రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

21, నవంబర్ 2015, శనివారం

స్ట్రక్చర్-7






స్క్రీన్ ప్లేలో మిడిల్ విభాగం విలువని గుర్తించకపోతే చాలా నష్టం కథకి. నూటికి 90 శాతం మంది ఇది తెలుసుకోకుండానే రాసేస్తున్నారు. స్క్రీన్ ప్లేకి బిగినింగ్ ముఖ చిత్రమైతే మిడిల్ దేహం. దేహం లేకుండా, ఒకవేళ వున్నా సగానికి కుదించి, ఇంకా  ఆ సగంలో సగానికి కూడా  కుదించి రాసే స్క్రీన్ ప్లేలు నిజానికి స్క్రీన్ ప్లేలు కావు. స్క్రీన్ ప్లేలో సగ భాగం అంటే 50 శాతం నిడివితో  మిడిల్ విభాగం వుంటే అది ఉత్తమ స్ట్రక్చర్. 25 శాతం వుంటే బలహీన స్ట్రక్చర్, 25 శాతం కన్నా తక్కువ వుంటే అది స్క్రీన్ ప్లేనే కాదు. మిడిల్ విభాగం బిజినెస్ లోకి వెళ్ళే ముందు మిడిల్ భౌతిక స్వరూపం గురించి లోతుగా తెలుసుకోవడం అవసరం.  ఓ రెండు గంటల స్క్రీన్ ప్లే వుందంటే అందులో అరగంట సేపు బిగినింగ్, ఓ  గంటసేపు  మిడిల్, ఇంకో అరగంట సేపూ ఎండ్ విభాగాలుండాలన్న మాట - శాతాల్లో చూస్తే  స్ట్రక్చర్   25%- 50%- 25% గా ఉండాలన్న మాట. అంటే 1 : 2 : 3 నిష్పత్తులన్న మాట. ఎటొచ్చీ మిడిల్ అనేది బిగినింగ్, ఎండ్ విభాగాల కంటే రెట్టింపు సైజులో ఉండాలన్న మాట.

        ఎందుకు రెట్టింపు సైజులో వుండాలి? అసలు కథంతా ఇక్కడే వుంటుంది కాబట్టి. బిగింగ్ అనేది కథకాదు. అది కథని పరిచయం చేసే ప్రవేశ ద్వారం మాత్రమే.  అలాగే ఎండ్ కూడా కథ కాదు. అది కథకి ముగింపు పలికే నిష్క్రమణ మార్గం మాత్రమే. మిడిల్ లో వున్న కథని పరిచయం చేసేది బిగినింగ్ అయితే, మిడిల్లో  లో నడిచిన కథకి ముగింపుకి  తెచ్చేది ఎండ్. ఎక్కడైతే కథా పరిచయ విభాగం ‘బిగినింగ్’ అనేది ముగింపు కొస్తూ  సమస్యని ఏర్పాటు చేస్తుందో,  ఆ బిందువుని ప్లాట్ పాయింట్ -1 అంటున్నాం. ఈ ప్లాట్ పాయింట్ - 1 దగ్గర నుంచీ ప్రారంభమయ్యేది మిడిల్. ఇది ఇంటర్వెల్ మీదుగా కొనసాగి అవతల ప్లాట్ పాయిట్ -2 అనే మరో బిందువు దగ్గర అంతమవుతుంది. ఈ బిందువు ప్లాట్ పాయిట్ - 1 దగ్గర ఏర్పాటు చేసే సమస్యకి పరిష్కార మార్గాన్ని సూచించే బిందువు. అంటే బిగినింగ్ అందించే  సమస్యని తీసుకుని మిడిల్  తనదైన బిజినెస్ తో సాధించి ఓ పరిష్కారమార్గాన్ని కనుగొని ఎండ్ కి అందిస్తుందన్న మాట. బిగినింగ్  అందించే సమస్యని పరిష్కరిస్తూ ఎండ్ కి అందించడం మిడిల్ నిర్వర్తించే కార్యకలాపమన్న మాట. పిండి మర నోటి దగ్గర గోధుమలు పోస్తే,  ఆ మర గోధుమల్ని ఆడించి పిండిగా మార్చి బయటికి ఎలా పంపుతుందో,   స్క్రీన్ ప్లేలో మిడిల్ చేసే పని కూడా ఇలాటిదే :  తన నోటికి బిగినింగ్ అందించే  సమస్యని మరాడించి, పరిష్కార మార్గాన్ని ఎండ్ కి అందించడం.

       మరలో గోధుమలు ఎంత సేపు పోస్తారు?  అది క్షణాల్లో పని. ఆ గోధుమలు పిండిగా మారడానికి నిమిషాలు పడుతుంది. చివరికి బయటికి రావడం మళ్ళీ క్షణాల్లో పనే. అలాగే  స్క్రీన్ ప్లే ప్రారంభంలో బిగినింగ్ విభాగం  మిడిల్ విభాగానికి సమస్యని అందించడం అంత చప్పున జరగాలి. ఆ సమస్యని మిడిల్ మరాడించడానికి ఎంత సమయమైనా తీసుకోవచ్చు. సమస్యని అందించడానికే బిగినింగ్ చాలా సమయం తీసుకుంటే, మరాడించడానికి మిడిల్ కి చాలినంత సమయం దొరకదు. ఎందుకంటే దాని టైము ప్రకారం అది అవతల ఎండ్ కి పరిష్కారం అందించాలి. 
ఎండ్ సమయాన్ని తను తినేయ్యడానికి లేదు. ఎంత మిడిల్ సమయాన్ని బిగినింగ్ తినేసి పంక్చువాలిటీ లేకుండా ప్రవర్తించినా, మిడిల్ మాత్రం ఎండ్ తో పంక్చువాలిటీ తోనే వుంటుంది.  మిడిల్ మరాదించే సమయాన్ని బిగినింగ్ సమస్యని అందించడానికి తాత్సారం చేస్తూ  ఎంత తినేస్తే అంత మిడిల్ సమయం తగ్గి- ఆ మేరకు కథ కూడా తగ్గిపోతుంది...
contd..
కథంటే మిడిలే!
ఈ కింది పటం చూడండి : 

     ఇందులో  బిగినింగే  ఇంటర్వెల్ వరకూ సాగుతోంది. భారతీయ సినిమాల్లో సర్వసాధారణంగా వుండే స్ట్రక్చర్ ఇది. రెండు గంటల సినిమా వుందంటే సమస్యని స్థాపించడానికి ఇంటర్వెల్ వరకూ గంట సేపు సమయం తీసుకోవడం వల్ల ఇలా జరుగుతుంది. సమస్య స్థాపించే వరకూ కథ ప్రారంభమేకావడం జరగదని ప్రధానంగా గమనించాలి. రెండు గంటల సినిమాలో సగభాగం సమయం, అంటే స్క్రీన్ ప్లే లో 50% నిడివి అంతా ఇలా 25 % ఉండాల్సిన బిగినింగే తీసుకుంటే అంకాలు స్థానభ్రంశం చెందినట్టే. మొదటి అంకం అంటే బిగినింగ్ వెళ్లి- రెండో అంకం మిడిల్ లోకి జొరబడి ఇంటర్వెల్ వరకూ చోటుని ఆక్రమిస్తే, మిడిల్ వెళ్లి ఇంటర్వెల్ తర్వాత సర్దుకుంటోంది పై పటంలో.  దీంతో ఫస్టాఫ్ లో ప్రారంభమై ఇంటర్వెల్ మీదుగా సెకండాఫ్ కొచ్చి 50% ఉండాల్సిన మిడిల్ సైజు,  ఇంటర్వెల్ తర్వాత మాత్రమే సగానికి, అంటే 25 % కుంచించుకు పోతోంది. ఐదవ తరగతి చదివే  కుర్రాడు  ఐదవ తరగతి లోనే కూర్చోవాలి. వాడు వెళ్లి ఆరో తరగతిలో జొరబడితే అక్కడ కలకలం రేగుతుంది. వాడు ఇరికిరికి కూర్చునే సరికి ఆరో తరగతి కుర్రాళ్ళు కూడా వాడికి చోటు వదిలి తామూ ఇరికిరికి  కూర్చోవాల్సి వస్తుంది. తిక్కరేగితే వాణ్ణి తన్ని వెళ్ళ  గొట్ట వచ్చు. కానీ మిడిల్ చోటుని దర్జాగా కబ్జా చేసే బిగినింగ్ ని  మెడబట్టి  గెంటేసేందుకు మనసొప్పదు భారతీయ  స్క్రీన్ ప్లే కళాకారులకి. తమ సొమ్మేం పోయింది- కొంప లంటుకునేది నిర్మాతలకే కదా.  వెరసి మెజారిటీ భారతీయ సినిమాల స్క్రీన్ ప్లే స్ట్రక్చర్= 50% బిగినింగ్, 25% మిడిల్, 25% ఎండ్ = 2 : 1 : 1 = బిగినింగ్ గంట + మిడిల్ అరగంట + ఎండ్ అరగంట = ఫస్టాఫ్/సెకండాఫ్ స్క్రీన్ ప్లే మోడల్ అన్నమాట!

