రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

13, అక్టోబర్ 2015, మంగళవారం





రచన -దర్శకత్వం- నిర్మాణం :  గుణశేఖర్ 

తారాగణం : అనూష్కా, అల్లు అర్జున్, రానా దగ్గుబాటి, నిత్యా మీనన్, కృష్ణంరాజు, ప్రకాష్ రాజ్, సుమన్, ఆదిత్యా మీనన్, విక్రం జిత్ విర్క్, కేథరిన్ ట్రెసా తదితరులు
సంగీతం : ఇళయరాజా
,  ఛాయాగ్రహణం : అజయ్ విన్సెంట్, ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్
బ్యానర్ : గుణా టీం వర్క్స్
విడుదల : అక్టోబర్ 9
, 2015

***

             పెద్ద బడ్జెట్  సినిమా వసూళ్లు సాధించుకోవడానికి కనీసం ఓ రెండు వారాలు కూడా గ్యాప్ లేకపోతే రిస్కే. ‘రుద్రమదేవి’ బాలారిష్టాల్ని దాటించి ఎట్టకేలకు ఎందరో మోసి విడుదలకి నోచుకునేలా చేసినా, పోటీ సినిమాల విడుదల వెన్నంటే వుండడాన్నినివారించలేక  పోయారు.మరుసటి వారమే  రామ్ చరణ్- శ్రీను వైట్లల ‘బ్రూస్ లీ’,  మళ్ళీ ఆ పైవారమే  అఖిల్- వి.వి. వినాయక్ ల ‘అఖిల్’  అనే మరో రెండు భారీ కమర్షియల్సూ వచ్చి పడుతూండడంతో  ‘రుద్రమదేవి’ బ్రీతింగ్ స్పేస్ అనేది లేకుండా పోయింది. పెట్టిన పెట్టుబడి ఎనభై కోట్లని చెప్పుకుంటున్నా, 50 కి మించి ఆవదని నిపుణులు అంటున్నారు. సీజీ క్వాలిటీని చూస్తే   తెలిసిపోతోంది. ఈ యాభై కూడా ఒక్కవారంలో వెనక్కి రావడమెలా అన్నది ఇప్పుడు ప్రశ్న. క్యూకట్టి వున్న పై  రెండు పెద్ద కమర్షియల్స్ తో పోటీని తట్టుకో గల్గితే  ఫర్వాలేదు-  ఐతే అలా తట్టుకునే శక్తి వుందా దీనికి? 

             ప్రేక్షకులు భలే  ఎమోషనల్ జీవులు. ఒక్కోసారి సినిమా బాగోగులతో సంబంధం లేకుండా భారీ సినిమాలకి ఓపెనింగ్స్ ని భారీగానే ముట్టజెప్పేస్తారు.  స్టార్ బ్యాగేజితో అట్టహాసంగా తమ ముందు కొచ్చేసిన ‘రుద్రమదేవి’ కి తొలి మూడు రోజుల్లో  26.10 కోట్ల గ్రాస్ ని అందించేశారంటే, వాళ్ళ భావోద్వేగాలు ఏ స్థాయిలో వున్నాయో ఊహించుకోవచ్చు. కాబట్టి భారీ సినిమాలు నిర్మించడానికి పెద్దగా తెలివితేటలు అవసరం లేదనుకోవచ్చు. విషయపరంగానూ తీవ్రంగా కష్ట పడిపోనక్కర లేదని కూడా  అనుకోవచ్చు. బుద్ధిజీవుల కోసం భారీ కమర్షియల్స్ ని తీయరు. అయితే ఒకజాతి గర్వించదగ్గ చరిత్రతో కూడిన సినిమాని కూడా మైండ్ ని అప్లయ్ చేయకుండా, మసాలా సినిమాలా తీసెయ్యొచ్చా అన్నది ఆ దర్శకుడే  వేసుకోవాల్సిన ప్రశ్న. 

          నిజానికి దర్శకుడు గుణశేఖర్ కి చరిత్ర అవకాశామివ్వలేదు గానీ, మామూలు కమర్షియల్స్ తో వరస ఫ్లాపులు చవిచూసి విసిగిపోయి, ఆపద్ధర్మంగా తనే ఓ చారిత్రిక అవకాశాన్ని సృష్టించుకుని, ‘రుద్రమదేవి’ అనే మహాయజ్ఞానికి సమకట్టారు. దీనికి బాక్సాఫీసు క్షమించినంతగా చరిత్ర కూడా క్షమిస్తుందా, లేకపోతే ఇది ఇలావచ్చి అలా జనం మర్చిపోయే చెత్తబుట్ట దాఖలు బాపతు మరో విఫల యత్నమేనా ,  ఓ సారి ఈ కింద చూసుకుంటూ వెళ్దాం..

 దేవియే దేవుడుగా! 
         కాకతీయ సామ్రాజ్య చరిత్రలో  రాణీ రుద్రమ దేవి  (పాలనా కాలం 1261–1289)  పోషించిన పాత్ర తాలూకు చిత్రణ ఇది.  రుద్రమదేవిగా అనుష్కా ఇందులో కన్పిస్తుంది. రుద్రమ దేవి పుట్టే టప్పటికే రాజ్యానికి చాలా ప్రమాదాలు పొంచి వుంటాయి. శత్రు రాజులు, దాయాదులూ రాజ్యాన్ని కబళించాలని చూస్తూంటారు. అప్పటికే ఒక కూతురున్న రాజు గణపతి దేవుడు (కృష్ణం రాజు) తన వారసత్వాన్ని కొనసాగించే  మగ సంతానం లేకపోవడంతో శత్రువుల దృష్టిలో బలహీనపడతాడు. అలాంటప్పుడు మగసంతానం కోసం ఎదురు చూస్తూంటే ఆడపిల్ల రుద్రమ దేవి పుడుతుంది. ఈ విషయం పొక్కిందంటే, శత్రువులు విజృంభిస్తారు. దీనికో ఉపాయం చెప్తాడు మంత్రి శివ దేవయ్య (ప్రకాష్ రాజ్ ). పుట్టింది మగ సంతానమని ప్రకటించమంటాడు. పుట్టిన పిల్లని రుద్రమ దేవుడిగా పెంచుదామంటాడు. కోటలోనే పాగావేసి కుయుక్తులు పన్నుతున్న దాయాదులు హరిహర దేవుడు ( సుమన్), మురారీ దేవుడు ( ఆదిత్యా మీనన్) లకి  సైతం ఈ విషయం  తెలియకుండా దాచాలంటాడు. అలాగే ప్రకటన చేస్తాడు గణపతి దేవుడు. 

               ఇది తెలుసుకుని శత్రు దేశపు రాజు మహాదేవ నాయకుడు ( విక్రం జిత్ విర్క్) పిచ్చెక్కిపోతాడు. ఇటు మగపిల్లాడిలా పెరుగుతున్న రుద్రమదేవికి నిడదవోలు సామంతరాజు చాళుక్య వీరభద్ర ( దగ్గుబాటి రానా),   మరో దివంగత సామంత రాజు గోన బుద్ధా రెడ్డి కొడుకు గన్నారెడ్డి (అల్లు అర్జున్) లు స్నేహితులుగా ఏర్పడతారు. గన్నారెడ్డి పెద్దయ్యాక బందిపోటుగా మారి  ప్రజల్ని దోచుకుంటున్నాడని ప్రచారం జరుగుతూంటుంది. తన తండ్రిని చంపి గణపతి దేవుడి  పంచన చేరిన అన్నల మీద కక్షతో ఉంటాడు గన్నారెడ్డి. ఇటు ‘యువరాజు’ గా ఎదిగి తండ్రితో కలిసి పరిపాలిస్తూ చెరువులు తవ్వించీ, పన్నులు మాఫీ చేయించీ ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతూంటుంది రుద్రమ దేవి. కక్షతో ఈమె పాలనకి ఆటంకాలు సృష్టిస్తూంటాడు మహాదేవ నాయకుడు. 

            ఈ నేపధ్యంలో రుద్రమదేవి ఆడపిల్లన్న సంగతి ఎలా ఎప్పుడు బయటపడింది, అప్పుడు ఎలాటి విషమ పరిస్థితులు ఏర్పడ్డాయి, వాటినామె ఎలా ఎదుర్కొంది; వీరభద్రుడు, గన్నారెడ్డి లు ఆమెకెలా తోడ్పడ్డారు మొదలయిన అంశాలతో మిగతా కథ సాగుతుంది.


