రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

19, ఏప్రిల్ 2016, మంగళవారం

స్క్రీన్ ప్లే సంగతులు!

        సినిమా కథల్లో సంఘర్షణ సంక్షోభాన్ని పుట్టించకపోతే ఆ సంఘర్షణే సంక్షోభంలో పడిపో తుందనేది తెలిసిందే. అప్పుడు సంఘర్షణ ఐడెంటిటీని కోల్పోతుంది. సంఘర్షణ ఐడెంటిటీని కోల్పోయాక కథేముంటుంది. యుద్ధానికి దిగాక యుద్ధం దేని కోసమో తెలీకపోతే అరాచకం మొదలయినట్టే, పాత్ర దేనికోసం సంఘర్షణ మొదలెట్టిందో తెలుసుకోకపోతే కథనం అనేక పక్క దార్లు వెతుక్కుంటుంది. కథలో సంఘర్షణ ప్రారంభించే  పాత్ర, కాల్పుల విరమణ ప్రకటించడానికి వీలే వుండదు. చావో రేవో సంఘర్షణలో పడి తేల్చుకోవాల్సిందే. స్క్రీన్ ప్లేలో మిడిల్ విభాగంలో  పలాయనవాదానికి ఎలాటి చోటూ  వుండదు.  


        కాకతాళీయమే కావొచ్చు, ఒకే నెలలో విడుదలైన పవన్ కల్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్’, షారుఖ్ ఖాన్ ఫ్యాన్రెండూ సంఘర్షణని భిన్న కోణాల్లో చూశాయి. సంఘర్షణ- అది దారి తీయించే సంక్షోభం ఈ రెండు సినిమాల్లోనూ ఒకలాగే వుంటాయి - హీరోని బద్నాం చేయడమే పాయింటు. అయితే ఈ బద్నాం చేసే ( హీరో పరువు ప్రతిష్టలకి భంగం కల్గించే) ప్రక్రియని మిడిల్లో ఎప్పుడు ప్రారంభించాలనే దానికి రెండూ రెండు సూత్రాలు చెప్పాయి. ‘ఫ్యాన్లో వెంటనే చెప్పడం ప్రారంభిస్తే, ‘సర్దార్ గబ్బర్ సింగ్ లో చాలా ఆలస్యంగా క్లయిమాక్స్ లో ఆ ప్రక్రియ చేపట్టారు. ఈ ఆలస్యమే సంఘర్షణని సంక్షోభంలోకి నెట్టేసిందా?

         
పవన్ కల్యాణ్ రచనా వ్యాసంగంలో ప్రతిష్టాత్మకంగా రూపొందిన  ‘సర్దార్ గబ్బర్ సింగ్ చలనచిత్ర కథా స్క్రీన్ ప్లేలతో,  అంత కష్టపడి సినిమా తీస్తే, ఒక్క నిమిషంలో  ఏం బాగా లేదని తేల్చేశారు జనాలు. సినిమాలో ఎన్నో వున్నాయి, వినోదానికి హద్దులే లేవు, విన్యాసాలకి అంతే లేదు, కథని  హీరో విలన్ల మధ్య రొటీన్ వయొలెంట్ పోరాటంగా వుంచక, తేలికబర్చిముక్కోణ ప్రేమతో ఎంటర్టెయిన్మేంటే  ప్రధానంగా నడిపించారు. అయినా నచ్చలేదు జనాలకి. ఎందుకు నచ్చలేదు- కథ లేదు కాబట్టి, ఎమోషన్ లేదు కాబట్టి నచ్చలేదు. ప్రతీ సినిమాలో కథే ఉండాలా, ఎమోషనే ఉండాలా, ఓ సారికి క్షమించేసి సరదాగా ఓ జాయ్ రైడ్ గా తీసుకుని, పవన్ లాంటి స్టార్ డమ్ ని అధిగమించిన పర్సనాలిటీని ఎంజాయ్ చేసేసి వెళ్లి పోకూడదా? ఇంత నిర్దాక్షిణ్యంగా శిక్షించాలా? ఐనా  కథల్ని ఎప్పట్నుంచీ సీరియస్ గా తీసుకోవడం మొదలెట్టారేమిటి  మహా జనాలు? వాళ్ళ దృష్టిలో కథలంటే ఏమిటి?  హీరో విలన్లు తన్నుకునే అవే రొటీన్ కథలా? ఎమోషన్ అంటే పాసివ్ హీరోలు ఏరులై పారించే అవే హాస్యాస్పదమైన ఎమోషన్సా? ఇక సినిమాల్లో సంఘర్షణ కూడా ఉండాలనీ, అదికూడా  హీరో విలన్ల మధ్య విజువల్ గా ఉండాలనీ జనాలు అనుకుంటే- ‘ఊపిరిలో ఏ సంఘర్షణ వుందని దాన్ని ఒప్పుకున్నారు?

      కానీ ఏదో వుంది, ప్రేక్షకులకి కావాల్సిందింకేదో లేకపోవడమే  జరిగింది. సినిమాల్లో కథ పెద్దగా లేకపోవడం ఒక సమస్యగా జనాలెప్పుడూ చూళ్ళేదు. కానీ ఉన్న కాస్త కథైనా కథలాగా ఉండాలనేది మాత్రం వాళ్ళకి తెలుసు. కథలా ఉండడమంటే ఏమిటి? ఓ కథ- ఆ కథకి ఒకే ఒక్క ప్రధాన  సమస్య- ఆ సమస్యలో ఎమోషన్, ఆ ఎమోషన్ సహిత సమస్యతో పోరాటం, ఇంతే. ఇంతకి  మించి గొంతెమ్మ కోర్కెలేవీ కోరక పోవచ్చు జనాలు. హీరో విలన్లు చిట్ట చివర్లో తన్నుకున్నా ఫర్వాలేదు. కానీ వాళ్ళ మధ్య సంఘర్షణ అంటూ పుట్టాక ఆ సెగ చివరిదాకా దమ్ బిర్యానీలా  తగులుతూ వుండాలి. సెగ వుందంటే సంఘర్షణకి కారణమైన సమస్య తాలూకు ఎమోషన్ (దమ్ బిర్యానీ ఘుమఘుమలు)  ఉన్నట్టే. సమస్య- సంఘర్షణ- సెగ- ఎమోషన్...ఈ కనీసావసరాలు తీర్చలేక పోయిందా పవన్ సినిమా?

         
పవన్ సినిమాని ఒక్క ముక్కలో జనం బాగా లేదని తేల్చెయ్యొచ్చు గాక, ఐతే ఎందుకు బాగాలేదో  అందుబాటులో వున్న శాస్త్రీయ సంగతులతో పోల్చి చూస్తే ఎక్కడా అంతు చిక్కదు. సాధారణంగా కమర్షియల్ సినిమాల మంచి చెడ్డలు స్థూల దృష్టికి తెలిసిపోతూంటాయి. కానీ భూతద్దం పెట్టినా సూక్ష్మ దృష్టికి కూడా అందని చిక్కడు దొరకడులా వుంది పవన్ తడాఖా!

         
ఇంతకీ పవన్ అత్యంత రహస్యంగా  ఏం చేసి వుంటే ఇలా బెడిసి వుంటుంది? ఇది మిలియన్ డిస్కుల ప్రశ్న. ఏ హాలీవుడ్ నిపుణులో వచ్చి డయాగ్నసిస్ చేయాలి తప్ప ఇక మనవల్ల కాదని చేతులెత్తేసిన సమయంలో, పరుచూరి బ్రదర్స్ స్కూల్ నుంచి వచ్చిన, నందమూరి హరికృష్ణ నటించిన  టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్మెదిలింది. ఈ సమయంలో ఇదెందుకు మెదిలిందబ్బా అని చూస్తే -అదీ ఇదే ఒకటే నన్నయూరేకాసిట్యుయేషన్ ఎదురయ్యింది. పవన్ రచనా చమత్కృతి రహస్యమంతా టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్లోనే దాగి వుందన్న జ్ఞానోదయమైంది!
         
కథ నచ్చక, ఎమోషన్ లేక జనాలు నోచ్చుకోవడం నిజమే అనుకున్నా, మొత్తం కథంతా  నచ్చకపోవడం అంటూ జరిగుండదు. ఏదో ఒక దశనుంచే నచ్చక పోయుండాలి. ఆ దశ ఏది? ఆ ఎమోషన్ ఎక్కడ్నించీ  ఎందుకు మిస్సయ్యింది?

         
నేటివిటీ ఏమైనా ఎమోషన్ కి గండి కొట్టి ఉంటుందా? కథంతా ఒక హిందీ ప్రాంతంలో, హిందీ పాత్రలతో, వాళ్ళ సమస్యలతో  సాగుతుంది. ఇలాటిది జనం ఎప్పుడూ అంగీకరించలేదు. మహేష్ బాబు అంతటి ప్రిన్స్ నటించిన, రాజస్థాన్ ప్రజల కథైన  ‘ఖలేజా అయినా సరే, రవితేజ అంతటి మాస్ మహారాజా నటించిన,  మరో రాజస్థాన్ ప్రజలదే బాధ అయిన కిక్-2’ అయినా సరే, నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. పవన్ మళ్ళీ  అనవసరంగా  రిస్కు చేశారేమో. వాళ్ళెవరో నేటివ్ ఫీల్ లేని పాత్రలతో ఎమోషన్ ఏం ఫీలవగలరు.
        విడుదలవుతున్న సినిమాల జయాపజయాల కారణాలతో స్టార్లు డేటా బ్యాంక్స్ ని నిర్వహించు కోకపోతే ఒకరు చేసిన తప్పు మరొకరు చేస్తూనే వుంటారు. ‘ఖలేజా’లో మహేష్ బాబు ఎందుకు దెబ్బ తిన్నాడో తెలుసుకోక రవితేజ ‘కిక్ -2’ తీశాడు. ‘కిక్ -2’ తో రవితేజ ఎలా దెబ్బ తిన్నాడో తెలుసుకోక పవన్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ తీశాడు. ముగ్గురూ ముగ్గురే, ముగ్గులో గల్లంతయిన అన్నదమ్ములే. ఇక నాల్గో కృష్ణుడు ఎవరొస్తారో చూడాలి.