         బిగినింగ్ కే ఎక్కువ ఇంపార్టెన్సు. ఆ బిగినింగ్ సాగే ఇంటర్వెల్ వరకూ కథ వుండదు మళ్ళీ.  కామెడీ ట్రాక్, లవ్ ట్రాక్, పాటల కార్యక్రమం వీటితోనే గడిచిపోయి- ఇంటర్వెల్ వచ్చేసరికి అక్కడో పాయింటు తో సమస్యా స్థాపన. ఇంటర్వెల్ తర్వాత సెకండాఫ్ లోనే మిడిల్ ప్రారంభం. అంటే ఇక్కడే కథ ప్రారంభమవుతుంది ఇంటర్వెల్లో  ఏర్పాటు చేసిన ఆ సమస్యని పట్టుకుని. సెకండాఫ్ లో వుండే ఆ గంట సమయంలోనే మిడిల్ నీ, ఎండ్ నీ సర్దాలి కాబట్టి- మిడిల్ కోఅరగంట, ఎండ్ కో అరగంటా దక్కుతాయి. ఎండ్ కి ఇబ్బంది లేదు. దాని సైజు మారదు.  ఇలా మొత్తం రెండు గంటల నిడివిగల సినిమాలో కథ ( మిడిల్) నడిచేది అరగంట సేపే నన్న మాట. అరగంట కథ కోసం గంటన్నర సినిమా భరించాలి ప్రేక్షకులు. ఇదొక శ్రమ తప్పించుకునే స్కామ్  కాకపోతే ఏమిటి?

      ఇంతేనా? ఇంకో పెద్ద స్కామ్ కూడా వుంది. స్క్రీన్ ప్లే రైటింగ్ పేరుతో జరుగుతున్న అతి పెద్ద స్కామ్ లో అసలు శ్రమించడమే వుండదు. పై రెండో పటం చూస్తే ఇదేమిటో తెలుస్తుంది. ఈ స్కామ్  దెబ్బకి ఏ సినిమా కూడా ఒక్క పూట ఆడే ప్రసక్తే లేదు. ‘అఖిల్’ అయినా సరే,  ‘కిక్-2’  అయినా సరే. మిడిల్ ని గౌరవించక పోతే ఆ మిడిల్ నిర్మాతల్ని లెక్క చెయ్యదు. ఈ పటంలో మిడిల్ ని కూడా మింగేస్తూ బిగినింగే ఎండ్ దాకా సాగుతోంది.. ఎప్పుడో ఫస్టాఫ్ లోనే ప్రారంభమై ఇంటర్వెల్ మీదుగా సెకండాఫ్ లోకి ఎంటరై 50% ఉండాల్సిన మిడిల్, ఇక్కడ 12.5% శాతానికి చిక్కిశల్యమై,  వెళ్ళేసి ఎండ్ విభాగపు చోటులో ఇరుక్కుంటోంది. ఎండ్ కూడా 12.5% శాతానికి చిక్కిపోతోంది. అంటే ఇలా క్లైమాక్స్ దగ్గర మాత్రమే  ప్రారంభమయ్యే కథ,  అప్పుడే మొదలై అప్పుడే ముగిసిపోయే అగత్య మన్నమాట. ఈ కింది పటంలో కూడా చూడండి మిడిల్ పరిస్థితి. అందుకే మిడిలే ( కథే) వుండని  ఈ స్క్రీన్ ప్లే మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే! 

ఇలా జరగడానికి సినిమా మొత్తంగా  నడిచేది కథే అనే దురభిప్రాయంతో ఉండడమే కారణం.  సినిమా మొత్తం నడిచేది కథే కాదు, మిడిల్ లో వుండేది మాత్రమే  అసలు కథ, ప్రాణం, బలిమి, సింహాసనం, కథాపాలనా వగైరా. బిగినింగ్ లో వుండేది కేవలం ఉపోద్ఘాతమే ననీ, అలాగే ఎండ్ లో వుండేది కూడా కేవలం ఉపసంహారమే ననీ సాంకేతిక దృక్కోణంలో స్క్రీన్  ప్లే ని చూడకపోతే మిగిలేది రోదనే. 


        ప్రేక్షకుల సమయం విలువైనది.  ఆ విలువైన  సమయాన్ని సమాదరిస్తే వాళ్ళుకూడా సినిమాని ఆదరించే అవకాశం వుంటుంది. కథ చెప్పాలనుకుంటే చప్పున ఫస్టాఫ్ లోనే ప్రారంభించాలి మిడిల్ ని. ఉపోద్ఘాతాల చాపల్యం, ఉపసంహారాల ప్రకోపం అదుపులో వుంచుకోవాలి. కింద చూపిన పటాల్లో విధంగా కథని సకాలంలో ప్రారంభిస్తే స్ట్రక్చర్ అర్ధవంతంగా వుంటుంది : 

      ఈ సార్వజనీన, ప్రామాణిక త్రీ యాక్ట్ స్ట్రక్చర్ వున్న ‘దేవదాసు’ ని చూస్తారా, ‘పాండురంగ మహాత్మ్యం’ ని చూస్తారా, ‘అల్లూరి సీతారామ రాజు’ ని చూస్తారా- ఇంకా వందల్లోవున్న-
      ఆనాటి ఎన్నో సినిమాల్ని చూస్తారా మీ ఇష్టం. ఏమైపోయింది ఆనాటి నమ్మక మైన స్ట్రక్చర్? ఏమైపోయింది మిడిల్ కి అంతటి గౌరవం? ఫస్టాఫ్/సెకండాఫ్ స్ట్రక్చర్ తో మిడిల్ విలువని తగ్గించింది గాక, అసలు మిడిలే వుండని మిడిల్ మటాష్ స్ట్రక్చర్ అనే కొత్త వైకల్యాన్ని ఎందుకు  సంతరించుకుని భారీ సినిమాల్ని సైతం మట్టి కరిపించుకునే దాకా వచ్చింది?
contd.. 



         




   
       





    


రీమేక్ @ నేటివిటీ





దర్శకత్వం : రాజేష్ ఎం. సెల్వ 

తారాగణం :  కమల్ హాసన్, త్రిష, ప్రకాష్ రాజ్, సంపత్ కుమార్, కిషోర్, మధుశాలిని, అమన్ అబ్దుల్లా, ఆశా శరత్, సంతాన భారతి తదితరులు
కథ : ఫ్రెడరిక్ జార్డిన్
, నికోలస్ సాదా,  స్క్రీన్ ప్లే : కమల్ హాసన్, మాటలు : అబ్బూరి రవి
 
సంగీతం
; జిబ్రాన్, ఛాయాగ్రహణం : సానూ జాన్ వర్గీస్ 
బ్యానర్ : రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్ నేషనల్
నిర్మాతలు :
 కమల్ హాసన్, ఎస్. చంద్రహాసన్, గోకులం గోపాలన్, విసి ప్రవీణ్, బిజు గోపాలన్ 
విడుదల : 20 నవంబర్ 2015 

 ***

       కమల్ హాసన్ నటించాలంటే ఏ భేషజాలూ వుండవు. సాధారణ క్రైం  థ్రిల్లర్స్ కూడా అవి ఇంటరెస్టింగ్ గా వుంటే నటించేస్తారు. 2011 లో విడుదలైన ఫ్రెంచి థ్రిల్లర్ స్లీప్ లెస్ నైట్ని రీమేక్ చేస్తూ తను నటించిన చీకటి రాజ్యంఈ కోవలోనిదే. తెలుగు తమిళ ద్విభాషా చిత్రం గా నిర్మించిన దీన్ని తమిళంలో తూంగవనంగా మొన్న దీపావళికి విడుదల చేశారు. తెలుగులో ఈ వారం విడుదల చేశారు. ఇదొక సాధారణ థ్రిల్లరే  అయినా పకడ్బందీగా ఉండడానికి తారాగణ బలం కూడా సమకూర్చుకున్నారు. త్రిష, మధుశాలిని, ప్రకాష్ రాజ్, సంపత్ రాజ్ ల వంటి పాపులర్ నటీనటుల్ని తీసుకుని, కొత్త దర్శకుడు రాజేష్ ఎం. సెల్వ దర్శకత్వంలో విజయవంతంగా నిర్మించిన ఈ సినిమాలో అసలేముందో చూద్దాం..