ఎవరెలా చేశారు 
        ఇప్పుడున్న తారల్లో రుద్రమదేవి పాత్రలో అనూష్కా ని తప్ప మరొకర్ని ఊహించలేమన్నది నిజమే. రుద్రమ దేవుడుగా పురుష పాత్రలో, రుద్రమదేవిగా స్త్రీ పాత్రలో రెండింటిలోనూ కన్పిస్తుంది అనూష్కా. రాజరికపు వీరత్వంతో కాఠిన్యంతోనూ, ప్రేమలో పడిన కుమారిగా సౌకుమార్యంతోనూ కన్పిస్తుంది. రుద్రమదేవి నిజజీవితంలోనే కొంతకాలం పురుషుడి వేషంలో వున్న స్త్రీగా జీవించిందన్న స్పష్టత వుంది కాబట్టి  ఇంతవరకూ మాత్రం ఏ కన్ఫ్యూజనూ లేదు అనూష్కాకి. 

          ఫస్టాఫ్ గడిచి సెకండాఫ్ లో తను స్త్రీ అన్న విషయం ప్రపంచానికి తెలిసిపోయాకే, ఫైనల్ గా ఆ కీలకమైన స్త్రీ పాత్రతో ఉండాల్సిన అసలు నటనంతా నీరుగారిపోయింది. ఇక్కడ్నించీ కథ ఇతర పాత్రల చేతుల్లోకి వెళ్లిపోవడంతో, ఇంకా క్లయిమాక్స్ లో కొచ్చేసరికి  పూర్తిగా కథ అల్లు అర్జున్ నటించిన గోన గన్నారెడ్డి పాత్ర వశమైపోవడంతో,  చేష్టలుడిగినట్టు కన్పిస్తుంది అనూష్కా. ఎంతగానంటే, ఈ కథకి తాను ముఖ్య పాత్ర కానంతగా. ఆయా సీన్లలో తనెందుకుందో అర్ధంగానంత తికమకగా. 

          దీనికి తోడూ అప్పీరియన్స్ కి కంటిన్యూటీ సమస్య కూడా ఎదురయ్యింది. ఎప్పుడో 2013 లో ఈ సినిమాని ప్రారంభించిన నాటి నాజూకుదనంతో సినిమా సాంతం కన్పించదు. సెకండాఫ్ గడుస్తున్న కొద్దీ బరువెక్కిపోతూ  కన్పిస్తుంది. 2013 నాటి అనూష్కా -2015 నాటికి ఎలావుందో ఫిజికల్ ఫీచర్స్ పరిణామక్రమాన్ని రికార్డు చేస్తుంది ఈ సినిమా. ఈ కథ అనూష్కా పాత్రని  కేంద్రంగా చేసుకుని  నడవక పోవడంతో ఓవరాల్ గా చూస్తే తను చేసిందేమిటో అంతగా గుర్తుకు రాదు. అంటే నటిగా తను విఫలమైనట్టు కాదు. పాత్ర చిత్రణలో దర్శకుడు చేసిన పొరపాట్ల ఫలితం. ఒక ‘ప్రతిఘటన’ లాంటి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా తీసుకున్నా, అందులో పవర్ఫుల్ గా నటించిన విజయశాంతి ఇప్పటికీ గుర్తుంటుంది. కానీ ఇక్కడ ఇంత భారీ చారిత్రాత్మకంలోనూ వీరవనిత రుద్రమదేవిగా అనూష్కా గుర్తుండదు, అల్లు అర్జునే గుర్తుంటాడు. 

         అనూష్కా కంటే గోన గన్నారెడ్డి పాత్రలో అల్లుఅర్జున్ ఎక్కువ హల్చల్ చేయడంతో ఈ సినిమాకి ‘గోన గన్నారెడ్డి’ అని టైటిల్ పెట్టినా నష్టం లేదు,  పైగా ‘బ్రూస్ లీ’  లకీ, ‘అఖిల్’ లకీ బస్తీమే సవాలుగా వుంటుంది తొడగొట్టి సినిమా. తెలంగాణా యాసలో అర్జున్ డైలాగులకే ఎక్కువ హుషారు ప్రేక్షకులకి. పోషించింది అతిధి పాత్రయినా గంగి గోవు పాలు గరిటెడైనా చాలన్నట్టు, ఈ సినిమా చూస్తూంటే వచ్చే నీరసాన్నంతా హుష్ కాకీ చేసేస్తాడు ఎమోషనల్ డ్రైవ్ జాస్తిగా వున్న తెలుగుజాతి ప్రేక్షకులకి అర్జున్. 

          రానా దగ్గుబాటి కాల్పనిక చరిత్ర ‘బాహుబలి’ లోలాంటి పాత్రతోనే, ఆహార్యంతోనే, డిజైనర్ చరిత్ర ‘రుద్రమదేవి’ లోనూ నటించాడు. కానీ ఈ పాత్రకూడా ఆటలో అరటి పండు అయిపోవడంతో తన గురించి చెప్పుకోవడాని కేమీ లేదు. ఇతర పాత్రల్లో కృష్ణం రాజు, ప్రకాష్ రాజ్, నిత్యామీనన్ సుమన్, ఆదిత్యా మీనన్ తదితర భారీ తారాగణమంతా కలిసి, భారీ డైలాగులతో, ప్రధానపాత్ర రుద్రమ దేవి ఉనికిని ప్రశ్నార్ధకం చేశారు. ఇక మహాదేవ నాయకుడుగా నటించిన ముప్ఫయ్యేళ్ళ కుర్రాడు విక్రంజిత్ విర్క్ అయితే,  ఇంత భారీ చారిత్రాత్మకానికి కురచ విలన్ అయిపోయాడు.

          ఇళయరాజా సంగీతం హిట్టేమీ కాదు. పాటలూ - నేపధ్య సంగీతమూ అంతంత మాత్రంగానే వున్నాయి. నేపధ్య సంగీతమైతే మరీ వెనకబడిపోయింది. అజయ్ విన్సెంట్ ఛాయాగ్రహణానికి లైటింగ్ లో, కలర్ స్కీం లో ఏకత్వం కన్పించదు. కొన్ని ఔర్ డోర్ దృశ్యాలు మాత్రం బావున్నాయి. సాంకేతికంగా ఈ సినిమా అంత ఉన్నతంగా ఏమీ లేదు.  గ్రాఫిక్స్ మరీ చవకబారుగా వున్నాయి.  సెకనుకి ఇరవై వేలు వెచ్చిస్తే వచ్చే క్వాలిటీ నాలుగైదు వేలు పెడితే ఏమొస్తుంది. అలాగే యాక్షన్ సీన్సు సైతం బలహీనంగా వున్నాయి. కత్తి పోరాటాలు ఈ కాలపు సినిమానే  చూస్తున్నామా అన్నట్టున్నాయి- పాత జానపద సినిమాల్ని జ్ఞప్తికి తెస్తూ. 

          పరుచూరి బ్రదర్స్ రాసిన సంభాషణలు ఫస్టాఫ్ వరకూ మంచి ఫీల్ నిస్తాయి. సెకండాఫ్ లోనే మరీ  భారమన్పిస్తాయి. కారణం,  కథని యాక్షన్ తో కాకుండా, ఎంతసేపూ వ్యూహ ప్రతివ్యూహాలు, కుట్రలూ కుతంత్రాలూ మాటాడుకోవడాలతో, ఊహాగానాలతో నిండి పోవడమే - ఆ నాడు కృష్ణ దర్శకత్వం వహించిన డైలాగుల మోత  ‘సింహాసనం’ ని గుర్తుకు తెస్తూ.  ఒక్క అల్లు అర్జున్ కి రాసిన డైలాగులు మాత్రమే క్రియేటివిటీతో శక్తిమంతంగా వున్నాయి. ఇలాటి పవర్ఫుల్ డైలాగులు  అసలుండాల్సిన  రుద్రమదేవి పాత్రకే మృగ్యమైపోయాయి.

