రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

25, డిసెంబర్ 2015, శుక్రవారం

మూస మీద దాడి!




దర్శకత్వం : శ్రీ రామ్ ఆదిత్య టి.



తారాగణం : సుధీర్ బాబు, వమిఖా గబ్బి, ధన్యా బాలకృష్ణ, సాయి కుమార్, పోసాని కృష్ణ మురళి, పరుచూరి గోపాల కృష్ణ, చైతన్య కృష్ణ  తదితరులు

కథ- స్క్రీన్ ప్లే : శ్రీ రాం ఆదిత్య టి., మాటలు : అర్జున్- కార్తీక్, సంగీతం : సన్నీ ఎం ఆర్, ఛాయాగ్రహణం : శ్యాందత్  సైనుద్దీన్, నృత్యాలు : చిన్ని ప్రకాష్, సుచిత్రా చంద్రబోస్, విజయ్, కూర్పు : ఎం ఆర్ వర్మ, పోరాటాలు : అన్బరీవ్, రామ్ సుంకర 
బ్యానర్ : 70 ఎం ఎం ఎంటర్ టిన్ మెంట్స్, నిర్మాతలు : విజయ కుమార్ రెడ్డి, శశిధర్ రెడ్డి 
విడుదల : 25 డిసెంబర్,  2015
****



ప్రేమకథా చిత్రం’ తో ఓ మంచి హిట్ సాధించిన సుధీర్ బాబు, మళ్ళీ అలాటి ఒక సక్సెస్ కోసం విఫలయత్నాలు చేస్తున్నప్పటికీ,  కొత్తదనాన్ని ప్రయత్నించడం మానుకోక పోవడం అతడి ప్లస్ పాయింట్. దొంగాట, మోసగాళ్ళకు మోసగాడు, కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ- అనే గత భిన్నమైన మూడు ప్రయత్నాలతో  అపజయాల బాట పట్టినప్పటికీ,  మళ్ళీ ఓ కొత్తదనాన్నే ఆశ్రయించి, కొత్త దర్శకుడ్నే పూర్తిగా నమ్మి,  ‘భలే మంచి రోజు’ తో తిరిగొచ్చాడు. కొత్త దర్శకుడు శ్రీ రామ్  ఆదిత్య న్యూవేవ్  థ్రిల్లర్ గా అందించిన  ఈ తొలి  ప్రయత్నానికి,  ‘స్వామిరారా’  స్ఫూర్తి అన్నట్టు స్పష్టంగా అన్పించినా, ఆ రేంజి సక్సెస్ కి ఇది చేరుకో గల్గిందా లేదా చూద్దాం...

కథ

రామ్ ( సుధీర్ బాబు) అనే నిరుద్యోగి  ప్రేమించిన గర్ల్ ఫ్రెండ్ ( ధన్యా బాలకృష్ణ) మోసం చేసి ఇదే రోజు పెళ్లి చేసుకుంటోందని,  ఆమెని  నాల్గు తన్ని వద్దామని ఫ్రెండ్ (ప్రవీణ్) తో కలిసి బయల్దేరతాడు. దార్లో ఫ్రెండ్ తో వాగ్వాదం తో ఆ కారు వెళ్లి ఇంకో కారుకి డాష్ ఇవ్వడంతో-ఆ కార్లో కిడ్నాపైన ఇంకో పెళ్లి కూతురు సీత ( వమిఖా గబ్బి) కారు దిగి పరారవుతుంది. దీంతో గ్యాంగ్ లీడర్ శక్తి ( సాయికుమార్) రామ్ ఫ్రెండ్ ని బంధించి, ఆ సీతని వెతికి తీసుకొచ్చే బాధ్యత రామ్  మీదేస్తాడు. రామ్ కి ఇద్దరు క్రిమినల్స్ యూసుఫ్- ఆల్బర్ట్ (వేణు- శ్రీరాం) లు  తగుల్తారు. సీత కూడా ఓ చోట తగుల్తుంది. ఈ క్రిమినల్స్ సాయంతో సీతని పట్టుకుని, శక్తి దగ్గరికి తీసుకోస్తూంటే ఇంకో గ్యాంగ్ కిడ్నాప్ చేస్తుంది.. ఏమిటీ  కిడ్నాపులు? మొత్తం ఎన్ని గ్యాంగులు పనిచేస్తున్నాయి? వాళ్ళెవరెవరు? ఒకర్నొకరు ఎందుకు డబుల్ క్రాస్ చేసుకుంటున్నారు? మధ్యలో సీత పెళ్లి కథేంటి? ఒక్క రోజులో ఈ చిక్కులన్నీ ఇందులో ఇరుక్కున్న  రామ్ ఎలా పరిష్కరించాడు- మొదలైన ప్రశ్నలకి సమాధానాలు కావాలంటే మిగతా సినిమా చూడాల్సిందే.

ఎలావుంది కథ
నిన్నటి ‘సౌఖ్యం’ దెబ్బకి ఇహ తెలుగు సినిమా కథంటే భయపడి పారిపోయే పరిస్థితి పరాకాష్ఠ కి  చేరుకున్నాక- ‘భలే మంచి రోజు’ కథ క్రిస్మస్ పండక్కి పండగ మూడ్ ని నాశనం చేయకుండా, ఈ మంచి రోజుని మంచిరోజులాగే ఉంచుతూ కొండంత ధైర్యాన్నిస్తుంది చూసే ప్రేక్షకులకి. ఇదేరోజు మళ్ళీ అవతల ‘మామ మంచు- అల్లుడు కంచు’ చూసే వాళ్ళ పరిస్థితి  వేరు, అదలా ఉంచుదాం. ఒక సహజంగా జరిగే కథ చూడడం ఎవరికైనా మూస సినిమాల నుంచి చాలా రిలీఫ్ నిస్తుంది.  సహజ సంఘటనలు, సహజ క్రిమినల్ పాత్రలు, సహజ కామెడీ, వీటితో థ్రిల్, సస్పెన్స్, వినోదం  కలగలిసి ఫ్రెష్ గా  తయారైన కథ ఇది. ముందే చెప్పినట్టు, ‘స్వామిరారా’ పంథాలో వుంటుంది. అయితే ‘స్వామిరారా’ తో ప్రామిజింగ్ దర్శకుడిగా కన్పించిన  సుధీర్ వర్మ అంతలోనే  రెండో ప్రయత్నం పాత మూస ‘దోచేయ్’ తో ఎంత షాకిచ్చాడో  తెలిసిందే. ప్రస్తుత కొత్త దర్శకుడు అలా కాకుండా ఆ ‘స్వామిరారా’  ప్రమాణాల కోసం- ఆ ఫీల్ కోసం తెగ ప్రయత్నం చేయడం ఇక్కడ తెర నిండా కన్పిస్తుంది.

ఎవరెలా చేశారు
        సుధీర్ బాబు కచ్చితంగా ఇంప్రూవ్ అయ్యాడు. పైగా ప్రారంభం నుంచీ  ముగింపు వరకూ సినిమాని తన భుజాన మోస్తూ ఒక పక్కా యాక్టివ్ క్యారెక్టర్ కి నిదర్శనంగా నిలచాడు. ఫ్రెండ్ కోసం హీరోయిన్ని కిడ్నాప్ చేస్తే, మళ్ళీ తల్లిదండ్రుల కోసం తప్పి పోయిన హీరోయిన్ ని మళ్ళీ పట్టుకునే బాధ్యత కూడా   మీద పడే, నిత్యం కర్తవ్యానికీ- హీరోయిన్ తో నైతిక బాధ్యతకీ  నడుమ  నలిగే పాత్రని  సమర్ధవంతంగా పోషించాడు. గత ఫ్లాపుల బాధ దీంతో తీరిపోవచ్చు.  