ఒక రాత్రి - ఓ సంఘర్షణ 
        దివాకర్ ( కమల్ హాసన్ ) నార్కోటిక్ (మాదక ద్రవ్యాల) కంట్రోల్ బ్యూరో అధికారి.  ఓ తెల్లారి పొద్దున్నే తన అసిస్టెంట్ మణి (యుగి సేతు) తో కలిసి నగరంలో జరుగుతున్న డ్రగ్స్ స్మగ్లింగ్ ని విచ్చిన్నం చేస్తాడు. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో గాయపడతాడు.  విఠల్ రావ్ ( ప్రకాష్ రాజ్ ) అనే నైట్ క్లబ్ బాస్ డ్రగ్స్  రాకెట్ నడుపుతూంటాడు. దివాకర్ పట్టుకున్న పది కోట్ల విలువ జేసే డ్రగ్స్ విఠల్  రావ్ కి చెందినవే. దీంతో అతను కొడుకు వాసూ ( అమన్ అబ్దుల్లా) ని కిడ్నాప్ చేసి ఆ డ్రగ్స్ తెచ్చివ్వ మని బెదిరిస్తాడు. దివాకర్ కి డాక్టర్ అయిన భార్య ( ఆశా శరత్) తో విడాకులై వుంటాయి. కానీ అనునిత్యం ఆమె దివాకర్ దగ్గర వుండి  చదువుకుంటున్న కొడుకు యోగ క్షేమాల గురించే దివాకర్ కి ఫోన్లు ప్రాణం తీస్తూంటుంది.  కొడుకు కిడ్నాప్ అయ్యేసరికి భార్యతో ఇరకాటంలో పడ్డ దివాకర్ విధిలేక ఆ డ్రగ్స్ ని విఠల్ రావ్ కి అందించడానికి బయల్దేరతాడు. ఆ నైట్ క్లబ్ లోనే వుంటుంది మల్లికా ( త్రిష) అనే ఇంకో నార్కోటిక్స్ ఉద్యోగి. ఈమె దివాకర్ అక్కడికి బ్యాగుతో రావడాన్ని చూసి, విఠల్ రావ్ తో ఇతను కుమ్మక్కయ్యాడనుకుని ఆ బ్యాగు కొట్టేసి తన అధికారి ( కిషోర్) ని పిలుస్తుంది. ఇద్దరూ కలిసి దివాకర్ చర్యల మీద కన్నేస్తారు. కొడుకుని విడిపించుకోవడానికి వచ్చిన దివాకర్ తన బ్యాగు పోయినట్టు గుర్తించి ఇరకాటంలో పడతాడు. ఇంకోవైపు ఆ డ్రగ్స్ కోసం పెదబాబు ( సంపత్ రాజ్)  అనే ఇంకో స్మగ్లర్ వచ్చి విఠల్ రావ్ దగ్గర కూర్చుంటాడు. దివాకర్ తెలివిగా ఆలోచించి మైదా పిండిని తీసికెళ్ళి డ్రగ్స్ గా వాళ్లకి అంట గట్టడంతో అది బయటపడి మొత్తం అభాసవుతుంది- దివాకర్ ని పట్టుకోవడానికి గ్యాన్స్  వెంట పడతారు. కొడుకుని కాపాడు కోవడానికి నైట్ క్లబ్ లోనే దివాకర్ దాగుడు మూతలాడతాడు. ఇక నైట్ క్లబ్ లోనే ఎక్కడో బందీగా వున్న కొడుకుని దివాకర్ ఎలా విడిపించుకున్నాడన్నది మిగతా కథ.

ఎలా వుంది కథ 
        థ్రిల్లర్ జానర్ కి తగ్గట్టే ఉంది. ఒరిజినల్ ఫ్రెంచి సినిమాకి పూర్తి అనుసరణ కాకపోయినా కమల్ హసన్ తన స్క్రీన్ ప్లే నేర్పుతో నేటివిటీ ని దృష్టిలో పెట్టుకుని పకడ్బందే కథనం చేశారు. కేవలం ఒక రాత్రి నైట్ క్లబ్ లో జరిగే యాక్షన్ కథ ఇది. చప్పున ముగిసిపోయే రెండుగంటల పది నిమిషాల నిడివితో, అక్కడక్కడా ఫన్నీ డైలాగులతో టైం  పాస్ గ్యారంటీ  థ్రిల్లర్ ఇది. ఎలాటి పాటలూ, ప్రత్యేకంగా కామెడీ ట్రాకులూ వంటి పక్క చూపులు చూడకుండా ఏక సూత్ర కార్యక్రమం అన్నట్టు ఈ థ్రిల్లర్ని రక్తి కట్టించారు.

ఎవరెలా చేశారు
        మల్ హాసన్ చాలా రియలిస్టిక్ గా వున్న ఫైటింగ్  సీన్లలో ఈ వయసులోనూ చాలా సాహసించి నటించారు. కొడుకు కోసం ఫిజుకల్ యాక్షన్, భార్య కారణంగా ఎమోషనల్ యాక్షన్ - ఈ రెండిటి మధ్య నలిగే పాత్రగా నటించడమెలాగో ఆయనకి వేరే నేర్పక్కర్లేదు. బయట యాక్షన్ లో వుండే హీరోకి ఇంటి దగ్గర భార్య తోనో, ప్రియురాలితోనో ఒక సమస్య వుండడమనే  హాలీవుడ్ సినిమాల్లో కన్పించే  ఫార్ములా ని ఇక్కడా వర్కౌట్ చేశారు. త్రిష తో కమల్ చేసిన ఫైట్ ఇంకో ఎత్తు. ఈ రియలిస్టిక్ ఫైట్ లో త్రిష  కొత్త కోణాన్ని ప్రదర్శిస్తుంది.  కమల్ ని అపార్ధం జేసుకున్న పాత్రగా త్రిష ని నెగెటివ్ షేడ్స లో బాగా చూపించారు. ఆమె కెరీర్ లో ఇదొక విభిన్న పాత్ర. ఇక ప్రకాష్ రాజ్,  సంపత్ రాజ్ ల విలనీ సున్నిత హాస్యంతో ఎంటర్ టైన్ చేస్తుంది. మొత్తం నైట్ క్లబ్ లో డ్రగ్స్ కోసం జరుగుతున్న ముసుగులో గుద్దులాట స్టాఫ్ కి అర్ధం గాక- మైదా పిండి కోసం కొట్టేసుకుంటున్నారు’ - అనుకోవడం పెద్ద కామెడీ.  ఇలాటి ఫన్నీ డైలాగ్స్ చాలా వున్నాయి ఎంటర్ టైన్ మెంట్ పార్టు మిస్సవ్వకుండా.

        జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ  సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్. అలాగే సౌండ్ ఎఫెక్ట్స్ కూడా అంతర్జాతీయ  స్థాయిలో వున్నాయి. ఇక  సానూ జాన్ వర్గీస్ కెమెరా పనితనం క్లాస్ గా వుంది. ఎంత సేపూ నైట్ క్లబ్ లోనే  జరిగే కథ బోరు కొట్టకుండా, ఎప్పటికప్పుడు బ్లాకులు మార్చేస్తూ కొత్త ఫీల్ కలిగేట్టు చిత్రీకరణని ప్లాన్ చేయడం గొప్ప విషయం. అబ్బూరి రవి మాటలు తమిళ డైలాగులకి అనుసరణే  అయినా వాటిని కూర్చడంలో మంచి ఈజ్ చూపించారు.

