రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

10, జూన్ 2016, శుక్రవారం

షార్ట్ రివ్యూ

దర్శకత్వం : మను
తారాగణం : సుమంత్ అశ్విన్, పూజా జావేరీ, పావని జి,  ప్రభాకర్, నాజర్, జీవా, రాజారవీంద్ర, తాగుబోతు రమేష్, షకలక శంకర్, ధనరాజ్
మాటలు : డార్లింగ్ స్వామి. సంగీతం : జేబీ, ఛాయాగ్రహణం : శేఖర్ వి. జోసెఫ్
బ్యానర్ : శ్రీ సత్య ఎంటర్ ప్రైజెస్, నిర్మాత : జె. వంశీ కృష్ణ
విడుదల : 10.6.16
***
     హీరోగా నిలదొక్కుకునేందుకు విఫలయత్నాలు చేస్తున్న సుమంత్ అశ్విన్ మలయాళ రీమేకుని  ఆశ్రయించాడు. కొత్త దర్శకుడు మనునీ, ‘బాహుబలి’ ప్రభాకర్ నీ, హీరోయిన్ పూజా జావేరీనీ, ఒక బస్సునీ  టీముగా ఏర్పాటు చేసుకుని కలెక్షన్స్ కోసం కండక్టరుగా నటించాడు. బస్సుతో సినిమాలు అనేకం వచ్చాయి. మొన్నే దాసరి తీసిన ‘ఎర్రబస్సు’ తో బాటు, భీమనేని శ్రీనివాసరావు తీసిన ‘స్పీడున్నోడు’ వచ్చాయి. మలయాళంలో ‘ఆర్డినరీ’ పేరుతో విడుదలై ఘనవిజయం సాధించిన ప్రస్తుత సుమంత్  రీమేకు బస్సు, ఎంత ఎక్స్ ట్రార్డినరీగా వుందో, ఎన్ని టికెట్లు కొడితే ఎంత వచ్చిందో  ఈ కింద చూసుకుంటూ వెళ్దాం...  

కథ 
      రవి (సుమంత్ అశ్విన్) కొత్తగా ఆర్టీసీ బస్సు కండక్టర్ గా చేరతాడు. గవిటి  అనే ఏజెన్సీ  ప్రాంతానికి ఒక ట్రిప్పు వేసే ఆ బస్సుకి  డ్రైవర్ గా వున్న  శేషు (ప్రభాకర్) తో దోస్తీ కుదురుతుంది. శేషు మద్యం సేవించి బస్సు నడుపుతాడు. గవిటి లో సర్పంచ్ విశ్వనాథం విశ్వనాథం (నాజర్),  ఆయన కుటుంబం వుంటారు. చనిపోయిన తన మిత్రుడి కూతుర్ని తనింట్లోనే ఉంచుకుని కొడుక్కిచ్చి పెళ్లి చేద్దామను కుంటున్నాడు. అదే వూళ్ళో కల్యాణీ  అనే టౌన్ లో ఓ సెల్ ఫోన్ షోరూం లో పని చేసే అమ్మాయి వుంటుంది. రోజూ ట్రిప్పులేస్తున్న రవికి ఆమెతో సాన్నిహిత్య మేర్పడుతుంది. ప్రేమని వెల్లడిస్తాడు. ఆమె సరేనంటుంది. శేషుతో రవి వూళ్ళో షికార్లు  తిరుగుతూ, టౌనుకి ట్రిప్పులు వేస్తూ ఉంటాడు. ఒకరోజు వెళ్తున్న బస్సు ఫెయిలవుతుంది. డిపో నుంచి మెకానిక్ (జీవా) వస్తాడు. ఇతనూ శేషూ మద్యం సేవిస్తూ కూర్చుంటారు, అసిస్టెంట్ బస్సుని బాగుచేస్తాడు. బయల్దేరబోతూ తాగి వున్న శేషు బస్సు నడపబోతే, అడ్డుకుని రవి నడుపుతాడు. కొంత దూరంలో యాక్సిడెంట్ చేస్తాడు. ఆ యాక్సిడెంట్, దాని తర్వాతి పరిణామాల్లో విశ్వనాథం కొడుకు చనిపోతాడు. రవీ శేషూ ఇరకాటంలో పడతారు. విషయం బయటపడి పోలీసులు రవిని అరెస్టు చేస్తారు. ఇక ఈ కేసు లోంచి బయటపడేందుకు రవి ఏం చేశాడనేది మిగతా కథ.

ఎలావుంది కథ
    ఈ కథతో మలయాళ ఒరిజినల్  ఎప్పుడో 2012 లో తీశారు. వెంటనే 2013లో తమిళంలో  రీమేక్ చేశారు. రెండూ అప్పట్లో సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు ఆలస్యంగా 2016 లో తెలుగులో తీశారు. దీంతో దీని నావెల్టీ తగ్గడమేగాక, యూత్ అప్పీల్ ని కోల్పోయింది. పైగా తెలుగులో సినిమాగా దీన్ని రీమేక్ చేయడానికి ఈ కథకున్న  విస్తృతి సరిపోయేలా లేదు, షార్ట్ ఫిలింకి సరిపోతుందేమో. రెండోది అసలుకి ఈ కథే గత శతాబ్దానికి చెందిన పురాతనమైన కథ. శోభన్ బాబుతో ‘ఖైదీ బాబాయ్’, కృష్ణ తో ‘నేరము- శిక్ష’ సినిమాలు ఇలాటి కథలే. సుమంత్ అశ్విన్  తండ్రి గారే (ఎంఎస్. రాజు) ఈ నేరం- శిక్ష బాపతు జానర్ తో 2002 లో ‘నీ స్నేహం’ (‘తుమ్ బిన్’ రిమేక్) తీశారు. భూమి గుండ్రం గా వున్నట్టు తనయుడు మళ్ళీ ఇలాటిదే వ్యవహారంలో నటించాడు. ఐతే ఈ నేరం-శిక్ష పాయింటుతో గతంలో వచ్చిన సినిమాలు నిజంగా హీరో నేరం చేసినవే- ఆ పశ్చాత్తాపంతో కుమిలిపోయే మెలోడ్రామాలు. ఈ పాయింటు మెలోడ్రామాతోనే వర్కౌట్ అవుతుంది. అలాగాక  సస్పెన్స్ కోణాన్ని జతచేస్తే, ఆ సస్పెన్స్ ఆధారంగా సులువుగా  హీరోని బయట పడేసే ప్రయత్నం చేస్తే, అంత వర్కౌట్ అయ్యే వ్యవహారంగా కనపడదు. 

ఎవరెలా చేశారు
       సుమంత్ అశ్విన్ నటించ గలడు  గానీ పాత్రలే కుదరడంలేదు. బస్సు కండక్టర్ అయినంత మాత్రాన పాత్రకి గ్లామర్ లేదని, చీటికీ మాటికీ ఈశ్వరా అనే ఊతపదంతో చాదస్తంగా కనపడాల్సిన అవసరం లేదు. కుర్ర కండక్టర్లు చాలా ఫాస్ట్ గా వుంటారు. ఫస్టాఫ్ లో ఏదో సరదాగా నటించేసినా- వయసులోనూ, శారీరకంగానూ భారీగా వుండే ప్రభాకర్ తో దోస్తీ – కెమిస్ట్రీ కుదరలేదు. అదంతా కృతకంగా వుంది. ఇక సెకండాఫ్ పూర్తిగా సీరియస్ కథ కాబట్టి, అది కూడా చప్పున ముగిసిపోయే కథ కాబట్టి నటనకి పెద్దగా స్కోపు లేక యాక్షన్ తో సరిపెట్టేశాడు. కండక్టరుగా ప్రేక్షకులకి అందించడానికి తను పోగేసిన కలెక్షన్ అంతా అవుట్ డేటెడ్. 

        ఇలాటి సాఫ్ట్ పాత్రలో ఎందుకనో ప్రభాకర్ ఆకట్టుకునేలా లేడు. అతను రఫ్ పాత్రలు వేసుకుంటేనే మంచిదేమో. హీరోయిన్ పూజా జావేరీ గురించి చెప్పుకోవడానికేమీ లేదు. ప్రొఫైల్ లో ఆమెని చూపించకుండా వుంటే బావుండేది. కమెడియన్లు తాగుబోతు రమేష్, షకలక శంకర్, ధన రాజ్ ముగ్గురూ వున్నా కామెడీ కూడా ఏమీ లేదు. ఇక ఇతర పాత్రధారుల గురించి కూడా చెప్పుకోవడానికేమీ లేదు.  
        సంగీతం, ఛాయగ్రహణం అవుట్ డేటెడ్ గా వున్నాయి.


చివరికేమిటి?
       కొత్త దర్శకుడు ‘మను’ తన తొలిప్రయత్నంగా రీమేక్ కి పూనుకోవడమే గాక, చాలా పాత విషయం తలకెత్తుకోవడం, అదీ కొత్తగా చెప్పలేకపోవడం, చాలా స్లోగా కథ నడపడం, ఇంటర్వెల్ వరకూ స్క్రీన్ ప్లే బిగినింగ్ విభాగంతోనే కాలక్షేపం చేయడం లాంటి స్పీడ్ బ్రేకర్లతో నిరుత్సాహ పరుస్తాడు. కొత్తగా టిఫిన్ సెంటర్ పెట్టిన వాడుకూడా వంటకాలతో కసకస లాడి స్తాడు. ఈ కొత్త దర్శకుడు కసకసలు, మిసమిసలు లేని చద్దన్నం ఎందుకు వడ్డించాలనుకున్నాడో అర్ధంగాదు.


-సికిందర్

http://www.cinemabazaar.in



        

5, జూన్ 2016, ఆదివారం






దర్శకత్వం : ముప్పలనేని శివ
తారాగణం : కృష్ణ, విజయనిర్మల, అంగనా రే, మురళీ శర్మ, పోసాని, సాయికుమార్, పృథ్వీ, ఎల్బీ శ్రీ రామ్, డా. రవి తదితరులు.
సంగీతం :
ఈ ఎస్ మూర్తి,  ఛాయాగ్రహణం :  సతీష్ ముత్యాల
కథ : రమేష్ డీఓ  ప్రొడక్షన్స్,  కాన్సెప్ట్  రైటర్ : కల్యాణ్ జీ, మాటలు :  రామ్ కంకిపాటి
నిర్మాతలు
: శ్రీసాయి దీప్ చాట్ల, వై. బాలు రెడ్డి, షేక్ సిరాజ్
విడుదల :  3. 6. 2016

***
రికార్డు స్థాయిలో 350 సినిమాల సూపర్ స్టార్ కృష్ణ,  గోల్డెన్ జూబ్లీని  పూర్తి  చేసుకుంటూ ‘శ్రీ శ్రీ’ అనే యాక్షన్  మూవీతో హీరోగా విచ్చేశారు- అమితాబ్ బచ్చన్ గెటప్ తో - కాకపోతే నేచురల్ బ్లాక్ గడ్డంతో. ‘డెత్ విష్’  ఫేమ్ ‘విజిలాంటీ’ ఛార్లెస్ బ్రాన్సన్ పాత్రని పోషిస్తూ  దుష్ట శిక్షణ గావించారు. సీనియర్ దర్శకుడు ముప్పలనేని శివ,  ఘట్టమనేని వంశీకులతో ఓ ‘మనం’ కూడా చేద్దామనుకున్నారు దీన్ని, ఇది కుదర్లేలేదు

    
క లా ప్రొఫెసర్ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఎలా వుంటుంది?  చాలా కొత్తగా వుంటుంది. కళ్ళ ముందు నేరం జరుగుతున్నప్పుడు లా ప్రొఫెసర్ ఏం చేస్తే బావుంటుంది? నేరాన్ని అడ్డుకుంటే బావుంటుంది. నేరాన్ని అడ్డుకోలేనప్పుడు ఏం చేస్తే  బావుంటుంది? తన దగ్గరున్న సెల్ ఫోన్లో ఆ నేరాన్ని చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టేస్తే బావుంటుంది. అప్పటికీ చట్టం సరిగ్గా పని చెయ్యక పోతే ఏం చేస్తే బావుంటుంది? సినిమా కాబట్టి చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే బావుంటుంది. లా ప్రొఫెసర్ చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే కొత్తగా వుండడం వేరు, బావుండడం వేరు. కొత్తగా ఉండడానికి క్యారక్టరైజేషన్ అవసరం లేదు, బావుండడానికి అవసరం. 