      పెద్ద సినిమాలే కాదు, చిన్నచిన్న  సినిమాల జయాపజయాల కారణాలు కూడా పెద్ద సినిమాల్లోకి చొరబడవచ్చు. కనుక వీటి డేటా బ్యాంక్స్  కూడా అవసరమే. టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ ని అలావుంచుదాం. ఈమధ్యే విడుదలై అట్టర్ ఫ్లాపయిన ‘సైజ్ జీరో’ అనే మీడియం బడ్జెట్ సినిమా పరాజయ కారణాలు కూడా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ లో  వున్నాయని తెలుసా? ‘జ్యోతిలక్ష్మి’, ‘ఆటోనగర్ సూర్య’, ‘సిటిజన్’ సినిమాల పరాజయ కారణాలూ అన్నీ ఒకటే ననీ, అవే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ లోనూ చొరబడ్డాయని తెలుసా?

         
నేటివిటీ సమస్య  సెకండరీయే. అసలు సమస్య కేవలం డాక్యుమెంటరీల్లో ఉండాల్సిన ‘స్టార్ట్ అండ్ స్టాప్’ తరహా కథనం ఇక్కడ ఇంత భారీ కమర్షియల్లోకి  వచ్చేసి జొరబడ్డమే.

        ఐతే టైగర్ హరిశ్చంద్రప్రసాద్ ని  స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ తో చిన్న చిన్న విడి విడి  కథలుగా  చెప్పారు. హీరో ఒకసారి రైతుల గిట్టుబాటు ధర సమస్య తీసుకుంటాడు, దాన్ని పరిష్కరిస్తాడు. ఇంకోసారి ఎరువుల సమస్య తీసుకుంటాడు, దాన్నీ  పరిష్కరిస్తాడు...ఇలా ఒక్కో రైతు సమస్య తీసుకుని పరిష్కరిస్తూ పోవడమే ఎపిసోడ్లుగా సాగే కథ. ఇది డాక్యుమెంటరీలు తీయడానికి రాసుకునే స్క్రిప్టు. ఇలా కాక సినిమా కథకి  ఒకే ప్రధాన సమస్య, దాని చుట్టే సంఘర్షణా ఉంటాయని తెలిసిందే.

        ‘
సర్దార్ గబ్బర్ సింగ్’ లో చిన్న చిన్న విడి విడి కథలు కాదు గానీ - మైండ్ బ్లోయింగ్ గా, ప్రపంచంలో ఎవరి బుర్రకీ తట్టని విధంగా, ఇంటర్వెల్ దాకా తీసుకొచ్చి స్థాపించిన ప్రధాన సమస్యతో, పుట్టిన ప్రధాన సంఘర్షణని వదిలేసి- అదే విలన్ తో వేరేవేరే చిన్న చిన్న విడి విడి సంఘర్షణలుగా చేసి చూపించు కొచ్చారు! అదీ సమస్య!
         
ఒకసారి కథలోకి వెళ్దాం...

నేటివిటీ ప్రశ్న 
        ఆంధ్రా తెలంగాణా సరిహద్దుల్లో ఎక్కడో రతన్ పూర్ అనే ఒక గ్రామం. ఇదొక్కప్పుడు పూర్వపు  రాజపుత్ర వంశీయుల సంస్థానంలో వుండేది. ఆ సంస్థానం వారసురాలు అర్షి దేవి ( కాజల్ అగర్వాల్) తల్లిదండ్రుల మరణంతో దళపతి అయిన హరినారాయణ్ (ముఖేష్ రిషి) సంరక్షణలో పెరుగుతుంది. ప్రజల సంక్షేమం కోసం పాటు పడుతూ వుంటుంది. ఈమెకి మధుమతి( ఊర్వశి) అనే చెలికత్తె,  శేఖర్ సింగ్  ( బ్రహ్మానందం) అనే మామా వుంటారు. ఈ ఒకప్పటి సంస్థానం పరిధిలోని గ్రామాలకి బొగ్గు మాఫియాగా ఎదిగిన రాజపుత్ర వంశీయుడే, భైరవ్ సింగ్ (శరద్ కేల్కర్) అనే అతను ప్రజల పాలిట యముడిలా మారతాడు. అడ్డొచ్చిన వాళ్ళని చంపి గ్రామాల్ని బొగ్గు మైనింగ్ వనరులుగా మార్చుకుంటాడు. రతన్ పూర్ ని కూడా చెరబట్టి బొగ్గు తవ్వుకుని తరలిస్తూంటాడు.

        అటు హైదరాబాద్ లో గబ్బర్ సింగ్ (పవన్ కల్యాణ్ ) అనే ఎస్సైఓ స్నేక్ గ్యాంగ్ అరచకాల్ని అరికట్టి పాపులర్ అవుతాడు. ఇతడి పై అధికారి (తనికెళ్ళ) ఇతడికి ప్రమోషన్ ఇచ్చి,  రతన్ పూర్ కి బదిలీ చేస్తూ అక్కడ పరిస్థితుల్ని చక్క దిద్దమని పంపిస్తాడు. వెంట సాంబా (అలీ) అనే కానిస్టేబుల్ ని కూడా పంపిస్తాడు. రతన్ పూర్ కి  గబ్బర్ సింగ్,  సర్కిల్ ఇన్స్ పెక్టర్ సర్దార్ గబ్బర్ సింగ్ గా రావడంతో ప్రజల్లో ఆశలు చిగురిస్తాయి, ప్రత్యర్ధులకి ఆగ్రహం పెల్లుబుకుతుంది.  

        ఈ నేపధ్యంలో తనదైన స్టయిల్లోప్రత్యర్ధుల పని పడుతున్న గబ్బర్ కి,  అర్షి తారస పడుతుంది. దీంతో ఈ రాకుమారి అర్షి ని చెలికత్తెగానూ, అర్షి చెలికత్తె నడివయసు మధుమతిని రాకుమరిగానూ భ్రమించి, తన లెవెల్ చెలికత్తె తోనే అనుకుని, అర్షినే ప్రేమించడానికి నిర్ణయించుకుంటాడు గబ్బర్. ఇదే అర్షి మీద అటు పెళ్ళైన బైరవ్ సింగ్ కూడా కన్నేసి సమయం కోసం చూస్తూంటాడు..ఇదీ కథ.

క్రాస్ ఫైర్ లో కథ 
       భైరవ్ సింగ్ కీ, గబ్బర్ సింగ్ కీ లడాయి ఈ కథ. ఈ లడాయి కోల్ మాఫియాగా గ్రామాలకి గ్రామాలనే మాయం చేస్తున్న భైరవ్ పీడా ప్రజలకి తొలగించడం గురించి. ఓపెనింగ్ లోనే భైరవ్  రతన్ పూర్ ని నేలమట్టం చేయడాన్ని చూపించారు. గబ్బర్ వచ్చి ఫస్టాఫ్ లో భైరవ్ వ్యాపారాలు ఒక్కోటీ మూయించడం మొదలెట్టాడు. ఇంటర్వెల్ కి ముందు నాకాబందీ పెట్టి బొగ్గు రవాణాని అడ్డుకున్నాడు. దీంతో గబ్బర్- భైరవ్ లిద్దరూ మొదటి సారిగా ముఖాముఖీ సంఘర్షించుకున్నారు. ఆ సంఘర్షణలో   గబ్బర్ ఎంత శక్తిమంతుండో తెలుసుకుని  భైరవ్ వెనక్కి తగ్గాడు. 

        సెకండాఫ్ లో తిరిగి గబ్బర్ అర్షి తో ఫస్టాఫ్ లో  ప్రారంభించిన తన ప్రేమాయణాన్ని కొనసాగించాడు. ఈ ప్రేమకి భైరవ్ అడ్డు తగలడం మొదలెట్టాడు. ఇతను గబ్బర్ కంటే ముందే అర్షి తనదనుకుని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనతో వున్నాడు. ఇలా ముక్కోణ ప్రేమకథగా నడించింది. తీరా భైరవ్ నిశ్చితార్ధం చేసుకుంటున్నప్పుడు, గబ్బర్ దెబ్బ కొట్టి అర్షిని తీసుకుని పారిపోయాడు. దీంతో భైరవ్ అంతిమ పోరాటానికి తెర తీశాడు. ఇక్కడ అంతవరకూ ఓపిక పట్టి ఉంటున్న తన వ్యూహం గురించి చెప్పాడు-

        అదేమిటంటే,  గబ్బర్ ని చంపెయ్యడం పెద్ద కష్ట మేమీ కాదు, అలా చంపితే ప్రజల్లో వచ్చే తిరుగుబాటుతోనే  కష్టం. గబ్బర్ ప్రజల మనస్సులో నాటుకున్న ఒక ఐడియాలజీ. కాబట్టి ఆ ఐడియాలజీని చంపేస్తే ప్రజలకి వాడంటే వున్న పిచ్చి అంతా పోతుంది. అలా పిచ్చిని పోగొడితే ఎప్పట్లాగే తన బానిసల్లా పడి వుంటారు ప్రజలు...

