కామిక్ థ్రిల్లర్ లో వినాయక విగ్రహ అపహరణ అనే బ్యాక్ డ్రాప్ కూడా సీరియస్ ఐనదే. ‘బృందావనం’ అనే ఫ్యామిలీ కామెడీలో రాజేంద్ర ప్రసాద్ తాతా నానమ్మ లైన గుమ్మడి, అంజలీదేవిల భవంతిని రమ్యకృష్ణ  తండ్రి సత్యనారాయణ చీట్ చేసి కొట్టేయడం కూడా సీరియస్ బ్యాక్ డ్రాపే. ‘సుడిగాడు’ లో అల్లరి నరేష్ పుట్టినప్పుడు జయప్రకాష్  రెడ్డి కొడుకు మీద మూత్రం పోస్తే  అతను చనిపోయి అల్లరి నరేష్ మీద జయప్రకాశ్ రెడ్డికి పగ రగలడమూ సీరియస్ బ్యాక్ డ్రాపే...కామెడీకి బాగా వర్కౌటయ్యే ఈ సీరియస్ బ్యాక్ డ్రా పుల విషయంలో గుర్తు పెట్టుకోవాల్సింది ఒక్కటే : ఇక్కడ ఏర్పడే ప్లాట్ పాయింట్ -1 మాత్రం సీరియస్ గా ఉండకూడదు. పాత్రలు కామెడీ గానే ప్రవర్తించాలి- పైన ‘అహ నా పెళ్ళంట’ లో  పేర్కొన్న తండ్రీ కొడుకుల సవాళ్ళ లాగా!

        కామెడీ కథనం డైనమిక్స్ ప్రధానంగా సాగుతుంది. జూలో కంచె  దూకి పులితో సేల్ఫీ దిగి వచ్చిన అఖిలేష్ విజయగర్వంతో యూరినల్స్ కి వెళ్తే అక్కడ పులి వుండడం రివర్స్ మెకానిజంతో ఏర్పడే డైనమిక్స్. నవ్వొచ్చే విధంగా, ప్రేక్షకుల ఊహకందకుండా, ఆనందం విషాదంగా మారడం, విషాదం ఆనందంగా మారడమనే పంచ్ కామెడీ కథనానికి ప్రాణం. డైనమిక్స్ ఎప్పుడూ పాత్రల కదలికలతో, యాక్షన్ ప్రధానంగా వుంటే మంచిది. పాత్రలు కదలకుండా వున్న చోటే వుండి  డైలాగులతో కామెడీ నడపడం  అన్ని సీన్లకీ పనికి రాదు. ఇలాటి వెర్బల్ కామెడీ వల్ల  నడక మందగిస్తుంది. విజువల్ కామెడీ తో పరుగులు పెడుతుంది కథనం. సినిమా విజువల్ మీడియా అనేది గుర్తుంచుకోవాలి. సినిమా విజువల్ మీడియా  అని గుర్తు పెట్టుకుంటే చాలా సినిమాలు బాగు పడతాయి- ‘ఒక మనసు’ లాంటివి రావు. 

        ఇక కామెడీని ద్వంద్వార్ధాలతో నడపాలా వద్దా అనేది  రచయిత ఇష్టం. కానీ కామెడీ పేరుతో  సమాజంలో ఏ వొక వర్గాన్నీ కించపర్చకుండా వుంటే మంచిది.  అలాగే కామెడీ-హేళన – ఈ రెండిటి పట్ల అప్రమత్తంగా వుండకపోతే ఆత్మరక్షణలో పడక తప్పదు. రాస్తున్న కామెడీ హేళన చేసే విధంగా ఉందేమో సరిచూసుకోవాలి. లేకపోతే తనని రేపైన మహిళ తో పోల్చుకున్న సల్మాన్ ఖాన్ లాంటి పరిస్థితి ఎదురవుతుంది. లేదా లతా మంగేష్కర్ నీ, సచిన్ టెండూల్కర్ నీ పాత్రలుగా చేసి ఘోరమైన సెటైర్లు వేసిన తన్మయ్  భట్ లాంటి చిక్కుల్లో పడక తప్పదు. ఇలాటివి డార్క్ హ్యూమర్ కింద చెల్లిపోవు. ‘అ ఆ’ లో కత్తితో మణికట్టు కోసుకుని ఆత్మహత్యా యత్నం చేసిన సమంతా ని డాక్టర్ ట్రీట్ చేశాక, ‘మీ కిచెన్ లోకి వాడిగా వుండే వేరే కత్తులు కొనండి’  అని కామెడీ ఏదో చేస్తే అదీ  డార్క్ హ్యూమర్ అన్పించుకుంటుంది.
(సమాప్తం)


-సికిందర్ 

1, జులై 2016, శుక్రవారం


దర్శకత్వం : మురళీకృష్ణ ఎం.

తారాగణం :  చేతన్, పార్వతీశం, తేజస్వి, కృతిక, వాసు ఇంటూరి, రాజారవీంద్ర తదితరులు కథ, స్క్రీన్ ప్లే :  మారుతి, మాటలు : రవివర్మ, సంగీతం: జెబి, ఛాయాగ్రహణం : బాల్ రెడ్డి
బ్యానర్ : గుడ్ సినిమా గ్రూప్, నిర్మాత : జి. శ్రీనివాసరావు
విడుదల :  జులై  1,  2016
***
దిల్ రాజు సమర్పణ, మారుతి రచన అనే ఆభరణాలు చూశాక ‘రోజులు మారాయి’ మీద ఆకర్షణ పెరుగుతుంది ఎవరికైనా. ఆ ఆకర్షణని, నమ్మకాన్నీ నిలబెట్టుకోవాలంటే దిల్ రాజుకీ మారుతికీ రోజులు మారినట్టు తాము కూడా మారామనే నమ్మకం  కల్గాలి. అప్పుడే ‘రోజులు మారాయి’  అంటూ తీయడానికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. రోజులు మారిపోయి ప్రపంచం ముందుకు వురుకుతోంది. తాము అక్కడే వుండి పోయి  రోజులు మారాయంటూ మెసేజీలు ఇస్తే అది  శోభాయమానంగా వుంటుందా? నిజంగా ‘రోజులు మారాయి’ అనే టైటిల్  పెట్టుకుని ఆ ప్రకారం తీయగల్గింది  సగం సినిమానే.  మిగతా  సగాన్ని  తాము మారలేక  మారిపోయి కూర్చున్న  ప్రేక్షకుల మీద లాఠీ చార్జి చేసినట్టు తీశారు.

      అసలు తెలుగు  సినిమాలకోసం  రోజులు మారకుండా వుండే ఫైర్ వాల్ సాఫ్ట్ వేర్ ని ఎవరైనా కనిపెడితే బావుణ్ణు.  రోజులు మారిపోవడం తెలుగు సినిమాలకి ప్రాణసంకటంగా మారింది. ఏరువాకా సాగారో అంటూ 1955 నాటి  ‘రోజులు మారాయి’ ఇంకా మారిపోతూ మారిపోతూ వున్న రోజుల్లో కూడా గ్లామర్ ని  పెంచుకుంటూ వుంటే, మారుతి  ‘రోజులు మారాయి’ @ 2016  సినిమాలకి రోజులే కావన్నట్టు గట్టి లక్ష్మణ రేఖ గీసేసుకుంది.
        ఇంతకీ రోజులు మారాయి అని ఎందుకు అనుకుంటున్నట్టు? తెలుసుకుందాం...

కథ
      ఆద్య ( కృత్తిక), రంభ (తేజస్వి) లనే ఇద్దరు కిలాడీ అమ్మాయిలు హాస్టల్లో  వుంటారు. అవసరాల కోసం ఇద్దరితో,  ప్రేమల కోసం మరో ఇద్దరితో తిరుగుతూంటారు. అశ్వథ్  (చేతన్), పీటర్ ( పార్వతీశం) లు ఈ అమ్మాయిల్ని సిన్సియర్ గా ప్రేమిస్తూ వాళ్ళ కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా వుంటారు.  ఆద్య, రంభలకి తాము సిన్సియర్ గా ప్రేమిస్తున్న అసలు బాయ్ ఫ్రెండ్సే  కిలాడీలని  తెలీదు.  