పంజాబీ హీరోయిన్ వమిఖా గబ్బీ కి ఇదే తొలి తెలుగు అయినా,  హిందీలో 2007 లో ‘జబ్  వి మెట్’  లో కరీనా కపూర్ చెల్లెలిగా వేసి నప్పట్నించీ వుంది. అంత  గ్లామరస్ కాకపోయినా,  గోదావరి జిల్లా అమ్మాయి పాత్రకి సరిపోయింది. రెండో హీరోయిన్ ధన్యా బాలకృష్ణ కెక్కువ కథలేదు. హీరో తండ్రిగా కార్ల షెడ్డు నడిపే పరుచూరి గోపాల కృష్ణ పాత్ర గమ్మత్తయినది. అలాగే చర్చి ఫాదర్ గా పోసానీ పాత్రకూడా బిన్నమైన కామిక్ పాత్రే. క్లయిమాక్స్ లో  వచ్చి గందరగోళం సృష్టించే పృథ్వీ తో క్లయిమాక్స్ కే బలం పెరిగింది. అయితే ఎంత సేపూ  సినిమాల్ని పేరడీ చేసే పాత్రలే ఆయనకి  దక్కుతున్నాయి. తన కామెడీకి ఇక  రూటు మార్చుకుంటే మంచిదేమో. హీరో చెల్లెలి పాత్రలో విద్యుల్లేఖా  రామన్ కూడా ఫన్నీ పాత్రే. ఓల్డ్ సిటీలో మూతబడ్డ థియేటర్ లో పాత సినిమాలేసుకు ఎంజాయ్ చేసే,  మెయిన్ విలన్ గా సాయికుమార్ దో  భిన్నమైన పాత్రా, నటనా. వీళ్ళందరితో బాటు, జంట క్రిమినల్స్ గా కమెడియన్ వేణు- శ్రీరాంలు సైతం కథని మలుపులు తిప్పుతూ ఎక్కడికో తీసికెళ్ళి పోయే పాత్రలే. ప్రతీ పాత్రా కథలో ఎక్కడో కలిసి కథ పరిధిని పెంచేదే.  ఈ సహజత్వం వల్ల ఇవి గుర్తుండి  పోతాయి.

టెక్నికల్ గా ఈ కథ డిమాండ్ చేస్తున్న మేకింగ్ తో వుంది. ‘ఉత్తమ విలన్’, ‘ విశ్వరూపం’ సినిమాల ఫేం కెమెరా మాన్ శ్యాందత్  సైనుద్దీన్ కలర్స్ తో, లైటింగ్ తో, షేడ్స్ తో ఉత్తమ పనితనం కనబరచాడు. అలాగే ‘స్వామిరారా’ లో లాగా జాజ్ మ్యూజిక్ ని ఫ్యూజన్ చేసిన బాణీలతో సన్నీ ఎం ఆర్ కథ ఫ్లేవర్ తగ్గ ట్రెండీ మ్యూజిక్ ఇచ్చాడు. మిగిలిన ఎడిటింగ్, యాక్షన్, కోరియోగ్రఫీ విభాగాలూ కూడా కథ ఏర్పరచిన చట్రంలోనే పని చేశాయి. పోతే మాటలు రాసిన అర్జున్- కార్తీక్ లు ఈ కామిక్ థ్రిల్లర్ కి చాలా స్పూర్తిదాయకమైన క్రియేటివిటీ ని కనబర్చా రు.

చివరి కేమిటి
కొత్త దర్శకుడు శ్రీరామ్  ఆదిత్యలో మంచి టాలెంట్ వుంది. సినిమాలు చూసే జనంగా యువ ప్రేక్షకులే మిగిలినప్పుడు,  వాళ్ళ అభిరుచిని దృష్టిలో పెట్టుకుని టార్గెట్ చేసిన న్యూవ్ వేవ్ థ్రిల్లర్ ఇది. ఇదయినా ‘స్వామి రారా’ అయినా ‘పల్ప్ ఫిక్షన్’ తో క్వెంటిన్ టరాంటినో పాపులర్ చేసిన తరహా సినిమాలే.  అవలా ఉంచితే,  మొత్తం థ్రిల్లర్ కుండాల్సిన స్పీడు, పెప్, టెంపో లోపించాయి.  షాట్స్ లో కెమెరా స్పీడు కూడా లేదు. అలాగే ఈ కథంతా ఒక్క  రోజులో జరుగుతోందన్న ఫీల్ కూడా తీసుకు రాలేకపోయారు. ఇవన్నీ స్క్రీన్ ప్లే సంగతుల్లో చూద్దాం. ఏమైనా కొత్త దర్శకుడు అప్పుడే పర్ఫెక్టుగా వుండాలని ఆశించలేం. ఈ కొత్త దర్శకుడి మీద విశ్వాసంతో అవకాశమిచ్చిన సుధీర్ బాబు, నిర్మాత లిద్దరూ అభినందనీయులే.


-సికిందర్
(స్క్రీన్ ప్లే సంగతులు రేపు!) 

సౌఖ్యం ఎవరికి?





దర్శకత్వం : ఏఎస్. రవికుమార్ చౌదరి

తారాగణం :  గోపీచంద్ , రేజీనా కాసాండ్రా, బ్రహ్మానందం, షావుకారు జానకి, పృథ్వీ, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్ రెడ్డి, జీవా, రఘుబాబు, కృష్ణ భగవాన్, ముఖేష్ రిషి, ప్రదీప్ రావత్, రాజన్   తదితరులు
సంగీతం : అనూప్ రూబెన్స్, ఛాయాగ్రహణం :  ప్రసాద్ మురెళ్ళ, కథ- మాటలు : శ్రీధర్ సీపాన, స్క్రీన్ ప్లే : కోన వెంకట్- గోపీ మోహన్, కూర్పు : గౌతం రాజు, పోరాటాలు : వెంకట్
బ్యానర్ : భవ్య క్రియేషన్స్, నిర్మాత : ఆనంద్ ప్రసాద్
విడుదల : 24 డిసెంబర్,   2015
       2004 లో గోపీచంద్ తో ‘యజ్ఞం’ తీసి సక్సెస్ అయిన దర్శకుడు ఏ ఎస్ రవికుమార్ దశాబ్దం తర్వాత తిరిగి గోపీచంద్ తో ‘సౌఖ్యం’ తీస్తూ ప్రేక్షకులకి తగిన సుఖశాంతులు ఇద్దామనుకున్నాడు. గత సంవత్సరం సాయి ధరమ్ తేజ్ తో తన సెకండ్ ఇన్నింగ్స్ గా  ‘పిల్లా నువ్వు లేని జీవితం’  అనే హిట్ ఇచ్చిన తను, ఈ సక్సెస్ బాటలో ఈసారి ఏం చేశాడో తెలుసుకుంటే సుఖ శాంతులు  కష్ట సాధ్యంగానే వుంటాయి. శాంతము లేక సౌఖ్యము లేదన్నారు కాబట్టి – గోపీచంద్ కూడా లౌక్యం, శౌర్యం, శంఖం టైటిల్స్ బాటలో ‘సౌఖ్యం’ తో మోజు తీర్చుకోవడం కూడా అయింది. కానీ ‘సౌఖ్యం’ కంటే ముందు  ‘శాంతం’  అని ఒకటి తీసివుంటే వరస బావుండేది. జరిగిందేదో జరిగిపోయిందని ఇప్పటికైనా శాంతం గా ఉండకపోతే ఇకముందు ఎలాటి సౌఖ్యమూ దక్కదని గ్యారంటీగా చెప్పొచ్చు. అంతా గజిబిజిగా వుంది కదూ టైటిల్స్ తో ? కాస్సేపు ఈ టైటిల్స్ గొడవ పక్కన పెట్టి అసలు సంగతేమిటో చూద్దాం...