     శ్రీ శ్రీ ( శ్రీరంగం శ్రీపాద రావు) ఒక లా ప్రొఫెసర్. సుమతి (విజయనిర్మల) అనే భార్య, ఓ పెళ్ళయిన కొడుకూ పెళ్లి కాని  కూతురూ వుంటారు. కూతురు శ్వేత ఒక టీవీ రిపోర్టర్. నగరంలో జేకే (మురళీశర్మ) అనే బడా పారిశ్రామికవేత్తా, అతడి తొత్తు డాక్టర్ ముసుగులో ఆర్ఎంపీ క్వాక్  భిక్షపతీ ( పోసాని) వుంటారు. పోతురాజుల గూడెం అనే గిరిజన ప్రాంతం. అక్కడ ఫార్మా కంపెనీ నడుపుతూంటారు. దాంతో జల వాయు కాలుష్యా లేర్పడి భూములు బీడు పోతాయి. ఇంకో పక్క ఏదో కొత్త మందు కోసం మనుషుల మీద ప్రయోగాలు చేస్తూ, వాళ్ళు  చచ్చిపోతే ఒక శిథిలమైన క్వారీలో శవాల్ని పడేస్తూంటారు. వీటికి వ్యతిరేకంగా పోరాడేవాడు సూర్యారావు ( సాయి కుమార్). ఇతడికి తోడయ్యింది శ్వేత. ఈమె తీస్తున్న డాక్యుమెంటరీ విషయం తెలిసి జేకే ఆదేశాలపై అతడి కొడుకు, భిక్షపతి కొడుకు, ఇంకొకడి కొడుకూ కలిసి ఛానల్ కార్యాలయంలో శ్వేత మీద దాడి చేస్తారు పెన్ డ్రైవ్ కోసం. ఆ సమయంలో అక్కడే వున్న శ్రీశ్రీ అడ్డుకోబోతే  కొట్టి పడేస్తారు. అవతల అద్దాల గదిలో తన కూతురు మీద జరుగుతున్న దాడిని కళ్ళారా చూస్తూ ఏమీ చేయలేక తల్లడిల్లిపోతాడు శ్ర్రీ శ్రీ.  పెన్ డ్రైవ్ దొరక్క ఆమెని చంపేసి వెళ్ళిపోతారు ఆ ముగ్గురు కొడుకులూ.   

        వీళ్ళే హంతకులని  కేసు నమోదవుతుంది. కానీ  సరైన  సాక్ష్యాధారాల్లేక విడుదలైపోతారు. శ్రీ శ్రీ ఇంకా తల్లడిల్లి పోతాడు. భార్య సుమతి ఇక ఒకటే మార్గముందని చెప్తుంది. పేపర్లో పడిన ఆ ముగ్గురు హంతకుల ఫోటోలలో ఒకడి ఫోటోని  మార్క్ చేసి,  శ్రీ శ్రీని యుద్ధానికి పంపిస్తుంది. వెళ్లి చంపేసి వస్తాడు. రెండో వాణ్ణీ  మార్క్ చేసి ముహూర్తం పెడుతుంది. ఇంకో విధంగా చంపేసి వస్తాడు. 

     ఇప్పుడు ఎసిపి అజయ్ కుమార్ (నరేష్)  రంగంలోకి వస్తాడు. ఈ హత్యలు ఎవరు చేస్తున్నారో అర్ధం జేసుకోలేకపోతాడు. అయితే  రెండో హత్య చేస్తున్నప్పుడు మంకీ క్యాప్ వేసుకుని వచ్చిన హంతకుడి పోలికలు చెప్తాడు ఆ ఇంటి పనివాడు. ఆ పోలికలతో ఒక ఊహా చిత్రం తయారు చేయిస్తాడు  ఎసిపి అజయ్. ఈ మంకీ క్యాప్ వ్యక్తి  ఎవరో అంతుపట్టదు. అప్పుడు శ్రీ శ్రీ ఒక ఫైలు పంపిస్తాడు. అప్పట్లో తను పోరాడిన తన కూతురి హత్య తాలూకు కేసు వివరాలు అందులో వుంటాయి. ఆ ఫైలు చదువుకున్న అజయ్, అందులోనే శ్రీ శ్రీ పంపుకున్న శ్రీశ్రీ  ఫోటో చూసి, ఊహా చిత్రంతో  మ్యాచ్ చేసుకుని శ్రీశ్రీని అరెస్ట్ చేయడానికి బయల్దేరడంతో సగం కథ ముగుస్తుంది.

     ఈ కథ శ్వేత చనిపోయి, కేసు కొట్టేసిన వాతావరణ నేపధ్యంలో ప్రారంభమవుతుంది. ఆమె ఎలా వుండేదీ, ఏం చేసి ఎలా హత్యకి గురయ్యిందీ అంచెలంచెలుగా  మల్టీ పుల్ ఫ్లాష్ బ్యాకులతో ఇంటర్వెల్ లోపే  తెలిసిపోతుంది. నడుస్తున్న కథలో అప్పటికి శ్రీశ్రీ ఇద్దరు హంతకుల్ని కూడా చంపేస్తాడు.  అజయ్ అరెస్ట్ చేయడానికి వస్తే, ముందు పోతురాజుల గూడెం వెళ్లి అక్కడ్నించీ నీ దర్యాప్తు చేసుకో –అని సుమతి దబాయిస్తుంది. లాగి ఓటిచ్చుకుంటుంది కూడా ( ఎంతైనా తెరవెనుక కన్నతల్లే కాబట్టి కొడితే ఓర్చుకుని ఉంటాడు నరేష్, కాస్సేపు పాత్రని  హాయిగా మర్చిపోయి- ఇలా డ్రామా బాగా పండుతుందనుకుని). అజయ్ పోతురాజుల గూడెం వెళ్తే అక్కడున్న సూర్యా రావు తనదైన ఫ్లాష్ బ్యాక్ తో శ్వేత కథ మొదలెడతాడు. ఓ పాట కలుపుకుని ఇరవై నిముషాలు సాగే ఈ ఫ్లాష్ బ్యాక్ నిజానికి అవసరమే లేదు- ఆమె కథ మొత్తం ఫస్టాఫ్ లో చెప్పెశాక. ఇంకా ఆమె అక్కడ ఉద్యమం తీసి పోరాడుతున్నట్టు చూపడం కూడా అసహజం. ఒక రిపోర్టర్ రిపోర్టింగ్ మాత్రమే చేయగలదు, ఉద్యమాలు లేవదీయడం తీయడం ఆమె పని కాదు. ఆ రిపోర్టింగ్ కూడా ఛానెల్ అనుమతిలేకుండా కూడా చేయలేదు. 

     ఈ ఫ్లాష్ బ్యాక్ ముగింపు ఏమిటంటే, ఆ దుష్ట త్రయం సూర్యా రావు కాలు విరగ్గొట్టడం! దీంతో ఫ్లాష్ బ్యాక్ ముగించుకుని ఈ లోకంలో కొచ్చేస్తాడు సూర్యారావు. ‘షోలే’  లో సంజీవ్ కుమార్ చేతులని  గబ్బర్ సింగ్ నరకగానే ఫ్లాష్ బ్యాక్ అయిపోయినట్టు-  అలాటి షోలేయిజం కోసం కాలు విరగ్గొట్టి తాపత్రయ పడినట్టుందే తప్ప, మరే ప్రయోజనమూ లేదు. సూర్యారావు కాలు విరిగితే ఏమిటి, చేతులిరిగితే ఏమిటి? దీనికి బదులు ఇంటర్వెల్లో ఆపిన శ్ర్రీశ్రీ ని ఢీకొనడానికి వచ్చిన ఎసిపి అజయ్ తో కథని ముందుకు నడిపించి వుంటే బావుండేది. 

     ఎసిపి అజయ్  శ్రీశ్రీ ఇంటికి వచ్చేముందు  సూర్యారావు వచ్చి శ్రీశ్రీతో మాట్లాడుతూంటాడు. కట్ చేస్తే ఎసిపి అజయ్ వస్తాడు. ఇప్పుడు చూస్తే  శ్రీశ్రీ గాఢనిద్రలో వుంటాడు. ఎసిపిని చూసి సూర్యారావు దాక్కుని ఉంటాడు. ఇదెలా సంభవం ఒకపక్క ఇంటికొచ్చిన సూర్యారావు ఉండగానే శ్రీశ్రీ నిద్రపోవడం? ఎసిపి వచ్చి మాట్లాడుతున్నా మెలకువ రాకపోవడం, సుమతి చెంపఛెళ్లు మన్పించినా లేవకపోవడం? చెంప వాయింప జేసుకుని ఎసిపి వెళ్తున్నప్పుడే లేస్తాడు శ్రీశ్రీ. అతణ్ణి ఏదోలా చూసుకుంటూ వెళ్ళిపోతాడు అజయ్. కామెడీగా వుటుందీ సీరియస్ సీను- సూర్యారావు కాలు విరిగే సీనులాగే. సినిమాలో కామెడీ లేని లోటు ఇలా తీర్చినట్టున్నారు.

      ఇక శ్రీశ్రీ విషయం. ఛానెల్లో ఆ యెత్తున కూతురి మీద దాడిజరుగుతున్నా మొత్తం ఛా నెల్లో ఇంకెవరూ లేకపోవడం,  సెక్యూరిటీ సిబ్బంది  కూడా లేకపోవడం పోనీలే అని సరిపెట్టుకున్నా, లా ప్రొఫెసర్ శ్రీశ్రీ పోలీసులకి ఫోను చేయకుండా, కూతురి మీద  జరుగుతున్న ఘొరాన్ని  కనీసం చిత్రీకరించకుండా వూరికే తల్లడిల్లి పోతూంటాడు. ఇక కేసెలా గెలుస్తాడు, కేసు గెలవక పోవడానికి తనే కారకుడైనప్పుడు వ్యవస్థ మీద కోపమెందుకు?

       శ్రీశ్రీ చేసే ఇంకో పోరపాటేమిటంటే పనిమాలా కేసు ఫైలు తన ఫోటోతో  సహా ఎసిపికి పంపడం! పాత్ర ఇలా చేయదు, కథ ముందుకు నడవడం కోసం దర్శకుడు, రచయితలూ జోక్యం  చేసుకుని ఇలా చేశారు! 