        ఓ రోజు ఓ  బాబా జ్యోతిషం చెప్తాడు. ఒకే  జాతకాలున్న ఆద్య, రంభలు పెళ్లి చేసుకున్న మూడ్రోజుల్లో వాళ్ళ భర్తలు చనిపోతారని హెచ్చరిస్తాడు.  దీంతో ఆందోళనకి గురైన ఇద్దరూ ఒక ఆలోచన చేస్తారు. ముందు తమ చుట్టూ సిన్సియర్ గా తిరుగుతున్న బకరాలు అశ్వథ్, పీటర్ లని  పెళ్లి చేసుకుంటే, మూడ్రోజుల్లో వాళ్ళు చచ్చి పీడా వదుల్తుంది. అప్పుడు తమ బాయ్ ఫ్రెండ్స్ ని చేసుకుని కలకాలం సుఖంగా వుండ వచ్చని పథకం వేస్తారు. పథకం ప్రకారం పెళ్లి చేసుకున్న రెండు రోజులకి కూడా అశ్వథ్, పీటర్ లు చావకపోతే,  మూడోరోజు శోభనం నాడు తామే చంపి పారేసి, ఫాం హౌస్ వాచ్ మన్ విబూధి (వాసు ఇంటూరి) సహాయంతో పాతిపెట్టేస్తారు.  ఇక బాయ్ ఫ్రెండ్స్ ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోతారు. అప్పుడిక ఏం జరిగిందన్నది మిగతా కథ.

ఎలా వుంది కథ
     ఈ రోజుల్లో అమ్మాయిలు ఇలా ఉంటారని చెప్పాలనుకున్నారు. కానీ దీన్ని ఏ జానర్ లో తీసి అలరించాలో నిర్ణయించుకోలేక పోయారు. బకరాలని పెళ్లి చేసుకున్నాక వాళ్ళకి చావు తప్పిపోయే ఘట్టాలవరకూ రోమాంటిక్ కామెడీగా సాగుతున్నది కాస్తా, వాళ్ళని చంపెయ్యడంతో రసభంగమై సీరియస్ క్రైం ఇన్వెస్టిగేషన్ జానర్ గా మారిపోతుంది. అంతలో చనిపోయిన ఇద్దరూ దెయ్యాలై  తిరిగి రావడంతో మరోసారి రసభంగమై, హర్రర్ కామెడీగా మారుతుంది. ఇదికూడా భంగమై మళ్ళీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ జానర్ కి తిరగబెడుతుంది. చివరికి మరో రసభంగంతో, కామెడీలో ఫార్స్ సబ్ జానర్ కిందికి మారిపోయి చప్పగా, అసంతృప్తిగా, చూసింది మొత్తం డొల్లగా అన్పించి ముగుస్తుంది. ఇన్ని రసభంగాలతో శృంగభంగమైంది. ఒక విఫలయత్నంగా మిగిలిపోయింది. కిలాడీ అమ్మాయిల్ని అలాగే కిలాడీ అమ్మాయిలుగా వుంచకుండా, నేరస్వభావాన్ని అద్ది ఖూనీకోర్లుగా మార్చడం వల్ల మొత్తం ‘రోజులు మారాయి’ అనే కాన్సెప్టే  మింగుడు పడకుండా మారిపోయింది. ఇలాటి నేర పథకాలేసే అమ్మాయిలు ఉండొచ్చు. ఎక్కడో అరుదుగా వుంటారు. దాన్ని రోమాంటిక్ కామెడీగానో, హార్రర్ కామెడీగానో తీయలేరు. సీరియస్ క్రైం జానర్ లో డార్క్ మూవీగా తీయాల్సి వుంటుంది, మెయిన్ స్ట్రీమ్ ఎంటర్ టైనర్ గా మాత్రం కాదు. 

ఎవరెలా చేశారు 

        మార్కులన్నీ తేజస్వీ మాదివాడకి పడతాయి. ఆ తర్వాత పార్వతీశానికి పడతాయి. మాటల రచయిత వర్మకి పడతాయి. మారుతికీ, కొత్త దర్శకుడు మురళీ కృష్ణకీ మార్కులు పడవు. సంగీతానికి కూడా పడవు. కెమెరాకి కొంత వరకు మార్కులు పడతాయి. తేజస్వీ మాదివాడ మంచి టాలెంట్ వున్న యువనటి. రంభ పాత్రలో కీలాడీతనం, నటనలో వేగం, హావభావ ప్రదర్శనలో పరిణతి ఆమెకి పెట్టని ఆభరణాలు. దిల్ రాజు సమర్పణ, మారుతి రచన అనే ఆభరణాలు ఆమె ముందు వెలవెలబోతాయి. ఉత్తరాంధ్ర యాసతో, టైమింగ్ తో కామెడీ పండించగల నేర్పున్న వాడు పార్వతీశం. ఇదివరకే ‘కేరింత’ లో ప్రేక్షకులకి ఇలాటి ప్రేమికుడి పాత్రలోనే పరిచయమయ్యాడు. ఇక ‘దృశ్యం’ ఫేం కృతిక సాఫ్ట్ రోల్ లో సున్నితంగా కన్పిస్తుంది. చేతన్ ది పెద్దగా పనిలేని పాత్ర. ఇక ‘ఆద్య’ అనే పేరుని ఆధ్య...ఆధ్య  అని పిలవడం ఎబ్బెట్టుగా వుంది.


చివరికేమిటి 
      రచయితగా మారుతి ఇద్దరు హీరోన్లు పాజిటివ్ గా ఒకరు, నెగెటివ్ గా  ఒకరుగా కొనసాగే డైనమిక్స్ ని పట్టించుకున్నంతగా కథ జానర్ ని పట్టించుకోలేదు. పైన చెప్పుకున్నట్టు ఒక కలగూరగంపలా తయారయ్యింది. తప్పులో కాలెక్కడ పడిందంటే, ఇంటర్వెల్లో హీరో లిద్దర్నీ చంపేసే దగ్గర. ఇది పూర్తిగా రాంగ్ కథా పథకం రోమాంటిక్ కామెడీకి. అందుకే సెకండాఫ్ ని రకరకాల జానర్స్ తో గిమ్మిక్కులు చేస్తూ ఒక లక్ష్యం లేకుండా నడిపారు. ఒక్కమాటలో చెప్పాలంటే సెకండాఫ్ కుప్పకూలింది. హీరోల్ని హీరోయిన్లు చంపేశాక ఏ రకంగానూ రోమాంటిక్ కామెడీ సెకండాఫ్ ని  నడపలేరు, జస్టిఫై చేయలేరు. హీరోయిన్లకి వాళ్ళ చేష్టల్ని  బట్టి బాబా మాటల్ని పట్టుకుని హీరోలని చంపెయ్యాలన్న ఆలోచన రావడంవరకూ, హీరోలు చావడం కోసం రకరకాల విఫయ లత్నాలూ చేయడం వరకూ ఓకే. ఇదంతా కామెడీ కింద వర్కౌట్ అయిపోతుంది. అయ్యింది కూడా. ఫస్టాఫ్ గట్టిగా  నిలబడడానికి ఇదే కారణం. ఎందుకంటే సెకండాఫ్ లోనైనా తాము చేస్తున్నది తప్పని హీరోయిన్లు తెలుసుకుని మనసు మార్చుకుంటారని ప్రేక్షకులు భావిస్తారు. ఎప్పుడైతే హీరోల్ని చంపేశారో సినిమా చచ్చిపోయింది. ప్రేక్షకులూ చచ్చారు. 

        బాబా జోస్యం చెప్పే దృశ్యం సరిగ్గా సినిమా ప్రారంభమైన అరగంట కొస్తుంది. ఇంత త్వరగా బిగినింగ్ విభాగం ముగిస్తున్నందుకు సంతోషిస్తాం. ఇదే సమయంలో, స్టార్ కాస్ట్ కూడా సరిగా లేని,  ఇంత  నూలు దారం లాంటి సన్నని కథని, ఇక్కడ్నించీ మిడిల్ నంతా  చాలా దూరం కుప్పకూలకుండా నడపడం మారుతికి సాధ్యమౌతుందా అన్న సందేహం కూడా వచ్చేస్తుంది. ఈ సందేహమే నిజమైంది. నడపలేమని ఇంటర్వెల్లో హీరోలని మర్డర్ చేసేశారు!  

        బంగారం లాంటి కథని మర్డర్ చేసుకోవడమే రోజులు మారాయనడానికి అర్ధమేమో!   


-సికిందర్ 
http://www.cinemabazaar.in

30, జూన్ 2016, గురువారం

షార్ట్ రివ్యూ!