చివరికేమిటి
        మంచు విష్ణు నటించిన తమిళ రీమేక్ డైన మైట్’  అనే థ్రిల్లర్ కంటే చాలా బెటరే చీకటి రాజ్యం’. నసపెట్ట కుండా థ్రిల్లర్ ని కూడా సరదాగా తీసే విధానం తో ఇది సక్సెస్ అయింది. లాజికల్ గా, ఎమోషనల్ గా పకడ్బందీగా వున్న దీన్ని ఓసారి చూసేసి ఎంజాయ్ చేయవచ్చు. 


-సికిందర్


సు'కుమారీయం' !







దర్శకత్వం :  పల్నాటి  సూర్య ప్రతాప్ 

కథ-  స్క్రీన్ ప్లే : సుకుమార్ 
తారాగణం : రాజ్ తరుణ్
, హెబ్బా పటేల్, హేమ తదితరులు 
మాటలు : పొట్లూరి వెంకటేశ్వర రావు
, 
సంగీతం : దేవీశ్రీ ప్రసాద్
, ఛాయాగ్రహణం : ఆర్ రత్నవేలు 
బ్యానర్ : పి ఎ మోషన్ పిక్చర్స్
 
నిర్మాతలు :
  విజయ్ ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి
విడుదల :  20 నవంబర్ 2015 

                     ***


         ప్రేమ కథల్ని సైకలాజికల్ గా ఏదో మలుపు తిప్పి కొత్తగా చెప్పాలన్న తపన గల దర్శకుడు సుకుమార్ ఈసారి నిర్మాతగా మారి కొత్త దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ కి దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. తను ఒక న్యూ ఏజ్ - మెట్రో లవ్ స్టోరీ లాంటి దాన్ని స్క్రీన్ ప్లే చేసి అందించారు. ఓ రెండు సినిమాలు- ఉయ్యాల జంపాల’, ‘సినిమా చూపిస్తా మావాలతో యూత్ లో పాపులరైన హీరో రాజ్ తరుణ్ - తమిళ నటి హెబ్బా పటేల్ ల కాంబినేషన్ లో మొహమాట పడకుండా అడల్ట్ కంటెంట్ ని దట్టిస్తూ రియలిస్టిక్ ప్రేమకథ కోసం ప్రయత్నించారు. ఈ ప్రయత్నం  దర్శకుడు మారుతీ తీసిన ఓ రెండు మూడు అడల్ట్  కామెడీలకీ, లేదా మొన్న వచ్చిన తమిళ ‘త్రిష లేదా నయనతార’ అనే  అల్ట్రా అడల్ట్ కామెడీకీ తేడాగా ఏమైనా ఉందా- లేక ఏదో డేరింగ్ ప్రయత్నం  పేరుతో పర్వెర్టెడ్ సెక్స్ గా తయారయ్యిందా ఈ కింద చూద్దాం..

        సిద్దూ (రాజ్ తరుణ్) కేటరింగ్ కోర్సు చదివి ఆవారాగా తిరుగుతూ,  సింగపూర్ లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూంటాడు. అతడి తల్లి (హేమ) ఓ నర్సు. భర్త వేరే సంబంధం పెట్టుకున్నాడని ఇరవై ఏళ్ళ క్రితం అతణ్ణి వదిలేసి ఆమె కొడుకుతో ఉంటోంది. సిద్దూ కి ముగ్గురు ప్రెండ్స్ వుంటారు. చిల్లర దొంగ తనాలు చేసి బతికేస్తూంటారు. తాగుళ్ళు తిరుగుళ్ళూ అన్నీ జరిగిపోతూంటాయి. వాళ్ళు నేరాలు చసి అండర్ గ్రౌండ్ కి వెళ్లి పోయినప్పుడల్లా తను అన్నం తీసికెళ్ళి అందిస్తూ సాయంగా ఉంటాడు. 

        ఇలా వుండగా ఈ కాలనీలోకి ముంబాయి నుంచి కుమారి (హెబ్బా పటేల్) అనే ఒక బి గ్రేడ్ ఛోటా మోడల్ వచ్చి తాత తో కలిసి సెటిలవుతుంది. సిద్దూని చూడగానే క్లోజ్ అవుతుంది. లవ్యూ చెప్పేస్తుంది. ఆమె విపరీత ప్రవర్తన
, హద్దులు మీరిన మాటలూ అతణ్ణి తికమక పెట్టేస్తాయి. చొరవ చేసి ఆమె కిస్ కూడా చేసేసరికి, తన ముందు ఎక్స్ పోజ్ కూడా చేసేసరికి - సిద్దూ ఫ్రెండ్స్ హెచ్చరిస్తారు. ఆమెకి చాలా మంది బాయ్ ఫ్రెండ్ వుండి  ఉంటారనీ, క్యారక్టర్ మంచిది కాదనీ నూరి పోస్తూంటారు. ఇతర అబ్బాయిల్ని జస్ట్ ఫ్రెండ్స్ అని ఆమె తెగ తిరిగేస్తూంటుంది. ఆమె ఎలా కన్పించినా, ఎవరేం చెప్పినా సిద్దూ ఆమెని ప్రేమించేస్తాడు. కానీ అనుమానం తీరక ఆమె క్యారక్టర్ ని పరీక్షించబోయి దొరికిపోతాడు. దీంతో ఆమె ఛీ కొడుతుంది. నన్ను ప్రేమించే మెట్యూరిటీ నీకు లేదని గుడ్ బై కొట్టేస్తుంది.
 

        హర్టయిన  సిద్దూ ఆమెకో చాలెంజి విసిరి, ఆ మేరకు వేరే అమ్మాయితో తిరగడం మొదలెడతాడు. మనం ప్రేమించే మనిషి వేరొకరితో తిరిగితే ఎలా వుంటుందో ఆమె తెలుసుకోవాలని ఇలా చేస్తూంటాడు. ఈ పంతాలు పట్టింపులూ రకరకాల మలుపులకి దారితీస్తాయి. పరిస్థితి విషమంగా మారుతుంది. అప్పుడు ఆమె గతం గురించి తెలుసుకున్న సిద్దూ మనసుమార్చుకుంటాడు. ఇంతలో ఒక అనూహ్య సంఘటన జరుగుతుంది. చివరికి వీళ్ళిద్దరూ ఎలా ఒకటయ్యారనేది మిగతా కథ.

ఎలావుంది కథ 
        యూత్ కి కనెక్ట్ చేయాలని తపన పడ్డ కథ. మారుతీ సినిమాలతో ద్వంద్వార్థ, ఏకార్ధ రోమాంటిక్ కామెడీలు యూత్ లో చెడ్డ పేరు తెచ్చుకుని అంతరించిపోయిన నేపధ్యంలో, మొన్నే ‘త్రిష లేదా నయనతార’ అనే మరో అడల్ట్ మూవీనీ మట్టి కరిపించిన పూర్వరంగంలో, సుకుమార్ అనే బ్రాండింగ్ తో వచ్చినందుకు కొంతవరకూ ప్రేక్షకులు ఔదార్యం చూపించగల బోల్డ్- సెక్స్- కండోమ్స్ సహిత అడల్ట్ కథ. ఆధునికత అంటే అవధుల్లేని విశృంఖలత్వమనే ధోరణికి ఎక్కువగా లోబడి సాగే కథ. ఇంటలెక్చువల్ గా దర్శకుడి నుంచి పైస్థాయి వ్యక్తీకరణల్ని డిమాండ్ చేసే కథ. ఎప్పుడైతే మెచ్యూరిటీ అనే పాయింటు హీరో హీరోయిన్లని విడదీసిందో, అది కథకుడి/ దర్శకుడి మెచ్యూరిటీని కూడా సవాలు చేయడంతో, చేతులెత్తేసి ఈజీ సొల్యూషన్ కోసం  రొటీన్ ఫార్ములా బాట పట్టే గాయపడ్డ రియలిస్టిక్  కథ. సమస్యని పరిష్కరించడానికి విధి లేనట్టు అరిగిపోయిన ఫాల్స్ డ్రామాతో- ఒకింత మెల్ షావెనిజంతో-  అకారణంగా హీరోయిన్ని శిక్షించి సంతృప్తి పడే కథ.  హిందీలో క్రేజ్ సంపాదించుకున్న  ప్యార్ కా పంచనామాలాంటి రియలిస్టిక్ రిలేషన్ షిప్స్ తో ఉండాల్సిన కథ మరోవైపు సీరియెస్ నెస్ ఎక్కువైపోయి- రోమాంటిక్ కథలాగాక, డార్క్ మూవీగా  మారిపోయిన హెవీ, స్లో నేరేషన్ కథ. ఇలాటి డార్క్ మూడ్ తో పవన్ కళ్యాణ్ నటించిన ఫ్లాప్ మూవీ ‘పంజా’ ఈ సందర్భంగా గుర్తుకు రాకమానదు.