        ఇలా గబ్బర్ ని కాక, గబ్బర్ అనే ఒక అయిడియాలజీని అంతమొందించడానికి  చకచకా కొన్ని దృశ్యాలు సృష్టించాడు భైరవ్. ఈ దృశ్యాలతో గబ్బర్ లంచగొండిగా, విలువలు లేనివాడిగా ప్రపంచానికి రివీల్ అయ్యాడు. పరువంతా పోగొట్టుకుని చట్టానికి దొరికిపోయాడు. ఇప్పుడు తనెలా తిరగబడ్డా డన్నది మిగతా క్లయిమాక్స్ లో  కథ.

        ఈ కథలో స్పష్టంగా తెలిసిపోతున్న లోపం ఏమిటంటే, ఫస్టాఫ్ తో సెకండాఫ్ తెగిపోవడం. ఫస్టాఫ్ లో  ప్రజల సమస్యతో, ప్రజలకోసంగా  ప్రారంభించిన గబ్బర్ పోరాటం, సెకండాఫ్ లో తనకోసం, తన ప్రేమని రక్షించుకోవడం కోసమే  చేసే పోరాటంగా మారిపోయింది. ఇలా ఫస్టాఫ్ లో  ప్రజలూ - సెకండాఫ్ లో ప్రేమా  అనే ఎదురెదురు కాల్పుల్లో (క్రాస్ ఫైర్ లో) చిక్కుకుని ప్రాణం విడిచింది కథ.

షాక్ ట్రీట్ మెంట్ 
      ఏ కథకైనా ఒకే ప్రధాన సమస్య, దాంతోనే  సంఘర్షణా ఉంటాయని చెప్పుకున్నాం. అలా స్థాపించిన ప్రధాన సమస్యతో సంఘర్షణని వదిలేసి, లేదా పెండింగ్ లో పెట్టి,  ఇంకేవో  వేరేవేరే సంఘర్షణలు ప్రారంభిస్తే, మొదట్లో స్థాపించిన ప్రధాన సమస్య ప్రశ్నార్ధక మవుతుంది. ఎందుకంటే ప్రేక్షకులకి పళ్ళెంలో పెట్టి తాంబూలంలా ఇచ్చింది ఆ ప్రధాన సమస్యే గనుక. అలా ఇచ్చి, తాంబూలాలిచ్చేశాం ఇక తన్నుకోండని చేతులు దులుపుకుంటే ప్రేక్షకులే మైపోవాలి?

        స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ తో ఒక్కో సమస్యా దృష్టికి తెస్తూ డాక్యుమెంటరీలు తీస్తారని నమ్మింది ప్రపంచం. దీన్ని సినిమాలకి వాడేసి ‘టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్’, ‘సైజ్ జీరో’, ‘సిటిజన్’, ‘ఆటోనగర్ సూర్య’, ఆఖరికి
స్టీవెన్ స్పీల్బెర్గ్ అంతటి వాడూ తీసిన  వార్ హార్స్  లాంటి కథలు కాని ఫ్లాప్ కథలు అందిస్తారని ఊహించి వుండదు ప్రపంచం. 

        ఇది వేరే విషయం. జరిగిపోయిన వింత. ఇప్పుడు ‘సర్దార్ గబ్బర్ సింగ్’ లో
మైండ్ బ్లోయింగ్ గా, ప్రపంచంలో ఎవరి బుర్రకీ తట్టని విధంగా, చూపిస్తున్న కొత్త వింత ఏమిటంటే- ‘విడివిడి సమస్యల’ స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ నే, ‘సంఘర్షణ’ కి కూడా వాడెయ్యడం! ఒక సంఘర్షణ లోంచి వేరే చిరుచిరు సంఘర్షణలు సృష్టించి చూపించడం!         

        ప్రతిపాదించిన సంఘర్షణ : భైరవ్ బారి నుంచి వూరిని కాపాడ్డం.
        అమలుచేసిన సంఘర్షణ : ప్రేమా పెళ్ళీ, పెళ్ళీ ప్రేమా చిరు చిరు సంఘర్షణలు.
        దీంతో సమస్యేమిటి : సంఘర్షణ కారకుడు భైరవ్ అంటూ ఒక విలన్ని చూపించాం కాబట్టి, ఆ విలన్ తోనే వేరే గొడవలు చూపించినా చెల్లిపోవచ్చను కోవడం- కథకి విలన్ అంటూ ఒకడు కన్పిస్తూ వుంటే చాలన్నట్టు.
        ఇది ఎందుకు చెల్లదు : ఇంటి ఓనర్ ఒకతను రంగారావుని ఇల్లు ఖాళీ చేయమని కోరితే ఖాళీ చేయించడం గురించే  గొడవ పడతాడు, ఆ రంగారావు కూతుర్ని ప్రేమించాలనుకోడు. ఈ పని చేస్తే,  అసలుపని - ఇల్లు ఖాళీ చేయించే సంగతి మర్చిపోవాలి గనుక.
        అసలు పని కంటే ఈ కొసరు వేషం మంచిదేగా రోమాంటిక్ గా : నిజ జీవితంలో ఎలాగైనా ప్రవర్తించ వచ్చు. నిజజీవితం ఆర్ట్ సినిమా లాంటిది. లేదా ఇండీ ఫిలిం లాంటిది. ఏ రూల్సూ వుండవు. అలాటి సినిమాలకి, జీవితాలకి ప్రేక్షకులు కూడా తక్కువే. కమర్షియల్ సినిమాల్లో అసలు పనే ముఖ్యం. గోల్ నుంచి పాత్ర తప్పుకుంటే గోల్మాల్ అయిపోతుంది కమర్షియల్ కథ.

        బుల్లెట్ ని ఒకసారి పేల్చడమంటూ జరిగాక దాని దిశని మార్చలేం. దానికదే బుల్లెట్ కూడా వంకర టింకరగా ప్రయాణించదు. అది ముక్కు సూటిగానే దూసుకు
పోతుంది. ఏదైనా అడ్డొస్తే తప్ప లక్ష్యాన్ని తాకేదాకా పలాయనంలోనే వుంటుంది. ఏదైనా అడ్డొస్తే  దానికి తగిలి లక్ష్యం చెదిరిపోవచ్చు. అప్పుడా బులెట్ ని పేల్చడం విఫలమైనట్టే. ఒకవేళ లక్ష్యాన్ని తాకినప్పటికీ,  చొచ్చుకు పోలేక పరావర్తనం చెందితే (రికోషెట్ బుల్లెట్) , తిరిగి వచ్చి తనకే తగిలితే  అది కూడా ప్రమాదకరం.  ఈ ప్రమాదం - ఈ ఎఫెక్ట్ కథల్లో పాత్రకి  శాడ్ ఎండింగ్. 

        ప్లాట్ పాయింట్ వన్ దగ్గర పాత్రకి లక్ష్యాన్నిచ్చి బుల్లెట్ లా పేల్చాక అది వంకర టింకరగా పోదు. పేల్చే ముందే ఆలోచించుకోవాలి. గబ్బర్ వూరి కోసం కమిట్ అయ్యాక,  ఇంటర్వెల్ దగ్గర సూటిగా బుల్లెట్ లా భైరవ్ కి తగిలాక, పడిపోయి- ఇంకో బుల్లెట్ పే ల్చండి రోమాన్స్ చేసుకుంటా అనలేడు. ఎందుకంటే తన మీద పేల్చిన బులెట్ కి భైరవ్ ఊరుకోడు. పౌరాణికాల్లో ప్రత్యర్ధులు పరస్పరం వేసుకునే బాణాలు సూటిగా గురితప్పకుండా ఢీకొట్టుకుని ఆకాశంలో మెరుపులు మెరిపిస్తాయి. అంతే గానీ- రాముడు నా మీద బాణం వేశాడా, అయితే నేను కాసేపు సీతమీద ప్రేమ బాణా లేసుకుంటా - అని రావణుడు టైం పాస్ చేయలేడు.

        భైరవ్ టైం పాస్ చేశాడు. ఇంటర్వెల్ దగ్గర వెనక్కి తగ్గాడు. ఏమంటే ఎందుకు వెనక్కి  తగ్గాడో క్లయిమాక్స్ దగ్గర చెప్పాడు. అప్పటికి ఆలస్యం అమృతం విషమైపోయింది. ఇంటర్వెల్ దగ్గర గబ్బర్ తన తడాఖా చూపిస్తే, భైరవ్  కూడా ఊరుకోకుండా తన ప్రతివ్యూహమేమిటో  అప్పుడే చెప్పేసి సవాలు విసిరితే,  బలాబలాల సమీకరణ ఎస్టాబ్లిష్ అయివుండేది.  గబ్బర్ అలా అయితే- భైరవ్ ఇలానా  అని క్లియర్ గా పిక్చర్ కనపడేది. కథ అర్ధమయ్యేది. కథ వున్నట్టూ కనపడేది.  భైరవ్ వ్యూహం : ఏ  ప్రజల కోసం గబ్బర్ నిలబడ్డాడో, ఆ ప్రజల్లో పాతుకుపోయిన గబ్బర్ అనే ఐడియాలజీని పెకిలించి పారెయ్యడం. ఈ ఇంటరెస్టింగ్ పాయింటుని ప్లాట్ పాయింట్ వన్ అయిన ఇంటర్వెల్ ఘట్టంలోనే వెల్లడించాలి భైరవ్. కానీ అతను ఈ పని చెయ్యలేదు. చెయ్యాలని మనసులో వుంచుకున్నాడు. క్లైమాక్స్ లొ మాత్రమే తన మనసులో వున్న వ్యూహం చెప్పి అమలు పరచాడు!  అంతవరకూ ప్రధాన సమస్యనుంచి డిస్కనెక్ట్ అయ్యాడు. హీరోయిన్ కోసం రావణుడి అవతారమెత్తాడు.