రచన –దర్శకత్వం : చేరన్ 

తారాగణం : శర్వానంద్, నిత్యా మీనన్, సంతానం, ప్రకాష్ రాజ్ తదితరులు
సంగీతం : జివి ప్రకాష్ కుమార్, ఛాయాగ్రహణం :  సిద్దార్థ్  
బ్యానర్ : బృందావన్ పిక్చర్స్ , నిర్మాత : డి. ప్రతాప్ రాజు
విడుదల : 25 జూన్, 2016
***
ర్వానంద్ నటించిన ద్విభాషా చలనచిత్రం ‘రాజాధిరాజా’ మొత్తానికి విడుదలయ్యింది. చేరన్ దర్శకత్వంలో నిత్యా మీనన్ తో కలిసి నటించాడు. చేరన్ గతంలో ‘ఆటోగ్రాఫ్’ అనే హిట్  తీశాడు. చేరన్ కి ఆటోగ్రాఫులు, బయోగ్రఫీలు, డైరీలూ అంటే బాగా ఇష్ట మున్నట్టుంది.జేకే  ఎనమ్ నాన్ బనిన్ వళక్కాయ్’  అని ‘రాజాధి రాజా’  తమిళ వెర్షన్ కి టైటిల్ పెట్టాడు. అంటే ‘నా మిత్రుడు జేకే జీవితం’ అని అర్ధం. ఎవరా మిత్రుడు? ఏమిటా జీవితం?...ఒకసారి తెలుసుకుందాం.
కథ???
      ఐటీ ప్రొఫెషనల్ జయకుమార్ (శర్వానంద్) ఫ్రెండ్స్ తో కలిసి విచ్చలవిడిగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తూంటాడు. అలాంటిది అకస్మాత్తు గా బుద్ధిమంతుడై పోతాడు. సీరియస్ గా ఇంటిని పట్టించుకోవడం మొదలెడతాడు. రిటైర్ అయిన తండ్రి, తల్లి, ఇద్దరు పెళ్లి కావాల్సిన చెల్లెళ్ళు, ఒక చదువుకుంటున్న తమ్ముడూ వుంటారు. వీళ్ళందరూ జీవితంలో స్థిరపడడానికి చర్యలు చేపడతాడు. ఉద్యోగం మానేసి ఫ్రెండ్స్ ని కలుపుకుని ఫ్లాట్స్ ని శుభ్రం చేసే క్లీన్ అండ్ గ్రీన్ అని కంపెనీ పెడతాడు. రియల్ ఎస్టేట్ లోకి దిగి డూప్లెక్స్ లు కట్టే ప్రణాళిక వేస్తాడు. ఫ్లవర్ బిజినెస్ ప్రారంభిస్తాడు, ఫ్యాషన్ డిజైనింగ్ మొదలెడతాడు. ఈ వ్యాపారాల్లో గర్ల్ ఫ్రెండ్ నిత్య కూడా తోడ్పడుతూంటుంది. వ్యాపారాలు బాగా సాగుతున్నప్పుడు బడా రియల్ ఎస్టేట్ వ్యాపారి రుద్ర (ప్రకాష్ రాజ్) దెబ్బ తీస్తాడు, ఫలితంగా రియల్ ఎస్టేట్ వెంచర్ ని అతడికే తక్కువకి  అమ్ముకోవాల్సి వస్తుంది. ఆ డబ్బుని తనతో పనిచేస్తున్న ఏడుగురు ఫ్రెండ్స్ తో పంచుకుంటాడు. పెద్ద చెల్లెలికి  సంబంధం చూస్తాడు. దానికి పెద్ద మొత్తంలో కట్నం అవసరమేర్పడి మళ్ళీ ఫ్రెండ్స్ దగ్గరే  అప్పుతీసుకుంటాడు. నిత్యకి కార్డియాక్ ఆస్థమా  జబ్బు వుంటుంది. గుండె మార్పిడి చేయాలి. అది కూడా చేయిస్తాడు జేకే. తన కుటుంబానికి ఫ్లాట్ కొని అందులోకి మారుస్తాడు. చెల్లెలి పెళ్లి ఘనంగా చేస్తాడు. ఇంతలో ఒక వూళ్ళో  ఇంకో సమస్య తలెత్తుతుంది. ఆ సమస్య ఎందుకొచ్చిందో నిత్యకి చెప్తాడు. ఆ సమస్య తీరుస్తాడు. తిరిగి వచ్చి కంపెనీల్ని ఫ్రెండ్స్ పేర రాసేసి శాశ్వతంగా విదేశాలకి వెళ్ళిపోతాడు...

        ఎందుకిలా చేశాడు? అసలేం జరిగిందతడికి? జీవితాన్ని విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తున్న వాడు ఎందుకు సీరియస్ గా మారిపోయి ఈ పనులన్నీ చేశాడు? వీటికి సమాధానాలు అతడు గడిపిన విశృంఖల జీవితంలోనే దొరుకుతాయి.
ఎలావుంది కథ  
     దురదృష్టవశాత్తూ కథకీ, గాథకీ ఇంకా తేడా తెలుసుకోలేదు దర్శకుడు చేరన్. కథ అనుకుంటూ గాథలుగా తీసిన అనేక ఫ్లాప్ సినిమాలొచ్చాయి భారీ  ‘బ్రహ్మోత్సవం’ తోబాటు! ఒకదాని తర్వాత ఒకటి కృష్ణ వంశీ తీసిన ‘మొగుడు’, ‘పైసా’ రెండూ  కూడా టాప్ బ్రాండ్ అట్టర్ ఫ్లాప్ గాథలు రికార్డు స్థాయిలో. మనవాళ్ళ సినిమా నాలెడ్జి ఇలా వుంటోంది. చేరన్ అయితే కృష్ణవంశీ రికార్డు కూడా బద్దలు కొడుతూ ఏకంగా ద్విభాషా చలన చిత్రంగా ఈ గాథని తలపెట్టాడు. 2013 లో పూర్తి చేస్తే, 2015 వరకూ తమిళ వెర్షన్ విడుదలే  కాలేదు. చివరికి డీవీడీ లు విడుదల చేసి చేతులు దులుపుకోవాల్సి వచ్చింది. శర్వానంద్- నిత్యామీనన్ -ప్రకాష్ రాజ్ ల వంటి  స్టార్స్  సినిమాకి ఈ పరిస్థితి. ఇక తెలుగు వెర్షన్ కి ‘ఏమిటో ఈ మాయ’  అని తమ మీద తామే జోకు వేసుకుంటున్నట్టు టైటిల్ పెట్టి అమ్మకానికి పెడితే, నలిగినలిగి ‘రాజాధి రాజా’ గా రూపాంతరం చెంది ఇలా విడుదలయ్యింది. దర్శ కులు, హీరోలు, నిర్మాతలూ ఇప్పటికీ ఎందుకిలా జరిగిందో తెలుసుకుంటారా అంటే, అంత నాలెడ్జి ఎక్కడిది? కథ అనుకుంటూ గాథ తీయాల్సిందే, గాథలు తీశాక వాటి తడాఖా చవి చూడాల్సిందే కోట్లు వదిలించుకుని
          కథా గాథా అన్నది పక్కన పెడితే, అసలిందులో విషయం ఎంత పాతది... అనగనగా ఒక హీరో రాము, చాలీ చాలని జీతం, రిటైరైన తండ్రి,  చాకిరీ చేసే తల్లి, పెళ్లి కెదిగి కూర్చున్న చెల్లెళ్ళు, డాక్టరీ చదవాలనుకుంటున్న తమ్ముడూ...వీళ్ళకోసం కుటుంబరావులా  బతుకు బండిని ఈడుస్తూ...బాపతు కథల సినిమాలు  ఇంకానా! ట్రెండ్, బాక్సాఫీసు అప్పీల్, యూత్ అప్పీల్,  మాస్ అప్పీల్ ల వంటి  కమర్షియాలిటీలు పట్టని ‘విషయం’ ఎలా వర్కౌట్ అవుతుందనేది కామన్ సెన్సు కదా? దీనికి తోడు హార్ట్ పేషంట్లు, బ్రెయిన్ ట్యూమర్ పేషంట్లు కూడా వుంటే ఇంకేం  చెప్తాం!
ఎవరెలా చేశారు 
      సీరియస్ వాతావరణంలో అందరూ సీరియస్ గా వున్నప్పుడు చేయడానికి  ఇంకేముంటుంది.  ప్రారంభం నుంచీ ముగింపు వరకూ విషాదాన్ని ఒలకబోస్తూ కన్పించే నటీనటులతో –శర్వానంద్, నిత్యా మీనన్ సహా- ఆఖరికి  కమెడియన్ సంతానంతో  కూడా-ఎక్కడా  రిలీఫ్ అనేది వుండదు. సినిమాలో ఎంటర్ టైన్ మెంట్, కాస్త నవ్వు, మరికాస్త హుషారు అనేవి లేకుండా ప్రవర్తించే నటీనటుల ప్రతిభాపాటవాల గురించి చెప్పుకోవదానికేమీ వుండదు. జివి ప్రకాశ కుమార్ సంగీతం ఇంకో నీరసమైన వ్యవహారం. ఛాయాగ్రహణం, కళా దర్శకత్వం బావున్నాయంటే. 