          పాత్రల పంపకం, డైలాగుల పంపకం, సాంకేతిక హంగుల పంపకం.. ఇలా వేటిలోనూ బ్యాలెన్సింగ్ యాక్ట్ పాటించని అగ్ర దర్శకుడు గుణశేఖర్ మేకింగ్ పనితనం మొత్తంగా ఎలా వుందో ఈ కింద  ‘స్క్రీన్ ప్లే సంగతులు’ తర్వాత చెప్పుకుందాం..

స్క్రీన్ ప్లే సంగతులు 














                                  


                                                         
                   


          

8, అక్టోబర్ 2015, గురువారం

సాంకేతికం- ఆర్ట్

ఆనంద్ సాయి
      కళా దర్శకుల క్రియేటివిటీ సెట్స్ వేయడం దగ్గరే ముగిసినప్పుడు షూటింగుల్లో వాళ్లకి పనుండేది కాదు. రచయితల్లాగే కళా దర్శకుల్నీ షూటింగ్ స్పాట్ లో పరదేశీలు గా చూసేవాళ్ళు. హాలీవుడ్ లోనూ ఇంతే. షూటింగుల్లో  ఆ సినిమా రచయిత కన్పిస్తే - ‘ వీడిక్కడికి ఎందుకొచ్చినట్టు?’ అన్నట్టు చూస్తారనీ రెండు ఆస్కార్ల రచయిత విలియం గోల్డ్ మాన్ రాశారు. తన సినిమా ప్రివ్యూకే వెళ్ళినా ద్వారపాలకుడు  రానియ్యలేదని సరదాగా పుస్తకం రాశారు ( అడ్వెంచర్స్ ఇన్ స్క్రీన్ ట్రేడ్). టాలీవుడ్ కి సంబంధించిన ఒక ప్రముఖ కళాదర్శకుడు ఆఫ్ ది రికార్డ్ గా చెప్పిన ప్రకారం-  షూటింగుల్లో దర్శకుడికీ కెమెరామాన్ కీ మధ్య కళాదర్శకుడు డిస్టర్బెన్స్!  నిర్మాతకి అనవసర ఖర్చు!!

          ధోరణి ఇప్పుడు మారింది. కనీసం భారీ వ్యయాలతో నిర్మిస్తున్న సినిమాలకి సంబంధించి! ఇప్పుడంతా డిజైనర్ లుక్ ప్రపంచం. కొత్తతరం దర్శకులు సినిమా ఆద్యంతం, ప్రత్యంగుళం ప్రొడక్షన్ ని స్టయిలిష్ గా డిజైన్ చేసేందుకు కళాదర్శకుల్ని కూడా కలుపుకుని పోతున్నారు. దీంతో దృశ్యాల్లో కన్పించే అన్ని సెట్ ప్రాపర్టీస్ మీదా  కళా దర్శకుడికి అధికారం వచ్చేసింది. దీని పర్యవసానం ఎలా వుందంటే,  హిందీ సినిమాల్లో కన్పించే డిజైనర్ ఫర్నీచర్, డోర్ కర్టెన్లు, ఆఖరికి టీపాయ్ మీది యాష్ ట్రేలూ సైతం చూసి ముచ్చట పడి, అలాటివి తమ ఇళ్ళల్లో తయారు చేయించుకుంటున్నారు ప్రేక్షకులు. ఇంతగా ప్రభావితం చేస్తోంది నేటి కళా దర్శకత్వం ప్రజల్ని. సరీగ్గా ఇలాటి మంచి ట్రెండ్లో టైం చూసుకుని ఎంటరయ్యారు ఆనంద్ సాయి. ఎంటరై పూర్తి ఇన్వాల్వ్ మెంట్ తో అద్భుతాలు చేస్తున్నారు ఆర్ట్ డైరెక్షన్ లో.

          ‘ఎక్కడా నా టచ్ ని మిస్ కానివ్వను, నాకు సంతృప్తి నివ్వంది ఏ  సినిమాకీ పని చెయ్యను. సంఖ్య కాదు నాకు ముఖ్యం, నాణ్యత’  అని తన వర్క్ కల్చర్ చెప్పుకొచ్చారు.

          అనుభవజ్ఞుడైన దర్శకుడికీ, కెమెరా మన్లకీ భిన్నంగా,  ఫ్రేముల్లో మీరింకేం విశేషం చూసి నిర్ణయిస్తారన్న ప్రశ్నకి, రసాత్మకతని చూస్తానన్నారు.

          సంగీత నాట్యాలు, సాహిత్య చిత్రలేఖనల్లాగే, వాస్తుకళ కూడా ప్రాచీన శాస్త్రాల మీద ఆధారపడింది. మరి అత్యవసరమైన ఈ మూలాలతో కూడిన భారతీయతని ఒక కళా దర్శకుడిగా మీరెంత వరకు సంతరించుకున్నారన్న మరో ప్రశ్నకి,  తన తండ్రి జీన్సే సహజంగా తనకి సంక్రమించాయన్నారు. 

         విఖ్యాత కళా దర్శకుడు బి. చలం ( 700 సినిమాలు) తనయుడైన ఆనంద్ సాయి అప్పటి విధానాలు తనకి సరిపడక తండ్రి అడుగు జాడల్లో నడవలేదు. ఇంటీరియర్ డెకొరేషన్ కోర్సు చేసుకుని చెన్నై లోనే ఆ బిజినెస్ పెట్టుకున్నారు. కానీ సినిమాలు ఆయన్ని వదల్లేదు.  ఒకసారి ఆ పెట్టిన బిజినెస్ లో అయన సృజనాత్మకతకి మెచ్చి, పవన్ కళ్యాణ్  ‘తొలిప్రేమ’ కి పనిచేయమని కోరారు. అంతే, ఇక తన విధానాలు అమల్లో పెట్టే టైం వచ్చేసిందని ఫీల్డులోకి ఎంటరై పోయారు ఆనంద్.

           రావడం రావడం ఏకంగా తాజ్ మహల్ నే సృష్టించారు. అది చూసి వారెవ్వా అనుకుంది ఫీల్డు. కానీ అవార్డుల కమిటీ ఆ తాజ్ మహల్  గ్రాఫిక్స్ అని భ్రమసి నంది అవార్డు లేదు పొమ్మంది. గ్రాఫిక్స్ ని అంతగా ఇష్టపడని తను, ఇప్పుడు చాలా మంది అనుసరిస్తున్న 50 శాతం సెట్,  50 గ్రాఫిక్స్ అనే విధానానికి పూర్తి వ్యతిరేకం. కళా దర్శకులు వేసే సెట్స్ కి మ్యాచయ్యే ప్రమాణాలతో కూడిన హై ఎండ్ కంప్యూటర్ గ్రాఫిక్స్ ఇంకా మన దేశానికి రాలేదన్నది తన అభిప్రాయం. కనుక ఎంత పెద్ద సెట్ అయినా పూర్తిగా ఫిజుకల్ గా నిర్మించే తీర్తారు తను. అసలు గ్రాఫిక్స్ కే ఖర్చు ఎక్కువన్నది తన నమ్మకం.

          ‘ గ్రాఫిక్స్ ని అలా ఉంచితే, డిజిటల్ ఇంటర్మీడియేట్ ( డీ ఐ) సంగతేమిటి? మీరొక సెట్ వేశాక, కెమెరామాన్ తన తరహా లైటింగ్ తో చిత్రీ కరిస్తాడు. ఆ చిత్రీకరణల మీద మళ్ళీ డీఐ  కలరిస్టు వచ్చేసి  ఆ లైటింగ్ నీ,  మీరు వాడిన సెట్ కలర్స్ నీ కూడా దిద్దుతాడు. అప్పుడు మీ ఒరిజినాలిటీ  ఎక్కడుంటుంది? మీ మీద కెమెరామాన్, కెమెరామాన్ మీద కలరిస్టూ చేయి చేసుకుంటూ పోతే, అంతిమ రూపం కలరిస్టుదే అవుతుంది కదా?’ అన్న సందేహానికి,  ఇలాటి సమస్యలు వస్తాయనే డీఐ మీద మంచి అవగాహన ఉన్న కెమెరామన్లతో పనిచేస్తున్నట్టు చెప్పుకొచ్చారు ఆనంద్.