‘ఫ్యాన్’ టాస్టిక్?  
       షారుఖ్ ఖాన్ ‘ఫ్యాన్’ లో ఇంటర్వెల్ కి ముందు షారుఖ్ తన ఫ్యాన్ (ఈ పాత్రకూడా షారుఖే నటించాడు, వీఎఫెక్స్ తో 24 ఏళ్ల కుర్రాడిగా మారిపోయి) కి చేసిన అవమానానికి, షారుఖ్   మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న ఫ్యాన్,  సెకండాఫ్ లో వెంటనే ఆ మేరకు రంగంలోకి దిగిపోతాడు షారుఖ్ ని టార్గెట్ చేస్తూ. అతడి లక్ష్యం ఒక్కటే - వీలైనన్నిచోట్లా తను షారుక్ లా వెళ్లి,  షారుఖ్ పేరుని బద్నాం చేసి పారిపోవడమే. ఈ వ్యక్తిత్వ హననాన్ని ఆపాలంటే షారుఖ్ ఒక్కటే  చెయ్యాలి- తనకి సారీ చెప్పాలి. సారీ చెప్పే ప్రసక్తే వుండదు షారుఖ్ కి. ఇదీ ఇద్దరు ప్రత్యర్దుల మధ్య ప్రారంభించిన గేమ్.

        ఇదే ఫ్యాన్ షారుఖ్ ని క్లయిమాక్స్ లో బద్నాం చేద్దాంలే అనుకుని, అప్పటిదాకా ప్రతీకారాన్ని ఆపుకుంటే? సమస్య ఏర్పడ్డాక సంఘర్షణని- ప్రతీకార భావాన్నీ ఎలా ఆపుతారు? పక్క పాత్రలతో అయితే ఆపవచ్చు. రాంగోపాల్ వర్మ ‘కంపెనీ’ లో అనుచరుడు విజయ్ రాజ్ అనూహ్యంగా ముగింపులో అజయ్ దేవగణ్ ని కాల్చి చంపి కక్ష తీర్చుకుంటాడు. అతడి కక్ష ప్రధాన కథ కాదు, అది సబ్ ప్లాట్. అతడి కక్షని ముగింపు దాకా ఆపవచ్చు. కానీ హీరో విలన్ల మధ్య ఆపలేరు. ‘ఫ్యాన్’ లో ఆపలేదు. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ లో ఆపి వాయిదా వేశారు క్లయిమాక్స్ కి- అప్పుడేదో ఐడియాలజీ అంటూ గబ్బర్ ని బద్నాం చేసే ఎపిసోడ్ మొదలెట్టాడు భైరవ్. ఇంటర్వెల్ దగ్గర తెగిన ప్రధాన కథ ముక్కని క్లయిమాక్స్ లో జోడించారు. మధ్యలో అంతా హీరోయిన్ తో గబ్బర్- భైరవ్ ల మహా ముక్కోణ ప్రేమాయణం. దీని తాలూకు గిల్లి కజ్జాలు.

ఏది కథ- ఏది ఉప కథ
       హీరోయిన్ తో గబ్బర్ ప్రేమాయణం ఉపకథే. అతను  ప్రేమించడం కోసం రాలేదు, వూళ్ళో బైరవ్ పని పడదామని వచ్చాడు, ఇదే కథ. ఈ కథ ఇంటర్వెల్లో సంఘర్షణాత్మకంగా
మారేక, అంటే మిడిల్లోకి ప్రవేశించాక, మళ్ళీ బిగినింగ్ లో వాడుకున్నఉపకథ అయిన ప్రేమాయణాన్ని మిడిల్ మెయిన్ ట్రాకులోకి ఎలా తీసుకొస్తారు? ఇలా తేవడంవల్ల మిడిల్ చూస్తున్నట్టు గాక, మళ్ళీ బిగినింగ్ చూస్తున్నట్టే వుండదా? 

        ఉపకథ ప్రధాన కథగా ఎలా మారిపోతుంది? ఈ మధ్య ‘ఆమె ఎవరు?’ అనే సినిమాలో హీరో పాత్ర మంట గలిసిపోయి, పక్క పాత్ర హీరో అయిపోయి, చివరిదాకా తనే దున్నుకున్నట్టు- కథ, ఉప కథలు కూడా వంతు లేసుకుని మెయిన్ ట్రాకుతో చెలగాట మాడతాయా? ఇలా ‘సర్దార్ గబ్బర్ సింగ్’  స్క్రీన్ ప్లే ఇంటర్వెల్ దగ్గర్నుంచీ మధ్యకి ఫ్రాక్చర్ కూడా అయ్యింది- దాంతో సెకండాఫ్ సిండ్రోం అనే సుడిగుండంలో కూడా పడింది-
దొంగోడు’, ‘ధమ్’, ‘తేరేనామ్’, ‘హవా’, ‘జ్యోతిలక్ష్మీ, ‘సైజ్ జీరో’ తదితర సినిమాల సెకండాఫ్ సిండ్రోమ్స్ కి మల్లే.

        ఇంటర్వెల్లో ప్లాట్ పాయింట్ వన్ దగ్గర, భైరవ్  ఏమీ అనకుండా వెనక్కి తగ్గడం వల్ల, ఆ తర్వాతి సెకండాఫ్ కథనంలో,  అతడి తాలూకు సెన్సాఫ్ డేంజర్ ఏమైనా ఏర్పడిందా?
హీరో సవాలు విసిరాడు కదా, ఇక విలన్ ఏం ప్రమాదం తలపెడతాడో నన్నఆందోళన అతను  చెప్పకపోయినా బ్యాక్ డ్రాప్ లో ఫీలయ్యామా?

        ఫస్టాఫ్ లో,  అంటే బిగినింగ్ లో భైరవ్ కి చెందిన ఒక్కో వ్యాపారాన్నీ మూయిస్తూంటే భైరవ్ ఇక ఏం చేస్తాడో నన్న సెన్సాఫ్ డేంజర్ ఇక్కడ ఏర్పడింది. ప్లాట్ పాయింట్ వన్ దగ్గర అతను  గబ్బర్ తో ముఖాముఖీ అయ్యాక కూడా ఇప్పుడేం  చేస్తాడో చెప్పేసి, ఆ సెన్సాఫ్ డేంజర్ ని  మర్యాదగా పే ఆఫ్ చేస్తే ప్రేక్షకుల మనోభావాలని మన్నించడం అవుతుంది. అలా చెయ్యకుండా భైరవ్ ఏం చేయబోతున్నాడో క్లయిమాక్స్ లొ చెప్పిస్తామంటే అప్పటికి సెన్సాఫ్ డేంజర్ డైల్యూట్ అయి ప్రేక్షకుల మనోభావాలు దెబ్బతింటాయి.

        ఒక్క ‘సంఘర్షణ’ అనే మలుపు మీద స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ ని ప్రయోగించిన దుష్పరిణామంగా, పవన్ స్క్రీన్ ప్లేలో సంఘర్షణే సంక్షోభంలో పడింది. సంఘర్షణే సంక్షోభంలో పడితే సంఘర్షణ ఎలా చెయ్యాలి? ఎవరు చేయాలి?

        ఒక పాత సినిమా పాట వుంది-
          నిప్పు రగిలి రేగు జ్వాల
          నీళ్ళ వలన ఆరును

          నీళ్ళలోనే జ్వాల రేగ
          మంట ఎటుల ఆరును...అని.
        ఇంతేకదా సంక్షోభంలో పడితే  సంఘర్షణ జాతకం!

-సికిందర్
cinemabazaar.in





       
       



       






15, ఏప్రిల్ 2016, శుక్రవారం

షార్ట్ రివ్యూ!


రచన - దర్శకత్వం : అట్లీ
తారాగణం : విజయ్, సమంత, బేబీ నైనిక, అమీ జాక్సన్,
ప్రభు, రాధికా శరత్ కుమార్, మహేంద్రన్, అళగం పెరుమాళ్,
కళ్యాణీ నటరాజన్, కాళీ వెంకట్ తదితరులు
సంగీతం : జివి ప్రకాష్ కుమార్,  ఛా
యాగ్రహణం : జార్జి సి. విలియమ్స్
నిర్మాతలు : దిల్ రాజు, ఎస్ థాను
విడుదల : 15 ఏప్రెల్, 2016
 
***

          తెలుగులో కూడా బాగానే అభిమానుల్ని సంపాదించుకున్న ‘ఇళయదళపతి’ అలియాస్  మాస్ హీరో విజయ్ తమిళంలో  నటించిన ‘తేరి’ (స్పార్క్) తెలుగులో ‘పోలీసోడు’ గా విడుదల కాబోయి, ఈ టైటిల్ పట్ల పోలీసుల అభ్యంతరంతో  ‘పోలీస్’ గా విడుదలయ్యింది. గతంలో ఆర్య- నయన తారలతో ‘రాజా రాణి’ తీసిన మెగా డైరెక్టర్ శంకర్ అసిస్టెంట్ ‘అట్లీ’ అలియాస్ అరుణ్ కుమార్,  ఓ మంచి టెక్నీషియన్ గా పేరు తెచ్చుకున్నాడు. తిరిగి తన రెండో సినిమా ‘తేరి’ (పోలీస్) కి దర్శకత్వం వహిస్తూ ప్రేక్షకుల్లో మళ్ళీ ఆసక్తిని రేపాడు. ఒకవైపు విజయ్- మరో వైపు అట్లీ, ఈ ఇద్దరు మార్కెట్ వేల్యూ వున్న ప్రముఖులతో ఈ భారీ బడ్జెట్ యాక్షన్- కమర్షియల్ లో ఆశించినంత విషయముందా? ఎందుకంటే విషయం లేకపోతే ఊరుకోవడం లేదు ప్రేక్షకులు. సినిమా అంటే పకోడీ పొట్లం చుట్టేయడం కాదంటున్నారు కాబట్టి,  విషయం ఏముందో ఓ సారి చూద్దాం. 

