రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

19, జూన్ 2016, ఆదివారం

కామెడీ సంగతులు- 1






సినిమా కామెడీ సీజనల్. ఒక సీజన్ లో ఒక ట్రెండ్ లో ఒకటైపుతో మొదలైన కామెడీ అదేపనిగా  విసుగెత్తే వరకూ రిపీటై అంతరించిపోతుంది. మళ్ళీ ఇంకో టైపు మొదలవుతుంది. కన్ఫ్యూజ్ కామెడీలు, హర్రర్ కామెడీలూ ఇలా వచ్చివెళ్లినవే. ఒకప్పటి వరకూ  కమెడియన్లకే పరిమితమైన  కామెడీ విభాగం – ఏకంగా స్టార్లు కామెడీ చేయడంతో అదో ఫ్యాషన్ గా  కామెడీ విభాగం స్టార్ల హస్తగతమైపోయింది.  కమెడియన్లు అడుక్కి జారిపోయారు. అంతేకాదు, స్టార్లే కామెడీ చేయడంతో అల్లరి నరేష్, సునీల్ లలాంటి కామెడీ హీరోలకీ గడ్డు కాలం వచ్చింది. గతంలో కామెడీ హీరోలు గా రాజేంద్ర ప్రసాద్, నరేష్, చంద్రమోహన్  ల వంటి వాళ్ళు ఎదురులేకుండా  వెలిగిపోయారంటే  అందుక్కారణం  అప్పట్లో హీరోలు కామెడీ చేసే వాళ్ళు కాదు. కమెడియన్ల పని కమెడియన్లు,  వాంప్ ల పని వాంప్ లు చేసుకునే వాళ్ళు. కమెడియన్ల పని స్టార్లూ, వాంప్ ల పని హీరోయిన్లూ చేయడంతో రెండిటి కళాకారులూ గల్లంతయ్యారు. అయితే కామెడీ ఎప్పుడైతే స్టార్ల చేతికి వెళ్ళిపోయిందో, అప్పుడది  కృత్రిమంగా, ఒక టెంప్లెట్ గా, మొక్కుబడి వ్యవహారంగా  మారిపోయింది. 


        ఏ స్టార్ సినిమాలోనైనా స్టార్లు చేసే కామెడీ ఏమిటో ఓసారి చూడండి : ఫస్టాఫ్ అంతా  హీరోయిన్ ని ప్రేమలో పడేసేందుకే కామెడీ చేస్తారు; సెకండాఫ్ లో బ్రహ్మానందం తోనో మరోకరితోనో  బకరా కామెడీ ఏదో చేస్తారు. ప్రధాన కథని మాత్రం యాక్షన్ తో ఉండేలా చూసుకుంటారు. ఒక పూర్తిస్థాయి కామెడీ సినిమాని  స్టార్లు తలపెట్టలేరు. తమ ఇమేజికి తక్కువనుకుంటారు. నిజమే, కామెడీ అనేది నీచ స్థాయి వ్యక్తిత్వాల వ్యవహారమన్నాడు అరిస్టాటిల్. సర్కస్ లో జోకర్, గ్రామాల్లో తుపాకీ రాముడు, తోలు బొమ్మలాటల్లో కేతిగాడు,  జుట్టు పోలిగాడు, ఛార్లీచాప్లిన్ పాపులర్ చేసిన దేశదిమ్మరి పాత్రలూ వాళ్ళ వెకిలి పోకిరీ చేష్టలతో నవ్వించే నీచస్థాయి వ్యక్తిత్వపు పాత్రలే. అందుకని  స్టార్లు గౌరవంగా తమ ఇమేజిని కాపాడుకుంటూ ఓ టెంప్లెట్ కామెడీతో  సరిపెట్టేస్తారు. హిందీలో అప్పుడప్పుడైనా అక్షయ్ కుమార్ లాంటి యాక్షన్ హీరో హీరా ఫేరీ, ఎంటర్ టైన్ మెంట్, షౌకీన్స్, హౌస్ ఫుల్- 3 లాంటి పూర్తి స్థాయి హస్యకథా చిత్రాలు చేస్తూ వస్తున్నాడు. కాబట్టి తెలుగులో కామెడీ సీజనల్ గానూ, స్టార్ల చేతిలో  కంపార్ట్ మెంటలైజ్డ్ గానూ మారిపోయింది. ఫస్టాఫ్ కథతో సంబంధం లేని హీరోయిన్ కోసం కామెడీ, సెకండాఫ్ కూడా కథతో సంబంధంలేని బ్రహ్మానందంతో- కాకపోతే మరొకరితో కామెడీ అనే రెండు టెంప్లెట్స్ ని  పెట్టుకుని కామెడీని లాగించేస్తున్నారు. ఈ రకంగా కామెడీ ట్రాకులుగా ముక్కలయ్యింది. ప్రధాన కథ కామెడీగానూ వుండదు, ప్రధాన కథతో సంబంధం కూడా వుండదు కాబట్టి ఒక్కో ట్రాకు ఒకొక్కరూ అవుట్ సోర్సింగ్ కూడా తీసుకుని రాసెయ్యొచ్చు!

        కామెడీ ఎలా రాయాలో తెలియజేయమని ఒక అసోసియేట్ దర్శకుడు కోరిన మీదట కామెడీ జానర్ లోకి ప్రయాణించడం ప్రారంభిస్తే, రెండు విషయాలు కొట్టొచ్చినట్టు కన్పిస్తున్నాయి : పైన చెప్పుకున్న తరహా స్టార్ల టెంప్లెట్  కామెడీలు మార్కెట్ ని ఆక్రమించడం ఒకటైతే, అసలు పూర్తి స్థాయి హాస్య చిత్రాలనేవి  కనుమరుగైపోవడం రెండోది. ప్రేక్షకులు మొదటి దానికే అలవాటు పడిపోయి, రెండో దాని ఉనికినే గుర్తించడం లేదు. ప్రపంచమొక నాటక రంగమన్నాడు షేక్స్ పియర్. తెలుగు ప్రేక్షకులేమను కుంటున్నారంటే, తెలుగు సినిమాలోక హస్య నాటకరంగమనీ వాటిలో హాస్యం లేకపోతే  చూడలేమనీ అనుకుంటున్నారు. అయితే విచారకరంగా వాళ్ళు వినోదించడానికి ఇష్టపడుతున్నది మాత్రం అర్ధ/అనర్ధ  హాస్య నాటకరంగాన్నే. ఫస్టాఫ్ లో ఒక టెంప్లెట్ కామెడీ, సెకండాఫ్ లో  ఇంకో టెంప్లెట్ కామెడీ, మధ్యలో పిసరంత ఏదో కథ వుంటే చాలు, అదే సినిమా అనుకునే పరిస్థితి వచ్చింది. 

         ఈ వాతావరణ పరిస్థితుల్లో కామెడీ రాయడమెలా అన్న ప్రశ్నే అప్రస్తుతమై
పోతుంది. హీరోయిన్ ని ప్రేమలో పడేసే టెంప్లెట్ కామెడీ రాయడానికి ఏ సూత్రాలూ వుండవు. ఎందుకంటే అదే కథ కాదు కాబట్టి. కథ ప్రారంభ మయ్యేసరికి అది కనుమరుగైపోతుంది కాబట్టి. అది నిర్వహించేది  కేవలం స్పేస్ ఫిల్లర్ పాత్రే  కాబట్టి. కామెడీ చేసి హీరోయిన్ని ప్రేమలో పడేశాడు, అక్కడ్నించీ ఆ ప్రేమ కథేమిటి? అన్నప్పుడు దాన్ని పూర్తిస్థాయి కామెడీ కథగా పొడిగించ వచ్చు. కానీ ప్రేమలో పడేశాక హీరో యాక్షన్ కథ వైపు వెళ్ళిపోతే ప్రేమకథ అక్కడితో ఆగిపోతుంది. ఫస్టాఫ్ లో ఆ కాస్తా అరగంట, ముప్పావుగంట- పోనీ గంట పాటు కథతో సంబంధంలేని టెంప్లెట్ కామెడీ రాయడానికి కావలసినవి రెండే రెండు :  ఎత్తుగడలు, పంచ్  డైలాగులు. ఎత్తుగడలు హీరోయిన్ని పడెయ్యడానికి, పంచ్  డైలాగులు హీరోయిజాన్ని పండించడానికి. ఈ ఆర్నెలల్లో విడుదలైన ‘నేనూ శైలజ’ నుంచీ ‘జంటిల్ మన్’ వరకూ  18 స్టార్ సినిమాలని చూస్తే ఎత్తుగడల, పంచ్  డైలాగుల క్రమం తెలిసిపోతుంది. ఇవన్నీ కొంచెం తేడాతో ఒకేరకంగా వుంటాయి. ఏ స్టార్ సినిమా అయినా  సినిమా మొదలెట్టగానే  హీరోయిన్ని ప్రేమలో పడెయ్యడమనే కార్యక్రమం తప్ప మరో కామెడీతో ప్రారంభంకాదు. ప్రతీ స్టార్ సినిమాలో ఇదే రొటీన్ ని విసుగులేకుండా మనసారా ఆనందిస్తున్న ప్రేక్షకులు ఎంతైనా మహానుభావులే అనుకోవాలి. 