           తిరిగి ఆయన ప్రొఫైల్ కొస్తే, ఈ పన్నెండేళ్ళలో  60 సినిమాలకి పని చేశారు. అన్నీ బిగ్ స్టార్స్ తో బిగ్ డైరెక్టర్ల  సినిమాలే. ఒక్క 2010 లోనే చూసుకుంటే, ‘అదుర్స్’,  ‘కొమరం పులి’, ‘ఖలేజా’, ‘బృందావనం’, ‘ఆరెంజ్’  అనే ఐదు బిగ్ సినిమాలకి కళా దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘శక్తి’ కి, అల్లు అర్జున్ ‘బద్రీ నాథ్’ కీ పని చేస్తున్నారు. ‘శక్తి’ కి వేసిన పాతాళ  భైరవి సెట్ తన కళా ప్రతిభకి పరాకాష్ఠ. ఇందులో ముట్టుకుంటే స్థంభాలు వెలుగుతాయి, పట్టుకుంటే కత్తులు ప్రకాశిస్తాయి. ఇంతవరకూ ఎక్కడా వెయ్యని 40 అడుగుల ఎత్తు, 120 అడుగుల పొడవు, 170 అడుగుల వెడల్పూ గల మెగాసెట్ అది. అలాగే ‘బద్రీనాథ్’ కి కులూమనాలీ లో భారీ దేవాలయం సెట్ వేశారు.

       వ్యక్తిగతంగా తెలుపు నలుపు సినిమాలిష్టం. ఎలాంటి గ్రాఫిక్స్, టెక్నాలజీ, రిఫరెన్సులూ కూడా లేని ఆ రోజుల్లో తన తండ్రీ,  ఏకే శేఖరూ కలిసీ వేసిన ‘చంద్ర లేఖ’  (1948) సినిమాలోని సెట్స్ ఈనాటికీ మర్చిపోలేనన్నారు. అలాగే ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ కి తన తండ్రి వేసిన మానస సరోవరం సెట్ ఒక పాఠమయిందని చెప్పారు.

          తన శైలి గురించి చెప్తూ, తక్కువ ఛాయలో కలర్స్, వేసింది సెట్ లా కాకుండా నిజ నిర్మాణంలా ఉంటూ,  కాస్త ఎత్తు ఎక్కువున్న సెట్స్ కన్పిస్తే,  అది ఆనంద్ సాయి బ్రాండ్ గా గుర్తు పట్ట వచ్చన్నారు. ‘ఖలేజా’  లో రాజస్థాన్ గ్రామం సెట్, నిజంగా గ్రామంలానే అన్పించడాన్ని మనం చూశాం. ఇకపోతే  ప్రాచీన కట్టడాల్ని పరిశీలించడానికి తరచూ విదేశీ యాత్రలు చేస్తారు ఆనంద్. కంప్యూటర్  మీద తను పని చెయ్యరు. చేత్తోనే డ్రాయింగ్స్ వేస్తారు. అదీ దర్శకుల ముందు కూర్చుని. డ్రాయింగ్స్ వేయలేని కళాదర్శకులు కూడా ఫీల్డులో కొనసాగ వచ్చనీ, అయితే అది ఎంతో కాలం సాగదనీ హెచ్చరించారు.

          కథని స్టార్స్ డామినేట్ చేయకూడదని అనుకుంటాం మనం. స్టార్స్ ని సెట్స్ డామినేట్ చేయకూడదని అంటారు టాప్ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి.


-సికిందర్
(ఫిబ్రవరి 2011, ఆంధ్రజ్యోతి-‘సినిమాటెక్’ శీర్షిక)  


సాంకేతికం- ఎడిటింగ్

జి.జి. కృష్ణారావు

 శ్రీ రామరాజ్యంతో బాపూ రమణల రామాయణ అబ్సెషన్ తిరిగి వెండితెర మీద జ్వాజల్యమాన 
మవుతున్నప్పుడు మొట్ట మొదటిసారిగా 
ఆ క్యాంపులోకి  అడుగుపెడుతున్న కె. విశ్వనాథ్ స్కూలు ఎడిటర్ జి.జి. కృష్ణారావు...


                                    
                                 తానిప్పుడు శివాలయం నుంచి రామాలయంలోకి బదిలీ అయ్యారు. తన కెరీర్ లో కూడా ఇదే తొలి పౌరాణికమయ్యింది. ఆనాడు ఆదుర్తి సుబ్బారావుతో మొదలై,  దాసరి నారాయణరావుతో కొనసాగి, విశ్వనాథ్  దగ్గర  సెటిలైన తను నూరు సినిమాల ఓల్డ్ మాస్టర్. మూడు నందుల గ్రహీత. ప్రతిష్టాత్మక ‘శంకరాభరణం’ ఎడిటర్ కూడా.

                              ‘షాట్స్ స్పీక్స్..’ అని విశ్వనాథ్ గురించి చెప్పడం ప్రారంభించారు. ‘ఆయన షాట్సే కథ చెప్తాయి. ఎడిటింగ్ లో ఆయన స్మూత్ నెస్ ని కోరుకుంటారు. ‘శంకరాభరణం’ ఎడిటింగ్ విషయంలో ప్రత్యేకంగా నేను కష్ట పడిందేమీ లేదు. అన్ని సినిమాలకి లాగే దానికీ చేశాను. అప్పట్లో ఎడిటింగ్ కి నంది అవార్డు లేదు గానీ వుంటే తప్పకుండా నాకొచ్చేది ‘శంకరాభరణం’ కి..’ అని  చెప్పుకొచ్చారు. 


                              తర్వాత ‘సాగర సంగమం’, ‘శృతిలయలు’, ‘శుభసంకల్పం’ అనే మూడు విశ్వనాథ్ సినిమాలతోనే ఆలోటు కూడా తీరిపోయింది మూడు నందు లందు కోవడంతో!

                              స్మూత్ ఎడిటింగ్ ని పదేపదే ప్రస్తావించారాయన. కానీ ఇప్పుడు అలాంటి ఎడిటింగ్ కి కాలం తీరిందని మనకి తెలుసు. అలాంటప్పుడు ఈ రోజుల్లో ఒక ‘సింహా’ లాంటి భారీ యాక్షన్ సినిమాకి ఎడిటింగ్ చేయాల్సి వస్తే తన పరిస్థితేంటి?-  అనడిగితే- 

                               ‘ఆ ఏముందిలెద్దూ..ఆ రోజుల్లో దాసరి తీసిన చాలా సినిమాల్లో యాక్షన్ సీన్స్ కి ఏ ఆప్టికల్సూ వాడకుండా, అయినా ఎఫెక్టు తగ్గకుండా ఎడిటింగ్ చేశానుగా..’ అని  తేలిగ్గా నవ్వేశారు. 

                              ఈ నవ్వు తర్వాత  నిస్పృహ ...ఇవ్వాళ ఎడిటర్లు మనసు చంపుకుని పని చేస్తున్నారనేది ఒక వాస్తవం. దీన్ని ప్రస్తావిస్తే, ఆయన ఏకీభవిస్తూ- ‘వాట్ డైరెక్టర్స్ వాంట్ ఈజ్ అవర్ అట్ మోస్ట్ ప్రయారిటీ’ అన్నారు. ‘దర్శకులు ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు రకరకాల పద్ధతులు అవలంబిస్తారు విజువల్ గా..ప్రేక్షకులు కూడా ఎడిటింగ్ తీరుతెన్నుల్ని గమనిస్తున్నారు. జెర్కీ కట్స్ తో, వీలైనన్ని ఎక్కువ ఎఫెక్ట్సు వేస్తే ఎడిటింగ్ ఫస్టుగా చేశాడ్రోయ్ అనుకుంటున్నారు..పైకి మేం దర్శకుల, ప్రేక్షకుల టేస్టుకి ఓటేసినా, లోలోప బాధపడుతూనే వుంటాం.. అదసలు ఎడిటింగే కాదనుకుంటాం- ఏం చేస్తాం?’ అన్నారు నిస్పృహగా. 