చివరికేమిటి 
         ‘నా మిత్రుడు జేకే జీవితం’ ద్వారా విచ్చలవిడి జీవితాల్ని  గడిపే యూత్ ఒకనాటికి అనుభవిస్తారని చెప్పడం దర్శకుడి ఉద్దేశం. యూత్ కి పాఠాలు చెప్పే కాలం కాదని మా ఉద్దేశం. కావలసినంత ఎంటర్ టైన్ చేసి వదిలెయ్యాలని బాక్సాఫీసు కూడా విన్నవించుకుంటుంది. బాగా ఖర్చుపెట్టి ఎంత క్వాలిటీతో తీసినప్పటికీ, దర్శకుడికి ఎంత కళా హృదయమున్నప్పటికీ, కాస్త ప్రేక్షకుల్ని కూడా పట్టించుకుని తీస్తే ఇలాటి పరాభవాలు ఎదురుకావు. కుటుంబరావులూ క్యాన్సర్ వ్యాధులూ లాంటి అరిగిపోయిన విషయాలు డైరీల్లో, ఆటో బయోగ్రఫీల్లో మాత్రమే బావుంటాయనేదీ, సినిమాల్లో బావుండవనేదీ  ఇవ్వాళ్ళ కొత్తగా చెప్పుకోవాల్సిన  విషయం కాదు.
స్క్రీన్ ప్లే సంగతులు 
       కథ ఒక ఆర్గ్యుమెంట్ ని ప్రతిపాదిస్తుంది. గాథ ఒక స్టేట్ మెంట్ నిస్తుంది. అనిల్ కుమార్ రోడ్డు మీద పోతూంటే యాక్సిడెంట్ జరిగింది. హాస్పిటల్లో చేరాడు. కాలు ఫ్రాక్చరైందని తేల్చారు. తిరిగి నడవాలంటే కొన్ని నెలలు పడుతుందని చెప్పారు. కొన్ని నెలల తర్వాత తిరిగి ఎప్పటిలా నడవసాగాడు. ఇది గాథ. ఇది ఇలా  స్టేట్ మెంట్ మాత్రంగా వుండిపోతుంది. 

        అనిల్ కుమార్ రోడ్డుమీద పోతూంటే యాక్సిడెంట్ జరిగింది. హాస్పిటల్లో చేరాడు. ఆ వాహనదారుడి మీద కేసు పెట్టాల్సిందే నని  పట్టుబట్టాడు. కోర్టులో కేసు వేశారు. అనిల్ కుమార్ కేసు పోరాడి గెలిచాడు. వాహనదారుడిదే తప్పని తేలింది. అనిల్ కుమార్ కి నష్ట పరిహారం లభించింది. ఇది కథ . ఇది  ఆర్గ్యుమెంట్ ని ప్రతిపాదిస్తోంది. స్టేట్ మెంట్ మాత్రంగా వుండిపోయిన  గాథ ఎంత  చప్పగా వుందో, ఆర్గ్యుమెంట్ ని ప్రతిపాదిస్తున్న కథ అంత  ఆసక్తి కరంగా వుందని తేలుతోంది. ఇందుకే సినిమాలకి పనికొచ్చేది కథలే, గాథలు కాదు. 

        ఇంకోటి గమనిస్తే- గాథకి స్ట్రక్చర్  వుండదు, కథకి వుంటుంది. సినిమాకి స్ట్రక్చరే ముఖ్యం.  గాథలో బిగినింగ్ మాత్రమే వుండి, సాగి సాగి  బిగినింగ్ తోనే ముగుస్తుంది. అందుకని సినిమాకి పనికి రాదు. కథ కి బిగినింగ్ తో బాటు మిడిల్, ఎండ్ కూడా వుండి  సంతృప్తికరంగా ముగుస్తుంది. 

        గాథకి ప్లాట్ పాయింట్స్ వుండవు, కథకి వుంటాయి. కథకి క్యారక్టర్ ఆర్క్ వుండదు, ఎలా వున్న పాత్ర అలా నిస్తేజంగా పడి వుంటుంది. కథకి క్యారక్టర్ ఆర్క్ తో పాత్ర ఉద్విగ్నభరితంగా వుంటుంది. గాథకి టైం అండ్ టెన్షన్ గ్రాఫ్ వుండదు, కథనం నేలబారుగా సాగుతూ వుంటుంది. కథకి టైం అండ్ టెన్షన్ గ్రాఫ్ వుంటుంది, కథనం ఉత్థాన పతనాలతో కట్టి పడేస్తుంది.

        గాథలో సంఘర్షణ వుండదు, సంఘర్షణ లేనిది కథ వుండదు. గాథకి ప్రతినాయక పాత్ర వుండదు, కథకి ప్రతినాయక పాత్ర కీలకం. గాథలు ఆర్ట్ సినిమాలకి బావుంటాయి, కథలు కమర్షియల్ సినిమాలకి బావుంటాయి. 

        ఇవన్నీ ‘రాజాధిరాజా’ సినిమా పొడవునా గమనించవచ్చు. గాథతో జరిగే మోసమేమిటంటే, అది గాథ  అని చాలాసేపటి వరకూ తెలీదు. ఇంకా ప్లాట్ పాయింట్ వన్ వస్తుందనే ఎదురు చూస్తూంటాం. ఎంతకీ రాదు, విశ్రాంతి వచ్చేస్తుంది. అది కూడా ప్లాట్ పాయింట్ వన్ కాదని తేలడంతో అప్పుడు తెలుస్తుంది మోసం. మోసపోయామే అని లేచిపోవడమో లేక,  ఏం చేస్తాం ఖర్మ అనుకుని మిగతాదంతా చూడడమో చేస్తాం.

        ‘రాజాధిరాజా’ లో  మొదటి పదినిమిషాలు హీరో విశృంఖల జీవితాన్ని చూపిస్తారు పాటతో సహా. ఆ తర్వాత అతను ఎందుకో మారిపోయి కుటుంబ బాగు కోసం వ్యాపారాలు పెడుతున్నట్టు  చూపించు కొస్తూంటారు. ఒకదాని తర్వాత ఒకటి కంపెనీలు పెట్టడం, వాటికి  ప్రచారం చేసుకోవడం, కష్టమర్లని ఆకర్షించడం వగైరా- ఇదంతా వివిధ ఉత్పత్తుల యాడ్ ఫిలిమ్స్ చూపిస్తున్నట్టుగా ముప్పావు గంట సేపూ నడిపిస్తారు. అప్పుడు ప్రకాష్ రాజ్ అడ్డుపుల్ల వేయగానే,  హమ్మయ్యా ప్లాట్ పాయింట్ వన్ వచ్చిందని రైలొచ్చినంత సంతోష పడతాం. ఇక ఇద్దరికీ సంఘర్షణ పుట్టి, ఆ పోరాటంతో హీరోకి ఒక గోల్, మనకి కథతో ఆడుకోవడానికి ఒక బాల్ లభిస్తాయని ఆనందపడతాం. ఇదేమీ వుండదు. ప్రకాష్ రాజ్ అడిగింది ఇచ్చేసి వేరే పని చేసుకుంటాడు హీరో. ప్రకాష్ రాజ్ ఇక కన్పించడు. ఇంటర్వెల్ దగ్గర ఒక ఫోన్ ఫస్తుంది హీరోకి- ఆమె అన్నా కాపాడమని వేడుకుంటూ వుంటుంది...

        ఎవరామె? తెలుసుకోవాలంటే సెకండాఫ్ లోకి వెళ్ళాలి. హీరోయిన్ తో హీరో చిత్తూరు జిల్లాకి వెళ్తూ, ఆ కుటుంబానికి తన వల్ల జరిగిన అన్యాయం తాలూకు ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. ఆ ఫ్లాష్ బ్యాక్ లో  సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు, ఈ కుటుంబానికి చెందిన తన కొలీగ్ తో న్యూ ఇయర్ పార్టీకి వెళ్లి వస్తూ యాక్సిడెంట్ చేస్తే అతను చనిపోయాడు. కుటుంబం దిక్కులేనిదనిది. తండ్రికి గుండె హబ్బు వచ్చింది...ఇప్పుడు ఇలా వెళ్లి ఆ కుటుంబానికి బోలెడు డబ్బు ఇస్తాడు హీరో. అ డబ్బుతో పూల తోటలు వేసి తన కంపెనీకి అమ్మమంటాడు. 

        ఇక హీరోయిన్ కి గుండెజబ్బు సీరియస్ అవుతుంది. ఆమెకి గుండె మార్పిడి ఆపరేషన్ చేసి బతికిస్తాడు. ఆమె అతడి మెడికల్ రిపోర్టులు చూస్తుంది. దాంతో అదే ఫ్లాష్ బ్యాక్ లో జరిగిన ఇంకో విశేషం చెప్తాడు హీరో. తన తలకి దెబ్బ తగిలింది. రిపోర్టులో బ్రెయిన్ ట్యూమర్ ఇది వరకే వున్నట్టు తెలిందనీ, యాక్సిడెంట్ తో బ్లడ్ కొద్ది కొద్దిగా వూరుతూ చావుకి దగ్గర చేస్తోందనీ, అందుకే కుటుంబం గురించి ఇంట కష్టపడుతున్నా ననీ అంటాడు. 