        ఇలా స్టార్లు- ప్రేక్షకులూ కలిసి  కామెడీని  టెంప్లెట్స్ లో చెరబట్టాక, కింకర్తవ్య మేమిటి? పూర్తిస్థాయి హాస్యకథా చిత్రాలు తీయడమే! కామెడీ సినిమాలంటే ఇవే. వీటి దురదృష్టమేమిటంటే ఒకటి : ప్రేక్షకులు వీటి ఉనికినే గుర్తించక పోవడం, రెండు : గుర్తించినా స్టార్ సినిమాల కామెడీల దృష్ట్యా వీటిని  ‘బి’ గ్రేడ్ సినిమాలుగా పక్కన పడెయ్యడం, మూడు : అసలు వీటిని తీసే, రాసే దర్శకులే రచయితలే లేకపోవడం! 

        కాబట్టి కామెడీ రాయడమెలా అన్నప్పుడు ఒక పూర్తి స్థాయి హాస్య కథా చిత్రాన్ని రాయడమెలా అనే అర్ధంలోనే ఆ ప్రశ్నని చూడాలి తప్ప, స్టార్ సినిమాల్లో కరివేపాకు కామెడీ అని కాదు. ఆ దృష్టితో కామెడీని చూస్తే  ఈ వ్యాసాల పరంపర చదివి ప్రయోజనం లేదు. సమీపభవిష్యత్తులో కూడా స్టార్ సినిమాల్లో కామెడీ కథ వుండే అవకాశంలేదు. కథతో సంబంధంలేకుండా, హీరోయిన్ తో ఒక ట్రాకు, కమెడియన్ తో ఒక ట్రాకూ వుంటాయంతే. వీటిని రాయడానికి పెద్దగా క్రియేటివిటీ అవసరం లేదు. ఒక పధ్ధతి అంటూ కూడా ఏమీ లేదు. ఒక పూర్తి స్థాయి కామెడీ కథ రాయడానికే చాలా పద్ధతీ, క్రియేటివిటీ అవసరం. నేర్చుకోవాల్సింది దీన్ని. కానీ ఇది నేర్చుకుని ఏం చేస్తారు? కామెడీ సినిమాలకి కాలం తీరిపోయిందిగా? ఇక్కడే ఇంకో ప్రశ్న వేసుకోవాలి- ప్రేక్షకులు కామెడీ సినిమాలని ‘బి’ గ్రేడ్ సినిమాలుగా పక్కన పడేస్తున్నది నిజంగానే  స్టార్ సినిమాల్లో కామెడీల్ని చూసేనా? లేకపోతే - ఇవివి సత్యనారాయణ, సింగీతం శ్రీనివాస రావు, బాపు, జంధ్యాల, రేలంగి నరసింహారావు, విజయ బాపినీడు, వంశీ, శివనాగేశ్వరరావు ల్లాంటి హస్యకథా  చిత్రాల దర్శకులు ఇప్పుడు లేరనా? 

       కచ్చితంగా ఇది కూడా కారణమే. ఈ శతాబ్దపు ఈ పదహారేళ్ళ కాలంలో కామెడీ సినిమాలతో కొత్తగా వచ్చిన దర్శకులూ రచయితలూ ఎవరూ లేరు. పైన చెప్పుకున్న ప్రసిద్ధ దర్శకుల తరం తర్వాత కొత్త తరంలో హాస్యకథా  చిత్ర దర్శకులెవరూ పుట్టుకురా లేదు. కాలేజీ బూతు కామెడీ దర్శకులు కొందరు పుట్టుకొచ్చి వెళ్ళిపోయారు. ప్రేమల గురించి గొప్ప గొప్ప పాఠాలు చెప్పే ప్రేమ సినిమాల దర్శకులే పుట్టుకు వస్తున్నారు తప్ప- పక్కా కామెడీ దర్శకుణ్ణి  నేనూ అంటూ వచ్చిన వాళ్ళెవరూ లేరు. కామెడీ హీరో అల్లరి నరేష్ ని పెట్టుకుని కూడా సక్సెస్ కాలేకపోయారు. నిజానికి ఏడాదికి 60 -70  మంది కొత్త దర్శకులు ప్రతివాళ్ళూ పనికిరాని ప్రేమ సినిమాలతో కాకుండా, కొందరైనా ఒక ‘అహనా పెళ్ళంట’, ఒక ‘బృందావనం’, ఒక ‘లేడీస్ టైలర్’ లాంటి పూర్తి స్థాయి హస్యకథా చిత్రాలతో వస్తే,  అప్పుడు తెలుగునాట కామెడీ సినిమాలనేవి బతికున్నట్టు లెక్క. ఎక్కడా లేనంత మంది కమెడియన్లు తెలుగులో వున్నారు, వీళ్ళని సరీగ్గా ఉపయోగించుకునే కామెడీ దర్శకులూ రచయితలే లేరు. 

        పైన చెప్పుకున్న హస్యదర్శకుల తరం తర్వాత కొత్త హస్యదర్శకులెలా పుట్టుకు రాలేదో, అలా ముళ్ళపూడి వెంకట రమణ, భమిడిపాటి రాధాకృష్ణ మూర్తి, డివి నరసరాజు, జంధ్యాల, ఆదివిష్ణు, వంశీ, ఎల్బీ శ్రీరామ్ ల వంటి దిట్టమైన హస్యరచయితలు కూడా తర్వాతి తరంలో పుట్టుకురా లేదు. 

        ఇప్పుడేం  చేద్దాం. రంగంలో టెంప్లెట్ కామెడీ కర్తలు తప్ప, పూర్తి నిడివి కామెడీ కథా చిత్రాలకి దశాబ్దంన్నర కాలంగా ఎవరూ మిగలనప్పుడు, ఇటు వైపు ఆసక్తి కనబర్చే వాళ్ళు కూడా లేనప్పుడు, కామెడీ రాయడమెలా అని బుర్రబద్దలు కొట్టుకోవడం అవసరమా? వస్తున్న కొత్త దర్శకుల్ని ఈ పనికిరాని చెత్త ప్రేమ సినిమాలు కాదు, చక్కగా  ఇంటిల్లిపాదీ చూసి పొట్ట చెక్కలు చేసుకునే కామెడీ సినిమాలు తీయమని చెబితే వింటారా? ఎవ్వరూ వినరు.  అవే చెత్త ప్రేమలు తీసి అందరితో బాటూ అదే చెత్త బుట్టదాఖలై పోవడంలోనే పరమానందముంది. టెంప్లెట్ కామెడీలే కామెడీ అని భ్రమిస్తున్న  ప్రేక్షకులు కూడా ఆ భ్రమల్లోనే వుండిపోతారు. జాలిపడ్డం తప్ప మనం చేయగల్గిందేమీ లేదు. ఇదంతా నిరాశావాదం. 