                          ‘ఒకప్పుడు హీరో కొడితే కింద పడిపోయే వాడు విలన్..అది బావుందనుకున్నారు. తర్వాత గాల్లోకి లేచి కాస్సేపు అలా నిల్చిపోవడం మొదలెట్టాడు. ఇదీ బావుందనుకున్నారు. దీని తర్వాతేంటి? ఒక ‘రోబో’ ని  వదిలి  ప్రేక్షకుల్ని ఆకలి గొన్న పులుల్ని చేశారు. దీని తర్వాతేంటి? ఇలా ఎక్కడిదాకా పోతారు? ఎక్కడో ఒక చోట కుప్పకూలాల్సిందే. ప్రేక్షకులకి ఎంత ఎక్కువగా టెక్నాలజీ అలవాటు చేస్తే అంత ఎక్కువ కోరుకుంటారు. అందుకని సినిమాల్ని మంచి కథావస్తువుతో, మనస్సుకి హత్తుకునేలా విలువల్ని పెంపొందించేలా తీస్తే ఏ గొడవా వుండదు ’ అని వివరించారు.

                              ఒకప్పుడు ఫీల్ తో చేసిన ఎడిటింగ్ ఇప్పుడు మెకానికల్ గా మారిందన్నారు.
మూవీయోలా రోజుల్లో ఆ యంత్రంలో రీలు రన్ అవుతూంటే, సరైన షాటు కన్పించిందా- ‘ఇదిరా షాటూ!’ అని చేతులు చాచి ఉద్వేగంగా పట్టుకునే వాళ్ళమన్నారు. ఇప్పుడు ఎవిడ్ లో యాంత్రికంగా క్లిక్ చేసి సరిపుచ్చు కుంటు న్నామన్నారు.

                              దర్శకుడు ఎంతయినా ఫిలింని  ఎక్స్ పోజ్ చేయవచ్చు, కానీ ఒక దృశ్యంలో ఫీల్ ఎంత ఉండాలో తెలిసి ఎడిట్ చేసిన వాడే గొప్ప ఎడిటరని అన్నారాయన. ఒక్కో కథకీ ఒక్కో వేగంతో నడక (పేస్) ఉంటుందనీ, ఆ నడకని  కూడా దృష్టిలో పెట్టుకుని ఎడిటింగ్ చేయాల్సి ఉంటుందనీ అన్నారు. 


                              ఇప్పుడు సమ్మె కారణంగా ‘శ్రీరామ రాజ్యం’ ఎడిటింగ్ పనులు ఇంకా మొదలు కాలేదు. తగు మోతాదులో సీజీ వర్క్స్ ని కూడా కలిగివుండే ఈ సినిమా విషయంలో తనకి కంగారేమీ లేదని ధీమా వ్యక్తం చేశారు. గుడివాడ ఏఎన్నార్ కళాశాలలో బీఎస్సీ పూర్తి చేసిన కృష్ణా రావు, మిలటరీలో చేరబోయి ఎలాగో పూనా ఫిలిం ఇనిస్టిట్యూట్ లో ఎడిటింగ్ కోర్సులో పడ్డారు. 1961-62 లలో అప్పుడప్పుడే ఆ ఇనిస్టిట్యూట్ ప్రారంభమయింది. అప్పుడు అక్కడికి వచ్చిన  సుప్రసిద్ధ దర్శకుడు ఆదుర్తి  సుబ్బారావు కృష్ణారావుని చూసి- ‘యూ కమ్ అండ్ మీట్ మీ ఇన్ మెడ్రాస్’  అన్నారు.

                            అప్పుడు ‘మూగమనసులు’ ఎడిటింగ్ పనులు పూర్తి కావచ్చి,  ‘గౌరమ్మా  నీ మొగుడెవరమ్మా’ పాట దగ్గరుంది.. ఎడిటర్ టి. కృష్ణ కి అసిస్టెంట్ గా ఆ సినిమాకి పని చేసి, తర్వాత  ఆదుర్తే తీసిన ‘తేనేమనసులు’ కీ అసిస్టెంట్ గానే చేశారు. ఆతర్వాత ఆదుర్తి బాంబే  తీసికెళ్ళి తను తీస్తున్న ‘జ్వార్ భాటా’ (దాగుడుమూతలు) ఎడిటింగ్ బాధ్యతలప్పగించారు. అదే ఎడిటర్ గా కృష్ణారావు తొలి సినిమా. వడ్డే శోభానాద్రీశ్వర రావు తీసిన ‘పాడవోయి భారతీయుడా’ ఎడిటర్ గా తెలుగులో తన మొదటి సినిమా. 

                        మిలిటరీలో చేరిపోయే అవకాశం ఎలాగో తప్పినా, ఆ తర్వాత ఎడిటర్ గా ఢిల్లీ వెళ్లినప్పుడు అప్పుడున్న టీవీ కేంద్రంలో చేరిపోయారు. కానీ ఇలా నెలనెలా జీతం తీసుకుంటూ కాంప్రమైజ్ అయిపోవడమేనా, ఏమైనా రిస్కు చేసి నీ టాలెంటుని ఇంకా సువిశాలం చేసుకునేదేమైనా ఉందా? - అన్న టాక్ వచ్చి, అదృష్టంకొద్దీ ఆదుర్తి, దాసరి, విశ్వనాథ్ ల తర్వాత..ఇప్పుడు బాపూకి దక్కారాయన!


-సికిందర్ 
(జనవరి 2011, ఆంధ్రజ్యోతి- ‘సినిమాటెక్’ శీర్షిక)
                                   
                                   
                                   
                                    

5, అక్టోబర్ 2015, సోమవారం

జోడు పాయింట్ల జుగల్బందీ..?

        
దర్శకత్వం : మేఘనా గుల్జార్ 

తారాగణం : ఇర్ఫాన్ ఖాన్, కొంకణా సేన్ శర్మ, టబు, ఆయేషా పర్వీన్, నీరజ్ కబి,
సోహం శర్మ, గజరాజ్ రావ్, అతుల్ కుమార్, శిశిర్ శర్మ తదితరులు
రచన- సంగీతం :  విశాల్ భరద్వాజ్,  సాహిత్యం : గుల్జార్
ఛాయాగ్రహణం :  పంకజ్ కుమార్, ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్
బ్యానర్ : జంగ్లీ పిక్చర్స్, వీబీ పిక్చర్స్, మిర్చీ మూవీస్
నిర్మాతలు : విశాల్ భరద్వాజ్, వినీత్ జైన్
విడుదల :  2 అక్టోబర్ 2015

***
         2008 లో నోయిడాలో ఆరుషీ- హేమ రాజ్ ల జంటహత్యల కేసు జాతీయ మీడియా పుణ్యమా అని సంచలనాత్మక ఉదంతంగా హోరెత్తిపోతోంది ఇవ్వాళ్ళ కూడా. జాతీయ మీడియాగా చెప్పుకునే ఉత్తరాది మీడియా ఇలాటి హై సొసైటీ హత్య కేసులకి లేనిపోని ప్రాధ్యాన్య మిచ్చి నాన్ స్టాప్ కవరేజీ ఇవ్వడం మామూలే. జెస్సికా లాల్ హత్య కేసు, నిథారీ గొలుసు హత్యల కేసు, సునందా పుష్కర్ హత్య కేసు, తాజాగా షీనా బోరా హత్య కేసు...వీటికి కవరేజీ మాత్రమే ఇవ్వడం కాదు, ఛానెళ్ళ దర్బార్లలో సొంత కోర్టులు నిర్వహించి తీర్పులు కూడా చెప్పేయడం చేసేస్తున్నారు. షీనా బోరా హత్య కేసులో పది రోజులు గొడవ గొడవగా వరస కోర్టులు నిర్వహించి, ఆమె తల్లి ఇంద్రాణీ ముఖర్జీయాని హంతకురాలిగా తేల్చిపారేసింది ఓ నంబర్ వన్ ‘జాతీయ’ ఛానెల్. ఇవే హత్యలు దక్షిణ దేశం లో జరిగితే ప్రాంతీయ వార్తల స్థానానికి కూడా నోచుకోవు జాతీయ ఛానెళ్ళుగా చెప్పుకునే ఉత్తరాది ఇంగ్లీషు ఛానెళ్ళలో. ట్యాంక్ బండ్ మీద రైతు ఆత్మహత్య చేసుకుంటే అది జాతీయ వార్త కాదు, ఓ రాజస్థాన్ రైతు ఢిల్లీ వచ్చి ఆత్మహత్య చేసుకుంటే రోజుల తరబడి రగడ, ఆ రైతు స్వగ్రామాని కెళ్ళి  పరిశోధనలు. దక్షిణ రాష్ట్రాలే కాదు, ఈశాన్య రాష్ట్రాల్ని కూడా ఈ దేశంలో భాగంగా గుర్తించడానికి నిరాకరిస్తాయి ‘జాతీయోత్తరాది’ మీడియా సంస్థలు. ఈ నేపధ్యంలో ఆరుషీ -హేమ రాజ్ జంట హత్యల మీద ఓ సినిమా తీయగాలిగారంటే అది  ‘జాతీయోత్తరాది’ మీడియా పుణ్యాన అంత పాపులర్ అయినందునే. నిజానికి ఈ ఏ హత్య కేసుల పట్లా దక్షిణాది ప్రజలకి అంత ఆసక్తి లేదు. సినిమాని మాత్రం దేశ వ్యాప్తంగా విడుదల చేశారు...