        చెల్లెలి పెళ్లి ఇదివరకే చేశాడు, కుటుంబానికి ఫ్లాట్ కొనిచ్చాడు, బోలెడు డబ్బు ఇచ్చాడు, హీరోయిన్ కి ఆపరేషన్ చేయించాడు, కొలీగ్ కుటుంబానికి ఆధారం చూపించాడు, ఇక ఫ్రెండ్స్ అందరికీ కంపెనీలు  రాసేసి, సెలవు తీసుకుని మరణాన్ని ఆహ్వానిస్తూ విదేశాలకి వాలస... ఇంట్లో అసలు విషయం తెలియ నివ్వకుండా...ది ఎండ్.

        గాథ గోదాములోకి, మనం అగాథంలోకి!

-సికిందర్

26, జూన్ 2016, ఆదివారం

రివ్యూ :






రచన- దర్శకత్వం : శశి
తారాగణం : విజయ్ ఆంటోనీ, శాట్నా టైటస్, దీపా రామానుజం, ముత్తురామన్, భగవతీ పెరుమాళ్ తదితరులు.
సంగీతం : విజయ్ ఆంటోనీ, ఛాయాగ్రహణం : ప్రసన్న కుమార్
బ్యానర్ : విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్
నిర్మాత : ఫాతిమా విజయ్ ఆంటోనీ
విడుదల : మే 13,  2016
***
     తమిళ ‘పిచ్చకారాన్’ తెలుగులోకి ‘బిచ్చగాడు’ గా డబ్ అయి గత ఆరు వారాలుగా

విజయవంతంగా భిక్షాటన చేస్తూ వసూళ్లు సాధించుకుంటోంది. దీనిముందు చాలా తెలుగు సినిమాలు వెలవెలబోయాయి, బోతున్నాయి, అవబోతున్నాయి. గత సంవత్సరం మార్చిలో ‘డాక్టర్ సలీం’ అనే తమిళ డబ్బింగ్ తో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న విజయ్ ఆంటోనీ ‘బిచ్చగాడు’ తో ఇంకోసారి హీరోగా వచ్చాడు. హీరోగా 6 సినిమాలు,  గాయకుడిగా 23 సినిమాలు, సంగీత దర్శకుడిగా 31 సినిమాల అనుభవమున్న ఆంటోనీ, ‘బిచ్చగాడు’ డబ్బింగ్ తో తెలుగు బయ్యర్లకి కోటాను కోట్ల లాభాలు తెచ్చిపెట్టాడు.  

          ఇంతగా ఆకర్షిస్తున్న ‘బిచ్చగాడు’ ప్రత్యేకత ఏమిటంటే, ఇది పక్కా కమర్షియల్ సినిమానే, కానీ రొటీన్ కమర్షియల్ కాదు- సమాంతర సినిమాల్ని తలపించే వాస్తవికతా ధోరణులు కలగలిసిన కమర్షియల్. భిక్షాటన వృత్తి లాంటి  కమర్షియలేతర కథావస్తువుని తీసుకుని దానికి కమర్షియల్ హంగుల్ని అద్దడం. 2007 లో మధుర్  భండార్కర్ ఇలాటిదే సబ్జెక్టుతో హిందీలో ‘ట్రాఫిక్ సిగ్నల్’ అనే విజయవంతమైన క్రాసోవర్ సినిమా తీసిన విషయం గుర్తుండే వుంటుంది. ఐతే ఒక రెగ్యులర్ కమర్షియల్ హీరోని  ‘బిచ్చగాడు’ గా చూపిస్తూ ఇప్పుడు తమిళ దర్శకుడు శశి చూపిన ధైర్యానికి  ప్రేక్షకులనుంచి ఇంతగా ఆమోదం లభిస్తోందంటే, ప్రేక్షకులెప్పుడూ  మార్పుని ఆహ్వానిస్తారనే అర్ధం.

కథ 


       పారిశ్రామిక వేత్త భువనేశ్వరి (దీపా రామానుజం) ఏకైక కుమారుడు అరుణ్ (విజయ్ ఆంటోనీ) విదేశాల్లో చదువు పూర్తి చేసుకుని వస్తాడు. ఇక తల్లి బాధ్యతలు అతడికి అప్పజెప్పి రిటైర్ అవుతుంది. అరుణ్ కో  పెద్దనాన్న (ముత్తురామన్) ఉంటాడు. తనకి తక్కువ ఆస్తి ఉందన్న ఏడ్పు ఇతడికి విపరీతంగా వుంటుంది. ఎప్పుడెప్పుడు అరుణ్  వాళ్ళ కంపెనీలు కొట్టేద్దామా అని చూస్తూంటాడు. ఒకరోజు ఆ  టెక్స్ టైల్ మిల్లులో భువనేశ్వరి తీవ్ర ప్రమాదానికి లోనై  కోమాలోకి వెళ్ళిపోతుంది. ఎలాటి వైద్యమూ ఆమె మీద పని చెయ్యదు. ఇలాటి పరిస్థితుల్లో  ఒక స్వామీజీ ఎదురై  ఒక దీక్ష చెయ్యాలని అరుణ్ కి చెప్తాడు. దాని ప్రకారం 48 రోజులు అన్నీ వదులుకుని అతను బిచ్చగాడిలా అడుక్కు తినాలి. తానెవరో ఎక్కడా బయట పడకూడదు. ఇలా చేస్తే తన తల్లి కోలుకుంటుందా అంటే, అది నమ్మకంగా చెప్పలేమంటాడు స్వామీజీ. అదృష్టాన్ని నమ్ముకుని చేయాల్సిందే నంటాడు.  


        తల్లిని బతికించుకోవడం కోసం అరుణ్  సర్వం త్యజించి బిచ్చగాడుగా మారతాడు. అడుక్కుంటూ అవమానాల పాలవుతాడు, తన్నులు తింటాడు. అన్నీ భరిస్తాడు. గుడి మెట్ల దగ్గర నల్గురు బిచ్చగాళ్ళని పరిచయం చేసుకుని వాళ్ళతో కూర్చుంటాడు. వాళ్ళు అడుక్కోవడంలో ట్రైనింగ్ ఇస్తారు. తమ ‘కొంప’ లో ఆశ్రయమిస్తారు. రోజులు గడుస్తూంటాయి.  అరుణ్ కి మహి (శాట్నా టైటస్) అనే అమ్మాయి పరిచయమవుతుంది. ఆమె పిజ్జా హౌస్ నడుపుతూంటుంది.  అతను బిచ్చగాడని తెలీక ప్రేమలో పడుతుంది. ఒకరాత్రి అరుణ్ ఒక మతిస్థిమితంలేని బిచ్చగత్తెని కొందరు రేప్ చేయబోతూంటే కాపాడి మెంటల్ ఆస్పత్రిలో చేరుస్తాడు. ఆ మెంటల్ ఆస్పత్రిలో రోగులమీద  రహస్యంగా ప్రయోగాలు  జరుగుతూంటాయి. ఆమె తప్పించుకుని అరుణ్ కీ విషయం చెప్తుంది. దీంతో ఆ గ్యాంగ్ అరుణ్ ని పట్టుకోవడం కోసం రంగంలోకి దిగుతుంది. వాళ్ళతో కుమ్మక్కయిన పోలీసులూ వెంటపడతారు. ఈ నేపధ్యంలో అరుణ్ తన 48 రోజుల దీక్ష ఎలా పూర్తిచేశాడు, ఇంకా అతడికి ఎదురైన అవరోధాలేమిటి, ఆఖరి క్షణాల్లో ముంచుకొచ్చిన ఉపద్రవాలేమిటీ  అన్నది మిగతా కథ.