      ఆ శ్రీశ్రీ రాసి చూపిస్తే, ఈ శ్రీశ్రీ చేసి చూపిస్తాడని ఇచ్చుకున్న బిల్డప్  ప్రకారం కృష్ణ పాత్ర బలంగా గానీ, చేసే హత్యలు ఎమోషనల్ గా గానీ  లేకపోవడం చాలా మైనస్ ఈ సినిమాకి. ఇప్పుడు ఈ తారాగణంతో ఈ సినిమా ఏదో అద్భుతం చేయగలదని కాదు, కనీసం కథా కథనాల్లో, పాత్రచిత్రణల్లో బలంవున్నా, వయసురీత్యా స్టామినా  తగ్గినప్పటికీ అదే ఎస్సెట్ అయ్యేది కృష్ణ పాత్రకి. వయోభారంతో ఓ పెద్ద బాధ్యత మీదేసుకున్న పెద్దమనిషి సతమతమయ్యే మానసిక, శారీరక సంఘర్షణలతో పాత్ర అద్భుతంగా నిలబడేది.  ఆయన కష్టం చూడలేక భార్యా కొడుకూ ఆ ప్రతీకార కాండలో చేతులు కలిపితే ఆ దృశ్యాలు కమర్షియల్ గా మరింత  ప్లస్ అయ్యేవి.    కానీ ఇవేవీ పట్టించుకోకుండా ఒక మూసలో వుండిపోయి,  పాత మూస తరహాలో ఈ సినిమా తీశారు - ఎక్కడా ఆసక్తి గానీ టెన్షన్ గానీ పుట్టించకుండా. దర్శకుడు ముప్పలనేని శివ టేకింగ్ పద్ధతులు కూడా అప్ డేట్ కాలేదు. 

       నాల్గు పాటలూ ఛాయాగ్రహణమూ అంతంత మాత్రంగా వున్నాయి. కృష్ణలో చురుకుదనం తగ్గింది, విజయనిర్మలలో బాగా పెరిగింది. స్ప్లిట్ స్క్రీన్ లో వీళ్ళిద్దరి పాత సినిమాల బిట్లు వేయడం ఓ గిమ్మిక్కు. ఎసిపి పాత్రలో నరేష్ ప్రొఫెషనల్ గా కన్పిస్తాడు. సూర్యారావుగా సాయికుమార్ ఇంకో నారాయణ మూర్తి అనుకోవాలి. ఇక శ్వేత పాత్ర నటించిన అంగనా రే పాత్రకి మించిన చురుకుదనంతో ఓవరాక్టింగ్ చేస్తున్నట్టు వుంటుంది. విలన్లు మురళీశర్మ, పోసానీలు షరామామూలే.

     సినిమా మహేష్ బాబు వాయిసోవర్ తో ప్రారంభమవుతుంది. ఈ వాయిసోవర్ ముగింపులో కూడా వుంటుంది. మహేష్ బాబు, కృష్ణ, విజయనిర్మల, నరేష్ ల తర్వాత ఇక చిట్టచివర్లో- ‘మనం’ లో మిగిలిన అక్కినేని వంశాంకురం అఖిల్ వచ్చినట్టు- ఇక్కడ సుధీర్ వచ్చేసి- మొత్తం ఘట్టమనేని అల్బంని కంప్లీట్ చేస్తాడు! 

     ఇలాటి క్రియేటివిటీని కాస్త కథమీద కూడా చూపించి వుంటే బావుండేది.

-సికిందర్






2, జూన్ 2016, గురువారం

షార్ట్ రివ్యూ!






రచన –దర్శకత్వం : త్రివిక్రం 

తారాగణం :   నితిన్‌, సమంత, అనుపమా పరమేశ్వరన్‌,  నరేష్‌, నదియా, ఈశ్వరీరావు, అనన్య, శ్రీనివాస్‌ అవసరాల,  రావు రమేష్‌, పోసాని కృష్ణమురళి తదితరులు 
సంగీతం: మిక్కీ జె.మేయర్‌, ఛాయాగ్రహణం: నటరాజన్‌ సుబ్రమణ్యం 
బ్యానర్ :  హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌,నిర్మాత: ఎస్‌.రాధాకృష్ణ 
రచన : దర్శకత్వం: త్రివిక్రమ్‌ 
విడుదల: 02-06-2016
        ***

       ఒకే ఫార్ములాతో వరసగా రెండు ఫ్యామిలీ సినిమాలు తీసిన త్రివిక్రం నుంచి మళ్ళీ  అదే ఫార్ములా రిపీట యింది.  విడిపోయిన కుటుంబాలు కలుసుకునే ‘అత్తారింటికి దారేది’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ల తర్వాత  ‘అ ఆ’ సైతం  అదేబాటలో   ‘విడిపోయిన అత్త గారు ఎలా కలిశారు’  ఫార్ములాని రిపీట్ చేసింది. అయితే  ఈసారి హుషారైన రోమాంటిక్ సినిమాలతో క్రేజ్ పెంచుకున్న హీరో  నితిన్ ఇమేజిని కావలసినంత కుదించి,  సమంతాతో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాగా తీయడం ప్రత్యకత. కానీ  సమంతా కైనా ఆ హీరోయినిజం సరీగ్గా లేకపోవడంతో, రెండు కుటుంబాలు వాళ్ళు వాళ్ళు ముచ్చట్లాడుకునే సోప్ ఒపేరాలా కొత్త రూపం ధరించింది. వివరాల్లోకి వెళ్దాం...


 కథ :
        బిజినెస్ వుమన్ మహాలక్ష్మి (నదియా) అంటే భర్తకీ కూతురికీ హడల్. భర్త రామలింగం ( నరేష్), కూతురు అనసూయ ( సమంతా) ఒక జట్టుగా మహాలక్ష్మికి వ్యతిరేకంగా పథకాలేస్తూంటారు.  బెనర్జీ (గిరిబాబు) మనవడు శేఖర్ ( అవసరాల శ్రీనివాస్) తో మహాలక్ష్మి అనసూయకి సంబంధం చూస్తే  నచ్చక ఆత్మహత్యా యత్నం చేస్తుంది అనసూయ. ఆమెని మందలించి, ఈ సంబంధం చేసుకోవాల్సిందేనని,  పది రోజులు పని మీద చెన్నై వెళ్తుంది మహాలక్ష్మి. ఇక్కడ బోరు కొట్టి ఎక్కడికైనా వెళ్తానని మహాలక్ష్మి అంటుంది. ఆమెని ఏనాడో దూరమైన తన బావగారి వూరు కల్వపూడికి రహస్యంగా పంపించేస్తాడు రామలింగం- వెంట హైదరాబాద్ లోనే పనిచేస్తున్న మేనల్లుడు ఆనంద విహరి( నితిన్) నిచ్చి. ఆనంద్ తో వెళ్లి అనసూయ వాళ్ళింట్లో దిగుతుంది. ఆమె ఎవరో తల్లి కామేశ్వరి ( ఈశ్వరీ రావు)కీ, చెల్లెలు భాను (అనన్య) కీ పరిచయం చేస్తాడు ఆనంద్. అక్కడ తన డిమాండ్లతో, చిలిపి పన్లతో సరదాగా కాలం గడుపుతున్న అనసూయకి- ఆనంద్ ఏనాడో వూరిపెద్ద పల్లం వెంకన్న  ( రావురమేష్) కూతురు వల్లి ( పరమేశ్వరన్)తో సంబంధం కుదిరిందని తెలిసి జెలసీ ఫీలవుతుంది. ఇంతలో తను హైదరాబాద్ లో ఇంట్లో లేదన్న సంగతి తల్లికి తెలిసిపోయి వచ్చేస్తూంటే, ఆనంద్ ఆమెని తీసుకుని ఆమె తల్లి చేరుకునే లోగా ఇంటిదగ్గర దిగ బెట్టేస్తాడు. 

        ఇప్పుడేం జరిగింది? ఆనంద్ లేకుండా అనసూయ ఇంటిదగ్గర వుండగల్గిందా? ఆనంద్ నాగవల్లిని చేసుకోవడానికి ఒప్పుకోవడానికి కారణమేమిటి? మహాలక్షికి అనసూయ కల్వ పూడికి వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందా? తెలిస్తే ఏం జరిగింది? మహా లక్ష్మికి  ఆనాడు తన అన్నతో జరిగిన గొడవేంటి? ఎందుకు విడిపోయారు? ఇప్పుడెలా కలిశారు?...ఇవీ మిగతా కథలో తీర్చుకోవాల్సిన సందేహాలు. 

 ఎలావుంది కథ
        ముందుగానే చెప్పుకున్నట్టు మేనరికాల పాత కథే. విడిపోయిన కుటుంబాల రొటీన్ కథే. చూసి చూసి చూసి వున్న రీసైక్లింగ్ కథే. ఇన్నేసి సార్లు తీస్తున్న వాళ్లకే  విసుగులేనప్పుడు, కొందరు చూసే వాళ్ళకి ఎందుకుండాలి? మళ్ళీ మళ్ళీ చూసేయాలి. తప్పకుండా చూడాలి.

 ఎవరెలా చేశారు 
         ఓపెనింగ్ సీనుతో మొదలెడితే,  తన వాయిసోవర్ తో అక్కడక్కడా కథా గమనాన్ని చెప్తూ సాగే సమంతాకి కేవలం గ్లామరస్ పాత్రే ఇది. ఈ విషయంలో ఈ సినిమాకి హైలైట్ గా కనిపిస్తుంది, పాత్రపరంగా చెప్పుకోవాలంటే హీరోయిన్ ఓరియెంటెడ్ అయిన ఈ కథలో తనకి కథ నడిపే పనికూడా లేదు, కేవలం దర్శకుడు ఏర్పాటు చేసే ఆయా సీన్లలో చిలిపిగా నటించుకుపోవడమే. 

        ఇది నితిన్ కథతో సినిమా కాదు కాబట్టి పాసివ్ పాత్ర అని కూడా అనలేకుండా సహాయ పాత్రగా కన్పిస్తాడు. సహాయ పాత్ర కాబట్టి ఒక హీరో కుండే గోల్, సంఘర్షణ వగైరా లేక- చూస్తే  చూడండి, పోతే పోండి - అన్నట్టు వుంటాడు. ఈ సినిమా కథ విషయంలో, ప్రధాన పాత్ర విషయంలో ఇక నిర్వచనాలు మార్చుకోవాలన్న ధోరణిలో వుంటుంది. 

        ఇతర పాత్రల్లో నదియా, నరేష్ లు ఆకట్టుకుంటారు. అయితే రావురమేష్ ఉన్న కొన్ని సీన్లలో ఎక్కువ ప్రభావం చూపిస్తాడు- ఫన్నీ డైలాగులతో. సినిమా ముగింపు షాట్ అతడిమీదే వుంటుంది- అప్పుడు పలికే చిన్న డైలాగుతో బాగా హోరెత్తించేస్తాడు. హిందీ విలన్లు రాజ్యమేలుతున్న కాలంలో రావు రమేష్ ఒక్కడే విలనీకి తెలుగుదనాన్ని నూరిపోస్తున్నాడు. 

        మిక్కీ జె మేయర్ పాటలు తెర మీద చూస్తున్నంత సేపే- బయటికొస్తే ఒక్కటీ గుర్తుండవు. ఈ పాటలకీ,  మిగతా అన్ని దృశ్యాలకీ నటరాజన్ సుబ్రహ్మణ్యం కెమెరా పనితనం క్లాస్ లుక్ ని తీసుకొచ్చింది. నితిన్ కి తొలిసారిగా చాలా పెద్ద బడ్జెట్ తో ఎక్కువ సాంకేతిక ప్రమాణాలున్న సినిమా దక్కింది.