        కవి గుల్జార్ కుమార్తె, దర్శకురాలు మేఘనా గుల్జార్ కూడా ఈ సినిమా తీస్తూ తీర్పు చెప్పేశారు. నిజానికి కేసు హైకోర్టులో పెండింగులో వుంది. మేఘన తీర్పు చెప్పడమే గాక,  పొట్టపోసుకోవడానికి ఇళ్ళల్లో పని చేసుకునే సేవకుల మనోభావాల్ని దెబ్బతీస్తూ  ఈ సినిమాకి  పబ్లిసిటీ కూడా ఇస్తున్నారు. ఢిల్లీ, ముంబాయిలలోని ఉన్నత వర్గాల వారి నుంచి అభిప్రాయాలు సేకరిస్తూ, ఇప్పుడు పని వాళ్ళని చూసి భయపడాల్సి వస్తోందని ప్రచారం చేయిస్తున్నారు. ఒకావిడ పాతికేళ్ళుగా నమ్మకంగా పని చేస్తున్న పనివాణ్ణి  ఈ సినిమా చూసి రమ్మని పంపానని చెప్పుకుంది! ఇంకో బిజినెస్ మాగ్నెట్  స్వయంగా తను పనివాణ్ణి తీసికెళ్ళి సినిమా చూపిస్తానని చెప్పుకున్నాడు! ఇంకా చాలామంది చాలా చాలా చెప్పుకొచ్చారు పనివాళ్ళపై అనుమానాలు పెట్టుకుని. ఈ సినిమాలో చూపించినట్టుగా పనివాళ్ళు చెడ్డవాళ్ళుగా మారకూడదన్న మెసేజి ఉదారంగా ఇచ్చేస్తున్నారు. పనివాళ్ళ ద్రోహాల కంటే యజమానుల  శాడిజాలే ఎక్కువన్న సంగతి మర్చిపోతున్నారు. నోయిడాలో ఆ హత్యలు జరిగినప్పుడు పని వాళ్ళంటే లేని భయం, ఈ ప్రచారం, ఇప్పుడు సినిమా విడుదలయ్యాక అర్జెంటుగా గుర్తు కొచ్చేసింది. ఓ కళారూపంగా ఈ సినిమా పట్ల ఏ కాస్త ఆసక్తి పెంచుకున్న వాళ్లని కూడా ఈ నెగెటివ్ పబ్లిసిటీతో దూరం చేసుకుంటున్నారు. ఎనిమిదేళ్ళ నుంచీ ఇంకా తెమలని కేసులో పనివాళ్ళని ఎలా దోషులుగా చిత్రిస్తారో వాళ్ళ విజ్ఞతకే వదిలెయ్యాలి.


        కళారూపంగా చూస్తే ఈ సినిమాతో మేఘన అద్బుతాన్నే సాధించారు టెక్నికల్ గా, విషయపరంగా కాదు. 2002 లో దర్శకురాలిగా తొలి సినిమా ‘ఫిల్హాల్’  (తాత్కాలికంగా..) తీసి ఎవర్నీ సంతృప్తి పర్చలేకపోయిన తను, మరో మూడు సినిమాలతోనూ చుక్కాని లేని నావలాగే ప్రయాణించు కొచ్చారు.  ‘తల్వార్’ తో ఇప్పుడు తన జానర్ ఏంటో, చేరాల్సిన గమ్యస్థానమేంటో తెలుసుకున్నారు. మరో మీరా నాయర్ అన్పించుకోవడానికి  నామోషీ ఏమీ వుండకూడదు.  నిజానికి దర్శకురాళ్ళు కమర్షియల్ సినిమాల కంటే రియలిస్టిక్ సినిమాలు తీసే పేరు సంపాదించుకుంటున్నారు. 

          నిజానికి రియలిస్టిక్ సినిమాలు తీయడమే కష్టం. కమర్షియల్ సినిమాల్లో అరగంట కొరియోగ్రాఫర్లు పాటలేసుకుంటారు, అరగంట ఫైట్ మాస్టర్లు ఫైట్లేసుకుంటారు. మిగిలిన గంట దర్శకులకి వదిలిపెడతారు. ఈ గంటలో మళ్ళీ ఓ అరగంట కామెడీ వేసి తప్పించుకుని, చివరాఖర్లో చద్దన్నంలా మిగిలే ఆ అరగంట సేపే దర్శకులు కథ పెట్టుకుని పని కల్పించుకుంటారు.

          రియలిస్టిక్ సినిమాలతో అలాకాదు. మొత్తం రెండు గంటల నిడివినీ ఔట్ సోర్సింగ్ ఇవ్వకుండా దర్శకులే  భుజాన్నేసుకుని, ఏ మసాలాలూ వుండని సబ్జెక్టుని, తమ మేధస్సుని రంగరించి దగ్గరుండి దృశ్యీ కరించుకోవాల్సిందే. ఈ గడ్డు ప్రయత్నంలో మేఘనా తడబడకుండా దాటేశారు. ఐతే స్క్రిప్టుకి సంబంధించిన పనీపాటా తను పెట్టుకోకుండా,  మరో రియలిస్టిక్  మాంత్రికుడు విశాల్ భరద్వాజ్ కి అప్పజెప్పారు.

***
    ‘ల్వార్’ రెగ్యులర్ రియలిస్టిక్ సినిమాల ధోరణిలో కూడా వుండదు. ఎడిటింగ్ గిమ్మిక్కు లుండవు. ఆర్ట్ సినిమా వాస్తవికతతో ఏ హడావిడీ లేకుండా, ఆర్ ఆర్ తోనూ ఉద్రేకపర్చకుండా, సైలెంట్ గా నిజజీవితంలో లాంటి సాదాసీదా సన్నివేశాలతోనే షాకిస్తూ, ఆలోచింప జేస్తూ సాగిపోతుంది. అక్కడక్కడా డాక్యుమెంటరీ ధోరణి వచ్చి చేరుతుంది. దీంతో ఇది డాక్యూ డ్రామా జానర్ ని సంతరించుకుంది. ఈ హత్యోదంతాన్ని బహుళ దృష్టి కోణాల్లో చెప్పాల్సిన అవసర ముంటుంది. నిజ కేసు అలాగే వుంది. మూడు  పోలీసు బృందాలు సేకరించిన సాక్ష్యాల్లో మూడు రకాల వాంగ్మూలాలిచ్చిన  పనివాళ్ళతో తలనొప్పిగా తయారైన కేసు. ఏ వొకరు చెప్పింది మరొకరితో సరిపోలని రోషోమన్ ఎఫెక్ట్ లాంటి పరిస్థితి. అందుకే ఇదింకా తేలని కేసుగా ఉండిపోయింది. ఐతే పని వాళ్ళు వాళ్ళ దృష్టికోణంలో అసలా రాత్రి ఏం  జరిగిందీ చెప్పుకొస్తున్నప్పుడు, ఆ దారుణానికి రచయిత ఇచ్చిన ట్రీట్ మెంట్, దాన్ని దర్శకురాలు చిత్రీకరించిన తీరూ ఒక క్లాసిక్ సందర్భం, కవి సమయం.