మళ్ళీ మళ్ళీ  అదే కథ!
చాలా చాలా రిపీట్- రిపీట్- రిపీటెడ్ గా శీను ( గోపీచంద్) పెళ్లవుతున్న ఓ అమ్మాయిని ఎత్తుకెళ్ళి  ఆమె ఇష్ట పడ్డ వేరే పెళ్లి చేసేస్తాడు. వెంటనే రొటీన్ గా పాటేసుకుంటాడు. ఆ వెంటనే  రొటీన్ గా ఓ రౌడీని కొడతాడు. ఆ రౌడీ బావూజీ (ప్రదీప్ రావత్) అనే ముఠా కోరు కొడుకు. తన కొడుకుని కొట్టిన వాణ్ణి చంపుతానని రొటీన్ గా ప్రతిజ్ఞ చేస్తాడు. శీను కి ఇంట్లో పెళ్లి చేయాలనుకుంటారు. ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేక ఏ పెళ్ళీ వద్దంటాడు. ఆ అమ్మాయి శైలజ ( రేజీనా) ని కోలకత్తాలో పవర్ఫుల్  పీఆర్ (రాజన్) అనే అతడి కూతురు. అక్కడి సీఎం కొడుకుతో ఇష్టం లేని పెళ్లి చేస్తోంటే రొటీన్ గా పారిపోయి వచ్చి శీనుతో రొటీన్ గా ప్రేమలో పడింది. ఇప్పుడా తండ్రి గ్యాంగే రొటీన్  గా ఎత్తుకెళ్ళారు. ఈ నేపధ్యంలో బావూజీ కి ఇంకో గొడవ వుంటుంది. రొటీన్ గా శైలజని తన కొడుక్కు చేసుకోవాలని. ఇప్పుడా శైలజని కొలకత్తా లో పీఆర్ ఇంట్లోంచి తీ సుకురావాలంటే చాలా గట్టివాడు కావాలి. ఆ గట్టి వాడుగా రొటీన్ గా శీను ఆఫరిస్తాడు. కొలకత్తా వెళ్లి  శైలజని తీసుకుని రొటీన్ గా పారిపోయి వచ్చి తన ఇంట్లో పెట్టుకుంటాడు. ఇక్కడ్నించీ ఇంకా  -రొటీన్- రొటీన్ – పరమ రొటీన్ గా ఏం జరిగిందనేది ఓపిక మిగిలుంటే వెండితెర మీద చూసుకోవచ్చు.
కథెలా వుంది
        ప్రేక్షకుల మీద చేసిన స్కామ్ లా వుంది. ఏవేవో గొప్ప అంచనాలు కల్పిస్తారు, తీరా చూస్తే సవాలక్ష సార్లు చూసిందే చూపించి, నేడు సినిమా కథల పేరుతో జరుగుతోంది రీసైక్లింగ్ స్కామే తప్ప ఇంకేమీ కాదని చెప్పకుండానే చెప్పేస్తారు. పైన సగం వరకూ చెప్పుకున్న కథని చూస్తే అర్ధమైపోతుంది.  కథెలా వుందో ఇంకా విడమర్చి చెప్పుకోనవసరం లేదు. కథ రాసిన శ్రీధర్ సీపాన అనే రచయిత తన సొంత మస్తిష్కంతో ఏమీ ఆలోచించలేదు. శివమ్, బాద్షా, ఢీ, రెఢీ, పండగ చేస్కో...లాంటి డజన్ల సినిమాల దగ్గర్నుంచీ నిన్నటి ‘లోఫర్’ వరకూ తిరగమోత తాలింపు సినిమాలెన్నో వుండగా- వాటిని దింపెయ్యడానికి పెద్దగా మస్తిష్కం అవసరం లేదు. టాలీవుడ్ లో రైటర్ అనే వాడికి బుర్రే అవసరం లేదు. వచ్చిన ఏ తెలుగు సినిమాలో ఏ సీన్లున్నాయో గుర్తుంటే చాలు. పరీక్షలో అందరూ కలిసి ఒకరి దాంట్లో ఇంకొకరు చూసి మాస్ కాపీయింగ్ కి పాల్పడితే ఆన్సర్ పేపర్లు ఎలావుంటాయో, తెలుగు సినిమాలు అలాటి జిరాక్స్ కాపీల్లా ఉంటున్నాయి, ఇంకా వుంటాయి కూడా.
ఎవరెలా చేశారు
వరైనా చేయడానికి ఏం కావాలి? ఓ కథ, ఓ పాత్ర. ఈ రెండూ లేనప్పుడు గోపీచంద్ పొందిన సౌఖ్య మేమిటో జుట్టు పీక్కున్నా అర్ధంగాదు. మాట్లాడితే ఫైటు, మాట్లాడితే పాట, మధ్యమధ్యలో నాలుగు మాటలు- సెకండాఫ్ ని ఇతర నటీ నటులు పూర్తిగా హైజాక్ చేయడంతో,  ఆ గ్రూపుల  వెనకాల ఎక్కడో- చేష్టలుడిగి చూడ్డంతోనే సరిపోయింది. సెకండాఫ్ లో గోపీచంద్ వున్నట్టే గుర్తుండదు.  క్లయిమాక్స్ లో వచ్చే ఫైట్ కోసం పొంచి వున్నట్టు సీన్లలోంచి  గైర్ హాజరు. ఇలా వుంది హీరోయిజం.
హీరోయిన్ రేజీనా డిటో. ఈ  ఇంట్లోంచి ఆ ఇంట్లోకి, ఆ ఇంట్లోంచి ఈ ఇంట్లోకీ  తనని దాచిపెట్టే వాళ్ళ చేతుల్లో, అడపాదడపా ఎత్తుకెళ్ళే వాళ్ళ హస్తాల్లో పిప్పళ్ల బస్తాలా తయారయ్యింది తప్ప- నటనకి అవకాశం వున్న ఒక్క సీనూ లేదు.
ఇదేదో ఒక మహా ‘పండంటి కాపురం’ అయినట్టు, ఒక మహామహా  ‘దేవుడు చేసిన మనుషులు’ అయినట్టూ సినిమా నిండా తారాతోరణమే. ఎందరెందరో నటీ నటులు. అంతా కలిసి  దర్శకుడు- రచయితా చేసిన స్కామ్ లో తలా ఓ చెయ్యివేసి సాయం పట్టారు. పాపం ఇటీవలే శంకరాభరణం, బెంగాల్ టైగర్ లతో ఎక్కడికో....వెళ్ళిపోయిన మాస్టర్ కమెడియన్ పృథ్వీ కి సైతం జాపిగోల్పే స్థితి. బ్రహ్మానందం, సప్తగిరిలు చెప్పక్కర్లేదు. స్కామ్ అన్నాక బావుకోవడం ఎవరికైనా సాధ్య మవుతుందా?
రచన సైడు స్క్రీన్ ప్లేకి కోన – మోహన్ ద్వయం దోహదం చేశారు.  ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అవసరమా? అది వున్నట్టు అన్పిస్తోందా? హీరో క్యారక్టర్ పాసివ్ గా మారి సోదిలోకి లేకుండా పోయాక, ఎక్కడా సస్పెన్స్, థ్రిల్ అనేవి లేక కథనం నీరసించి పోయాక - దీన్నో డబ్బులు వచ్చే కమర్షియల్ సినిమా స్క్రీన్ ప్లే అందామా – రూపాయి రాని ఆర్ట్ సినిమా అవతారం అందామా? పదే పదే స్టార్స్ పోషించే పాత్రలు పాసివ్ పాత్రలు అవుతున్నాయనే స్పృహ కూడా లేకుండా- గొప్ప గొప్ప కాంబినేషన్స్ తో తీస్తున్న సినిమాలు – నిజానికి కమర్షియల్ ముసుగేసుకున్న ఆర్ట్ సినిమాలంటే నమ్ముతారా?
ఇక మాటలు కూడా రాసిన శ్రీధర్ సీపాన ఇంకా  ప్రాస డైలాగులే – అవి కూడా వచ్చిన సినిమాల్లో పేలిన డైలాగులే రూపం మార్చి దిగుమతి చేసుకోవడం  కూడా స్కామే!
సాంకేతికాల విషయానికొస్తే, కెమేరాతో ప్రసాద్ మూరెళ్ళ కీ, ఎడిటింగ్ తో గౌతమ్ రాజుకీ, పోరాటాలతో వెంకట్ కీ, సంగీతం తో అనూప్ రూబెన్స్ కీ   స్కాము బాధితుల పరిస్థితే. రొటీన్ సినిమాలే కదా అని ఒప్పుకుంటే స్కాములే మిగులుతాయి. రొటీన్ల కాలం పోయింది. స్కామ్ సినిమాల సీజన్ నడుస్తోంది.
చివరికేమిటి?
        ది రవికుమార్ చౌదరి వేసుకోవాల్సిన ప్రశ్న. చాలాకాలం కనుమరుగై,  ‘పిల్లా నువ్వు లేని జీవితం’ అనే హిట్ తో ఆశ్చర్య పరచిన తను- ఆ హిట్ కారణాలని బేరీజు వేసుకున్నట్టు లేదు.  పిల్లా నువ్వు లేని జీవితంలో కథనానికి వాడిన టెక్నిక్కే ఆ సినిమాకి టానిక్. సినిమాలకి ప్రమాదకరంగా పరిణమించే ఎండ్ సస్పెన్స్ ప్రక్రియతో కథనాన్ని - అసలు చివరిదాకా నడిచింది ఎండ్ సస్పెన్స్ కథనమే అని  తెలియకుండా ఇంటర్వెల్ వరకూ, ఆపైన మళ్ళీ క్లైమాక్స్ వరకూ రెండు సార్లు  ఎండ్ సస్పెన్స్ కథనం నడిపి సక్సెస్ అయ్యారు. సినిమాలకి సంబంధించి ఎండ్ సస్పెన్ కథలతో వచ్చే ఇబ్బందుల్ని తొలగిస్తూ ఎప్పుడో 1958 లో బ్రిటిష్ దర్శకుడు మైకేల్ ఆండర్సన్ టు ఛేజ్ ఏ క్రూకెడ్ షాడో అనే బ్లాక్ అండ్ వైట్ థ్రిల్లర్ ద్వారా సెట్ చేసి పెట్టాడు. 1981 లో దీన్నే ధువాఁ గా హిందీలో విజయవంతంగా ఫ్రీమేక్ చేశారు. ఇదే యాదృచ్చికంగా, లేకపోతే  కాకతాళీయంగా పిల్లా నువ్వు లేని జీవితంలోనూ ప్రయోగించి విజయం సాధించారు. లేకపోతే ఎండ్ సస్పెన్స్ కథనాలతో  ‘జాదూగాడు’, ‘ఆ ఒక్కడు’ లాంటివి అనేక తెలుగు సినిమాలు వచ్చి ఫ్లాపయ్యాయి. ఎండ్ సస్పెన్స్ వల్లే ఇటీవల ‘బెంగాల్ టైగర్’ సెకండాఫ్ కూడా బలహీన పడింది.
ప్రస్తుత సినిమాలో రవికుమార్ చౌదరి క్రియేటివిటీ కనుమరుగైపోయింది. స్కామ్ కథే అయినా దాన్ని ఎక్సైటింగ్ గా చెప్పాలన్న ఆలోచనకోడా చేయకపోవడం విచారకరం. ఇంకెన్ని సార్లు సెకండాఫ్ లో కన్ఫ్యూజ్ కామెడీ పెట్టి ప్రేక్షకుల్ని నవ్వించాలనుకుంటారు. మారు వేషాలు వేయించి కామెడీ చేస్తారు? మారువేషాల కామెడీ ఎన్టీఆర్ బ్లాక్ అండ్ వైట్ ల రోజుల్లోనే నడించాయి. ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ పోయి- కలర్ ఫిల్మూ పోయి – డిజిటల్ వచ్చింది. డిజిటల్ లో కూడా పాత మూస డ్రామాలతో చేతనైనంత స్కాములు చేసుకోవడమేనా?