ఎలావుంది కథ
      తమిళ సినిమా కథకులు  కాల్పనిక కమర్షియల్ ఫార్ములా కుడ్యాల్ని కొంచెం వదులు చేసి, అందులో కాస్త పచ్చిగా వుండే  జీవితాన్ని నూరిపోయడానికి వెనుకాడరు. ఈ ప్రయత్నంలో ఆ పచ్చి జీవితం డాక్యుమెంటరీలా తయారైనా  సరే, రూల్స్ ని బ్రేక్ చేయడానికీ సందేహించరు. అయితే ఈ డాక్యుమెంటరీ పార్టు యాక్షన్ తో నిండిపోయినప్పుడు దీనికి ప్రేక్షకులకి నచ్చే షుగర్ కోటింగ్ పడిపోయినట్టే. అందుకే తెలుగులో కూడా ప్రేక్షకులు ఈ బిచ్చగాళ్ళ  దయనీయ లోకాన్ని చూడగల్గుతున్నారు. మళ్ళీ ఈ యాక్షన్ షుగర్ కోటింగ్ లో కామెడీలు, డాన్సులు, గ్లామర్  లాంటి కమర్షియల్ ఫార్ములా హంగులు పెట్టాలన్న ఆదుర్దాకి లోనుకాలేదు. ఇదంతా ఒకెత్తయితే- స్థూలంగా ఇది కమర్షియల్ సినిమానే అనుకుంటే- మదర్ సెంటిమెంటుతో ఇదేదో రొటీన్ కథకాదు. మదర్ కోమాలోకి వెళ్ళిపోతే ఆమెని బతికించుకోవడం కోసం, ఒక కోటీశ్వరుడైన కొడుకు బిచ్చమెత్తుకునే దీక్ష బూనే పాయింటే అనూహ్యమైనది. ఇదే మదర్ సెంటిమెంటుని కొత్తదారి పట్టించింది.  అనూహ్యమైన క పాయింట్లు ఎవరి బుర్రలోంచీ పుట్టుకురావు- సొంత బుర్రల్లో  ఎంతసేపూ చూసిన  హిట్టయిన సినిమాల పాయింట్లే పుడతాయి. బయటి ప్రపంచంలోకి బుర్రని తాటించినప్పుడు ఇలాటి కొత్త పాయింట్లు పరిచయమవుతాయి. ఈ సినిమా చివర్లో ఇది యదార్ధంగా జరిగిన సంఘటన అని వెల్లడించాడు దర్శకుడు.  ఆ యదార్థ సంఘటనకి ఇంకా పరిష్కారం దొరకనే లేదట. కానీ ఈ సంఘటనలో, హీరో చేసే ప్రయత్నంలో,  స్పిరిచ్యువల్ టచ్ కూడా వుంది. దీంతో  ప్రేక్షకుల ఆత్మిక దాహం కూడా తీరుతోంది. 

ఎవరెలా చేశారు

      హీరో విజయ్ ఆంటోనీ నటన అనే తన మూడో వ్యాపకంతో కూడా నిలదొ క్కుకోవడానికి తను ఎంచుకుంటున్న పాత్రలే కారణం. పాత్ర బలంగా, విలక్షణంగా,  కాస్త హ్యూమన్ టచ్ తో ఉండేలా చూసుకుంటూ పాత్రోచితంగా నటిస్తే ఏ  హీరో అయినా నిలదొక్కుకోగలడు. విషాద నేపధ్యమున్న ఈ పాత్రలోకి విజయ్ ఆంటోనీ ప్రవేశించిన తర్వాత, ఆద్యంతం ఆ నేపధ్య దృష్టితో  సీరియస్ మూడ్ తోనే నటించాడు తప్ప- పక్కకి జరిగి ఎలాటి కాలక్షేప విన్యాసాలకీ పాల్పపడలేదు. పావు గంటకో యాక్షన్ సీను చొప్పున ఫైట్లు చేసుకుపోతూంటే అదే కమర్షియల్ విలువ! పాత్రోచిత విన్యాసం! సినిమా ప్రారంభమైన పావు గంటకే తల్లిని బతికించు కోవడం కోసం బయల్దేరిన పాత్రగా  ప్రేక్షకులకి  అర్ధమైన తర్వాత, వాళ్ళు కూడా ఇంకెలాటి డాన్సులూ పాటలూ కామెడీ ఆశించలేరు. తల్లికోసం ఎన్ని బాధలైనా పడేందుకు సిద్ధపడే నటనతో  చాలా చోట్ల గుండెలు బరువెక్కిస్తాడు. అతను సహజ నటుడు. ప్రేక్షకులని అయస్కాంతంలా తనవైపు లాక్కోగల మాసాకర్షణ వున్న హీరో. 


        కొత్త హీరోయిన్ శాట్నా టైటస్ కూడా అతిసాధారణ అమ్మాయిలా వుండడం ఈ కథకి బాగా తోడ్పడింది. పైగా తను కూడా సహజంగా నటించెయ్య గలదనడానికి - విజయ్ కోటీశ్వరుడని తెలిశాక,  తన ముఖంలో కనబర్చే  రియాక్షన్ తాలూకు సైలెంట్ క్లోజప్ షాట్ ఒక్కటి చాలు.

        ఇక మిగతా పాత్రల్లో బిచ్చ గాళ్ళుగా నటించిన వాళ్ళు  కామెడీ లేని కొరత తీర్చడానికి ఎప్పుడూ రెడీ. దీంతో బాటు ముగ్గురు గ్యాంగ్ పదేపదే బిచ్చగాడి చేతిలో తన్నులు తిని పరువు పోగొట్టుకునే కామెడీకి అక్కడక్కడా తగుల్తూంటారు. తల్లిగా నటించిన దీపా రామానుజం మొదటి పది నిమిషాల తర్వాత కోమాలోనే కంటిన్యూ అయి చివర్లో చలనంలో కొస్తుంది. 

        పాటలు, కెమెరా వర్క్  తగినంత క్వాలిటీతో వున్నాయి. 1999లో వెంకటేష్ తో ‘శీను’  అనే తెలుగు తీసిన 7 సినిమాల దర్శకుడుగా శశికి,  సినిమా మాధ్యమం మీద మంచి పట్టువున్నట్టు గమనించవచ్చు.  


    ఇది రెగ్యులర్ స్క్రీన్ ప్లే కాదు. అయినా కమర్షియల్ స్క్రీన్ ప్లే. ఇందులో పాత్ర- ఆ పాత్ర ఎదుర్కొనే సమస్య- ఆ సమస్యతో సంఘర్షణ- చివరికి పరిష్కారమనే రెగ్యులర్ నడకే  వుంటుంది గానీ, ఇక్కడ సమస్య విలన్ వల్ల ఏర్పడదు, పరిష్కారం కోసం విలన్ తో సంఘర్షించడు హీరో. మరి  విలన్ లేకుండా కథెలా అవుతుంది, ‘రాజాధి రాజా’ లోలాగా అదొక గాథ అవుతుందేమో అనొచ్చు. ఇక్కడ విలన్ మానవ రూపంలో లేడని మాత్రమే చెప్పడం. విధి రూపంలో వుంటుంది.  ఆ విధి తల్లికి సంక్రమించిన కోమా.

        అందుకే ఇది పాత్ర చేసే ప్రయాణం. ఆ ప్రయాణంలో ఎదుర్కొనే కష్టాలు. కష్టాల్ని దాటుకుని  చేరుకునే గోల్. ఆ గోల్ 48 రోజుల బిచ్చమెత్తుకునే దీక్ష పూర్తి చేయడం. ఇందులో దీక్ష పూర్తి చేయకుండా అడ్డుకునే  విలన్లెవరూ లేరు. అతను  దీక్ష చేస్తున్నాడని ఎవరికీ తెలీదు. అలాగే తల్లిని కోమాలోనే చంపెయ్యాలని చూసే విలన్ ఎవడూ లేడు.  కాబట్టి అదృశ్యంగా వుండే విధిని ఓడించేందుకు హీరో చేసే ప్రయాణమే ఇది. మంచి కర్మలు చేస్తే విధి ఓడిపోతుందని చెప్పడమే. ఈ ప్రయాణంలో రకరకాల సందర్భాల్లో రకరకాల పాత్రలు స్టోరీ పాయింటుతో సంబంధం లేకుండా సమస్యల్లో ఇరికిస్తూంటాయి- హింసిస్తూంటాయి- ఓపికని పరీక్షిస్తూంటాయి. బిచ్చమడిగితే దొంగోడనుకుని కొట్టడం, బిచ్చ గత్తెని మెంటల్ ఆస్పత్రిలో చేర్పిస్తే అనుమానించి వెంటాడ్డం, తన దగ్గర డబ్బుందనుకుని దాడి చేసిన దొంగల్ని కొడితే, వాళ్ళు  పగబట్టి ఎల్ల వేళలా గొడవకి దిగడం లాంటివన్నీ విధి పెడుతున్న పరీక్షలే. 

        అంటే డాక్యుమెంటరీల్లో వాడే స్టార్ట్ అండ్ స్టాప్ నడక పద్ధతి అన్నమాట. ఒక సమస్య ఎత్తుకోవడం, దానికి పరిష్కారం చూపి మరింకో సమస్య ఎత్తుకోవడం...ఇలాగన్న మాట. ఈ పద్ధతిలో  ప్రధాన సమస్య చుట్టూ విషయం తిరగదు. అన్నీ విడివిడి సమస్యలే వుంటాయి. కానీ కమర్షియల్ సినిమాలకి ఒక ప్రధాన సమస్య వుండి  తీరాలి. అలా ఒక ప్రధాన సమస్య లేకుండా ఒక్కో విడి విడి సమస్యగా స్టార్ట్ అండ్ స్టాప్ డాక్యుమెంటరీ పద్ధతిలో చూపినందు వల్లే ‘సైజ్ జీరో’, ‘ఆటోనగర్ సూర్య’, ‘టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్’ లాంటి కమర్షియల్స్ ఫ్లాపయ్యాయి.  ఒక్కో సమస్యని చెప్పి ముగిస్తూ ఉండడమంటే చిన్న చిన్న కథలు చెప్పడమే. కానీ కథానికలతో సినిమా వర్కౌట్ కాదు. ఒకే పెద్ద కథ వుండాలి. ‘బిచ్చగాడు’ విషయానికొస్తే ఇక్కడ విడి విడి సమస్యలు- కష్టాలూ ఎదురై అవి ముగిసిపోతున్నా- నేపధ్యంలో ప్రధాన సమస్యంటూ ఒకటుంది. అది విధి- కోమా- తల్లి ని బతికించుకునే  ఒకే పెద్ద కథ, ఒక గోల్. కాబట్టి వర్కౌట్ అయ్యింది. 