     ఇక ఆశావాదం. నిరాశావాదం మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్న దర్శకులకీ ప్రేక్షకులకీ ఉండొచ్చు గానీ, ఇలాటి రాతలు రాసేవాడికి కాదు. ఆశావాదంతో ఏదో ఒకటి రాస్తూనే వుండాలి కాబట్టి- పైన ప్రస్తావించుకున్న అసోసియేట్ దర్శకుడి కోరికని మన్నించి – కామెడీ ఎలా రాయాలీ అని ఆలోచించక తప్పదు. భవిష్యత్తులో ఎప్పుడో ఎక్కడో ఎవరో ఒకడు దేవుడు దయతల్చి, కామెడీ తీద్దామని నిద్రలేచి చూసుకున్నప్పుడు, ఎదురుగా ఈ రాతలు బంపర్ ఆఫర్ లా కన్పిస్తే చాలన్న ఆశావహ దృక్పథంతో మొదలెడదాం...

        ముందుగా బీ. ఓ మల్లే అనే ఫిలిం మేకర్ అందించిన కామెడీ గణితం ఏమిటో చూద్దాం :
        ఒక నూటా యాభై పేజీల కామెడీ స్క్రిప్టు (డైలాగ్ వెర్షన్) రాశారనుకుందాం. అందులో ఒక్కో పేజీ చదివితే ఎన్ని సార్లు నవ్వొస్తోందో ఆ అంకె ఆ పేజీ కింద రాసుకోవాలి. కొన్ని పేజీల్లో ఎక్కువ సార్లు నవ్వి, కొన్ని పేజీల్లో  అసలే నవ్వురాక పోవచ్చు. ఆ మొత్తమంతా  కూడాలి. ఆ లాఫ్ కౌంట్ 200 వచ్చిందనుకుందాం. దీన్ని స్క్రిప్టులో వున్న పేజీల సంఖ్యతో భాగించాలి. ఈ శేషాన్ని 10 తో గుణించాలి. ఈ ఫలితానికి 5 కలపాలి. మళ్ళీ ఈ ఫలితంలోంచి 30 తీసేయాలి. అప్పుడు మిగిలిందే కామెడీ పవర్. 

        150 పేజీల లాఫ్ కౌంట్ 200 వచ్చిందనుకుందాం, అప్పుడు-
        200
÷ 150 x 10 + 5 - 30 = - 11. 66
        ఈ ఫలితం ఎంత తగ్గితే అంత యౌవనంగా కామెడీ వున్నట్టు.

-సికిందర్
       








17, జూన్ 2016, శుక్రవారం

షార్ట్ రివ్యూ...





స్క్రీన్ ప్లే- మాటలు- దర్శకత్వం : మోహనకృష్ణ ఇంద్రగంటి

తారాగణం : నాని, సురభి, నివేద థామస్, శ్రీనివాస్ అవసరాల, రోహిణి, ‘వెన్నెలకిశోర్, తనికెళ్ళభరణి, ‘సత్యంరాజేష్ తదితరులు
కథ : డేవిడ్ నాథన్, సంగీతం : మణిశర్మ, ఛాయాగ్రహణం : పి.జి.విందా
బ్యానర్ : శ్రీదేవి మూవీస్, నిర్మాత : శివలెంక కృష్ణప్రసాద్
విడుదల :  17 జూన్, 2016
                       ***
            ఎనిమిదేళ్ళ క్రితం ‘అష్టాచమ్మ’ లో నానిని పరిచయంచేసిన మోహనకృష్ణ ఇంద్రగంటి తిరిగి నానితో ‘జంటిల్ మన్’ అనే రోమాంటిక్ సస్పన్స్ జానర్ ని టచ్ చేయడం ఇద్దరికీ కొత్తే. ‘చిన్నోడు –పెద్దోడు’,  ‘ఆదిత్య -369’,  ‘వంశానికొక్కడు’, ‘మిత్రుడు’ వంటి సినిమాలు నిర్మించిన శివలెంక కృష్ణ ప్రసాద్ ఎనిమిదేళ్ళ తర్వాత  ఈ రోమాంటిక్ కి సస్పెన్స్ ని నిర్మించడం తనకీ కొత్త జానరే.  ఖచ్చితంగా ఇలాటి స్క్రిప్టులు తెలుగు రచయితలూ దర్శకుల నుంచి రావు కాబట్టి ఇది డేవిడ్ నాథన్ అనే తమిళ రచయిత  అందించిన స్క్రిప్టు. ఇక చాలా కాలానికి సంగీత దర్శకుడు మణిశర్మ కూడా తన స్వరాలు విన్పించడానికి ముందుకురావడం ఈ సినిమా ఇంకో ప్రత్యేకత. ఇన్ని ప్రత్యేకతలు పెరుకే వున్నాయా, లేకపోతే సినిమా సక్సెస్ అవడానికి ఏమైనా పనికొచ్చాయా ఓసారి చూద్దాం...

కథ 
      కేథీ అలియాస్ కేథరిన్ (నివేదా థామస్), ఐశ్వర్య (సురభి) లు ఫ్లయిట్ లో హైదరాబాద్ వస్తూ పరిచయమవుతారు. ఇద్దరూ ఒకరి బాయ్ ఫ్రెండ్ గురించి ఒకరు చెప్పుకోవడం ప్రారంభిస్తారు. ముందుగా కేథీ చెప్తుంది తన బాయ్ ఫ్రెండ్ గౌతమ్  (నాని) గురించి. మొదటి చూపులోనే తన వెంట పడ్డం ప్రారంభించిన గౌతమ్ ప్రేమలో తనూ పడుతుంది. అయితే తనకో పెళ్లి చేసుకోమని వేధించే మేనమామ వుంటాడు. ఇతను  గౌతమ్ మీద కక్షగడతాడు. ఇక కేథీ గౌతమ్ లు గాఢంగా  ప్రేమించుకున్తున్నాక,  కంపెనీ పనిమీద కేథీ లండన్ వెళ్ళాల్సి  వస్తుంది. నెలరోజుల తర్వాత ఇప్పుడు  తిరిగి వస్తోంది- ఇక గౌతమ్ తో తన భావిజీవితం గురించి కలలుగంటోంది... 

        ఐశ్వర్య  తన బాయ్ గ్రెండ్ జై (నాని ద్విపాత్రాభినయం) గురించి చెప్పుకొస్తూ, అతనో పెద్ద కంపనీకి అధిపతి అనీ, తన తండ్రి అతడితో సంబంధం కుదిర్చాడనీ, దీన్ని పురస్కరించుకుని తామిద్దరూ కొడైకెనాల్ వెళ్లి సరదాగా గడిపి వచ్చామనీ, ఇక ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాక ఎంగేజ్ మెంట్ చేసుకుంటామనీ అంటుంది... 

        ఇద్దరూ ఏర్ పోర్టులో దిగేసరికి రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన గౌతమ్ ని సంతోషంతో చూస్తుంది కేథీ. కానీ గౌతమ్ ఆమె ని గుర్తు పట్టనట్టు ఐశ్వర్యని పలకరిస్తాడు. వాళ్ళిద్దరూ ఆనందంగా కలుసుకుంటారు. అసలేం జరిగిందో తెలుసుకోవడానికి కేథీ గౌతమ్ ఇంటి కెళ్తుంది.  గౌతమ్ తల్లి రోహిణి గౌతమ్ యాక్సిడెంట్ లో చనిపోయాడని చెప్తుంది. కేథీ షాక్ అవుతుంది. అయితే తను ఐశ్వర్యతో చోసింది గౌతమ్ ని కాదనీ, అతను గౌతమ్ లాగే  జైయేననీ అర్ధం జేసుకుంటుంది. ఇంతలో ఒక రిపోర్టర్ వచ్చి గౌతమ్ ని జై చంపి వుంటాడని అనుమానం వెలిబుచ్చుతుంది. అసలు గౌతమ్ ఎలా చనిపోయాడో జై ని కేంద్రబిందువుగా  చేసుకుని ఇద్దరూ పరిశోధించడం ప్రారంభిస్తారు.

        గౌతమ్ ని జై చంపి వుంటే ఎందుకుచంపాడు, వంశీ అనే వాడి బ్లాక్ మెయిల్ కి లొంగి జై ఎందుకు డబ్బు సమర్పించుకుంటున్నాడు. మధ్యలో కేథీ మేనమామ పాత్రేంటి...అన్నవి ఈ పరిశోధనలో బయటపడతాయి...