-సికిందర్ 

(స్క్రీన్ ప్లే సంగతులు రేపు! )

24, డిసెంబర్ 2015, గురువారం

టెక్నాలజీని కమ్మేసిన కళ!





రచన- దర్శకత్వం : సంజయ్ లీలా భన్సాలీ

తారాగణం : రణవీర్ సింగ్, దీపికా పడుకొనే, ప్రియాంకా చోప్రా, తన్వీ అజ్మీ, మహేష్ మంజ్రేకర్, వైభవ్ తత్వావ్దీ తదితరులు 
సంభాషణలు :
 ప్రకాష్ కపాడియా, సంభాషణలు-తెలుగు  : మదన్ కర్కే, పాటలు : రామజోగయ్య శాస్త్రి, సంగీతం :సంజయ్ లీలా భన్సాలీ, శ్రేయాస్ పురాణిక్ ఛాయాగ్రహణం : సుదీప్ ఛటర్జీ, కూర్పు : రాజేష్ పాండే శబ్దగ్రహణం : బిశ్వదీప్ ఛటర్జీ, కళ : సలోనీ ధత్రక్, శ్రీరాం అయ్యంగార్, సుజీత్ సావంత్ఆహార్యం : మాక్సిమా బసు, అంజూ మోడీ,పోరాటాలు : శ్యాం కౌశల్, విజువల్ ఎఫెక్ట్స్ : ప్రైమ్ ఫోకస్

బ్యానర్ : సంజయ్ లీలా భన్సాలీ ఫిలిమ్స్
నిర్మాత :
 సంజయ్ లీలా భన్సాలీ
విడుదల :
 18 డిసెంబర్, 2015 
 ***

         వెండి తెర మీద సునాయాసంగా తైలవర్ణ చిత్ర లేఖనాలు చేసే విజువల్ మాంత్రికుడు మరోసారి ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసేందుకు మరోసారి విచ్చేశాడు. మరాఠా చారిత్రకాన్ని మహా దృశ్య- కావ్య వైభవ విలాసంగా మల్చి, హృదయాల్ని మెలితిప్పే  కళాత్మకతతో భావోద్వేగాల సమాహారం చేశాడు. భాండాగారాల్లో  నిక్షిప్తమైపోయిన శతాబ్దాల నాటి ప్రేమచరిత్రకి చిత్రిక పట్టి అజరామరమయ్యే శిల్పంలా చెక్కాడు. బాజీరావు- మస్తానీల స్మృతిని వెనకటి- ఇప్పటి- ఇంకా ముందటి తరాలన్నిటికీ ఒక జ్ఞాపకంలా  దృశ్యమానం చేసిపెట్టాడు.   