చివరికేమిటి!
        చూసిందే చూడాలనుకుంటే చూడొచ్చు. షరతులు వర్తిస్తాయి : ఏ హీరోయినిజమూ, హీరోయిజమూ ఆశించకూడదు. త్రివిక్రమ్ సినిమాల్లో ఏ స్క్రీన్ ప్లే స్ట్రక్చరూ, క్యారక్ట రైజేషన్  లూ వుండవన్న నిర్ధారిత సత్యానికి ఈ సారి మాటల బలం కూడా లేకుండా పోయింది. ఇదలా ఉంచితే, చాలా తక్కువ చోట్ల మాత్రమే సీన్లలో పెప్, హుషారు కన్పిస్తాయి. అలాగే  పాత్రలకి గోల్ లేకపోవడంతో సెకండాఫ్ లో కూడా ఎంత సేపూ కథ ప్రారంభంకాక, చాలా సేపూ డల్  అయిపోతుంది. క్లయిమాక్స్ కొచ్చేసరికి, అది  నితిన్ పాత్ర మీద బలవంతంగా రుద్దిన ముగింపులా  కన్పిస్తుంది. సమంతాని అతను  వాళ్ళింట్లో అప్పజెప్పేసి వెళ్తున్నప్పుడు నితిన్ చెల్లెలి పాత్ర అనే ఒక మాటతో- “నా ఆనందం  నా గెలుపులో చూసుకోవాలి, ఎదుటి వాడి ఆనందంలో  ఎందుకు చూడాలి” - అని వెనక్కి వెళ్లి తండ్రి దగ్గర్నుంచి సమంతాని లాక్కుంటాడు.  నితిన్ పాత్ర  పాజిటివ్ అయివుంటే ఇలా చేయదు- త్యాగం చేసి వెళ్లి పోవాల్సిందే. అసలు ఎదుటి వాళ్ళ విజయాల్ని మనం ఎంజాయ్  చేస్తేనే  అలాటి విజయాలు మనకొస్తాయ్ - ఇది పాజిటివ్ అవుట్ లుక్!


-సికిందర్
cinemabazaar.in

       

  
       
         






1, జూన్ 2016, బుధవారం

తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ -15

స్ట్రక్చర్ నేర్చుకునేందుకు  శివ ని ఎంచుకోవడానికి కారణాలు,   ఇది సార్వజనీన ప్రమాణాలతో కూడిన నిర్మాణంతో వుండడం మొదటిదైతే,  ఈ స్క్రీన్ ప్లేలో నేర్చుకోవడానికి సూటి కథకి అడ్డు తగిలే కామెడీ ట్రాకులూ సబ్ ప్లాట్లూ వంటివి లేకపోవడం రెండోది. దీనివల్ల కథ, పాత్రలు ఎలా ప్రయాణిస్తున్నాయో ఏకత్రాటిపై స్పషంగా కన్పిస్తూ, అర్ధం జేసుకోవడానికి సులభంగా వుంది. ఇప్పుడు శివ మిడిల్ విభాగాన్ని ఫాలో అవుతూ దాని నిర్మాణాన్ని చూద్దాం. స్క్రీన్ ప్లేలో మిడిల్ విభాగం మిగతా బిగినింగ్ఎండ్ విభాగాలకన్నా పరిమాణంలో రెట్టింపు వుంటుందని తెలిసిందే.  సుమారుగా బిగినింగ్  ఇరవై సీన్లతో  25 శాతం స్క్రీన్ ప్లేని ఆక్రమిస్తే, మిడిల్  నలభై సీన్లతో  50 శాతం స్క్రీన్ ప్లేని ఆక్రమిస్తుంది; అలాగే ఎండ్ మరో ఇరవై సీన్లతో   25 శాతం స్క్రీన్ ప్లే ని ఆక్రమిస్తుంది. మిడిల్ విభాగం ఇంటర్వెల్ కి ముందు ఒకభాగం, ఇంటర్వెల్ తర్వాత ఇంకో భాగంగా వుంటుందని తెలిసిందే.  మొత్తం ఒకేసారి 50 సీన్లతో మిడిల్ భారం మీదేసుకుంటే ఎటునుంచి ఎటుపోవాలో తెలీక కన్ఫ్యూజన్ తో దారి తప్పిపోచ్చు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలంటే మధ్యలో సూర్యాపేట,  ఆతర్వాత  కోదాడ చేరుకోవాలని తెలీకపోతే గందరగోళమే. హైదరాబాద్ నుంచి సూర్యా పేట చేరుకోకుండా మధ్యలో  నార్కట్ పల్లి దగ్గర రైట్ టర్న్ తీసుకుని అద్దంకి హైవే మీద పడ్డా, లేదా సూర్యా పేట చేరుకుంటూ  అక్కడ్నించీ  కోదాడ వెళ్ళాలని తెలీక   లెఫ్ట్ టర్న్ తీసుకుని  జామ్మని  జనగామ రూట్లో దూసుకుపోయినా తేలేది మరెక్కడో!



కాబట్టి మిడిల్ ఎత్తుకుని క్లయిమాక్స్ దాకా బారుగా వెళ్ళాలంటే ముందుగా పించ్ -1, ఆ తర్వాత ఇంటర్వెల్, ఇంకా తర్వాత పించ్ -2 ల మీదుగా వెళ్ళాలని  తెలుసుకుంటే సీన్లు వేయడం సులభమవుతుంది. ముందుగా మిడిల్ మొదటి భాగాన్ని తీసుకుని, పించ్-1  కి దారి తీసే సీన్లు వేసుకున్నాక, ఆ తర్వాత పించ్- 1 నుంచీ సినాప్సిస్ లో రాసుకున్న ప్రకారం ఇంటర్వెల్ కి దారి తీసే సీన్లు వేసుకోవాలి. ప్లాట్ పాయింట్ వన్ దగ్గర మిడిల్ మొదలైనప్పుడు, అక్కడ్నించీ పించ్- 1 వరకూ ఎన్నైతే సీన్లు వుంటాయో, అవన్నీ పించ్- 1 కి డ్రైవ్ చేసేట్టు చూసుకోవడం ముఖ్యం. అప్పుడు పించ్- 1 నుంచీ సినాప్సిస్ లో  రాసుకున్న ఇంటర్వెల్ కి చేరేలా సీన్లు వేసుకోవాలి. ప్లాట్ పాయింట్ వన్ కీ, ఇంటర్వెల్ కీ మధ్య పించ్- 1 అనేది, ఇంటర్వెల్ ని ప్రేరేపించే ఘట్టం. దీన్ని ఉత్ప్రేరకం -1 అని కూడా అనొచ్చు. కింది పటం ఒకసారి చూడండి.


        ‘శివ’ ని ఆధారంగా చేసుకుని బిగినింగ్ విభాగం సీన్లు  ఎలా వేయాలో స్ట్రక్చర్ ని  గత 5వ  అధ్యాయంలో నేర్చుకున్నాం. ‘శివ’ బిగినింగ్ లో మొత్తం 20 సీన్లున్నాయి. ఇప్పుడు 21 వ సీన్నుంచి మిడిల్ చూద్దాం. ఈ మిడిల్ మొత్తం 52 సీన్లతో వుంది- జేడీని కొట్టినందుకు ప్రిన్సిపాల్ శివని మందలించడం దగ్గర్నుంచీ, సెకండాఫ్ లో చిన్నాకి గణేష్ గురించిన సమాచారం తెలిసే సీను వరకూ. ముందుగా ఇంటర్వెల్  వరకూ 30 సీన్ల స్ట్రక్చర్ నేర్చుకుందాం.

        మిడిల్ వన్ లైన్ ఆర్డర్ :
        21. జేడీ ని కొట్టినందుకు ప్రిన్సిపాల్ శివని మందలించడం, జేడీ చేసే పన్లకి మీరు యాక్షన్ తీసుకోకపోతే  నేనింకేం  చేయాలని శివ అనడం.
        22. క్యాంటీన్లో శివ అండ్ ఫ్రెండ్స్ ఎలక్షన్స్ గురించి చర్చ, ఇంతకాలం ఎదురులేకుండా జేడీ గెలుస్తూ వచ్చాడనీ, ఇప్పుడు శివ నిలబడి వాణ్ణి ఓడించాలనీ ఫ్రెండ్స్ అంటే, కాదని నరేష్ ని నిలబెడదామని శివ నిర్ణయించడం.
        23. జిమ్ లో శివ ఆశాల సరదా రోమాంటిక్ సీను.
        24. జేడీని కొట్టినందుకు కాలేజీ బయట గణేష్ శివకి వార్నింగ్ ఇవ్వడం.
        25. ఫ్రెండ్స్ వచ్చి శివ ని సెకెండ్ షోకి పిలిస్తే రాననడం, ఆశా వచ్చి పిలిస్తే  వెళ్ళడం.
        26. థియేటర్ కి  ఆశా వెంట వచ్చిన శివని చూసి ఫ్రెండ్స్ జోకులెయ్యడం.
        27. థియేటర్ లో  సినిమా చూస్తూ ఆశా డ్రీమ్ సాంగ్.
        28. సినిమా అయిపోయాక ఇంటికి వెళ్తున్న నరేష్ ని గణేష్ అనుచరులు చంపెయ్యడం.
        29. హాస్పిటల్లో నరేష్ శవాన్ని శివ చూడడడం.
        30. హోటల్ దగ్గర జేడీ మీద శివ ఎటాక్ చేయడం.
        31.  అరెస్టయిన జేడీ ని విడిపించుకోవడానికి నానాజీ రావడం, నానాజీ భవానీ కుడి భుజమని శివకి సీఐ చెప్పడం, అసలు భవానీ ఎవరని శివ అడిగితే, పొలిటీషియన్  మాచిరాజు అనుచరుడని కొంత చరిత్ర విప్పడం.
        32. శివ రౌడీలతో గొడవపడుతున్నాడని వదిన కోపగించుకోవడం, అన్న కూడా మందలించడం.
        33. క్యాంటీన్ లో మూడీ గా వున్న శివని ఆశా టీజ్ చేయడం, తన బర్త్ డే అని చెప్పడం.
        34. శివ, ఆశా రెస్టారెంట్ కి వెళ్ళడం, అక్కడ సాంగ్.
        35. భవానీ ఓపెన్ అవడం, విశ్వనాధంని కలవడానికి బయల్దేరడం.
        36. మాచిరాజు ప్రత్యర్ధి విశ్వనాధం వార్నింగ్ ఇస్తే భవానీ పొడిచి చంపెయ్యడం.
        37. కాలేజీ గోడ మీద ఎలక్షన్లో శివ నిలబడుతున్నట్టు మల్లి రాస్తూంటే, జేడీ చూసి
ఎలర్ట్ అవడం.
        38. జేడీ వెళ్లి భవానీకి ఈ విషయం చెప్పడం, శివ మనకి పనికిరావచ్చనీ, మన తరపున పోటీ చేయమని చెప్పమనీ భవానీ నానాజీతో ఆనడం.
        39. ఈ విషయం  చెప్పడానికి గణేష్ వస్తే శివ కొట్టి పంపించడం.
        40. టైం  చూసి శివని నరికి పారెయ్యమని భవానీ ఆదేశించడం.
        41. భవానీ విశ్వనాధాన్ని ఆధారాలు దొరక్కుండా చంపేశాడనీ, శివ జాగ్రత్తగా ఉండాలనీ సీఐ అనడం, ఆశా కూడా సమర్ధించడం, ప్రతీ వాడూ మనకెందుకని అనుకోబట్టే ఈ పరిస్థితులొచ్చాయని శివ అనడం.
        42. శివకి తన క్లాస్ మేట్ బాషా చెల్లెలి పెళ్లి వుందని తెలియడం.
        43. శివ అతడి ఫ్రెండ్స్ బాషా చెల్లెలి పెళ్ళికి హన్మకొండ  వెళ్తున్నారని భవానికి తెలియడం.
        44. అన్నకూతురికి జ్వరమనీ,  హాస్పిటల్ కి తీసికెళ్ళమనీ శివతో వదిన అనడం.
        45. ఈ పరిస్థితి చెప్పి,  పెళ్ళికి రాలేనని శివ ఫ్రెండ్స్ కి చెప్పడం.
        46. అన్న కూతురితో సైకిలు మీద శివ  హాస్పిటల్ కి బయల్దేరడం.
        47. నానాజీ భవానీకి ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం.
        48. శివ ఫ్రెండ్స్ ని  గణేష్ మాటు వేసి చంపేస్తే, శివ మన మీదికి రావచ్చు కాబట్టి,  వాడి ఫ్రెండ్స్ ని మనం చంపామని వాడికి తెలిసేలోగా వాణ్ణి కూడా లేపెయ్యమని భవానీ ఆదేశించడం.
        49. సైకిల్ మీద పోతున్న శివ ని కారులో భవానీ గ్యాంగ్ ఛేజ్ చేయడం, శివ వాళ్ళని ఎదుర్కోవడం.
        50. హన్మకొండ వెళ్ళే దారిలో శివ ఫ్రెండ్స్ మీద ఎటాక్ జరగడం, మల్లిని గణేష్ చంపెయ్యడం.
        *విశ్రాంతి.
***
      మిడిల్ బిజినెస్ ప్రకారం ఒక గోల్ పెట్టుకున్న హీరో ఆ గోల్ కోసం వ్యతిరేక శక్తులతో/పరిస్థితులతో  సంఘర్షిస్తాడు. ప్లాట్ పాయింట్ వన్ దగ్గర గోల్ చేపట్టినప్పుడు అందులోంచి పుట్టే కోరిక, రిస్క్, పరిణామాల హెచ్చరిక, ఎమోషన్ అనే నాల్గు ఎలిమెంట్స్ ఈ మిడిల్ బిజినెస్ లో వ్యక్తమవుతూ వుంటాయి.  అలాగే ప్లాట్ పాయింట్ వన్ సంఘటనలోనే  ఇంకో నాల్గు సప్లిమెంటరీలు పుట్టుకొస్తాయి,  అవి : పాత్ర చిత్రణలు, ప్రధాన పాత్రకి కల్పించిన అంతర్గత- బహిర్గత సమస్యలు, క్యారక్టర్ ఆర్క్, టైం అండ్ టెన్షన్ గ్రాఫ్. ఇవన్నీ మిడిల్లో నడుస్తున్న సీన్లలో కన్పిస్తూ వుండాలి. వీటిలో క్యారక్టర్ ఆర్క్ పడుతూ లేస్తూ వుంటే, టైం అండ్ అండ్ టెన్షన్ గ్రాఫ్ పైపైకి పోతూ వుండాలి. 