ఎలావుంది కథ 
       ఫస్టాఫ్ రెండు సరదా ప్రేమ కథలు, సెకండాఫ్ సీరియస్ సస్పెన్స్ కథా వున్న రో మాంటిక్ సస్పెన్స్ ఇది. అయితే సెకండాఫ్ లో పూర్తిగా రోమాంటిక్ అప్పీల్ ని మిస్సవడంతో పేరుకే రోమాంటిక్ సస్పెన్స్ అనేట్టుంది. జై చేసిన హత్యని బయటపెట్టే దృష్టితో జరిగే సంఘటనలతో రోమాంటిక్ ఫీల్, వినోదం పాలు పూర్తిగా మృగ్యమయ్యాయి. 2002 లో అబ్బాస్ మస్తాన్ లు  అభయ్ డియోల్- అమీషా పటేల్- అక్షయ్ ఖన్నా లతో తీసిన రోమాంటిక్ థ్రిల్లర్  ‘హమ్ రాజ్’ కావలసినంత థ్రిల్  తోబాటు,  పెళ్ళయిన స్త్రీ సంసారం ప్రమాదంలో పడే బలమైన ఫ్యామిలీ ఎలిమెంట్ వుంది. దీన్ని ‘పర్ ఫెక్ట్ మర్డర్’ (1998) అనే హాలీవుడ్ హిట్  నుంచి కాపీ కొట్టారు. ఈ ‘పర్ ఫెక్ట్ మర్డర్’  కూడా 1954 లో ఆల్ ఫ్రెడ్ హిచ్ కాక్ తీసిన ‘డయల్ ఎమ్ ఫర్ మర్డర్’ కి రీమేక్.  అంటే ప్పట్లో హిచ్ కాక్ తన సస్పెన్స్ లో ఫ్యామిలీ డ్రామా కూడా మిళితం చేసిన మాస్టర్ అన్నమాట.

        రోమాంటిక్ సస్పెన్స్ అన్నాక జై ని కేథీ అనుమానించి పరిశోధిస్తే అతను  తన బాయ్  ఫ్రెండ్ కాదు కాబట్టి అది రివెంజి డ్రామా అవుతుంది. జై ని అతడి గర్ల్ ఫ్రెండ్ ఐశ్వర్యే అనుమానించి పరిశోదిస్తూంటే అప్పుడు అది అచ్చమైన బాయ్ ఫ్రెండ్- గర్ల్ ఫ్రెండ్ ల మద్య రోమాంటిక్ సస్పెన్స్ అన్పించుకుని ఎక్కువ బాక్సాఫీసు అప్పీలుకి దోహదం చేస్తుంది. అమితాబ్ బచ్చన్ ‘డాన్’ లో అమితాబే తన అన్నని చంపిన డాన్ అనుకుని  జీనత్ అమన్ పగబట్టడం, అమితాబ్ ఆమెని రోమాంటిక్ యాంగిల్లో చూడ్డం...ఇందులో అమితాబ్ అమాయకుడని ప్రేక్షులకి తెలుసు కాబట్టి ఆ రివెంజి డ్రామా పండింది.  కానీ ఇప్పుడున్న నాని రెండో పాత్ర హంతకుడే అన్న అనుమానం కల్గిస్తూ కథ నడిపించడంతో, ఇది ఎలాటి రోమాంటిక్ యాంగిల్ కూడా లేని రివెంజి డ్రామాగా – ఒక డ్రై మూవీగా  తయారయ్యింది. 

ఎవరెలా చేశారు
       రెండు పాత్రల్లో నాని మెప్పిస్తాడు, అయితే రెండో పాత్రతో బాటు సెకండాఫ్ అంతా  సీరియస్ అయిపోవడంతో ఆ మూడ్ లో నటనకి మాస్ అప్పీల్ సమస్య తలెత్తుతుంది. సెకండాఫ్ లో  తనతో ఎలాటి కమర్షియల్ ఎలిమెంట్సూ  కూడా లేకపోవడం పెద్ద లోపం. ఫస్టాఫ్ లో ఇద్దరు హీరోయిన్లతో వేర్వేరు లవ్ ట్రాక్స్ లో అతను  పాల్పడే చేష్టలు కొత్తగానే వుంటూ ప్రేక్షకుల మెప్పు పొందుతాయి. సెకండాఫ్ కొచ్చేసరికి నాని నుంచి ఇంకెలాటి  ఎంటర్ టైన్ మెంట్ నీ ఆశించే పరిస్థితి లేదు. ఇదంతా ఫస్ట్ హీరోయిన్ రివెంజి డ్రామా కావడం వల్ల వచ్చిన సమస్య.  పాత కాలంలో సినిమాలు చూసి ప్రేక్షకులు- ఫస్టాఫ్ కామెడీ- సెకండాఫ్   స్టోరీ అనేవాళ్ళు. ఫస్టాఫ్ లో కామెడీ నంతా ఎంజాయ్ చేసి, ఇక సెకండాఫ్ లో ప్రారంభమయ్యే ఎంతటి సీరియెస్ కథనైనా ఇన్వాల్వ్ అయిపోయి చూసేవాళ్ళు. ఈ రోజుల్లో ఈ పరిస్థితి వుందా? ఇప్పుడు సినిమా సాంతం ఎంటర్ టైన్ మెంటే కావాలి!

        ఫస్ట్ హీరోయిన్ నివేదా  థామస్ ఫస్ట్ క్లాస్ గా వుంది. భావప్రకటనా సామర్ధ్యం పుష్కలంగా వుంది. అదే సెకండ్ హీరోయిన్ తో లేదు. రిపోర్టర్ గా నటించిన శ్రీముఖి ఇన్వెస్టిగేషన్ తక్కువగానూ, సమాచార మివ్వడం ఎక్కువగానూ వుంది. ఇక ఆఫీస్ కామెడీతో వెన్నెల కిషోర్- సత్యం రాజేష్ లు కొన్ని కొన్నిచోట్ల బాగానే నవ్విస్తారు. శ్రీనివాస్ అవసరాల విలన్ పాత్రలో ప్రశ్నార్ధకంగా ఉంటాడు. 

        సినిమాకి విందా ఛాయాగ్రహణం ఒకరకంగా వున్నా, మణిశర్మ సంగీతం మాత్రం హైలైట్ అనే చెప్పాలి. నేపధ్య సంగీతంతో బాటు,  ఫస్టాఫ్ లో వచ్చే రెండో పాట డ్రమ్ బీట్స్ తో  బాగా ఇంప్రెస్ చేస్తుంది. రవీందర్ కళాదర్శకత్వం, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ ఓ మోస్తరుగా వున్నాయి. 

చివరికేమిటి 
      లైటర్ వీన్ కథల దర్శకుడు క్రితం సినిమా ‘బందిపోటు’ అనే మాస్ కమర్షియల్ దగ్గర చేతులెత్తేసినట్టే ఇప్పుడు సస్పన్స్ బిజినెస్ తో తికమక పడిపోయారు. ఈ సినిమాలో నటీనటుల నుంచి నటనల్ని రాబట్టుకోవడం, షాట్స్ తీయడం వగైరా వరకూ తను ఓకే. కానీ ఈ రోమాంటిక్ సస్పన్స్ కథ- దీని స్క్రీన్ ప్లేల  విషయంలో మాత్రం రాణించలేకపోయారు. సస్పెన్స్ అంతా  చివర్లో ఓపెన్ చేసి ఫ్లాష్ బ్యాక్ గా చెప్పుకు వచ్చే ఎండ్ సస్పెన్స్ విధానం ప్రింట్ మీడియాకే తప్ప,  సినిమా అనే విజువల్ మీడియాకి ఇక పనికి రాదని, ముప్పై ఏళ్ల క్రితమే హాలీవుడ్ తేల్చేసుకుని ఇక దాని జోలికి వెళ్ళడం లేదు. 