        సంజయ్ లీలా భన్సాలీ- ఈ  పేరు వింటేనే  నాటి ఖామోషీదగ్గర్నుంచీ మొన్నటి  రామ్ లీలా’  వరకూ కళ్ళప్పగించి  చూసే అద్భుత, అనిర్వచనీయ  లోకాలే కన్పిస్తాయి. సంగీత సాహిత్య సౌరభాల గుచ్చాలే ఆహ్వానిస్తాయి. అతని విజన్ వేరు, ఆలోచనవేరు, దృశ్య మాధ్యమపు నిర్వచనం పూర్తిగా వేరు. ఒక్కమాటలో చెప్పాలంటే, దేశంలోనే అతణ్ణి  మించిన మహోజ్వల చిత్రరాజాల రారాజు లేడనొచ్చు

        బాలీవుడ్ సూపర్ స్టార్లతో గ్లామరస్ గా బాజీరావు మస్తానీతెలుగు వెర్షన్ తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. గ్లామరస్ గా ఆనడమెందుకంటే, ఇది నిఖార్శయిన ప్రేమ కథ అయినందుకే. అదికూడా అతి సరళంగా చెప్పి పామరుల నుంచీ పండితుల దాకా అందర్నీ సంలీనం చేయగలనందుకే. కింది క్లాసు మాస్ మహాజనులు ఎంత తదాత్మ్యంతో దీన్ని అక్కున జేర్చుకోగలరంటేసౌండ్ మిక్సింగ్ లోపాల వల్ల మొనోలో స్పష్టత కోల్పోయి  సంభాషణలు విన్పిస్తే, పదేపదే అలజడి రేపే దాకా!  మాస్ ప్రేక్షకులు సీరియస్ గా ఇన్వాల్వ్ అయి చూసేందుకు క్లాస్ మాస్ సినిమాలంటూ తేడాల్లేవని తెలిపే దాకా!

       రణవీర్ సింగ్, దీపికా పడుకొనే, ప్రియాంకా చోప్రా ల నట నాట్య భావప్రకటనా  విన్యాస విలాసాలకి  నిజానికి ఇంకా విస్తృత కాన్వాస్ అవసరం. భన్సాలీ కూర్చిన కథాప్రపంచం కూడా కురచనైపోయి-  ఈ ప్రతిభాశాలులు  పాత్రల్లో పాత్రలకి మించి ఎదిగిపోయారు. రాజు కంటే ధర్మం గొప్పదని పలికించిన ఒక సంభాషణలాగాతమ ఇమేజులకంటే పాత్రలు గొప్పవైపోయాయి!

        చరిత్రని భావజాలాల కళ్ళద్దాలతో చూస్తే డాక్యుమెంటరీలు చూసుకోవాలి. చారిత్రక ఆధారాలన్నిటినీ ససాక్ష్యంగా ముందుపెట్టి నిజాయితీని చాటుకోవడం సినిమా లక్షణం కాదు. సినిమా అనేది కళ, డాక్యుమెంటరీ అనేది సమాచారం. చరిత్రని జనబాహుళ్యానికి నాటకీయంగా మల్చి చూపడమే సినిమాకళ కర్తవ్యం. ఆ నాటకీయత అవధులు దాటితే దానికదే ఆ సినిమా అభాసు అవుతుంది. నాటకీయత కోసం కొన్ని సృజనాత్మక స్వేచ్ఛలు తీసుకోవడం కూడా  అవసరం. ఈ సృజనాత్మక స్వేచ్ఛ ఉద్దేశించిన సారాన్ని ఎలా ఎత్తి పట్టిందని మాత్రమేచూడాలి. అలా చూస్తే, భన్సాలీ ఉద్దేశించిన సారం కేవలం ప్రేమకథకి సంబంధించిందైనప్పుడు, పాత్ర రాజకీయ జీవితానికి సంబంధించిన అసంగతాలు అప్రస్తుతమైపోతాయి.

కథ
      18 వ శతాబ్దపు మరాఠా వీరుడు బాజీరావు (రణవీర్ సింగ్) ఢిల్లీ లో మొఘల్ రాజుల్ని పదవీచ్యుతుల్ని చేసి, భారత దేశమంతటా హిందూ రాజ్యాన్ని స్థాపించాలని  యుద్ధాలు చేస్తూంటాడు. ( హిందూ రాజ్యం కంటే మరాఠా రాజ్యం లక్ష్యంగా కొనసాగాడనీ,  అందుకే ఇతర సంస్థానాల రాజులు వ్యతిరేకమయ్యారనీ ఇంకో వాదం వుంది).  ఇలావుండగా,  మరాఠా సామ్రాజ్య చక్రవర్తి ( మహేష్ మంజ్రేకర్), తదుపరి  పీష్వా ( ప్రధాని) గా వారసుడి ఎంపిక కోసం అన్వేషిస్తున్నప్పుడు  బాజీరావు పరీక్షకి సిద్ధపడతాడు. ఆ పరీక్షలో నెగ్గి,  సేనాపతి అవుతాడు. ఈ సమయంలో బుందేల్ ఖండ్ రాజు ఛత్రశాల్ తన రాజ్యాన్ని ముట్టడించ డానికి సిద్ధమైన ముస్లిం సైన్యాలనుంచి కాపాడాల్సిందిగా రహస్య సందేశం  పంపిస్తాడు. ఆ సందేశ హరిణి మరెవరో కాదు, యువరాణి మస్తానీ (దీపికా పడుకొనే). ఈమె  కత్తి యుద్ధంలో, గుర్రపు స్వారీలో, నాట్యంలో, గానంలో అసమాన ప్రతిభగల పడతి. ఆమె కోరడంతో బాజీరావు బుందేల్ ఖండ్ వెళ్లి శత్రువుల్ని సంహరిస్తాడు. ఈ సందర్భంగా మస్తానీ  అతడితో  ప్రేమలో పడుతుంది. బాజీరావు కూడా ప్రేమలో పడిపోతాడు.

        బాజీరావుని  సాగనంపాక, మస్తానీ మనసులో మాట తల్లిదండ్రులకి చెప్తుంది. రాజపుత్ర వంశీయుడైన  బుందేల్ ఖండ్ రాజు ఛత్రశాల్,  రుహానీ బేగం అనే ముస్లిం ని చేసుకున్నాడు ( ఈమె అప్పటి నిజాం దర్బారులో నాట్యగత్తెగా వుండేది). మస్తానీ మాట కాదనలేక ఆమెని బాజీరావు దగ్గరికి పూనా పంపిస్తారు తల్లిదండ్రులు.