          ముందుగా గోల్ ఎలిమెంట్స్  చూద్దాం : 1. కోరిక : హీరో తన కెదురైన సమస్యని పరిష్కరించడం ద్వారా, తనకో, ఇతరులకో లబ్ది చేకూర్చాలన్న బలమైన కాంక్షని కలిగి వుండడం.

         1. కోరిక : అంతవరకూ కాలేజీలో పరోక్షంగా భవానీ అకృత్యాల్ని భరిస్తూ వచ్చిన శివ, ఇక ప్రత్యక్షంగా అతడితో తలబడాలన్న కోరికతో ఎదురు తిరిగి ఇక్కడ జేడీ మీద దాడి చేశాడు. విద్యా వ్యవస్థలో మాఫియాల జోక్యానికి ముగింపు పలకాలన్న బలమైన కోరిక ఇది. దీన్ని సపోర్టు చేసే సమాచారమంతా మనకి బిగినింగ్ విభాగంలోని సీన్ల ద్వారానే అందింది. కాలేజీలో భవానీ మనుషులు జేడీ సహా ఎలా పీక్కు తింటున్నారో చూశాం. అంతే కాదు, ఇంకో రూపంలో ఈ మాఫియా పడగ నీడ ఇంటిదగ్గర శివ కుటుంబంలోకీ జొరబడిన వైనాన్నికూడా  చూశాం. ఈ నేపధ్య బలంతో పుట్టిన శక్తివంతమైన కోరిక ఇది.

            2. పణం : భవానీ లాంటి కరుడు గట్టిన మాఫియాతో తలపడేందుకు సర్వస్వాన్నీ పణంగా ఒడ్డాడు  శివ. ఇక్కడ్నించీ జీవితం ఓడిడుకుల పాలవుతుందని తెలుసు : విద్యార్ధి జీవితం, కుటుంబ జీవితం కూడా. ఇంకా హీరోయిన్ తో ప్రేమ కూడా రిస్కులో పడవచ్చు. ఇదేమీ అతను  డైలాగుల్లో చెప్పడం లేదు. చెప్పకూడదు కూడా. సన్నివేశంలో ఈ ఫీల్ వ్యక్తమవ్వాలి, అది వ్యక్తమవుతోంది : బిగినింగ్ విభాగంలో మనం చూసిన అతడి అందమైన విద్యార్థి జీవితం లోంచి, అందమైనది కాకపోయినా కమిటైన కుటుంబ జీవితం లోంచీ. ఇక హీరోయిన్ తో గడుపుతున్న జీవితం లోంచి  రిస్కులో పడిన ప్రేమనీ ఫీలవుతున్నాం. 

            3. పరిణామాల హెచ్చరిక : ఏ బ్యాకింగ్ లేనివాడు అంత పెద్ద మాఫియా మీద యుద్ధం ప్రకతించాడంటే ఏంటి పరిస్థితి. బిగినింగ్ విభాగంలో అన్న కూతురితో శివ బాంధవ్యాన్ని చూపించుకు రావడం చూస్తేజరుగనున్న పరిణామాల్లో ఆ అమ్మాయికే ఇందులో కీడు ఎక్కువన్న సంకేతం ఇవ్వకనే ఇచ్చేస్తోందీ గోల్ ఏర్పడే ఘట్టం- మొదటి మూలస్థంభం. 

            4. ఎమోషన్ : పై మూడింటిని గమనంలోకి తీసుకున్న మనం, యాదృచ్ఛికంగా ఎమోషన్ ని ఫీలవుతున్నాం. చాలా బలమైన ఎమోషన్. లాజిక్ తగ్గడమో, ఇంకేదో లోపించడమో జరిగిన నామమాత్రపు ఎమోషన్ కాదు. ఇంత రిస్కు చేస్తున్నందుకు హీరో మీద ప్రేమా సానుభూతీ ఇంకా పెరిగి,  అతడి గోల్ ని మన గోల్ గా ఓన్ చేసుకుని, ఇన్వాల్వ్ మెంట్ తో, కథలో అతను ఇంకా మున్ముందు  కెళ్ళాడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాం.

        పై నాలుగు ఎలిమెంట్స్ బిగినింగ్ విభాగపు కథనంలో ఏర్పాటైతేనే వాటి ఆధారంగా మిడిల్ ముందుకు సాగుతుంది. అంటే సంఘర్షణ మొదలవుతుంది. ఈ సంఘర్షణ హీరోకీ అతడి ఎదుటి పాత్రకీ మధ్య యాక్షన్ రియాక్షన్ల సంకుల సమరంగా సాగుతుంది. ఒక రాయి హీరో వేస్తే, బదులుగా  ఇంకో రాయి ఎదుటి వాడు వేస్తాడు. ఆ దెబ్బ తగిలో తప్పించుకునో హీరో ఇంకో రాయితో సమాధానం చెప్తే,  ఈ దెబ్బ తగిలో తప్పించుకునో ఎదుటి వాడు ఇంకో రాయి విసురుతాడు. ఇద్దరికీ ఒకే పాయింటు మీద పోరాటం జరుగుతూంటుంది. పాయింటు కోసం హీరో, పాయింటుని చెడగొట్టేందుకు ఎదుటు వాడూ...ఈ పోరాటంలో ఒక్కోసారి దెబ్బలు తప్పించుకోలేక గాయాలపాలు కావచ్చు ఇద్దరూ.  దేన్నో, ఇంకెవర్నో   కోల్పోతూ కూడా వుండొచ్చు కూడా. ఇంటర్వెల్ దగ్గరి కొచ్చేసరికి హీరోయే తీవ్రంగా నష్టపోయి దిక్కు తోచని స్థితిలో పడతాడు. ఇదీ ఇంటర్వెల్ వరకూ మిడిల్ మొదటి భాగంలో వుండాల్సిన  బిజినెస్. 

        ఇప్పుడు మిడిల్ మొదటి భాగం సీన్లలో పైవన్నీ ఎలా సర్దుకున్నాయో చూద్దాం-
        పైన పొందుపరచిన మిడిల్ మొదటి భాగం వన్ లైన్ ఆర్డర్ లో 30 సీన్లున్నాయి.
వీటిలో మొదటి సీను (21), అంతకి ముందు ప్లాట్ పాయింట్ వన్ లో జేడీని శివ కొట్టిన ఫలితంగా ప్రిన్సిపాల్ రియాక్షన్ గా వేస్తూ మిడిల్ ప్రారంభించారు. 

        దీని తర్వాత ఇంటర్వెల్ వరకూ 29 సీన్లు రెండు సీక్వెన్సులుగా ఏర్పడ్డాయి. అంటే రెండు టాపిక్స్ మీద నడిచాయి : మొదటి టాపిక్ కాలేజీ ఎలక్షన్స్, రెండో టాపిక్ శివ క్లాస్ మేట్ బాషా చెల్లెలి పెళ్లి. మొదటి టాపిక్ సీక్వెన్సులో 20 సీన్లు, రెండో టాపిక్ సీక్వెన్సులో 9 సీన్లూ వున్నాయి. ఎలక్షన్  అంశం చుట్టూ మొదటి సీక్వెన్స్ శివకీ,  భవానీకీ మధ్య పోరాటాన్ని క్రమంగా పెంచుతూ పోతే, బాషా చెల్లెలి పెళ్లి చుట్టూ రెండో సీక్వెన్స్ ఆ పోరాటాన్ని  ఉధృతం చేసింది. మొదటి సీక్వెన్స్  స్క్రీన్ ప్లే నడకలో పించ్ పాయింట్ -1 దగ్గర ముగిస్తే, ఇంటర్వెల్ కి దారి తీయించే ఆ పించ్ పాయింట్ -1 అక్కడ్నించీ బాషా   చెల్లెలి పెళ్లి సీక్వెన్సు ని ఎత్తుకుని ఇంటర్వెల్ లో ముగించింది నియమాల ప్రకారం.
                                     ***

  మొదటి సీక్వెన్స్                  22. క్యాంటీన్లో శివ అండ్ ఫ్రెండ్స్ ఎలక్షన్స్ గురించి చర్చ, జేడీ మీద శివ పోటీ చేయాలంటే, కాదని నరేష్ ని నిలబెడదామని శివ అనడం.

          23. జిమ్ లో శివ ఆశాల సరదా రోమాంటిక్ సీను.
        24.
జేడీని కొట్టినందుకు కాలేజీ బయట గణేష్ శివకి వార్నింగ్ ఇవ్వడం.
        25.
ఫ్రెండ్స్ వచ్చి శివ ని సెకెండ్ షోకి పిలిస్తే రాననడం, అదే ఆశా వచ్చి పిలిస్తే వెళ్ళడం.
        26. థియేటర్ కి  ఆశా వెంట వచ్చిన శివని చూసి ఫ్రెండ్స్ జోకులెయ్యడం.
        27.
థియేటర్ లో  సినిమా చూస్తూ ఆశా డ్రీమ్ సాంగ్.
        28.
సినిమా అయిపోయాక ఇంటికి వెళ్తున్న నరేష్ ని గణేష్ అనుచరులు చంపెయ్యడం.
        29.
హాస్పిటల్లో నరేష్ శవాన్ని శివ చూడడడం.
        30.
హోటల్ దగ్గర జేడీ మీద శివ ఎటాక్ చేయడం.
        31
అరెస్టయిన జేడీ ని విడిపించుకోవడానికి నానాజీ రావడం, నానాజీ ఎవరో శివకి సీఐ చెప్పడం, భవానీ బ్యాక్ గ్రౌండ్ కూడా చెప్పడం.
        32.
శివ రౌడీలతో గొడవపడుతున్నాడని వదిన కోపగించుకోవడం, అన్న కూడా శివ ని మందలించడం.         
       