        మొన్నే రవితేజతో ‘బెంగాల్ టైగర్’ అనే భారీ బడ్జెట్  సినిమా ఎండ్ సస్పెన్స్ కథతో వచ్చి ఏమైందో  తెలిసిందే. తెలుగు సినిమాల ప్రధాన  జాడ్యాలు మూడు- పాసివ్ హీరో పాత్ర, సెకండాఫ్ సిండ్రోమ్, ఎండ్ సస్పెన్స్- ఈ మూడూ పదేపదే రిపీటవుతూనే వున్నాయి- ఇలాగే తీస్తూ వుంటారు. ఇంద్రగంటి స్క్రీన్ ప్లేలో ఈ ఎండ్ సస్పెన్స్ లో కూడా అసలా జరిగిన మూల సంఘటన ఏమిటీ అన్నది చూపించే సరికి అదికూడా బలహీనంగా తేలిపోయింది. మొత్తం సస్పెన్స్ బిజినెస్ కి మూలమైన సంఘటనే  బలహీనంగా వున్నప్పుడు ఇక కథ బలంగా ఎలావస్తుంది. పైగా సెకండాఫ్ నిడివి కూడా బాగా పెరిగిపోయింది. ఇక చివరికొస్తే, ఫ్లాష్ బ్యాక్ లో చెప్పిన ప్రకారమైతే  హీరో  అరెస్టయి తన నిజాయితీ నిరూపించుకోవాలి. అప్పుడే జంటిల్ మన్ అని అన్పించుకో గలడు. అంతకాలం చట్టాన్ని ఏమార్చి,  పోలీసుల్ని తప్పుదోవపట్టించే సాక్ష్యాధారాలు సృష్టించి ఈ సస్పెన్స్ అంతా నడిపించాడు. ఆ పోలీసులు ఏమయ్యారు? అటూ ఇటూ కుటుంబ సభ్యులందరూ హీరో చేసింది గొప్ప అని మెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే సరిపోయిందా? హీరో తల్లికూడా హీరోకి సహకరించింది కదా, ఆమెకూడా చట్టానికి లొంగి పోవాల్సిందే. 

        ఇది సమగ్రమమైన కథా చిత్రమన్పించుకోదు. ఇలాటి కథకి పరిపూర్ణమైన ముగింపు నివ్వడం సాధ్యంకాదు. ఇస్తే హీరో అతడి తల్లీ ముందు జైల్లో వుండాల్సిన ఖర్మ పడుతుంది.

-సికిందర్
http://www.cinemabazaar.in





       
 




















11, జూన్ 2016, శనివారం

షార్ట్ రివ్యూ!

రచన- దర్శకత్వం : రాజసింహ 
తారాగణం: సందీప్‌ కిషన్‌, నిత్యామీనన్‌, రవికిషన్‌, రాహుల్ దేవ్, అలీ, నళిని, అజయ్‌, రోహిణి, సప్తగిరి, పృధ్వీ, తాగుబోతు రమేష్‌, ఝాన్సీ తదితరులు
సంగీతం: మిక్కీ జె. మేయర్‌, ఛాయాగ్రహణం: ఛోటా కె. నాయుడు
బ్యానర్‌: అంజిరెడ్డి ప్రొడక్షన్స్‌, నిర్మాత: భోగాది అంజిరెడ్డి
విడుదల :  జూన్‌ 10, 2016
***
     ఒక్క హిట్ కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్న సందీప్ కిషన్ మళ్ళీ ప్రయోగాలబట్టి ‘ఒక్క అమ్మాయి తప్ప’ లో నటించాడు. మొన్నే ‘రన్’ అనే ప్రయోగాత్మకంలో నటించి విఫలమయ్యాడు. ప్రస్తుత ప్రయత్నం తెలుగు సినిమాల్లో ఇంతవరకూ ఎవరూ చేయని సాహస ప్రయోగమే నిజానికి. తెలుగు సినిమాల్ని మూస నుంచి కమర్షియల్ గా కొత్త బాట పట్టించే ప్రయోగాలు తప్పకుండా  జరగాల్సిందే. కొత్త దర్శకుడు రాజసింహ ఈ కొత్త ప్రయోగం చేస్తూ వీలైనన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఇందులో ప్రవేశపెట్టాడు. దర్శకుడి విజన్ ని  పూర్తిగా నమ్మిన సందీప్ కిషన్ పారితోషికాన్నికూడా  త్యాగం చేసి, ప్రముఖ హీరోయిన్ నిత్యామీనన్ తో కలిసి నటించాడు. మరైతే ఈ త్యాగం, దర్శకుడి విజన్ ఏమైనా సార్ధకమయ్యాయా లేక షరామామూలు బాక్సాఫీసు తిరస్కరణకి గురయ్యాయా ఓసారి చూద్దాం... 

కథ 
      కృష్ణ వచన్ (సందీప్ కిషన్)  రెండో తరగతి చదివేటప్పుడు క్లాస్ మేట్ మ్యాంగో (నిత్యామీనన్) ని ప్రేమిస్తాడు. స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఆమెకు జాతీయ పతాకం అందిస్తూ పెళ్లి చేసుకుంటానని ప్రామీస్ చేస్తాడు (పుట్టే పిల్లల గురించికూడా మాట్లా డేస్తాడు- ఏమంటే వీడి మాటల్ని కామెడీగా తీసుకుని మనం నవ్వాలి!). ఆమె తిప్పి కొట్టేస్తుంది. పెద్దయ్యాక వచన్ కి చదువు నచ్చక కాలేజీ మానేసి, పేకాటలో ఆరితేరతాడు. జీవితంలో గెలవాలంటే మ్యానిపులేషన్స్ కాదనీ, క్యాలిక్యులేషన్స్ అవసరమనీ చెప్తూంటాడు(ఆవారా హీరోల పాత్రలు ఇలాగే  గాలి కొటేషన్లు చెప్తూంటాయి). ఒకరోజు ఏదో పనిమీద బైక్ మీద వెళ్తూంటే ఫ్లై ఓవర్ మీద రెండు లారీలు గుద్దుకుని ట్రాఫిక్ జామ్ అయి అందులో చిక్కుకుంటాడు. ఒక షేర్ ఆటోలో ప్రయాణిస్తున్న మ్యాంగో కూడా ఆ జామ్ లో చిక్కుకుంటుంది. ఆమె చిన్నప్పటి మ్యాంగో అని తెలీక టీజ్ చేస్తాడు వచన్. ఈ ట్రాఫిక్ జామ్ ని కావాలనే  అన్వర్(రవికిషన్)  అనే హైటెక్ టెర్రరిస్టు సృష్టిస్తాడు. అక్కడ పెట్టిన బాంబుల్ని పేల్చేస్తానని బెదిరించి జైల్లో వున్న ఇంకో టెర్రరిస్టు అస్లం ఖాన్(రాహుల్ దేవ్) ని విడుదల చేయించుకోవాలని పథకం వేస్తాడు. అయితే బాంబులకి కనెక్షన్స్ ఇవ్వడానికి పంపించిన అనుచరుడు మాయమవడంతో అయోమయంలో పడ్డ అన్వర్, ఫ్లై ఓవర్ మీద చిక్కుకున్న వచన్ ని టార్గెట్ చేసి ఆ పని అతడితో చేయించుకోవాలనుకుంటాడు. దూరంగా బిల్డింగ్ లోంచి ఈ పథకం వేస్తున్న అతను- ఆటోలో వున్న మ్యాంగో మీద టెలిస్కోపిక్ రైఫిల్ ని గురిపెట్టి బెదిరిస్తూ, వచన్ ని లొంగ దీసుకుంటాడు. 

        ఇదీ విషయం. ఇప్పుడు వచన్ ఏం చేశాడు? అన్వర్ బెదిరింపులకి లొంగిపోయిన తను అతను  చెప్పినట్టే చేశాడా? మ్యాంగో తన చిన్ననాటి లవర్ అని ఎప్పుడు తెలుసుకున్నాడు? ప్రమాదంలో వున్న ఆమె ప్రాణాలనీ,  మిగతా ప్రజల ప్రాణాలనీ  ఎలా కాపాడాడు? చివరికేమైంది? ఇవన్నీ వెండితెర మీద చూసి తెలుసుకోవాల్సిన  విషయాలు.