        అలా కోటలోకి ప్రవేశించిన మస్తానీకి తెలుసు, బాజీరావుకి కాశీ బాయి ( ప్రియాంకా చోప్రా)  అనే భార్య వుందని. అయినా తెగువతో ఇలా వచ్చేయడంతో బాజీరావు గొప్ప సంయమనం పాటించి ఆమెకి కోటలో స్థానం కల్పిస్తాడు. మొదట నాట్యగత్తె  అనుకున్న మస్తానీ తర్వాత భర్త  ప్రియురాలే  అని తెలియంతో  హతాశురాలవుతుంది కాశీబాయి. బాజీరావు తల్లి ( తన్వీ అజ్మీ), తమ్ముడు (వైభవ్ తత్వావ్దీ)  బాజీరావుకి వ్యతిరేకులవుతారు. రాజపుత్రులు - మొగలులు పెళ్లి సంబంధాలు చేసుకోవడమేమో గానీ, బ్రాహ్మణులైన మేము ఈ సంబంధాన్ని ఒప్పుకోబోమని చెప్పేస్తారు. దీంతో మొదలవుతుంది బాజీ -మస్తానీల ప్రేమలో సంక్షోభం. ఈ ప్రేమ ఇక్కడి నించీ ఏఏ మలుపులు తిరిగి ఏ దరికి చేరిందో ఇక వెండితెర మీద చూసి తరించాల్సిందే.


ఎవరెలా చేశారు.
      బాజీరావుగా రణవీర్ సింగ్ లో ఇంత నటనా పటిమ ఉంటుందని ఎవరూ ఊహించరు. బాజీరావంటే తను తప్ప ఇంకెవరూ వుండరనేంతగా ప్రాణ ప్రతిష్ట చేశాడు. యుద్ధ నైపుణ్యం తెలిసిన వీరుడిగా, కానీ  పరస్త్రీని ప్రేమించకుండా ఉండలేని బలహీనుడిగా- అతివలిద్దరి మధ్యా  సంధి కుదిర్చే తెలివిమంతుడిగా, పోనుపోనూ భగ్నప్రేమికుడిగా, ఇంకాతర్వాత మతిస్థిమితం కోల్పోయిన వాడిగా....రణవీర్ అభినయ చాతుర్యం పాత్రని సజీవం చేసింది. తన భావోద్వేగాల్ని, భావ ప్రకటనల్నీ అమోఘంగా అదుపులో ఉంచుతూ అండర్ ప్లే చేసిన రణవీర్ నటుడిగా ఇంత ఎదిగి ధన్యుడ వుతాడని కూడా ఎవరూ ఊహించరు.

        దీపికా  పడుకొనే మస్తానీ పాత్రని అజరామరం చేసింది. తను వీరనారియే కావొచ్చు,  కానీ ప్రేమలో పడ్డాక సౌమురాలై పోతుంది. అనేక అవమానాల్ని సైతం ప్రేమకోసం ఎదుర్కొనే ధీరత్వం ఆ సహజ వీరత్వం లోంచే వచ్చినట్టు,  తన వీరనారీతనం బెర్పినట్టు లోపలా బయటా సంఘర్షణ తాలూకు ఇరు పార్శాలని సమున్నతంగా ప్రదర్శించింది.

         ఇక ప్రియాంకా చోప్రా ఎలాటి పాత్రనైనా సునాయాసం గా అభినయించేయ గలదని బర్ఫీలోనే నిరూపించింది. ఇప్పుడు కాశీబాయి పాత్ర ఎంత సంక్లిష్ట పాత్రయినా సమర్ధవంతంగా నిర్వహించుకుపోయింది. ఇటు భర్తతో- అటు మస్తానీతో లవ్ –హేట్ రిలేషన్ షిప్ ఆమెది. అయినా మాటల్లో గానీ, చూపుల్లో గానీ పాత్ర  స్థాయినీ, హూందాతనాన్నీ నిలబెడుతూ హృద్యమైన నటనని పోషించింది.
ఈ ముగ్గురూ తమ తమ పాత్రభినయాలతో చిరకాలం మనల్ని వెంటాడుతారు. బాలీవుడ్ కి, ఆ మాటకొస్తే భారతీయ సినిమా తెరకి ఒక పరిపక్వ ప్రేమకథకి శాశ్వత తత్త్వం కల్పించిన స్టార్లు గా గుర్తుండిపోతారు.


భన్సాలీయే సారథి

           న్సాలీ సారధ్యం లేకుండా ఇంత  క్లాసిక్ చారిత్రక  ప్రేమ కథని ఊహించలేం. సంగీతం తనే నిర్వహించాడు,  అది చాలా తోడ్పడింది. చారిత్రక సినిమాలని కూడా టెక్నాలజీ మోజుతో డిజైనర్ చరిత్ర  సినిమాలుగా రుచీ పచీ వుండని కళావిహీన సరుకుగా అమ్మేస్తున్న ఈ రోజుల్లో, ఇలాటి సినిమాల నిర్మాణాలకి భన్సాలీ ఒక పాఠ్య పుస్తకాన్నే  ఇచ్చాడు, చరిత్రతో, చరిత్ర నాటి కాలంతో అతనెక్కడా రాజీ పడలేదు. 18 వ శతాబ్దపు కాలాన్నీ, వాతావరణ పరిస్థితుల్నీ, నిర్మాణాల్నీ, మనుష్యుల్నీ, కళల్నీ, సంగీతాన్నీ అచ్చుగుద్దినట్టు ఆ కాలంలోకి దిగుమతి చేశాడు. మరాఠా  సంస్కృతీ సాంప్రదాయలు ఉట్టిపడే శాస్త్రీయ సంగీత (దేశవాళీ వాద్య  పరికరాలతో) సాహిత్య గుబాళింపు లతో నింపేశాడు.  కాలంలో వెనక్కి  ప్రయాణిం జేయడమంటే ఇదే. ఎక్కడా గ్రాఫిక్స్ చేసినట్టూ అన్పించని అద్భుత కళాఖండాన్ని కళ్ళ ముందు నిలబెట్టాడు. రంగుల్ని కూడా రూపకా లంకారాలుగా  వాడుకున్నాడు. రెండు మతాలకి చెందిన కాషాయ, ఆకుపచ్చ రంగులతోనూ కథ చెప్పాడు, భావాల్నీ చెప్పాడు.  యుద్ధ దృశ్యాల చిత్రీకరణ అయితే ఒక ఆర్టు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటూనే కథా కథనాలనీ, పాత్ర చిత్రణల్నీ అపూర్వంగా, సమర్ధవంతంగా  నిర్వహించుకొచ్చాడు. భారతీయ కమర్షియల్ సిన్మాకి భన్సాలీ ఒక ఆన్సర్.

        ఈ తెలుగు డబ్బింగ్ తో ఇంకో విషయం తేటతెల్ల మవుతోంది. చాలా  సరళమైన  ప్రేమకథని  అంతే సున్నితంగా, ఏ దృశ్య శబ్ద కాలుష్యాలకీ చోటులేకుండా, అదుపు చేసిన భావోద్వేగాలతో ఇంత బలంగానూ  చెప్ప వచ్చనేది. అలాగే  ఇలా బాజీరావు మస్తానీ’,  ‘కంచె’  లాంటి అర్ధవంతమైన క్వాలిటీ కథల సినిమాలు ఇంకో పది వరసగా వచ్చి మీద పడితే- మంచి సినిమాల్ని కుదురుగా కూర్చుని చూడలేని, అభిరుచి పట్టని, రసాస్వాదన తెలీని ఎక్కువ మంది తెలుగు ప్రేక్షకులు పధ్ధతి మార్చుకునే  వీలుంటుంది.


-సికిందర్ 






22, డిసెంబర్ 2015, మంగళవారం

స్మాల్ సెన్స్!