కథ 
         కేరళలో ఒక బేకరీలో పని చేస్తూంటాడు జోసెఫ్ ( విజయ్). అతడికి నివేదిత ( నైనిక) అనే ఆరేళ్ళ కూతురుంటుంది. ఇద్దరూ జీవితం జల్సాగా గడిపేస్తూంటారు. ఎవరితోనూ  గొడవలు పెట్టుకోకుండా, గొడవలు పెట్టుకోవడానికి ఎవరైనా వచ్చినా ఆవేశపడకుండా సాధు  జీవితం గడుపుతూంటాడు జోసెఫ్. నివేదిత చదివే స్కూల్లో ఏన్ ( అమీ జాక్సన్) అనే టీచర్ వుంటుంది. ఈ తండ్రీ కూతుళ్ళ అనుబంధం చూసి ఆమె ముచ్చట పడుతుంది. నివేదిత ద్వారా జోసెఫ్ కి దగ్గరవుతుంది. ఒకరోజు నివేదితని ఏన్  స్కూలుకి తీసుకు పోతూంటే  స్కూటీ యాక్సిడెంట్ అవుతుంది. పోలీస్ కంప్లెయింట్ ఇస్తుంది. ఆ యాక్సిడెంట్ చేసింది చేటా  అనే బ్యాడ్ క్యారక్టర్ ముఠా.

          జోసెఫ్  వెంటనే ఆ కంప్లెయింట్ వెనక్కి తీసుకోమని ఏన్  మీద ఒత్తిడి తెస్తాడు. ఆమె కంప్లెయింట్ వెనక్కి తీసుకున్నా అసలలా కంప్లెయింట్ ఇచ్చే ధైర్యం చేసినందుకు  ఆ ముఠా జోసెఫ్ మీద దాడి చేస్తుంది. ఈలోగా అసలీ జోసఫ్ ఒక మాజీ పోలీస్ డిసిపి అనీ, పేరు విజయ్  కుమార్ అనీ తెలుసుకున్న ఏన్,  ముఠాతో జోసెఫ్ చేస్తున్న పోరాటాన్ని దిగ్భ్రాంతితో చూస్తుంది.

          ఇక ఆమెకి తన గతం చెప్పుకోక తప్పదు విజయ్ కి. హైదరాబాద్ లో తను డిసిపిగా వుండగా మిత్రా (సమంత ) అనే  హౌస్ సర్జన్ ని ప్రేమించాడు. కొన్ని ఇబ్బందుల తర్వాత పెళ్లి జరిగింది. అయితే అవతల ఒక రేప్ కేసుని చేపట్టినప్పుడు ఆ నిందితుడు మంత్రి వెంకట్ రెడ్డి (మహేంద్రన్) కొడుకని తెలుసుకున్న విజయ్, వాణ్ణి చిత్ర హింసలు పెట్టి చంపి, మంత్రికి బహుమతిగా ఇచ్చి సవాలు విసిరాడు. అప్పుడా పగబట్టిన మంత్రి విజయ్ కుటుంబం మీద దాడి జరిపినప్పుడు విజయ్ తల్లీ, భార్యా మరణించారు. దాంతో ఏడాది కూతుర్ని కాపాడుకోవడానికి  కేరళ వచ్చి అజ్ఞాత వాసం చేస్తున్నాడు విజయ్.


          ఈ నేపధ్యంలో తిరిగి మంత్రికీ, విజయ్ కీ సంఘర్షణ ఎలా మొదలయ్యిందీ, చివరికి మంత్రిని విజయ్ ఎలా అంతమొందించిందీ మిగతా కథ.

ఎలావుంది కథ
       రొటీన్  రివెంజి కథ. అయితే ఇందులో ఒక బలమైన కొత్త పాయింటు వుంది. ఆవారాలు, క్రిమినల్సు, కిల్లర్సు, రేపిస్టులు, తాగుబోతులు, తిరుగుబోతులూ వంటి  సకల సంఘ విద్రోహక శక్తులూ తయారు కావడానికి వాళ్ళ తండ్రుల  పెంపకమే కారణమనీ, శిక్షించాల్సింది అలాటి  తండ్రుల్నే ననీ పలికిస్తారు ఈ కథలో. 

          సరీగ్గా ‘ఊపిరి’ లో కూడా జయసుధ పాత్ర సంతానం అలా తయారవ్వడానికి ఆమె ఒక్కతే కారణమని మనకి సన్నివేశాల ప్రకారం ఎంత బలంగా తోస్తున్నా, ఆ పాత్రని మహాతల్లిలాగా చిత్రించారు.

          ప్రసుత ‘పోలీస్’ కథలో దర్శకుడు ఈ సమస్యకి మూల కారణం ఎలాటి మొహమాటమూ  లేకుండా తండ్రులేనని  చెప్పేశాడు. వాళ్ళనే శిక్షించాలన్నాడు. ఇంతవరకూ బాగానే వుంది. అయితే ఇది ఎప్పుడో చిట్ట చివర్లో చెప్పే మాట, నడిపించిన  కథంతా మాత్రం ఇందుకు విరుద్ధంగా. మంత్రి కొడుకు రేప్ చేస్తే ఆ తండ్రి అయిన మంత్రినే  చంపేసి, అప్పుడే అలాటి తండ్రులకి హెచ్చరిక పంపాల్సింది హీరో. తర్వాత పరిణామాలేవైనా వుంటే,  పగబట్టిన ఆ మంత్రి కొడుకుతో ఎదుర్కొనే కథగా కొనసాగించ  వచ్చు. ఇది అర్ధ వంతంగా కూడా వుండేది. ఒకసారి అసాధారణ పాయింటు అంటూ ఎత్తుకున్నాక, బేషరతుగా ఆ పాయింటుని మాటల్లో కాదు, చేతల్లో అమలుపర్చాల్సిందే. ‘భారతీయుడు’ లో కమల్ హసన్ లంచావతారాల్ని పొడిచి చంపెయ్యాల్సిందే అనుకున్నాడు- పొడిచి చంపేసుకుంటూ పోయాడు. కమర్షియల్ కథకి పాయింటు వెజిటేరియన్ గా వుండదు, నాన్ వెజ్ గా వుంటుంది. అప్పుడే మజా. నేటి కాలమాన పరిస్థితులకి అవసరమైన ఒకమంచి, కొత్త పాయింటు దర్శకుడి మిస్ మేనేజ్ మెంట్ వల్ల  వృధా పోయింది. అసలే రొటీన్ రివెంజి కథ- ఈ రొటీన్ కి బలాన్నిచ్చే  విటమిన్ లాంటి పాయింటు కూడా నీరుగారిపోతే, ఇక ఎందుకోసం ఈ కథతో సినిమా చూడాలి?

ఎవరెలా చేశారు 

       విజయ్ నటన, ఫైట్లు, డాన్సులు, సున్నిత కామెడీ వగైరా సందేహించ నక్కర్లేకుండా ఎంజాయ్ చేయవచ్చు. ఇందులో రెండో మాటకి తావేలేదు. పైగా దర్శకుడు అతన్ని స్టయిలిష్ గా చూపిస్తూ కొత్త పుంతలు తొక్కించాడు. కలర్ఫుల్ గా అల్ట్రా మోడరన్ విజువల్స్ ఇచ్చాడు. అయితే  లుక్స్ పరంగా  అతడి గ్రాఫ్ పైపైకి ఎంత పోతుందో,  పాత్ర పరంగా అంత కిందికి దిగివస్తూ కన్పిస్తుంది. పాత్ర లుక్స్ కి సహకరించడం మానేస్తుంది. సెకండాఫ్ లో  ఫ్లాష్ బ్యాక్ పూర్తయయాక మరీ దయనీయంగా కన్పిస్తుంది పాత్ర. దీనికి ఒక్కటే కారణం : పాత్రచిత్రణలో వైఫల్యం. 

          రేపిస్టు అయిన మంత్రి కొడుకుని చంపి- ‘నువ్వు నా వెంట్రుక కూడా పీకలేవ్’ అని అంత పెద్ద సవాలు విసిరాక, ఆ సవాలుకి తగ్గట్టు తనే లేకపోవడం. తన పెళ్లి మాటలు జరుగుతూంటే మొదటి ఎటాక్  చేయించేదీ ఆ మంత్రే. పెళ్ళయ్యాక – పిల్ల కూడా పుట్టాక ( ఇంత కాలం  ఎందుకు వెయిట్ చేశాడో మంత్రి) స్వయంగా ఇంటికొచ్చి తన తల్లినీ, భార్యనీ కాల్చి చంపి, ఏడాది పిల్లని నీటి తొట్టిలో ముంచేసి,  తన మీదికీ కాల్పులు జరిపి గ్యాస్ లీక్  చేసిపోయేదీ ఈసారి స్వయంగా మంత్రే!!