33. క్యాంటీన్ లో మూడీ గా వున్న శివని ఆశా టీజ్ చేయడం, ఈ రోజు తన బర్త్  డే అని చెప్పడం.
       
34. శివ ఆశా రెస్టారెంట్ కి వెళ్ళడం, సాంగ్.
        35.
భవానీ ఓపెన్ అవడం, విశ్వనాథం ని కలవడానికి వెళ్ళడం.
        36.
మాచిరాజు ప్రత్యర్ధి విశ్వనాధం వార్నింగ్ ఇస్తే భవానీ పొడిచి చంపెయ్యడం.
        37. కాలేజీ గోడమీద ఎలక్షన్ లో శివ నిలబడుతున్నట్టు మల్లి నినాదాలు రాస్తూంటే జేడీ చూసి ఎలర్ట్ అవడం.
        38. జేడీ వెళ్లి భవానీకి ఈ విషయం చెప్పడం, జేడీని తప్పించి,  శివని మన తరపున పోటీ  చేయాల్సిందిగా కోరమని గణేష్ ని భవానీ ఆదేశించడం.

       
39. ఈ రాయబారంతో గణేష్  వెళ్తే శివ కొట్టి పంపించడం.
        40. ఇక టైం చూసి, శివ ని ఫ్రెండ్స్ తో బాటు చంపెయ్యమని భవానీ ఆదేశించడం. 

       
ఈ సీక్వెన్సులో కథని ప్రధాన పాత్ర శివే యాక్టివ్ గా వుండి నడిపిస్తున్నాడని గమనించాలి. కథ బోరుకొట్టకుండా వుండాలంటే ప్రధాన పాత్రే  కథని నడపాలి. ఎత్తుకోవడమే ఎలక్షన్ తో మొదలు పెట్టి, కాలేజీ చరిత్రలో మొట్ట మొదటి సారిగా జేడీకి నరేష్ ని పోటీ పెట్టించి,  ప్రేక్షకుల దృష్టిలో భవానీకి మళ్ళీ సవాలు విసిరాడు. ప్లాట్ పాయింట్ వన్ దగ్గర జేడీ ని కొట్టి సవాలు విసిరింది గాక, వెంటనే మళ్ళీ ఇంకో సవాలుకి సిద్ధమవుతున్నాడు. ఇలా కాకుండా జేడీని కొట్టేశాం కదా, ఇంకేముంది మన జోలికెవడూ రాడనేసి, ఆశాతో శివ లవ్ ట్రాక్ మొదలెట్టుకో లేదు. ఆ లవ్ ట్రాక్ లో కామెడీలూ డ్యూయెట్టూ అయిపోయాక,  స్వయంగా భావానీయే కథని గుర్తు చేస్తూ శివకి గట్టి బ్యాంగ్ నివ్వలేదు. అప్పుడు శివ తెలివి తెచ్చుకుని భవానీ మీది కెళ్ళలేదు. ఇలా జరిగివుంటే శివ ఉత్త పాసివ్- రియాక్టివ్ పాత్ర అయిపోయేవాడు. 

        జేడీ ని కొట్టినందుకు రియాక్షన్ గా గణేష్ కాలేజీకి శివ దగ్గరి కొస్తాడు. ఇది మొదటి సారి ఇద్దరూ ముఖా ముఖీ అవడం, దీన్ని గుర్తు పెట్టుకుని ఒక టెర్రిఫిక్ షాట్ తో రిజిస్టర్ చేస్తాడు దర్శకుడు. శివతో గణేష్ బచ్చా గాడనుకుని తేలిగ్గా మాట్లాడతాడు. బుద్ధిగా చదువుకోమంటాడు. భవానీ సంగతి నీకు తెలీదు, నరేష్ ని విత్ డ్రా చేసుకోమంటాడు. అప్పుడు శివ- ఇంకా నరేష్ ని నిలబెట్టాలని ఖచ్చితంగా అనుకోలేదు,ఇప్పుడు డిసైడ్ చేసుకున్నాను నువ్వొచ్చాక. భవానీ గాడు ఏమైనా చెప్పానుకుంటే వాణ్ణి వచ్చి చెప్పమను, నీలాటి చెంచా గాళ్ళని పంప వద్దని చెప్పు- అంటాడు. దీంతో జేడీకి మండిపోయి కొట్టబోతాడు. గణేష్ ఆపి- చిన్న వయసుకదా కొంచెం పొగరెక్కువ, మళ్ళీ కలుద్దాం - అనేసి వెళ్ళిపోతాడు. 

        ఈ సీన్లో ప్రధానంగా  గమనించాల్సిందేమిటంటే, శివ భవానీకే నేరుగా సవాలు విసురుతున్నాడు- బచ్చాగాళ్ళతో పెట్టుకోదల్చుకోలేదు. అంటే భవానీ కంటే తనే ఎక్కువ అనే సంకేతాలిస్తున్నాడు. భవానీ గాడూ అంటూ నిర్లక్ష్యంగా సంబోధిస్తూ రెచ్చ గొడుతున్నాడు పరిణామాల్ని లెక్క చెయ్యకుండా. తనకి చెంచాగాళ్ళతో  బచ్చాగాళ్ళతో  పని లేదు- భవానీ గాడు ఏమైనా చెప్పానుకుంటే వాణ్ణి వచ్చి చెప్పమను - అనేశాడు. అంటే,  కథ హీరోకీ విలన్ కీ మధ్య అయినప్పుడు అది వెంటనే డైరెక్టుగా మొదలై పోవాలి. ఇంకా చల్లకొచ్చి ముంత దాచడమనే  వ్యవహార ముండకూడదు. ఇప్పుడు చాలా  సినిమాల్లో చూపిస్తున్నట్టు- విలన్ చాటుగా వుంటే,  క్లయిమాక్స్ వరకూ హీరో అతడి బచ్చాలతోనే పోరాడుతూ వుండడ మనే నాన్చుడు, బలహీన, పాసివ్  వ్యవహారం ఇక్కడ లేదు.

        రెండో దేమిటంటే, శివ అన్న మాటలకి జేడీని ఆపకుండా గణేష్ ఫైటింగ్ మొదలెట్టేసి వుంటే, ఈ సీనులో  కథని నిలబెట్టే సస్పెన్స్ మిగిలేది కాదు. ఫైట్ చేయడం కంటే, చిన్న వయసుకదా కొంచెం పొగరెక్కువ, మళ్ళీ కలుద్దాం - అనేసి గణేష్ వెళ్ళిపోవడం సెన్సాఫ్ డేంజర్ ని పెంచింది. అలా వెళ్ళిన గణేష్ వూరుకోడని, ఇంకేదో చేస్తాడని  మనకి తెలుసు.  ఆ  ప్రమాదాన్ని శివ ఎలా ఎదుర్కొంటాడనే ఉత్కంఠ ఇక్కడ పుడుతోంది. ఇలా సీక్వెన్సులో ఈ మొదటి సీన్లోనే శివ క్యారక్టర్ ఆర్క్ పైకి లేవడమేగాక, టైం అండ్ టెన్షన్ గ్రాఫ్ కూడా పైకి లేచింది టెన్షన్ ని పెంచేస్తూ. 

        సీక్వెన్స్ ఎత్తుగడని ఇలా ఎస్టాబ్లిష్ చేశాక, ఇంకా వాదోపవాదాలు పెట్టుకోలేదు. నేరుగా యాక్షన్లో కెళ్ళిపోయే సీన్లు మొదలయ్యాయి. 25 నుంచీ 30 వ సీను వరకూ శివ ఆశాతో ఫ్రెండ్స్ తో సినిమా కెళ్ళడం, సినిమా చూసి ఒంటరిగా తన గదికి వెళ్తున్న నరేష్ ని గణేష్ గ్యాంగ్ మాటువేసి చంపెయ్యడమూ, హాస్పిటల్లో నరేష్ శవాన్ని చూసి శివ చలించడమూ, అక్కడ మల్లి సమాచారమివ్వడమూ జరుగుతాయి. తాము సినిమా కెళ్ళి నట్టు జేడీకి తెలిసి గణేష్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడని చెప్తాడు మల్లి. 

        శివ ఇక్కడ తను చేపట్టిన గోల్ తాలూకు పరిణామాల హెచ్చరిక వాస్తవ రూపం దాల్చడం మొదటి సారిగా ప్రత్యక్షంగా చూశాడు. తను ఒక మిత్రుణ్ణి కోల్పోయాడు. యాక్షన్ = ఎలక్షన్ లో నరేష్ ని నిలబెడుతున్నాను, ఏం చేసుకుంటావో చేసుకో అన్నట్టు సీక్వెన్స్ ఎత్తుగడలో శివ గణేష్ కి సవాలు విసిరాడు; దీని రియాక్షన్ = గణేష్ నరేష్ ని చంపేశాడు.  సవాలు విసిరినప్పుడు గణేష్ శివతో దెబ్బలాటకి దిగకుండా సైలంట్ గా వెళ్ళిపోయాడు. దెబ్బలాటకి దిగివుంటే నరేష్ కి కాలేజీలో మద్దతు పెరిగి ఎలక్షన్ గెలుస్తాడనేమో, ఇలా గుట్టుగా మట్టు బెట్టేసి ఎలక్షన్లో అడ్డు తొలగించుకున్నాడు. వ్యూహాలు ప్రతివ్యూహాలుగా వాస్తవిక ధోరణిలో ఈ కథ నడుస్తోంది. 

        నరేష్ హత్యకి యాక్షన్ గా శివ వెళ్లి జీడీని కొడతాడు. పోలీసులు వచ్చి జేడీని అరెస్టు చేస్తారు. పోలీస్ స్టేషన్ కి భవానీ కుడి భుజం నానాజీ వచ్చి బెయిలు మీద జేడీ ని విడిపించుకుపోతాడు. అక్కడే శివ ఆశా వుంటారు. నానాజీ అనుచరుడు ‘శివ అంటే అతనే’  అని నానాజీకి శివని చూపిస్తాడు. శివకి మొదట గణేష్ తెలిశాడు, ఇప్పడు నానాజీ తెలు స్తున్నాడు. నానాజీ వెళ్ళిపోతూ శివ మీద ఓ లుక్కేస్తాడు. ఇలా ఈ సీను కూడా కథని పెంచుతోంది. 