ప్రతి ఏడాదీ సగటున యాభై 
మంది కొత్త దర్శకులు తెలుగులో పరిచయ మవుతున్నారు.  మొత్తం తెలుగు సినిమాల్లో సగం సినిమాలు వీళ్ళే తీస్తున్నారు. ఆ సగానికి సగమూ అపజయాల పాల్జేసి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ కొత్త సంవత్సరంలో ఇంకో యాభై మంది కొత్తగా వస్తున్నారు. వాళ్ళూ ఓ యాభై ఫ్లాపులిచ్చి వెళ్ళిపోతున్నారు. వెళ్లి పోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఓ రెండు శాతమే వుంటుంది. అలా వచ్చి రెండో సినిమా కూడా ఫ్లాపే ఇస్తున్నారు. 2014 లో 70 మంది కొత్త దర్శకులు వచ్చారు. 64 ఫ్లాపులిచ్చారు. 2015 లో కొత్త దర్శకుల సంఖ్య 48 కి తగ్గింది.  వీళ్ళు 39 ఫ్లాపులిచ్చారు. అసలు ఎవరు వీళ్ళంతా,  వీళ్ళతో సినిమాలు తీస్తున్న నిర్మాత లెవరనీ చూస్తే,  నిర్మాతలు కొత్త వాళ్ళు, దర్శకులు కొత్త వాళ్ళే.  ఎన్నాళ్ళ నుంచో స్ట్రగుల్ చేస్తూ ఓ అవకాశం పొందిన వాళ్ళు. కొందరైతే సినిమాలు  తీయడంలో ఏ అనుభవమూ లేకుండానే కొత్త నిర్మాతల్ని పట్టేస్తున్న వాళ్ళు.

అగ్ర నిర్మాతలు తీసే భారీ సినిమాలూ,  పది కోట్ల లోపు సినిమాలు తీసే ఇతర నిర్మాతలూ  మొత్తం  కలిపి తీసేవి ప్రతీ సంవత్సరం ఇరవైకి మించవు. మిగతా లో- బడ్జెట్ చిన్నాచితకా సినిమాలే భారీ సంఖ్యలో  వుంటాయి. ఒక విధంగా ఇవి తీసే కొత్త నిర్మాతలు అంతా పోగొట్టుకుని టెక్నీషియన్లనీ, కార్మికుల్నీ  పోషిస్తున్నట్టే. కానీ థియేటర్లలో క్యాంటీన్ వాళ్ళనీ, పార్కింగ్ వాళ్ళనీ కలెక్షన్లు  లేక తెగ ఏడ్పిస్తూంటారు. ప్రొడక్షన్ రంగంలో అందరికీ కామెడీగా వుంటే, ప్రదర్శనా  రంగంలో అందరికీ ఈ సినిమాలతో ట్రాజెడీయే. పల్లీలమ్ముకునే వాడుకూడా బతకలేడు. ఇదంతా  ఛోటా నిర్మాతల గ్రేట్ టాలీవుడ్ షో గా ప్రతీ సంవత్సరమూ రన్  అవుతూంటుంది సగర్వంగా. ఈ ఛోటా నిర్మాతలకి కావలసినంత  ‘కీ’ ఇచ్చి వదిలేది కొత్త కొత్త దర్శకులు. దీని తర్వాత ఈ నిర్మాతలూ వుండరు, కొత్త దర్శకులూ వుండరు. ఈ వెళ్ళిపోయినా యాభై మంది కొత్త దర్శకుల, కొత్త నిర్మాతల స్థానాన్ని భర్తీ చేస్తూ, ఇంకో యాభై మంది కొత్త నిర్మాతలూ దర్శకులూ వచ్చేసి, ఆ ఏడాదికి ఫ్లాపుల కాష్టాన్ని ఆరకుండా మండించడం మొదలెడతారు. ది షో మస్ట్ గో ఆన్- అన్నట్టు రావణ కాష్టం మండుతూనే వుంటుంది. ఎప్పటికపుడు ఓ యాభై – అరవై చెత్త చెత్త సినిమాలు భస్మీపటలం అవుతూనే  వుంటాయి.



 వీళ్ళు తీస్తున్న  సినిమా లేమిటీ  అని చూస్తే మాత్రం,  నూటికి తొంభై శాతం చెత్త ప్రేమ సినిమాలే. ఒకటీ అరా హార్రరో మరోటో వుంటాయి. ఇవన్నీ  మళ్ళీ ముక్కూ మొహం తెలీని ఆ ఒక్క సినిమాతో ఖతం అయిపోయే కొత్త కొత్త హీరో హీరోయిన్లతోనే  తీస్తారు. ఆ కథలూ బావుండవు, హీరో హీరోయిన్లూ నటించలేరు, దర్శకుడూ సరీగ్గా తీయలేడు.  అర్ధం పర్ధం లేని ప్రేమలు, వాటికి చాలా ఇమ్మెచ్యూర్డ్ కథనాలు, ఇంకా మాటాడితే అవే  మూస ఫార్ములా షోకులూ... ఇవే ఈ నయా దర్శకుల పాలిట యమ పాశా లైపోతున్నాయి.    

        ‘నువ్వు నేను ఒకటవుదాం’ అని ఒక కొత్త దర్శకుడు తీస్తాడు. ఇంకో కొత్త దర్శకుడు ‘గాయకుడు’ అని తీస్తాడు. మరొకతను వచ్చేసి  ‘ భం భోలే నాథ్’ అంటూ ఏదో తీస్తాడు. వీళ్ళ ఉద్దేశంలో ఇలాటి సినిమాలన్నీ చూడాల్సింది యువ ప్రేక్షకులే. కానీ ముక్కూ మొహం తెలీని కొత్త కొత్త  హీరో హీరోయిన్లని యువ ప్రేక్షకులు అసలే కేర్ చెయ్యరని వీళ్ళకి తెలీదు. థియేటర్ వైపు కూడా తొంగి చూడరని తెలుసుకోరు. ఇక ఇవి తీసే కొత్త దర్శకుణ్ణి  ఏ యువ ప్రేక్షకులూ అసలే పట్టించుకోరనీ గ్రహించరు. ఇక తయారైన ఇలాటి సినిమాల్ని ఏ బయ్యరూ కొనడు. మళ్ళీ నిర్మాతలే డబ్బులు పెట్టుకుని విడుదల చేసుకోవాలి. విడుదల చేస్తే ఓపెనింగ్సే వుండవు. డబ్బుల్లేక పోతే విడుదలే కావు. 

        ఇక్కడ కొత్త దర్శకులకి అర్ధం కాని ఇంకో సంగతేమిటంటే, కొత్త కొత్త హీరో హీరోయిన్లని ఏ అగ్ర దర్శకుడో లేదా ఏ ప్రముఖ బ్యానరో  పరిచయం చేస్తే తప్ప యువ ప్రేక్షకుల్లో సినిమాకి గ్లామర్ రాదనేది. ఒకప్పుడు యువప్రేక్షకుల్లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు తేజా,  ఎవర్ని పెట్టి సినిమా తీసినా యువ ప్రేక్షకులు ఎగబడి చూశారు. ఇప్పుడు తేజ క్రేజ్ తగ్గిపోయాక, ఆయన కొత్త వాళ్ళని పెట్టి ఎంత గట్టిగా సినిమా తీసినా ఆయన్నీ, ఆయన ప్రెజెంట్ చేస్తున్న కొత్త హీరో హీరోయిన్లనీ కనీసం కన్నెత్తి చూడడం లేదు యువ ప్రేక్షకులు.  ఇదే కొత్త దర్శకుల విషయంలోనూ జరుగుతోంది. నువ్వే  కొత్తయి నప్పుడు నువ్వు పెట్టే కొత్త మొహాలెవరికి అవసరం? రెండోది
,  యువ ప్రేక్షకులు గ్లామరస్ గా వుండే బిగ్ ఈవెంట్ నే కోరుకుంటారు. ఫీల్డులో పేరున్న కుటుంబాల నుంచి ఏ  కొత్త హీరో వస్తున్నా ఒక గ్లామర్ తో, ఒక సెలెబ్రేషన్ తో మొదట్నించీ దృష్టి పెడతారు యువ ప్రేక్షకులు. వాళ్ళ సినిమాలకి ఓపెనింగ్స్ ఇస్తారు. బావుంటే హిట్ కూడా చేస్తారు.