***
     ఓ తెల్లారి పొద్దుటే శృతీ టాండన్ ( ఆయేషా పర్వీన్) బెడ్ రూమ్ లో హత్యకి గురై వుంటుంది. ఆమె తల్లిదండ్రులు రమేష్ ( నీరజ్ కబీ), నూతన్ ( కొంకణా సేన్ శర్మ) టాండన్ లు షాక్ అవుతారు. పోలీస్ ఇన్స్పెక్టర్ ధనీరామ్ (గజరాజ్ రావ్) వచ్చి దర్యాప్తు ప్రారంభిస్తాడు. ఎప్పుడూ చెవి దగ్గర సెల్ ఫోన్ పెట్టుకుని పిచ్చి వాగుడు వాగుతూ, నోట్లో పాన్ వేసుకుని అసహ్యంగా నములుతూ, న్యూసెన్స్ గా వుండే ఇతను దేని మీదా సరీగ్గా దృష్టి పెట్టడు. అక్కడి సాక్ష్యాధారాలు  కూడా సేకరించడు. ఒక్క ఇంట్లో ఉండాల్సిన నలభై ఐదేళ్ళ పనివాడు ఖేంపాల్ లేకుండాపోయాడని మాత్రం గ్రహిస్తాడు. ఆ ఖేంపాల్ ని అనుమానితుణ్ణి చేసేస్తాడు. వాడే శృతిని చంపి పారిపోయాడని ప్రకటించేస్తాడు. మర్నాడు ఆ ఖేంపాల్ శవమై టెర్రస్ మీద కన్పిస్తాడు. కంగుతిన్న ధనీరామ్ అక్కడ గోడ మీద రక్తంతో కూడిన హస్త ముద్రపడి వున్నా దాన్నీ తేలిగ్గా తీసుకుంటాడు. అతడి దర్యాప్తు చాలా నీచస్థాయిలో వుంటుంది. హత్యలు జరిగితే ఫోరెన్సిక్ టీముని పిలిపించాలని గానీ, స్నిఫర్ డాగ్స్ ని రప్పించాలని గానీ అతడికి తోచదు. ఖేంపాల్ గొంతు కోసేసి వుంటుంది. శృతి హత్య కూడా గొంతు కోసేసే జరిగింది. 

          శృతి తల్లిదండ్రులు రమేష్-నూతన్ లు డెంటిస్టులు. వాళ్ళ క్లినిక్ లో కాంపౌండర్ గా పనిచేసే, ఖేంపాల్ క్లోజ్ ఫ్రెండ్ కన్హయ్యా అనే వాణ్ణి ప్రశ్నించడం మొదలెడతాడు ధనీరామ్ నిర్లక్ష్యంగా. డాక్టర్ రమేష్ కి వివాహేతర సంబంధం ఉందనీ, కూతురితో పనివాడు ఖేంపాల్ సంబంధం పెట్టుకున్నాడని అనుమానిస్తున్నాడనీ ఏదేదో చెప్పుకొస్తాడు కన్హయ్యా. దీంతో పూనకం పూనినట్టు నిర్ణయానికొచ్చేస్తాడు ధనీరామ్. వెంటనే పై అధికారి మీడియా సమావేశం పెట్టి- ఈ జంట హత్యలు డాక్టర్ రమేషే చేశాడని ప్రకటించేస్తాడు. తన కూతురూ పనివాడు ఖేంపాల్ ఇద్దరూ ఆ రాత్రి  కలిసివుండగా చూసి తట్టుకోలేక చంపేశాడనీ, ఇది కచ్చితంగా ఆనర్ కిల్లింగే అని చెప్పేసి, డాక్టర్ రమేష్ ని అరెస్టు చేయించి జ్యూడీషియల్ కస్టడీకి పంపించేస్తాడు. దీంతో పోలీసులమీద దుమారం రేగుతుంది అంతటా. ప్రభుత్వం ఈ కేసుని పోలీసుల నుంచి తప్పించి సీడీఐ కి అప్పగిస్తుంది.

       దీంతో జాయింట్ డైరెక్టర్ స్థాయిలో వున్న సెంట్రల్ డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీడీఐ - సీబీఐ పేరు మార్చి ఇలా పెట్టారు) అధికారి అశ్విన్ కుమార్ ( ఇర్ఫాన్ ఖాన్) రంగంలో కొస్తాడు. అసిస్టెంట్ కమిషనర్ హోదాలోవున్న వేదాంత్ (సోహాం శర్మ) తో కలిసి కేసుని తిరగదోడతాడు. కేసు దర్యాప్తులో ఎన్నో లోసుగులున్నట్టు గ్రహిస్తారు. ఇద్దరూ ఇన్స్పెక్టర్  ధనీరామ్ ని పిలిపించి గదిలోపెట్టి, ఏంట్రా నీ ఇన్వెస్టిగేషనూ నువ్వూ -అంటూ చితకబాదడం మొదలెడతారు. దారికొచ్చి ధనీరామ్ చేసిన తప్పులన్నీ చెప్పేసుకుంటాడు.

          సీడీఐ డైరెక్టర్ స్వామి (ప్రకాష్ బేలవాది ) రిటైరవుతూ ఒక మాట చెప్పివుంటాడు అశ్విన్ కుమార్ కి- న్యాయదేవత చేతిలో త్రాసు ఒక్కటే  కాదు, ఇంకో చేతిలో తల్వార్ కూడా వుంటుంది. ఆ తల్వార్ మనమే- పోలీసులం.  గత అరవయ్యేళ్ళుగా ఆ తల్వార్ తుప్పు పట్టిపోయింది. దాన్ని శుభ్రం చేయాల్సిన బాధ్యత నీదే- అని. 

          ధనీరామ్ శుభ్రపడ్డాడు. డాక్టర్ రమేష్ మీద తప్పుడు కేసు పెట్టారని నమ్ముతూంటాడు  అశ్విన్ కుమార్. ఫోరెన్సిక్ టీముతో రీ- ఇన్వెస్టిగేషన్ చేయిస్తాడు. కాంపౌండర్ కన్హయ్యానీ, వాడి ఇంకో మిత్రుణ్ణీ నార్కో టెస్టుకి గురిచేసి కొత్త విషయాల్ని రాబడతాడు. ఆ రాత్రి ఖేంపాల్ గదిలో వీళ్ళిద్దరూ మద్యం తాగుతూ వున్నట్టు, శృతి గదిలోకెళ్ళి ఆమెని అనుభవించాలని చూసినట్టూ, ఖేంపాల్ అడ్డుపడితే అతణ్ణి  చంపేసి టెర్రస్ మీద పడేసినట్టూ, తమని చూసిన శృతిని కూడా చంపేసినట్టూ తేలుతుంది ఆ టెస్ట్ లో. 

          కొత్తగా వచ్చిన సీడీఐ డైరెక్టర్ జేడీ కుమార్ ( శిశిర్ శర్మ) కి ఈ దర్యాప్తు నచ్చదు. అశ్విన్ కనుగొంటున్న విషయాలు అతను నమ్మడు. దీనికి తోడు ప్రమోషన్ ని ఆశిస్తున్న అశ్విన్ సహ అధికారి వేదాంత్,  అశ్విన్ కి ద్రోహం తలపెట్టడంతో, అతడితో కలబడతాడు అశ్విన్. వెంటనే అశ్విన్ ని సస్పెండ్ చేసేస్తాడు జేడీ కుమార్. 