        సాధారణంగా పది పదిహేను నిమిషాల్లో బిగినింగ్ ముగించి మిడిల్ కొచ్చే స్క్రీన్ ప్లేలు ఆ తర్వాత రెండు గంటలపాటు మిడిల్ ని లాగలేక చతికిల బడుతూంటాయి. ఎందుకని? అంతసేపూ ఏర్పాటు చేసిన  సమస్య చుట్టూ సంఘర్షణ మొనాటనీ బారిన పడ్డం వల్ల. దీన్ని ‘చక్కిలిగింత’ జయించలేక ఇంటర్వెల్ లోనే చేతులెత్తేస్తే, ‘దొంగాట’ గజిబిజి చేసుకుంటే, ‘క్షణం’ భేషుగ్గా జయించేసింది. కారణం, ఇందులో  బిగినింగ్ పదినిమిషాలే చూపినా ఆ పది నిమిషాల బిగినింగ్ లోనే  అంతర్లీనంగా సెటప్ చేసిన ఒక ప్రధాన  అంశముంది ఆఫ్ స్క్రీన్ లో. దాన్ని  పే-ఆఫ్ చేయక తప్పదు. ఆ ప్రధానాంశం హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్. దీన్ని మిడిల్ విభాగంలో మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకుల ద్వారా పే- ఆఫ్ చేస్తూ పోయారు. దీంతో ఈ మిడిల్లో హీరో పాపని వెతికే సమస్యతో రెండు గంటల పాటు సుదీర్ఘంగా సాగే మిడిల్ మొనాటనీ బారిన పడలేదు. 

        ‘బిచ్చగాడు’ లో మొదటి పది నిమిషాల్లో బిగినింగ్ ముగుస్తూ హీరో బిచ్చగాడుగా మారతాడు. అక్కడ్నించీ  దాదాపు రెండు గంటల సుదీర్ఘ షో సమయాన్ని  ఈ మిడిల్ విభాగం ఆక్రమిస్తుంది. అయితే ఎంత సేపని దీన్ని హీరో కష్టాలతో భర్తీ చేస్తారు. అది మొనాటనీ బారిన పడుతుంది. అందుకే బిగినింగ్ లో  సెటప్ చేసిన అంశాల్ని పే- ఆఫ్ చేసే సీన్లు కూడా మిడిల్ లో కలుపుకుంటూ పోయారు. దీని వల్ల హీరో కష్టాల కథకి మొనాటనీ జాడ్యం పట్టుకోలేదు. బిగినింగ్ లో సెటప్ చేసిన అంశాలు : 1. గ్రూపాఫ్ కంపెనీల  అధిపతిగా తల్లి భువనేశ్వరి గొప్పతనం, 2. కొన్ని కారణాల వల్ల  కంపెనీలని విక్రయించాలని హీరో నిర్ణయించడం, 3. కంపెనీలని  కొట్టేయాలని హీరో పెదనాన్న కుట్రలు పన్నడం మొదలైనవి.

        వీటిని మిడిల్ లో పే-ఆఫ్ చేసుకుంటూ పోయారు. ఇలా చేయవచ్చా అంటే, తప్పకుండా చేయవచ్చు. ఎందుకంటే ‘దొంగాట’ లో లాగా ఇవి మిడిల్ లో పుట్టుకొచ్చిన  అంశాలు కావు. బిగినింగ్ లోనే పుట్టి ముగింపు (పే-ఆఫ్)  కోసం ఎదురు చూస్తున్న సెటప్స్. ‘దొంగాట’ బిగినింగ్ లో పుట్టాల్సిన బిజినెస్ బిగినింగ్ లో పుట్టకుండా మిడిల్లో పుట్టుకొచ్చినందుకే బిగినింగ్- మిడిల్ గజిబిజి అయిపోయాయి. అలాగే ఇటీవలి ‘ఒక్క  అమ్మాయి తప్ప’ లో కూడా బిగినింగ్, మిడిల్  బిజినెస్ లు రెండూ కలగలిసిపోయి గందరగోళ మైపోయింది.  ఈ రెండు సినిమాలూ,  బిచ్చగాడూ పక్కపక్కన పెట్టుకుని చూస్తే  ఈ తేడా తెలుస్తుంది. సినిమాలెందుకు ఫ్లాపవుతాయంటే, ఇలాటి విషయాల్లో సూత్రాలు పాటించ నందుకే.  కానీ  సూత్రాలంటే చాలా మంది దర్శకులకి ఇప్పటికీ – ఇంత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యుగంలో కూడా  - అజ్ఞానంతో కూడుకున్న ఎలర్జీ.

        ‘ బిచ్చగాడు’ బిగినింగ్లో సెటప్ చేసిన మూడు పాయింట్లనీ మిడిల్లో పే- ఆఫ్ చేసుకుంటూ పోతే ఒక సమస్య పరిష్కారమైపోయింది. కోమాలో వున్న తల్లి భువనేశ్వరి గొప్పతనాన్ని చవిచూసిన కార్మికులు,  ఆవిడ కోలుకోవాలని ఊరేగిపుగా రావడం, నిరాహార దీక్షలు చేయడం, బిచ్చమెత్తుకుంటూ వాళ్ళని చూసి, వాళ్లతో మాట్లాడిన అరుణ్ ఇక కంపెనీలని విక్రయించి వీళ్ళకి అన్యాయం చేయకూడదని మనసు మార్చుకోవడం, దీంతో పెదనాన్న కుట్రలు ఆగిపోవడం...ఒక చైన్ రియాక్షన్ లా జరిగిపోతాయి. ఇందుకే కథని కూర్చ కూడదంటారు. కథని అల్లాలి. ఆ అల్లిక ఇంత అందంగా  కనపడాలి. 

        ఇక హీరోయిన్ పాత్ర ప్రవేశం ఇక్కడ బిగినింగ్ లోనే ఇరికిస్తూ జరగాలని లేదు. మిడిల్లో జరుగుతుంది. ఈమె పాత్రకి మూడు కుదుపు లిచ్చారు : బిచ్చగాడని తెలీక ప్రేమించడం, బిచ్చగాడని తెలిశాక సందిగ్ధంలో పడ్డం, ఫలానా కోటీశ్వరుడని తెలిశాక అవాక్కవడం. ఈ మూడు కుదుపుల మధ్యా వాటి తాలూకు కథనం –ప్రేమాయణం కూడా మొనాటనీ బారిన పడకుండా తప్పించుకున్నాయి.


        సుదీర్ఘమైన మిడిల్ విభాగంలో బిగినింగ్ సెటప్స్ ని పే- ఆఫ్ చేసుకుంటూ పోవడం వల్ల,  కథలో  హీరో పాత్ర ప్రయాణానికి ప్రాణం పోసినట్టయ్యింది.


-సికిందర్
         
         
         







24, జూన్ 2016, శుక్రవారం

షార్ట్ రివ్యూ!






రచన- దర్శకత్వం : రామరాజు
తారాగణం :  
నాగశౌర్య, నిహారిక, రావు రమేష్, ప్రగతి,
వెన్నెల కిషోర్, అవసరాల శ్రీనివాస్
సంగీతం : సునీల్ కశ్యప్,  ఛాయాగ్రహణం : రాంరెడ్డి
నిర్మాత : మధుర శ్రీధర్
విడుదల :  24 జూన్, 2016
***
   మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక హీరోయిన్ గా పరిచయమవుతున్న సినిమా అంటూ విపరీత ప్రచారం జరిగిన ‘ఒక మనసు’ కి దర్శకుడు రామరాజు. హీరో నాగశౌర్య, నిర్మాత మధుర శ్రీధర్. మొదటి సారిగా నాగశౌర్య సినిమా నాగశౌర్య సినిమా అని కాకుండా ఒక హీరోయిన్ సినిమా అన్నట్టు విడుదలవడం, దీనికి తగ్గట్టు ఇదివరకు నాగశౌర్య సినిమాలకి లేనంత  ఓపెనింగ్స్ రావడం ఈ సినిమా ప్లస్ పాయింట్. దర్శకుడి అదృష్టం. నిహారికతో ఈ సినిమా తీయకపోతే  దర్శకుడికి ఈ స్థాయి గుర్తింపు  కూడా రావడం కష్టం. కానీ ఈ స్థాయి  గుర్తింపుతో, ఈ ఓపెనింగ్స్ తో, తీరా సినిమా కెళ్తే  ఎలా వుంటుంది?