ఎలావుంది కథ
     ర్శకుడు రాజసింహ కొన్నేళ్ళ పాటు ఈ కథ పట్టుకుని నిర్మాతల చుట్టూ తిరిగాననీ, అప్పట్లో ఎవరికీ నచ్చలేదనీ  చెప్పుకున్నాడు. 1960 లో ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్ కి రైటర్ లారీ కోహెన్ ఓ కథ చెప్పాడు. ఐడియా  బాగానే వుంది గానీ దీన్నెలా తీయాలబ్బా అని సందేహంలో పడ్డాడు హిచ్ కాక్. దర్శకుడు రాజసింహ నాల్గేళ్ళ  క్రితం హీరో సందీప్ కిషన్ కి ఇదే కథ చెప్పి ఒప్పించానని చెప్పుకున్నాడు. రైటర్ లారీ కోహెన్ చివరికి 1990లలో తన కథకి ఒక తుపాకీ గురిపెట్టిన విలన్ ని సృష్టిస్తే అప్పడు కథ దారిలో పడింది. రాజసింహ తన సినిమాకి అదే తుపాకీ గురిపెట్టిన  విలన్ ని పెట్టుకున్నాడు. రైటర్ లారీ కోహెన్ స్క్రిప్టు చివరికి 2002 లో తెరకెక్కింది. రాజసింహ సినిమా చివరికి 2016 లో తెరకెక్కింది. లారీ కోహెన్ సినిమా వచ్చేసి  ‘ఫోన్ బూత్’ అయితే, రాజసింహ సినిమా వచ్చేసి ‘ఒక్క అమ్మాయి తప్ప’. లారీ కోహెన్ ఒరిజినల్ ఐడియాని పట్టుకుని 42 ఏళ్ల పాటూ శ్రమిస్తే, లారీకోహెన్ ఐడియాని చప్పున కాపీ కొట్టేసిన రాజసింహ పన్నెండేళ్ళ పాటూ నిర్మాతల చుట్టూ తిరగడానికి పరిశ్రమించాడు. ఐతే కాపీలూ లీకులూ ఒకరితో ఆగవు. అవి పవిత్ర తీర్ధ జలాలు, అలా ప్రవహిస్తూనే వుంటాయి. రాజసింహ కథలో టెర్రరిజం పార్టు కొంచెం మార్పులతో ఉన్నదున్నట్టు మొత్తం ఇంకో కొత్త నిర్మాత దగ్గర ఫైలు సిద్ధంగా వుంది, ఆయన దానితో పరిశ్రమిస్తున్నాడు. దాంతో ఎటూ తెగక అదృష్టవశాత్తూ ఈ వ్యాసకర్త ఆయన పరిశ్రమలో పాలుపంచుకోవడం మానేసి తప్పించుకున్నాడు! కొన్ని మిరకిల్స్ ఇలా జరుగుతూంటాయి...

        ప్రేమ- టెర్రరిజం సజాతి కమర్షియల్ జానర్లే. టెర్రరిస్టు కోరిక థ్రిల్లింగ్ పాయింటే. కాకపోతే ఈ ఐడియాని అమలు పరచడానికి దర్శకుడు ‘బర్నింగ్ ట్రైన్’ అనే హిందీ, ‘ట వరింగ్ ఇన్ ఫెర్నో’  అనే హలీవుడ్ డిజాస్టర్ మూవీస్ కూడా చూసివుంటే ఒక మంచి అవగాహన ఏర్పడేది. ‘ఫోన్ బూత్’  ఐడియా చాలా చిన్నది. అదో పర్సనల్ కథ. ఫోన్ బూత్ కి  ఫోన్ చేయడాని కెళ్ళిన  హీరోకి అక్కడే ఓ కాల్ వస్తుంది. అతను భార్య కళ్లుగప్పి సాగిస్తున్న రహస్యప్రేమాయణం గురించి విలన్ చెప్పి- ఈ దాగుడు మూతల్ని ఇద్దరికీ ఓపెన్ చేయకపోతే చంపేస్తానని బెదిరిస్తాడు, రహస్యంగా టెలిస్కోపిక్ రైఫిల్ తో కనిపెడుతూ. ఈ విలన్ అనైతిక ప్రవర్తనలని సహించడు.  ఇప్పడు హీరో కుటుంబ జీవితం, రంకు జీవితం, సొంత ప్రాణాలూ ఏమయ్యాయనేదే కథ. 

        రాజసింహకి హిచ్ కాక్ కంటే  బ్రహ్మాండమైన ఐడియా వచ్చి ఈ కథ ఫ్లై ఓవర్ కెక్కింది. సువిశాలమైంది. తను హేండిల్ చేయలేనంత విశ్వరూపం ధరించింది. ముప్పాతిక వంతు సినిమా ఫ్లై ఓవర్ మీద అనే కాన్సెప్టు వరకూ ఆహ్వానించదగ్గదే, దీన్ని అమలు పర్చేసరికి కాన్సెప్టు చెల్లా చెదురయ్యింది.  కారణం స్క్రీన్ ప్లేనే!

ఎవరెలా చేశారు
       సందీప్ కిషన్ దురదృష్ట మేమిటో గానీ నటించగల శక్తి వున్నతనకి, ఫాలోయింగ్ కూడా వున్న తనకి సినిమాలు హేండిచ్చేస్తున్నాయి. నటన అంటే పాత్రే  కాదనీ, పాత్ర చిత్రణ కూడాననీ గ్రహిస్తే ఈ తిప్పలు తప్పుతాయేమో.  గెలవాలంటే మ్యానిపులేషన్స్ కాదనీ, క్యాలిక్యులేషన్స్ అవసరమనీ చెప్పుకున్న తన పాత్రే,  విలన్ మ్యానిపులేషన్ ని తన క్యాలిక్యులేషన్ తో తిప్పికొట్ట గల అవకాశమున్నా బేలగా మిగిలిపోవడం నటన అన్పించుకోకపోగా,  ఆ నటన పేలవంగా,  అర్ధరహితంగా వుంటుంది. తను విలన్ చెప్పినట్టు బాంబులకి కనెక్షన్ ఇవ్వకముందు జరిగే బోలెడు డ్రామాలో,  నిత్యామీనన్ ని అటు పక్కనుంచి ఆటో దింపేసి తీసికెళ్ళి పోయుంటే విలన్ చేసేదేమీ వుండదు. 

        నిత్యా మీనన్ కి షేర్ ఆటోలో కూర్చుని డైలాగులు చెప్పడం, డ్రీమ్ సాంగులేసుకోవడం తప్ప చేయడానికేమీ లేకుండా పోయింది. బాగా విర్రవీగి నటించింది మాత్రం టెర్రరిస్టు పాత్రలో రవికిషనే. రాహుల్ దేవ్ జైలుకి పరిమిత మైపోయాడు. కమెడియన్లు అలీ, సప్తగిరి, తాగుబోతు, ధన రాజ్, వేణు, ఫిష్ వెంకట్ లు- ఫ్లై ఓవర్ యాక్షన్ మధ్య మధ్యమ్  అకస్మాత్తుగా వూడిపడి కామెడీలు  చేస్తూంటారు. ఈ కామెడీల్ని విడిగా ఎంజాయ్ చేయగలమేమో గానీ,అర్ధం లేకుండా ఫ్లై  ఓవర్ డ్రామా లోకి జొరబడుతూంటేనే ఇబ్బంది. 

        ఈ సినిమాకి అసలైన హీరో సందీప్ కిషన్ మేనమామ ఛోటా కె. నాయుడు. తన కెమెరా వర్క్ తో నాయుడు ఇంకో మెట్టు పైకెక్కారు. తెలుగు సినిమాకి- అందునా ఓ థ్రిల్లర్ కి-  ఇంత క్వాలిటీ విజువల్స్, దానికి మళ్ళీ  వరల్డ్ క్లాస్ డీఐ కూడా ఇవ్వడం ఇదే ప్రథమం. ఆద్యంతం కళ్ళప్ప గించి చూసేలా చేసి,  ఈ సినిమాలో అన్ని లాజిక్ పరమైన లోపాలనీ మటుమాయం చేయగల్గిన మంత్రజాలం ఆయనదే. అయినా అంతిమంగా ప్రతికూల ప్రభావాన్నే  ఈ సినిమా చవి చూసిందంటే ప్రధాన కారణం స్క్రీన్ ప్లేనే. 