          లేచి, పిల్లని బతికించుకుని పారిపోయి, కేరళలో బేకరీ గుమాస్తాగా బతుకుతూంటాడు తనూ!! ఏమంటే పిల్ల కోసం మంత్రి తో పెట్టుకోదల్చుకోలేదని వివరణ- ఛఛఛ –చ్ఛా!!

          మళ్ళీ ఐదేళ్ళ తర్వాత మంత్రే వీడెక్క డున్నాడూ అని ఆరా తీసి, కేరళ వచ్చేసి పిల్ల పని మళ్ళీ  పట్టాల్సి వచ్చింది! ఇలా తనమీద మంత్రి దాడులు చేస్తున్నప్పుడు పారిపోవడమో, తిరగబడ్డమో చేసే ఈ పాసివ్ రియాక్టివ్  క్యారక్టరైజేషన్ మొత్తం కథనాన్నే దెబ్బతీసింది.

          తను మంత్రికి చేసిన నష్టం కన్నా, మంత్రే తనకి ఎక్కువ నష్టం చేశాడని తేలుతోంది చివరికి. మంత్రి మీద అంత సవాలు విసిరి తను సాధించిందేమిటి- తన కుటుంబ సభ్యుల హత్యలు కళ్ళారా చూడ్డమేనా? ఇంత చేతకాని  పోలీస్ డిసిపి అధికారి పాత్రని ఇంకే సినిమాలోనూ చూసి ఉండం.

          సమంతా గ్లామర్ ఒలకబోతకి బాగా పనికొచ్చింది. ఆమె పాత్ర డీసెంట్  గానే వున్నా, తను హీరోకి పరిచయమైనప్పుడు హౌస్ సర్జన్. ఆ తర్వాత అదేమయ్యిందో, డాక్టరుగా పోస్టులో ఎందుకు చేరలేదో దర్శకుడికే తెలియాలి. హీరో తల్లిగా  ఒకప్పటి  హీరోయిన్ రాధిక  సీన్లని బాగానే ఉత్తేజ పరుస్తుంది. పోలీసు అధికారిగా ప్రభు కన్పిస్తాడు. మంత్రిగా విలన్ పాత్రలో ప్రముఖ సీనియర్ దర్శకుడు మహేంద్రన్ తొలిసారిగా తెర పైన కన్పిస్తాడు. వయసుమళ్ళిన అతడి సాధారణ రూపురేఖలే  విలన్ గా  అసాధారణంగా కన్పించేట్టు చేశాయి.

          జివి ప్రకాష్ కుమార్ సంగీతం, జార్జి విలియమ్స్ కెమెరా ఈ రెండూ అతిపెద్ద ఎసెట్స్ సినిమాకి. టెక్నికల్ గా టాప్  క్లాస్ గా వున్న ఈ యాక్షన్ మూవీ, దర్శకుడి కథా- పాత్రల నిర్వహణా లోపం లేకపోతే ఇంకా చాలా చాలా బావుండేది.

చివరికేమిటి?
     ఏముంది, పిలిచిన పాయింటొకటి – జరిగిన పేరంటం ఒకటి. దర్శకుడికి ముందు తన కథ గురించి తనకి లోతుగా తెలియడం చాలా అవసరం. ఇన్ని పదుల కోట్ల బడ్జెట్ తో సినిమాకి సమకట్టి, పది రూపాయల పకోడీ ప్రేక్షకుల చేతిలో పెడితే, టికెట్ డబ్బులైనా గిట్టుబాటు అవ్వాలా వద్దా? మొదటి నుంచీ తెలిసిపోతున్న కథే తప్ప, కొత్త ట్విస్టులతో ఆశర్యపర్చిందీ లేదు. ఇంటర్వెల్ లోనే  ఆ నిలబెట్టుకోలేని సవాలు విసిరే బదులు- అక్కడే మంత్రిని చంపి- చెప్పాలనుకున్న పాయింటుకి అక్కడే శంఖు స్థాపన చేసి వుంటే- అక్కడ్నించీ బోలెడు షాక్ వేల్యూతో ఎక్కడికో వెళ్ళిపోయేది కదా సెకండాఫ్! కానీ ఈ  పక్క ఫోటో చూస్తే, విజయ్ నోటిని విజయయ్యే ఎందుకు మూస్తున్నట్టు? పాయింటు ఇంటర్వెల్లో చెప్పవద్దనా? సినిమా అంతా అయిపోయాక గొప్ప మెసేజిలా ఇద్దామనా? నడిపిన కథకి విరుద్ధంగా వున్న మెసేజ్? నిర్మాత దిల్ రాజు కాన్సెప్ట్స్ ని బేరీజు వేసి సినిమాల్ని /కథల్ని ఎంపిక చేసుకోవడంలో విఫలమవడం ఇంకా కొనసాగుతూనే వుంది...

            పాసివ్ రియాక్టివ్ క్యారక్టర్ తో అదొక కమర్షియల్ సినిమా ఎలా  అవుతుందన్నది బేసిక్ క్వశ్చన్.
            చేయాల్సింది చేయాల్సినప్పుడే చేయకుండా ఎప్పుడో  అంతా చల్లారి పోయాక చేసి మెసేజి ఇవ్వడంలో అర్ధమేమిటన్నది రెండో ప్రశ్న! 

         

 -సికిందర్ 
http://www.cinemabazaar.in








తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్- 12







          సినిమా అనగానే దాంతో పాటు సోల్ (soul)  అనే మాట కూడా తరచూ విన్పిస్తూ వుంటుంది. సినిమాలో ‘సోల్’ లేదురా అంటూంటారు. అంటే ఏమిటి? ఆత్మే, కథాత్మ లేదనడం వాళ్ళ భాషలో.  దీన్నే ‘ఫీల్’ అని కూడా అంటూంటారు. కానీ ఫీల్ వేరు- సోల్ వేరు. సోల్ ఉంటేనే ఫీల్ వుంటుంది. సోల్ ని ఎలా ఫీలవ్వాలి? ఒక కిషోర్ కుమార్ పాట వుంది- అమ్మకానికి పూలు వుంటాయి కానీ  వాటి పరిమళం అమ్మకానికి ఉండదని. అలాగే ఇడ్లీలు అమ్ముతారేగానీ, ఇడ్లీల నుంచి వచ్చే నోరూరించే – ఘుమఘుమలాడే ఆవిరిని అమ్మరు, అమ్మలేరు. మరలాగే సినిమాలో సోల్ ని అమ్మగలరుగానీ, సోల్ లేకుండా ఫీల్ ని అమ్మలేరు. పూలూ పరిమళం ఒక ప్యాకేజీ, ఇడ్లీ ఆవిరీ  ఒక పొట్లం, సోల్ - ఫీల్ కూడా ఒక పార్సిల్ గానే వస్తాయి.  సోల్ ని ఫీలవ్వాలంటే ఆత్మిక దాహాన్ని తీర్చే ‘కథనం’ వుండాలి. ఒక భక్తి  సినిమా చూస్తున్నప్పుడు ఆత్మిక దాహం బాగా తీరవచ్చు. కానీ ఇతర సినిమాలు చూపిస్తున్నప్పుడు కూడా ఈ దాహాన్ని తీర్చెయ్యాలి. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడి  ఏ కథలయినా అక్కడి జానపద, పౌరాణిక కథలకి దిగుమతులే. అంటే ఫారిన్ డీవీడీ ల నుంచి దిగుమతి చేసుకుంటున్నప్పుడు కన్పించే, కాపీ కొట్టుకోవడానికి ఊరించే  కథే  కాకుండా,   ఆ కథ వెనుక కార్ఖానా ఏమిటో కూడా తెలుసుకోవాలన్నమాట.

          ప్రేక్షకులు మాత్రం సినిమాల్లో సోల్, ఫీల్ వగైరా ఉంటాయని ఎప్పుడో గుర్తించేశారు. వాటి గురించి చర్చలు కూడా పెట్టుకుంటారు. మరి ఇప్పుడు సినిమాలు తీసేవాళ్లో? చాలా తక్కువ. భక్తి  సినిమాల్లో తప్ప (బాలకృష్ణ నటించిన ‘పాండురంగ మహాత్మ్యం’ మినహాయింపు)  ఇతర సినిమాల్లో ఇప్పుడు సోల్ లేకుండా  ఫీల్ ని అమ్మడానికి ప్రయత్నిస్తున్నారు. సోల్ లేకుండా మంచి ఫీల్ తో సినిమాలు తీయాలని చూస్తున్నారు. పువ్వు లేకుండా దాని వాసన చూపించాలని కష్టపడుతున్నారు. సోల్ అంటే అదేదో కళాత్మక – మహోజ్వల చిత్రరాజాల వ్యవహారమని, దానిజోలికి పోతే మునిగిపోతామని భయపడుతున్నారు.
 
          కానీ చూడగలిగితే   ‘శివ’ లాంటి  ఫక్తు యాక్షన్ ఫిలింలో,  నాగార్జున సైకిలు చైను తెంపి, జేడీ మీద ఎటాక్  చేసే ఘట్టం  సోల్ కి  అంకురార్పణ చేసేదే!  

          ‘నేనూ మనిషినే’ అనే మర్డర్- థ్రిల్లర్ లో, జడ్జి పాత్రధారి అయిన  గుమ్మడి, హత్య చేసెయ్యాలని బయల్దేరడం కథాత్మకి బీజం వేయడమే!

          ‘సోగ్గాడే చిన్ని నాయనా’ లో ప్రారంభంలోనే నాగార్జున- లావణ్యలు విడాకుల కోసం పల్లెటూళ్ళో వున్న తమ ఇంటికి వచ్చే సీను సెంట్ పర్సెంట్ సోల్ సెట్టింగే!