అంతే  గానీ ఒక కొత్త నిర్మాత ఎవరో వచ్చేసి,  నా కొడుకుని హీరోగా పెట్టి సినిమా తీస్తానని అంటే,  నీ కొడుకెవరు? మెగా స్టార్ వారసుడా? రామానాయుడు మనవడా? అసలు నువ్వెవరు? నీ కొడుకుతో సినిమా తీస్తే ఎవరు విడుదల చేస్తారు? ఎవరు చూస్తారు? ..అనే ఈ ప్రశ్న లేవీ వీళ్ళ మీద పనిచెయ్యవు. ఇలాటి బాపతు వ్యక్తులు కూడా ఈ  మధ్య ఎక్కువైపోయారు. వీళ్ళని చూసి స్వాభిమానం వున్న కొత్త దర్శకులు పారిపోవడమో, వచ్చిన  అవకాశమే గొప్పనుకున్న వాళ్ళు అలాగే పెట్టి ఆ సినిమా చుట్టి పారేసి తప్పించుకోవడమో  చేస్తున్నారు.

ఈ సంవత్సరం  కొత్తగా వచ్చిన దర్శకుల్లో  కిషోర్ కుమార్ ( గోపాల గోపాల), అనిల్ రావిపూడి ( పటాస్), క్రాంతి మాధవ్ ( మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు), నాగ్ అశ్విన్ ( ఎవడే సుబ్రహ్మణ్యం), రాధాకృష్ణ కుమార్ (జిల్).. ఈ ఆరుగురు మాత్రమే సక్సెస్ అవగల్గారు. ( డిసెంబర్ 25 న విడుదల కానున్న ‘భలే మంచి రోజు’ తో మరో కొత్త దర్శకుడు శ్రీరాం ఆదిత్య రిజల్ట్  ఇంకా తేలాల్సి వుంది). ఈ కొత్త దర్శకులందరూ స్టార్స్ తో తీసి సక్సెస్ అయిన వాళ్ళే. అలాగే బాలకృష్ణ తో ‘లయన్’ తీసినప్పటికీ సత్య దేవ్ అనే కొత్త దర్శకుడు రాణించలేక పోయాడు. సుధీర్ తో ‘మోసగాళ్ళకు మోసగాడు’ తీసిన ఏఎన్ బోస్, నారా రోహిత్ తో ‘అసుర’ తీసిన కృష్ణ విజయ్, సుమంత్ అశ్విన్ తో ‘కొలంబస్’ తీసిన సామల ఆర్, కోనవెంకట్ నీడన నిఖిల్ తో ‘ శంకరాభరణం’ తీసిన ఉదయ్ లాంటి కొత్త దర్శకులు ఫ్లాప్ అయితే, సుకుమార్ పంచన ‘కుమారి 21 ఎఫ్’  తీసిన సూర్య ప్రతాప్ హిట్టయ్యాడు. 

ఇక గతంలో కొత్త దర్శకుడుగా ‘రిషి’ అనే ఫ్లాప్ తీసిన రాజ్ మాదిరాజు, మళ్ళీ తిరిగి వచ్చి ఈ సంవత్సరం ‘ఆంధ్రాపోరి’ తీసి రెండో సారి కూడా చతికిలబడ్డాడు. కొత్త దర్శకుడుగా ‘రారా స్వామీ’ అనే న్యూవేవ్ సూపర్ హిట్ తీసి ప్రామిజింగ్ గా కన్పించిన సుధీర్ వర్మ, నాగచైతన్యతో ‘ దోచేయ్’ అనే పాత మూసకి పాల్పడి మోసపోయాడు. ఇంకో కొత్త దర్శకుడు రాజ కిరణ్ తిరిగి రెండో సినిమాతో వచ్చాడు. ఈయన ‘గీతాంజలి’ తో సక్సెస్ అయి, రెండో సినిమా ‘త్రిపుర’ తో ఫ్లాపయ్యాడు.



కొత్త దర్శకులందరికీ పెద్ద అవకాశాలు రావు. ఓ చిన్న బడ్జెట్ సినిమాతో ప్రూవ్ చేసుకుంటే ఫోన్ కాల్స్ రావచ్చు. కానీ ఈ ప్రూవ్ చేసుకునే ఆలోచన ఎంతమంది కొత్త దర్శకులు చేస్తున్నారు. అలాటి ఉన్నతమైన ఆలోచనలు చేస్తే ఏటా యాభై అరవై చిన్న సినిమాల్ని గంగలో ఎందుకు కలుపుతున్నారు. వాటి మొత్తం విలువ ఎన్ని వందల కోట్లు వుంటుంది? వందలాది  కోట్లతో ఏం చూసుకుని ఆటలాడుతున్నారు? పోనీ ఓ ‘కంచె’ లాంటి  భిన్న ప్రయోగం చేసీ చేయరాక, హిందీ లో ఓ ‘తిత్లీ’ లాంటి రియలిస్టిక్ ఫిక్షన్ లాంటిది ప్రయత్నించీ చేతులెత్తేసి, ఈ వందలాది  కోట్ల రూపాయల్నీ  ముంచేస్తున్నారా?  ఇలా చేస్తే ఆ మునిగినా కొత్త దర్శకుడికీ, కొత్త నిర్మాతకీ మంచి పేరైనా వస్తుంది- సోదిలోకి రాని చెత్త ప్రేమకథలే  తీస్తూ కూర్చుంటే  పేరూ డబ్బులూ రెండూ పోతాయి కదా?

గడ్డి పోచ దొరకనట్టు ప్రవాహంలో కొట్టుకు పోవడం కాదు, గడ్డి పోచని కనిపెట్టడం తెలుసుకోవాలి. దాన్ని పట్టుకుని విజయవంతంగా ఒడ్డున పడడం నేర్చుకోవాలి. కొరియన్ సినిమాల కట్ అండ్ పేస్ట్ కృత్రిమ పనులు పనికి రావు, సమాజాన్ని తెలుసుకోవాలి. సమాజంలోకి చూపు సారించినప్పుడు, యూత్ అసలేం కోరుకుంటున్నారో తెలుస్తుంది. అప్పుడు మాత్రమే యూత్ తో కనెక్ట్ అవగల్గి, బలమైన కథాకథనాల్ని సృష్టించగల్గుతారు. కోటి రూపాయలతో తీసిన సిన్మా సొంత క్రియేటివిటీ తో కళకళ లాడితే థియేటర్లు కిటకిట లాడతాయి. ఈ పనికి మనస్కరించని మందబుద్ధులైన కొత్త దర్శకులు, కొత్త నిర్మాతలూ రంగం నుంచి తప్పుకోవాలి. ఏటేటా ఇంత ట్రాష్ తో టాలీవుడ్ సుగంధాల్ని మాత్రం వెదజల్లడం లేదు. 

-సికిందర్