ఎవరెలా చేశారు.
        రాజ్ తరణ్ కిది భిన్నమైన పాత్రే.. మొదటి రెండు సినిమాలకంటే అర్బన్ ఫ్లేవర్ వున్న పాత్ర పోషించాడు. పాత్రకి తగ్గట్టే నటనని డౌన్ ప్లే చేసినా, సెకండాఫ్ కొచ్చేసరికి మారిపోయిన ఫార్ములా సరళికి తగ్గట్టే తనూ ఫార్ములా హీరో పాత్రగా మారిపోవాల్సి వచ్చింది. కొన్ని ఫీల్, సెంటిమెంట్స్ వున్న సీన్స్ లో ఓవరాక్టింగ్ కి దూరంగా వున్నాడు. రెండు మాస్ పాటలతో ప్రేక్షకులకి హుషారెక్కించాడు. తనకంటే హీరోయినే ఎక్కువ ఫన్నీగా ఉంటూ, తను ప్రేక్షక మాత్రుడిగా వుండి పోవడంతో కామెడీ ఏదైనా వుంటే అది హీరోయిన్ ఖాతాలోనే పడిపోయింది. 

        హీరోయిన్ హెబ్బా పటేల్ టైటిల్ రోల్ కి సరీగ్గా సరిపోయేఫిజిక్ నీ, మేనరిజమ్స్ నీ  సంతరించుకుని- కుమారి అనే క్యారక్టర్  గుర్తుండి పోయేలా చేసింది. ఓ పట్టాన అర్ధంగాని సంక్లిష్ట అమ్మాయి పాత్ర  ఇది. ఈ పాత్ర డిమాండ్ చేసే భిన్న మూడ్స్ నీ, విభిన్న షేడ్స్ నీ చాలా అనుభవమున్న నటిలా నటించేసింది.  మంచిదో చెడ్డదో, ఈ రకంగానైనా  తెలుగు సినిమాల్లో కరువైపోయిన బలమైన హీరోయిన్ పాత్ర కొరత తీరిపోయింది. దీనికి సుకుమార్ నీ, ఇందుకు ఒప్పుకున్నా హీరో రాజ్ తరుణ్ నీ అభినందించాలి. 

        దేవీశ్రీ ప్రసాద్ సంగీతం, రత్నవేలు ఛాయాగ్రహణం ఈ సినిమా కథ డిమాండ్ చేసే డార్క్ మూడ్ నే  క్రియేట్ చేశాయి. కొత్త దర్శకుడి  విషయానికొస్తే, ఈయన వెనుక అన్నిటా సుకుమార్ చేయి వున్నట్టన్పిస్తుంది. సుకుమార్ ముద్రతోనే మూవీ కన్పిస్తుంది. దీంతో కొత్త దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ పాత్ర ఎంతో తెలిసే అవకాశం లేకుండా పోయింది.


(స్క్రీన్ ప్లే సంగతులు రేపు!)
-సికిందర్  





15, నవంబర్ 2015, ఆదివారం

జువాలజీ !








దర్శకత్వం : వి. వి.వినాయక్ 


తారాగణం :  అఖిల్ అక్కినేని, సాయేషా సైగల్, బ్రహ్మానందం, మహేష్ మంజ్రేకర్, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, జయప్రకాష్ రెడ్డి తదితరులు.

సంగీతం : అనూప్ రూబెన్స్, ఎస్ ఎస్ తమన్,  ఛాయాగ్రహణం : అమోల్ రాథోడ్ 
కథ : వెలిగొండ శ్రీనివాస్, మాటలు : కోన వెంకట్ 
బ్యానర్ : శ్రేష్ట్  మూవీస్, నిర్మాతలు : నితిన్, సుధాకర్ రెడ్డి 
***

    మధ్య ఏ నట వారసుడి ఎంట్రీ కీ జరగనంత ప్రచారార్భాటంతో ఈ వారం ప్రేక్షకుల ముందు కొచ్చిన  అఖిల్,  అక్కినేని వంశం నుంచి మూడో తరం యువ నటుడిగా, తన పేరే టైటిల్ గా పెట్టుకుని తెలుగు తెరకి పరిచయమయ్యాడు. ( ఏడాది పసి వాడుగా వున్నప్పుడు ‘సిసింద్రీ’ అనే సూపర్ హిట్ లో నటించాడు, మొన్నే ‘మనం’లో అరనిమిషం పాటు అప్పీయరెన్స్ ఇచ్చాడు).  సాధారణంగా వారసుల పరిచయ సినిమాలు ప్రేమ కథలై వుంటాయి. అలాటిది అఖిల్  ఏకంగా ఓ భారీ స్థాయి సోషియో- ఫాంటసీ యాక్షన్ మూవీకే తెరతీయడం సాహసమే. పైగా దీన్ని సాటి స్టార్ నితిన్ నిర్మించడం ఇంకో అపూర్వ ఘటన. తను ఏం తీసిపోనట్టు  అక్కినేని నాగార్జున కూడా   టాప్ డైరెక్టర్ వివి వినాయక్ చేతుల్లో కుమారుడు అఖిల్ ని పెడుతూ ఆయనకీ సవాలు విసిరారు. ఇలా అఖిల్, నితిన్, నాగార్జున, వినాయక్ లందరికీ ఇది చాలా ప్రతిష్టాత్మక వ్యవహారంగా మారడమే గాక, ఇందరేసి సెలెబ్రిటీలంతా  ఒకచోట కూడి ఏం చేశారబ్బా అన్న క్యూరియాసిటీని  కూడా అమాంతంగా ప్రేక్షకులకి పెంచేసి,  ఇక దీంతో దీపావళిని ఎంజాయ్ చేయండంటూ చేతులు జోడించారు. ప్రేక్షకులు ఆనందోత్సాహాలతో థియేటర్లకి పరుగులు  పెట్టారు. ఆ తర్వాతేమయ్యారు? ఏమన్నారు? అఖిల్ నీ, సినిమానీ కొనియాడారా,  లేక పండగ మూడ్ అంతా పాడుచేసుకుని ఎటో వెళ్ళిపోయారా- మళ్ళీ తెలుగు సినిమాల వైపు రాకూడదంటే రాకూడదని ఒట్టేసుకుని? 

         సందేహం లేదు, వరుసగా తెలుగు సినిమాలిలాగే భారీ స్థాయిలో వచ్చి రాక్షస బల్లుల్లా ప్రేక్షకుల్ని ఇంకా బెదర గొడుతూనే వుంటాయి. రాక్షస బల్లుల్ని రాజహంసల్లా మార్చే దెలా? మార్చేదెవరు? అసలా మార్చే ఆలోచనంటూ వుందా? నెవ్వర్, ముందు  క్వాలిటీ రైటింగ్ అనేది తెలిస్తే కదా మార్చే ఆలోచన వచ్చేది.  ఏ జవాబుదారీ తనమూ లేకుండా, ఎంత అరాచకంగా పది రూపాయల బ్యాడ్ రైటింగ్ వుంటే దానికి అన్ని కోట్లు కట్టి మరిన్ని పదుల కోట్లు కూడా ధారబోసి ఒక రాక్షస బల్లిని తయారు చేసుకుంటున్నప్పుడు, వేరే ఆలోచనలకి టైముండదు! అర్జెంటుగా ఒక అట్టర్ ఫ్లాపు తీయడానికి టైం చాలా చాలా ఇంపార్టెంట్! ఫ్లాపయ్యాక విశ్లేషణలు చేసుకోవచ్చు, ముందు జాగ్రత్తల జోలికి మాత్రం వెళ్లొద్దు!
    బ్యాడ్ రైటింగ్ తోనే బిగ్ నేమ్స్!!