చివరికేమిటి
     క్కడో చూసి తను రాసుకున్నదే వేదం అనుకోకుండా కొత్త దర్శకుడు రాజసింహ కాస్త స్క్రీన్ ప్లే మీద కూడా రీసెర్చి చేసుకోవాల్సింది. ఫ్లై ఓవర్ మీద మందిని పోగేసి ‘ఫోన్ బూత్’ ఐడియాని అమలు చేసే ముందు- ఆ మందిని పోగేసే క్రమం ఎలా వుంటుందో, ప్రమాద ఘంటికలు ఎప్పుడు మోగుతాయో ఆ టైమింగ్ ని తెలుసుకోవాల్సింది- ‘బర్నింగ్ ట్రైన్’, ‘టవరింగ్ ఇన్ ఫెర్నో’, ఆఖరికి ‘టైటానిక్’ కూడా చూసి! 

        ‘బర్నింగ్ ట్రైన్’ లో జరగబోయే ప్రమాదం ప్రేక్షకులకి కూడా ముందు తెలీదు. ఈ మల్టీ స్టారర్ లో  ఒకరొకరే స్టార్లు  ట్రైన్ ఎక్కడం, వాళ్ళ పలకరింపులు, పరిచయాలు, జీవితాలు, ప్రేమలు, పాటలూ ఇవన్నీ స్క్రీన్ ప్లేలో బిగినింగ్ విభాగపు బిజినెస్  కింద పూర్తయ్యాక, ప్రయాణిస్తున్న ట్రైను ట్రైను బ్రేకులూడదీసి బాంబులు పెట్టారని తెలుస్తుంది. ఇలా మిడిల్ విభాగం ప్రారంభమవుతుంది. ఇక బిగినింగ్ విభాగంలో చూపించిన బిజినెస్ తాలూకు అంశాలేవీ ఇక్కడ అడ్డుపడవు. మిడిల్ అంటే సంఘర్షణే  కాబట్టి పాత్రలన్నీ ప్రమాదంలో పడ్డ ప్రయాణంతో రకరకాలుగా సంఘర్షించడమే మొదలెడతాయి. హేమా హేమీలతో ఈ హిట్ ని 1979 లో బీఆర్ చోప్రా నిర్మించారు.  

         ‘ది టవరింగ్ ఇన్ ఫెర్నో’  లో ఒక 135 అంతస్తుల ఆకాశహార్మ్యం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఆహ్వానితులందరూ రావడం మొదలెడతారు. ‘బర్నింగ్ ట్రైన్’ లో లాంటి బిగినింగ్ విభాగపు బిజినెస్సే వుంటుంది. గంట సేపటి తర్వాత అగ్నిప్రమాదం సంభవించి మిడిల్ విభాగంలో పడుతుంది కథ. ఇక అప్పుడు ప్రాణాలకోసం అందరూ సంఘర్షించడమే వుంటుంది. హేమాహేమీలతో 1974 లో తీసిన దీనికి ఆస్కార్ ఉత్తమ చిత్రం అవార్డు నామినేషన్ దక్కింది. ఇతర విభాగాలో ఐదు ఆస్కార్ అవార్డులు సాధించింది. 

        ‘టైటానిక్’ కూడా ప్రేమకథ ఎష్టాబ్లిష్ అయ్యాకే(బిగినింగ్ విభాగం) నౌక ప్రమాదంలో పడుతుంది. 

        రాజసింహ స్క్రీన్ ప్లేకి ఇలాటి అంక విభజన లేదు. బిగినింగ్, మిడిల్ కలగాపులగమైపోయాయి. మిడిల్ విభాగంలో ఓపెన్ చేయాల్సిన కుట్రకి సన్నాహాల్ని బిగినింగ్ లో హీరో ప్రేమని ఎస్టాబ్లిష్ చేస్తున్న బిజినెస్ తో కలిపేశారు. కామెడీలూ గీమిడీలూ అన్నీ ఇష్టారాజ్యం చేశాయి ఎక్కడబడితే అక్కడ. దీంతో స్క్రీన్ ప్లేకి వుండే విభాగాలూ,  వాటిలో వేటికవి జరగాల్సిన బిజినెస్సులూ  దర్శకుడికి తెలియవేమో అన్న సందేహాలేర్పడ్డాయి.

        శుభ్రంగా  బిగినింగ్ ని ప్రారంభించి అందులో హీరో చిన్నప్పటి ఫ్లాష్ బ్యాక్, ఆతర్వాత హీరోయిన్ పరిచయం, ఆమెతో ట్రాకు, ఇద్దరూ పరస్పరం గుర్తించుకుని ప్రేమలో పడ్డం, ఇతర కమెడియన్ల ట్రాకులూ వగైరా  నడిపి- ఓ శుభోదయాన ఎవరి పనులమీద వాళ్ళు, ఇంకా ఆ ప్రయాణంలో మరి కొన్ని కొత్త పాత్రలూ కలిసి వెళ్తున్నప్పుడు, అకస్మాత్తుగా  ఫ్లై ఓవర్ మీద లారీలు గుద్దుకుని ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో,  మొత్తం పరిచయం చేసిన పాత్రలన్నీ అందులో చిక్కుకోవడంతో బిగినింగ్ విభాగాన్ని ముగిస్తే సరిపోయేది. 

        ఇప్పుడు మిడిల్ ని ప్రారంభిస్తూ అసలా లారీలతో ప్రమాదాన్ని  విలన్ సృష్టించాడని ఓపెన్ చేస్తూ,  వాడి అసలు కుట్రని బయటపెడితే  ఈ ట్విస్ట్  షాకింగ్ గా  వుండి - మిడిల్ లో పాత్రల పరిచయాలూ, ప్రేమ ట్రాకులూ, ఇంకే కాలక్షేప కామెడీలూ లేకుండా పాయింటుతో ఏకత్రాటి పైకొచ్చేసేది కథ. ప్రమాదంలో పడ్డాక ‘టైటానిక్’ లో ప్రేమ కథ ఎలా సాగిందో చూసుకోవచ్చు. అగ్ని ప్రమాదం సంభవించాక ఒకటి కాదు, ఐదు ప్రేమ కథలూ ఎలా కొనసాగాయో ‘ది టవరింగ్ ఇన్ ఫెర్నో’లో పరిశీలించుకోవచ్చు. 

        పరిశీలన లేకుండా తోచినట్టూ రాసేసుకుంటే అది స్క్రీన్ ప్లే అవదు, దానికి ప్రేక్షకులు దాసోహం కారు!

-సికిందర్ 
http://www.cinemabazaar.in/

10, జూన్ 2016, శుక్రవారం

షార్ట్ రివ్యూ

దర్శకత్వం : మను
తారాగణం : సుమంత్ అశ్విన్, పూజా జావేరీ, పావని జి,  ప్రభాకర్, నాజర్, జీవా, రాజారవీంద్ర, తాగుబోతు రమేష్, షకలక శంకర్, ధనరాజ్
మాటలు : డార్లింగ్ స్వామి. సంగీతం : జేబీ, ఛాయాగ్రహణం : శేఖర్ వి. జోసెఫ్
బ్యానర్ : శ్రీ సత్య ఎంటర్ ప్రైజెస్, నిర్మాత : జె. వంశీ కృష్ణ
విడుదల : 10.6.16
***
     హీరోగా నిలదొక్కుకునేందుకు విఫలయత్నాలు చేస్తున్న సుమంత్ అశ్విన్ మలయాళ రీమేకుని  ఆశ్రయించాడు. కొత్త దర్శకుడు మనునీ, ‘బాహుబలి’ ప్రభాకర్ నీ, హీరోయిన్ పూజా జావేరీనీ, ఒక బస్సునీ  టీముగా ఏర్పాటు చేసుకుని కలెక్షన్స్ కోసం కండక్టరుగా నటించాడు. బస్సుతో సినిమాలు అనేకం వచ్చాయి. మొన్నే దాసరి తీసిన ‘ఎర్రబస్సు’ తో బాటు, భీమనేని శ్రీనివాసరావు తీసిన ‘స్పీడున్నోడు’ వచ్చాయి. మలయాళంలో ‘ఆర్డినరీ’ పేరుతో విడుదలై ఘనవిజయం సాధించిన ప్రస్తుత సుమంత్  రీమేకు బస్సు, ఎంత ఎక్స్ ట్రార్డినరీగా వుందో, ఎన్ని టికెట్లు కొడితే ఎంత వచ్చిందో  ఈ కింద చూసుకుంటూ వెళ్దాం...  