        మళ్ళీ కొత్తగా దర్యాప్తుని అశ్విన్ మాజీ బాస్, రిటైరైన పాల్ (అతుల్ కుమార్) కే  అప్పగిస్తాడు జేడీ కుమార్. పాల్ జేడీ కి అనుకూలంగానే  డాక్టర్ రమేష్ నీ, అతడి భార్యనీ నిందితులుగా నిర్ధారిస్తూ రిపోర్టిస్తాడు. ఇతడి రిపోర్టుకి ఆధారం ఆడ పనిమనిషి ఇచ్చిన సాక్ష్యం. ఇప్పుడు కేంద్ర మంత్రి జోక్యం చేసుకుంటాడు. రెండు టీములూ ఆయన ముందు హాజరై వాదనలతో వేడెక్కిస్తాయి. అశ్విన్ పనివాళ్ళని- పాల్ భార్యాభర్తల్ని హంతకులుగా తేల్చడం గందరగోళంగా అన్పించి క్లోజర్ కి వేసుకోమంటాడు కేంద్ర మంత్రి. ఛార్జి షీటు దాఖలు చేయాల్సిన సీడీఐ, కేసులో సరయిన సాక్ష్యాధారాలు లభించనందున  మూసేయాల్సిందిగా పిటిషన్ వేసుకుంటుంది. జడ్జి చీవాట్లు పెట్టి, భార్యాభర్తల మీద చార్జిషీట్ వేసి కేసు నడపమంటుంది. అలా కేసు నడిచి, డాక్టర్ దంపతులిద్దరూ దోషులుగా తేలి యావజ్జీవ శిక్షతో జైలుకి తరలిపోతారు. ఈ కేసు తప్పుల తడక అంటూ హైకోర్టు కి అప్పీల్ చేసుకుంటారు.
***


          నిజజీవితంలో ఈ కేసు సుప్రీం కోర్టు దాకా పోవచ్చు. తుది తీర్పు వెలువడకుండానే కేసు పట్ల ఒక స్టాండ్ తీసుకుంటూ సినిమా తీయడంతోనే వచ్చింది ఇబ్బంది. ఇతర పాత్రలు ఏమైనా ప్రతిపాదించవచ్చు- కానీ  ప్రధాన పాత్ర ఏం చెప్పిందన్నదే లెక్క కొస్తుంది. అశ్విన్ కుమార్ పనివాళ్ళని నిందితుల్ని చేయడమే సబబు అన్పించదు. ఇలా చేయడం వల్లే  ఒక వర్గం ప్రజలు పనివాళ్ళని కించ పర్చే కామెంట్లు  చేస్తూ మీడియా కెక్కారు సినిమా పబ్లిసిటీలో భాగంగా. వాళ్ళది వ్యవస్థీకృత రంగం కాదు కాబట్టి, వాళ్లకి సంఘాలూ నాయకులూ లేరు కాబట్టి సరిపోయింది. లేకపోతే  ఈపాటికి పనివాళ్ళు వీధి కెక్కి యజమానులు రోడ్డున పడేవాళ్ళు.  

             1950 లో అకిరా కురసావా తీసిన ‘రోషోమన్’ అనే ప్రసిద్ధ సినిమా వుంది. జరిగిన ఒక హత్య గురించి చూసిన నల్గురూ నాల్గు విధాలుగా చెప్పుకొచ్చే కథనం. వీటిలో నిజమేదో ప్రేక్షకులకే వదిలేస్తాడు దర్శకుడు. ఏ సాక్ష్యం  వైపూ ప్రేక్షకుల్నిలీడ్ చేయడు. అదే తను నమ్ముతున్నానని కూడా చెప్పడు. ఒక ప్రశ్నగానే ముగించేస్తాడు కథని.  అదీగాక ఆ వాంగ్మూలాలు అబద్ధాలు అన్పించేట్టుగా కూడా చిత్రించడు. ఆ వాంగ్మూలాలతో అబద్ధాల ఆట, రాజకీయ చదరంగం, ఎత్తుకు పై ఎత్తులేయడం లాంటి గిమ్మిక్కులకి కూడా పాల్పడడు. ‘తల్వార్’ లో ఇవే వున్నాయి. దర్శకురాలే కేసుని తిమ్మిని బొమ్మిని చేస్తూ రాజకీయం చేసినట్టుగా తయారయ్యింది. కురసావా చూపించదల్చుకుంది - నీషే ఫిలాసఫీకి వెండితెర రూపాన్నే అని మనకర్ధమౌతుంది.  నిజాలనేవి లేనే లేవనీ, కేవలం భాష్యాలే ఉంటాయనీ అన్నాడు నీషే (There are no facts, only interpretations-Frederick Niche).

          ‘
తల్వార్’ అనే టైటిల్  తో పోలీస్ వ్యవస్థ నిర్వాకమెలా వుంటుందో చెప్పాలనుకున్నారు. పోలీసుల నిర్వాకంవల్లే  నిజ కేసు అలా తయారయ్యింది. ఒక కేసుని పట్టుకుని వాళ్ళ అసమర్ధత, వాళ్ళ రాజకీయాలు, పోటాపోటీలు ఎలావుంటాయో చక్కగా చూపించారు సినిమాలో. అశ్విన్ కుమార్ వచ్చాక పోలీస్ ప్రొసీజర్ ని కూడా సశాస్త్రీయంగా చూపించారు. ఈ కేసులో మూడురకాల సాక్ష్యాలతో  పోలీసుల పరిస్థితి ఇదీ- అనే రోషోమన్ ఎఫక్ట్ తో ముగించేస్తే సరిపోయేది. కాన్సెప్ట్ ఇదయినప్పుడు కాన్సెప్ట్ తో సంబంధంలేని నిందితుల నిర్ధారణ తతంగానికి తెరతీయాల్సిన అవసరం లేదు. కేసుతో  పోలీసులే గందరగోళంగా వున్నప్పుడు  ఫలానా వాళ్ళు నిందితులనడం అర్ధరహితమే. ఒకే కథలో ఈ రెండూ పరస్పరం పొసగని పాయింట్లు. అయినా ఒకే ఒరలో రెండు తల్వార్లు దూర్చారు- ‘హవా’ లో తల్లి కథగా నడుస్తున్న సినిమా కాస్తా ఆమె పిల్ల కథగా ముగిసినట్టు- పోలీసుల మీద చర్చ కాస్తా పనివాళ్ళ మీదికి మళ్ళిపోయింది. పోలీసులు బతికిపోయారు ఇలాకూడా- పనివాళ్ళు బలైపోయారు చివరికి.
***
           దీనికి పాపం దర్శకురాలి బాధ్యత లేదనుకోవాలి.  ఆవిడ విశాల్ భరద్వాజ్ ని నమ్ముకున్నారు. ఆయన ఏం రాస్తే అదే తీశారు. ఈ సారెందుకో విశాల్ భరద్వాజ్ రాయడానికి రెండు తల్వార్లు పెట్టుకున్నారు. ఒక తల్వార్ తో తీస్తే ఇన్ స్పైర్ అయి రెండో తల్వార్ తో ఇంకెవరూ తీయకుండా రెండు తల్వార్లనీ తనే వాడేసుకున్నారు. కానీ  భరద్వాజ్ ఎంత ప్రయత్నించినా పనివాళ్ళ తల్వార్ తుప్పు పట్టే ప్రసక్తే లేదు. ఎందుకంటే వాళ్ళ పనే తోమి శభ్రంగా ఉంచుకోవడం!        ఈ సినిమా ద్వారా కేసు మీదా, పోలీసుల తీరు మీదా ప్రశ్నాస్త్రాన్ని సంధించాల్సింది కాస్తా  తీర్పులతో మీడియా దర్బార్ లతో పోటీపడ్డారు- మీడియా పుట్టించిన సినిమాయే కాబట్టి!


          ఇర్ఫాన్ ఖాన్ ఈ సినిమాకి ఎస్సెట్. ఏ సినిమాకైనా అతను ఎసెట్టే. కానీ భార్య పాత్రలో టబు ఒక పంటి కింద రాయి. బయట యాక్షన్ లో వుండే హీరోకి ఇంటి దగ్గర సమస్యల్లో వుండే, లేదా సమస్యలు సృష్టించే భార్య వుండడం హాలీవుడ్ మూస. అదిక్కడ జొరబడకూడదు. జొరబడి వీళ్ళ విడాకుల గొడవని తీర్చిందీ లేదు. అర్ధాంతరంగా ముగిసే వ్యవహారం.

          ఇతర పాత్రల్లో ప్రతీ ఒక్కరూ ఈ సినిమాకి హైలైట్. ఎలా నటింప జేసుకోవాలో, నటుల చేత ఎలా మాట్లాడించుకోవాలో ఈ సినిమా చూసి ఇంకా తెలుగు దర్శకులు నేర్చుకోవాల్సింది వుంది. ఈసారి మేఘనా గుల్జార్ ఇంకాస్త మంచి రియలిస్టిక్ సృష్టి తో ముందుకొస్తారని ఆశిద్దాం.


-సికిందర్.