గోళమే గందరగోళం 
      పూర్వకాలంలో ఎప్పుడో కొందరు ఋషులు భూగోళం బాగోగుల కోసం,  ‘జువా’ అనే ఒక గోళాన్ని తయారు చేసి తీసికెళ్ళి భూమధ్య రేఖ దగ్గర ఓ ఆఫ్రికన్ గూడెం లో పడేస్తారు. సూర్యగ్రహణాలు  పూర్తయ్యాక వెలువడే తొలి సూర్య కిరణాలు చాలా ప్రమాదకరమని వాళ్ళు నమ్ముతారు. కనుక ఆ తొలి సూర్య కిరణాలు ఈ ‘జువా’ గోళం మీద పడితే వాటి దుష్ప్రభావం నుంచి భూగోళం తప్పించుకుంటుందని శాస్త్రం చెప్తారు (ఓజోన్ పొర ఏం చేస్తున్నట్టో మరి). అలా ఆ గోళాన్ని గూడెం వాసులు తరతరాలుగా కాపాడుకొస్తూంటారు. దీని గురించి తెలుసుకున్న ఖత్రోచ్చి అనే ఒక రష్యన్ సైంటిస్టు (ఖత్రోచ్చి అనేది రష్యన్ పేరు కాదు, ఇటాలియన్ పేరు. బోఫోర్స్ కేసుతో ఒట్టోవియో ఖత్రోచ్చి పేరు పాపులరయ్యింది. ఖత్రోచ్చి అంటే ఇటాలియన్ లో ‘నాలుగు కళ్ళు’)-   దాన్ని కాజేసి ప్రపంచాన్ని ఆడించాలని కుట్ర పన్నుతాడు. ఆ గోళం అతడి గ్యాంగ్ చేతిలో పడకుండా, బోడో అనే గూడెం వాసి ఒకడు తీసుకుని పారిపోతాడు. వాణ్ణి వెతికి పట్టుకునే పనిలో వుంటుంది ఆఫ్రికన్ గ్యాంగ్.

        ఇక్కడ్నించీ  ఇంకో కథలో కొస్తే, ఇక్కడ  సిటీలో అఖిల్ ( అఖిల్) అనే అనాధ,  స్ట్రీట్ ఫైట్లూ బెట్టింగులూ అవీ చేస్తూ డబ్బులు సంపాదిస్తూంటాడు. ఈ అనాధకి చదువు సంధ్యల్లేవు ( శుభమా అంటూ డీసెంట్  కుర్రాడి లుక్ తో రంగ ప్రవేశం చేస్తూ అఖిల్ కూడా ఇతర హీరోల్లాగే అక్షరజ్ఞానం లేని ఆవారా అనాధ పాత్రకి బలైపోక తప్పలేదు-  ఇక్కడ్నించే మొదలు సంపూర్ణ బ్యాడ్ రైటింగ్ గ్రహణం! దీని గ్రహణా ననంతర కిరణాలకి బాక్సాఫీసే భస్మమైపోయింది! కాపాడేందుకు ఏ గోళాలూ ఇక  ఋషులు కూడా  కనిపెట్టలేరు- టైటిల్లో  ట్యాగ్ లైను గా పెట్టిన ‘ది పవరాఫ్ జువా...’  కాస్తా  ది పవర్ ఆఫ్ జువాలజీగా మారిపోయింది- స్క్రిప్టాలజీని పూర్తిగా నిషేధిస్తూ..)  ఇతను చూడగానే మెడిసిన్ చదివే దివ్య ( సాయేషా సైగల్) అనే డబ్బున్న అమ్మాయిని ప్రేమించేస్తాడు. ఆ అమ్మాయి కాలేజీకి తెచ్చుకుని ఏంచక్కా చిన్నపిల్లలా  ఆడుకునే పెంపుడు కుందేలుకి వెటర్నరీ డాక్టరుగా మారిపోయి గుండాపరేషన్ కూడా  చేసేసి ఔరా అన్పిస్తాడు. ఇంత చిన్న మెడికోకి అప్పటికే పెళ్లి కూడా సెటిలైపోయి వుంటుంది (ఈ కాలం అమ్మాయైతే ఈ వయసులో పెళ్లిని పుట్ బాల్ ని తన్నినట్టు తన్ని తన చదువూ భవిష్యత్తూ చూసుకుంటుంది ముందు).  ఆ పెళ్లిని కూడా చెడగొడతాడు. దీంతో ఆమె తన పరువే  పోయినట్టు ఫీలయిపోయి- వేరే అమ్మాయితో పారిపోయిన ఆ పెళ్లి కొడుకు ( వెన్నెల కిషోర్) అంతు చూడాలని సాక్షాత్తూ స్పెయిన్ కే  వెళ్ళిపోతుంది. ఇది తెలిసి, తను అర్జెంటుగా  స్ట్రీట్ ఫైట్లు చేసి ఓ రెండు లక్షలు ఆపరేషన్ కి అవసరమున్న ఇంకో ఆవిడకిచ్చి  కన్నీళ్లు కార్పించి, మిగిలిన రెండు లక్షలతో తనుకూడా స్పెయిన్ కెళ్ళి పోతాడు - తను పెళ్లి చెడగొట్టిన అమ్మాయిని ప్రేమించేందుకు. 

        అక్కడ ఇతడ్ని చూసి ఇంకింత ద్వేషిస్తుంది. ఆపాటికి తన పెళ్లి చెడగొట్టడంలో ఇతడి హస్తం కూడా వున్నట్టు తెలుసుకుంటుంది. ఇంతలో  ఆ ‘జువా’ గోళ రహస్యం ఈమెకి తెలుసన్న సమాచారంతో ఖత్రోచ్చి గ్యాంగ్ వచ్చిపడి  ఈమెని కిడ్నాప్ చేస్తారు. ఆ గ్యాంగ్ ని పట్టుకోవడానికి ఆఫ్రికా వెళ్తాడు అఖిల్. ఇక అక్కడ ఆమెని ఎలా కాపాడుకున్నాడు, ఆ గోళం ఏమయ్యింది, దాన్ని  శత్రువులకి దొరక్కుండా గూడేనికి తెచ్చి పడేశాడా  అన్నవి మిగతా కథలోని విశేషాలు.

ఎలావుంది కథ

      హాలీవుడ్ లో దీన్ని హై కాన్సెప్ట్ స్టోరీగా భావించి కళ్ళకద్దుకుని అద్భుతాలు చేస్తారు. కానీ ‘అఖిల్’ సృష్టికర్తలు ఈ కాన్సెప్ట్ విలువని గుర్తించలేకపోయారు. ఇది పేరుకే సోషియో ఫాంటసీ, చూపించేదంతా రొటీన్ మూసఫార్ములా లవ్ స్టోరీ.  డజను అట్టర్ ఫ్లాపులు చవిచూసి వున్న హీరో నితిన్, ట్రెండీ లవ్ స్టోరీస్ లో నటిస్తూ  అనూహ్య విజయాలు సాధించడాన్ని చూస్తున్నాం.  అలాటిది నిర్మాతగామారి ఇంత  పాత మూస ప్రేమగోలని నిర్మించడం షాకిస్తుంది. కథలో సూర్య తాపం- గోళం- కుట్ర గట్రా  యాంగిల్ ఎక్కడా ప్రేక్షకులని ఆకట్టుకునే, అసలు అర్ధమయ్యే ప్రసక్తే లేదు. తెలుగులో ఏ  ఫాంటసీలు  తీసినా అవి ప్రేక్షకులకి కనెక్ట్ అవుతూనే వచ్చాయి. ప్రస్తుత ఫాంటసీ లాజిక్ కూడా లేని తూతూ మంత్రపు కబుర్లుగానే తేలిపోయింది.  