        ఇప్పటివరకూ భవానీ ప్రేక్షకులకి కన్పించలేదు. అతడి గురించి పాత్రలు అనుకుంటూ ప్రేక్షకులకి ఆసక్తి పెంచడమే జరుగుతోంది. ఇక్కడ శివ అసలీ భవానీ ఎవరని సీఐని అడిగేసరికి,  భవానీ బ్యాక్ గ్రౌండ్ తెలుస్తుంది. ఒకప్పుడు బస్టాండు కూలీగా వుండే భవానీ రౌడీయిజంలోకి దిగి, మాచిరాజు దృష్టిలో పడి అతడి రాజకీయ అవసరాలకి ఉపయోగపడుతున్నాడని సీఐ చెప్తాడు. అంటే శివ భావానీతోనే  కాదు, మాచిరాజు అనే పవర్ఫుల్ పొలిటీషియన్ తో కూడా తలపడాలని సూచనలందాయి. కథ ఇంకా చిక్కన
వుతోంది. కథ మొదటినుంచీ విడతల వారీగా భవానీ గురించి ఇస్తూ వస్తున్న వివరణ పర్వం (ఎక్స్ పొజిషన్) ఇక్కడ కొలిక్కి వచ్చింది. ఇంకా ముందు సీన్లలో భవానీ గురించి చెప్పుకోవడాని కేమీ లేదు- ఇక అతను ఓపెన్ అవడానికి రంగం సిద్ధమయ్యింది.
        భవానీ గురించి సీఐ వివరాలు చెప్పాక, తర్వాతి 32వ సీనులో శివ ఇంటి కొస్తాడు. ఇక్కడ వదిన రుసరుస లాడుతూంటుంది- పోలీస్ స్టేషన్ కెక్కాడనీ, రౌడీ లతో దెబ్బ లాడుతున్నాడనీ. అన్న మరో సారి మందలిస్తాడు. శివ అదే మౌనంతో ఉంటాడు. బిగినింగ్ విభాగం నుంచీ  శివకి ఇంట్లో వదినతో సమస్య వుందని చూపిస్తూ వచ్చారు. ఇది అంతర్గత సమస్య. బహిర్గత సమస్య భవానీ. పోలీస్ స్టేషన్ లో భవానీతో బహిర్గత సమస్య తాలూకు సీను అయిపోయాక, వెంటనే వదినతో అంతర్గత సమస్య తాలూకు సీను వేయడం మంచి డైనమిక్స్. డైనమిక్స్ అంటే పరస్పర వ్యతిరేకమైన పరిస్థితుల్ని బొమ్మాబొరుసులుగా చూపిస్తూ పోవడమే.         ఇదిమంచి కథన పధ్ధతి కింది కొస్తుంది. 

        ఇప్పుడొకసారి బిగినింగ్ విభాగం లోకి వెళ్దాం. బిగినింగ్ విభాగంలో ఇంకేమేం మిగిలున్నాయి ముందుకు  నడిపించడానికి? శివ, అతడి ఫ్రెండ్స్, ఆశా, సీఐ మిడిల్ లోకి ట్రావెల్ అయ్యారు. జేడీ, గణేష్ కూడా ట్రావెల్ అయ్యారు. భవానీ గురించిన ఎక్స్ పొజిషన్ కూడా మిడిల్లోకి ట్రావెల్ అయ్యింది; అన్నావదినలూ  వాళ్ళ కూతురు కూడా మిడిల్లోకి ట్రావెల్ అయ్యారు. ఇక లెక్చరర్, ప్రిన్సిపాల్ లకి ఇంకా కథతో పనిలేదు కాబట్టి అక్కడే ఆగిపోయారు. 

        భవానీ ఎక్స్ పొజిషన్ తో బాటు, శివ అంతర్గత- బహిర్గత సమస్యలూ తెగిపోకుండా మిడిల్లోకి బదలాయింపు అయి కొనసాగుతున్నాయి. ఈ మూడూ కూడా ఎమోషన్స్.  ఇవి శివ క్యారక్టర్ ఆర్క్ ఉత్థాన పతనాలతో బాటు, టైం అండ్ టెన్షన్ గ్రాఫ్ కీ అక్కరకొస్తున్నాయి.  తెర మీద సమయం గడుస్తున్న కొద్దీ టెన్షన్ పడిపోకుండా,  సీన్లు ఈ టైం అండ్ టెన్షన్ గ్రాఫ్  ని పోషిస్తున్నాయి. 

        కాబట్టి ఇక బిగినింగ్ విభాగంలో బ్యాలెన్స్ ఏమీ లేదు. ఇక కథ కోసం వెనక్కి చూడకుండా, బిగినింగ్ ని మర్చిపోయి, పూర్తిగా మిడిల్ మొదటి భాగంపై దృష్టిని కేంద్రీ కరించడమే.

        ఇక ఇంట్లో తీవ్రతరమవుతూన్న పరిస్థితికి మూడీగా మారి పోయిన శివని,  ఆశా టీజ్ చేసి మూడ్ మార్చేస్తుంది. ఇప్పుడు తాజాగా శివ పాత్ర వున్న ఈ మానసిక స్థితికి ఆశా దృష్టికోణంలో ఆమెకా చిలిపి ప్రవర్తన అవసరమే. ఏదో ప్రేక్షకులకి ఒక పాట కోసం సమయమైంది కాబట్టి దానికేదో లీడ్ వేయలేదు. లవ్ సాంగ్ అనే effect అవసరమే,  దీని cause కూడా అర్ధవంతంగా వుండాలి- అది పాత్రల్లోంచి, కథలోంచి పుడితే వాటిని ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది.  

        ఈ పాట అయిపోగానే మనం చాలా సేపు పనిచేసిన కంప్యూటార్ లో రీఫ్రెష్ బటన్ నొక్కినట్టు,  కథనాన్ని ఛేంజ్ ఓవర్ తో రీఫ్రెష్ చేసుకోవాలి. అలా రిఫ్రెష్ చేసినప్పుడు కథనంలో మళ్ళీ పాత విషయం, మళ్ళీ పాత పాత్ర రాకూడదు. కొత్త విషయంతో కొత్త పాత్ర రావాలి. డైనమిక్స్ అంటే ఇది కూడా. అలా బిగినింగ్ నుంచీ ఎక్స్ పొజిషన్ లో నలుగుతూన్న విలన్ భవానీ పాత్ర,  ఈ 35 సీన్లో తెరపైకి వస్తాడు. ఇప్పటికి సమయం 52 వ నిమిషం. ‘షోలే’ లో కూడా గబ్బర్ సింగ్  ఎక్స్ పొజిషన్లో నలిగీ నలిగీ గంట తర్వాత కన్పిస్తాడు. 

        భవానీ పాత్ర పరిచయం ఇంత వరకూ పరోక్షంగా అయింది. ఇప్పుడు ప్రత్యక్షంగా అవుతోంది. అవుతూనే ‘ఎవడ్రా ఆ శివ గాడూ?’ అని కేకలేయలేదు. అప్పుడిది పాత్ర ప్రత్యక్ష పరిచయ సీను అవదు, పరిచయానంతర సీనులా వుంటుంది.  అందుకని విశ్వనాధం మనిషి అతడి దగ్గరికి వచ్చి విశ్వనాథం కలవాలనుకుంటున్నట్టు చెప్పడంతో, ఈ ప్రత్యక్ష పరిచయ సీను అర్ధవంతంగా ప్రారంభమవుతుంది. మనకి భవానీకీ  శివకీ మధ్య నడుస్తున్న కథ మాత్రమే తెలుసు. కానీ భవానీ గురించి చివరి ఎక్స్ పొజిషన్ లో (31 వ సీన్ లో) భవానీ గాడ్ ఫాదర్ మాచిరాజు ప్రస్తావనతో కథ ఇంకో  లెవెల్ పైకి వెళ్ళింది. కాబట్టి దీని కంటిన్యుటీగా ఇక్కడ ప్రత్యక్ష పరిచయ  సీను పడాలి. విశ్వనాథం మనిషి భవానీ దగ్గరికి రావడంతో ఈ ప్రత్యక్ష పరిచయ సీను ప్రారంభం. విశ్వనాథాన్ని కలవడానికి భవానీ ఒక స్పాట్ కి వెళ్తాడు. అక్కడ తేడాలొచ్చి తన గాడ్ ఫాదర్ అయిన మాచిరాజు రాజకీయ ప్రత్యర్థి  విశ్వనాథాన్ని, మాచిరాజు శ్రేయస్సు దృష్ట్యా పొడిచి చంపేస్తాడు భవానీ. ఇంత గురు భక్తి ప్రదర్శించుకున్న భవానీ మాచిరాజుతో ఏమనుభవించాలో అదే అనుభవించి తీరతాడు చివరికి. ఇలాటి జీవితాలు ఇలాగే వుంటాయి. ఇదింకో డైనమిక్స్ తో కూడిన పాత్రచిత్రణ. 

        ఇదయ్యాక ఇప్పుడు ప్రధాన కథలోకి భవానీని రప్పిస్తాడు శివ- ఎలక్షన్లో తనే నిలబడుతున్నట్టు మళ్ళీ గోడమీద రాయడంతో అది చూసి జేడీ వెళ్లి భవానీకి చెప్పడంతో.

        సీన్ 38 : విషయం చెప్పిన జేడీని బయటికి పంపించేసి, నానాజీతో చాలా వ్యూహాత్మకంగా మాట్లాడతాడు భవానీ : “నానాజీ, ఈ జేడీ  ప్రతిదానికీ మన హెల్ప్ అడుగుతాడు? ఈ స్టూడెంట్ లీడర్లు మనకి బలం అవాలి గానీ, మన బలం మీద వీళ్ళు  బ్రతక్కూడదు. వాడు చెప్పిందాన్ని బట్టి ఈ శివ అంత తేలిగ్గా కొట్టి పారేసే వాళ్ళాలేడు... సరీగ్గా వాడుకుంటే మనకి పనికి రావచ్చు... నువ్వొక పనిచెయ్ (గణేష్ తో-)  వెళ్లి అతణ్ణి కలువ్. ఎలక్షన్ లో నిలబడమని చెప్పు, కానీ మన తరపున”  

       
దీంతో భవానీ ఎంత యూజ్ అండ్ థ్రో టైపో తెలిసిపోతోంది. జేడీని కరివేపాకులా తీసి పారేశాడు. ఇప్పుడు శత్రువైనా సరే, తనక్కావాల్సింది వ్యాపారాభివృద్ధి కాబట్టి శివకి గాలం వేస్తున్నాడు- జేడీకి హేండిచ్చి శివని ఎలక్షన్లో నిలబెట్టాలని ఆలోచన చేశాడు. జేడీకి రుచి చూపిస్తున్న ఇదే యూజ్ అండ్ థ్రో పాలసీని, మాచి రాజు నుంచి తను కూడా రుచి చూడ బోతున్నాడు చివర్లో భవానీ!

        ఇలా పాత్రచిత్రణలూ డైనమిక్స్ కలిసి కథని సజీవం చేస్తాయి. వెనకటి యాక్షన్-  రియాక్షన్ ల ప్లేలో నరేష్ ని చంపించినందుకు గాను యాక్షన్ తీసుకుని శివ జేడీ ని కొట్టాడు, అరెస్టయిన జేడీ రియాక్షన్ గా బెయిలు మీద విడుదలైపోయాడు. దీనికి యాక్షన్ గా శివ ఎన్నికల్లో నిలబడుతున్నట్టు మల్లి గోడ మీద రాశాడు. దీనికి రియాక్షన్ గా జేడీ వెళ్లి భవానీకి చెప్పాడు, దీనికి రియాక్షన్ గా భవానీ శివతో బేరసారాలకి దిగాడు. ఈ బేర సారాలకి గణేష్ తనదగ్గరికొస్తే ఇప్పుడు ఇంకో యాక్షన్ గా శివ గణేష్ ని కొట్టి పంపిస్తాడు.   