        నిస్సందేహంగా సహన పరీక్షలా వుంటుంది. ట్రెండ్ లో వున్న  ప్రేమ సినిమాల సరళికి దూరంగా, ఎక్కడో  1916 లో తీసిన సినిమాలా వుంటుంది. ఆ నాడు కూడా ఇలా రాసి, ఇలా తీసి వుండరు. అంత పాత మోడల్ ప్రేమలా వుండి, అన్ని  తరగతుల యువ ప్రేక్షకులూ గోల చేసేదిలా వుంటుంది. బెంచి క్లాసు ప్రేక్షకులైతే భరించలేక వెటకారాలు చేసేదిలా వుంటుంది. మెగా హీరోయిన్ తో మోడరన్ ప్రేమ కథ ఉంటుందనుకుంటే,  ఏదో పోయెటిక్ కథంటూ తీసిన దర్శకుడి సొంత కవిత్వాన్ని భరించలేక  హాహాకారాలు చేసేదిలా వుంటుంది. 

          ఈ రోజుల్లో పోయెటిక్ సినిమాలు ఎక్కడ ఎవరు తీస్తున్నారని ఈ సినిమా తీశారో అర్ధం గాదు. పోనీ ఆ పోయెట్రీ కూడా విషయపరంగా విఫలమై- చిత్రీకరణలో బావుంటే సరిపోయిందా? రచన, నటనలు, సంగీతం పోయెటిక్ గా ఉండనవసరం లేదా? కథా కథనాలు, పాత్ర చిత్రణలు అర్ధవంతంగా ఉండనవసరం లేదా? అంత పోయెట్రీ వుంటే ప్రేక్షకులు డైలాగులకి ఫీలవకుండా అంత పగలబడి ఎందుకు నవ్వుతున్నారు. ఈ సినిమాలో ఎక్కడా ఎంటర్ టైన్ మెంట్ అనేదే లేదు. కానీ వచ్చీ రాకుండా రాసిన గ్రాంథిక డైలాగులతో బాగా ఎంటర్ టైన్ చేశారు. ఎందుకు ఇంటర్వెల్ పడిందో అర్ధం గాదు- ఆ విశ్రాంతి దృశ్యం మీద ‘కాలానికి మార్పు వుంది, ప్రేమకి ఉంటుందా?’ అని సిల్లీగా అక్షరాలు వేసినప్పుడే దర్శకుడు ఇంకా ఏ కాలంలో, ఈ స్థాయి ఆలోచనలతో  వున్నాడో తెలిసిపోతుంది. కాలానికి తను అన్నట్టే మార్పు వుంటుంది, తనే మారాల్సిన అవసరముంది ప్రేక్షకుల ఆర్ధిక మానసికారోగ్యాల దృష్ట్యా. 

          అబ్బాయేమో రాజకీయ నాయకుడుగా ఎదగాలని సెటిల్ మెంట్ల దందా  చేస్తూంటాడు. అమ్మాయేమో ప్రభుత్వాసుపత్రిలో డాక్టరు. ఎందుకు ఇలాటి అబ్బాయిని ప్రేమిస్తుందో అర్ధంగాదు. అబ్బాయి జైలుకు పోతాడు. తిరిగి బెయిల్ మీద విడుదలై వచ్చేవరకూ అతడి కోసమే ఎదురు చూస్తుంది. పోనీ అప్పుడైనా పెళ్లి చేసుకుంటారా అంటే అదీ  లేదు. ఇంకా ప్రేమించుకుంటూనే వుంటారు. జైలుకి వెళ్ళక ముందు ఎలా, ఎంత ప్రేమించుకున్నారో అవే డైలాగులతో, అదే రొటీన్ తో ప్రేమించుకుంటూ ప్రేమించుకుంటూ ప్రేమించుకుంటూనే వుంటారు సాగదీస్తున్న రబ్బరులా.   ఈ ప్రేమలో పోయెట్రీ  ఏమిటంటే- పదే  పదే చేతులు పట్టుకోవడాలు, చేతులు రుద్దుకోవడాలు, నుదుటి మీద పదే పదే పదే ముద్దులు పెట్టుకోవడాలు, ఒక లక్షసార్లు గభీల్మంటూ కావిలించుకోవడాలూ, అద్దం  మీద చేతి ముద్రలు వేసుకోవడాలూ...... సీతాకోక చిలుకలు పట్టుకోవడాలు, తామర పువ్వులు తెంపు కోవడాలు, వర్షంలో ఆడుకోవడాల్లాంటి పాత్రోచితం కాని చిన్నపిల్లల చేష్టలూ....సహన పరీక్ష పెడుతూ చాదస్తంగా, చాలా  అమెచ్యూరిష్ గా వుంటుంది పోయెటిక్ విజన్. ‘చెప్పు సూర్య నన్ను ప్రేమిస్తున్నావా’ అంటే, ‘నా ప్రాణం ఉన్నంత వరకూ’ అంటాడు. ఈ స్థాయిలో, కాకపోతే నవ్వొచ్చే ఏదో గాంభీర్యంతో  వుంటాయి ప్రేమ డైలాగులు. చిట్ట చివరికి అబ్బాయి తండ్రి ఒక కండిషన్ పెడతాడు. ఆ కండిషన్ కి లొంగిన అబ్బాయి అమ్మాయికి కటీఫ్ చెప్పేస్తాడు. ఇక ట్రాజడీయే. ఈ రోజుల్లో ట్రాజిక్ ప్రేమ కథ కూడా వర్కౌట్ అవుతుందనుకోవడం దర్శకుడి దూరదృష్టికి నిదర్శనం.   


          కమర్షియాలిటీ లేని స్లో పాటలు ఇంకా సహన పరీక్ష. ఏదో విషాదం జరిగిపోయినట్టు  ఒక్క పెట్టున శోకాలాపనలతో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. ఇంతకీ  ఏ ఆడియెన్స్ ని దృష్టిలోపెట్టుకుని సినిమా తీశాడబ్బా అన్పిస్తుంది. యూత్ ని కాదు- నడివయసు అభిరుచిగల ప్రేక్షకులా? వాళ్ళయినా మెదడు ఇంటి దగ్గర పెట్టి మనసు చేసుకుని ఈ సినిమా చూడాలా? ఏ అభిరుచి కోసం? దేన్ని  ఆస్వా దించడం కోసం? 

          నాగశౌర్య పాత్రలో, నటనలో హుషారు లేదు, పెప్ లేదు, పంచ్ లేదు. పూర్తి పాసివ్ పాత్ర. ఈ పాసివ్ పాత్ర కూడా అర్ధమే గాదు. ఇక నిహారిక కదలకుండా నిలబడి మూతిముడుచుకుని ఉండడమే నటన అనుకున్నట్టుంది. ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ కన్పించవు  తను చైతన్యవంతంగా ఉండక, డల్ గా వుంటుంది. రెండున్నర గంటల సినిమా నడక అంతా నత్త నడక. పైగా ఫ్లాష్ బ్యాక్ లో చెప్పుకొస్తూంటారు. మధ్యమధ్యలో ప్రెజెంట్ లో కొస్తూంటుంది  కథ. కాసేపటికి ఏది ఫ్లాష్ బ్యాకో ఏది ప్రెజెంట్ కథో అర్ధంకాని గజిబిజి ఏర్పడుతుంది. పైగా ఫ్లాష్  బ్యాక్  ప్రారంభం నిహారిక పాయింటాఫ్ వ్యూలో ఆమె చెప్పుకుంటున్న కథలా  ఉంటూ, ఉన్నట్టుండి నాగశౌర్య  తన వాయిసోవార్ తో చెప్పే కథగా మారిపోతూంటుంది మధ్యమధ్యలో. స్ట్రక్చర్, స్క్రీన్ ప్లే, పాత్ర చిత్రణల పట్టింపు అన్నవి ఏ కోశానా కనపడవు. 

          నాగబాబు తన కుమార్తెతో ఇలా రంగ ప్రవేశం చేయించడం కచ్చితంగా తప్పటడుగే తన అపార అనుభవం దృష్ట్యా. నాగబాబు కుమార్తె నుంచి శభాష్ అనుకునే హీరోయిన్ని ఆశిస్తారు, జీరోయిన్ని కాదు. మిగతా తన మెగా వారసులు స్టార్లుగా ఎలా విరగదీస్తున్నారో అలా విరగదీయక పోతే నిహారిక సినిమాల్లోకి రావడం అనవసరమే.


-సికిందర్