ఎవరెలా చేశారు      అఖిల్ ని స్టార్ హీరోగా ఒక డెమో ఇప్పించే ఉద్దేశంతో ఈ సినిమా తీసినట్టు అన్పిస్తుంది తప్పితే మరొకటి కాదు. గతంలో కొందరు వారసుల విషయంలో ఇలాగే  జరిగింది.  ఈ ప్రయత్నంలో అఖిల్ ని అప్పుడే మాస్ హీరోగా ప్రెజెంట్ చేయడానికీ వెనుదీయలేదు. మాస్ పాత్రలు, ఫైట్లూ పాటలూ బాగా చేస్తాడని చూపించాలన్న ఆతృతే ఎక్కువ కన్పిస్తుంది. అఖిల్ నటించగలడు, అయితే ఇంకా చాలా పాలిష్ అవ్వాలి. ముఖ్యంగా ఈ రోజుల్లో చాలా అవసరమైన కామెడీలో తను మైనస్. దీన్ని సరిదిద్దుకోవాలి. మంచి స్క్రీన్ ప్రెజెన్స్ వుంది. తెరమీద కనపడితే ఒక బ్యూటీని తీసుకు రాగలడు. అయితే తను నటనలో ఇంకా శిక్షణ పొందేటప్పుడు యాక్టివ్ పాత్రంటే ఏమిటో, పాసివ్ పాత్రంటే ఏమిటో కూడా విధిగా తెలుసుకోవాలి. ఎక్కడా పాసివ్ పాత్ర ఛాయలు కనపడని యాక్టివ్ పాత్ర చిత్రణలుండేట్టు జాగ్రత్త తీసుకోవాలి. పాసివ్ పాత్రలతో సినిమాలు తీస్తున్నామని దర్శకులూ రచయితలూ ఇంకెన్నాళ్ళకీ తెలుసుకోలేరు. అదో ఖర్మ, అంతే. తను వాళ్ళ ట్రాప్ లో పడకుండా చూసుకోవాలి.  ఈ సినిమా ఇంత వరస్ట్ గా తయారయ్యిందంటే మొట్ట మొదటి కారణం, తెలీక తను పనికిరాని పాసివ్ పాత్రని పోషించడమే!

        కొత్త హీరోయిన్ సాయేషా  సైగల్  అఖిల్ కి సరీగ్గా సరిపోయిన జోడీ. ఇద్దరి మధ్యా  రోమాన్స్ గనుక ట్రెండీ గా వుండి వుంటే, ఈమె తమన్నా అంత క్రేజ్ ఈ ఒక్క సినిమాతో నే సంపాదించుకుని వుండేది. నిత్యా  మీనన్ కూడా ట్రెండీ లవ్ స్టోరీస్  తోనే యువ హృదయాల్లో తిష్ఠ వేసిందన్నది మరువ కూడదు. సాయేషా ఈ ఒక్క సినిమాతో కనుమరుగయ్యే గ్లామర్ బొమ్మ మాత్రం కాదు. ఇక బ్రహ్మానందం  కామెడీ రెండు మూడు సీన్లలో అదీ ఆఫ్రికన్ జాతి వాళ్ళతో మాత్రమే ఫర్వాలేదు. అయితే మళ్ళీ కన్ఫ్యూజ్ కామెడీయే తనకి శరణ్యమైంది అన్ని సినిమాల్లో లాగే. ఇంకో సహాయ పాత్రలో వెన్నెల కిషోర్ కామెడీ కూడా పెద్దాగా వర్కౌట్ కాలేదు. ఓ సీనులో మాత్రమే వచ్చిపోయే  సప్తగిరి సైతం డిటో. మెడికల్ కాలేజీ డీన్ గా రాజేంద్ర ప్రసాద్  డి కూడా ఫస్టాఫ్ లో చాలా త్వరగా ముగిసిపోయే పాత్రే. ఇక విలన్ గా తెలిసిన మహేష్ మంజ్రేకర్ తండ్రి పాత్రలో సాఫ్ట్ రోల్ లో కన్పిస్తాడు గానీ, అద్భుతాలేం చెయ్యడు.

       మ్యూజికల్ గా- అనూప్ రూబెన్స్, ఎస్ ఎస్ తమన్ ల సంగీతం లో బాణీలు హుషా రెక్కిస్తాయి. వీటికి జానీ సమకూర్చిన డాన్సులు చెప్పుకోదగ్గవి. మణిశర్మ నేపథ్య సంగీతం ఆయన మూస ధోరణిలోనే వుంది. రవి వర్మ ఫైట్స్ ఫర్వాలేదు, అలాగే అమోల్ రాథోడ్ కెమెరా వర్క్ కూడా. గ్రాఫిక్స్ వర్క్ అంతా డార్క్ లో యాక్షన్ సీన్స్ కి సంబంధించి మాత్రమే చేశారు. హీరో హీరోయిన్ల రోమాన్స్ కి సంబంధించి కనువిందు చేసే ఎలాటి ఫాంటసికల్ సీజీ వర్క్ కూడా చేయలేకపోయారు.

స్క్రీన్ ప్లే సంగతులు 
      ఎవరైనా కమర్షియల్ సినిమా స్క్రీన్ ప్లే రాయడం ఎలా మొదలెడతారు- కథని అనుకునా? పాత్రని అనుకునా? తరచూ మనకి విన్పించే స్టేట్ మెంట్స్ ఏమిటంటే-  కథే హీరో అని! కథని నమ్ముకోవాలని! సినిమాలో కథ కనపడాలని! ఇలాటివి నమ్మి తీస్తున్నందువల్లేనేమో  అట్టర్ ఫ్లాపవుతున్నాయి సినిమాలు. 


       కథే హీరో ఎలా అవుతుంది? కథనే ఎలా నమ్ముకుంటారు?  కథ మాత్రమే సినిమాలో ఎలా కనపడుతుంది? కథకి  అంత  గొప్ప స్వతంత్రత వుంటుందా? అంత సొంత అస్తిత్వం దానికుంటుందా? దానికదే కథ పుట్టుకొచ్చేస్తుందా? ఎవరో పుట్టిస్తే పుట్టే కథ హీరో ఎలా అవుతుంది? ఆ ఎవరో ఒక హీరోపాత్ర అయినప్పుడు- ఆ హీరో పాత్ర పుట్టించకుండా కథెలా పుడుతుంది? తనెలా హీరో అయిపోతుంది కథ, హీరోపాత్రని వదిలేసి ? తనెలా సినిమా అంతటా పర్చుకుని కనపడుతుంది కథ, హీరో పాత్ర లేకుండా? కథ లేకుండా హీరో ఉండొచ్చు, హీరో లేకుండా కథ ఉంటుందా? ఎవరిక్కావాలి కథ? అవగాహన వున్న రచయిత/ దర్శకుడు అయితే కథ ఆలోచించడమన్న ఆలోచననే తీసి అవతలకి విసిరేసి పాత్రని పట్టుకుంటాడు. పాత్రని పట్టుకుని సాగిపోతూంటాడు. ఎంతసేపూ అతణ్ణి దొలిచేసేది పాత్ర నడకే. కథ నడక కాదు. ఆస్కార్ అవార్డులు పొందుతున్న  సినిమాలన్నీ పాత్రల వల్ల అవార్డులు పొందుతున్న సినిమాలే. పాత్ర లేకపోతే  సోదిలోకి కూడా రాదు కథ. 

        దురవగాహనతో ఇచ్చేసే స్టేట్ మెంట్లు కొంపలు ముంచుతాయి. అలాటి స్టేట్ మెంట్ల  ప్రకారమైతే ఆర్ట్ సినిమాలకి పని కొచ్చే  కథలే  పుడతాయి. అక్కడ కథే హీరో, ఎందుకంటే హీరో అనే వాడు ఆ కథల్లో ఉత్త పాసివ్ గా ఉంటాడు కాబట్టి. వాణ్ణి కథ నడుపుడుతుంది కాబట్టి. అందుకని కమర్షియల్ సినిమాల్ని దృష్టిలో పెట్టుకుని స్టేట్ మెంట్లు అంటూ ఇస్తే- క్యారక్టర్ని నమ్ముకోవాల నాలి. గొప్ప క్యారక్టర్స్ ని క్రియేట్ చేయాలనాలి. సినిమా అంతటా ఆ క్యారక్టర్సే కనపడి జీవితమంతా వెంటాడాననాలి. ఈ తేడా గుర్తించి ఈ భాష మాట్లాడితే తప్ప తెలుగు సినిమాలు యాక్టివ్ పాత్రలతో కాస్తయినా బాగుపడవు.

        ప్రస్తుత సినిమా ఈ భాష మాట్లడ్డం లేదు. దీనికి పాత్ర గురించి ఏ పట్టింపూ లేదు, అసలు పాత్రచిత్రణల గురించే తెలీదు. ఎంతసేపూ కథతోనే పని. చాలా ఆశ్చర్యం. కథని పట్టుకుని కమర్షియల్ స్క్రీన్ ప్లే ఎలా రాస్తారో అంతు పట్టని విషయం. అసలు వన్ లైన్ ఆర్డర్ దశలోనే పాత్రతో కాకుండా కథతో ఆర్డర్ ముందుకే  కదలదు  కదా- అది ట్రీట్ మెంట్ (స్క్రీన్ ప్లే) దాకా ఎలా వచ్చి, డైలాగ్ వెర్షన్ కీ వెళ్తుందో! ఏమిటో ఆ రైటింగ్ మర్మం!
ఈ స్క్రీన్ ప్లేకి  ఒక పాసివ్ పాత్రని పట్టుకుని వన్ లైన్ ఆర్డర్ వేశామని ఎలా అనుకుంటారు. పాత్రని పట్టుకుని ప్రయాణించకుండా  రాతపని ముందుకు ఎలా కదుల్తుందో, కదల్చడానికి మనసెలా ఒప్పుతుందో- సరైన రాసే మనసు అయితే ఆ ప్రయత్నానికి అడుగడుగునా అడ్డు పడుతుంది. డీ ఫాల్ట్ గా ఈ మనసు ఎక్కువమంది ప్రేక్షకులకి వుంటుంది. ఇందుకే ఫ్లాప్ చేస్తూంటారు సినిమాల్ని. 