        దీనికి రియాక్షన్ భవానీ చూపిస్తాడు : “నానాజీ, ఈ వూళ్ళో మనమేం చేసినా చెల్లుతోందంటే, జనానికి మనమంటే భయం గనుక. ఇప్పుడెవడో శివ అనేవాడు, పది మందిలో గణేష్ ని కొట్టాడని తెలిసికూడా నేనేం చేయలేదనుకో, జనానికి మనమంటే భయం తగ్గుతుంది. అడ్డమైన వాడూ ఎదురు తిరుగుతాడు. కానీ మనకు బలముందని వెనకా ముందూ చూడకుండా తొందర పడకు. వాడి మీద ఓ కన్నెసి వుంచు, కరెక్ట్ టైం చూసి వాణ్ణీ వాడి ఫ్రెండ్స్ నీ నరికి పారేయ్!”
        దీంతో ఈ సీక్వెన్స్ ముగుస్తుంది.  
       పై సీక్వెన్స్ ని జాగ్రత్తగా గమనిస్తే,  ఇందులో బిగినింగ్- మిడిల్-ఎండ్ విభాగాలు కన్పిస్తాయి.. మొత్తంగా ఒక స్క్రీన్ ప్లే ఎలాగైతే  బిగినింగ్- మిడిల్- ఎండ్ విభాగాలుగా వుంటుందో, ఈ విభాగాల్లో వుండే సీక్వెన్సులు కూడా  వాటి బిగినింగ్- మిడిల్- ఎండ్ విభాగాలతో వుంటాయి. మళ్ళీ  ఈ సీక్వెన్సుల్లో  వుండే ఒక్కో సీనూ వాటి బిగినింగ్- మిడిల్- ఎండ్ విభాగాలతో వుంటుంది.  స్క్రీన్ ప్లే పటిష్టంగా వుండాలంటే ఈ ఏర్పాటు తప్పనిసరి. జానర్ తో సంబంధం లేకుండా ఏ కథయినా సీక్వెన్సులతోనే వుంటుంది : ఫస్టాఫ్ లో నాలుగు సీక్వెన్సులు, సెకండాఫ్ లో ఇంకో నాలుగు సీక్వెన్సులు మొత్తం 8 సీక్వెన్సులు వుంటాయి.  అంటే స్క్రీన్ ప్లే బిగినింగ్ లో రెండు, మిడిల్ మొదటి భాగంలో రెండు, మిడిల్ రెండో భాగంలో మరో రెండు, ఎండ్ లో ఇంకో రెండూ వుంటాయి. 

        శివ మిడిల్ మొదటి భాగంలో రెండు సీక్వెన్సులు గమనించాం- ఒకటి ఎలక్షన్ టాపిక్ తో, రెండు బాషా చెల్లె పెళ్లి టపిక్ తో. 

        మొదటి సీక్వెన్స్ (22 నుంచి 40వ సీను వరకు)  పైన విశ్లేషించాం. ఇది సీక్వెన్స్ గా ఎలా నిర్మాణమై వుందో ఈ కింద చూద్దాం : 

బిగినింగ్: ఎత్తుగడతో సాధారణ స్థితి :
       
22. క్యాంటీన్లో శివ అండ్ ఫ్రెండ్స్ ఎలక్షన్స్ గురించి చర్చ, జేడీ మీద శివ పోటీ చేయాలంటే, కాదని నరేష్ ని నిలబెడదామని శివ అనడం.
          23. జిమ్ లో శివ ఆశాల సరదా రోమాంటిక్ సీను.
        24.
జేడీని కొట్టినందుకు కాలేజీ బయట గణేష్ శివకి వార్నింగ్ ఇవ్వడం.
        25.
ఫ్రెండ్స్ వచ్చి శివ ని సెకెండ్ షోకి పిలిస్తే రాననడం, అదే ఆశా వచ్చి పిలిస్తే వెళ్ళడం.
        26. థియేటర్ కి  ఆశా వెంట వచ్చిన శివని చూసి ఫ్రెండ్స్ జోకులెయ్యడం.
        27.
థియేటర్ లో  సినిమా చూస్తూ ఆశా డ్రీమ్ సాంగ్.
        28.
సినిమా అయిపోయాక ఇంటికి వెళ్తున్న నరేష్ ని గణేష్ అనుచరులు చంపెయ్యడం.

 మిడిల్ – హత్యతో అసాధారణ స్థితి- సంఘర్షణ :
       
29. హాస్పిటల్లో నరేష్ శవాన్ని శివ చూడడడం.
        30.
హోటల్ దగ్గర జేడీ మీద శివ ఎటాక్ చేయడం.
        31
అరెస్టయిన జేడీ ని విడిపించుకోవడానికి నానాజీ రావడం, నానాజీ ఎవరో శివకి సీఐ చెప్పడం, భవానీ బ్యాక్ గ్రౌండ్ కూడా చెప్పడం.
        32.
శివ రౌడీలతో గొడవపడుతున్నాడని వదిన కోపగించుకోవడం, అన్న కూడా శివ ని మందలించడం.         
       
33. క్యాంటీన్ లో మూడీ గా వున్న శివని ఆశా టీజ్ చేయడం, ఈ రోజు తన బర్త్  డే అని చెప్పడం.
       
34. శివ ఆశా రెస్టారెంట్ కి వెళ్ళడం, సాంగ్.
        35.
భవానీ ఓపెన్ అవడం, విశ్వనాథం ని కలవడానికి వెళ్ళడం.
        36.
మాచిరాజు ప్రత్యర్ధి విశ్వనాధం వార్నింగ్ ఇస్తే భవానీ పొడిచి చంపెయ్యడం.
        37. కాలేజీ గోడమీద ఎలక్షన్ లో శివ నిలబడుతున్నట్టు మల్లి నినాదాలు రాస్తూంటే జేడీ చూసి ఎలర్ట్ అవడం.

          ఎండ్ – పరిష్కారం :

        38. జేడీ వెళ్లి భవానీకి ఈ విషయం చెప్పడం, జేడీని తప్పించి,  శివని మన తరపున పోటీ  చేయాల్సిందిగా కోరమని గణేష్ ని భవానీ ఆదేశించడం.

       
39. ఈ రాయబారంతో గణేష్  వెళ్తే శివ కొట్టి పంపించడం.
        40. ఇక టైం చూసి, శివ ని ఫ్రెండ్స్ తో బాటు చంపెయ్యమని భవానీ ఆదేశించడం.
        కథలో ఒక్కో సీక్వెన్స్ ఎక్కడ్నించి ఎక్కడి దాకా వుందో గుర్తించి,  దాన్ని పై విధంగా విభజించుకుని ఆర్డర్  వేసుకుంటే సులభంగా వుంటుంది, ఏ సీను తర్వాత ఏమిటనే గందరగోళం వుండదు.

     రెండో సీక్వెన్స్ భాషా చెల్లెలి పెళ్లి టాపిక్ తో  సీన్లు ఇలా వున్నాయి :


41. భవానీ విశ్వనాధాన్ని ఆధారాలు దొరక్కుండా చంపేశాడనీ, శివ జాగ్రత్తగా ఉండాలనీ సీఐ అనడం, ఆశా కూడా సమర్ధించడం, ప్రతీ వాడూ మనకెందుకని అనుకోబట్టే ఈ పరిస్థితులొచ్చాయని శివ అనడం. 
        42. శివకి తన క్లాస్ మేట్ బాషా చెల్లెలి పెళ్లి వుందని తెలియడం.
        43. శివ అతడి ఫ్రెండ్స్ బాషా చెల్లెలి పెళ్ళికి హన్మకొండ  వెళ్తున్నారని భవానికి తెలియడం.
        44. అన్నకూతురికి జ్వరమనీ,  హాస్పిటల్ కి తీసికెళ్ళమనీ శివతో వదిన అనడం.
        45. ఈ పరిస్థితి చెప్పి,  పెళ్ళికి రాలేనని శివ ఫ్రెండ్స్ కి చెప్పడం.
        46. అన్న కూతురితో సైకిలు మీద శివ  హాస్పిటల్ కి బయల్దేరడం.
        47. నానాజీ భవానీకి ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం.
        48. శివ ఫ్రెండ్స్ ని  గణేష్ మాటు వేసి చంపేస్తే, శివ మన మీదికి రావచ్చు కాబట్టి,  వాడి ఫ్రెండ్స్ ని మనం చంపామని వాడికి తెలిసేలోగా వాణ్ణి కూడా లేపెయ్యమని భవానీ ఆదేశించడం. 
        49. సైకిల్ మీద పోతున్న శివ ని కారులో భవానీ గ్యాంగ్ ఛేజ్ చేయడం, శివ వాళ్ళని ఎదుర్కోవడం. 
        50. హన్మకొండ వెళ్ళే దారిలో శివ ఫ్రెండ్స్ మీద ఎటాక్ జరగడం, మల్లిని గణేష్ చంపెయ్యడం.

          పై సీన్లు ఏవి ఎందుకున్నాయో సులభంగా అర్ధమైపోతున్నాయివేరే విశ్లేషణ అవసరం లేదుమొదటి సీక్వెన్స్ ముగింపులో శివనీఫ్రెండ్స్ నీ చంపెయ్యమని భవానీ ఆదేశించిన నేపధ్యంలోబాషా చెల్లెలి పెళ్లి టాపిక్ తో ఈ రెండో  సీక్వెన్స్  ప్రారంభ
మయ్యిందిఈ సీక్వెన్స్ స్క్రీన్ ప్లేలో పించ్ -1 దగ్గర మొదలయ్యిందిసహజంగానే ఇంటర్వెల్ కి దారి తీసిందిమల్లి హత్యతో ఈ సీక్వెన్స్ ముగుస్తూ ఇంటర్వెల్ పడింది.

          
ఈ సీక్వెన్స్ నిర్మాణం ఇలా వుంది :  
 బిగినింగ్ -సాధారణ స్థితి : 
          41. భవానీ విశ్వనాధాన్ని ఆధారాలు దొరక్కుండా చంపేశాడనీ, శివ జాగ్రత్తగా ఉండాలనీ సీఐ అనడం, ఆశా కూడా సమర్ధించడం, ప్రతీ వాడూ మనకెందుకని అనుకోబట్టే ఈ పరిస్థితులొచ్చాయని శివ అనడం.
        42. శివకి తన క్లాస్ మేట్ బాషా చెల్లెలి పెళ్లి వుందని తెలియడం.
        43. శివ అతడి ఫ్రెండ్స్ బాషా చెల్లెలి పెళ్ళికి హన్మకొండ  వెళ్తున్నారని భవానికి తెలియడం.
        44. అన్నకూతురికి జ్వరమనీ,  హాస్పిటల్ కి తీసికెళ్ళమనీ శివతో వదిన అనడం.
        45. ఈ పరిస్థితి చెప్పి,  పెళ్ళికి రాలేనని శివ ఫ్రెండ్స్ కి చెప్పడం.

మిడిల్ – అసాధారణ సత్తి- సంఘర్షణ : 
        46. అన్న కూతురితో సైకిలు మీద శివ  హాస్పిటల్ కి బయల్దేరడం.
        47. నానాజీ భవానీకి ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం.
        48. శివ ఫ్రెండ్స్ ని  గణేష్ మాటు వేసి చంపేస్తే, శివ మన మీదికి రావచ్చు కాబట్టి,  వాడి ఫ్రెండ్స్ ని మనం చంపామని వాడికి తెలిసేలోగా వాణ్ణి కూడా లేపెయ్యమని భవానీ ఆదేశించడం.  

ఎండ్ – పరిష్కారం :
        49. సైకిల్ మీద పోతున్న శివ ని కారులో భవానీ గ్యాంగ్ ఛేజ్ చేయడం, శివ వాళ్ళని ఎదుర్కోవడం. 
        50. హన్మకొండ వెళ్ళే దారిలో శివ ఫ్రెండ్స్ మీద ఎటాక్ జరగడం, మల్లిని గణేష్ చంపెయ్యడం.



(next : మిడిల్ రెండో భాగం)
-సికిందర్