కథ 
      రవి (సుమంత్ అశ్విన్) కొత్తగా ఆర్టీసీ బస్సు కండక్టర్ గా చేరతాడు. గవిటి  అనే ఏజెన్సీ  ప్రాంతానికి ఒక ట్రిప్పు వేసే ఆ బస్సుకి  డ్రైవర్ గా వున్న  శేషు (ప్రభాకర్) తో దోస్తీ కుదురుతుంది. శేషు మద్యం సేవించి బస్సు నడుపుతాడు. గవిటి లో సర్పంచ్ విశ్వనాథం విశ్వనాథం (నాజర్),  ఆయన కుటుంబం వుంటారు. చనిపోయిన తన మిత్రుడి కూతుర్ని తనింట్లోనే ఉంచుకుని కొడుక్కిచ్చి పెళ్లి చేద్దామను కుంటున్నాడు. అదే వూళ్ళో కల్యాణీ  అనే టౌన్ లో ఓ సెల్ ఫోన్ షోరూం లో పని చేసే అమ్మాయి వుంటుంది. రోజూ ట్రిప్పులేస్తున్న రవికి ఆమెతో సాన్నిహిత్య మేర్పడుతుంది. ప్రేమని వెల్లడిస్తాడు. ఆమె సరేనంటుంది. శేషుతో రవి వూళ్ళో షికార్లు  తిరుగుతూ, టౌనుకి ట్రిప్పులు వేస్తూ ఉంటాడు. ఒకరోజు వెళ్తున్న బస్సు ఫెయిలవుతుంది. డిపో నుంచి మెకానిక్ (జీవా) వస్తాడు. ఇతనూ శేషూ మద్యం సేవిస్తూ కూర్చుంటారు, అసిస్టెంట్ బస్సుని బాగుచేస్తాడు. బయల్దేరబోతూ తాగి వున్న శేషు బస్సు నడపబోతే, అడ్డుకుని రవి నడుపుతాడు. కొంత దూరంలో యాక్సిడెంట్ చేస్తాడు. ఆ యాక్సిడెంట్, దాని తర్వాతి పరిణామాల్లో విశ్వనాథం కొడుకు చనిపోతాడు. రవీ శేషూ ఇరకాటంలో పడతారు. విషయం బయటపడి పోలీసులు రవిని అరెస్టు చేస్తారు. ఇక ఈ కేసు లోంచి బయటపడేందుకు రవి ఏం చేశాడనేది మిగతా కథ.

ఎలావుంది కథ
    ఈ కథతో మలయాళ ఒరిజినల్  ఎప్పుడో 2012 లో తీశారు. వెంటనే 2013లో తమిళంలో  రీమేక్ చేశారు. రెండూ అప్పట్లో సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు ఆలస్యంగా 2016 లో తెలుగులో తీశారు. దీంతో దీని నావెల్టీ తగ్గడమేగాక, యూత్ అప్పీల్ ని కోల్పోయింది. పైగా తెలుగులో సినిమాగా దీన్ని రీమేక్ చేయడానికి ఈ కథకున్న  విస్తృతి సరిపోయేలా లేదు, షార్ట్ ఫిలింకి సరిపోతుందేమో. రెండోది అసలుకి ఈ కథే గత శతాబ్దానికి చెందిన పురాతనమైన కథ. శోభన్ బాబుతో ‘ఖైదీ బాబాయ్’, కృష్ణ తో ‘నేరము- శిక్ష’ సినిమాలు ఇలాటి కథలే. సుమంత్ అశ్విన్  తండ్రి గారే (ఎంఎస్. రాజు) ఈ నేరం- శిక్ష బాపతు జానర్ తో 2002 లో ‘నీ స్నేహం’ (‘తుమ్ బిన్’ రిమేక్) తీశారు. భూమి గుండ్రం గా వున్నట్టు తనయుడు మళ్ళీ ఇలాటిదే వ్యవహారంలో నటించాడు. ఐతే ఈ నేరం-శిక్ష పాయింటుతో గతంలో వచ్చిన సినిమాలు నిజంగా హీరో నేరం చేసినవే- ఆ పశ్చాత్తాపంతో కుమిలిపోయే మెలోడ్రామాలు. ఈ పాయింటు మెలోడ్రామాతోనే వర్కౌట్ అవుతుంది. అలాగాక  సస్పెన్స్ కోణాన్ని జతచేస్తే, ఆ సస్పెన్స్ ఆధారంగా సులువుగా  హీరోని బయట పడేసే ప్రయత్నం చేస్తే, అంత వర్కౌట్ అయ్యే వ్యవహారంగా కనపడదు. 

ఎవరెలా చేశారు
       సుమంత్ అశ్విన్ నటించ గలడు  గానీ పాత్రలే కుదరడంలేదు. బస్సు కండక్టర్ అయినంత మాత్రాన పాత్రకి గ్లామర్ లేదని, చీటికీ మాటికీ ఈశ్వరా అనే ఊతపదంతో చాదస్తంగా కనపడాల్సిన అవసరం లేదు. కుర్ర కండక్టర్లు చాలా ఫాస్ట్ గా వుంటారు. ఫస్టాఫ్ లో ఏదో సరదాగా నటించేసినా- వయసులోనూ, శారీరకంగానూ భారీగా వుండే ప్రభాకర్ తో దోస్తీ – కెమిస్ట్రీ కుదరలేదు. అదంతా కృతకంగా వుంది. ఇక సెకండాఫ్ పూర్తిగా సీరియస్ కథ కాబట్టి, అది కూడా చప్పున ముగిసిపోయే కథ కాబట్టి నటనకి పెద్దగా స్కోపు లేక యాక్షన్ తో సరిపెట్టేశాడు. కండక్టరుగా ప్రేక్షకులకి అందించడానికి తను పోగేసిన కలెక్షన్ అంతా అవుట్ డేటెడ్. 

        ఇలాటి సాఫ్ట్ పాత్రలో ఎందుకనో ప్రభాకర్ ఆకట్టుకునేలా లేడు. అతను రఫ్ పాత్రలు వేసుకుంటేనే మంచిదేమో. హీరోయిన్ పూజా జావేరీ గురించి చెప్పుకోవడానికేమీ లేదు. ప్రొఫైల్ లో ఆమెని చూపించకుండా వుంటే బావుండేది. కమెడియన్లు తాగుబోతు రమేష్, షకలక శంకర్, ధన రాజ్ ముగ్గురూ వున్నా కామెడీ కూడా ఏమీ లేదు. ఇక ఇతర పాత్రధారుల గురించి కూడా చెప్పుకోవడానికేమీ లేదు.  
        సంగీతం, ఛాయగ్రహణం అవుట్ డేటెడ్ గా వున్నాయి.


చివరికేమిటి?
       కొత్త దర్శకుడు ‘మను’ తన తొలిప్రయత్నంగా రీమేక్ కి పూనుకోవడమే గాక, చాలా పాత విషయం తలకెత్తుకోవడం, అదీ కొత్తగా చెప్పలేకపోవడం, చాలా స్లోగా కథ నడపడం, ఇంటర్వెల్ వరకూ స్క్రీన్ ప్లే బిగినింగ్ విభాగంతోనే కాలక్షేపం చేయడం లాంటి స్పీడ్ బ్రేకర్లతో నిరుత్సాహ పరుస్తాడు. కొత్తగా టిఫిన్ సెంటర్ పెట్టిన వాడుకూడా వంటకాలతో కసకస లాడి స్తాడు. ఈ కొత్త దర్శకుడు కసకసలు, మిసమిసలు లేని చద్దన్నం ఎందుకు వడ్డించాలనుకున్నాడో అర్ధంగాదు.


-సికిందర్

http://www.cinemabazaar.in