          ‘క్షణం’ లో తప్పిపోయిన తన పాపని వెతికి పెట్టమని అదా శర్మ, అడివి శేష్ ని కోరే సందర్భం  సోల్ కి బోణీ చేయడమే!

          ఇలా కాకుండా ‘శివ’ లో నాగార్జున సైకిలు చెయిన్ తో  జేడీ మీద ఎటాక్ చేయకుండా,  అసలెవరి జోలికీ పోకుండా, పిడికిలికి చైన్ చుట్టుకుని, అదేదో ఫ్యాషన్ ఐన్నట్టు, సినిమా అంతా వూరికే తిరుగుతూంటే ఎలా వుండేది  ఫీల్?

          ‘నేనూ మనిషినే’ లో చంపడానికి రైలెక్కిన గుమ్మడి, చంపకుండా రైల్లో కూర్చుని గుండెపోటు గురించి ఆలోచిస్తూ వుంటే  ఎలావుండేది ఫీల్?

          కనుక సోల్ లేనిదే ఫీల్ ఉండదని స్పష్టమవుతోంది. కానీ అక్కడక్కడా కొన్ని కదలించే సీన్లు పెడితే ఫీల్ వచ్చేసినట్టే అనుకుంటున్నట్టు ఉంటున్నాయి ఫ్లాపవుతున్న సినిమాలన్నీ. అది సోల్ ని పుట్టించకుండా చేసే పైపై సింగారమే - మృతదేహానికి అలంకారం చేయడం లాంటిది. 

          ఆద్యంతం ఒక ధారలా కథాత్మ ప్రవహిస్తూంటేనే  ఆ కథాత్మ- అంటే సోల్,  ఎడతెగని ఫీల్ ని సంతరించుకుంటుంది. పుట్టాల్సిన చోట సోల్ ని పుట్టించకుండా, అక్కడో ముక్కా ఇక్కడో ముక్కా ఏవేవో  సెంటి మెంట్ సీన్లేసి, అందులోంచే ఫీల్ రాబట్టాలనుకుంటే, అది నది లేకుండా కాలువలు తవ్వే ప్రయత్నం లాంటిది. డామ్ కట్టకుండా కాలువలు తవ్వేసి కాంట్రాక్టర్లు సొమ్ములు జేబుల్లో వేసుకోవచ్చు గానీ, కథాత్మ లేకుండా పిల్ల ‘ఫీల్’ కాల్వలు పుట్టించి టికెట్లు అమ్ముకోవాలంటే మాత్రం చాలా తిప్పలు. 

          ‘ఊపిరి’లో, ‘కల్యాణ వైభోగమే’ లో ఎన్ని పిల్లకాల్వల్లాంటి బెల్ట్ షాపులు సృష్టించారో తెలిసిందే.

          ‘సర్దార్ గబ్బర్ సింగ్’ లో కేవలం దాని ఫక్తు ఎంటర్ టైన్మెంట్  ప్రధానమైన లక్షణం సినిమాకి సోల్ కాదు. హీరో విలన్ల మధ్య సమస్య పుట్టడం సోల్ కి అంకురార్పణ. విలన్ దందాలకి హీరో అడ్డుతగలడంతో  సోల్ కి అంకురార్పణ జరిగింది. కానీ తర్వాత దీని కొనసాగింపుగా ఆ దందాలు వదిలేసి, ఇద్దరి మధ్యా హీరోయిన్ ప్రేమకోసం పోరాటంగా మార్చడంతో  కథాత్మ తెగిపోయింది. ఏర్పాటయిన దందాల గురించిన కథాత్మా ఝరికి, ప్రేమ పిల్లకాల్వలు తవ్వడంతో సోల్ చెదిరి, ఫీల్ కూడా గల్లంతయ్యింది. 

          అంటే సోల్ ని పుట్టించకుండా పిల్లకాల్వలని తవ్వినా, సోల్ ని పుట్టించీ కూడా పిల్ల కాల్వల్ని తవ్వినా రెండూ ఒకటేననీ, రెండూ రిస్కే నని అర్ధమవుతోంది. ఇలా సోల్ తో- ఆత్మ తో చెలగాటమంటే, సబ్ కాన్షస్ ని కుళ్ళబొడుచుకోవడమే. 

          సబ్ కాన్షస్ మైండ్
(అంతరాత్మ- మిడిల్ )  అనేది కుళ్ళ బొడుచుకోవడానికి లేదు, దాన్ని బాధించుకుని ఆత్మహత్యలు (ఫ్లాపులు) చేసుకోవడానికీ  లేదు. మధించి అమృతం (కలెక్షన్స్) పొందడానికే వుంది. క్షీరసాగర మధనం ఇదే చెప్తుంది. క్షీర సాగరం సబ్ కాన్షస్ మైండ్- అంటే మనుషుల అంతరాత్మకి ప్రతీకే.  క్షీర సాగర మధనంలో అమృతాన్ని పుట్టించడానికి జరిగే కార్యకలాపమంతా  స్క్రీన్ ప్లే మిడిల్ విభాగంలో హీరోకి జరిగే బిజినెస్సే. 1949 లో ప్రపంచ పురాణాల పరిశోధకుడు జోసెఫ్ క్యాంప్ బెల్ ప్రచురించిన The Hero with a Thousand Faces అన్న సుప్రసిద్ధ గ్రంథం  ప్రతిపాదించిన,  కథల్లో  హీరో చేసే ప్రయాణపు మజిలీలు అన్నీ కూడా క్షీర సాగర మధనంలో కన్పించే మజిలీలే. ప్రతి ప్రపంచ పురాణంలోనూ పురాణ పురుషుడు చేసే ప్రయాణంలో ( పోరాటంలో) ఇవే మజిలీలున్నాయని  తేల్చాడు క్యాంప్ బెల్. ఈ పురాణ పురుషుడు లేదా హీరో మన ఇగోనే. ఇది హాలీవుడ్ దర్శకులకి, రచయితలకీ బైబిల్ లా దొరికింది.  మన దర్శకుడు దేవ కట్టాకి కూడా. ఆయన సినిమాలు తీయడానికి ముందే ఈ గ్రంధాన్ని ఔపోసన పట్టారు. ఆచరణలో సాధ్యం కావడం లేదు, అది వేరే విషయం. ఇక  దీన్నుంచే ‘స్టార్ వార్స్’ ని సృష్టించాడు జార్జి లూకాస్. ఈ గ్రంధాన్ని దగ్గర పెట్టుకుని తెలుగులో కూడా గొప్ప సినిమాలు తీయాలనుకుంటే దెబ్బ తినిపోతారు. ఆస్కార్ కలలు హాలీవుడ్ కి ఉండొచ్చు గానీ, టాలీవుడ్ కేముంటాయి? తెలుగులో ఇప్పుడు గొప్ప కళాఖండాలు తీయరని ఇదివరకే చెప్పుకున్నాం. బాక్సాఫీసు దగ్గర వర్కౌటయ్యే ఓ మంచి కమర్షియల్ అయితే చాలు. ఈ దృష్టికి ఆలోచనల్ని కుదించుకుని,  ఈ గ్రంథంలోంచి కావలసిన, స్థానికంగా ఆచరణలో సాధ్యమయ్యే,   ఓ నాలుగు మూల సూత్రాలనే తీసుకుంటే ఏ గందరగోళానికీ తావుండదు. 


          ఈ హీరో జర్నీ కూడా స్క్రీన్ ప్లేకి సైకలాజికల్ లాక్ వేయడంలో భాగమే. అయితే ముందు వెలుపలి మనసుకీ, అంతరాత్మకీ
( బిగినింగ్ కీ, మిడిల్ కీ)  కలిపి లాక్ వేసింతర్వాత దీని అధ్యాయంలోకి పోవచ్చు. ఇదంతా  కాంప్లికేటెడ్ వ్యవహారంగా పరిణమిస్తోందని ఆందోళన పడనక్కర్లేదు. ఎలాగైతే లాకింగ్ కి ‘జేమ్స్ బానెట్’ నుంచి కేవలం  ఇరవై శాతమే తీసుకుందామని గత వ్యాసంలో చెప్పుకున్నామో, అలా హీరో జర్నీకి  ‘జోసెఫ్ క్యాంప్ బెల్’ నుంచీ ఓ పది శాతమే  తీసుకుంటే మహా ఎక్కువ - వినోదమే ప్రధానమైన నేటి తెలుగు కమర్షియల్స్ కి. కాబట్టి డోంట్ వర్రీ. 

          సింపుల్ గా కథ పూర్తిగా చెడకుండా, ఓ మంచి కథ అన్పించుకోవాంటే గొప్ప సినిమాలకి వేసినట్టు కాన్షస్- సబ్ కాన్షస్ మైండ్స్ ని కలిపి ముడి వేయడమే మార్గం. స్క్రీన్ ప్లే అంటే  బేసిగ్గా కాన్షస్- సబ్ కాన్షస్ మైండ్స్ ల ఇంటర్ ప్లే అని ఇదివరకే  చెప్పుకున్నాం.

          స్క్రీన్ ప్లే అంటే బేసిగ్గా కాన్షస్ మైండ్
(మనిషి వెలుపలి మనసు)  కీ - సబ్ కాన్షస్ మైండ్ (మనిషి అంతరాత్మ)  కీ మధ్య జరిగే ఇంటర్ ప్లే (సంఘర్షణ) గా అర్ధంజేసుకున్నప్పుడు, ఈ సంఘర్షణ ఎక్కడ మొదలవుతుందో అక్కడే స్క్రిప్టుకి సైకలాజికల్ లాక్ పడుతుందన్న మాట. 