        యాక్టివ్ పాత్రతోనే స్ట్రక్చర్ చెట్టపట్టా లేసుకుని వుంటుంది, పాసివ్ పాత్రతో స్ట్రక్చర్ వుండదు. ఆర్ట్ సినిమాకి ఏ స్ట్రక్చరూ  వుండదు. గతంలో చెప్పుకున్నదే మరోసారి చెప్పుకుంటే, తెలుగులో భారీ బడ్జెట్లతో తీస్తున్న సినిమాలు నిజానికి కమర్షియల్ ముసుగేసుకున్న ఆర్ట్ సినిమాలే. ప్రేక్షకులు డబ్బులు చెల్లించుకుని మోసపోతున్నారు.

***
      ఒకటి కాదు రెండూ కాదు, ‘అఖిల్’ అవస్థకి మూడు ప్రధాన కారణాలు : 1) పాసివ్ సుడిగుండంలో హీరో పాత్ర మునకలేయడం, 2) పాసివ్ హీరోకి విలన్ కూడా దిక్కు లేకుండా పోవడం, 3) కాన్సెప్ట్ ని  వదిలి ఈ రోజుల్లో ఏ మాత్రం అవసరంలేని ప్రేమగోలని ప్రధానం చేసుకుని పాసివ్ హీరో కాలక్షేపం చేయడం. ఇవన్నీ కూడబలక్కుని స్ట్రక్చర్ లేకుండా చేశాయి. 
        దీనికి ఒక ప్రింటెడ్ అప్లికేషన్ ఫారం నింపినట్టు- అనేక సినిమాల్లో పాతబడిపోయిన విధానమే-  సినిమా ప్రారంభం కాగానే ఒక ఓపెనింగ్ బ్యాంగ్, హీరో కన్పించగానే ఒక ఫైట్, ఫైట్ అయిపోగానే హీరో గ్రూప్ సాంగ్, సాంగ్ అయిపోగానే లవ్ ట్రాక్.. ఇలా శ్రమ లేని ఈ ఈజీ టెంప్లెట్ లో రొటీన్ గా కథనాన్ని పడేసుకుంటూపోతే అదే స్క్రీన్ ప్లే అయిపోయింది. వందల సినిమాల్లో చూసిన వరసే మళ్ళీమళ్ళీ రిపీట్ చేయడం. 

        జువా గోళం కాన్సెప్ట్- కాన్సెప్ట్ తో సంబంధం లేకుండా హీరో హీరోయిన్లు ఎలా వుంటారు? కాన్సెప్ట్ కి పొసగని వృత్తుల్లో/విద్యల్లో వాళ్ళెలా వుంటారు. వాళ్ళిద్దరూ గ్లోబల్ వార్మింగ్ రీసెర్చి విద్యార్థులై వుంటే, గ్లోబల్ వార్మింగ్ మీద సిటీలో సదస్సు జరుగుతూంటే, ఆ జువా గోళాన్ని గాలిస్తున్న బ్యాడ్ రష్యన్ సైంటిస్టు అందులో పాల్గొని వీళ్ళకి పరిచయమైతే...ఇలా వుంటుంది కాన్సెప్ట్ కి లోబడ్డ కథనమైతే.  దీని బదులు సంబధంలేని, ఏ మాత్రం ఆసక్తి కల్గించని  స్ట్రీట్ ఫైట ర్, మెడికల్ స్టూడెంట్ పాత్రల్ని పెట్టుకుని, చూసిచూసి విసిగిపోయిన మూసఫార్ములా ప్రేమ కథకి  తెర తీశారు.     

        2011 లో వినాయక్ తీసిన ‘బద్రీనాథ్’ లోనూ ఇదే తతంగం. దేవాలయాల మీద టెర్రరిస్టుల దాడులు- అంటూ గొప్పగా కథ ప్రారంభించి, దాన్నెదుర్కొనే వీరుడిగా హీరోని నియమించి- తీరా హీరోయిన్ ఎంటరవగానే ఆమె వెంటపడే పాత మూస ప్రేమ కథగా మార్చేశారు. హీరోయిన్ మేనత్త, ఆమె గ్యాంగ్ విలన్లు. చివరికి వాళ్ళే తెగబడి దేవాలయం మీద దాడి చేస్తారు. విదేశీ ఆక్రమణదార్ల మీదా, టెర్రరిస్టుల మీదా అంత కోపాన్ని వెళ్ళగ్రక్కుతూ చేసిన కథా ప్రారంభం- స్వమతస్థులే తెగబడి దేవాలయాల మీద దాడులు చేసే కథగా మారిపోతే ఏమనాలి? స్వమతస్థులే వచ్చి పడి  తెగ నరుకుతున్నప్పుడు, ఇంకా అన్యమతస్థుల మీద ఆరోపణ లేమిటో అర్ధంగాని గందరగోళం! ఇలా వుంటాయి మన సినిమాల హై కాన్సెప్టులు! అసలు ఏం మొదలుపెట్టి ఏం చెప్తున్నామో స్పృహయినా లేకపోతే  ఎలా! సృహగల ప్రేక్షకులు దీన్ని ఫ్లాప్ చేశారు.

        ఇదే ‘అఖిల్’ సమస్య కూడా. పోతే బ్యాక్ గ్రౌండ్ లో జువా గోళం కోసం కుట్ర జరుగుతోందన్న సంగతి ఎప్పుడో ఎండ్ విభాగంలోగానీ హీరోకి తెలీదు. ఇంతసేపూ అతను ఇందుకోసం ఉన్నాడో తనకే తెలీతనంతో ప్రేమకథకి నగిషీలు చెక్కు కుంటూ ఉంటాడు. ఇంటర్వెల్లో గ్యాంగ్ హీరోయిన్ని కిడ్నాప్ చేశారని తెలిసినా, ఎందుకు చేశారో తెలుసుకోవడానికి ప్రయత్నించడు. తన ప్రేమగోల తనదే. ప్రేమలో హీరోయిన్ తండ్రి విలన్ కాదు. బ్యాక్ గ్రౌండ్ లో గోళం కోసం వున్న విలన్ క్లయిమాక్స్ వరకూ మళ్ళీ తెరపైకి రాడు. హీరోకి విలన్ తో మిడిల్లో స్పర్శే వుండదు. ఒక విలన్ ఉన్నట్టే వుండదు కథనం. ఇదీ దీని దుస్థితి.

***
      బేసిక్స్ కూడా తెలియకుండా, ఒకవేళ తెలిసినా మనకెందుకులే అన్నట్టుగా చేసుకుపోతే ఇలాగే తయారవుతుంది స్క్రిప్టు. ఇంకా ‘బద్రీనాథ్’ లో చేసిన తప్పే మళ్ళీ చేస్తామంటే  బాక్సాఫీసు చూస్తూ వూరుకుంటుందా? కాన్సెప్ట్ రన్ అవడమంటే ‘స్వామిరారా’ లో చూపించినట్టుగా సినిమా సాంతం అదే త్రెడ్ గా కొనసాగడం, దాన్ని అంటి పెట్టుకుని  సందర్భవశాత్తూ రోమాన్సు సాగడం. హీరో పాత్ర యాక్టివ్ గా వుండడం. యాక్టివ్ ఏమిటో పాసివ్ ఏమిటో తూర్పు పడరమలు తెలియనితనంతో రాసేవి స్క్రీన్ ప్లేలు కావు- దురద పుట్టే స్కిన్ డిసీజ్ లు! స్క్రిప్టాలజీ కాకుండా జువాలజీ జిల!


-సికిందర్
           

       
   
       


   
   
   
















     -సికిందర్