          సంఘర్షణ ఎక్కడ మొదలవుతోంది? ‘శివ’ లో నాగార్జున సైకిలు చైను తెంపే దగ్గర, ‘నేనూ మనిషినే’ లో గుమ్మడి  హత్య చేయాలని బయల్దేరడం దగ్గర, ‘సోగ్గాడే చిన్ని నాయనా’ లో నాగార్జున- లావణ్యలు విడాకుల కోసం రావడం దగ్గర, ‘క్షణం’ లో పాపని వెతికి పెట్టమని అదా శర్మ కోరడం దగ్గర!

          ఇంకా-
 ‘మనం’ లో గతజన్మలో పోట్లాడుకుని విడిపోయిన తల్లిదండ్రుల్ని (నాగచైతన్య- సమంత) కలపాలని నాగార్జున ఫీలవ్వడంతో,  ‘లెజెండ్’ లో  చిన్న బాలకృష్ణ సహా కుటుంబాన్ని జగపతిబాబు హతమార్చబోతున్నప్పుడు పెద్ద బాలకృష్ణ రావడంతో, ‘కంచె’ లో  ప్రేమకి కులాలు అడ్డొచ్చి ప్రేయసి దుర్మరణం పాలయినప్పుడు వైరాగ్యంతో వరుణ్ తేజ్ యుద్ధానికి  బయల్దేరడంతో, అలాగే ‘టెంపర్’  లో  పొరపాటున ప్రత్యర్ధులు తనని చేయబోయిన కిడ్నాప్ విఫలమైనప్పుడు, తనుకాకపోతే ఇంకెక్కడో ఇంకెవరో అమ్మాయి ఈ గ్యాంగ్ బారిన పడబోతోందనీ, వెళ్లి కాపాడమనీ ఎన్టీఆర్ కి కాజల్ అల్టిమేటం ఇవ్వడంతో- సఘర్షణ మొదలవుతోంది.

         
ఇవన్నీ స్ట్రక్చర్ రీత్యా ప్లాట్ పాయింట్ -1 మజిలీలే. ఇక్కడ్నించే పాత్ర ఒక లక్ష్యంతో కార్యరంగంలోకి దూకుతోంది. అంటే మిడిల్ లోకి ప్రవేశిస్తోంది. ఎప్పుడైతే లక్ష్యం కోసం మిడిల్ లో సంఘర్షణకి పాత్ర దిగుతోందో అక్కడే ‘సోల్’  ఏర్పడుతోంది, అక్కడే కథకి జీవం పోయడం జరుగుతోంది. బిగినింగ్ విభాగంలో మాత్రం  ఏ సోల్, ఏ జీవమూ- వీటితో ఏర్పడే ఈ ఫీలూ కలిగే అవకాశం లేదు. ఎందుకంటే ఇదింకా పాత్రల పరిచయ విభాగమే, సంఘర్షణ అప్పుడే మొదలవదు. బిగినింగ్ విభాగం సంఘర్షణకి కేంద్రం కాదు, అది మిడిల్ చూసుకునే బిజినెస్. 

          కనుక ప్లాట్ పాయింట్ -1 ని సోల్ ని సమీకరించే కేంద్రంగా  చూడాల్సి వుంటుంది. సాధారణంగా ఇది కథకి మొదటి మలుపు అనీ, ఇక్కడ్నించీ సంఘర్షణ ఉంటుందనీ  స్ట్రక్చరల్ భాషలో చెప్పుకోవడం జరుగుతోంది. ఈ ‘ఇంజనీరింగ్’ భాష  మాట్లాడుకుంటే సోల్ పుట్టదు. కేవలం స్క్రీన్ ప్లేకి ‘వాస్తు’ లభిస్తుంది. వాస్తు మంచిదే. కానీ వాస్తు ప్రకారం నిర్మించిన ఇంట్లో  గృహ ప్రవేశానికి వాస్తు మంత్రాల్లేవు. శాస్త్రోక్తంగా గృహప్రవేశం జరిగిన ఇంట్లో ఒక పవిత్ర భావం
(ఫీల్) పలుకుతూంటుంది.  అలాటి గృహ ప్రవేశం కారణంగా పోగుపడిన సోల్ వల్లే ఈ భావం కలుగుతూంటుంది, అవునా? 

          అలాంటప్పుడు, ఇలాటిదే భావావేశం  ప్రేక్షకుల్ని పట్టి కుదిపెయ్యాలంటే ప్లాట్ పాయింట్ – 1 దగ్గర్నుంచి మిడిల్లోకి ప్రవేశాన్ని స్క్రీన్ ప్లే గృహప్రవేశంగా చూడాలి. సిడ్ ఫీల్డ్ రాస్తాడు- ప్లాట్ పాయింట్ వన్ దగ్గర వచ్చే ప్రధాన మలుపు సుడిగాలిలా ఉక్కిరిబిక్కిరి చేయాలని. కానీ  ఈ సిడ్ ఫీల్డ్  ‘ఇంజనీరింగ్’ తో  కూడా ఇంత  ప్రధానమైన మలుపుని ఎప్పుడో తప్ప ఎవరూ హైలైట్ చేయడం లేదు. 

          ఏమంటే ఇంటర్వెల్ బ్యాంగ్ గొప్పగా ఇచ్చామనుకుంటారు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఎక్కడ్నించి వచ్చింది? ప్లాట్ పాయింట్-1 ఉంటేనే కదా? అంటే అది  ప్లాట్ పాయింట్-1 కి బై ప్రొడక్టు మాత్రమే తప్ప, దానికి స్వయంప్రతిపత్తి లేదు. ప్లాట్ పాయింట్  -1,  దీని ఉప ఉత్పత్తి అయిన ఇంటర్వెల్ బ్యాంగ్, మళ్ళీ దీని ఉప ఉత్పత్తి కూడా అయిన ప్లాట్ పాయింట్ -2 అనే ఈ మూడు మూలస్థంభాలూ,  సినిమా చూస్తున్న ప్రేక్షకులకి కొట్టొచ్చినట్టూ  హైలైట్ అవ్వాల్సిందే.  ఇది సరయిన ‘ఇంజనీరింగ్’. కానీ కథ లోతులు తెలీని  పాసివ్ రైటింగ్ వల్ల 
ఈ డైనమిక్స్ కొరవడి స్క్రీన్ ప్లేలకి సౌరభం చేకూరడం లేదు.

          ఇప్పటి అవసరం ఈ సీన్ రివర్సలే. అంటే  స్క్రీన్ ప్లేని ఒక స్ట్రక్చర్ లా ‘ఇంజనీరింగ్’ దృష్టితో చెక్కడంగా గాక, అదొక ప్రేక్షకుల మానసిక ప్రపంచం కూడానూ అనే  ఉదాత్త దృష్టితో  చూసి, ప్రేక్షకుల మనోభావాల్ని  మన్నించడం. ప్రేక్షకుల మానసిక ప్రపంచాన్నే టార్గెట్ చేస్తూ, వాళ్ళ ‘వెలుపలి మనసు’ ని బిగినింగ్ గానూ పెట్టి, వాళ్ళ కుండే ‘అంతరాత్మని’  మిడిల్ గానూ పెట్టుకుని, మళ్ళీ ఎండ్ కొచ్చేసి  అదే ‘వెలుపలి మనసు’  వైపుకి ప్రయాణమనే భాషలో కథని వ్యక్తీ కరీంచుకుంటే  తప్ప మంచికథ రాదు.

          ప్రేక్షకుల మానసిక ప్రపంచాన్నే ఎందుకు టార్గెట్ చేయాలంటే, కథలుగా  పుట్టినప్పుడు పురాణాలూ జానపద గాథలూ ఈ పనే చేశాయి గనుక.  మనిషి మానసిక ప్రపంచాన్ని ఎరుక పర్చి, మోటివేట్ చేయడమే వాటి లక్ష్యం గనుక. కనుక సినిమా కథ సైతమూ వెండి తెర మీద ప్రేక్షకుల మానసిక ప్రపంచాన్నే ఆవిష్కరించి దాన్నే టార్గెట్ చేసే దృష్టితో కొనసాగాలి. 

          ఒకప్పుడు కొందరు పెద్ద దర్శకులు ప్రేక్షకుల నాడీని పట్టుకోవడం ఎవరి వల్లా కాదని ఊకదంపుడుగా అనే వాళ్ళు. నిజమే కాబోలని ఈ వ్యాసకర్త కూడా నమ్మేవాడు. తర్వాత్తర్వాత ఇదేదో బాధ్యతని తప్పించుకునే మార్గం కాదుకదా అన్పించసాగింది. నిజానికి అలా  అనడం పురాణాలని కూడా అవమానించడమే. రామాయణ మాహాభారతాలు దేన్ని  టార్గెట్ చేశాయో తెలుసుకోక  పోవడమే. భక్తి  పారవశ్యంలో మునిగిపోయి అవి చెబుతున్న  మౌలిక ఫిలాసఫీని చూడ నిరాకరించడమే. మౌలిక ఫిలాసఫీ ‘నీ మనసు తెలుసుకో' అయినప్పుడు, ‘సైకో థెరఫీ’ కూడా  అయినప్పుడు, యుగాలుగా అవి ప్రజల నాడిని పట్టుకుని మనగల్గుతున్నాయి. కథంటే ప్రేక్షకుల మానసిక ప్రపంచాన్ని ఆవిష్కరించడమే నని గ్రహించక పోతే, ఇలా నాడిని పట్టుకోలేమనే పాసివ్ స్టేట్ మెంట్లే వస్తాయి.


(ఇంకా వుంది)

-సికిందర్